రెండు కోట్ల మంది యువ ఓటర్లకు ఓటు హక్కు: కేంద్ర ఎన్నికల సంఘం

లోక్‌సభ ఎన్నికలు-2024 సమీపిస్తున్న వేళ భారత ఎన్నికల సంఘం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడానికి దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది అర్హత పొందనున్నారని వెల్లడించింది. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న 2 కోట్ల మంది యువ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారని తెలిపింది. ఈ మేరకు ఓటు కోసం నమోదు చేసుకున్నారని తెలిపింది. కాగా గత లోక్‌సభ ఎన్నికలు-2019తో పోల్చితే నమోదైన ఓటర్ల సంఖ్య 6 శాతం మేర పెరిగిందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ‘ఎక్స్’ వేదికగా ప్రకటన విడుదల చేసింది.  ప్రపంచంలో అత్యధికంగా 96.88 కోట్ల మంది భారత ఓటర్లు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారని ఈసీ పేర్కొంది. కాగా లింగ నిష్పత్తి విషయంలో పెరుగుదల నమోదయిందని, 2023లో 940గా ఉన్న లింగ నిష్పత్తి 2024లో 948కి చేరిందని వెల్లడించింది. ఓటర్ల జాబితాపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు పారదర్శకతతో జాబితాను రూపొందించామని పేర్కొంది..  ప్రస్తుత 17వ లోక్‌సభ పదవీకాలం 16 జూన్ 2024తో యుగియనుంది. జూన్ 16లోపు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. 2019లో 17వ లోక్‌సభకు ఏప్రిల్, మే నెలల్లో ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2019 ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు ఏడు విడతల్లో ఓటింగ్ నిర్వహించి.. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టారు. దాదాపు 91.2 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 67 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాటి ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. బీజేపీకి 37.36 శాతం, కాంగ్రెస్‌కు 19.49 శాతం ఓట్లు దక్కాయి. దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా, మెజారిటీకి 272 సీట్లు అవసరం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 ప్రకారం, ప్రతి ఐదేళ్లకు ఒకసారి లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం  త్వరలోనే ప్రకటించనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ 30కి పైగా పార్టీలతో పొత్తు పెట్టుకోగా, కాంగ్రెస్ తదితర విపక్షాలు ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు. ఈ సారి కూడా ఏప్రిల్, మే నెలల్లో ఆరు నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా యూపీలో 80 లోక్‌సభ స్థానాలు, మహారాష్ట్రలో 48, పశ్చిమ బెంగాల్‌లో 42, బీహార్ 42, తమిళనాడు 39 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపొంది వరుసగా మూడోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.  

జగన్ కు రేవంత్ రిటర్న్ గిఫ్ట్!?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం  జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. గత ఎన్నికలలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ జగన్ విజయం కోసం ఏం చేశారో.. దాదాపుగా అదే ఇప్పుడు రివర్స్ లో చేయడానికి రేవంత్  రెడీ అయిపోయారు.  ఏపీలో కాంగ్రెస్‌కు ఊపిరి పోసేందుకు, వైఎస్ బిడ్డ షర్మిలకు పగ్గాలు అప్పగించిన కాంగ్రె స్ నాయకత్వం.. జగన్ ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా  వైసీపీ నేతల ఆస్తుల మూలాలు ఉన్న తెలంగాణపై దృష్టి సారించింది. గత ఎన్నికల్లో నాటి సీఎం చంద్రబాబునాయుడును ఓడించి, తన మిత్రుడైన జగన్‌ను గద్దెనెక్కించేందుకు కేసీఆర్ సహకరించారు.   చంద్రబాబుకు రిటన్‌ గిఫ్ట్ ఇస్తానని మీడియా సమక్షంలోనే కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు కూడా. ఆ తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల భూములున్న తెలుగుదేశం నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే నేతలు, వివాదాస్పద భూములు కొన్న తెలుగుదేశం  ప్రముఖులను.. నాటి కేసీఆర్ సర్కారు భయపెట్టింది.  ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అయితే అప్పట్లో  తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి మారుతూ ఇక్కడ ఆస్తులు ఉన్నాయి అందుకే పార్టీ మారక తప్పడం లేదు అని బాహాటంగానే చెప్పేశారు. దీంతో కేసీఆర్ అప్పట్లో తెలుగుదేశం వారిని ఎంతగా భయపెట్టారో అందరికీ అవగతమైంది. అంటే వారిని లొంగదీసుకోవడానికి  వారి భూములకు రెవిన్యూ శాఖ నోటీసులు, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న బెదరింపులు, కోర్టులో కేసులు.. ఇలాంటి చర్యలతో భయపడిన చాలామంది నేతలు, టీడీపీ నుంచి పోటీ చేసేందుకు కూడా వెనక్కు తగ్గిన పరిస్థితి నాడు నెలకొంది.   జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు,  వైసీపీలోకి దూకేయడానికి కూడా  కేసీఆర్ అనుసరించిన ఇలాంటి వ్యూహమే కారణమన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఎన్నికల ముందు తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు.. ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన మహబూబ్‌నగర్- నల్లగొండలో తిష్టవేసి, వైసీపీ అభ్యర్ధులకు నిధులు పంపిణీ చేశారన్న ప్రచారం అప్పట్లో చాలా పెద్ద ఎత్తున జరిగింది. అందులో వాస్తవం లేకపోలేదని పరిశీలకులు కూడా విశ్లేషించారు. ఇక తెలుగుదేశం కు హైదరాబాద్ నుంచి నయాపైసా నిధులు అందకుండా కేసీఆర్ సర్కారు  చాలా  కట్టుదిట్టం చేసింది. ఫలితంగా తెలుగుదేశం ఆ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది.   ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్‌ను బతికించేందుకు తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా  సరిగ్గా అదే వ్యూహం అమలు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు వైసీపీకి నిధులు అందే మార్గాలను  మూసివేసే ప్రణాళిక ఇప్పటికే ఆరంభమైందని అంటున్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల్లో వైసీపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు కాంట్రాక్టులు దక్కాయి.  కాళేశ్వరం సహా తెలంగాణలోని భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టులు సైతం జగన్ సిఫారసు మేరకు కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.    ఏపీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీకి వెళ్లి మరీ ఈ కాంట్రాక్టుల వ్యవహారంపై అప్పట్లో కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి   కాంట్రాక్టర్లకు  బిల్లుల చెల్లింపు నిలిపివేయాలని రేవంత్ సర్కారు ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. వీటిలో ఏపీకి చెంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల కంపెనీల బిల్లులు కూడా ఉన్నాయంటున్నారు. కాగా ఏపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మరీ ముఖ్యంగా   రాయలసీమకు   పలువురు ఎమ్మెల్యేలు  తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. అవి కాకుండా సీమకు చెందిన వైసీపీ నేతలకు హైదరాబాద్‌లో పబ్, బార్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ ఏపీలో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నాయన్న విషయం తెలిసిందే. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న ఏపీకి చెందిన వైసీపీ వారిపై    కేసులు,  ఫిర్యాదులు? అలాగే  గ్రేటర్ పరిధిలోని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిథిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి అన్న ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి-మెదక్ జిల్లాల రిజిస్ట్రార్ల నుంచి, భూములు, భవనాలు, ఆస్తుల కొనుగోలుపై పూర్తి సమాచారాన్ని రేవంత్ సర్కార్ సేకరిస్తున్నట్లు సమాచారం.    సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిథిలోనే వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై ఎక్కువ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని.. వైసీపీ ఎంపి,   విజయసాయిరెడ్డి జోస్యంపై, రేవంత్ సర్కారు అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయనపై కాంగ్రెస్ నేతలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. కనీసం మర్యాదపూర్వకంగా కూడా ఏపీ సీఎం జగన్  ఆయనను కలవకపోవడం, కనీసం అభినందనలు తెలియజేయకపోవడం ఇప్పటికే చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.  ఇప్పుడు  ఈ అన్నిటికీ సరైన రిటార్డ్ ఇవ్వడానికి రేవంత్ రెడీ అయిపోయారనీ, జన్మలో మరచిపోలేని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నారనీ అంటున్నారు. మొత్తం మీద జగన్ కు తాను నాడు చేసినదే ఇప్పుడు రివర్స్ లో లభిస్తోందన్న ప్రచారం సామాజిక మాధ్యమంలో జోరుగా సాగుతోంది.

టీమిండియాకు మరో స్టార్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ దూరం

టీం ఇండియాకు మరో స్టార్ బ్యాట్స్ మెన్ దూరమయ్యారు. ప్రస్తుతం టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతోంది. మాజీ సారథి విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో సిరీస్ లో మరో రెండు టెస్టులకు దూరమయ్యారు. గాయాలతో బాధపడుతున్న కేఎల్ రాహుల్ తొలి రెండు టెస్టులకు, జడేజా రెండో టెస్టుకు దూరమయ్యారు. ఇప్పుడు మరో స్టార్ బ్యాట్స్ మన్ జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.  టాపార్డర్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వీపు నొప్పి, గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఈ నెల 15 నుంచి రాజ్ కోట్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లోనే కాదు, మిగతా రెండు టెస్టుల్లోనూ శ్రేయాస్ అయ్యర్ ఆడేది అనుమానంగా మారింది.  రెండో టెస్టు ముగిశాక అందరి క్రికెట్ సామగ్రి విశాఖ నుంచి రాజ్ కోట్ కు తరలించగా, శ్రేయాస్ అయ్యర్ కిట్ ను మాత్రం అతడి స్వస్థలం ముంబయికి తరలించారు. గాయం తీవ్రత దృష్ట్యా శ్రేయాస్ అయ్యర్ మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండబోవడంలేదని ఈ పరిణామం ద్వారా అర్థమవుతోంది.  ఐదు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టును ఇంగ్లండ్ గెలవగా, రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను 1-1తో సమం చేసింది. మిగతా మూడు టెస్టుల్లో ఆడే టీమిండియాను సెలెక్టర్లు నేడు ఎంపిక చేయనున్నారు.టీమిండియాకు బిగ్ షాక్. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమవుతున్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా అతడు సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండడని సమాచారం. వైజాగ్ టెస్టు అనంతరం టీమిండియా ఆటగాళ్ల లగేజ్‌ను మూడో టెస్టు జరిగే రాజ్‌కోట్‌కు తరలించారు. కానీ శ్రేయస్ అయ్యర్ లగేజ్‌ను మాత్రం తన ఇంటికి పంపించారని సమాచారం. '30 బంతులు కంటే ఎక్కువగా ఆడిన సందర్భాల్లో వెన్నునొప్పి వస్తుందని, ఫార్వార్డ్ ఢిఫెన్స్ ఆడుతున్నప్పుడు తన గజ్జల్లో నొప్పి కలుగుతుందని శ్రేయస్ అయ్యర్.. టీమిండియా, మేనేజ్మెంట్‌, వైద్య సిబ్బందికి తెలిపారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న శ్రేయస్ మొదటిసారిగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో అతడికి కొన్ని వారాలు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. త్వరలో అతడు ఎన్సీఏకి వెళ్తాడు'' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ప్రధానితో భేటీ అయిన  ముఖ్యమంత్రి జగన్ 

ఢిల్లీ  పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్  ఈ మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. ప్రధానితో సీఎం జగన్ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్లమెంటులోని ప్రధాని కార్యాలయం వేదికగా నిలిచింది.  రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా రాజకీయ అంశాలు ప్రధానితో జగన్ చర్చించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, పోలవరం నిధులు విడుదల, పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయంకు ఆమోదం, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్, కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని ప్రధానిని కోరారు. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంటులోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి చర్చించారు.

పీవీకి దేశ అత్యున్నత పురస్కారం

తెలుగుజాతి ఆణిముత్యం, బహుబాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ , హరితవిప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ లకు కూడా భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇప్పటికే ఎల్ కే అద్వానీ, కర్పూరీ ఠాకూర్ లకు భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది మొత్తం ఐదుగురికి భారతరత్న ప్రకటించినట్టయింది. పీవీకి భారతరత్న రావడంపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. భారత రత్న సాధించిన తొలి తెలుగు బిడ్డగా పీ.వీ.నరసింహారావు నిలిచారు. ఇప్పటికే కర్పూరి ఠాకూర్, ఎల్.కె.అద్వానీలకు భారత రత్న ప్రకటించిన కేంద్రం తాజాగా మాజీ ప్రధానులు పీ.వీ.నరసింహారావు, చరణ్ సింగ్‌లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు కూడా భారతరత్న ప్రకటించింది. ఈ దఫా మొత్తం ఐదుగురికి భారత రత్న అత్యున్నత పురస్కారం ప్రకటించడం విశేషం.  

ఏదీ గెలుపు బాట.. మిత్రుల కోసం వేట.. కమలనాథుల్లో తగ్గిన ధీమా!

సార్వత్రిక ఎన్నికల ముంగిట బీజేపీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సర్వేలన్నీ మోడీ సర్కార్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఘోషిస్తున్నా.. బీజేపీ హై కమాండ్ లో మాత్రం ఆ విశ్వాసం మచ్చుకైనా కనిపించడం లేదు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చే ఎన్నికలలో 400 సీట్లలో గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నా.. మరో సారి అధికారంలోకి రావాలంటే సొంత బలం సరిపోదన్న అంచనాలలో ఆ పార్టీ ఉంది. అందుకే చేతులారా దూరం చేసుకున్న మిత్ర పక్షాల కోసం తలుపులు బార్లా తెరవడమే కాదు.. మెట్లు దిగి మరీ వాటిని ఆహ్వానిస్తోంది. బుజ్జగిస్తోంది. అయ్యిందేదో అయిపోయింది.. ఇక నుంచి మనం మిత్రపక్షాలం. పెద్దన్న పాత్ర పోషించకుండా మిత్రధర్మాన్ని పాటిస్తాం నమ్మండి ప్లీజ్ అని బతిమలాడుకుంటోంది.  నిజానికి ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్ పేయి సారధ్యంలో 24 పార్టీల కూటమిగా  కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఎ ఇప్పుడు చిక్కి శల్యమైపోయింది. బీజేపీ వినా ఆ కూటమిలో చెప్పుకోదగ్గ పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. ఇందుకు కారణం మోడీ, అమిత్ షాల పోకడలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    నిజానికి, 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఏకపార్టీ  ఆధిక్యత సాధించిన రోజునే, ఎన్డీఎ కథ ముగింపు దశకు చేరింది.  ఇంచు మించుగా మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా 2014 ఎన్నికలలో లోక్ సభలో బీజేపీ సొంతగా సాధారణ మెజారిటీ (272)కు 10 సీట్లు అదనంగా (282) గెలిచి  చరిత్రను తిరగ రాసింది. అలాగే  2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలం మరింత పెరిగి  303 కు చేరింది. మరో వంక ప్రతిపక్ష కూటమి, యూపీఎకు సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్థమానంగా దిగజారి ప్రాంతీయ పార్టీల పంచన చేరింది. అయినా 2014లో, 2019లో బీజీపీ  ప్రధాని మోడీ సారధ్యంలో ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగు దేశం, శివసేన, అకాలీదళ్, సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే  ఆ తర్వాత ఏమి జరిగిందన్నది అందరికీ తెలిసిందే. ఎవరి కారణాలు వారికీ ఉన్నా, ఒక్కొక్క పార్టీ ఎన్డీఎకి దూరమవుతూ వచ్చాయి.  2019 ఎన్నికల్లోనూ అకాలీ దళ్, శివసేన, పాశ్వాన్ పార్టీ ఎల్ జేపీ, ఎఐఎడిఎంకే, జేడీ(యు)సహా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా బీజేపీతో కలిసి పోటీచేశాయి. కానీ, ఇప్పుడు ఆ చిన్నా  చితక పార్టీలలో కొన్ని మాత్రమే కూటమిలో మిగిలాయి. బీజేపీ సహజ మిత్ర పక్షాలు శివసేన, అకాలీ దళ్ సహా ప్రధాన ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్డీఎ గూడు వదిలి పోయాయి.  ఇక  ఇప్పుడు ఎన్డీఎలో ఉన్న పార్టీలు ఏవీ రాజకీయంగా అంతగా ప్రభావం చూపగలిగే పార్టీలు కాదు. ఏ పార్టీకీ  కూడా లోక్ సభలో  ఒకటి రెండు స్థానాలకు మించి లేవు.  అయితే, మిత్ర పక్షాలు బీజేపీకి ఎందుకు దూరం అవుతున్నాయి? బీజేపీతో చెలిమిని మిత్ర పక్షాల ఎందుకు దృతరాష్ట్ర కౌగిలిగా భావిస్తున్నాయి? బీజేపీకి మిత్ర పక్షాలు దురమవుతున్నాయా? లేక బీజేపీనే ఉద్దేశపూర్వకంగా మిత్ర పక్షాలను పోమ్మనకుండా పొగబెట్టి, సాగనంపుతోందా? మిత్ర పక్షాలు మోడీ, షా జోడీ రాజాకీయ వ్యూహ చతురతను తట్టుకోలేక చక్రబంధాలను ఛేదించుకుని బయట పడుతున్నాయా? అంటే  ఇదీ కారణం అని చెప్పడానికి పరిశీలకులు కొంచం తటపటాయిస్తున్నా.. వాస్తవం మాత్రం బీజేపీ ఒంటెత్తు పోకడలే.. చిన్నా చితకాపార్టీలను నిర్వీర్యం చేయడానికీ, వాటి ఉనికిని ప్రశ్నార్ధకం చేయడానికీ కమలం పార్టీ చేస్తున్న సర్పయాగం లాంటి క్రతువేకారణమనడంలో సందేహం లేదు.  ఎన్డీయేకు దూరమైన ఒక్కొక్క పార్టీదీ  ఒక్కొక్క కథ. తెలుగు దేశం పార్టీ అప్పట్లో బయటకు వచ్చిన కారణాలకు, అలాగే  నితీష్ కుమార్  బయటకు వెళ్ళిన కారణాలకు పొంతన లేదు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం  ధర్మ పోరాటం ప్రకటించి బయటకు వచ్చారు. చంద్రాబాబు రాజకీయ ప్రయోజనాలు చూసుకోలేదు.కానీ, నితీష్ కుమార్ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుందని, కమల దళానికి కటీఫ్ చెప్పలేదు. బీజేపీ చెలిమి భస్మాసుర హస్తంగా మారుతోందన్న భయంతో, తన అధికారానికి ముప్పు ఏర్పడిందన్న కారణంతో  తెగతెంపులు చేసుకున్నారు. అలాగే, అకాలీ దళ్, శివసేన ఇలా  ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క కథ.. ఒక్కొక్క వ్యథ.    అయితే  ఒకటి మాత్రం నిజం, మోడీ, షా జోడీ నాయకత్వంలో బీజేపీ శతృమిత్ర బంధాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలను సమ దృష్టితో చూసింది. అన్ని పార్టీలను రాజకీయ ప్రత్యర్ధులుగానే చూసింది. అందుకే మోడీ, షా జోడీ అడుగులు  ఏక పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం వైపుకు సాగుతున్నాయా? అనే అనుమానాలను పరిశీలకులు బలంగా వ్యక్తం చేశారు. చేస్తున్నారు.  నిజానికి  ఒక విధంగా మోడీ,షా జోడీ రాజకీయ అశ్వమేధ యాగం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా మొదలు పెట్టిన ఈ యాగం కాంగ్రెస్ కథ ముగింపుతో కానీ ముగిసేలా లేదని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. చేస్తున్నారు.  అయితే 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట మోడీ, షా ద్వయం ఏకఛత్రధిపత్య ధోరణికి చెక్ పడిందనే చెప్పాలి. ఎన్డీయే కూటమికి దాదాపు శుభం కార్డు పడిపోయిన దశ కనిపించడం, అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకోవడం, బీజేపీయేతర పార్టీల మధ్య విభేదాలున్నా.. ఐక్యతా ప్రయత్నాలు జరుగుతుండటం కమలనాథులలో ఆందోళనకు కారణమైంది. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదానికి కాలం చెల్లిపోయిందనీ, అయోధ్య రామమందిరం, మతం ప్రాతిపదికన పోలరైజేషన్ కలలు సాకారమయ్యే పరిస్థితి లేదని అర్ధం అవ్వడంతో ఇప్పుడు బీజేపీ భాగస్వామ్య పక్షాలను వెతుక్కునే పనిలో పడింది. అందుకే ముందుగా జేడీయూను ఆ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసమే ముందుకు వచ్చినా ఎలాంటి అరమరికలూ లేకుండా అక్కున చేర్చుకుంది. ఆ తరువాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీనీ ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించింది. ఇప్పుడు కూడా నితీష్ ఎన్డీయే కూటమిలోకి రావడానికి, చంద్రబాబు ఎన్డీయే కూటమిలో చేరేందుకు ఓకే చెప్పడానికీ వేర్వేరు కారణాలున్నాయి. అది వేరే సంగతి. కానీ బీజేపీ మాత్రం మరో సారి అంటే ముచ్చటగా మూడో సారి కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ఒంటరి పోరుతో కుదిరే పని కాదని తేలిపోయింది. అందుకే తన ఆటిట్యూడ్ తో దూరం చేసుకున్న పార్టీలను ఇప్పుడు రెండు మెట్లు దిగి మరీ ఆహ్వానిస్తోంది. అధికారాన్ని కాపాడుకోవడం కోసం నితీష్ కుమార్ ఎన్డీయే పంచన చేరితే.. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం చంద్రబాబు ఎన్డీయే ఆహ్వానాన్ని మన్నిస్తున్నారు. మొత్తం మీద ఎన్డీయేను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే మూడో సారి అధికారం అని మోఢీ భావిస్తున్నారు. అందుకోసమే దూరమైన భాగస్వామ్య పక్షాలను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఆటో డ్రైవర్లకు ఉపాధి కోరుతూ రోడ్డెక్కిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు 

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మహలక్ష్మి ఒకటి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్స్ ఉపాధి కోల్పోయారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ ఎంఎల్ ఏ  లు రోడ్డెక్కారు. కర్ణాటక రాష్ట్రంలో మాదిరి తెలంగాణ రాష్ట్రంలో  మహిళలకు ఉచిత బస్సు  ప్రయాణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.  ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని అన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కారణంగా... 6.5 లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పారు. మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం అందించాలని కోరారు. ఆటో కార్మికులను ఆదుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి ఆటోల్లో బయల్దేరారు.  ప్లకార్డులను పట్టుకుని అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నల్ల కండువాలు వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది సభలోకి అనుమతించలేదు. అయితే, కాసేపు వాగ్వాదం తర్వాత వారిని అనుమతించారు.

నిజమైన ప్రజా నేత చంద్రబాబు.. మరి కేసీఆర్?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు నాలుగు దశాబ్దాలకు పైగా రాజ‌కీయ అనుభ‌వం ఉంది. త‌న రాజ‌కీయ జీవితంలో ఎన్నో ఓట‌ములు మ‌రెన్నో విజ‌యాలు.. ప్ర‌త్య‌ర్థుల నుంచి ఎన్నో సవాళ్లు, విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు.. కానీ విజయాలతో పొంగిపోలేదు.. ఓట‌ముల‌కు కుంగిపోలేదు.. ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌కు వెన‌క‌డుగు వేయ‌లేదు. ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌న్న ఒకే ఒక్క ల‌క్ష్యం, సంకల్పం చంద్రబాబును  నాలుగు దశాబ్దాలుగా రాజ‌కీయాల్లో ప్ర‌జానేత‌గా నిలిపింది. చంద్ర‌బాబు తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టిన నాటినుంచి ప్ర‌జా సంక్షేమం కోసం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వ‌చ్చారు. అధికారంలో ఉన్న‌ప్పుడు ఎలాంటి నేత‌కైనా అన్నీ న‌మ‌స్కారాలే ఎదుర‌వుతాయి.. కానీ,  ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే ఒక రాజ‌కీయ నేత‌లో అస‌లైన సామ‌ర్థ్యం బ‌య‌ట‌ప‌డుతుంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అధికార ప‌క్షం నుంచి ఎదుర‌య్యే రాజ‌కీయ వ్యూహాల‌ను ఎదుర్కోవ‌టం మామూలు నేత‌ల‌కు సాధ్యం కాదు.. ప్రజ‌ల ప‌క్షాన పోరాటాలు చేసే నేత‌ల‌కు మాత్ర‌మే అది సాధ్యం అవుతుంది. అలాంటివారిలో చంద్ర‌బాబు  ముందు వ‌రుస‌లో ఉంటారు. ఉన్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు లాంటి నేత‌ను చూసి బీఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు నేర్చుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్లు క‌నిపిస్తోంది.  కేసీఆర్ అంటే.. ఉద్య‌మ నేత‌గా ఎవరికైనా గుర్తుకొస్తారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంకోసం సుదీర్ఘ‌కాలం ఉద్య‌మం చేసిన‌వారిలో కేసీఆర్ ఒక‌రు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు త‌రువాత కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చారు. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టి ప‌లు ప్ర‌జాసంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేశారు. వ‌రుస‌గా రెండోసారికూడా అధికారంలోకి వ‌చ్చి 10ఏళ్ల‌పాటు తెలంగాణ రాష్ట్ర   ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఈ ప‌దేళ్ల కాలంలో తెలంగాణ‌లో కేసీఆర్ చెప్పిందే వేదంగా  సాగింది. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. కేసీఆర్ సీఎం ప‌ద‌వి కోల్పోయిన త‌రువాత డీలా పడిపోయారు. ప‌దేళ్లు అధికారంలో ఉండి ఒక్క‌సారిగా ప్ర‌తిప‌క్షంలోకి వెళ్ల‌డాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోయారు. ఆయన ఓటమిని తట్టుకోలేకపోతున్నారని విస్పష్టంగా తెలిసిపోతోంది. పరాజయం తరువాత హుందాగా ఓటమిని అంగీకరించి, గెలిచిన పార్టీకి, నూతన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపి, రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించడం కనీస మర్యాద. కానీ కేసీఆర్ ఆ కనీస మర్యాదను కూడా పాటించలేదు. రహస్యంగా ప్రగతి భవన్ ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. గెలిచిన కాంగ్రెస్ పార్టీనీ, నూతన సీఎం రేవంత్ ను అభినందించలేదు. గవర్నర్ ను కలిసి రాజీనామా కూడా సమర్పించలేదు. తన ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖ పంపించేసి అందరికీ ముఖం చాటేశారు. ఇక ఇప్పుడు  క‌నీసం అసెంబ్లీ స‌మావేశాల‌కు సైతం కేసీఆర్ హాజ‌రు కాక‌పోవ‌టం ఆయన ఒక్క ఓటమితో ఎలా డీలాపడిపోయారో అవగతమౌతోందని అంటున్నారు.  టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి ముఖ్య‌మంత్రిగా తొమ్మిదేళ్లు కొన‌సాగారు.  ఆ త‌రువాత 2004లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది.  వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2009లో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ విజ‌యం సాధించ‌డంతో మ‌రోసారి సీఎంగా వైఎస్ఆర్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ రెండు ద‌ఫాలుగా ప్ర‌తిప‌క్షంలో చంద్ర‌బాబు ఉన్న‌ప్ప‌టికీ ఎక్క‌డా కుంగిపోలేదు. పార్టీ బ‌లోపేతం కోసం, త‌న‌ను న‌మ్ముకున్న వారికి అండ‌గా నిలుస్తూ ప్రజ‌ల ప‌క్షాన అసెంబ్లీలో గ‌ళ‌మెత్తారు. రాష్ట్రం విడిపోయిన త‌రువాత 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపీలో మ‌ళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఏపీలో అమ‌రావ‌తి రాజ‌ధానికోసం విశేష కృషి చేశారు. ఏపీకి ప‌లు కంపెనీల‌ను తీసుకొచ్చారు. వేలాది మందికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించారు.  2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో   టీడీపీ అధికారం కోల్పోయింది. వైసీపీ అధికారంలోకి రావ‌డంతో సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొన్నిరోజుల‌కే అమ‌రావ‌తి ఏపీ రాజ‌ధాని కాదంటూ బాంబు పేల్చాడు. దీనికితోడు, చంద్ర‌బాబు కంటే జ‌గ‌న్ చాలా చిన్న‌వాడు.. చంద్ర‌బాబుకు ఉన్న రాజ‌కీయ అనుభ‌వంలో పావువంతుకూడా జ‌గ‌న్ కు లేదు. అలా అని.. జ‌గ‌న్ నాకంటే చిన్న‌వాడు.. నేను అసెంబ్లీకి వెళ్లి ప్ర‌తిప‌క్షంలో జ‌గ‌న్ ముందు కూర్చోను అని అన‌లేదు. చంద్ర‌బాబు ల‌క్ష్యం ప్ర‌జా స‌ంక్షేమం, త‌న‌ను న‌మ్ముకున్న క్యాడ‌ర్ ను కాపాడుకోవ‌టం. ఇదే అస‌లైన ప్ర‌జానేత‌కు ఉండే ల‌క్ష‌ణం. ప్ర‌స్తుతం కేసీఆర్ ఈ విష‌యంలో చంద్ర‌బాబును చూసి నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని వాళ్లూ వీళ్లూ కాదు స్వయంగా బీఆర్ఎస్ క్యాడరే అంటున్నది. అధికారంలో ఉన్న స‌మ‌యంలో సంతోషంగా ఎలా అయితే అసెంబ్లీకి వెళ్తామో.. అధికారం కోల్పోయిన‌ సంద‌ర్భంలోనూ అదే ఉత్సాహంతో అసెంబ్లీకి వెళ్లి అధికార ప‌క్షాన్ని ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నిల‌దీయ‌డ‌మే నికార్స‌యిన రాజ‌కీయ నేత ల‌క్ష‌ణం. ఆ ల‌క్ష‌ణాలు కేసీఆర్ లో ఇసుమంతైనా కనిపించడం లేదని బీఆర్ఎస్ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో కేసీఆర్ చంద్రబాబును చూసి నేర్చుకోవాలని అంటున్నాయి. 

గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ డుమ్మా.. ముఖం చాటేశారా?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ సమావేశాలకు తెలంగాణ మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఈ సమావేశాలకు ఆయన హాజరవుతారంటూ కారు పార్టీలో ఓ ప్రచారం అయితే గట్టిగానే షికారు చేసింది. అయితే కేసీఆర్ మాత్రం అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత ఎలా ముఖం చాటేశారో.. సరిగ్గా అలాగే అసెంబ్లీ సమావేశాల ప్రాంరభం రోజున గవర్నర్ ప్రసంగానికి ఆయన గైర్హాజరయ్యారు. కేసీఆర్ సమావేశాలకు రాకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    తెలంగాణ గవర్నర్ తమిళసై ను ఫేస్ చేయడం ఇష్టం లేకే ఆయన   హాజరుకాలేదనే ఓ చర్చ సైతం సాగుతోంది. అదీ కాక తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో.. ఆయనకు గవర్నర్ తమిళి సై మధ్య సత్సంబంధాలు లేవనీ, వ్యవహారం ఉప్పూ నిప్పూలా ఉండేదనీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ  ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్... తన రాజీనామా లేఖను  స్వయంగా రాజ్‌భవన్‌కు వెళ్లి  గవర్నర్‌కు అందజేయకుండా.. తన ఓఎస్డీ ద్వారా పంపారని,  దీంతో కేసీఆర్ వ్యవహార శైలిపై నాడే పలువురు ప్రజాస్వామిక వాదులు  మండిపడ్డారని పార్టీ  శ్రేణులు ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటున్నాయి.   అదీకాక ఇవి బడ్జెట్ సమావేశాలు.. ఈ నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అలాంటి వేళ సభకు గవర్నర్ వస్తే.. సభా మర్యాదలు పాటించాల్సి ఉందని.. దీంతో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఈ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు.. డుమ్మా కొట్టారనే ఓ చర్చ  పార్టీ శ్రేణుల్లో కొనసాగుతోంది.  మరోవైపు కేసీఆర్‌కి సెంటిమెంటే ఆయుధమని.. దీనిని ఆయన బాగా నమ్ముతారని, అందుకే    అమావాస్య కనుక ఆయన అసెంబ్లీ సమావేశాల తొలి రోజు బయటకు రాలేదని అంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కేసీఆర్ ఇదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారని,  ప్రస్తుతం అదే సెంటిమెంట్‌ను ఆయన కొనసాగిస్తున్నారనే మరో చర్చ సైతం నడుస్తోంది.  అదీ కాక ఇటీవలే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారని.. దీంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని అంతా భావించారని... మరి ఆయన ఈ సమావేశాలకు హాజరై.. అధికార పక్షంలోని లోపాలను ఎత్తి చూపుతారా? లేకుంటే.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే.. .అదే సెక్రటేరియట్ అన్నట్లుగా ప్రతిపక్ష నేత ఎక్కడుంటే అదేనంటూ.. మరో కొత్త భాష్యంకి తెర తీస్తారా? అని గులాబీ పార్టీ శ్రేణుల్లో ఓ చర్చ అయితే వాడి వేడిగా హల్ చల్ చేస్తోంది.

లోకేశ్ ఎన్నికల ప్రచార శంఖారావం!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఫిబ్రవరి 11వ తేదీన శంఖారావం పేరిట ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. శంఖారావంపై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు విడుదల చేశారు. సుమారు 50 రోజుల పాటు ఈ ప్రచారం కొనసాగనుందని.. రోజుకు మూడు నియోజకవర్గాల్లో లోకేశ్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.  ఫిబ్రవరి 11వ తేదీన తొలి రోజు.. తొలి సభ ఇచ్చాపురంలో నిర్వహించనున్నారు. జగన్ పాలనలో మోసపోయిన వారికి భరోసా కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో శంఖారావం ఎన్నికల ప్రచారం జరిగేలా ప్రణాళికలు రూపొందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  2023, జనవరి 27వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి యువగళం పేరిట పాదయాత్ర చేపట్టారు. ఆ క్రమంలో రాయలసీమలోని జిల్లాల మీదుగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ద్వారా నారా లోకేశ్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది.  ఆయన పాదయాత్ర రాజోలు నియోజకవర్గంలో కొనసాగుతోండగా.. సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబును ఏపీ స్కీల్ డెవలప్‌మెంట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి.. విజయవాడ కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు 14రోజుల రిమాండ్ విధించడంతో.. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.  దీంతో నారా లోకేశ్... తన పాదయాత్రను తాత్కాలికం నిలిపివేశారు. అనంతరం చంద్రబాబు బెయిల్ కోసం.. ఢిల్లీ వేదికగా లోకేశ్.. న్యాయమూర్తులతో వరుస సంప్రదింపులు జరిపారు.   52 రోజు తర్వాత.. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు అనారోగ్యంతో ఉన్న చంద్రబాబును కంటికి రెప్పల చూసుకుంటూ, ఆయన కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న సమయంలోనూ ఆయన వెంటే ఉన్న లోకేశ్. ఆ తర్వాత నవంబర్ చివరి వారంలో  యువగళం పాదయాత్రను పున: ప్రారంభించి.. విశాఖపట్నంలో ముగించారు.   ఇక అసలు అయితే నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 400 రోజుల పాటు.. 4 వేల కిలోమీటర్ల మేర సాగాల్సి ఉండగా.. అనుకోని పరిణామాలు చోటు చేసుకోవడంతో.. నారా లోకేశ్ తన పాదయాత్రను అనుకున్న సమయాని కంటే ముందే ముగింపు పలికి.. మళ్లీ శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమౌతున్నారు.  ఈ శంఖారావం యాత్ర 50 రోజుల పాటు సాగనుందని చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికే..  నారా లోకేశ్ ఈ యాత్ర పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ శ్రేణులు అంటున్నాయి. 

వైఎస్ ఫ్యామిలీ ఫైట్!

ఎన్నికల నగరా మోగలేదు.. కానీ అప్పుడే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయం మాత్రం రసకందాయంలో పడింది. ఇప్పటి  వరకు అధికార జగన్ పార్టీ వర్సెస్ టీడీపీ, జనసేన అన్నట్లుగా పరిస్థితులు ఉంటే.. ఏపీసీసీ చీఫ్‌గా వైయస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అధికార వైసీపీ వర్సెస్ వైఎస్ షర్మిల అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల పర్యటనలో భాగంగా వైఎస్ షర్మిల.. సోదరుడు జగన్ పాలనపై మరోసారి నిప్పులు చెరిగారు.   మరోవైపు ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్  . తూర్పు గోదావరి జిల్లా గోకవరం సమీపంలో ఓ సభలో మాట్లాడుతూ, జగన్ పాలనపై పరోక్షంగా   కీలక వ్యాఖ్యలు చేశారు,  అలాగే   జగన్ సొంత మేనత్త   విమలారెడ్డి కూడా అదే రోజు గుంటూరు వేదికగా పత్తిపాడు నియోజకవర్గంలోని పాస్టర్లతో సమావేశం నిర్వహించి,  రాష్ట్రంలో మళ్లీ జగన్ పాలన రావడం కోసం.. చేయాల్సిన అంశాలపై కులంకూషంగా చర్చించారన్న ప్రచారం అయితే రాజకీయవర్గాలలో వాడి వేడిగా నడుస్తోంది.  అయితే గత ఎన్నికల వేళ.. ఒక్కరి గెలుపు కోసం అందరూ కలిసి పని చేశారనీ,   ఇంకా క్లారిటీగా చెప్పాలంటే,  జగన్‌ని అధికార పీఠం ఎక్కించడం కోసం వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు,  అలాగే ఆమె భర్త బ్రదర్ అనిల్.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లతో సభలు, సమావేశాలు నిర్వహించారు,  జగన్ ముఖ్యమంత్రి అయితే  పరిస్థితులు మారతాయంటూ ఓ విధమైన భరోసా  సైతం కల్పించారు.అలాగే  జగన్ మేనత్త వైఎస్ విమలారెడ్డి సైతం దాదాపుగా అదే బాటలో నడిచారు.  ఇక   జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత .పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. దీంతో వైఎస్ షర్మిల ఎటువైపు అడుగులు వేశారో అందరికీ తెలిసిందేనని అంటున్నారు. ఇక ఆమె భర్త బ్రదర్ అనిల్ అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల నాయకులతో భేటీలో  కీలక వ్యాఖ్యలు చేశారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.   ఇక వైఎస్ షర్మిల  పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుండడంతోపాటు,  జగన్ పాలననే టార్గెట్‌గా చేసుకోని దూసుకుపోతుండడంతో,  జగన్ తన మేనత్త   విమలారెడ్డిని రంగంలో దింపారని.. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన రాజకీయం ఒకలాగా ఉంటే.. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం అందుకు పూర్తి భిన్నంగా ఉందనే ఓ చర్చ అయితే సదరు సర్కిల్‌లో వైరల్ అవుతోంది.

జగన్ ను సాగనంపేందుకు జనం సిద్ధం.. మూడ్ ఆఫ్ ఏపీ ఇదే!

ఏపీలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి పెల్లుబిక్కుతోంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి చెప్పుకోద‌గ్గ అభివృద్ధి ఏ ప్రాంతంలోనూ జ‌ర‌గ‌లేదు. ఏపీ అభివృద్ధిలో కీల‌క భూమిక పోషించాల్సిన అమ‌రావ‌తి రాజ‌ధానిని సైతం వైసీపీ పాల‌న‌లో నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతూనే ఉంది. చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఏపీలో ఏర్పాటైన ప‌లు కంపెనీలు సైతం ఏపీ నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లిపోయాయి. ఇసుక ద‌గ్గ‌ర నుంచి మ‌ట్టి ఇలా అన్నింట్లోనూ ఏపీలో వైసీపీ నేత‌ల దోపీడీ కొన‌సాగుతుంద‌న్న వాద‌న ప్ర‌జ‌ల నుంచి విస్తృతంగా వినిపిస్తోంది. కానీ, వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం అదంతా ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లేనంటూ త‌మ‌కు అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేసుకుంటున్నాయి. తాజాగా ప్ర‌జ‌ల్లో వైసీపీ ప్ర‌భుత్వంపై అసంతృప్తి పెల్లుబికుతోంద‌ని తేటతెల్లమైపోయింది.   ఇండియా టుడే తాజా స‌ర్వేలో ఏపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర‌ అసంతృప్తి ఉంద‌ని తేలింది. దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌పై ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేష‌న్ పేరుతో నిర్వహించిన స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డించింది. ఈ స‌ర్వే ఫ‌లితాల్లో వైసీపీకి బిగ్ షాక్ త‌గిలింది. ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. వచ్చే నెలలోనే ఎన్నిక‌ల షెడ్యూల్ రాబోతుంది. అన్నిప్ర‌ధాన పార్టీలు స‌మ‌ర శంఖం పూరించాయి. అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. స‌భ‌లు, స‌మావేశాల‌తో ఏపీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం నెల‌కొంది. మ‌రోవైపు మ‌ళ్లీ అధికార పీఠాన్ని ద‌క్కించుకునేందుకు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తున్నారు. కానీ, ఈసారి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తీవ్ర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని సర్వే తేల్చేసింది. ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేలు అందుబాటులోకి వ‌చ్చాయి. దాదాపు అన్ని స‌ర్వేల్లోనూ వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని తేలిపోయింది.  దీంతో సీఎం జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జుల‌ను మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త‌వారిని అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దింపుతున్నారు. అయినా జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు గ‌ట్టిషాకిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. దేశంలో ప్ర‌ధాన స‌ర్వేల్లో ఒక‌టైన ఇండియా టుడే స‌ర్వే సైతం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి  ఓటమి ఖాయమని తేల్చేసింది.  ఈ స‌ర్వే ఏపీలో వైసీపీకి కేవ‌లం ఎనిమిది ఎంపీ స్థానాలు మాత్ర‌మే వ‌స్తాయ‌ని చెప్పింది. తెలుగుదేశం - జ‌న‌సేన కూట‌మి   17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో   విజ‌యం సాధిస్తుంద‌ని స‌ర్వేలో  తేలింది. ఏపీలో టీడీపీ - జ‌న‌సేన కూట‌మికి 45శాతం ఓటు బ్యాంకు న‌మోద‌వుతుంద‌ని, అధికార వైసీపీకి 41శాతం ఓటు బ్యాంకు స‌మ‌కూరుతుంద‌ని ఇండియా టుడే స‌ర్వే ఫ‌లితాల్లో వెల్ల‌డైంది. ఏపీ విభ‌జ‌న త‌రువాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్‌ పూర్తిగా వైసీపీకి వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం, ష‌ర్మిల ఆ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్దికాలంలోనే కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకున్న‌ట్లు ఇండియా టూడే స‌ర్వేలో తేలింది. ఫ‌లితంగా కాంగ్రెస్ పార్టీకి 2.7శాతం ఓట్ షేర్ వ‌స్తుంద‌ని, బీజేపీ 2.1 శాతం సాధిస్తుంద‌ని స‌ర్వే వెల్ల‌డించింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో 2019లో ఇండియా టూడే జ‌రిపిన స‌ర్వే ఫ‌లితాలు దాదాపు నిజ‌మ‌య్యాయి. అప్ప‌ట్లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీకి 18 నుంచి 20 ఎంపీ సీట్లు, టీడీపీ కి 4-6 ఎంపీ సీట్లు వ‌స్తాయ‌ని ఇండియా టుడే వెల్ల‌డించ‌గా.. వైసీపీకి 22, టీడీపీ మూడు ఎంపీ స్థానాలు వ‌చ్చాయి. తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలో టీడీపీ - జ‌న‌సేన కూట‌మికి 17 ఎంపీ సీట్లు వ‌స్తాయ‌ని తేలింది. దీంతో ఈ ద‌ఫా పార్ల‌మెంట్ ఫ‌లితాల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతుంద‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఇవే ఫ‌లితాలు అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ పున‌రావృతం కానున్నాయ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. టీడీపీ - జ‌న‌సేన పొత్తుపై ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చేసింది. మ‌రోవైపు వీరికి త్వ‌ర‌లో బీజేపీకూడా తోడు కాబోతుంది. ఇప్ప‌టికే చంద్ర‌బాబు నాయుడు బీజేపీ పెద్ద‌ల‌తో భేటీ అయ్యారు. టీడీపీ, జ‌న‌సేన కూట‌మిలో క‌లిసేందుకు బీజేపీ సిద్ధ‌మైంది. తాజాగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేష‌న్ స‌ర్వేలో ఏపీలో బీజేపీ 2.1శాతం ఓటు షేర్ వ‌స్తుంద‌ని తేలింది. అయితే, టీడీపీ - జ‌న‌సేన కూట‌మిలో బీజేపీ క‌ల‌వ‌డం ఖాయం కావ‌డంతో ఆ ఓటింగ్ శాతంసైతం టీడీపీ, జ‌న‌సేన కూట‌మికి యాడ్ కానుంది. దీనికితోడు త‌ట‌స్థ ఓట్ల‌లో మ‌రికొన్ని ఓట్లు ఈ కూట‌మివైపు వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీంతో వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ కూట‌మికి 22 నుంచి 23 ఎంపీ స్థానాలు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మొత్తానికి వైసీపీ ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌లు ఎంత ఆగ్ర‌హంతో ఉన్నారో  ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేష‌న్ పేరుతో నిర్వ‌హించిన తాజా స‌ర్వేలో తేలిపోయింది.

కోడికత్తి శీనుకు బెయిలు

కోడికత్తి దాడి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనుకు హైకోర్టు గురువారం (ఫిబ్రవరి 8) బెయిలు మంజూరు చేసింది. అయితే కేసుకు సంబంధించి ఎక్కడా మాట్లాడకూడదని షరతు విధించింది. అలాగే వారంలో ఒక రోజు  ట్రయల్ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐదేళ్ల కిందట అప్పటి విపక్ష నేత జగన్ పై శీను కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడి కేసులో అప్పుడు అరెస్టైన శీను ఇంత కాలం బెయిలుకు కూడా నోచుకోకుండా జైల్లోనే మగ్గుతున్నారు. అప్పట్లో కోడి కత్తి కేసు దర్యాప్తు ఎన్ఐఏ టేకప్ చేయాలని డిమాండ్ చేసి సాధించుకున్న సంగతి విదితమే. ఏపీ పోలీసులపైనా, సీబీఐ పైనా నమ్మకం లేదంటూ ఆయన పట్టుబట్టి మరీ ఎన్ఐఏ చేత దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు తెచ్చుకున్నారు.  ఇక అప్పటి నుంచీ ఈ కేసు దర్యాప్తు నత్తనడక నడుస్తూనే ఉంది.  ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ హత్య కేసులో నిదితుడిగా  ఉన్న ఒక ఎంపీకి  ముందస్తు బెయిల్  లభిస్తుంది. కానీ,  కోడి కత్తి కేసులో నిందితుడు, శ్రీనివాసరావు ఐదేళ్లుగా  జైలులో మగ్గుతున్నా, ఎన్ని సార్లు కోర్టును వేడుకున్నా, అతనికి మాత్రం ఇప్పటి వరకూ కనీసం బెయిలు లభించలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నది ఎన్ఐఏ కనుక, ఆ దర్యాప్తు సంస్థకు ఉగ్రవాదులు, తీవ్రవాద సంబంధిత కేసుల దర్యాప్తే ప్రధానం కనుక ఈ కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. అయితే బెయిలు విషయంలో జాప్యానికి మాత్రం పూర్తిగా జగన్ దే బాధ్యత. ఈ కేసులో బాధితుడైన జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇస్తే నిందితుడు శీనుకు వెంటనే బెయిలు లభించే అవకాశం ఉంటుందని న్యాయవాదులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోర్టులు ఎన్ని సార్లు నోటీసులు జారీ చేసినా జగన్ కు మాత్రం కోర్టుకు వచ్చేందుకు సమయం చిక్కలేదు. అంతే కాకుండా ఈ కేసు దర్యాప్తు చేసిన ఎన్ఐఏ ఈ దాడి వెనుక ఎటువంటి కుట్ర కోణం లేదని విస్పష్టంగా తేల్చేసినా బాధితుడైన జగన్ మాత్రం ఎన్ఐఏ దర్యాప్తు తీరు సరిగా లేదనీ మరింత లోతైన విచారణ జరపాలనీ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.  అయితే జగన్ ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాకపోవడం గమనార్హం. తన దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఈ కేసులో నిందితుడైన జనపల్లి శ్రీను  తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కాదని పేర్కొంది. దీంతో తన హత్యకు కుట్ర అంటూ విపక్ష నేతగా పట్టుబట్టి సాధించుకున్న ఎన్ఐఏ దర్యాప్తు జగన్ నాడు చెప్పిన దాంట్లో వాస్తవం లేదని తేల్చింది.  ఇక ఇప్పుడు ఎట్టకేలకు కోడికత్తి శీనుకు ఏపీ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.  

సీనియర్ జర్నలిస్టు ఎన్ వేణుగోపాల్ నివాసంలో ఎన్ఐఏ సోదాలు

హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. సీనియర్ జర్నలిస్ట్ ఎన్. వేణుగోపాల్ నివాసంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నది. పలు మీడియా సంస్థలలో పని చేసిన వేణుగోపాల్.. విపప్ల రచయత వరవరరావుకు అల్లుడు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో వేణుగోపాల్ నివాసంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నదని తెలుస్తోంది.   హిమాయత్ నగర్ లోని ఆయన నివాసంలో ఈ ఉదయం ఆరుగంటల నుంచే ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. అలాగే పౌరహక్కుల సంఘం నాయకుడు రవి శర్మ నివాసంలో సైతం ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నది.  గతంలో వరవరరావును సైతం ఎన్ఐఏ గోరెగావ్ కుట్ర కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును అప్పట్లో ఆయన నివాసంలో పుణె పోలీసులు సోదాలు నిర్వహించారు. అనంతరం గాంధీనగర్‌లోని వీవీ హౌస్‌లో వరవరరావును పోలీసులు విచారించారు.  ప్రధాని మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రలో వరవరరావు పేరు ఉన్నట్లు ఆరోపించిన పోలీసులు  మావోయిస్టులకు నిధుల సమీకరణలోనూ వరవరరావు పాత్ర ఉన్నట్లు అప్పట్లో పేర్కొన్నారు.  కాగా ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమే లక్ష్యంగా పాలక వర్గాలు దమనకాండ ప్రయోగిస్తున్నాయి ప్రజాస్వామ్యవాదులు విమర్శిస్తున్నారు. 

మళ్లీ ఎన్డీయే కూటమిలోకి తెలుగుదేశం.. రాష్ట్రం కోసం బాబు, దేశం కోసం బీజేపీ!

పొత్తు పొడిచింది. దేశ ప్రయోజనాల కోసం అంటూ బీజేపీ, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటూ తెలుగుదేశం సార్వత్రిక ఎన్నికల ముందు జట్టు కట్టేందుకు దాదాపుగా ఒక అవగాహనకు వచ్చేశాయి. అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరడం ఖాయమైపోయింది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు బుధవారం (ఫిబ్రవరి 7) అర్థరాత్రి హస్తినలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో పొత్తుపై ఒక అవగాహన కుదిరినట్లు చెబుతున్నారు. ఇక ఏపీలో ప్రస్తుతం ఉన్న పురిస్థితులపై చంద్రబాబు అమిత్ షా, నడ్డాలు పూసగుచ్చినట్లు వివరించారని చెబుతున్నారు. చంద్రబాబు చెప్పిన ప్రతి విషయంతోనూ ఏకీభవించిన అమిత్ షా.. జగన్ పాలన, ఏపీలో పరిస్థితులకు సంబంధించి తన వద్ద ఉన్న నివేదికలో ఈ వివరాలన్నీ ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా ఇప్పటికే ఎన్డీయేలో భాగస్వామ్య పక్షమైన జనసేన ఏపీలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.  ఏపీలో జగన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యం అంటూ పవన్ కల్యాణ్ గతంలోనే తెలుగుదేశంతో కలిసే తమ పార్టీ ఎన్నికలకు వెడుతుందని ప్రకటించేశారు. అప్పటి నుంచీ తెలుగుదేశం, జనసేనలు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.  అయితే మొదటి నుంచీ కూడా పవన్ కల్యాణ్ బీజేపీని కూడా కలుపుకుని పోతామన్న అభిప్రాయమే వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ విషయంలో ఏదీ తేల్చకుండా నాన్చిన బీజేపీ ఎట్టకేలకు ఏపీలో తెలుగుదేశం, జనసేనలతో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలలో 400 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఎన్డీయే బలోపేతంపై దృష్టి సారించింది. అందుకే పాత మిత్రులను కలుపుకు పోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో అమిత్ షా, నడ్డాలు భేటీ అయ్యారు.  ఇక జనసేనాని పవన్ కల్యాణ్ కూడా గురువారం హస్తిన వెళ్లి అమిత్ షా, నడ్డాలతో భేటీ కానున్నారు. అయితే అప్పటికే చంద్రబాబు హస్తిన నుంచి హైదరాబాద్ కు వచ్చేస్తారు. ఒక రోజు వ్యవధిలో తెలుగుదేశం అధినేత, జనసేన అధినేతతో అమిత్ షా, నడ్డాలు వేరువేరుగా భేటీ అవ్వడానికి కారణమేమిటన్నదానిపై రాజకీయవర్గాలలో పలురకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే బీజేపీ కలవడంతో ఏపీలో సీట్ల సర్దు బాటు విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిన తెలుగుదేశం, జనసేనలు తమ తమ స్థానాలలో ఒకటి రెండు త్యాగం చేయాల్సి వస్తుంది.  ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక అవగాహనకు రావడంతో బీజేపీకి కేటాయించే సీట్ల విషయంలో పవన్ కల్యాణ్ అమిత్ షాతో భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  సహజంగానే బీజేపీ పొత్తులో భాగంగా తమకు అసెంబ్లీ కంటే లోక్ సభ స్థానాల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతుంది. అయితే చంద్రబాబు మాత్రం పరస్పర ఉపయోగం ఉన్న చోట్లే సీట్ల సర్దుబాటు చేసుకుందామని ఇప్పటికే బీజేపీ పెద్దలకు చెప్పేశారంటున్నారు. అలా కాకుండా బలం లేని చోట పోటీకి నిలబెడితే అది అంతిమంగా వైసీపీకి అనుకూలం అవుతుందని ఆయన వివరించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలో 2014 నాటి పొత్తులు మళ్లీ పొడిచాయనీ, అప్పటి ఫలితమే పునరావృతం అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

షర్మిల ప్రాణాలకు ముప్పు? చెల్లికి ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేవా జ‌గ‌న్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు  ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ష‌ర్మిల బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో పాటు.. త‌న‌ సోద‌రుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్తున్నారు. ఇప్ప‌టికే జిల్లాల వారిగా కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించిన ష‌ర్మిల‌.. తాజాగా బ‌హిరంగ స‌భ‌ల పేరుతో జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ష‌ర్మిల తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తుండ‌టంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్నది. వైసీపీ నేత‌లు కౌంట‌ర్ ఇచ్చే క్ర‌మంలో ష‌ర్మిల‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జనబాహుల్యంలో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వైసీపీలో బూతుల నేత‌లు ఎక్కువ‌గానే ఉన్నార‌న్న సంగతి తెలిసిందే.  అయితే ఆమెపై బూతుల పంచాగంతో విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు  2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం పీఠం ఎక్క‌గ‌లిగాడంటే అందులో ష‌ర్మిల పాత్ర కీల‌క‌మ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోతుండ‌టం సిగ్గుచేటు.       ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిందంటే అందులో ష‌ర్మిల పాత్ర కీల‌క‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ఎవ‌రికైనా ఈ విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో అక్ర‌మాస్తుల కేసులో సంవ‌త్స‌రానికిపైగా జైలుకెళ్లిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్య‌త‌ల‌ను ష‌ర్మిల భుజానికెత్తుకున్నారు. అంతేకాదు.. పాద‌యాత్ర పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి నేను జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణాన్ని అంటూ పాపుల‌ర్  రాజ‌కీయ నేత‌గా ఎదిగారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ష‌ర్మిల‌, జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ ప్ర‌చారంతో వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క్ర‌మంగా ష‌ర్మిల‌ను ప‌క్క‌కు పెడుతూ వ‌చ్చారు. దీనికితోడు ఆస్తి పంప‌కాల విష‌యంలోనూ విబేధాలు రావ‌డంతో జ‌గ‌న్‌, ష‌ర్మిల శ్రుతువులుగా మారిపోయారు. ఆ త‌రువాత ష‌ర్మిల తెలంగాణ‌లో  తెలంగాణ వైఎస్ ఆర్ పార్టీ పేరుతో రాజ‌కీయాలు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీలో త‌న సొంత పార్టీని విలీనం చేసి ఆ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలిగా ప‌గ్గాలు చేప‌ట్టారు. అప్ప‌టి నుంచి ఏపీ రాజ‌కీయాల్లో ష‌ర్మిల క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  ఏపీ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన ష‌ర్మిల వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెట్టారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఏవ‌ర్గాల వారికి న్యాయం జ‌ర‌గ‌లేద‌ని తేల్చారు. జ‌గ‌న్ ప‌రిపాల‌న‌ చేసేందుకు అర్హుడు కాదంటూ విమ‌ర్శించారు. ఈ క్ర‌మంలో ప‌లువురు వైసీపీ శ్రేణులు ష‌ర్మిల‌కు వ్య‌తిరేకంగా అస‌భ్య‌క‌రంగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్టారు. కొంద‌రు వైసీపీ నేత‌లు అన్నా.. ష‌ర్మిల అడ్డు తొల‌గించెయ్య‌రాద‌న్న‌ట్లు జ‌గ‌న్ కు సూచ‌న‌లు చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులుసైతం పెట్టే స్థాయికి వెళ్లిపోయారు. మ‌రికొంద‌రు.. ష‌ర్మిల అస‌లు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సొంత కుమార్తేనా అంటూ అస‌భ్య‌క‌ర రీతిలో వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల్లో ఎంత బ‌ద్ద‌శ‌త్రువులైనా సొంత చెల్లిని అస‌భ్య‌క‌రంగా మాట్లాడుతుంటే ఎవ‌రూ చూస్తూ ఉండ‌రు. కానీ  జ‌గ‌న్ ష‌ర్మిల‌పై అస‌భ్య‌క‌ర రీతిలో మాట్లాడుతున్న వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను కంట్రోల్ చేసేందుకు ప్ర‌య‌త్నంకూడా చేయ‌క‌పోవ‌టం అటుంచి వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   మ‌రోవైపు ష‌ర్మిల‌కు ప్రాణ‌హాని ఉంద‌ని, ప్ర‌భుత్వం త‌ర‌పున సెక్యూరిటీ క‌ల్పించాల‌ని కోరినా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌కు సెక్యూరిటీ ఉండేది. త‌రువాత కాలంలో ఆ సెక్యూరిటీని తొల‌గించేశారు. ప్ర‌స్తుతం ష‌ర్మిల ప్రాణాల‌కు ముప్పు పొంచిఉంద‌ని కాంగ్రెస్ నేత‌లు, ఆఖ‌రికి ప‌లువురు టీడీపీ నేత‌లుసైతం పేర్కొంటున్నారు. అయినా ష‌ర్మిల‌కు భ‌ద్ర‌త‌ను క‌ల్పించేందుకు జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌టం జ‌గ‌న్ మూర్ఖ‌త్వానికి అద్దం ప‌డుతున్నద‌ని ప‌లువురు వైసీపీ నేత‌లుసైతం విమర్శిస్తున్నారు. తాజాగా.. తన భద్రత విషయంలో ఏపీ సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏదో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనకు సెక్యూరిటీ కల్పించకపోవడం అంటే.. తన చెడు కోరుకుంటున్నారనేగా అర్థం అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ష‌ర్మిల వ్యాఖ్య‌ల‌తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆమె భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుంది. జ‌గ‌న్ ఇప్ప‌టికైనా త‌న మూర్ఖ‌త్వాన్ని వీడి ష‌ర్మిల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కాంగ్రెస్ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. త‌న మూర్ఖ‌త్వ రాజ‌కీయాల‌తో ప్ర‌త్య‌ర్థులపై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించే జ‌గ‌న్‌.. చెల్లి ష‌ర్మిలపై కూడా అలాగే వ్యవహరించడం విస్మయం గొలుపుతోంది. గత ఎన్నికల ముందు సొంత బాబాయ్   వైఎస్ వివేకా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ హత్యను కూడా తన రాజకీయ లబ్ధికి వాడేసుకున్న జగన్ తీరా గెలిచిన తరువాత హత్యకు కారకులైన వారి పక్షాన నిలిచి అడుగడుగునా ఆ కేసు దర్యాప్తునకు అవరోధాలు కలిగిస్తున్న సంగతి తెలిసిందే.  ఇక ఇప్పుడు మళ్లీ మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు  జరగనున్న తరుణంలో సొంత చెల్లి షర్మిల తన భద్రతపై ఆందోళన చెందుతున్నారు.  అయినా భద్రత విషయంలో జగన్ నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో సొంత చెల్లికి సైతం భద్రత కల్పించని వ్యక్తి జగన్ అటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.  గత ఎన్నికల ముందు జరిగిన బాబాయ్ హత్య ఉదంతాన్ని పేర్కొటూ షర్మిల ఆందోళనలో అర్ధం ఉందని అంటున్నారు. 

విజ‌య‌సాయి రెడ్డి గూబ గుయ్యిమనేలా కాంగ్రెస్ రిటార్డ్

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డికి నోటి దురుసు కాస్త ఎక్కువే. ఈ విష‌యాన్ని వైసీపీ నేత‌లుకూడా అప్పుడ‌ప్పుడు ప్ర‌స్తావిస్తుంటారు.  ప్ర‌తిప‌క్షాల‌పై ఇష్టారీతిలో మాట్లాడ‌టం ఆయ‌నకు అల‌వాటే. ఆయ‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన నాటినుంచి స‌త్య‌ దూర వ్యాఖ్యల‌తో పలు వివాదాలు కొనితెచ్చుకున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల మెప్పు కోసం విజ‌య‌సాయిరెడ్డి అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తుండ‌టం తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని విష‌యం కాదు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఆయ‌న‌ చేసిన వ్యాఖ్య‌లు కాంగ్రెస్ శ్రేణుల‌తోపాటు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తున్నాయి. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా సాయిరెడ్డిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. తాజాగా తెలంగాణ‌ కాంగ్రెస్ నేత‌లు రంగంలోకి దిగారు.. విజ‌య‌సాయికి గూబ గుయ్యిమ‌నేలా స‌మాధానం ఇచ్చారు. నీ బుద్ది మార‌కుంటే త‌గిన శాస్త్రి త‌ప్ప‌దంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.  తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాటు త‌రువాత ప‌దేళ్ల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. గ‌తేడాది డిసెంబ‌ర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పాల‌న ప్రారంభ‌మై ప‌ట్టుమ‌ని మూన్నెళ్లుకూడా కాలేదు.. అయినా, రేవంత్ సార‌థ్యంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా నెర‌వేస్తున్నారు. ముఖ్యంగా.. ఆరు గ్యారెంటీల అమ‌లుపై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఒక్కో ప‌థ‌కాన్ని అమ‌లు చేసుకుంటూ వ‌స్తోంది. గ‌డిచిన రెండు నెల‌ల కాలంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరిగింది. మ‌రోవైపు గ‌త ప్ర‌భుత్వం అవినీతి అక్ర‌మాల‌ను రేవంత్ స‌ర్కార్ వెలుగులోకి తెస్తోంది. ఈ ప‌రిణామాలు త‌ట్టుకోలేక‌పోయిన బీఆర్ఎస్ పార్టీ నేత‌లు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల దాడికి దిగుతున్నారు. మ‌రికొద్ది నెల‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోతుంద‌ని వ్యాఖ్యానిస్తూ ప్ర‌జ‌ల్లో మ‌రింత అభాసుపాల‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే విజ‌య‌సాయిరెడ్డి త‌న‌ది కాని స‌బ్జెక్ట్ లోకి దూరిపోయాడు. ఆయ‌న‌కు నోటి దురుసు కాస్త ఎక్క‌వ‌నే విష‌యం  తెలిసిందే క‌దా.. తెలంగాణ ప్ర‌భుత్వంపై నోరుపారేసుకున్నాడు.  రాజ్య‌స‌భ‌లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై జ‌రిగిన చ‌ర్చ‌ల్లో విజ‌య‌సాయి రెడ్డి మాట్లాడారు. ప‌దేళ్ల త‌రువాత అనేక అబ‌ద్ధాలు చెప్పి తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింద‌ని అక్క‌సు వెల్ల‌గ‌క్కారు.. త్వ‌ర‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని వ్యాఖ్యానించాడు. ఇదంతా బీజేపీ మెప్పుకోసం మాట్లాడిన మాట‌లే అయినా.. విజ‌య‌సాయి రెడ్డి వ్యాఖ్య‌ల్లో మ‌రో ఆందోళ‌న క‌నిపించింది. ఇన్నాళ్లు జ‌గ‌న‌న్న బాణంగా రాజ‌కీయాల్లో కొన‌సాగిన ఆయ‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిల ఎదురు తిరిగి.. ఏకంగా ఏపీలో జ‌గ‌న‌న్న‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయాల్లో దూసుకెళ్తున్నారు.  అడుగ‌డుగునా జ‌గ‌న్‌ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ వైసీపీ నాయ‌క‌త్వానికి కంటిమీద క‌నుకు లేకుండా చేస్తున్నారు. దీంతో.. ష‌ర్మిల‌పై కోపాన్ని తెలంగాణ ప్ర‌భుత్వంపై విజ‌య‌సాయి వెళ్ల‌గ‌క్కిన‌ట్లు ఉంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. మ‌రో వైపు తెలంగాణ ప్ర‌భుత్వంపై ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడితే కాంగ్రెస్ నేత‌లు ఊరుకుంటారా.. విజ‌య‌సాయిరెడ్డి గూబ గుయ్యిమ‌నేలా కౌంట‌ర్ ఇచ్చారు.  విజ‌య‌సాయి రెడ్డి వ్యాఖ్య‌లపై కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విజ‌య‌సాయి రెడ్డి రాజ్య‌స‌భ స‌భ్యుడా?  బ్రోక‌ర్  ప‌నిచేస్తున్నాడా?. బీజేపీ డైరెక్ష‌న్ లో జ‌గ‌న్‌, కేసీఆర్ ప‌ని చేస్తున్నారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధి చెంద‌వ‌ద్ద‌ని కేసీఆర్‌, కేటీఆర్‌, జ‌గ‌న్ కుట్ర చేస్తున్నారంటూ  ఓ రేంజ్ లో విమ‌ర్శ‌లు చేశారు. బీజేపీ, జ‌గ‌న్‌, కేసీఆర్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ను తిప్పికొడ‌తాం.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌లోపు బీఆర్ ఎస్ పార్టీకి త‌గిన గుణ‌పాఠం చెబుతామంటూ జ‌గ్గారెడ్డి హెచ్చ‌రించారు. మ‌రో కాంగ్రెస్ నేత అద్దంకి ద‌యాక‌ర్ మాట్లాడుతూ విజ‌య‌సాయిపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విజ‌య‌సాయికి ఏ రాజ‌కీయ తెలివి ఉందో ఇప్పుడు అర్థ‌మ‌వుతుంది.. ష‌ర్మిల ఏపీకి వ‌చ్చి కాంగ్రెస్ ను బ‌లోపేతం చేయ‌డం అనేది విజ‌య‌సాయికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు.. అందుకే కాంగ్రెస్ పై అక్క‌సు వెల్ల‌బుచ్చుకుంటున్నారు..  రాబోయే కాలంలో స‌రైన రీతిలో గుణ‌పాఠం చెబుతామ‌ని అద్దంకి ద‌యాక‌ర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు సైతం విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా మండిప‌డుతున్నాయి. మొత్తానికి విజ‌య‌సాయి రెడ్డికి గూబ గుయ్యిమ‌నేలా కాంగ్రెస్ నేత‌లు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇస్తున్నారు. ఇక‌నైనా మారు సామి.. అంటూ హితవు పలుకుతున్నారు.