బ్రిటన్‌కు బుల్లి యువరాజు

   బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్, ఆయన భార్య కేట్ మిడల్టన్‌లకు బాబు జన్మించాడనే వార్తతో రాజకుటుంబంతో పాటు బ్రిటన్‌ అంతట సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు రాజకుటుంబానికి అభినందనలు తెలిపారు. సోమవారం సాయంత్రం 4.24 నిమిషాలకు మగబిడ్డకు యువరాణి కేట్‌మిడిల్‌టన్‌ జన్మనిచ్చింది. ప్రిన్స్‌ డయానా తన ఇద్దరు కుమారులకు జన్మనిచ్చిన పాడింగ్టన్ లోని సెయింట్ మేరీస్ హస్పిటల్ లోనే  కేట్‌ మిడల్టన్ కూడా తన బాబుకు జన్మనిచ్చింది.   ఈ విషయాన్ని బ్రిటన్‌ ప్రదాన మంత్రి కామెరూన్‌ ట్విటర్లో వెల్లడించారు. కేట్ మిడిల్ టన్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ప్రెస్‌తో పాటు , పలువురు ప్రముఖులు ప్రజలు హస్పిటల్‌ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బ్రిటన్‌ మీడియా అక్కడి పరిస్థితులను నిరంతరం లైవ్‌ అప్‌డేట్స్‌ ఇచ్చింది.. అంతేకాదు రాయల్ బేబి పుట్టటానికి ముందే వారికి పెట్టబోయే పేర్లపై కూడా భారీ స్థాయిలో బెట్టింగ్‌ జరిగింది. రాయల్ బేబీగా వ్యవహరిస్తున్న బేబీ పేరు గురించి ప్రధానంగా రెండు పేర్లమీద బెట్టింగ్  జరిగింది. కేట్‌కు పుట్టబోయేది ఆడపిల్ల అయితే ఆ పాప పేరు ‘అలెగ్జాండ్రా’ అని మగపిల్లవాడైతే ఆ బాబు పేరు ‘జార్జ్’ అవుతుందని బెట్టింగ్‌రాయుళ్లు అంచనా వేశారు. ఇంతకీ బ్రిటన్‌ రాజవంశం ఏ నిర్ణయం తీసుకుంటుందో  చూడాలి..

ఉదయభాను కొప్పులో కమలమా

  ప్రముఖ టీవీ యాంకర్, సినీనటి ఉదయభాను త్వరలో బీజేపీలో చేరబోతోందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకు ముహూర్తం కూడా మీడియానే ఖరారు చేసేసింది. వచ్చేనెల 11న హైదరాబాద్ లో జరుగనున్న నరేంద్ర మోడీ సమావేశంలో ఆమె బీజేపీ తీర్ధం పుచ్చుకొంటారని, ఆమెకు పార్టీ టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందని, అదేవిధంగా తెరాస కూడా ఆమెకు అటువంటి ఆఫర్లతోనే గేలం వేస్తోందని అంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని, అవి తన ఒంటికి పడవని ఆమె చెప్పారు. తనకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చిన టీవీ, సినిమా రంగాలని విడిచి రాజకీయాలలో చేరే ఉద్దేశ్యం లేదని ఆమె స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ఆమె రాజకీయ ఆరంగ్రేటంపై వార్తలు మాత్రం ఆగలేదు.

అమెరికా ఉపాధ్యక్షుని భారత పర్యటన

  దాదాపు 30 ఏళ్ల తరువాత అమెరికా ఉపాద్యక్షుడు భారత పర్యటనకు వస్తున్నాడు.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా బాద్యతలు నిర్వహిస్తున్న జోసెఫ్ జో బిడెన్ నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జోబిడెన్ భారత్ పలు రంగాల్లో మరింత ఆర్ధిక సరళీకరణ విధానాలు అమలు చేసే దిశగా చర్చలు జరపనున్నారు. పర్యటనలో భాగంగా జో పలువురు రాజకీయనాయకులతో సమావేశం కానున్నారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రదాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ తోపాటు ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ లతో భేటి కానున్నారు. హెచ్ 1 బి వీసాల విషయంలో భారత్ పట్ల అమెరికా అనుసరిస్తున్నవిధానాన్ని కూడా చర్చించనున్నారు. తరువాత ముంబైలోని పలువురు రాజకీయ పరిశ్రామిక వేత్తలను కూడా కలవనున్నారు.. పర్యటనలో భాగంగా తొలి రెండు రోజులు ఢిల్లీలో పర్యటిస్తున్న బిడెన్ తరువాత రెండు రోజుల పాటు భారత ఆర్ధిక రాజధాని ముంబైలో పర్యటించనున్నారు.

మంత్రి గారబ్బాయికి మర్యాదలు

  రామ్ చరణ్.. టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ వారసుడు..చిరంజీవి వారసునిగా టాలీవుడ్లో ఈజీ విక్టరీస్ కొడుతున్న రామ్ చరణ్ పొలిటిక్స్ లో కూడా బాగానే చక్రం తిప్పుతున్నాడు.. ఇన్నాళ్లు మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీరంగంలో మంచి ఫాలోయింగ్ అందుకున్న చెర్రీ ఇప్పుడు కేంద్రమంత్రి తనయుడిగా పొలిటికల్ ఫాలోయింగ్ ను కూడా అదే రేంజ్ లో అందుకుంటున్నాడు.. గతంలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ కి హాజరైన చరణ్ కు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహా చాలా మంది రాష్ట్రమంత్రులు, కేంద్రమంత్రులు లేచి నిలబడి మరీ స్వాగతం పలికారు..ఇప్పుడు అదే తరహాలో అఖిల భారత యాదవ మహాసభకని ఆంద్రప్రదేశ్ వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పొలిటికల్ లీడర్స్ తో పాటు రామ్ చరణ్ ను కూడా పలకరించి వెళ్లారు.. దీంతో తన సినీ వారసునిగా చరణ్ నిలబెట్టిన చిరు, తన రాజకీయ వారసునిగా కూడా ఇప్పటి నుంచే చెర్రీని రెడీ చేస్తున్నట్టుగా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు.. ఏది ఏమైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇలా కేవలం ఓ మంత్రిగారబ్బాయికి మర్యాదలు చేయటం మాత్రం ఏం బాలేందటున్నారు ప్రజలు.

అయోధ్య హనుమాన్ గుడిలో కాల్పులు

      వివాదాస్పద రామ జన్మభూమి - బాబ్రీ మసీదుకు సమీపంలోని హనుమాన్ గుడి ఆలయంలో ఆదివారం కాల్పులు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మహంతులకు చెందిన రెండు ముఠాల మధ్య వివాదమే ఈ కాల్పులకు కారణంగా తెలుస్తోంది.   హనుమాన్ గుడి ఆలయానికి చెందిన మహంత్ భవనాథ్ దాస్ ఆధ్వర్యంలో ముఠాకు, మహంత్ హరిశంకర్ దాస్ నేతృత్వంలోని ముఠాకి మధ్య.. భక్తుల నుంచి స్వీకరించిన ఆస్తులు, సంపద పైన ఆధిపత్యం విషయమై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోందని తెలుస్తోంది. రెండు వైపుల నుంచి కాల్పులకు సంబంధించి లిఖిత పూర్వక ఫిర్యాదులు అందాయని, ప్రస్తుతం ఎప్ఐఆర్ నమోదు చేసే పనిలో ఉన్నామని పోలీసులు చెప్పారు.  

భారీ వర్షాలకు 12 మంది మృతి

      రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 12 మంది మృతి చెందారని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి రఘువీర సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రఘువీరా మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోందన్నారు. వర్షాల వల్ల మృతి చెందిన కుటుంబాలకు లక్షన్నర ఎక్స్‌గ్రేషియా, ఆపద్భందు పథకం కింద రూ.50 వేల నగదును ప్రకటించారు. భారీ వర్షాలకు 294 చెరువులు దెబ్బతిన్నాయన్నారు. ఇంకా 884 గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసి 53 పునరావాస కేంద్రాల్లో 8,360 మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందజేస్తామని మంత్రి ప్రకటించారు.   ఈ ఏడాది రాష్ట్రంలో 29 శాతం అధిక వర్షపాతం నమోదైందన్నారు. 13 జిల్లాలో అధిక, 8 జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, విశాఖ, అనంతపురం జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదైందని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు.    

అక్టోబర్ లో తెలంగాణ!

      కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణపై జోస్యం చెబుతున్నారు. అక్టోబర్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని ఆయన చెప్పారు. ఈసారి తెలంగాణ పక్కా అని ఆయన నొక్కి వక్కాణించారు. భాజపా, తెదేపా, తెరాస నాయకులు తెలంగాణ రాదని ప్రచారం చేయడం సరికాదన్నారు. తెరాసపై, కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూనే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని కేసీఆర్ గతంలో ప్రకటించారని, ఆ మాటకు కేసీఆర్ కట్టుబడి.. తెలంగాణ రాగానే తెరాసను కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయాలన్నారు. అయితే కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వెళ్లిన ఒక నక్షత్రకుడు ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపిస్తారోననే ఆందోళన తమకు ఉందంటూ కె.కేశవరావుపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వడానికే తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఉదయభాను బీజేపీలో చేరతారా?

      ప్రముఖ యాంకర్ ఉదయభాను బిజెపిలో చేరతారా? ఈ విషయమై ఒక టీవీ చానల్ లో విస్తారంగా ప్రచారం జరిగింది. తాను రాజకీయాల్లోకి వస్తానన్న మాట అవాస్తవమని భాను చెప్పినప్పటికీ.. ఆమె రాజకీయ అరంగేట్రం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్న భారతీయ జనతా పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఉదయభాను సొంత జిల్లా కరీంనగర్ నుంచి పోటీ చేసేందుకు ఆమెను సిద్ధం చేస్తున్నట్లు చెబుతన్నారు. ఉదయభాను తండ్రి మాజీ సర్పంచ్ కూడా కావడంతో ఆమె రాజకీయాల్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఐతే మరోవైపు ఉదయభాను పాట వల్ల చెలరేగిన వివాదం ఇంకా చల్లారినట్లు లేదు. గద్దె కోసం గాడిద కొడుకులు అని ఆమె పాడిన నేపథ్యంలో కొందరు ఆగంతుకుల నుంచి ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. తనకు రక్షణ కావాలని కూడా ఆమె పోలీసులను కోరిందట.

తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కుయుక్తులు

  దేశంపై విరుచుకుపడుతున్న ఉగ్రవాదులను, మావోయిస్టులను అడ్డుకోలేని యుపీయే ప్రభుత్వం అందుకు ఏనాడు సిగ్గుపడలేదు. కనీసం వాటికి పాల్పడిన వారిని పట్టుకోలేకపోతోంది. అందుకు కూడా అది ఏనాడు సిగ్గుపడలేదు. అయితే, దీనికంతటి మూల కారణం గుజరాత్ రాష్ట్రంలో జరిగిన గోద్రా అల్లర్లేనని, ఆ తరువాతనే ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ పుట్టిందని, ఈవిషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ దాఖలుచేసిన అభియోగపత్రం కూడా ధృవీకరించిందని, అందువల్ల ఇప్పటికయినా బీజేపీ, ఆర్.యస్.యస్. సంస్థలు తమ మతోన్మాద చర్యలను మానుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత షకీల్ అహ్మద్ గారు శలవిచ్చారు. అందుకు బీజీపీ కూడా ఘాటుగానే స్పందిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. కానీ, ఇటువంటి అంశాలను కూడా రాజకీయం చేయడం సబబేనా?   దేశరక్షణ విషయంలో కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే బాధ్యత ఉందని, మిగిలిన పార్టీలకి ఆ పార్టీ అంత దేశభక్తి లేదని, అందువల్ల మిగిలిన వారందరూ సంఘవిద్రోహక శక్తులేనన్నట్లు మాట్లాడటం అవివేకం. ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉక్కు శాఖామంత్రి బేణీ ప్రసాద్ వర్మ తన రాజకీయ ప్రత్యర్ధి అయిన ములాయం సింగ్ ఉగ్రవాదులతో, నేరస్తులతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నడని తీవ్ర ఆరోపణలు చేసారు. అంటే కాంగ్రెస్ నేతలకి ప్రత్యర్ధిగా ఉండిఉంటే వారందరూ దుష్టుల క్రింద లెక్కగట్టబడతారన్నమాట.   మరి బేణీ ప్రసాద్ అంత తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ యుపీయే ప్రభుత్వం వెంటనే ములాయం సింగ్ పై ఎందుకు విచారణకు ఆదేశించలేదు? ఎందుకంటే, అయన తమ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు ఇస్తున్న సమాజ్ వాడి పార్టీ అధినేత గనుక. అంటే, బేణీ ప్రసాద్ ఆరోపణలు నిజమని నమ్మితే, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఉగ్రవాదుల ముఠాలతో సంబంధాలు ఉన్నవ్యక్తి నుండి మద్దతు తీసుకొంటోందని భావించవలసి ఉంటుంది. మరటువంటప్పుడు కాంగ్రెస్ ని ఏమని నిందించాలి? గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ తన ప్రధాని అభ్యర్ధిగా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ, ఆయనే ప్రధాని అభ్యర్ధిగా దాదాపు ఖాయం అయిపోవడంతో బెంగ పెట్టుకొన్నకాంగ్రెస్ పార్టీ, నాటి నుండి మోడీని, బీజేపీని లక్ష్యంగా చేసుకొని యుద్ధం మొదలుపెట్టింది.   తద్వారా కాంగ్రెస్ తన తప్పులను కప్పిపుచ్చుకోగలగడమే కాకుండా, వాటి నుండి ప్రత్యర్ధుల దృష్టి మళ్ళిస్తూ వారు ఎప్పుడూ కూడా తను చేస్తున్న ఆరోపణలకు సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితిలోనే ఉండేలా చేస్తూ రాజకీయంగా పైచేయి సాధించాలని ఇటువంటి ఎత్తులు వేస్తుంటుంది. కాంగ్రెస్ తనకు ఏకైక ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీని రాజకీయంగా దెబ్బ తీయాలనే దురాలోచనతో ఇటువంటి ఎత్తులు వేస్తోంది.

బీహార్‌ బిజెపిలో ముసలం

      బీహార్‌లో బిజెపికి మరో ఎదురుదెబ్బ తగలనుంది.. నరేంద్రమోడి అభ్యర్ధిత్వంతో అలిగి పార్టీకి దూరమైన జెడియు.. బీహార్‌ బిజెపిని దెబ్బతీసే దిశగా పావులు కదుపుతుంది. ఇప్పటికే పార్టీపై అసంతృప్తిగా ఉన్న పలువురు బిజెపి ఎమ్మెల్యేలతో జెడియు టచ్‌ ఉన్నట్టుగా సమాచారం.. పార్టీ విదానాలతో పాటు, మాజీ డిప్యుటీ చీఫ్‌ మినిస్టర్‌ సుశీల్‌కుమార్‌ మోడి వైఖరితో అసంతృప్తిగా ఉన్న పలువురు బిజెపి ఎమ్మెల్యేలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జెడియూ సదరు నేతలతో సంప్రదింపులు మొదలు పెట్టింది.. అయితే ఆ ఎమ్మేల్యేల సంఖ్య ఇంకా అధికారికంగా తెలియకపోయినా దాదాపుగా ఏడుగురు ఈ లిస్ట్‌ ఉన్నారంటున్నాయి జెడియు వర్గాలు.. సుశీల్‌కుమార్‌ మోడీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ గామి పై చేసిన వ్యాఖ్యలతో మొదలైన సమస్య ఇప్పుడు  ఎమ్మెల్యేలు పార్టీని వీడిదాకా వచ్చింది.. ఇప్పటికే గామి పై వేటు వేసిన బిజేపి అధిష్టానం మిగతా నాయకులపై కూడా  చర్యలకు రెడీ అవుతుంది.

అబ్బే అలా అనలేదు

      మోడి ప్రదానమంత్రి అభ్యర్థిత్వానికి ఒక్కటొక్కటిగా అడ్డంకులు తొలగుతున్నాయి.. గతంలో మోడి ప్రదాని అభ్యర్థిగా ప్రకటించినపుడు శివసేన వ్యతిరేఖించిందని వచ్చిన వార్తలను ఆ పార్టీ ఛీఫ్‌ ఉద్దవ్‌ థాక్రే ఖండిచారు.. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిదని తాను అలా అనలేదన్నారు..   అంతేకాదు బీజేపి ప్రచార కమిటీ అధ్యక్షుడిగా మోడిని నియమించినపుడు తాము ఆహ్వానించామని.. శుభాకాంక్షలు కూడా తెలియజేశామన్నారు థాక్రే.. ప్రస్థుతం దేశానికి సమర్ధుడైన నాయకుడు అవసరం అని అధికార కాంగ్రెస్‌లో అలాంటి నాయకులే లేరని ఎద్దేవ చేశారు.. ఇప్పటి వరకు బిజేపి ప్రదాని అభ్యర్థిని ప్రకటించలేదని మోడి అభ్యర్థిత్వం కేవలం మీడియా సృష్టే అన్న థాక్రే.. ఎన్‌డిఎ తమ అభ్యర్థిని ప్రకటించాకే తన పార్టీ వైఖరిని ప్రకటిస్తామన్నారు.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచే పరిస్థితి లేదన్న ఉద్దవ్‌ థాక్రే.. ఎన్‌డిఏతోనే కలిసి కొనసాగుతామన్నారు..

వరద ప్రాంతాల్లో వాయిదా

      రేపు జరగనున్న పంచాయతీ ఎలక్షన్స్‌ పై కూడా వరుణుడు ప్రతాపం చూపించాడు.. పలు జిల్లాల్లో భారీ గా కురుస్తున్న వర్షాలతో అక్కడ ఎన్నిక నిర్వహించడం కష్టం అని తేల్చేసింది ఎలక్షన్‌ కమీషన్‌.. దాదాపు ఆరు జిల్లాల్లోని 300లకు పైగా గ్రామల్లో పంచాయితీ ఎలక్షన్స్‌ వాయిదా పడనున్నాయి..   వర్షాలు అధికంగా ఉన్న ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతంలోని అన్ని డివిజన్‌లలో ఎలక్షన్స్‌ వాయిదా పడ్డాయి.. ఈ ఎలక్షన్స్‌ ను ఆఖరి విడత డివిజన్‌లతో పాటు ఈ నెల 31న జరపటానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.. ఖమ్మంతో పాటు ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.   వరద ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌ వ్యవస్థతో పాటు ఎన్నికలు నిర్వహించడానికి సౌకర్యాలు కూడా సరిగా లేకపోవటంతో ఎలక్షన్స్‌  వాయిదా వేస్తున్నట్టుగా ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ ప్రకటించారు.

ప్రముఖ రచయిత గిడుగు రాజేశ్వరరావు కన్నుమూత

      ప్రముఖ రచయిత గిడుగు రాజేశ్వరరావు (82) కన్నుమూశారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో గుండెపోటుతో ఆయన మరణించారు. ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ఘాట్‌లోని శ్మశానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. బాలసాహిత్యంలో ఎంతో కృషి చేసిన సుప్రసిద్ద రచయిత గా ఆయన ప్రసిద్దిగాంచారు. కంద పద్యశతకాలు, జీవిత చరిత్రలు, రేడియో నాటికలు అనేకం ఆయన లిఖించారు. రాజేశ్వరరావుకు కుమార్తె స్నేహలత, కుమారుడు రామదాసు ఉన్నారు. రామదాసు ఢిల్లీలోనే రక్షణ శాఖలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తుండగా.. కూతురు స్నేహలత గాయనిగా, వైణికురాలిగా పేరొందారు. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ, జానకి, మోహన రాజు తదితరులు ఆయన రచించిన పాటలను పాడారు.

అఖిలేష్ దేవోభవ

  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అఖిలభారత యాదవ సంఘం సభకి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి ఆయన అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకొని, అక్కడి నుండి నేరుగా ప్రతిపక్ష నేత చంద్రబాబుని కలుసుకొని ఆయన పాదయాత్రను మెచ్చుకొని, ఆసందర్భంగా ఆయన ప్రకటించిన బిసి డిక్లరేషన్, బిసిలకు వంద సీట్లు వంటి విధానాలను కూడా అదే నోటితో మెచ్చుకొని, ఆతరువాత కేంద్రమంత్రి చిరంజీవిని కలిసి కబుర్లు చెప్పుకొని అందరి దగ్గరా చాయ్ పానీలు సేవించి, నొప్పింపక తానొవ్వక అన్నట్లు అందరినీ సంతృప్తి పరిచారు. కానీ, ఆయనను కలిసిన తెలంగాణ జెయేసి నేత శ్రీనివాస గౌడ్ తెలంగాణకు మద్దతు ఈయమని విజ్ఞప్తి చేసినప్పుడు మాత్రం తాము చిన్న రాష్ట్రాలను వ్యతిరేఖిస్తున్నట్లు చెప్పి ఆయనను నిరాశపరిచారు. అందరినీ మెచ్చుకొని వెళ్తూ వెళ్తూ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ వరదలలో సహాయ చర్యలు సరిగ్గా చెప్పట్టలేకపోయిందని ఒక డైలాగ్ వదలి కేంద్రరాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలకు రెంటికీ ఒకేసారి  చురకలు వేసి తానూ కూడా తన తండ్రి ములాయం సింగుకి తగ్గ కొడుకునేనని నిరూపించుకొన్నారు.

తెలంగణా ముఖ్యమా ఉద్యమాలు ముఖ్యమా?

  ఇటీవల తెరాస కండువా కప్పుకొన్న కాంగ్రెస్ నేత కే.కేశవ్ రావు ఈరోజు తన కొత్తబాస్ కేసీఆర్ మనసులో మాటను చల్లగా బయటపెట్టాడు. “కాంగ్రెస్ పార్లమెంటులో బిల్లుపెట్టేవరకు కూడా తెలంగాణా ఇస్తుందని తమకు నమ్మకం లేదని, ఒకవేళ కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణా ఇవ్వకపోయినా మరో ఆరునెలలు కోట్లాడి సాధించుకొంటామని” ఆయన చెప్పారు. అంటే తెలంగాణా సాధన కంటే, ఆ పేరిట మరో ఆరునెలలు ఉద్యమాలు చేసుకొనే అవకాశం ఉంటేనే మేలని ఆయన ఉద్దేశ్యం కాబోలు.   ఆయన కాంగ్రెస్ లో ఉన్నంతకాలం తెలంగాణా కోసం గొంతు చించుకొని మాట్లాడేవారు. తమ పార్టీ తెలంగాణా ఇవ్వదని, పార్టీలో ఉంటూ ఎటువంటి ఉద్యమాలు చేసే అవకాశం లేదని భావించిన కేశవ్ రావు, తెరాసలో చేరితే చురుకుగా ఉద్యమాలలో పాల్గొనవచ్చుననే ఉద్దేశ్యంతో, తనకి అత్యున్నత హోదానిచ్చిన కాంగ్రెస్ కండువాని చెత్త కుండీలోకి విసిరేసి, తెరాస కండువా వేసుకొన్నారు. కానీ, ఆయన పార్టీ మారగానే పరిస్థితులు కూడా ఒక్కసారిగా మారిపోయాయి.   అంతవరకు ఉద్యమాలతో కాంగ్రెస్ ను ఒక ఆట ఆడించిన తెరాస చేతిలోంచి తెలంగాణా సెంటిమెంటును కాంగ్రెస్ కాకి రివ్వున వచ్చిఎత్తుకుపోయింది. ఇప్పుడు అది తెరాసను పక్కన పడేసి తానే స్వయంగా తెలంగాణా ఇచ్చేందుకు సిద్దం అవుతుండటంతో, ఎన్నెన్నో ఆలోచనలతో పార్టీ మారిన కేశవ్ రావుకి ఇప్పుడు ఏమిచేయాలో పాలుపోవడం లేదు. ఒకపక్క కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చేస్తానని హడావుడిపడుతుంటే, ఇక ఉద్యమాల అవసరం ఏముంటుంది. తెరాసలో ఉండి చేసేదేముంటుంది?   అదేవిధంగా తెలంగాణా కోసం తన తల నరుకొన్నేందుకు కూడా సిద్ధమని ప్రగల్భాలు పలికిన కేసీఆర్, ఇప్పుడు తెరాసను విలీనం చేస్తే తెలంగాణా ఇస్తానని కాంగ్రెస్ చెపుతున్నపటికీ, ఎందుకు వెనకాడుతున్నట్లు? అంటే ఆయనకి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకంటే, తన రాజకీయ ప్రయోజనాలు, పార్టీని నిలుపుకోవడమే ముఖ్యమని అర్ధం అవుతోంది.   ఒకవేళ కేసీఆర్, కేశవ్ రావులు నిజంగా మనస్పూర్తిగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలని కోరుకొంటుంటే, అందుకోసం తమ బేషజాలు, కోరికలు, కలలు, రాజకీయ ప్రయోజనాలు అన్నీటినీ పక్కనబెట్టి, తెలంగాణా ఏర్పాటుకి తీవ్ర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా సహకరించి ఉండాలి. కానీ, వారిద్దరూ ఆవిధంగా చేసేందుకు సిద్ధంగాలేరు.   తెలంగాణా సెంటిమెంట్ సజీవంగా నిలిస్తేనే తెరాస కలలుకంటున్నట్లు వచ్చేఎన్నికలలో పూర్తి మెజారిటీ సాధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చేస్తే అప్పుడు కాంగ్రెస్ హస్తానిది పైచేయి అవుతుంది. గనుక, వచ్చే ఎన్నికల వరకు తెలంగాణా రాష్ట్రం ఏర్పడకూడదని, ఆయన తన మాటలతో చెప్పకనే చెప్పారు.   మరి, తెలంగాణా వద్దంటున్న ఇటువంటి నేతలను నిలదీయకుండా, తెలంగాణాకి అడ్డుపడుతున్నారని వేరేవరినో నిందించడం ఎందుకు?ఇటువంటి నేతల శల్యసారధ్యంలో సాగుతున్న తెలంగాణా ఉద్యమం కోసం, ఉజ్వల భవిష్యత్తు ఉన్నవిద్యార్ధులు బలిదానాలు చేసుకోవడం వల్ల ఏమి ప్రయోజనం?ఎవరికి లాభం కలుగుతుంది?

తెలంగాణ వల్ల రాయలసీమకు నష్టం

      రాయలసీమను విభజిస్తే తాము సహించబోమని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. రాయల తెలంగాణ పేరుతో రాయలసీమను విభజించాలనే ప్రతిపాదన ఉన్నట్లు వచ్చిన వార్తలపై ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చేయాలని అన్ని రాజకీయ పార్టీలు చెప్పాయని, ప్రజల ఆకాంక్ష మేరకు తమ కాంగ్రెసు పార్టీ తెలంగాణ నాయకులు కూడా తెలంగాణ కావాలని అంటున్నారని ఆయన అన్నారు. ఈ పరిస్థితిలో సమైక్యవాదాన్ని కోరుకుంటున్న తాము వీక్ పాయింట్‌లో ఉన్నామని మంత్రి అన్నారు. తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెసు ఇంకా అనుకోలేదని, ఇచ్చేస్తారేమోననే భయమూ ఆందోళనతో తాము మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ విడిపోతుందుంటేనే బాధ కలుగుతోందని, దానికి తోడు రాయలసీమను విడగొట్టడం ఎందుకని ఆయన అన్నారు. తాము ఇప్పటికే బళ్లారిని కోల్పోయామని, దానివల్ల తుంగభద్ర నీరు తమకు రాకుండా పోతోందని, మంచినీళ్లు కూడా తమకు అందడం లేదని ఆయన అన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాలను రాయలసీమలో కలపాలని ఆయన అన్నారు. దానివల్ల జలవివాదాలు రావని, అంతేకాకుండా ఆ ప్రాంతాల ప్రజలతో రాయలసీమ ప్రజలకు సంబంధాలున్నాయని ఆయన అన్నారు.   రాష్ట్ర విభజన పై సీమాంధ్ర ప్రజల నుంచి స్పందన లభించడం లేదని, ఈ స్థితిలో రాష్ట్ర విభజనకు నిర్ణయం జరిగితే సీమాంధ్ర ప్రజలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

జగన్, అనిల్ ను రక్షించారు..!!

      అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనను ఆసరాగా చేసుకుని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బొత్స తాను బ్రదర్ అనిల్ తప్పు చేస్తే రక్షించానని చెబుతున్నారని, ఆ విషయం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రిగా ఆయన బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ముఖ్యమంత్రి తాను గతంలో జగన్ ను రక్షించానని అన్నారని, అలాగే ఇప్పుడు బొత్స తాను అనిల్ ను రక్షించారని అంటారని, వీరందరిని వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాపాడారని ఆయన మద్దతుదారులు చెబుతారని, కాంగ్రెస్ లో ఇదంతా ఒక చిత్రమైన పరిస్థితి అని ఇవన్ని బయటకు రావలసిన అవసరం ఉందని రావుల వ్యాఖ్యానించారు.   అయితే ఇదిలా ఉంటే ఒక నాయకుడు ఎన్నో మంచి పనులు చేసి ప్రజాసేవకుడై స్వలాభాపేక్షకు గురికానివారు గుర్తింపు సాధించి, ఇప్పడు కష్టాలలో ఉన్నారంటే అతడిని కాపాడడానికి తోటి నాయకులు కష్టపడితే పర్వాలేదు. కాని జనం డబ్బు దోచుకొని రాజభోగాలు అనుభవించే నాయకులను కాపాడడమేంటి ఒక రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడంటే అతని వెనుక ఎన్నో అక్రమాలు ఉంటున్న ఈ రోజుల్లో ఆ రాజకీయ నాయకుడి రక్షించామని చెప్పుకోవడం ఏంటోనని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

పతనావస్థకు చేరుకొంటున్న రాష్ట్ర పరిస్థితులు

  ప్రస్తుతం రాష్ట్రం సందిగ్ధ పరిస్థితుల్లో ఉంది. తెలంగాణా అంశం, మంత్రులపై అవినీతి ఆరోపణలు, ప్రతిపక్షాల కుమ్ములాటలు, ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, బాంబు ప్రేలుళ్ళు, ధర్నాలు, ఆందోళనలు వంటివి ఒక అరాచక పరిస్థితిని సృష్టించాయి. ప్రభుత్వం రోజుకో కొత్తపధకం ప్రవేశపెడుతూ ప్రజశ్రేయస్సుకోసమే తాము పనిచేస్తున్నామని చెప్పుకొంటుంటే, ప్రతిపక్షాలు అందుకు పూర్తి విరుద్ధంగా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మీడియా కూడా ఒక్కో రాజకీయ పార్టీకి నిస్సిగ్గుగా కొమ్ము కాస్తున్న కారణంగా చివరికి ప్రజలు దానిని కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు కూడా తమ బాధ్యతలు మరిచి, రాష్ట్ర సంక్షేమం గాలికొదిలి వివిధ కారణాలతో ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకొంటూ కాలక్షేపం చేస్తూ, దానినే రాజకీయంగా భావిస్తున్నారు.   అధికార, ప్రతిపక్షాలు రెండూ కూడా నిర్మాణాత్మకమయిన ఆలోచనలు చేయడం ఎన్నడో మరిచిపోయాయి. ఇటువంటి ధోరణి వల్ల రాష్ట్ర పరిస్థితి నానాటికి దిగజారుతున్నపటికీ, ఎటువంటి దిద్దిబాటు చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించకపోవడం దారుణం. ఏదయినా సమస్య వచ్చినప్పుడే దాని గురించి ఆలోచించవచ్చుననే నిర్లిప్తత ప్రభుత్వంలో పేర్కొంది.   ఇక తెలంగాణా అంశం పట్టుకొని రెండు ప్రాంతాలకి చెందిన మంత్రులు, శాసనసభ్యులు తమ భాధ్యతలను నిర్వర్తించకుండా సభలు సమావేశాలు పెట్టుకొని ఒకరినొకరు దూషించుకొంటూ, డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తు కాలక్షేపం చేస్తున్నారు. తత్ఫలితంగా రాష్ట్రంలో పాలన అదుపు తప్పి అక్రమ వ్యాపారులకు, అవినీతి ఉద్యోగులకు, అధిక ధరలకు, దొంగతనాలకు, దోపిడీలకు నేడు రాష్ట్రం నిలయంగా మారింది. ఒకనాడు ఇటువంటి పరిస్థితి వెనుకబడిన బీహార్ రాష్ట్రంలో ఉండేది. కానీ ఇప్పుడు మన రాష్ట్రం కూడా ఆ స్థాయికి చేరుకొంది. ఇందుకు ప్రభుత్వాన్ని , ప్రతిపక్షాలను రెంటినీ తప్పు పట్టక తప్పదు.   అధికార, ప్రతిపక్షాల ఆశయం రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిగా ఉండాలి. కానీ, అవి నేడు కేవలం రాజకీయ చదరంగం ఆడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందుకోసం ప్రజలని కూడా వివిధ వర్గాలుగా విడదీసి తమ పావులుగా చేసి ఆడుకొంటున్నాయి. ప్రజలు తమకున్న ఏకైక ఆయుధం ఓటుని సక్రమంగా వినియోగించుకొని ఇటువంటి రాజకీయనేతలకి తగిన బుద్ధి చెప్పగలిగిననాడే పరిస్థితులో మార్పు మొదలవుతుంది. లేకుంటే ప్రజలు కూడా ప్రభుత్వాన్ని నిందిస్తూ భారంగా జీవితాలు వెళ్ళదీయక తప్పదు.

సీఎం కిరణ్ ది క్రమశిక్షణారాహిత్య౦

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు లీకులు ఇవ్వడం క్రమశిక్షణా రాహిత్యమని సీనియర్ మంత్రి కె. జానారెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి లీకులపై కాంగ్రెసు అధిష్టానానికి సమాచారం ఉందని ఆయన అన్నారు. మీడియాకు తప్పుడు సమాచారం ఇవ్వడం సరి కాదని ఆయన అన్నారు. ఆయన తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, వి హనుమంతరావుతో శనివారంనాడు సమావేశమయ్యారు.   ఎవరెన్ని చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని జానారెడ్డి అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటేనే నక్సలిజం పెరుగుతుందని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి లీకులు ఇవ్వడం అధిష్టానం దృష్టికి వెళ్లిందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేదంటే మూడుగా విభజించాలని రాయలసీమ ప్రాంతానికి చెందిన రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.