బీజాపూర్ ఎన్ కౌంటర్ లో షాకింగ్ నిజాలు
posted on Apr 6, 2021 @ 1:30PM
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 24 మంది భద్రతా బలగాలు చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మావోయిస్టులను దెబ్బకు దెబ్బ కొట్టేలా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల వద్ద బంధీగా ఉన్న రాకేశ్వర్ సింగ్ కోసం బలగాలు గాలిస్తున్నాయి. అయితే బీజాపూర్ ఎన్ కౌంటర్ కు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోనికి వచ్చాయి.
‘‘వాళ్లు అంతా పొడవుగా ఉన్నారు సార్..! వారిపై ఫైర్ చేస్తున్నా.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి.. జంకు లేకుండా నిలబడ్డారు..! ఏ ఒక్కరూ పొట్టిగా కనిపించలేదు..! అంతా బలంగా ఉన్నారు..! భారీ కసరత్తు, శిక్షణ తీసుకున్న వారిలా కనిపించారు. అలాంటి వారిని మావోయిస్టుల్లో ఎన్నడూ చూడలేదు.’’..అని ఛత్తీసగఢ్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడి, బీజాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ జవాన్ చెప్పారు.
ఆదివారం నాటి ఎదురుకాల్పుల్లో మావోయిస్టు దళంలోని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) దళాలు పాల్గొన్నాయని భావిస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు పీఎల్జీఏ ఒకటో బెటాలియన్కు నేతృత్వం వహిస్తున్నాడు. అతను తన దళంలో రిక్రూట్మెంట్ల సమయంలోనే ఎత్తుగా, బలంగా ఉన్న యువకులను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. గెరిల్లా యుద్ధ విద్యలతోపాటు.. శారీరక వ్యాయామాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. క్షతగాత్రుల వద్దకు వారు కొండలు, గుట్టలు, అడవుల నుంచి పరుగెత్తుకొచ్చిన తీరును బట్టి.. ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘‘మాకు వాళ్లు అతి దగ్గరగా వచ్చారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపినా.. వాళ్లకు చిన్న గాయం కూడా కాలేదు. ముఖంలో భయం కనిపించలేదు. అంతా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించారు’’ అని మరో జవాను చెప్పడాన్ని బట్టి పీఎల్జీఏ దళాలు ప్రత్యక్ష యుద్ధానికి అవసరమైన శిక్షణ తీసుకున్నట్లు అర్థమవుతోంది.
‘‘మావోయిస్టుల్లో అలాంటివాళ్లను ఇంతవరకు చూడలేదు. చూడడానికే రాక్షసుల్లా కనిపించారు. ఇంతకుముందు కూంబింగ్లలో మావోయిస్టులు తారసపడ్డా బక్కచిక్కి కనిపించారు. ఆదివారం నాటి ఘటనలో మావోయిస్టులు భిన్నంగా ఉన్నారు’’ అని ఆ జవాను వెల్లడించారు.ఉన్నతాధికారులు సైతం ఈ విషయాలను నిర్ధారిస్తున్నారు. మావోయిస్టులు ఈ ఆపరేషన్ కోసం బలంగా ఉన్నావారినే ఎంచుకున్నట్లు తెలుస్తోంది.