ప్రధాని వస్తున్నారు జాగ్రత్త... నెల్లూరు జిల్లా నేతలకు జగన్ క్లాస్

 

నెల్లూరు జిల్లా వైసీపీలో నేతల మధ్య విభేదాలు వీధికెక్కడంపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారట. ముఖ్యంగా కోటంరెడ్డి-కాకాని వివాదం జగన్ దగ్గరకు చేరింది. కోటంరెడ్డి అరెస్టుకు దారితీసిన పరిణామాలు, కోటంరెడ్డి-కాకాని మధ్య నెలకొన్న విభేదాలపై జగన్ సీరియస్ అయ్యారట. అధికారంలోకి వచ్చి, ఇంకా ఆర్నెళ్ల కూడా పూర్తికాకముందే ఈ గొడవలేంటని జగన్మోహన్ రెడ్డి మండిపడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కోటంరెడ్డి అండ్ కాకానికి స్ట్రాంగ్ క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతోంది. 

అయితే, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న రైతు భరోసా పథకాన్ని నెల్లూరు నుంచి ప్రారంభించబోతున్న నేపథ్యంలో సింహపురి నేతలతో జగన్ సమావేశమవుతున్నారు. రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించినందున... కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముందుగా నెల్లూరు జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ముఖ్యంగా నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపంపై చర్చించనున్నారు. అయితే, కోటంరెడ్డి-కాకాని వివాదమే కాకుండా, మిగతా నేతల మధ్య కూడా సరిగా సఖ్యత లేదని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి... విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని, రైతు భరోసా పథకం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించనున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

Teluguone gnews banner