తెలంగాణ సర్కార్ కు ఎన్ జీటీ భారీ జరిమానా.. ఎందుకంటే?
posted on Dec 22, 2022 @ 4:30PM
జాతీయ హరిత ట్రైబ్యునల్ తెలంగాణ సర్కార్ కు భారీ జరిమానా విధించింది. డిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవనిపేర్కొంటూ సర్కార్ కు 900 కోట్ల రూపాయల జరిమానా విధించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ గతంలో ఆ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశాలిచ్చినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొంది.
పర్యావరణ అనుమతులులేకుండా ప్రాజెక్టు నిర్మించినందుకు మొత్తం నిర్మాణ వ్యయంలో 1.5 శాతం జరిమానా విధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారని కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ వేసిన సంగతి విదితమే.
ఆయనతో పాటు.. ఏపీ ప్రభుత్వం, కర్నూలుకు చెందిన చంద్రమౌళేశ్వర రెడ్డి అనుబంధ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వానికి ఈ జరిమానా విధించింది. గతంలో ఏపీలో కూడా పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులకు కూడా పర్యవరణ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించిన సంగతి విదితమే.