పదేండ్లు సీఎం.. ఆస్తి 16 లక్షలు!
posted on Mar 11, 2021 @ 9:04PM
పదేండ్లుగా ముఖ్యమంత్రి.. రెండు సార్లు కేంద్ర మంత్రి.. పశ్చిమ బెంగాల్ లో మూడోసారి అధికారం కోసం పోరాడుతున్న మమతా బెనర్జీ మొత్తం ఆస్తి ఎంతో తెలుసా... రూ. 16. 73 లక్షలు. అక్షరాలు 16 లక్షల 73 వేల రూపాయలు మాత్రమే. మమతా బెనర్జీకి సొంత వాహనం కూడా లేదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి పుర్బా మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న మమతా బెనర్డీ.. నామినేషన్ సందర్భంగా ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తన నికర ఆస్తుల విలువను రూ. 16.72 లక్షలుగా తెలిపారు. అలాగే తనకు సొంత వాహనం కూడా లేదని అఫిడవిట్లో ఆమె వెల్లడించారు.
ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. 66 ఏళ్ల మమత వద్ద ఉన్న మొత్తం చరాస్తుల విలువ రూ. 16.72 లక్షలు. 2016 ఎన్నికలకు ముందు వీటి విలువ రూ. 30.45 లక్షలు మాత్రమే. అలాగే, 2019-20లో రూ. 10,34,370 ఆదాయం వచ్చింది. రూ. 69,255 నగదు ఆమె వద్ద ఉంది. మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 13.53 లక్షలు. ఇందులో ఆమె ఎన్నికల ఖర్చుకు సంబంధించిన రూ. 1.51 లక్షలు కూడా ఉంది.జాతీయ పొదుపు సర్టిఫికెట్ లో రూ. 18,490 డిపాజిట్ చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను టీడీఎస్ రూపంలో రూ. 1.85 లక్షలు రావాల్సి ఉందని అఫిడవిట్లో మమత పేర్కొన్నారు. రూ. 43,837 విలువైన 9 గ్రాముల బంగారం కూడా దీదీ వద్ద ఉంది.
తన పుస్తకాలపై 2019-20లో రూ. 930 రాయల్టీగా వచ్చినట్టు ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో మమత వివరించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగులో లేవని, కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశానని, ఎల్ఎల్బీ కూడా చేశానని మమత వివరించారు.