వాళ్లవి ఉత్తర కుమార ప్రగల్బాలేనా

      ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతాం అలా జరగని పక్షంలో తన పదవులకు పార్టీకి రాజీనామ చేస్తామంటూ ఉత్తర కుమార ప్రగల్బాలు పలికిన నాయకులు ఇప్పుడు మొహం చాటేశారు. ప్రకటనకు ముందు వరకు రాజీనామాల డ్రామా ఆడిన ఈ నాయకులు తెలంగాణ ప్రకటన తరువాత మీడియాకు కనిపించటమే మానేశారు.   అయితే ఈవిషయం పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో సమావేశం అయిన మంత్రులు భిన్న వాధనలు వినిపించారు.. కొంత మంది రాజీనామాలకు మొగ్గు చూపగా మరి కొందరు మాత్రం అధిష్టాన నిర్ణయమే శిరోదార్యం అంటున్నారు. ఆఖరికి ముగ్గురు మంత్రులు మాత్రమే రాజీనామలు అందించగా మిగతా వారు అధిష్టానానికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో అధిష్టానం దూతలుగా వచ్చిన ఏఐసీసీ కార్యదర్శులు తిరునావుక్కరసు, కుంతియా వారిని కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సీమాంధ్రలో ఆందోళనలు తీవ్రతరమవుతున్నందున ప్రజల్లోకి వెళ్లాలంటే రాజీనామాలు తప్పవని మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, శైలజానాథ్, కాసు కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇక ఆ విషయంలో నో కాంప్రమైజ్‌

      తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంతో సీమాంద్రలో నిరసలు వెల్లువెత్తాయి. ప్రత్యేక రాష్ట్ర నిర్ణయం పై కేంద్రం మరోసారి పునరాలోచించుకోవాలి అన్నడిమాండ్‌ బలంగా వినిపిస్తుంది.. ఈ నేపధ్యంలో అలాంటి అవకాశం లేదని స్పంష్టం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే.   ఆయన హోం శాఖ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో తెలంగాణ నిర్ణయం పై కూడా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయంపై పునరాలొచించేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్ర విభజనకు అవసరమైన రాజ్యాంగబద్ధ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు. అయితే ఈ 5వ తారీఖు నుంచి జరగబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టడం సాధ్యం కాదన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో కూడా చాలా సార్లు తెలంగాణ విషయం చర్చ జరిగినందున మరోసారి అసెంబ్లీ తీర్మానం కూడా అవసరం పడక పోవచ్చు అన్నారు.

విదర్భకు కూడా ఒకే

      తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా ప్రకటన చేసి కాంగ్రెస్‌ పుట్టించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపధ్యంలో మరిన్ని డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. అంతేకాదు ఇన్నాళ్లు ఈ డిమాండ్‌లకు దూరంగా ఉన్న నాయకులు కూడా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు పలుకుతున్నారు.   ఇన్నాళ్లు తెలంగాణకు మద్దతు పలికినా… తన సొంతం రాష్ట్రంలోని విదర్భ ఏర్పాటు గురించి ఏనాడు నోరు విప్పని శరద్‌ పవార్‌ తొలిసారిగా విదర్భ ఏర్పాటు గురించి మాట్లాడారు.. అక్కడి ప్రజలు మనోభావాలను గౌరవించి విదర్భ ప్ర్యతేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ అంశంపై ఎన్‌సిపి ఉపాధ్యక్షుడు, కేంద్రమంత్రి ప్రపుల్‌ పటేల్‌ ప్రకటన విడుదల చేశారు. అక్కడి ప్రజల మనోభావాలకనుగుణంగా విదర్భ ఏర్పాటుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. రెండో ఎస్సార్సీ ద్వారా రాష్ట్రాల విభజనకు కూడా తమ మద్దతు ఉంటుందన్నారు.

రాజీనామాలు రాష్ట్రపతి పాలనకి ఆహ్వానమా

  మెల్లగా రాజుకొన్న సమైక్య ఉద్యమం ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలని తాకుతోంది. ఊహించినట్లుగానే సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు తెదేపాను కూడా తాకాయి. ఇంత కాలం చంద్రబాబు అతికష్టం మీద పార్టీ నేతలను కట్టడిచేసి ఉంచినప్పటికీ, రోజురోజుకి తీవ్రతరమవుతున్నఉద్యమం నుండి తప్పించుకోవడం వారి వల్లకాలేదు.   పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, ప్రభాకర్ రావు, రఘునాథ రెడ్డి, శ్రీరామ్ తాతయ్య, అబ్దుల్ ఘని, ప్రత్తిపాటి పుల్లారావు, శ్రీదర్, నరేంద్ర, ఆనంద బాబు, పార్థ సారధి, కేవీ వెంకట ప్రసాద్, దేవినేని ఉమ తదితరులు రాజీనామాలు చేసారు. వీరు గాక పార్టీకి చెందిన అనేక మంది యంయల్సీలు కూడా రాజీనామాలు చేస్తున్నారు. బహుశః రేపటికి అన్ని రాజకీయ పార్టీలు దాదాపు ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే, కాంగ్రెస్ చెందిన అనేక మంది మంత్రులు, శాసన సభ్యులు, యంయల్సీలు తమ రాజీనామాలు సమర్పించారు.   ఇక ప్రస్తుతం సీమంధ్ర ప్రాంతానికి చెందిన పల్లంరాజు, కావూరి, చిరంజీవి, పురందేశ్వరి, శీలం తదితర కేంద్ర మంత్రులు డిల్లీలో కేవీపీ రామచంద్ర రావు ఇంట్లో సమావేశమయ్యారు. వారు కూడా రాజీనామాలు చేయాలనే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే సమైక్య ఉద్యమం పరాకాష్టకు చేరుకోన్నట్లే భావించవచ్చును.   అయితే, తమ రాజీనామాల వలన కేంద్ర నిర్ణయం మారదని వారందరికీ తెలిసినప్పటికీ వారు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారంటే, రాజ్యంగ సంక్షోభం సృష్టిండం ద్వారా రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన విదించబడితే, రాజధాని హైదరాబాద్ పై ప్రస్తుతం తెలంగాణా నేతలు చేస్తున్న వాదనలకు అడ్డు కట్ట వేయవచ్చునని వారి ఆలోచన కావచ్చును. హైదరాబాద్ ను ఎట్టిపరిస్థితుల్లో వదులుకొనేందుకు రెండు ప్రాంతాల వారు ఇష్టపడని కారణంగా మధ్యే మార్గంగా హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు ఈ రాజీనామాల ద్వారా ఒత్తిడి తేవచ్చునని వారి ఆలోచన కావచ్చును.   రాష్ట్ర విభజనపై ఎంతో లోతుగా అధ్యయనం చేసి అనేక మందితో సంప్రదింపులు జరిపిన తరువాతనే నిర్ణయం ప్రకటించామని కొద్ది సేపటి క్రితమే దిగ్విజయ్ సింగ్ మీడియాతో చెప్పారు. అయితే, కాంగ్రెస్ అంచనాలకు విరుద్దంగా సమైక్యాంధ్ర ఉద్యమం మళ్ళీ పుంజుకొంది. కాంగ్రెస్ హైదరాబాదు పై ఉన్న పీటముడులను గమనించి కేంద్రపాలిత ప్రాంతంగా ముందే ప్రకటించి ఉంటే బహుశః ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. నానాటికి తీవ్రమవుతున్న ఉద్యమానికి బహుశః అదొక్కటే పరిష్కారం అవుతుందేమో!

బొత్స ఇళ్ళు ముట్టడి

    సమైక్యాంధ్ర జేఏసి నేతలు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న బొత్స సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేయాలని, అలాగే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులంతా తమ పదవులకు రాజీనామా చేసి పాలనా పరమైన సంక్షోభాన్ని సృష్టించాలని సమైక్యాంధ్రవాదులు డిమాండ్ చేశారు. ఉద్యమానికి సహకరించని నాయకులకు తీవ్రపరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో విజయనగరం పట్టణం మొత్తం పోలీసులు వలయంలో చిక్కుకొంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్ర ప్రక్రియ ఐదారు నెలల్లో పూర్తి: షిండే

      రాష్ట్ర విభజన ప్రక్రియకు సాధారణంగా ఎనిమిది నెలలు పడుతుందని, కాని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ఐదారు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నోట్‌ను రాష్ట్రపతికి పంపడం జరుగుతుందని షిండే చెప్పారు.   హోంమంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరిందని, ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. దేశంలో చాలా చోట్ల ప్రత్యేక రాష్ట్రం డిమాండ్లు వస్తున్నాయని, అయితే విధర్భ కంటే ముందే తెలంగాణ డిమాండ్ ఉందని షిండే పేర్కొన్నారు. కేబినెట్‌లో తెలంగాణ అంశంపై నోట్ సిద్ధం కాగానే హైదరాబాద్‌పై మరింత స్పష్టత వస్తుందని షిండే స్పష్టం చేశారు. భాష ఆధారంగానే రాష్ట్రం ఉండాలని ఎక్కడా లేదని, రాష్ట్ర విభజనపై అందరూ సయంమనం పాటించాలని షిండే విజ్ఞప్తి చేశారు.

సస్పెన్షన్: కెసిఆర్ కు విజయశాంతి కృతజ్ఞతలు

      టీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ కు గురైన మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి బహిరంగ లేఖ రాశారు. ఆరేళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి లో పనిచేసేందుకు అవకాశం ఇచ్చిన అన్న, పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. తనకు సస్పెన్షన్ షోకాజ్ ఇంకా అందలేదని, అందాక దానిపై స్పందిస్తానని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగ ఫలితం వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. మెదక్ ప్రజలకు తన ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. విజయశాంతి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని ఆమె అనుచరుడు రఘువీర్ తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదన్నరు. అలాంటప్పుడు వేటు ఎందుకు వేస్తారని ప్రశ్నించారు.

హరికృష్ణ తెదేపా వఖల్తా ఎందుకు పుచ్చుకొన్నట్లో

  వైకాపా పెట్టిన ఫ్లెక్సీ బ్యానర్ చిచ్చుతో తెదేపాకు దూరమయి, పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్ననందమూరి హరికృష్ణ నిన్నజరిగిన పంచాయితీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ అవినీతి, అసమర్థ పార్టీలను త్రిప్పికొట్టి, తెలుగు దేశం పార్టీని గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇంత కాలం పార్టీ అంటే గిట్టనట్లు వ్యవహరించిన హరికృష్ణ, ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ తరపున మాట్లాడటం ఆశ్చర్యం కలిగించినా, ఆయన తెదేపా ద్వారా తన రాజకీయ జీవితం కొనసాగించేందుకే ఆసక్తి చూపుతున్నందునే ఆవిధంగా మాట్లాడినట్లు అర్ధం అవుతోంది.   రాజ్యసభ సభ్యుడయిన హరికృష్ణ మరో తొమ్మిది నెలలలో జరగనున్నఎన్నికలలో ఈ సారి గన్నవరం నియోజక వర్గం నుండి శాసనసభకు పోటీచేసే ఆలోచన ఉన్నట్లు ఇదివరకు ఒకసారి తెలిపారు. బహుశః దానిని దృష్టిలో ఉంచుకొనే ఇప్పుడు మళ్ళీ పార్టీ తరపున మాట్లాడి ఉండవచ్చును. అయితే, మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో తెదేపా తప్పని సరి విజయం సాదించాలంటే కేవలం గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్స్ ఇవ్వవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మరి తెదేపా ఆయనకు టికెట్ కేటాయించగలదని భావించలేము. అదీగాక రాష్ట్ర విభజన తరువాత, దాదాపు 140 సీట్లు మాత్రమే ఉండే అవకాశం ఉన్నందున టికెట్స్ కోసం పోటీ చాల అధికంగా ఉండబోతోంది. రానున్న ఎన్నికలలో గెలవడం తేదేపాకు ఎంత ముఖ్యమో వైకాపా, కాంగ్రెస్ పార్టీలకు కూడా అంతే ముఖ్యం గనుక వారి మధ్య చాల తీవ్రమయిన పోటీ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో హరికృష్ణ పార్టీ టికెట్ ఆశిస్తూ మళ్ళీ చంద్రబాబుకి దగ్గర కావాలని ప్రయత్నిస్తే మాత్రం ఆయనకు నిరాశ తప్పదు.

రాజకీయాలకు బలవుతున్న తెలుగుజాతి

......సాయి లక్ష్మీ మద్దాల       తెలుగుజాతి విదేశీయురాలి పుణ్యమా అని రెండుగా చీలిపోయింది. ఎంటువంటి ముందస్తు జాగ్రత్తలు, నిర్ణయాలు లేకుండానే వామపక్ష నిర్ణయం,....తీర్మానం జరిగిపోయాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం పూర్తయ్యే వరకు ఏ ఒక్క రాజకీయ నేత నోరు మెదపలేదు. మరి ముఖ్యంగా ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి వ్యవహారశైలి మాత్రం చాలా విడ్డురంగాను, విచిత్రంగానూ ఉంది. రెండు రాష్ట్రాలుగా విడిపోయి, విడగొట్టబడిన సందర్భంలో ఆయా ప్రాంతప్రజల మనోభావాలను, భావోద్వేగాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు ఏ రాజకీయ నేత కూడా. దీనిని ఏమనాలి?     మరీ ముఖ్యంగా ఇపుడు కొత్తగా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని దానికి కొత్తగా ఒక రాజధానిని నిర్దేశించడం అంటే, అది రాత్రికి రాత్రే అయిపోయే కార్యక్రమం కాదు. ఒక జాతిని, ఒక ప్రాంతాన్ని రెండుగా చీల్చాలంటే అక్కడ తలెత్తే భౌగోళిక సమస్యలు, మౌలిక సమస్యలు, ఎవరికి తెలియనిది కావు. ఒక ప్రాంతాన్ని విభజించితే నిర్ణయం తీసుకున్నప్పుడు, ముందుగా అవలంభించవలసిన నిబంధనలు ఎందుకు పాటించలేదు.   ఒక రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించేటప్పుడు ముఖ్యంగా తలెత్తే వివాదం నీటి వివాదం. నీటి పంపకాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు జరగలేదు. ముఖ్యంగా తలెత్తే సమస్యలను ఒకసారి కూలంకుషంగా పరిశీలిస్తే నీటి సమస్య, ఇక్కడ హైదరాబాద్ లో 30,40 సంవత్సరాలుగా సెటిలయిన వివిధ ప్రభుత్వ రంగ ఉద్యోగుల భవితవ్యం, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వ్యాపారస్తుల భవితవ్యం, వివిధ ప్రైవేటు సంస్థల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ రకంగా విశ్లేషించుకోండి. హైదరాబాద్ లో సెటిల్ అయిన వివిధ ప్రాంత వాసులకు జీవన భరోసా ఎవరు కల్పిస్తారు. పోలవరానికి జాతీయ హోదా కల్పించటం అంటే అది ఒక కాగితం మీద రాసుకున్నంత తేలికగా జరిగిపోయే వ్యవహారమా. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవేవి ఏళ్లకేల్లుగా నలుగుతున్న సమస్య. ఆ నిర్మాణం జరగాలంటే అక్కడ తలెత్తే మౌలిక సమస్యలకు ఎవరు భాధ్యులు? ఇన్ని రకాల సమస్యలు ఒక ప్రాంత విభజనలో అంతర్లీనంగా దాగొని ఉంటే ఒక 10గంటల వ్యవధిలో ఒక 20మంది సభ్యులు 10కోట్ల మంది ప్రజానీకం తలరాతను ఎలా శాసించగలిగారు? మరీ ముఖ్యంగా ప్రధాన సమస్య "హైదరాబాద్". హైదరాబాద్ ను 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్నారు. మరి ఈ 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఎవరి అధీనంలో ఉండాలి? రాష్ట్ర విభజనలో ఉన్న ఇన్ని సమస్యలు చంద్రబాబు నాయుడి దృష్టికి రాలేదా? ఆంధ్ర రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా ఆయన తన కర్తవ్యాన్ని ఎందుకు విస్మరించారు? విభజన అనంతరం రాష్ట్రంలో తలెత్తబోయే సమస్యల విషయంలో ఒక కమిటీని వేయటం ద్వారా, సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందనే ప్రతిపాదనను ఆయన ఎందుకు ముందుకు తీసుకురాలేదు. ఆ మేరకు కాంగ్రెస్స్ అధిష్టానాన్ని ఎందుకు ఒత్తిడి చేయలేదు. ఏ ప్రలోభాలను చంద్రబాబు లొంగిపోయి, అధిష్ఠానం ముందు నోరు మెదపలేకపోయారు. విభజన కార్యక్రమం ముగిసిన తరువాత ఇపుడు కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రాభివృద్ధికి 4,5 లక్షల కోట్ల నిధులు కావాలని, హైదరాబాద్ తరహాలో కొత్త రాజధానిని అభివృద్ధి చేయాలని ఆయన వ్యాఖ్యానించడం దేనికి నిదర్శనం? హైదరాబాద్ ఒక్క రోజుల్లోనే, ఒక్క సంవత్సరంలోనే అభివృద్ధిని సాధించిందా? ఆ విషయం చంద్రబాబుకు తెలియదా? అన్నిటికి మించి ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా కల్పించమని బాబుగారు మాట్లాడటం అందరిని విస్మయానికి గురిచేసింది. రెండు ప్రాంతాలలోను టి.డి.పి. ఉంటుందని ఆయన వ్యాఖ్యానిస్తున్నట్లుగానే, నేడు ఆయనకు కావాల్సింది కేవలం రాజకీయ లబ్ది మాత్రమేనా? తెలుగుజాతి సంక్షేమం కదా?

ఆత్మబంధువు చంద్రబాబు

కేంద్రం సెపరేట్ తెలంగాణ రాష్ట్రం ప్రకటన పాపం చంద్రబాబుదే అని చాలా మంది ఆయన వైపు వేలెత్తి చూపుతున్నారు. అది శుద్ద అవివేకం. ఆయన మనసులోని నిగూడమైన భావాలు అర్ధం చేసుకునేవారు అలా అంటారు. సీమాంధ్ర ప్రజలు బ్లాక్ డే గా అభివర్ణించిన జూలై 30వ తేది సాయంత్రం చంద్రబాబు పెదవి విప్పి తన మనసులోని మాట చెప్పారు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో సీమాంధ్ర ప్రజలు గమనించలేకపోయారు.     సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్ లాంటి నగరాన్ని సీమాంధ్ర రాష్ట్రం కోసం నిర్మించుకోవాలని చెప్పారు. ఆ మహానగరం నిర్మాణం కోసం 5 లక్షల కోట్లు కేంద్రాన్ని ఇవ్వవలసిందిగా ఆయన డిమాండ్ చేస్తారట! కాబట్టి 5 లక్షల కోట్లతో సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్ ను మించిన నగరాన్ని నిర్మించుకోవచ్చు. హైదరాబాద్ లోని ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ కంటే గొప్ప ఎయిర్ పోర్ట్ ని నిర్మించుకోవచ్చు. పరిశ్రమలు ఇక్కడ వందల సంఖ్యలో ఐ.టి కంపెనీలు ఉంటే ఆ మహానగరంలో వేల సంఖ్యలో  ఐ.టి కంపెనీలు, పరిశ్రమలు స్థాపించబడేలా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పదుల సంఖ్యలో స్టార్ హోటల్స్, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు ఇతరవి ఇక్కడ ఉంటే వీటికంటే ఎక్కువగా అక్కడ ఉండేలా సీమాంధ్ర ప్రజలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే 5 లక్షల కోట్ల రూపాయలు సామాన్యమైన డబ్బు కాదు. మరి అంతా డబ్బు కేంద్రం ఇస్తుందా? అంటే చచ్చినట్టు ఇస్తుంది. ఎందుకంటే అక్కడ అడబ్బుని డిమాండ్ చేస్తున్నది చంద్రబాబు నాయుడు కదా! రాష్ట్ర విభజన సమయంలోమౌనంగా ఉన్నందుకైనా కేంద్రం చంద్రబాబు డిమాండ్ కి తల ఒగ్గి  5 లక్షల కోట్లు కోట్లు మరో రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు కల సాకారం కావడానికి 10సంవత్సరాలు కూడా అక్కర్లేదు. నాలుగైదు సంవత్సరాల కాలం చాలు. అపర చాణుక్యుడైనా చంద్రబాబుకి సమైఖ్య ఆంధ్ర ప్రజలు ఎంతైన రుణపడి ఉన్నారు.      

మాజీ మంత్రి పీవీ రంగారావు మృతి

      మాజీ మంత్రి పీవీ రంగారావు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకి గుండెపోటు రావడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మరణించారు. రంగారావు వయసు 73 సంవత్సరాలు. ఈయన దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పెద్ద కుమారుడు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి , కోట్ల విజయభాస్కరరెడ్డిల క్యాబినెట్ లో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయన బ్రహ్మచారిగానే ఉండిపోయారు. పీవీ నరసింహా రావు మృతి చెందాక ఆయనకు ఢిల్లీలో తగిన గౌరవం దక్కలేదని రంగారావు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా ప్రధానుల్లా పీవీ సమాధికి ఢిల్లీలో తగిన గౌరవం కల్పించాలని ఎంతో ప్రయత్నిచారు.

బీజేపీలో మోడీ ముసలం పదిలం

  భారతీయ జనతాపార్టీలో నరేంద్ర మోడీ విషయమై ఇంకా కల్లోలం చెలరేగుతూనే ఉంది. ఆయన తన గుజరాత్ కంచుకోట లోంచి బయటకి వచ్చి దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ పార్టీని బలపరచడానికి కృషి చేస్తుంటే, పార్టీలో ఆయనను వ్యతిరేఖించేవారు చాప క్రింద నీరులా తమపని తాము చేసుకొనిపోతున్నారు.   ఆ పార్టీకి చెందిన ప్రముఖ సినీ నటుడు శత్రుఘన్ సిన్హా తమ పార్టీకి, ముఖ్యంగా మోడీకి బద్ధ శత్రువయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని పొగడ్తలతో ముంచెత్తారు. “నితీష్ కుమార్ సారధ్యంలో బీహార్ రాష్ట్రం అద్భుతమయిన ప్రగతి సాధిస్తోందని, ఆయన వంటి సమర్ధుడు దేశప్రధాని పదవి ఆశించడంలో తప్పు లేదని, ఆయన ప్రధాని పదవికి అన్ని విధాల సమర్ధుడు, అర్హుడు” అంటూ పొగిడేశారు.   నరేంద్ర మోడీని సాకుగా చూపి బీజేపీ సారద్యంలో నడుస్తున్న ఎన్డీయే కూటమి నుండి నితీష్ కుమార్ కి చెందిన జేడీ (యు) వైదొలగిన నాటినుండి ఆయనపై విరుచుకుపడుతున్నబీజేపీకి, తమ పార్టీ సీనియర్ నేతే ఈవిధంగా శత్రువును పొగడటం మింగుడు పడటం లేదు. అందువల్ల శత్రుఘన్ సిన్హాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి బీజేపీ అధిష్టానం సిద్దపడుతోంది. బహుశః సిన్హా కూడా సరిగ్గా అదే ఆశిస్తూ ఆవిధంగా మాట్లాడి ఉండవచ్చును.   బీహార్ రాష్ట్రానికే చెందిన ఆయన ఒకవేళ జేడీ(యు) పార్టీలోకి మారే ఆలోచనతో నితీష్ కుమార్ ని పొగిడి ఉండవచ్చును. లేదా, మోడీని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న అద్వానీ వర్గానికి చెందిన సిన్హాను అద్వానీయే వెనుక నుండి ఆవిధంగా మాట్లాడేందుకు ప్రేరేపించి ఉండవచ్చును. మోడీ కోసం నితీష్ కుమార్ వదులుకొని పార్టీ పెద్ద తప్పు చేసిందని దృడంగా నమ్ముతున్న అద్వానీ వర్గం, సిన్హా ద్వారా పార్టీలో ఒక కొత్త చర్చ లేవదీసే ప్రయత్నం చేసి ఉండవచ్చును. ఒకవేళ సిన్హా మీద పార్టీ వేటువేస్తే అద్వానీ వర్గం ఇదే అదునుగా చేసుకొని మోడీని వ్యతిరేఖిస్తూ మళ్ళీ తిరుగుబాటు జెండా ఎగురవేసే అవకాశం ఉంది. రానున్న ఎన్నికలలోగా పార్టీ చేత మోడీ పేరును ఎలాగయినా పక్కన పెట్టించాలని తీవ్రంగా పరితపిస్తున్న అద్వానీ వర్గం ఇటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండవచ్చును.   అయితే, దీనివల్ల ఆ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగవచ్చును. రానున్న సాదారణ ఎన్నికలలో భారీ మెజార్టీతో బీజేపీ గెలుపు ఖాయం అని ధీమాగ చెపుతున్న అద్వానీ, మోడీకి వ్యతిరేఖంగా ఈవిధంగా ముసుగులో గుద్దులాతలు కొనసాగిస్తుంటే, కాంగ్రెస్ ని కష్టపెట్టకుండా బీజేపీ తనను తానే ఓడించుకోవడం మాత్రం ఖాయం.

పంచాయతీ ఫలితాలపై స్పందించిన హరికృష్ణ

      పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టిడిపి రాజ్యసభ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్.కుమారుడు నందమూరి హరికృష్ణ స్పందించారు. మూడు విడతల్లో వచ్చిన ఫలితాలను విశ్లేషిస్తే ప్రజలు టిడిపి వైపే వున్నారని అర్థమవుతుందని అన్నారు. టిడిపి పార్టీకి అత్యధిక స్థానాల్లో విజయాన్ని అందించినందుకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అవినీతిని, కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానన్ని ప్రజలు తిరస్కరించారన్నారు. మూడు దశల పంచాయతీ ఎన్నికల ఫలితాలు కలిపి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మద్దతుదారులు కొద్ది తేడాతో ఆరువేల పంచాయతీల్లో గెలుపొందారు.

జగన్ కంచుకోటలో తెదెపా విజయం

      వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంచు కోటలో టిడిపి పార్టీ విజయజెండా ఎగురవేసింది. వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీ వేంపల్లెలో టిడిపి పార్టీ విజయం సాధించింది. కడప పులివెందులలో జగన్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీలో టిడిపి మద్దతుదారు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. వైఎస్ఆర్. కాంగ్రెస్ మద్దతుదారుడు రవి కుమార్ 2076 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారు వేంపల్లెలో గత రెండుమూడు దశాబ్దాలుగా వైయస్ కుటుంబం అనుచరులే గెలుస్తూ వస్తున్నారు. టిడిపి మద్దతుదారుగా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి శాసన మండలి సభ్యుడు సతీష్ రెడ్డికి సోదరుడు.

కాంగ్రెస్ ఎత్తులకు మోడీ పైఎత్తు

  తెరాస చేతిలోంచి తెలంగాణా ఉద్యమాన్ని చివరి నిమిషంలోవచ్చికాకిలా తన్నుకుపోయిన కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా తెలంగాణా రాష్ట్ర ప్రకటనతో మోడీ చేతిలోంచి కూడా తెలంగాణా అంశం ఎత్తుకుపోయింది.   మోడీ ఈనెల 11న హైదరాబాదులో ప్రత్యేకంగా తెలంగాణా యువతని ఉద్దేశించి మాట్లాడేందుకే ఒక భారీ సభకు హాజరవనున్నారు. అందులో తెలంగాణా అంశంపై కాంగ్రెస్ అనుసరిస్తున్న కపట వైఖరిని ఎండగట్టి, వచ్చే ఎన్నికలలో బీజేపీకి ఓటేసి అధికారం ఇస్తే, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటగా తెలంగాణా ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయాలని భావించారు.   అయితే, గత 9 ఏళ్లుగా ఈ సమస్యను పరిష్కరించకుండా సాగదీస్తున్నకాంగ్రెస్ పార్టీ గత వారం రోజులుగా రేయనక పగలనక ఓవర్ టైం చేసి మరీ, తెలంగాణా ప్రకటన చేసిందని మోడీ విమర్శించడం గమనిస్తే, కాంగ్రెస్ మోడీ హైదరాబాదు పర్యటనను డెడ్ లైన్ గా పెట్టుకొని పని చేసి ప్రకటన చేసినట్లు అనిపిస్తుంది. కానీ, మోడీ తన వాగ్దానంతో తెలంగాణా ప్రజలను తన వైపుకి తిప్పేసుకోగలడని చెప్పడం సరికాకపోయినా ఆప్రాంతంలో కాంగ్రెస్  ఓటు బ్యాంకుకి ఎంతో కొంత మేర నష్టపరచ గలిగేవారనేది మాత్రం సత్యం. అందువల్ల, ఆయన హైదరాబాద్ పర్యటన కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో కొంత ఒత్తిడి పెంచే ఉండవచ్చును.   స్థానిక బీజేపీ నేతలు, “మోడీ తెలంగాణపై వాగ్ధానం చేసి ప్రజలను ఎక్కడ ఆకట్టుకొంటాడో అనే భయంతోనే కాంగ్రెస్ అంత కష్టపడిందని, లేకుంటే ఎన్నికల వరకు ఈ తంతు కొనసాగుతూనే ఉండేదని” వాదిస్తున్నారు. వారి వాదనల సంగతెలా ఉన్నపటికీ, కాంగ్రెస్ మాత్రం తన ప్రకటనతో మోడీ చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం వంటి అంశాన్ని తెలివిగా ఎత్తుకుపోయిందని ఖచ్చితంగా చెప్పవచ్చును.   అయితే, మోడీ కూడా ఏమి తెలివి తక్కువవాడేమికాదు. ఆయన హైదరాబాద్ లో తన బహిరంగ సభ తరువాత తెలంగాణా లో విస్తృతంగా పర్యటించి తెలంగాణా అంశంతో పార్టీకి బలం చేకూర్చాలని అనుకొన్నారు. కానీ మారిన పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు తెలంగాణా ప్రాంతాలకు బదులు, కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్న ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలలో పర్యటించి విస్తృతంగా సభలు నిర్వించాలని కొత్త వ్యూహం రచించారు.   హైదరాబాద్ తరువాత, ముందుగా తిరుపతి, అనంతపురం పట్టణాలలో ఆ తరువాత వెనువెంటనే, విజయవాడ, రాజమండ్రీ, విశాఖపట్నంలలో సభలు నిర్వహించేందుకు సిద్ధపడుతున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీమంధ్ర ప్రజలను తమవైపుకు తిప్పుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. అయితే, తెలంగాణా ప్రాంతంలో ఆయనకు అడ్డుకట్ట వేయగలిగిన కాంగ్రెస్ మరిప్పుడు సీమంధ్ర ప్రాంతంలో ఏవిధంగా నిలువరిస్తుందో చూడాలి.

టీఆర్ఎస్ నుంచి రాములమ్మ ఔట్

      విజయశాంతి పై టీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్దమైందని వార్తలు వస్తున్న ఆమె ఖండించకపోవడంతో కేసీఆర్ ఆమె పై మండిపడ్డారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విజయశాంతి అనేక సార్లు క్షమించా౦. ఇప్పుడు సస్పెన్షన్ చేస్తున్నాం. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు ఇస్తాం. పొలిట్‌బ్యూరో ఏకాభిప్రాయం మేరకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు'' అని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.   విజయశాంతి కొన్నాళ్లుగా టీఆర్ఎస్‌ పార్టీ కార్యాకలాపాల్లో పాల్గొనడంలేదు. ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. విభజన అంశంపై అటు రాష్ట్రం, ఇటు కాంగ్రెస్ పెద్దలు తలమునకలైన సమయంలోనే ఆమె ఢిల్లీకి వెళ్లారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో సమావేశమై మెదక్ ఎంపీ సీటుపై హామీ ఇప్పించుకున్నారు.

ఈ పాపం కాంగ్రెస్‌దే

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో దేశ‌వ్యాప్తంగా విభ‌జ‌న సెగ‌లు చెల‌రేగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ‌తో పాటు బ‌ల‌మైన ఉద్యమంగా కొన‌సాగుతున్న గుర్ఖాల్యాండ్ పోరాటం తెలంగాణ ప్రక‌ట‌న‌తో మ‌రోసారి ఉవ్వెత్తున్న ఎగ‌సి ప‌డింది. తెలంగాణ ప్రక‌ట‌న రాబోతుంది అన్న నేప‌ధ్యంలోనే 72 గంట‌ల బంద్‌కు పిలుపునిచ్చిన అక్కడి ప్రజ‌లు తెలంగాణ ప్రక‌ట‌నతో ఉద్యమాన్ని మ‌రింత ఉదృతం చేశారు. దీంతో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీపై మండిప‌డుతున్నారు. దేశాన్ని ముక్కలుచేసేందుకు కాంగ్రెస్ పార్టీ కంక‌ణం క‌ట్టుకుంద‌ని మండిప‌డ్డారు. కేవ‌లం త‌మ రాజ‌కీయ ప్రయోజ‌నాల కోస‌మే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌ను ప్రక‌టించింద‌న్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రక‌టించ‌టం వ‌ల్లే త‌మ రాష్ట్రంలో ఇలా అనిశ్చితి నెల‌కొంది అని మండిప‌డ్డారు. ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నా ప‌శ్చిమ‌బెంగాల్ విడిపోనివ్వన‌న్న మ‌మ‌త కాంగ్రెస్ నాయ‌కుల‌ను తీవ్రంగా విమ‌ర్శించారు. గుర్ఖాల్యాండ్ ప‌శ్చిమ బెంగాల్లో అంత‌ర్భాగ‌మేన‌ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ విడిపోద‌ని ప్రక‌టించారు.

మాకు నాలుగు రాష్ట్రాలు కావాలి

  తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ రెడీ అవ్వటంతో ఇప్పుడు మ‌రిన్ని విభ‌జ‌న అంశాలు తెర మీద‌కు వ‌స్తున్నాయి. ముఖ్యంగా చాలా రోజులు త‌మ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా చీల్చాలంటూ కోరుతుంది యుపి నేత మాయ‌వ‌తి. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తామెప్పుడు సుముఖంగానే ఉన్నా మ‌న్న మాయ త‌మ రాష్ట్ర స‌మ‌స్యను కూడా త్వర‌గా ప‌రీక్షించాల‌ని కోరారు. ఇప్పటికే గుర్ఖాలాండ్ ఉద్యమం కూడా ఊపంవుకోవ‌టంతో మ‌రిన్ని డిమాండ్‌లు వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు విశ్లేష‌కులు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేక‌మ‌ని ప్రక‌టించిన జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా తెలంగాణ ఏర్పాటు తో పాటు ఇత‌ర డిమాండ్లను కూడా ఖండించారు.

అన్నదమ్ముల్లా కలిసుండాలి: సోనియా!

      సీమాంధ్ర ప్రాంతం వారు మీ సోదరులేనని, సంయమనం పాటించాలని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తమకు సూచించారని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు అన్నారు. విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుండాలని సోనియా సూచించారని, అనివార్యమై విభజనపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారని అన్నారు. ఏ సమస్యనైనా ఇరు ప్రాంత నేతలు చర్చించి పరిష్కరించుకోవాలని, శాంతిభద్రతలు వాటిల్లకుండా కలిసిమెలిసి ఉండాలని చెప్పారన్నారు. తెలంగాణలో పార్టీని గెలిపించేందుకు కృషి చేయమని సూచించారన్నారు. తెలంగాణపై సానుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు తాము సోనియాకు కృతజ్ఞతలు తెలిపామన్నారు. తీర్మానానికి సహకరించిన సీమాంధ్ర నేతలకు ధన్యవాదాలు తెలిపారు.