తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్? క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. తెలంగాణలోనూ వేగంగా విస్తరిస్తూ.. డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో జనాలు హడలిపోతున్నారు. ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. విద్యా సంస్థలను మూసివేసింది. దీంతో  తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ పెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వలస కూలీలు, కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.ఈ తెలంగాణలో లాక్‌డౌన్‌పై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.  ప్రజలు ఆందోళన చెందవద్దని... రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పెట్టమని తేల్చిచెప్పారు సీఎం కేసీఆర్.  కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్రంలో థియేటర్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేయాలంటూ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. విద్యార్థులు కరోనా బారిన పడుతుండటంతో బాధతోనే స్కూళ్లను మూసేశామని తెలిపారు. స్కూళ్ల మూసివేత తాత్కాలికం మాత్రమే అని చెప్పారు. తెలంగాణలో కరోనా అంత తీవ్రంగా లేదని...ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు.  లాక్‌డౌన్ అనేది పెట్టం. ప‌రిశ్ర‌మ‌ల మూసివేత ఉండ‌దు. ఇప్ప‌టికే చాలా దెబ్బ‌తిన్నాం. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తే క‌రోనాను నియంత్రించొచ్చని కేసీఆర్ చెప్పారు. క‌రోనా విష‌యంలో రాష్ర్ట ప్ర‌భుత్వం భేష్‌గా ఉందన్నారు కేసీఆర్. టెస్టుల సంఖ్య‌ను పెంచాం.. రోజూ 70 వేలు టెస్టులు చేస్తున్నామని చెప్పారు. క‌రోనా ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌కుండా సంవ‌త్స‌ర కాలంగా ప్ర‌పంచాన్ని వేధిస్తోంది..అన్ని దేశాల జీడీపీలు కుప్ప‌కూలాయి.. జీడీపీలో మ‌నం మెరుగ్గా ఉన్నాం.. అనేక రాష్ట్రాలు మైన‌స్‌లో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.  10.85 ల‌క్ష‌ల మందికి కోవిడ్ వ్యాక్సినేష‌న్ ఇచ్చామన్నారు సీఎం కేసీఆర్. వ్యాక్సిన్ ఇచ్చే అంశం కేంద్రం ప‌రిధిలో ఉందన్నారు. డోసుల త‌యారీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం రాష్ట్రాలకు  స‌మానంగా పంపిణీ చేస్తోంది.. వ్యాక్సినేష‌న్‌కు ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంది అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వెల్లడించారు. 

ఆమోదం లేకుండానే 55 వేల కోట్ల ఖర్చు! కడిగిపారేసిన కాగ్ 

విద్యా రంగానికి నిధులు ఇవ్వడం లేదు.. రవాణా, క్రీడలు, కళలకు ఖర్చును తగ్గించారు.. సాగునీటి ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేస్తున్నా.. వాటి ఆర్థిక ఫలితాలు చెప్పడం లేదు.. ఇవీ తెలంగాణ సర్కార్ పై కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ చేసిన అభియోగాల. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై నివేదిక ఇచ్చిన కాగ్‌ .. పలు కీలక అంశాలను వెల్లడించింది. వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ... వాటి ఫలితాలను మాత్రం వెల్లడించలేదని తెలిపింది.  తెలంగాణలో ద్రవ్యలోటు, చెల్లించాల్సిన రుణ బాధ్యతలు.. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన శాతాలకు లోబడే ఉన్నాయని కాగ్‌ తెలిపింది. ప్రాథమిక లోటులో తగ్గుదల ఉన్నప్పటికీ ప్రాథమిక వ్యయాన్ని భరించే స్థాయిలో అప్పులు మినహా ఇతర రాబడి లేదని కాగ్‌ వ్యాఖ్యానించింది. బడ్జెట్‌ అంచనాలకు, వాస్తవాలకు మధ్య తేడా తగ్గేలా బడ్జెట్‌ తయారీ ప్రక్రియను హేతుబద్దీకరించాలని సూచించింది. రెవెన్యూ రాబడి, రెవెన్యూ ఖర్చుల పెరుగుదల 2015-16 నుంచి 2018- 19 మధ్య కాలంలో మెరుగైందని, జీఎస్డీపీలో రెవెన్యూ రాబడి, ఖర్చులు మాత్రం స్వల్పంగా తగ్గాయని కాగ్ పేర్కొంది. అంతకు ముందుతో పోల్చినా, జీఎస్టీడీపీతో పోల్చినా క్యాపిటల్‌ వ్యయం తగ్గిందని పేర్కొంది. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 3.25శాతం కన్నా ద్రవ్యలోటు జీఎస్డీపీలో తక్కువగానే  3.11శాతం ఉందని పేర్కొంది. చెల్లించాల్సిన రుణ బాధ్యతలు జీఎస్డీపీతో పోల్చితే 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 23.33 శాతం కన్నా తక్కువగానే 22.75 శాతం ఉందని తెలిపింది.  2019 మార్చి నాటి ప్రకారం ప్రభుత్వ అప్పులలో 46శాతం రూ,76,262 కోట్లను రానున్న ఏడేళ్లలో తీర్చాల్సి ఉందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. శాసనసభ ఆమోదం లేకుండా 2014-15 నుంచి 2017-18 మధ్య రూ.55,517 కోట్లు అధికంగా ఖర్చే చేసిందని, వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కాగ్‌ సిఫారసు చేసింది.   

వైసీపీ ఎమ్మెల్యేకు యువకుల షాక్

ఆయన అధికార వైసీపీ ఎమ్మెల్యే. అయితేనేం అన్యాయం చేస్తే ఊరుకుంటామా అంటూ నిలదీశారు ఆ యువకులు. కారు దిగిన ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే సైతం ఘాటుగా రియాక్ట్ అవడంతో వివాదం ముదిరింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈలోగా స్థానికులు కలగజేసుకొని ఎమ్మెల్యేను కారు ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారు. వైసీపీ ఎమ్మెల్యేకు యువకులు చుక్కలు చూపించిన ఈ ఘటన విశాఖ జిల్లాలో కలకలం రేపింది. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. వేపగుంట ముత్యమాంబ పండుగలో స్టేజీల ఏర్పాటు విషయంలో అదీప్‌రాజ్‌ను నిలదీశారు స్థానిక యువకులు. స్టేజీలకు ముందుగా అనుమతులు ఇచ్చి ఆ తరువాత రద్దు చేయడమేంటని ప్రశ్నించారు. గ్రామ దేవత పండుగలో రాజకీయాలు చేస్తారా అంటూ నిగ్గదీసి అడిగారు. ఎమ్మెల్యే కారును అడ్డగించి దుర్భాషలాడారు.  వేపగుంట ముత్యమాంబ పండుగకు సంబంధించి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం నాలుగు స్టేజీలు ఏర్పాటు చేశారు. సంబంధిత శాఖల నుంచి అనుమతులు కూడా తెచ్చుకున్నారు. ఆ తర్వాత స్టేజీలకు అనుమతి లేదంటూ అధికారులు రివర్స్ కావడంతో వారు కంగుతిన్నారు. దీనికి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ కారణమని భావించిన యువకులు.. పినగాడి నుంచి వేపగుంట వైపు వెళుతున్న ఎమ్మెల్యే కారును ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు కలిసి అడ్డగించారు. ఎమ్మెల్యేను చుట్టముట్టారు. స్టేజీల ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను అధికార బలంతో అడ్డుకున్నారని ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్టేజీ ఏర్పాటు అనుమతుల రద్దు వెనుక రాజకీయ ప్రమేయం లేదని ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ ఘాటుగా సమాధానం చెప్పడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అనుమతులు ఇవ్వాల్సిందేనని వారు పట్టుబట్టడంతో సమయం అయిపోయిందని ఎమ్మెల్యే తేల్చి చెప్పడంతో వివాదం ముదిరింది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో స్థానికులు కొందరు కలగజేసుకుని.. ఎమ్మెల్యేను కారెక్కించి అక్కడి నుంచి పంపించేశారు. ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కు జరిగిన చేదు అనుభావం స్థానికంగా సంచలనంగా మారింది.

ఆర్డినెన్సు రూట్ లో బడ్జెట్.. ఇదేమి దుష్ట సంప్రదాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండోసారి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ రూపంలో తీసుకువచ్చింది. జగన్ సర్కార్ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం దుష్ట సంప్రదాయానికి శ్రీకారం చుట్టిందని  ఆర్థిక శాఖ మాజీ మంత్రి,  శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆర్డినెన్సు రూట్లో బడ్జెట్ తీసుకు రావడాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుందని యనమల స్పష్టం చేశారు.   పూర్తి స్థాయి బడ్జెట్‌ సమావేశాలు లేదా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదముద్ర వేయరాదని కోరారు యనుమల రామకృష్ణుడు.  తిరుపతి ఉప ఎన్నిక, పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సాకుతో బడ్జెట్‌ సమావేశాలు వాయిదా వేయటం పలాయనవాదమని యనుమల ధ్వజమెత్తారు. వార్షిక బడ్జెట్‌ను కూడా ఆర్డినెన్స్‌ రూపంలో తెచ్చే దుష్ట సంప్రదాయానికి జగన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి ప్రజలు, ప్రతిపక్షాలు, చట్టసభలంటే లెక్కే లేదని విమర్శించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి కుంటిసాకులు చూపి బడ్జెట్‌ వాయిదా వేయలేదన్నారు. గతంలోనూ ఇదే తరహాలో తెచ్చిన మొక్కుబడి బడ్జెట్‌తో పాటు 3 రాజధానుల బిల్లును శాసనమండలి వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో మమ అనిపించుకున్నారని రామకృష్ణుడు మండిపడ్డారు. 

మందు సారు.. స్కూల్ బారు.. 

ఎవరైనా మందు బార్లోనో, వైన్స్ లోనో .. లేదంటే ఇంట్లోనో తాగుతారు. గుడిలాంటి బడిలో ఏవైనా మందు తాగుతారా.. అది ఒక అక్షరాశ్యుడు అయితే ఏమో అనుకోవచ్చు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే మద్యసేవిస్తే. ఆ ఉపాధ్యాయుడిని ఏమనాలి. అలాంటి  ఉపాధ్యాయులను విద్యార్థులు ఎలాంటి విలువలు నేర్చుకోవాలి.  ఆయన పేరుకు మాత్రం ఉపాద్యాయుడు. కానీ నిత్యం మద్యం మత్తులో మునిగితేలే మద్యోపాధ్యాయుడు. మనిషి అన్నాక కొద్దిగా కళాపోషణ ఉండాలి గానీ మరి వృత్తి పర విధుల్లో ఉంది ఇలాంటి పడుపని చేసే కళాపోషణ మాత్రం ఉండకూడదు. చిత్తూరు జిల్లా పాకాల మండలం కృష్ణాపురం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కోటేశ్వర రావు పాఠశాలలోనే మద్యంతో పాటు బిరియాని తింటూ ఉండగా గమనించిన విద్యార్థులు తల్లిదండ్రులు వీడియో తీశారు. వీడియో తీస్తున్నారన్న విషయం తెలిసిన మేలుకోని ఆ బూతు ఉపాద్యాయుడు  పల్లెటూరు వాళ్ళు కదా నన్ను ఏం  చేస్తారు అనుకున్నాడో ఏమో గానీ .. ఆయన దుస్తులు విప్పుతా తీసుకుంటారా అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. వీడియో తీసుకోండంటూ మద్యం బాటిల్‌, బిరియాని పైకెత్తి మరీ చూపించాడు. నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరై చిన్న చిన్న విషయాలకే విద్యార్ధుల దుస్తులు విప్పి పైశాచికంగా ప్రవర్తిస్తున్న కోటేశ్వరరావుపై అప్పటికే ఆగ్రహంగా వున్న తల్లిదండ్రులు  ఆ వీడియోను విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపించారు. విజయనగరం జిల్లాకు చెందిన కోటేశ్వర రావు గతంలో కుప్పంలో పని చేసినప్పుడు కూడా ఇలాగే తాగి పాఠశాలకు హాజరయ్యే వాడని సమాచారం. రెండు నెలలక్రితం బదిలీపై కృష్ణాపురం పాఠశాలకు వచ్చిన ఈయన వ్యవహార శైలి మొదటి నుంచి అలాగే వుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కోటేశ్వర రావును విధులనుంచి తాత్కాలికంగా తొలగించినట్లు డీఈవో నరసింహా రావు గురువారం రాత్రి ప్రకటించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు స్థానిక సర్పంచ్‌, స్కూల్‌ కమిటీ ఛైర్మన్‌, సీఆర్సీ, హెచ్‌ఎం సమక్షంలో విచారణ జరిపామని తెలిపారు .పాఠశాల వేళల్లో మద్యం సేవించడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని తేలడంతో చర్యలు తీసుకున్నట్లు డీఈవో ప్రకటించారు.

మల్లన్నకు పదవీ టెన్షన్! పల్లా ఫీవర్..

కేసీఆర్ ప్రధాని అయితే దేశ చరిత్ర మారిపోతుందంటూ మల్లన్న జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ పీఎం కావాలి. మంత్రి మల్లారెడ్డి కోరిక ఇది. కేసీఆర్ పీఎం అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే దేశాన్ని కూడా ప్రగతిపథంలోకి తీసుకెళ్తారట. ప్రజలకు సమస్యలే ఉండవట. సమయం, సందర్భం లేకుండా సడెన్‌గా ఆయన కేసీఆర్ భజన ఎందుకు చేశారనేది ఆసక్తికరం.  మల్లారెడ్డికి మంత్రిగండం పొంచి ఉందని అంటున్నారు. త్వరలోనే ఆయన పదవి ఊస్ట్ అని చెబుతున్నారు. వెంటనే మల్లారెడ్డి సాబ్‌ను తీసేయాలని గులాబీ బాస్ మనసులో లేకపోయినా.. తనకిష్టమైన, పార్టీకి సరికొత్త ట్రబుల్ షూటర్‌గా మారిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోవాలని కేసీఆర్ తెగ ఆరాటపడుతున్నారట. సామాజిక వర్గ సమతూకంలో భాగంగా.. రెడ్డి వర్గానికి చెందిన పల్లాను మంత్రిమండలిలోకి తీసుకుంటే.. అదే వర్గానికి చెందిన మరో మంత్రిని మైనస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్‌లో మిగతా మంత్రుల కంటే ముందున్నారట మల్లన్న. అందుకే, ఎక్కడ తన పదవి పోతుందోననే టెన్షన్ మల్లారెడ్డిని వేధిస్తోంది.  గత పార్లమెంట్ ఎలక్షన్‌లో ఏరికోరి మరి మల్లారెడ్డి అల్లుడికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇస్తే.. ఆయన రేవంత్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అప్పట్లో రాజకీయాలకు కొత్త వాడైన మర్రి రాజశేఖర్‌ను గెలిపించే బాధ్యత మల్లారెడ్డికి అప్పగించినా.. అందులో ఆయన విఫలమయ్యారనే అపవాదు ఉంది. ఇక కార్మిక శాఖ మంత్రిగా పెద్దగా సాధించింది కూడా ఏమీ లేదు. మరోవైపు.. సొంతపార్టీ నేతలతో పొసగకపోవడం.. ఆయనపై పెద్ద ఎత్తున భూకబ్జా ఆరోపణలు రావడం.. మల్లారెడ్డి మంత్రి పదవికి ఎసరు పెట్టేలా ఉంది. సవాల్‌గా మారిన స్థానం నుంచి రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టి ఆయనకు పట్టం కట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట.  ఇప్పటికే పాలనలో ఆఫ్ టర్మ్ పూర్తి చేసుకున్న కేసీఆర్.. త్వరలోనే కేబినెట్‌లో మార్పులు, చేర్పులు చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఆ సమయంలో మల్లారెడ్డి స్థానంలో పల్లా మంత్రి మండలిలో చేరుతారని అంటున్నారు. మల్లన్నకు మంత్రి పదవి భయం పట్టుకుందని.. అందుకే, అసెంబ్లీలో కేసీఆర్ పీఎం కావాలంటూ పొగడ్తలతో ముంచెత్తి.. గులాబీ బాస్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఇలాంటి కాకా పట్టే.. భజనలకు పొంగిపోతే ఆయన కేసీఆర్ ఎందుకవుతారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు మల్లన్నా..?

యూట్యూబ్ డాక్టర్.. 

యూట్యూబ్ లో లేని విషయాలు ఉండమంటే నమ్మాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చోడి చేతిలో రాయిలా మారింది యూట్యూబ్. ఏం చేసిన న్యూస్ గా మారింది.    అలా అని యూట్యూబ్ ని తక్కువ అంచనా వేయకండి చాలా మందికి ఉపాధితో పాటు, సంఘం లో గుర్తింపు కూడా ఇచ్చింది. యూట్యూబ్ ని ఒక్కొక్కరు ఒక్కోలా వాడుతారు. ప్రపంచ రహస్యాలు, చరిత్ర , నుండి మొదలు పెడితే  వంట ఎలా చేయాలి. పంట ఏం వేయాలి, ఏం తినాలి , ఎలా తినాలి, ఎలా కుట్టాలి ఎలా కట్లు కట్టాలి,   ఎలా చదవాలి, ఎలా చావాలి , ఎలా పడాలి, ఎలా పాడుకోవాలి అబ్బో .. ఒక్కటేమిటి మనకు తెలియాలి  విషయాలు యూట్యూబ్లో చాలా ఉన్నాయి.  ఈ మధ్య ఒక వ్యక్తి యూట్యూబ్ చూసి డాక్టర్ అయ్యాడు. అదేంటి డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదువుతారు గానీ.. యూట్యూబ్ చుస్తే అవుతారా అనుకుంటున్నారా.. అదే ఇక్కడ ట్విస్ట్. అందుకే  పైన యూట్యూబ్  పిచ్చోడి చేతిలో రాయి అని చెప్పాను. డాక్టర్ అంతే అలాంటిలాంటి డాక్టర్ కాదు భయ్యో.. యూట్యూబ్ డాక్టర్.. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఆపరేషన్స్ చేసే డాక్టర్.  అతను ఒక  మెడికల్‌ రిప్రజెంటేటివ్‌. చదివింది బీఎస్సీ. ఎంబీబీఎస్‌ వైద్యుడిగా మారాడు. వరంగల్‌ నగరం ఆసుపత్రి విధులు నిర్వహిస్తున్నాడు ఈ యూట్యూబ్ డాక్టర్. యూట్యూబ్ చూస్తూ అబార్షన్లు చేస్తూ మహిళల ప్రాణాలతో పుడ్ బాల్ ఆడుతున్నాడు. తాను యూట్యూబ్ డాక్టర్ అనే విషయం తెలియడంతో  వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడిచేసి పోలీసులకు అప్పగించారు.  వరంగల్‌ రురల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన అండ్రు ఇంద్రారెడ్డి నెల రోజుల క్రితం హన్మకొండలోని  సిటీ హాస్పిటల్‌ పేరిట ఆసుపత్రి ఓపెన్ చేశాడు. ఆడపిల్లలు వాడుకుంటున్న మహిళలను ఆర్‌ఎంపీలు, పీఎంపీల ద్వారా గుర్తిస్తున్నాడు. నర్సింగ్‌లో శిక్షణ పొందినవారి సాయంతో.. యూట్యూబ్‌ చూస్తూ అబార్షన్లు చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో బుధవారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆసుపత్రిపై దాడిచేశారు. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలకు చికిత్స చేస్తున్నారు. అధికారులను చూసి వైద్య సిబ్బంది గోడదూకి పారిపోయారు. థియేటర్‌లో ఉన్న మహిళను బాత్రూంలో దాచారు. డీఎంహెచ్‌వో లలితాదేవి, అడిషనల్‌ డీఎంహెచ్‌వో మదన్‌మోహన్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో యాకూబ్‌పాషాలు పోలీసుల సాయంతో ఆ మహిళను బయటకు తీసుకొచ్చి విచారించారు. రక్తస్రావం అవుతుండటంతో హన్మకొండ జీఎంహెచ్‌కు తరలించారు. డీఎంహెచ్‌వో ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిపై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఆసుపత్రిని జిల్లా వైద్య అధికారులు సీజ్‌ చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిపారు. ఇంద్రారెడ్డి మూడేళ్ల క్రితం వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలోనూ ఇలాగే ఓ ఆసుపత్రి ఏర్పాటు చేయగా.. అధికారులు దాన్ని సీజ్‌ చేశారు.    ఈ ఇంటర్ నెట్ ప్రపంచం వచ్చిన తరువాత బ్రెయిన్ కి పని తగ్గిందనే చెప్పాలి. ఏ సమాచారం కావాలన్నా ఇంటర్ నెట్ పైనే ఆధారపడుతున్నాం. సమాచారం కోసం గూగుల్ సర్చ్, యూట్యూబ్ సర్చ్ అంటూ ఇంట్లో వాళ్ళని కూడా పట్టుకోలేనంత బిజీ అయ్యాం.. మనకు తెలియకుండానే మనం వేరే ప్రపంచంలో బతుకుతున్నాం. సరే ఇదంతా పక్కన పెడితే 5 నెలల పిల్లలు కూడా ఫోన్ చేతికి వదలడం లేదు. ఏమైపోతుందో ప్రపంచం చివరికి.    

సాగర్ లో టైంపాస్ పాలి..ట్రిక్స్

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. జనవరి 30వ తేదీ వరకు గడువున్నా.. ఇందులో మూడు రోజులు సెలవులున్నాయి. అంటే మంగళవారం మాత్రమే నామినేషన్ వేసేందుకు అవకాశం. అయినా ఇంతవరకు కాంగ్రెస్ క్యాండిడేట్ గా జానా రెడ్డి మాత్రమే ఖరారయ్యారు.  టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్ సస్పెన్స్ కొనసాగిస్తుండగా... టీఆర్ఎస్ తర్వాతే మేమంటూ కమలనాదులు వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది.  దుబ్బాక ఉపఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు బిగ్ షాకిచ్చిన కమలదళం..అదే ఊపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. హైదరాబాద్ స్థానంలో టీఆర్ఎస్‌తో హోరాహోరీగా తలపడినా.. నల్గొండ స్థానంలో మాత్రం నాలుగో స్థానానికి పరిమితమయింది. దీంతో నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో సత్తా చాటి.. టీఆర్ఎస్‌కు మరో షాక్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే.. తమ అభ్యర్థిని ప్రకటించాలని కమలం నేతలు యోచిస్తున్నారు. టీఆర్ఎస్ ఏ సామాజికవర్గానికి చెందిన నేతకు టికెట్ ఇస్తుంది? నియోజకవర్గంలో అతడు ఏ మేరకు ప్రభావం చూపుతాడు? అని అంచనా వేసి.. ఆ తర్వాతే తమ అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ నేతలు చూస్తున్నారు. టీఆర్ఎస్ టికెట్ ఆశించిన భంగపడిన నేతలకు గాలం వేసేందుకు కమలదళం కాచుకుని కూర్చుందని చెబుతున్నారు. సాగర్ నియోజకవర్గానికి చెందిన కొందరు గులాబీ నేతలతో బీజేపీ పెద్దలు టచ్ లో ఉన్నారని సమాచారం. బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన కేసీఆర్ కూడా.. వాళ్లకు కౌంటర్ ప్లాన్ అమలు చేస్తున్నారని తెలుస్తోంది. బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే వ్యూహంతో ఆయన పక్కాగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటిస్తారని.. నేరుగా నామినేషన్ దాఖలు చేయిస్తారని సమాచారం. తద్వారా టీఆర్ఎస్‌లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లకుండా అడ్డుకోవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే టీఆర్ఎస్ అసంతృప్త నేతలను బీజేపీ చేరదీసి.. టికెట్ ఇచ్చే అవకాశముందని. అదే జరిగితే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారట. అందుకే అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తున్నారని తెలంగాణలో చర్చ జరుగుతోంది. గతంలో పెద్దపల్లిలో ఇదే వ్యూహాన్ని సీఎం కేసీఆర్ అనుసరించారు.   నామినేషన్లు గడువు ముగింపు దగ్గరపడుతున్నా అభ్యర్తులను ఖరారు చేయకపోవడం రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరిగింది. టికెట్ రేసులో ఉన్న అభ్యర్తులైతే తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు. ఆయా పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్, లోకల్ నాయకుడు గురువయ్య యాదవ్ లో ఒకరికి టికెట్ ఇస్తారని తెలుస్తోంది. బీజేపీ టికెట్ రవినాయక్ కు దాదాపుగా ఖరారైందని, చివరి నిమిషంలో టీఆర్ఎస్ నుంచి ఎవరైనా కీలక నేత వస్తే మారవచ్చని చెబుతున్నారు. 

నాకు బీపీ, షుగర్.. ఓటేయండి ప్లీజ్..

రోడ్లు వేస్తాం.. బస్సులు వేస్తాం.. భవనాలు కడతాం.. అభివృద్ధి చేస్తాం నాకే మీ ఓటు.. ఎలక్షన్లు వస్తే ఇలాంటి డైలాగులు కామన్. కొంచెం అటూ ఇటూగా నేతలంతా ఇలాంటి హామీలు, రిక్వెస్టులే చేస్తుంటారు. కానీ.. ఓ మంత్రి మాత్రం సంథింగ్ డిఫరెంట్. గెలిస్తే తానేమి చేస్తాడో చెప్పకుండా.. తనకున్న సమస్యలేంటో చెప్పి.. ఓటేయమని అడుగుతున్నాడు. ఆ ప్రాబ్లమ్స్ కూడా అంత పెద్దవేమీ కాదు. తాను బీపీ, షుగర్‌తో బాధపడుతున్నా కాబట్టి తనను ఆదరించి, తనకే ఓటువేసి.. గెలిపించాలని ఓటర్లను ప్రార్థిస్తున్నాడు. అదేంటి, మంత్రికి బీపీ, షుగర్ ఉంటే మేము ఓటేయడమేంటంటూ జనాలు తెగ నవ్వుకుంటున్నారు. మంత్రి స్థాయిలో ఉన్న నేత.. ఇంత సిల్లీగా ఓట్లు అడగడమేంటని ఓటర్లు విసుక్కుంటున్నారు.  ఇది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జరిగిన వింత. తమిళనాడు మంత్రి విజయభాస్కర్.. తనకు బీపీ, షుగర్ ఉంది కాబట్టి మీ ఓటు వేసి తనను ఆదుకోమంటూ ఓటర్లను వేడుకున్నాడు. మంత్రి గారు చేసిన ఈ వ్యాఖ్య‌లు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. పుదుకోట్టై జిల్లా విరాళిమలై నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు విజయభాస్కర్. ఆరోగ్య శాఖ‌ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో తాను చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు ట్రోల్ చేస్తుండటంతో ఆయ‌న స్పందించారు. తాను చేసిన కామెంట్లను సమర్థించుకున్నారు. సెంటిమెంట్ అస్త్రాన్ని ప్ర‌యోగించి ఓట్ల కోసం పాకులాడటం లేదంటూ కవర్ చేసుకున్నారు. తాను శారీరకంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌ను ఓటర్లకు గుర్తు చేయడంలో తప్పేముందని తిరిగి ప్రశ్నించారు.  తాను ఇటీవ‌ల ఓ ప్రాంతంలో చేసిన ప్రసంగాన్ని కొంద‌రు వక్రీకరిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. తాను విశ్రాంతి లేకుండా ప్రజలకు సేవ చేశానని చెప్పారు. ఈ విష‌యాల‌న్నీ వివ‌రిస్తూ.. త‌న‌కున్న‌ బీపీ, షుగర్‌ గురించి కూడా మాట్లాడాన‌ని.. అందులో తప్పేమీ లేదని తనను తాను సమర్థించుకున్నారు మంత్రి విజయభాస్కర్. 

అక్షరాస్యతలో ఆంధ్ర లాస్ట్.. ఈ పాపం ఎవరిది? 

అక్షర క్రమంలో ముందు వరుసలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ అక్షరాస్యతలో మాత్రం అన్ని రాష్ట్రాల కంటే అట్టడుగున అథమ స్థానంలో వుంది.  చివరకు బీమార్ స్టేట్ గా ముద్ర వేసుకున్న బీహార్ కంటే కూడా దిగువ స్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరుకుంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే నివేదిక ప్రకారం అక్షరాస్యతలో ఆంధ్ర రాష్ట్రం చిట్టచివర స్థానంలో ఉంది. ఈ సర్వే ప్రకారం ఆంధ్రలో 66.4 శాతం మంది అక్షరాస్యులు ఉండగా, బీహార్లో 70.9 శాతం ఉన్నారు. తెలంగాణలో 72.8 శాతం ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్ లో 15 ఏళ్ళు దాటిన ప్రతి వంద మందిలో 38.7 మంది అక్షరం ముక్క రాని సంపూర్ణ నిరక్షరాస్యులు.  అయితే  ఇది ప్రస్తుత ప్రభుత్వం  సొంత రికార్డ్ కాదు. గత ప్రభుత్వం అంతకు ముందున్న ఉమ్మడి రాష్ట్ర పాలకులు అందరూ బాధ్యులే. ఈ సర్వే కూడా 2017-18 విద్యా సంవత్సరానికి సంబందించిన సర్వే. అందుకే తిలా పాపం తలాపిడికెడు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యతా దినం సందర్భంగా ముఖ్యమంత్రులు సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ఇయరు, డేటుతో సహా ముహూర్తం ఖరారు చేస్తూనే ఉన్నారు. ముహూర్తాలు వచ్చిపోతూనే ఉన్నాయి కానీ, ఇంతవరకు మూడు ముళ్ళు మాత్రం పడలేదు. మరో వంక రాష్ట్రంలో అక్షరాస్యత మరింతగా దిగజారి చివరి మెట్టుకు చేరుకుంది.   రాష్ట్ర విభజన తర్వాత 2015లో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా  అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..  “2019 నాటికి రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తాం” అని ప్రకటించారు. ఆయనే 2018లో మళ్ళీ మాట తప్పకుండా, అదే వాగ్దానాన్ని అక్షరం పొల్లు పోకుండా అలాగే అప్పగించారు. అయితే (2015-2018) మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ సంపూర్ణ అక్షరాస్యత సాధనలో ఏదైనా సాధించిందా అంటే లేదు. నిజానికి మరో మెట్టు దిగజారి ఆఖరి మెట్టుకు చేరుకుంది.  2019 సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యతా దినం సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. “వచ్చే ఐదేళ్ళలో రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధిస్తాం” అని కొత్త ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే జగన్మోహనరెడ్డి ప్రభుత్వం గడచిన 20నెలల కాలంలో సంపూర్ణ అక్షరాస్యత దిశగా నిర్దిష్ట చర్యలు ఏమైనా తీసుకుందా అంటే అది లేదు. చదువు పేరిట అమ్మ ఒడి, నాడు నేడు లాంటి ఓటు బ్యాంకు పథకాలకు ఇచ్చిన ప్రాధాన్యత పంతుల్ల నియామకానికి ఇవ్వడం లేదు. అంతే కాదు  అమ్మ భాషకే దిక్కు లేదంటే, కిరస్తానీ భాష, ఇంగ్లీష్ ను పిల్లల నెత్తికి ఎత్తెందుకు ప్రాధమిక స్థాయి నుంచే  అంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అంటూ కొత్త వివాదానికి తెర తీశారు. మరో వంక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధాన ప్రకారం ఐదవ తరగతి వరకు మాతృ భాషలోనే బోధన ఉంటుంది. దీంతో కొంత గందరగోళం నెలకొంది. మరో వంక ఇంతకు  ముందే అనుకున్నట్లుగా, ఉమ్మడి ఆంధ్ర అప్రదేశ్ రాష్టంలో కూడా, ప్రభుత్వాలు ప్రాధమిక విద్యపై అంతగా శ్రద్ద పెట్టలేదు. పాఠశాల విద్య నిర్లక్ష్యానికి గురవుతూనే వుంది. ఇప్పడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. రాష్ట్రంలో అక్షరాస్యత పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను అయితే ప్రవేశపెడుతున్నాయి కానీ.. చాలా వరకు పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. చివరకు నిర్బంధ ప్రాదమిక విద్య కూడా వానాకాలం చదువులానే సాగుతోంది.  మరోవైపు 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసి అక్షరాస్యతను పెంపొందించేకు గతంలో అమలైన వయోజన విద్యా పథకాలు ఇప్పుడు అమలు కావడం లేదు. అందుకే ఆంధ్ర ప్రదేశ్ అక్షరాస్యతలో అథమ స్థానానికి చేరింది. ఈ పరిస్థితి మారాలంటే ప్రత్యేక శ్రద్ద, చిత్తశుద్ధి అవసరం. గత ప్రభుత్వాలకు కానీ  ప్రస్తుత ప్రభుత్వానికి కానీ,లోపించినవీ లేనివీ అవే.. 

మైనారిటీ ఓటు పైనే దీదీ ఆశలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, పెరుగతున్న ఉష్ణోగ్రతలతో పోటీపడి వేడెక్కుతోంది.కాలికి గాయమై కదలలేని పరిస్థితిలోనూ తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు సాగిస్తున్నారు. బీజేపీని టార్గెట్ చేసుకుని దుమ్మెత్తి పోస్తున్నారు. ముఖ్యంగా మైనారిటీల ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టిన మమత, కాంగ్రెస్, కమ్యూనిస్ట్’లతో జట్టుకట్టిన ఇస్లాం ప్రబోధకుడు అబ్బాస్‌ సిద్ధిఖీ స్థాపించిన ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్ఎఫ్‌)ను బీజేపీ సృష్టిగా పేర్కొంటున్నారు. గురువారం  దక్షిణ 24 పరగణాల జిల్లాలో నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన దీదీ చాలా చిత్రంగా పరస్పర వైరుధ్య విశ్వాసాలకు ప్రతీకాగా నిలిచే  బీజేపీ, ‘ఐఎస్ఎఫ్‌’లను ఒకటి చేశారు. మైనార్టీల ఓట్లను చీల్చేందుకు రాష్ట్రంలో కొత్త పార్టీ ఒకటి పుట్టుకొచ్చిందని, దాని వెనుక బీజేపీ  హస్తం ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ పార్టీకి బీజేపీ నుంచి డబ్బులు కూడా అందుతున్నాయని విమర్శించారు. పేరు ప్రస్తావించనప్పటికీ పరోక్షంగా ఇస్లాం ప్రబోధకుడు అబ్బాస్‌ సిద్ధిఖీ స్థాపించిన ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్ఎఫ్‌)ను ఉద్దేశించి పరోక్షంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయొద్దని  ఓటర్లను అభ్యర్థించారు.సీపీఎం-కాంగ్రెస్‌ సైతం బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు.   అదలా ఉంటే గురువారం, బాఘ్‌ముండిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో  పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మమతకు ఏ మాత్రం తీసిపోకుండా, డెంగీ, మలేరియా వ్యాధులతో దీదీ స్నేహం చేస్తున్నారని అందుకే అవి రాష్ట్రాన్ని వదిలిపెట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఆ వ్యాధులు నిర్మూలన కావాలంటే బీజేపీకి  ఓటెయ్యాలని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలకు దీదీ ఫ్లోరైడ్‌ నీటిని సరఫరా చేస్తున్నారు.మీరు ఒక్కసారి దీదీని ఇక్కడి నుంచి పంపిస్తే.. మీకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు బీజేపీ  ప్రభుత్వం రూ.10వేల కోట్లు కేటాయిస్తుంది. గతంలో టీఎంసీ, లెఫ్ట్‌ ప్రభుత్వాలు రాష్ట్రానికి పరిశ్రమల్ని రాకుండా చేశారు. అందుకే ఉపాధి అవకాశాలు లభించలేదు. మీకు ఉద్యోగాలు కావాలంటే తప్పకుండా బీజేపీకి ఓటెయ్యండి. అలాగే, ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించని బీజీపీ మోడీ పేరున లబ్ది పొందాలని చూస్తోంది, ఈ క్రమమలోనే, మోదీ ప్రజల సంక్షేమం కోసం ఎన్నికలు కావాలనుకుంటారు. కానీ దీదీ తన మేనల్లుడిని సీఎం చేయడం కోసం ఎన్నికలు కావాలనుకుంటున్నారు’ అని షా తెలిపారు. ప్రధాని మోదీ దేశ అభివృద్ధి కోసం 115 స్కీంలు ప్రవేశపెట్టారు. కానీ బెంగాల్‌లో దీదీ 115 స్కాంలు తెచ్చారు అంటూ  దీదీపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ అధికరంలోకివశే బీజ్పీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని రైతులందరి ఖాతాల్లో పెట్టుబడి కింద రూ.18వేలు అందిస్తాం. ఆదివాసీల అభివృద్ధి కోసం మేం కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే కేంద్రం ఇక్కడ రైల్వే సదుపాయాల కల్పనకు పనులు ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ ప్రభుత్వ బస్సుల్లో రవాణా ఉచితంగా కల్పిస్తాం. దీదీ మలేరియా, డెంగీతో స్నేహం చేస్తోంది. వాటిని నిర్మూలన చేయాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి’ అని ఓటర్లకు అమిత్‌షా విజ్ఞప్తి చేశారు.పశ్చిమబెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకు మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 6వతేదీ వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే 2వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.  

సీబీఐ వెనుక జగన్.. నేరం నాది కాదు..

తమపై నమోదైన సీబీఐ ఎఫ్‌ఆర్‌ఐపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వివరణ ఇచ్చారు. అభూతకల్పనలు, అవాస్తవాలతో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిందన్నారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ వెనుక వైసీపీ నేతల ఒత్తిడి ఉందన్నారు రఘురామ కృష్ణరాజు. ఫిర్యాదు చేసిన ఎస్‌బీఐ మేనేజర్‌కు, సీఎంవో మధ్య.. ఫోన్‌ కాల్స్‌పై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పలు ఛార్జిషీట్‌లు దాఖలైన సీఎం జగన్‌.. విచారణకు హాజరుకాకపోయినా సీబీఐ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్‌పీఎల్టీలో ఉన్న తన కంపెనీపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలుకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. నిధుల మళ్లింపు, దుర్వినియోగం ఆరోపణల్లో నిజం లేదని కుండబద్దలు కొట్టారు. నిజాలన్నీ నిలకడ మీద తెలుస్తాయని, సీబీఐ విచారణకు సహకరిస్తానన్నారు రఘురామ కృష్ణరాజు.  తనపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనందున  రాజీనామా చేయాలని కొందరు ఎంపీలు అంటున్నారన్న రఘురామ.. వారు ఆ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా.. నేనూ సీఎం జగన్‌రెడ్డిపై 33 చార్జిషీట్లు ఉన్నట్లు గుర్తు చేయాలా? అని ప్రశ్నించారు. సీబీఐ కోర్టుకు ప్రతి శుక్రవారం వెళ్లకుండా తప్పించుకుంటున్న సీఎం సంగతేంటి? అన్నారు.  ప్రతివారం ఏవో పథకాల ప్రారంభం, శంకుస్థాపనల నెపంతో ఆయన సీబీఐ కోర్టుకు హాజరుకావడానికి భయపడుతున్నట్లు అనుకోవాలా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రఘురామ. జగన్‌పై ఉన్న చార్జిషీట్ల సంఖ్య కంటే ఒక్కటైనా అదనంగా.. అంటే నాపై 34 ఎఫ్‌ఐఆర్‌లు అక్రమంగా పెట్టేందుకు కుట్ర చేస్తున్నారు అని రఘురామరాజు మండిపడ్డారు. వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెందిన కంపెనీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న ఇంద్‌భరత్‌ పవర్‌ జెన్‌కాం లిమిటెడ్‌ కంపెనీ తమను తీవ్రంగా మోసగించిందని, నకిలీ డాక్యుమెంట్లు సమర్పించిందని.. తమ నిధులను దాదాపు రూ.237.84 కోట్ల మేర స్వాహా చేసిందని ఆరోపిస్తూ బ్యాంకుల కన్సార్షియం తరఫున స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెన్నై శాఖ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రవిచంద్రన్‌ చేసిన ఫిర్యాదును సీబీఐ పరిగణనలోకి తీసుకుంది. ఈ కంపెనీ ఎస్‌బీఐకి రూ.107.57 కోట్లు, యాక్సిస్‌ బ్యాంకుకు రూ.123.65 కోట్లు, సిండికేట్‌ బ్యాంకు రూ.46.05 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.13.95 కోట్లు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకుకు రూ.6.62 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఇంకా యూకో బ్యాంకు, ఐఎల్‌ఎ్‌ఫఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి వివరాలు రావలసి ఉందని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.     

సిలిండర్ పై 20 లక్షలు.. తగలబెట్టిన తహసీల్దార్..

అప్పుడెప్పుడో ఇందిరా గాంధీ తన దగరికి వచ్చిన ఓ గెస్ట్ కి  కరెన్సీ తో మంటపెట్టి  కాఫీ పెట్టి ఇచ్చారని మాట్లాడుకుంటుంటే విన్నాం. ఇప్పుడు చాలా మంది సరదాకు సెగరెట్ కాలుస్తుంటే చూస్తున్నాం. అప్పుడప్పుడు ఎవరికైన కోపం పక్కవాడి ఒళ్ళు కాలుస్తుంటారు ఆ వార్తలు కూడా విన్నాం. లేదంటే ఆఫీసులో  జరిగిన అవినీతిని బయటికి రాకుండా చూడడానికి  అకౌంట్ కి సంబందించిన రికార్డ్స్ తగలేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం.  కానీ డబ్బులు ఏరైనా కలుస్తారా.. సరే కాలుస్తారు అనుకుందాం ఎంత 10 రూపాయలు,  100 రూపాయలు, 5000 వేలు కలుస్తారు. మరి 20  లక్షలు ఎవరైనా కాలుస్తారా చెప్పండి..? ఏంటి.. మాట రావడంలేదా.. ఒక వ్యక్తి కాల్చాడు.. నిజంగానే అక్షరాలా 20 కాల్చాడు. అలా అని అది కస్టపడి సంపాదించిన డబ్బు కాదండోయి.. అవినీతి అమ్మకు పుట్టిన.. లంచం డబ్బు.      తను ఒక తహసీల్దారు. అవినీతికి నీరుకట్టే పాము లాంటివాడు. ఎంత అవినీతి పరుడో అంతే తెలివి పరుడు. తెలివి ఉండాలి కానీ అతితెలివి ఉండకూడదంటారు. ఆ  తహశీల్ దారు అతితెలివి తనను ఇరకాటంలో పడేసింది. జాలరి వల నుండి తప్పించుకున్న చేప ఎక్కడికైనా వలలో పడినట్టు.. చివరికి తాను ఏసీబీ వలకు చిక్కుకున్నాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే లంచాలకు అడ్డా అని. ఆ అవినీతి చాపకింద దాగి ఉన్న తిమింగిలాలు, జలగల్ని పట్టుకోవాలని ఏసీబీ వల వేస్తూ.  అవినీతి దందాకు అంతిమంగా చెక్ పెడుతోంది. అందులోనే ఏసీబీ రెవెన్యూ శాఖపైనే కన్నేసింది. తాజాగా  ఏసీబీ అధికారులు ఓ తహసీల్దారు ఇంట్లో రెక్కీ నిర్వహించడానికి వెళ్లానని నిర్ణయం తీసుకున్నారు. ఇక అంతే తన ఇంట్లో సోదాలు చేస్తున్నారని ముందే పసిగట్టి. తహసీల్దారు అక్షరాలా 20 లక్షలకు నిప్పు అంటించాడు.  తహసీల్దార్ కల్పేష్ కుమార్  జైన్ ఓ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇప్పించాడు. మధ్యవర్తిగా ఉన్న రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పర్వత్ సింగ్‌ సదరు కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. అయితే ఈ అవినీతిపై విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ కల్పేష్ కుమార్ జైన్ ఇంటి పై దాడులు జరిపారు. ఈ దాడులకంటే ముందు ఏసీబీ అధికారులు వస్తున్నారని సమాచారం అందుకున్న కల్పేష్ కుమార్ ఇంట్లో ఉన్న 20 లక్షల్ని ఇంటిలోపల తాళం వేసి వంటగదిలో గ్యాస్ పై తగలబెట్టాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు తహసీల్దార్ ఇంటి డోర్ ను బలవంతంగా ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూడగా.., జైన్ తగలబెట్టిన కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. దీంతో జైన్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కాలిన నోట్లు కాకుండా విడిగా ఉన్న 1.5లక్షల్ని స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ లోని సిరోహి జిల్లాలో చోటుచేసుకుంది.   

కరోనా ఆసుపత్రిలో మంటలు.. ఇద్దరు సజీవ దహనం

కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కరోనా హాస్పిటల్ లో మంటలు రావడంతో  ఇద్దరు కరోనా రోగులు సజీవదహనమయ్యారు. భాండప్ ప్రాంతంలోని డ్రీమ్స్ మాల్‌లో ఉన్న సన్‌రైజ్ ఆసుపత్రిలో అర్ధరాత్రి దాటిన  ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో 76 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురు రోగులు వెంటిలేటర్లపై ఉండగా.. మిగితా 70 మందిని మరో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మంటలు వ్యాపించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కరోనా బాధితులను మరో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. 23 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. మాల్‌లోని మొదటి అంతస్తులో అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించిందని డీసీపీ ప్రశాంత్ కదమ్ తెలిపారు.  అగ్ని ప్రమాదం జరిగిన హాస్పిటల్ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి. మాల్ లో నిబంధనలకు విరుద్దంగా హాస్పిటల్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ముంబై నగర మేయర్ కిషోరి పడ్నేకర్ మాట్లాడుతూ.. అసలు ఓ మాల్‌లో ఆసుపత్రి ఉండడాన్ని తాను తొలిసారి చూస్తున్నట్టు చెప్పారు. ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని మేయర్ పేర్కొన్నారు.  

ఏప్రిల్ లో కరోనా ఉప్పెన! 100 రోజుల డేంజర్

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత మూడు వారాలుగా కేసులు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రోజువారి కేసులు 50 వేలకు పైగానే  వస్తున్నాయి. గ‌తేడాది న‌వంబ‌ర్ ఆరో తేదీ త‌ర్వాత అత్య‌ధికంగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. మ‌హారాష్ట్ర‌, పంజాబ్ ,కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో ప్ర‌జ‌లు దారుణ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు. కరోనా కేసులు పెరగడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అయితే కరోనాకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. దేశంలో కరోనా విజృంభణ తీరును బట్టి చూస్తే రెండో వేవ్‌ ప్రారంభమైందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నివేదిక తెలిపింది. ఫిబ్రవరి 15 మొదలుకొని వంద రోజుల పాటు రెండో వేవ్‌ విజృంభణ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏప్రిల్ ద్వితీయార్ధంలో రోజువారీ కేసులు గ‌రిష్ఠ‌స్థాయికి చేరతాయని తెలిపింది. కేసులు పెరుగుతున్న తీరును బట్టి చూస్తే మార్చి 23 నాటికే దేశవ్యాప్తంగా రెండో వేవ్‌లో 25 లక్షల కొత్త కేసులు ఉండి ఉంటాయని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో కరోనా నిబంధనలు, ఆంక్షల్ని తేలిగ్గా తీసుకోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని తెలిపింది.కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో గత వారం రోజులుగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయని నివేదిక తెలిపింది. ఇక ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న లాక్‌డౌన్‌లు, ఆంక్షల ప్రభావం వచ్చే నెలలో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపింది. కరోనాను నియంత్రించాలంటే వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని ఎస్బీఐ నివేదిక సూచించింది. ప్రస్తుతం రాష్ట్రాలు సగటున 34 లక్షల మందికి టీకా అందిస్తున్నాయని తెలిపింది. దీన్ని 40-45 లక్షలకు పెంచాలని సూచించింది.  

ఈ సీఎం.. ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష పేప‌ర్లు ఎత్తుకెళ్లిన దొంగ!

రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష పేప‌ర్లు ఎత్తుకెళ్లిన దొంగ .. గతంలో చేసిన దొంగ బుద్ది ఆయనకు ఇంకా పోలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అలాంటి పనులే చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట తప్పుతూ, పాలనలో వేసిన ప్రతి అడుగూ తప్పుతూ ఫేక్ ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నారు... ఈ వ్యాఖ్యలు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి.. ప్రతిపక్ష నాయకుడు చేసినవి.  ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారం రాజకీయ కాక రేపుతోంది. ఫేక్ కేసులు నమోదు చేశారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.  ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘాటు విమర్శలు చేశారు. పదో తరగతి పరీక్ష పేపర్లు ఎత్తుకెళ్లిపోయిన బుద్ధి జగన్ రెడ్డి ఇంకా మార్చుకోలేదని వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల పేరుతో సీఐడీకి ఫేక్ ఫిర్యాదులు ఇచ్చి ఫేక్ సీఎం బిరుదు సార్థకం చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. అమరావతి అసైన్డ్ భూముల అంశంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులైనా నిజమైనవాళ్లా? లేక ఫేక్ సీఎం ఇచ్చిన ఫేక్ ఫిర్యాదుల్లాంటి ఫేక్ ఖాకీలా? అంటూ సెటైర్లు వేశారు అయ్యన్న పాత్రుడు.  "నాడు విపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి అంగీకరించి, అధికారం చేపట్టాక కక్ష కట్టి మరీ అమరావతి అంతానికి కుట్రలు చేస్తున్నావు. వికేంద్రీకరణ పేరుతో నువ్వు చిమ్ముతున్న విద్వేషపు విషాన్ని టీడీపీ జనం ముందు ఉంచింది. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎంత బెదిరింపులకు పాల్పడినా జగన్ రెడ్డి, ఆయన గ్యాంగ్ చెప్పేవన్నీ అవాస్తవాలేనని ప్రజలు కుండబద్దలు కొట్టారు. అసత్యప్రచారాలే పునాదులుగా నిర్మించుకున్న అధికారం కూలిపోయే రోజు దగ్గరపడింది" అంటూ సీఎం జగన్ పై అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు.

స్వేరో ప్రవీణ్ కు షర్మిల సపోర్ట్? 

ఎవరితోనూ పొత్తు లుండవు. ఒంటరిగానే పోటీ చేస్తాం,  దేవుని దయతో విజయం సాధిస్తాం ... ఇది ఏ తెరాస నేతలో, బీజేపీ లేదా కాంగ్రెస్ నాయకులో, చేసిన ప్రకటన కాదు. ఇంకా పుట్టని, పేరైనా పెట్టని పార్టీ, నాయకురాలు  వైఎస్ షర్మిల వ్యక్తం చేసిన  విశ్వాసం. ఇది విశ్వాసమో మరొకటో, కానీ, ఆమె మాటతీరు, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ గమనిస్తే, దేవుని బిడ్డగానే, దేవుని పేరునే ఆమె రాజకీయ ప్రస్థానం సాగుతోందని, ఆమె రాజకీయ అడుగులను గమనిస్తున్న సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, రాజన్న రాజ్యం పేరున ఏసు రాజ్య స్థాపనకోసమే ఆమె ఆరాటమని అర్థమవుతుంది.  వచ్చెనెల 9న లక్ష మందితో ఖమ్మంలో తలపెట్టిన సంకల్ప సభ ఏర్పాట్లను సమీక్షరించేందుకు  పది ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో ఆమె గురువారం లోటస్ పాండ్’లో సమావేశమయ్యారు.   ఈ సందర్భంగా సంకల్ప సభ వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె, ఒంటరి ప్రకటన చేశారు. అంతే కాదు  తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని చెప్పారు.అలాగే, ఎవరో పిలిస్తే, ఎవరికో పరోక్షంగా ప్రయోజనం చేకూర్చెందుకో, రాలేదని,స్పష్టం చేశారు. టీఆర్ఎస్ చెబితే వచ్చినవాళ్లం కాదని,  బీజేపీ అడిగితే వచ్చినవాళ్లం కాదని అన్నారు. పాదయాత్ర మొదలుపెట్టిన ఏప్రిల్ 9న తొలి అడుగు వేద్దామని షర్మిల అన్నారు. అదెలా ఉన్నా ఆమె వివాదాస్పద  ఐపీఎస్ అధికారి,  స్వేరో ప్రవీణ్ కుమార్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్వేరో ప్రవీణ్ కుమార్ ఎవరో ఏమిటో, ఎలాంటి కరుడుగట్టిన హిందూ వ్యతిరేకో వేరే చెప్పనక్కర లేదు. ఆయన తమ అధికారాన్ని, ప్రభుత్వ సంపూర్ణ సహకారాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ, తెలంగాణలో క్రైస్తవ రాజ్య స్థాపనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడుగా,  ఏసు బిడ్డగా క్రైస్తవ సమాజం ప్రసంసలు అందుకుంటున్నారు. అలాంటి ఏసు భక్తుని, షర్మిల సమర్ధించడం, ఆయన షర్మిలను సమర్ధించడం, ఆ ఇద్దరినీ  మరొక దొరగారు సమర్ధించడంలో ఆశ్చర్య పోవలసిన విషయం కానీ, అనుమానించవలసిన విశేషం గానీ ఏదీ లేదు. ఎక్కడున్నా క్రైస్తవులంతా ఒక్కటే,అందరి లక్షం ఒక్కటే, ఏసు రాజ్య స్థాపనే అందరి లక్ష్యం, పేరు మాత్రమే రాజన్న రాజ్యం ... స్వేరో ప్రవీణ్’కు మద్దతు తెలపడంతో షర్మిల తమ నిజ రూపాన్ని బయట పెట్టారు.  అయితే, షర్మిల సంకల్పానికి, సంకల్ప సభకు సభకు కోవిడ్ చిక్కులు ఏర్పడ్డాయి. ప్రజల ముందు పెద్ద ఎత్తున వచ్చేందుకు ఆమె చేస్తున్న ఏర్పాట్లకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. లక్ష మందితో సభ నిర్వహణకు షర్మిల బృందం ఒకవైపు కసరత్తు చేస్తుంటే.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం 6వేల మందితో సభ నిర్వహించుకునేందుకు ఖమ్మం జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. అది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ నిర్వహించుకోవాలని సూచించారు. షర్మిల మాత్రం దేవుని మీద భారంవేసి అకేలా యతకు సిద్దమవుతున్నారు. మరో వంక ఆమె రాజకీయ సంకల్పం, ప్రస్థానం విషయంలో అనుమానాలు పూర్తిగా తొలిగి పోలేదు. ఆమె ఎంత గట్టిగా తెరాస రమ్మంటేనో ,వచ్చిన వాళ్ళం కాదు , బీజేపీ పిలిస్తేనో వచ్చిన వాళ్ళం కాదు అని చెప్పుకుంటే అంతగా అనుమానాలు బలపదుతున్నాయి.

కేసీఆర్ పై మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ 

సంచలన కామెంట్లతో రాజకీయ కాక పుట్టించే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. కేసీఆర్ ప్రధాని అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే దేశాన్ని కూడా ప్రగతిపథంలోకి తీసుకెళ్తారని చెప్పారు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ప్రజలకు సమస్యలే ఉండవని పేర్కొన్నారు. దేశ చరిత్ర మారిపోతుందని మల్లారెడ్డి జ్యోస్యం చెప్పారు.  అసెంబ్లీలో మాట్లాడిన మల్లారెడ్డి.. కేంద్ర సర్కార్ విధానాలపై విమర్శలు చేస్తూ ఈ కామెంట్లు చేశారు. కేంద్రప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ప్రైవేటీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేస్తోందని మల్లారెడ్డి మండిపడ్డారు.  ఇటీవల రాష్ట్రంలో సీఎంగా మంత్రి కేటీఆర్ ప్రకటించాలని టీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు కేబినెట్‌లోని మంత్రులు ముక్తకంఠంతో నినదించారు. ఈ నినాదంలో చేసిన వారిలో మల్లారెడ్డి ముందువరుసలో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం కేసీఆర్‌ను ప్రధానమంత్రిగా చూడాలని చెప్పడంతో ఆయన మాటలు చర్చగా మారాయి. తన వ్యాఖ్యల ద్వారా  కేటీఆర్ ను సీఎం చేయాలని మంత్రి మల్లారెడ్డి చెప్పకనే చెప్పారని అంటున్నారు. 

వాణీదేవి.. ఐరన్ లెగ్?

గొడ్డొచ్చిన వేళ.. పిల్లొచ్చిన వేళ.. దేనికైనా టైమ్ బాగుండాలంటారు. లేదంటే, మంచి జరగదనేది ఆ నానుడి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి విషయంలోనూ అలాంటి చర్చే జరుగుతోంది. ఇదేమీ సీరియస్ పొలిటికల్ డిస్కషన్ కాకపోయినా.. కొంత వెటకారమే అయినా.. వారు చెప్పే కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అవేంటో వింటే.. అవునుకదా? నిజమేకదా? అనిపిస్తున్నాయి.  అతికష్టం మీద ఎమ్మెల్సీగా గెలుపొందారు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి. ఊహించని విజయంతో గులాబీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ భవన్‌లో ఓ రేంజ్‌లో సెలబ్రేషన్స్ జరిగాయి. తీన్మార్ డ్యాన్సులతో కార్యకర్తల్లో ఉత్సాహం నిండింది. బాణాసంచా పేలుళ్లతో సంబరాలు అంబరాన్నంటాయి. అదే సమయంలో, బాణాసంచా పేలుడుతో తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. నిప్పురవ్వలు ఎగిసిపడి.. పందిరి తగలబడింది. ఎమ్మెల్సీగా వాణీదేవి ఎన్నికవగానే.. తెలంగాణ భవన్‌లో అగ్ని ప్రమాదం జరగడం కీడంటూ కొందరు వ్యాఖ్యానించారు. టపాసులు కాల్చినప్పుడు ఇలాంటివి కామన్ అంటూ మరికొందరు తీసి పడేశారు. దీంతో.. అప్పుడా విషయాన్ని అంతా లైట్ తీసుకున్నారు. కానీ.... గురువారం ఎమ్మెల్సీగా మండలికి వచ్చారు వాణీదేవి. ఆమె వచ్చిన కారు ప్రమాదానికి గురవడం కలకలం రేపింది.  అసెంబ్లీ గేట్‌ నెంబర్‌ 8ని కారు ఢీకొట్టింది. ఆ సమయంలో వాణీదేవి కారులో లేరు. కారును పార్కింగ్‌ చేస్తుండగా అదుపు తప్పిన సమీపంలోని గేటుపైకి దూసుకెళ్లింది. కారు టైరు పేలిపోయింది. ప్రమాద సమయంలో కారును ఎమ్మెల్సీ గన్‌మెన్‌ నడిపారు. కారు టైరు పేలి పెద్ద శబ్ధం రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు.  ఎమ్మెల్సీగా గెలిచిన రోజు తెలంగాణలో అగ్ని ప్రమాదం. మండలికి వచ్చిన రోజు కారు ప్రమాదం. ఈ రెండు ఘటనలతో ఎమ్మెల్సీ వాణీదేవి ఐరన్ లెగ్గా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు. రెండు కీలకమైన రోజుల్లో.. రెండు ప్రమాదాలు జరగడం యాధృచ్చికమా? లేక, కీడా? అని అనుమానిస్తున్నారు. రెండు దుర్ఘటనలకు వాణీదేవికి లింక్ ఉండటంతో.. మేడమ్‌ది ఐరన్ లెగ్ అంటూ చర్చించుకుంటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఇలాంటి ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నారు మరికొందరు హేతువాదులైన పార్టీ శ్రేణులు.