విషమంగా తమ్మినేని ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని  ఆరోగ్యం విషమంగా ఉంది. వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఖమ్మంలోని తన నివాసంలో ఉండగా తమ్మినేని వీరభద్రం మంగళవారం (జనవరి 16) గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.  అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తమ్మినేని గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు.  తమ్మినేని ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందనీ,  నిపుణులైన వైద్యులపర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.  

కల్వకోలులోని కాకతీయ శాసనాలు కాపాడుకోవాలి..పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి

కొల్లాపూర్ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోని పెద్ద కొత్తపల్లి మండలం, కల్వకోలు కాకతీయ గణపతి దేవుని కాలపు శాసనాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. గ్రామం బయట మట్టికోట గోడ లోపల ఉన్న నంది కోటేశ్వర స్వామి ఆలయం పక్కనున్న క్రీ. శ. 13వ శతాబ్ధనాటి శాసనం మట్టిలో కూరుకు పోయిందని, కాకతీయుల వంశ వృక్షాన్ని, ప్రోల రాజు విజయాలను, గణపతి దేవుని సామంతుడైన చెఱకు బోల్లయ రెడ్డి జమ్మలూరుపురం కలువకొలను గాను, పిలవబడిన కల్వకోలు పట్టడానికి ఏరువ సీమకు అధిపతి అన్న వివరాలు ఉన్నాయన్నారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ శాసనం, క్రీ.శ. 1321 నాటి ప్రతాపరుద్రుని శాసనం, మట్టి కోటను కాపాడుకోవాలని కల్వకోలు గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే  

రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. జనవరి 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. వీటి భర్తీకి ఈసీ వేర్వురు నోటిఫికేషన్లు విడుదల చేయటంతో…ఈ రెండు స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం పార్టీలని పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. నామినేషన్ల స్వీకరణకు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో… ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. పలువురిని పేర్లను పరిశీలించిన హైకమాండ్… ఇద్దరిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ఫైనల్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు వారికి ఫోన్ చేసి సమాచారం అందించారు. నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.అద్దంకి దయాకర్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి టిక్కెట్ ఆశించారు. కానీ టిక్కెట్ దక్కలేదు. బల్మూరి వెంకట్ 2021 హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.  ఉన్నది రెండు ఎమ్మెల్సీ పదవులే అయినా.. పోటీలో మాత్రం ఎక్కువ మందే ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ, అజారుద్దీన్, సంపత్, మధు యాష్కీ గౌడ్ వంటి నేతలు కూడా ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి ఒక్క ముస్లిం మైనారిటీ నాయకుడు కూడా ఎమ్మెల్యేగా లేరు. అదే మాదిరిగా ఎమ్మెల్సీలు కూడా లేరు. మంత్రి వర్గంలోకి ఒక ముస్లిం మైనారిటీ నేతను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలపై కన్నేసిన కాంగ్రెస్ కు ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకం కానున్నాయి. ఇక గవర్నర్ కోటాలో కూడా రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్ కు ఇచ్చే అవకాశం ఉండగా… ఒకటి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీటిపై కూడా క్లారిటీ రానుంది.

చంద్రబాబు క్వాష్ లో కొత్త మలుపు.. జడ్జీలకే అర్ధం కాని కేసా ఇది?!

స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఏటూ తెల్చకుండానే సీజేఐకి రిఫర్ చేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం బనాయించిన  స్కిల్ స్కాం కేసు  నెలల తరబడి కోర్టుల్లో  సాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ కేసులో చంద్రబాబుపై నమోదు చేసిన కేసుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో ఈ రోజు ఈ కీలక తీర్పు వెలువడనుందని గత రెండు రోజులుగా  ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే, నేటి తీర్పులో ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. స్పష్టంగా చెప్పాలంటే ఇద్దరు జడ్జిలు పరస్పర విరుద్ధమైన తీర్పులు వెల్లడించారు. ఈ కేసును విచారించిన ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయారు. ఒకరు సెక్షన్ 17ఏ వర్తిస్తుందంటే మరొకరు వర్తించదని అభిప్రాయపడ్డారు. దీనికి ఎవరికి వారు వారి వారి కారణాలు, సెక్షన్స్ లో షరతులు, లొసుగులు ఎన్నో చెప్పుకొచ్చారు. ఫైనల్ గా ఈ కేసును ద్విసభ్య ధర్మాసనం తేల్చలేక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి అప్పగించారు. దీంతో ఈ కేసు అక్కడ ఎప్పటికి తేలుతుందన్నది చెప్పేలేని పరిస్థితి. సీజేఐ ఈ కేసును ఎలా తేల్చనున్నారన్న దానిపై రకరకాల విశ్లేషణలు ఇప్పటికే మొదలయ్యాయి.  తీర్పు రావాలంటే మాత్రం మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉందన్నది న్యాయనిపుణుల అభిప్రాయం. న్యాయమూర్తులతో కూడిన ఓ కమిటీని నియమించడం, మరింత క్షుణ్ణంగా ఈ కేసులో లోతుకు వెళ్లి విచారణ చేయడం వంటి అంశాల నేపథ్యంలో ఈ కేసు ఇప్పటిలో తేలే పరిస్థితి లేదన్నది అర్ధమవుతుంది. ఇది చంద్రబాబుకు నష్టం తెచ్చే అంశమని  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది అక్రమంగా బనాయించిన కేసని ఇప్పటికే ఎందరో న్యాయ నిపుణులు, మేధావులు, రిటైర్డ్ న్యాయమూర్తులు తేల్చి చెప్పారు. హై ప్రొఫైల్ ఉన్న ఒక నేతను ముందస్తు సమాచారం లేకుండా, గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం ముమ్మాటికీ సీఐడీ తప్పిదమే. అయితే, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది. చేస్తున్నది. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చెల్లదు. అలాగే చంద్రబాబుపై బనాయించిన కేసులు కూడా చెల్లవు. అయితే  17ఏ 2018 తర్వాత కేసులకు మాత్రమే వర్తిస్తుంది. అంతకు ముందు కేసులలో ఈ సెక్షన్ వర్తించదు. సరిగ్గా ఏపీ ప్రభుత్వం అదే అంశాన్ని అడ్డం పెట్టుకొని వింత వాదన తెరపైకి తెచ్చింది. స్కిల్ స్కాం కేసు 2018కి ముందే విచారణ మొదలైందని సీఐడీ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. 2018కి ముందు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో సర్వీస్ అందించిన సంస్థలకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. నిజానికి ఈ నోటీసులు ఇచ్చింది జీఎస్టీ గురించి. ఆ నోటీసులకు ఇప్పటి సీఐడీ విచారణకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ నోటీసులు ఇచ్చినప్పటి నుండే ఈ కేసు విచారణ మొదలైనట్లు సీఐడీ లాయర్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ఈ కేసుకు 17ఏ వర్తించదని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఈ కేసుకు 2018 నోటీసులకు సంబంధం లేదు కనుక 2018 తర్వాత కేసుగా 17ఏ వర్తిస్తుందని మరో న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో ఈ కేసు ఇప్పుడు మరింత మెలిక పడింది.  అయితే ఇది న్యాయమూర్తులకే అర్ధం కాని కేసా అంటూ రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ సాగుతున్నది. ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులలో ఒకరు చంద్రబాబుకు ప్రతికూలంగా మరొకరు అనుకూలంగా అభిప్రాయపడ్డారు. ఈ కేసులో జస్టిస్ ఆలస్యమైతే నష్టపోయేది చంద్రబాబే. ఆయన విషయంలో ప్రభుత్వం, సీఐడీ తప్పు చేసిందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ప్రభుత్వం కక్షసాధింపులో భాగంగా ఈ అక్రమ అరెస్టులు చేయించిందని స్పష్టంగా తెలుస్తుంది. కానీ, అది నిరూపించాలంటే మాత్రం న్యాయవ్యవస్థలో లొసుగులు అడ్డుపడుతున్నాయి. ఇది 2018కి ముందే విచారణ మొదలైన కేసా.. తర్వాత విచారణ ప్రారంభమైందా అన్నది కూడా స్పష్టమే. కానీ, సీఐడీ తరపున వాదించేందుకు వీలుగా సీబీఐ నోటీసులు అడ్డు పడుతున్నాయి. అదే ఇప్పుడు ఈ కేసు సీజేఐ వరకూ చేర్చింది. మరి ఈ కేసులో తీర్పు ఏపీలో ఎన్నికలకు ముందే వస్తుందా అన్నది తేలాల్సి ఉంది. ఎన్నికల తర్వాత తీర్పు వస్తే ఈ కేసులో ఎవరికీ ఎలాంటి లాభం ఉండదు. అందుకే ఈ కేసులో తీర్పు ఎంత ఆలస్యమైతే అంతగా నష్టపోయేది ఒక్క చంద్రబాబు మాత్రమే. కనుక అందుకే ప్రభుత్వం కూడా ఈ కేసులో సాగదీసేందుకు అన్ని మార్గాలను వాడుకుంటున్నట్లుంది.

 సీపిఎం నేత  తమ్మినేని వీరభధ్రంకు గుండెపోటు 

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. ఖమ్మంలో తన నివాసంలో ఉన్న సమయంలో ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తమ్మినేనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారి సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం తమ్మినేనిని హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  ఇటీవలె జరిగిన తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎం  కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాట్ల చర్చలు సఫలం కాకపోవడంతో ఒంటరిగా పోటీ చేసి అన్ని స్థానాల్లో పరాజయం చెందింది. రానున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో తమ్మినేని రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో వరుసగా పర్యటనలలో పాల్గొంటున్నారు. తనకు నలతగా ఉందని నిన్న సాయంత్రం నుంచి కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. అయితే మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నియామకం.. తక్షణమే అమల్లోకి

లాంఛనం పూర్తై పోయింది. వైఎస్ షర్మిల ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడతారని గత కొద్ది రోజులుగా గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సంక్రాంతి తరువాత ఏ క్షణంలోనైనా ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడతారని తెలుగువన్ ముందుగానే చెప్పింది. అలాగే సంక్రాంతి రోజు అప్పటి వరకూ ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేయడంతో షర్మిలకు లైన్ క్లియర్ అయిపోయింది. షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో క్రియాశీలంగా వ్యవహరించే దిశగా చర్చలు జరుగుతున్న సందర్భంగానే  ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైతే తాను రాజీనామా చేస్తానని గిడుగు రుద్రరాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. గిడుగు రుద్రరాజు సోమవారం అంటే సరిగ్గా సంక్రాంతి నాడు రాజీనామా చేశారు. తెలుగువన్ ముందుగానే చెప్పినట్లు సంక్రాంతి మరునాడే షర్మిల ఏపీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు.  గిడుగు రుద్రరాజు ఇలా రాజీనామా చేయడంతోనే షర్మిలను అలా ఏపీసీసీ చీఫ్ గా నియమించేసేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో  కాంగ్రెస్ బలోపేతం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని హైకమాండ్ భావిస్తున్నది. అందుకు తగ్గట్టుగానే ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించేశారు. ఏపీసీసీ చీఫ్ గా ఈ రోజు అధికారికంగా నియామకం జరిగినా, అంతకు ముందు నుంచే ఆమె రాష్ట్రంలో కాంగ్రెస్ పటిష్ఠతకు తన వంతు కృషి ప్రారంభించేశారు.   ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ మాజీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వైసీపీ నేతలను తిరిగి తమ పార్టీలోకి చేర్చుకోవడమే టార్గెట్ గా షర్మిల అడుగులు వేస్తున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం వల్ల భారీ నష్టం వాటిల్లేది ఎవరికంటే పరిశీలకులు జగన్ పేరే చెబుతున్నారు. ఏపీ ఇక అన్నాచెళ్లెల్ల పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ గా మారబోతోందని విశ్లేషిస్తున్నారు.   షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో  ఇప్పటికే పతనమైన జగన్ గ్రాఫ్ పాతాళానికి చేరడం ఖాయమని వైసీపీ వర్గాలే అంటున్నాయి. ఇప్పటి వరకూ అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం, జనసేన కూటమి మధ్య ముఖాముఖీగా ఉన్న ఎన్నికల పోరు.. షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో త్రిముఖ పోరుగా మారుతుందని, అదే సమయంలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టడం వల్ల ఆ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని కానీ, అద్భుతాలు జరుగుతాయని కానీ ఎవరూ భావించడం లేదు. కానీ షర్మిల కారణంగా జగన్ పార్టీకి మాత్రం కోలుకోలేని నష్టం వాటిల్లడం ఖాయమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఔను నిజమే ఏపీలో కాంగ్రెస్ ఏ మాత్రం బలపడినా ఆ మేరకు నష్టపోయేది జగన్ రెడ్డే. ఎందుకంటే వైసీపీలో సీనియర్లంతా కాంగ్రెస్ నేతలే.  క్యాడర్ కూడా ఒకప్పటి కాంగ్రెస్ క్యాడరే.  ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ చచ్చి వైసీపీకి ఊపిరి పోసింది. మరి ఇప్పుడు  పదేళ్ల తరువాత కాంగ్రెస్ బతికి ఊపిరి పోసుకుంటే.. నిస్సందేహంగా వైసీపీకి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఏర్పడటం ఖాయమంటున్నారు.  రానున్న ఎన్నికల పోరు   తెలుగుదేశం జనసేన కూటమి, వైసీపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరుగా ఉంటుందో, షర్మిల చేరికతో వైసీపీ ఇక అధికారం కోసం కాకుండా కనీసం తెలుగుదేశం, జనసేన కూటమి తరువాత రెండో స్థానంలో నిలవడానికి కాంగ్రెస్ తో పోటీ పడుతుందో చూడాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు. 

సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనానికి చంద్రబాబు క్వాష్ పిటిషన్

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను  జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం సీజేఐ బెంచ్ కు రిఫర్ చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని ఇరువురు న్యాయమూర్తులూ భిన్న తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేశారు.   దీంతో స్కిల్ కేసులో 17-ఏ సెక్షన్ వర్తింపు వ్యవహారం ప్రధాన న్యాయమూర్తి సారధ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు చేరింది. 17-ఏ వర్తింపు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండడంతో తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్‌కి నివేదిస్తున్నామని జస్టిస్ బేలా త్రివేది అన్నారు. స్కిల్ కేసులో  జగన్ సర్కార్ చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 52 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ లో ఉన్న  చంద్రబాబు.. తాను ఎటువంటి తప్పూ చేయలేదనీ, తనపై కేసు రాజకీయ ప్రేరేపితమనీ, రాజకీయ కక్ష సాధింపులో భాగమని పేర్కొంటూ క్వాష్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ ను కొట్టివేశాయి. దీంతో ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. సుప్రీంలో సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు రిజర్వ చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు మంగళవారం (జనవరి 16)న వెలువడింది. దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొన్న ఈ కేసు తీర్పు విషయంలో న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వెలువరించడంతో సీజేఐ బెంచ్ కు రిఫర్ చేశారు.  అక్కడ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ప్రభుత్వ న్యాయవాదులు, చంద్రబాబు న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించారు.  ఏపీ  సర్కార్ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ  వాదనలు ఉన్నాయంటున్నారు. అవినీతి జరిగింది. దానిలో  చంద్రబాబు  పాత్ర ఉందా లేదా అన్నది ఆయనను విచారించి  తెలుసుకుంటాం అన్నట్లుగా ముకుల్ రోహత్గీ వాదించారు.  చంద్రబాబు అరెస్టు అక్రమమనీ, ఆయనను విచారించాలన్నా, అరెస్టు చేయాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పని  సరి  అనీ  చంద్రబాబు  తరఫు న్యాయవాది హరీష్ సాల్వే  కోర్టుకు తెలిపారు. 17ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందని చెబుతూ అందుకు ఉదాహరణగా పలు కేసులలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను ఉటంకించారు. పలు సందర్భాలలో హరీష్ సాల్వే వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించారు. ఒక సందర్భంలో అయితే ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని అనిపిస్తోందని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దీంతో అంతా చంద్రబాబుకు క్వాష్ వర్తిస్తుందంటూ తీర్పు వెలువడుతుందని భావించారు. అయితే   ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు  జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందా? లేదా అన్న విషయంపై తీర్పు వెలువరించకుండా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారు.  ఇలా ఉండగా  ద్విసభ్య ధర్మాసనంలో ని ఇరువురు న్యాయమూర్తులలో ముందుగా జస్టిస్ అనిరుధ్ బోస్ తన తీర్పు వెలువరిస్తూ స్కిల్ కేసులో చంద్రబాబుకు 17 ఏ వర్తిస్తుందని విస్పష్టంగా తేల్చారు. 17ఏ అమలులోకి రాకముందు జరిగిన దర్యాప్తును ఈ కేసులో చంద్రబాబు అరెస్టుకు వర్తింప చేయడం కూడదని పేర్కొన్నారు. అయితే చంద్రబాబుకు విధించిన రిమాండ్ రిపోర్టును కొట్టివేయలేమని పేర్కొన్నారు.  ఇక మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదని తన తీర్పులో పేర్కొన్నారు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్‌ చేయలేమని తన తీర్పులో పేర్కొన్నారు.   ఇరువురు న్యాయమూర్తులూ భిన్న తీర్పులు వెలువరించడంతో  చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. 

బాబూ ఓ రాంబాబు!

తెలుగుదేశం పార్టీని   విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ స్థాపించారు.  జనసేన పార్టీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించారు.  ఆ రెండు పార్టీలలో  కళా వల్లభులు పెద్దగా కనిపించరు. అయతే జగన్ పార్టీ అయిన వైసీపీలో మాత్రం  మహానటుల స్థాయికి ఏ మాత్రం తగ్గనిక ళాకారులంతా  వై గుట్టలుగుట్టలుగా ఉన్నారనే ఓ చర్చ అయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో వైరల్ అవుతోంది.   తాజాగా సంక్రాంతి పండగ వేళ.. భోగి పండగను పురస్కరించుకొని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు   సంబరాల రాంబాబులా మారి  వేసిన స్టెప్స్ కెవ్వు కేక పుట్టించాయని సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓ ప్రచారం వీర లెవల్ లో నడుస్తోంది. అలాగే నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలంతా ఈ కార్యక్రమానికి హాజరై.. సంబరాల రాంబాబు డ్యాన్స్ కార్యక్రమాన్ని  కనులారా వీక్షించి ఆనందించేశారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.   గతంలో రాజకీయ పార్టీ అధినేతలపై మాత్రమే పాటలు ఉండేవని.. కానీ అంబటి రాంబాబు..తనపై పాట రాయించుకొని మరీ ఇలా డ్యాన్స్ చేయడం పట్ల ప్రజలలోనే కాదు, పరిశీలకులు, రాజకీయ వర్గాలలో సైతంఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. మరోవైపు మంత్రి అంబటి రాంబాబు..  తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుతోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ప్రెస్‌మీట్లు పెట్టి మరీ వ్యంగ్య బాణాలు సంధిస్తారని.. అయితే అదే అంబటి రాంబాబు... ఇలా స్టెప్స్ వేయడమే కాకుండా.. నేను సంబరాల రాంబాబును కూడా అంటూ భోగి మంటల సాక్షిగా ఇచ్చిన క్లారిటీ మాత్రం అదిరిపోయిందని వారు చెబుతున్నారు.     బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎప్పటికి పూర్తవుతుందంటే.. పవన్ కల్యాణ్ మళ్లీ పెళ్లి చేసుకొనే సమయానికి అంటూ తన వ్యంగ్య వైభవన్నా చాటిన   అంబటి రాంబాబుకు.. జలవనరుల శాఖను కేటాయించే కంటే.. మరో శాఖ ఏదైనా కేటాయిస్తే బాగుండేదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే కార్యక్రమంలో.. ఓ హీరోయిన్‌ని కూడా తీసుకు వచ్చి.. ఆమెతో కూడా కాలు కదిపి ఈ అంబటి రాంబాబు కనుక స్టెప్లు వేస్తే.. ఇంకా ఈ సీన్ సూపరో సూపర్‌గా ఉండేదని సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓ వేళ అంబటి రాంబాబు ఓటమి పాలైనా కొరియాగ్రాఫర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం కలిగిందని సత్తెనపల్లి  నియోజకవర్గ ప్రజలు అంబటి రాంబాబు భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తున్నారు.    అయినా.. అంబటి రాంబాబులో చాలా టాలెంట్ ఉందని.. ఆయనలో.. ఆ టాలెంట్‌ను వైసీపీ అధినేత జగన్ గుర్తించారని.. అందుకే   ఆయన్ని వదులు కోలేదని..  కానీ అంబటి రాంబాబు మంత్రి కావడం వల్ల.. ఆయనలో సహజ నటనంతా..మళ్లీ ఇలా సంక్రాంతి పండగ వేళ బయటకు తన్నుకొచ్చిందని.. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో ఆయన నటించారని.. అయితే ఆయన నటనను ప్రజలంతా దాదాపుగా మరిచిపోయారని.. కానీ ఆయనలోని ప్రతిభ పాటవాలు చూసి.. రాబోయే కాలానికి కాబోయే ఓ సహజ నటుడు టాలీవుడ్‌కి.. అది ఇలా సంక్రాంతి పండగ వేళ దొరికాడని.. దీంతో తెలుగు సినీ కళామతల్లి  సైతం సిగ్గు మెగ్గలతో మెలికలు తిరుగుతూ తెగ మురిసిపోతుందని వారు వివరిస్తున్నారు.    జగన్ పార్టీలో కళాకారులకు కొదవే లేదని.. అంబటి రాంబాబుతోపాటు కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, ఆర్కే రోజా, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అవంతి శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్.. ఇలా ఇలాంటి  డైమండ్ పీస్‌ల సంఖ్య పెద్దదే అయినా  వారిలో అంబటి రాంబాబు అగ్రస్థానంలో నిలుస్తారనడంలో సందేహం లేదంటున్నారు.   గత సంక్రాంతి పండగ వేళ.. ఇదే అంబటి రాంబాబు, ఇదే సత్తినపల్లిలో గ్రూప్ డ్యాన్స్ చేసి చెలరేగిపోయారని.. దీంతో ఫ్యాన్ పార్టీ నాయకుడిగా.. ఎమ్మెల్యేగా... మంత్రిగా ఆయనకు రాని పబ్లిసిటీ.. ఒకే ఒక్క గ్రూప్ డ్యాన్స్‌తో పీక్స్‌కు చేరిందని.. మరోవైపు అంబటి రాంబాబు డ్యాన్స్‌‌పై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తే.. తాను చేసింది ఆనంద తాండవం అంటూ పక్కా క్లారిటీతో వివరించారని ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఏదీ ఏమైనా.. అంబటి రాంబాబులో టాలెంట్ ఉందని.. అది కూడా కెవ్వు కేకంతగా ఉందని.. అందుకే  .. బాబూ ఓ రాంబాబు.. అంటూ ఆయనపై సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. 

వైసీపీ ఎమ్మెల్యే ఛీప్  పబ్లిసిటీ... పండగ నాడు మద్యం, మాంసం పంపిణీ 

పురాణాల దగ్గర నుంచి దానాలు చేయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. దానం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. మనకున్న వాటిని అవసరంలో ఉన్న ఇతరులకి దానం చేసి సహాయం చేయడం వల్ల పుణ్యం దక్కుతుందని నమ్ముతారు. అందుకే కుడి చేత్తో చేసిన దానం గురించి ఎడమ చేతికి కూడా తెలియకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఎపిలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు సంక్రాంతి కానుకగా ఇచ్చిన ఫుల్ బాటిల్స్, కోడి మాంసం సోషల్ మీడయా వేదికగా తెగ వైరల్ చేసుకున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి తరువాత రోజు జరుపుకునే కనుమ  పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటారు. పండుగ నాడు కోడి కూర, కిక్కిచ్చే చుక్క ఉంటే కొందరికి పండుగే. దసరా పండుగ నాడు యజమానులు తమ వద్ద పనిచేసే వాళ్లకు బోనస్ లు ఇస్తుంటారు. ఇక రాజకీయ నేతలైతే తమ మద్దతుదారులకు మందు, ముక్క తప్పనిసరిగా ఇస్తారు. ఇలాంటి ఘటననే విశాఖలో చోటుచేసుకుంది. నిరుడు  దసరా పండుగ నాడు విశాఖ దక్షిణ మండల వైసీపీ అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్‌ తమ మద్దతుదారులు, మరికొంత మందికి కోడి, లిక్కర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. విశాఖ డాబా గార్డెన్స్‌లోని వైసీపీ ఆఫీసు వద్ద అప్పట్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వైసీపీ నేత కోడి, మద్యం పంపిణీ చేశారు. గతంలో కేజీ మటన్‌ ఇచ్చామని, ఈ ఏడాది కోడి, క్వార్టర్‌ మందు ఇస్తున్నట్లు ఆయన బహిరంగంగానే చెప్పుకున్నారు. గత ఏడాది వైసీపీ విశాఖ దక్షిణ మండల అధ్యక్షుడు చేసిన ప్రచారాన్ని వైసీపీ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఓర్వ లేకపోయారు. సరిగ్గా సంవత్సరం కాపు కాశారు. సోమవారం నాడు కనుమ పండగను పురస్కరించుకుని ఒక రోజు ముందు అంటే సంక్రాంతినాడే వైసీపీ కార్యకర్తలు, నాయకులకు మద్యం పంపిణీ చేశారు. ఇది చీప్ లిక్కర్ కావడం గమనార్హం. జగన్ పాలనకు దర్పం పట్టే విధంగా వైసీపీ ఎమ్మెల్యే తన కాలేజి క్లాస్ రూమ్లలోనే చీప్ లిక్కర్ పంపిణీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. తరగతి గదిలో విద్యార్థులు కూర్చొనే బెంచీలపై వైసీపీ నేతలను కూర్చోబెట్టి పంపిణీ చేయడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాలేజి ప్రాంగణంలోకి వైసీపీ శ్రేణులు భారీగా తరలి రావడం ఫుల్ బాటిల్స్, కోడి మాంసం తీసుకొని ఇంటికి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి.  మద్యపాన నిషేధం అంటూ ప్రచారం చేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు మద్యం బాటిల్స్ పంపిణీ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

ఈడీ.. కవిత.. దాగుడుమూతలు!

కారణాలు ఏమైనా ఢిల్లీ మద్యం కుంభకోణంలో  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తనయ, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు వ్యవహారం గత కొంత కాలంగా రాజకీయ ప్రాముఖ్యత కలిగిన అంశంగా మారిపోయింది. ఆమెను ఈడీ విచారణకు పిలవడం, ఆమె కోర్టును ఆశ్రయించడం, ఈడీ వేగం మందగించడం వంటి అంశాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకూ హాట్ టాపిక్ గానే ఉన్నాయి. కవితను అరెస్టు చేసే విషయంలో ఈడీ ఇదే కేసులో మిగిలిన నిందితుల పట్ల చూపిన చొరవ, దూకుడు చూపలేదన్నది మాత్రం వాస్తవం. సరిగ్గా ఈ అంశమే బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య మైత్రిని సామాన్య జనానికి కూడా అర్ధమయ్యేలా చేసింది. అలాగే , బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్ అన్న ఆరోపణలే వాస్తవమన్న భావన ప్రజలలో కలగడానికి దోహదపడింది. ఫలితంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీలు జమిలిగా నష్టపోయాయి. సరే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడింది. ఈ సారి ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ కు దూరం జరిగితేనే ఏదో మేరకు లబ్ధి పొందుతామన్న ఆలోచనలో ఉంది.  అదే సమయంలో బీఆర్ఎస్ తాము బీజేపీకి దగ్గర అన్న భావన ప్రజలలో కలిగేలా వ్యవహరించడానికి మొగ్గు చూపుతోంది. అందులో భాగమే కవిత హిందుత్వ మంత్రం జపించడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ వైఖరి ఇలాగే కొనసాగితే.. భారీ నష్టం తప్పదన్న భావనలో ఉన్న కమలం.. బీఆర్ఎస్ తమకు ప్రత్యర్థి పార్టీయే అని ప్రజలను నమ్మించడానికి  బీజేపీ శతథా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో బీజేపీతో తమకు వైరం లేదని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ తంటాలు పడుతోంది. సరిగ్గా ఈ తరుణంలో  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది.  అయితే ఆ నోటీసులను కవిత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించదు. తనను విచారణకు పిలిచే హక్కు ఈడీకి లేదని పేర్కొంటూ, సుప్రీం కోర్టు రక్షణ తనకు ఉందని ఈడీ నోటీసులకు సమాధానం ఇచ్చి ఊరుకున్నారు. అయినా మద్యం కుంభకోణం తెరమీదకు వచ్చి కవితపై ఆరోపణలు వెల్లువెత్తనప్పటి నుంచీ  కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ విచరణ పేరిట దాగుడు మూతలు ఆడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు అరెస్టు, అదిగో రెండు మూడు రోజుల్లో అరెస్టు అంటూ లీకులు వదులుతూ పొలిటికల్ హీట్ క్రియేట్ చేయడం వినా ఆ రెండు సంస్థలూ కవిత అరెస్టు విషయంలో ముందుకు అడుగేసింది లేదు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈడీ ఏమైనా దూకుడు పెంచుతుందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో ఇలా నోటీసుల మీద నోటీసులు ఇచ్చి కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఈడీ ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోవడాన్ని చూపుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఎలాగైతే కేజ్రీవాల్ కు రక్షణగా నిలిచిందో.. కవితకు కూడా సుప్రీంలో విచారణలో ఉన్న పిటిషన్ రక్షణగా నిలుస్తుందని అంటున్నారు.   తనను  ఇంటి వద్దే విచారించాలని కవిత గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.  విచారణల విషయంలో మహిళలకు చాలా వెసులుబాట్లు ఉండాలని ఆమె తరపు లాయర్లు సుప్రీంకోర్టులో వాదించారు. ఆ నేపథ్యంలో అప్పట్లో  కవితను విచారణకు పిలవకుండా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఆమె పిటిసణ్ విచారణను  వాయిదా వేసింది. దాంతో ఆ మధ్యంతర ఉత్తర్వులను చూపుతూ తాను విచారణకు హాజరయ్యేది లేదని కవిత స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఈడీ నోటీసుకు సమాధానంగా పంపారు.  దీంతో ఈడీ తదుపరి ఏ చర్య తీసుకోనుందన్నది ఆసక్తిగా మారింది. కవిత పిటిషన్ విచారణ వేగవంతం చేయాలని సుప్రీం కోర్టును కోరుతుందా చూడాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఈడీ నోటీసుతో తెలంగాణ రాజకీయాలలో మళ్లీ  మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్టు అవుతారా? తేదా గతంలోలా దాగుడుమూతలతో సరిపెట్టేస్తారా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో విస్తృతంగా జరుగుతోంది.  

ఫ్యామిలీ ప్యాకేజీ లెక్కన జగన్ టికెట్ల పందేరం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ఆయన పాలన పదే పదే రుజువు చేస్తున్నది. పరిశీలకులు కూడా జగన్ హామీ ఇచ్చారంటే అది నెరవేరదని తేలిపోయినట్లేనంటూ సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. అలాగే ఓ మాట చెప్పారంటే దానికి కట్టుబడి ఉండే తత్వం ఆయనలో లేదని చెబుతున్నారు. గతంలో పలు సందర్భాలలో జగన్ తమ పార్టీలో కుటుంబానికి ఒకటే టికెట్ అంటూ ఘనంగా ప్రకటనలు గుప్పించారు. అయితే ఆచరణలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముంగిట సిట్టింగుల మార్పు అంటూ ఓ వింత ప్రయోగానికి తెరలేపి ఆశావహుల్లో, సిట్టింగుల్లో, నేతల్లో, క్యాడర్ లో నిరాశనూ, నిరుత్సాహాన్నీ, ఆవేదననూ, అయోమయాన్నీ, గందరగోళాన్నీ సృష్టించిన జగన్.. ఇప్పుడు టికెట్ల విషయంలో కూడా గతంలో ఎవరూ చేయని విధంగా కుటుంబ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు 20కి పైగా అసెంబ్లీ స్థానాలను కేవలం ఐదు కుటుంబాలకు అప్పగించేస్తున్నారు. ఇది గతంలో ఆయన ఘనంగా చెప్పిన ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్నదానికి పూర్తి విరుద్ధమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యం అంటూ జగన్ చేస్తున్న విన్యాసాలు, ప్రయోగాలు ఓటమికే దారి చూపుతున్నాయంటూ సొంత పార్టీ నేతలూ, క్యాడర్ గగ్గోలు పెడుతున్నా ఆయన చెవికి ఎక్కడం లేదు. మొత్తం మీద రానున్న ఎన్నికలలో ఆయన పార్టీ అభ్యర్థలను ఫ్యామిలీ ప్యాకేజీల ప్రకటించేస్తున్నారు. ఆయన ఎవరికి టికెట్ ఇస్తున్నారు? ఎవరికి నిరాకరిస్తున్నారు? ఎవరిని నియోజకవర్గం మారుస్తున్నారు అన్న విషయంలో పార్టీ నేతలకే అర్ధం కాని పరిస్థితి ఉంది.  విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఈ సారి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులలో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన వారికి కనీసం నాలుగు సీట్లు దక్కే అవకాశం ఉంది. అలాగే మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకులకు ఐదు స్థానాలలో పోటీ చేసే అవకాశం ఉంది. ముందుగా బొత్స ఫ్యామిలీని తీసుకుంటే  ఆయన సోదరులు ఇద్దరు, ఆయన మేనల్లుడు, భార్యకు టిక్కెట్లు ఇవ్వాలని జగన్ ఇప్పటికే డిసైడ్ అయిపోయినట్లు చెబుతున్నారు. అలాగే గత కొద్ది కాలంగా బొత్స తన కుమారుడికి కూడా వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని జగన్  వద్ద గట్టిగా పట్టుబడుతున్నారు. అవసరమైతే తాను పోటీ నుంచి వైదొలగి అయినా సరే తన కుమారుడిని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి నిలబెట్టాలని చూస్తున్నారు. అందుకు జగన్ అంగీకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒక వేళ అలా కాకుండా బొత్సకూ, ఆయన కుమారుడికీ కూడా పోటీ చేసే అవకాశం ఇచ్చే చాన్సెస్ ను కూడా తీసిపారేయలేమని చెబుతున్నారు. అంటే వచ్చే ఎన్నికలలో కేవలం బొత్స కుటుంబం నుంచే ఐదు నుంచి ఆరుగురు వైసీపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.  ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయానికి వస్తే ఆయన కుటుంబానికి చెందిన వారు నలుగురు వచ్చే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగనున్నారు. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో  నగరి, రిజర్వుడు నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన అన్ని స్థానాలలోనూ పెద్దరెడ్డి, ఆయన కుటుంబీకులు, ఆయన వర్గీయులే పార్టీ అభ్యర్థులుగా ఉంటారన్న టాక్ అయితే వైసీపీలో గట్టిగా వినిపిస్తోంది.   వీరే కాకుండా  మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరులు నలుగురు ఎమ్మెల్యేలు. ఈ సారి కూడా వారందరికీ, వారితో పాటు వారి వారసులూ కూడా  పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారసుల సంగతి ఎలా ఉన్నా బాలనాగిరెడ్డితో పాటు వారి సోదరులకూ ఈ సారి పార్టీ టికెట్ ఖాయమేనని చెబుతున్నారు.  ఇక మంత్రి ఆదిమూలం సురేష్ తో పాటు ఆయన సోదరుడికీ జగన్ ఇప్పటికే టిక్కెట్లు ప్రకటించారు. ఇక జగన్   ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. అలాగే కారుమూరి కుటుంబాలకు కూడా రెండేసి టికెట్లను ఇప్పటికే జగన్ ఖరారు చేసేశారని అంటున్నారు.   అంటే వైసీపీ నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేసే వారిలో అత్యధికులు ఓ నాలుగైదు కుటుంబాలకు చెందిన వారే ఉంటారన్న మాట.   అయితే జగన్ ఈ తీరు పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక విపక్షాలైతే జగన్ పార్టీ తరఫునుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో  అనివార్యంగా ఇలా ఓ నాలుగైదు కుటుంబాలకు చెందిన వారినే అభ్యర్థులుగా దింపాల్సిన పరిస్థితి జగన్ కు వచ్చిందని విమర్శలు, సెటైర్లు గుప్పిస్తున్నాయి.   ఇక చెవిరెడ్డి భాస్కరరెడ్డి , అలాగే కారుమూరి కుటుంబాలకు కూడా రెండేసి టికెట్లను ఇప్పటికే జగన్ ఖరారు చేసేశారని అంటున్నారు.  

షర్మిలకు లైన్ క్లియర్.. జగన్ కు రోడ్ క్లోజ్?!

వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ అయిపొయింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామా చేసేశారు. సరిగ్గా సంక్రాంతి పండుగ వేళ ఆయన మాజీ పీసీసీ చీఫ్ అయిపోయారు. ఇక తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గెకు   పంపించేశారు. ఆయన రాజీనామా  షర్మిల కోసమే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. షర్మిల తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. త్వరలోనే షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌ పార్టీ పగ్గాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. షర్మిలకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే తాను సంతోషంగా తప్పుకుంటానని   ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన రాజీనామా చేసి షర్మిలకు లైన్ క్లియర్ చేసేశారని చెప్పాలి. ఇక ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేతికి వెళ్లడమే తరువాయి.  షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ నేత.  ప్రస్తుతానికి ఆమెకి పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వలేదు. కానీ  పీసీసీ చీఫ్ షర్మిలనే అని ఖరారై పోవడంతో ఆమె ఇప్పటికే ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ మాజీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఏపీ రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వైసీపీ నేతలను తిరిగి తమ పార్టీలోకి చేర్చుకోవడమే టార్గెట్ గా షర్మిల అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   ఈ వారంలోనే షర్మిలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. ఇకపై ఏపీలో అన్నా చెల్లెళ్ళ వార్ మొదలవబోతుందని షర్మిల ఇప్పటికే సంకేతాలు ఇచ్చేశారు. అయితే, షర్మిల అసెంబ్లీకి పోటీ చేస్తారా లేక పార్లమెంటు బరిలో దిగుతారా లేక రాజ్యసభకు వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే  ఏది ఏమైనా ఇకపై ఏపీ రాజకీయాలు మరింత రసకందాయంగా సాగనున్నట్లు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకూ ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటమి మధ్య పోరు నడుస్తుంది. మరి ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఏమి అద్భుతాలు సాధిస్తుందన్నది ఆసక్తికరంగామారింది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన పని లేదు. కనీసం   ఒక్క శాతం ఓటింగ్ ఉందా అంటే అనుమానమే. నిజం చెప్పాలంటే ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పగ్గాలు ఎవరు అందుకున్నా పార్టీని బతికించడం కష్టం అన్న భావన ఉంది.  అయితే గత ఆరు నెలల ముందు వరకూ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ను అలాగే అనుకున్నా.. ఆరు నెలలలో అధికారం దక్కించునే స్థాయికి ఎదిగింది.  ఏపీలో అధికారం పొందే స్థాయికి కాకపోయినా షర్మిలను ముందు పెట్టి ఎంతో కొంత ఉనికి చాటుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేస్తోంది. మరి కాంగ్రెస్ ఇక్కడ రాజకీయం మొదలు పెడితే నష్టం ఎవరికి అన్నదానిపై సహజంగానే విశ్లేషణలు జరుగుతున్నాయి.  అయితే  ఏపీలో కాంగ్రెస్ అంటూ బలపడితే నష్టపోయేది జగన్ మోహన్ రెడ్డే. ఇప్పుడు వైసీపీలో ఉన్న సీనియర్ నేతలంతా ఇంతకు ముందు కాంగ్రెస్ నేతలే. జగన్ వైపు మళ్లింది కూడా కాంగ్రెస్ క్యాడరే. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ చచ్చి వైసీపీకి ఊపిరి పోసింది. మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ బ్రతికి వస్తే అది తీసేది వైసీపీ ఊపిరే అంటున్నారు పరిశీలకులు. అందుకే షర్మిలకు పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది అనగానే జగన్ కు రోడ్ క్లోజ్ అయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  షర్మిల ఎంత త్వరగా పీసీసీ బాధ్యతలు స్వీకరిస్తే అంత వేగంగా జగన్ ఇబ్బందులలో కూరుకుపోతారు. జగన్ సిట్టింగుల మార్పు నిర్ణయంతో వైసీపీలో ఇప్పుడు తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో షర్మిల ఎంట్రీతో  ఏపీ రాజకీయాలను ఎలాంటి మలుపులు తిరగనున్నాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణరెడ్డి లాంటి వారు షర్మిలతో ప్రయాణం మొదలు పెట్టగా.. షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ నుంచి మరిన్ని వలసలు ఖాయమని చెబుతున్నారు..

జగన్ కు బాలినేని రిటార్డ్.. అదిరిపోయిందిగా?

సిట్టింగుల సీట్లు మార్చే ప్రయోగం చేస్తున్న వైసీపీ అధినేత-సీఎం జగన్ ప్రయత్నం బెడిసికొడుతోంది. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి, ఆయన సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో మిస్ ఫైర్ అయ్యిందనే పరిశీలకులు అంటున్నారు.  ఒంగోలులో బాలినేనికి వ్యతిరేకత ఉన్నందున, ఆయనను గిద్దలూరు లేదా మార్కాపురం నియోజకవర్గానికి పంపించాలన్నది పార్టీ అధినేత జగన్ ఆలోచన. కానీ తాను ఒంగోలు తప్ప మరెక్కడా పోటీ చేసేది లేదని బాలినేని కుండబద్దలు కొట్టేశారు. అంతే కాదు ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి తన మిత్రుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డికే టికెట్ ఇవ్వాలని కూడా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సొంత నియోజకవర్గం నుంచి బాలినేనికి అనూహ్య మద్దతు లభించింది. వైసీపీ మేయర్, కార్పొరేటర్లు అంతా బాలినేని వెంటే నిలిచారు.  బాలినేనికి ఒంగోలు సీటు విషయంలో. ఒంగోలు మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు, కీలక నేతలు హైదరాబాద్‌లో ఉన్న బాలినేనికి బాసటగా నిలిచారు.   జగన్ కంటే తమకు బాలినేనే ముఖ్యమని స్పష్టం చేశారు.  పార్టీ ఏదైనా సరే తాను  వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని స్పష్టం చేయడమే కాకుండా ఆ విషయాన్ని   జగన్, విజయసాయిరెడ్డికి స్పష్టం చేశారు. విజయవాడలో రోజుల తరబడి మకాం వేసినా బాలినేనికి జగన్ అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో ఆయన ఒక ఓపెన్ అయిపోయారు. జగన్ ను కలిసేదే లేదని తెగేసి చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఒక వేళ మనసు మార్చుకుని ఒంగోలు నుంచి బాలినేనికి అవకాశం ఇచ్చినా కూడా బాలినేని ఇప్పుడు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి దాకా పార్టీ తరఫున పోటీ చేయాలంటే కోట్లలో సొమ్ము డిపాజిట్ చేయాలని జగన్ ఆశావహులకు షరతు పెడుతున్నారు. ఈ విషయంలో బాలినేనే జగన్ కు తాను పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే 170 కోట్ల తనకు డిపాజిట్ చేయాలని రిటార్డ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒంగోలులో పాతిక వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన తరువాతే తాను వైసీపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి రంగంలోకి దిగుతానని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతే కాకుండా ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జీల నియామకాలు కూడా తాను సూచించిన మేరకే జరగాలని బాలినేని జగన్ కు అల్టిమేటమ్ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. అంతే కాకుండా మాగుంట శ్రీనివాుల రెడ్డికే ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఇవ్వాలని కూడా బాలినేషని షరతు పెట్టారని అంటున్నారు. గతంలో చెప్పినట్లుగానే పార్టీతో సంబంధం లేకుండా ఇద్దరమూ కూడా ఒంగోలు నుంచే రంగంలోకి దిగుతామనీ, మాగుంట లోక్ సభకు, తాను అసెంబ్లీకి ఒంగోలు నుంచే పోటీ చేస్తామని బాలినేని జగన్ కు తెగేసి చెప్పినట్లు సమాచారం.  

జగన్ కు ‘కాపు’ కాయం.. తేల్చి చెప్పేసిన వంగవీటి రాధాకృష్ణ!

జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో విజయం కోసం పేక మేడలు కడుతున్నారు. వాటినే కోటలుగా భావిస్తూ ఇష్టారీతిన  సిట్టింగ్ అభ్యర్థులను మార్చేస్తున్నారు. దీంతో వైసీపీలో పరిస్థితి ఇప్పుడు చిన్న పాటి గాలి వీస్తే కుప్పకూలిపోయేలా మారిపోయింది. దీంతో పార్టీ నేతలలో, కేడర్ లో భయం, ఆందోళన, గందరగోళం ఏర్పడింది.   ఉండేవాళ్ళు ఉండండి, వెళ్లే వాళ్లు వెళ్లండి   అనే ధోరణిలో జగన్ వ్యవహరిస్తున్నారు.   ఆ విషయం  పక్కన పెడితే జగన్ కు ఒక విషయంలో మాత్రం ఆందోళన వెంటాడుతోంది. అదే రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా ఉండే కాపు సామాజికవర్గాన్ని తన వైపు తిప్పుకోవడం. దీని కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ బెడిసికొడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీకి కాపు సామజిక వర్గ ఓటర్లను ఆకర్శించే ఒక ఐకాన్ కావాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనతో కాపు సామాజికవర్గాన్ని ఆకర్షిస్తుండగా.. వైసీపీ ఎలాగైనా దానిని అడ్డుకోవాలని టార్గెట్ చేసుకొని పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే జగన్ ఎన్నో ఎత్తులు వేశారు. ముందుగా జనసేనను తెలుగుదేశంతో కలవనీయకుడదన్న ఉద్దేశంతో ఎన్నెన్నో కుట్రలు చేశారు. కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. అది కుదరకు చీల్చేందకు వ్యూహాలు పన్నారు.  కానీ అవేమీ వర్కౌట్ కాలేదు.  దీంతో కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభంను ఫోకస్ లోకి తీసుకొచ్చారు. ముద్రగడను పార్టీలోకి చేర్చుకొని కాపు సామాజిక వర్గాన్ని ఎంతోకొంత పవన్ వైపు వెళ్లకుండా నియంత్రించవచ్చని ఆశపపడ్డారు. కానీ  ఇప్పుడు ముద్రగడ కూడా జనసేన నేతలలో టచ్ లో ఉన్నారు. ఇక యంగ్ క్రికెటర్ అంబటి రాయుడును వైసీపీలోకి చేర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానం నుంచి రాయుడును పోటీ చేయించి..  రాష్ట్రమంతా ఆయనతో ప్రచారం చేయించాలని భావించారు. కానీ రాయుడు ఇలా చేరినట్లే చేరి అలా రాజీనామా చేసి జనసేన గూటికి చేరారు. ఆ తర్వాత సినీ దర్శకుడు వీవీ వినాయక్ ను రంగంలోకి దింపాలని శతవిధాలా ప్రయత్నించారు. గోదావరి జిల్లాలో వినాయక్ తో ప్రచారం చేయించాలని కలలు కన్నారు. కానీ, వినాయక్ కూడా ససేమీరా అన్నట్లు తెలిసింది.  దీంతో వంగవీటి మోహన్ రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణను తమ వైపు తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. నిజానికి రెండు మూడేళ్లుగా వైసీపీ నేతలు వంగవీటి రాధా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అవకాశం ఉన్న వరకూ ఈ ప్రయత్నాలు సాగాయి. ప్రస్తుతం రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.  రాధా వైసీపీలోకి వస్తే కనుక విజయవాడ సెంట్రల్ స్థానాన్ని కేటాయిస్తామని వైసీపీ ఆఫర్ ఇచ్చినట్లు కూడా తెలిసింది. రాధను వైసీపీలోకి తెచ్చుకునేందుకు ఆ మధ్యన మిధున్ రెడ్డి చర్చలు జరిపి రాయబారం నడిపారు. రాధాతో కాస్త అనుకూలంగా ఉండే మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలతో..  టీడీపీ నుండి వెళ్లిన ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీల‌తో కూడా వైసీపీ రాయబారం నడిపింది.  రాధా ఇటీవల త‌న తండ్రి రంగా వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని కాశీకి వెళ్లి పిండ ప్ర‌దానం చేశారు. రాధా వెంట కొడాలి నాని కూడా తోడు వెళ్లారు. దీంతో రాధా వైసీపీలోకి వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు.    కానీ, రాధా ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. త‌న‌కు పార్టీ మారాల్సిన అవ‌స‌రం లేద‌ని  తేల్చి చెప్పేశారు. అలాగే విజ‌య‌వాడ వైసీపీ ఇంచార్జ్ బొప్ప‌న భ‌వ‌కుమార్‌ను కూడా టీడీపీలోకి రావాలని రాధా ఆహ్వానించిన‌ట్టు ప్ర‌చారం జరుగుతున్నది. మొత్తంగా  తాను మాత్రం టీడీపీని వీడ‌డం లేద‌న్న రాధా స్పష్టంగా చెప్పేశారు.  దీంతో ఇప్పుడు జగన్ కాపు కల నెరవేరే పరిస్థితి లేదని తేలిపోయింది. రాధా కోసం ఇన్నాళ్లుగా వైసీపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని స్పష్టమైపోయింది. రాధాను వైసీపీ గూటికి చేర్చే ప్రయత్నాలలో భాగంగా కొడాలి నానీ కాశీ వరకూ వెళ్లినా అది శుష్క ప్రయత్నంగానే మిగిలిపోయింది. తెలుగుదేశం, జనసేన కూటమిలో పవన్ కళ్యాణ్ కాపు సామజిక వర్గానికి బిగ్ ఐకాన్ గా ఉండగా.. తెలుగుదేశం నుండి వంగవీటి రాధా ప్రభావం కూడా అదే స్థాయిలో ఉండనుంది. ఇక అంబటి రాయుడు కూటమికి మరో అడ్వాంటేజ్ అయ్యారు. అలాగే ముద్రగడ కూడా జనసేనలోకి వస్తే ఇక కంప్లీట్ కాపు సామజిక వర్గాన్ని జగన్ మర్చిపోవాల్సిందే. ఉత్తరాంధ్ర నుండి కోస్తాంధ్ర వరకూ.. గోదావరి నుండి రాయలసీమ వరకూ ఎటు చూసినా కాపు సామజిక వర్గం జగన్ కు దూరమైనట్లే.  ఇది జగన్ మోహన్ రెడ్డికి తీరని నష్టమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

18 అసెంబ్లీ, 2 పార్లమెంట్.. జనసేన పోటీ చేసే స్థానాలివే?

తెలుగుదేశం, జనసేన  మధ్య పొత్తు ఖరారై చాలా కాలమైంది. కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడమూ ఖాయమైపోయింది. అయితే పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే సీట్లెన్ని అన్న విషయంలో ఇప్పటి దాకా స్సష్టత రాలేదు. చాలా చాలా విశ్లేషణలు వినిపించాయి.  అయితే ఇతమిథ్థండగా పొత్తులో భాగంగా  జనసేన ఇన్ని స్థానాలలో పోటీ చేస్తుంది అన్న విషయం మాత్రం ఇప్పటికీ అధికారికంగా తెలుగుదేశం, జనసేనల నుంచి ఎటువంటి స్పష్టతా రాలేదు. మరో వైపు  అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే 51 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేసింది. దీంతో విపక్ష   టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల ప్రకటన ఎప్పుడా అన్న ఆసక్తి పరిశీలకులలోనే కాదు, జనబాహుల్యంలో కూడా వ్యక్తం అవుతోంది.   ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన పోటీ చేసే స్థానాల విషయంలో ఇరు పార్టీలూ ఒక అంగీకారానికి వచ్చినట్లు ఆ పార్టీల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం.  భోగి పండుగకు ముందు రోజు అంటే శనివారం (జనవరి 13) తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు  అంశంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. ఈ భేటీలో తెలుగుదేశంతో పొత్తులో భాగంగా  జనసేన పోటీ చేసే స్థానాలపై ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలేంటి, ఎన్ని అన్నది  అధికారికంగా ఇరు పార్టీల నుండి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ,  జనసేన పోటీ చేసే స్థానాలివే  అంటూ ఓ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  పొత్తులో భాగంగా   జనసేన  18 అసెంబ్లీ స్థానాలలో రంగంలో ఉంటుందని తెలుగుదేశం, జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సీట్ల ఒప్పందంపైనే తాజా భేటీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించి ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.  అయితే, దీనిపై అటు జనసేన గానీ, ఇటు తెలుగుదేశం గానీ ఇంకా స్పందించలేదు.. అలాగని ఖండించనూ లేదు.  వైరల్ అవుతున్న జాబితా ప్రకారం చూస్తే జనసేన పిఠాపురం, విజ‌య‌వాడ వెస్ట్‌, చీరాల‌, ద‌ర్శి, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రూర‌ల్‌, తిరుపతి, మాడుగుల‌, పోల‌వ‌రం, పెడ‌న‌, నంద్యాల‌, అనంత‌పురం రూర‌ల్‌, ధ‌ర్మ‌వ‌రం, క‌ళ్యాణ‌దుర్గం, పూత‌ల‌ప‌ట్టు, విశాఖ, మచిలీపట్నం స్థానాలలో పోటీ చేస్తుందని అంటున్నారు.  విశాఖ‌ప‌ట్నానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ‌యాద‌వ్ తాజాగా జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. ఈయ‌న‌కు జనసేనలో టికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించగా.. వైసీపీ ఎంపీ బాల‌శౌరి త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీలో చేరనుండగా.. ఆయనకు మచిలీ పట్నం టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.  ఇక పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల విషయానికి వస్తే రెండు పార్లమెంట్ స్థానాలలో ఒకటి మ‌చిలీప‌ట్నం కాగా..  కసరత్తులు తర్వాత మ‌రో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ఎమిటన్నది ఖరారౌతుందని అంటున్నారు. కాగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేయనున్నారన్నది రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో ఎంతో ఆసక్తి రేకెత్తించే ప్రశ్న. కాగా, పవన్ భీమవరం, గాజువాకలలో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఇప్పుడు కేటాయించిన స్థానాలలో అవి రెండూ లేవు.  దీంతో పవన్ కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురంలలో ఏదో ఒక స్థానం నుంచి   పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, ఒక లోక్ సభ స్థానం నుండి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేయనున్నట్లు గతంలోనే పార్టీ వర్గాలు పేర్కొనగా ఇప్పుడు కేటాయింపులలో దక్కిన మచిలీపట్నం స్థానం నుండే నాగబాబు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక మరో పార్లమెంట్ స్థానం ఏదీ అనేది మరో వారం రోజులలో ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తున్నది.  కాగా, తెలుగుదేశం, జనసేన అభ్యర్థులతో కలిపి తొలి జాబితా అభర్ధులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇందుకోసం జనసేన కూడా బలమైన అభ్యర్థులతో ఒకటీ రెండు రోజులలోనే తొలి జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇక టికెట్ల వివాదాలు రాకుండా,  నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయ‌కుండా ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకుని అడుగులు వేయాల‌ని ఇరు పార్టీల అధినేత‌లు నిర్ణ‌యించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు తగిన జాగ్రత్తలు కూడా మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పొత్తులు దెబ్బ‌తిన‌కుండా చూసుకొనేందుకు. ఇరు పార్టీల క్యాడర్ కలిసి పనిచేసేందుకు ఏం చేయాలన్నదానిపై చర్చలు ఒక  కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది. అలాగే క‌మ్యూనిస్టుల‌ను క‌లుపుకొని వెళ్లేందుకు కూడా అంగీకారం జరిగినట్లు తెలుస్తున్నది.  

జగన్ పాలన.. నాటి పాలెగాళ్ల రాజ్యం!

ఏపీలో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది? జగన్ హయంలో ఏపీ ప్రజలు ఎలా ఉన్నారు? వైసీపీ భజన బృందం చెబుతున్నట్లుగా రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారా? అంటే నూటికి నూరు శాతం లేదనే చెప్పాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు జగన్ హయంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని చెప్పక తప్పదు. అందుకే ఇప్పుడు పరిశీలకులు ఏపీలో జగన్ పాలనను పూర్వం ఇదే ఆంధ్ర రాష్ట్రంలోని పాలెగాళ్ళ పాలనతో పోల్చి తూర్పార పడుతున్నారు. ఆంధ్ర ప్రాంతంలో 600 సంత్సరాల క్రితం రాచ వేమారెడ్డి అనే ఓ రాజు అరాచక పాలన సాగింది.  సకల శుభాలతో వర్ధిల్లిన కొండవీటి రాజ్యాన్ని ఈ వేమారెడ్డి పతనం చేశారు. కొండవీడు ఆఖరి రాజు అయిన రాచ వేమారెడ్డి  దుర్మార్గపు పాలన అత్యంత చెత్త పాలనగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. రకరకాల వింత పన్నులను విధిస్తూ ప్రజలను పీడించి పిప్పి చేశాడు. అప్పుడే పుట్టిన బిడ్డపై పురిటి పన్ను, రైతులకు సాగు నీరుకు తూము పన్నులు వంటివి విధించాడు.  ఒక వైపు కరువు కాటకాలతో సతమతమౌతున్న  ప్రజలపై మోయలేని పన్నుల భారాలను మోపి వేధించారు. రకరకాల పన్నులు, చెత్త పాలనతో రాజ్యంలోని ప్రజలు విసిగిపోయారు. రాజు చుట్టూ ఉండే అనుచరులు, సంస్థానంలోని సేవకులకు కూడా వేమారెడ్డి అంటే విరక్తి వచ్చేసింది. అందుకే వేమారెడ్డి వద్ద పనిచేసే ఓ వ్యక్తి అతన్ని హత్య చేసి రాజ్యంలోని ప్రజలకు విముక్తి కలిగించాడు. వేమారెడ్డితోనే ఆ వంశం అంతమైపోగా.. ఆ తరువాత కొండవీడు రాజ్యం గజపతులు, విజయనగర సామ్రాజ్యం ఏలుబడిలోకి వెళ్లిపోవడంతో మళ్ళీ కొన్నాళ్ళకు సాధారణ పరిస్థితికి వచ్చింది. అలాగే సుమారు 200 సంవత్సరాల క్రితం రాయలసీమలో అనాగరిక గ్రామీణ ముఠా కక్షలు మొదలయ్యాయి. ఈ సాంప్రదాయాన్ని పాలెగాళ్లు, పెత్తందార్లు అని పిలవగా.. బ్రిటిష్ పాలకులు ఫ్యాక్షనిస్టులుగా పిలిచేవారు. సామాజిక, ప్రజా ప్రయోజనాలు అనేవి లేకుండా రాజకీయాల కోసం, సారాయి వ్యాపారం, సివిల్ కాంట్రాక్టులు, నాపరాయి గనుల కోసం ఈ ఫ్యాక్షన్ పుట్టుకొచ్చి రాయలసీమలో బాంబుల మోత మోగిపోయింది.  ఈ పాలెగాళ్ళ లక్ష్యం, ఆలోచన, తీరు ఒక్కటే. ప్రజలపై తోచినంత పన్నులు విధించి తాలిబన్ తరహా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోని శాంతి భద్రతలను గుప్పెట్లో పెట్టుకోవడం, విభజించు పాలించు సిద్ధాంతంతో ప్రజలను రెండు వర్గాలుగా చీల్చి వారిని ఒకరిపై ఒకరికి పగలు, ప్రతీకారాలు పెంచి పాలెగాళ్ళు పెత్తనం చేసేవారు. ఈ పాలెగాళ్ళు తమని తాము హీరోలుగా భావించుకుంటూ ప్రజలను బిచ్చగాళ్లను చేసి ఆడించారు. రాజకీయంగా ఎదుగుదల కోసం నిసిగ్గుగా రాజకీయాలను రక్తసిక్తం చేసిన ఘనులు ఈ పాలెగాళ్ళు. ఆ తర్వాత 19వ శతాబ్దం తొలినాళ్లలో రాయలసీమ ప్రాంతం బ్రిటిష్ ఆధిపత్యంలోకి రాగా.. రాయలసీమ మొదటి కలెక్టర్ థామస్ మన్రో 1800లో 80 మంది పాలెగాళ్ళను గుర్తించారు. వారిలో 37 మంది పులివెందుల చుట్టుపక్కల వారే కావడం విశేషం. ఈ పాలెగాళ్ళంతా ఒక పెద్ద పాలెగాడి అండతో పెత్తనం సాగించేవారు. ఆ పెద్ద పాలెగాడు రాజుకు లోబడి ఉండేవాడు. ప్రతి పాలిగాడికి ఒక సైన్యం ఉండేది. ఈ సైనికులు యుద్ధాల సమయంలో గ్రామాలను లూటీ చేసి దోచుకుని సంపద పోగేసుకొనేవారు. ఈ పాలెగాళ్లలో కొందరు బ్రిటిష్ సైన్యంతో చేతిలో హతమవ్వగా.. మరికొందరిని ఉరి తీయించారు. మిగిలిన వారికి అధికారం తొలగించి పెన్షన్ ఇచ్చారు. కాగా  స్వాతంత్య్రం వచ్చాక ఫ్యాక్షన్ కొత్త రూపు సంతరించుకుంది. ప్రజా స్వామ్యంలో కూడా ఈ ఫ్యాక్షన్ లీడర్లు ప్రజలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రజల నిత్య అవసరాలకు కూడా ముఠా నాయకుడి దయాదాక్షిణ్యలపై ఆధారపడేలా చేసుకున్నారు. ఒకరిపై మరొకరు ఆధిపత్యపోరులో ఊళ్ళ మీద బాంబులు పడ్డాయి.. హత్యలు జరిగాయి.. పొలాలు బీడు వారాయి. ఆ తర్వాత ఈ బీడు భూమిని తవ్వి మైనింగ్ సొమ్ముతో ఫ్యాక్షనిస్టులు సంపద గుట్టలు పోగేసుకున్నారు. ముఠా తత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సొంతం చేసుకున్నారు. ఈ ఫ్యాక్షన్ కుటుంబాలలో ఇప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబం కూడా ఒకటి.  జగన్ తాత రాజారెడ్డి కూడా ఒక ఫ్యాక్షనిస్టు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు జగన్ పాలనలో కూడా అదే మార్క్ దౌర్జన్యాలు, అరాచకాలు మనం ఎన్నో చూశాం. చూస్తున్నాం.  తనను ఎదిరిస్తే అక్రమ అరెస్టులు చేసి వేధించడం చూశాం.  ప్రశ్నిస్తే నామరూపాల్లేకుండా చేయడం చూశాం. ఈ దౌర్జన్యాలు, ఆధిపత్య పోరు జగన్ కు వెన్నతో పెట్టిన విద్యని ఇప్పటికే నిర్ధారణైపోయింది.  దౌర్జన్యకారుల ఏలుబడిలో ప్రజల జీవన వసతులు పెరుగు పడతాయనుకుంటే అది పొరపాటే. అలాగే అభివృద్ధి పథకాలు అమలవుతాయనుకుంటే అమాయకత్వమే. ఒక ప్రాంతం అభివృద్ధి కాలేదు అంటే అక్కడ నాయకులు అసమర్థులని అర్ధం. అదే ఒక రాష్ట్రం అభివృద్ధి కాలేదంటే సమర్ధతలేని సీఎం కారణం. అలాగే తమకు కావాల్సిన అధికారం సాధించుకోవడం కోసం ఎన్ని కుట్రలైనా చేయడం, ఎన్ని హత్యలైనా చేయడం ఈ దౌర్జన్యకారుల పని. ఈ లక్షణాలన్నీ ఈ నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో కనిపించాయి. అందుకే ఇప్పటి ఈ ఏపీలో ఆనాటి పాలెగాళ్ళ పాలన సాగుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే.  ఆ విషయాన్ని ఇప్పటికే గుర్తించిన జనం ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. పాలెగాళ్ల పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నారు. 

ఎన్నికలకు ముందే జగన్ కు పరాభవం తప్పదా?

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే  జగన్ పార్టీకి బ్యాడ్ టైమ్..  తెలుగుదేశం పార్టీకి గుడ్ టైమ్ స్టార్ట్ అయిపోయింది.  మరో రెండు మూడు నెలల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలే అందుకు వేదిక కానున్నాయని అంటున్నారు. ఏపీ నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. మామూలుగా అయితే అంటే అసెంబ్లీలో పార్టీల బలాబలాలను బట్టి చూస్తే ఆ మూడూ కూడా జగన్ పార్టీకే దక్కాల్సి ఉంది. అయితే ఇప్పుడు జగన్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీకే ఓటు వేస్తారన్న నమ్మకం ఆ పార్టీ నేతలకే లేదు. ఇందుకు కారణం  పెద్ద సంఖ్యలో సిట్టింగులను మార్చేస్తూ తీసుకుంటున్న నిర్ణయమే కారణం. ఇప్పటికే పలువురు సిట్టింగులు జగన్ కు గుడ్ బై చెప్పేశారు. మరింత మంది అదే దారిలో ఉన్నారు.  టీడీపీకి అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో వైసీపీ గూటికి ఎప్పుడో చేరిపోయారు. అయితే గత ఏడాది జరిగిన ఎమ్మెల్యే కోటా  ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి  పంచుమర్తి అనురాధ బరిలో నిలిచి విజయం సాధించారు. దీంతో అప్పట్లో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని చెబుతూ జగన్ ఆ నలుగురినీ పార్టీ నుంచి బహిష్కరించారు.  ఇప్పుడా నలుగురూ తెలుగుదేశంకు చేరువయ్యారు.  దీంతో అసెంబ్లీలో  టీడీపీ బలం 23కి చెరింది. ఇక జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నా.. ఇప్పుడాయన వైసీపీలో ఉన్నారు. ఇక ఇప్పుడు విషయానికి వస్తే  రాజ్యసభకు ఎంపిక కావాలంటే.. 40 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి.  అది జగన్ పార్టీకి సంపూర్ణంగా ఉంది. అంటే.. 151 మంది ఎమ్మెల్యేల ఉన్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో..  జగన్  నిర్ణయాలు, వైఖరి కారణంగా  కారణంగా.. పార్టీలో అసంతృప్తి భగ్గుమంటోది. దీంతో ఆ పార్టీలో అసంతృప్తి ఎమ్మెలంతా.. గంపగుత్తగా తెలుగుదేశం బరిలో దింపిన రాజ్యసభ అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేసే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలో పంచుమర్తి విజయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దీంతో వచ్చే రాజ్యసభ ఎన్నికలలో కూడా తెలుగుదేశం అభ్యర్థులు బరిలో నిలిస్తే వారికి జాక్ పాట్ తగిలినట్లేననీ, విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని అంటున్నారు.  అసెంబ్లీ ఎన్నికలకు జస్ట్ రోజుల ముందు జరిగే రాజ్యసభ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందితే మాత్రం.. సినిమా రిలీజ్‌కు ముందే ట్రైలర్ విడుదలై.. సూపర్ డూపర్ హిట్ కొట్టినట్లేననడంలో సందేహం లేదు. జగన్ అధికారంలో ఉండగానే.. ప్రభుత్వంపై వ్యతిరేకతతో.. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కోటాలో జరిగిన ఎన్నికల్లో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలు గెలుపొందారు.   అలాగే పార్టీలోని అసంతృప్తి కారణంగా.. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం సాధించారు.  అదే విధంగా త్వరలో జరగనున్న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో జగన్ పై అసంతృప్తితో వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ అభ్యర్థులు జాక్ పాట్ కొట్టడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.