టీవీ 5 కార్యాలయం పై దాడిని ఖండించిన లోకేష్!

హైదరాబాద్ టీవీ 5 కార్యాలయం పై దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. టీవీ 5 కార్యాలయం పై రాళ్ల దాడి పిరికిబంద చర్య అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా పై దాడులు చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలని ఆయ‌న అన్నారు. పత్రికా స్వేచ్చని హరించే విధంగా జరుగుతున్న సంఘటనల పై మీడియా ఐక్యంగా పోరాటం చెయ్యాలి లేకపోతే ఇలాంటి పరిస్థితి అందరికి వచ్చే ప్రమాదం ఉంది లోకేష్ అభిప్రాయ‌ప‌డ్డారు. అన్ని రాజకీయ పార్టీలు మీడియా,మీడియా ప్రతినిధులపై దాడులను తీవ్రంగా ఖండించి భావ ప్రకటనా స్వేచ్చని కాపాడటానికి ముందుకు రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని లోకేష్ విజ్ఞ‌ప్తి చేశారు.

ముంబయి చేరుకోనున్న విదేశాల్లోని తెలుగు ప్రజలు! హోటళ్ల‌లో 1000 గదులు సిద్ధం చేసిన ఏపీ స‌ర్కార్‌

విదేశాల నుంచి వచ్చే వారిని 14 రోజుల పాటు పెయిడ్ క్వారంటైన్ కు తరలించ‌నున్నారు. వారి కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడలో హోటళ్లు, లాడ్జీల్లో 1000 గదులు సిద్ధం చేసింది. 14 రోజుల తర్వాత నెగెటివ్ వస్తే ఇళ్లకు పంపిస్తారు. అవసరాన్ని బట్టి 28 రోజుల వరకు క్వారంటైన్ పెంచే అవకాశం ఉంది. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. 64 ప్రత్యేక విమానాల ద్వారా విదేశాల్లోని భారతీయులను తీసుకురావ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. అందులో వున్న తెలుగువారిని ముంబయి నుంచి హైదరాబాద్, గన్నవరంకి తరలిస్తారు. ఈ క్రమంలో, విదేశాల్లో ఉన్న తెలుగు వారు సోమవారం నాటికి ప్రత్యేక విమానాల్లో ముంబయి చేరుకోనున్నారు. వారిని ముంబయి నుంచి హైదరాబాదుకు, గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలించనున్నారు.

పబ్‌లు, రెస్టారెంట్లు, బార్‌లలో మద్యం అమ్మకాలు!

మద్యం విక్రయాలపై కర్ణాటక సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మే 9వతేదీ నుంచి 17వతేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని రెస్టారెంట్లు, పబ్‌లు, బార్‌లలో కూడా రిటైల్ ధరలకు మద్యం విక్రయాలకు అనుమతిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రెస్టారెంట్లు, పబ్‌లు, బార్‌లలో మందుబాబులు ఇంటికి తీసుకువెళ్లేలా అమ్మకాలు చేసుకోవచ్చని సర్కారు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ఆదాయం కోసం మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతించింది. ఇప్పుడు మద్యం విక్రయాల ద్వార మరింత ఆదాయం పెంచుకునేందుకు మద్యాన్ని రెస్టారెంట్లు, పబ్‌లు, బార్‌లలో కూడా రిటైల్ ధరలకు విక్రయించవచ్చని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 753కు చేరింది.

లాక్ డౌన్ వేళ మావంతు సాయం చేస్తున్నాం: నారా భువనేశ్వరి

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు. సంక్షోభ సమయంలో సేవ చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడు ముందుంటుందని అన్నారు. లాక్ డౌన్ వేళ తెలుగు రాష్ట్రాల్లో తమవంతు సాయం చేస్తున్నామని వెల్లడించారు. భౌతికదూరం పాటిస్తూ ఇప్పటివరకు 20 వేల మంది పేదలకు నిత్యావసరాలు అందించామని, బియ్యం, నూనె, పండ్లు, గుడ్లు, కూరగాయలు పంపిణీ చేశామని వివరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 2.5 లక్షల మందికి ఎస్ఎస్-99 మాస్కులు అందించామని భువనేశ్వరి తెలిపారు. 3 వేల మంది కూలీలకు పులిహోర, బిస్కెట్లు పంపిణీ చేశామని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.  ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ 24 గంటలూ అత్యవసర సేవలు అందిస్తోందని, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి బ్లడ్ బ్యాంకుల ద్వారా 5,000 యూనిట్లు పంపిణీ చేశామని వివరించారు.

మద్యం అమ్మకాలను నిషేధించాలని ఆదేశాలివ్వలేం: సుప్రీం

మద్యం అమ్మకాలను నిషేధించాలని ఆదేశాలివ్వలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మద్యం అమ్మకాలపై రాష్ట్రాలవి విధానపరమైన నిర్ణయాలని.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. మద్యం కొనుగోలు సమయంలో చాలాచోట్ల భౌతిక దూరం పాటించడం లేదని, అందువల్ల మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను శుక్రవారం విచారించిన అనంతరం సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే.. రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను పాటించాలని ధర్మాసనం సూచించింది. రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు ఆన్‌లైన్‌ విధానాన్ని అనుసరించాలని, ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మద్యాన్ని హోం డెలివరీ చేయాలని సుప్రీం కోర్టు రాష్ట్రాలకు సూచించింది.

నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టు తీర్పు రిజర్వ్!

ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సుధీర్ఘంగా విచారించిన అనంతరం నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. ఐదు రోజుల పాటు వాద ప్రతివాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు.  243కె అధికరణలో పదవీకాలం రక్షణ ప్రస్తావన లేదని ఏజీ తెలిపారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని.. నిష్పక్షికంగా ఎన్నికలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్న పిటిషనర్ల వాదనలో వాస్తవం లేదని కోర్టుకు వాదనలు వినిపించారు. అంతేకాదు.. ఆర్డినెన్స్‌పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారణార్హం కాదని ఏజీ కోర్టుకు తెలిపారు. ఎస్ఈసీ కనగరాజ్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్. ప్రసాద్ వాదనలు వినిపించారు. మాజీ న్యాయమూర్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడం శుభపరిణామమని ఈ సందర్భంగా కోర్టుకు వినిపించారు. కమిషనర్ పదవిని వయసుతో ముడిపెట్టడం సరికాదని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ తరుపున రాతపూర్వకంగా వాదనలు సమర్పించేందుకు మాజీ అడ్వకేట్ జనరల్ సీవీ మోహన్ రెడ్డి సమయం కోరారు. వచ్చే సోమవారం వరకు హైకోర్టు సమయం ఇచ్చింది.

నిబంధనలు అతిక్రమిస్తే సహించం: గౌతమ్‌రెడ్డి

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజ్‌ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గ్యాస్‌ లీకేజ్‌ ఘటనపై సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విశాఖ గ్యాస్ లీక్ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే సహించమని.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  కష్టకాలంలో బాధితులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరించారని పేర్కొన్నారు. తనతో సహా మంత్రులను విశాఖకు పంపించి.. సాధారణ పరిస్థితి వచ్చేలా చూడాలని సీఎం జగన్ చెప్పారని వెల్లడించారు. ఎల్జీ కంపెనీని రూ.50 కోట్లు డిపాజిట్‌ చేయమని గ్రీన్ ‌ట్రిబ్యునల్‌ ఆదేశించిందని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందన్నారు. 100 శాతం సురక్షితంగా మారాక గ్రామస్తులను అనుమతిస్తామని తెలిపారు. విశాఖ పోలీసులు, వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారని మంత్రి గౌతమ్‌రెడ్డి అభినందించారు.  ఎల్జీ పాలిమర్స్‌ ప్రతినిధులు,నిపుణులతో మంత్రి గౌతమ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ట్యాంక్‌ పరిస్థితిపై సమీక్షించామని తెలిపారు. ట్యాంక్ ఉష్ణోగ్రత 120 కన్నా తక్కువ గా ఉందని.. కొన్ని రసాయనాలు వాడి పూర్తిగా ఉష్ణోగ్రతలు తగ్గిస్తున్నారని తెలిపారు. ‘‘ఇప్పుడు వచ్చిన నిపుణులు ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. 48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుంది.  స్టైరిన్ గాల్లో తక్కువ మోతాదులో ఉంది. దీని వల్ల ప్రమాదం లేదు. ఇది ఎక్కువ శాతం గాల్లో కూడా ఉండదు. ఇది భూమి మీద పడిపోతుంది. దీని వల్ల ప్రమాదం లేదని’’ మంత్రి వివరించారు. రాష్ట్రంలో 86 కంపెనీలు గుర్తించామని.. భద్రత ప్రమాణాలు పరిశీలించిన తరువాతే ప్రారంభించడానికి అనుమతులు ఇస్తామని గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.

సంక్షోభాన్ని రాజకీయం చేస్తారా?: బొత్స

టీడీపీలా సంక్షోభాన్ని రాజకీయానికి వాడుకోవడం తమ పార్టీకి తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ ఘటన విషయంలో ప్రభుత్వ స్పందనను ఒక టీడీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు హర్షించాయని చెప్పారు. ఈ ప్రమాదంపై సోషల్ మీడియాలో టీడీపీ చేసే కామెంట్స్ చూసి బాధపడ్డామని అన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఏ విషయంలో ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యమో చెప్పాలని అన్నారు. చౌకబారు ఆరోపణలు చేయడం తగదన్నారు.  భద్రతా పరమైన చర్యలు చేపట్టకపోవడం కంపెనీ తప్పని అన్నారు. అయితే ఎల్జీ కంపెనీతో లాలూచీ పడుతున్నామంటూ చౌకబారు విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ నుంచి పరిహారం వస్తుందా లేదా అనే తదుపరి విషయం అని, ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినా తప్పుపడతారా? అని ధ్వజమెత్తారు. లాక్‌డౌన్ నేపథ్యంలో అత్యవసర సర్వీసుల కింద ఏ కంపెనీకి అనుమతులు ఇవ్వలేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు.  అనుమతి పొందడానికి ముందు కంపెనీ ప్రతినిధులు పర్యవేక్షించే సమయంలో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. విశాఖలో పాలిమార్స్ కాలుష్య సమస్య పరిష్కారం అయ్యే వరకూ మంత్రులందరూ విశాఖలోనే ఉంటారని బొత్స తెలిపారు.

ఎల్జీ పాలిమర్స్ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉంది: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

గ్యాస్ లీకేజ్ ప్రమాదం సంభవించిన ఎల్ జి పాలిమర్స్ కర్మాగార ప్రాంతంలోగల ఐదు గ్రామాలలో పరిస్థితి అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కర్మాగారానికి దక్షిణ దిశలో ఉన్న గ్రామాల్లోనే విష వాయువు ప్రభావం కొద్దిగా మిగిలి ఉన్నదని తెలిపారు.  నిర్వాసితులకు  పునరావాసం, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు.454 మంది ఆసుపత్రిలో ఉన్నారని వారిలో 20 మంది తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని తెలిపారు. కర్మాగారం గేటు వద్ద వెంకటాపురంలో మాత్రమే పాయింట్ 0.2 ppm గాఢత ఉందని గోపాలపట్నం వేపగుంట ప్రాంతాల్లో విషవాయువు గాఢత  “0” గా నమోదైందని వెల్లడించారు.  కర్మాగారం లోని బ్రాయిలర్ ల ఉష్ణోగ్రత అదుపులోనే ఉందన్నారు. ఇతర సాంకేతిక విషయాలపై నిపుణులు, సాంకేతిక కమిటీ లతో చర్చించడం జరుగుతుందన్నారు.  జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.కోటి అందజేయడం జరుగుతుందని, తర్వాత న్యాయపరమైన అంశాల తో కంపెనీ నుండి నష్టపరిహారం చేస్తామని తెలిపారు.

రూ.30 కోట్లు ఎక్స్‌‌గ్రేషియా విడుదల! ఉత్తర్వులను జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా విడుదల చేసింది. రూ.30 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.కోటి రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రథమచికిత్స చేసుకున్న వారికి రూ.25 వేలు. ఆస్పత్రిలో రెండు, మూడు రోజులు ఉన్నవారికి రూ.లక్ష. వెంటి లెటర్‌పై ఉన్నవారికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.  గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లో ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రూ.30 కోట్లు విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్‌ లీక్‌ ఘటనలో మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరింది. అలాగే విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైనవారికి విశాఖలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు గ్యాస్‌ లీకేజి అరికట్టేందకు 9 మంది నిపుణుల బృందంతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు నిపుణల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది.

8 గంటల్లోనే రైల్వే వంతెన పునర్ నిర్మాణం!

విజయవాడ డివిజన్లో రికార్డు సమయంలో రైల్వే పాత వంతెనను పునర్ నిర్మించారు. ఇంజనీరింగ్ బృందం ఆధ్వర్యంలో పాత వంతెనను కేవ‌లం 8 గంటల రికార్డు సమయంలో ఒంగోల్ - కరావాడి విభాగం మధ్య డౌన్-లైన్లో ప్రీ-కాస్ట్ ఆర్సిసి బాక్స్లతో నిర్మాణం పూర్తి చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలోని పాత శిధిలావస్థలో ఉన్న  రాతి వంతెనను ప్రీ కాస్ట్ ఆర్సిసి (రీఇన్ఫోర్స్ డ్ సిమెంట్ కాంక్రీట్) బాక్సులతో కిలో  నెం.  588 డౌన్ మెయిన్ లైన్లో విజయవంతంగా పూర్తి చేశారు. వంతెనను మార్చడానికి వీలుగా గురువారం 07:30 - 15:30 గంటల మధ్య డౌన్ లైన్లో 8 గంటల మెగా బ్లాక్ లతో కూడి పనులు చేపట్టేందుకు చర్యలు విజయవంతం గా పూర్తి.  దీనితో డివిజన్ ఎదుర్కొంటున్న 5 ప్రధాన వంతెన బ్లాక్లు లాక్డౌన్ సమయంలో రికార్డు సమయంలో మరమ్మతులు పూర్తయ్యాయి.   మూడు 200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల క్రేన్లు, 4 ప్రోక్లెయినర్లు, 2 పవర్ బ్రేకర్లు, 4 టిప్పర్ లారీలు, టవర్ కార్ పరికరాలు మరియు 20 మంది కనీస సిబ్బంది  శ్రమను ఉపయోగించి 8 గంటల రికార్డు సమయంలో సమీకరించడం ద్వారా  రైలు రాకపోకలు కి ఎటువంటి అంతరాయం కలగకుండా పనిని  పూర్తీ చేశామని డివిజనల్ ఇంజనీర్ సంజీవ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, విధుల్లో భాగస్వామ్యం అయిన కార్మికుల్ని  క్షుణ్ణంగా పరీక్షించడం, వారికి పిపిఇలు, శానిటైజర్లు అందించామన్నారు.  పని సమయంలో భౌతిక దూరాన్ని  ఖచ్చితంగా పాటించడం ద్వారా అన్ని భద్రతా జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు.     ఇటువంటి పనులు సాధారణ రోజుల్లో జరిపితే  ఈ ప్రధాన మార్గంలో  200 కంటే ఎక్కువ రైళ్ల సేవల కదలికలను ప్రభావితం అవుతాయని తెలిపారు. ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చెయ్యడంతో, విజయవాడ డివిజన్  నాలుగు ప్రధాన వంతెన బ్లాక్లు పూర్తయ్యాయన్నారు.  సిగరాయకొండ-టంగూటూర్ మరియు రాజమండ్రి-విశాఖపట్నం సెక్షన్ మధ్య రెండు వంతెనలు, మరియు విజయవాడ యార్డ్ వద్ద సిజర్స్ క్రాస్ఓవర్ను పిసిసి స్లీపర్లతో భర్తీ చెయ్యగలిగామన్నారు. లాక్డౌన్ కాలంలో ఇలాంటి కీలకమైన పనులు చేసినందుకు ఇంజనీరింగ్ బృందాన్ని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్  పి.శ్రీనివాస్ అభినందించారు.

రైలు ప్రమాద ఘటన తెలిసి ఎంతో బాధపడ్డాను: చంద్రబాబు

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి రైలు ప్రమాద ఘటనపై స్పందిస్తూ చందబ్రాబు ట్వీట్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ - నాందేడ్ మార్గంలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ ఘటన సమాచారం తెలిసి తాను ఎంతో బాధపడ్డానని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.  కాగా,  ఈ రైలు ప్రమాదంలో 16 మంది మరణించినట్టు సమాచారం. వీరంతా మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికులుగా తెలుస్తోంది.

విశాఖ ఘటనపై తూతూమంత్రంగా విచారణ: చంద్రబాబు

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ విచారణ తూతూమంత్రంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మీడియాతో శుక్రవారం మాట్లాడిన ఆయన ఈ ఘటన దురదృష్టకరమన్నారు. సహాయ కార్యక్రమాల్లో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు. విశాఖ వెళ్లేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా స్టైరిన్‌ ప్రమాదం జరగలేదని చెప్పారు. మానవ తప్పిదమా? లేక టెక్నికల్‌ సమస్యా? తేలాల్సి ఉందన్నారు. జనసాంద్రత మధ్య ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ఉండడం సరికాదన్న ఆయన.. బాధితులు ప్రస్తుతానికి కోలుకున్నా మళ్లీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. విశాఖ ఘటనను హైకోర్టు, హెచ్‌ఆర్సీ సుమోటోగా తీసుకున్నాయని, కేంద్రం కూడా హైపవర్‌ కమిటీని నియమించిందన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీపై చిన్న చిన్న కేసులు నమోదు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఆంధ్ర‌-తెలంగాణా మ‌ధ్య మ‌ళ్ళీ చిచ్చు! పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై ర‌గ‌డ‌!

తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు పంచాయితీ ముదురుతోంది. గతంలోనే ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడానికి ఆంధ్రప్రదేశ్‌ పూనుకోవడం, దానికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం జరిగాయి. ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లడంతో మరోసారి ఇది చర్చనీయాంశమైంది.  పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం డిసెంబరులోనే నిర్ణయించింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే తమకు అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు విషయంలో తమ అనుమతి లేకుండా నిర్ణయం తీసుకోవద్దని బోర్డు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఇదేమీ పట్టించుకోకుండా ప్రాజెక్టు విస్తరణపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే తెలంగాణ నీటి ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయన్న ఆందోళన ఉంది.  ప్రస్తుతం పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40 వేల క్యూసెక్కులుగా ఉంది. ఈ సామర్థ్యంతోనే ఏపీ భారీగా శ్రీశైలం నీటిని తరలిస్తుందనే ఆరోపణలున్నాయి. దీని సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచడం ద్వారా మరింత నీటిని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అదే జరిగితే శ్రీశైలంపై ఆధారపడ్డ తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడుతుందనే ఆందోళన ఉంది.

మ‌‌ద్యం తాగ‌డంలో ఆ ఐదు రాష్ట్రాలే టాప్‌!

దేశంలో ఉత్ప‌త్తి అయ్యే మొత్తం మ‌ద్యంలో 45 శాతం మ‌ద్యాన్ని ఆ ఐదు రాష్ట్రాలే తాగేస్తున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఇన్ఫ‌ర్మేష‌న్ స‌ర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలిపిన స‌ర్వే ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాల ప్ర‌జ‌లు మ‌ద్యం గ‌రిష్టంగా వినియోగిస్తున్నార‌ని తెలిపింది.  అత్య‌ధికంగా మ‌ద్యం వినియోగించే రాష్ట్రంగా త‌మిళ‌నాడు మొద‌టి స్థానంలో నిలిచింది. దేశంలో ఉత్ప‌త్తి అయ్యే మ‌ద్యంలో 13శాతం ఆ రాష్ట్రంలోనే వినియోగిస్తున్నారు. త‌రువాతి స్థానంతో పోటి ప‌డుతూ క‌ర్ణాట‌క రాష్ట్రం 12శాతం వినియోగిస్తుంది. జాతీయ మ‌ద్యం ఉత్ప‌త్తి మొత్తంలో తెలంగాణ రాష్ట్రం 6శాతం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 7 శాతం, కేర‌ళ రాష్ట్రం 5 శాతం వినియోగిస్తున్నాయి.   ఈ ఐదు ద‌క్ష‌ణాది రాష్ట్రాల‌తో క‌లిపి ఉత్త‌రాది రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ మొత్తం 12 రాష్ట్రాల్లో 75శాతం మ‌ద్యం వినియోగంలో ఉందని తేలింది.  ఆదాయం విష‌యానికి వ‌స్తే కేవ‌లం 3.3 కోట్ల జ‌నాభా ఉన్న కేర‌ళ రాష్ట్రం త‌మ ఆదాయ వ‌న‌రుల్లో మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా 15 శాతం రెవెన్యూ సాధించి దేశంలోనే మొద‌టి స్థానంలో ఉంది.  దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే కేర‌ళ ప్ర‌భుత్వం మ‌ద్యంపై అత్య‌ధిక ప‌న్ను వ‌సూలు చేస్తుంది. కేర‌ళతో పాటు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కూడా రాష్ట్ర ఆదాయంలో 15 శాతం వాటా మ‌ద్యం అమ్మ‌కాల ద్వార పొందుతోంది.   రాష్ట్రాల వారిగా మ‌ద్యం రెవెన్యూ శాతం చూస్తే  క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ 11శాతం, తెలంగాణ 10శాతం క‌లిగి ఉన్నాయి. జాతీయ జ‌నాభాలో 4 శాత‌మే ఉన్న ఢిల్లీ రాష్ట్రం మ‌ద్యం ఆదాయం విష‌యంలో దేశంలో మూడో స్థానంలో ఉంది.

గ్యాస్‌ లీకేజీపై హైపవర్‌ కమిటీ ఏర్పాటు!

విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్‌ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం తెల్లవారుజామున ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి వెలువడిన స్టైరిన్‌ విషవాయువును పీల్చడం ద్వారా 12 మంది మృతి చెందగా, వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదకర ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు హై పవర్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ హైపవర్‌ కమిటీకి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ చైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కరికలవలవన్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, విశాఖ పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కె మీనా, పీసీబీ మెంబర్ సెక్రటరీ వివేక్ యాదవ్ సభ్యులుగా వ్యవహరించనున్నారు.  ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ వెలువడటానికి గల కారణాలపై ఈ కమిటీ సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎల్‌జీ పాలిమర్స్‌ పుట్టుపూర్వోత్తరాలను ఆరా తీయనుంది. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా చేపట్టిన విస్తరణ కార్యకలాపాలు, దీనికి సంబంధించిన అనుమతి పత్రాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. కంపెనీ కార్యకలాపాల్లో అనుమతులు, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలు చోటు చేసుకుంటే దానికి గల కారణాలను ఈ కమిటీ అన్వేషించనుంది. విచారణలో ఎదురైన అంశాలు, ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్యం వెల్లడించిన అభిప్రాయాలతో కూడిన సమగ్ర నివేదికను నెల రోజుల్లోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయాల్సి ఉంటుందని ప్రభుత్వం హైపవర్‌ కమిటీకి సూచించింది.

విజయవాడలో కేంద్ర బృందం పర్యటన!

కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలుసుకునేందుకు శుక్రవారం ఉదయం కేంద్ర వైద్య బృందం నగరంలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డితో కేంద్ర బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల వివరాలు అడిగి తెలుసుకుంది. అలాగే కర్నూలు, గుంటూరులో కరోనా ఎక్కువగా వ్యాప్తికి గల కారణాలను కేంద్ర బృందం ఆరా తీసింది. కరోనా బారిన పడిన వారికి అందుతున్న వైద్య సహాయంపై చర్చించింది.  రాష్ట్రంలో కేసుల వివరాలను కేంద్రబృందం అడిగి తెలుసుకుంది. అలాగే రోగులకు ఎలాంటి చికిత్స అందిస్తున్నది తెలుసుకుంటున్నారు. అనంతరం రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలపై కేంద్ర బృందానికి వైద్యారోగ్య శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు. అలాగే ఇంటింటి సర్వే వివరాలను కేంద్రబృందానికి అధికారులు వివరిస్తున్నారు.

జనావాసాల మధ్య ఉన్న పరిశ్రమల్ని గుర్తించండి! సి.ఎం.

విశాఖపట్నంలో ఇలాంటి విషవాయువులు ఉన్న పరిశ్రమలు ఎన్ని అన్నదానిపై గుర్తించండి. అందులో జనావాసాల మధ్య ఉన్న పరిశ్రమలను గుర్తించండి. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై దృష్టిపెట్టండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాటి తరలింపుపై కూడా విధానపరమైన ఆలోచనలు చేయండి.  జరిగిన ఘటనను  దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది రాకుండా జనావాసాలకు దూరంగా తరలింపుపై తగిన ఆలోచనలు చేయండి. అలాగే ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఉన్న రసాయనాలను తరలించే అవకాశాలపై వెంటనే చర్యలు తీసుకోండి. మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన కోటి రూపాయల చొప్పున పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన, అనంతరం తీసుకున్న చర్యలపై సీఎం జ‌గ‌న్ సమీక్షించారు. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో  సీఎస్‌ నీలం సాహ్ని, కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌ కే మీనా పాల్గొన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్న సీఎస్ ముఖ్య‌మంత్రికి వివ‌ర‌ణ ఇచ్చారు. ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌ నివారణకు చేపట్టిన చర్యలను సీఎంకు కలెక్టర్ వివ‌రించారు. ట్యాంకర్‌లోని రసాయనంలో 60శాతం పాలిమరైజ్‌ అయ్యింది.  మిగిలిన 40శాతం కూడా పాలిమరైజ్‌ అవుతుంది. దీనికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఫ్యాక్టరీలోని అన్ని ట్యాంకులు కూడా భద్రంగా ఉన్నాయ‌ని అధికారులు సి.ఎం.కు వివ‌రించారు. ఈ దుర్ఘ‌టనపై  సమగ్ర విచారణ జరిపి తగిన కార్యాచరణ ప్రణాళికతో రావాలని సీఎం ఈ సంద‌ర్భంగా ఆదేశించారు. కాలుష్య నివారణా మండలి క్రియాశీలకంగా ఉండాలి. కాలుష్యకారక అంశాలపై ఫిర్యాదులు, వాటిని నివారణకు, పాటించాల్సిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను సిద్ధంచేయాలన్న సీఎం సూచించారు.

చైనాను వదిలే కంపెనీలకు ఇండియా బంప‌ర్ ఆఫర్!

కరోనా కారణంగా చైనాను వదిలి వెళ్లాలనుకుంటున్న కంపెనీలను ఆక‌ట్టుకోవ‌డానికి మోడీ ప్రభుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌ల‌ను ఇస్తోంది. కొన్నింటికి ఇప్పటికే భారత్‌లో ఉనికి ఉంది. అలాంటి వారు పూర్తిగా చైనా నుండి ఇక్కడకు తరలి వచ్చే అవకాశాలు ఉంటాయి. గత నెలలోనే వెయ్యికి పైగా అమెరికా కంపెనీలను దైత్య అధికారుల ద్వారా భారత్ సంప్రదించింది. అక్కడి నుంచి వచ్చే కంపెనీలకు భారీ ఎత్తున ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఇస్తామని భారత్ భ‌రోసా ఇస్తోంది. పన్నులు, కార్మిక చట్టాలు, భూసేకరణ నిబంధనలను మరింత సులభతరం చేయనుంది. చైనా నుండి విదేశీ కంపెనీలు బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేప‌థ్యంలో భార‌త్ ఆ కంపెనీల‌కు గాలం వేస్తోంది. ఇందులో మొబైల్, టెక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్ సంస్థలు ఉన్నాయి. అమెరికా కంపెనీలతో పాటు ఇతర దేశాల సంస్థలు కూడా భారత్‌ను ఎంచుకుంటున్నాయి. గత సెప్టెంబర్ నెలలో కార్పోరేట్ పన్నును మోడీ ప్రభుత్వం 25 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది కూడా విదేశీ కంపెనీలు రావడానికి కలిసి వస్తోంది. కొత్త తయారీ సంస్థలపై పన్నును 17 శాతం మాత్రమే విధిస్తున్నట్లు కూడా ప్రకటన చేసింది మోడీ ప్రభుత్వం. జీడీపీలో 15 శాతంగా ఉన్న తయారీ రంగం వాటాను 2022 నాటికి 25 శాతానికి పెంచాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది.