కరోనా వచ్చినా నో లాక్ డౌన్
కరోనా మహమ్మారి మరో మారు, ప్రపంచవ్యాప్తంగా కలకలం, కలవరం సృష్టిస్తోంది. పొరుగుదేశం, కరోనా పుట్టిల్లు చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న బీఎఫ్7 రకానికి చెందిన ఒమిక్రాన్ కేసులు భారత్ దేశంలోనూ నమోదు కావడంతో భారత వైద్యమండలి ప్రజల్ని అప్రమత్తం చేసింది. కొవిడ్ నియంత్రణ పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని కోరింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ను కచ్చితంగా ఉపయోగించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవాలని కోరుతూ ప్రకటన విడుదల చేసింది. శానిటైజర్ ఉపయోగించాలని చెప్పింది.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్సభలో మాట్లాడుతూ.. భారత్లో కొవిడ్ కేసుల పెరుగుదలపై కేంద్రం ఓ కన్నేసి ఉంచిందని చెప్పిన గంటల వ్యవధిలోనే ఐఎంఏ ఈ ప్రకటన జారీ చేయడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్గా నమూనాలను సేకరించి, పరీక్షించాలని మాండవీయ ఆదేశించిన నేపథ్యంలో ఆ ప్రక్రియ కూడా గురువారం(డిసెంబర్ 22) నుంచి ప్రారంభమైంది.
మరోవంక చైనా, జపాన్, అమెరికా సహా పలు దేశాల్లో కలవరం సృష్టిస్తున్న అధిక వ్యాప్తి సామర్థ్యంగల ఒమిక్రాన్ ఉపరకం బీఎఫ్.7 కేసులు భారత దేశంలోనూవెలుగు చూసిన నేపథ్యంలో.. తాజా పరిణామాలు మరో వేవ్కు దారి తీసి, దేశాన్ని మళ్లీ లాక్డౌన్లోకి నెడతాయా? అన్న కలవరం నెలకొంది. అయితే భారత వైద్య సంఘానికి చెందిన డా.అనిల్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే దేశ జనాభాలో అర్హులైనవారిలో 95 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిన నేపథ్యంలో.. లాక్ డౌన్ వంటి పరిస్థితి రాదని ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భారతీయుల రోగనిరోధక శక్తి చైనీయుల కంటే అధికంగా ఉందని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో.. భారత్ తప్పనిసరిగా మళ్లీ ‘టెస్టింగ్, ట్రీటింగ్, ట్రేసింగ్’ (టిటిటి) విధానానికి మారాలని డా.గోయల్ ఈ సందర్భంగా సూచించారు. ఇప్పటికే భారత్ 200 కోట్లకుపైగా డోసులు అందించింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ వంటి పరిస్థితి తలెత్తదు అని చెప్పారు. మరో వైపు.. పౌరులంతా తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వినియోగం, శానిటైజర్ల వాడకం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి కొవిడ్ నిబంధనలతో వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపింది. ప్రపంచ దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్న వేళ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ఇప్పటికే ఆదేశించారు.
వీలైనంత వరకు ప్రజలు జన సమూహాలకు దూరంగా ఉండాలని, వివాహాలు, రాజకీయ, సామాజిక సమావేశాలను వాయిదా వేసుకోవడం మంచిదని ఐఎంఏ సూచించింది. అత్యవసరమైతే తప్ప, సాధ్యమైనంత వరకు అంతర్జాతీయ ప్రయాణాలు చేయొద్దని ప్రజలను కోరింది. జ్వరం, గొంతు నొప్పి, జలుబు, విరేచనాలు తదితర సమస్యలేమైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది. కొవిడ్ ప్రికాషనరీ డోసు (ముందస్తు డోసు)ను వీలైనంత తొందరగా తీసుకోవాలని సూచించింది. వివిధ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ప్రజలను భారత వైద్య మండలి అప్రమత్తం చేస్తోంది. తక్షణమే కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజల్ని కోరుతోంది. గడిచిన 24 గంటల్లో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ప్రాన్స్, బ్రెజిల్ తదితర దేశాల్లో 5.37లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.
భారత్లోనూ 145 కొత్తగా కేసులను గుర్తించారు. ఇందులో 4 కేసులు చైనాలో భయాందోళనలు సృష్టిస్తున్న బీఎఫ్7 రకానికి చెందినవి అని ఐఎంఏ ప్రకటనలో పేర్కొంది.2021 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్, అంబులెన్స్ సర్వీసులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, సంబంధిత విభాగాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఎంఏ తన ప్రకటనలో పేర్కొంది. మరోవైపు చైనా నుంచి వచ్చే ప్రయాణికులు వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండేలా కేంద్ర చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.