నిమ్మగడ్డ రమేష్ తొలగింపులో జగన్ సర్కార్ తప్పటడుగులు వేసిందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు విషయంలో జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందనే విమర్శలు అన్ని విపక్ష పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. అయితే విమర్శల సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వం దురుద్దేశపూరితంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిందనే వాదనకు మద్దతుగా న్యాయ నిపుణుల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీటిలో ప్రధానమైనది ఆర్ఢినెన్స్ లో కొన్ని కీలక అంశాలను విస్మరించడంతో పాటు అప్పటికే పదవిలో ఉన్న వ్యక్తికి కొత్త నిబంధనల వర్తింపు వంటివి కూడా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కోసం జారీ చేసిన ఆర్డినెన్స్ లో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. అయితే ఇందులో ఒక అంశానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా రెండో అంశం మాత్రం కచ్చితంగా నిమ్మగడ్డను టార్గెట్ చేసి పెట్టిందే అనే భావన న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. కమిషనర్ పదవీకాలం సవరణ చేసే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాగో ఉంది. ఈ విషయంలో నిమ్మగడ్డకు ఎలాంటి రాజ్యాంగ రక్షణ లభించబోదు. అయితే ఆయన సర్వీసు రూల్స్ లో మార్పులు చేసే విషయంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ లో ప్రస్తావించిన సర్వీస్ రూల్స్ మార్పు వ్యవహారం కొత్త కమిషనర్ ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిందే. అయితే ఈ నిబంధన విషయంలో రాజ్యాంగంలో ఉన్న అర్ధం ప్రకారం ప్రస్తుత కమిషనర్ సర్వీస్ రూల్స్ ను మార్చడం ద్వారా ఆయనకు నష్టం కలిగేలా చేయరాదన్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే చెబుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం ఆర్టికల్ 243లోని పదవీకాలం నిబంధన మాత్రమే వాడుకుని నిమ్మగడ్డను తొలగించింది. దీంతో ఇప్పుడు ఇదే విషయాన్ని వచ్చే సోమవారం జరిగే వాదనల సందర్బంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయవాది ప్రస్తావించే అవకాశముంది. అప్పుడు న్యాయస్ధానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇప్పుడాయన ఏజెంట్ 116...

* విజయసాయి రెడ్డి పరిశోధనలో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు...  *నిమ్మగడ్డ ఫోర్జరీ వ్యవహారం లో కనకమేడల, వర్ల రామయ్య, టీ డీ జనార్దన్ ఉన్నారంటూ డి జి పి కి ఫిర్యాదు  *నిమ్మగడ్డ సంతకం తెలుగుదేశం పార్టీ ఆఫీసు లోనే ఫోర్జరీ అయిందని విజయసాయి ఆరోపణ  * ఐపీ ఆధారంగా ఈ లేఖను ఎవరు పంపారో గుర్తించాలంటూ డి జి పి కి వినతి  నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంక్షోభం , మొత్తానికి తెలుగుదేశం పార్టీని ఇంకా వెన్నాడుతూనే ఉంది. సి ఐ డి ఆఫీసర్ గా అవతారమెత్తిన వై ఎస్ ఆర్ సి పి జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయి రెడ్డి తాజాగా తన పరిశోధనలో కొత్త అంశాలను వెలికి తీశారు.  కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ రాసిన లేఖపై విచారణ జరిపించాలని కోరుతూ, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, డి జి పి గౌతమ్ సవాంగ్ కు తాజాగా లేఖ రాయడంతో, ఇప్పుడు ఈ వివాదం మరో మలుపు తిరిగింది. ఇటీవల, కేంద్ర హోం శాఖకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినట్టుగా వెలుగు చూసిన ఒక లేఖ, సంచలనం రేపిన విషయం తెలిసిందే.  దీనిపై తాజాగా, రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల కేంద్ర హోం శాఖకు రాసిన లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ సందర్భంగా రమేష్ కుమార్‌ చేసిన సంతకానికి, ఇప్పుడు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతనే లేదని అనుమానం వ్యక్తం చేశారు.  సంతకం ఫోర్జరీ చేసిన లేఖ కచ్చితంగా తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో తయారైందని తమ దగ్గర సమాచారం ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇది కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేశారని, ఇందులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, ఆ పార్టీ నాయకులు వర్ల రామయ్య, టీడీ జనార్ధన్‌ల హస్తం ఉందని వెల్లడించారు. వీరంతా కలిసే ఈ లేఖను సృష్టించారని, ఈ తతంగమంతా రమేష్ కుమార్‌కు తెలిసే జరిగిందని విమర్శించారు. ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాలని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఆ లేఖను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాలని, దీనిపై వచ్చే నివేదిక ఆధారంగా క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా వెల్లడించారు. ఐపీ ఆధారంగా ఈ లేఖను ఎవరు పంపారో గుర్తించి చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డీజీపీని కోరారు.

రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జాబితాను ప్రకటించిన కేంద్రం

రెడ్ జోన్లో 170 జిల్లాలు, ఆరెంజ్ జోన్లో 207, మిగతావి గ్రీన్ జోన్లో రెడ్ జోన్లో రెండు రకాలు. విస్తృతి ఎక్కువున్నవి 143 (లార్జ్ ఔట్‌బ్రేక్), క్లస్టర్లలో విస్తృతి ఉన్నవి 47 జిల్లాలు 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు - ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్పు ఏపీలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపూర్ తెలంగాణలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్ తెలంగాణలో రెడ్ జోన్ (హాట్‌స్పాట్ క్లస్టర్) జిల్లాలు: నల్గొండ తెలంగాణలో ఆరెంజ్ జోన్ (నాన్-హాట్‌స్పాట్) జిల్లాలు: సూర్యాపేట, ఆదిలాబాద్. మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట.

దేశ వ్యాప్తంగా ‘కరోనా’ హాట్ స్పాట్ జిల్లాలు 170: లవ్ అగర్వాల్

*దేశ వ్యాప్తంగా కొవిడ్-19 హాట్ స్పాట్ కేంద్రాలను గుర్తించాం *భారత్ లో ‘కరోనా’ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ స్థాయికి చేరలేదు  *హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం ‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను హాట్ స్పాట్స్ గా గుర్తించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఢిల్లీలో ఇవాళ ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా కొవిడ్-19 హాట్ స్పాట్ కేంద్రాలు, నాన్ హాట్ స్పాట్ కేంద్రాలు, గ్రీన్ జోన్లను గుర్తించామని అన్నారు. భారత్ లో ‘కరోనా’ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ స్థాయికి చేరలేదని స్పష్టం చేశారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,439కి చేరిందని, దీని బారిన పడి 377 మంది మృతి చెందారని అన్నారు.

ఐటీ కంపెనీ ఉద్యోగులకు పెరిగిన వేతనాలు

ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని వంటి సంస్థల్లో దాదాపు 70 శాతం మంది ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వీరికి సింగిల్ డిజిట్ వేతనం పెరిగింది. ఈ సంస్థలోని 84,000 ఉద్యోగులకు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ వేతన పెంపు అమలవుతుంది. మిగతా వారికి అప్రైజల్స్ జూలై నెలలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంతే కాదు క్యాప్‌జెమిని నాలుగువేల జాబ్ ఆఫర్లు కూడా ఇచ్చింది. ఇందులో 2,000 మంది ఫ్రెషర్స్ ఉన్నారు. కేవలం క్యాప్‌జెమినియే కాదు వివిధ సేవా సంస్థలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగాలు ఉండటం కష్టంగా ఉందనే సమయంలో కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు ఊహించని విధంగా వేతన పెంపు, కొత్త ఆఫర్లు ఇవ్వడం గమనార్హం. తమ ఉద్యోగులందరినీ నిలుపుకుంటామని క్యాప్ జెమిని చెబుతోంది. బిల్లబుల్ ప్రాజెక్టుపై లేకుండా బెంచ్‌కు పరిమితమైన వారిని కూడా నిలుపుకుంటామని చెబుతోంది. సాధారణంగా ఉద్యోగులను 60 రోజుల పాటు బెంచ్‌కు పరిమితం చేస్తారు. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 8 శాతం మంది బెంచ్‌కు పరిమితమవుతారు. డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్ భారత్‌పే కూడా తమ ఉద్యోగులకు 20 శాతం హైక్ ఇచ్చింది. కాగ్నిజెంట్ ఏప్రిల్ నెలకు గాను బేసిక్ శాలరీలో 25 శాతం అదనపు మొత్తాన్ని ఇస్తోంది. మరోవైపు అసోసియేట్ స్థాయి ఉధ్యోగుల వరకు వేతనం పెంచింది. ఇండియాలో ఈ అమెరికన్ ఐటీ దిగ్గజానికి 2,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దీనిని అమలు చేయడం ద్వారా దాదాపు మూడొంతుల మంది ఉద్యోగులకు వేతనం పెరిగినట్లు. ఫ్రాన్స్‌కు చెందిన ఈ ఐటీ మల్టీ నేషనల్ కంపెనీ తమ ఉద్యోగులకు కొందరికి రూ.10,000 అలవెన్స్ కూడా ఇస్తోందట. రీలోకేషన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి, అకామిడేషన్ లేకుండా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ మొత్తం అందిస్తోంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది.

ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెడ‌తారా? సీఎంపై టి.కాంగ్రెస్ ధ్వ‌జం!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఘాటుగా విమ‌ర్శ‌లు చేస్తూ ముఖ్య‌మంత్రికి 22 ప్ర‌శ్న‌లు వేసింది. 1. జన్ ధన్ యోజన పేరిట మహిళల జన్ ధన్ అకౌంట్లలో నెలకురూ.500 చొప్పున మూడు నెలల పాటు కేంద్రం డిపాజిట్ చేయనుంది. శుక్రవారం నుంచే అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ ఈ స్కీమ్ మొదలైంది.  2.తెలంగాణలో అంతయోదయ, ప్రయారిటీహౌస్ హోల్డర్స్ జాబితా ప్రకారం కోటీ 92లక్షల మంది ఉన్నారు. వారందరికీ మూడు నెలల పాటు ప్రతి నెల ఉచితంగా 5 కిలోలబియ్యం, కిలో పప్పును ఇస్తోంది. అంటే 15కిలోల బియ్యం, 3 కిలోల పప్పు ప్రతి రేషన్కార్డు హోల్డెర్ కు అందనుంది. 3.తెలంగాణ లో ఉన్న తెల్ల కార్డులు ఉన్నవారు 87.59 లక్షలు. 4.తెలంగాణ లో ఉన్న రేషన్ డీలర్లు 17022 మంది.  5.వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలకు రూ. వెయ్యి చొప్పున పెన్చన్ను 3 నెలల పాటు కేంద్రం అందించనుంది. దీనివల్ల రాష్ట్రంలో ఆసరా పిన్షస్.  పొందుతున్న 30 లక్షల మందికి పైగా లబ్జి చేకూరే అవకాశముంది. 6.ఉపాధి హామీ కార్మికులకు రోజూ వారి కూలీని రూ.182 నుంచి రూ.202కు పెంచింది. రాష్ట్రంలో 59 లక్షల మందికి లబ్ధి. ఇప్పటికే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూ.4,431 కోట్లను విడుదల చేసింది. 7. తెలంగాణ లో  ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన లబ్ధిదారులు  10,75,202.  8. దీపం పథకం కింద TOI చమురు కంపెనీల డాటా ప్రకారం తెలంగాణ లో ఉన్న కుటుంబాలు 1.04cr. ఉన్న గ్యాస్ కనెక్షన్లు 1.14cr. 9.కేంద్ర ప్రభుత్వం నెలకు 5 kg బియ్యం, 1kg పప్పు ఇస్తే, ముఖ్య‌మంత్రి  KCR 22.3.2020, GoMs 45 ప్రకారం ప్రకటించి న 12kg బియ్యం కలిపితే లబ్దిదారులకు రావలసింది. 5kg+12kg+=17kg బియ్యం,  1kg పప్పు = నెలకు 18kg.  మరి ఇప్పుడు లబ్ధిదారులకు వచ్చింది 12kg. బియ్యం మాత్రమే, మిగతా 5kg బియ్యం,1 kg పప్పు ఏమైనట్టు ? ఈ 12kg లు కేంద్ర వాటా నా! రాష్ట్ర వాటా నా! రాష్ట్ర వాటా ఐతే కేంద్ర వాటా ఎక్కడ? 11.GoMs45 లో 87.59 లక్షల కార్డు లబ్ధిదారులకు 12kg ల బియ్యం ఈ ఒక్క నెల నేనా? కేంద్రం లాగా 3 నెలలా అనేది స్పష్టత లేదు.  ఓక వేల 3 నెల లైతె ...15kg+36kg+=51kg బియ్యం, 3kg పప్పు = నెలకు 54kg. 12. ముఖ్య‌మంత్రి KCR ప్రకటించిన 22.3.2020,GoMs 45 ప్రకారం 87.59 లక్షల తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు ఇస్తామన్నా 1500 రూ ఆర్థిక సహాయం ఇంకెప్పుడూ ఇస్తారు. 13.తెల్ల రేషన్ కార్డు దరఖాస్తు చేసుకొని పెండింగ్ లో ఉండి పొందని వారు 18 లక్షల మంది పరిస్థితి ఏంటి? 14.లాక్ డౌన్  మొదలైనది ఏప్రిల్ 22 న ఈ రోజుకులాక్డౌన్ 22 రోజులు. మీ ఆర్థిక సహాయం ఇంకా ఎన్నడు ఇస్తారు? 15. తెలంగాణ ఆర్థిక శాఖా 19.3.2020 నాడు 1500cr కు DIPR RO NO 2686-DP/CL/Advt/2019-20 బాండ్ వేలం కోసం ప్రకటన చేసింది.  16. మార్చి 23 నే  వేలం డబ్బులు వచ్చాయి. అవి ఎక్కడకు పోయాయి? 17. కేంద్రం నుండి మొదటి విడత కోరన విపత్తు కింద 269 cr. వచ్చాయి. మరి జీతభత్యా ల్లో కోత విధించారు.  18. దాతలు ఇచ్చిన కోట్ల రూపాయలు ఏమైనాయి. 19. భవన నిర్మాణ సంక్షేమ నిధులు వాడుకోవాలని కేంద్రం అనుమతి ఇచ్చిందా? లేదా? ఇస్తే  ఎన్ని  వేల కోట్లకు అనుమతి ఇచ్చింది.  20.GHMC పరిధిలో వలస కూలీలు 3 నుండి  4 లక్షల మంది ఉన్నారు. వారి వసతి, తిండి పరిస్థితి ఏంటి? 21. మీరు ఏర్పాటు చేసిన 200 food centers ఎక్కడ? వాటి బాధ్యతలను ఎవరూ చూస్తున్నారు.  22. రోజుకు average గా ఎంత మందికి క‌రోనా టెస్టులు చేస్తున్నారు.  Doctor's కి, nurse లకు ఎలాంటి రక్షణ వస్తువులు వాడుతున్నారు, సరిపడా అందుబాటులో ఉన్నాయా? N95 మాస్క్ లు ఎన్ని ఉన్నాయి? కాలనీ వైస్ గా ఉన్న డాక్టర్ లను సంప్రదించి వారి ఏరియా పరిది లో ఉన్న ప్రజలకు డోర్ to డోర్ covid screening చేస్తే తొందరగా ఈ ప్రమాదం నుండి బయట పడవచ్చ‌ని తెలంగాణా కాంగ్రెస్ సూచించింది.

నిర్బంధంలోకి ముఖ్య‌మంత్రి విజయ్ రూపానీ

గుజరాత్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగుతోంది. అయితే, ఆయ‌న‌కు కరోనా నిర్దారణ కావడానికి ఆరు గంటల ముందే ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదెవాలా మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజాను గాంధీనగర్‌లోని సెక్రటేరియల్‌లో స‌మావేశం అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశమై.. అహ్మదాబాద్‌లో కరోనా వ్యాప్తి, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదెవాలా కలిసి మాట్లాడారు.  అదే రోజు సాయంత్రం ఇమ్రాన్ ఖేడెవాలాకు పరీక్షలు చేయగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో వెంటనే అప్రమత్తం అయిన ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ సెల్ఫ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా.. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే బద్రుద్దీన్, ఆయన భార్యకు కరోనా సోకడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేతో జరిగిన సమావేశంలో సామాజిక దూరం పాటించారని ప్రభుత్వం చెబుతున్నా.. అహ్మదాబాద్ మిర్రర్ వెల్లడించిన ఫోటోల్లో మాత్రం వీరంతా మాస్క్‌లు తీసేసి, పక్కపక్కనే కూర్చున్నట్టు స్పష్టమవుతోంది. దీంతో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని, రిపోర్టులు నెగెటివ్‌గా వచ్చాయని అధికారులు తెలిపారు. ఆరోగ్యం సాధారణంగా ఉందన్నారు. అయితే, సీఎం మాత్రం స్వీయ నిర్బంధంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనులను పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. ఆయనను కలుసుకోడానికి వారం రోజుల వరకూ ఎవర్నీ అనుమతించ‌రు. డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్‌లు కూడా ఇళ్లకే పరిమితమ్యారు. దరియాపూర్ ఎమ్మెల్యే గ్యాసుద్దీన్ కూడా ఇమ్రాన్ కారులో ప్రయాణించారు.  జమల్‌పూర్ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

హమ్మో.. ఏపీలో కరోనా లెక్క ఝడిపిస్తోంది...

*ఏపీలో 502కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు  *గుంటూరు లో అత్యధికంగా 114 కేసులు  ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహహ్మారి విజృంభిస్తోంది. కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం వరకు కొత్తగా 19 కేసులు నమోదయ్యాయి. వీటిలో పశ్చిమగోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 502కి చేరుకుంది. 114 కేసులతో గుంటూరు జిల్లా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కర్నూలు జిల్లా 96, నెల్లూరు జిల్లా 54 ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి జీఓ లను కొట్టివేసిన ఏపీ హై కోర్ట్ 

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85 లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఏ మీడియం చదువుకోవాలి అనేది పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయిస్తారని జీఓ సవాలు చేస్తూ , ఇంద్రనీల్ అనే న్యాయవాది పిల్ దాఖలు చేశారు. ఆ పిల్ ను విచారించిన హై కోర్టు, ఆ జి ఓ లను కొట్టివేసింది.  ఇలా తప్పనిసరి చేస్తే కొందరి బ్యాక్ లాగ్ లు మిగిలిపోయే ప్రమాదం ఉందని న్యాయవాది తన పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై లోగడ వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం, ఈ రోజు  జీఓ లు కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం నవంబరు 6న అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే . వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే విడతల వారీగా 1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను అమలు చేయాలనీ ప్రభుత్వ ఉద్దేశంగా అప్పట్లో జారీ అయిన ఉత్తర్వుల ద్వారా తెలిసింది.   2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు, 2021-22 విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతికి, 2022-23 విద్యాసంవత్సరం నుంచి 10 తరగతి విద్యార్థులకు ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్టు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయా తరగతుల్లో తెలుగు లేదా ఉర్దూను తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.  దీనిపై మార్గదర్శకాలు ఇలా  ఉన్నాయి.  అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ-విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు నియమించేలా చర్యలు తీసుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో 1-8 తరగతులను ఇంగ్లిష్‌ మీడియంలోకి మారుస్తున్న నేపథ్యంలో.. అందుకు అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్యకు సంబంధించిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పంపాలి.  ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు వీలుగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే.. టీచర్లకు శిక్షణా కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలి. వేసవి సెలవుల్లోనూ శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయి. టీచర్లలో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన సామర్థ్యం మెరుగుపడే వరకు సంబంధిత సబ్జెక్టు, ఇతర అంశాలపై వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. ఇంగ్లిష్‌ మీడియం బోధనలో సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే భవిష్యత్తులో జరిగే ఉపాధ్యాయ నియామకాల్లో నియమించుకోవాలి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌ సెంటర్లు, డిస్ట్రిక్ట్‌ ఇంగ్లిష్‌ సెంటర్లను.. డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌లుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలి.సంబంధిత ఉపాధ్యాయులు ఇంగ్లిష్‌ మీడియంలో బోధించడానికి వీలుగా.. వారికి అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శిక్షణ, హ్యాండ్‌ బుక్స్‌ రూపకల్పన, ఉత్తమ బోధన పద్ధతుల గురించి వివరించడం, వారికి అవసరమైన మెటీరియల్‌ను రూపొందించే బాధ్యతను స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్‌టీ)కి అప్పగించింది.

బిఆర్ శెట్టి ఒప్పందాన్ని ఆవిరి చేసిన టీడీపీ సర్కార్

* అమరావతి లో 950 పడకల ఆస్పత్రి తో సహా మెడికల్ సిటీ కి ప్రతిపాదన  * ఒప్పందం సమయంలో భారీ మొత్తలు చేతులు మారాయని ఆరోపణలు  * సి బి ఐ ఆధ్వర్యం లో మొదలైన విచారణ  * 2018 లో బీ ఆర్ ఎస్ మెడిసిటీ పూర్తయ్యుంటే, ఈ రోజున రాజధాని ప్రాంతానికి ఈ కష్టం వచ్చి ఉండేది కాదు  తెలుగుదేశం ప్రభుత్వం తో ఒప్పందం ప్రకారం, ప్రస్తుత రాజధాని ప్రాంతం లో ప్రతిపాదించిన - 950 పడకల గల ఒక అత్యాధునిక ఆస్పత్రిని బి ఆర్ శెట్టి నిర్మించి సేవలు ప్రారంభించి ఉంటె, ఈ రోజు ఆంధ్ర ప్రాంతంలో ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యుండేది కాదు. అవును, ఇది నిజం. 950 పడకల ఆస్పత్రి మాట దేవుడికెరుక. అది కనీసం వంద పడకల ఆసుపత్రిగా కూడా రూపుదిద్దు కాకపోవటం గమనార్హం. రాజధాని ప్రాంతంలో కారుచౌకగా 100 ఎకరాలను బిఆర్ శెట్టి మెడిసిటీ సంస్థకు ఒక మెడికల్ యూనివర్సిటీ ప్రారంభించే ఒప్పందంతో తెలుగుదేశం ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ సంస్థ పట్ల ప్రత్యేక ప్రేమతో నిబంధనలను కూడా సడలించింది అయినప్పటికీ ఈ సంస్థ మెడికల్ యూనివర్సిటీ నిర్మాణ దిశగా గాని, 950 పడకల ఆధునిక ఆసుపత్రి నిర్మాణ దిశగా గాని ఎటువంటి చర్యలు తీసుకున్నట్లుగా మనకి కనిపించదు, ఇదే 100 ఎకరాలను నిజాయితీగల సంస్థలకు ఇచ్చి ఉన్నట్లయితే ఈ విపత్కర పరిస్థితులలో ఉన్నత స్థాయి ఆసుపత్రులు మెడికల్ కాలేజీలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండే వాళ్ళు. అదేవిధంగా మెడికల్ సీట్లు కూడా రాష్ట్రానికి వచ్చి ఉండేవి. తమ స్వార్థం కోసం వందల ఎకరాలను కాజేసే దుర్బుద్ధితో నే మెడిసిటీ పేరిట గత టిడిపి ప్రభుత్వం లోని పెద్దలు ఈ స్థలాలను దోచుకున్నారనే అంశం మీద ఇప్పటికే విజిలెన్స్ విచారణ, సి బి ఐ విచారణ కూడా నడుస్తున్నాయి కూడా.  అయితే, అదే ప్రాంతంలో ఎయిమ్స్ లాంటి సంస్థలచేత, లేదా టాటా గ్రూప్ చేత గానీ అత్యవసర ప్రాతిపదికన ఒక వంద పడకల ఆస్పత్రిని సిద్ధం చేయాలనీ విజిల్ బ్లోయర్ డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ , ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి విజ్ఞప్తి చేసారు.

పేదల వైద్యుడు కె. ఎం. ఇస్మాయిల్ హుస్సేన్‌ కన్నుమూత

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనను చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం 6 గంటలకు మృతి చెందారు. ఉస్మానియా కాలేజ్ ఎదుట ఆస్పత్రిని ఏర్పాటు చేసి గత 45 ఏళ్లుగా పేదోళ్ల కోసం డాక్టర్‌ ఇస్మాయిల్‌ విశేష సేవలు అందించారు. ఫీజు అడగకుండా రూ.20 ఇచ్చినా, రూ. 30 ఇచ్చినా.. ఇవ్వలేమని చెప్పినా... చిరునవ్వుతో వైద్యం చేయడం ఆయన విశిష్టత. పేదల కోసం కార్పొరేట్ హంగులుతో పెద్ద నర్సింగ్ హోమ్ కట్టించి పేదలు ఇచ్చినంత తీసుకుని వైద్య సేవలు అందిచారాయన. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.. కుమారుడు డాక్టర్ కె. ఎం ఇక్బాల్ హుస్సేన్ కూడా ప్రభుత్వ వైద్యుడు. ముగ్గురు అల్లుళ్ల లో ఒకరు ప్రస్తుతం కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మహమ్మద్ కాగా, మరో ఇద్దరు అల్లుళ్లు విదేశాల్లో ఇంజనీర్లుగా స్థిరపడ్డారు.

తెలంగాణలో ఈ ఐదు జిల్లాలు సేఫ్!

ఈ రోజు ప్రకటించే మార్గదర్శకాలను బట్టి, తెలంగాణా కు భారీ రిలీఫ్ కలిగే అవకాశం కనిపిస్తోంది. కరోనా వైరస్ తెలంగాణలో ఇప్పటివరకూ ఐదు జిల్లాలను అసలు తాకనేలేదు. మరో ఆరు జిల్లాల్లో కరోనా ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఈ 11 జిల్లాల్లో కరోనా కారణంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ నిబంధనల నుంచి ప్రజలకు కొంతమేరకు ఉపశమనం లభించవచ్చని తెలుస్తోంది. నిబంధనల మినహాయింపుపై రాష్ట్రాల ప్రభుత్వాలదే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, నిబంధనల తొలగింపుపై కేసీఆర్ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నారాయణ పేట, వనపర్తి, వరంగల్‌ రూరల్‌, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో మహబూబాబాద్‌, సిద్దిపేట, ములుగు, నాగర్‌ కర్నూలు, జగిత్యాల తదితర జిల్లాల్లో ఒకటి నుంచి రెండు కేసులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా మార్చిలో వెలుగులోకి వచ్చినవే. ఏప్రిల్ లో ఈ జిల్లాల నుంచి ఒక్క కేసు కూడా రాకపోవడంతో ఈ ప్రాంతాలనూ మినహాయింపు జాబితాలో చేర్చేందుకు వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, మొత్తం 30 సర్కిళ్లు ఉండగా, హయత్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో మాత్రమే ఒక్క కేసు కూడా రాలేదు. మిగతా 28 సర్కిళ్లలో కేసులు ఉండటంతో, ఈ ప్రాంతంలో నిబంధనలను సడలిస్తే, ప్రజలను నియంత్రించడం కష్టమవుతుందన్న నేపథ్యంలో, ప్రస్తుతానికి మినహాయింపులు ఉండక పోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక కరోనా సోకని, ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినా, అన్ని కార్యకలాపాలనూ జిల్లాల సరిహద్దుల వరకే పరిమితం చేసేలా అధికారులు ప్రణాళికలను రచిస్తున్నారు. జిల్లాల సరిహద్దులను మూసే ఉంచుతారని తెలుస్తోంది. ఇక ఈ ప్రాంతాల్లో వ్యవసాయ పనులను పూర్తి స్థాయిలో చేసుకునేందుకు, చిన్న ఫ్యాక్టరీలు, ఇతర వ్యాపారాలను అనుమతించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు ఊతం ఇచ్చినట్టు అవుతుందని, ప్రభుత్వానికి కొంతయినా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.  అయితే, ఇవన్నీ కూడా పూర్తిగా షరతులకు లోబడే వర్తిస్తాయి.

ఏమ్మా.. నిర్మలమ్మా....  నువ్వు సెప్పిందేంది.. సేసిందేంది...

* ఆర్ధిక మంత్రి మారటోరియాన్ని లైట్ తీసుకున్న బ్యాంకులు  * ఎప్పటిలానే,  లోన్ కిస్తీలను డిడక్ట్ చేస్తున్న బ్యాంకులు  * ఓ వైపు జీతాల్లో కోత, మరో వైపు ఇన్ స్టాల్ మెంట్ల వాత  * హామీ ఇచ్చిన స్టేట్ బ్యాంక్ కూడా సైలెంట్ గా కిస్తీల కోత మొదలెట్టింది  ఏదో పోన్లే గదా అని మా నాయుడు గారు ( అదేనండీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు) అవకాశమిస్తే, మా రాష్ట్రం నుంచి రాజ్యసభ కు వెళ్లి, మాకే వెన్నుపోటు పొడిచిన నిర్మలమ్మ గారూ...(కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్).. ఇప్పుడు ఇంకోసారి బ్యాంకు ఖాతాదారులను బిచ్చగాళ్ల స్థాయికి తీసుకువస్తున్నావు గదమ్మా.. .. మా ఆంధ్ర బ్యాంకు ను తీసుకెళ్లి, అదేదో నార్త్ బ్యాంక్ లో మెర్జ్ చేశావు...ఇప్పుడేమో, ఆర్ బీ ఐ వాళ్ళ చేత ..మూడు నెలల మారటోరియం అన్ని లోన్స్ మీద ఉంటుందని చెప్పించి, యధావిధిగా లోన్ ఇన్స్టాల్ మెంట్ కట్ చేయించావు... నువ్వు మామూలు మంత్రివి కాదమ్మా.. ..జనాన్ని ఈ స్థాయిలో పిచ్చివాళ్ల ను చేయగల మీ మేధో శక్తి ని చూసే, నరేంద్ర మోడీ మీకు రెండు సార్లు మంత్రి పదవి ఆఫర్ చేసి ఉంటారు. కిందటి నెల నువ్వు ప్రకటన చేసే సమయానికే ఆ నెల కిస్తీ ని డిడక్ట్ చేసుకున్న బ్యాంకులు, ఈ నెల హోమ్ లోన్స్ కిస్తీలు కూడా మినహాయించుకోవటం మొదలెట్టాయి. చివరికి, ప్రభుత్వ రంగం లోని అతి పెద్ద బ్యాంకు అయిన- భారతీయ స్టేట్ బ్యాంక్ ( ఎస్ బీ ఐ) కూడా ఇచ్చిన మాట ను గట్టున పెట్టి మరీ హోమ్ లోన్ కిస్తీలను మినహాయించుకోవటం మొదలెట్టింది.  ఈ కరోనా కంటిన్యూ అవుతోంది గదా, నా లోన్ కిస్తీ ఆపేస్తారా? , నా క్రెడిట్ కార్డు బిల్ క్యాన్సిల్ చేస్తారా? అంటూ పిచ్చి జనం వేసే వెర్రి ప్రశ్నలకు ఒకటే ఆన్సర్ ఇప్పుడు. అవేవీ ప్రాక్టికల్ గా సాధ్యం కావని నిర్మల సీతారామన్ బ్యాంకుల ద్వారా చెప్పించేశారు. కరోనా లాక్ డౌన్ నేపధ్యం లో, అన్ని తరహా లోన్ల మీద మారటోరియం విధించుకునే వెసులుబాటును బ్యాంకులకు కల్పిస్తూ, ఆర్ బీ ఐ కిందటి నెల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తం అన్ని బ్యాంకులు కూడా అన్ని తరహా టర్మ్ లోన్ల మీద మూడు నెలల మారటోరియం విధించుకునే వెసులుబాటుని ఆర్ బీ ఐ కల్పించింది. ఈ నిర్ణయం వల్ల, బ్యాంకు కస్టమర్లు మూడు నెలల పాటు తమ కిస్తీలను కట్టకుండా ఉండే సదుపాయాన్ని బ్యాంకులు కల్పించవచ్చునన్న మాట.  ఇక్కడే ఆర్ బీ ఐ ఒక పీట ముడి వేసింది. బ్యాంకులకు తాము మారటోరియం  సదుపాయం మాత్రమే కల్పించామని, దీనిపైన తదుపరి నిబంధనలు రూపొందించాలని, ఈ విషయం లో ఒక వేళ వ్యక్తిగత స్థాయిలో ఈ ఎం ఐ లను మూడు నెలలపాటు సస్పెండ్ చేయాలా, లేక బ్యాంక్ లెవెల్ లో నిర్ణయం తీసుకోవాలా అనేది ఇంకా ఒక నిర్ణయం అయితే జరగలేదనేది ఆర్ బీ ఐ సూత్రీకరణ.  ఎస్ బీ ఐ చీఫ్ రజనీష్ కుమార్ అయితే, అన్ని టర్మ్ లోన్లు క్యాన్సిల్ అయినట్లే అని ధృవీకరించారు. కానీ, వాస్తవానికి అది జరగలేదు. లోన్లు తీసుకున్న బ్యాంక్ కస్టమర్ల ఖాతాల నుంచి లోన్లు ఆటొమ్యాటిక్ గా డిడక్ట్ అవుతాయా, లేక, కస్టమర్లు వ్యక్తిగత స్థాయిలో ఆ ఆప్షన్ ను ఎంచుకొవాలా అనే అంశం మీద ఆర్ బీ ఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే, ఆ ఇచ్చిన క్లారిటీ లో లొసుగుల కారణంగా, బ్యాంకులు శుభ్రంగా కిస్తీలు డిడక్ట్ చేయటం మొదలెట్టాయి.  అలాగే, ఒక వేళ లోన్ కిస్తీలు చెల్లించకపోతే, ఖాతాదారుల క్రెడిట్ స్కోర్ మీద దాని ప్రభావం పడుతుందా అనే ప్రశ్నకు, ఏ ప్రభావమూ ఉండదు అనే బదులిస్తోంది ఆర్ బీ ఐ. అలాగే, ఆర్ బీ ఐ తీసుకున్న కిస్తీ ల మూడు నెలల వాయిదా నిర్ణయాన్ని, అన్ని కమర్షియల్ బ్యాంకులు, అంటే రీజనల్ రూరల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, అఖిల భారత స్థాయిలో ఉన్న ఆర్ధిక సంస్థలు, NBFC, అంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు అన్నీ కూడా ఈ మారటోరియం సదుపాయాన్ని కల్పించవచ్చును.  అయితే, ఆర్ బీ ఐ దీని మీద మరో క్లారిటీ కూడా ఇచ్చింది. ఇది రుణాల రద్దు కిందకి రాదు, కేవలం కిస్తీల చెల్లింపు లో కల్పిస్తున్న వాయిదా సదుపాయమే కానీ, మూడు నెలల పాటు రీ పేమెంట్ షెడ్యూల్ తో పాటు, తదుపరి కిస్తీ చెల్లింపు తేదీలన్నీ కూడా మూడు నెలల తర్వాత ఉండేలా చూడాలనేది బ్యాంకులకు ఆర్ బీ ఐ సూచన. అంటే దానర్ధం, మూడు నెలల రుణ వాయిదాలన్నీ, ఒకే సారి జూన్ నెలలో చెల్లించాలనే అనుమానాల మీద మాత్రం ఆర్ బీ ఐ క్లారిటీ ఇవ్వలేదు. ఆర్ బీ ఐ పూర్తి గైడ్ లైన్స్ వెలువరిస్తే కానీ, దీని మీద స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే, ఈ మూడు నెలల మారటోరియం -ఖాతాదారుల రుణాల మీద అసలు, ఇంకా వడ్డీ కి కూడా వర్తిస్తుందా అనే దాని మీద మాత్రం, ఆర్ బీ ఐ క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చ్ 1 నాటికి ఉన్న అన్ని రకాల రుణాల మీద, మూడు నెలల పాటు రుణ కిస్తీల అసలు, ఇంకా వడ్డీ మీద మినహాయింపు ఉంటుందని ఆర్ బీ ఐ వివరించింది. ఇవన్నీ అబద్హం అని తేలిపోయింది.  హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, నిశ్చిత కాలపరిమితి ఉన్న ఆటో లోన్లు వంటివి అన్నీ, అంటే- మొబైల్, ఫ్రిజ్, టీ వీ లాంటి -కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కూడా ఆర్ బీ ఐ ప్రకటించిన మారటోరియం పరిధిలోకి వస్తాయని ఆర్ బీ ఐ స్పష్టం చేసింది.  అయితే క్రెడిట్ కార్డు పేమెంట్స్ మాత్రం దీని పరిధిలోకి రావాలి. అవి రివాల్వింగ్ క్రెడిట్ కిందకు వస్తాయి కాబట్టి, ఆ ప్రసక్తే ఉత్పన్నం కాదని ఆర్ బీ ఐ సూత్రీకరణ. అలాగే, క్రెడిట్ కార్డ్స్ మీద తీసుకున్న రుణాల విషయం లో మారటోరియం వర్తిస్తుందా, లేదా అనే దాని మీద ఆర్ బీ ఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఒక వేళ ఎవరైనా ఒక ఫ్యాక్టరీ నెలకొల్పే నిమిత్తం తీసుకున్న రుణాలకు ఇది వర్తిస్తుందా అనే దాని మీద మాత్రం, ఆయా బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుందని ఆర్ బీ ఐ క్లారిటీ ఇచ్చింది.  ఇక వ్యాపారాల గురించి, వాటి మీద తీసుకున్న రుణాల గురించి మాట్లాడుతూ, ఆర్ బీ ఐ చెప్పేదేమిటంటే -వ్యాపారాల నిమిత్తం తీసుకున్న వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ మీద వడ్డీ చెల్లింపుల కు మినహాయింపు ఇప్పటికే ఇచ్చిన విషయాన్ని స్పష్టం చేసింది. మార్చ్ 1 నాటికి ఉన్న లోన్స్ మీద ఈ మూడు నెలల కాలానికి గానూ పేరుకుపోయిన వడ్డీని, ఈ మారటోరియం ముగిసిన తర్వాతనే వాసులు చేస్తారనేది కూడా ఆర్ బీ ఐ మాట. అయితే, రుణ ఒప్పందాలను కానీ, ఆస్తుల విభజన అంశాలను కానీ ఈ మారటోరియం ఏ రకంగానూ ప్రభావితం చేయదనేది ఆర్ బీ ఐ మాట. ఇవన్నీ వినటానికి బావుంటాయి. ఇంకా మీరు ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ మాటలను నమ్ముతూ ఉంటె, మిమ్మల్ని ఆ మోడీ గారే కాపాడాలి.

హైదరాబాద్ లో వీరికెలా కరోనా.. సోకింది? 3వ ద‌శ వ‌చ్చేసిందా?

పాజిటివ్ గా తేలిన హైదరాబాద్ గాంధీనగర్ కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. కాళ్లు చేతులు పనిచేయక ఇంటిలోనే ఉంటున్నాడు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటికే పరిమితమయ్యారు. వీళ్లలో ఎవరికి బయట లింకులు లేవు. అయినా సరే పక్షవాతం సోకిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం వైద్యులను షాక్ కు గురిచేసింది. అలాగే మ‌రో కేసులో....టౌలిచోకీకి చెందిన 8 ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ చిన్నారి కుటుంబాలకు సేమ్ ఎవరితోనూ లింక్స్ లేవు. అయినా ఆమెకు కూడా కరోనా సోకింది. ఈ రెండు కేసులకు మర్కజ్ తోకానీ.. విదేశీ ట్రావెల్ హిస్టరీ కానీ లేకపోవడం వైద్యవర్గాలను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఈ కేసుల్లో ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ లేకున్నా కానీ కరోనా సోకడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి వారు ఇంకెంతమంది ఉంటారోనన్న భయం నెలకొంది. కొంతమందిలో లక్షణాలు బయటపడడంలేదు.వారు బయట తిరుగుతూ అంటించేస్తున్నారు. ఇలా ఎవరి ద్వారా వ్యాపిస్తుందో తెలియని కేసులు సామూహిక దశ అని ఇది చాలా డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజురోజుకు సంఖ్య తగ్గకపోగా విపరీతంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో అనూహ్యమైన కరోనా కేసులు వెలుగుచూస్తుండడం వైద్యవర్గాలను సైతం షాక్ కు గురిచేస్తోంది.

కేంద్రం విడుద‌ల చేసిన లాక్‌డౌన్ మార్గదర్శకాలు!

1. అన్ని జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సర్వీసులు మే 3 వరకు ర‌ద్దు. 2. భద్రత విధులకు తప్ప బస్సు, రైలు మెట్రో సర్వీసులు ర‌ద్దు. 3. అత్యవసర వైద్యానికి మినహా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా ప్రయాణాలపై నిషేధం. ఎవరూ సరిహద్దులు దాటడానికి వీల్లేదు. 4. ట్యాక్సీ సర్వీసులకు కూడా అనుమతి లేదు. 5. నిత్యావసరాల పంపిణీ మినహా మిగతా అన్ని కార్యక్రమాలకు రద్దు. 6. మాల్స్, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, బార్స్, ఆడిటోరియంలు బంద్‌. 7. సామాజిక, రాజకీయ, క్రీడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిషేధం. 8. మత ప్రదేశాలలో పెద్ద ఎత్తున ప్రార్థనలకు అనుమ‌తి లేదు. 9. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా. 10. హాట్‌స్పాట్స్, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. హాట్‌స్పాట్స్‌, కంటెయిన్‌మెంట్ జోన్‌లను రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు గుర్తించాలి. ఈ ప్రదేశాలలో సాధారణ కార్యకలాపాలకు అనుమతిలేదు. 11. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు 20 మందికి అనుమ‌తి. 12. ఆరోగ్య కేంద్రం, ఔషధాల విక్రయాలకు అనుమ‌తి. 13. ఔషధ పరిశ్రమలలో ఉత్పత్తికి అనుమతి. 14. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వరంలోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాలకు అనుమతి. వ్యవసాయ, ఉద్యానవన విభాగాలకు అనుమతి. 15. వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే పరిశ్రమలకు అనుమతి. 16. ఆక్వా ఉత్పత్తులు క్రయ విక్రయాలకు, బ్యాంకు కార్యకలాపాలకు అనుమతి. 17. వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాలు నిర్వహణకు ఎలాంటి ఆంక్షలు లేవు. 18. ఉపాధి హామీ పనులు, భవన నిర్మాణ పనులకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తరించరాదని, సమీపంలో ఉన్నవారితోనే పనులు చేపట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టు నిర్మాణ పనులకు అనుమతి. ఉపాధి కూలీలు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి. 19. ఎరువులు, పరుగుల మందులు, విత్తనోత్పత్తి దుకాణాలు తెరిచేందుకు అనుమతి. పాలకు సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగును కొనసాగించవచ్చు.

హెచ్1బీ వీసా గ‌డువు పెంపు!

ప్రస్తుతం ఉన్న హెచ్1బీ వీసాల వాలిడిటీని ఆరు వారాల నుంచి ఎనిమిది నెలలకు పొడిగిస్తూ అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) తమ వెబ్‌సైట్‌లో కీలక నోటిఫికేషన్ పోస్ట్ చేసింది. కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో వీసాల గడువు పొడిగింపు నిర్ణయాన్ని వెను వెంటనే పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే ప్రతీ దరఖాస్తును పరిశీలించి ప్రాసెస్ చేస్తామని తెలిపింది. అయితే గడువు పొడిగింపునకు సంబంధించి విశ్వసనీయమైన సాక్ష్యాలను దరఖాస్తు దారుడు సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వీసాల గడువు ముగిసి అమెరికాలో చిక్కుకున్న భారతీయ పౌరులకు ఈ నిర్ణయం పెద్ద ఊరట నిస్తుందని ఇమ్మిగ్రేషన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కోవిడ్-19 పరిణామాల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులకు హెచ్-1 బీ సహా, వివిధ రకాల వీసాల చెల్లుబాటును పొడిగించాలని లాస్ట్ వీక్ అమెరికాకు భారత ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో వలసదారులు వీసా గడువు ముగిసిన తరువాత అమెరికాలో ఉండేందుకు గడువు పొడిగింపు (ఈవోఎస్) లేదా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా బహిష్కరణ వంటి ఇతర పరిణామాలను తప్పించుకోవచ్చు. హెచ్-1 బీ వీసా దారులు ఒకవేళ ఉద్యోగాలు కోల్పోయినట్టయితే అమెరికాలో ఉండే గడువును 60 రోజుల నుంచి 8 నెలలు వరకు పొడిగించినట్టు తెలిపింది.

ఒకే కుటుంబంలో 17 మందికి క‌రోనా!

హైదరాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన 17 మందికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరణ అయిందని అధికారులు ధ్రువీకరించారు. వీరిలో ఒక 10 నెలల శిశువు నుంచి 12 ఏళ్ళ లోపు పిల్లలు ఆరుగురు ఉన్నారు. హైదరాబాద్‌లోని తలాబ్‌కట్టకు చెందిన ఒక మహిళ ఏప్రిల్ 10న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందారు. ఆమెకు కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 13న ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధరణ అయింది. దాంతో, వైద్య అధికారులు అప్రమత్తమై ఆ మహిళ కుటుంబ సభ్యులకు, వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారికి కలిపి మొత్తం 41 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 17 మందికి కోవిడ్ వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ అయింది. వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 24 మందిని కూడా ప్రభుత్వ నిజామియా హాస్పిటల్‌లో క్వారెంటైన్‌కు తరలించారు. అయితే, ఆ మహిళకు వైరస్ ఎలా సోకిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో ఒకే కుటుంబంలో ఇంత మందికి వైరస్ సోకడం ఇదే మొదటిసారి.

దేశ ప్రజలకు రైల్వే శాఖ ప్రత్యేక విజ్ఞప్తి...

దేశవ్యాప్తంగా మే 3 వరకూ... ప్రయాణికుల రైళ్లేవీ నడపట్లేదనీ... ప్రత్యేక రైళ్లేవీ నడపట్లేదనీ భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక ప్రకటన జారీచేసింది. దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరింది. ఏ ప్రకటనైనా అధికారికంగా వచ్చేది మాత్రమే నమ్మాలని ప్రజలను కోరింది. ఈ విషయంపై ప్రజలందరికీ అవగాహన కలిగించాలని మీడియా సంస్థలను రైల్వే శాఖ కోరింది. మే 3 వరకూ... ప్రజలెవ్వరూ... రైల్వే స్టేషన్ల దగ్గరకు రావొద్దని కోరింది. ఇండియాలో కరోనా వచ్చిన కొత్తలో... దాదాపు 12 మంది పాజిటివ్ వచ్చిన వారు రైళ్లలో ప్రయాణించారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా రైల్వే శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం రైల్వే శాఖ 15,523 రైళ్లను నడుపుతోంది. వీటిలో 9000 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. 3000 మెయిల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులున్నాయి. ఇవేవీ ఇప్పుడు నడవట్లేదు.