మహారాష్ట్రలో కరోనా పంజా! నాగపూర్ లో లాక్ డౌన్
posted on Mar 11, 2021 @ 8:16PM
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. కొత్త కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్క రోజే 13,659 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది 60 శాతం. దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న 10 నగరాల్లో 8 మహారాష్ట్రలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. పూణె, నాగ్ పూర్, థానే, ముంబై, అమరావతి, జల్ గావ్, నాశిక్, ఔరంగాబాద్ నగరాల్లో కరోనా కేసులు భారీగా వస్తున్నాయి.
నాగ్ పూర్ లో గత 24 గంటల్లో 1800 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.కరోనా తీవ్రత పెరగడంతో మార్చ్ 15 నుంచి 21 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు మహా ప్రభుత్వం ప్రకటించింది.
రాబోయే రోజుల్లో మరిన్ని జిల్లాల్లో లాక్ డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చెప్పారు.
మహారాష్ట్రలో కేసుల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో మహారాష్ట్రలో కొత్త కేసులు మళ్లీ పెరుగుతుండటంపై కేంద్రం తీవ్రంగా ఆందోళన చెందుతోందని నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.మన దేశం కోవిడ్ రహితంగా ఉండాలంటే... ప్రతి ఒక్కరూ వైరస్ ను సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. నాగ్ పూర్ లో మళ్లీ లాక్ డౌన్ విధించాలనుకోవడం పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తోందని పాల్ చెప్పారు. మళ్లీ సీరియస్ లాక్ డౌన్ నాటి పరిస్థితులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాల నుంచి మనం రెండు విషయాలను నేర్చుకోవాలని... వైరస్ ను తేలికగా తీసుకోకూడదనేది తొలి విషయమని, కరోనా రహితంగా దేశం తయారు కావాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలనేది రెండో విషయమని వీకే పాల్ తెలిపారు.