సీమంధ్ర మంత్రులు కిం కర్తవ్యం

  కాంగ్రెస్ అధిష్టానం ఒకవైపు రాష్ట్ర విభజన గురించి యోచిస్తుంటే మరోవైపు సమైక్యగానం చేస్తున్న మంత్రులందరూ ఈరోజు మినిస్టర్స్ క్వార్టర్స్ లో సమావేశమయి రాష్ట్రవిభజనను ఏవిధంగా అడ్డుకోవాలనే ఆలోచనలు చేసారు. పరిస్థితి ఇంతవరకు వచ్చిన తరువాత, ఇప్పుడు తమ రాజీనామాలు కేంద్రనిర్ణయాన్ని మార్చలేవని మంత్రి టీజీ వెంకటేష్ స్వయంగా అంగీకరించారు. అటువంటప్పుడు రాజీనామాలు చేసి అధిష్టానం ఆగ్రహానికి గురికావడం ఎందుకనే ఆలోచన కూడా వారిలో మొదలయింది. అందువల్ల రాజీనామాల ఆలోచనలు పక్కనబెట్టి ఆఖరి ప్రయత్నంగా డిల్లీ వెళ్లి రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచాలని కోరుతూ కేంద్రానికి మరోమారు విజ్ఞప్తి చేయాలని వారు నిశ్చయించుకొన్నారు.కానీ, అవసరమయితే పదవులకు రాజీనామాలు చేసేందుకు కూడా వెనకాడబోమని వారు చేపుతున్నపటికీ, అది కేవలం వృధా ప్రయాస మాత్రమేనని వారికి తెలుసు.సమావేశం అనంతరం వారు ముఖ్యమంత్రిని, పీసీసీ అధ్యక్షుడిని కలిసి సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను వారికి తెలియజేసి, అధిష్టానాన్ని రాష్ట్ర విభజన చేయకుండా ఒప్పించమని కోరినట్లు తెలుస్తోంది. అయితే, విభజన అనివార్యం అని తెలిసినప్పుడు వారు అటువంటి ప్రయత్నాలు చేయడంకంటే, తమ పార్టీకి అన్నివిధాల సహకరించి విభజన సజావుగా, సీమంధ్ర రాష్ట్ర ప్రజలకు పూర్తి న్యాయం జరిగేలా కృషిచేయడం మంచిదేమో.

కిరణ్ కుమార్ రెడ్డికి డిల్లీ నుండి మళ్ళీ పిలుపు

  బహుశః కేంద్రం తెలంగాణా ఏర్పాటు చేసేందుకు సన్నధం అవుతూ ఆ ప్రక్రియలో భాగంగా మళ్ళీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ఉపముఖ్యమంత్రి దామోదరను, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణను ఈనెల 26వ తేదీన డిల్లీకి రావలసిందిగా ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర విభజన జరుగుతున్నట్లయితే, ఇటువంటి సమయంలో సమైక్యాంధ్ర కోసం వాదిస్తున్నకిరణ్ కుమార్ ను ముఖ్యమంత్రిగా కొనసాగించడం ఎంత మాత్రం తగదని, అతని వల్ల తెలంగాణా ఏర్పాటులో సమస్యలు ఏర్పడవచ్చని, అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డిని పదవిలోంచి తొలగించి, ఈ సంధి కాలంలో ఇరుప్రాంతాలకు ఆమోదయోగ్యుడయిన మరొకరిని తాత్కాలికంగా ముఖ్యమంత్రిగా నియమించాలని, (కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న) ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ మరియు జైపాల్ రెడ్డి అధిష్టానాన్ని కోరినట్లు, (ఆయనను మొదటి నుండి వ్యతిరేకిస్తున్న) బొత్ససత్యనారాయణ కూడా వారికి తన మద్దతు తెలుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారి వాదనకు బలం చేకూరుస్తున్నట్లు సచివాలయంలో తెలంగాణకు భూములకు సంబంధించిన ఫైళ్ళను కొందరు సీమంధ్ర ఉద్యోగులు, నేతలు తగలబెట్టేస్తున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరామ్ తీవ్ర ఆరోపణలు చేసారు. ఈ నేపద్యంలో వారినిరువురినీ డిల్లీకి రమ్మని కాంగ్రెస్ ఆదేశించడంతో కిరణ్ కుమార్ రెడ్డికి ఉద్వాసన తప్పదని పుకార్లు మొదలయ్యాయి.   కానీ, ఈ నెల 28న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది గనుక, రాష్ట్ర విభజనపై అంతిమ నిర్ణయం తీసుకొనే ముందు ఆయన నుండి మరిన్నిసలహాలు, సూచనలు స్వీకరించాలనే ఉద్దేశ్యంతోనే వారిని డిల్లీకి పిలిపించి ఉండవచ్చును తప్ప, తనకు అత్యంత విధేయుడయిన కిరణ్ కుమార్ రెడ్డికి ఉద్వాసన చెప్పే అవకాశం లేదు. మరో 8నెలలో ఎన్నికలను పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం అటువంటి నిర్ణయం తీసుకోకపోవచ్చును.   అయినా రాష్ట్ర విభజన ఖచ్చితంగా జరుగుతుందా లేదా అనే విషయంపై కేవలం ఊహాగానాలే తప్ప ఇంతవరకు ఖచ్చితమయిన సమాచారం లేదు. అంటే, రాష్ట్ర విభజన చేయదలచుకోకపోతే మరింత సమయం పొందేందుకుగాను కాంగ్రెస్ అధిష్టానం ‘రెండవ యస్.ఆర్.సి.’ లేదా ‘రాయల తెలంగాణా’ వంటి ఆలోచనలు కూడా చేసే అవకాశాలున్నాయి. అదే జరిగేమాటయితే కిరణ్ కుమార్ రెడ్డిపై మరింత బాధ్యత పెరుగుతుందే తప్ప, ఆయనని తొలగించడం జరుగదు.   ఏమయినప్పటికీ, వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసి కాంగ్రెస్ తన నిర్ణయం ప్రకటించేవరకు ఈ సస్పెన్స్ సీరియల్ కొనసాగక తప్పదు. అంతవరకు ఇటువంటి ఆసక్తికరమయిన ట్విస్టులు తప్పవు మరి.

నైతికవిలువలకు తిలోదకాలు

  ఇటీవల కాలంలో వివిధ పార్టీల శాసనసభ్యులు, యంపీలు పార్టీలు మారుతున్నపటికీ తమ శాసన సభ, పార్లమెంటు సభ్యత్వాలు మాత్రం వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎవరయినా ఒక పార్టీని వద్దనుకొన్నపుడు, ఆ పార్టీ ద్వారా దక్కిన శాసనసభ, పార్లమెంటు సభ్యత్వం కూడా వదులుకొంటే హుందాగా ఉండేది. కానీ, నేడు రాజకీయ పార్టీలలో అటువంటి నైతిక విలువలు పాటించేవారు అరుదుగా కనిపిస్తుంటారు.   నిజానికి అటువంటి వారిపై సదరు పార్టీలు స్పీకర్ కు పిర్యాదు చేసిన వెంటనే విచారణ జరిపి అనర్హత వేటు వేయాలి. కానీ, కేంద్రంలో,రాష్ట్రంలో కూడా అధికారంలోఉన్న కాంగ్రెస్ పార్టీ, అటువంటి వారి మద్దతుతోనే మనుగడ సాధిస్తున్నందున వారిపై పిర్యాదు చేయకుండా వారిపై అనర్హత వేటు పడకుండా చూసుకొంటూ లోపాయికారిగా వారి మద్దతు పొందుతోంది.   ఉదాహరణకు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పితెరాసలో చేరిన కాంగ్రెస్ యంపీలు మందా జగన్నాధం, వివేక్ ఇద్దరూ కూడా ఇంత వరకు తమ పదవులను అంటిపెట్టుకొనే ఉన్నారు. నిజానికి వారు పార్టీ వీడిన వెంటనే వారిపై కూడా అనర్హత వేటు వేయాలి. కానీ ఈ కారణాలతోనే వారిపై వేటు వేయలేదు. కేంద్రం యొక్క ఆ బలహీనత కారణంగానే వారు ఒకవైపు తెరాస సభ్యులుగా, మరో వైపు కాంగ్రెస్ యంపీలుగా కొనసాగుతున్నారు. వారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళే ఆలోచనలు చేస్తున్నాట్లు సమాచారం. ఉద్యమం కోసమే తెరాసలో జేరమని చెపుతున్నవారు, తమకు పదవులు తృణప్రాయమని ఎన్ని గొప్పలు చెప్పుకొన్నపటికీ, నేటికీ వారు తమ పదవులను భద్రంగా అట్టేపెట్టుకొన్నారు. వాటిని పొందడం కోసం తాము ఎన్నికలలో చేసిన ఖర్చులను, తమ పదవులవల్ల వచ్చే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వారు ద్వంద పార్టీ విధానం అవలంబిస్తుంటే, ప్రభుత్వ మనుగడకు వారి మద్దతు ఎంతో అవసరం గనుక వారిపై వేటు వేయకుండా ప్రభుత్వం కూడా ఈ అనైతిక విధానాలకు ఆమోదం తెలుపుతోంది.   ఈవిధంగా ఒక వ్యక్తి ఏక కాలంలో రెండు పార్టీలలో సభ్యత్వం కలిగి ఉండటం అనైతికమేనని అందరికీ తెలిసినప్పటికీ, ఆ అనైతికతను కూడా నేడు ఆమోదించే స్థాయికి మన రాజకీయాలు దిగజారిపోయాయి. శాసనసభ జరిగినంత కాలం అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరినొకరు దూషించుకొంటూ, వాగ్వాదాలు చేసుకొంటూ విలువయిన సభాకాలాన్ని, అంత కంటే విలువయిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. కానీ సభ నిరవధిక వాయిదా పడినప్పుడు ప్రభుత్వం అందించే వేల రూపాయల నజరానాలు నిస్సిగ్గుగా అందుకొంటారు. పూర్తి పతనావస్థకు చేరుకొన్న మన రాజకేయాలలో నైతిక విలువలు ఆశిస్తే భంగపాటు తప్పదు.

పాఠ్యాంశంగా అల్ ఖైదా సాహిత్యం

  ఓ కవి  కాదేది కవితకనర్హం చెప్పినట్టు. మన ఇండియాలో కాదేది వివాదానికనర్హం అన్నట్టుగా తయారైంది ఇండియా పరిస్థితి.. రాజకీయాలు, సినిమాలే కాదు ఆఖరికి విద్యావ్యవస్థ కూడా వివాదాలకు వేదిక అవుతుంది.తాజాగా ఓ యూనివర్సిటి చేసిన నిర్వాకంతో మరో సారి విద్యా వ్యవస్థలో వివాదాలు తలెత్తాయి.. కాలికట్ యూనివర్శిటీలోని డిగ్రీ విద్యార్ధుల పాఠ్యాంశాల్లో అల్ ఖైదా నేత రాసిన ఓ కవితను చేర్చడం వివాదాస్పదం అయింది. నిషిద్ధ అల్ ఖైదా తీవ్రవాద సంస్థకు చెందిన ఇబ్రహీం అల్ రుబాయిష్ ఈ కవితను రాశాడు. అమెరికా లోని గ్వాంటనామో బే జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో రుబాయిష్ ఈ కవితను రాశాడు.  'ఓడ్ టు ద సీ (సముద్రానికి నివేదన)' పేరుతో రాసిన ఈ గీతం ఇప్పుడు కాలికట్ వర్శిటీ సిలబస్ లో కనిపించడంతో నిరసనలు వెల్లువెత్తాయి. తక్షణమే ఈ సాహిత్యాన్ని పాఠ్య పుస్తకాల్లోంచి తొలగించాలని పలు విద్యాసంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ కోసం వేట సాగిస్తున్న సమయంలో.. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దుల్లో అమెరికా దళాలకు పట్టుబడ్డ రుబాయిష్ కొంతకాలం పాటు గ్వాంటనామో బే జైల్లో ఉన్నాడు. తరువాత అతడిని సౌదీ అరేబియా జైలుకు తరలించారు. 2006లో అక్కడి నుంచి తప్పించుకున్న రుబాయిష్.. ప్రస్థుతం అల్ ఖైదాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

గంగుల వితండ వాదన

  ఇటీవల తెదేపాను వీడి తెరాసలో జేరిన తెదేపా కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ పై తెదేపా స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు పిర్యాదు చేయడంతో ఆయనపై అనర్హత వేటు ఎందుకువేయరాదో తెలుపమంటూ స్పీకర్ ఆయనకీ నోటీసు జారీ చేసారు. విచారణకు హాజరయిన కమలాకర్ తాను ఎటువంటి పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడలేదని, తానూ నేటికీ తెదేపా శాసన సభ్యుడిగానే కొనసాగుతున్నానని, అందువల్ల తనపై అనర్హత వేటువేయడం సమంజసం కాదని వాదించారు. స్పీకర్ ఆయన కేసుని వాయిదా వేసారు. తెదేపా టికెట్ పై శాసనసభ సభ్యుడిగా ఎంపికయిన గంగుల, తెదేపా ద్వారా తనకు దక్కిన సభ్యత్వం వదులుకోవాలనుకోవట్లేదు. కానీ ఆ పార్టీలో సభ్యుడిగా మాత్రం కొనసాగేందుకు ఇష్టపడట్లెదు. అందుకే తెరాసలోకి మారారు. మరి అటువంటప్పుడు తానూ పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడలేదని వాదించడం వితండవాదం కాక మరేమిటి?

ఫైళ్ళు తగలబెట్టేస్తున్నారు!

      సచివాలయంలో తెలంగాణకు భూములకు సంబంధించిన ఫైళ్ళు తగలబెట్టేస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరామ్ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తుందన్న భయంతో సీమాంధ్ర నేతలు తెలంగాణకు సంబంధించిన ఫైళ్ళను తగుగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.   విభజనకు రంగం సిద్ధమవుతున్న సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాలకూ లాభమేనని కోదండరాం అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే చట్టబద్ధంగా తీర్చుకోవచ్చునన్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సీమాంధ్ర నేతలు ఇప్పుడు రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. గురువారం నిర్వహించ తలపెట్టిన ధర్నాను ఆగస్టు 1కి వాయిదా వేశామని తెలిపారు. పంచాయితీ పూర్తిగా ముగిసిన తర్వాత ఫలితాల గురించి స్పందిస్తానని కోదండరాం చెప్పారు.

తెలంగాణ పై బొత్స కొత్త వ్యాఖ్య

      సీమాంధ్ర వ్యక్తిగా రాష్ట్రం యథాతథంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, అన్నదమ్ములు విడిపోతానంటే ఇంటి పెద్ద ఎలా ఆలోచిస్తాడో తమ పార్టీ అధిష్టానం ఇప్పుడు ఆలాగే ఆలోచిస్తోందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని గెలిపించినందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవాల్లో కాంగ్రెసు పార్టీయే ఎక్కువ స్థానాలను సాధించిందన్నారు. మూడు అంచెల ఎన్నికలు పూర్తయ్యేసరికి కాంగ్రెసు పార్టీయే ముందంజలో ఉంటుందన్నారు.   తెలంగాణపై... విభజన సమస్యను రాజకీయాలతో ముడిపెట్టవద్దని బొత్స అన్నారు. రాజకీయ అవసరాల కోసం విభజన అంశాన్ని లేవనెత్తడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిని ఏ ఒక్క ప్రాంతానికి ఆపాదించవద్దని కోరారు. సీమాంధ్ర వ్యక్తిగా తాను రాష్ట్రం యథాతథంగా ఉండాలని కోరుకుంటానని అయితే, అధిష్టానం నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంటానని చెప్పారు. విభజన జరిగితే అభివృద్ధి ఆగిపోతుందనేదే తన ఆందోళన అన్నారు. ఓ కుటుంబంలోని అన్నదమ్ములు విడిపోతామంటే కుటుంబ పెద్ద ఎలా ఆలోచిస్తాడో కాంగ్రెసు పార్టీ అలాగే ఆలోచిస్తోందన్నారు.  

సాక్షి తప్పుడు ప్రచారం

      కాంగ్రెస్ హయాంలో ప్రపంచంలో ఎక్కడా లేనంతగా అవినీతి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అవినీతిపై కాంగ్రెస్ నోరు విప్పడం లేదని మండిపడ్డారు. అవినీతి, అరాచకాలకు మరోపేరు వైసీపీ అని చంద్రబాబు దుయ్యబట్టారు. సాక్షి తప్ప మీడియా అంతా టీడీపీ గెలిచించదనే రాసాయని, ఒకప్పుడు అరాచకాలు, అవినీతే అనుకున్నాం. ఇప్పుడు అబద్దాలు, అసత్యాలు కూడా చెబుతోందన్నారు. వైసీపీ ఒకటిన్నర జిల్లా పార్టీని అని బాబు ఎద్దేవా చేశారు. దొంగ బంగారం అమ్మారని ఆరోపణ వచ్చిన సిద్ధార్థరెడ్డిని సస్పెండ్ చేసిన వైసీపీ జగన్ విషయంలో ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ డీఎన్ఏ ఉన్న పార్టీ వైసీపీ అని బాబు తెలిపారు. టీఆర్ఎస్, వైసీపీ విలీనం అవుతాయనే ఉద్దేశ్యంతో ఆ పార్టీలకు వచ్చిన స్థానాలను కూడా కలుపుకుని తమకే అధిక మెజార్టీ వచ్చిందని బొత్స చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని కాంగ్రెస్ భ్రమపడింది. వరదల వల్ల నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాలని బాబు కోరారు. ప్రజలే తీర్పు ఇచ్చిన తర్వాత సర్వేలు ఏవిధంగా ప్రామాణికం అవుతాయని ప్రశ్నించారు.నూటికి వెయ్యి శాతం అధికారంలోకి వస్తున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఆఫర్ ని బీజేపీ అందుకోగలదా

  కర్ణుడి చావుకి వేయి శాపాలు, వేయి కారణాలు అన్నట్లు, మోడీకి కూడా బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా పేరు ఖాయం చేసుకోవడానికి అన్నిఅవాంతరాలు, అభ్యంతరాలు, విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే, ఆ అవకాశం ఇతరులకు ఎందుకు ఈయడమని బీజేపీ నేతలే ఆపని స్వయంగా చక్కబెడుతున్నారు. ప్రస్తుతం బీజీపీని ఎన్నికలలో గెలిపించగలమని భరోసా ఇచ్చే నాయకుడు ఆ పార్టీలో ఒక్కడు కూడా లేకపోయినప్పటికీ, అందుకు సిద్దపడిన మోడీని అందరూ కలిసి క్రిందకి లాగుతున్నారు. మోడీ విషయంలో బీజేపీ రెండుగా చీలిపోయి కొట్టుకొంటుంటే, ఒడ్డున కూర్చొన్న కాంగ్రెస్, జేడీ (యు) వంటి పార్టీలన్నీఅవకాశం దక్కినప్పుడల్లా యధాశక్తిన మోడీపై నాలుగు రాళ్ళు వేస్తున్నాయి.   మరో ఐదు నెలల్లో మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ‘జన్ ఆశీర్వాద్ యాత్ర’ పేరుతో ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పార్టీ సీనియర్ నేతలయిన అద్వానీ, వాజ్‌పేయి, మురళిమనోహర్ జోషీ, సుష్మ స్వరాజ్ ఫొటోలతో కూడిన బ్యానర్లు, గోడ పత్రికలు ఏర్పాటు చేశారు. కానీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న నరేంద్రమోడీ ఫొటో మాత్రం ఎక్కడా కనపడలేదు. ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఉన్న మోడీని ఆ సభకు ఆహ్వానించలేదు. ఇదే విషయం గురించి మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే, “ఇది రాష్ట్రానికి సంబందించిన కార్యక్రమం,” అని క్లుప్తంగా జవాబిచ్చారు. “మోడీని ఆహ్వానించారా?” అంటే జాతీయ నేతలందరికీ ఆహ్వానాలు పంపామని చెప్పడం చూస్తే మోడీ పట్ల ఆయన అభిప్రాయం ఏమిటో అర్ధం అవుతుంది. శివరాజ్‌సింగ్ చౌహాన్ అద్వానీ అనుచరుడిగా అందరికీ సుపరిచితుడు. అందువల్ల అతను కూడా మోడీని వ్యతిరేఖించడంలో ఆశ్చర్యం లేదు.   పార్టీలో ఇటువంటి రాజకీయాలు కొనసాగడం వలన, బీజేపీ పట్ల ప్రజలలో అపనమ్మకం కలగడం సహజం. కాంగ్రెస్ తన ఐదేళ్ళ పాలనలో అన్నిరంగాలలో తీవ్ర వైఫల్యాలు చవిచూస్తూ, అనేక కుంభకోణాలలో చిక్కుకొని అవినీతి మరకలు అంటించుకొని అత్యంత బలహీన పరిస్థితిలో ఉన్న ఈ తరుణంలో, దానికి ఏకైక ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీ ఈవిధమయిన అంతః కలహాలతో కాంగ్రెస్ అందిస్తున్న ఒక సువర్ణావకాశాన్నిదూరం చేసుకోబోతున్నట్లు కనబడుతోంది.

నందమూరి బాలకృష్ణ ఇంట్లో పెళ్ళి సందడి!

      నందమూరి అభిమానులకు శుభవార్త. టాలీవుడ్ ప్రముఖ నటుడు, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ ఇంట్లో పెళ్ళి సందడి మొదలు కాబోతుంది. బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని నిశ్చితార్ధం ఆగస్ట్ లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గీతం విద్యా సంస్థల అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎమ్.పి ఎమ్.వి.వి.ఎస్.మూర్తి మనుమడు శ్రీభరత్ తో తేజస్వినికి వివాహం జరగనున్నట్లు కథనాలు వస్తున్నాయి. తేజస్విని హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతోంది. మూర్తి మనవడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే దీనికి సంబంధించి బాలయ్య కుటుంబం నుంచి కాని మూర్తి ఫ్యామిలీ నుంచి గాని ఎలాంటి స్టేట్ మెంట్ రాలేదు.

కిరణ్, బొత్స, దామోదరలకు పిలుపు

      ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై నిర్ణయం తీసుకొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కాంగ్రెస్ అదిష్టానం నుంచి పిలుపు వచ్చి౦దని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 26న ఢిల్లీకి రావల్సిందిగా అదిష్టానం కోరిందని సమాచారం. ఈ నెల 28న సీడబ్ల్యూలో తెలంగాణ పై చర్చిస్తారనే నేపధ్యంలో వీరికి ఢిల్లీ నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సత్కరించుకుంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. అయితే సీమాంధ్ర మంత్రులు దీనిపై మళ్లీ సమావేశమై అధిష్టానానికి హెచ్చరిక ఇచ్చి రావాలని భావిస్తున్నట్లు సమాచారం.

పంచాయతీలో వైకాపాకి షాక్

      పంచాయతీ మొదట విడత ఎన్నికల్లో అధిక స్థానాలు మావేనంటూ వైకాపా నేతలు చేసిన ప్రకటనలు ఫలించలేదు. ఆ పార్టీకి కంచుకోటగా భావిస్తున్న రాయలసీమలోనూ వైఎస్ఆర్. కాంగ్రెస్ ఎక్కువగా ప్రభావం చూపలేకపోయింది. కడపలో తప్ప మిగిలిన మూడు చోట్ల వైకాపా వెనకబడింది. చిత్తూరు, అనంతపురం,కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్, టిడిపిల కంటే వెనకబడింది.   తెలంగాణాలో అయితే వైకాపా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలో ప్రభావం లేకపోయింది. మహాబూబ్ నగర్ లో మాత్రం ఆలంపూర్, గద్వాల్ వంటి నియోజకవర్గాలలో స్థానిక నాయకత్వ ప్రభావ౦తో 80కి పైగా స్థానాలను కైవసం చేసుకుంది. తర్వాత జరిగే రెండు విడతల్లో దాదాపు పార్టీ ప్రభావం కనిపించని పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఆంధ్రాలోనూ తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో కొద్దిపాటి ఆధిక్యాన్ని కనబరిచిన మిగిలిన చోట్ల ఆ స్థాయి ప్రభావాన్ని చూపలేకపోయింది. అయితే తర్వాత జరిగే  రెండు విడతల ఎన్నికల్లో ఈ మాత్రం పలితాలు రాబట్టడం పార్టీకి కష్టమేనని అంటున్నారు.

ముగిసిన తొలి సం’గ్రామం’

  తొలిదశ సంగ్రామం ముగిసింది.. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష టిడిపి, వైయస్ఆర్ కాంగ్రెస్, టిఆర్ ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకం తీసుకున్న పంచాయితీ సమరంలో టిడిపినే గెలిచింది. భారీ వర్షాలు కురుస్తున్నా ప్రజలు మాత్రం పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 82.31 శాతం పోలింగ్ నమోదయింది. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా 90 శాతం... అన్నింటికంటే తక్కువగా ఆదిలాబాద్లో 60 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం వరకు పోలింగ్ కొనసాగగా తరువాత కౌంటిగ్ మొదలైంది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగక పోయినా ఆ పార్టీలకు మద్దతు పలికే అభ్యర్ధుల గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్ధులు కూడా పార్టీ జెండాలతోనే ప్రచారం నిర్వహించారు.. ఒక్క ఎన్నికల సంఘం తప్ప మిగతా అంతా ఇవి పార్టీ పరంగా జరుగుతున్న ఎన్నికల గానే భావించారు..అందుకు అనుగుణంగా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేఖత స్పష్టంగా కనిపించింది.. పాలక పక్షంపై ఉన్న అసంతృప్తితో వైసిపి, టిఆర్ఎస్ల వైపు జనం వెళతారన్న ఆ పార్టీల ఆశలపై కూడా జనం నీళ్లు చల్లారు.. సీమాంద్రతో పాటు తెలంగాణలోనూ ప్రదాన పార్టీ కాంగ్రెస్ టిడిపిల మధ్యే సాగింది.. మెజారిటీ స్థానాల్లో టిడిపి ముందుగగా కాంగ్రెస్ రెండో స్ధానంలో నిలిచింది.. టిఆర్ ఎస్, వైసిపిలు మూడు నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నాయి. తొలి విడత జరిగిన పంచాయితీల్లో 1650కి పైగా సర్పంచ్ స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు విజయబావుటా ఎగురవేయగా. 1520 గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. దాదాపు 1200 సర్పంచ్‌ స్థానాల్లో నెగ్గిన వైసీపీ మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ పంచాయతీలో టీఆర్ఎస్ 430 స్థానాలు దక్కించుకుంది.

వైకాపాలో మరో మాయగాడు అరెస్ట్

  కొన్నినెలల క్రితం తెదేపాను తన ఫ్లెక్సీ బ్యానర్ వ్యూహంతో ముప్పతిప్పలు పెట్టిన వైకాపాకు ఇటీవల కాలంలో కొత్త రకం సమస్యలు ఎదురవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం రాజమండ్రిలో బ్యాంక్ ఏ.టీ.యం.ను దోచుకొని ఒక హత్యకు కూడా పాల్పడిన వ్యక్తి వైకాపాలో చేరడం ఆ తరువాత అతనిని పోలీసులు అరెస్ట్ చేయడం, వెంటనే అతనిని పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది. అది జరిగిన కొద్ది రోజులకే వైజాగ్ కు చెందిన ఒక మహిళ పార్టీలో చేరడం, ఆమెను కూడా పోలీసులు దొంగనోట్ల చలామణీ చేస్తుండగా పట్టుకోవడం, మళ్ళీ ఆమెను కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ అటువంటిదే మరో సంఘటన జరిగింది.   నిజామాబాద్ జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇంఛార్జ్ సిద్దార్దరెడ్డిని ప్రజలకు నకిలీ బంగారం అంటగడుతూ మోసం చేస్తున్న నేరానికి ఈ రోజు (మంగళవారం) పోలీసులు అరెస్ట్ చేసారు. అతను ఆల్వాల్ ప్రాంతంలో ప్రజలకు తక్కువ ధరకే బంగారం విక్రయిస్తున్నట్లు తేలింది. విచారిస్తే అది నకిలీ బంగారమని తేలింది. అతను 1995లో వేరే ఊరులో ఒక చిట్ ఫండ్ కంపెనీ పెట్టి, పాంచజన్య రికరింగ్ డిపాజిట్ పథకం పేరిట ప్రజల నుండి డబ్బు దండుకొని మాయమయిపోయాడు. మళ్ళీ చాలారోజుల తరువాత ఇప్పుడు వైకాపాలో జేరి కొత్త జీవితం మొదలుపెట్టినప్పటికీ, తన పాత అలవాటులు వదులుకోలేక పోవడంతో ఈసారి పోలీసుల చేత చిక్కాడు.   పార్టీ ఇంఛార్జ్ స్థాయిలో ఉన్నవ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఇది చాలా అవమానకర సంఘటనగా మిగిలింది. అతనిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వైకాపా ప్రకటించింది. ఇకనయినా అన్ని పార్టీలు కూడా పార్టీలో చేరేవారి పూర్తి వివరాలు తెలుసుకొన్న తరువాతనే సభ్యత్వం ఈయడం మంచిది.

మోడిని అమెరికా రానివ్వకండి

దేశ వ్యాప్తంగా మోడీ హవా బలపడుతున్న నేపథ్యంలో  ప్రత్యర్థి పార్టీలు ఆయనను ఎదుర్కోవటానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు.. ఇప్పటికే మోడిపై గుజరాత్ అల్లర్లు లాంటి విషయాలతో విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న పార్టీలు ఇప్పుడు మరో ఎత్తు వేశాయి. గుజరాత్ అల్లర్ల తరువాత హిందుత్వ వాదిగా ముద్రపడ్డ మోడిపై అమెరికా నిషేదం విదించింది.. ఆయన అమెరికా అనుమతించకుండా విసా నిరాకరించింది.. అయితే ఇటీవల గుజరాత్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రన్ని అభివ్రుద్ది పథంలో నడిపిస్తుండటంతో అమెరికా ఆయనపై కొనసాగుతున్ననిషేదం పై పునరాలోచనలో పడింది. దీంతో ఇప్పుడు మోడీని అమెరికాకు అనుమతించొద్దు అంటూ పత్యర్ధి పార్టీల ఎంపిలు అమెరికా అధ్యక్ష్యుడు బరాక్ ఒబామాకు లేఖ రాశారు.. 25 మంది రాజ్యసభ, 40 మంది లొక్ సభ ఎంపిల సంతకాలతో ఈ లేఖను ఒబామాకు పంపించారు..మొదట రాజ్యసభ స్వతంత్ర అభ్యర్ది మొహమద్ అదిబ్ లేఖ రాయగా దానికి పలువురు కాంగ్రెస్, సిపిఐ, సిపియం సభ్యలు మధ్దతు పలికారు..

పంచాయితీల్లో సత్తా చాటిన టిడిపి

రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడత పోలింగ్ లో 26 రెవెన్యూ డివిజన్లలో 5803 గ్రామ పంచాయితీల్లో పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం దాదాపు అన్ని జిల్లాలోనూ టిడిపి ముందంజలో ఉండగా, కాంగ్రెస్ వైసిపిలు రెండు మూడు స్థానాలతో సరిపెట్టుకున్నాయి.   ప్రస్థుతం జరుగుతున్న పంచాయితీ ఎన్నికల ఫలితాల ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో ప్రత్యక్షంగా కనిపించింది. ఈ పంచాయితీ ఎలక్షన్స్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కింది స్ధాయిలో ఏమాత్రం కేడర్ లేకపోవటంతో వైసిపి దాదాపు అన్ని చోట్లా మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. మరి కొన్ని గంటల్లో పంచాయితీ ఎన్నికల తొలిదశ పోలింగ్ పూర్తి ఫలితాలు వెలుడనుండగా ఈ ఫలితాలు రెండు మూడో దశలలో జరిగే పోలింగ్ పై కూడా ప్రభావం చూపిస్తాయంటున్నారు విశ్లేషకులు.

తాజ్ కన్నా ముందున్న తిరుపతి

  దేశంలోనే అత్యధిక మంది టూరిస్ట్ లను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ చరిత్ర స్రుష్టించింది.. మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలను వెనుకకు నెట్టి ఆంద్రప్రదేశ్ ఈ రికార్డును స్రుష్టించింది.గత సంవత్సరంలో దాదాపు 206.8 మిలియన్ల టూరిస్ట్ లు ఆంద్రప్రదేశ్ ను సందర్శించారు..అయితే ఆంద్రప్రదేశ్ ను సందర్శించిన వారిలో అధికంగా తిరుపతిని సందర్శించటానికే వచ్చారు.   ఆంద్రప్రదేశ్ తరువాత 184.1 మిలియన్ టూరిస్ట్ లతో తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉండగా,168.4 మిలియన్ టూరిస్ట్ లతో ఉత్తర ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. అయితే అత్యధిక మంది టూరిస్ట్ లను ఆకర్షించిన మూడు ప్లేస్ లు ఆధ్యాత్మిక కేంద్రాలే కావటం విశేషం..   టూరిజం మినిస్టరీ హైయర్ అఫీషియల్స్ చెప్పిన లెక్కల ప్రకారం తాజ్ మహల్, ఎల్లోరా కేవ్స్ లాంటి పర్యాటక ప్రదేశాల కన్నా ఎక్కువ మంది టూరిస్ట్ లు ఆధ్యాత్మిక దామాలను చూడటానికి ఇష్టపడుతున్నారట.. విదేశి టూరిస్ట్ లు కూడా ఎక్కువగా ఇంలాటి స్ధలాలను చూడటానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.. ప్రతి ఏటా ఆరు శాతానికి పైగా విదేశి టూరిస్ట్ ల సంఖ్య పెరుగుతుందని అంచనా..

తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ విలీనం

      తెలంగాణ సాధన కోసమని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరిన ఎంపీ వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు ఇబ్బంది కలిగే ప్రకటన చేశారు. తెలంగాణ ఇస్తే తిరిగి కాంగ్రెస్ లో చేరతారా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానమివ్వకుండా తెలంగాణ ఇస్తే తెరాసే కాంగ్రెస్ లో విలీనమవుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరినప్పటికీ వివేక్ ఆ పార్టీ వ్యవహారాల్లో పాల్గొనడం లేదు. ఆయనతో పాటు తెరాసలో చేరిన కేకే మాత్రం పార్టీలో చురుగ్గా ఉన్నారు. విభజన జరిగితే నక్సలిజం పెరుగుతుందంటూ సీఎం ఇచ్చిన నివేదికపై వివేక్ మండి పడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఆయనపై నక్సల్స్ దాడి జరిగింది సీమాంధ్రలోనే అన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రుల ఆస్తులపై ఎలాంటి దాడులు జరగడం లేదన్నారు. తెలంగాణపై ఎలాంటి ప్యాకేజీలకు తాము ఒప్పుకునేది లేదన్నారు. రాష్ట్రం తప్ప ఎవరూ ప్యాకేజీలు కోరుకోవడం లేదన్నారు. ఆంధ్రా ప్రాంతంలోనే నక్సలిజం మొదలైందని తాను హోం మంత్రి షిండేకు చెప్పానన్నారు. నీరు, విద్యుత్ తదితర సమస్యలపై చట్టపరంగా వ్యవహరించవచ్చన్నారు.