20 నుంచి ‘టోల్’తీసేస్తారేమో జాగ్రత్త బాబులూ....
posted on Apr 18, 2020 @ 11:32AM
లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి టోల్ వసూలు నిలిపివేసిన నేషనల్ హై వేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ( ఎం హెచ్ ఏ ఐ ),
20 నుంచి మళ్లీ వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థిస్తూ, కేంద్రానికి లేఖ రాసింది. అయితే, ఆదుకోవాల్సిన సమయంలో ఇది సరికాదని, రవాణా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గత నెల రోజులుగా ఆగిన టోల్ వసూళ్లు మళ్లీ మొదలుకానున్నాయి. ఈ నెల 20 నుంచి టోల్ రుసుమును వసూలు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రంగం సిద్ధం చేస్తోంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గత నెల 24న కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. అయితే, అంతర్ రాష్ట్రాల పరిధిలో నిత్యావసర సరుకులు మోసుకెళ్లే ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలపై భారం తగ్గించేందుకు కేంద్రం టోలు వసూలును నిలిపివేసింది. గత నెల 25 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. తాజాగా, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్హెచ్ఏఐకి లేఖ రాస్తూ ఏప్రిల్ 20 నుంచి టోలు వసూలు మొదలుపెట్టాలని సూచించింది. కేంద్రం సూచనపై రవాణా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా రవాణా రంగం పూర్తిగా కుదేలైందని, ఎన్నో ఇబ్బందులు తట్టుకుని నిత్యావసర సరుకుల రవాణా కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నిర్ణయం సరికాదని అఖిల భారత మోటారు ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ఆవేదన వ్యక్తం చేసింది.