పంచాయతీ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడి

      రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో ఫలితాలు ఒక్కటొక్కటిగా వెలువడుతున్నాయి. ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణ జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లో తొలుత వార్డు సభ్యుల ఓట్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తున్నారు. ఫలితాలను సాయంత్రం విడుదల చేస్తారు.   మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్లలో నిర్వహించిన ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. గన్నవరం నియోజకవర్గం తుంటగుంట పంచాయితీ సర్పంచ్ గా టిడిపి బలపరిచిన జీ.రాణి 51 ఓట్ల మెజార్టీ తో విజయం సాధించారు.

ప్రముఖ సినీనటి మంజుల కన్నుమూత

      ప్రముఖ సినీనటి మంజుల ఈ రోజు చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని శ్రీరామచంద్ర ఆస్పత్రిలో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మంజుల ప్రముఖ తమిళ నటుడు విజయకుమార్ సతీమణీ. ఆమెకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మంజుల కథానాయికగా తెలుగు,తమిళ్, కన్నడ లో దాదాపు వంద చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా 'వాసు'. ఎన్టీ రామారావుతో మగాడు, మా ఇద్దరికథ, వాడే వీడు వంటి చిత్రాల్లో, కృష్ణతో మాయదారి మల్లిగాడువంటి చిత్రాల్లో, అక్కినేని నాగేశ్వర రావు సరసన బంగారు బొమ్మలు వంటి చిత్రాల్లో నటించారు. శోభన్ బాబు సరసన ఆమె పలు చిత్రాల్లో నటించారు. శోభన్ బాబు, మంజుల అప్పట్లో హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందింది. తమిళంలో ఆమె శివాజీ గణేషన్, యంజీ రామచంద్రన్, జెమినీ గణేషన్ సరసన నటించింది.

ఐబీఎల్ లో సైనా కి భారీ ఆఫర్

      ప్రతిష్ఠాత్మక భారత బ్యాడ్మింటన్ లీగ్‌లో ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ను మంచి డిమాండ్ ఏర్పడింది. ఐకాన్ ప్లేయర్ సైనాను రూ. 71.27 లక్షలకు హైదరాబాద్ హాట్‌షాట్స్ దక్కించుకుంది. పురుషుల ప్రపంచ నంబర్‌వ న్ లీ చాంగ్ వీకి వేలంలో అత్యధిక రేటు దక్కింది. ముంబయి మాస్టర్స్ అతడిని రూ. 80.19 లక్షలకు కొనుగోలు చేసింది. ఒలింపిక్ క్వార్టర్ ఫైనలిస్ట్ పారుపల్లి కశ్యప్‌ను బంగా బీట్స్ రూ. 44.55 లక్షలకు దక్కించుకుంది. లక్నో వారియర్స్ వర్ధమాన తార పీవీ సింధును రూ.47. 52 లక్షలకు దక్కించుకుంది.   ఇక డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప కనీస ధరను తగ్గించారు. తొలుత రూ. 29.75 లక్షలుగా ఉన్న ధరను తర్వాత దానిలోని సగం ధర రూ. 14.85 లక్షలుగా నిర్ణయించారు. జ్వాలను ఢిల్లీ స్మాషర్స్ 18.81 లక్షలకు.. వేలం చివరి నిమిషంలో అశ్వినిని పుణె కనీస ధరకు దక్కించుకున్నాయి.   ఆగస్ట్ 14 నుంచి ప్రారంభమయ్యే ఐబీఎల్ మొత్తం 6 ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. ఒక్కో ఫ్రాంచైజీ 11 మందిని కొనుగోలు చేయగా..అందులో ఆరుగురు భారత్ ఆటగాళ్లు, నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉంటారు.

సం'గ్రామం': వేగంగా పోలింగ్

      మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ మంగళవార౦ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైందని ఎన్నికల కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాదులో వెల్లడించారు. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ జోరుగా సాగుతోంది.   అనంతపురం 50%, మెదక్ 54%, కృష్ణా 63%, గుంటూరు 70%, కడప 45%, చిత్తూరు 66%, కర్నూలు 70%, కడప 45%, విజయనగరం 61%, నల్గొండ 50%, రంగారెడ్డి 50%, ఎస్పీఎస్ నెల్లూరు 54%, రంగారెడ్డి 50%, పశ్చిమ గోదావరి 57%, తూర్పు గోదావరి 50%, వరంగల్ 57%, కరీంనగర్ 51%, ప్రకాశం 67%, మహబూబ్ నగర్ 47%, అదిలాబాద్ 35%, నిజామాబాద్ 48%, శ్రీకాకుళం 62%, విశాఖ జిల్లాల్లో 46% శాతంగా ఓటింగ్ నమోదయింది.

తెలంగాణ కోసం ఆత్మహత్య కాదు..హత్య!!

      తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్ధి వినోద్ కేసు సడన్ గా మలుపు తిరిగింది. వినోద్ ఆత్మహత్య చేసుకోలేదని..అతనిని గొంతునులిమి హత్య చేసి కాల్చేసారని పోలీసులు చెబుతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఈ విషయం బయటపడిందని పోలీసులు వాదిస్తున్నారు.   ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి సీఐ గిరిబాబు మాట్లుడుతూ.. బీటెక్ స్టూడెంట్ వినోద్ ను ఎవరో పథకం ప్రకారం హత్య చేసి తెలంగాణ రంగు పూలమడానికి ప్రయత్నించినట్లు అర్థమవుతుందని...మృతుదేహం పోస్ట్ మార్టానికి వెళ్ళడంతో అసలు విషయం బయట పడిందని అంటున్నారు. ఈ హత్యకు రాజకీయమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.        ఇటీవలే బీటెక్ పూర్తి చేసిన వినోద్..చిన్నాన్న సర్పంచ్ గా పోటి చేస్తుండడంతో ప్రచార౦ కోసం గ్రామానికి వచ్చాడు. మధ్యాహ్నం భోజనం చేసిన వినోద్..ఇంటి వెనుక పశువుల పాకలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.     

కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు

  కాంగ్రెస్ నేతలు ముందు ప్రతిపక్ష నేతలపై బురద జల్లడం, ఒకవేళ దానివల్ల పార్టీ ఇరుకున పడినట్లయితే, వెంటనే ఆవిమర్శలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ మరో ఖండన చేసి చేతులు దులుపుకోవడం రివాజు. తద్వారా తమ శత్రువులపై బురద జల్లడం దిగ్విజయంగా పూర్తవుతుంది. పార్టీకి ఆ మైల అంటుకోకుండా జాగ్రత పడుతోంది.   ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత షకీల్ అహ్మద్ “గోద్రా సంఘటన తరువాతనే ఇండియన్ ముజాహుదీన్ ఉగ్రవాద సంస్థ పుట్టుకు వచ్చిందని” చెపుతూ అందుకు మోడీ, బీజేపీ, ఆర్.యస్.యస్. సంస్థలే కారణమన్నట్లు ఆరోపణలు చేసారు. మోడీని విమర్శించడంలో ఎప్పుడు ముందుండే దిగ్విజయ్ సింగ్ కూడా షకీల్ అహ్మద్ ను వెనకేసుకు వస్తూ ఆయన చేసిన ఆరోపణలలో అసత్యమేమి లేదని అన్నారు.   కానీ, ఊహించని విధంగా బీజేపీ వేరే కోణంలోంచి ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎదురుదాడి చేసింది. “షకీల్ అహ్మద్ ఒక తీవ్రవాద సంస్థ తరపున వఖల్తా తీసుకొని మాట్లాడుతున్నట్లున్నారు,” అని తీవ్ర ప్రతివిమర్శలు చేయడంతో, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వెంటనే స్పందిస్తూ”షకీల్ అహ్మద్ చేసిన వ్యాక్యలతో పార్టీకి సంబంధం లేదు. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చును,” అని ప్రకటన చేసారు. అయితే, అంత మాత్రాన్న కాంగ్రెస్ పార్టీ మోడీని అంత తేలికగా వదిలిపెట్టదని అందరికీ తెలిందే.

మోడీని అడ్డుకొనేందుకు కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహం

  నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా నిలబెట్టే విషయంలో నేటికీ బీజేపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కుమ్ములాడుకొంటుంటే, మరోపక్క ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయిన మోడీ తనపని తానూ చేసుకుపోతూనే ఉన్నాడు. ఇదంతా చూస్తున్నకాంగ్రెస్ పార్టీ కూడా తన జాగ్రత్తలో తానూ ఉండాలనే ఆలోచనతో మోడీని అడ్డుకొనేందుకు తనపని తానూ చేసుకుపోతోంది.   ఒక దశాబ్ధం క్రితం గుజరాత్ లో జరిగిన గోద్రా సంఘటన, తదనంతర మారణఖాండను కాంగ్రెస్ నేతలు పదేపదే ఎత్తి చూపుతూ మోడీ ఒక కరడుకట్టిన మతతత్వవాది అని, అందువల్ల అతను ప్రధాని పదవి చేపట్టడానికి అనర్హుడని గట్టిగా ప్రచారం చేస్తోంది. అదే సమయంలో మోడీని వ్యతిరేఖిస్తున్ననితీష్ కుమార్ వంటి వారిని కూడా ప్రోత్సహిస్తూ, గుజరాత్ లో కంటే బీహార్ వంటి రాష్ట్రాలలోనే బాగా అభివృద్ధి జరగుతోందని ప్రచారం చేయిస్తోంది.   ఇక కాగల కార్యం గందర్వులే చేస్తారన్నట్లు, బీజేపీకే చెందిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి వారు కూడా గుజరాత్ కంటే తమ రాష్ట్రంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతోందని ప్రచారం చేసుకోవడం, దానికి మోడీని వ్యతిరేఖిస్తున్న అద్వానీ వంటివారు వత్తాసు పలకడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు. మోడీ ప్రచారం చేసుకొంటున్నట్లుగా గుజరాత్ లో ఏమీ అద్భుతాలు జరిగిపోవడం లేదని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నాలు కూడా కాంగ్రెస్ గట్టిగానే చేస్తోంది.   తద్వారా, గుజరాత్ రాష్ట్రాన్నిఅభివృద్ధిపధంలో నడిపిస్తునందున, మోడీ చేసిన తప్పులను క్షమించడానికి సిద్దపడుతున్నప్రజల మనస్సులో మోడీ పట్ల ఏర్పడుతున్న మంచి అభిప్రాయాన్నిపూర్తిగా తుడిచిపెట్టి, రానున్న ఎన్నికలలోగా అతనిపట్ల ప్రజలు మళ్ళీ ఏహ్యభావం పెంపొందించుకొనేలా చేసేందుకు కాంగ్రెస్ ఈ దీర్గకాలిక ప్రణాళికతో ముందుకు సాగిపోతోంది.

మొదలైన తొలి సమరం

      మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ మంగళవారమే జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. రెండు గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు. తొలుత వార్డుల ఓట్లు లెక్కించి ప్రకటిస్తారు. బ్యాలెట్ పేపరుపై జరగనున్న ఈ ఎన్నికల్లో 1.25 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. మొదటి విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. వేలం జరిగిన 18 పంచాయతీల్లో ఎన్నికలు రద్దు చేశామని, వాటికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.   ఇక, తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాల పరిధిలో 5803 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి, ఈనెల మూడో తేదీన మొదటి విడతలో 6,863 సర్పంచి, 69,450 వార్డు పదవులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 683 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా మొదటి విడతలో జరగాల్సిన 237 పంచాయతీల్లో ఎన్నికలను మూడో విడతకు వాయిదా వేశారు. వీటితోపాటు 48 వేల వార్డులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి పదవులకు బరిలో నిలిచిన సుమారు 17 వేల మంది, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేస్తున్న దాదాపు లక్ష మంది భవితవ్యం మంగళవారం తేలిపోనుంది. వర్షాల కారణంగా భద్రాచలం డివిజన్లో ఎన్నికలను వాయిదా వే యడంతో మొదటి విడతలో ఖమ్మం జిల్లాలో అసలు పంచాయతీ ఎన్నికలే జరగడం లేదు. లక్ష మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు.

దేశంలోనే తొలి కంప్యూటరైజ్డ్‌ అసెంబ్లీ

      ఇక మీదట రాష్ట్ర అసెంబ్లీలో కాగితాలు కనిపించవు.. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్ర అసెంబ్లీని పూర్తి స్థాయిలో కంప్యూటరీకరించనున్నారు.. దాదాపు అసెంబ్లీ ఇచ్చే అన్ని ఆదేశాలు సందేశాలను ఇకపై ఎలక్ట్రానిక్‌ పద్దతిలోనే పంపనున్నారు.. అందుకు ఈ మెయిల్స్‌ సందేశాలను వినియోగించుకోనున్నారు..   అసెంబ్లీ కంప్యూటరీకరణకు కేంద్రం ఆర్ధిక సాయం ప్రకటించదన్నారు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌..ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన స్పీకర్‌ మనోహర్‌ మీడియాతో మాట్లాడారు.. కేంద్రం 16.15 కోట్ల రూపాయలను అసెంబ్లీ ఆధునీకరణకు కేటాయించిందని చెప్పారు.. ఇకపై కౌన్సిల్, అసెంబ్లీకి సంబంధించిన కార్యక్రమ వివరాలను ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తామన్నారు.ఈ ఆధునికరణకు సంవత్సరంనర కాలం పడుతుందని, దీనిపై అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, అసెంబ్లీ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. దీనితో పాటు అసెంబ్లీ వెబ్‌సైట్‌ను కూడా తెలుగులో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు..

బ్రిటన్‌కు బుల్లి యువరాజు

   బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్, ఆయన భార్య కేట్ మిడల్టన్‌లకు బాబు జన్మించాడనే వార్తతో రాజకుటుంబంతో పాటు బ్రిటన్‌ అంతట సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు రాజకుటుంబానికి అభినందనలు తెలిపారు. సోమవారం సాయంత్రం 4.24 నిమిషాలకు మగబిడ్డకు యువరాణి కేట్‌మిడిల్‌టన్‌ జన్మనిచ్చింది. ప్రిన్స్‌ డయానా తన ఇద్దరు కుమారులకు జన్మనిచ్చిన పాడింగ్టన్ లోని సెయింట్ మేరీస్ హస్పిటల్ లోనే  కేట్‌ మిడల్టన్ కూడా తన బాబుకు జన్మనిచ్చింది.   ఈ విషయాన్ని బ్రిటన్‌ ప్రదాన మంత్రి కామెరూన్‌ ట్విటర్లో వెల్లడించారు. కేట్ మిడిల్ టన్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ప్రెస్‌తో పాటు , పలువురు ప్రముఖులు ప్రజలు హస్పిటల్‌ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బ్రిటన్‌ మీడియా అక్కడి పరిస్థితులను నిరంతరం లైవ్‌ అప్‌డేట్స్‌ ఇచ్చింది.. అంతేకాదు రాయల్ బేబి పుట్టటానికి ముందే వారికి పెట్టబోయే పేర్లపై కూడా భారీ స్థాయిలో బెట్టింగ్‌ జరిగింది. రాయల్ బేబీగా వ్యవహరిస్తున్న బేబీ పేరు గురించి ప్రధానంగా రెండు పేర్లమీద బెట్టింగ్  జరిగింది. కేట్‌కు పుట్టబోయేది ఆడపిల్ల అయితే ఆ పాప పేరు ‘అలెగ్జాండ్రా’ అని మగపిల్లవాడైతే ఆ బాబు పేరు ‘జార్జ్’ అవుతుందని బెట్టింగ్‌రాయుళ్లు అంచనా వేశారు. ఇంతకీ బ్రిటన్‌ రాజవంశం ఏ నిర్ణయం తీసుకుంటుందో  చూడాలి..

ఉదయభాను కొప్పులో కమలమా

  ప్రముఖ టీవీ యాంకర్, సినీనటి ఉదయభాను త్వరలో బీజేపీలో చేరబోతోందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకు ముహూర్తం కూడా మీడియానే ఖరారు చేసేసింది. వచ్చేనెల 11న హైదరాబాద్ లో జరుగనున్న నరేంద్ర మోడీ సమావేశంలో ఆమె బీజేపీ తీర్ధం పుచ్చుకొంటారని, ఆమెకు పార్టీ టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందని, అదేవిధంగా తెరాస కూడా ఆమెకు అటువంటి ఆఫర్లతోనే గేలం వేస్తోందని అంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని, అవి తన ఒంటికి పడవని ఆమె చెప్పారు. తనకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చిన టీవీ, సినిమా రంగాలని విడిచి రాజకీయాలలో చేరే ఉద్దేశ్యం లేదని ఆమె స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ఆమె రాజకీయ ఆరంగ్రేటంపై వార్తలు మాత్రం ఆగలేదు.

అమెరికా ఉపాధ్యక్షుని భారత పర్యటన

  దాదాపు 30 ఏళ్ల తరువాత అమెరికా ఉపాద్యక్షుడు భారత పర్యటనకు వస్తున్నాడు.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా బాద్యతలు నిర్వహిస్తున్న జోసెఫ్ జో బిడెన్ నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జోబిడెన్ భారత్ పలు రంగాల్లో మరింత ఆర్ధిక సరళీకరణ విధానాలు అమలు చేసే దిశగా చర్చలు జరపనున్నారు. పర్యటనలో భాగంగా జో పలువురు రాజకీయనాయకులతో సమావేశం కానున్నారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రదాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ తోపాటు ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ లతో భేటి కానున్నారు. హెచ్ 1 బి వీసాల విషయంలో భారత్ పట్ల అమెరికా అనుసరిస్తున్నవిధానాన్ని కూడా చర్చించనున్నారు. తరువాత ముంబైలోని పలువురు రాజకీయ పరిశ్రామిక వేత్తలను కూడా కలవనున్నారు.. పర్యటనలో భాగంగా తొలి రెండు రోజులు ఢిల్లీలో పర్యటిస్తున్న బిడెన్ తరువాత రెండు రోజుల పాటు భారత ఆర్ధిక రాజధాని ముంబైలో పర్యటించనున్నారు.

మంత్రి గారబ్బాయికి మర్యాదలు

  రామ్ చరణ్.. టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ వారసుడు..చిరంజీవి వారసునిగా టాలీవుడ్లో ఈజీ విక్టరీస్ కొడుతున్న రామ్ చరణ్ పొలిటిక్స్ లో కూడా బాగానే చక్రం తిప్పుతున్నాడు.. ఇన్నాళ్లు మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీరంగంలో మంచి ఫాలోయింగ్ అందుకున్న చెర్రీ ఇప్పుడు కేంద్రమంత్రి తనయుడిగా పొలిటికల్ ఫాలోయింగ్ ను కూడా అదే రేంజ్ లో అందుకుంటున్నాడు.. గతంలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ కి హాజరైన చరణ్ కు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహా చాలా మంది రాష్ట్రమంత్రులు, కేంద్రమంత్రులు లేచి నిలబడి మరీ స్వాగతం పలికారు..ఇప్పుడు అదే తరహాలో అఖిల భారత యాదవ మహాసభకని ఆంద్రప్రదేశ్ వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పొలిటికల్ లీడర్స్ తో పాటు రామ్ చరణ్ ను కూడా పలకరించి వెళ్లారు.. దీంతో తన సినీ వారసునిగా చరణ్ నిలబెట్టిన చిరు, తన రాజకీయ వారసునిగా కూడా ఇప్పటి నుంచే చెర్రీని రెడీ చేస్తున్నట్టుగా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు.. ఏది ఏమైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇలా కేవలం ఓ మంత్రిగారబ్బాయికి మర్యాదలు చేయటం మాత్రం ఏం బాలేందటున్నారు ప్రజలు.

అయోధ్య హనుమాన్ గుడిలో కాల్పులు

      వివాదాస్పద రామ జన్మభూమి - బాబ్రీ మసీదుకు సమీపంలోని హనుమాన్ గుడి ఆలయంలో ఆదివారం కాల్పులు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మహంతులకు చెందిన రెండు ముఠాల మధ్య వివాదమే ఈ కాల్పులకు కారణంగా తెలుస్తోంది.   హనుమాన్ గుడి ఆలయానికి చెందిన మహంత్ భవనాథ్ దాస్ ఆధ్వర్యంలో ముఠాకు, మహంత్ హరిశంకర్ దాస్ నేతృత్వంలోని ముఠాకి మధ్య.. భక్తుల నుంచి స్వీకరించిన ఆస్తులు, సంపద పైన ఆధిపత్యం విషయమై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోందని తెలుస్తోంది. రెండు వైపుల నుంచి కాల్పులకు సంబంధించి లిఖిత పూర్వక ఫిర్యాదులు అందాయని, ప్రస్తుతం ఎప్ఐఆర్ నమోదు చేసే పనిలో ఉన్నామని పోలీసులు చెప్పారు.  

భారీ వర్షాలకు 12 మంది మృతి

      రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 12 మంది మృతి చెందారని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి రఘువీర సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రఘువీరా మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోందన్నారు. వర్షాల వల్ల మృతి చెందిన కుటుంబాలకు లక్షన్నర ఎక్స్‌గ్రేషియా, ఆపద్భందు పథకం కింద రూ.50 వేల నగదును ప్రకటించారు. భారీ వర్షాలకు 294 చెరువులు దెబ్బతిన్నాయన్నారు. ఇంకా 884 గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసి 53 పునరావాస కేంద్రాల్లో 8,360 మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందజేస్తామని మంత్రి ప్రకటించారు.   ఈ ఏడాది రాష్ట్రంలో 29 శాతం అధిక వర్షపాతం నమోదైందన్నారు. 13 జిల్లాలో అధిక, 8 జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, విశాఖ, అనంతపురం జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదైందని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు.    

అక్టోబర్ లో తెలంగాణ!

      కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణపై జోస్యం చెబుతున్నారు. అక్టోబర్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని ఆయన చెప్పారు. ఈసారి తెలంగాణ పక్కా అని ఆయన నొక్కి వక్కాణించారు. భాజపా, తెదేపా, తెరాస నాయకులు తెలంగాణ రాదని ప్రచారం చేయడం సరికాదన్నారు. తెరాసపై, కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూనే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని కేసీఆర్ గతంలో ప్రకటించారని, ఆ మాటకు కేసీఆర్ కట్టుబడి.. తెలంగాణ రాగానే తెరాసను కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయాలన్నారు. అయితే కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వెళ్లిన ఒక నక్షత్రకుడు ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపిస్తారోననే ఆందోళన తమకు ఉందంటూ కె.కేశవరావుపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వడానికే తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఉదయభాను బీజేపీలో చేరతారా?

      ప్రముఖ యాంకర్ ఉదయభాను బిజెపిలో చేరతారా? ఈ విషయమై ఒక టీవీ చానల్ లో విస్తారంగా ప్రచారం జరిగింది. తాను రాజకీయాల్లోకి వస్తానన్న మాట అవాస్తవమని భాను చెప్పినప్పటికీ.. ఆమె రాజకీయ అరంగేట్రం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్న భారతీయ జనతా పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఉదయభాను సొంత జిల్లా కరీంనగర్ నుంచి పోటీ చేసేందుకు ఆమెను సిద్ధం చేస్తున్నట్లు చెబుతన్నారు. ఉదయభాను తండ్రి మాజీ సర్పంచ్ కూడా కావడంతో ఆమె రాజకీయాల్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఐతే మరోవైపు ఉదయభాను పాట వల్ల చెలరేగిన వివాదం ఇంకా చల్లారినట్లు లేదు. గద్దె కోసం గాడిద కొడుకులు అని ఆమె పాడిన నేపథ్యంలో కొందరు ఆగంతుకుల నుంచి ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. తనకు రక్షణ కావాలని కూడా ఆమె పోలీసులను కోరిందట.

తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కుయుక్తులు

  దేశంపై విరుచుకుపడుతున్న ఉగ్రవాదులను, మావోయిస్టులను అడ్డుకోలేని యుపీయే ప్రభుత్వం అందుకు ఏనాడు సిగ్గుపడలేదు. కనీసం వాటికి పాల్పడిన వారిని పట్టుకోలేకపోతోంది. అందుకు కూడా అది ఏనాడు సిగ్గుపడలేదు. అయితే, దీనికంతటి మూల కారణం గుజరాత్ రాష్ట్రంలో జరిగిన గోద్రా అల్లర్లేనని, ఆ తరువాతనే ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ పుట్టిందని, ఈవిషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ దాఖలుచేసిన అభియోగపత్రం కూడా ధృవీకరించిందని, అందువల్ల ఇప్పటికయినా బీజేపీ, ఆర్.యస్.యస్. సంస్థలు తమ మతోన్మాద చర్యలను మానుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత షకీల్ అహ్మద్ గారు శలవిచ్చారు. అందుకు బీజీపీ కూడా ఘాటుగానే స్పందిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. కానీ, ఇటువంటి అంశాలను కూడా రాజకీయం చేయడం సబబేనా?   దేశరక్షణ విషయంలో కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే బాధ్యత ఉందని, మిగిలిన పార్టీలకి ఆ పార్టీ అంత దేశభక్తి లేదని, అందువల్ల మిగిలిన వారందరూ సంఘవిద్రోహక శక్తులేనన్నట్లు మాట్లాడటం అవివేకం. ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉక్కు శాఖామంత్రి బేణీ ప్రసాద్ వర్మ తన రాజకీయ ప్రత్యర్ధి అయిన ములాయం సింగ్ ఉగ్రవాదులతో, నేరస్తులతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నడని తీవ్ర ఆరోపణలు చేసారు. అంటే కాంగ్రెస్ నేతలకి ప్రత్యర్ధిగా ఉండిఉంటే వారందరూ దుష్టుల క్రింద లెక్కగట్టబడతారన్నమాట.   మరి బేణీ ప్రసాద్ అంత తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ యుపీయే ప్రభుత్వం వెంటనే ములాయం సింగ్ పై ఎందుకు విచారణకు ఆదేశించలేదు? ఎందుకంటే, అయన తమ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు ఇస్తున్న సమాజ్ వాడి పార్టీ అధినేత గనుక. అంటే, బేణీ ప్రసాద్ ఆరోపణలు నిజమని నమ్మితే, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఉగ్రవాదుల ముఠాలతో సంబంధాలు ఉన్నవ్యక్తి నుండి మద్దతు తీసుకొంటోందని భావించవలసి ఉంటుంది. మరటువంటప్పుడు కాంగ్రెస్ ని ఏమని నిందించాలి? గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ తన ప్రధాని అభ్యర్ధిగా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ, ఆయనే ప్రధాని అభ్యర్ధిగా దాదాపు ఖాయం అయిపోవడంతో బెంగ పెట్టుకొన్నకాంగ్రెస్ పార్టీ, నాటి నుండి మోడీని, బీజేపీని లక్ష్యంగా చేసుకొని యుద్ధం మొదలుపెట్టింది.   తద్వారా కాంగ్రెస్ తన తప్పులను కప్పిపుచ్చుకోగలగడమే కాకుండా, వాటి నుండి ప్రత్యర్ధుల దృష్టి మళ్ళిస్తూ వారు ఎప్పుడూ కూడా తను చేస్తున్న ఆరోపణలకు సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితిలోనే ఉండేలా చేస్తూ రాజకీయంగా పైచేయి సాధించాలని ఇటువంటి ఎత్తులు వేస్తుంటుంది. కాంగ్రెస్ తనకు ఏకైక ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీని రాజకీయంగా దెబ్బ తీయాలనే దురాలోచనతో ఇటువంటి ఎత్తులు వేస్తోంది.

బీహార్‌ బిజెపిలో ముసలం

      బీహార్‌లో బిజెపికి మరో ఎదురుదెబ్బ తగలనుంది.. నరేంద్రమోడి అభ్యర్ధిత్వంతో అలిగి పార్టీకి దూరమైన జెడియు.. బీహార్‌ బిజెపిని దెబ్బతీసే దిశగా పావులు కదుపుతుంది. ఇప్పటికే పార్టీపై అసంతృప్తిగా ఉన్న పలువురు బిజెపి ఎమ్మెల్యేలతో జెడియు టచ్‌ ఉన్నట్టుగా సమాచారం.. పార్టీ విదానాలతో పాటు, మాజీ డిప్యుటీ చీఫ్‌ మినిస్టర్‌ సుశీల్‌కుమార్‌ మోడి వైఖరితో అసంతృప్తిగా ఉన్న పలువురు బిజెపి ఎమ్మెల్యేలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జెడియూ సదరు నేతలతో సంప్రదింపులు మొదలు పెట్టింది.. అయితే ఆ ఎమ్మేల్యేల సంఖ్య ఇంకా అధికారికంగా తెలియకపోయినా దాదాపుగా ఏడుగురు ఈ లిస్ట్‌ ఉన్నారంటున్నాయి జెడియు వర్గాలు.. సుశీల్‌కుమార్‌ మోడీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ గామి పై చేసిన వ్యాఖ్యలతో మొదలైన సమస్య ఇప్పుడు  ఎమ్మెల్యేలు పార్టీని వీడిదాకా వచ్చింది.. ఇప్పటికే గామి పై వేటు వేసిన బిజేపి అధిష్టానం మిగతా నాయకులపై కూడా  చర్యలకు రెడీ అవుతుంది.