హాట్‌ బ్యూటి పొలిటికల్‌ కామెంట్స్‌

      కాంగ్రెస్‌ తో పాటు ఇతర రాజకీయపార్టీలు ఆడుతున్న రాజకీయ చదరంగంతో రాష్ట్ర రాజకీయాల పరిస్థితి అద్వనంగా తయారైంది. బాధ్యులు బాధితులే కాదు ఇక్కడి పరిస్థితులతో ఎలాంటి సంబందంలేని వారు.. కనీస అవగాహన కూడా లేనివారు ఆంద్రప్రదేశ్‌ గురించి మాట్లాడేస్తున్నారు.     కేవలం తన కామెంట్స్‌తోనే పబ్లిసిటీ కావాలని ఆశపడే షెర్లిన్‌ చోప్రా మరోసారి తన నోటికి పని చెప్పింది. ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అందరూ చెర్చించుకుంటున్న తెలంగాణ ఇష్యూపై తన అభిప్రాయాన్ని చెప్పింది. హాట్‌ స్టార్‌గా బాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్న షెర్లిన్‌ చోప్రా ఎ ఫిల్మ్ బై అరవింద్‌ అనే తెలుగు సినిమాలో నటించింది. కాని తరువాత ఎప్పుడు ఆంద్రప్రదేశ్‌ వంక కన్నెత్తి కూడా చూడని షెర్లిన్‌ ఇప్పుడు రాష్ట్ర విభజనపై కామెంట్‌ చేసింది. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తే దానికి కావాల్సిన ఖర్చు ఎవరు భరిస్తారన్న షెర్లిన్‌ ఇలాంటి రాజకీయాలపై తిరగబడాలని పిలుపునిచ్చింది. షెర్లీన్‌ కామెంట్స్‌ మంచిదే అని కొంత మంది అంటున్నా తన పని తానూ చూసుకుంటే బెటర్‌ అనే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు.

చంద్రబాబుకు జగన్ పార్టీ నేత ప్రశంసలు

      వైఎస్ఆర్.కాంగ్రెస్ నాయకుడు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి చంద్రబాబు అనుసరించిన వైఖరిపై ద్వారంపూడి ప్రశంసలు కురిపించారు. సీమాంధ్ర రాజధాని కోసం రూ.5 లక్షల కోట్లు కేటాయించాలని చంద్రబాబు కోరడం సమంజసమన్నారు. ఈ మొత్తం హైదరాబాద్ అభివృద్ధికి ఖర్చయిందేనన్నారు. అసలు రాష్ట్ర విభజనపై చంద్రబాబు తప్పేమీ లేదని ద్వారంపూడి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రకటనకు చంద్రబాబే కారణమంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తుతున్న సమయంలో ద్వారంపూడి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామమే.

మాజీ మంత్రి ఉప్పునూతల ఇకలేరు

      మాజీ మంత్రి, వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల వయస్సు గల పురుషోత్తమరెడ్డికి సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరారు.   ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి.. కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేసారు. రామన్నపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా, తెలంగాణ అభివృద్ధి మండలి ఛైర్మన్‌గా, ఎపిఐఐసీకి చైర్మన్‌గా ఉప్పునూతల పనిచేశారు. ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి మృతి పట్ల పలువురు దిగ్రాంతి వ్యక్తం చేశారు.  

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కి కేసీఆరే అవరోధమా

  రాష్ట్ర విభజన జరిగిన తరువాత తెలంగాణాలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంత ఉద్యోగులందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోక తప్పదు. వారికి వేరే ఆప్షన్లు ఉండవన్న కేసీఆర్ మాటలు తెలంగాణా ప్రక్రియకు అవరోధం కలిగించేలా ఉన్నాయని ఆ పార్టీ నుండి సస్పెండ్ అయిన విజయశాంతి అన్నారు. నిన్నమొన్నటి వరకు కేసీఆర్ కు చెల్లెలుగా అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆమె బహుశః కేసీఆర్ మనసులో ఆలోచనలని సరిగ్గా అంచనా వేసారని చెప్పవచ్చును.   కాంగ్రెస్ పార్టీ ఆఖరి నిమిషంలో వచ్చి కేసీఆర్ చేతిలోంచి తెలంగాణా అంశం ఎత్తుకెళ్ళిపోయి కేసీఆర్ కలలను కల్లలు చేసింది. ఆ తరువాత రాష్ట్ర విభజనపై అత్యంత కీలక నిర్ణయం తీసుకొంటున్నప్పుడు కూడా అతనిని పూర్తిగా పక్కనపెట్టి స్వయంగా నిర్ణయం తీసుకొంది. ఆ సమయంలో కేసీఆర్ ఏవిధంగా అసహాయ స్థితిలోతన ఫారం హౌస్ కే పరిమితమయిపోయారో అందరికీ తెలుసు.   కేంద్రం తెలంగాణా ఈయదని దృడంగా నమ్మిన కేసీఆర్ రానున్నఎన్నికలలో తెలంగాణా సెంటిమెంట్ ను ఉపయోగించుకొని 15యంపీ సీట్లు, 100 శాసనసభ సీట్లు కైవసం చేసుకొని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను శాశించే స్థాయికి ఎదుగుదామని కన్నకలలను కాంగ్రెస్ సర్వ నాశనం చేసింది. చివరికి తెలంగాణాలో తన పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్ధకంగా మార్చివేసి, విలీనం కూడా చేయక తప్పని పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ కు మనసులో అక్కసు ఉండటం సహజమే.   అయితే, కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చేసిన తరువాత దానిని తప్పు పట్టడానికి కానీ నిందించడానికి గానీ అవకాశం లేదిప్పుడు. అయితే కాంగ్రెస్ పార్టీని ఇదేవిధంగా తన పని తానూ చేసుకొని పోనిస్తే, ఇన్నేళ్ళుగా కేసీఆర్ కష్టపడి సంపాదించుకొన్న కీర్తి ప్రతిష్టలను కూడా కాంగ్రెస్ హైజాక్ చేసుకుపోవడం ఖాయం. బహుశః ఆ ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణా ప్రక్రియను వీలయినంత త్వరితంగా, సజావుగా పూర్తి చేయాలని తొందరపడుతోంది.   కాంగ్రెస్ గనుక ఈ ప్రయత్నంలో సఫలం అయితే, ఇక టీ-కాంగ్రెస్ నేతల ముందు కేసీఆర్ అతని తెరాస నేతలు ఎవరూ కూడా నిలువలేరు. టీ-కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా పనిచేస్తే అది ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి వారు నిర్వహించిన ‘తెలంగాణా సాధన సభ’ ఒక గొప్ప ఉదాహరణ. తెలంగాణా సాధించి మంచి ఊపు మీద ఉన్న వారు గనుక నిజంగా మనసుపెట్టి రంగంలోకి దిగితే, ఇక తెలంగాణాలో కేసీఆర్ గురించి, తెరాస గురించి మాట్లాడే వారుండరు.   తెలంగాణా సాధించి “తెలంగాణా రాష్ట్ర పిత”గా అరుదయిన గౌరవం పొందాలని కలలుగన్న కేసీఆర్, ఇటువంటి పరిణామాలు బహుశః కలలో కూడా ఊహించుకొని ఉండరు. గానీ, కాంగ్రెస్ పార్టీ తన కళ్ళెదుటే, తన ప్రమేయం లేకుండానే అన్ని పనులు చకచకా చక్కబెట్టేస్తుంటే కేసీఆర్ ఎంత బాధ పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చును. కానీ, ప్రజలందరూ కోరుకొంటున్న తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న ఈ తరుణంలో దానిని అడ్డుకొంటే ఏమవుతుందో కూడా ఆయనకీ తెలుసు. అందుకే అందుబాటులో ఉన్న ఇటువంటి ఆయుధాలను బయటకి తీసి ప్రయోగిస్తున్నారు.   తెలంగాణా ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు ఆంధ్రప్రాంత ఉద్యోగులే ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నారని అన్యోపదేశం చేస్తూ మరో కొత్త ఉద్యమానికి ఆయన రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఉద్యమాలు చేసిన రికార్డు తప్ప ఏవిధమయిన అధికారిక హోదా లేకపోయినప్పటికీ, ఆయన తనే తెలంగాణా రాష్ట్రానికి మొట్ట మొదటి ముఖ్యమంత్రి అన్న రీతిలో ప్రభుత్వోద్యోగ నియామకాలు, ప్రమోషన్లు, తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకరణల గురించి హామీలు గుప్పిస్తున్నారు. అసలు తన పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితులో ఉన్న ఆయన ఈవిధమయిన హామీలు ఈయడం, తన మాటకారితనంతో ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూడటం గమనిస్తే ఆయనకు తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలనే కోరిక కంటే తన ఉద్యమాలు కొనసాగాలనే కోరికే ఎక్కువగా ఉన్నట్లు అర్ధం అవుతోంది.   అయితే, అటువంటి వారిని నిలవరించేందుకు సమర్దులయిన నేతలు, రాజకీయ పార్టీలు ఉన్నాయనే సంగతి ఆయన గుర్తుంచుకొని, ఇకనయినా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో అవరోధాలు కల్పించకుండా ఉంటే అటు తెలంగాణా, ఇటు సీమంధ్ర ప్రజలకి మేలు చేసిన వారవుతారు.

కేసీఆర్ పై విజయశాంతి ఫైర్

      తెలంగాణ వస్తే ఆంధ్రా ఉద్యోగులు వెళ్లి పోవాల్సిందేనన్న కేసీఆర్ వ్యాఖ్యలపై విజయశాంతి మండిపడ్డారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పాటుకు ఆటంకం కల్గించే విధంగా ఆమె విమర్శించారు. కేసీఆర్ వ్యాఖ్యలను పలువురు నేతలు ఖండించారు. ఆంధ్రా ఉద్యోగులపై వెళ్లి పోవాల్సిందేనని కేసీఆర్ అనడంతో వివాదం రాజకుంది. కేసీఆర్ పై విజయ శాంతి గుర్రుగా వున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న ఆమె మాత్రం మౌనంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు మంతనాలు సాగించిందనే పక్కా సమాచారంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో ఆమె కెసిఆర్ పై మండిపడడం ప్రాధాన్యం సత్కరించుకుంది.

రాజీనామా డ్రామాలు

....సాయి లక్ష్మీ మద్దాల       రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇప్పటివరుకు తెలంగాణాలో జరిగిన ఉద్యమం ఇప్పుడు సీమాంద్రలో జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం నేపధ్యంలో సీమాంద్ర ప్రాంతంవారి భావోద్వేగాలను చల్లార్చటానికి అన్నట్లు ఆ ప్రాంత నేతలంత రాజీనామా బాట పట్టారు. ఐయితే ఇక్కడ ప్రజలకు అర్ధంకాని విషయం ఏమిటంటే,ఇంతకు ముందు అఖిల పక్ష సమావేశాలలో తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పిన పెద్దమనుషులు కనీసం విభజన ప్రక్రియ ఐన హేతుబద్ధంగా జరిపించలేని అసమర్ధులు ఇప్పుడెందుకు ఈ రాజీనామాల డ్రామాలతో మరోసారి ప్రజలకు నామాలు పెట్టాలని చూస్తున్నారు అని. ఇప్పుడున్న సీమాంద్ర నేతలలో ఎవరికైనా హైదరాబాదులో వ్యాపారాలు లేకుంటే ఈ రాజీనామాఊసే ఉండేది కాదు. మంత్రి పదవి రానంత వరకు సమైఖ్యాంద్ర అన్న కావూరి ఇప్పుడేమో మాట మార్చిన వైనం ప్రజలకు తెలియదు అనుకుంటే పొరబాటే. బొత్స సత్యనారాయణ వైఖరి మరీ అసహ్యం. రాష్ట్రం ఎప్పుడెపుడు విడిపోతుందా ఆంద్ర రాష్ట్రానికి తానెపుడు ముఖ్య మంత్రిని అవుతాన అన్న ద్యాసే తప్ప రాష్ట్రం ఏమై పోయినా ఆయనకు అఖర్లేదు.   ప్రత్యేక రాష్ట్రానికి కావలసిన నిధులు,నీళ్ళు,ఉద్యోగాలు,చదువులు,ఇతరత్రా పారిశ్రామిక అభివృద్ధికి కావలసిన కార్యాచరణ,కనీసం వీటి గురించైనా అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చి సీమాంద్ర ప్రాంత ప్రజలకు న్యాయం చేసి,వారికి భరోసా కలిగించ లేకపోయారు. అందుకనే కదా ఆ ప్రాంత ప్రజల ఉద్వేగాలు మిన్నంటుతున్నాయి. కనీసం రాజీనామాలు సమర్పించే విషయంలో కూడా చిత్తశుద్ది లేదు ఆయా రాజకీయనేతలకు. కొంతమంది స్పీకర్ కు రాజీనామాలు ఇస్తే, ఇంకొంతమంది పీసీసీ అద్యక్షుడికి ఇస్తున్నారు. ఇహ MP లు ,కేంద్ర మంత్రులు అయితే దిగ్విజయ్ సింగ్ కు సమర్పించారు. ఇదెక్కడి పద్ధతి అనుకోవాలి.               ఏది ఏమైనా నేడు సీమాంద్ర నేతలకు ఉన్నది వారి ప్రజల పట్ల అభిమానం ఎంత మాత్రం కాదు. వారి కున్న బాధంతా హైదరాబాదులో వారికున్న ఆస్తులు,వ్యాపారాలు ఏమైపోతాయోననే. ఛి ఛి వీళ్ళు నేతలు కాదునీచులు. . రాష్ట్రం విడిపోతున్నది అనే సమాచారం వారికి ముందే తెలిసినా,ఏదో ప్రజలకోసం చాలా కష్టపడిపోతున్నట్లు ఉండవల్లి రాజమండ్రి లో సభ నిర్వహించి తనకు ఎంతగొప్ప వాక్చాతుర్యముందో సినీ ఫక్కీలో చూపించాడు. ఏమీ కాదు అంతా మేం చూసుకుంటాం,మీకు అండగా మేమున్నాం అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారు. గంట శ్రీనివాసరావు వైకాపా లో చేరటానికి మార్గం సుగమం చేసుకుని ఇప్పుడేదో ప్రజల కోసం త్యాగం చేస్తున్నట్లు రాజీనామా డ్రామాలు ఆడుతున్నాడు.             ఇంకా అందరి కంటే పెద్దమనిషి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఈరోజు వరకు రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచటానికి అధిష్టానానికి ఏమి వివరించారో ప్రజలకు చెప్పే ప్రయత్నం చెయ్యలేదు సరికదా కనీసం రాష్ట్ర ప్రజలను క్షమాపణ అడిగే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఈరోజున ఉన్న రాజకీయ నేతలందరు అవేనీతి పరులే. ఈ విషయంలో అన్ని పార్టీలది అదే బాట. అందుకనే సోనియా గాంధి అంత నిరంకుశము గా దేశాన్ని ఏలుతోంది. ప్రతినేత తన స్వలాభం కోసం,తన స్వార్ధం కోసం ఆరు కోట్ల ప్రజానీకం బ్రతుకును,భవిష్యత్తును,జీవితాన్ని ఒక విదేశీయురాలి పాదాల చెంత తాకట్టు పెట్టారు. అయినా కాని వారికి ఒకటే ధైర్యం ఎలాగైనా వచ్చే ఎన్నికలలో ప్రజలను మభ్య పెట్టగలము మళ్ళి గద్దెనెక్క గలము అని.               నిజానికి ఈ నేతలలో ఎవరికైనా మళ్ళి 2014 ఎన్నికలలో నిలబడే అర్హత ఉందా అసలు?అందుకనే నేడు వీళ్ళు ప్రజలకు చేసిన అన్యాయానికి, మోసానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే, చేయాల్సింది రాజీనామాలు కాదు, రాజకీయ సన్యాసం. అవును ఈమాట ముందుగా సెలవిచ్చిన పెద్దమనిషి లగడపాటి. కాని ఈరోజు విషయానికి వచ్చేసరికి ఆయనకూడా మొహం చాటేసి,రాజీనామాతో సరిపెట్టుకున్నారు. కాబట్టి ప్రజలు పెట్టె ఓట్ల భిక్షతో గద్దెనెక్కి,ఆప్రజల జీవితాలనే నాశనం చేసే హక్కు ఈ రాజకీయ నీచులకు ఎవరిచ్చారు? అందుకనే ప్రజా కోర్టులో నిలబడితే వీరికిచ్చే తీర్పు రాజకీయ సన్యాసం. మళ్ళి జన్మలో వీరికి ఆ రాజకీయ పదవులను అనుభవించే అర్హత లేదు. ప్రజల నెత్తి మీద కూర్చుని పెత్తనం చేసే అర్హత అంతకన్నా లేదు. అందుకని ప్రజలు వీళ్ళ మీద ఒత్తిడి తేవలసింది రాజీనామాల కోసం కాదు రాజకీయ సన్యాసం కోసం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ చెత్తంతా ఇహనైనా కొట్టుకుపోతే,కనీసం రాబోయే ఎన్నికల నుండైనా అంతో ఇంతో ప్రజల బాగుకోసం పాటుబడే వాళ్ళు వస్తారు.

కొత్త రాజ‌ధానికి క‌నీసం 2.5 ల‌క్షల కోట్లు

  తెలంగాణ ప్రక‌ట‌న త‌రువాత ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న విష‌యం కొత్త రాజ‌ధాని ఏది అనే. 10 సంవ‌త్సరాల పాటు హైద‌రాబాద్ ఉమ్మడి రాజ‌ధానిగా ఉన్న ఆ త‌రువాత సీమాంద్ర ప్రాంతానికి రాజ‌ధానిగా ఉండ‌బోయే న‌గ‌రం ఏది అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు సాధార‌ణ ప్రజ‌ల్లో కూడా క‌నిపిస్తుంది. హైద‌రాబాద్‌కు దీటైన రాజ‌ధాని నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ స‌హ‌క‌రిస్తుందని ప్రక‌టించారు దిగ్విజ‌య్ సింగ్‌. అయితే అది అన్నంత ఈజీ కాంద‌టున్నారు విశ్లేష‌కులు. సరైన మౌలిక వసతులతో రాష్ట్ర రాజధానిని నిర్మించాలంటే రూ.2.5 లక్షల కోట్లు  ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్థుతం ఉన్న న‌గరాల‌కు చేరువ‌లోనే ఓ రాజ‌ధాని న‌గ‌రాన్ని నిర్మించే ఆలోచ‌న‌లో కేంద్ర ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే డిల్లీ ఐఐటి నిపుణుల‌తో పాటు, హైద‌రాబాద్ కు చెందిన వాడ ఫాండేష‌న్ కొత్త రాజ‌ధాని విష‌యంలో అధ్యనం చేస్తున్నారు. రాజ‌ధాని ఏర్పాటుకు ముఖ్యంగా కావాల్సింది విస్తారమైన రవాణా సౌకర్యాలు. అంతర్జాతీయ విమానాశ్రయం, రోడ్డు రవాణా వ్యవస్థ, రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలకు అనుసంధానం చేసే వ్యవస్థ అవసరమని భావిస్తున్నారు. అధ్యయన నివేదికను త్వరలో కేంద్రానికి సమర్పించనున్నట్లు సమాచారం. హైదరాబాదు రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి యేటా 5 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని హెచ్‌ఎండిఎ ఏర్పాటు చేసిన సమగ్ర రవాణా వ్యవస్థ అధ్యయనం తెలిపింది.

ఆంధ్ర ఉద్యోగులకు కేసీఆర్ తొలి హుకుం

  తెలంగాణా ఏర్పడితే హైదరాబాదులో స్థిరపడిన లక్షలాది ఆంధ్రా ప్రాంతవాసులకు ఎటువంటి నష్టం జరగదని వారి రక్షణకు తాము హామీ ఉంటామని తెరాసతో సహా అన్ని రాజకీయ పార్టీలు బల్లగుద్ది మరీ చెపుతున్నపటికీ ప్రజలు మాత్రం వారి మాటలు నమ్మడం లేదు.   తమ భవిష్యత్తు పట్లా తీవ్ర ఆందోళన చెందుతున్నవారి భయాలు నిజమని నిరూపిస్తున్నట్లు ఈ రోజు కేసీఆర్ మాట్లాడారు. “ఆంధ్రప్రాంత ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్లిపోక తప్పదని, ఇందులో వేరే ఆప్షన్స్ ఉండవని” ఆయన అన్నారు. “అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నడపడానికి కూడా ఉద్యోగులు అవసరం ఉంటుంది గనుక వారు తప్పనిసరిగా వెళ్ళిపోవలసి ఉంటుందని, వారు వెళ్ళిపోగానే వారి స్థానంలోకి తెలంగాణా ఉద్యోగులు ప్రమోషన్ ల ద్వారా భర్తీ చేస్తారని, అప్పుడు క్రింద తరగతిలో ఏర్పడిన ఖాళీలలో తెలంగాణా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తానని, అందుకు తానూ హామీ ఇస్తున్నానని” ఆయన అన్నారు.   అయితే, హైదరాబాదులోనే అనేక దశాబ్దాలుగా స్థిరపడిన వేలాది ఉద్యోగులు హైదరాబాదునే తమ స్వస్థలంగా భావించడం సహజం. మరి అటువంటి వారు ఇప్పుడు ఆంధ్రా తిరిగి వెళ్ళిపోవాలని కేసీఆర్ చెప్పడం హుకుం జారీ చేయడమే అవుతుంది. ఈ కారణంగానే సీమంధ్ర ప్రాంత నేతలు హైదరాబాద్ పై పట్టుదలగా ఉన్నారు. ఇంకా రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుకాకముందే కేసీఆర్ ఈవిధంగా మాట్లాడటం గమనిస్తే ఇక మున్ముందు తమ పరిస్థితి ఏమిటని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   ఇక యాదృచ్చికంగా ఈ రోజు ఉదయమే హైదరాబాదులో పనిచేస్తున్నఆంధ్ర ప్రాంత ఉద్యోగులు, కేంద్రం తమ సమస్యలను భయాలను లెక్కలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తెలంగాణా ప్రకటించడాన్నినిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. వారి భయాలను మరింత పెంచుతున్నట్లు ఈ రోజు కేసీఆర్ మాట్లాడారు. ఇటువంటి పరిస్థితుల్లో సీమంధ్ర నేతలు హైదరాబాద్ పై మరింత పట్టుదలకు పోయినా ఆశ్చర్యం లేదు.   అయితే, రాజకీయ అనుభవజ్ఞుడయిన కేసీఆర్ ఇటువంటి సంధికాలంలో ఈవిధంగా అనాలోచితంగా ఈమాటలు అని ఉంటారని భావించలేము. తన చేతిలోంచి తెలంగాణా అంశాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసి, తన ప్రమేయం లేకుండానే తెలంగాణా ప్రకటించేసి, తన ప్రతిష్టని, తన పార్టీ ఉనికిని సవాలు చేసిన కాంగ్రెస్ పార్టీపై ఆయన రగిలిపోతున్నారు. ఇప్పుడు ఇటువంటి మాటలతో సమైక్యవాదులను రెచ్చగొట్టడం ద్వారా వారిపై ఒత్తిడి తెచ్చి, కాంగ్రెస్ తెలంగాణాపై ఇచ్చిన మాటపై మళ్ళీ పునరాలోచనలో పడేట్లు చేయగలిగితే మళ్ళీ తన ఉద్యమాలు కొనసాగించుకోవచ్చునని భావిస్తున్నారేమో! లేదా, ఈవిధమయిన మాటలతో హైదరాబాద్ కోసం పట్టుబడుతున్న సీమంధ్ర నేతలను మరింత రెచ్చగొట్టి మళ్ళీ ఉద్యమాలు చేపట్టెందుకో ఆయన ఆలోచనలు చేస్తున్నారేమో తెలియదు. ఏమయినప్పటికీ, అకారణంగా కేసీఆర్ ఇటువంటి మాటలు అని ఉండకపోవచ్చును.         

బాగో అన‌లేదు కాని వెళ్లిపోవాల్సిందే

  సీమాంద్ర ప్రజ‌ల‌కు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌దు అంటునే మ‌రోసారి కేసిఆర్ వివాదాస్పద స్టేట్‌మెంట్ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న సీమాంద్ర ఉద్యోగులు ఎట్టి ప‌రిస్థితుల్లో వెళ్లిపోవాల్పిందే అన్నారు కెసిఆర్‌.హైద‌రాబాద్ టిఎన్‌జీవొలు ఏర్పాటు చేసిన స‌భ‌లో పాల్గొన్న కెసిఆర్ మ‌రోసారి ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తెలంగాణ‌లో నివ‌సిస్తున్న వారు ముఖ్యంగా ఇక్కడ ఓటు హ‌క్కు క‌లిగిన వారంతా ఇక్కడి ప్రజ‌లుగానే పరిగ‌ణింప‌బ‌డ‌తార‌ని దిగ్విజ‌య్ సింగ్ చెప్పి 24 గంట‌లు కూడా కాక ముందే కెసిఆర్ చేసిన ఈ ప్రక‌టన వివాదాస్పద‌మైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబందించి ఎలాంటి చ‌ర్యలు జ‌ర‌గ‌క‌ముందే కెసిఆర్ ఇలా మాట్లాడ‌టంతో ఆ వ్యాఖ్యల‌కు ప్రదాన్యత సంత‌రించుకుంది. ఇప్పటికే హైద‌రాబాద్‌లో ఉన్న సీమాంద్రులు త‌మ భద్రత విష‌యంలో భ‌య‌ప‌డుతుంటే ఇప్పుడు కెసిఆర్ వ్యాఖ్యల‌తో ఆ భ‌యం మ‌రింత ఎక్కువ‌యింది. అస‌లు త‌న ఎప్పుడు సీమాంద్రుల‌ను బాగో అన‌లేద‌ని చెప్పిన కెసిఆర్. ఉద్యోగులు త‌ప్పకుండా వెళ్లిపోవాలి అన‌టం బాగో అన‌టం కాదా అంటున్నారు విశ్లేష‌కులు. ఇప్పటికైనా ఇలాంటి నాయ‌కులు ఇరు ప‌క్షాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయ‌కుండా క‌ట్టడి చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

చిరంజీవి కాళ్లు విర‌గొడ‌తా

  సీమాంద్రలో రేగుతున్న విభ‌జ‌న సెగ‌లు ఇన్నాళ్లుగా ఇంటిప‌ట్టున ఉన్న నేత‌లు కూడా ప‌ని క‌ల్పిస్తున్నాయి. చాలా కాలం క్రితం ప్రజారాజ్యం పార్టీలో కీల‌క పాత్ర పోషించి, త‌రువాత చిరు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయ‌డంతో ఆయ‌న మీద దుమ్మెత్తిపోసిన నాయ‌కురాలు శోభారాణి. చిరు కాంగ్రెస్‌లో చేర‌డంతో త‌రువాత కొద్ది రోజులు వైకాపా వెంట తిరిగిన వాళ్లు కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మైకుల ముందు క‌నిపించ‌ట‌మే మానేసింది. అయితే తాజాగా తెలంగాణ‌కు అనుకూలంగా కాంగ్రెస్ ప్రక‌ట‌న చేయ‌డంతో మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చింది శోభారాణి. విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి పై తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. చిరంజీవి క‌నిపిస్తే రాళ్లతో, చెప్పుల‌తోకొడ‌తాన‌న‌ట‌మే కాకుండా కాళ్లు విర‌గొడ‌తానన్నారు.. అంతేకాదు రాష్ట్ర విభ‌జ‌న‌కు నిర‌స‌న‌గా త‌న నివాసంలోనే ఆమె ఆమ‌ర‌ణ నిర‌హార దీక్షకు దిగారు. చిరంజీవి స‌మైక్యాంద్రకు మ‌ద్దతు ఇవ్వటం వ‌ల్లే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కోసం ప‌ని చేశామ‌ని, ఇప్పుడు అదే విష‌యంలో చిరు మౌనంగా ఉంటడ‌టం బాధ‌క‌ర‌మ‌న్నారు. చిరంజీవి సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ మంచి నటుడని నిరూపించుకున్నారని, ఇకపై చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోల చిత్రాల ప్రదర్శనను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.

టిడిపి సీమాంధ్ర ఎంపీల రాజీనామా

      సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కొణకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, శివప్రసాద్, సీఎం రమేష్, సుజనా చౌదరిలు తమ పదవులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని కొనకళ్ల నారాయణ అన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ రాజకీయ లబ్ది కోసం ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై స్పష్టమైన క్లారిటీ లేదని, ఏక పక్ష నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర ప్రజలు నష్టపోతున్నారని కొణకళ్ల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడ్డానికి ప్రజల్లోకి వెళ్ళి ఉద్యయం చేస్తామని, కేంద్రం దిగివచ్చే వరకు ఉద్యమం ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు సభ్యులుగా ఉండి ఏం చేయలేని పరిస్థితి ఉన్నందున తాము రాజీనామాలు చేస్తున్నామన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించకుండా డిగ్గీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ తీరు దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా ఉందన్నారు. తమ ప్రాంతానికి న్యాయం చేసేందుకు కేంద్రం దిగి వచ్చే వరకు తాము ఉద్యమిస్తామన్నారు. వైయస్సే తెలంగాణకు అనుకూలమని కాంగ్రెసు పార్టీ నేతలే చెబుతున్నారన్నారు. చర్చలు జరపకుండా కాంగ్రెసు తమ నిర్ణయాన్ని ప్రజల పైన రుద్దారన్నారు.

జగన్ పార్టీలో బయటపడుతున్న దొంగలు

      ఇప్పటికే వరుసగా ముగ్గురు మోసగాళ్లు ఇటవలే వైసీపీలో బయటపడిన సంగతి తెలిసిందే తాజాగా గుంటూరులో మరో ఆణిముత్యం బయటకు వచ్చింది. మేడికొండూరుకు చెందిన ధనేకుల కళ్యాణి వైఎస్సార్ కాంగ్రెస్లో క్రియాశీలక నేత. జిల్లాలో షర్మిల పాదయాత్ర జరిగినపుడు అక్కడ కట్టిన బ్యానర్లలో అధిక శాతం కళ్యాణివే. నిరంతరం నాయకులతో కలిసి తిరిగేది.   ఇదిలా ఉండగా….నాలుగు రోఉల క్రితం గుంటూరు బ్రాడీపేటలోని ఓ జువెలరీ దుకాణానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత పేరుతో ఫోన్ చేసింది. మా వాళ్లను పంపుతున్నాను. కొన్ని డిజైన్లు పంపితే నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటానని చెప్పింది. తర్వాత కొంతసేపటి తర్వాత ఓ వ్యక్తి ఆ దుకాణానికి వెళ్లాడు. తనను ఎమ్మెల్యే పంపారని, ఇరవై లక్షల విలువైన నగలు తీసుకెళ్లారు. ఎంత బాగా నమ్మించారంటే రెండ్రోజుల తర్వాత ఆరు లక్షల నగలు తిరిగి ఇచ్చేశారు. తీసుకున్న వాటికి డబ్బలు ఆన్లైన్లో పంపుతామని చెప్పారు. తీరా ఎన్నాళ్లకీ డబ్బు రాకపోయేటప్పటికి పోలీసుల వద్దకు వ్యవహారం వెళ్లింది. అపుడు ఆ వ్యక్తిని విచారిస్తే కళ్యాణి పేరు బయటకు వచ్చింది. ఆమెను విచారిస్తే నగలు బయటకు వచ్చాయి. ఈ మేడమ్ గారి చరిత్ర ఏంటో తెలుసా… హైదరాబాదులో చదువుకుంది. ఇక్కడే ఒక వ్యక్తిని పెళ్లాడింది. రెండు నెలలకే అతనితో విడిపోయింది. ఆ తర్వాత వైసీపీ అయితే తనకు అడ్డంకి ఉండదని అనుకుని తన గ్లామర్ తో అక్కడ సెటిలైంది.  

అందాల తమ్మన్నాకు సమైక్య సెగ

  ఈరోజు తన సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన అందాల తార తమ్మన్నాకు వైజాగ్ విమానశ్రయంలో సమైక్యాంధ్ర సెగ తగిలింది. అక్కడ మంత్రులు యంపీలకోసం కాపుకాసుకొని కూర్చొన్న కొందరు సమైక్యవాదులు ఆమె కారును చుట్టూ ముట్టి ‘జై సమైక్యాంధ్ర’ అని నినాదం చేయమని అడిగినప్పుడు ఆమె తనకీ ఉద్యమాలతో సంబంధం లేదని తానొక కళాకారిణినని, తనకు అన్ని ప్రాంతాల ప్రజలతో అనుబంధం ఉందని జవాబివ్వడంతో వారు కనీసం “తెలుగువారు కలిసుండాలి” అని అనమని కోరారు. కానీ ఆమె అనకపోవడంతో కొంచెం అసహనానికి గురయిన వారు ‘జై తెలుగు’ అనమని ఒత్తిడి చేసారు. కానీ ఆమె ‘జై ఇండియా’ అని తన కారులో వెళ్లిపోయింది.   ఇంత కాలం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తెలంగాణావాదులు చుక్కలు చూపించారు. ఇప్పుడు సమైక్యవాదులు ఆ పనికిపూనుకోవడం విచారకరం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో అనుబంధం ఉన్నట్టి చిత్రపరిశ్రమను ఉద్యమకారులు ఈవిధంగా ఇబ్బందులకు గురిచేయడం సబబు కాదు. ముఖ్యంగా సినీపరిశ్రమలో అత్యధికులు సీమంద్రా ప్రాంతానికి చెందినవారేననే విషయం గమనించాలి. అందువల్ల వారిచేత బలవంతంగా ఇటువంటి నినాదాలు చేయమని ఒత్తిడి చేయడం షూటింగులకి ఆటంకం కలిగించడం వంటివి చేయకుండా, వారి పని వారిని చేసుకోనిస్తే తమ ఉద్యమానికి వన్నె పెరుగుతుందే తప్ప తగ్గదని తెలుసుకోవాలి.

వాళ్ళ మాట...ప్రజల తూటా

వాళ్ళ మాట...ప్రజల తూటా       వాళ్ళ మాట   1. అన్ని పార్టీల అధినేతల అంగీకారంతోనే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాం.    ప్రజల తూటా   1.అధినేతలు అరడజను మంది... ప్రజలు ఆరు కోట్లు మంది...ఎవరి    అభిప్రాయం ముఖ్యం. వాళ్ళ మాట   2. గీ ఉద్యమాలన్నీ పక్కన బెట్టి అన్న దమ్ములేక్క ఇడిపోదాం.    ప్రజల తూటా   2. అవును...నువ్వు నీ వాటాగా బంగాళా తీస్కో...మేము మా వాటాగా గుడిసె తీస్కుని అన్నదమ్ముల్లా విడిపోదాం. వాళ్ళ మాట   3. హైదరాబాద్ కెల్లి మేం పోమ్మనట్లే..ఈడనే మీరూ ఉండండి..మేమేం అనం   ప్రజల తూటా   3. దానికి ప్రత్యేక రాష్ట్రం అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్నట్టే  ఉండొచ్చు.   వాళ్ళ మాట 4. డిగ్గీ సింగ్..పదేళ్ళు హైదరాబాద్ మీద పెత్తనం తెలంగాణ వాళ్ళదే!    ప్రజల తూటా   4. సీమాంధ్రవాళ్లకి అన్యాయం జరగదన్నావ్..ఇదా?   వాళ్ళ మాట 5. విగ్రహాలు ధ్వంసం మంచి పద్దతికాదు.    ప్రజల తూటా   5. అవును..అది..నిజమే.....ఆవిషయం ఈ రోజు తెలిసిందే? హైదరాబాద్ లోని  ట్యాంక్ బండ్ మీద మహామహుల విగ్రహాలు కూల్చినప్పుడు ఈ మాట ఎందుకనలేదు.   వాళ్ళ మాట 6. డిగ్గీ సింగ్..ఈ సమ్మెలు ఉద్యమాలు చెయ్యడం మాములే.    ప్రజల తూటా   6. అలాగే అనుకుని ప్రత్యేక రాష్ట్రం జోలికి వెళ్ళకుండా ఉండాల్సింది.   వాళ్ళ మాట 7. చిరంజీవి.. నేను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటాను.   ప్రజల తూటా   7. ఇప్పుడు కట్టిపడేసినట్లు మాట్లాడాకుండా కూర్చున్నాడు.     వాళ్ళ మాట                        8. చంద్రబాబు...సెపరేట్ రాజధాని నిర్మించుకోవడానికి నేను 5 లక్షల కోట్లు కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా.   ప్రజల తూటా   8. ఈయన డిమాండ్ చేస్తే ఇవ్వడానికి అక్కడి వాళ్ళు రెడీగా ఉన్నారు.    వాళ్ళ మాట          9. మీరు ఆడ మరో రాజధాని మంచిగా డెవలప్ చేస్కోవచ్చు.   ప్రజల తూటా   9. ఆ పనేదో మీరూ చేస్తే బాగుంటుందేమో కదా..మంచిగా!   వాళ్ళ మాట      10. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలని అన్నవారు. అలాంటి వారి విగ్రహాలు...     ప్రజల తూటా   10. వాళ్ళంటే అంత గౌరవం ఉన్నవాల్లయితే రాష్ట్రాన్ని విడగొట్టి ఉండేవారు కాదు.   వాళ్ళ మాట     11. డిగ్గీ సింగ్...ఇప్పుడు మడమ తిప్పే ప్రసక్తే లేదు.   ప్రజల తూటా   11.అదే మేము అంటున్నాం.    

రాజీనామాలు అనవసరం: పనబాక

  ఈ రోజు కొందరు కాంగ్రెస్ యంపీలు రాజీనామాలు చేయడంపై కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి స్పందిస్తూ, “ఇప్పుడు రాజీనామాలు చేయడం వల్ల పార్టీని ఇబ్బంది పెట్టడం తప్ప మరే ఇతర ప్రయోజనమూ ఉండదు. ప్రజా ప్రతినిధులమయిన మేము ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామాలు చేసి సమస్యలో భాగం కావడం కంటే, ప్రజలకు, మా పార్టీకి మధ్య వారధిగా నిలవడం అందరికీ మేలు చేస్తుందని నా అభిప్రాయం. రాజీనామాలు చేయడమనేది వ్యక్తిగత అభిప్రాయాలతో ముడిపడి ఉంటుంది. ఈ సమయంలో పార్టీ వెన్నంటి ఉండి సమస్యను పరిష్కరించడంలో నా వంతు పాత్రను పోషించడమే సమంజసమని భావిస్తున్నాను,” అని ఆమె మీడియాతో అన్నారు. అందరూ రాజీనామాలు చేస్తున్న ఈ తరుణంలో ఆమె ఈవిధంగా మాట్లాడటం పదవులపట్ల ఆమెకున్న యావేనని అందరూ భావించవచ్చును. ఆమె నిజంగా ఈ సమస్య పరిష్కారం కోసం కృషిచేస్తే ఆమె నిర్ణయం నూటికి నూరుపాళ్ళు సరయినదేనని చెప్పవచ్చును.

ఆంధ్రాలో ఉద్రుతమవుతున్న ఉద్యమాలు

  కేంద్రం తెలంగాణా ప్రకటన చేసి నేటికి మూడవరోజు. క్రమంగా సీమంధ్ర జిల్లాలంతటా కూడా సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉద్రుతమవుతూ పలు చోట్ల హింసాయుతంగా మారుతున్నాయి. అనేక జిల్లాలో ఉద్యమకారులు ఇందిరా, రాజీవ్ గాంధీల విగ్రహాలు విధ్వసం చేస్తున్నారు. ఇంతవరకు వివిధ ప్రాంతాలలో దాదాపు 15-20 విగ్రహాలు ఉద్యమకారుల చేతిలో విద్వంసమయినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల పోలీసులు విద్వంసానికి పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసారు.   తెలంగాణాలో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తుంటే, మిగిలిన ప్రాంతాలు మాత్రం అల్లకల్లోలంగా ఉన్నాయి. ఇటువంటి అరాచక పరిస్థితుల్లో రాష్ట్రంలో పోలీసులు, పారా మిలెటరీ బలగాలు తప్ప అసలు ప్రభుత్వం ఉనికి కానరావట్లేదు. ఇంత వరకు ముఖ్యమంత్రి గానీ, బొత్ససత్యనారాయణ గానీ, మరే ఇతర మంత్రులు గానీ బయటకి వచ్చి మీడియాతో మాట్లాడకపోవడం చాలా విచిత్రం.   సీమంధ్ర జిల్లాలంతటా బస్సులు డిపోలకే పరిమితమయిపోగా కొన్నిమారుమూల ప్రాంతాలలో మాత్రం యదావిధిగా తిరుగుతున్నాయి. గత మూడు రోజులుగా అన్ని జిల్లాలలో విద్యాసంస్థలు మూత పడ్డాయి. అదేవిధంగా రవాణ వ్యవస్థ స్తంబించిపోవడంతో ప్రభుత్వ, ప్రవేట్ కార్యాలయాలు కూడా బోసిపోయాయి. ఇక కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, యంపీలు, మంత్రులు అందరూ వరుసబెట్టి రాజీనామాలు చేస్తున్నప్పటికీ ఇందిరా, రాజీవ్ గాంధీల విగ్రహాలు విధ్వసం మాత్రం ఆగలేదు. బహుశః ప్రజాగ్రహానికి భయపడటం వలననేమో ఉద్యమాలలో కాంగ్రెస్ నేతలెవరు కూడా చురుకుగా పాల్గొంటున్నట్లు కనబడటం లేదు.   తెదేపా, వైకాపాలు మాత్రం ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే, పార్టీల వారిగా ఉద్యమాలు జరుగుతున్న కొన్ని ప్రాంతాలలో విభజనకు ఇతర పార్టీలే కారణమని నిందించడం గమనిస్తే, ఉద్యమం వెనుక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్, తెదేపాలలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు రెండు పార్టీలకు చెందిన దాదాపు పదిమంది శాసనసభ్యులు రాజీనామాలు చేసారు.

పక్క దారి పడుతున్న ఉద్యమాలు

  మిలియన్ మార్చ్ సందర్భంగా కొందరు తెలంగాణావాదులు హైదరాబాదులో ట్యాంక్ బండ్ పై ఉన్న మహానీయుల విగ్రహాలు కూల్చినప్పుడు యావత్ తెలుగు జాతి సిగ్గుతో తలవంచుకొంది. దానిని సమర్ధించిన సదరు నేతలను కూడా ప్రజలు తీవ్రంగా అసహ్యించుకొన్నారు. అదేవిధంగా అఖిలపక్షం తరువాత జరిగిన సభలో తెరాస అధ్యక్షుడు జాతీయ నాయకులయిన నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలను నోటికొచ్చినట్లు తూలనాడినప్పుడు కూడా ప్రజలు అంతే తీవ్రంగా స్పందించారు. అయితే, ఇప్పుడు అదే తప్పును కొందరు సమైక్యవాదులు చేస్తుండటం చాలా విచారకరం. ఇటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా తప్పనిసరిగా తీవ్రంగా ఖండించవలసిందే.   అనంతపురం జిల్లాలో కొందరు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలకు నిప్పు పెట్టడం, కూల్చివేయడం చాలా హేయమయిన చర్య. కాంగ్రెస్ పార్టీ తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేఖించడాన్నిఎవరూ తప్పు పట్టరు. కానీ, అందుకు ఆ పార్టీకి చెందిన నేతల విగ్రహాలను ద్వంసం చేయడం మాత్రం చాలా తప్పు. ఆవిధంగా చేయడం కేవలం ఒక వికృతి సంస్కృతికి అద్దం పడుతుంది.   అదేవిధంగా 365 రోజులు ప్రజలకు సేవ చేస్తున్న ఆర్టీసీ బస్సులను తగులబెట్టడం, ద్వంసం చేయడం అంటే మన స్వంత ఆస్తులను మనమే నాశనం చేసుకోవడమే అవుతుంది. ఇక, వివిధ సంస్థల కార్యాలయాలలోకి జొరబడి ఆస్తులను ద్వంసం చేయడం, రోడ్డు మీద కనబడిన వాహనాలకి నిప్పుపెట్టడం వంటి చర్యల వల్ల సాటి ప్రజలకు నష్టం కలిగించడమే తప్ప అది ఉద్యమానికి ఎంత మాత్రం ఉపయోగపడదు.   ఉద్యమం ఎవరు పాల్గొన్నా లేకున్నా కొనసాగుతూనే ఉంటుంది. కానీ, ఇటువంటి సంఘ వ్యతిరేఖ చర్యలకు పాల్పడినవారు మాత్రం పోలీసు కేసులలో ఇరుకొని తమ జీవితాలు పాడుచేసుకొన్నవారవుతారు. అందువల్ల సమైక్యాంధ్ర కోరుతూ ఉద్యమం చేస్తున్న వారు రాజకీయ నేతల ప్రభోదాలకి లొంగి ఆవేశపూరితంగా ప్రవర్తించడం కంటే, తమ ఉద్యమంతో ఇతరులకు కూడా ఆదర్శప్రాయంగా నిలవాలి.

వైకాపాకు విరుగుడు మంత్రం వేసిన కాంగ్రెస్

  కాంగ్రెస్ పార్టీపై వైకాపా సంధించిన సమైక్యాస్త్రాన్నిఎదుర్కొనేందుకు ఒక బ్రహ్మాస్త్రమే సిద్దంగా ఉంచుకొంది. కాంగ్రెస్ పార్టీ ఎవరినడిగి రాష్ట్ర విభజన చేసిందని ప్రశ్నిస్తూ ఉద్యమంలోకి దూకిన వైకాపాకు, గతంలో తెలంగాణా కోరుతూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి స్వయంగా సంతకం చేసి ఇచ్చిన లేఖను ఇప్పుడు బయటపెట్టింది. 2004లో ఆయన ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు తెలంగాణ కోరుతూ 32 మంది ఎమ్మెల్యేలతో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీకి ఆయన సంతకం చేసి పంపిన లేఖను కాంగ్రెస్ ఇప్పుడు బయట పెట్టింది. దీనితో వైకాపా కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనేందుకు మరో కొత్త అస్త్రం చూసుకోక తప్పదు. అయితే, అది తన శాసనసభ్యుల రాజీనామాలతో రాజేసిన సమైక్యమంటలు నేడు రాష్ట్రమంతా వ్యాపించడమే కాకుండా ఇతర పార్టీలని కూడా దహించివేస్తున్నాయి.   అయితే, ఈ నిరసనలను, ఆందోళనలను కాంగ్రెస్ ఎంత మాత్రం పట్టించుకొనే ఆలోచన లేదని సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ నిన్న చెప్పడం జరిగింది. రాష్ట్ర విభజన వంటి కీలక నిర్ణయం తీసుకొన్నపుడు ఇటువంటి ప్రతిస్పందన చాల సహజమేనని ఆయన చెప్పడం పార్టీ కూడా ఈవిషయమై పెద్దగా ఆందోళన చెందడంలేదని తెలియజేస్తోంది.   మంత్రులు, శాసనసభ్యుల రాజీనామాలతో రాజ్యంగా సంక్షోభం ఏర్పడితే, దానిని అదిగమించేందుకు కూడా కాంగ్రెస్ మరో అస్త్రం సిద్దంగా ఉంచుకొంది. రాష్ట్ర విభజనపై శాసనసభ ఆమోదించడం సంప్రదాయమే అయినప్పటికీ, అది తప్పని సరి కాదని కాంగ్రెస్ ముందే ప్రకటించింది. అందువల్ల అది 2009 ఫిబ్రవరి 12న రాజశేఖర్ రెడ్డి అద్వర్యంలో రాష్ట్ర శాసనసభలో తెలంగాణపై జరిగిన చర్చను, నాటి సభ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానాన్నిప్రాతిపదికగా తీసుకొని నేడు ముందుకుపోయేందుకు సిద్దపడుతోంది. అందువల్ల రాష్ట్రంలో మంత్రులు, శాసనసభ్యుల రాజీనామాలతో రాజ్యంగా సంక్షోభం ఏర్పడినప్పటికీ, అది రాష్ట్ర విభజన ప్రక్రియకు అవరోధం కాబోదు. అది కేవలం రాష్ట్రపతి పాలనకు మాత్రమే దారి తీస్తుంది.   ప్రస్తుతం తెలంగాణా ప్రక్రియ కొనసాగించడంకంటే పార్టీకి చెందిన రాష్ట్ర, కేంద్ర మంత్రులు, యంపీలు, శాసనసభ్యులు, యంయల్సీలు చేస్తున్న రాజీనామాలను తట్టుకొని నిలబడటమే కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్ష. ఈ పరీక్షలో పార్టీ ఎంత త్వరగా విజయం సాధిస్తే అంత మంచిది.