కంటైన్మెంట్ నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే కేసు నమోదు!
posted on Apr 18, 2020 @ 10:22AM
తెలంగాణాలో 260 కంటైన్మెంట్ జోన్ లు! హైదరాబాద్లో 146 జోన్లు ఏర్పాటు చేశారు.
కోవిడ్-19ను అరికట్టుటకు కంటైన్మెంట్ జోన్స్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కే తారక రామారావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిలో జిహెచ్ఎంసి పరిధిలోనే 146 జోన్లు ఉన్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లోని 43 మున్సిపాలిటీలలో మిగిలిన 114 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు.
కంటైన్మెంట్ జోన్లలో వున్న ప్రజలను ఇండ్లకే పరిమితం చేశారు. మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల స్థానికంగా పర్యవేక్షిస్తున్నారు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, మెడిసిన్స్ ను ఇండ్ల వద్దకే సరఫరా చేస్తున్నారు. తదనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నియమించిన వాలెంటీర్లు, సిబ్బందిచే మాత్రమే నిత్యవసరాలను డోర్ డెలవరీ చేయించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశించారు. వాలెంటీర్లు, సిబ్బందికి ప్రత్యేక దుస్తులు అందజేయాలని నిర్ణయించారు.
కంటైన్మెంట్ జోన్లలోకి దాతలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని కేటీఆర్ అధికారులను హెచ్చరించారు. కంటైన్మెంట్ జోన్ లోని కుటుంబాల సెల్ నెంబర్లతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, అవసరాలను తెలుసుకుంటున్నారు. కంటైన్మెంట్ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ జోన్లను తొలగించనున్నట్లు తెలిపారు. ప్రజల సహకారం పైనే కంటైన్మెంట్ జోన్ల తొలగింపు ఆధారపడి ఉంటుందని తెలిపారు.
కొత్త కేసులు నమోదు కాకుండా కంటైన్మెంట్ నిబంధనలపై అవగాహన కల్పించి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శానిటేషన్, స్ప్రేయింగ్, ఫీవర్ సర్వేలను తగు జాగ్రత్త లతో నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. శానిటేషన్, స్ప్రేయింగ్ సిబ్బంది తప్పనిసరిగా రక్షణ పరికరాలు ధరించేవిధంగా మానిటరింగ్ చేయాలని తెలిపారు. సోడియం హైఫో క్లోరైట్ ద్రావనం నిల్వలను ముందస్తుగా తెప్పించుకోవాలని తెలిపారు. శానిటేషన్ తో పాటు మురుగునీటి వ్యవస్థలను మానిటరింగ్ చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. కంటైన్మెంట్ నిబంధనల అమలులో వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, వాటర్ వర్క్స్ /ప్రజారోగ్య విభాగాలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి కేటిఆర్ తెలిపారు. కంటైన్మెంట్ జోన్లను మానిటరింగ్ చేసేందుకు చేపట్టాల్సిన 12 ప్రధాన అంశాల గురించి అధికారులకు మంత్రి కె.టి.ఆర్ వివరించారు.
1) సరైన విధంగా బారీకేడింగ్ చేయాలి., 2) సంబంధిత శాఖల సిబ్బందిని నియమించాలి. 3) ఫీవర్ సర్వే కై పారమెడికల్ సిబ్బందిని నియమించాలి. 4) శానిటేషన్, స్ప్రేయింగ్ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలి. 5) నిత్యవసర వస్తువులను ఇంటింటికి అందించుటకై ఏర్పాట్లు చేయాలి. 6) పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా కంటైన్మెంట్ నిబంధనలు పాటించాలని కోరుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి ప్రచారం చేయాలి. 7) ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయాలి. 8) ప్రతిరోజు మెడికల్ టీమ్, అధికారులు ప్రతి ఇంటిని సందర్శించాలి. 9) సీనియర్ అధికారులు కంటైన్మెంట్ ఏరియాని తనిఖీ చేయాలి. 10) కంటైన్మెంట్ జోెన్లలోని ప్రజలను ఇంటికే పరిమితం చేయాలి, వారి కదలికలను నియంత్రించాలి. 11) అత్యవసర వైద్య సేవలకై అంబులెెన్స్ ను సిద్దంగా ఉంచాలి. 12) బియ్యాన్ని పంపిణీ చేయాలి.