భారత్ బయోటెక్ 'కోవాగ్జిన్' సురక్షితం.. వచ్చేసిన మొదటి దశ ట్రయల్స్ రిజల్ట్స్
posted on Sep 1, 2020 @ 10:00AM
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పూర్తీ స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్ లోని భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ లు కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ "కోవాగ్జిన్" పూర్తిగా సురక్షితమైందని తాజాగా వెల్లడైంది. ఈ వ్యాక్సిన్ తో చేసిన మొదటి దశ ట్రయల్స్ పూర్తైన సందర్భంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లూ కనిపించలేదని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం మనదేశంలో మూడు వ్యాక్సిన్ లకు సంబంధించిన ట్రయల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి భారత్ బయోటెక్ వ్యాక్సిన్, మరొకటి జైడస్ కాడిలా వ్యాక్సిన్ కాగా ఇక మూడోది ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ కు సంబంధించిన ట్రయల్స్ ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్నాయి. అయితే భారత్ బయోటిక్ వ్యాక్సిన్, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రస్తుతం రెండు, మూడవ దశ ట్రయల్స్ లో ఉన్నాయి.
భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తొ దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేస్తున్న పరిశోధనల పై తాజాగా రిపోర్టులు వస్తున్నాయి. అయితే ఈ ట్రయల్స్ నిర్వహించిన అన్ని ప్రాంతాల నుండి కూడా పూర్తిగా పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆ వలంటీర్ల పై జరిపిన పరీక్షల్లో తేలిందని వైద్యాధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఇదే విషయమై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ నిన్న మాట్లాడుతూ డిసెంబర్ లోగా వ్యాక్సిన్ విడుదలవుతుందని, ట్రయల్స్ విజయవంతంగా జరుగుతున్నాయని ప్రకటించడం గమనార్హం.