బాసరలో వసంత పంచమి వేడుకలు 

 తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని 108 కలశాల జలాలతో అభిషేకం నిర్వహించారు. పద్మశాలి సంఘం తరుపున ఆందజేసిన చేనేత పట్టువస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి సేవలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. ఇక బాసరలో అక్షరాభ్యాసం చేయించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని వచ్చారు. తెల్లవారు జామున 3 గంటల నుంచే చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదన నందన సరస్వతి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదన నందన సరస్వతి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అమ్మవారి పుట్టిన రోజు కావడంతో దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామునుంచే బారులు తీరారు. దీంతో అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కాగా సరస్వతి అమ్మవారికి వసంత పంచమి చాలా ప్రీతికరమైన రోజు. అక్షరాభ్యాసానికి యోగ్యకరమైనరోజు.. అందుచేత చాలా మంది తమ పిల్లలకు ఈరోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. అయితే ఇంటిలో కూడా అక్షరాభ్యాసం చేయించవచ్చునని వేద పండితులు చెబుతున్నారు. అలాగే తెలంగాణలో నిర్మల్ జిల్లాలో  నేడు సరస్వతీ దేవి జన్మించిన వసంత పంచమి కావడంతో  బాసరలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కాగా, వసంత పంచమి పర్వదినం సందర్భంగా విద్యా ప్రధాయిని సరస్వతి అమ్మవారి రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఆలయ అర్చకులు, వేదపండితులు వేకువజామున సరస్వతి, మహా కాళీ, లక్ష్మీ అమ్మవారికి మంగళ వాయిద్య సేవ, గణపతి పూజ, సుప్రభాత సేవ నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  

నగర శివారులో శిలాయుగపు చిత్రకళ!

 యాడారం గుట్టలో క్రీ.పూ. 8500 నాటి ఆదిమానవుల వర్ణ చిత్రాలు   మేడ్చల్ -మల్కాజ్గిరి జిల్లాలో వెలుగు చూసిన శిలాయుగపు చిత్రాలు!  హైదరాబాద్ పరిసరాల్లో ఆదిమానవుని అడుగుజాడలు!!  కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు ఈమని  శివనాగిరెడ్డి నగర శివారులో ఆదిమానవుని అడుగుజాడలు, శిలాయుగపు చిత్రకళ వెలుగు చూశాయని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా, సీఈవో  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. శ్రీరామోజు హరగోపాల్ నేతృత్వంలోని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు మహమ్మద్ నసీరుద్దీన్, అహోబిలం కరుణాకర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన వారితో కలిసి మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా, షామిర్ పేట మండలం, యాడారం గ్రామంలోని పెద్ద అంతరాల (అంతస్తుల) గుట్ట పైనున్న ఆదిమానవుని కొండచరియ ఆవాసాలను, వాటి గోడలపై ఉన్న ఆనాటి వర్ణ చిత్రాలను పరిశీలించారు.  నాలుగు అంతస్తుల రాతి ఆవాసపు మూడో అంతస్తులో 60 అడుగుల ఎత్తులో పక్కపక్క నున్న రెండు నిలువుబండలపై సూక్ష్మరాతి యుగానికి (క్రీ.పూ.8500) చెందిన మూపురమున్న, మూపురం లేని ఎద్దు బొమ్మలు, శరీరం లోపలి ఎముకలు కనిపించేట్లు(ఎక్స్ రే) చిత్రించిన  మరో ఎద్దు బొమ్మ, మూడు మనుషుల బొమ్మలు, కొత్త రాతి యుగానికి  చెందిన(క్రీ.పూ.4000), ఎద్దు, నెమలి బొమ్మలు, ఇనుపయుగానికి (క్రీ.పూ.1000) చెందిన ముగ్గులను పోలిన రేఖాచిత్రాలు, చారిత్రక తొలి యుగపు (క్రీ. శ. 1-2 శతాబ్దాలు) శృంగార భంగిమలో ఉన్న మూడు జంటలు, ఒకే దానిపై ఒకటి నిలబడి తేనె పట్టును అందుకుంటున్న ఎనిమిది కోతులు, పక్కనున్న మరో బండపై కొత్త రాతియుగపు ఎద్దును లాగుతున్న మనిషి, పక్కనే ఆవు దూడ బొమ్మలు ఉన్నాయని, ఈ రేఖాచిత్రాలన్నీ ఎర్రజాజు రంగు తో వేసినవని, ఇవి సూక్ష్మరాతి యుగం నుంచి చారిత్రక తొలి యుగం వరకు ఈ పెద్ద అంతరాల గుట్ట నివాస స్థావరమని తెలియజేస్తున్నాయని శివనాగిరెడ్డి వివరించారు. గుట్ట కింద సూక్ష్మరాతి యుగపు పనిముట్లు,  కొత్తరాతి యుగంలో రాతిగొడ్డళ్లను అరగదీసిన గుంటలు, ఒక ఇనుప యుగం సమాధి ఆనవాళ్లు, ఈ రేఖాచిత్రాల పురా చరిత్రకు ఆధారాలని, వీటిని కాపాడుకోవాలని, రాజీవ్ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో గల ఈ స్థావరం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రాచీన ఆలయ పునరుద్ధరణ ట్రస్ట్ ఛైర్మన్ ఆర్.కె. జైన్, స్థానిక యువకుడు వేణుమాధవ్ పాల్గొన్నారని శివనాగిరెడ్డి తెలిపారు.

 కారు ఢీ కొట్టిన ఘటనలో   సిఐ మృతి

రాంగ్ రూట్ లో వచ్చే కారు బైక్ ను ఢీ కొన్న ఘటనలో హైదరాబాద్ కు చెందిన సర్కిల్ ఇన్ స్పెక్టర్ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ మరణించగా ఎస్సై గాయాలపాలయ్యారు. ఎల్బీనగర్‌లో ఓ కారు యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్‌లో వెళుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సీఐ సాధిక్ అలీ మృతిచెందారు. ఎస్సై కాజా వలీ మోహీనుద్దీన్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. అతని పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. సాధిక్‌ అలీ చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో చేస్తుండగా, కాజా వలీ నారాయణ గూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో చేస్తున్నారు. మలక్‌పేట క్వార్టర్స్‌లో ఉండే వీరిద్దరూ మంగళవారం సాయంత్రం ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు వినుషా శెట్టి అనే పేరుపై రిజిస్ట్ అయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ ఛలాన్లు కూడా ఉండటం గమనార్హం. ప్రమాదం జరిగాక కారు ఆపకుండా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

నామినేషన్ వేయడానికి జైపూర్ చేరుకున్న సోనియా 

ఎట్టకేలకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ లోకసభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాకుండా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ నుంచి బయల్దేరిన సోనియా కాసేపటి క్రితం రాజస్థాన్ రాజధాని జైపూర్ కు చేరుకున్నారు. ఆమెతో పాటు రాహుల్, ప్రియాంకాగాంధీలు ఉన్నారు. ఈరోజు సోనియా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్లు సమర్పించడానికి రేపు చివరి తేదీ. 27న ఎన్నికలు జరుగుతాయి.  ఐదు సార్లు లోక్ సభకు ఎన్నికైన 77 ఏళ్ల సోనియాగాంధీ తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ఆమె కుమార్తె ప్రియాంకాగాంధీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది.  నామినేషన్ల దాఖలు సమయంలో సోనియాతో పాటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ ఉంటారని తెలుస్తోంది. ఈనెల 27న 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాజస్థాన్ లో మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడింట్లో ఒక స్థానంలో కాంగ్రెస్ సునాయాసంగా విజయాన్ని సాధిస్తుంది. అందుకే, సోనియా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. లోక్ సభకు మరోసారి పోటీ చేయబోనని 2019లోనే సోనియా ప్రకటించారు.

తెలుగుదేశం గూటికి లావు శ్రీకృష్ణ దేవరాయలు.. ముహూర్తం ఎప్పుడంటే?!

వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల ముంగిట ఆ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో సిట్టింగులు, కీలక నేతలూ పార్టీని వీడుతున్నారు. అలా వీడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. దీంతో వైసీపీ శిబిరంలో తీవ్ర నిరాశా నిస్ఫృహలు నెలకొన్నాయి. మరో వైపు పార్టీ అధినేత జగన్ సీతయ్య  తరహాలో  ఎవరి మాటా విననంటూ సిట్టింగుల మార్పు నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగుతున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు డీలా పడిపోతున్నాయి. అధినేతే ఓటమి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తుంటే ఇక చేయగలిగిందేముంది.. ప్రజాభీష్ఠానికి అనుగుణంగా నడుచుకుంటూ తెలుగుదేశం, జనసేన కూటమి కోసం పని చేస్తే పోలా అన్న భావనకు వచ్చేస్తున్నారు. వరుస జంపింగులతో ఎన్నికల నోటిఫికేష్ వెలువడే నాటికి వైసీపీకి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇక ఇప్పటికే పార్టీకి దూరమైన వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.   నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తెలుగుదేశం గూటికి చేరనున్నారన్న సంగతీ విదితమే. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇప్పుడు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఔను ఈ నెల 22న లావు శ్రీకృష్ణ దేవరాయులు తెలుగుదేశం గూటికి చేరనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.  

బీఆర్ఎస్ కు కటీఫ్?.. మజ్లిస్ దోస్తీ కాంగ్రెస్ తోనే!

ఆల్ఇండియా మ‌జ్లిస్-ఇ-ఇత్తేహదుల్ ముస్లిమీన్‌ (ఏఐఎమ్ఐఎమ్) అలియాస్ మజ్లిస్.. హైదరాబాద్ పాత బస్తీలో తిరుగులేని ఆధిపత్యం ఉన్న ఈ పార్టీ రాజకీయాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  బీజేపీ వ్యతిరేకతే ఈ పార్టీ విధానం అని చెప్పవచ్చు.  అయితే ఆ ముసుగులో బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకు జాతీయ స్థాయిలో విస్తరణ పేరిట ముస్లిం జనాభా అధికంగా ఉండే నియోజకవర్గాలలో అభ్యర్థులను పోటీకి నిలబెడుతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే మొత్తంగా ఈ పార్టీ పాత బస్తీలో తన పట్టును నిలుపుకోవడానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ  బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులూ తెలంగాణలో  ఆ  పార్టీకే మద్దతుగా నిలిచింది. బీఆర్ఎస్ అధినేత కూడా అప్పట్లో ఎలాంటి దాపరికం లేకుండా మజ్లిస్, బీఆర్ఎస్ లు మిత్రులు అని అప్పట్లో ప్రకటించారు కూడా. కానీ మజ్లిస్ లక్ష్యం వేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ కూడా మజ్లిస్ అధికారంలో ఉన్న పార్టీతోనే దోస్తానా చేసింది. ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ‌లో  అధికారంలో ఉన్న  టీఆర్ఎస్‌(బీఆర్ఎస్) తో మజ్లిస్ పార్టీ దోస్తీ కొనసాగింది.  కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా ఒవైసీ ఆయనతో భాయీ భాయీ బంధం నెరిపారు.   మజ్లిస్ పార్టీ ఏం చేసినా పాత‌బ‌స్తీలో త‌న పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా చేస్తుందన్నది పరిశీలకుల విశ్లేషణ. అవును కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు రేవంత్ చేపట్టిన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ జోరు స్పీడందుకుంది. అధికారం కారు నుంచి హస్తానికి ట్రాన్స్ ఫర్ అవుతుందన్న విశ్లేషణలూ వెల్లువెత్తాయి. దీంతో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీఆర్ఎస్ కు దూరం జరిగే  ప్రయత్నాలు ప్రారంభించారని అప్పట్లోనే రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.   ఆ ప్రచారం వాస్తవమేనని ఇప్పుడు నిస్సందేహంగా తేలిపోయింది. ఔను రేవంత్ సర్కార్ మేడిగడ్డ సందర్శనకు ఇచ్చిన పిలుపునకు మజ్లిస్ స్పందించింది. మేడిగడ్డ సందర్శనకు కాంగ్రెస్ తో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు సైతం వెళ్లారు. అయితే రేవంత్ సర్కార్ మేడిగడ్డ సందర్శనకు రావాల్సిందిగా కోరినా బీఆర్ఎస్, బీజేపీలు స్పందించలేదు.  దీంతో రాష్ట్రంలో ఎవరెవరు ఇప్పుడు మిత్రులు, ఎవరెవరు ఇప్పుడు మిత్రులు కాదు అన్నది విస్పష్టంగా తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలి నుంచీ అంటే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ కూడా బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. మద్యం కుంభకోణం కేసు విషయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లభించిన, ఇప్పటికీ లభిస్తున్న వెసులు బాట్లను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చని కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవినీతికి బ్రాండ్ అన్న ఆరోపణలను సైతం ఎప్పటి నుంచో కాంగ్రెస్ చేస్తోంది. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఈ విషయంలో మజ్లిస్ జోక్యం చే సుకోలేదు. కాళేశ్వరం అవినీతిపై కానీ, మేడిగడ్డ కుంగుబాటుపై కానీ మజ్లిస్ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా స్పందించలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో  ఆ వెంటనే మజ్లిస్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ సందర్శనకు వెళ్లింది. దీంతోనే మజ్లిస్ ఇప్పుడు ఎవరికి మిత్రపక్షంగా ఉందో తేటతెల్లమైపోయింది. అసలు రేవంత్ సర్కార్ మేడిగడ్డ సందర్శన కార్యక్రమం పెట్టుకున్నదే  బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు వ్యతిరేకంగా . అలాంటి మేడిగడ్డ సందర్శనకు మజ్లిస్ వెళ్లడం అంటే తాము కాంగ్రెస్ వైపు ఉన్నామని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుండబద్దలు కొట్టేసినట్లే. అయితే  మజ్లిస్ బీఆర్ఎస్ కు దూరం జరగడం ఏమీ ఆశ్చర్యకర పరిణామం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  నిజానికి మజ్లిస్ కాంగ్రెస్ మిత్రపక్షం గా ఉన్నట్లు మేడిగడ్డ సందర్శనకు హాజరు కావడంతో తేలిపోయినా.. వాస్తవానికి మజ్లిస్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే మిత్రపక్షంగా వ్యవహరిస్తుందని, అలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా తన రాజకీయ అవసరాల కోసమే మజ్లిస్ ను చేరదీస్తున్నదని అంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పాత బస్తీలో తన పట్టు నిలుపుకోవాలంటే మజ్లిస్ కు రాష్ట్రంలో అధికార పార్టీ అండ అవసరం. అలాగే  అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి  తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలంటే.. జంపింగుల భయం లేకుండా ధీమాగా పాలన సాగాలంటే.. మజ్లిస్ తమకు మద్దతుగా నిలవడం కావాలి. అందుకే పరస్పర ప్రయోజనాల పరిరక్షణలో భాగమే మజ్లిస్, కాంగ్రెస్ దోస్తానా అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి బారులు.. బారులు!

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అధికార వైకాపా నాయకుల్లో గుబులు మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను పసిగట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సహా సీనియర్ నాయకులు మెల్లమెల్లగా  జగన్ కు ఆయన పార్టీకీ దూరం అవుతున్నారు. తమ దారి తాము చూసుకుంటున్నారు.  ఇప్పటికే వెళ్లిపోయిన వారు పోగా ఇంకా పలువురు తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది. వారిలో కొందరు ఇప్పుడు ఓపెన్ అప్ అవుతున్నారు.  దీంతో రానున్న రోజులలో వైసీపీ నుంచి  వలసల వరద ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అదే సమయంలో  వైసీపీ నుంచి వచ్చే వారిని చేర్చుకునే విషయంలో  తెలుగు దేశంజాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.  కష్ట కాలంలో పార్టీని నమ్ముకుని ఉన్న నాయకుల ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు ప్రధమ ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు.  ఇక విషయానికి వస్తే.. ఏపీలో వైసీపీ పరిస్థితి .. జగన్ తో పాటు సజ్జల, వైవీ, విజయసాయి వంటి వారు తప్ప మిగిలిన అందరూ కూడా చంద్రబాబు తలుపు తెరిస్తే తెలుగుదేశం గూటికి చేరిపోవడానికి రెడీగా ఉన్నారనిపించేలా మారిపోయింది.  ఔను  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయ్యారు.  ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికూడా చంద్రబాబుతో చర్చలు జరిపారు. గత ఎన్నికలకు ముందు… తెలుగుదేశం పార్టీకి హ్యాండిచ్చినట్లే ఇప్పుడు వైసీపీకి హ్యాండివ్వడానికి అదాల ప్రభాకర్ రెడ్డి రెడీ అయిపోయారు. ఇలా  ఒకరు, ఇద్దరు, ముగ్గురని కాదు.. దాదాపు  వైసీపీ ముఖ్య నేతలంతా కళ్లేలు తెంచుకుని వైసీపీ నుంచి బయటపడేందుకు తహతహలాడుతున్నారు.   పార్థసారధి , వసంత కృష్ణ ప్రసాద్ ఇలా ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు.   రాజ్యసభ ఎన్నికలు, పొత్తుల విషయంలో అధికారిక ప్రకటన కు సిద్ధమౌతున్న  చంద్రబాబు  అదే సమయంలో చేరికల విషయంలో   ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తున్నారు. అత్యంత బలమైన అభ్యర్థులు,  గెలుపు గుర్రాలు అయితేనే  అయితేనే ప్రాధాన్యత లేకపోతే లేదు అన్నట్లుగా చంద్రబాబు వ్యాహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.  వేమిరెడ్డి  వైసీపీని వీడడమంటే.. ఆ పార్టీ పనైపోయిందనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వేమిరెడ్డి బాబుతో భేటీ అవ్వడంతో వైసీపీ నుంచి వలసలు అనూహ్య స్థాయిలో వెల్లువెత్తే వరదలా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సిట్టింగుల మార్పు అంటూ సీఎం జగన్ ఇప్పటికే అరడజను జాబితాలు విడుదల చేశారు.  ఆయన విడుదల చేసిన జాబితాలలో జరిగిన మార్పులన్నీ దాదాపుగా   రిజర్వుడు  నియోజకవర్గాలకు సంబంధించినవే ఉన్నాయి. అయితే ఆ ఆరడజను జాబితాలలో మార్పుల ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడలేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పుడు విడుదల కానున్న తదుపరి జాబితాల తరువాత ఇంకెంత మంది సిట్టింగులు, నేతలు జగన్ కు దూరం జరుగుతారన్న దానిపై పార్టీ శ్రేణుల్లోనే విస్తృత చర్చ జరుగుతోంది.  జగన్ టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిపోయిన వారి సంఖ్య భారీగానే ఉందని వైసీపీ వర్గాల నుంచే  తెలుస్తోంది. అలా పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నవారిలో అత్యధికులు తెలుగుదేశంలో చేరేందుకే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో తమకు టిక్కెట్లు లేకపోయినా ఫరవాలేదన్నట్లు వారు భావిస్తున్నారని కూడా అంటున్నారు.  ప్రజలలో ఉండడానికీ, తమ రాజకీయ భవిష్యత్ అంతమైపోకుండా చూసుకోవడానికీ వైసీపీని వీడడం ఒక్కటే మార్గమని వారంతా భావిస్తున్నారని చెబుతున్నారు.   అందుకే చంద్రబాబు నాయుడు కూడా చేరికల విషయంలో స్పష్టమైన క్లారిటీతో వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే   పార్టీని నమ్ముకున్న స్థానిక నాయకుల అనుమతి లేకుండా కొత్త వారిని చేర్చుకోరాదని, రాష్ట్ర,  జిల్లా  స్థాయి నాయకులకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే,  అనేక జిల్లాల్లో వైసీపీ  కీలక నేతలు టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నా, వారికి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించడం లేదని అంటున్నారు.  

సరి కొత్త జగన్నాటకం.. ప్రజల చేతిలో పరాభవం ఖాయం

అమ్మ పెట్టా పెట్ట‌దు.. అడుక్కు తినానివ్వ‌దు అన్న‌ట్లుగా ఉంది ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం తీరు. ఉన్న‌వాటిని కూల్చేసి.. కొత్త‌గా అభివృద్ధి ఏంటో మేం చూపిస్తామంటూ గొప్ప‌లు చెప్పుకుని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి ఒక్క చాన్స్ కొట్టేసిన జగన్ నాలుగున్న‌రేళ్ల  పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన సాగించారు. ఇప్పుడు తీరా ఎన్నికల సమయం వచ్చేసే సరికి మేము ప్ర‌య‌త్నం చేశాం.. మావ‌ల్ల కాలేదంటూ చేతులెత్తేశారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో చంద్ర‌బాబు ఒక రాజ‌ధానికి శంకుస్థాప‌న చేస్తే.. మేము మూడు రాజ‌ధానులు క‌డ‌తాం.. మూడు ప్రాంతాల్లో అద్భుత పాల‌న సాగిస్తాం అంటూ డప్పాలు కొట్టుకుని..  చివ‌రికి క‌నీసం ఒక్క రాజ‌ధాని క‌దుక‌దా.. ఎక్క‌డా ఒక్క ఇటుక పెట్టి నిర్మాణాలు చేసిన దాఖ‌లాలు జగన్ పాల‌న‌లో ఎక్క‌డా క‌నిపించ‌వు.  మామూలుగా కాదు.. భూతద్దం పెట్టి వెతికినా క‌నిపించ‌వు.  నాలుగున్న‌రేళ్లు మూడు రాజ‌ధానులంటూ  ఉత్తుత్తి  కబుర్లు చెప్పిన జ‌గ‌న్ , ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర రాజ‌ధానిని నిర్మించుకునేంత స్థోమ‌త లేదు.. హైద‌రాబాద్ ను ఉమ్మ‌డి రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని డిమాండ్ చేద్దాం అంటూ తన చేత‌గానిత‌నాన్ని బ‌య‌ట‌ పెట్టుకున్నారు.  ఏపీలో నాలుగున్నారేళ్ల జ‌గ‌న్ పాల‌న‌లో ప్ర‌జ‌లు విసిగివేసారి పోతున్నారు. క‌నీసం ఉపాధి, ఉద్యోగాలులేక హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల‌కు వ‌లస‌ పోతున్నారు. నాలుగున్న‌రేళ్ల జ‌గ‌న్   హ‌యాంలో చెప్పుకోద‌గ్గ ఏ ఒక్క కంపెనీకూడా ఏపీలో అడుగుపెట్ట‌లేదు. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లో ఏపీలో బ‌డా కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టాయి. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వాటిలో కొన్నింటిని ఏపీ నుంచి త‌రిమేశారు. ఉన్న రాజ‌ధాని అమ‌రావ‌తిని చిదిమేసి..  మూడు రాజ‌ధానుల పేరుతో  జ‌గ‌న్ నేల విడిచి సాము చేశారు. పాల‌నా అనుభ‌వంలేని జ‌గ‌న్ , మూడు రాజ‌ధానుల హామీని నెర‌వేర్చ‌లేక , అది ప్రాక్టికల్ గా అసాధ్యం అని తెలిశాకా, విశాఖ పల్లవి ఎత్తుకున్నారు. విశాఖ ప‌ట్ట‌ణం ప‌రిపాల‌న రాజ‌ధానిగా చేస్తున్నాం.. ఇదిగో రేప‌టి నుంచి.. అదిగో ఎల్లుండి నుంచి విశాఖ నుంచి పాలన మొద‌ల‌వుతుంద‌ని చెప్పుకుంటూ వ‌చ్చారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో జ‌గ‌న్  కొత్త‌నాట‌కానికి తెర‌లేపారు. త‌న‌చేత‌కాని త‌నాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు కోర్టుల్లో చిక్కులుకార‌ణంగా విశాఖ‌కు వెళ్ల‌లేక పోతున్నాం అంటూ జ‌గ‌న్ బాబాయి,  వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేత మీడియా ముందు ఒక ప్రకటన చేయించారు. ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చింది. సీఎంగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత‌.. ఏపీకి రాజ‌ధాని ఉండాల‌ని భావించారు. ప‌లు వ‌ర్గాలు, పార్టీల ప్ర‌తినిధులను సంప్ర‌దించి అంద‌రి ఆమోదంతో అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబుపై ఉన్న న‌మ్మ‌కంతో అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతాల్లోని రైతులు సైతం స్వ‌చ్చందంగా ముందుకొచ్చి త‌మ భూముల‌ను అప్ప‌గించారు. రాజ‌ధానిలో హైకోర్టుతోపాటు తాత్కాలికంగా పాల‌న సాగించేందుకు భవనాల‌ను నిర్మించారు. చంద్ర‌బాబు పాల‌న‌ సైతం అమ‌రావ‌తి నుంచే సాగింది. భార‌త‌దేశంలోనేకాక ప్ర‌పంచంలోనే అద్భుత‌మైన రాజ‌ధానిగా అమ‌రావ‌తిని తీర్చిదిద్దే ల‌క్ష్యంతో చంద్ర‌బాబు ముందుకు సాగారు. అయితే 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. జ‌గ‌న్ సీఎం కుర్చీ ఎక్కిన నాటి నుంచి నిర్మాణాలను మరిచి..  కూల్చివేత ప‌ర్వానికి, విధ్వంసానికి తెర‌ లేపారు.  అమ‌రావ‌తిని రాజ‌ధానిగా కొన‌సాగిస్తే చంద్ర‌బాబుకు ఎక్క‌డ పేరు వ‌స్తుందన్న దుగ్ధతో,  భ‌యంతో రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోతార‌ని తెలిసినా, ప్ర‌భుత్వ  సొమ్ము వృథా అవుతుంద‌ని తెలిసినా.. అమ‌రావ‌తి రాజ‌ధాని కాదు.. మేము మూడు రాజ‌ధానులు చేస్తాం అంటూ జ‌గ‌న్‌ కొత్త వాద‌న తెర‌పైకి తెచ్చారు. విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా చేసుకొని అక్క‌డినుంచే పాల‌న సాగించేలా జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, రాజ‌ధాని ఏర్పాటు అంటే అంత‌ తేలికైన విష‌యం కాదుక‌దా.. అనుభ‌వం లేని జ‌గ‌న్ కు అవేమీ తెలియ‌క మొండి వైఖ‌రితో ఏపీ ప్ర‌జ‌ల జీవితాలో ఆట‌లాడుకుంటూ వ‌చ్చాడు. ఇదిగో రేపు.. అదిగో ఎల్లుండి నుంచే విశాఖ నుంచి పాల‌న సాగిస్తామ‌ని చెప్పుకుంటూ వ‌చ్చిన జ‌గ‌న్‌.. అది సాధ్యంకాక‌పోయే స‌రికి ప్ర‌జ‌ల‌ను మ‌రోమాయా ప్ర‌పంచంలోకి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడు. ఈ క్ర‌మంలోనే ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కోర్టులో చిక్కుల కారణంగా విశాఖ నుంచి పాల‌న సాగించ‌లేక పోతున్నామ‌ని చెప్పాడు. అంతేకాదు..  హైద‌రాబాద్ ప‌దేళ్లు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంటుంద‌ని విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విష‌యం తెలిసిందేన‌ని.. ఆ గ‌డువును మ‌రికొన్నేళ్లు పెంచ‌మ‌ని పోరాటం చేద్దామ‌ని చెప్పుకొచ్చాడు. ఉన్న రాజ‌ధాని అమ‌రావ‌తి  అభివృద్ధి చేయడం చేత‌కాని  జగన్ ప్ర‌భుత్వం ఇప్పుడు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని అంటూ కొత్తపాత పాడుతుండ‌టం ఏపీ ప్ర‌జ‌లను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై అన్ని వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త రావ‌డంతో.. మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌లేమ‌ని భావించిన జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకొనేలా హైద‌రాబాద్ అంటూ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి మ‌రోసారి ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కేందుకు కొత్త  నాట‌కానికి తెర‌లేపాడ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అయితే ఈ సారి జనం జగన్మాయలో పడరని కూడా చెబుతున్నారు. 

అయ్యో పాపం.. కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ అస్త్రం!

తెలంగాణ‌లో అధికార కాంగ్రెస్‌, విప‌క్ష బీఆర్ ఎస్ పార్టీల మ‌ధ్య సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో వార్ తార స్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డంతో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. బీఆర్ ఎస్ హ‌యాంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతిని వెలికితీసేందుకు   రేవంత్‌ ఉపక్ర‌మించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్ల‌ర్లు కుంగడంపై సీఎం రేవంత్ స‌హా, కాంగ్రెస్ నేత‌లు బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కమిషన్ల కక్కుర్తి కోసం నాసిరకంగా మేడిగడ్డను నిర్మించారు.. ఆధారాల‌తో నిరూపిస్తామ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ క్ర‌మంలో అసెంబ్లీ స‌మావేశాల్లోనూ అధికార‌, విప‌క్ష పార్టీల స‌భ్యుల మ‌ధ్య ఇదే విష‌యంపై తీవ్ర‌ స్థాయిలో మాట‌ల యుద్ధం సాగింది. కాంగ్రెస్ వాద‌న‌కు కౌంట‌ర్ గా బీఆర్ ఎస్ స‌భ్యులు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నియంత్రణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) కి కాంగ్రెస్ ప్రభుత్వం అప్ప‌గించింద‌ని విమ‌ర్శ‌లు చేశారు. అదంతా కేసీఆర్ పాప‌మ‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల బాధ్య‌తలు అప్ప‌గించేది లేద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తేల్చి చెప్పేసింది.  మ‌రో రెండు నెల‌ల్లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మిని చ‌విచూసిన‌ బీఆర్ ఎస్.. పార్ల‌మెంట్ లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నది. ఈ క్ర‌మంలో మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టుల విష‌యంపై సుదీర్ఘ చ‌ర్చ‌జ‌రుగుతున్నా హాజ‌రు కాని కేసీఆర్‌.. న‌ల్గొండ జిల్లా వేదిక‌గా బ‌హిరంగ స‌భ‌ నిర్వ‌హించారు. బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగం ఆసాంతం ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్ ను ర‌గిల్చే విధంగా సాగింది. ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు ఏమీ లేవు.. ఇది ఎన్నిక‌ల స‌భ కాదంటూనే.. పార్ల‌మెంట్ ఎన్నిక‌లే టార్గెట్ గా కేసీఆర్ ప్ర‌సంగం సాగింది. ఒకానొక ద‌శ‌లో.. కేసీఆర్ కంట్రోల్ త‌ప్పి  మాట్లాడారన్న భావన పరిశీలకులలోనే కాదు, బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ వ్యక్తమైంది. న‌ల్గొండ జిల్లాలో అడుగు పెట్ట‌నివ్వ‌రా.. ఎవ‌ర్రా న‌న్ను ఆపేది.. చంపుతారా.. న‌న్ను చంపుతారా.. దా వ‌చ్చి చంపు.. అంటూ ఉద్వేగ‌పూరిత‌మైన ప్ర‌సంగం చేయ‌డం ద్వారా కేసీఆర్‌ ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందే ప్ర‌య‌త్నం చేశారు. అదే సమయంలో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్న‌మూ కేసీఆర్ ప్ర‌సంగంలో క‌నిపించింది. మీరెవ‌రూ అధైర్య‌ప‌డొద్దు.. అడుగుడునా ప్ర‌భుత్వాన్ని నిల‌దీయండి అంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు.  రెండు నెల‌ల్లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో అధికారాన్ని కోల్పోయిన కేసీఆర్‌.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఎలాగైనా స‌త్తా చాటాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో వ‌చ్చిన త‌రువాత‌.. ఇన్నాళ్లు బీఆర్ ఎస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, బీఆర్ ఎస్ పార్టీ ముఖ్య‌ నేత‌లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మ‌రికొంద‌రు బీఆర్ ఎస్ ను వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దీనికి తోడు   బీఆర్ ఎస్ పార్టీ ప‌ట్టును నిలుపుకోవాలంటే పార్ల‌మెంట్ లో గ‌తంలో కంటే అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే  ప్ర‌జ‌ల్లో మాత్రం బీఆర్ ఎస్ పై వ్య‌తిరేక‌త ఉండ‌టం కేసీఆర్ ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత‌.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జాదర‌ణ పెర‌గ‌డం కేసీఆర్ ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నది. రోజు రోజుకు ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బ‌లంగా ఢీకొట్టాలంటే ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్ ర‌గ‌ల్చ‌డంతో పాటు సానుభూతిని పొందాల‌ని కేసీఆర్ భావిస్తున్నట్లు క‌నిపిస్తున్నది. న‌ల్గొండ బ‌హిరంగ స‌భలో కేసీఆర్ ప్ర‌సంగం చూస్తే ఇదే విష‌యం అర్థ‌మ‌వుతున్నది. స్పష్టంగా చెప్పాలంటే.. వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌లు బీఆర్ ఎస్ పార్టీకి జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య.  పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పార్టీ విఫ‌ల‌మైతే .. ఆ పార్టీ మ‌నుగడ ప్రశ్నార్థకమౌతుందని కేసీఆర్ ఆందోళ‌న చెందుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంద‌డంతోపాటు, సెంటిమెంట్ రెచ్చ‌గొట్ట‌డం ద్వారా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నాటికి వారిని బీఆర్ ఎస్ వైపు తిప్పుకోవాల‌న్నది కేసీఆర్ ప్లాన్ గా క‌నిపిస్తోంది. బీఆర్ఎస్ కు బలమైన ఆయుధం లాటి తెలంగాణ పేరును  పార్టీ నుంచి తొలగించేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ సెంటిమెంట్ కోసం వెంపర్లాడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జనం మాత్రం సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలను కోరుకుంటున్నారంటున్నారు. మ‌రి కేసీఆర్ సానుభూతి, సెంటిమెంట్ అస్త్రం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఏమేర‌కు ప‌నిచేస్తుందో వేచి చూడాల్సిందే.

ముష్టియా.. కళ్లు చెదిరే సంపాదన..!

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం పోకిరి. కలెక్షన్ వసూళ్లలో ఈ చిత్రం పాత రికార్డులను బద్దలు కొట్టింది. ఆ చిత్రంలో  సాఫ్టేవేర్ ఇంజినీర్ పాత్రలో బ్రహ్మనందం, ముష్టివాడు పాత్రలో ఆలీ మధ్య సంభాషణ... మాఫియాలాగా ముష్టియా.. అంటూ బ్రహ్మనందానికి ఆలీ చెప్పే సమాధానం.. ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. అయితే ఆ ముష్టియానే ఆసరాగా చేసుకొని.. ఓ ఫ్యామిలీ ఫ్యామిలీ.. కోట్లాది రూపాయిలు గడించింది. ఈ ముష్టి ఎత్తుకోవడం ద్వారా ఆ ఫ్యామిలీ రెండతస్తుల భవనం, 20 వేల రూపాయిలు ఖరీదు చేసే అధునిక సెల్ ఫోన్‌తోపాటు వ్యవసాయ భూమి, బైక్‌తోపాటు ఇండ్ల స్థలం.. అలాగే జస్ట్ ఆరు వారాల్లోనే 2.5 లక్షల రూపాయిల ఆ ప్యామిలీ సంపాదన చూసి పోలీసులే నోరు వెళ్లబెట్టేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన మద్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో వెలుగులోకి వచ్చింది.   ఫిబ్రవరి 9వ తేదీన ఇండోర్ నగరంలో ముష్టి ఎత్తుకోంటున్న తల్లి ఇందిరా బాయితోపాటు 7 ఏళ్ల వయస్సు ఉన్న ఆమె కుమార్తెను పోలీసులు అదుపులోకి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో ఇందిరాబాయ్‌ వద్ద నుంచి 19,600 రూపాయిలు, అలాగే 7 ఏళ్ల వయస్సు ఉన్న ఆమె కుమార్తె నుంచి 6 వందల రూపాయిలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. ఆమె నుంచి వచ్చిన సమాధానం విని పోలీసులే నిర్ఘాంత పోయారు. ఆమె స్వయంగా తన ఆస్తుల వివరాలు పోలీసులకు వివరించడంతో.. వారంతా కంగుతినడమే కాకుండా.. దొంగతనం చేయడం కంటే ముష్టి ఎత్తుకోవడమే ఉత్తమైన మార్గమేనంటూ ఆమె ఖాకీలకు హితబోధ చేయడం కోసమెరుపు. అయితే తమ వద్ద ఉన్న ఖరీదైన సెల్ ఫోన్ తాను వాడతానని... బైక్ మాత్రం తన భర్త వాడతాడని..ఇక పొలం అయితే పక్క రాష్ట్రం రాజస్థాన్‌లోని కోట సమీపంలో ఉందంటూ ఆమె సెలవివ్వడం గమనార్హం.  ఇందిరాబాయ్‌కు మరో నలుగురు చిన్నారులు ఉన్నారు. వారి వయస్సు10, 8, 3, 2 ఏళ్లు. వారిని యాచక వృత్తిలోకి దింపి.. ఇండోర్ నగరంలోని ప్రధాన కూడళ్లలో వారితో ముష్టి ఎత్తిస్తోంది. నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతాలు.. ఉజ్జయినీలోని మహాకాళేశ్వర్ మందిర్‌కు వెళ్లే మార్గం, లవ్ కుష్ స్క్వేర్ వద్ద వారిని ఉంచి.. వారి చేత ముష్టె త్తించుకోవడం.. దాంతో వారి రాబడి బాగా పెరిగిందని.. దీంతో ఆస్తుల బాగా కూడబెట్టారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. మరోవైపు... ఇందిరా బాయ్‌తోపాటు ఆమె కుమార్తెను పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఆ సమీపంలోనే ఉన్న ఆమె భర్తతోపాటు మరో ఇద్దరు పిల్లలు అక్కడి నుంచి పరారైయ్యారు.   ముష్టివారికి పునరావాసం కల్పించేందుకు ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో కలిసి ఓ ఎన్జీవో పని చేస్తోంది. అందులోభాగంగా ఇండోర్‌లోని 38 ముఖ్య కూడళ్ల వద్ద ఉన్న 7 వేల మంది యాచకులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. వారిలో సగానికి సగమంది చిన్నారులే ఉన్నారని.. అయితే వారి ఏడాది సంపాదన మాత్రం 20 కోట్ల రూపాయిలుగా ఉందని ఎన్జీవో సంస్థ నిర్వాహకులు వెల్లడిస్తుండడం గమనార్హం.

జగన్ నివాసాన్ని ముట్టడించిన ఎబివిపి కార్యకర్తలు 

రాష్ట్రంలో మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు నేడు తాడేపల్లిలో సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించారు. మినీ డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ కావాలి అనే నినాదంతో వారు 'ఛలో తాడేపల్లి' పేరిట ఆందోళనకు దిగారు. నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని వారు మండిపడ్డారు. సీఎం నివాసం ముట్టడి సందర్భంగా విద్యార్థి నేతలు ఒక్కసారిగా దూసుకువచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడ్నించి మంగళగిరి పీఎస్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పలువురు విద్యార్థి నేతలు పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నారు. దొరికిన వాళ్లను ఓ వాహనంలోకి ఎక్కించి అక్కడ్నించి తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ముట్టడిలో దాదాపు 100 మందికి పైగా విద్యార్థి నేతలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు విద్యార్థి నేతలకు గాయాలైనట్టు సమాచారం.ఉపాధ్యాయుల పోస్టుల గురించి మాట్లాడని సీఎం ఎవరైనా ఉన్నారంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని డీఎస్సీ విద్యార్థులు మండిపడ్డారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో వందల మంది డీఎస్సీ అభ్యర్థులు ఈరోజు రోడ్డెక్కారు. 23వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రిగా ప్రజలను పాలించడానికి వచ్చారా లేకపోతే ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి వచ్చారా అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  డీఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన మాట నెరవేర్చుకుని 23వేల పోస్టులతో మెగా డీఎస్సీని తక్షణమే విడుదల చేయాలని విద్యార్థులు ఈ ఆందోళన చేపట్టారు. నాలుగేళ్లలో డీఎస్సీ విడుదల చేయకపోవటం సిగ్గుచేటు, ఆవిరైపోతున్న ఉపాధ్యాయ నిరుద్యోగ ఆశలు, సున్నాలలో నోటిఫికేషన్ వద్దు మెగా డీఎస్సీ ముద్దు అంటూ విద్యార్థులు ఫ్లకార్డులతో నిరసనలు తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో రెండుసార్లు నోటిఫికేషన్ ఇస్తే జగన్ ఒక్కసారి కూడా విడుదల చేయకపోవటం సిగ్గు చేటు అని విద్యార్థులు ఎద్దేవా చేశారు. "నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తున్నారు. హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులకు పాల్పడుతుంది. తక్షణమే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి లేకపోతే నిరుద్యోగుల సత్తా ఎమిటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం" అని విద్యార్థులు హెచ్చరించారు. గత నాలుగు సంవత్సరాలుగా మెగా, జంబో, మినీ డీఎస్సీ అంటూన్నారు కాని ఇప్పటివరకూ ఒక్క పోస్టు కూడా విడుదల చేయకుండా జాప్యం చేశారని విద్యార్థులు విరుచుకుపడ్డారు. ప్రభుత్వం వారం రోజులు లోపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకపోతే పక్క రాష్ట్రంలో కేసీఆర్​కు పట్టిన పరిస్థితే జగన్​కు పడుతుందని ఉద్యోగులు హెచ్చరించారు. ఏపీని నిరుద్యోగి రాష్ట్రంగా మారుస్తామన్న మీ హామీ ఏమైందని, నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మెగా డీఎస్సీ ప్రకటించకుంటే వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం: నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వం వారం రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిస్తామని విద్యార్థులు రోడ్డుపై బైటాయింపు ఆందోళన చేశారు.వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగుల సత్తా ఏంటో జగన్మోహనరెడ్డికి చూపిస్తామని హెచ్చరించారు. వీరిని అరెిస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించటంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్సీ అభ్యర్థుల నిరసన కార్యక్రమానికి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ మద్దతు తెలిపారు. విద్యార్ధులు చదువుకోవడం వలన నిరుద్యోగ శాతం పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి అనడం దారుణం విద్యార్థులు మండిపడ్డారు.

జయప్రదకు అరెస్ట్ వారెంట్ 

చట్టానికి కళ్లు లేవు . న్యాయదేవత పట్టుకున్న త్రాసు ఎటువైపు తూగుతుందో అక్కడే న్యాయం ఉంటుంది. అంటే బరువు వైపు తూగడం వల్లే న్యాయం జరుగుతుంది. సాక్ష్యం బలంగా ఉండటం వల్లే ఇవ్వాళ అలనాటి జయప్రద న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టింది. ఆమెకు ఉన్న స్టార్ డమ్ , పొలిటికల్ ఇన్ ఫ్లూయెన్స్ అక్కరకు రాకుంబా పోయింది. చట్టం తన పని తాను చేసుకుపోయింది.   సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదను సమస్యలు చుట్టుముట్టాయి. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా యూపీలోని రాంపూర్ నుంచి జయప్రద పోటీ చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆ సమయంలో ఆమెపై అక్కడ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరిగింది. అయితే కోర్టుకు హాజరు కావాలంటూ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో, గతంలో ఒకసారి ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఈ క్రమంలోనే ఆమెను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ ఎస్పీని కోర్టు ఆదేశించింది. తదిపరి విచారణను ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది. సినీ నటి.. మాజీ హీరోయిన్ జయప్రద చిక్కుల్లో పడ్డారు. పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉన్నటైమ్ లో ఆమెపై పెట్టిన కేసుకు సబంధించి ప్రస్తుతం జయప్రదకు చిక్కులు తప్పేట్లు లేవు. జయప్రదకు ఎన్ని సార్లు నోటీస్లు ఇచ్చినా.. స్పందించకపోవడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది.  ప్రముఖ నటి జయప్రదకు ఈఎస్‌ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా జయప్రదకు మరోసారి షాక్‌ తగిలిందనే చెప్పాలి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించారని జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ అయింది. జయప్రదను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలంటూ రాంపుర్‌ ఎస్పీకి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాంపుర్ నుంచి జయప్రద   పోటీ చేశారు. ఈ సమయంలోనే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.. వీటికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతోంది. ఈ క్రమంలో జయప్రదకు ఎన్ని సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు.  దీంతో ఆమెకు నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది కోర్టు. గతంలో కూడా ఒకసారి నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ చేసి జయప్రదను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.  

జగన్ పై బ్రదర్ అనీల్ పాశుపతాస్త్రం!

గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో జగన్ విజయానికి దోహదపడిన అంశాలన్నీ ఇప్పుడు రివర్స్ గేర్ లో ఆయన ఓటమికి కారణమౌతున్న అస్త్రాలుగా మారుతున్నాయి. గత ఎన్నికలలో జగన్ విజయానికి దోహదపడిన వాటిలో ప్రధానంగా ఆయన సోదరి, వైఎస్ షర్మిల పాదయాత్ర, ప్రచారం అలాగే విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి, ఆ తరువాత సరిగ్గా ఎన్నికల ముందు జరిగిన సొంత బాబాయ్ వివేకా హత్య వంటి అంశాలు ఇప్పుడు జమరోసారి విజయం సాధించి అధికారం చేపట్టాలన్న గన్ కు  ఆశకు ప్రధాన ప్రతిబంధకాలుగా మారాయని చెప్పవచ్చు.  ఔను నాడు తన అన్న అధికారం చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం కోసం కాళ్లరిగేలా తిరిగి, గొంతు చినిగేలా ప్రచారం చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు అదే అన్న ఓటమి కోసం కంకణం కట్టుకుని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టి రాష్ట్రం చుట్టేస్తున్నారు. నాడు విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి జగన్ పై జనం సానుభూతి పెరిగేలా చేయడానికి ఎంతగానో దోహదపడింది. ఇప్పుడు అదే కోడికత్తి కేసు జగన్ నాడు సానుభూతి కోసం ఆడిన డ్రామాగా ప్రజల ముందు ఆవిష్కృతమై, ఆ కేసులో నిందితుడు కోడికత్తి శ్రీను (జనుపల్లి శ్రీను) బలిపశువుగా మారారన్న భావన జనబాహుల్యంలో వ్యక్తం అవుతోంది. అలాగే వైఎస్ వివేకా హత్య ఘటన కూడా జగన్ కు సానుభూతి వెల్లువెత్తి నాటి ఎన్నికలలో విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పడు ఆ కేసులో జగన్ నిందితుల పక్షాన నిలవడం, స్వయంగా సోదరి షర్మిల, వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా వివేకా హత్యకు రాజకీయ కారణాలున్నాయనీ, కడప ఎంపీ సీటు విషయంలో వివేకా ప్రదర్శించిన పట్టుదల కారణంగానే హత్య జరిగిందని చెప్పడంతో ఇప్పుడు వివేకా హత్య కేసు జగన్ కు యాంటీ సెంటిమెంట్ గా మారింది. నిందితుల పక్షాన నిలబడిన జగన్ పై ప్రజలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా నాడు జగన్ విజయానికి దోహదపడిన అంశాలన్నీ నేడు రివర్స్ అయ్యాయి. ఆ ఆంశాలే జగన్ ను ఆయన పార్టీని గద్దె దించేందుకు వస్తున్న ఆస్త్రాలుగా మారాయి. ఇవే కాకుండా నాడు అంటే 2019 ఎన్నికలలో జగన్ పార్టీ విజయానికి మరో అంశం కూడా ఎంతగానో దోహదపడింది. అదే షర్మిల భర్త బ్రదర్ అనీల్ కుమార్ క్రైస్తవ సంఘాలతో వరుస భేటీలు జరిపి వారిని జగన్ కు అనుకూలంగా మార్చడం. ఇప్పుడు 2024 ఎన్నికల సమయం వచ్చే సరికి అదే బ్రదర్ అనీల్ కుమార్ జగన్ కు వ్యతిరేకంగా క్రస్తవ సంఘాలతో భేటీలు నిర్వహిస్తూ వాటిని జగన్ కు వ్యతిరేకంగా ఏకం చేస్తున్నారు.  మామూలుగానే రాజకీయాలలో కులం కార్డు విజయానికి దోహదపడే అంశంగా అంతా పరిగణిస్తారు. ఇక మతం కార్డైతే తిరుగేలేని అస్త్రంగా భావిస్తారు. గత ఎన్నికలలో మతం అస్త్రాన్ని అప్పటి విపక్ష నేతకు అండగా, అప్పటి అధికార పార్టీ తెలుగుదేశంకు వ్యతిరేకంగా సంధించిన బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పుడు అదే అస్త్రాన్ని జగన్ కు వ్యతిరేకంగా సంధిస్తున్నారు.  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తన సతీమణి వైస్ షర్మిలకు మద్దతుగా బ్రదర్ అనీల్ కుమార్ రంగంలోకి దిగారు.  నాడు జగన్ విజయం కోసం ఆయన ఏ విధంగా పని చేశారో, అదే విధంగా ఇప్పుడు జగన్ ఓటమి కోసం పని చేస్తున్నారు.   బ్రదర్ అనీల్ కుమార్ కు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవసమాజంలో ఒక ఇమేజ్ ఉంది.  ఆ ఇమేజ్ ను గత ఎన్నికలలో  బావమరిది జగన్ ని సీఎం చేయాలన్న లక్ష్య సాధన కోసం ఉపయోగించిన బ్రదర్ అనీల్ కుమారు ఇప్పుడు జగన్ ఓటమి కోసం ఉపయోగిస్తున్నారు.  నాడు అనిల్ ప్రభావంతో రాష్ట్రంలోని క్రేస్తవ సమాజం మొత్తం జగన్ కు మద్దతుగా నిలిచింది. రానున్న ఎన్నికల్లో అదే అనీల్ ప్రమాభంతో రాష్ట్రంలోని క్రైస్తవ సమాజం జగన్ వ్యతిరేకంగా ఏకతాటిపైకి వస్తోంది. జగన్ పైకి మతం అనే పాశుపతాస్త్రాన్ని బ్రదర్ అనీల్ కుమార్ విశాఖ నుంచి సంధించారని చెప్పవచ్చు. ఆయన మంగళవారం విశాఖలో మత పెద్దలతో భేటీతో రాష్ట్రంలోని క్రైస్తవ మతస్థులను జగన్ కు వ్యతిరేకంగా ఏకతాటికి తీసుకు వచ్చే ప్రయత్నానికి ప్రారంభంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మాగుంట శ్రీనివాసులురెడ్డి అడుగులు టిడిపి వైపు ..

ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ పార్లమెంటు సభ్యుులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పక్క చూపులు చూస్తున్నారా? అంటే ఔననే వినిపిస్తుంది. వైసీసీలో టికెట్‌ లేదన్న సంకేతాలు వస్తుండటంతో తెలుగుదేశం పార్టీతో మాగుంట టచ్‌లో ఉన్నారట. అసలు సిట్టింగ్ ఎంపీ మాగుంటకు వైసీపీ టికెట్ ఎందుకు నిరాకరించినట్టు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారా.. అంటే. వైసీపీలో టికెట్‌ రాకుంటే ఏం చేస్తాం.. మాదారి మేం చూసుకుంటాం.. అంటున్నారట మాగుంట అభిమానులు. దీంతో ఒంగోలులో వైసీపీ నుంచి పార్లమెంట్‌కు, అసెంబ్లీకి కలిసి పోటీ చేయాలని భావిస్తున్న మాగుంట – బాలినేని కాంబినేషన్‌కు ఈ ఎన్నికలు మరోసారి బ్రేక్‌ పడనున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ టికెట్‌ కోసం ఆఖ రివరకు ఎదురు చూడాలని మాగుంటకు బాలినేని సూచించడంతో అందుకు అనుగుణంగానే హైదరాబాద్‌లో ఉన్న బాలినేనితో రెండు రోజుల పాటు మంతనాలు చేసిన మాగుంట చివరకు వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సూచనలు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ టచ్‌లోకి వెళ్ళిపోయారని భావిస్తున్నారు. టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయని, ఒంగోలు లేదా నెల్లూరు నుంచి పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలని టీడీపీ అధిష్టానం నుంచి ఇప్పటికే మాగుంట శిబిరానికి సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల బరిలో మాగుంట కుటుంబం నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయించాలని భావిస్తున్నారట. టీడీపీ అధిష్టానం కూడా మాగుంట కుటుంబానికి సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది అందుకు ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన రా కదలిరా.. ఎన్నికల శంఖారావ సభలో పరోక్షంగా మాగుంటను అభినందిస్తూ చంద్రబాబు చేసిన ప్రసంగమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు తెలుగు తమ్ముళ్ళు.

రేవంత్ రెడ్డితో భేటీ అయిన  డిప్యూటి మేయర్ శ్రీలత

ఆరునెలల్లో మళ్లీ కెసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన నేతలే ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బిఆర్ఎస్ హాయంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కెటిఆర్ కు నమ్మినబంటు. అతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కల్సిన మరుసటి రోజే డిప్యూటి మేయర్ శ్రీలత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కల్సుకున్నారు. మరో రెండు రోజుల్లో ఆమె తన భర్త శోభన్ రెడ్డితో కల్సి  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.  తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కాంగ్రెస్ సొంతమయ్యాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా విజయాలు దక్కాయి. అయితే హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ పూర్తి ఆధిక్యతను కనపరిచింది. దీంతో, కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో హైదరాబాద్ పై ఫోకస్ చేసింది.  జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరారు. తాజాగా ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తన భర్త శోభన్ రెడ్డితో కలిసి ఆమె సీఎంతో భేటీ అయ్యారు. రెండు రోజుల్లో శ్రీలత దంపతులు కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ సందర్భంగా వీరితో పాటు ఫసీయుద్దీన్ కూడా ఉన్నారు. కొంత కాలంగా బీఆర్ఎస్ హైకమాండ్ పై శ్రీలత దంపతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శోభన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దంపతులు మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్, కేటీఆర్ తమను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నుమాయిష్ గడువు పొడగింపు

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న నుమాయిష్ ప్రదర్శనను మరో మూడు రోజులు కొనసాగించనున్నారు. సందర్శకుల డిమాండ్, ట్రేడర్ల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ (ఏఐఐఈఎస్) ప్రకటించింది. దీంతో ఈ నెల 15తో ముగియనున్న నుమాయిష్ మరో మూడు రోజులు.. అంటే ఈ 18 వరకు కొనసాగనుంది. ఏఐఐఈఎస్ నిర్ణయంపై నుమాయిష్ సందర్శకులు, ట్రేడర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.షెడ్యూల్ ప్రకారం ఏటా జనవరి 1న నుమాయిష్ మొదలై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. గడువు దగ్గర పడుతుండడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సోమవారం సందర్శకుల రద్దీ చాలా ఎక్కువగా ఉందని ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. రద్దీ నేపథ్యంలో ప్రదర్శనను పొడిగించాలని ట్రేడర్లు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆదివారం వరకు నుమాయిష్ ను కొనసాగించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది.ఈ సంవత్సరం, నాంపల్లిలోని నుమాయిష్ మైదాన్‌లో 45 రోజుల పాటు జరిగే వార్షిక ప్రదర్శన కోసం 2,400 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు సాయంత్రం 4:00 గంటల నుండి ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది. వరకు అయితే, వారాంతాల్లో మరియు సెలవు దినాల్లో, నుమాయిష్ సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఎగ్జిబిషన్ సొసైటీ టిక్కెట్ ధరలను, సందర్శన వేళలను మార్చలేదు. ఫిబ్రవరి 15 న హైదరాబాద్‌లో నుమాయిష్‌ను ముగించాలని ప్లాన్ చేసినప్పటికీ, వ్యవధిని పొడిగించే హక్కు మేనేజింగ్ కమిటీకి ఉంది.

కెసిఆర్ కు ప్రత్యేక హెలికాప్టర్

కాళేశ్వరంప్రాజెక్టు కొరకు లక్షా ముప్పయివేల కోట్ల రూపాయలను వెచ్చించింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం. గత ఎన్నికల ప్రచారంలోనే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజిలు కుంగడం ప్రారంభించడంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణమ ఏర్పడింది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ హాయంలో జరిగిన అవినీతి మీద కాంగ్రెస్ శంఖారావం పూరించింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బాటు గత ముఖ్యమంత్రి కెసీఆర్ ను బాధ్యులుగా చేస్తూ పావులు కదుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చుతో మేడిగడ్డ పర్యటనకు పిలుపునివ్వడమే కాదు ముఖ్యమంత్రి కెసిఆర్ కోసం ప్రత్యేక హెలికాప్టర్ ను సిద్దం చేసింది. ప్రపంచంలోనే అద్భుతమంటూ బీఆర్ఎస్ నేతలు పొగుడుతున్న కాళేశ్వరం గొప్పతనాన్ని కేసీఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం తలపెట్టిన మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు మాజీ సీఎం కేసీఆర్, కాళేశ్వర రావు (హరీశ్ రావును ఉద్దేశించి) లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రావాలని కోరారు. కేసీఆర్ కోసం ప్రత్యేకంగా బేగంపేట ఎయిర్ పోర్టులో ఓ హెలికాఫ్టర్ ను ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందని చెప్పారు.ఈమేరకు మంగళవారం ఉదయం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రాజెక్టు రీడిజైన్ అనే బ్రహ్మ పదార్థాన్ని కనుగొన్నారని, దాంతో ప్రాజెక్టు అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ కి పగుళ్లు ఏర్పడిందని ఆందోళన చేసిన ప్రతిపక్షాలను అప్పట్లో అడ్డుకున్నారని గుర్తుచేశారు. భారీగా పోలీసులను మోహరించి బ్యారేజ్ పైకి ఎవరూ పోకుండా అడ్డుకున్నారని, మేడిగడ్డ బ్యారేజ్ ఫెయిల్యూర్ ను గత ప్రభుత్వం దాచిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మరో అడుగు ముందుకేసి బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. బాంబులు పెట్టి పేలిస్తే శకలాలు గాల్లోకి లేస్తాయని, భూమిలోకి కుంగదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయం ‘అ ఆ’ లు చదివే పిల్లవాడికీ తెలుసని అన్నారు.  మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చేశారా..? లేక బ్యారేజీనే ఇసుకలో పేకమేడలా కట్టారా? అనేది అక్కడికి వెళ్లి చూసి తేల్చదానికే ప్రభుత్వం ఈ టూర్ ఏర్పాటు చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ సందర్శనకు రావాలని సీఎం ఆహ్వానించారు. అక్కడికి వెళ్లి చూసి వచ్చాక ఒకటి రెండు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సభలో అందరమూ చర్చిద్దామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరికి ఏటీఎంగా మారింది.. దాని కథ, కమామీషు అంతా తేల్చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

వైపీపీ దాష్టికాలపై చర్యలకు నో పొలీస్!

ఆంధ్రప్రదేశ్ లో అసలు పోలీసులు ఉన్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికార పార్టీపై విమర్శలు గుప్పించినా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినదిస్తూ ఆందోళనకు దిగినా పెద్ద సంఖ్యలో ఖాఖీ యూనిఫారాలు వేసుకున్న దండు వాలిపోతుంది. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు, వేధింపులతో చెలరేగిపోతుంది. అదే అధికార పార్టీకి చెందిన వారు ఎంత అడ్డగోలుగా వ్యవహరించినా కిమ్మనదు. పైపెచ్చు అధికార పార్టీ నేతల దాష్టీకాలకు బలైన బాధితులపైనే కేసులు నమోదు చేస్తుంది. అరెస్టులు చేస్తుంది. ఇదంతా చూస్తుంటే.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఖాఖీ యూనిఫారంలో వైసీపీ అనుబంధ సంస్థలా మారిపోయిందా అన్న అనుమానాలు కలుగక మానవు. ఒక ఎమ్మెల్సీ తన మాజీ డ్రైవర్ ను హత్య చేసి అతడి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేస్తే.. ఆ ఎమ్మెల్సీ తనంతట తాను వచ్చి లొంగిపోయే వరకూ..బహిరంగంగా తిరిగినా అరెస్టు చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉదాహరణలు. వైసీపీ మూకలు దాడులకు తెగబడిన సందర్భాలలో ఆ దాడులకు గురైన వారిపైనే కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం అన్నది ఏపీ పోలీసులకు సర్వసాధారణంగా మారిపోయింది.  ఇక వైసీపీ నేతలు ఎంత అడ్డగోలుగా మాట్లాడినా, ప్రతిపక్ష నేతలను దుర్భాషలాడినా, లేపేస్తాం అంటూ హెచ్చరికలు చేసినా పోలీసులకు వినపడదు. అదే ప్రతిపక్ష నాయకులు అధికారపక్షంపై కానీ, ఆ పార్టీ నాయకులపై కానీ చిన్న పాటి విమర్శ చేసినా కేసులు, జైళ్లు. ఇదీ ఏపీలో పోలీసు వ్యవస్థ పని తీరు.   సహజంగా ఎవరినైనా ఫోన్ చేసి బెదిరిస్తేనే కేసులు పెడతారు. కానీ.. ఒక బాధ్యతగల ఎమ్మెల్యే ఒక మహిళను ఉద్దేశించి ఆమె వైఎస్ బిడ్డ కాబట్టి బాపట్ల దాటనిచ్చాం. అదే వేరేవాళ్లయితేనా? అంటూ మీడియా సమావేశంలోనే బహిరంగంగా హెచ్చరిస్తే.. పోలీసులకు అందులో ఎలాంటి తప్పూ కనిపించలేదు. ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడానికి చేతులు, చేతలు రాలేదు.  అందుకు ఒకే ఒక్క కారణం ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. అదే స్థానంలో ఏ విపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా అయి ఉంటే.. ఈ పాటికి  కేసులు నమోదు చేసి రాజును మించిన రాజభక్తి ప్రదర్శించేవారనడంలో సందేహం లేదు. విషయమేంటంటే.. ఇటీవల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బాపట్లలో పర్యటించారు. ఆ సందర్భంగా  బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి దందాలపై విమర్శలు గుప్పించారు.  దీనిపై స్పందించి  కోన మీడియా సమావేశం పెట్టి మరీ పెట్టి షర్మిలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.  ఆమె వైఎస్ బిడ్డ షర్మిల కాబట్టి బాపట్ల దాటగలిగింది. ఇంకొకరైతే వేరేలా ఉండేదంటూ  హెచ్చరించారు. షర్మిల కాకుండా మరొకరైతే    బాపట్లయితే దాటనిచ్చేవాడిని కాదని విస్పష్టంగానే చెప్పేశారు. దీనిపై స్పందించిన షర్మిల.. తనను హెచ్చరించిన కోనకు గట్టి రిటార్డే ఇచ్చారు. ఒ ఒక్క నిమిషానికి నేను వైఎస్ బిడ్డను కాదనుకుందాం. రండి ఎవరడొస్తారో చూద్దాం. ఎంతమంది వస్తారో చూద్దాం. మీ దమ్మేంటో చూపించండి. ఎవరేంటో చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు.  చెల్లి అనే ఇంగిత జ్ఞానం లేదంటూ జగన్ పైనా విరుచుకుపడ్డారు.  షర్మిల ప్రతి సవాల్ సంగతి పక్కన పెడితే.. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే..  ఎమ్మెల్యే కోనం వ్యాఖ్యలపై పోలీసుల మౌనం.   సాధారణంగా అయితే ఈ అంశానికి సంబంధించి ఎవరైనా కోనపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయాలి. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా  పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్యే హెచ్చరికలో  హింస ధ్వనిస్తోంది.  గత ఐదేళ్లలోతెలుగుదేశం నేతలు   ప్రెస్‌మీట్లలో చేసిన వ్యాఖ్యలు, సోషల్‌మీడియాలో పోస్టింగులు, లైకులు, ఫార్వార్డు మెసేజీలు పంపిస్తేనే పోలీసులు సుమోటోగా కేసులు  నమోదు చేశారు.   మరి షర్మిలను హెచ్చరించిన అధికార పార్టీ ఎమ్మెల్యే కోనపై కూడా అదే విధంగా  పోలీసులు సుమోటోగా ఎందుకు కేసు నమోదు చేయలేదు అని నెటిజన్లు నిలదీస్తున్నారు. కోనకు భయపడి  ఎవరూ ఫిర్యాదు చేయనంత మాత్రానా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైనదేనా అని ప్రశ్నిస్తున్నారు.   ఇలాంటి అంశాలపై గతంలో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు, అధికార పార్టీ ఎమ్మెల్యే కనుకే కోనపై కేసు నమోదు చేయలేదు, చర్యలకు ఉపక్రమించలేదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇక కాంగ్రెస్ పార్టీ అయితే వైసీపీ ఎమ్మెల్యే కోన హెచ్చరికలను బట్టి, వైఎస్ షర్మిలకు ప్రాణహాని  ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.   పోలీసు భద్రత పెంచాలని డిమాండ్ చేస్తోంది.   మొత్తం మీద ఏపీలో పోలీసులు    వైసీపీకి ఊడిగం చేయడమే తమ డ్యూటీ అని భావిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.