సుప్రీంకోర్టు సీజేగా ఎన్వీ రమణ
posted on Apr 6, 2021 @ 11:09AM
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన 2022 ఆగస్టు 26వరకు పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ పదవి అలంకరించిన రెండవ తెలుగు వాడిగా జస్టిస్ ఎన్వీ రమణ గుర్తింపు పొందనున్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ పూర్తి పేరు నూతలపాటి వెంకట రమణ. కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న జన్మించారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000 సంవత్సరం జూన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా వ్యవహరించారు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బీఎల్ చదివారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్), ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు పానెల్ కౌన్సిల్ గా ఉన్నారు. క్యాట్లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరఫున పనిచేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. 2000 జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మినెంటు జడ్జిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా పనిచేశారు. 2013 సెప్టెంబరు 2న దిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పదోన్నతి పొందారు. 2014లో సుప్రీం కోర్టులో నియమితులయ్యారు.