ఉద్యోగుల్ని తొలగించొద్దు! వేతనాలు తగ్గించవ‌ద్దు! కార్మిక మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ తో ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థపై, ఉద్యోగాలపై భారీగా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కంపెనీలు, సంస్థల యాజమాన్యాలకు ప్రధాని మోడీ ఓ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించవద్దని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. మీ ఉద్యోగుల పట్ల సానుభూతి చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించవద్దని సంస్థలకు సూచిస్తున్నాయి. మంగళవారం కర్ణాటక ప్రభుత్వం ఉద్యోగులను తొలగించవద్దని, వేతనాలు తగ్గించవద్దని సూచించింది. అన్ని ఆర్థిక వ్యవస్థలు నిలిచిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని సూచించింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ కూడా కంపెనీలకు సూచన చేసింది. ఉద్యోగులను తొలగించవద్దని, వేతనాలు తగ్గించవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కంపెనీలకు సూచించింది.

మీడియా అంటే.. అది ఒక వస్తువు కాదు. మనుషులే!

ప్రస్తుతం లాక్‌డౌన్‌తో మన అనుకున్నవారి ఇంటికి కూడా మనం వెళ్లలేక పోతున్నాం కదా? మరి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విషయాలు మనకు ఎలా తెలుస్తున్నాయి? మనం ఓట్లు వేసి గెలిపించిన నాయకుడు కూడా మన ఇంటికి రావడం లేదు. కనీసం మన వీధికి కూడా రావడం లేదు (ఏమో ఒకరిద్దరు వస్తున్నారు!) కదా.. మరి మన సమస్యలు ప్రభుత్వానికి ఎలా చేరుతున్నాయి? వారధి ఎవరు? అంటే తడముకోకుండా చెప్పే మాట మీడియా ఉందికదా!? అని! నిజమే. మీడియా అంటే.. అది ఒక వస్తువు కాదు. మనుషులే! మీడియాలో పనిచేస్తున్నది కూడా మనలాంటివారే! వారికీ కరోనా ఎఫెక్ట్ పొంచే ఉంది. వారిపైనా అనేక నిషేధాజ్ఞలు ఉన్నాయి. పోలీసుల నుంచి బెదిరింపులు ఉన్నాయి. లాఠీల భయం కూడా పొంచే ఉంది. ప‌ని చేసే యాజ‌మాన్యం ఎప్పుడు ఉద్యోగంలో నుంచి పీకివేస్తోందో తెలియ‌దు. అయినా.. వారు ఎంచుకున్న వృత్తి ధర్మానికి పాత్రికేయులు పాటు పడుతున్నారు. అందుకే ప్రజలకు ఇంట్లో ఉన్నా.. ప్రపంచం మొత్తం వారికి చేరువ అవుతోంది. దేశంలో ఏ క్షణాన ఎన్ని కరోనా కేసులు నమోదవుతున్నాయో.. ప్రభుత్వం చెబుతోంది. అయితే, దీనికి కారణాలు ఏంటి? ఎక్కడెక్కడ కరోనా విజృంభించే అవకాశం ఉందనే విషయాలపై సమగ్ర పరిశోధనాత్మకంగా సమాచారం ఇస్తూ.. పాత్రికేయులు ఇంత ఘోర కరోనా కాలంలోనూ తమ వృత్తి ధర్మానికి కట్టుబడ్డారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నిజానికి సమాజంలో ఏం జరుగుతోందో చెబుతున్నప్పటికీ.. ఇంత శ్రమ తీసుకుంటున్నప్పటికీ.. పాత్రికేయులను గుర్తించేవారు.. వారి పేరును స్మరించేవారు ఒక్కరంటే ఒక్కరు ఒక్క ప్రభుత్వం అంటే ఒక్క ప్రభుత్వం కూడా లేదంటే నమ్మితీరాలి. కేంద్ర ప్రభుత్వం వైద్యులకు, వైద్య సిబ్బందికి .. ఆయుష్మాన్ భారత్ కింద 50 లక్షల బీమా ఇచ్చింది. కానీ, అదే వాతావరణంలో అదే ఆసుపత్రుల్లో పనిచేస్తూ.. వార్తలు సేకరిస్తున్న పాత్రికేయుల పరిస్థితి ఏంటి? వారికి కనీస అవసరాలు తీర్చేవారు ఎవరు? మాస్కులు లేవు. సంస్థలు ఇవ్వవు. కనీసం వారికి సమయానికి ఆహారం కూడా లేదంటే.. నమ్ముతారా? అయినా ఇది పచ్చినిజం. మనం ఇంట్లో ఉండి సమయానికి అన్నీ వండుకుని తింటున్నాం. ఉదయాన్ని వెళ్లి మనకు అవసరమైన వాటిని తెచ్చుకుంటున్నాం. మరి జర్నలిస్టు కుటుంబాలు ఇలా చేస్తున్నాయా? ఈ విప‌త్క‌ర ప‌రిస్థితి కొంత మంది మీడియా యాజమాన్యాలకు గొప్ప వరంగా మారింది. దీనిని సాకుగా చూపించి ఎడాపెడా ఉద్యోగాలకు కోత మొదలుపెట్టారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరియు బిజినెస్ స్టాండర్డ్ జీతాల తగ్గింపు తీసుకోవాలని సిబ్బందిని కోరింది. ఔట్‌లు ముద్రణ ప్రచురణను నిలిపివేసింది. న్యూస్ నేషన్ 16 ఇంగ్లీష్ డిజిటల్ ఉద్యోగులను తొలగించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా మొత్తం ఆదివారం స్పెష‌ల్ టీం ను తొలగించింది. క్వింట్ బృందంలో సగం మంది జీతం లేకుండా సెలవుపై వెళ్ళమని కోరారు. ఇండియా టుడే 46 మంది రిపోర్టర్లు, 6 మంది కెమెరామెన్లు మరియు 17 మంది న్యూస్ ప్రొడ్యూస‌ర్‌ల‌ను తొలగించింది. ఉదయాన్ని పుస్తకం పెన్ను పట్టుకుని ఫీల్డ్ లోకి వెళ్తున్న జర్నలిస్టు.. ఎప్పుడు ఇంటికి వస్తాడో చెప్పలేని పరిస్థితి! ఎలా వస్తాడో కూడా తెలియని పరిస్థితి!! అయినా ఆయనను మ‌నిషిగా చూడ‌డం లేదు. పాత్రికేయుడిని పట్టించుకునేవారు ఎవరు? వారికీ కుటుంబాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం!

ఈ దేశాల‌పై కరోనా వైర‌స్ దాడి చేయ‌లేద‌ట‌!

కరోనా వైరస్ రిసోర్స్ సెంటర్ కు చెందిన జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటీ తన వెబ్ సైబ్ లో ఈ విష‌యాల‌ను వెల్లడించింది. ఇప్పటివరకు ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాని దేశాల జాబితాను జాన్ హాప్ కిన్స్ ప్ర‌క‌టించింది. 1. కొమొరోస్ 2. లెసోతో 3. మార్షల్ దీవులు 4. పలావు 5. నౌరు 6. సమోవ 7.కిరిబాటి 8. వనౌటు 9. సోలమన్ దీవులు 10. టోన్గా 11. టువాలు 12. తుర్క్మెనిస్తాన్ 13. తజికిస్తాన్. ఇదిలా వుంటే తమ దేశంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా చెబుతోంది. అయితే ఆ దేశం మాటను ఎవరూ నమ్మడం లేదు. కరోనా కేసులు నమోదైనా రహాస్యంగా ఉంచి తమ దేశంలో కరోనా పాకలేదని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ప్రకటిస్తున్నాడు. అయితే అలాంటిదేమీ లేదని.. చైనా పక్కన ఉన్న ఆ దేశంలో తప్పనిసరిగా కేసులు నమోదయ్యాయని కానీ ఉద్దేశపూర్వకంగా ప్రకటించడం లేదని అంతర్జాతీయ సంస్థలు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విల‌య‌తాండ‌వం. ఏడు ఖండాలకు ఈ వైరస్ పాకింది. అగ్ర దేశాలతో పాటు అట్టడుగున ఉన్న దేశాలకు కూడా ఆ వైరస్ కలవరం సృష్టిస్తోంది. ప్రపంచమంతా ఆ వైరస్ అంత కల్లోలం సృష్టిస్తుండగా ఇలాంటి సమయంలో కూడా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించలేదు.

భ‌య‌పెడుతున్న లెక్క‌లు! పరిస్థితి అదుపులోకి రావ‌డంలేదు!

దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. లాక్ డౌన్ ప్రారంభం అయిన తొలి రోజున 526 గా ఉన్న కరోనా పాజిటివ్ కేసులు, ఏప్రిల్ 14 నాటికి 11 వేలకు చేరువ అయ్యాయి. కేంద్ర హోంశాఖ అధికారుల కథనం ప్రకారం దేశ వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కరోనా బాధితులు క్వారెంటైన్‌ కేంద్రాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే కరోనా వ్యాప్తి కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 3 లక్షల 23 వేల మందిని నిర్బంధ కేంద్రాల్లో (క్వారెంటెన్ లో) ఉంచినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 66వేల మంది, ఉత్తరాఖండ్‌లో 55వేలు, రాజస్తాన్‌ 35,841, ఉత్తరప్రదేశ్‌ 31,158, గుజరాత్‌ 14,204, బిహార్‌లో 11,998 మందిని హోం క్వారెంటైన్‌లో ఉన్నారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలోనే కరోనా బాధితులు క్వారెంటైన్‌లో ఉన్నారు. దేశంలోని మొత్తం 718 జిల్లాల్లో దాదాపు 370 జిల్లాకు పైగా కరోనా బారిన పడ్డయని హోంశాఖ నివేదికలో తేలింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో సుమారు 11 వేలకు చేరుకున్నాయి పాజిటివ్‌ కేసులు. మృతుల సంఖ్య 339కి చేరింది. పరిస్థితి అదుపులోకి రాలేదు.

అత్యవసరమైతే పోలీస్‌ పాస్‌ తీసుకోండి!

*రాష్ట్ర ప్రజలకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సూచన *ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ–పాస్‌ల జారీకి చర్యలు *జిల్లాల వారీగా పాస్‌ల కోసం వాట్సప్‌ నెంబర్లు, మెయిల్‌ ఐడీల వివరాలు విడుదల చేసిన డీజీపీ కార్యాలయం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఈ–పాస్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. తగిన కారణాలు, ఆధారాలు చూపించి ఈ–పాస్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని స్పష్టం చేశారు.దీనికి సంబంధించి డీజీపీ తెలిపిన వివరాలివీ. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న దృష్ట్యా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారికి పోలీస్‌ శాఖ ద్వారా అత్యవసర రవాణా పాస్‌లను జారీ చేస్తాం. జిల్లా పరిధిలో వెళ్లాల్సి వస్తే.. ఆ జిల్లా ఎస్పీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేరే జిల్లాకు వెళ్లాల్సి వస్తే.. తమ జిల్లా ఎస్పీ ద్వారా ఆ వ్యక్తి వెళ్లాల్సిన జిల్లా ఎస్పీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే.. సదరు వ్యక్తికి సంబంధించిన జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. వివరాలన్నీ పరిశీలించి ఆయా రాష్ట్రాలను సంప్రదించిన అనంతరం డీఐజీ కార్యాలయం అనుమతి మంజూరు చేస్తుంది. పాస్‌ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి. పాస్‌ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్‌ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్‌ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. అత్యవసర పనుల కోసం పాస్‌లు తీసుకోదలచినవారు తమ యొక్క వినతిపత్రాలను పైన ఇచ్చిన వాట్సప్‌ మొబైల్ నెంబర్లకు మరియు మెయిల్ ఐడీలకు మాత్రమే పంపగలరు. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్లకు/మెయిల్ కు అనుమతి పంపబడును. మీరు ప్రయాణించేటపుడు జిల్లాల యొక్క  వాట్సప్‌ నెంబర్ మరియు మెయిల్ ఐడీల నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే అంగీకరించబడును. ఫార్వర్డ్‌ చేయబడిన అనుమతులు (పాసులు) అంగీకరించబడవు. మీరు ప్రయాణించేటప్పుడు మీతోపాటు మీయొక్క గుర్తింపు కార్డు (ఐడీ కార్డ్‌) తప్పనిసరిగా ఉంచుకోవాలని డీజీపీ కార్యాలయం పేర్కొంది.

మ‌ళ్లీ డాక్టర్లపై కరోనా బాధితుల దాడి!

మొన్న గాంధీలో..నేడు ఉస్మానియాలో మ‌ళ్లీ డాక్టర్ల పై కరోనా భాదితులు దాడికి దిగారు. ఉస్మానియా లోనూ అదే సీన్ రిపీట్ అయింది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో రెండు పాజిటివ్ కేసులు ఉన్నాయి. అనుమానితులను, రోగులను ఒకే చోట ఉంచడంపై అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఐసోలేషన్ వార్డులో ఉన్న పీజీలపై కరోనా బాధితులు దాడి చేసినట్టు వార్తలు భ‌గ్గుమ‌న్నాయి. కరోనా బాధితులు ఎవరూ సహనం కోల్పోకూడదని - అందరూ సంయమనం పాటించాలని ఎవ‌రు ఎంతగా చెప్పినా బాధితులు స‌హ‌నం కోల్పోయి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దాడుల‌కు దిగుతున్నారు.  డాక్టర్లు దైవంతో సమానమని - వారిని ఇబ్బంది పెట్టవద్దని సీఎం చెప్పినా కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. డాక్టర్ల పై దాడికి దిగితే ..వారు చేతులెత్తేస్తే మనల్ని కాపాడేవారే లేరు అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని మెలిగితే మంచిది. మ‌రో ప్ర‌క్క కరోనావైరస్ హైద‌రాబాద్‌లోనూ విజృంభిస్తుంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు ఆందోళ‌న‌క‌రంగా పెరిగిపోతున్నాయి. దీనితో ప్రజలలో అలజడి మొదలైంది.  డాక్టర్లు - పోలీసులు - అధికారులు ప్రాణాలని పణంగా పెట్టి కరోనా పై యుద్ధం చేస్తున్నారు. అయితే అక్కడక్కడా పోలీసులు - డాక్టర్ల పై కరోనా భాదితులు దాడికి దిగుతున్నారు.గాంధీ హాస్పిటల్ లో కరోనా రోగులు వైద్యులపై దాడికి దిగితే ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ లోనూ అదే సీన్ రిపీట్ అయింది.

నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు త‌ప్ప‌వు!  కేటిఆర్‌

రాష్ట్రంలో కరోన వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు  కె.టి.రామారావు మరియు ఈటల రాజేందర్ అధికారులను సూచించారు. మంత్రులు ప్రగతిభవన్‌లో కరోనా వైరస్‌పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.  హైద్రాబాద్ సిటీలో గుర్తించిన ప్రాంతాల్లో100 శాతం లాక్ డౌన్ నిబంధనలు పాటించేలా, పూర్తిగా అన్ని రహదారులను మూసివేసి ఒకటే మార్గం పోలీసుల పహరలో తెరచి ఉంచాలి. ఏ ఒక్కరు బైటికి రాకుండా, వారికి కావలసిన నిత్యావసర వస్తువులు ఇంటికే పంపించే ఏర్పాట్లు చేయాలని కేటిఆర్ సూచించారు. ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరితో ప్రతి రోజు ఆరోగ్య పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకుని, అనుమానితులను హాస్పిటల్ కు తరలించి కావలసిన వైద్య పరీక్షలు చేయించి positive రిపోర్ట్ వస్తే సంబంధిత హాస్పిటల్ కు పంపించడంతో పాటు ట్రావెల్ హిస్టరీ వివరాలతో పాటు, కాంటాక్ట్ వివరాలను వెంటనే సేకరించి తదుపరి చర్యలు తీసుకోవాలని, పోలీస్, జిహెచ్ఎంసి మరియు మెడికల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి కేటిఆర్ ఆదేశించారు. రాబోయే 10 రోజులు చాలా ముఖ్యమని, ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైనే రావొద్దని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. వైద్య పరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అధికారులు, డాక్టర్లు సమన్వయంతో వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఈటెల సూచించారు.  ఈ సమావేశానికి సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి సహా హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, వైద్య ఆరోగ్య, పురపాలక, పోలీసు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఫాంగేట్‌ పద్దతిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం!

తెలంగాణ నుంచి కూడా ధాన్యం రాష్ట్రంలో రాకుండా నిలిపేశాం. మద్దతు ధర కన్నా తక్కువ ఖరీదుకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి రాకుండా ఈ చర్యలన్నీ తీసుకున్నాం. సరిహద్దుల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూసుకోవాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశిస్తున్నాని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ రోజు జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. ముఖ్యంగా కొనుగోళ్లు సవ్యంగా జరుగుతున్నాయా? లేవా? అన్నది చూసుకోండి. ఏ సమస్య ఉన్నా.. వెంటనే సీఎం కార్యాలయం దృష్టికి తీసుకురండి. వెంటనే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. మార్కెటింగ్‌కు సంబంధించి కొన్ని వినూత్న ఆలోచనలు చేస్తున్నాం. ఈ సమయంలో వ్యవసాయం అన్నదాన్ని మనం కాపాడుకోగలిగితే, రైతు అనేవాడిని మనం ఇబ్బంది పడకుండా చూసుకోగలిగితే.. 60శాతం ఆర్థిక వ్యవస్థను మనం నిలబెట్టుకోగలుగుతాం ముఖ్య‌మంత్రి అన్నారు. గ్రామంలో రైతులు ఏమైనా ఇబ్బందులు పడితే.. వెంటనే ఆ సమాచారం పైస్థాయిలో ఉన్నవారికే కాకుండా జిల్లా కలెక్టర్లకూ రావాలి. రైతు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు? ఏ పంటకు తక్కువ ధర వస్తుంది? ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయన్నదానిపై కలెక్టర్లకు సమాచారం రావాలి. దీని ఆధారంగా మార్కెటింగ్‌శాఖ అధికారులతో మాట్లాడాలి. మన రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు వెళ్తాయి. ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లు నడవడంలేదు. రవాణాకూడా జరగడంలేదు. మధ్యలో ఆపేస్తారనే భయంతో లారీల రవాణా నడవడంలేదు. ఈ సమస్యల పరిష్కారానికి క‌లెక్ట‌ర్లు దృష్టిపెట్టాలని ముఖ్య‌మంత్రి సూచించారు. వైయస్సార్‌ జనతా బజార్లకు బీజం వేస్తున్నాం. ఏ రైతు కూడా ఇబ్బంది పడుతున్నా మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి, రవాణాను అందుబాటులోకి తీసుకురావడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని ముఖ్య‌మంత్రి అన్నారు. రైతులు అవస్తలు పడకుండా చర్యలు తీసుకోవాలి. భౌతిక దూరం పాటించేలా వారిలో చైతన్యంకలిగించి... ఆమేరకు వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగేలా చూడాలి కరోనా నివారణా చర్యలు పాటిస్తూ.. కార్యకలాపాలు ఎలా చేపట్టాలన్నదానిపై రైతులకు అవగాహన, చైతన్యం కలిగించాలని సి.ఎం. సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి. నిరంతరం ఇది జరగాల్సిన అవసరం ఉంది. మన చుట్టుపక్కల ప్రాంతాలు బాగుంటేనే ఏ వైరస్‌ అయినా, బాక్టీరియా అయినా ప్రబలకుండా ఉంటుంది. రైతు భరోసాకేంద్రాలు, విలేజ్‌ క్లినిక్కులు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలు, వీటిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి.  నిత్యావసర వస్తువుల ధరలపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని సి.ఎం. ఆదేశించారు. ఎవరైనా అధిక ధరకు అమ్మితే వెంటనే కేసులు పెట్టి, జైల్లో పెట్టాలి. కలెక్టర్లు,  ఎస్పీలు బాధ్యత తీసుకోవాలి. నిత్యావసర వస్తువుల ధరలు పూర్తిగా కంట్రోల్‌లో ఉండాలి.

ఫీజు రీయింబర్స్ మెంట్ త‌ల్లి అక్కౌంట్లోకే!

ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము డైరెక్ట్ గా కాలేజ్ లకి ట్రాన్స్ ఫర్ చేసేవారు.. కానీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాలోకే ఫీజు రీయింబర్స్ మెంట్ మొత్తాన్ని జమ చేస్తామని తెలిపారు. త్రైమాసికానికి ఓ విడత చొప్పున రీయింబర్స్మెంట్ సొమ్మును తల్లుల అకౌంట్లో జమ చేయనున్నారు. దీంతో కాలేజీ యాజమన్యాలతోపాటు విద్యార్థులకు కూడా ఊరట చేకూరే అవకాశం ఉంది. 2018-19కి సంబంధించి రూ.1800 కోట్ల బకాయిలను చెల్లించామని ప్రభుత్వం తెలిపింది. 2019-20 సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించామని సీఎం తెలిపారు.  తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని కాలేజీలకు సీఎం ఆదేశాలు జారీచేశారు.దీనికి సంబంధించి 191 కాలేజీలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ఆదేశాల సక్రమంగా అమలయ్యేలా చూడాలని  కలెక్టర్లకు ముఖ్య‌మంత్రి సూచించారు. అవ‌స‌ర‌మైతే కాలేజీలపై చర్యలు తీసుకుని, బ్లాక్‌ లిస్టులో పెడతామని సి.ఎం. హెచ్చ‌రించారు.

ఏ మనిషి కూడా పస్తు ఉండే పరిస్థితి రాకూడదు!

ఏప్రిల్‌ 16 నుంచి రేషన్‌ పంపిణీ సందర్భంగా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వీడియోకాన్ఫ‌రెన్స్‌లో చ‌ర్చించారు.  ఒకే దుకాణం పరిధిలో రెండు మూడు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలు గుమిగూడకుండా ముందే టోకెన్లు ఇస్తున్నారు. ఎవరు ఏ రోజు రేషన్‌కోసం రావాలో, ఏ కౌంటర్‌ వద్దకు రావాలో స్లిప్పులో పేర్కొంటున్నారు.  ఎవరికి కార్డు లేకపోయినా అర్హతలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పెట్టామ‌ని అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు.  ఇలాంటి సమయంలో ఆహారంలేని పరిస్థితి ఉండకూడదు కాబట్టి.. ఎవరు రేషన్‌ అడిగినా ఇవ్వండి. ఏ మనిషి కూడా పస్తు ఉండే పరిస్థితి రాకూడదని ముఖ్య‌మంత్రి సూచించారు. గతంలో ప్రకటించిన విధంగా కరోనా సహాయం కింద రేషన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరికీ కూడా రూ.1000లు ఇవ్వండని సి.ఎం. ఆదేశించారు.

జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోండి! సీఎం ఆదేశం!

*కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ *కోవిడ్‌నివారణా చర్యలు, రైతులను ఆదుకునే చర్యలు, రేషన్‌ పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్లతో చ‌ర్చించారు. రద్దీని తగ్గించాలంటే ప్రతిరోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలి. జోన్లలోకూడా రోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచడం వల్ల జనం గుమిగూడకుండా చూసుకోవచ్చు. లేకపోతే రద్దీ ఉండి మళ్లీ లాక్‌డౌన్‌ ఉద్దేశాలు నెరవేరవు. కాబ‌ట్టి జనం గుమిగూడకుండా ఏం చేయాలన్నదానిపై ఆలోచనలు చేయాలని ముఖ్య‌మంత్రి ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. మనం ఇచ్చిన పరిమిత సమయంలోనే భౌతిక దూరం పాటిస్తూ, మార్కెట్లను, బజార్లను వికేంద్రీకరిస్తూ, ఆంక్షలను అమలు చేస్తూ రోజూ నిత్యావసరాలను సరఫరాచేయండి. ప్రజల మూవ్‌మెంట్‌ను తగ్గిస్తూ.. వారికి అందుబాటులో అన్నీ ఉండేలా చేయాలి.  అలాగే హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో హోండెలివరీ లాంటి మార్గాలను ఎంచుకంటే మంచిందని ముఖ్య‌మంత్రి సూచించారు. హాట్‌స్పాట్లలో ప్రజల మూవ్‌ మెంట్‌ తగ్గించేలా, ప్రతిరోజూ నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచేలా, ప్రజలకు అత్యంత సమీపంలో  నిత్యావసరాలు ఉండేలా చూడండి. వీలైతే డోర్‌  డెలివరీ లాంటి మార్గాలపై ఆలోచన చేయమ‌ని క‌లెక్ట‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్వారంటైన్‌ సెంటర్లలో నాణ్యతమైన సేవలు, సదుపాయాలు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అలాగే జిల్లాల్లో ఉన్న షెల్టర్లు జోన్ల అన్నింటికీ కూడా ఒక రెసిడెంట్‌ ఆఫీసర్‌ను నియ‌మించి ప్రతిరోజూ భోజనం, మెనూ మార్చారా? లేదా? బాత్‌రూమ్స్‌ పరిశుభ్రంగా ఉన్నాయా? లేవా? పారిశుద్ధ్యం సరిగ్గా ఉందా? లేదా? అన్నదానిపై ప్రతిరోజూ ఫీడ్‌ బ్యాక్‌ తెప్పించుకోవాలని సి.ఎం. వీడియోకాన్ఫ‌రెన్స్‌లో సూచించారు. కుటుంబ సర్వే ద్వారా జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, సహా బీపీ, సుగర్, ఆస్తమా లాంటి లక్షణాలు ఉన్నవారందరికీ పరీక్షలు చేయించాలని అధికారుల‌కు ఆదేశించారు.  కరోనా ఎవరికి వచ్చింది? వారి వయస్సు ఎంత? వారు ఇప్పటికే ఏ వ్యాధులతో బాధపడుతున్నారు? అన్నదాన్ని గుర్తించి.. వెంటనే వారికి అత్యుత్తమ వైద్యం అందించాలి. హైరిస్కుగా ఉన్న కేసులను గుర్తించి వారిని పూర్తిస్థాయిలో ఉత్తమ వైద్యం అందించాలి. వారిని వెంటనే కోవిడ్‌ క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులకు తరలించి మంచి వైద్యం ఇస్తే... మరణాలను అరికట్టగలమ‌ని ముఖ్య‌మంత్రి ఈ సంద‌ర్భంగా అభిప్రాయ‌ప‌డ్డారు.

ప‌ద‌వ‌త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ లోనే బోధ‌న‌! 

ఏపీలో టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ గడువు మే 3 వరకు పొడగించడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేకపోతున్నామని  విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్ర‌క‌టించారు. పరీక్షలు జరిగేంత వరకు వారికి సీఎం ఆదేశాలు మేరకు ఆన్ లైన్ సప్తగిరి ఛానల్ ద్వారా క్లాస్ తీసుకుంటారు. ఉదయం 10-11, సాయంత్రం 4-5 ఇవి ప్రసారం అవుతాయి. అవే క్లాసులను యూట్యూబ్ సప్తగిరి ఛానల్ లో కూడా అందుబాటులో ఉంచుతామ‌ని మంత్రి తెలిపారు. విద్యామృతం పేరుతో కార్యక్రమం రూపొందించాం అన్ని శాఖల పరిధిలోని స్కూల్స్ నుంచి అధ్యాపకుల ఎంపిక చేస్తున్నాం. ఇప్పటికే ట్రయిల్ రన్ చేసామని మంత్రి తెలిపారు.  విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ఈ క్లాసులను వినియోగించుకోవాల‌ని మంత్రి పిలుపునిచ్చారు. ఛానల్ లో వచ్చే ఈ క్లాసులకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు విద్యార్థుల హాజరుకు సంబంధించి గ్రామ సచివాలయ సిబ్బంది విద్యా శాఖకు సమాచారం అందిస్తారు. ఉపాధ్యాయులు కూడా హాజరును పరిశీలించనున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.

ఎవ‌రు ఎలాంటి మాస్కులు ధ‌రించాలి?

జలుబు, దగ్గు, తుమ్ముల వంటి లక్షణాలు గలవారికి.. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు గలవారికి సర్జికల్‌ మాస్కులు అవసరం. అలాగే రోగులకు సేవలు చేసేవారు కూడా  సర్జికల్‌ మాస్కులే వాడాలి.  అందుబాటులో ఉంటే ఎన్‌-95 మాస్కులు ధరిస్తే ఇంకా మంచిది. కొవిడ్‌-19కు చికిత్స చేసేవారికి: కరోనా ఇన్‌ఫెక్షన్‌ బాధితులకు చికిత్స చేసే డాక్టర్లు, నర్సులు, అనుబంధ వైద్య సిబ్బంది విధిగా ఎన్‌-95 మాస్కులు ధరించాలి. సీపీఆర్‌, వెంటిలేషన్‌, బ్రాంకోస్కోపీ, శ్వాసనాళంలోకి గొట్టాన్ని పంపించే చికిత్సల వంటివి చేసే గదుల్లో ఉండేవారికీ ఇవి అవసరమే. మరణించినవారిని తరలించేవారు ఎన్‌-95 మాస్కులతో పాటు శరీరాన్ని కప్పి ఉంచే రక్షణ పరికరాలు కూడా ధరించాలి. అయితే మాస్కు ధరించటానికి ముందు చేతులను సబ్బుతో కడుక్కోవాలి. లేదా ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌ను చేతులకు రాసుకోవాలి.  నోరు, ముక్కు ఏమాత్రం కనిపించకుండా మాస్కు ధరించాలి. ముఖానికి, మాస్కుకు మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా చూసుకోవాలి. మాస్కు తడిగా అయితే వెంటనే తీసేసి కొత్తది పెట్టుకోవాలి. ఒక మాస్కును ఒకసారే వాడాలి. మాస్కు పెట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు భాగాన్ని చేతులతో తాకరాదు. ఒకవేళ తాకితే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.  మాస్కును తీసేటప్పుడు చెవుల చుట్టూ ఉండే పట్టీలను పట్టుకునే తీయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు భాగాన్ని తాకరాదు. తీసిన మాస్కును సంచీలో పెట్టి బిగించి చెత్త బుట్టలో వేయాలి. లేదంటే మూత ఉన్న చెత్తబుట్టలో వేయాలి.  మాస్కును తీసిన తర్వాత చేతులను సబ్బుతో రుద్దుకొని శుభ్రంగా కడుక్కోవాలి. వీలుంటే శానిటైజర్‌ రాసుకోవచ్ఛు.  ఎత్తయిన భవనాల్లో లిఫ్ట్‌లు, మెట్ల వంటి చోట్ల వైరస్‌ అంటుకొని ఉండొచ్ఛు కాబట్టి అపార్ట్‌మెంట్లలో నివసించేవారు ఇంట్లోనే మాస్కును పెట్టుకొని బయటకు రావాలి. ఇంట్లోకి వచ్చాకే తీసెయ్యాలి. గుడ్డ మాస్కులను రోజూ శుభ్రంగా ఉతికి, ఆరెయ్యాలి.

నలుగురికీ నచ్చిందీ నాకసలే నచ్చదులే...

తెగించినోడికి తెడ్డే లింగం అన్నచందంగా ఏపీ ప్రభుత్వం వ్యహారం ఉందని ప్రతిపక్షాలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వం తీసుకొనే ఏకపక్ష కక్ష్యపూరిత నిర్ణయాలను తప్పుబడుతూ కోర్టులు చివాట్లు పెడుతున్నా ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టు..తనను కాదన్నట్లే ముందుకు వెళ్తుందని.. సాక్షాత్తు ప్రభుత్వమే కోర్టు బోనులో నిలబడాల్సి వస్తున్నా మూర్ఖపు నిర్ణయాలనే సమర్థిస్తుందని తీవ్రవ్యాఖ్యలే చేస్తున్నారు. ఇంతకు ముందు ఘటనలను పక్కనపెడితే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ తొలగింపు.. కొత్త కమిషనర్ నియామకం హాట్ టాపిక్ గా నడుస్తుంది. ప్రభుత్వం రాత్రికి రాత్రి అనేకన్నా కేవలం గంటల వ్యవధిలో ఆర్డినెన్స్ ద్వారా ఈ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లడం వివాదాలకు దారితీసింది. దీనిపై ఇప్పటికే పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తుల నుండి సామాన్య పౌరుల వరకు ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఎస్ఈసీ తొలగింపు చెల్లదంటూ యోగేష్ అనే లాయర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయగా శుక్రవారం స్వయంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, కామినేని శ్రీనివాస్, బీజేపీ తరపున పిటిషన్స్ దాఖలు చేయగా టీడీపీ నేత వర్ల రామయ్య కూడా ఇదే అంశంపై మరో పిటిషన్ దాఖలు చేశారు. మరో సామాన్య పౌరుడు కూడా ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నిటినీ కలిపి హైకోర్టు సోమవారం విచారణ ప్రారంభించగా ప్రభుత్వ తరపు అడ్వకేట్ జనరల్ కౌంటర్ దాఖలు చేసేందుకు నెల రోజుల సమయం కావాలని కోరారు. అయితే, బీజేపీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కేసు తీవ్రతను.. మాజీ మంత్రులు స్వయంగా పిటిషన్లు దాఖలు చేయడంను కోర్టుకు గుర్తుచేయడంతో హై కోర్టు ప్రభుత్వానికి కేవలం మూడే రోజుల సమయం ఇచ్చింది. దాఖలైన అన్ని పిటిషన్లు ప్రభుత్వానికి అందించి మూడు రోజులలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. ఒకపక్క రాష్ట్రంలో కరోనా ప్రభావంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుండగా ఉపాధి కోల్పోయిన ఎందరో ప్రభుత్వం వంక ఆశగా చూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎస్ఈసీ తొలగింపుతో రాజకీయ చిచ్చురేపి వినోదం చూస్తోంది. ఒకవైపు కరోనా విలయం.. మరోవైపు ఎస్ఈసీ తొలగింపుపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నా రాష్ట్రంలో ఎన్నికలకు మాత్రం రంగం సిద్దమవుతున్నట్టు కనిపిస్తోంది. కొత్త ఎన్నికల కమిషనర్ గా నియమించిన గంటలలోనే.. లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుండి కొత్త వ్యక్తులకు అనుమతి లేదన్న నిబంధనకు నీళ్ళొదిలేసి విధులలో ప్రత్యక్షమైన కనగరాజన్ సోమవారం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించిన కనగరాజన్ ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల వాయిదా.. ప్రస్తుత లాక్ డౌన్ తదితర పరిస్థితులపై చర్చించారు. ఎన్నికలకు ఏ క్షణమైనా సిద్ధంగా ఉండాలని అందుకు తగిన కార్యాచరణ మొదలుపెట్టాలని ఆదేశించారు. అయితే.. ఒకపక్క రాష్ట్రంలో కరోనా కష్టాలు వెంటాడుతుండగా.. మరోవైపు తన నియామకంపైనే హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే రాష్ట్రంలో ఎన్నికలపై సమీక్ష చేయడం.. ప్రభుత్వం పనితీరు.. ఎన్నికలపై ఉన్న వ్యామోహమే తప్ప ప్రజా శ్రేయస్సు ఎక్కడా కనిపించనట్లుగా ఉందని విమర్శలొస్తున్నాయి. మరో వైపు నేడు ప్రధాని మే 3 తేదీ వరకూ లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రకటన చెయ్యడం, 20 తేదీన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తొలగింపు విషయంలో హైకోర్టు తీర్పు రానుండడంతో ఏం జరగనుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

22 కేజీల పండ్లు రూ.300లకే! ఫోన్ కొట్టు పండ్లు ప‌ట్టు!

ఉద్యానవన రైతులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ వినూత్న కార్యక్రమం అమలు చేస్తోంది. జంటనగరాల్లో ప్రజల ఇంటి వద్దకే పండ్ల సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లోని ప్రజలు 30 ప్యాక్‌లు ఆర్డర్‌ ఇస్తే నేరుగా సరఫరా చేస్తామని ప్రకటించింది.  73307 33212కు ఫోన్‌ చేస్తే డోర్‌ డెలివరీ అందిస్తారని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్యాక్ లో ఉండే పండ్ల రకాల్ని చూస్తే.. మామిడికాయలు 3.5కేజీలు.. బొప్పాయి 3 కేజీలు.. సపోటా కేజీ..బత్తాయి 2.5కేజీలు.. నిమ్మకాయలు 12.. పుచ్చకాయలు నాలుగు కేజీలు ఉంటాయి. అంటే..మొత్తం 22 కేజీల పండ్లు రూ.300లకే ఇంటికి తెచ్చేలా మార్కెటింగ్ శాఖ ప్లాన్ చేసింది. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఉత్తరాదికి పండ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానికంగా అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం రైతులకు ఆదాయాన్ని, ప్రజలకు ఇంటివద్దనే  తాజా పండ్లను అందిస్తుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి తెలిపారు.

ఉదయం ప్రధాని నాకు ఫోన్‌ చేశారు: చంద్రబాబు

లాక్‌డౌన్‌ను మే 3 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈరోజు ఉదయం ప్రధానితో ఫోన్ లో కరోనా కట్టడి గురించి మాట్లాడానని తెలిపారు.  హైదరాబాద్‌లో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నిన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్‌ చేశా.. ఆయనతో మాట్లాడాలని అడిగాను. అయితే, ఈ రోజు ఉదయం 8.30 గంటలకు ప్రధాని నాకు ఫోన్‌ చేశారు.  ఆయనతో నా ఆలోచనలు పంచుకున్నా’’ అని చంద్రబాబు తెలిపారు. కరోనా నియంత్రణ చర్యలపై ప్రధానికి ఇటీవల రాసిన లేఖలో కొన్ని సూచనలు చేశానని చంద్రబాబు అన్నారు. జోన్ల వారీగా కరోనా వ్యాప్తి ప్రాంతాలను విభజించమని ఆ లేఖలో కోరానన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

వైసీపీ ఎమ్మెల్యేతో సమావేశమైన ఎమ్మార్వోకు కరోనా!!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఓ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన సన్నిహితులు, తోటి ఉద్యోగులు, ఆయనను కలిసిన రాజకీయ నేతల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం వారందరూ వైద్యుల సమక్షంలో క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ తహసీల్దార్ మడకశిర వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామితో పలుసార్లు సమావేశమయ్యారని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే ఇంతవరకూ స్పందించలేదు.

ప్రజలందరికీ ఉచితంగా ఆహారం అందించాలి!

కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లో కూడా శరవేగంగా విస్తరిస్తుంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జాతిని ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భాగమైన "నా ప్రియమైన దేశ ప్రజలారా.." అంటూ ప్రారంభమైన ఆమె సందేశంలో, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు ప్రతి పౌరుడూ సహకరించాలని ఆమె కోరారు. వైరస్ భయాందోళనలు తగ్గేంతవరకు ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరారు. ఇటువంటి సమయంలో ప్రజలంతా శాంతి, సహనం, సంయమనం పాటిస్తున్నారని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిచాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అభ్యర్థించారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తమ భార్యా పిల్లలనూ, తల్లిదండ్రులనూ వదిలి కరోనాపై పోరాడుతున్నారని, వారందరికీ థ్యాంక్స్ అని చెప్పారు. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని గుర్తు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు, ప్రజలందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన సోనియా గాంధీ.. ముందస్తు సన్నాహాలు లేకుండా దేశంలో లాక్‌ డౌన్ అమలు చేస్తుండడం వల్ల దేశం నష్టపోతోందని అన్నారు.