Communist Party of India

జోరందుకుంటున్న మావోయిస్టు సత్సంబంధాలు

  మావోయిస్ట్ లతో సంభందాలు ఉన్న నలభై ఐదు మంది పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారిలో పది మంది మావోయిస్టు పార్టీకి చెందిన వారు కాగా, మరో ముప్పై ఐదు మందికి పన్నెండు సంఘాలతో అనుబంధం ఉంది. ఈ సంఘాలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని వారికి ఆయుధాలు సమకూరుస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. ఉపాధి చట్టం కింద కేసు నమోదైన వారిలో ఇటీవల గద్వాల పోలీసులు అరెస్టు చేసిన తెలంగాణ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణ తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మద్దిలేటి ఉన్నారు. మావోయిస్టు పార్టీ సానుభూతిపరులుగా పేర్కొంటూ ఐత అనిల్ కుమార్, దాసరపు సురేష్ ను భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టును ఒక పత్రిక సంపాదించింది. అందులో ఉప కేసు నమోదైన నలభై ఐదు మంది వ్యక్తులు పన్నెండు సంస్థల వివరాలున్నాయి. వివరాల్లో తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ పౌర హక్కుల సంఘం, తెలంగాణ విద్యార్థి వేదిక, తుడుం దెబ్బ, చైతన్య మహిళా సంఘం, తెలంగాణ విద్యార్థి సంఘం, ప్రజాస్వామ్య విద్యార్థి వేదిక, తెలంగాణ యూత్ ఫోరం, పార్టియాటిక్ డెమోక్రటిక్ మూమెంట్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, తెలంగాణ రైతాంగ సమితి ఉన్నాయి. ఇవన్నీ మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలని పేర్కొన్నారు. ఆయా సంఘాల నేతలు యూనివర్సిటీలు, కాలేజీల్లో తిరుగుతూ విద్యార్థులను మావోయిజం వైపు ఆకర్షిస్తున్నారని మావోయిస్టులకు నిధులను సేకరించడం ఆయుధాలనూ సాంకేతిక పరికరాలను విప్లవ సాహిత్యాన్ని మందుపాత్రలను సమకూర్చడం వీరి ప్రధాన వీధులని రిమాండ్ రిపోర్టులో చర్ల పోలీసులు వెల్లడించారు.ఈ మావోయిస్టు చర్యలపై వెంటనే ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రాష్ట్రం తీవ్ర నష్టానికి గురి అవుతుందని స్పష్టమవుతోంది.    

Government to resume AP Formation Day celebration on November 1

ఏపీ ఆవిర్భావ దినోత్సవంపై వివాదం... నవంబర్ 1పై జగన్ సర్కార్ మొగ్గు..!

  అవశేష ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవంపై మళ్లీ రగడ మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... ఆవిర్భావ దినోత్సవం నిర్వహించకుండా, నవ నిర్మాణ దీక్షలు చేపట్టారు. ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా చేసిన విభజనతో ఆంధ్రులు తీవ్రంగా నష్టపోయారంటూ విభజన బాధలను ప్రజలు గుర్తుతెచ్చుకునేలా ఆరోజు కార్యక్రమాలు చేపట్టారు. అయితే, ఇఫ్పుడు ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. దాంతో మళ్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవంపై చర్చ మొదలైంది. అయితే, రాష్ట్ర విభజనతో జూన్ రెండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాంతో ప్రతి ఏటా జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం అంగరంగ వైభవంగా ఆనందోత్సవాల మధ్య ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఆవిర్భావ దినోత్సవాలకు ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం స్వస్తి పలికింది. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కారు... ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ కు మూడు తేదీలతో సంబంధముండటంతో ఏ రోజున నిర్వహించాలనేదానిపై తర్జనభర్జనలు పడింది. అలాగే విస్తృత చర్చలు జరిపింది. చివరికి, 1956లో తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రం విలీనంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ నే ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయానికి వచ్చిందట. అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరుపుకున్నట్లే... నవంబర్ 1న ఏపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అయితే, నవంబర్ 1ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన దినాన్ని ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం అంత సరైనది కాకపోయినా... తెలంగాణ విలీనంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రోజుని ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం కూడా సరికాదంటున్నారు. ఈ రెండు తేదీలను కాకుండా, మద్రాస్ నుంచి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, జగన్ ప్రభుత్వం ఏ రోజున ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తుందో చూడాలి. అయితే, ఏ నిర్ణయం తీసుకున్నా... ముందుగా అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే వివాదాలకు తావు లేకుండా ఉంటుందని అంటున్నారు.

Exit Polls Predict Easy Comeback For Devendra Fadnavis In Maharashtra

మహారాష్ట్రలో మళ్లీ కమలానిదే అధికారం... కనీసం పోటీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్...

  మహారాష్ట్రలో వార్ వన్ సైడ్ అని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మరాఠా గడ్డపై కమలానిదే మళ్లీ అధికారమని బల్లగుద్దిమరీ చెప్పాయి. బీజేపీ, శివసేన కూటమికి ఎదురే లేదని తేలింది. తిరుగులేని మెజారిటీతో మళ్లీ అధికారాన్ని దక్కించుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. అంతేకాదు కాంగ్రెస్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయిందని, మునుపటి కంటే మరింత దారుణ ఫలితాలు రావడం ఖాయమని తేల్చేశాయి. కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పతనమైందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక, ఎన్సీపీయే ఎంతోకొంత పరువు నిలబెట్టుకుందని లెక్కగట్టాయి. మహారాష్ట్రలో ఈసారి కూడా బీజేపీ హవానే కొనసాగుతుందని ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ తేల్చింది. బీజేపీ 166 స్థానాల నుంచి 194 వరకు గెలుచుకుంటుందని తెలిపింది. ఇక, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి 72 నుంచి 90 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని... ఇతరులకు 22 నుంచి 34 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీజేపీ కూటమికి 230 స్థానాలు, కాంగ్రెస్ కూటమి 48 సీట్లు, ఇతరులకు 10 స్థానాలు దక్కుతాయని టైమ్స్ నౌ ఎగ్గిజ్ పోల్స్ వెల్లడించాయి. అలాగే, బీజేపీ కూటమి 230 స్థానాలు, కాంగ్రెస్ మిత్రపక్షాలు 48 సీట్లు, ఇతరులకు 10 స్థానాల వరకు రావచ్చని ఇండియాటీవీ ఎగ్జిట్ పోల్ లెక్కగట్టింది. అదేవిధంగా బీజేపీ కూటమి 204 సీట్ల వరకు గెలుచుకుంటుందని ఏబీపీ న్యూస్ అంచనా వేసింది. కాంగ్రెస్ మిత్రపక్షాలు 69 స్థానాలు, ఇతరులకు 15 సీట్లు దక్కే అవకాశం ఉందని ఏబీపీ సర్వే వెల్లడించింది. ఇక రిపబ్లిక్ టీవీ అయితే బీజేపీకి 230 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే కాంగ్రెస్‌‌కు 43, ఇతరులకు పది దక్కుతాయని రిపబ్లిక్ టీవీ తెలిపింది. మొత్తానికి అన్ని జాతీయ ఛానెళ్లు, సర్వే సంస్థలు మరో అభిప్రాయానికి తావులేకుండా మహారాష్ట్రలో బీజేపీ-శివసేనదే విజయమని తేల్చేశాయి. అయితే, గత ఎన్నికల్లోనూ చాలా ఎగ్జిట్‌పోల్స్‌ లెక్క తప్పాయి. పూర్తిగా రివర్సయిన సందర్భాలూ ఉన్నాయి. మరి, ఈ ఎగ్జిట్‌ పల్స్... ఏ మేరకు నిజమవుతాయో ఈనెల 24న తేలిపోనుంది. వివిధ ఛానెల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలు TIMES NOW     : బీజేపీ - 230, కాంగ్రెస్‌ - 48, ఇతరులు - 10 REPUBLIC      : బీజేపీ 135 - 142, శివసేన 81 - 88, కాంగ్రెస్‌ 24 - 30 INDIA TODAY      : బీజేపీ 166-194, కాంగ్రెస్‌ 72 - 90, ఇతరులు 22 - 34 NDTV          : బీజేపీ - 211, కాంగ్రెస్‌ - 64, ఇతరులు - 13 ABP          : బీజేపీ - 204, కాంగ్రెస్‌ - 69, ఇతరులు - 15 INDIA TV      : బీజేపీ - 230, కాంగ్రెస్‌ - 48, ఇతరులు - 10 NEW X          : బీజేపీ 188 - 200, కాంగ్రెస్‌ 74 - 89, ఇతరులు 6 -10

TRS Is Going To Win In Huzurnagar Bypolls

హుజూర్ లో కనిపించని ఆర్టీసీ సమ్మె ప్రభావం... మెజారిటీ ప్రజలపై సంక్షేమ పథకాల ఎఫెక్ట్...!

  ఒకపక్క ఆర్టీసీ సమ్మె... మరోపక్క విపక్షాల మూకుమ్మడి దాడి... ఇంకోవైపు సీపీఐ మద్దతు ఉపసంహరణ... ఇలా నలువైపులా నుంచి ప్రత్యర్ధులు చుట్టుముట్టడంతో... ఇక, హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపు అనుమానమేనన్న చర్చ నడిచింది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎఫెక్ట్... హుజూర్ నగర్ పై ఉంటుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను ఎగ్జిట్ పోల్స్ తలకిందులు చేశాయి. హుజూర్ నగర్ లో అసలు ఆర్టీసీ సమ్మె ప్రభావం లేనే లేదని తేల్చేశాయి. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించాయని ప్రకటించాయి. ఒకపక్క మిషన్ చాణక్య... మరోవైపు ఆరా... ఈ రెండు సర్వే సంస్థలు కూడా హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ దే విజయమని తేల్చేశాయి. మిషన్ చాణక్య సంస్థ టీఆర్ఎస్ కు 53.37శాతం ఓట్లు వస్తాయని చెబితే.... ఆరా 50.48శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. అంతేకాదు ప్రతి మండలంలోనూ టీఆర్ఎస్ అభ్యర్ధి స్పష్టమైన ఆధిక్యం కనబర్చాడని తమ సర్వేల్లో తేలిందని ప్రకటించాయి. ఇక, అధికార టీఆర్ఎస్ కు ఒక్క కాంగ్రెస్ మాత్రమే పోటీ ఇఛ్చిందన్న సర్వే సంస్థలు.... మిషన్ చాణక్య 41.04శాతం... ఆరా 39.95శాతం ఓట్ షేర్ ఇచ్చాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ నడిచినప్పటికినీ... గులాబీ పార్టీ మాత్రం భారీ ఆధిక్యం సాధిస్తుందని... ఇక, ఇతర పార్టీలేమీ కనీసం దరిదాపుల్లో కూడా లేవని ప్రకటించాయి. బీజేపీ, టీడీపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కదని సర్వేలు తేల్చేశాయి.   ఇక, హుజూర్ నగర్ గెలుపుపై టీఆర్ఎస్ అధిష్టానంలో ధీమా వ్యక్తమవుతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే ట్వీట్ చేసిన కేటీఆర్‌.... హుజూర్‌‌నగర్‌లో ఈసారి గెలుపు కారుదేనన్నారు. టీఆర్‌‌ఎస్‌ అభ్యర్ధి సైదిరెడ్డి.... మంచి మెజారిటీలో విజయం సాధిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేశారంటూ కేటీఆర్ ప్రశంసించారు. ఓటింగ్ సరళి, ప్రజానాడి, క్షేత్రస్థాయి సమాచారం, వివిధ సంస్థల సర్వేల ప్రకారం టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలువబోతోందని చెప్పారు. మరి సర్వేలు చెప్పినట్లు... గులాబీ నేతలు అంచనా వేస్తున్నట్లు... ఫలితం ఉంటుందో లేక... ఎగ్జిట్ పోల్స్ కు షాకిస్తూ కాంగ్రెస్ విజయం సాధించబోతుందో... అక్టోబర్ 24న తేలిపోనుంది.

Haryana exit poll result 2019

రైతులకై పుట్టిన పార్టీ చివరకు కనుమరుగవనుందా?

  రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ ఓ పార్టీ ఇరవై ఏళ్లుగా అధికారం కోసం ఎదురు చూపులు చూస్తోంది.హర్యానా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన,ఉద్యమాలతో ప్రజల్లో స్థానం దక్కించుకున్న పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితుల్లో ఉంది. వివరాల్లోకి వెళ్తే ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్డీ) పార్టీని స్థాపించింది చౌదరి దేవిలాల్. ఓంప్రకాష్ చౌతాలా తండ్రి. పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దేవీలాల్ భారతీయ లోక్ దల్ గా పార్టీని స్థాపించారు. తర్వాత లోక్ దల్ గా పంతొమ్మిది వందల తొంభై ఆరు లో ఐఎన్ఎల్డీగా మార్చారు ఐఎన్ఎల్డీ రైతుబంధు పార్టీగా గుర్తింపు పొందింది. దేవీలాల్ రైతుల కోసం పోరాటం చేశారు అందుకే ఆయన్ని హర్యానా ప్రజలంతా పెదనాన్న అంటూ పిలుచుకునేవారు. ఎమర్జెన్సీ సమయంలోనూ అనేక ఆందోళనలు చేశారు దేవీలాల్. న్యాయయుద్ధం పేరుతో దేవీలాల్ ఐఎన్ఎల్డీని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. అలా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా చివరికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఎదిగారు.  ముఖ్యంగా దేవీలాల్ హర్యానా సీఎంగా ఉన్నప్పుడు రైతుల మేలు కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లింది. దేవీలాల్ మాస్ లీడర్ గా ఎదిగడమే కాక ఆ తర్వాత పార్టీని సీఎం పదవిని కుమారుడు ఓంప్రకాష్ చౌతాలాకి  అప్పగించారు.హర్యానా రాజకీయాల్లో దేవీలాల్పేరు ఓ మంత్రం.కానీ అదే దేవీలాల్ కలలు కన్న పార్టీ ఇప్పుడు రెండుగా చీలింది. కుటుంబ పార్టీలో కలహాలు రావడంతో ఓంప్రకాష్ చౌతాలా కుమారుడు రెండుగా విడిపోయారు. అజయ్ చౌతాల అతని కుమారులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అజయ్ చౌతాల కుమారుడు దుష్యంత్ చౌతాలా జేపీపీ పేరుతో కొత్త పార్టీని పెట్టారు ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల్లోనే ఐఎన్ ఎల్డీ ఓటు బ్యాంకును భారీగా చీల్చింది. ఎదిగిన ఐఎన్ఎల్డీ ఇప్పుడు ఒకటి రెండు స్థానాలకు పరిమితమవుతున్న తీరు నిజంగా షాక్ కు గురి చేస్తోంది. గత నాలుగు సార్లు అధికారానికి దూరమైన ఐఎంఎంటి ఇప్పుడు మరింతగా దిగజారింది. తాజా ఎగ్జిట్ పోల్స్ లో ఆ పార్టీ ఒకటి రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతాయి అని ఈ సర్వే లో తేలింది.పార్టీ ఎలా కుదేలవుతుంది అన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. రైతుల కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు ఉనికి కోసం అష్ట కష్టాలు పడుతోంది.ఇప్పటికే పదిహేనేళ్లుగా అధికారంలో లేదు పైగా ప్రజల్లోనూ మద్దతు కోల్పోతూ వచ్చింది.హర్యానాలో ఇప్పుడు కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి లేదు. రెండు వేల ఐదు రెండు వేల పది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఇప్పుడు ఆ పార్టీ మళ్లీ కుదేలైంది. పడడం లేవడం కాంగ్రెస్ కి కొత్తేమీ కాదు. కానీ ఐఎన్ఎల్డీ పరిస్థితి అలా కాదు ఇప్పుడు ఆ పార్టీ గెలిచే స్థానాలు సింగిల్ డిజిట్ కే పడిపోవడం పార్టీ చీలడం ఇలా అన్నీ ఆ పార్టీని మరింత కుదేలయ్యేలా చేశాయి. దేవీలాల్ రాజ్ ఆశలు, అంచనాలు ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చేసింది. ఉద్యమాలతో రైతుల కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు ప్రజామద్దతు కోల్పోయే పరిస్థితికొచ్చింది. ఒకప్పుడు ఎనభై ఐదు స్థానాలు గెలుచుకున్న పార్టీకి ఇప్పుడు ఒకటి రెండు స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వే లు చెపుతున్నాయి.ఇక ఈ పార్టీ పరిస్థితి ముందు ముందు ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

Huzurnagar By Elections Exit Poll Results

టీఆర్‌ఎస్‌‌కి 53 శాతం... కాంగ్రెస్‌‌కి 41 శాతం...  హుజూర్‌ కారుదేనంటున్న మిషన్ చాణక్య

  తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌‌దే విజయమని ఎగ్జిట్‌ పోల్స్‌ అంటున్నాయి. హుజూర్‌నగర్‌లో ఈసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెబుతున్నాయి. హుజూర్‌నగర్ బైపోల్‌పై ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించిన మిషన్ చాణక్య సంస్థ... కచ్చితంగా కారుదే గెలుపు అంటూ బల్లగుద్దిమరీ చెబుతోంది. టీఆర్‌ఎస్‌కి 53శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక, కాంగ్రెస్‌‌కు 41శాతం ఓట్లు, తెలుగుదేశానికి 2.1శాతం ఓట్లు వస్తాయని చెబుతోంది. అయితే, టీఆర్‌ఎస్‌ కి తామే ప్రత్యామ్నాయమంటూ బరిలోకి దిగిన బీజేపీకి కేవలం 1.1శాతం ఓట్లు మాత్రమే వస్తాయని మిషన్ చాణక్య సంస్థ అంచనా వేసింది.హుజూర్‌నగర్ నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర్నుంచి ఇప్పటివరకు వరకు మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన కాంగ్రెస్‌‌కు ఈసారి భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. టీపీసీసీ చీఫ్ కంచుకోటైన హుజూర్‌‌నగర్‌లో ఈసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమంటోంది. 50శాతానికి పైగా ‎ఓట్‌ షేర్‌‌తో కారు దూసుకుపోతుందని మిషన్ చాణక్య సంస్థ చెబుతోంది. అంతేకాదు టీఆర్ఎస్ కి 18వేల నుంచి 25వేల వరకు మెజారిటీ వస్తుందని అంచనా వేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కంటే కేసీఆర్ సంక్షేమ పథకాలే ఎక్కువగా ఓటర్లపై ప్రభావం చూపించాయని మిషన్ చాణక్య సంస్థ చెబుతోంది. అయితే, సిట్టింగ్ సీటైన హుజూర్‌‌నగర్‌ను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డింది. తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలంతా రంగంలోకి దిగి హుజూర్‌‌నగర్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇ‌క, తన స్వయంగా సతీమణిని బరిలోకి దింపిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... ఎలాగైనా గెలిచితీరాలని తీవ్రంగా ప్రయత్నించారు. ఇటు, అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ కూడా సర్వశక్తులూ ఒడ్డింది. అయితే, హోరాహోరీగా జరిగిన బైపోరులో... గులాబీ పార్టీదే ఆధిపత్యమని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. కానీ, తాను ఈ ఎగ్జిట్ పోల్స్ ను నమ్మనని, కచ్చితంగా కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ఉత్తమ్ నమ్మకంగా చెబుతున్నారు. మరి హుజూర్ నగర్ ప్రజల తీర్పు ఎలా ఉండనుందో ఈనెల 24న తేలిపోనుంది.

IT department raids 40 places linked to Kalki Bhagwan

40 ప్రాంతాల్లో ముగిసిన ఐటీ రైడ్స్... వేలకోట్ల కల్కి ఆస్తుల లెక్కలు ఇవే... 

  కల్కి ఆశ్రమాల్లో ఐటీ రైడ్స్‌ కొలిక్కి వచ్చాయి. చిత్తూరు, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరుల్లో జరిపిన తనిఖీలు ముగింపుకొచ్చాయి. మొత్తం 40 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఐటీ టీమ్స్‌... ఇప్పటివరకు 300మందిని విచారించారు. కల్కి ఆశ్రమాల్లో గుట్టలుగుట్టలుగా పడివున్న నగదును, బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 40కోట్ల ఇండియన్ కరెన్సీ, అలాగే 22కోట్ల విదేశీ కరెన్సీని సీజ్ చేశారు. ఇక, కల్కి విలాసవంత భవనమైన వైట్‌ లోటస్‌‌లో పెద్దఎత్తున వజ్రాలు, బంగారం, దేశ, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కీలక భూ డాక్యుమెంట్లతోపాటు హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లను అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. అదేవిధంగా ఆశ్రమ సిబ్బంది స్టేట్ మెంట్స్ చేశారు. అలాగే ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలంటూ ఆశ్రమ ప్రముఖులను ఆదేశించారు. అయితే, 85కోట్ల రూపాయలు హవాలా ద్వారా వచ్చినట్లు గుర్తించిన ఐటీ అధికారులు.... 5వందల కోట్ల లావాదేవీలకు లెక్కలు దొరకడం లేదని అంటున్నారు.  ఇక, చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం ఆశ్రమంలో 105 కోట్ల రూపాయల విలువైన 90 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు అకౌంట్ లో 115కోట్ల డిపాజిట్లు, 61 కోట్ల విలువైన బోగస్ షేర్లు, డివిడెండ్ వడ్డీలు 100కోట్ల మేర ఉన్నట్లు గుర్తించారు. చైనా, సింగపూర్, అమెరికా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు దొరికాయి. అలాగే విదేశీ కరెన్సీని దారి మళ్లించినట్లు గుర్తించారు. కల్కీ... ఇండియాలోనే కాకుండా అరబిక్ దేశాలతో పాటు కెన్యా, ఆఫ్రికాలోనూ వేలాది ఎకరాల భూములను కొనుగోలు చేసినట్టుగా ఐటీ తనిఖీల్లో తేలింది. ఇక... కల్కి భగవాన్ తనయుడు కృష్ణాజీ, కోడలు ప్రీతి, ట్రస్ట్ సీఈవో లోకేష్ దాసాజీలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఐటీ దాడులపై కల్కి ఆశ్రమం స్పందించింది. ఆశ్రమంపై ఐటీ దాడులు జరిగాయని... అధికారులకు పూర్తిగా సహకరించామని సునీల్ దాసాజీ తెలిపారు. వారడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పామన్నారు. తదుపరి విచారణకు సహకరిస్తామని అన్నారు. ఐటీ దాడుల తర్వాత ఆశ్రమంలో కార్యకలాపాలు యధావిధిగా జరుగుతున్నాయని వెల్లడించారు. అయితే, కల్కీ భగవాన్‌గా చెప్పుకుంటున్న విజయ్‌కుమార్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉండగా, అతని కుమారుడి నుంచి కూడా సరైన సమాధానాలు రాలేదని తెలుస్తోంది.

Heavy rain likely in Telangana in next five days

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

  తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు నష్టం వాటిల్లుతోంది.ఎడతెరిపి లేని వర్షాలకు భాగ్యనగరం మరోసారి వణికిపోయింది. పిడుగుల ప్రమాదం పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.శీతాకాలంలో కారుమబ్బులు కమ్ముకొచ్చి కుంభవృష్టిలా వర్షాలు కురిపిస్తున్నాయి. ప్రస్తుతం తూర్పు ,ఈశాన్య, ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తేమగాలులు వీస్తున్నాయి. ఇవి తెలంగాణ కోస్తాంధ్ర ప్రాంతంలో పరస్పరం కలుస్తున్నందున ఈశాన్య రుతు పవనాలు వేగంగా కదులుతున్నాయి.వీటి కారణంగానే కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు కారుమబ్బులు ఏర్పడి కొద్ది గంటల వ్యవధిలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. ఇక ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్న ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ్హ హెచ్చరించింది ఉపరితల ద్రోణి రెండు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉందని ఐఎండీ వివరించింది.నిన్న హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది బంజారాహిల్స్ ,జూబ్లీహిల్స్, మెహిదీపట్నం ,ఆసిఫ్ నగర్, లకిడికపూల్, అమీర్ పేట్, మాసబ్ ట్యాంక్ తో పాటు వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది, పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పలుచోట్ల నాలాలు పొంగిపొర్లాయి, రహదారులన్నీ నదులను తలపించాయి, వాహన ధరలు నరక యాతన అనుభవించారు .మొత్తానికి రోజుల తరబడి వర్షం కురవడంతో జన జీవనం అస్తవ్యస్తంగా తయారైంది.

Green Diwali Massive response from Warangal

గ్రీన్ దీపావళికి సై అంటున్న వరంగల్ వాసులు...

  దీపావళి అనగానే మనకు ముందుగా గుర్తోచ్చేది రంగురంగుల టపాసులు, మిరుమిట్లు గొలిపే వెలుగులు, నిప్పులు కక్కుతూ దూసుకుపోయే దీపావళి రాకెట్లు. ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, ఇలా చైనా టపాసులు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చైనా టపాసుల విక్రయం తగ్గించే క్రమంలో గ్రీన్ దీపావళి అనే అంశం ప్రజల ముందుకు వచ్చింది .గ్రీన్ దీపావళికి భారీ స్పందన వస్తోంది. ప్రజల నుంచే కాకుండా వ్యాపారస్తులు సైతం గ్రీన్ దివాలీ వైపు కదులుతున్నారు. ఈ సారి చైనా టపాసుల్ని నిషేధించారు. తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసుల్ని విక్రయిస్తున్నారు. చైనా టపాసుల్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం కేంద్రం పంతొమ్మిది వందల తొంభై రెండులో చైనా బాణాసంచా ఉత్పత్తులపై పరోక్షంగా నిషేధాన్ని విధించింది. కానీ ఆ దేశ ఫైర్ వర్క్స్ దిగుమతులను మాత్రం అడ్డుకోలేకపోతోంది.  చైనా టపాసుల్లో పొటాషియం క్లోరైడ్ వాడతారు. వీటి వాడకం పై భారత్ లో ఆంక్షలున్నాయి. తక్కువ ధరకు బాణాసంచ ఉత్పత్తి చేయాలంటే అతి తక్కువ రేటు ఉన్న ముడి సరుకును ఉపయోగించాలి. మిగతా వాటితో పోలిస్తే పొటాషియం క్లోరైట్, సల్ఫరైట్, నైట్రేట్ రసాయనాలు చైనాలో అత్యంత చౌక. ఈ హానికారక రసాయనాలతో చేసిన బాణా సంచా ఎక్కువగా వెలుగులు విరజిమ్ముతాయి. పెద్ద శబ్దం వస్తుంది. సాధారణంగా భారత్ లో నూట నలభై ఐదు డెసిబుల్స్ కన్నా ఎక్కువగా శబ్దం వచ్చే బాణాసంచా తయారీ నిషేధం. చైనా టపాసులు నూట నలభై ఐదు డెసిబుల్స్ దాటి ధ్వని కాలుష్యం చేస్తాయి. ప్రతి ఏడాది వేల కోట్ల టపాసులు చైనా నుండి దొంగచాటుగా దిగుమతి అవుతున్నాయి. అయితే వీటివల్ల జరుగుతున్న నష్టాన్ని ఇపుడిపుడే గుర్తిస్తున్నారు ప్రజలు. అందుకే చైనా టపాసుల జోలికి వెళ్లటం లేదు. చివరకు వ్యాపారస్తులు సైతం స్వచ్ఛందంగా చైనా బాణా సంచాపై నిషేధాన్ని విధిస్తున్నారు.  గ్రీన్ దివాళి నినాదంతో వరంగల్ కు చెందిన వ్యాపారస్తులు చైనా టపాసుల్ని విక్రయించడం లేదు. ధ్వని కాలుష్యాన్ని నివారించేందుకు ఎనభై శాతం శబ్దం రాని వాటినే అమ్ముతున్నారు. ఈ సారి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చైనా టపాసుల్ని బహిష్కరించారు. మన దేశంలో తయారైన టపాసుల్నే విక్రయిస్తున్నారు. అది కూడా భారీ శబ్దం,కాలుష్యాం లేనివే అమ్ముతున్నారు. గ్రీన్ దీపావళి తమలో ఎంతో స్ఫూర్తి నింపిందని ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. విపరీతమైన కాలుష్యానికి కారణమవుతున్న టపాసులను తగ్గించి గ్రీన్ దివాలీ వైపు అడుగులు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. వరంగల్ వాసులు ఈ సారి గ్రీన్ దివాలీ వైపు అడుగులు వేశారు. భారీగా కాలుష్యం వచ్చే టపాసుల జోలికి వెళ్లటం లేదు. భవిష్యత్ లో ఇది మరింత తగ్గి అసలైన దీపావళి జరుపుకోవాలని ఆశిద్దాం.  

Revanth Reddy Arrested At Pragathi Bhavan

ప్రగతి భవన్ ముట్టడికి యత్నం.. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

  రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు కొనసాగుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి కార్మికులు రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటు హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై మూడు పిటిషన్ లు దాఖలయ్యాయి. ప్రభుత్వం, ఆర్టీసీ సంఘాలకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. అన్ని పిటిషన్లపై ఇరవై ఎనిమిదిన వాదనలు ఉంటాయి. ఇటు ఆర్టీసీ సమ్మె, అటు కార్మికుల నిరసనలు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల సమయంలో ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు కాంగ్రెస్ నేతలు. దీంతో ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు పోలీసులు. అయిన ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు.  ప్రగతి భవన్ బాట పట్టిన కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, రాములు నాయక్ ను అరెస్టు చేశారు. బైక్ పై వచ్చి ప్రగతి భవన్ లోకి వెళ్లేందుకు యత్నించిన రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. షబ్బీర్ అలీ, విశ్వేశ్వర్ రెడ్డి సహా పలు కీలక నేతలను ఇంటికే పరిమితం చేశారు పోలీసులు. ఇటు పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డిలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు.  మరోవైపు ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో సోమాజిగూడ, బేగంపేట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఓ వైపు స్కూళ్ళ రీ ఓపెనింగ్, ఇంకో వైపు బస్సుల కరువు, సొంత వాహనాలతో రోడ్లెక్కడం నిరసనలకు పిలుపు వెరసి హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోటెత్తింది. ప్రగతి భవన్ దగ్గర బందోబస్తుతో సికింద్రాబాద్ రోడ్డులో విపరీతమైన ట్రాఫిక్ కన్పిస్తోంది.  ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు ప్రభుత్వం విఛ్చిన్నం చేయాలని కుట్ర చేస్తోందన్నారు సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు. కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆయన యూనియన్ లు లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఈ నెల ముప్పై వ తేదీ వరకు కార్మిక సంఘాలు ఇచ్చిన ఆందోళనల్లో కార్మిక కుటుంబాలు కూడా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. శనివారం ఆందోళనలో వేలు తెగిన కారణంగా హైదరాబాద్ సన్ షైన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు పోటు రంగారావు.ఇక సమ్మెలో కార్మికుల కుటుంబాలు పాల్గొని పరిస్థితి ఇంకా ఉధృక్తం కాక ముందే ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే కానీ రాష్ట్రనికి  మేలు జరిగే సూచనలు కనిపించట్లేదు.

huzurnagar by election voting live

హుజూర్ నగర్ ఎన్నికల్లో ఎదురవుతున్న అవాంతరాలు...

  హుజూర్ నగర్ పోలింగ్ జరుగుతోంది. మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మూడు వందల రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ పద్మారెడ్డి, టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, బిజెపి నుంచి రామారావు, టిడిపి నుంచి చావా కిరణ్మయి బరిలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం మూడు వేల మూడు వందల యాభై మంది పోలీసులను వినియోగిస్తున్నారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.  హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు 53 శాతం ఓటింగ్ నమోదు అయినట్టు సమాచారం. కానీ అధికారికంగా పోలింగ్ శాతం రావాల్సి ఉంది. అయితే తొలి గంటలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ప్రధానంగా నేరేడుచర్ల మండల కేంద్రంలోని చింతబండ లోని ముప్పై ఒకటి, ముప్పై మూడు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు మొరాయించడంతోటి ఓటర్లు అందరూ కూడా పోలింగ్ కేంద్రాల బయటనే వేచి చూసిన పరిస్థితి ఉంది. అయితే టెక్నికల్ సిబ్బందిని పిలిపించి ఈవిఎంలను నడిపించే  పరిస్థితిలో అధికారులు ఉన్నారు.  మఠంపల్లి మండలంలో ఒక చోట మాత్రం వెలుతురు సరిగా లేని కారణంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. చింతలపాలెం మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ లోని నూట అరవై ఎనిమిదిలో సరైన వెలుతురు లేక గుర్తులు సరిగా కనిపించటం లేదని చెప్పి ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో దానిని సరిదిద్దే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏ గుర్తు ఎక్కడ ఉందనేది చీకటి ఉన్న నేపథ్యంలో మాత్రం సరిగా కనిపించటం లేదని చెప్పే అక్కడ ఒక ఓటర్ ఆరోపణ చేశారు.దానిని సరిచేసే ప్రయత్నాలలో అధికారులు ఉన్నారు.

Mohan Bhagwat casts his vote in Nagpur

ఎన్నికల్లో తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్న నేతలు...

  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పదహారు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని యాభై యొక్క అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తిపూర్ లోకసభ స్థానాలకు బైపోల్స్ జరుగుతున్నాయి.  నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజా ప్రతినిధులను ఓటు వేసి ఎన్నుకోవటం ఓటర్ల హక్కు అని మోహన్ భగవత్ ఈ సందర్భంగా తెలిపారు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి అంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇక హర్యానాలోని దాద్రి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుస్తీ క్రీడాకారిణి బబితా ఫోగట్ బలాలీలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హర్యానా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కుమారి సెల్జా హిస్సార్ లోని యశోదా పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదంపూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న టిక్ టాక్ స్టార్ సొనాలీ ఫోగట్ ఓటువేసారు. బీజేపీ కూటమికి మహారాష్ట్రలో రెండు వందల ఇరవై ఐదు సీట్లు వస్తాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. మోదీ ఫడ్నవీస్ తోనే జనం ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తన సతీమణి కంచన్ తో కలిసి నాగపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే బారామతిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారీ మహారాష్ట్రలో అధికారంకి వచ్చేది కాంగ్రెస్ ఎన్సీపీ కూటమేనని సూలే ధీమా వ్యక్తం చేశారు.  హర్యాణలోని బాద్ షాపూర్ లో ఉన్న రెండు వందల ఎనభై ఆరువ నెంబర్ పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించటంతో కొద్ది సేపు పోలింగ్ నిలిచిపోయింది. మహారాష్ట్ర లోని రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు మూడు వేల రెండు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో రెండు వందల ముప్పై ఐదు మంది మహిళలే ఉన్నారు. మరోవైపు హర్యానాలోని తొంభై స్థానాలకు గాను పదకొండు వందల అరవై తొమ్మిది మంది పోటీ పడుతున్నారు. ఇందులో నూట నలుగురు మహిళలు. మహారాష్ట్రలో రెండవసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ తన ప్రధాన మిత్రపక్షమైన శివసేనతో కలిసి బరిలోకి దిగింది. మరోవైపు గత వైభవాన్ని సాధించాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలు పొత్తుతో పోటీలో నిలిచాయి. రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేనతో పాటు పలు ఇతర పార్టీలు తమ అభ్యర్థులను నిలిపాయి. దాదాపు పద్నాలుగు వందల మంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీలో నిలిచారు.  హర్యాణలో రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ రెండోసారి కూడా విజయ ఢంకా మోగించాలన్న పట్టుదలతో ఉంది. ఐఎన్ఎల్డీ నుంచి వేరుపడి చౌతాలా కుటుంబీకులు స్థాపించిన జన్ నాయక్ జనతా పార్టీ తొలిసారి పోటీ చేస్తూ సత్తాచాటాలి అన్న సంకల్పంతో ఉంది. ఐఎన్ఎల్డీ కూడా పట్టు కోసం ప్రయత్నిస్తోంది. మూడు వందల డెబ్బై ఐదు మంది స్వతంత్రులు ఇక్కడ బరిలో ఉన్నారు.ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తమ పార్టీ నేతల ప్రయత్నాలు సఫలీకృతమైయ్యయా అన్నది వేచి చూడాలి.

main parties distributed money and liquor to voters in huzurnagar

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోలీసులు నిజంగానే ప్రేక్షక పాత్ర వహించారా?

  హుజూర్ నగర్ ఉప ఎన్నికల పై  వివిధ పార్టీలు చాలా ఆసక్తి చూపించాయి.ఎవరికి తగ్గ రీతిలో తమ దైన శైలిలో ప్రచారాలతో ముందుకుపోయారు పార్టీ నేతలు.ప్రచారల గడువు ముగిసిన తరువాత కూడా అధికారులు ఎంత నిఘా పెట్టినా హుజూర్ నగర్ లో జరగాల్సిన కార్యక్రమం జరిగింది. రాత్రికి రాత్రే ఎవరికి కావాల్సిన సరుకు వారికి చేరిపోయింది. కోట్లాది రూపాయల డబ్బును పార్టీలు పంచేశాయి. పీపాలకు పీపాల మద్యాన్ని తాగించేశాయి.  హుజూర్ నగర్ ఉప ఎన్నికలో నోట్ల కట్టలు చేతులు మారాయి. మద్యం ఏరులై పారింది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేశాయి. ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి ఒకెత్తయితే చివరి రెండ్రోజులు ఒకెత్తు అన్నట్టుగా ఓటర్ల కొనుగోలుకు ప్రయత్నించాయి. ఒక్క శనివారం రాత్రే సుమారు ముప్పై ఐదు కోట్లు పంపిణీ చేశారు. హోరాహోరీ తలపడుతున్న రెండు పార్టీలు కేవలం మద్యానికే ఆరు కోట్లు ఖర్చు చేశాయి. మండల స్థాయి నాయకులకు చెక్కుల ద్వారా డబ్బులు అందించగా వారు ముందుగా శనివారం రాత్రికి రాత్రే పంపిణీ పూర్తి చేశారు. మరికొన్ని చోట్ల స్థానిక వ్యాపారులు పెట్టుబడిదారుల వద్ద చేబదులుగా తీసుకుని స్థానిక నేతలకు అందజేశారు.  మరోవైపు హుజూర్ నగర్ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఉండడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన డబ్బును వివిధ సంఘాల నేతలు వారి అనుచరులకు అప్పగించారు. వారంతా ఆ కొద్ది మొత్తాన్నే ఆర్టీసీ బస్సులో సామాన్య ప్రయాణికుల మాదిరిగా వచ్చి ఎంచుకున్న ప్రాంతాలకు డబ్బు సంచులను చేరవేశారు. అరవై మంది ఓటర్లకు ఒక ఇన్ చార్జీ చొప్పున నియమించిన ప్రధాన పార్టీలు డబ్బు పంపిణీలో వారిని కీలకం చేశాయి. ఒక ప్రధాన పార్టీ ఓటర్ కు వెయ్యి రూపాయలు పంచగా, మరో పార్టీ ఐదు వందల రూపాయల చొప్పున ఇచ్చింది. మరోవైపు డబ్బులిస్తూనే కొందరు కార్యకర్తలు ఓటర్లతో ప్రమాణం చేయించుకున్నారు. కళ్లేపల్లి మైసమ్మ, దుప్పలపల్లి మైసమ్మ దేవతల వద్ద మొక్కి తెచ్చామని డబ్బులు తీసుకున్న వారు తాము చెప్పిన గుర్తుకు ఓటు వేయాలని లేదంటే ఆ దేవతల ఆగ్రహానికి గురవుతారు అంటూ వారిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా అటు ఎన్నికల కమిషన్ సిబ్బంది, ఇటు నిఘా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారనే విమర్శలు వినపడుతున్నాయి.ఇక పార్టీ నేతల ప్రయత్నాలు సఫలం అయ్యాయో లేదో ఫలితాల నాడే తేలనుంది.

devineni avinash about joining ycp

ప్రాణమున్నంతవరకు టీడీపీలోనే... ఒక్క మాటతో తేల్చేసిన యూత్ ప్రెసిడెంట్...

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కొద్దిరోజులుగా జరుగుతోన్న ప్రచారాన్ని టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఘాటుగా స్పందించారు. తన కంఠంలో ప్రాణమున్నంతవరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానంటూ తేల్చిచెప్పారు. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన దేవినేని అవినాష్... అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే... ఇలాంటి అసత్య ప్రచారానాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్న దేవినేని అవినాష్... ఇసుక కొరతతో లక్షలాది కార్మికులు రోడ్డునపడ్డా పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. ఇసుక కార్మికుల కుటుంబాల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని, ఆకలి బాధ తీర్చుకోవడానికి చివరికి చోరీలకు పాల్పడే పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. ఇక, తెలుగుదేశంలో యాక్టివ్ గా ఉండే నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులతో వేధిస్తున్నారని దేవినేని అవినాష్ ఆరోపించారు. అలాగే తమ అసమర్ధతను కప్పి పుచ్చుకునేందుకే మీడియాపై ఆంక్షలు విధించారని నిప్పులు చెరిగారు. ఇసుక కొరతపై అక్టోబర్ 24న దీక్షలు చేపట్టనున్నట్లు  దేవినేని అవినాష్ ప్రకటించారు.

maharashtra and haryana assembly election

ఎన్నికలు, ఉపఎన్నికల హోరహోరీ పోరుతో వేడెక్కుతున్న రాష్ట్రాలు...

  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోని ఓటర్లు నేడు తీర్పునివ్వనున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాలలోని యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు, రెండు లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల కౌంటింగ్ గురువారం జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, శివసేన కూటమిగా బరిలో దిగుతుండగా అటు ఎన్సీపీ, కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి, కమలనాథులకు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ కూటమి ఎన్నికల సమరంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. మరి ఓటరు తీర్పు ఏమిటన్నది గురువారం తేలిపోనుంది.  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 3,239 మంది అభ్యర్థులున్నారు. ఇందులో ఒక్క నాందేడ్ దక్షిణ నియోజక వర్గం నుంచే 38 అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఇక చిప్లున్ నియోజక వర్గం నుంచి అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల బరిలో బిజెపి 152 స్థానాల్లో పోటీ చేస్తోండగా, శివసేన 124 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఓర్లీ నియోజక వర్గం నుంచి ఠాక్రే వారుసుడు ఆదిత్య ఠాక్రే పోటీకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ 145 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఎన్సీపీ 123 స్థానాల్లో పోటీకి దిగింది. వీటితో పాటు ఇతర పార్టీలు కూడా పోటీకి దిగాయి. రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఏకంగా 103 స్థానాల్లో పోటీకి దిగి ఈ సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఎంఐఎం కూడా ఎన్నికల బరిలో దిగి సవాల్ విసురుతోంది. ఎంఐఎం నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. హర్యానాల్లోనూ పోటీ వేడిని పెంచుతోంది. హర్యానాలో మొత్తం 90 స్థానాలుండగా..1,169 తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా హన్సీ నియోజక వర్గం నుంచి 25 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా అత్యల్పంగా షహబాద్ నియోజకవర్గల్లో 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక బిజెపి 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ కూడా పొత్తు లేకుండా 90 స్థానాల్లో బరిలో నిలిచింది. ఇక బీఎస్పీ 87 ఐఎన్ఎల్డీ 81 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.  మహారాష్ట్ర, హర్యానాతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల్లో ఆయా నేతల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు చెప్పబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల తలరాతను మార్చబోతున్నాయి. అందుకే ఈ ఎన్నికలపైనా నిఘా పెరిగింది. దాదాపు పది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు కీలకం కాబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లోని నాయకుల పరిపాలనకు మార్కులు వేయబోతున్నారు ఓటర్లు. యూపీలో ఏకంగా 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగికి ఇది కఠిన పరీక్షే. యూపీలో ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. బీహార్ లోని 5 స్థానాలు కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ బైపోల్స్ కూడా బిజెపి, జేడీయూ స్నేహానికి కీలకంగా మారబోతున్నాయి. మరో ఏడాదిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో పార్టీలు కర్టనరైజర్ గా చూస్తున్నాయి.  మధ్యప్రదేశ్ లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లు ఉంది. బిజెపి కాంగ్రెస్ ల మధ్య బలం దోబూచులాడుతోంది. స్వతంత్రులు బీఎస్పీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ గట్టెక్కిన, కర్ణాటక పరిణామాలు కమలనాధ్ సర్కారుకు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో మధ్యప్రదేశ్ లోని ఒక స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఉప ఎన్నిక అటు బిజెపి  ఇటు కాంగ్రెస్ కు చాలా కీలకం. ఇప్పటికే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను ఓ బీఎస్పీను లాగి కాంగ్రెస్ వ్యూహం ప్రదర్శించిన ఎప్పటికైనా బిజెపి నుంచి ముప్పు తప్పదన్న భావనలో ఉంది.అందుకే ఈ ఒక్క స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. అయితే బీజేపీ కూడా ఈ స్థానంపై కన్నేసింది. ఇది గెలిస్తే ప్రజాభిప్రాయం తమకే ఉందంటూ కర్నాటక ఫార్ములా ప్రయోగించిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.  కేరళలో 5 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఐదింటినీ చేజిక్కించుకోవాలని లెఫ్ట్ ఫ్రంట్ చూస్తూంటే పాగా వేయాలని బిజెపి అనుకుంటోది. అటు కాంగ్రెస్ కూటమి కూడా గెలుపుపై నమ్మకం పెట్టుకుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరుగుతున్నాయి. అందుకే తాజా ఉప పోరును సెమీ సమరంగా చెబుతున్నారు.  తమిళనాడులో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో రెండు స్థానాలపై డీఎంకే కన్నేసింది. ఇప్పటికే ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అదరగొడుతోంది. రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని ధీమాతో ఉన్న స్టాలిన్ పార్టీ ఇప్పుడు రెండు స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది. అటు అన్నా డీఎంకే నేతలు మాత్రం అసెంబ్లీలో తమ నెంబర్ పెరుగుతుందని చెబుతున్నారు.  తెలంగాణలోని హుజూర్ నగర్ పై అందరి దృష్టీ నెలకొంది. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక వచ్చింది. గుజరాత్, పంజాబ్, ఒడిషా రాష్ట్రాల్లోను ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్ లో ఇప్పటికే బిజెపి ప్రభుత్వం బలంగా మారింది. ఇప్పుడు అక్కడ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోవు. పంజాబ్ లోనూ కెప్టెన్ సర్కార్ కు ఎన్ని మార్కులు పడతాయి అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మధ్య అధికారంలోకి వచ్చిన నవీన్ పట్నాయక్ కు ఒక్క స్థానంతో ఎలాంటి మార్పు ఉండదు. కానీ యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు మరింత కీలకంగా మారాయి ,ఎందుకంటే వీటితోనే జాతకాలు తేలిపోనున్నాయి. అధికార పార్టీల పాలనపై జనం మాటేంటో ఫలితాల ద్వారా బయటకు రానుంది, మరి ప్రజాధరణ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

ఓ సామాన్యుడు... వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు... కల్కి కథలు

  ఓ సామాన్య వ్యక్తి... భగవాన్‌గా అవతారమెత్తాడు. కల్కి అసలు పేరు విజయకుమార్. భక్తి ప్రవచనాలు చేసే విజయకుమార్ ఆధ్యాత్మిక గురువుగా మారాడు. శిష్యులను పెంచుకున్నాడు. దేశ విదేశాల్లో శిష్యులు కల్కి గురించి విస్తృత ప్రచారం చేశారు. కల్కి దర్శనంతో అంతా మంచి జరుగుతుందని, రోగాలు నయం అవుతాయని ప్రచారం చేశారు. ఇంకేముంది తండోపతండాలుగా ప్రజలు కల్కి ఆశ్రమానికి క్యూకట్టారు. దాంతో వందల ఎకరాల్లో ఆశ్రమాన్ని విస్తరించారు. పాల రాతితో అందమైన కట్టడాలు కట్టారు. పచ్చని చెట్లు, ఆధ్యాత్మిక, ధ్యాన భవనాలు నిర్మించారు. క్యూకాంప్లెక్స్లు ఏర్పాటు చేశారు. క్యాష్ కౌంటర్లు నెలకొల్పారు. ఎంతలా అంటే ఆ భవనాన్ని ఒక్కసారైనా చూడాలనిపించేలా సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఇక, కల్కికి ఆదరణ పెరగడంతో విజయకుమార్ సతీమణి కూడా రంగంలోకి దిగింది. అమ్మ భగవాన్‌గా భక్తులకు పరిచయమైంది. ఇద్దరూ ఒకేచోట ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చేవారు. ఆశ్రమానికి వచ్చే విదేశీ భక్తుల నుంచి భారీగా విరాళాలు వసూలుచేసేవారు. దర్శనానికైతే కొంత... పాదాలు మొక్కితే ఇంత అంటూ రకరకాల సేవల పేరుతో డబ్బు వసూళ్లు చేపట్టేవారు. విదేశీ భక్తులైతే తమ ఆస్తుల మొత్తాన్ని ఆశ్రమానికి ఇచ్చేస్తారని తెలిసింది. అలా విదేశీ భక్తులు ఇచ్చిన విరాళాలే వందల వేల కోట్లకు చేరుకున్నాయి. దాంతో ట్రస్ట్ పేర్లు మారుస్తూ, కల్కి ఆశ్రమ ఆస్తులు, లెక్కలు ఉన్నట్లు తేలింది.

వరుస భేటీలతో పోలవరం రివర్స్ టెండరింగ్ అంశం తుది దశకు చేరనుందా?

  ఏపీ జల వనరుల శాఖ నేడు పోలవరం ప్రాజెక్టు అథారిటీతో హైదరాబాద్ లో భేటీ కానుంది. సమావేశంలో సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణ పనుల కార్యాచరణను గురించి ప్రశ్నించనుంది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో నిర్ణయం తీసుకున్నప్పుడు వద్దని వారిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ లేఖ రాసింది. పీపీఏతో సహా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా రివర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దంటూ సూచించింది. తరువాత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. రివర్స్ టెండర్ విధానంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా సంస్థ ఒక్కటే పాల్గొన్నప్పటికీ పోలవరం సాగు నీటి ప్రాజెక్టులో రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల మేర ఆదా అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.  పోలవరం సాగు నీటి ప్రాజెక్టు, పోలవరం జల విద్యుత్ కేంద్రాలను కలిపి ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండర్ లను జలవనరులశాఖ పిలిచింది. జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి రాష్ట్ర హై కోర్టులో వివాదం ఉంది. హైకోర్టులో ఇప్పటికే వాదనలు పూర్తయ్యి తీర్పు రిజర్వులో ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర జల వనరుల శాఖతో పీపీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి రివర్స్ టెండరింగ్ విధానానికి వెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడే న్యాయపరమైన ప్రతిబంధకాలు తలెత్తుతాయని ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని పీపీఏతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలు హెచ్చరించాయి. అయితే నేటి సమావేశంలో పోలవరం సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని రివర్స్ టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని వివరించనుంది. ఒకే ఒక్క సంస్థ బిడ్ ను దాఖలు చేసినందున రీటెండర్ గా పరిగణించాల్సి ఉంటుందని వివరించనుంది. ఈ రీటెండర్ లో రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆదా అయిందని పీపీఏకు రాష్ట్ర జల వనరుల శాఖ వివరించనుంది. న్యాయస్థానం తీర్పు వెలువడ్డాకే కార్యాచరణను ప్రకటిస్తామని పీపీఏకు రాష్ట్ర జల వనరుల శాఖ స్పష్టం చేయనుంది. న్యాయస్థానం తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఉటుందని పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయనుంది. అయితే దీనిపై పీపీఏ స్పందన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి  సర్వత్రా నెలకొంది.  మరోవైపు పోలవరం తుది అంచనాల పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ న్యూఢిల్లీలో రేపు భేటీ కానుంది. ఇప్పటికే పలు దఫాలు ఈ సమావేశాలు జరిగాయి. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర జల సంఘం, పోలవరం తుది అంచనాలు యాభై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా సంఘం సమ్మతి తెలిపింది. దీన్ని ఆమోదించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఫైలు పంపింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఈ తుది అంచనాలోని భూ సేకరణ సహాయ పునరావాసం వ్యయంపై ఆర్థిక శాఖ కొర్రీలు వేస్తూ వస్తోంది. అటు ఇదే సమయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ రెండు వేల పద్నాలుగుకు ముందు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి ఆడిట్ నివేదికను కోరుతోంది. ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం సాగు జల విద్యుత్ కేంద్రాల రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. ఈ రివర్స్ టెండరింగ్ లో ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల మేర ఆదా అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంటే పోలవరం తుది అంచనా యాభై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు కోట్లకు చేరుతుంది. దీనిపైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఇక పైన అయినా పోలవరంలోని పనులు జోరందుకుంటాయో లేదో వేచి చూడాలి.

గుట్టలుగుట్టలుగా నోట్ల కట్టలు... ఐటీ రైడ్స్ లో కల్కి గుట్టురట్టు...

  గుట్టలుగుట్టలుగా నోట్ల కట్టలు... కిలోలకొద్దీ బంగారం... కోట్ల విలువైన డైమండ్లు... వందల కోట్ల రూపాయల దేశ విదేశీ కరెన్సీ...  వేల కోట్ల అక్రమాస్తులు... ఇదీ కల్కి ఆశ్రమాల్లో పరిస్థితి. ఐటీ దాడుల్లో కల్కి గుట్టురట్టవుతుంది. ఐటీ దాడులతో కల్కి అక్రమ సామ్రాజ్యంలో చీకటి కోణం వెలుగులోకి వస్తున్నాయి. దేశంలోనే కాదు... విదేశాల్లోనూ కల్కికి అక్రమ ఆస్తున్నాయని తేలింది. కల్కి ఆశ్రమంతోపాటు 40చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ దాడుల్లో వందల వేల కోట్ల విలువైన ఆస్తులతోపాటు బంగారం, నగదు దొరకడంతో అధికారులే నివ్వెరపోయారు.   కోట్లాది రూపాయలు పోగుపడటంతో కల్కి కుమారుడు కృష్ణాజీ పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. వేలాది ఎకరాల భూములు కొన్నారు. సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో ట్రస్టు ఏర్పాటు చేశారు. ట్రస్టు కోసం భారీ మొత్తంలో నిధులు సేకరించారు. తరచూ ట్రస్టు పేర్లు మారుస్తూ ఐటీ శాఖను బురిడీ కొట్టించారు. వందల కోట్ల రూపాయల ఆదాయ పన్ను ఎగ్గొట్టినట్లు రికార్డుల్లో తేలింది. అయితే, నాలుగైదు రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నా... కల్కి, అమ్మ భగవాన్ మాత్రం ఎక్కడున్నారనేది మాత్రం తెలియడం లేదు. అసలు ఆశ్రమంలో ఉన్నారా లేరా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే, కల్కి అక్రమాలపై నిగ్గుతేల్చాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కల్కి భగవాన్ ఎన్నికలప్పుడు ఓ పార్టీకి కొమ్ముకాశారని... వారికి సొమ్ములిచ్చారని ఆరోపిస్తున్నారు. కృష్ణా దాసాజీ, లోకేష్‌ దాసాజీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలని కోరుతున్నారు.  

రెండు వర్గాలుగా విడిపోతున్న టీఆర్ఎస్ నేతలు.. అసలేం జరుగుతోంది?

  తెలంగాణ ఏర్పడిన తర్వాత అసిస్టెంట్ సెక్షన్ అధికారుల సంఘంతో పాటు సచివాలయ టీఎన్జీవో విభాగాలు ప్రధాన సంఘంలో విలీనమయ్యాయి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యక్ష ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైంది. రెండు వేల తొమ్మిది డిసెంబర్ లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు దానిని విరమింపజేయటానికి జ్యూస్ ను అందించింది ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ తొలిగురి ఎమార్పీఎస్ పైనే ఉంది. మంద కృష్ణ మాదిగకు కుడి ఎడమ భుజంగా ఉన్న కీలక నేతలతో రహస్యంగా సమావేశమైన కేసీఆర్ ఎమ్మార్పీఎస్ ను ముక్కలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయానికి కొన్ని ప్రజా ఉద్యోగ సంఘాలు తలో దిక్కున ఉన్నాయి. వాటికి తోడు మరికొన్ని సంఘాలను అప్పట్లో టీఆర్ఎస్ ఏర్పాటు చేయించింది. విడివిడిగా ఉన్న సంఘాలను దగ్గరికి చేర్చి బలమైన తాడుగా పేనింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో మమేకం చేసింది. అన్నిటినీ కలిపి జేఏసీగా ఏర్పాటు చేసి ఉద్యమానికి కొత్త ఊపిరిలూదింది. సొంత రాష్ట్రం సాకారమై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వివిధ సంఘాలు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారిందని ప్రకటించిన ప్రభుత్వ పెద్దలకు ఇది నచ్చటం లేదని ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోవడం లేదని ప్రజా, ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.  ప్రభుత్వంలోని ముఖ్యులు సంఘాలను నిలువుగా చీల్చే వ్యూహాలకు పదును పెడుతూ చాలా వరకు సఫలీకృతులవుతారనే చర్చ నడుస్తోంది. ఇందుకు సామ దాన భేద దండోపాయాలన్నింటినీ ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో చీలిక వర్గం ప్రభుత్వానికి పూర్తి విధేయత ప్రకటిస్తుంది. రెండో వర్గం న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాటం కొనసాగిస్తామని చెబుతోంది. రాష్ట్ర సర్పంచుల సంఘంలో ఒక వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే, మరొక వర్గం అధికార టీఆర్ఎస్ అండగా నిలుస్తోంది.  తాజాగా ఆర్టీసీ సమ్మెకు నేతృత్వం వహిస్తున్న టీఎంయూ చీలికకు తెర వెనుక పావులు కదుపుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. పైగా ప్రభుత్వం ముందు న్యాయమైన తమ వర్గం సమస్యలను ఉంచి పరిష్కారం కోసం కొట్లాడుతున్న సంఘాల నేతలను వేధింపులు తప్పడం లేదనే ఆందోళన నెలకొంది. అప్రాధాన్య పోస్టులలోకి సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం ప్రభుత్వ సంస్థల ద్వారా వేధింపులకు గురి చేయటం వంటి అనైతిక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ అధినేతకు విధేయత చాటిన వారికి కూడా ఇప్పుడు ఇబ్బందులు తప్పడం లేదనే చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఉద్యోగులతో అప్రకటిత యుద్ధం చేస్తున్న క్రమంలోనే ఒకే సంఘానికి చెందిన నేతలు భిన్నస్వరాలు వినిపించటం ఎక్కువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  నిజానికి ఉద్యమ సమయంలో వీరంతా టీఆర్ఎస్ నేతలకు చాలా సన్నిహితంగా మెలిగిన వారే. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలకు సహకరించారు. అప్పుడు వారి పోరాటానికి ఆయువుపట్టుగా నిలిచిన సమాచారాన్ని గుట్టుగా అందజేశారు.  హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో భూముల అక్రమ కేటాయింపుల సమాచారాన్ని తెలంగాణ తహసీల్దార్ ల సంఘం అధ్యక్షుడు అయిన వి లచ్చిరెడ్డి నేతృత్వంలోని ప్రతి నిధుల నుంచే కేసీఆర్ ఆ సమాచారాన్ని సేకరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ల అధికారాన్ని తహసీల్దార్ లకు కట్టబెట్టడాన్ని తహసీల్దార్లంతా తీవ్రంగా వ్యతిరేకించగా సీఎం విధేయుడిగా ఉన్న లచ్చిరెడ్డి మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. అందుకు నజరానాగా లచ్చిరెడ్డికి కీసర ఆర్డీవోగా పోస్టింగ్ ఇచ్చారు. రెండేళ్ల పాటు అంతా బాగానే ఉన్నా కలెక్టర్ల సదస్సులో ఏం జరిగిందో తెలుసుకోవటానికి మంత్రి ఈటెలతో లచ్చిరెడ్డి భేటీ అయ్యారంటూ ప్రభుత్వ అనుకూల పత్రికల్లో కథనాలు వచ్చాయి. వాటిని సాకుగా చేసుకున్నా ప్రభుత్వం లచ్చిరెడ్డి బదిలీ చేయడమే కాకుండా ఇటీవలే కొందరు డిప్యూటీ కలెక్టర్ లతో ఆయన పెట్టుకున్న సంఘంలో కూడా చీలిక తెచ్చింది. ఆ సంఘంలో కీలక కార్యవర్గ సభ్యులంతా రాజీనామాలు చేశారు.అసలు తెలంగాణ ప్రభుత్వంలో తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఆర్టీసీ సమ్మె కారణంగా అంతరంగా దాగున్న రహస్యాలు అన్ని బయటకు వస్తున్నాయా అనే అనుమానాలు వెల్లడవుతున్నాయి.