మద్యం మత్తులో ఇంటికి నిప్పు..

మద్యం మత్తులో ఇంటికి నిప్పు..  మత్తు వదలరా నిద్దర మత్తూ.. ఛీ ఛీ.. మద్యం మత్తు వదలరా.. మత్తులోనే పడితే నీ సీన్ సిరిగిపోద్ది.. అందుకే మత్తు వదలరా మద్యం మత్తువదలరా.. పొట్ట నిండా తాగి, ఎనిమిది మంది ఉన్న ఇంటికి నిప్పంటించాడు ఓ మందు బాబు.. మద్యం మత్తులో ఒక్కడు ఇంటికి తాళం వేసి ఇంటికి నిప్పు అంటించాడు. ఈ రోజు ఉద‌యం ఇంట్లోని వారంతా నిద్రపోతోన్న స‌మ‌యంలో భోజా (50) అనే తాగుబోతు ఇంటి పైక‌ప్పు ఎక్కి, పెట్రోలు పోసి ఇంటికి నిప్పంటించాడు. దీంతో  ఎనిమిది మంది మంటల్లో చిక్కుకున్నారు.  మంట‌లు అంటుకుని ముగ్గురు అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మిగ‌తావారిని ఆసుప‌త్రికి త‌ర‌లించగా మ‌రో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. వారిలో న‌లుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. కుటుంబ తగాదాల కార‌ణంగానే అత‌డు ఆగ్ర‌హంతో ఊగిపోతూ ఈ దారుణానికి పాల్పడిన‌ట్లు తెలిసింది. కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్ తాలూకా ముగుట‌గెరె గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.  ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు  పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.   

జగన్ కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జగన్ కు గుడ్ బై చెప్పేశారు ఆ పార్టీ కీలక నేత.  తన  నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల ప్రకారం వైసీపీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. జాతీయ పార్టీలో చేరాలనుకుంటున్నానని ఆ నేత తెలిపారు. తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిలకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. కీలక నేత రాజీనామా చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది.  వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఆ పార్టీ తెలంగాణ  అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి.  తన జీవితంలో ఇది దుర్దినం అన్నారు. సామాన్యుడిగా ఉన్న తనకు రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్ నియమించారని చెప్పారు. జాతీయ పార్టీలో చేరి భవిష్యత్ లో  హుజూర్ నగర్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తానని తెలిపారు. 2007 నుంచి తనకు జగన్ తో సంబంధం ఉందన్నారు శ్రీకాంత్ రెడ్డి. అప్పుడు కాంగ్రెస్ లో చేరి.. తర్వాత  వైఎస్ జగన్ తో కలిసి నడిచానని తెలిపారు. వైఎస్ జగన్ భవిష్యత్ లో ఇంకా గొప్ప స్థానాలు అధిరోహించాలని కోరుకున్నారు గట్టు.  తెలంగాణలో పోరాటాలు చేయలేదనే ఆరోపణలు తమపై వచ్చాయన్నారు గట్టు శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్రం వచ్చి ఏడు సంవత్సరాలైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక పోవడం అన్యాయమన్నారు. గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా వైసీపీలో కలకలం రేపుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. అంతేకాదు టీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు అన్యాయం చేస్తున్నా వైసీపీ స్పందించలేదని కామెంట్ చేశారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని జగన్ ఆదేశించారనే సంకేతం వచ్చేలా గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేయడం, మిగిలిన వారు షర్మిలకు మద్దతుగా ఉంటుండటంతో తెలంగాణలో వైసీపీ దుకాణం బంద్ అయినట్టేననే చర్చ జరుగుతోంది. 

2024లో యూటీగా హైదరాబాద్? మేడ్చల్, రంగారెడ్డిపై కేసీఆర్ ఫోకస్ 

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా? 2024లో యూటీ కావడం ఖాయమా?.. ఈ ప్రశ్న రాష్ట్ర విభజనకు ముందు నుంచి వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనే  హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారనే ప్రచారం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని యూటీగా చేసి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేస్తారని చర్చ జరిగింది. కొందరు సమైక్యాంధ్ర నేతలు కూడా ఇదే డిమాండ్ చేశారు. అయితే రాష్ట్ర విభజనతో హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రమే ఏర్పడింది. కాకుంటే పదేళ్ల పాటు హైదరాబాద్ ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచారు. ఆ గడువు 2024తో ముగియనుంది.  ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు మూడేండ్లలో ముగియనుండటంతో మళ్లీ కేంద్ర పాలిత ప్రాంతం కానుందనే  అంశం తెరపైకి వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిని యూటీగా చేయాలని.. అవసరమైతే దేశానికి రెండో రాజధానిగా ప్రకటించాలనే నిర్ణయానికి కేంద్ర సర్కార్ వచ్చిందంటున్నారు. అందుకే కొన్ని రోజులుగా దీనిపై లీకులు ఇస్తున్నారని చెబుతున్నారు. ఫిబ్రవరిలో లోక్ సభలోనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దీనిపై మాట్లాడారు. హైదరాబాద్ ను యూటీగా మార్చాలని కేంద్రం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. హైదరాబాద్ ను యూటీ చేస్తున్నారంటూ  అసద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అసద్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించినా... యూటీపై వస్తున్న వార్తలు మాత్రం ఆగడం లేదు.  తాజాగా రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల అభివృద్ధికి కేసీఆర్ కసరత్తు చేస్తుండటం ఇందుకు బలాన్నిస్తోంది. శుక్రవారం  ఈ రెండు జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు కేసీఆర్. ఈ రెండు జిల్లాలు భవిష్యత్తులో హైదరాబాద్‌కు పోటీగా అభివృద్ధి చెంది నగర ముఖచిత్రాన్ని మరింత గుణాత్మకంగా మార్చివేస్తాయన్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ జిల్లాల్లో సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధ్యక్షతన నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ ను యూటీ చేయాలనే కేంద్ర ఆలోచనపై సీఎం కేసీఆర్ కు సిగ్నల్స్ వచ్చాయని అంటున్నారు. అందుకే కేసీఆర్ మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలపై ఎక్కువ ఫోకస్ చేశారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి ఇస్తోంది. హైదరాబాద్ ను యూటీగా ప్రకటించినా... మేడ్చల్ , రంగారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే తెలంగాణకు డోకా ఉండదని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం.  రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల అభివృద్ధిపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ చేయడానికి కేంద్ర పాలిత ప్రాంతం కానుందనే సమాచారమే కారణమంటున్నారు. నిజానికి హైదరాబాద్ ను యూటీ చేస్తే వరంగల్ ను రాజధానిగా మార్చాలని మొదట కేసీఆర్ నిర్ణయించారట. అయితే ఇప్పుడు ఆయన తన ఆలోచన మార్చుకున్నారని చెబుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం అభివృద్ధి శర వేగంగా సాగుతోంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఐటీ సంస్థలన్ని కోలువున్నాయి. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలన్ని అక్కడే ఉన్నాయి. అందుకే  జీహెచ్ఎంసీని కేంద్రం యూటీగా మార్చినా..  తెలంగాణకు నష్టం లేకుండా ఈ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేసుకోవాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా హైదరాబాద్ శివారు ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయకుండా.. ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ చుట్టూ ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటితో పాటు అభివృద్ధి వేగంగా ఉన్న ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మార్చారు.  రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కేసీఆర్ కుటుంబంతో పాటు ఆయన సన్నిహితులకు భారీగా భూములు ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్ యూటీ ఎయితే రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయాలని భావించడానికి  ఇది కూడా ఒక కారణమంటున్నారు. అందుకే వరంగల్ ప్రతిపాదనను పక్కనపెట్టి... ఈ ప్రాంతంపై కేసీఆర్ ఫోకస్ చేశారని అంటున్నారు. రీజనల్ రింగు రోడ్డు కోసం కేంద్రంపై టీఆర్ఎస్ సర్కార్ ఒత్తిడి పెంచడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. రీజనల్ రింగు రోడ్డు వస్తే మేడ్చల్, రంగారెడ్డితో పాటు సిద్ధిపేట, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలకు మహార్దశ పట్టనుంది. ఈ ప్రాంతంలోనూ కేసీఆర్ కుటుంబానికి భారీగా ఆస్తులు ఉన్నాయనే ప్రచారం ఉంది. మొత్తంగా మేడ్చల్ , రంగారెడ్డి జిల్లాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళిక రచించడానికి .. హైదరాబాద్ యూటీ కానుండటమే కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ ను యూటీ చేసినా తనకు ఇబ్బంది లేకుండా కేసీఆర్ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

బాధ, ఆవేదనతోనే.. తొలిసారి ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ 

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తెలుగు దేశం పార్టీ బహిష్కరించడం చర్చగా మారింది. రాజకీయ వర్గాల్లో భిన్న స్పందనలు వస్తున్నాయి. పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించడంతో  టీడీపీ అధినేత చంద్రబాబు వివరణ ఇచ్చారు. బాధ, ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే అవకాశం లేదన్నారు. నాలుగు వారాల కోడ్ ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశం ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బొమ్మగా చేసి ఎన్నికలను పరిహాసాస్పదంగా మారుస్తున్న జగన్‌ ప్రభుత్వ వ్యవహార శైలికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ‘నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణలో ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలోనూ పోటీ చేశాం. తీవ్రవాదుల ప్రభావం బాగా బలంగా ఉన్న చోట్ల కూడా చేశాం’ అని చంద్ర బాబు చెప్పారు.  రాజకీయ చరిత్రలో టీడీపీ  ఎన్నికల బహిష్కరించడం ఇదే తొలిసారి.  పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఎప్పుడూ ఎన్నికలను బహిష్కరించలేదు. తెలంగాణ ఉద్యమం వంటి సమయాల్లోనూ ఎన్నికల్లో పోటీ చేసింది. మధ్యలో కొన్నిసార్లు కొన్ని ఉప ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. నాటి ప్రధాని పీవీ నరసింహరావు పోటీ చేసిన నంద్యాల లోక్‌సభ స్థానంలో, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీజేఆర్‌ మరణం తర్వాత జరిగిన ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాగ్యా నాయక్‌ను నక్సలైట్లు హత్య చేసిన తర్వాత వచ్చిన ఉప ఎన్నిక, వైసీపీ నేత శోభా నాగిరెడ్డి మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నిక లో ఆ పార్టీ పోటీ చేయలేదు. ఏక మొత్తంగా ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి.  టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం పొలిట్‌బ్యూరో, రాష్ట్ర స్థాయి నేతల సమావేశం నిర్వహించారు. ఎన్నికల బహిష్కరణపై టీడీపీ నేతల నుంచి భిన్న స్వరాలు వినిపించాయి. ఎన్నికలను బహిష్కరించడమే మేలని కొందరు వాదించగా వారితో మరికొందరు విభేదించారు. అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్యచౌదరి, యనమల రామకృష్ణుడు, కూన రవికుమార్‌ వంటివారు.. ఎన్ని సమస్యలున్నా ఎన్నికల్లో పోరాడుతూనే ఉండాలని, అప్పుడే కేడర్‌ను నిలబెట్టుకోగలమని అభిప్రాయపడ్డారు. కానీ మెజారిటీ నేతలు బహిష్కరణకే మొగ్గు చూపారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున పోటీలో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కూడా చంద్రబాబు మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు. మెజారిటీ నేతల అభిప్రాయం ప్రకారం ఎన్నికల బహిష్కరణ  నిర్ణయాన్ని ప్రకటించారు.  

ప్రచారంలో కస్సుబుస్సుమన్న నమిత.. .

నటి నమిత ప్రచారం చేయడానికి వెళ్ళింది.. అసలు అభ్యర్థే పత్తాలేదు.. తొమ్మిదినరకు ప్రారంభం కావాల్సిన ప్రచారం 10 :15 స్టార్ట్ అయింది..  నటి నమితకు చిర్రెత్తే. దాంతో ప్రచారం గిచారం జాంతానై.. కేల్కతం దుకాణ్ బంద్ అంటూ.. అభ్యర్థులు ప్రచారంలో లేకపోతే  నేను చెన్నై చెక్కేస్తా అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. ఈ ఘటన రామనాధపురంలో జరిగింది.  బీజేపీ పార్టీ  అభ్యర్ధులకు మద్దతుగా ఆ పార్టీ నాయకురాలు నటి నమిత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నమిత ప్రచారంతో కార్యకర్తలు మాత్రం కేరింతలు కొడుతూ రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో.. రామనాథపురం బీజేపీ అభ్యర్ధి కుప్పు రాముకు మద్దతుగా నమిత గురువారం రామేశ్వరం మున్సిపాలిటీల్లో నాలుగు ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు.  ఉదయం 9.30 గంటలకు మరుదుపాండియన్‌ విగ్రహం సమీపం నుంచి ఆమె ప్రచారం ప్రారంభించాల్సి ఉండగా, 10.15 గంటలకు కూడా అభ్యర్ధి కుప్పు రాము రాలేదు. దీంతో, మరుదుపాండియన్‌ విగ్రహం సమీపంలో ప్రచారం రద్దు చేసుకున్న నమిత, బస్టాండ్‌, దేవర్‌ విగ్రహం ప్రాంతంలో ప్రచారానికి వెళ్లారు. అప్పటికీ కూడా అభ్యర్ధి జాడలేకపోవడంతో ఆగ్రహించిన నమిత ప్రచారం రద్దు చేసుకొని హోటల్‌కు వెళ్లిపోయారు. సాయంత్రం ప్రచారానికి రావాలని బీజేపీ కార్యకర్తలు కోరడంతో, ఆగ్రహించిన నమిత శివంగిలా ఊగిపోయారు  ‘అభ్యర్ధి లేకుండా ప్రచారం చేయబోనని, ఇలాగైతే చెన్నై వెళ్లిపోతానని మండిపడ్డారు.. అయినా ఆ అభ్యర్థి పట్టించుకుంటేగా?

సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థికి వర్మ సపోర్ట్

సంచనాలకు కేరాఫ్ గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ  మరోసారి కేక పుట్టించారు. సినిమాలపై కాకుండా ఓ ఎన్నికపై ఆయన చేసిన ట్వీట్  ఇప్పుడు వైరల్ గా మారింది. తెలంగాణలో రాజకీయ రచ్చగా మారింది. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నోముల భగత్ కు మద్దతుగా ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ.  దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య  కొడుకు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్అభ్యర్థి నోముల భగత్... ఓ చిరుత పులితో వాకింగ్ చేస్తూ వెళ్తున్న చిన్న వీడియోను వర్మ ట్వీట్ చేశారు. "వామ్మో... కేసీఆర్, కేటీఆర్‌లు టైగర్‌, సింహాలు అని మనకు తెలుసు. కానీ, అభ్యర్థి నోముల భగత్ చిరుత పులిని వాకింగ్‌కి తీసుకెళ్తుండడం నాకు నచ్చింది. ఒకవేళ నాకే కనుక నాగార్జున సాగర్‌ ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ ఉంటే 17న నా ఓటు ఇతనికే వేసేవాణ్ని’’ అని వర్మ ట్వీట్ చేశారు. ‘ ఈ అభ్యర్థి నోముల భగత్... "మాకు ఓటు వేయండి. నాగార్జునసాగర్‌లో మన గర్జనకు ఏ ఒక్క పార్టీ నిలబడలేదు" అంటున్నారు. చిరుత పులితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్న వ్యక్తిని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు’’అని మరో ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ.  రాంగోపాల్ వర్మ ట్వీట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్వీట్‌కి అనుకూలంగా, వ్యతిరేకంగా చాలా మంది రిప్లైలు ఇస్తున్నారు. చిరుతపులితో నోముల భగత్ నిజంగానే వెళ్లారా... వెళ్తే... ఎక్కడ వెళ్లారు... ఎప్పుడు వెళ్లారనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీడియోని గమనించిన చాలా మంది నెటిజన్లు అది గ్రాఫిక్ కాదనీ... నిజమైన వీడియోనే అని అంటున్నారు. చిరుతపులి, నోముల భగత్ నీడలను బట్టీ... నిజంగానే చిరుతపులి తో వాకింగ్ చేశారని అంటున్నారు. ఇది నిజమే అయితే... ఇండియాలో ఇలా చెయ్యడానికి అనుమతి ఇవ్వరు. చుట్టూ ఉన్న గడ్డిని బట్టీ... అది ఆఫ్రికా సహారా ఎడారి లాంటిది కావచ్చని కొందరు అంటున్నారు. అక్కడి సఫారీల్లో ఇలా చిరుతలతో ప్రజలు దగ్గరగా ఉండేలా వాటికి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు కాబట్టే... ఇది అక్కడిదే అంటున్నారు కొందరు.

గూగుల్ పే.. ఫోన్ పే వాడుతున్నారా.. అయితే.. 

ఇక ఫోన్ తో ఏటీఎం లో నగదు విత్డ్రా డెబిట్ కార్డు లేకుండానే.. ఎలా  అనుకుంటున్నారా గూగుల్ పే, ఫోన్ పే ఉండగా చింతేందుకు దండగ.. నేరుగా గూగుల్ పే ఫోన్ పే తో క్యాష్  విత్డ్రా చేసూకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే, అమెజాన్‌ పే వంటి మొబైల్‌ వ్యాలెట్‌ యాప్‌ల్లో ఏదైనా ఒకటి ఉంటే చాలు. ఈ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) ఆధారిత యాప్‌తో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఏటీఎం తయారీ సంస్థ ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. యూపీఐ ఆధారిత ఇంటరాపరబుల్‌ కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయల్‌ (ఐసీసీడబ్ల్యూ) ఏటీఎంలను తయారు చేసింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), సిటీ యూనియన్‌ బ్యాంక్‌ భాగస్వామ్యంలో తొలుత వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. తమకు చెందిన 1,500కు పైగా ఏటీఎంలను ఇప్పటికే ఈ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌తో అప్‌గ్రేడ్‌ చేసినట్లు సిటీ యూనియన్‌ బ్యాంక్‌ వెల్లడించింది. దేశంలోని మరిన్ని ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ బ్యాంకుల    ఏటీఎంల్లోనూ ఈ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ విషయమై ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌, ఎన్‌పీసీఐ కలిసి పలు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నాయి. ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ ఇండియా ఎండీ నవరోజ్‌ దస్తూర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.  ఏటీఎం లో నగదు విత్ డ్రా ఇలా..  1  ఏటీఎం నుంచి నగదు కావాలంటే  ముందుగా మీ మొబైల్‌లోని యూపీఐ ఆధారిత యాప్‌ను ఓపెన్‌ చేయాలి. ఆ యాప్‌        మీ బ్యాంక్‌ ఖాతాతో అనుసంధానితమై ఉండాలి.   2  ఏటీఎంలో క్యూఆర్‌ క్యాష్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తద్వారా ఏటీఎం తెరపై కన్పించే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి.  3  స్కానింగ్ ‌ పూర్తయ్యాక నగదు విత్‌డ్రా వివరాలను ఎంటర్‌ చేసి, ‘ప్రొసీడ్‌’ బటన్‌ను నొక్కాలి. 4  ఆ తర్వాత 4 లేదా 6 డిజిటల్‌ యూపీఐ పిన్‌కోడ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా ఏటీఎం మెషీన్‌ నుంచి నగదు పొందవచ్చు.  5  ఈ పద్ధతిలో ఒకసారికి గరిష్ఠంగా రూ.5,000 మా త్రమే ఉపసంహరించుకునే వీలుంటుంది. భవిష్యత్‌లో ఈ పరిమితిని            మరింత పెంచే అవకాశముంది.   ఎస్‌బీఐ యోనో క్యాష్‌ తరహాలో.. దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. యోనో లైట్‌ యాప్‌ కస్టమర్లకు ఇప్పటికే ఈ తరహా సేవలందిస్తోంది. డెబిట్‌ కార్డు అవసరం లేకుండా క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ ద్వారా ఎస్‌బీఐ ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది.   

వంద కోసం చంపేశారు.. 

కోట్లు కాదు. లక్షలు కాదు. వంద రూపాయలు  ప్రాణం తీసింది. వినేవాడు చూపించే ఏమైనా చెప్తారు అనుకుంటున్నారా.. నిజంగానే.. మేడం.. సర్ అదేంటి నవ్వుతున్నారా.. నమ్ముతారా లేదా..  ఆ..బొక్కలే.. వంద రూపాయలు ప్రాణం తియ్యడం ఏంటి..? వీడి బోండా ..అనుకుంటున్నారా..? అయినా సరే..  మీరు నమ్మి తీరాల్సిందే.. ఎందుకంటే  నేను చెప్పేది కథ కాదు.. కట్టు కథ అంతకన్నా కాదు.    కలిసి రోజు పనికి వెళ్లే వాళ్ళు. కలిసి మద్యం తాగేవాళ్ళు.. అప్పటి వరకు కలిసే ఉన్నారు.. ఇంతలో ఏమైందో తెలీదు.. తన తోటి స్నేహితుడ్ని కత్తితో పొడిచి చంపాడు.. ఈ ఘటన విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... వాంబేకాలనీ ప్రాంతానికి చెందిన సెంట్రింగ్‌ మేస్త్రీ షేక్‌ రఫీ వద్ద అదే ప్రాంతానికి చెందిన యడ్లవల్లి నాగరాజు అలియాస్‌ పండు(27) సెంట్రింగ్‌ పనులకు వెళ్తుంటాడు. ఖర్చుల కోసం రూ.100 ఇవ్వాలని రఫీని పండు రెండు రోజులుగా అడుగుతున్నాడు. రెండు రోజులుగా అడుగుతున్న రూ. 100  ఇవ్వకపోవడంతో ఇదే విషయమై గురువారం సాయంత్రం రఫీ ఇంటి వద్ద వీరిద్దరూ గొడవపడటంతో పెద్దలు సర్దుబాటు చేసి పంపేశారు. శుక్రవారం ఉదయం 10గంటల రఫీ ఇంటికి వెళ్ళాడు. పండుని ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లాడు. రాజీవ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ షేక్‌ హుసేన్‌, మరో సెంట్రింగ్‌ కార్మికుడు కిశోర్‌ని కలిశారు.. అందరు కలసి  పైపులరోడ్డు సెంటర్‌ సమీపంలోని దుర్గా బార్‌లో మద్యం తాగారు. అక్కడినుంచి వెళ్లిపోయిన గంట తర్వాత మళ్లీ కలిశారు. నున్న రూరల్‌ పోలీసు స్టేషన్‌ సరిహద్దు ప్రాంతంలో బైక్‌లు పెట్టారు. దుర్గాబార్ ‌పక్క రోడ్డులో మళ్ళీ గొడవ పడ్డారు. పండును హుసేన్‌, కిశోర్‌ పట్టుకోగా రఫీ కత్తితో పొడిచి చంపాడు. ఈ కొట్లాటలో నిందితులు ముగ్గురికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ లక్ష్మీనారాయణ వెంటనే సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న పండును, గాయాలపాలైన రఫీ, హుసేన్‌, కిశోర్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే పండు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగిలిన ముగ్గురికీ చికిత్స అందిస్తున్నారు. పండును అంతమొందించే ఉద్దేశంతోనే రఫీ ఉదయం నుంచి వెంటబెట్టుకొని తిరుగుతూ స్నేహితుల సహాయంతో హత్య చేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. 

భారత్ లో కరోనా విలయమేనా?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గిన వైరస్.. మార్చి నుంచి మళ్లీ పంజా విసురుతోంది. మహారాష్ట్రలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని 11 రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోందని వైద్య వర్గాలు హెచ్చరించాయి. తాజాగా మనదేశంలో కరోనాకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. ఏప్రిల్  రెండో వారం తర్వాత దేశంలో కరోనా వైరస్ విజృంభణ గరిష్ఠ స్థాయికి చేరుతుందని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మే చివరి వరకు అలానే కొనసాగి ఆ తర్వాత క్రమంగా తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది సెప్టెంబరులో వైరస్ గరిష్ఠ స్థాయికి చేరుకుని ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి తగ్గిందని, ప్రస్తుతం రెండో దశలోనూ వైరస్ ఉద్ధృతి అలానే ఉండే అవకాశం ఉందని  ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తీరును చూస్తే ఏప్రిల్ 15-20 మధ్య గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్రా అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉందని, మున్ముందు ఆ సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి మహారాష్ట్ర, పంజాబ్‌లలో కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని తెలిపారు. హర్యానాలోని అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్ మీనన్ మాత్రం ఏప్రిల్, మే నాటికి వైరస్ విజృంభణ తీవ్రస్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. వైరస్ వ్యాప్తి రేటు, అది సోకే అవకాశం ఉన్న జనాభా, పాజిటివ్ కేసుల సంఖ్యను ఆధారంగా చేసుకుని శాస్త్రవేత్తలు ఈ అంచనాకొచ్చారు.   

పవన్ కు షాకిచ్చిన రత్నప్రభ.. సోము వీర్రాజు పరువు గోవిందా!

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి రిటైర్జ్ ఐఏఎస్ రత్నప్రభ పోటీ చేస్తున్నారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ పై కీలక ప్రకటన చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. తమ కూటమి తరపున పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించారు. సోము వీర్రాజు ప్రకటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం బీజేపీలో ప్రకంపనలు రేపుతుండగా.. సీఎంలను ముందే ప్రకటింతే సాంప్రదాయం లేని బీజేపీ.. ఎలాగూ గెలిచే అవకాశం లేదని భావించే ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ను ప్రకటించారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.   తాజాగా తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ .. పవన్ కల్యాణ్ కు షాకిచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి కాదంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓ మీడియా  ఛానల్ డిబేట్ లో  మాట్లాడిన రత్నప్రభ.. పలు అసక్తికర విషయాలు వెల్లడించారు. ఏపీకి కాబోయే సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పిన విషయం తనకు తెలియదన్నారు. పవనే సీఎం అభ్యర్థి అంటూ మీడియాలో ఎలా వచ్చిందన్న విషయం కూడా తెలియదని వ్యాఖ్యానించారు. పవన్ పై రత్నప్రభ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజే పవన్ సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించినా.. రత్నప్రభ తెలియదు అన్ని పేర్కొనడం చర్చనీయాంశమైంది. రత్నప్రభ వ్యాఖ్యలతో సోము వీర్రాజు పరువు పోయిందనే ప్రచారం సాగుతోంది.  తిరుపతి ఉపఎన్నికలో ఇరు పార్టీల కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు రత్నప్రభ. బీజేపీకి జనసేన మద్దతు లేదన్న ప్రచారం సరికాదన్నారు. . తన అభ్యర్థిత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంతృప్తిగా ఉన్నారన్నారు.తిరుపతిలో ప్రచారం కూడా చేస్తారని చెప్పారు. తిరుపతిలో ఉన్న సమస్యలు తనకు తెలుసని చెప్పారు. ప్రస్తుతం తిరుపతిలో పరిశ్రమలు లేవని, తనను గెలిపిస్తే తిరుపతిలో పరిశ్రమలకు తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని రత్నప్రభ అన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించే విధంగా ప్రయత్నిస్తానని చెప్పారు. తిరుపతిలో మతమార్పిడి జరుగుతున్నాయని ఆరోపించిన రత్నప్రభ.. హిందువులపై దాడులు కూడా పెరిగాయన్నారు. తిరపతిలో హిందూ ధర్మాన్ని కాపాడతామన్నారు. దుబ్బాక ఫలితమే తిరుపతిలోనూ రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తిరుపతిలో తాను గెలుస్తానని, ప్రజల మద్దతు తమకే ఉందని రత్నప్రభ విశ్వాసం వ్యక్తం చేశారు. 

పాలించే వాడికి  మెరిట్ ఉండాలి.. ఈటల మరో సంచలనం

ఇటీవల కాలంలో హాట్ కామెంట్స్ తో  హీట్ పుట్టిస్తున్న తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి మాటల తూటాలు పేల్చారు. రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం కార్యక్రమంలో ఆయన  సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలించే వాడికి కూడా మెరిట్ ఉండాలన్నారు. ఉద్యమాలు ప్రజల కోసం చేస్తే వారికి గొంతు కలపాలని సూచించారు.. ప్రజల ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలన్నారు ఈటల రాజేందర్. ‘‘నేను మంత్రి కావొచ్చు, కానీ ముందుగా మనిషిని. మెరిట్ లేనిదే టీచర్ కారు.మెరిట్ లేనిదే మెడికల్ సీటు రాదు. దేశ పౌరునిగా, సగటు మనిషిగా స్పందించాలి. ఎర్రకోట సాక్షిగా మన రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ అది సక్రమంగా అమలు కావడం లేదని ఈటల రాజేందర్  అన్నారు.  అంబానీ ఒక్కడి సంపద పెరిగితే పేదరికం పోదని, సంపద కేంద్రీకృతమే పేదరికానికి కారణమని మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శించారు. అందుకే మనం క్రిమిలేయర్ గురించి మాట్లాడుకుంటున్నామన్నారు. ఎలుకల బాధకు ఇంటిని తగలబెట్టుకోవద్దని వ్యాఖ్యానించారు. ఢిల్లీ రైతు బాధ ఏదో ఒక రోజు నీ గడప కూడా తొక్కుతుందని ఈటల హెచ్చరించారు. 

దేశంలో కరోనా పంజా.. 11 రాష్ట్రాలు యమ డేంజర్ 

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత  పెరిగిపోతోంది. వైరస్ సెకండ్ వేవ్ ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.11 రాష్ట్రాల్లో ‘తీవ్రమైన ఆందోళనకర పరిస్థితులు’ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గత 14 రోజులలో ఈ రాష్ట్రాల నుంచి 90 శాతం కేసులు వచ్చాయని వెల్లడించింది. గత కరోనా దశ కంటే ఈసారి 11 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.  మహారాష్ట్రలో అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయని చెప్పారు రాజీవ్ గౌబా. మహారాష్ట్ర విషయంలో మాత్రం తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. కోవిడ్ కేసుల విషయంలో తక్షణమే మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కోవిడ్‌ను అరికట్టడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న అన్ని వనరులనూ ఉయోగించాలని, ఆరోగ్య శాఖే కాదు, ఇందుకు అన్ని శాఖలూ ప్రభుత్వాలకు సహకరించాలని రాజీవ్ గౌబా విజ్ఞప్తి చేశారు. 

వివేకా హత్య కేసు అనుమానితుల్లో వైసీపీ ఎంపీ! 

తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడే క్రమంలో అలిసిపోతున్నామని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సునీతా రెడ్డి.. ఈ హత్య అనంతరం తమ జీవితాల్లో ప్రశాంతత అనేది లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. అందుకు ప్రజల మద్దతు తీసుకుందామనే తాను ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానని చెప్పారు. తన తండ్రి హత్య కేసులో తమకు తెలిసిన విషయాలను ఎవరైనా వెల్లడించకపోతారా అని భావిస్తున్నామని సునీతా రెడ్డి తెలిపారు.  తన తండ్రి వివేకా హత్యకేసులో 15 మంది అనుమానితుల జాబితాను దర్యాప్తు అధికారులకు అందజేసినట్టు సునీతా రెడ్డి వెల్లడించారు. ఆ అనుమానితుల్లో ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా ఉన్నాడని తెలిపారు. భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిల పేర్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ జాబితాలో మొదటిపేరు వాచ్ మన్ రంగన్న అని, అతని వ్యవహార శైలి ఎంతో అనుమానాస్పదంగా ఉందన్నారు. ఆ తర్వాత పేరు ఎర్ర గంగిరెడ్డి అని, ఆయన తన తండ్రికి ఎంతో సన్నిహితుడని, హత్య జరిగిన తర్వాత ఘటన స్థలంలో మరకలు శుభ్రం చేయించింది ఆయనే అని ఆరోపించారు.  పరమేశ్వర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు సంబంధించి అనేక సందేహాలున్నాయని వైఎస్ వివేకా  కూతురు చెప్పారు. తమ కుటుంబంలో తమకు కొందరు మద్దతుగా నిలుస్తున్నారని వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిశానని తెలిపారు. దర్యాప్తు సంస్థలు ఈ కేసుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సునీతారెడ్డి కోరారు. 

రబ్బరు స్టాంప్ గా ఎస్‌ఈసీ! ఎన్నికలు బహిష్కరించిన టీడీపీ

ఏపీలో స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా మారాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పరిషత్‌ ఎన్నికల తేదీలను మంత్రులు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల బహిష్కరణ కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలంటే టీడీపీకి భయంలేదన్నారు. ప్రజా కోర్టులో అధికార పార్టీని దోషిగా నిలబెడతామని చంద్రబాబు హెచ్చరించారు. కొత్త ఎస్‌ఈసీ వచ్చీ రాగానే పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారని ఆక్షేపించారు. పరిషత్‌ ఎన్నికల్లో ఎస్‌ఈసీ రబ్బర్‌స్టాంపుగా మారారని ఆరోపించారు. 2014లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో 2 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవమైతే తాజా ఎన్నికల్లో 24 శాతం ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. 2014లో 1శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవమైతే ఈసారి 19శాతం అయ్యాయని గుర్తు చేశారు. అధికార వైకాపా దౌర్జన్యాలు, అక్రమాలతోనే బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తామనే అభ్యర్థులను పోలీసులు బెదిరించారని మండిపడ్డారు.   బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోకపోడాన్ని ఆయన తప్పుబట్టారు. జాతీయ స్థాయిలోనూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అక్రమాలు జరిగిన ఎన్నికలను కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో కరోనా కారణంగా ఎన్నికలు వద్దని మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చెబితే తప్పుపట్టారని, ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ ఉందని, ఎన్నికలు ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. కొత్త నోటిఫికేషన్‌ ఇస్తే పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రకటించారు.     

ప్రగతి భవన్ లో కేటీఆర్ సన్మానాలు.. ఏ హోదాలో చేశారో సారూ? 

ప్రగతి భవన్.. తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం.. ప్రస్తుతం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో పాటు ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ముఖ్యమంత్రి నివాసంలో ఉంటూ కేటీఆర్ చేస్తున్న కార్యక్రమాలే వివాదంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్.. పార్టీ కార్యక్రమాలకు ప్రగతి భవన్ ను వేదిక చేసుకున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. తాజాగా ప్రగతి భవన్ లో మరో మంత్రితో పాటు ఉన్నతాధికారులకు ఆయన సన్మానం చేయడం దుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ పంచాయ‌తీ స‌శ‌క్తి క‌ర‌ణ్ పుర‌స్కారాలు ఇస్తుంది. ఈ ఏడాది అత్యుత్త‌మ స్థానిక సంస్థ‌లుగా 12 పుర‌స్కారాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్రానికి అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్..  రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి  ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకి శుభాకాంక్ష‌లు తెలిపి, స‌త్క‌రించారు. పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌న‌ర్ ర‌ఘునంద‌న్ రావుల‌ని స‌న్మానించారు. ఈ కార్యక్రమం ప్రగతి భవన్ లో జరగడం ఇప్పుడు కాక రేపుతోంది.  ప్రగతి భవన్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం. అక్కడ కేసీఆర్ తనయుడిగానే కేటీఆర్ ఉంటున్నారు తప్ప మంత్రిగా కాదు. ప్రగతి భవన్ లో ఏ అధికారిక కార్యక్రమైనా ముఖ్యమంత్రే చేయాలి. కేటీఆర్ చేయడానికి వీలుండదు. అలాంటిది ప్రగతి భవన్ లో మంత్రితో పాటు ఉన్నతాధికారులను కేటీఆర్ సన్మానించడంపై విమర్శలు  వస్తున్నాయి. అసలు ఏ హోదాలో కేటీఆర్.. మంత్రి ఎర్రబల్లితో పాటు ఉన్నతాధికారులను సన్మానించారన్నది రచ్చగా మారింది. రాజకీయంగా  కేటీఆర్ కంటే ఎర్రబెల్లి చాలా సీనియర్.  పదవి పరంగా చూసినా ప్రస్తుతం ఇద్దరూ మంత్రులే. పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి కేంద్రం అవార్డులు వస్తే.. ఆ శాఖ మంత్రిని సత్కరిస్తే ముఖ్యమంత్రి సత్కరించాలి. అధికారులను కూడా సీఎం లేదా సీఎస్ సత్కరించాలి. కాని ఎర్రబెల్లి నిర్వహిస్తున్న మంత్రి పదవికి సమాన హోదాలోనే ఉన్న కేటీఆర్.. ఎర్రబెల్లిని సత్కరించడం ఏంటనే చర్చ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. అది కూడా ప్రగతి భవన్ లో చేయడమేంటనీ ప్రశ్నిస్తున్నారు. అసలు తన కన్నా సీనియర్ అయిన  రాజకీయ నేతను కేటీఆర్ సన్మానించడమే విడ్డూరమంటున్నారు.   తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నా... పాలనంతా కేటీఆర్ డైరెక్షన్ లోనే సాగుతుందని కొంత కాలంగా ఆరోపణలు ఉన్నాయి. విపక్షాలు కూడా కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. మంత్రులు, ఉన్నతాధికారులంతా ప్రగతిభవన్ లో కేటీఆర్ ను కలుస్తుండటం విపక్షాలకు ఆరోపణలు బలాన్నిస్తున్నాయి. అయినా తన తీరు మార్చుకోవడం లేదు కేటీఆర్. తాజాగా ఎర్రబెల్లి దయాకర్ రావును కేటీఆర్ సన్మానించడంపై కాక రేపుతోంది. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎర్రబెల్లిని సన్మానించారా లేక మంత్రిగా చేశారా చెప్పాలంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయితే పార్టీ ఆఫీసులో చేసుకోవాలి కాని ప్రగతిభవన్ వేదిక కాదంటున్నారు. మంత్రిగా చేస్తే..ఏ హోదాలో చేశారో చెప్పాలంటున్నారు. కేటీఆర్ తనకు తానే సీఎంగా భావిస్తున్నట్లుగా ఆయన వ్యవహారం ఉందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. 

కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా..?

కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ? అన్న అనుమానం చలా మంది ప్రజల్లో సందేహాలు కలిగిస్తున్నాయి. ప్రపంచంలో వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న సంస్థలు ఎన్ని ఉన్నాయి అన్న ప్రశ్నకు సమాధానంగా కొంత సమాచారం మీముందు ఉంచుతున్నాము. ప్రపంచం మొత్తం మీద ఉత్పాదక సంస్థలు 1 3 ఉన్నాయని తేల్చారు. కోవిడ్ వ్యాక్సిన్లు ప్రపంచం మొత్తం వాడు తున్నారు. మిలియన్ల ప్రజలు ఇప్పటికే మొదటి విడత డోస్ లు తీసుకున్నారు. ప్రతి రోజూ ఒకటవ రెండవ డోస్ లు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మనం ప్రతి వ్యాక్సిన్ వివరాలు చూద్దాం. ఈ వ్యాక్సిన్ తీసుకోడం వల్ల  ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో చూద్దాం. ఎవరైనా క్యూలో నిలబడి వ్యాక్సిన్ తీసుకుందామని అనుకునే వారిలో రకరకాల సందేహాలు వస్థాయి. అదీ వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి. అలా ఎందుకు జరుగుతుంది. ఒకరికి కాక ఎక్కువ మందికి ఎందుకు జరుగు తుంది? వ్యాక్సిన్ సురక్షితమా కాదా? ఎలర్జీలు ఉంటె వ్యాక్సిన్ వేయరా? వేయించుకో కూడదా ? గత వారం రోజులగా మా తెలుగు వన్ హెల్త్ విభాగం వివిద ఆసుపత్రులలో వ్యాక్సిన్ ఇస్తున్న తీరు, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీ బోడీల తయారీ ఎలాఉంటుంది ?వ్యాక్సిన్ తీసుకున్న వారికి లో  వస్తున్నరీ యాక్షన్ ఏమిటి అన్న అంశాల పైన ఆధ్యనం చేస్తున్నారు. అయితే కొంత లాభం కొంత రిస్క్ ఉన్నది అన్నట్లుగానే ఉన్నదని  నిపుణులు ఆభిప్రాయా పడుతున్నారు. ప్యాండమిక్ నుండి బయట పడాలంటే కోవిడ్ ను నియంత్రించాలంటే కీలక మైన సాధనం వ్యాక్సిన్ మాత్రమే అని ఒప్పుకుని తీరాల్సిందే అని అంటున్నారు నిపుణులు. అసలు వ్యాక్సిన్ వేయించుకోడానికి ఎందుకు  వ్యతిరేకిస్తున్నారు? యాంటీ - ఏషియన్ రేసిజం అని వ్యాక్సిన్ తి మాపై పగ తీర్చుకోవాలని చ్చోస్తున్నారని కొందరి వాదన కాగా , ప్రపంచం మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ ను తయారు చేయడానికి సిద్ధం అయ్యింది. కోవిడ్ 1 9  ప్యండమిక్ అంశం హెడ్ లైన్స్ వార్తాలలోనిలుస్తోంది. దీనిపై జరుగుతున్న పరిశోధనలు అభివృద్ధి. సంరక్షణ  పై ఆనేక విషయాలు వెల్లడి అవుతున్నాయి. గుర్తింపు పొందిన 1 3 రకాల వ్యాక్సిన్లు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వాటి వల్ల పొంచి ఉన్న ప్రమాదం అందులో వాడకూడని రసాయనాలు ఏమిటి? వాటి వల్ల ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అన్న అంశాలను మీ ముందు ఉంచే ప్రయాత్నం చేస్తోంది. తెలుగు వన్ హెల్త్   పొందిన సంస్థల వ్యాక్సిన్ పేరు       కంపెనీ పేరు       కారకమైన వ్యాక్సిన్             ప్రభావం తీవ్రత  1 ) బి ఎన్ టి 1 6 2 బి 2      పి ఫైజర్  బయో టేక్      ఎం ఆర్ ఎన్ ఏ                                      9 5 %     2)  ఎం ఆర్ ఎన్ ఏ 1 2 7 3     మదేర్నా                         ఎం అర ఎన్ ఏ                                     9 4.5 %    3) ఏ డి 2 6 సి కో వి 2    ఎస్   జాన్సన్ అండ్ జాన్సన్       వైరల్ వెక్టార్                                       6 6 %  4)ఏ జెడ్ డి 1 2 2 2             ఆక్స్ ఫోర్డ్ - ఆస్ట్రా జెన్క      వైరల్ వెక్టార్                                         8 1 .3 %  5) కోవి షీల్డ్                   సీరం ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఇండియా  వైరల్ వెక్టర్                                    8 1  6)ఏ డి 5 -ఎన్ కోవి              కాన్సినో                              వైరల్  వెక్టార్                                         6 5.2 % 7) స్పుత్నిక్                    గామా లెయా                   వైరల్  వెక్టార్                                               9 1 .6 %  8) కోవ్యాక్సిన్                  భారత్ బయో టెక్  ఇండియా  ఇన్ యాక్టివ్                                        8 ౦.6% 9) బి బి -ఐబి పి -కో ఆర్ వి   ఎస్ ఐఎన్ ఓ ఫర్మా బిజిన్స్   ఇన్ యాక్టివేటేడ్                              7 9 .3 %   10)ఐనో యాక్టి వేటేడ్ వీరా సెల్  సైనో ఫర్మా  వూహాన్      ఇన్ యక్తివేటెడ్                               7 2 .5 %  11)కరోనావి ఏ ఎల్           సైనో వాల్                        ఇన్ యాక్టివేటేడ్                                      5 ౦ .38% కోవి షీల్డ్  ఆక్స్ ఫర్డ్  ఆస్ట్రా జెనిక వ్యాక్సిన్ భారాత్ కోసం తయారు చేసారు. పైన పేర్కొన్న వ్యాక్సిన్ ప్రభావం ఎంత ఉండచ్చు అన్న  అంశాని చూసిన నిపుణులు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో వివరించారు. సహాజంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి అని నిర్ధారించారు.వ్యాక్సిన్ మన శరీరంలో ఇన్యునిటీ పెంచేందుకు అనుమతిస్తుంది. టి మరియు బి వంటి  లీంఫో సైట్స్ ను గుర్తిస్తాయి. వైరస్ ను యాంటీ బాడీలను తయారు చేస్తాయి. వ్యాక్సిన్ కోవిడ్ కు కారణం కాదని తేల్చారు. పూర్తి స్థాయిలో వైరస్ రూపంలో ఉండదు. అనారోగ్యానికి కారణం కాదని నిపుణులు తేల్చారు.శరీరంలో ఇమ్యునిటీ పెంచుతుంది. దీనివల్ల చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ మినహా మరి ఏమి లేవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సి డి సి ఇచ్చిన నివేదిక ప్రకారం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రేవెంక్షన్ డబ్లు హెచ్ ఓ నివేదిక ప్రకారం  వ్యాక్సిన్ వల్ల జ్వరం, అలసట, తల నొప్పి, ఒళ్ళు నొప్పులు నుసియా  ఉంటుందని  నిపుణులు తెలిపారు. వ్యక్తి కి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ముఖ్యంగా ఇంజక్షన్ చేసుకున్న  చేతి పై వాపు నొప్పి ఎర్రబడడం దురద, రేష్ లాగా వచ్చి అసహనం గా ఉంటారు తనకు కోవిడ్ వచిందన్న భావన వాళ్ళలో ఉంటుంది. 1 3 రకాల వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్న విషయాన్నీ ఆరోగ్య ఆధికారులు గుర్తించారు. ఈ రకమైనా ఎఫ్ఫెక్ట్స్ సహాజంగా ఉంటుందని అవి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే అవి ఎప్పుడు ఎలా వస్తాయో ఊహించి చెప్పడం అసాధ్యమని తెలిపారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వ్యాక్సిన్ తీసుకున్న తారువాత. వచ్చే లక్షణాలను సమస్యలను వి ఏ ఇ ఆర్ ఎస్ కు రిపోర్ట్ చేయవచ్చు. లేదా వి ఏ ఇఆర్ ఎస్ పోర్టల్ లో తేలపచ్చు. వ్యాక్సిన్ పై వచ్చే వివిధ రకాల సమస్యలపై ఎఫ్ డి ఏ , సి డి సి  లు నిశితంగా పరిశీలిస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఆయా సంస్థలు వ్యాక్సిన్ సేఫ్టీ పై సంస్తలు పునతాలోచిస్తున్నట్లు సమాచారం. యురోపియన్ యునియన్ సైతం ప్రజలలో అనుమానించదగ్గ ఎఫెక్ట్స్ పై వైద్యులు కూలం కషంగా ప్పరిసీలించేందుకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞాప్తి చేసింది. ఇదిఇలా ఉంటె భారాత్ లో మాత్రం ఎవరికీ చెప్పాలన్న అంశం పై సమగ్ర సమాచారం లేదు కేవలం డ్రగ్ కంట్రోల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా మాత్రమే చూస్తుందా ఆరోగ్య మంత్రి త్వ శాఖ కు తెలపాలా అన్నది మరో అంశం. ఇదిలా ఉంటె అలర్జీ రియాక్షన్ రావడానికి కారణం వ్యాక్సిన్ లొనీ కొన్ని పదార్ధాలు కారణమని తేల్చారు. దీనివల్ల చార్మం పై దద్దుర్లు, వాపు, ఊపిరి తిత్తుల సమస్యలు వచ్చాయి. ఎనా ఫి లాక్సిస్ అరుదైన సైడ్ ఎఫెక్ట్ సి డి సి పరిసీలనలో 2 . 5 మిలియన్ల ప్రజలు జ్వరం, తరువాతా ఏనా ఫైలక్సిస్ వచ్చిందని, ఎం ఆర్ ఎన్ ఏ వ్యా క్సిన్ లో పోలి ఎతిలిన్ గ్లైకాల్ ను కొన్ని అనుమతి పొందిన వ్యాక్సిన్ లలో వాడకూడదు.కాగా కొన్ని వ్యాక్సిన్ లలో ఏ, ఆర్ ఎన్ ఏ మలిక్యుల్, సెల్ పెనాన్ ట్రేషన్, పి ఇ జి పోలి సర్బేట్ 8 ౦ ఉన్నట్లు సమాచారం. ఎం అర ఎన్ ఏ ద్వారా చాలా తెక్కువ శాతం రీయక్షన్ ఎలర్జీ ఉన్నవాళ్ళని స్క్రీన్ చేయాలని సి డి సి సూచించింది.అయితే మహిళలలో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నది నిజమా ? ఆక్స్ ఫార్డ్ ఆష్ట్రాజనికా వల్ల రక్తం గడ్డ కట్టుకు పోవడం జరిగిందని కొన్ని దేశాలలో ఆశ్త్రా జనికా ను కొన్ని రోజులు నిలిపి వేసినట్లు సమాచారం. మరల దీనికి గల కరనాలాను పరిశీలించినా తరువాత యురప్ దేశాలు మళ్ళీ వ్యాక్సిన్ కు అనుమతించాయి.                  

బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎం.. అసోంలో దుమారం  

ఎన్నికల్లో ఓటింగ్ కోసం ఉపయోగిస్తున్న ఈవీఎంలపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలను టాంపరింగ్ చేశారనే ఆరోపణలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాకా ఈవీఎంలపై ఆరోపణలు పెరిగిపోయాయి. అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. అక్కడ వెలుగుచూసిన ఘటన సంచలనంగా మారింది. పోలింగ్ అయిపోయాక ఈవీఎంలను బీజేపీ అభ్యర్థి కారులో తీసుకెళ్లడం కలకలం రేపుతోంది. పోలింగ్ అయిపోయాక ఈవీఎంలను అధికారిక వాహనంలో తీసుకెళ్లాలి. కానీ అసోంలో ఓ బీజేపీ అభ్యర్థి కారులో తీసుకెళ్లారు. ఈ ఘటన అసోంలోని కరీంగంజ్ లోని రాతాబరీ నియోజకవర్గంలో జరిగింది. ఈవీఎంలను బీజేపీ అభ్యర్థి కారులో తీసుకెళ్తుండడాన్ని గుర్తించిన ప్రతిపక్ష నేతలు.. వెంటనే కారును ఆపి వాటిని స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ భార్య పేరిట ఉన్న ఆ కారును అడ్డుకున్న ప్రతిపక్ష సభ్యులు.. ఆందోళనలకు దిగారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఎన్నికల్లో అధికార బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈవీఎం తరలింపుపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ రీపోలింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశించింది.  కరీంగంజ్ ఘటనపై  నిజనిర్ధారణ నివేదికను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఈవీఎంలను స్ట్రాంగ్ రూంకు తీసుకెళ్లే క్రమంలో.. గురువారం రాత్రి 9 గంటల సమయంలో నీలం బజార్ కు దగ్గర్లోనే వాహనం బ్రేక్ డౌన్ అయిందని పేర్కొంది. అప్పటికే వాతావరణం బాగాలేకపోవడం, ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండడంతో అటుగా వచ్చిన వాహనాన్ని లిఫ్ట్ అడిగి తీసుకున్నామని చెప్పింది. ఆ వాహనంలోని ఎన్నికల సిబ్బంది వెంటనే సెక్టార్ ఆఫీసర్ అజయ్ సూత్రధార్ కు ఫోన్ చేశారని, ఆయన వాహనం ఏర్పాటు చేసే లోపే అటుగా వస్తున్న వాహనాన్ని అధికారులు లిఫ్ట్ అడిగారని చెప్పింది. ఆ వాహనం ఎవరిదో తెలియకుండానే అధికారులు ఆపారని, స్ట్రాంగ్ రూం వద్ద ప్రతిపక్ష కార్యకర్తలు ముట్టడించి దాడి చేసినప్పుడే ఆ కారు బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ భార్య మధుమిత పాల్ దిగా తెలిసిందని వెల్లడించింది. రాత్రి 10 గంటలకు కనైశిల్ కు చేరుకున్న తర్వాత.. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో వాహనం ట్రాఫిక్ లో ఆగిందని, అప్పుడే 50 మంది దాకా గుంపుగా వచ్చి కారుపై రాళ్లతో దాడి చేశారని చెప్పింది. ఆ వాహనం బీజేపీ నేతదని ఆ గుంపుకు నాయకుడు చెప్పాడని తెలిపింది. అప్పుడే అది బీజేపీ అభ్యర్థి కారని తెలిసిందని చెప్పింది. వారు హింసకు పాల్పడి దాడి చేయడంతో కరీంగంజ్ ఎస్పీకి గాయాలయ్యాయని తెలిపింది. పోలింగ్ ప్రొటోకాల్ ను ఉల్లంఘించినందుకు పోలింగ్ అధికారి సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశామని ఎన్నికల సంఘం తెలిపింది. 

హైదరాబాద్ ముస్లిం నేతకు బీజేపీ డబ్బులు! 

భారతీయ జనతా పార్టీ ప్రధాన నినాదమే హిందుత్వ. హిందుత్వ కార్డుతోనే ఎన్నికల్లో ప్రచారం చేస్తుంది.. ఓట్లు అడుగుతుంది. ముస్లిం పార్టీలపై బహిరంగంగానే ఆరోపణలు, విమర్శలు చేస్తారు కమలం నేతలు. అలాంటిది ముస్లిం పార్టీ నేతకు బీజేపీ భారీగా డబ్బులు ఇచ్చిందని ఆరోపణలు చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి మమతా బెనర్జీ  సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నుంచి డ‌బ్బులు తీసుకుని.. ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి డబ్బులు తీసుకుని బెంగాల్ వచ్చాడని.. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని అన్నారు. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు అతను ఈ విధంగా చేస్తున్నాడని ఆరోపించారు. ముస్లిం ఓట్ బ్యాంక్ టీఎంసీకి దక్కకుండా ఓట్లను చీల్చేందుకు కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ వ్యక్తిని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. మమతా బెనర్జీ ఎక్కడ అసదుద్దీన్ పేరును ప్రస్తావించకపోయినా.. ఆమె ఆయనను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. కూచ్ బేహార్‌ టీఎంసీ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసగించిన మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. నందిగ్రామ్‌లో తాను తప్పకుండా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. ‘నేను గెలుస్తానని నాకు తెలుసు.. కానీ నాతో పాటు కనీషం 200 మంది అభ్యర్థులు గెలవాలి.. అలా అయితేనే మన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అందుకే మీరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలి. నేను నందిగామ్ నుంచి గెలిచి తీరుతాను.. అందులో ఆందోళన పడాల్సిన అవసరం లేదు’అని అన్నారు. 

వివేకాది రాజకీయ హత్యే.. 

తన తండ్రి హత్య జరిగి రెండు ఏళ్ళు అయింది. అయినా నిందితులు ఎవరో తెలియదు. న్యాయం కోసం వెళితే మీ ఏరియాలో ఇలాంటి హత్యలు జరగడం మాములే కదా అన్నారు. మాజీ మంత్రి కి న్యాయం జరగకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య గురించి వదిలేయమని తనకు చాలా మంది సలహా ఇచ్చారని.. నా మనసు మాత్రం న్యాయం కోసం పోరాడమని చెబుతోందన్నారు. తన తండ్రి ఏపీ దివంగత సీఎంకు సోదరుడని.. ప్రస్తుత సీఎం జగన్‌కు స్వయానా బాబాయ్‌ అని ఆమె చెప్పారు. తన తండ్రి హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఇంకెంతకాలం వేచిచూడాలని నిలదీశారు. ఈ అన్యాయంపై పోరాటంలో తనకు అందరి సహకారం కావాలని కోరారు. ఈ కేసు విషయంలో కొందరు అధికారులను కలిశా. కడప ప్రాంతంలో హత్యలు సాధారణం అన్నట్లు వారు మాట్లాడారు. హత్యలు జరగడం సాధారణమెలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు. హత్య కేసులో సాక్షులకు హాని జరుగుతుందేమోనని భయమేస్తోంది. నాన్న హత్య గురించి మాట్లాడేందుకు..వాస్తవం చెప్పేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. నాన్న అందరితో ప్రేమగా మెలిగేవారు.. ఆయనకు శత్రువులెవరూ లేరు. ఆర్థిక పరమైన కారణాలతో హత్య జరిగి ఉంటుందని నేను అనుకోవడం లేదు. నాకు తెలిసినంత వరకు ఇది రాజకీయ హత్యే’’ అని సునీతారెడ్డి అన్నారు.