జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోండి! సీఎం ఆదేశం!
*కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్
*కోవిడ్నివారణా చర్యలు, రైతులను ఆదుకునే చర్యలు, రేషన్ పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు.
రద్దీని తగ్గించాలంటే ప్రతిరోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలి. జోన్లలోకూడా రోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచడం వల్ల జనం గుమిగూడకుండా చూసుకోవచ్చు. లేకపోతే రద్దీ ఉండి మళ్లీ లాక్డౌన్ ఉద్దేశాలు నెరవేరవు. కాబట్టి జనం గుమిగూడకుండా ఏం చేయాలన్నదానిపై ఆలోచనలు చేయాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు.
మనం ఇచ్చిన పరిమిత సమయంలోనే భౌతిక దూరం పాటిస్తూ, మార్కెట్లను, బజార్లను వికేంద్రీకరిస్తూ, ఆంక్షలను అమలు చేస్తూ రోజూ నిత్యావసరాలను సరఫరాచేయండి. ప్రజల మూవ్మెంట్ను తగ్గిస్తూ.. వారికి అందుబాటులో అన్నీ ఉండేలా చేయాలి. అలాగే హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో హోండెలివరీ లాంటి మార్గాలను ఎంచుకంటే మంచిందని ముఖ్యమంత్రి సూచించారు.
హాట్స్పాట్లలో ప్రజల మూవ్ మెంట్ తగ్గించేలా, ప్రతిరోజూ నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచేలా, ప్రజలకు అత్యంత సమీపంలో నిత్యావసరాలు ఉండేలా చూడండి. వీలైతే డోర్ డెలివరీ లాంటి మార్గాలపై ఆలోచన చేయమని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
క్వారంటైన్ సెంటర్లలో నాణ్యతమైన సేవలు, సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే జిల్లాల్లో ఉన్న షెల్టర్లు జోన్ల అన్నింటికీ కూడా ఒక రెసిడెంట్ ఆఫీసర్ను నియమించి ప్రతిరోజూ భోజనం, మెనూ మార్చారా? లేదా? బాత్రూమ్స్ పరిశుభ్రంగా ఉన్నాయా? లేవా? పారిశుద్ధ్యం సరిగ్గా ఉందా? లేదా? అన్నదానిపై ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్ తెప్పించుకోవాలని సి.ఎం. వీడియోకాన్ఫరెన్స్లో సూచించారు.
కుటుంబ సర్వే ద్వారా జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, సహా బీపీ, సుగర్, ఆస్తమా లాంటి లక్షణాలు ఉన్నవారందరికీ పరీక్షలు చేయించాలని అధికారులకు ఆదేశించారు. కరోనా ఎవరికి వచ్చింది? వారి వయస్సు ఎంత? వారు ఇప్పటికే ఏ వ్యాధులతో బాధపడుతున్నారు? అన్నదాన్ని గుర్తించి.. వెంటనే వారికి అత్యుత్తమ వైద్యం అందించాలి. హైరిస్కుగా ఉన్న కేసులను గుర్తించి వారిని పూర్తిస్థాయిలో ఉత్తమ వైద్యం అందించాలి. వారిని వెంటనే కోవిడ్ క్రిటికల్ కేర్ ఆస్పత్రులకు తరలించి మంచి వైద్యం ఇస్తే... మరణాలను అరికట్టగలమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.