గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై అరెస్ట్ వారెంట్ 

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో మొత్తం 38 మందిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. కేసు విచారణకు కోర్టుకు హాజరుకాకపోవటంతో వారెంట్ ను గత విచారణలోనే న్యాయస్థానం జారీ చేసింది. ఇవాళ్టి విచారణకూ వంశీ హాజరుకాకపోవటంతో వారెంట్ అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలించింది. ప్రస్తుతం వల్లభనేని వంశీ నియోజకవర్గంలో అందుబాటులో లేనట్లుగా తెలుస్తోంది. గతకొంతకాలంగా ఆయన నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్ లో ఉంటున్నారని సమాచారం. అయితే, తాజా పరిణామాలపై వల్లభనేని వంశీ ఎలా ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిందే.  

జార్ఖండ్ మాజీ సిఎంకు సుప్రీంలో చుక్కెదురు 

మనీలాండరింగ్ కేసులో అరెస్టైన  జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎమ్ఎమ్ పార్టీ అధినేత హేమంత్ సోరెన్‌కు శుక్రవారం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తన అరెస్టును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించబోమని సుప్రీం తేల్చిచెప్పింది. ఈ పిటిషన్‌కు తగిన వేదిక సుప్రీంకోర్టు కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎమ్ఎమ్ సుందరేశ్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని మాజీ సీఎంకు సూచించింది. జార్ఖండ్‌లో అక్రమ భూలావాదేవీలపై విచారణ జరుపుతున్న ఈడీ ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పీఎమ్ఎల్‌ఏ కోర్టు సోరెన్‌కు ఒక రోజు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే, పది రోజుల రిమాండ్ కావాలని ఈడీ కోరడంతో తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. సోరెన్ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది.  సోరెన్ అరెస్టుకు వ్యతిరేకంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఏడు గంటల పాటు విచారించిన తర్వాత బుధవారం అర్థరాత్రి సోరెన్‌ను ఇడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  అరెస్టుకు ముందే సోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

మంత్రి రోజాకు నిరసన సెగ

ఎపికి మూడు రాజధానుల ప్రతిపాదన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఎపికి రాజధాని లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జై అమరావతి ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తాజాగా  తిరుమల కొండపై ఏపీ మంత్రి రోజాకు శ్రీవారి సేవకుల నుంచే  నిరసన సెగ తగిలింది. జై అమరావతి అంటూ వారు మంత్రి ఎదుట నినదించారు. అంతకుముందు వారు మంత్రి రోజాతో సెల్ఫీలు దిగారు. ఎపికి మూడు రాజధానులు అవసరం లేదని వాళ్లు మంత్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత వాళ్లు జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  ఈ ఉదయం ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆమె ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత... అమరావతి ప్రాంతం నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు ఆమెను చుట్టుముట్టారు. ఆమె ఆందోళనకారులతో నవ్వుతూ సమాధానాన్ని దాట వేసారు.  జై అమరావతి, ఏపీకి ఒకటే రాజధాని, వందేమాతరం అని నినాదాలు చేశారు. జై అమరావతి అని మీరు కూడా చెప్పండి మేడమ్ అని రోజాను వారు అడిగారు. అయితే, రోజా చిరునవ్వులు చిందిస్తూనే... 'శ్రీవారి సేవకు వచ్చి ఇదేంది?' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.  ఎపిలో ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్న నేపథ్యంలో అమరావతి ఉద్యమకారుల నుంచి నిరసన రావడం జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ  పట్టుబడ్డ ఎపి పోలీసులు 

గంజాయి మీద ఉక్కు పాదం మోపిన తెలంగాణ సర్కారు కు వింత అనుభవం ఎదురైంది. తెలంగాణ పోలీసులకు ఆంధ్రా పోలీసులు పట్టుబడిన వైనమిది.  హైదరాబాద్ లోని బాచుపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున సంచలనం చోటుచేసుకుంది. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు బాలానగర్ పోలీసులకు పట్టుబడ్డారు. కారులో గంజాయి తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా డ్యూటీకి సెలవు పెట్టి మరీ గంజాయి దందాకు తెరలేపారు. ముందస్తు సమాచారం అందడంతో తెలంగాణ పోలీసులు తనిఖీ చేపట్టడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లిలో గంజాయి అమ్మేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ సమాచారం అందడంతో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ చేపట్టారు. దీంతో ఓ కారులో 22 కిలోల గంజాయి బయటపడింది. ఆ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. విస్తుపోయే విషయం బయటపడింది. వారిద్దరూ ఏపీ పోలీస్ శాఖకు చెందిన వారని, కాకినాడలో ఒకరు హెడ్ కానిస్టేబుల్, మరొకరు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారని తేలింది. విధులకు సెలవు పెట్టి మరీ గంజాయి దందాకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి వారిద్దరినీ బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వివరించారు.

కేసీఆర్ కు అగ్నిపరీక్ష!

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరగనున్నాయన్న సమాచారంతో బీఆర్ఎస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలర్ట్ అయ్యారు. గురువారం (ఫిబ్రవరి1) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై వారికి కీలక సూచనలు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అయితే కేసీఆర్ స్వరంలో గతంలో ఉన్న ధీమా లేదనీ, పార్టీ ఎమ్మెల్యేలపై ఆయనకు పట్టు జారిందనీ చెబుతున్నారు. గట్టిగా మందలిస్తే రేపు పార్టీ వీడుదామనుకుంటున్న వారు ఇప్పుడే జారిపోతారేమో అన్న భయం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపించిందని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పుడు కర్రవిరగకుండా, పాము చావకుండా వ్యవహరించి ఎమ్మెల్యేల వలసలను నిరోధించాలన్న టాస్క్ తో కేసీఆర్ ఉన్నారని వారు చెబుతున్నారు. అందుకే రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ విషయంలో ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే.. అలా భేటీ అయిన ఎమ్మెల్యేలను తప్పుపట్టకుండా జాగ్రత్తగా మాట్లాడారు. మంచి ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉన్న వారిని కలిస్తే తప్పు లేదనీ, అయితే అలా కలవడం వల్ల ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెడతాయనీ కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వాలన్నా, నియోజకవర్గ సమస్యలను చెప్పుకోవాలన్నా అదంతా ప్రజల సమక్షంలోనే చేయాలని సూచించారు.  ఎమ్యెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో ఆయన నిర్వహించిన ఈ  సమావేశానికి ప్రాధాన్యం చేకూరింది. లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కేసీఆర్ ఇక తాను అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. పార్టీ కేడర్ ను కాపాడుకోవడం ముఖ్యమన్నారు. లోకసభ ఎన్నికలలో బీఆర్ఎస్ సత్తా చాటకుంటే..  వలసలను ఆపడం సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా వచ్చే లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు మాత్రమే కాదు కేసీఆర్ కు కూడా అగ్నిపరీక్షగానే మారాయి.  అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో నరేంద్రమోడీ గ్రాఫ్ పెరిగింది. దీంతో వచ్చే లోక్ సభ  ఎన్నికలలో తెలంగాణలో కూడా బీజేపీ పెర్ఫార్మెన్స్ బాగుంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ ను వెనక్కు నెట్టి కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోరు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకునే కేసీఆర్ తెరమీదకు వచ్చారని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత.. కేసీఆర్ గాయం కారణంగా ఇన్ని రోజులూ తెరమీదకు రాలేదు. దీంతో బీఆర్ఎస్ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే పార్టీలో మళ్లీ జోష్ తీసుకురావడానికి కేసీఆర్ రంగంలోకి దిగారు. 

దిగజారిన కేశినేని నాని స్థాయి!

విజయవాడ సిట్టింగ్ ఎంపీ, వైసీపీ నాయకుడు త కేశినేని నానిపై ఆయన సోదరుడు, తెలుగుదేశం నేత కేశినేని చిన్ని మరోసారి విరుచుకుపడ్డారు.విశ్వాసం లేని వ్యక్తి కేవినేని నాని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.   కేశినేని  నాని వైసీపీలో చేరడంతో  సైకోలందరూ ఒకే చోటకు చేరినట్టయిందని అన్నారు. విజయవాడ లోక్ సభ స్థానానికి కేశినేని నాని పోటీ చేస్తే ఆయన ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. విజయవాడ ఎంపీగా నాని కచ్చితంగా 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతాడన్నారు. అందుకే విజయవాడ టికెట్ ను నానికి ఇచ్చే అంశంలో వైసీపీ నాయకత్వం ఇంత వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు.  తెలుగుదేశంలో ఉన్నప్పుడు కేశినేని నానికి చాలా గౌరవం ఉండేదని, ఇప్పుడు ఆయన వైసీపీలో చేరిన తరువాత ఆయన స్థాయి దిగజారిపోయిందని కేశినేని చిన్న పేర్కొన్నారు.  ఇప్పుడు దేవినేని అవినాశ్ కు ముఖ్య అనుచరుడిగా నాని మారారని ఎద్దేవా చేశారు. విజయవాడ నుంచి తాను బరిలోకి దిగే అంశాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.  తమ నాయకత్వం ఎక్కడి నుంచి పోటీ చేయాలని  ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని తెలిపారు. టికెట్ల కేటాయింపులపై తమ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ చర్చిస్తారని చెప్పారు. అయితే కేశినేని నానిపై పోటీకి తాను సిద్ధమని కేశినేని చిన్ని చెప్పారు.

వదల బొమ్మాలీ వ‌ద‌లా.. ఢిల్లీలోనూ జ‌గ‌న్‌కు దిమ్మ‌తిరిగే షాక్‌లిస్తున్న ష‌ర్మిల

తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  కంగారెత్తిపోతున్నార‌ు. ఈ విష‌యం తెలుసుకున్న వైసీపీ నేత‌లు బెంబేలెత్తిపోతున్నారు. ఎవ‌రు అడ్డొచ్చినా కేసులుపెట్టి లోపలేసే మా జ‌గ‌న‌న్న‌కు కంగారెంటి? అంటూ బాధపడిపోతున్నారు. జగన్ కు కంగారెత్తించేంత సీన్  ఎవ‌రికీ లేద‌ంటూ తమకు తామే ధైర్యం చెప్పుకుని  జ‌బ్బ‌లు చ‌చరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.  కానీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిస్థితి మాత్రం ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి అన్న‌ట్లుగా త‌యారైంది. కేంద్రంలోని బీజేపీ అండ‌దండ‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పుష్క‌లంగా ఉండ‌టంతో ప్ర‌త్య‌ర్థి పార్టీలైన‌ తెలుగుదేశం, జ‌న‌సేన‌లు ఇంత కాలం జ‌గ‌న్ ను దీటుగా ఎదుర్కోవడంలో కొంత ఇబ్బంది పడ్డారు.  కానీ, తాను వ‌దిలిన బాణ‌ం, సొంత సోదరి షర్మిలే  త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును కుప్ప‌కూల్చేందుకు ఎదురు తిరిగి వ‌స్తుండ‌టంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయారు. ఈ విషయం ఏపీ రాజ‌కీయాల్లో అవ‌గాహ‌న ఉన్న వారందరికీ ఇప్పటికే అర్థమైపోయింది.   ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ప‌గ్గాలు చేప‌ట్టి  జ‌గ‌న‌న్న‌పై క‌య్యానికి కాలుదువ్వుతున్న ష‌ర్మిల‌ను ఎదుర్కొనేందుకు వైసీపీ నేత‌లు నానా తంటాలు ప‌డుతున్నారు. సూటిగా సుత్తి లేకుండా జ‌గ‌న‌న్నా.. అంటూ ఆమె సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలకు సమాధానం చెప్పలేక తమకు మాత్రమే తెలిసిన తిట్ల‌దండ‌కం అందుకుంటున్నారు. తెలంగాణ‌లో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు పునాదులు వేసుకోవ‌టంలో విఫ‌ల‌మైన ష‌ర్మిల కాంగ్రెస్ గూటికి చేరి, త‌న సొంత పార్టీ  వైఎస్‌ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తెలంగాణ‌లో కోడ‌లినంటూ రాజ‌కీయాలు చేసిన ష‌ర్మిల.. ఇప్పుడు జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇలాకాలో  అస‌లు సిససలైన  వైఎస్ వార‌సురాలిని నేనే అంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చరమగీతం పాడేందుకు  కంక‌ణం క‌ట్టుకున్నారు. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా ఎత్తిచూపుతూ జ‌గ‌న్ శిబిరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా గ‌ల్లీలోనే కాదు.. ఢిల్లీలోనూ వ‌ద‌లేది లేదంటూ జ‌గ‌న్ లో టెన్ష‌న్ ను మ‌రింత పెంచేస్తున్నారు ష‌ర్మిల‌. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై పోరాటం చేశారు. అయితే కేంద్రం స్పందించకపోవడంతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత జరిగిన 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలైంది. అయితే ఆ ఎన్నికల ప్రచారంలో  నాకు ఇర‌వైకిపైగా ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడ‌లు వంచి ఏపీకి ప్ర‌త్యేక హోదా తెస్తానంటూ జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో  ఉదరగొట్టేశారు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట‌ల‌ను న‌మ్మిన ఏపీ ప్ర‌జ‌లు ఆయ‌న కోరిన‌ట్లే ఇర‌వైకిపైగా ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించారు. రాష్ట్రంలోనూ భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్.. ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని మ‌ర్చిపోవ‌టంతో పాటు.. కేంద్రంతో స్నేహ సంబంధాల‌ను కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం ముంచుకొస్తున్న స‌మ‌యంలో ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ష‌ర్మిల.. ప్ర‌త్యేక హోదా విష‌యాన్నే ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తూ ప్ర‌జల‌కు జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌ను గుర్తు చేస్తూ వైసీపీ నేత‌ల‌కు వ‌ణుకుపుట్టిస్తున్నారు. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధులు వంటి అంశాల‌పై గ‌ళ‌మెత్తుతున్న ష‌ర్మిల‌.. అటూ జ‌గ‌న్, మ‌రోవైపు బీజేపీపై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నారు. ష‌ర్మిల దూకుడుకు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.  ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని మోదీ, అమిత్ షాల‌తో పాటు ఇత‌ర కేంద్ర మంత్రుల‌ను క‌లిసి ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల‌పై విన్న‌వించుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈక్ర‌మంలో బుధ‌వారమే ఢిల్లీ వెళ్లాల్సిన జ‌గ‌న్‌.. మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో ఆగిపోయారు.  వారి నుంచి ఎప్పుడు అపాయింట్ మెంట్ వ‌స్తే అప్పుడు వెళ్లి క‌లిసేందుకు జ‌గ‌న్ సిద్ధంగా ఉన్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వై.ఎస్ ష‌ర్మిల ఏకంగా త‌న మ‌కాంను ఢిల్లీకి మార్చేశారు. ష‌ర్మిల ఆధ్వ‌ర్యంలో ఏపీ కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీవెళ్లి అక్క‌డ ధ‌ర్నా చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు అంశంతోపాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై ప్ర‌శ్నించేందుకు ఢిల్లీవేదిక‌గా ధ‌ర్నా చేప‌ట్ట‌బోతున్నారు. శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 2న‌) ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నా చేయ‌నున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ కంటే ముందే మోదీ, అమిత్ షాల‌తో భేటీకోసం షర్మిల ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.  వారితో భేటీకి అప్పాయింట్ మెంట్ ల‌భిస్తే.. ప్ర‌త్యేక హోదా, ఏపీకి సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. అయితే, పైకి అలా చెప్పుకుంటున్నా.. మోదీ, అమిత్ షాల‌తో ష‌ర్మిల భేటీ అయితే.. జ‌గ‌న్ రెడ్డికి ఎలాంటి సాయం చేయ‌వ‌ద్ద‌ని ఆయ‌న కుటుంబాన్ని ఎలా మోసం చేశారో వివ‌రించడమే షర్మిల ఉద్దేశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో సీఎం జ‌గ‌న్ కు బీజేపీ అవ‌స‌రం ఎంతైనా ఉంది. తాజాగా ఎన్నిక‌ల సంఘం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. షెడ్యూల్ ప్ర‌క‌ట‌న త‌రువాత మ‌రింత కఠినంగా ఉండే  అవ‌కాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికితోడు జ‌గ‌న్ స‌ర్వీస్ అధికారుల్ని శంక‌ర‌గిరి మాన్యాలు ప‌ట్టించేందుకు జాబితాను రెడీ చేసుకుంటున్నద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. మ‌రోవైపు.. ష‌ర్మిల లేవ‌నెత్తుతున్న ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు నిధులు, ఏపీకి రావాల్సిన నిధులు అంశాల‌పై మోదీ, అమిత్ షాల దృష్టికి తీసుకెళ్ల‌డం ద్వారా ష‌ర్మిల వ్యూహాల‌కు జ‌గ‌న్ చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే, జ‌గ‌న్ ఢిల్లీ టూర్ స‌మ‌యంలోనే ష‌ర్మిల ఢిల్లీలో తిష్ట‌వేయ‌డం, ఏపీ స‌మ‌స్య‌ల‌పై ఢిల్లీ వీధుల్లో నిర‌స‌నకు పూనుకోవ‌డంతో జ‌గ‌న్ శిబిరంలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోందంటున్నారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను సూటిగా సుత్తిలేకుండా ప్ర‌శ్నిస్తూ తాడేప‌ల్లి పాలెస్ లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి నిద్ర‌లేకుండా చేస్తున్న ష‌ర్మిల‌.. ఇప్పుడు ఢిల్లీలోనూ వ‌ద‌ల  బొమ్మాలీ వదల అంటుండ‌టంతో తాడేప‌ల్లి ప్యాలెస్ లో కంగారు మొదలైందని చెబుతున్నారు.  మొత్తానికి ష‌ర్మిల మాత్రం.. ఏపీలోనే కాదు.. ఢిల్లీలోనూ జగన్ ను వదిలేదే లే.. తగ్గేదేలే అంటూ క‌య్యానికి కాలుదువుతున్నారు. మ‌రి జ‌గ‌న్ ష‌ర్మిల పెట్టే టెన్ష‌న్ నుంచి ఎలా త‌ప్పించుకుంటాడో చూడాల్సిందే.

నమో నమామి.. కేసీఆర్ కు మిగిలిన దారిదేనా?

బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో నిలబడ్డారు. ఒక వైపు ఒక్క ఓటమితో కకావికలుకావడానికి సిద్ధంగా ఉన్న పార్టీని కాపాడుకోవడం, అదే సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పీకలోతు ఇరుక్కున్న కుమార్తె కవితను ఆ కేసు నుంచి బయటపడేయడం. రెండూ ఒకే నిర్ణయంతో జరిగేలా ఆయన వ్యూహ రచన చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తెలంగాణ ఆవిర్బావం నుంచి వరుసగా రెండు దఫాలు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన ఆ అధికార మత్తులో తనకు ఇక తిరుగే లేదన్న భ్రమల్లో పడ్డారు. అందుకే తన పార్టీకి అధికారం కట్టబెట్టిన, తనకు వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగించిన తెలంగాణ అన్న సెంటిమెంటును పార్టీకి దూరం చేసేశారు. అందుకు ఆయన చెప్పిన కారణం.. తెలంగాణ సిద్ధించిన తరువాత ఇక ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ కొనసాగాల్సిన అవసరం లేదు.. ఈ తెలంగాణ మోడల్ ప్రగతిని దేశ వ్యాప్తం చేయాలంటే తాను ప్రధాని కావడమేనని ఆయన నమ్మారు. తన మాటను శిలాశాసనంగా భావించే పార్టీ నేతలు, శ్రేణులను నమ్మించారు. అలా నమ్మని వారు ఎవరైనా ఉన్న ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నారో ఏమో నోరెత్త లేదు.   పదేళ్ళకు పైగా సాగిన తెలంగాణ ఉద్యమాలలో, ఆ తర్వాత మరో పదేళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను తన కంటి చూపుతో కంట్రోల్ చేసిన కేసీఆర్, దేశ రాజకీయాలను కూడా అలాగే దున్నేయగలనని భావించారు. అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు కదిపారు. కాంగ్రెస్సేతర, బీజేపీ యేతర కూటమి, ధర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ అంటూ దేశ మంతా చుట్టేశారు. ధనిక రాష్ట్రం అంటూ ఇక్కడి బాధితులను ఆదుకోవడం అన్న విషయాన్ని పూర్తిగా విస్మరించి.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి రాష్ట్ర సొమ్మును పందేరం చేశారు. అయితే ఆయన మోడీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రచారాన్ని ఉదృతం చేసి,  కేంద్రంపై విమర్శల తీవ్రత పెంచిన సమయంల అనూహ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణం తెరమీదకు వచ్చింది. ఆ కుంభకోణంలో కీలక పాత్ర  కేసీఆర్ తనయ, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ ఆరోపణలు వెల్లువెత్తడం, సీబీఐ, ఈడీల దర్యాప్తు ఆమె అరెస్టు దిశగా సాగడంతో కేసీఆర్ దూకుడుకు బ్రేక్ పడింది. ఇక అప్పటి నుంచీ కేంద్రంపై  ఆయన విమర్శల వరదకు కళ్లెం పడింది. సరిగ్గా ఇదే బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అంటూ కాంగ్రెస్ విమర్శలు వాస్తవమే అన్న నమ్మకం కలిగింది. అదే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి, స్వయంగా కేసీఆర్ పోటీ చేసిన రెండు స్థానాలలో ఒక స్థానం నుంచి పరాజయం పాలు కావడానికి ప్రధాన కారణాలలో ఒకటి అయ్యింది.  సరే ఇప్పుడు అధికారం ఎలాగూ దూరమైంది. ఇక ఆయన ముందు ఇప్పడు ఉన్న లక్ష్యాలు పార్టీని, కుమార్తెను కాపాడు కోవడం మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. అందు కోసం ఆయన బీజేపీని పల్లెత్తు మాట అనేందుకు కూడా ఒకటికి పది సార్లు ఆలోచిస్తారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత బీఆర్ఎస్ నేతల విమర్శలను అధకార పగ్గాలు  అందుకుని నిండా రెండు నెలలు కూడా కాని కాంగ్రెస్ పైనే సంధిస్తున్నారు తప్ప బీజేపీపై మాత్రం ఆమోదయోగ్యం కాని సంయమనం పాటిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ పొలిటికల్ గా మాళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశలు ఉన్నప్పటికీ, ఆయన నమో నరేంద్ర మోడీ) నమామి అంటూ సరెండ్ అవుతారనీ, బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ నినాదానికి తన గొంతు విచ్చి మోస్తారని పరిశీలకులు అంటున్నారు.  కవేళ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యుంటే తప్పకుండా అదీ చేసేవారేమో? కానీ అనూహ్యంగా కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోవడంతో తెలంగాణ గడప దాటి అడుగు బయట పెట్టలేని స్థితిలో ఉన్నారు. అసలు ఈ ఓటమి కేసీఆర్‌కు చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే అపర చాణక్యుడైన కేసీఆర్‌ని ఎదుర్కోవడం ఎవరి వల్లా కాదని, రేవంత్‌ రెడ్డికి నోటి దురద తప్ప మరేమీ చేతకాదని బిఆర్ఎస్ పార్టీలో అందరూ గుడ్డి నమ్మకంతో ఉండేవారు. నిజానికి కేసీఆరే వారందరికీ అటువంటి గుడ్డి నమ్మకం కలిగించారని చెప్పవచ్చు. అందుకే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్‌ ప్రత్యేక విమానాలు వేసుకొని దేశాటన చేస్తున్నప్పటికీ అభ్యంతరం చెప్పలేదు. దేశంలో ఏ పార్టీ కూడా తమతో కలవకపోవడం వలననే కేసీఆర్‌ టిఆర్ఎస్‌ పేరుని బిఆర్ఎస్ పార్టీగా పేరు మార్చారని తెలిసి ఉన్నప్పటికీ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కీలకమైన శాసనసభ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ మహారాష్ట్రలో చక్కర్లు కొడుతున్నప్పటికీ పార్టీలో ఎవరూ తప్పుపట్టలేదు. ఎందుకంటే కేసీఆర్‌పై అంత గుడ్డి నమ్మకం వారికి. ఆయన మంత్ర దండం తిప్పేసి బిఆర్ఎస్‌ని గెలిపించేస్తారని అందరూ గుడ్డిగా నమ్మారు కనుక! కానీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కేసీఆర్‌ నిర్ణయాలలో చాలా తప్పులే కనిపిస్తున్నాయి వారందరికీ. అందుకే పార్టీ పేరుని మళ్ళీ టిఆర్ఎస్‌గా మార్చుకొనే ఆలోచనలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఇతర రాష్ట్రాలలో పోటీ చేసే ఆలోచనలు విరమించుకొని, తెలంగాణకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలన్నీ తప్పని బిఆర్ఎస్‌ నేతలు ప్రస్తుతం చాలా మృదువుగా చెప్పుకుంటున్నప్పటికీ, ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీ ఎంపీ సీట్లు తగ్గిపోతే వారందరూ మరింత స్పష్టంగా కేసీఆర్‌ తీరుని తప్పు పట్టవచ్చు. అప్పుడు కేసీఆర్‌ని వ్యతిరేకించేవారు లేదా కేసీఆర్‌ వద్దనుకునేవారు కాంగ్రెస్‌లోకి జంప్ అయిపోవడం ఖాయమే. బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల వలసలు మొదలైతే వాటిని కేసీఆర్‌ కూడా ఆపలేరు. కనుక అవి మొదలవకుండా చేయడంపైనే బిఆర్ఎస్‌ మనుగడ ఆధారపడి ఉంటుంది. ఓ పక్క కేసీఆర్‌ తలపై ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కత్తి వ్రేలాడుతూనే ఉంది. మరోపక్క రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్‌, కేట్, హరీష్ రావులతో సహా బిఆర్ఎస్‌ నేతలందరి మెడలకు ఉచ్చు బిగించేందుకు అనేక కేసులు సిద్దం చేస్తోంది. ఇదివరకు కేసీఆర్‌ నుంచి రక్షణ కోసం ఈటల రాజేందర్‌ వంటివారు బీజేపీలో చేరితే, ఇప్పుడు ఈ కేసులు, పార్టీని చక్కదిద్దుకోవడం కోసం కేసీఆర్‌ స్వయంగా మోడీ పంచన చేరి బీజేపీ రక్షణ కవచం ధరించక తప్పదు. కేసీఆర్‌కు వేరే దారి లేదు కూడా. బహుశః లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఇదే చేయవచ్చు. 

ఇలా జాబితాలు.. అలా అసమ్మతులు!.. వైసీపీలో గందరగోళం

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి వైనాట్ 175, అలాగే లోక్ సభ స్థానాలు కూడా 25 అవుటాఫ్ 25 అంటూ తెగ ఊదరగొట్టేసి.. ఇప్పుడు గెలవాలంటే అభ్యర్థులను మార్చేయాలని భావిస్తున్నారు. అయితే అభ్యర్థులను కాదు.. గెలవాలంటే అధినేతను మార్చాలని, ఆయన నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి లోనై పార్టీ విడిచి వెళ్లి పోతున్న నేతలు చెబుతు న్న మాట. ఇప్పటి వరకూ ఆయన ఇలాంటి మార్పులు చేర్పులతో ఐదు జాబితాలు విడుదల చేశారు. మొత్తం 61 అసెంబ్లీ, 14 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.  ఒంగోలు వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మళ్ళీ టికెట్‌ ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పట్టుబట్టినా పట్టించుకోలేదు.  అక్కడి నుంచి ఈసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అలా చెప్పినట్లే ఒంగోలు లోక్‌సభ బాధ్యతలు చెవిరెడ్డికి కట్టబెట్టారు. గత్యంతరం లేక బాలినేని సర్దుకుపోయి ఒంగోలు అసెంబ్లీ సీటుతో సరిపెట్టకుంటానని చెప్పేశారు. అయినా ఆయనలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. అది ఏక్షణంలోనైనా నివురు తొలగించుకుని భగ్గుమనడం తథ్యమని పరిశీలకులు అంటున్నారు. ఇక మాగుంట అయితే పార్టీని వీడేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక నెల్లూరు అర్బన్ వైసీపి ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్ ఇంతకాలం తనకు నెల్లూరులో తిరుగే లేదని, పార్టీని వీడిన కోటంరెడ్డి, మేకపాటి, ఆనం ముగ్గురికీ తన తడాఖా చూపిస్తానంటూ గంభీర ఉపన్యాసాలు ఇస్తూ వచ్చారు. తీరా ఇప్పుడు ఆయనను నెల్లూరు నుంచి  మార్చేసి నరసరావు పేట ఎంపీగా పోటీ చేయమంటున్నారు. ఆయన ఇప్పటి వరకూ మౌనంగానే ఉన్నా.. పార్టీ మారే యోచన చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  అందుకు కారణం లేకపోలేదు. అనీల్ కుమార్ యాదవ్ మాకు వద్దంటే వద్దని నరసరావుపేట వైసీపీ శ్రేణులు ఇప్పటికే ఆందోళన బాట పట్టారు. ఎలాగోలా సర్దుకుని పోటీ చేసినా నరసరావు పేట లోక్ సభ అభ్యర్థిగా పార్టీ శ్రేణుల సహకారం లేకుండా గెలిచే అవకాశాలు లేవని అనీల్ కుమార్ యాదవ్ భావిస్తున్నారు. అదే విధంగా సత్యవేడు వైసీపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను  ఈసారి తిరుపతి నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని జగన్‌ ఆదేశించి సత్యవేడు టికెట్‌ నూకతోటి రాజేష్‌కి ఇచ్చారు. ఈ మార్పును అంగీకరించని ఆదిమూలం  పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇంకా మరిన్ని జాబితాలు ఉన్నాయంటున్నారు. ఒక్కో జాబితాతో పార్టీలో అసమ్మతి, అసంతృప్తి పెరిగిపోతోంది. జాబితాలు పూర్తయ్యే నాటికి పార్టీలో ఉండేదెవరో, గుడ్ బై చెప్పి వెళ్లేదెవరో అన్న అయోమయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. 

మొరార్జీ రికార్డు సమం చేసిన విత్త మంత్రి..ఎందులో నంటే..?

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్  గురువారం (ఫిబ్రవరి 10) 2024 మధ్యంతర బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. పాత పన్ను బకాయిల రద్దు మాత్రం ఒకింత ఊరట కలిగించినా పన్ను రేట్లను యథాతథంగా ఉంచడం, అలాగే ఆదాయపన్ను మినహాయింపు పెంపుపై వేతన జీవులు పెట్టుకున్న ఆశలను పట్టించుకోకపోవడం నిరాశ కలిగింది. అదే విధంగా పన్ను స్లాబుల విషయంలో కూడా ఎలాంటి మార్పూ చేయలేదు. అయితే ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ కావడంతో ఎటువంటి అంచనాలూ వద్దని నిర్మలా సీతారామన్ ముందు ప్రకటించడంతో ఈ బడ్జెట్ పై ఎవరూ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అయితే ఈ మధ్యంత బడ్జెట్ గురించి చెప్పుకోవలసింది ఏమైనా ఉందంటే అతి విత్త మంత్రిగా  బడ్జెట్ లు ప్రవశ పెట్టడంతో నిర్మలా సీతారామన్ సృష్టించిన రికార్డు ఒక్కటే. అవును మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మధ్యంతర బడ్జెట్ ల రికార్డును నిర్మలా సీతారామన్ సమం చేశారు. ఔను 1959 1964 మధ్య కాలంలో మోరార్జీ దేశాయ్ విత్త మంత్రిగా ఐదు పూర్తి స్థాయి బడ్జెట్ లు, ఒక ఓటాన్  అక్కౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇప్పుడు ప్రస్తుత విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అలాగే ఆమె ఇప్పటి వరకూ ఎవరూ చేయని విధంగా అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా కూడా రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. 2020లో నిర్మలా సీతారామన్  వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఏకంగా 2 గంటల 42 నిముషాలు ప్రసంగించారు.     

ఎవరి సాయం లేకుండానే హ్యాండ్ స్టిక్ పట్టుకుని కేసీఆర్ నడక!.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.  గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన దాదాపు రెండు నెలల తరువాత గురువారం (ఫిబ్రవరి 1) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. స్పీకర్ ఛాంబర్ లో కేసీఆర్ ప్రమాక స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నా ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం హాజరు కాకపోవడం రాజకీయ ఊహాగానాలకు తెరలేపింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనా, వారిలో ఇద్దరు కొత్త ప్రభాకరరెడ్డి, ప్రకాష్ గౌడ్ లు మాత్రం గైర్హాజరయ్యారు.  కేసీఆర్ ఫామ్ హౌస్ లో కాలుజారి పడటంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జాప్యమైంది. అయితే.. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెడతారా? అసలు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారా? అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అయ్యాయి.  అయితే ఆ అనుమానాలన్నీ నిరాధారమేనని కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంతో తేలిపోయింది.  అయితే కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న పరిణామాలే కేసీఆర్ ను రాజకీయాలకు గుడ్ బై చెబుదామన్న యోచనను విరమించుకునేలా చేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో నేతను ఎవరన్న దానిపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, అదే సమయంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీరుపై పార్టీ ఎమ్మెల్యేలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేయడంతో పార్టీని కాపాడుకోవడం, ఎమ్మెల్యేలు జారిపోకుండా నిలువరించడం కేసీఆర్ వినా మరెవరు బీఆర్ఎస్పీ నేతగా ఎన్నికైనా సాధ్యం కాదన్న అభిప్రాయంతోనే కేసీఆర్ మళ్లీ క్రియాశీలంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇలా ఉండగా తుంటి ఎముక  గాయం నుంచి కేసీఆర్ చాలా వరకూ కోలుకున్నట్లుగా కనిపిచారు. కొన్ని రోజుల కిందటి వరకూ హ్యాండ్ స్టిక్ ఉన్నాఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప అడుగులు వేయలేకపోయిన కేసీఆర్ ఇప్పుడు ఎవరి సాయం లేకుండానే హ్యాండ్ స్టిక్ పట్టుకుని నడవడం కనిపించింది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఆయన తొలిసారిగా విపక్ష నేతగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆయన ఎవరినైతే అసెంబ్లీలో చూడడానికి ఇష్టపడలేదో అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో సభా నాయకుడిగా ఉన్నారు.  

వైసీపీ@5వ జాబితా.. నాలుగు ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిదో అభ్యర్థుల జాబితాను  విడుదల చేసింది. ఈ జాబితాలో నలుగురు ఎంపీల పేర్లు ప్రకటించడంతో పాటు మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్‌. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్‌కుమార్‌ యాదవ్‌. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్‌ బాబు. సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నూకతోటి రాజేష్‌. అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగం మత్స్యలింగం. అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు పేర్లను ప్రకటించింది.  ఇప్పటికే జగన్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన నాలుగు జాబితాలను పలు దఫాలుగా విడుదల చేసిన విషయం విదితమే. మరికొద్ది రోజుల్లో మరిన్ని జాబితాలు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే నరసరావుపేట ఎంపీగా నెల్లూరు సీటీ ఎమ్మెల్మే , మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ఎంపిక చేశారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా టీటీడీ మాజీ చైర్మన్, రాయలసీమ టీడీపీ నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడిని బరిలో దింపేందుకు సైకిల్ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్ నిర్ణయించారని.. దీంతో అనిల్ కుమార్ యాదవ్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తినే మళ్లీ ఎంపిక చేశారు. 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా బి దుర్గా ప్రసాద్ ఎన్నికయ్యారు. కానీ ఆయన ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో  డాక్టర్ గురుమూర్తిని జగన్ పార్టీ బరిలో దింపింది. ఆ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. దాంతో మళ్లీ ఆయనకే ఈ స్థానాన్ని కట్టబెట్టింది.    అలాగే మచిలీపట్నం లోక్ సభ స్థానం ప్యాన్ పార్టీ అభ్యర్థిగా సింహద్రి రమేష్ బాబును ఎంపిక చేశారు. ఆయన ప్రస్తుతం అవనిగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక ఇప్పటి వరకు మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి పవన్ పార్టీ కండువా కప్పుకోవడంతో.. ఆ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా సింహద్రి రమేష్ బాబును సీఎం వైయస్ జగన్ తెరపైకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసిన డాక్టర్ సింహద్రి చంద్రశేఖరరావు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సింహద్రి సత్యనారాయణ కుమారుడన్న సంగతి అందరికీ తెలిసిందే.  అలాగే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవనున్న చలమలశెట్టి సునీల్ సైతం గతంలో ఇదే స్థానం నుంచి అదే పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. మళ్లీ ఆయన రానున్న ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు.

రాజధాని ఫైల్స్.. ఏపీలో రాజకీయ ప్రకంపనలేనా?..

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల మెప్పు పొందుతాయి. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం 'రాజధాని ఫైల్స్'. శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. 'రాజధాని ఫైల్స్' చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. టైటిల్ లోగోలో పొలం దున్నే నాగలి ఉండటం ఆకట్టుకుంది. అలాగే పోస్టర్ కూడా ఎంతో క్రియేటివిటీగా ఉంది. ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన ఒక యువ నాయకుడు.. వేలాది రైతు కుటుంబాలకు నేనున్నాను అని భరోసా ఇస్తున్నట్లుగా పోస్టర్ లో కనిపిస్తోంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో మరో రాజకీయ నాయకుడు రూపం ఉన్నట్లుగా గమనించవచ్చు. అలాగే పోస్టర్ మీద "ఒకే ఒక్కడి అహం.. వేలాది రైతులకి కన్నీరు.. కోట్ల కుటుంబాల భవిష్యత్తు అంధకారం." అని రాసుంది. వాస్తవ సంఘటనలకు సహజమైన భావోద్వేగాలను జోడించి ప్రేక్షుకుల్లో ఆలోచన రేకెత్తించేలా ఈ చిత్రాన్ని రూపొందించారట. సంగీత దర్శకుడు మణిశర్మ, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ వంటి దిగ్గజాలు ఈ సినిమా కోసం పని చేయడం విశేషం. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రోజా సీన్ సితారేనా?

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి  రోజా.. ఆశలపై  వైసీపీఅధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ నీళ్లు పోసేశారా?  రానున్న ఎన్నికల్లో నగరి సీటు  ఆమెకు కేటాయించేందుకు పార్టీ అధినేత సుముఖంగా లేరా అంటే వైసీపీ వర్గాల నుంచే కాదు, రాజకీయ సర్కిల్స్ నుంచి కూడా ఔననే సమాధానమే వస్తున్నది.  మరోవైపు ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి ఆర్కే రోజాను రంగంలోకి దింపేందుకు ఫ్యాన్ పార్టీ అగ్రనాయకత్వం పావులు కదుపుతోందంటూ ఓ ప్రచారం సాగినా.. అదేమీ లేదని  తేలిపోయింది. దీంతో రోజాను ముచ్చటగా మూడో సారి  కూడా నగర్ అసెంబ్లీ టికెట్ కేటాయిస్తారన్న ప్రచారం జోరందుకున్నట్లే జోరందుకుని జావగారిపోయింది.    గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి ఎమ్మెల్యేగా  విజయం సాధించిన  రోజా.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెకు కేబినెట్ లో బెర్త్ లభించడంతో ఆమె తీరు, వైఖరి పూర్తిగా మారిపోయాయని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నది. అంతే కాకుండా  ఆమె పార్టీ క్యాడర్ ను, జిల్లా నేతలను కూడా పట్టించుకోకుండా, వారిని ఇసుమంతైనా లెక్క చేయకుండా వ్యవహరిస్తుండటంతో  పార్టీ వర్గాల నుంచే ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.  దీంతో వారంతా జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొరపెట్టుకున్నారు.   దీంతో నియోజకవర్గంలో రోజా వ్యతిరేకులకు కీలక నామినేటెడ్ పదవులు దక్కేలా  మంత్రి పెద్దిరెడ్డి జగన్ వద్ద చక్రం తిప్పారు.  దీంతో ఎమ్మెల్యే, మంత్రి అయి ఉండి కూడా రోజాకు నియోజకవర్గంలో పార్టీ నుంచి ఎటువంటి మద్దతు లేకుండా పోయింది. పైపెచ్చు ఆమెకు ఎవరితోనూ సఖ్యత లేకపోవడంతో  ఆమె నియోజకవర్గంలో ఏకాకిగా మిగిలిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకు మళ్లీ టికెట్  ఇచ్చినా విజయం సాధించే అవకాశాలు లేవన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారని పార్టీ శ్రేణుల్లోనే గట్టిగా వినిపిస్తోంది.   అదే సమయంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకోవడం, జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి మంత్రి పెద్దిరెడ్డి నడుంబిగించారు. తన వర్గానికి చెందిన వారిని నగరి నుంచి బరిలో దింపేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాడేపల్లి ప్యాలెస్ పెద్దలతో నగరి సీటు గెలవాలంటే రోజాకు టికెట్ ఇవ్వవద్దని గట్టిగా చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.   నగరి నుంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపు కోసం ఆర్కే రోజా.. తన వంతు ప్రయత్నాలు చేపట్టినప్పటికీ,   ఆమెకు నియోజకవర్గంలో ప్రతి కూల పవనాలు వీస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన జగన్ ఆమెను మరో నియోజకవర్గం నుంచి బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి ఆమె పేరు ప్రతిపాదించినా, కారణాలేమిటో తెలియదు కానీ, వెంటనే ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు.  దీంతో రానున్న ఎన్నికల్లో ఆర్కే రోజాకు అటులోక్ సభ టికెట్ కానీ ఎమ్మెల్యే సీటు కాని దక్కే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఆమె సేవలను పార్టీ విజయం కోసం వాడుకోవాలనీ, పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే  మాత్రం పడ్డ కష్టాన్ని ప్రతిఫలంగా రోజాకు ఏదో ఒక కీలక  నామినేటేడ్ పోస్ట్ జగనన్న కట్ట బెట్టే అవకాశం ఉందనే   చర్చ పార్టీలో, పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.

వల్లభనేని వంశి.. హిట్ వికెట్టా.. క్లీన్ బౌల్డా?

వల్లభనేని వంశి ఏపీ రాజకీయాలతో పరిచయం ఉన్నవారికి ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుసగా రెండు సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన వంశీ.. రెండో సారి ఎన్నికైన తరువాత విపక్షంలో ఉండలేక అధికార పార్టీ పంచన చేరిపోయారు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వంశీ ఆ తరువాత గురువుకే పంగనామాలు పెట్టిన చందంగా జగన్ పంచన చేరి తెలుగుదేశం పార్టీని విమర్శించడంలో మాస్టర్ డిగ్రీ సంపాదించినట్లుగా చెలరేగిపోయారు. అయితే పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. మరీ ముఖ్యంగా రాజకీయాలలో  అయితే  మరీను. ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి కూడా అలాగే తయారైంది.  బలమైన క్యాడర్, సమర్థ నాయకత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా రెండు సార్లు గన్నవరంఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ.. రెండో సారి ఎన్నికైన తరువాత పార్టీదేముంది? అంతా తన ప్రతిభేనని అనుకున్నారు. ఔను అచ్చం విజయవాడ ఎంపీ కేశినేని నానిలాగే.. అయితే నాని నిన్నమొన్నటి వరకూ గెలిచిన పార్టీలోనే ఉంటూ, పార్టీ విధానలను లెక్కచేయకుండా వ్యవహరించారు. చివరకు తెలుగుదేశం పార్టీయే మీ సేవలింక చాలని మర్యాదగా పక్కన పెట్టేసింది. అప్పుడు ఆయన రాజీనామా చేసి తానే బయటకు వచ్చేశానని గప్పాలు కొట్టుకుంటున్నారనుకోండి అది వేరే విషయం. వల్లభనేని వంశీ మాత్రం రెండో సారి విజయం సాధించగానే, తన ప్రయోజనాలు అధికార పార్టీతో అంటకాగితేనే  భద్రంగా ఉంటాయన్న ఉద్దేశంతో జగన్ పంచన చేరిపోయారు. రాజకీయాలలో పార్టీలు మారడం సహజం. అందుకు ఎవరి కారణాలు వారికి ఉంటాయి. అయితే అలా పార్టీ మారిన వారు చెప్పే, చెప్పిన కారణాలు సహేతుకంగా ఉన్నాయని భావిస్తే జనం పార్టీ మారినా ఆదరిస్తారు. అలా కాకుండా స్వార్థ ప్రయోజనాల పరిరక్షణకే  ప్లేటు ఫిరాయించి తాను గెలిచిన పార్టీపైనే బురద జల్లుతున్నారని జనం భావిస్తే మాత్రం ఆ పార్టీ మారిన వ్యక్తికి ఇక రాజకీయ జీవితం ముగిసినట్లేనని దేశ వ్యాప్తంగా జరిగిన పలు జంపింగు నుతలను చూస్తే ఇట్టే అవగతమౌతుంది.  మరీ ముఖ్యంగా తెలుగుదేశం వంటి కేడర్ ఆధారిత పార్టీలో అయితే పార్టీని కాదని పక్కకుపోయిన నేతల పరిస్థితి శంకర గిరి మాన్యాలే దిక్కు అన్నట్లుగా తయారౌతుంది. ఎన్టీఆర్ హయాం నుంచీ ఇది పదే పదే రుజువైంది. నెల రోజుల ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కోసం అమ్మలాంటి పార్టీని కాదని జంప్ చేసిన పలువురు ఆ తరువాత రాజకీయాలలో  అడ్రస్ లేకుండా పోయిన సందర్భాలు ఎన్నో.  ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్ఖితి కూడా అలాగే తయారయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించిన వల్లభనేని వంశీ ఎప్పుడైతే పార్టీని కాదని వైసీపీ పంచన చేరారో ఆ రోజు నుంచే ఆయన రాజకీయ పతనం ఆరంభమైందని ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు.  వంశీ విజయానికి కారణమైన తెలుగుదేశం, ఆ పార్టీ కార్యకర్తలూ ఎటూ వంశీకి దూరమయ్యారు. అలాగే.. ఆయన కోరి చేరిన వైసీపీలో కూడా ఆయన ఒంటరిగానే మిగలాల్సి వచ్చింది.  వైసీపీ గన్నవరం క్యాడర్ ఎవరూ వంశీని దగ్గరకు రానీయలేదు. యువకుడు, ఉత్సాహవంతుడు అన్న భావనతో గత ఎన్నికలలో వంశీవైపు మొగ్గు చూపిన న్యూట్రల్స్ కూడా ఇప్పుడు ఆయనను దగ్గరకే రానీయడం లేదు.  ఇక వైసీపీ అధిష్ఠానం కూడా వంశీని వదుల్చుకోవడమే బెటర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇందుకు నిదర్శనమే రెండు సార్లు సొంత ఇమేజ్ తో గన్నవరం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాను అంటూ చెప్పుకునే వంశీకి వైసీపీ ఈ సారి మొండి చేయి చూపాలన్న నిర్ణయానికి వచ్చేశింది.  దీంతో వంశీయే గత్యంతరం లేని పరిస్థితిలో పోటీ చేయను అంటూ ప్రకటించేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆయన ఆ ప్రకటన చేసినా చేయకపోయినా గన్నవరం నుంచి వంశీకి వైసీపీ టికెట్ ఇచ్చేది లేదన్నది ఖాయమైపోయింది. దీంతో గత కొంత కాలంగా వంశీ దాదాపుగా అజ్ణాతంలోకి వెళ్లిపోయిన పరిస్థితి. కనిపించడు, వినిపించడు అని వైసీపీ నేతలే ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.  అసలు విషయం ఏమిటంటే గన్నవరం నుంచి పోటీకి జగన్ అసలు వంశీ పేరును కనీసం పరిశీలనకు కూడా తీసుకోలేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. గత రెండు నెలలుగా వల్లభనేని వంశీ అసలు నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన పరిస్థితి. తెలుగుదేశం అగ్రనాయకత్వంపై వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయనకు మిత్రులుగా ఉన్న వారు కూడా దూరం అయ్యిరని అంటున్నారు. ఇప్పుడు గన్నవరంలో వంశీ ఏకాకిగా మారిపోయారని, ఆయనను కలిసే వారు కానీ, పలకరించేవారు కానీ లేరని అంటున్నారు. అన్నిటికీ మించి వంశీ తనకు ఆప్తమిత్రుడిగా చెప్పుకునే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా వంశీని పట్టించుకోవడం లేదని అంటున్నారు.  

షర్మిల భద్రత కుదింపు.. జగన్ సర్కార్ తీరుపై సర్వత్రా అనుమానాలు!

కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల ప్రాణాలకు హాని ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తన సొంత అన్న జగన్ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో  విమర్శలు గుప్పిస్తున్న షర్మిలకు ప్రాణహాని ఉందన్న అనుమానాలను ఇప్పటికే తెలుగుదేశం నాయకులు వ్యక్తం చేశారు. తనను విమర్శించే వారిపై జగన్ వ్యవహరించే తీరును ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అందుక దళిత వైద్యుడిపై పిచ్చివాడన్న ముద్ర వేసిన సంఘటన నుంచీ, జగన్ విధానాలపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలపై కేసులు, వేధింపులు, దాడుల వరకూ పలు ఉదాహరణలను చూపుతున్నారు.  అంతెందుకు గత ఎన్నికలలో తన విజయం కోసం కాళ్లరిగేలా తిరిగి, ప్రచారం చేసిన సొంత సోదరి షర్మిలను తాను అధికారంలోకి  రాగానే రాష్ట్రం నుంచి తరిమేయడమే కాకుండా, పొరుగు రాష్ట్రంలో  సొంత పార్టీ పెట్టుకున్నా, ఆమెకు ఎటువంటి సహాయ సహకారాలూ అందకుండా చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల ఏపీ పాలిటిక్స్ లో అడుగుపెట్టి, కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టి అన్నపైనే విమర్శల బాణాలు కురిపిస్తున్న తరుణంలో ఆమె ప్రాణాలకు ముప్పు ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగానే జగన్ సర్కార్ చర్యలు కనిపిస్తున్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కుదించేసింది. ఇప్పటి వరకూ ఫోర్ ప్లస్ ఫోర్ గా ఉన్న ఆమె భద్రతను వన్ ప్లస్ వన్ కు కుదించేయడం..ఆమెకు హాని తలపెట్టే ఉద్దేశంతోనే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అయితే తక్షణం ఆమెకు భద్రత పెంచాలని డిమాండ్ చేసింది.   ఆమెకు హాని తలపెట్టే ఉద్దేశంతోనే భద్రతను కుదించారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ, జగన్ సర్కార్ విధానాలను, వ్యవహార శైలిని తప్పుపడుతున్న వారిపై జరిగిన దాడులను ఉదాహరణలుగా చూపుతూ, ఇప్పుడు షర్మిల జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూ, సవాళ్లు విసురుతూ రాష్ట్రాన్ని చుట్టేస్తున్న షర్మిలపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  షర్మిల కూడా నేరుగా అన్న జగన్ అవకతవకలను, అరాచక పాలనను విమర్శిస్తూ, విపక్షాల కంటే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీ శ్రేణుల నుంచి ఆమెకు బెదరింపులు కూడా వస్తున్నాయి. అంతే కాకుండా వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం ఆమె వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెడుతోంది. అలాగే మంత్రులు, వైసీసీ నేతలూ  కూడా  షర్మిలపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.  అసలు ఆమె రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఏపీలోకి వచ్చిన రోజే పోలీసులు ఆమె కాన్వాయ్ ను అడ్డుకుని నానా హంగామా చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తూ.. జగన్ హయాంలో ఏపీలో  పోలీసు వ్యవస్థ అధికార పార్టీ జేబు సంస్థగా మారిపోయిందనీ, విపక్ష నేతలపై దాడులకు పాల్పడిన వైసీపీ వారిపై కాకుండా దాడికి గురైన బాధితులపైనే కేసులు నమోదు చేస్తు భయభ్రాంతలకు గురి చేయడమే లక్ష్యంగా పని చేస్తోందని విమర్శిస్తున్నారు.   మొత్తం మీద షర్మిల జగన్ సర్కార్ పై విమర్శల దాడి జోరు పెంచుతున్న సమయంలోనే ఆమెకు భద్రత కుదించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెకు కుదించిన భద్రతను వెంటనే పునరుద్ధరించాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ ఆందోళనలక సిద్ధమౌతోంది. 

పులివెందులలో జగన్ కు పొంచి ఉన్న ఓటమి? సొంత సోదరే ప్రత్యర్థి

రాయలసీమలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని నిర్ధారణ అయిపోయింది. స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత సోదరి వైఎస్ షర్మిల, బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత నుంచి ఆయనకు ఓటమి భయం పొంచి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ తన రాజకీయ భవిష్యత్ ను కాపాడుకోవడం కోసమే షర్మిల ఏపీ పాలిటిక్స్ లో అడుగుపెట్టిందన్న భావన రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తం అయ్యేది. ఆమె జగన్ సర్కార్ లక్ష్యంగా చేస్తున్న విమర్శలు కూడా కాంగ్రెస్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమేననీ, ఆమె లక్ష్యం రాజ్యసభకు వెళ్లడమనీ విశ్లేషణలు చేశారు. అయితే ఆమె నేరుగా అన్న జగన్ తో  తలపడి తాడో పేడో తెల్చుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని ఇప్పుడు తేటతెల్లమైపోయింది.  కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలి అన్నట్లుగా ఆమె అన్నతో ఆయన సొంత నియోజకవర్గం నుంచే ప్రత్యర్థిగా నిలబడేందుకు రెడీ అయిపోయారని ఇప్పుడు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజన్న బిడ్డగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారస్వాన్ని సొంతం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. సొంత అన్న నుంచి తనకు ఎదురైన అవమానాలకు బదులు తీర్చుకునేందుకే షర్మిల ఈ స్థాయిలో పులివెందుల బరిలో షర్మిల కన్ షర్మ్?.. కడప లోక్ సభ స్థానం నుంచి డాక్టర్ సునీత ఆయనతో తలపడేందుకు ఆమె సిద్ధమయ్యారని చెబుతున్నారు.  మరో వైపు షర్మిల బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత కూడా తన తండ్రి హంతకులకు అన్ని విధాలుగా అండదండగా నిలుస్తూ.. తన న్యాయపోరాటంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న జగన్ పై రాజకీయ పోరాటానికి రెడీ అయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన అవినాష్ రెడ్డిపై నిలబడి తలపడేందుకు రెడీ అయిపోయారు. అంటే జగన్ సొంత సోదరి పులివెందుల నుంచి అసెంబ్లీకి, బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత కడప లోక్ సభ నియోజకవర్గం నుంచీ రంగంలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చారనీ, తద్వారా సొంత జిల్లాలో జగన్ కు తేరుకోలేని, గుక్కతిప్పుకునే అవకాశం లేని దెబ్బ కొట్టాలని షర్మిల, సునీత భావిస్తున్నారని అంటున్నారు. ఈ పేపథ్యంలోనే ఇటీవల ఇరువురూ ఇడుపుల పాయలో భేటీ అయ్యారు. ఆ భేటీలోనే సునీత కడప లోక్ సభ స్థానం నుంచి అవినాష్ రెడ్డి ప్రత్యర్థిగా రంగంలోకి దిగాలనీ, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి షర్మిల సొంత అన్న జగన్ కు ప్రత్యర్థిగా రంగంలోకి దిగాలని నిర్ణయంచినట్లు వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన వారు చెబుతేన్నారు. అదే జరిగితే ఆ ప్రభావం ఆ రెండు నియోజకవర్గాలకే పరిమితం కాదనీ, జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  షర్మిల, సునీతలు జగన్ కు వ్యతిరేకంగా కడప జిల్లాలో ఎన్నికల బరిలోకి దిగితే.. గత ఎన్నికలలో వైఎస్ వివేకా హత్య అంశం వైసీపీ విజయానికి ఎంతగా దోహదపడిందో.. అంతకు రెట్టింపు రానున్న ఎన్నికలలో  ఆ పార్టీ పరాజయానికి  చేరువ చేస్తుందని చెబుతున్నారు. గత ఎన్నికలలో వైఎస్ వివేకా హత్యను అడ్డుపెట్టుకుని జనం సానుభూతిని సంపాదించుకుని విజయం సాధించిన జగన్ కు ఇప్పుడు అదే వివేకా హత్య కేసు యాంటీ సెంటిమెంట్ గా మారి పుట్టి ముంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  ఇప్పటికే  ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన అనంతరం తల్లి, చెల్లిని  దూరం పెట్టడంతో జగన్  తీరు ప్రజలలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. జిల్లా వాసులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు గత ఎన్నికలలో తన విజయం కోసం అహర్నిశలూ శ్రమించిన సొంత చెల్లి, తల్లిని జగన్ దూరం పెట్టడాన్ని ఏరు దాటి తెప్పతగలిసినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. దీంతో పులివెందులలో షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా, జగన్ ప్రత్యర్థిగా రంగంలోకి దిగితే.. ఆయన సొంత నియోజకవర్గ ప్రజలకు షర్మిలను దూరంపెట్టడానికి, పార్టీ నుంచి బయటకు పంపేయడానికి సరైన కారణాలు చెప్పి మరీ వివరణ ఇచ్చు కోవాల్సి ఉంటుంది. అదలా ఉంచితే... తన తండ్రి హంతకులకు  చట్ట ప్రకారం శిక్ష పడాలన్న లక్ష్యంతో అలుపెరుగని సునీత న్యాయపోరాటానికి ప్రజా మద్దతు గట్టిగా ఉంది. వైఎస్ వివాకా హత్య విషయంలో  గత ఎన్నికలకు ముందు ఒకలా, విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా వ్యవహరిస్తున్న జగన్ తీరుతో డాక్టర్ సునీత పట్ల ప్రజలలో సానుభూతి వ్యక్తం అవుతోంది.  అదే జగన్ పార్టీకి కడప జిల్లాలో పెద్ద ఎదురుదెబ్బ తగిలేందుకు కారణమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కేశినేని చిన్ని ఆధ్వర్యంలో హోమం, యాగం

విజయవాడ గురునానక్ కాలనీ అన్న క్యాంటీన్ ప్రాంగణంలో తెలుగుదేశం  నాయకుడు  కేశినేని చిన్ని  ఆధ్వర్యంలో శ్రీ చక్ర ఆరాధన, సుదర్శన శతక హోమం, నారసింహ హోమం, ఆయుత చండీ యాగాలు నిర్వహించగా అందులో ఆఖరి ఘట్టం ఈరోజు పూర్ణాహుతి హోమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో తెలుగుదేశంనాయకులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి  దేవినేని ఉమా, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, నందిగామ నియోజకవర్గ మాజీ  ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శావల దేవదత్, గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ (అన్న), జంపాల సీతారామయ్య, నవనీతం సాంబశివరావు, చెన్నుపాటి గాంధీ, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, అంగన్వాడి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, మైనార్టీ నాయకులు  ఎంఎస్ బేగ్, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, జాస్తి సాంబశివరావు, దేవినేని అపర్ణ, ఉమ్మడి చంటి నాయకులు బొప్పన బావ కుమార్, మహమ్మద్ ఫతావుల్లా, షేక్ ఆషా, సొంగ సంజయ్ వర్మ, రేపాకుల శ్రీనివాస్, దివి ఉమామహేశ్వరరావు, చలసాని రమణ మరియు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూదొందే.. బీజేపీ

అధికారంలో ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఎలా ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిందో.. ఆ అధికారం నుంచి వైదొలగిన తరువాత ఒక్కటొక్కటిగా వెలుగులోని వస్తున్నాయి. అధికారులను చెప్పు చేతల్లో ఉంచుకుని బీఆర్ఎస్ నేతలు అక్రమాలు, అడ్డగోలు కబ్జాలతో చెలరేగిపోతే... కేసీఆర్ సర్కార్ కు సన్నిహితంగా మెలిగిన అధికారులు కూడా అందిన కాడకి దోచుకోవడం, దాచుకోవడం అన్న రీతిలోనే వ్యవహరించారని తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వ్యవహారంలోబయటపడుతున్న భూ కొనుగోలు దందా తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ పై బీజేపీ చర్యలు తీసుకోవడానికి ముందు వెనుకలాడుతోందంటూ విరుచుకుపడుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ లు రెండూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శిస్తుంటే.. బీజేపీ కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో ఒకే తాను ముక్కలుగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబడుతోంది. ఈ నేపథ్యంలోనే   గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ భార్య పేరుమీద పాతిక  ఎకరాలు రిజిస్ట్రేషన్  ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కేసు నమోదు చేసే విషయంలో మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారో చెప్పాలని బీజేపీ నాయకుడు రఘునందనరావు రేవంత్ సర్కార్ ను నిలదీస్తున్నారు.  అలాగే ఎన్నికల ముదు అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తామంటూ పదేపదే చెప్పిన రేవంత్ అధికారం చేపట్టి రెండు నెలలు అయినా ధరణిలో సవరణలు అంటూ ఎందుకు మాటమారుస్తున్నారని విమర్శిస్తున్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేక సలహాదారుగా పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి.. సర్వీస్ లో ఉండగా  ధరణిని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై చర్యలకు ఎందుకు ఉపక్రమించడం లేదని నిలదీస్తున్నారు.  పేరుతో అక్రమాస్తులు సంపాదించుకున్నట్లు ఆరోపణలు వస్తుంటే విచారణ ఎందుకు చేపట్టడం లేదని రఘునందనరావు ప్రశ్నించారు. మొత్తంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తరువాత కూడా బీజేపీతో అంటకాగుతున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పర ఆరోపణలు విమర్శలూ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రివర్స్ లో బీజేపీ తాను రెండు పార్టీలకూ వ్యతిరేకమనీ, ఆ రెండు పార్టీలే కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయనీ ఎదురు విమర్శలకు దిగుతోంది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలకు ముందు  బీజేపీ బలపడేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని ప్రచారం చేసి లబ్ధిం పొదాలని చూస్తోంది.  అధికారంలో ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఎలా ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిందో.. ఆ అధికారం నుంచి వైదొలగిన తరువాత ఒక్కటొక్కటిగా వెలుగులోని వస్తున్నాయి. అధికారులను చెప్పు చేతల్లో ఉంచుకుని బీఆర్ఎస్ నేతలు అక్రమాలు, అడ్డగోలు కబ్జాలతో చెలరేగిపోతే... కేసీఆర్ సర్కార్ కు సన్నిహితంగా మెలిగిన అధికారులు కూడా అందిన కాడకి దోచుకోవడం, దాచుకోవడం అన్న రీతిలోనే వ్యవహరించారని తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వ్యవహారంలోబయటపడుతున్న భూ కొనుగోలు దందా తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ పై బీజేపీ చర్యలు తీసుకోవడానికి ముందు వెనుకలాడుతోందంటూ విరుచుకుపడుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ లు రెండూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శిస్తుంటే.. బీజేపీ కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో ఒకే తాను ముక్కలుగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబడుతోంది. ఈ నేపథ్యంలోనే   గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ భార్య పేరుమీద పాతిక  ఎకరాలు రిజిస్ట్రేషన్  ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కేసు నమోదు చేసే విషయంలో మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారో చెప్పాలని బీజేపీ నాయకుడు రఘునందనరావు రేవంత్ సర్కార్ ను నిలదీస్తున్నారు.  అలాగే ఎన్నికల ముదు అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తామంటూ పదేపదే చెప్పిన రేవంత్ అధికారం చేపట్టి రెండు నెలలు అయినా ధరణిలో సవరణలు అంటూ ఎందుకు మాటమారుస్తున్నారని విమర్శిస్తున్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేక సలహాదారుగా పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి.. సర్వీస్ లో ఉండగా  ధరణిని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై చర్యలకు ఎందుకు ఉపక్రమించడం లేదని నిలదీస్తున్నారు.  పేరుతో అక్రమాస్తులు సంపాదించుకున్నట్లు ఆరోపణలు వస్తుంటే విచారణ ఎందుకు చేపట్టడం లేదని రఘునందనరావు ప్రశ్నించారు. మొత్తంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తరువాత కూడా బీజేపీతో అంటకాగుతున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పర ఆరోపణలు విమర్శలూ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రివర్స్ లో బీజేపీ తాను రెండు పార్టీలకూ వ్యతిరేకమనీ, ఆ రెండు పార్టీలే కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయనీ ఎదురు విమర్శలకు దిగుతోంది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలకు ముందు  బీజేపీ బలపడేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని ప్రచారం చేసి లబ్ధిం పొదాలని చూస్తోంది.