విశ్వసనీయత అంటే ఇదేనా

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సమైక్యాంధ్ర కోరుతూ నిన్న అకస్మాత్తుగా రాజీనామాలు సమర్పించడంతో ఆ పార్టీకి చెందిన తెలంగాణా నేతలు కంగు తిన్నారు. తెరాస విసురుతున్న సవాళ్ళను తట్టుకొంటూ పార్టీకోసం అవమానాలు భరిస్తూ పనిచేస్తున్న తమతో కనీసం చర్చించకుండా మాట మాత్రమయినా చెప్పకుండా పార్టీ ఈవిధమయిన నిర్ణయం తీసుకోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తీసుకొన్నఈ నిర్ణయంతో పార్టీనే నమ్ముకొన్నతమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరం అయిపోయిందని వాపోతున్నారు. ఒకప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా తెలంగాణాలో ఆయన అభిమానులు ఆ పార్టీకోసం లక్షలు ఖర్చుబెట్టి నష్టపోయిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకొంటున్నారు. తాము కూడా వైకాపా కోసం చాలా ఖర్చుచేసి, తెలంగాణాలో బలమయిన తెరాసను డ్డీకొంటూ పార్టీని కాపాడుకొంటున్నామని, అయినప్పటికీ పార్టీ తమపై ఏమాత్రం విశ్వాసం చూపకుండా అకస్మాత్తుగా ఈవిధంగా తెలంగాణాలో బోర్డు తిప్పేయడం చాలా అన్యాయమని వారు వాపోతున్నారు. ఆ పార్టీకి చెందిన కొండా సురేఖ కేవలం స్వర్గీయ వైయస్సార్ పట్ల తమకున్న కృతజ్ఞతా భావంతో తాను వైకాపాకోసం తన మంత్రి పదవికి, శాసనసభ సభ్యత్వానికి చివరికి కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామాలు చేసివస్తే, ఇప్పుడు పార్టీ ఈవిధంగా చేసి తమను చాల ఘోరంగా దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీనామాల వ్యవహారంపై విజయమ్మ వెంటనే స్పష్టమయిన ప్రకటన చేయాలని కొండా సురేఖతో సహా ఆపార్టీకి చెందిన తెలంగాణా నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైకాపా చేసిన ఈ పని వల్ల తమపై కూడా ప్రజలలో అపనమ్మకం ఏర్పడుతుందని తెదేపా నేతలు భయపడుతున్నారు.   వైకాపా తన రాజకీయ మనుగడకు చాలా గొప్ప నిర్ణయమే తీసుకొన్నట్లు భావించవచ్చు గాక, కానీ ఆ పార్టీ తన తెలంగాణా నేతలకి ఏమని సమాధానం చెపుతుందిప్పుడు? విస్వసనీయతకు మారుపేరుగా చెప్పుకొనే ఆ పార్టీ తన తెలంగాణా నేతల రాజకీయ భవిష్యత్తును ఏమాత్రం పట్టించుకోకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఎటువంటి విశ్వసనీయత?

కాంగ్రెస్ నెల్లూరు ఎమ్మెల్యేల రాజీనామా

      ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలనే ఒత్తిడి పెరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరూ ఎమ్మెల్యే లు రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తమ పదవులకు రాజీనామాలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి రాజీనామా తర్వాత ఈ రోజుల వీరిద్దరూ చేయడం విశేషం. ఇప్పటికే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు ప్రకటించారు.

బొత్స ఎంపైరింగ్ అంటే మాటలా మరి

  రాష్ట్ర విభజన అంశం నిర్ణయాత్మక దశకు చేరుకోవడంతో రెండు ప్రాంతాల నేతలు తమతమ ‘స్టార్ బ్యాట్ మ్యాన్స్’తో డిల్లీలో జరగబోయే ఫైనల్ గేంకి సిద్దం అయ్యారు. ఈ గేంలో తనకీ సమైక్యాంధ్ర తరపున బ్యాటింగ్ చేయాలనీ ఉన్నపటికీ, రాష్ట్ర హితం కోరే పెద్దమనిషిగా ‘న్యూట్రల్ ఎంపైర్’ పాత్ర పోషిస్తానని బొత్ససత్యనారాయణ శలవిచ్చారు. ఇక ఫీల్డింగులో ఉన్నకొందరు సీమంధ్ర నేతలు ఆట మద్యలో వెళ్ళిపోతే తానేమీ చేయలేనని, ఆట చివరివరకు ఆడదలచుకొన్నవారికి మాత్రమే చివరాఖరున ‘రాష్ట్ర విభజన కప్పు’ స్వీకరించే అర్హత ఉంటుందని ఆయన స్పష్టం చేసారు.   తానూ ఎంపైర్ గా ఉన్నపటికీ తన సీమంద్ర టీం గెలవాలని మనసారా కోరుకొంటున్నానని స్పష్టం చేసారు. అదేవిధంగా తమ స్టార్ బ్యాట్స్ మ్యాన్ కిరణ్ కుమార్ రెడ్డికి తానూ కాలు అడ్డుపెట్టి, జైపాల్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడుతున్నట్లు వస్తున్న వార్తలు కేవలం మీడియా సృష్టేనని ఆయన తెలిపారు. ఒకవేళ ఆయన బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున తన కాలు అడ్డం పెట్టినా, దానిని మీడియా వాళ్ళు ఫాల్స్ రిపోర్టింగ్ చేసేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.   ఇక, వైకాపాకి చెందిన 11మంది ప్లేయర్లు గ్రౌండులోకి రాకుండానే గేం డిక్లేర్ చేసి వెళ్ళిపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. పంచాయితీ ఎన్నికలలో క్లీన్ బౌల్డ్ అయిపోవడం వలననే వైకాపా పాత గేం పక్కనబెట్టి, మరో కొత్త గేం మొదలుపెట్టాలని చూడటం ఫౌల్ గేం అవుతుందని ఆయన అన్నారు. తమ కాంగ్రెస్ ఫ్రాంచైసర్లు(అధిష్టానం) ఏ టీముని ఇచ్చినప్పటికీ తాను చక్కగా ఎంపైరింగ్ చేయగలనని, తనకు ఏ టీమయినా ఒకటేనని ఆయన చెప్పారు.

రాజీనామలపై కొండా ఆగ్రహం

      మరోసారి కొండా సురేఖ పార్టీ పై దిక్కార స్వరం వినిపించారు.. తెలంగాణ పై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తమ ఎమ్మేల్యేలు శాసన సభ్యత్వాలకు రాజీనామ చేసిన నేపధ్యంలో కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేవారు.. గతంలో కూడా పార్టీలో తమకు సముచిత స్థానం దక్కటం లేదని పక్కచూపులు చూసిన కొండా దంపతులు. నాయకత్వం బుజ్జగింపులతో తిరిగి పార్టీలో కొనసాగారు..   ప్రస్థుతం మరోసారి ఎమ్మెల్యే రాజీనామాల విషయం కూడా తమ దృష్టికి రాకుండానే జరగటంతో సురేఖ మండిపడ్డారు.. ఇలాంటి పరిణామాలతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కేవలం సీమాంద్ర పార్టీగా మిగిలిపోతుందన్నారు.. ఈ విషయంపై పార్టీ అధినాయకురాలు విజయమ్మ సమాధానం చెప్పాలని కొండా సురేఖ డిమాండ్‌ చేశారు.. విలైనంత త్వరగా పార్టీ స్పందించి ఎమ్మేల్యేల రాజీనామాలు పార్టీ పరంగా జరిగినవా లేక, వారి వ్యక్తిగతంగా చేశారా అన్నది తేల్చని పక్షంలో పార్టీని విడటానికి కూడా వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు.. త్వరలొ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తెలంగాణ నాయకులంతా కలిసి ఓ నిర్ణయం తీసకుంటామని చెప్పారు.

తెలంగాణలో సమైఖ్యగానం

      దేశ రాజకీయాల్లో తెలంగాణ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అసలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వాదం కు ఉన్న బలం ఎంత అన్న వాదన మొదలైంది.. ఇన్నాళ్లు తెలంగాణలోని ప్రతి వ్యక్తి ప్ర్యతేక రాష్ట్రం కోరుకుంటున్నాడంటూ చెపుతూ వచ్చిన కొంత మందికి ప్రస్థుత పరిస్థితులు మింగుడు పడటం లేదు..   ప్రస్థుత రాష్ట్ర రాజదానిగా ఉంటూ ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాజధానిగా కూడా ఉండే హైదరాబాద్‌లోనే తెలంగాణ వాదం అంత బలంగా లేదంటున్నారు.. ఇక్కడ బలమైన ఓటు బ్యాంక్‌ ఉన్న మజ్లీస్‌ పార్టీతో పాటు.. కొంత మంది అధికార కాంగ్రెస్‌ నాయకులకు కూడా సమైఖ్య రాష్ట్రనికే సై అంటున్నారు.. ముఖ్యంగా భాగ్యనగర్‌ బ్రదర్స్‌గా పేరు పడిన దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌లు మొదటి నుంచి తెలంగాణ వాదం పై భిన్న వాదనలు వినిపిస్తున్నారు.. ఇప్పుడు వీరి వాదానికి మరింత బలం చేకూరుస్తూ ఎమ్మేల్యే జగ్గారెడ్డి కూడా సమైక్యరాగం అందుకున్నారు.. తెలంగాణ ప్రాంతంలోని ప్రజలందరూ ప్ర్యతేక రాష్ట్రం కోరుకుంటున్నారనడం అవాస్తవమని ఇక్కడి ప్రజల్లో కూడా చాలా మంది కలిసుండాలని కోరుకుంటున్నారన్నరు..

కోర్‌ కమిటీ మీటింగ్‌ వాయిదా

      తెలంగాణపై రాజకీయాలు వేడెక్కుతుండటంతో కేంద్రంలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.. ఇప్పటికే పలువురు తెలంగాణ, సీమాంద్రనాయకులు డిల్లీలో ఉంటూ తమ పరిది మేరకు లాభియింగ్‌లు చేస్తున్నారు.. ఈ నేపధ్యంలో ఇవాళ జరగాల్సిన కోర్‌కమిటీ బేటిని కాంగ్రెస్‌ అధిష్టానం వాయిదా వేసింది..   కోర్‌కమిటీ వాయిదాకు ప్రదాని ఆరోగ్యసమస్య కారణంగా చూపుతున్నా దీని వెనుక మరేదో ఉదంటున్నారు విశ్లేషకులు.. సీయం సహ పలువురు రాష్ట్ర నాయకులను ఢిల్లీ పిలిపించిన తరువాత ఇలా అర్ధాతరంగా వాయిదా వేయడం పై అంతా చర్చించుకుంటున్నారు.   కోర్‌ కమిటీ బేటి జరిగే నేపధ్యంలో తెలంగాణ సమస్య ప్రస్ధావనకు వస్తుంది.. ఆ విషయంపై ఎటూ తేల్చలేకపోయినా కనీసం సిడబ్లూసి మీటింగ్‌ డేట్‌ అయినా ఎనౌన్స్‌ చేయాల్సి వస్తుంది.. ప్రస్థుతం పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాటం సరికాదని భావించిన కేంద్రం కోర్‌కమిటీ మీటింగ్‌ వాయిదా వేసింది..

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం: 80 మృతి

      స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 80 మృతి చెందగా...140 మంది తీవ్రంగా గాయపడ్డారు. శాంటియాగో డి కంపోస్టీలాలోని నార్త్ స్పానిష్ సిటీలో రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. 13 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.   గంటకు 180 కి.మీతో వస్తున్న రైలు మలుపు వద్ద ఎనిమిది బోగీలు పట్టాలు తప్పి అదేవేగంతో వెళ్లి పక్కనున్న గోడను ఢీకొట్టాయి. దీంతో భారీ శబ్దం రావడంతో.. స్థానికులు భూకంపం వచ్చిందన్న భయంతో పరుగులు తీశారు. తీరా.. చూసేసరికి రైలు ప్రమాదం! రైలు ఎగిరిపడటంతో మంటలు వ్యాపించి.. అందులోనే 73 మంది సజీవదహనమయ్యారు. మరో ఐదుగురు అసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు. వెంటనే స్పందించిన ప్రభుత్వ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు.  స్పెయిన్ రైల్వే చరిత్రలో వందలాది మందిని బలి తీసుకున్న 1944 దుర్ఘటన తరువాత మళ్లీ ఇదే అతిపెద్ద ప్రమాదమని, దీనికి కారణం మలుపులో రైలు మితిమీరిన వేగమేనని నిపుణులు చెబుతున్నారు. సంఘటనాస్థలిని ప్రధానమంత్రి మారియానో రాజోయ్ సందర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వెల్లడించారు.

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ నెహ్రూ ఇకలేరు

      కేంద్ర మాజీ మంత్రి అరుణ్ నెహ్రూ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి 10.47 గంటలకు గుర్గావ్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య సుభద్ర,ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జన్మించిన అరుణ్ నెహ్రూ మూడు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. రాజీవ్ గాంధీ హయాంలో ఆయన రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖను నిర్వహించారు. ఆ తర్వాత ఆయన రాజీవ్ గాంధీతో విభేదించి జన మోర్చాను ఏర్పాటు చేసిన విపి సింగ్‌తో చేతులు కలిపారు. ఢిల్లీలోని లోడీ శ్మశాన వాటికలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

వాజ్ పేయి కోరితే భారతరత్న వాపసుకి సిద్ధం: అమర్త్యసేన్

  నోబెల్ మరియు భారతరత్నవంటి అత్యున్నత అవార్డులు అందుకొన్న ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ ఇటీవల తాను నరేంద్ర మోడీని దేశ ప్రధానిగా అంగీకరించలేనని ప్రకటించడం ఒక సరికొత్త వివాదానికి దారి తీసింది. ఆయన ఎన్డీయే ప్రభుత్వ హయంలో నాటి భారతప్రధాని అటల్ బీహారీ వాజపేయి చేతుల మీదుగా భారతరత్నఅవార్డు అందుకొన్నారు. ఇప్పుడు ఆయన మోడీకి వ్యతిరేక వ్యాక్యలు చేయడంతో ఆ పార్టీకి చెందిన చందన్ మిత్రా అనే నేత, అమర్త్యసేన్ కనీసం భారతదేశంలో ఓటరుగా ఉండే హక్కు కూడా లేదని తీవ్రంగా విమర్శించారు. అంతే గాక, బీజేపీ హయంలో ఆయన పుచ్చుకొన్న భారత రత్న అవార్డును కూడా వెనక్కు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసారు. దీనితో తీవ్రంగా నొచ్చుకొన్న అమర్త్యసేన్, తనకు ఆ అవార్డు ప్రధానం చేసిన వాజపేయి కోరితే, తను తప్పకుండా ఆ అవార్డుని వెనక్కి తిరిగి ఇచ్చేస్తానని జవాబిచ్చారు. కానీ, అవార్డుని వెనక్కి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం చాల దురదృష్టమని అన్నారు. ఈ సంఘటన రాజకీయ పార్టీల పెరుగుతున్న అసహనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో ఆయనతో సహా ప్రజలందరికీ కూడా భావ ప్రకటన స్వేచ్చఉంది. అయితే, కొందరు రాజకీయ నాయకులు దానిని మన్నించలేకపోవడం నిజంగా విచారకరమే. మోడీని ఈ దేశంలో ఎంతమంది అభిమానిస్తున్నారో, అంతే మంది వ్యతిరేఖిస్తున్నారు కూడా. చివరికి ఆ పార్టీ సీనియర్ నేత అద్వానీతో సహా పలువురు నాయకులు మోడీని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నవిషయం అందరికీ తెలిసిందే. మరటువంటప్పుడు, సదరు బీజేపీ నేత చందన్ మిత్రా అద్వానికీ, బీజేపీలో మోడీని వ్యతిరేఖిస్తున్నవారికీ, మోడీని వ్యతిరేఖిస్తున్న భారతీయులకీ కూడా అదే సూత్రం వర్తింపజేయగలరా?

రాయలసీమలో మొదలయిన రాజకీయ అల్పపీడనం

  కమలాపురం కాంగ్రెస్ శాసనసభ్యుడు వీరశివారెడ్డి రాజీనామాతో రాయలసీమలో రాజకీయ అల్పపీడనం మొదలయి, పదకొండు మంది వైయస్సార్ కాంగ్రెస్ శాసన సభ్యుల రాజీనామాలతో పెను తుఫానుగా మారి, అది తెలంగాణాలో ఉరుములు, మెరుపులు సృష్టిస్తోంది.   సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 11మంది శాసన సభ్యులు రాజీనామాలు చేసారు. వారు: శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ); బాలినేని శ్రీనివాసరెడ్డి(ఒంగోలు); గుర్నాథరెడ్డి (అనంతపురం); అమర్ నాథరెడ్డి(రాజంపేట); భూమన కరుణాకరరెడ్డి( తిరుపతి); మేకపాటి చంద్రశేఖరరెడ్డి(ఉదయగిరి); శ్రీనివాసులు(రైల్వేకోడూరు); శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి); పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల); కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం) మరియు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (కోవూరు). వీరందరూ తమ రాజీనామా లేఖలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ఫాక్స్ ద్వారా ఈ రోజు పంపారు.   ఇక నేడో రేపో తెలంగాణా రాబోతోందని ఆత్రుతగా ఎదురు చూస్తున్న తెలంగాణా ప్రజలకు, తెలంగాణా వాదులకు, ముఖ్యంగా టీ-కాంగ్రెస్ నేతలకు, తెలంగాణా విద్యార్ధులకు ఇది తీవ్రఆగ్రహం కలిగించింది. వైసీపీ శాసన సభ్యులు రాజీనామాలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఓయూ జేఏసీ అందుకు నిరసనగా తెలంగాణాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణా కార్యకర్తలు, నేతలు అందరూ కూడా పార్టీని వీడాలని కోరింది. జగన్, విజయమ్మల దిష్టి బొమ్మలు దగ్ధం చేసి వారు తమ నిరసన తెలిపారు. తెలంగాణను అడ్డుకొనే ఆ పార్టీలో ఎవరూ కొనసాగరాదని, వెంటనే పార్టీని వీడి ఉద్యమంలోకి రావాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని వారు హెచ్చరించారు. బహుశః త్వరలో ఆ పార్టీకి చెందిన తెలంగాణా కార్యకర్తల, నేతల రాజీనామాలు మొదలయ్యే అవకాశం ఉంది.   ఇక, ఈ వేడి తెలుగుదేశం పార్టీని కూడా తాకితే, ఆ పార్టీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో, రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన చంద్రబాబు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

విభజిస్తే ఎంతకైనా తెగిస్తాం

      రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రాన్ని, రాయలసీమను విభజించే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారని శ్రీకాంత్ ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నారు. రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించవద్దని ఆయన కోరారు. విభజన విషయంలో నిర్ణయం తీసుకునే ముందు అన్ని పార్టీల నిర్ణయం తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆటాడుకుంటోందని ఆయన విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాను ఎప్పుడో రాజీనామా లేఖ ఇచ్చానని, ఈ విషయంలో తన చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాజీనామా చేస్తామని సీమాంధ్ర మంత్రులు చెప్పడం ఓ డ్రామా అన్నారు. ఆ నేతలకు ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని సవాల్ చేశారు.

ఎమ్మెల్యే బాలినేని రాజీనామా!

      ఒంగోలు ఎమ్మెల్యే వైఎస్ఆర్.కాంగ్రెస్ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలని కోరుతూ ఎమ్మెల్యే బాలినేని పదవికి రాజీనామా చేసినట్లు ఒంగోలులోని తన కార్యాలయంలో నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవిభజన కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాష్ట్ర నేతలతో చర్చలు జరిపే నేపధ్యంలో ఈ రాజీనామా ప్రకటన వెలువడింది. రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలనే డిమాండుతో తాను రాజీనామా చేసినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

చంద్రబాబు కష్టం ఫలించిందా

  గత రెండేళ్లుగా గడ్డు కాలం ఎదుర్కొన్నతెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికలలో ఘన విజయం సాధించడంతో మళ్ళీ ఆ పార్టీ దారిన పడుతున్నట్లు కనబడుతోంది. ఇందుకు ప్రధాన కారణాలు ఆ పార్టీ తెలంగాణా అనుకూల వైఖరి ప్రకటించడం, అదే సమయంలో చంద్రబాబు తన సీమంధ్ర నేతలని అదుపుతప్పకుండా ఉంచగలగడం, ఆయన తన శక్తికి మించి శ్రమపడి పాదయాత్ర చేయడం, పంచాయితీ ఎన్నికలను కూడా సాధారణ ఎన్నికలంత సీరియస్ గా తీసుకొని పకడ్బందీ వ్యూహాలతో పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేయడం, అంతే స్పూర్తితో పార్టీ క్యాడర్లు కూడా పనిచేయడంవంటివన్నీకలిసి పంచాయితీ ఎన్నికలలో ఆ పార్టీకి ఘనవిజయం సాధించిపెట్టాయి.   మొదట్లో తెదేపా రెండు ప్రాంతాలలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విభజనపై రెండు కళ్ళ సిద్ధాంతం పాటించినప్పటికీ, అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా తీసుకోవడంతో తెలంగాణా ప్రాంతంలో ఆ పార్టీ పరిస్థితులు క్రమంగా మెరుగుపడ్డాయి. (నేటికీ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనపై కుమ్ములాడుకొంటుంటే, వైకాపా తన వైఖరి ప్రకటించడానికి కూడా జంకుతోంది.) అదే సమయంలో ఆయన తెలంగాణాలో పాదయాత్ర చేయడం కూడా పార్టీకి కలిసివచ్చింది.   ఆ సమయంలో తెరాస, తెదేపాను దాని అధ్యక్షుడు చంద్రబాబును ఎంతగా విమర్శలు చేసినప్పటికీ, ఆయన తన సీమంద్రా నేతలను కట్టడి చేయడంతో, తెలంగాణా ప్రజలు తెరాస మాటలు నమ్మలేదు. దానితో చంద్రబాబులో, తెదేపా నేతలలో, క్యాడర్లలో కొత్త ఉత్సాహం వచ్చింది. తత్ఫలితంగా సీమంధ్ర ప్రాంతంలో కంటే తెలంగాణాలోనే ఆయన పాదయాత్ర మరింత ఉత్సాహభరితంగా, దిగ్విజయంగా సాగింది. ఆయన తన పాదయాత్రలో మారుమూల గ్రామాలలో కార్యకర్తలను కూడా కలుస్తూ, జిల్లాలవారిగా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తూ ముందుకు సాగడం వలన పాదయాత్ర వలన పార్టీకి ప్రయోజనం చేకూరింది.   ఇక, విశాఖలో నిర్వహించిన బహిరంగ సభ ఊహించిన దానికంటే చాలా విజయవంతం అయ్యింది. పాదయాత్ర ముగించిన తరువాత చంద్రబాబు కార్యాలయానికి చేరుకొన్న వెంటనే ముందుగా పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. నేతలకి, కార్యకర్తలకి మధ్య చక్కని సమన్వయం ఏర్పరచి పంచాయితీ ఎన్నికలకి ముందు నుండే అందరినీ సన్నధం చేయడంతో విజయం సాధించగలిగారు.

రాజీనామా చేస్తామని ప్రకటించలేదు

      సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను మంత్రి టిజి వెంకటేష్ ఖండించారు. రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని...రాజీనామాలు చేస్తామని ప్రకటించలేదన్నారు.   నాలుగు గోడల మధ్య జరిగిన భేటీపై వివరణ తీసుకొని వార్తలు రాస్తే బాగుండేదన్నారు. సమైక్య రాష్ట్రమే తాము కోరుతున్నామన్నారు.  వెనుకబాటుతనం విషయానికి వస్తే మాత్రం ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయాలని వారు అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నామే గానీ రాజీనామాలను చెప్పలేదన్నారు. విభజన పైన కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్నదనే గానీ.. విభజన ఇప్పుడే అని చెప్పలేదని అన్నారు.

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు

      కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే అవకాశమే లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తేల్చి చెప్పారు. తెలంగాణ దిశగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే ఉద్దేశమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఐతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన గట్టిగా డిమాండ్ వినిపించారు.   హైదరాబాద్ రాజధానిగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నారు. రాయల తెలంగాణ, హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం వంటి ప్రతిపాదనలను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు సీపీఏ అగ్రనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై తుది నిర్ణయం ఖరారు చేసే ముందు ఈ డిమాండ్‌ను బలపరిచిన అన్ని రాజకీయ పార్టీలతో, ఆందోళనకు సారథ్యం వహిస్తున్న రాజకీయ జేఏసీతో సంప్రదింపులు జరపాలని ఆయన సూచించారు.

కాంగ్రెస్ కి వీరశివారెడ్డి రాజీనామా

      తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు రాజీనామా చేస్తున్నట్లు లేఖ పంపించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సమైక్యాంధ్ర భావన మరీ బలంగా ఉన్న నేపధ్యంలో వీరశివారెడ్డి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడానికి ముందుగా చొరవ తీసుకున్నారనుకోవాలి. వీరశివారెడ్డి రాజీనామా ప్రకటనను అనుసరించి మరికొంతమంది కూడా వస్తారా?లేదా అన్నది చూడాల్సి ఉంటుంది.

కాంగ్రెస్‌కు గడ్డు కాలమే

      దేశవ్యాప్తంగా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సర్వేల హడావిడి మొదలైంది.. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రల్లో ప్రస్థుత రాజకీయ పరిస్థితిపై సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ సర్వే నిర్వహించింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో తమిళనాడు మినహా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కాంగ్రెస్‌ పార్టీ, ప్రాంతీయ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఈ సర్వే తేల్చింది. గతంలో జరిగిన ఎలక్షన్స్‌లో వచ్చిన రిజల్ట్స్‌ ఈ సారి రాబోయే రిజల్ట్స్‌ పూర్తీ భిన్నంగా ఉండబోతున్నాయని తేల్చింది సర్వే..   ఆంద్రప్రదేశ్‌లో కూడా అధికార కాంగ్రెస్‌కు ఎదురు గాలి వీస్తుందని ఈ సారి ఎలక్షన్స్‌లో కాంగ్రెస్‌ గెలువటం చాలా కష్టమని తేల్చింది.. తెలంగాణ ఏర్పాటు తో పాటు జగన్‌ అంశం స్కాం లు ఇలా పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌కు ఎన్నికలు సవాల్‌ గా మారనున్నాయి. రాష్ట్రంలోని 55 శాతం మంది ప్రజలు... కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై తీసుకోబోయే నిర్ణయం ఆధారంగానే తమ నిర్ణయం ఉంటుందని చెప్పినట్లు సర్వేలో వెల్లడైంది.     రాష్ట్రంలో కాంగ్రెస్‌ సీట్ల సంఖ్య భారీగా పడిపోతుందని సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ సర్వే స్పష్టంచేసింది. ప్రస్తుతం 33 సీట్లున్న అధికార కాంగ్రెస్‌ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 11 నుంచి 15 సీట్లకే పరిమితం కానుందని సర్వే తేల్చేసింది. అదే సమయంలో 2009లో పోటీలో లేని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ 11 నుంచి 15 స్థానాలు, ప్రస్తుతం 6 స్థానాలున్న ప్రతిపక్ష టీడీపీ 6 నుంచి 10 స్థానాలు గెలుస్తాయని సర్వే వెల్లడించింది.

సోనియా, మన్మోహన్ లకు రూ.33 మనియార్డర్‌

      తాజాగా ప్రణాలికా సంఘం ఇచ్చిన నివేదిక పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.. దేశంలో పేదరికం తగ్గిపోయిందని చెపుతున్న ప్రణాలికా సంఘం కేవలం 33రూపాయల 30 పైసలతో ఒక వ్యక్తి ఒక రోజు బతకవచ్చంటూ తేల్చింది.. దీనిపై బిజెపి సహా మిగతా పక్షాలని మండి పడుతున్నాయి..   ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు విజయ్‌ గోయల్‌ ఒక అడుగు ముందుకు వేసి వినూత్న నిరసనకు దిగారు. ప్రదాని మన్మోహన్‌ సింగ్‌తో పాటు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రణాలికా సంఘుం ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియాలకు 33 రూపాయల 30 పైసలు మనీయార్డర్‌ చేశారు.. మీరు ఈ డబ్బుతో ఒక్క రోజంతా ఎలా బతకాలో చేసి చూపించాలని కొరారు.. ప్రస్ధుతం ప్రణాలికా సంఘం అంచనాలకు వాడుతున్న పద్దతులను మార్చాలని డిమాండ్‌ చేశారు.. ప్రభుత్వ పథకాలను పేదలకు అందకుండా చేసేందుకే ప్రభుత్వం ఇలాంటి తప్పుడు లెక్కలు చూపిస్తుందని ఆరోపించారు..

అప్పుడు కావాలని ఇప్పుడు వద్దంటున్న సిబిఐ

      అసలే స్కాములతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు మరో ఎదురు దెబ్బ తగిలింది.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనిమా గాందీ సన్నిహిత సహాయకుడు విన్సెంట్‌ జార్జ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది.   జార్జ్‌కి వ్యతిరేకంగా నమోదైన కేసును మూసి వేయాలంటూ సిబిఐ వేసిన పిటిషన్‌ కొట్టేసిన కొర్టు జార్జ్‌పై విచారణ కొనసాగించటానికి కావలసిన ఆదారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. సీబిఐ ప్రత్యేక కోర్టు జడ్జీ జెపియస్‌ మాలిక్‌ మాలిక్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 1984 నవంబర్‌ నుంచి 1990 డిసెంబర్‌ మధ్య కాలంలో జార్జ్‌ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని 2000 సంవ్సతరంలో కేసు నమోదయింది.. రాజీవ్‌గాందీకి ప్రైవేట్‌ కార్యదర్శిగా వ్యవహరించారు జార్జ్‌. ప్రభుత్వోద్యోగిగా ఉండి భారీ ఆస్తులను కూడబెట్టుకోవడంతో పాటు.. బ్యాంక్‌లో 1.5 కోట్ల రూపాయల నగదు కూడాబెట్టారని గతంలో సిబిఐ ఆరోపించింది. కానీ ఇప్పుడు అదే సిబిఐ కేసును మూసి వేయాలంటూ కోర్టుకు నివేదికను సమర్పించింది. కానీ సిబిఐ వాదనను తప్పుపట్టిన  కోర్టు జార్జ్‌ పై విచారణ జరిపి నివేదికను అందచేయాలని సిబిఐని ఆదేశించింది.. ఆగస్టు 30న అతన్ని వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుపరచాలని ఆదేశించింది.