ఎన్నికల కోసమేనా.. హోదా చర్చ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఇంకా ఎవరైనా అనుకుంటున్నారా, ఆశిస్తున్నారా, అంటే లేదు. సామాన్య ప్రజలనుంచి పార్లమెంట్ సభ్యుల వరకు అందరికీ, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి హోదా రాదన్న నిజం తెలుసు. అయినా పార్లమెంట్’లోపల వెలుపల, ముఖ్యంగా మీడియాలో హోదా పై చర్చ జోరుగా సాగుతోంది, ఎందుకు, అంటే, అదే రాజకీయం. ఎన్నికల సమయంలో సెంటిమెంట్స్ ను సొమ్ము చేసుకోవడం, రాజకీయ పార్టీలు అలవాటుగా మలచు కున్నాయి. ఇటీవల తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడో మూలన పడిన ఐటీఐఆర్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశాలను తెరాస తెర మీదకు తీసుకువచ్చింది. ఎన్నికల క్రతువు ముగిసన వెంటనే ఆ అంశాలు పక్కకు పోయాయి.
ఇప్పుడు ఏపీలో జరుగ్తునండి కూడా అదే. తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగతున్న నేపధ్యంలోనే హోదా అంశాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకు వచ్చే ప్రయత్నం అటు రాజకీయ పార్టీలు, ఇటు మీడియా చేస్తున్నాయి. కేవలం ఉప ఎన్నికలో ప్రయోజనం కోసం మాత్రమే హోదా అంశాన్ని మళ్ళీ చర్చకు తెస్తున్నారని, వేరే చెప్పనక్కరలేదు.
ఇందులో భాగంగానే,లోక్ సభలో తెలుగు దేశం పార్టీ సభ్యుడు కింజారపు రామ్మోహన నాయుడు హోదాఅంశాన్ని ప్రస్తావించారు కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ రిప్లై ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని మరో మారు తెగేసి చెప్పింది. రామ్మోహననాయుడు ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిద్యానంద రాయ్, ఎప్పటిలానే, 14 ఆర్థిక సంఘాన్ని అడ్డుపెట్టుకుని, ఆర్థిక సంఘం హోదాకు ఎప్పుడొనే మంగళం పాడేసిందని, ఇక పై ఏ రాష్ట్రానికీ, ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని అరుణ జైట్లీ, నిర్మలా సీతారామాన్, సహా అనేక మంది కేంద్ర మంత్రులు గతంలో చెప్పిన సమదానాన్నే, మళ్ళీ మరో మరు రీప్లే చేశారు.
నిజానికి,హోదా ముగిసిన అధ్యాయమని ఎప్పుడోనే చెప్పిన కేంద్ర ప్రభుత్వం అప్పటినుంచి ఇప్పటి వరకు ఎవరు ఎన్ని విధాల అడిగినా అదే సమాధానం ఇస్తోంది.అయినా ఆంధ్ర ప్రదేశ్ అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అవసరం చిక్కిన ప్రతి సంవత్సరంలోనూ హోదా ప్రస్తావన చేస్తూనే ఉన్నారు. ఒక్క హోదా విషయంలోనే కాదు, విభజన హామీలకు సంబందించిన ఇతరత్రా అంశాలను కూడా అడగడం కాదనిపించుకోవడం,కాదంటే, తాజాగా నిద్యానంద రాయి చెప్పినట్లుగా ఇచ్చినవేవో ఇచ్చాం, ఇవ్వవలసినవి ఏవో ఇస్తాం, ఈలోగా, ఉభయ తెలుగు రాష్ట్రాలు చర్చించుకుని ఇచ్చి పుచ్చుకోవడాలు పూర్తి చేసుకోవడాలు కానిచ్చుకోండని కేంద్రం ఎప్పటికప్పుడు చేతులు కడిగేసుకుంటోంది. ఇప్పుడు కూడా అదే పని చేసింది.
అయినా రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు రెండూ కూడా హోదాను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తూనే ఉన్నాయి. అది కూడా కేవలం ఎన్నికల సమయంలో, ఒక తురుపు ముక్కగా వాడుకుంటున్నాయి. నిజానికి హోదా విషయంలో కానీ, ఇతరత్రా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కానీ, అధికార, ప్రతిపక్ష పార్టీలకు పెద్దగాపట్టింపు లేదు. రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత రాష్ట్ర రాజకీయాలకు ఇవ్వక పోవడం వల్లనే, ఈ పరిస్థితి వచ్చిందని అందరికీ తెలుసు. అయినా, ఎన్నికలు రాగానే, హోదా, గుర్తుకువస్తోంది.
రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కనీసపాటి సయోధ్యత లేక పోవడం కూడా అందుకో ప్రధాన కారణం.ఇప్పుదు కాదు, విభజనకు ముందు నుంచి కూడా ఆంధ్ర ప్రాంత రాజకీయ పార్టీల ధోరణి, ఎడ్డెమంటే తెడ్డెమన్నట్లే సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి గురుంచి వేరే చెప్పనక్కర లేదు. రాష్ట్రాన్ని పాలించిన, పాలిస్తున్న ప్రాంతీయ పార్టీలి టీడీపీ , వైసీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తూనే ఉంది. మంచి చెడులు, విచక్షణ లేకుండా ఒకరు అవునన్నది ఇంకొకరు కాదనడం, ఒకరు కాదన్నది ఇంకొకరు అవుననడం చూస్తూనే ఉన్నాం.
నిజానికి, సాకేతికంగా చూస్తే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ముగిసిన అధ్యాయం అని కేంద్రం చెప్పడం కాదు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం హోదాకు ప్రత్యాన్మాయంగా ప్రతిపాదించిన ప్రత్యేక ప్యాకేజికి ఆమోదం తెలుపుతూ శాసన సభ తీర్మానం చేసింది.ఆ తీర్మానంతోనే హోదా కథ ముగిసింది. బయట లోపలా ఎవరైనా ఏదైనా మాట్లడ వచ్చును, కానీ, అసెంబ్లీ తీర్మానమే ఫైనల్, అదే శాసనం.ఆ తీర్మానం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ, హోదా ముగిసిన అధ్యాయమని చెప్పగలుగుతున్నాయి.
ఇప్పటికైనా, హోదా కాకపోయినా, కనీసం విభజన చట్టంలోని ఇతర హామీలు అయినా అమలుకావాలంటే, రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్రను పోషిస్తున్న వైసీపీ, టీడీపీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కౌరవ, పాండవులు లాగా, ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళితే ఏదైనా ప్రయోజనం చేకూరుతుంది.