ట్రంప్ టీమ్లో తెలుగోళ్లు! కరోనాపై పోరుకు యాక్షన్ప్లాన్!
కరోనా దెబ్బతో అతలాకుతలమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ చర్యలు చేపట్టారు. 200 మందికి పైగా అగ్రశ్రేణి లీడర్లు, 12 మందికి పైగా ఇతర నిపుణులతో వేర్వేరు గ్రూపులను ఏర్పాటు చేశారు. వీరంతా అమెరికన్ ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలనే దానిపై సూచనలను అందించనున్నారు.
వీరిలో భారత సంతతికి చెందిన ఐటి, కార్పొరేట్ దిగ్గజాలు చోటు దక్కింది. ఈ టీంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్లతో సహా ఆరుగురు భారతీయ-అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలను ట్రంప్ ఎంపిక చేశారు. ఈ నిపుణులు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రణాళికలను, సూచనలు సలహాలు ఇవ్వబోతున్నారని ట్రంప్ ప్రకటించారు.
సుందర్ పిచాయ్, నాదెళ్లతో పాటు ఐబిఎం సిఇఒ అరవింద్ కృష్ణ, మైక్రాన్ సిఇఒ సంజయ్ మెహ్రోత్ర ఉన్నారు. వీరంతా సమాచార సాంకేతిక రంగం ఎదుర్కొంటున్నసమస్యలపై పరిష్కారాపై పనిచేస్తారు.
ఉత్పత్తి రంగం పునరుత్తేజ సూచనలిచ్చే బృందానికి పెర్నాడ్ రికార్డ్ బివరేజ్ కంపెనీ సిఇఒ ఆన్ ముఖర్జీని ఎంపిక చేశారు. మాస్టర్ కార్డ్కు చెందిన అజయ్ బంగా ఆర్థిక రంగ పునరుద్ధరణ బృందంలో ఉన్నారు.
వ్యవసాయ, బ్యాంకింగ్, నిర్మాణ, కార్మిక, రక్షణ, ఇంధన, ఆర్థిక సేవలు, ఆరోగ్యం, పర్యాటక, తయారీ, రియల్ ఎస్టేట్, రిటైల్, టెక్, టెలికమ్యూనికేషన్, రవాణా, క్రీడలు ఇలా వివిధ టీంలను ట్రంప్ ఏర్పాటు చేశారు. సంబంధిత రంగాలకు సంబంధించి ఈ బృందం సలహాలను అందివ్వనుంది.
ఆపిల్ సిఇఒ టిమ్ కుక్, ఒరాకిల్ లారీ ఎల్లిసన్, ఫేస్ బుక్ సిఇఒ మార్క్ జుకర్బర్గ్ , టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్, ఫియట్ క్రిస్లర్ మైక్ మ్యాన్లీ, ఫోర్డ్ కు చెందిన బిల్ ఫోర్డ్, జనరల్ మేరీ బార్రా లాంటి దిగ్గజాలు కూడా ట్రంప్ సలహా బృందం లో ఉన్నారు.
ఆరోగ్యం, సంపద సృష్టి తో పాటు అమెరికన్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఈ నిపుణుల బృందం తమ సూచనలతో కూడిన నివేదిక ఇస్తుందని వైట్ హౌస్ తెలిపింది.