సురేఖ అసంతృప్తి

      తెలంగాణ పార్టీ నేతలతో జగన్ పార్టీ అంతరం క్రమక్రంగా పెరుగుతోంది. విజయమ్మతో భేటి తరువాత కొండా సురేఖ మీడియా తో మాట్లాడుతూ... సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలు వ్యక్తిగతమో, పార్టీ నిర్ణయమో తమకు అధిష్టానం చెప్పలేదన్నారు. తాము అసంతృప్తితోనే బయటకు వచ్చామని చెప్పారు.   సీమాంధ్ర నేతల రాజీనామాల పైన, తెలంగాణ విషయంలో తమకు సరైన సమాధానం దొరకలేదని చెప్పారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలో ఉన్నామనే అపవాదు తమకు వద్దని ఆమె అన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేల నిర్ణయం పార్టీ వైఖరి కాకపోతే తమకు ఇప్పటి వరకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్టీ వైఖరి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్నారు. తామంతా మరోసారి చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని సురేఖ అన్నారు.

రెండో విడత పోలింగ్: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

      రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల చెదురుమొదురు ఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాతంగా జరిగాయి. ఒంటిగంట వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతినిచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌటింగ్ ప్రారంభమైంది.   రెండో విడతలో 916 పంచాయతీయలు ఏకగ్రీవమయ్యాయి. ముందుగా వార్డుసభ్యుల ఓట్లు లెక్కించి అనంతరం సర్పంచ్ ఓట్లు లెక్కించనున్నారు. రెండో విడత తొలి ఫలితం చిత్తూరు జిల్లా నుంచి వెలువడింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కనకంపాలెంలో సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందినట్లు సమాచారం. సాయంకాలానికల్లా చాలా వరకూ పలితాలు వెలువడే అవకాశం వుంది.

విజయమ్మతో కొండా భేటి..తాడోపేడో

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజీనామాలు చేసిన నేపథ్యంలో గుర్రుగా ఉన్న ఆ పార్టీ తెలంగాణ నాయకులు శనివారం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి కొండా సురేఖతో పాటు ఆమె భర్త కొండా మురళి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, రవీంద్ర నాయక్‌ తదితరులు సమావేశానికి వచ్చారు.   సీమాంధ్ర ఎమ్మెల్యే చర్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కొండా దంపతులు దీనికి విజయమ్మ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణపై పార్టీ వైఖరిపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు విజయమ్మను కోరనున్నట్లు సమాచారం.   తెలంగాణకు వ్యతిరేకంగా వైఖరి తీసుకుంటే తాము పార్టీకి రాజీనామా చేస్తామని కూడా వాళ్లు తేల్చిచెప్పనున్నారు. ప్లీనరీలో తెలంగాణకు అనుకూలంగా చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామని మాటల్లో చెబుతున్నా, చేతల్లో మాత్రం సమైక్యానికి అనుకూలంగా కనిపిస్తోందని, ఇది తమను తమ ప్రాంతాల్లో ఇబ్బందులకు గురి చేస్తోందని వారు నివేదించనున్నారు.

తెలంగాణపై తెదేపా కూడా మాట మారుస్తుందా

  ఈ రోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర విభజనపై మాట్లాడిన తీరు చూస్తే, క్రమంగా ఆ పార్టీ కూడా వైకాపా మార్గంలోనే పయనించేందుకు సిద్దం అవుతున్నట్లు కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం వైకాపా శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించినట్లే “ఎవరిన డిగి రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకొంటోందని” ఆయన ప్రశ్నించారు. ప్రజలు తెలంగాణా కోసం అడుగుతుంటే కాంగ్రెస్ రాయల తెలంగాణా అని మాట్లాడటం ఏమిటని ఆయన ప్రశించారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం, తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనకి ఆలోచనలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ముందుగా రాజధాని, జలవనరుల పంపిణీ, రెవెన్యు మొదలయిన అంశాలను పరిష్కరించకుండా విభజనకు సిద్దపడితే తాము ఉద్యమిస్తామని అన్నారు. సోమిరెడ్డి ఇంకా చాల అంశాలు ప్రస్తావించి నప్పటికీ, ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నట్లు తన మాటలతో స్పష్టం చేసారు.   చంద్రబాబు అనుమతి లేకుండా సోమిరెడ్డి ఈవిధంగా మాట్లాడే అవకాశం లేదు, గనుక ఆయన తమ పార్టీ అభిప్రాయం వెలువరిస్తునట్లుగానే భావించవలసి ఉంటుంది. మరి ఇంతవరకు తమ పార్టీ తెలంగాణకు అనుకూలమని ప్రకటిస్తూ వచ్చిన తెదేపా కూడా ఇప్పుడు హటాత్తుగా “ఎవరిని అడిగి విభజిస్తున్నారని” ప్రశ్నించడం చూస్తే, నేదో రేపో ఆ పార్టీ శాసనసభ్యులు కూడా రాజీనామాలతో రంగంలో దిగవచ్చునని అనిపిస్తోంది. అఖిలపక్షంలో రాష్ట్ర విభజనకు తమకు అభ్యంతరం లేదని స్పష్టంగా చెప్పిన తెదేపా ఇప్పుడు మళ్ళీ మాట మార్చితే తెలంగాణాలో భంగపాటు తప్పదు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నసోమిరెడ్డి, మరి తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా మాట్లాడటలేదనే సంగతిని విస్మరించడం విశేషం.

పామర జనానికి తెలియని నిజాలు

  కొంచెం కూడా లోకజ్ఞానం లేని అజ్ఞానులయిన భారతీయులు కొందరు దేశాన్నిదారిద్ర్యం పట్టి పీడిస్తోందని అవాకులు చవాకులు వాగుతుంటారు. మీడియా కూడా అటువంటి వారికి వంత పాడుతూ ఎక్కడో మారుమూల గ్రామాలలో ఆకలి చావులు చస్తున్నవారి ఫోటోలు ప్రచురిస్తూ దేశంలో పేదరికం విలయతాండవం చేస్తోందని, సగం మందిపైగా ఒంటిపూట భోజనానికి కూడా నోచుకోవట్లేదని అతిశయోక్తులు ప్రచురిస్తుంది.   కానీ, మన అదృష్టం కొద్దీ మహా మేధావులయిన కాంగ్రెస్ నేతలు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులయిన మాంటెక్ ఆహ్లువాలియా వంటి నిపుణులు ఉండబట్టి సరిపోయింది. లేకుంటే ప్రపంచం కూడా ఈ తప్పుడు కధనాలు నమ్మేసి ఉండేది. ఆహ్లూ వాలియా గారు తన ఏసి గదిలో కూర్చోనప్పటికీ ఎంతో చమటోడ్చి అరడజను చాయ్ లు, మరో అరడజను బిస్లిరీ నీళ్ళ బాటల్స్ సేవించి, సుదీర్గ పరిశోధన చేసి మన దేశంలో పేదరిక స్థాయి దాదాపు 22 శాతం తగ్గిపోయిందని కనిపెట్టారు.   పామరులయిన ప్రజలకి, వారి పెరిగిన ఆర్ధిక శక్తి గురించి కూడా తెలియజేసి పుణ్యం కట్టుకొన్నారు. ఇప్పుడు చాల మంది భారతీయులలలో సగటున రూ.33కంటే వ్యయం చేయగలిగే స్థితికి చేరుకొన్నారని, అంటే ఇక వారందరూ దారిద్యరేఖపై నుండి హై-జంప్ చేసి మద్యతరగతిలోకి వచ్చిపడ్డారని శలవిచ్చారు.   కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ ముంబాయిలో తన ఆఫీసుకి తన ఇంపోర్టెడ్ కారులో వెళుతూ పేపర్లో ఆ వార్త చదివి చాలా ఆనందపడిపోయారు. కానీ, ఇంత గొప్ప సంగతి తనకంటే తెలిసింది. కానీ, పాపం! రోడ్డు పక్కన ఫుట్ పాత్ ల మీద తిండి లేక ఈసురో...మని మొహాలు వ్రేలాడేసుకొని కూర్చోన్నవారికి ఎలా తెలుస్తుంది? అని ఆలోచించి, ఆఫీసుకి చేరుకోగానే ఒక స్థానిక పత్రికకి ఫోన్ చేసి ఈ విషయమంతా చెప్పి, ముంబైలో కేవలం రూ.12 పెడితే కడుపు నిండా భోజనం దొరుకుతుందని, అందువల్ల మిగిలిన రూ.21లతో అందరూ పండుగ చేసుకోవచ్చునని తన మాటగా ఆ ఫుట్ పాత్ జనాలకి తెలియజేయమని ఆయన ఆదేశించారు.   అయితే, ఆసంగతి అ ఫుట్ పాత్ జనాలకి తెలియలేదు, కానీ అంతకంటే ముందుగా డిల్లీలో తన ఫాం హౌస్ లో ఫ్రూట్ జ్యూస్ త్రాగుతూ సేద తీరుతున్నరషీద్ మసూద్ అనే కాంగ్రెస్ పెద్దాయనకి తెలిసిపోయింది. ఆయన వెంటనే మీడియా వాళ్ళని పిలిపించుకొని “మీరు ఆ రాజ్ బబ్బర్ మాటలు పట్టించుకోవద్దు. ఇక్కడ డిల్లీలో అయితే రూ.5పడేస్తే సుష్టుగా పొట్ట పగిలేలా తినొచ్చును. ఆ లెక్కన మనిషికి మొత్తం రూ.28 చొప్పున మిగిలిపోతుంటుంది. ఇక అదంతా ఎలా ఖర్చు చేయాలి? ఎప్పుడు ఖర్చు చేయాలి? డబ్బు ఖర్చు చేయలేని స్థితిలో ప్రజలుంటే ఇక దేశంలో పేదరికం ఎక్కడ మిగులుతుంది?” అని సూటిగా మీడియా వాళ్ళను ప్రశించారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వాళ్ళు బయటకొస్తుంటే, ఫారూక్ అబ్దుల్లా అనే మంత్రిగారు తన ఏసి కారులోంచి దిగి “ఏంటి సంగతీ?” అని అడిగారు. మీడియా అంతా పూసగుచ్చింది.   “అసలు ఒక్క రూపాయికి కావలసినంత తిండి దొరుకుతుంటే, వీళ్ళేమిటి 5, 12 అని తప్పుడు లెక్కలు చెపుతున్నారు?” అంటూ తెగ చిరాకుపడిపోయారు. “మనం ఏమి, ఎంత, ఏ రకం ఫుడ్డు తినాలనుకొంటున్నామనే దాని బట్టే ఖర్చుఉంటుంది తప్ప, ఒక సింపిల్ భోజనం కావాలంటే ఒక్క రూపాయి చాలదూ? మరటువంటప్పుడు కేవలం మేమే స్విస్ బ్యాంకుల్లో బ్లాక్ మనీ అకౌంట్స్ మెయింటేన్ చేస్తున్నామని ఆ ఆరోపణలేమిటి? ఆ మిగిలిన రూ.32లు ఎక్కడికి పోతున్నాయి? స్విస్ బ్యాంకులోకే కదా? మరి అందరికీ స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఇక దేశంలో పేదరికం ఎక్కడ ఉంది. ఈ సారి ఆ ఆహ్లూవాలియాని కలిసినప్పుడు “ఇండియా మే బీ పూర్, బట్ ఆల్ ఇండియన్స్ ఆర్ రిచ్” అని స్టేట్మెంట్ మార్చమని గట్టిగా చెపుతాను” అని ఆయన మీడియా మీద ఒంటి కాలుపై లేచేసరికి ఇంకెప్పుడు దేశంలో తిండి లేక పేదలు చచ్చిపోతున్నారని వ్రాయమని లెంపలు వేసుకొని బ్రతుకే జీవుడా అంటూ మీడియా వాళ్ళు బయటపడ్డారు.

అబద్ధాలకు తెరతీసిన "వేర్పాటు''!

- డా.ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]       అబద్దాల నోటికి అరవీసెడు సున్నం కొట్టినా చాలదట! ఊదర ద్వారా ఏ ఉద్యమాలూ నిలవవు; ఊదర వల్ల ఉద్యమాలకు అస్తిత్వం రాదు. ప్రజలకు, దేశానికి, రాష్ట్రాలకు 'అసిత్వం' అనేది సామాజిక, ఆర్థికరంగాలలో పాలనావ్యవస్థలు ప్రజానుకూలమైన, ప్రణాళికాబద్ధమైన, ద్వంద్వప్రమాణాలకు తావులేని పథకాలను ఆచరణలో జయప్రదంగా అమలు జరిపినప్పుడు మాత్రమే స్థిరపడుతుంది. ఆ ప్రగతి ప్రజాతంత్ర విప్లవం ద్వారా మాత్రమే ప్రజాబాహుళ్యం అనుభవంలోకి వస్తుంది. ప్రజలకు సామాజిక, ఆర్థికస్థిరత్వం అప్పుడు మాత్రమే సాధ్యం. అలాంటి స్థిరత్వం ద్వారానే జాతికీ, దేశానికీ, రాష్ట్రాలకూ ఆత్మగౌరవం సిద్ధిస్తుందిగాని పదవీ ప్రయోజనాల కోసం రాజకీయ నిరుద్యోగులు ప్రారంభించే ఊదర ఉద్యమాల వల్ల ఎంతమాత్రం సంప్రాప్తించదు! పరిణామాలకు చెప్పే వక్రభాష్యాలవల్ల, ఆడే అబద్దాలవల్లా ప్రాంతాలకు స్థిరత్వంగానీ, ప్రజలకు ఆత్మగౌరవంగానీ సమకూడదు. ఈ సూత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోని మోతుబరులకూ, చీలికవాదం చాటున, సమైక్యతా వాదం చాటునా దాచుకుంటున్న స్వార్థపరులందరికీ సమంగానే వర్తిస్తుంది. ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవాలంటే, అటూ యిటూ కూడా కృత్రిమంగా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ పేరుకు మాత్రమే 'మేథావులు'గా చెలామణి కాజూస్తున్న కొందరు కుహనా విద్యాధికులూ పలుకుతున్న అబద్ధాలు! ఈ మోతుబరులు, ఈ విద్యాధికులలో హెచ్సుమంది అటుయిటూ కూడా ప్రాంతాలలోనూ తరతమ భేదాలతో, ఆంధ్రప్రదేశ్ (విశాలాంధ్ర) రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎదిగివచ్చిన నయా (నియోరిచ్) సంపన్న వర్గాలేనని మరచిపోరాదు. వీరిలో ఒక ప్రాంతంలోని మోతుబరులకు దేశానికి స్వాతంత్ర్యం రాక ముందునుంచీ ప్రెసిడెన్సీలో భాగంగా తెలుగుసీమలోని ఒక ప్రాంతం ఉన్నప్పుడే కొంత ఆర్థికస్తోమత సమకూడి ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగువారు వేరై ఆంధ్రప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఈ సంపన్నవర్గం మరింత బలపడుతూ వచ్చింది. ప్రారిశ్రామికంగానూ, వ్యవసాయకంగానూ. కాని ఈ మోతుబరుల 'బలాన్ని' చూపి ఆంధ్రప్రాంతంలోని నూటికి తొంభైమంది ప్రజాబాహుళ్యం స్థితిగతులన్నీ మెరుగైపోయినట్టు భావించరాదు; జల సమస్యలు ముగింపునకు వచ్చినట్టూ భావించరాదు.   అలాగే బ్రిటిష్ వలసపాలకుల అండతో హైదరాబాద్ కేంద్రంగా నిజామాంధ్రలోని తెలుగుప్రజలపైన దారుణమైన నిరంకుశ పాలనను సాగిస్తూ తెలుగుప్రజల్ని తెలుగు పాఠశాలలు పెట్టుకోనివ్వకుండా ఉర్దూను మాత్రమే పాలనా భాషగానూ రుద్ది, స్వభాషా సంస్కృతులకు దూరంచేసి, దొరల, జాగిర్దార్ల, దేశ్ ముఖ్ ల దౌర్జన్యాలను అనుమతించడం ద్వారా నిజాంసర్కార్లు [ఒక్క కుతుబ్ షాహీ మినహా] ప్రజల్ని వెట్టిచాకిరీకి తాకట్టుగా మార్చాయి! ఆ పరిస్థితుల్లో అక్కడ నిజాంకు తాబ్ దార్లుగా మారిన ఏ కొలదిమంది దొరలూ, జాగిర్దార్లూ మాత్రమే సంపన్నులుగా చెలామణీ అయ్యారు. కాని, మెజారిటీ తెలంగాణా తెలుగుప్రజలను నిజాముతోపాటు తెలుగుదొరలూ, తెలుగు జాగిర్దార్లూ, తెలుగు పటేల్, పత్వారీలూ దారుణ దోపిడీ ద్వారా పీల్చుకుతిని పిప్పిచేసి 'నీ బాన్చని దొరా, నీ కాల్మొక్తా' అన్న బానిసవ్యవస్థకు బందీలు చేసి వదిలారు. ఒక్క తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం [ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సాహస నాయకత్వంలో] మాత్రమే ఏకభాషా సంస్కృతులు ఆధారంగా ఉభయ ప్రాంతాలలోని తెలుగువారినందరినీ ఏకోన్ముఖం చేసి విశాలాంధ్ర ఏర్పాటుకు భౌతిక, మానసిక పునాదుల్ని పటిష్టం చేసింది. అయితే అంతకుముందు ఆంధ్రరాష్ట్రావతరణ తర్వాత ''నియోరిచ్'' కోస్తాంధ్రలో ఎలా తలెత్తిందో, ఇటు విశాలాంధ్ర అవతరణ తర్వాత మన తెలంగాణా ప్రాంతంనుంచి కూడా "నయాసంపన్నవర్గం'' తలెత్తింది. అంతకుముందెన్నడూ లేని స్థాయిలో విశాలాంధ్ర ఏర్పడిన తరువాత కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి విద్యా, వ్యాపారరంగాల నుంచి ఎలా గణనీయమైన సంఖ్యలో "విదేశీ భారతీయులు''గా (ఎన్.ఐ.ఆర్.లు) ఎదుగుతూ వచ్చారా, అలాగే మన తెలంగాణానుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాతనే ఎన్.ఐ.ఆర్.ల సంఖ్యా నానాటికీ పెరుగుతూ వచ్చింది. ఈ పరిణామం ప్రధానంగా పరాయిపాలన నుంచి విడివడి, ఉభయప్రాంతాలలోని తెలుగువారంతా 'విశాలాంధ్ర' (ఆంధ్రప్రదేశ్)గా ఏర్పడిన తరువాతనే జరిగిందని మరచిపోరాదు!   అయితే అటూ, యిటూ కూడా సామాన్య ప్రజాబాహుళ్యానికి సమష్టిగా దక్కవలసిన రాష్ట్ర సహజవనరులు అందుబాటులోకి వచ్చాయని కలలో కూడా భావించకూడదు! ఈ సహజవనరులపై పెత్తనం కోసం ఉభయప్రాంతాలలోని మోతుబరుల మధ్య పెరుగుతూ వచ్చిన స్ఫర్ధలే, ప్రజాబాహుళ్య ప్రయోజనాలతో సంబంధంలేని వ్యర్థ ఉద్యమాల రూపంలో దఫదఫాలుగా తలెత్తుతూ రాష్ట్ర ప్రజల మూల్గులను పీల్చి వేస్తున్నాయి, ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ సమయంలో వామపక్షాలు సహితం ప్రజలకు నాయకత్వం వహించి వాస్తవాలను బోధించి సమీకరించడంలో విఫలమవడం ప్రజలపాలిట 'శాపం'గా మారి, మోతుబరులకు, వారి పాలకశక్తులకూ పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ అండదండలు అందించినట్టయింది! ఇందుకు ప్రధాన కారణం - విభేదించే విధానాలు చెప్పుకోదగినవి లేకపోయినా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలుబాటలలో యింకా ప్రయానిస్తూండటమే! ప్రజల్ని సరైన పంథాలో చైతన్యవంతుల్ని చేయడంలో తరచుగా విఫలమావుతూండటంవల్లనే ప్రజాతంత్ర ఐక్యసంఘటిన నిర్మాణంలో కూడా క్రియాశీల పాత్ర వహించలేకపోతున్నారు; ఐక్యప్రజాతంత్ర ఉద్యమాలు నిర్మించుకోడానికి ముందు ఉభయకమ్యూనిస్టు పార్టీలు [సి.పి.ఐ.-సి.పి.ఎం.] ఏకమై తిరిగి ఒక పార్టీగా అవతరించడం అవశ్యం జరగాల్సినపని. తెలంగాణా ఏర్పాటువాదం తలెత్తడానికి, ఎలాంటి శాస్త్రీయలక్ష్య నిర్వచనా లేకుండా కొందరు రాజకీయ నిరుద్యోగులు తలపెట్టిన ఉద్యమానికి కమ్యూనిస్టుపార్టీల ఉదాసీనత, నిర్వ్యాపార స్థితియే కారణం. అందువల్లనే రకరకాల అబద్ధాలకు వేర్పాటు ఉద్యమకారులు గజ్జెకడుతున్నారు; ఉభయప్రాంతాలలోని స్వార్థపర సంపన్నులూ, రాజకీయ నిరుద్యోగులూ భిన్నకోణాల నుంచి తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికైనా సిద్ధమేగాని పరాయి పాలకులనుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్న 'విభజించి-పాలించే' సూత్రాన్ని వదులుకోడానికి మాత్రం వదులుకోడానికి సిద్ధంకావటంలేదు!   కనుకనే అనేక అబద్ధాలను ప్రచారంలో పెట్టడానికి వీరిలో కొందరు వెరవడం లేదు. ఉదాహరణకు తెలంగాణాలో ఒక మోతుబరి ఇటీవల కాలంలో నెలకొల్పిన ఒక స్థానిక దినపత్రిక - కేంద్రప్రభుత్వం లేదా కాంగ్రెస్ అధిష్ఠానవర్గం రాష్ట్ర విభజన సమస్యపై యింకా ఎలాంటి అవకాశవాద నిర్ణయానికి సిద్ధం కాకపోయినా, "వీర తెలంగాణా'' బదులు వేరు తెలంగాణాను ప్రమోట్ చేయడానికి, రాణి 'విజయాని'కి వచ్చినట్టుగా రంగుపులిమి "జజ్జనకర జనారే - తెలంగాణా ఖరారే'' అంటూ పతాకశీర్షిక పెట్టేసింది. అలా పెట్టడంలో ఉద్దేశ్యం, దాదాపు 800-900 మంది తెలంగాణా ఎస్.సి., ఎస్.టి., బి.సి. తదితర బడుగుబలహీన వర్గాల బిడ్డల్ని తమ రాజకీయ స్వార్థం కోసం బలిపశువుల్ని చేసి ఆత్మహత్యలవైపు పురిగొల్పిన పాపాన్ని మరోరూపంలో కడిగేసుకోడానికి చేస్తున్న తెలంగాణా ప్రయత్నం తప్ప మరొకటి కాదు. తెలంగాణా ''ఖరారే'' అన్నప్పుడు, ప్రత్యేకరాష్ట్రం ఆచరణలో నిర్ణయాత్మకంగా ఖరారైన తరువాత మాత్రమే వాడవలసిన పదం. అంతేగాని, "ఖరారు'' కాకుండానే వాచా 'విజయోత్సవం' జరపడం కనీవినీ ఎరగని పోకడ! కాని పత్రికాధిపతి ఆత్మ‘విశ్వాసం’తో మాత్రమే ‘ఖరార’యిన ‘విజయం’ ఎలాంటిది? అదే స్థాయి పత్రిక మాటల్లో ‘‘హస్తిన (ఢిల్లీ)లో కసరత్‌ ముమ్మరం’’ ఎలా అంటే? కోర్‌ కమిటీ నుంచి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి, అక్కడి నుండి కేంద్రమంత్రివర్గానికి ఆ పిమ్మట రాష్ట్రపతిని నివేదన, ఆదరిమిలా రాష్ట్ర అసెంబ్లీలో ఎలాంటి నిర్ణయం చేయకుండా చర్చకు పరిమితం కావటం, ఆ తరువాత పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం, రాజ్యాంగ సవరణకు మూడింట రెండువంతుల మెజారిటీ అవసరం కాబట్టి, బిల్లు ‘నామ్‌కేవాస్తే’గా రూపొండం.. ఇలా ఎన్నో ‘సంకేతాల’ట! ఇలా ఊహాగానాలనే తెలంగాణా రాష్ట్రం వచ్చేసిందన్న ‘సంకేతాలు’గా మార్చడానికి జరిగిన ప్రయత్నం! ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తెచ్చి, తెలిసో తెలియకో తెలిసినట్టు నటించడం ద్వారా మరో అబద్ధానికి తెర ఎత్తుతోంది ఆ పత్రిక ఎలా?. ''ఆంధ్రప్రదేశ్‌ విభజన అనివార్యం! తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తథ్యం! వరుస పరిణామాలు ఇస్తున్న విసృష్ట సంకేతాలివి!   మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడే సమయంలో ముఖ్యమంత్రిగా వుండి, విభజన ఆనుపానులు తెలిసిన నేత దిగ్విజయ్‌సింగ్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమించడం మొదలు... స్వరం మార్చుకున్న కరడుగట్టిన తెలంగాణా వ్యతిరేకులు..!! ఇలా అబద్ధాల బిఠా ఆ పత్రిక వర్ణించింది. అంతగారు, అంతకు ముందు రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా పనిచేసిన గులామ్‌ నబీ అజాద్‌ స్థానంలో దిగ్విజయ్‌సింగ్‌ ‘‘నియామకమే తొలి అడుగ’’ని మహా ‘విశ్వసం’తో రాసేసింది. కాని రాష్ట్ర పర్యాటనలో ఇటు దిగ్విజయ్‌సింగ్‌గాని, అటు అజాద్‌గాని పలు ప్రకనల మధ్యనే విభజన ‘అనుభవాల’గురించి ఏమి చెప్పాలోమాత్రం ఆ పత్రిక వెల్లడిరచకుండా దాచిపెట్టింటి! బిజెపి`ఎన్‌డిఎ పరివార్‌ కేంద్ర ప్రభుత్వం మాధ్యప్రదేశ్‌ను బలవంతంగా విచ్చిన్నం చేసి ఛత్తీస్‌ఖడ్‌ రాష్ట్రాన్ని ఏర్పరచడం వల్ల తామెన్ని కష్టనష్టాలకు గురయ్యామో దిగ్విజయ్‌సింగ్‌ మన రాష్ట్ర పర్యటనలోనే మనకు గుర్తు చేయాల్సివచ్చింది! ‘యథాతథంగా  సమైక్యరాష్ట్రంగానే ఆంధ్రప్రదేశ్‌ను కొనసాగించినా అందుకు రాష్ట్రనాయకులంతా కట్టుబడి ఉండాల్సిందే’’నని కూడా ఆయన హెచ్చరించి పోయాడు! అంతేగాదు ‘‘రాష్ట్ర విభజన అనేది చాలా క్లిష్టమైదీ, బాధాకరమైనదీ, ఆ బాధేమిటో నేను స్వయంగా అనుభవించాను. అందువల్ల రాష్ట్రాన్ని విభజించడం ఆషామాషీ వ్యవహారం కాదు సుమా! మధ్యప్రదేశ్‌ విభజన జరిగినప్పుడు విద్యుత్‌ ప్రాజెక్టులన్నీ ఛత్తీస్‌గఢ్‌లో ఉంటే, వాడకందార్లందరూ మధ్య ప్రదేశ్‌లో ఉండిపోయారు...’’ అన్నారు దిగ్విజయ్‌సింగ్‌!   అలాగే అజాద్‌ కూడా లడఖ్‌ విభజన వల్ల మూడు జిల్లాలుగా కాంగ్రెస్‌ అన్ని సీట్లు గెలుస్తుందనుకుని విభజించనా కాంగ్రెస్‌ పూర్తిగా వోడిపోయిందని వాపోయాడు! వేర్పాటు వాదులకు అదీ ‘పరగడపై’పోయింది! ఇక పంజాబ్‌ విభజనవల్ల పంజాబ్‌ హర్యానా ప్రజలు ఇరువర్గాలూ ఘోరమైన ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ప్రసిద్ధ పాత్రికేయుడు కులదీప్‌నయ్యర్‌ మాటనూ ఆ పత్రిక మరిచిపోయి అబద్ధాలు అల్లడం విచారకరం! 'వేర్పాటు’వాదం చేసే రాజకీయ నిరుద్యోగుల్లో ఒకరు ఇప్పటిదాకా కేంద్రం ప్రకటన ఎందుకు రాలేదన్న పశ్నకు సమాధానంగా ‘ఎబ్బే‌, రాబోయే 122 రోజుల్లో వస్తుంద’ని చెప్పగా, ‘కాదు, కాదు 145 రోజుల్లోనే (ఇంకా అయిదు నెలలకట, అంటే డిసెంబర్‌నాటికి, అంటే 2014 ఎన్నికలకు మరో ‘గాలం’) ప్రకటన రాబోతోంద’ని మరొకరూ, ఇదీ అదీగారు, రానున్న 215 రోజుల్లోనే అంటే అంటే 2014 ఫిబ్రవరికల్లా (అంటే ఇదీ 2014 ఎన్నికలకు వేసిన గాలమే) ప్రత్యేకరాష్ట్ర ప్రకటన వెలువడుతుందని ఇంకొకరూ ఎవరికితోచిన ‘బుద్ధి’తో వారు ఉబుసుపోని ప్రకటనలు చేస్తూ యువకుల ఆత్మహత్యలకు బాధ్యత నుంచి తప్పించుకునే నానారకాల ‘పారుమాటలూ’చెబుతున్నారు!   అయితే ఇదే సందర్భంలో తెలంగాణాను ‘సీమాంధ్రులంతా దోచుకు తింటున్నార’ని బాహాటంగా మొత్తం ప్రజల్ని దోపిడీ దార్లుగా చిత్రించుతూ తెలంగాణా నుంచీ, హైదరాబాద్‌ నుంచీ టోకుగా ‘బంగీ కట్టి, కోస్తాంధ్రకు తోలేస్తామ’ని విషప్రచారాన్ని గత అయిదేళ్లుగా నిర్వహించిన తెలంగాణాలోని ‘బొబ్బిలి’వలసదారు నడమంత్రపు సిరిదారుడైన కె.సి.ఆర్‌, అతనికి అండగా నిలచిన ఆచార్యకోదండరామిరెడ్డి ఇప్పుడు గొంతులు మార్చారు! ఎందుకు? తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై వారికి అనుమానం వచ్చే బహుశా, గొంతులు మార్చారు. తమ‘పోరాటం’ తెలంగాణాను దోచుకునే ‘సీమాంధ్ర పెట్టుబడి దారులపైన’నే గాని సీమాంధ్ర ప్రజలపై కాదనీ, ‘‘సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్ర రాజకీయ పెత్తందార్ల పేరిట కృత్రిమ కుట్రల ఉద్యమం’అనీ వీరు గొంతు సవరించుకునే పరిస్థితి ఏర్పడిరది. ఇప్పటికైనా గొంతుకు తెచ్చుకున్న ‘సవరణ’మంచిదేగాని, అసలు ఒక్కటిగా ఉన్న తెలుగు జాతి ఎందుకు విడిపోవాలో వీరు సూటిగా సమాధానం ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు! తెలంగాణా ప్రజల్ని కోస్తాంధ్రుల న్యూనపరుస్తున్నారనీ, తెలంగాణా సాహిత్యాన్ని ‘దూషిస్తూ’న్నారనీ తెలంగాణా  సంస్కుతిని భ్రష్టు పట్టిస్తున్నారనీ తెలంగాణాను దోచుకోవడం ద్వారా కోస్తాంధ్రులు తెలంగాణాను ‘బికారి’గా మార్చారనీ, ‘అభివృద్ధి’ని కుంటుపర్చారనీ - ఇలా గణాంకాలతో, భౌతిక వాస్తవాలతో నిమిత్తంలేని వాదనలు చేస్తూ వచ్చారు.   సోదర తెలంగాణా ప్రజల్ని ఇంతకాలం న్యూనపరుస్తూ వచ్చిన ‘ఉద్యమ’నాయకులపై రాజకీయ నిరుద్యోగులే, గతంలోనూ ఇప్పుడూ మంత్రిపదవుల్లో ఉన్న తెలంగాణా నాయకుల్ని ‘దద్దమ్మలు, బలహీనుల’’నీ బహాటంగా ఆడిపోసుకుంటూ వచ్చింది కె.సి.ఆర్‌ ప్రభృతులే, చివరకు కాంగ్రెస్‌కు ఉద్యమాన్ని తాకట్టుపెట్టి, తానుగా ఆ ‘బలహీనుల’ జాబితాలో చేరిందీ కె.సి.ఆర్‌కి తెలంగాణా మిత్రులు కొందరు, తెలంగాణా  రాష్ట్ర ఏర్పాటును అభిలషిస్తున్న మిత్రులూ కొలది రోజుల నాడు ఏ సీమాంధ్ర పత్రికలోనూ కాదు, స్థానిక పెట్టుబడిదారుడైన రాజాం అధిపతిగా ఉన్న ‘నమస్తే తెలంగాణా’లో ప్రచురించిన వ్యాసంలో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత మన తెలంగాణాలో జరిగిన అభివృద్ధి గురించి రాసిన మాటలు సహృదయంతో పరిశీలించండి. సిక్కిం సెంట్రల్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న తెలంగాణా మిత్రులు డాక్టర్‌ ఓం ప్రసాద్‌గద్దె ఆ పత్రికలో ‘విభజన.. వ్యతిరేకుల వితండవాదాలు’’ అన్న మకుటం కింద తెలంగాణాలో విశాలాంధ్ర ఏర్పడిన తరువాత జరిగిన అభివృద్ధి గురించి జరిగిన యిలా పేర్కొన్నారు.   ‘తెలంగాణాలోని మారుమూల పల్లెలు సైతం ప్రభుత్వ పథకాలతో అభివృద్ధిబాటన నడుస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నది. అలాగే, తెలంగాణాలో పట్టు సాధించిన నక్సలైట్లను నిర్మూలించేందుకు ప్రభుత్వమూ, పోలీసులూ తీసుకున్న ప్రత్యేక చర్యలతో మావోయిస్టులు ప్రభావం కోల్పోయారు. ఒకప్పుడు నక్సలైట్లకు కంచుకోటగా ఉన్న తెలంగాణా పల్లెలు ఇప్పుడు అలాగే లేవు. ఇప్పుడు తెలంగాణా గ్రామీణ ప్రాంతం స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒకప్పటి జమిందారీ విదానం, దొరల దోపిడీ పీడనలు, భూస్వాముల ఆగడాలు లేవు. కాబట్టి ఇప్పుడు మళ్లీ మావోయిస్టులు తెలంగాణాలో పట్టుసాధిస్తారనడం ఆసమంజసం. (‘నమస్తే తెలంగాణా’’: 20`7`013)!   (ఇదిలా ఉండగా, ఈనెల (జూలై) 2వ తేదీన తెలంగాణా సమస్యపై ‘కాంగ్రెస్‌పైన వత్తిడిని పెంచే పేరిట అయిదు వామపక్షాల (సి.పి.ఎం. మినహా) ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర సదస్సు జరుపుతారట. ఈ వామపక్షాలలో ఒకటయిన ‘న్యూఢమోక్రసీ’ (మార్క్సిస్టు... లెనినిస్టు) పార్టీ రాష్ట్ర నాయకుడైన డి.వి.కృష్ణా ఒక ప్రకటన చేస్తూ చెప్పిన మాటలు అందరూ పరిశీలించదగినవిగా ఉన్నాయి. "రాష్ట్ర విభజన జరిగితే నక్సలైట్ల సమస్య పెరుగుతుందనడం, తెలంగాణా ఏర్పడకుండా ఉంటే నక్సలైట్లు నిజంగానే పెరుగుతారనుకోవడం అనే రెండు వాదనలూ సరైనవికావు. తెలంగాణా ఏర్పడినంత మాత్రాన సమసమాజ వ్యవస్థ నెలకొంటుందని భావించలేము. ఇప్పటిమాదిరిగానే అప్పుడు కూడా ప్రజలు అణచివేతలకు దోపిడీకి గురి అవుతూనే ఉంటారు.'' అయినప్పడు (తెలంగాణా రాష్ట్రం ఏర్పడినాగాని సమసమాజ వ్యవస్థ నెలకొన్నప్పుడు తెలుగు జాతి అనుపమానమైన త్యాగాల ద్వారా సాధించుకున్న ఆంధ్రప్రదేశ్‌ను సమసమాజ వ్యవస్థ ఏర్పడకుండానే బలవంతంగా రాజకీయ నిరుద్యోగుల పాక్షిక పదవీ ప్రయోజనాలకోసం బలిపెట్టవలసిన అవసరందేనికొస్తోంది? విభజన కేవలం ‘విభజన’కోసమా? ‘సమసమాజ వ్యవస్థ’ నెలకొనాల్సిన అవసరం ఒక్క తెలంగాణా ప్రాంతానికే పరిమితమా, లేక యావత్తు తెలుగుజాతి కలలపంటైన యావత్తు విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్‌) ప్రజలకూ, రాష్ట్రానికీ అవసరం లేదా? యావత్తు రాష్ట్రంలోనూ అలాంటి ఉత్తమోత్తమ వ్యవస్థ అవసరాన్ని మనసారా అభిలషించే అభ్యుదయ వాది ఎవడైనా ఒక ప్రాంతం అభ్యుదయాన్ని మాత్రమే కోరుకోవడం సోషలిజం ప్రాధమిక లక్ష్యానికే విరుద్ధం కాదా? సోషలిజం మాట పెరుమాళ్లకెరుక, ఒకనాటి సోషలిస్టు సోవియట్ యూనియన్ రాజ్యాంగరీత్యా విడిపోయే హక్కును దాని సమాఖ్య సభ్యజాతులకు యిచ్చి కూడా సమాఖ్య రూపురేఖలు ఎందుకని చెల్లాచెదరైపోవలసి వచ్చింది?   యూనియన్‌ నుంచి విడిపోయిన రిపబ్లిక్కులకు కొన్ని అమెరికా.... పెట్టుబడి పాలనా వ్యవస్థకు ‘జోహామీం’ అనవలసి వస్తోంది? ఆ మాటకొస్తే యూరప్‌లోని కొన్నిదేశాలో కొన్ని రాష్ట్రాలు (ఒకే జాతీయులు) విడిపోయి మళ్లీ కలుసుకోవడానికి దారితీసిన పరిణామాలేమిటి? సహజవనరులు, నీటి పంపిణీ, వాటి నిర్వహణ తాలూకూ తలెత్తిన సమస్యలూ, తలనొప్పులూ ‘వామపక్షు’లకు తెలియవా? నిన్నగాకమొన్న నైయినదీజలాల పంపిణీ ఈజిప్టు దాని ఇరుగు పొరుగుల మధ్య ఎంతటి తీవ్రతితీవ్రమైన ఘర్షణలకు దారి తీశాయో వామపక్షులకు తెలియదా?! ఈ మధ్యనే విడిపోయిన ఐక్యసూడాన్‌ (ఉత్తర ` దక్షణ సూడాకలుగా) రెండుభాగాలూ మళ్లీ ఎందుకు పునరేకీకరణకోసం తహతహలాడుతూ ‘సంప్రతింపుల అధ్యాయాన్ని తెరవవలసి వచ్చింది? ఒకే సైద్ధాంతిక పునాదిమీద ఏర్పడిన, మార్క్సిను భావజాలకుల మధ్య అనైక్యత కూడా ఒకే జాతిప్రజల మధ్య విభజనకు కృత్రిమ పునాదులు లేపుతోంది! ఇప్పటికైనా ‘వామపక్షులు’ తెలుగు ప్రజల, తెలుగు సమాజం పరిపూర్ణ ప్రయోజనాల దృష్ట్యా పునరాలోచన చేసుకుని, రెండు రకాల పరాయి పాలనలవల్ల చెల్లా చెదరై శతాబ్దాల పాటు పరాయి పంచలలో బతుకులాడిస్తున్న తెలుగువారందరినీ ఒక్క గూడికి చేర్చిన తెలంగాణా సాయూధ పోరాట స్ఫూర్తిని మరొక్కసారి పొంది చరితార్ధులు కాగలరని మనసారా కోరుకుందాం!!

తెలంగాణ పై దిగ్విజయ్ గోల్ మాల్

      తెలంగాణపై శుక్రవారం ఉదయం నుంచి హైడ్రామ నడిపిన కాంగ్రెస్‌ ఇరు ప్రాంతాల ప్రజలను ఊరించి చివరకు ఎటూ తేల్చలేక మరోసారి వాయిదా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బలగాలను మోహరిచటంతో ఇక తప్పకుండా ఏదో ఒక ప్రకటన వెలువడుతుందని భావించారు. కోర్‌ కమిటీ భేటి తరువాత దిగ్విజయ్ సింగ్ ఏం మాట్లాడుతారోనని ఉత్కంఠగా ఎదురు చూశారు.   దిగ్విజయ్ మాత్రం ... మీరు సిద్ధంగా ఉన్నారా? అని మీడియాతో అంటూ, మధ్యాహ్నం తాను చెప్పినట్లుగా సంప్రదింపుల ప్రక్రియ ముగిసిందని, పార్టీ, యూపిఏ ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి వేచిచూద్దామని చెబుతూ వెళ్లిపోయారు. కనీసం సిడబ్ల్యూసీ సమావేశం ఎప్పుడు ఉంటుంది, నిర్ణయం ఎప్పటి లోపు తీసుకుంటారనే విషయం పైన ఆయన మాత్రం స్పందించలేదు. డిగ్గీ ప్రకటన ఇటు తెలంగాణ నేతలకు అసంతృప్తిని మిగిల్చగా... సీమాంధ్ర నేతలలో మాత్రం ఉత్కంఠను కలిగిస్తోంది. ఆయన ప్రకటన ఇప్పుడు అందర్నీ కన్ఫ్యూజన్‌లో పడేసింది.

రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం

      రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. పలు జిల్లాలో బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల గుర్తులు తారుమారవడంతో ఆయా ప్రాంతాల్లో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఏజెంట్లు ఘర్షణకు దిగారు. కొన్ని జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.   రెండో విడతలో 6,971 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 1,910 కేంద్రాల్లో వెబ్‌కెమెరాల ద్వారా అధికారులు పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది. రెండు గంటలకు కౌటింగ్ ప్రారంభంకానుంది. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.

తేల్చుడు కాదు నాన్చుడే..!!

  తెలంగాణ విషయంపై మరోసారి కాంగ్రెస్‌ తన నిస్సహాయతను తెలిపింది.. శుక్రవారం ఉదయం నుంచి హైడ్రామ నడిపిన కాంగ్రెస్‌ ఇరు ప్రాంతాల ప్రజలను ఊరించి చివరకు ఎటూ తేల్చలేక మరోసారి వాయిదా వేసింది. ఉదయం జరగాల్సిన కోర్కమిటీ ప్రదాని ఆరోగ్య సమస్యల కారణంగా సాయంత్రానికి వాయిదా పడటం.. ఈ లోపు తెలంగాణ,సీమాంద్ర నాయకులుతో అధిష్టానం పెద్దలు సంప్రదింపులు జరపటం.. రాష్టర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బలగాలను మోహరిచటంతో ఇక శుక్రవారం తప్పకుండా ఏదో ఒక ప్రకటన వెలువడుతుందని భావించారు అంతా. దీనికి తోడు ఉదయం జరిగిన కోర్‌ కమిటీ భేటి తరువాత మీడియాతో మాట్లాడిన డిగ్గీ సంప్రదింపుల ప్రకియ ముగిసింది ఇక మిగిలింది పార్టీ నిర్ణయం తెలపటమే అనటంతో తప్పకుండా ప్రకటన వస్తుందని భావించారు అంతా. కనీసం సిడబ్ల్యూసి మీటింగ్‌ జరిగే తేది అయినా కరారవుతుందనుకున్నారు.. కానీ కాంగ్రెస్‌ నాయకులు ఏ నిర్ణయం తీసుకోలేక పోయారు.. ప్రకటన వెలువడుతుంది అనుకున్న తరుణంలోనే సీమాంద్ర నాయకులు తమ అస్త్రాలకు పదును పెట్టడం. కొందరూ రాజీనామాలు చేస్తామని తెగేసి చెప్పటంతో అధిష్టానం నిర్ణయం వాయిదా వేసుకుంది.. ఇన్నాళ్లుగా అనుకున్నట్టుగా తెలంగాణ తేనే తుట్టే కదిపే కాంగ్రెస్‌కు లేదని మరోసారి తేలిపోయింది.

భ‌య‌పెడుతున్న బ‌ల‌గాలు

  కేంద్రంలో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌ధ్యంలో పోలీస్ శాఖ ముందు జాగ్రత్త చ‌ర్యలు తీసుకుంటుంది..ప్రదానంగా సీమాంద్ర ప్రాంతాల్లో మోహ‌రిస్తున్న అద‌న‌పు బ‌ల‌గాలు స‌మాన్యుల‌ను భ‌య‌పెడుతున్నాయి.. ప్రత్యేక తెలంగాణ నిర్ణయం జరిగిపోయింద‌ని.. ప్రక‌ట‌న వెలువ‌డ‌నుంద‌న్న ఊహాగానాల నేప‌ధ్యంలో పోలీస్ శాఖ ముంద‌స్తూ జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే పోలీస్ శాఖ మాత్రం కేవ‌లం పంచాయితీ ఎన్నిక‌ల కోస‌మ‌నే బ‌ల‌గాల‌ను మోహరిస్తున్నామ‌ని చెపుతున్నా కేవ‌లం సీమాంద్ర ప్రాంతంతో పాటు, హైద‌రాబాద్‌లోనే ఈ బ‌ల‌గాల‌ను దించ‌టం చ‌ర్చల‌కు తావిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ఇవ్వాల‌న్న నిర్ణయం జ‌రిగిపోయింద‌ని సీమాంద్ర రాజ‌ధాని విష‌యంలోనే కోర్‌క‌మిటీ భేటి నిర్వహిస్తున్నార‌న్న వార్త కూడా ప్రచారంలో ఉంది.. ఇలా నిమిష నిముషానికి మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌ధ్యంలోనే పోలీస్ శాఖ అప్రమ‌త్తం అవుతుంది.. సీమాంద్రలోని అన్ని జిల్లాల్లో కేంద్ర బ‌ల‌గాల‌ను మోహ‌రించారు.  ఇప్పటికే కేంద్ర హోం మంత్రి తో స‌మావేశం అయి ప‌రిస్థితుల‌పై చ‌ర్చించిన డిజిపి దినేష్ రెడ్డి ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎద‌ర్కొన‌టానికి సిద్దం అవుతున్నారు.

స‌మైఖ్యవాదుల లేఖాస్త్రం

  శుక్రవారం డిల్లీలో రాజ‌కీయ ప‌రిణామ‌లు గంట‌కో మ‌లుపు తిరిగాయి.. ఉద‌యాన్నే జ‌ర‌గాల్సిన కోర్‌క‌మిటీ భేటి వాయిదా ప‌డ‌టంతో తెలంగాణ విష‌యంలో మ‌రోసారి కాంగ్రెస్ వెనుక‌డుగు వేసింది అనుకున్నారంతా.. ఈలోపు స‌మైఖ్యాంద్ర వాదులు త‌మ వాద‌న‌ను గ‌ట్టిగా వినిపిచ‌టంతొ అంతా డైలామాలో ప‌డ్డారు.. అయితే మ‌రోసారి డిగ్గీ త‌న మార్క్ రాజ‌కీయ చ‌తుర‌త చూపించారు.. ,మిని కోర్ క‌మిటీ భేటి నిర్వహించిన దిగ్విజ‌య్ ఇక సంప్రదింపులు ముగిసాయి.. నిర్ణయ‌మే త‌రువాయి అంటూ స‌మైఖ్యవాధుల గుండెల్లో గుబులు పుట్టించారు..   ఈ నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి శుక్రవారం సాయంత్రం ఓ లేఖ రాశారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు ఇంట్లో భేటి అయిన‌ సీమాంధ్ర మంత్రులు  ప్రత్యేక దూత తో తమ లేఖను సోనియాకు పంపించారు. ఏకపక్షంగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే తాము పార్టీకి, పదవులకు రాజీనామాలు చేస్తామని వారు తమ లేఖలో హెచ్చరించారు. తెలంగాణ‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవ‌టం వ‌ల్ల రాష్ట్రానికి గాని, పార్టీకి గాని ఎలాంటి ఉప‌యోగం లేద‌ని. పైగా సీమాంద్ర‌లో పార్టీ పూర్తిగా న‌ష్టపోవాల్సి వ‌స్తుంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెడితే వ్యతిరేకిస్తామని, పార్లమెంటులో బిల్లును కూడా వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. ఈ లేఖ మై రాష్ట్ర మంత్రుల‌తో పాటు ఐదుగురు ఎంపిలు కూడా సంత‌కాలు చేసిన‌ట్టుగా స‌మాచారం.

తెలంగాణ పై ప్రకటనే ఆలస్యం!

      తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోవడం కోసం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో ఏర్పాటైన ఈ భేటీకి యుపిఐ ఛైర్ పర్సన్ సోనియాగాందీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్,హోం మంత్రి షిండే,అజాద్ ,అహ్మద్ పటేల్ ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే సిడబ్ల్యుసి సమావేశం ఎప్పుడు నిర్వహించాలనేది కూడా నిర్ణయిస్తారని చెబుతున్నారు. తెలంగాణపై దాదాపు ఒక అబిప్రాయానికి వచ్చిన అధిష్టానం విదివిధానాలపై దృష్టి సారించవచ్చని చెబుతున్నారు.   మరోవైపు తెలంగాణ అంశంపై కేంద్రం తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణాకు సంబంధించిన నిర్ణయం అయిపోయిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనను కలిసిన సీమాంధ్ర మంత్రులకు చెబుతున్నట్టు తెలుస్తున్నది. అసలు సమస్యపై నిర్ణయం తీసేసుకున్న దృష్ట్యా ఇక సీమాంధ్ర రాజధాని ఎక్కడ అన్న అంశంపై మాత్రమే నిర్ణయం జరగవలసి ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే చివరి అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధికి లేఖ రాయాలని సీమాంద్ర నాయకులకు ముఖ్య.మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచించినట్టు తెలుస్తున్నది.

తెలంగాణ పై జగన్ నిర్ణయం!

      అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్ గుడా జైలులో ఉన్న వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు శ్రీకాంత్ రెడ్డి, వంగవీటి రాధా, కొడాలి నానిలు కలిశారు. అవనిగడ్డ ఉప ఎన్నిక, పార్టీలో రాజుకున్న తెలంగాణ రాజీనామాల వేడి పై ఈ సంధర్బంగా చర్చించినట్లు సమాచారం. తెలంగాణపై త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకుందామని, ప్రస్తుతానికి వాతావరణాన్ని కూల్ చేయాలని జగన్ వారికి నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది. జగన్‌తో భేటీ అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... విభజనపై కాంగ్రెసు పార్టీ నిరసిస్తూ రాజీనామాలు చేయడం తమ వ్యక్తిగతమని, అది పార్టీ నిర్ణయం కాదని చెప్పారు. తెలంగాణపై పార్టీ వైఖరిని రెండు రోజుల్లో తెలియజేస్తామన్నారు. ఏ ప్రాంతానికి నష్టం జరగకుండా ఈ సమస్యను కేంద్రం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

దొందూ దొందే

  సాదార‌ణ ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతుండ‌టంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బిజెపిల్లో ప్రదాని అభ్యర్ధిత్వం పై వార్తలు జోరుగా సాగుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీ అఫిషియ‌ల్‌గా ప్రక‌టించ‌క‌పోయినా ఈ సారి త‌ప్పకుండా రాహుల్ గాంధీ యే త‌మ ప్రదాని అభ్యర్ధి అని నాయ‌కులంతా చెపుతున్నారు. అయితే ఈనేప‌ద్యంలో బిజెపిలో మాత్రం ప్రదాని అభ్యర్ధిత్వంపై సందిగ్ధత కొన‌సాగుతుంది. పార్టీలో మోడీ అభ్యర్ధిత్వానికి మ‌ద్దతు ప‌లికే వారు చాలా మందే ఉన్న వ్యతిరేకించే వర్గం కూడా బ‌లంగానే ఉంది.. దీంతో ఇప్పుడు భావి ప్రదాని ఎవ‌రు అనే చ‌ర్చ జ‌రుగుతుంది.. స‌ర్వేలు కాస్త మోడి వైపు మొగ్గు చూపిన గ‌త రికార్డులు మాత్రం మోడిని వెంటాడుతూనే ఉన్నాయి.. ఈ విష‌యంపై  సామాజిక ఉద్యమ‌కారుడు అన్నాహ‌జ‌రే త‌న అభిప్రాయాన్నిచెప్పారు.. ఫరూఖాబాద్ జ‌నతంత్ర యాత్రలో పాల్గొంటున్న హ‌జ‌రే మోడి, రాహుల్‌ల అభ్యర్ధిత్వంపై మాట్లాడారు.. త‌న దృష్టిలో ఈ ఇద్దరు ప్రదాని ప‌ద‌వికి అర్హులు కార‌న్నారు అన్నా..

సంప్రదింపులు ముగిసాయి.. ఇక నిర్ణయ‌మే

  డిల్లీ లో వెడెక్కిన తెలంగాణ‌ రాజ‌కీయం.. ఇవాళ కోర్ క‌మిటీ నేపధ్యంలో ఢిల్లీ చేరిన రాష్ట్ర నాయ‌క‌త్వం అక్క‌డ జోరుగా మంత‌నాలు చేస్తుంది.. ఇప్పటికే తెలంగాణ అంశంపై ఓ నిర్ణయానికి వ‌చ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఆఖ‌రిసారిగా సియం పిసిసి చీఫ్ ల అభిప్రాయాల‌ను తీసుకుంది.. ఈ రోజు ఉద‌యం జ‌ర‌గాల్సిన కోర్‌క‌మిటీ భేటి వాయిదా ప‌డ‌టంతో, మ‌ధ్యాహ్నం దిగ్విజ‌య్ సింగ్ అందుబాటులో ఉన్న నాయ‌కుల‌తో మినీ కోర్‌క‌మిటీ భేటిని నిర్వహించారు.. ఈ భేటి త‌రువాత దిగ్విజ‌య్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్రకంప‌న‌లు పుట్టిస్తున్నాయి. మినీ కోర్‌క‌మిటీ భేటి త‌రువాత మీడియాతో మాట్లాడిన దిగ్విజ‌య్ తెలంగాణ పై సంప్రదింపుల ప్రక్రియ ముగిసింద‌ని, ఇక నిర్ణయం వెలువ‌డాల్సి ఉంది అని ప్రక‌టించారు. దీంతో ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ధ్యం అన్న వాద‌న బ‌లంగా వినిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం భేటి అవుతున్న కోర్ క‌మిటీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశం పై ఓ నిర్ణయానికి రానుంది అంటున్నాయి పార్టీ వ‌ర్గాలు.

అనిశ్చిత స్థితిలో రాష్ట్రం

  పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లు వైకాపా ఎత్తుకొన్న సమైక్యరాగంతో ముందుగా ఆ పార్టీకి చెందిన తెలంగాణా నేతలు, ఆ తరువాత కాంగ్రెస్, తెదేపాలకు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే, వైకాపా తెలంగాణా నేతలు అధ్యక్షురాలు విజయమ్మతో జరిపిన చర్చలు విఫలమయినట్లు వార్తలు వస్తున్నాయి. వారు మళ్ళీ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మరో మారు సమావేశం అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కూడా చర్చలు విఫలమయితే, వారు తట్టాబుట్టా సర్దుకోవడానికి సిద్దంగా ఉన్నారు.   ఇక, కాంగ్రెస్ కోర్ కమిటీ కూడా సరిగ్గా నాలుగు గంటలకే డిల్లీలో సమావేశం అవుతోంది. అందులో తెలంగాణాపై ఏదో ఒకటి తేల్చుకొని, ఆ తరువాత ఒకటి రెండు రోజుల్లో వర్కింగ్ కమిటీలోఅంతిమ నిర్ణయమ ప్రకటించే అవకాశాలున్నాయి. అందువల్ల కాంగ్రెస్ వైకాపా రాజీనామాలను పట్టించుకొనే స్థితిలో లేదిప్పుడు.   ఇక, తెలుగుదేశం పార్టీ నేతలెవరూ కూడా, వైకాపా చేసిన రాజీనామాలపై గానీ, కేంద్రంలో జరుగుతున్న సమావేశాల గురించి గానీ, ఎటువంటి వ్యాక్యాలు చేయవద్దని, ముఖ్యంగా వైకాపా ముగ్గులోకి లాగే ప్రయత్నం చేస్తున్నందున మరింత అప్రమత్తతతో మెలగాలని చంద్రబాబు తన నేతలందరికీ ఖచ్చితమయిన ఆదేశాలు ఇచ్చికట్టడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజులలో కాంగ్రెస్ రాష్ట్ర విభజనపై ఖచ్చితమయిన ఒక నిర్ణయం తీసుకొన్న తరువాతనే స్పందించడం మంచిదని అంతవరకు సమన్వయము పాటించడం మేలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ సిద్దమయితే, అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తన సీమంధ్ర నేతలను అదుపుచేయక తప్పదు. అప్పుడు సహజంగానే తెదేపాపై ఒత్తిడి తగ్గుతుందని చంద్రబాబు అంచనా.   కాంగ్రెస్, తెదేపాలు రెండూ కూడా తమ నేతలను నియంత్రించుకొనగలిగితే అకస్మాత్తుగా సమైక్యరాగం అందుకొన్న వైకాపా అప్పుడు రెండు ప్రాంతాలలో ఒంటరి అయ్యే అవకాశం ఉంది. అందువల్ల తెదేపా అధికార ప్రతినిధులు తప్ప ఇతర నేతలెవరూ కూడా ప్రస్తుత పరిణామాలపై మీడియాకెక్కి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. మరొక మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో నెలకొన్న ఈ అనిశ్చితస్థితి తొలగిపోవచ్చును. అప్పుడు ఎవరు కొత్తగా ఉద్యమ బాట పడతారో, ఎవరు పైచేయి సాధిస్తారో, ఎవరు నష్టపోతారో చూచాయగా తెలిసిపోవచ్చును.

త్వరలో తెలంగాణపై నిర్ణయం

      తెలంగాణ పై కాంగ్రెస్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కాంగ్రెసు పార్టీ వార్ రూమ్‌లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌తో భేటీ అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై నిర్ణయం చెప్పేందుకే తమ పార్టీ అధిష్టానం ఈ సమావేశాలు నిర్వహిస్తోందని, వైకాపా డ్రామాలు ఆపాలని అన్నారు. త్వరలో తెలంగాణపై కాంగ్రెసు పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలు ఉంటాయన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజీనామాలతో డ్రామాలు ఆడుతోందన్నారు. వారు డ్రామాలు ఆపి తెలంగాణపై తమ పార్టీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీలోనే స్పష్టమైన వైఖరి లేదన్నారు. త్వరలో తమ పార్టీ విధానం చెబుతామన్నారు.

తెరాసకు జీవం పోసిన వైకాపా వ్యూహం

  కాంగ్రెస్ తెలంగాణా అంశాన్ని తన చేతిలోంచి కాకిలా తన్నుకుపోయిన తరువాత, దిగాలుపడిన తెరాసకి మొన్న వెలువడిన మొదటి విడత పంచాయతీ ఫలితాలు మరో పెద్ద షాకిచ్చాయి. ఇటువంటి పరిస్థితిలో ఏమిచేయాలో, ఏవిధంగా స్పందించాలో తెలియని తెరాస అధినేత కేసీఆర్ మళ్ళీ తన గుహలోకి (ఫాంహౌసులోకి) వెళ్ళిపోయారు. ఇటువంటి క్లిష్ట సమయంలో వైకాపా శాసనసభ్యులు సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకొని రాజీనామాలు చేయడంతో మళ్ళీ తెరాసకు శ్వాస ఆడింది.   సీమంధ్ర ప్రాంతానికి చెందిన నేతల అద్వర్యంలో నడుస్తున్న పార్టీలు, తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడేందుకే ఈ రాజీనామా డ్రామాలు మొదలుపెట్టాయని, వాటిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే వెనుకనుండి ప్రోత్సహిస్తున్నారని తెరాస నేత హరీష్ రావు ఆరోపించారు.   ఇంతవరకు ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆకర్షించడానికి ఎన్నితిప్పలు పడినప్పటికీ, ఆ పార్టీలో నలుగురైదుగురు పెద్ద నేతలు తప్ప ఎవరూ చేరలేదు. ఆ చేరిన వారిలో మళ్ళీ కాంగ్రెస్ యంపీలు వివేక్, మందా జగన్నాథం ఇద్దరూ కూడా ఏక్షణంలోనయినా తిరిగి కాంగ్రెస్ గూటికి ఎగిరిపోయెందుకు సిద్దంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైకాపా తెలంగాణాలో అకస్మాతుగా బోర్డు తిప్పేయడంతో ఆ పార్టీకి చెందిన నేతలు,తప్పని పరిస్థితుల్లో తెరాసనే ఆశ్రయించవచ్చును.   అదేవిధంగా కాంగ్రెస్ తన ప్రమేయం లేకుండా తెలంగాణాపై నిర్ణయం తీసుకోవడానికి సిద్దపడటం జీర్ణించుకోలేని తెరాస నేతలకు, ఇప్పుడు వైకాపా రాజేసిన ఈ సమైక్యాంధ్ర మంటతో మళ్ళీ తెలంగాణా ప్రక్రియ ఆగిపోతే, అప్పుడు కాంగ్రెస్ తో సహా అన్ని రాజకీయపార్టీలతో తెలంగాణాలో చెడుగుడు ఆడేసుకొనే అవకాశం కూడా తప్పకుండా దొరుకుతుంది. నేడు వైకాపా రాజేసిన మంట రేపు తెలుగుదేశం పార్టీని తాకక మానదు. అప్పుడు తెదేపా గనుక మళ్ళీ తెలంగాణపై మాట మార్చితే అది తెరాసకు మరో ఆయుధంగా అందివస్తుంది.   కనీసం సీమంధ్ర ప్రాంతంలోనయినా బలపడాలనే ఆలోచనతో వైకాపా వేసిన ఈ ఎత్తుతో, వైకాపా ముందు తన తెలంగాణా ప్రాంత సభ్యులను పోగొట్టుకోవడమే కాకుండా తెరాసకు మరో లైఫ్ పాయింటు అందించింది.