హైదరాబాద్ కోసం కేటీఆర్ కొత్త ఆలోచనలు... ట్రాఫిక్ నియంత్రణనే ప్రధాన లక్ష్యం
posted on Dec 20, 2019 @ 3:12PM
మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. అంతేకాక ట్రాఫిక్ సమస్యల పై కూడా దృష్టి పెడుతున్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రధాన రోడ్ల పైన వాహనాల భారం తగ్గించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. జీహెచ్ఎంసి సాధ్యమైనన్ని ఎక్కువ స్లిప్ రోడ్లను నిర్మించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ లో మేయర్ బొంతు రామ్మోహన్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేటర్ లో ఫస్ట్ ఫేజ్ లో 55 స్లిప్ రోడ్లను గుర్తించామని వాటి నిర్మాణానికి వేగంగా ప్రణాళికలు చేస్తున్నామని అధికారులు మంత్రికి తెలియజేశారు. ఇప్పటికే 40 రోడ్లకు ఆర్టీసీ సిద్ధమైందన్నారు, ఇందులో 20 రోడ్లలో కేవలం 90 ఆస్తుల సేకరణ పూర్తి చేస్తే స్లిప్ ల నిర్మాణం మొదటి దశ ప్రారంభించేందుకు వీలవుతుందన్నారు. నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నగర రోడ్ల పై వాహనాల రద్దీ రోజు రోజుకూ పెరుగుతోందని దీన్ని ఎదుర్కొని పౌరులు సులభంగా తమ గమ్యం చేరేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్సు ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన పెద్ద ఎత్తున చేపడుతున్నామని అన్నారు. దీంతో పాటు అభివృద్ధి ద్వారా కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
రోడ్ల వెంబడి పాదచారులు నడిచేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఫుట్ పాత్ ల నిర్మాణం కూడా చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ప్రతి జోన్ లో కనీసం 10 కిలోమీటర్ల చొప్పున జనసమ్మర్దం ఉండే రోడ్ల వెంబడి ఫుట్ పాత్ ల నిర్మాణం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ బస్ బేల నిర్మాణం కోసం పలు ప్రాంతాలను గుర్తించామని ఆయన అన్నారు. ఈ ప్రాంతాల్లో బస్ బేల నిర్మాణం మరింత వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. సిటీలో ఇప్పటికే బస్ బేల నిర్మాణం కోసం పలు ప్రాంతాలను జీహెచ్ఎంసీ గుర్తించిన అంశాన్ని అధికారులకు మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఆ ప్రాంతాల్లో బస్ బేల నిర్మాణం మరింత వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేపడుతున్న పనుల వివరాలను కేటీఆర్ ఆరా తీశారు. హైదరాబాద్ లోనే పవర్ కారిడార్ లలో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి ఒక నివేదిక సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. హెచ్ఎండీఏ చేపడుతున్న రోడ్ల నిర్మాణంతో జీహెచ్ ఎంసీ చేపడుతున్న రోడ్ల నిర్మాణం ప్రణాళికలను సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.మంత్రి కేటీఆర్ అభివృద్ధి కొరకై చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేర స్ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి.