చోద్యం చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

  కేంద్రం రాష్ట్ర విభజన ప్రకటన చేసినప్పటి నుండీ నానాటికి సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రతరమవుతోంది. ఇదివరకు తెలంగాణా ఉద్యమాలతో అల్లకల్లోలంగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు సమైక్య ఉద్యమాలతో మళ్ళీ అదే పరిస్థితికి చేరుకొంది. అయితే, ఒక దశ దిశా లేకుండా సాగుతున్న ఈ ఉద్యమాలకు అసలు ముగింపు ఎప్పుడో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజనపై ఇక ఎంత మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితంగా చెపుతోంది. అంతే కాకుండా రాష్ట్ర విభజన ప్రక్రియను కూడా మొదలుపెట్టేసింది. ప్రస్తుతం హోంశాఖ రాష్ట్ర విభజన, హైదరబాద్ ఉమ్మడి రాజధాని అనే రెండు అంశాలపై ఒక నోట్ తయారుచేస్తోంది. దానిని కేంద్ర క్యాబినెట్ ఆమోదించడంతో విభజన ప్రక్రియ జోరందుకొంటుంది. అయితే, రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడానికి కాంగ్రెస్ ఎంత మాత్రం ప్రయత్నించక పోవడంతో ఉద్యమం నానాటికి తీవ్ర తరం అవుతోంది. మొదట అనంతపురంలో మొదలయిన ఈ సమైక్యాంధ్ర ఇప్పుడు సీమంధ్ర జిల్లాలంతటికీ వ్యాపించడంతో జన జీవనం అస్తవ్యస్తమయిపోయింది. సమైక్యాంధ్ర కోసం కూడా ఆత్మహత్యలు మొదలవడం చాలా విచారకరం. అయితే వాటిని నిలువరించే ప్రయత్నం ఎవరూ చేయకపోవడం వల్ల అవి కూడా క్రమంగా పెరుగుతున్నాయి. నేటికి దాదాపు 26వరకు చనిపోయినట్లు సమాచారం. రాష్ట్రంలో ఒకవైపు వరద భీభత్సంతో ప్రజలు నానా బాధలు పడుతుంటే, ఈ సమైక్యాంధ్ర ఉద్యమాల వల్ల ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూతపడుతుండటంతో వరదలలో చిక్కుకొన్న ప్రజలకి సహాయం అందక నానా బాధలు పడుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి నానాటికి దిగజారుతున్నపటికీ, ముఖ్యమంత్రి గానీ, ఇతర మంత్రులు గానీ ఏమాత్రం చొరవ తీసుకొనే ఆలోచనలో లేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ పరిస్తిత్కి ప్రజలను తప్పు పట్టడం కంటే, చోద్యం చూస్తూ కూర్చొన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే ముందుగా తప్పు పట్టవలసి ఉంటుంది.

ముఖ్యమంత్రి కనబడుట లేదు

  నిన్న మొన్నటి వరకు తన బంగారు తల్లిని వెంటబెట్టుకొని ఇందిరమ్మ కలలు కంటూ ఊరువాడా తిరిగుతూ, ప్రజల కోసమే ఈ జీవితమంటూ మైకులు బ్రద్దల్లయ్యేలా పెద్ద గొంతుతో స్వీయ చాటింపు వేసుకొన్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గత వారం రోజులుగా కనబడుటలేదని రాష్ట్ర ప్రజలు చాలా కంగారు పడుతున్నారు.   అసలు ఆయన రాష్ట్రంలోనే ఉన్నారా లేక డిల్లీలో ఉన్నారా? అని మీడియా వాళ్ళు కూడా ఆయన కోసం తెగ వెదుకుతున్నారు. కానీ  వాళ్ళు కూడా ఆయన ఆచూకీ కనుగొనలేకపోయారు.   అయితే, (తెలంగాణా) పంచాయితీలకి పెద్దన్నజానారెడ్డి మాత్రం రెండు మూడు రోజుల క్రితం ఆయన సీమంధ్ర మంత్రులతో తలుపులేసుకొని మాట్లాడుతుంటే తానూ కిటికీలోంచి చూశానని, అప్పుడు ఆయన పక్కన బొత్స బాబు కూడా ఉన్నారని, వారిద్దరూ ఏదో సమైక్య లేఖలు సంతకాలు చేస్తున్నారని, దానిని తానూ ఖండిస్తున్నానని చెప్పడంతో జనాలు కూడా తేలికపడ్డారు.   మేము కట్టిన పన్నులతో వాళ్ళక్కడ పనిచేయకుండా ఏసి గదుల్లో కులాసాగా కబుర్లు చెప్పుకొంటుంటే మేము మాత్రం ఆఫీసులలో పని చేయలా ఇదేమి (సమ) న్యాయం? అంటూ, అధికారులు, ప్రభుత్వోద్యోగులు, జనాలు అందరూ కూడా గిన్నెలు ముంతలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చేసారు.    ‘యదారాజ తదా ప్రజా’ అంటే ఏమిటో ఇప్పుడు మన రాష్ట్రాన్నిచూస్తే ఎవరికయినా ఇట్టే అర్ధమవుతుంది.   ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ సచివాలయం మొహం చూసి చాలా రోజులయింది. ఇక కేసీఆర్ వ్యాఖ్యలతో సచివాలయ ఉద్యోగులు ఆంధ్ర, తెలంగాణా ఉద్యోగులుగా విడిపోయి రోడ్ల మీద కత్తులు దూసుకొంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు అందరూ కూడా ఆఫీసులు కంటే రోడ్డు పదిలం అనుకొంటూ సమైక్యంగా రోడ్డు మీద వంటా వార్పులు చేసుకొంటూ రకరకాల ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు. మాకు మాత్రం ఆట విడుపు ఉండకపోతే ఎలా మేము ప్రజలమే (మనుషులమే) అంటూ జనాలు కూడా కార్యాలయాలకు, కాలేజీలకు, ఖార్కానాలకు, దవాఖానలకు తాళాలు వేసుకొని వచ్చి రోడ్ల మీద అవేశపడుతూ సేద తీరుతున్నారు.   ప్రజల వెనుక ప్రజా ప్రతినిధులున్నారో లేక వారి వెనుక ప్రజలున్నారో తెలియని పరిస్థితిలో మన ప్రజా ప్రనిధులు కూడా రాజీనామా లేఖలను ముక్కు మొహం తెలీని వాళ్ళ చేతుల్లో పెట్టి ‘సమైక్య చాంపియన్ షిప్’ పోటీలో పరుగులు పెడుతున్నారు.   ఇక త్వరలో ఆర్టీసీ, విద్యుత్, మునిసిపాలిటీ సిబ్బంది కూడా రోడ్లమీద వంట వార్పూ రుచి చూడాలని ఉవ్విళ్ళురుతున్నారు. ఇక ఏవయినా శాఖలు మిగిలి ఉంటే వాళ్ళు కూడా తమ కార్యలయాలకి తాళాలు వేసుకొని వచ్చేస్తే, విజయమ్మ కోరుకోన్నట్లు అందరికీ సమన్యాయం జరుగుతోందని పండగ చేసుకోవచ్చును. కానీ, ఆ పండగ చేసుకోవడానికి డబ్బులెక్కడి నుంచి వస్తాయన్నదే పెద్ద ప్రశ్న.

వలస బాటలో తెరాస నేతలు

      తెలంగాణ పై కాంగ్రెస్‌ సానుకూలంగా అడుగులు వేస్తుండటంతో టిఆర్‌ఎస్‌ వర్గాలు గుబులు రోజు రోజుకు ఎక్కువవుతుంది. కాంగ్రెస్‌ ఎత్తులతో ఇప్పుడు చాలా మంది టిఆర్‌ ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ తలుపు తడుతున్నారు. ఎలాగూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్‌ ఎస్‌ కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది కాబట్టి తాము అంతకన్నా ముందే ఆ పార్టీలో చేరడం మేలని భావిస్తున్నారు.   ఇప్పటికే టిఆర్‌ఎస్‌ ఎంపి విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీకి అనూకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణతో పార్టీ నుంచి సస్పెండ్‌ అవ్వగా, మరో ముగ్గురు నాయకులు సోమవారం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌తో చర్చలు జరిపారు. గతంలో టిఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న విజయరామారావుతో పాటు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్‌, సోయం బాబు రావులు దిగ్విజయ్‌ సింగ్‌తో మంతనాలు జరిపారు. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే టిఆర్‌ఎస్‌ పార్టీ కాలీ అవ్వడం కాయం అంటున్నాయి రాజకీయ వర్గాలు.

తెలంగాణలో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్

      రాబోయే సాధారణ ఎన్నికలలో తెరాసకు పది లేదా పదకొండు సీట్లు మాత్రమే వస్తాయని, కాంగ్రెసు పార్టీకి ఎనబై సీట్ల వరకు వస్తాయని మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందన్నారు. ఏర్పాటు ప్రకటన వచ్చిందంటే అది టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఒక్కరిది కాదని, అమరవీరులతో పాటు తామందరిదని మెదక్ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. 16 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నాను. నేనేంటో రాష్ట్రంలోనేకాక, దేశంలో అందరికీ తెలుసునని, షోకాజ్ నోటీసు వచ్చిన తర్వాతే తన అభిమానులతో చర్చించి భవిష్యత్ కార్యాచారణపై నిర్ణయం తీసుకుంటామని విజయశాంతి స్పష్టం చేశారు.

హైదరాబాద్ పై విజయమ్మ స్పందన

      ప్రజలకు సమన్యాయం చేయలేని కాంగ్రెస్ పార్టీ విభజన బాధ్యత ఎలా తీసుకుందో చెప్పాలని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. జగన్ కోసమే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ఆమె ఆరోపించారు. విభజనపై కాంగ్రెస్ నేతలు ఒక్కక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారని విజయమ్మ వ్యాఖ్యానించారు. విభజన విషయంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కేంద్రం ఓ తండ్రిలాగా వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని ఆమె అంటున్నారు.   హైదరాబాద్ను తెలంగాణలో కలపటం ఏ విధంగా సబబో కేంద్రం చెప్పాలని విజయమ్మ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్రులు వెళ్లిపోవాలని కేసీఆర్ ఎలా అంటారని విజయమ్మ ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల అభివృద్దికే రాజశేఖరరెడ్డి పాటు పడ్డారని ఆమె అన్నారు. అయితే హైదరాబాద్ కు సంబందించి ఏ ఒక్క రాజకీయ పార్టీ ఇంత బహిరంగంగా వ్యాఖ్యానించలేదు.

విలీనం కాకపోతే తెరాస ఖాళీ అయిపోతుందా

  తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలా వద్దా? చేస్తే లాభమా నష్టమా? అయితే ఎంత శాతం? అని కేసీఆర్ మదనపడుతుంటే, మరో వైపు దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే జ్ఞానం పొందిన తెరాస నేతలు కొందరు డిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం ముందు క్యూలు కడుతున్నారు.   మొన్నరాములమ్మ డిల్లీ వెళ్లి దిగ్గీరాజాకు రాఖీ కట్టి రావడంతో అగ్గి మీద గుగ్గిలమయిపోయిన కేసీఆర్, తన ముద్దుల చెల్లెమ్మని కూడా ఆలోచించకుండా వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసేసాడు. అయితే, ఆమె వెనుక మరో నలుగురైదుగురు కూడా క్యూలో నిలబడిన సంగతి తెలిసిన తరువాత ఇప్పుడు వారి నందరినీ కూడా సస్పెండ్ చెయాలా వద్దా? చేస్తే ఇక పార్టీలో తన కుటుంబ సభ్యులు తప్ప మరేవరయినా మిగులుతారా? అనే భయం కేసీఆర్ కి పుట్టుకొచ్చింది.   రాములమ్మ తరువాత తాజాగా డిగ్గీ రాజాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టేందుకు తెరాస నేతలు ఏ. చంద్రశేఖర్, విజయరామారావు, ఓ. చందులాల్‌లు, సోయం బాబు రావు, దిలీప్ తదితరులు డిల్లీలో ఎదురుచూస్తున్నారు.   కానీ, బేరం కుదిరితే ఇవాళ్ళోరేపో తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం ఖాయమని వార్తలు వస్తున్న తరుణంలోకూడా తెరాస నేతలు, అంత కంటే ముందుగానే తమ టైటానిక్ నావలోంచి కాంగ్రెస్ నావలోకి దూకేయాలను కోవడం వారి ముందు చూపుకి నిదర్శనం.   ఒకవేళ వారు తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే వరకు కూర్చుంటే, విలీనం తరువాత టికెట్ల కేటాయింపు వ్యవహారం మొత్తం కాంగ్రెస్ అధిష్టానం చేతిలోకే వెళ్ళిపోతుంది. అప్పుడు కేసీఆర్ ముందుగా తన ఇంట్లో వాళ్ళకి, ఆ తరువాత బాగా కావలసిన వారికే టికెట్స్ ఇప్పించుకొంటాడు గానీ, తెరాసలో ఉన్న అందరికీ ఇప్పించడు. ఒకవేళ అలా అడిగినా కాంగ్రెస్ తన పార్టీ నేతలని కాదని వారికి ఇవ్వదు. ఇవ్వదలుచుకొన్నా కాంగ్రెస్ లో ఉన్న నేతలు అడ్డుపడటం ఖాయం. అందుకే వారందరూ ముందుగానే వెళ్లి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ పట్టుకొని మన దిగ్గీరాజ ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు.   ఇక మరో కారణం ఏమిటంటే, ఒకవేళ బేరం కుదరక కేసీఆర్ తెరాసను నడుపుకోదలిస్తే, అప్పుడు వారు ఆయన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడక తప్పదు. ఎలాగో కష్టపడి టికెట్ సంపాదించుకొన్నా, తెలంగాణా ఇచ్చిన ఊపు మీద ఉన్న బలమయిన కాంగ్రెస్ నేతలతో వారు పోటీ పడిగెలవడం చాలా కష్టం. ఇక, ఒకవేళ కష్టపడి ఎలాగో కొందరు గెలిచినా, తెరాస భారీ మెజార్టీతో గెలిచి మొట్ట మొదటిసారిగా ఏర్పడబోతున్నతెలంగాణా ప్రభుత్వంలో అధికారం దక్కించుకోగలదని నమ్మకం లేదు.   కొత్త ప్రభుత్వంలో తప్పని సరిగా జేరాలని అందరికీ ఆరాటం ఉంటుంది. ఆ ఆరాటం ఉన్నవారి మధ్య తీవ్రమయిన పోటీ కూడా ఉంటుంది. అందుకే దీపం ఉండగానే తమ టికెట్స్ రిజర్వ్ చేసుకోవాలనే ప్రయత్నంలో తెరాస నేతలు డిల్లీలో దిగ్గీ రాజ ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.   ఇదంతా చూస్తున్న పార్టీలో మిగిలిన నేతలు విలీనం సంగతి త్వరగా తేల్చకపోతే, మా పరిస్థితి టైటానిక్ షిప్పులో పయనిస్తున్నట్లే ఉంది అంటూ ఆందోళనగా గంట కొడుతున్నారు. మరి కెప్టెన్ కేసీఆర్ వారిని కాంగ్రెస్ నావలోకి ఎక్కనిస్తాడో లేక మధ్యలోనే ముంచేస్తాడో చూడాలి.

టిఆర్‌ఎస్‌ పార్టీకి ఝలక్‌

  తెలంగాణ పై కాంగ్రెస్‌ సానుకూలంగా అడుగులు వేస్తుండటంతో టిఆర్‌ఎస్‌ వర్గాలు గుబులు రోజు రోజుకు ఎక్కువవుతుంది. సీమాంద్రలో నిరసన జ్వాలలు భగ్గుమతున్నా కాంగ్రెస్‌ హైకమాండ్‌ మాత్రం విభజన దిశగా ప్రక్రియ కూడా మొదలు పెట్టేసింది. కాంగ్రెస్‌ ఎత్తులతో ఇప్పుడు చాలా మంది టిఆర్‌ ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ తలుపు తడుతున్నారు. ఎలాగూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్‌ ఎస్‌ కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది కాబట్టి తాము అంతకన్నా ముందే ఆ పార్టీలో చేరడం మేలని భావిస్తున్నారు. ఇప్పటికే టిఆర్‌ఎస్‌ ఎంపి విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీకి అనూకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణతో పార్టీ నుంచి సస్పెండ్‌ అవ్వగా, మరో ముగ్గురు నాయకులు సోమవారం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌తో చర్చలు జరిపారు. గతంలో టిఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న విజయరామారావుతో పాటు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్‌, సోయం బాబు రావులు దిగ్విజయ్‌ సింగ్‌తో మంతనాలు జరిపారు. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే టిఆర్‌ఎస్‌ పార్టీ కాలీ అవ్వడం కాయం అంటున్నాయి రాజకీయ వర్గాలు.

హీరో పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ

  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసంచలనానికి తెర తీశాడు. ఎప్పుడు ట్వీటర్ ద్వారా తన ఆలోచనలను అభిమానలతో పంచుకునే వర్మ ఇప్పుడు ఓ స్టార్ హీరోపై తన కామెంట్ చేశాడు. ఎప్పుడు నెగెటివ్ కామెంట్స్ మాత్రమే చేసే వర్మ ఈసారి మాత్రం ఈ ఆ హీరోని ఆకాశానికి ఎత్తేశాడు. ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్థుతం టాలీవుడ్ లొ  పవర్ స్టార్ మేనియా నడుస్తుంది. పవన్ తో సినిమా అంటే రిలీజ్ కు ముందే మ్యాగ్జిమమ్ బిజినెస్ జరిగిపోతుంది. పవన్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే చాలు గంటల్లోనే మ్యాగ్జిమమ్ హిట్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ క్రేజ్ గమనించిన రామ్ గోపాల్ వర్మ ఓ ఇంట్రస్టింగ్ కామెంట్ చేశాడు. పవన్ కళ్యాన్ పొలిటికల్ పార్టీ పెడితే చాలా బాగుంటుందన్నాడు. స్వతహాగా అభ్యుదయ భావాలున్న పవన్ స్క్రీన్ హీరోగానే కాదు, రియల్ హీరోగా కూడా మంచి మార్కులు సాధింస్తాడన్నారు. అంతేకాదు గతంలో ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎంజిఆర్, చిరంజీవిల కంటే పవన్ డైనమిక్ లీడర్ అవుతాడని కితాబిచ్చాడు.

అహ్మదుల్లా కాన్వాయ్‌పై చెప్పుల‌తో దాడి

  ఉదృతంగా జ‌రుగుతున్న స‌మైక్య ఉద్యమంతో సీమాంద్ర నాయ‌కులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రజాభీష్టం మేర‌కు ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధుల రాజీనామ చేశారు. అయితే ఇప్పుడు రాజీనామ చేయ‌ని నాయ‌కుల‌పై ఆప్రాంతంలో తీవ్ర వ్యతిరేఖ‌త వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా మంత్రుల‌కు ఈ ఇబ్బంది ఎక్కువ‌గా ఉంది. అందుకే చాలా మంది సీమాంద్ర మంత్రులు హైద‌రాబాద్ కే ప‌రిమితం అవుతున్నారు. సోమవారం త‌న నియోజిక‌వ‌ర్గానికి వ‌చ్చిన మంత్రి అహ్మదుల్లాకు ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. క‌డ‌ప జిల్లాకు వ్యక్తిగ‌తప‌ని మీద వ‌చ్చిన అహ్మదుల్లా కాన్వాయ్ పై స‌మైక్య వాదులు చెప్పుల‌తో దాడిచేశారు. వెంట‌నే రాజీనామ చేయాల‌ని నినాధాలు చేశారు. ఓ ఆందోళ‌న కారుడు విసిరిన చెప్పుడు మంత్రి త‌గ‌ల‌టంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంట‌నే తేరుకున్న అహ్మదుల్లా ఆందోళ‌న కారుల‌ను స‌ముదాయించారు. తాను కూడా రాజీనామ చేయ‌డానికి సిద్దంగా ఉన్నాని ప్రక‌టించి ఆందోళ‌న‌కారుల‌ను శాంతింప చేసే ప్రయ‌త్నం చేశారు.

విభ‌జ‌న ప్రక్రియ మొద‌లైంది

  రాష్ట్రంలో స‌మైక్య సెగ‌లు ఏ స్థాయిలో ఉన్నా కేంద్ర మాత్రం త‌న పని తాను చేసుకు పోతుంది. ఇప్ప‌టికే రాష్ట్ర‌విభ‌జ‌న ప్రక్రియ మొద‌లైన‌ట్టుగా ప్రక‌టించారు కేంద్రమంత్రి చిదంబ‌రం. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందుగా అనేక అంశాల‌ను చ‌ర్చించాల్సి ఉంటుంద‌ని చెప్పిన చిదంబ‌రం ఆ దిశ‌గా ప్రయ‌త్నాలు మొద‌లు పెట్టామ‌న్నారు.ఈ మేర‌కు ఆయ‌న సోమ‌వారం రాజ్యస‌భ‌లో ఒక ప్రక‌ట‌న చేశారు. తెలంగాణ అంశానికి సంభందించిన త్వ‌ర‌లోనే కేంద్ర హోం శాఖ ఓ విధాన ప‌త్రాన్ని కేభినేట్ ముందు ఉంచుతుంద‌రి చెప్పారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంభందించి రాజ్యంగంలో కొన్ని విధి విదానాలు ఉన్నాయ‌న్న చిదంబ‌రం ఆ అంశాల‌తో కూడిన నోట్ సిద్దం చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ నోట్‌లో విద్యుత్. న‌దీ జ‌లాల పంపిణీ, ప్రజ‌ల భ‌ద్రత లాంటి అంశాల‌ను కూడా ప్రస్థావించ‌నున్నట్టు తెలిపారు. ముందుగా తాము త‌యారు చేసిన బిల్లు కేభినేట్ ఆమోదానికి వెలుతుంద‌ని. ఆత‌రువాత ఏర్పాడే మంత్రి వ‌ర్గ ఉప‌సంఘంతో అన్ని ప్రాంతాల వారు త‌మ అభిప్రాయాల‌ను చెప్పుకోవ‌చ్చన్నారు. దీంతో పాటు ఈ నోట్ పై కేంద్ర ఉభ‌య స‌భ‌ల్లో చ‌ర్చ‌కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు.

నిర్భయ అత్యాచార కేసులో బాలనేరస్తుడికి శిక్ష ఖరారు

  గతేడాది డిశంబరు నెలలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసుని మూడు నెలల్లో తేలిపోతుందని అందరూ హామీలు గుప్పించినప్పటికీ, ఇంతవరకు ఆ కేసులు తేలలేదు, దేశంలో అత్యాచారాలు ఆగలేదు. అదృష్టవశాత్తు ప్రజలకి, ప్రజా ప్రతినిధులకి కూడా షార్ట్ మెమొరీ ప్రాబ్లెం ఉండటం చేత అటువంటి నేరస్తులు కూడా తమకు ఉజ్వల భవిష్యత్ ఉందని దృడంగా నమ్ముతూ జైల్లో పరీక్షలకి కూడా ప్రిపేర్ అవగలుగుతున్నారు.   వయసులో అందరికంటే చిన్నవాడయినప్పటికీ మానవ జాతే అసహ్యించుకొనే విధంగా ఘోరంగా అత్యాచారం చేసి, నిర్భయ మరణానికి కారకుడయిన బాలనేరస్తుడికి కూడా మన చట్టాలలో ఉన్న లొసుగులు బాగానే ఉపయోగపడుతున్నాయి. నేరం చేసిన సమయానికి అతని వయసు 17సం.ల ఆరు నెలలు కనుక, అతను కటినమయిన శిక్షను తప్పించుకోగలుగుతున్నాడు. అసలు తను నేరమే చేయలేదని, ఆ రోజు తను బాగా తాగి పార్కులో పడుకొని ఉంటే తన తండ్రి తనను ఇంటికి మోసుకు వెళ్ళాడని వాదించాడు.   అయితే, ఈ రోజు బాలనేరస్థుల కోర్టు అతను నేరస్తుడని నిర్దారించింది. ఈ నెల 19న కోర్టు తన తీర్పు వెలువరించనుంది. కానీ, అతనికి అత్యధికంగా కేవలం మూడున్నర సం.లు జైలు శిక్ష మాత్రమే విధించే అవకాశం ఉంటుంది. అందులో ఇప్పటికే అతను ఒక సం.జైలులో గడిపేడు గనుక ఇక కేవలం రెండున్నర సం.లు శిక్ష అనుభవిస్తే సరిపోతుంది.   అంత ఘోరమయిన నేరం చేసిన్నపటికీ, ఇంత కాలం పాటు విచారణ కొనసాగడం, అంత తేలికపాటి శిక్షలతో తప్పించుకొనే అవకాశం కలిగి ఉండటం ఇటువంటి నేరాలు చేసే వారికి చట్టం అంటే భయం లేకుండా చేస్తోంది.

తెలంగాణా-సమైక్య రేసు షురూ

  ఒకవైపు ఆంధ్రాలో సమైక్య సెంటిమెంట్ ని స్వంతం చేసుకోవడం కోసం మూడు ప్రధాన రాజకీయ పార్టీలు వీధులకెక్కి పోరాటాలు చేస్తుంటే, మరోపక్క తెలంగాణాలో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. తెలంగాణా సాధించిన ఘనత ఎవరి ఖాతాలో వారు వ్రాసుకోవడానికి తెగ కష్టపడుతున్నారు.   కాంగ్రెస్ పార్టీ తెలంగాణాపై నిర్ణయం తీసుకొనే కీలక సమయంలో తనను పక్కన బెట్టి హర్ట్ చేసినప్పటికీ, మరీ హార్ట్ అయ్యి తన గుహలో (ఫాం హౌస్)లోనే కూర్చొండిపోతే, పెగ్గేసుకొని పడుకొన్నాడని ప్రజలు అపార్ధం చేసుకొంటారనో లేకుంటే మిగిలిన క్రెడిట్ కూడా కాంగ్రెస్ తన్నుకుపోతుందని భయపడో మొత్తం మీద కేసీఆర్ తన గుహలోంచి బయటకి వచ్చాడు. వచ్చి తానే తెలంగాణా సాధించినట్లు, అందువల్ల ప్రజలందరూ తనకే తెలంగాణా పునర్నిర్మాణ బాధ్యతలు కూడా అప్పగించేసినట్లు డిసైడ్ అయిపోయి, తను ఏఏ ఫైళ్ళ పాస్ చేయబోతున్నాడో, ఎవరికీ ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వదలచుకోన్నాడో, ఏఏ ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నాడో వగైరా వగైరా వివరాలను ముందుగానే ప్రకటించేస్తూ చాలా హడావుడిగా తిరుగుతున్నాడు.   అయితే, ఇన్నాళ్ళుగా ఆయన పక్కన కూర్చొని హోమాలు చేసి, ఆయన చేతికి బోలెడు రాఖీలు కూడా కట్టి తిరిగిన చెల్లెమ్మ రాములమ్మ మాత్రం “తెలంగాణా సాధన క్రెడిట్ మొత్తం కేసీఆర్ ఖాతాలో వ్రాసేసుకొంటే కుదరదు. నాతో సహా వెయ్యి మంది అమర వీరులకి కూడా ఆ క్రెడిట్ లో వాటా ఉంటుందని” రాములమ్మ మరిచిపోకుండా తన వాటా కూడా క్లైయిం చేసుకొంది. పనిలో పనిగా తను చేర బోతున్న కాంగ్రెస్ పార్టీని ప్రసన్నం చేసుకొనేందుకు “మా (మాజీ) అన్నగారు గురించి, ఆయన పార్టీ గురించి నేను చెప్పిన పాత రికార్డ్స్ సంగతి మర్చిపోండి. అప్పుడేదో అతను బాధపడతాడని అలా చెప్పాను కానీ నిజానికి అతనికి వంద సీట్లు కాదు కదా పది కూడా రావు. మహా అయితే మరో ఐదారు సీట్లు గెలుచుకొంటే అదే గొప్ప” అని తేల్చిపారేసింది. అంతే కాకుండా, “తెలంగాణాలో ప్రజలందరూ కూడా తెలంగాణ క్రెడిట్ ను కాంగ్రెస్ ఖాతాలోనే ఓట్ల రూపంలో జమా చేసేయడానికి ఎన్నికల కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఎంత వద్దనుకొన్నాకనీసం 80 అసెంబ్లీ సీట్లు కట్టబెట్టడం ఖాయమని” ఆమె కన్ఫర్మ్ చేసేసారు. మెదక్ సీటు ఆ అపూర్వమయిన అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్నిపుటుక్కున త్రెంచేయడం వల్లనే ఆమె ఈవిధంగా మాట్లాడారని ప్రజాభిప్రాయం.   మరి సమైక్యాంధ్ర క్రెడిట్ ఎవరికీ దక్కదని తెలిసినప్పటికీ, “గెలిచామా ఒడామా? అని కాదు ఆటలో పాల్గోన్నామా లేదా?” అనే స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి కదా. అందుకే అందరూ రాజీనామాల పోటీలు నిర్వహించుకొంటున్నారు. కానీ వైకాపా మాత్రం ఈ రేసులో ఇంతమంది వచ్చి జాయిన్ అవుతారని ఊహించక పోవడంతో కంగు తిని అందరూ ఫౌల్ గేం అడేస్తున్నారని బాధపడుతోంది.   అయితే తెదేపా మాత్రం “ఎప్పుడు వచ్చేమన్నది కాదు ముఖ్యం! రిజైన్ చేసామా లేదా అనేదే ముఖ్యం!” అని వాదిస్తోంది. కనీసం ఇప్పటికయినా రాష్ట్రపతి గారు దయతలచి రెండు రాష్ట్రాలు తానే ఇస్తున్నట్లు ఒక సంతకం పెట్టి ఇస్తే తప్ప ఇప్పటిలో ఈ రేసు ఆగేలా లేదు. మళ్ళీ ఆ తరువాత ముఖ్యమంత్రి రేసోకటి ఉంది కదా! వెర్రి నాగాన్నలు అలిసిపోతే మళ్ళీ పరిగెత్తలేరు పాపం!

వేటు మంచి కోసమే

      ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందంటే అది టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఒక్కరిది కాదని, అమరవీరులతో పాటు తామందరిదని మెదక్ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. తనపై వేటు వేసిన కేసీఆర్ ఇంతవరకు షోకాజ్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదో అర్ధం కాలేదని, నోటీసులు అందిన తర్వాత స్పందిస్తానని ఆమె తెలిపారు.   నాపై వేటు నా మంచి కోసమేనని రాములమ్మ అన్నారు. ఎందుకు వేటు వేశారో ప్రస్తుతం చెప్పలేనని, నాతో పాటు ఇంకెందరిపై వేటు పడిందో ఇప్పుడే చెప్పలేనని, నోటీసు వచ్చిన తర్వాత స్పందిస్తానని అన్నారు. వేటుపై కేసీఆర్‌పై విమర్శలు చేసి సంస్కారాన్ని కోల్పోనని విజయశాంతి పేర్కొన్నారు. 16 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నాను. నేనేంటో రాష్ట్రంలోనేకాక, దేశంలో అందరికీ తెలుసునని, షోకాజ్ నోటీసు వచ్చిన తర్వాతే తన అభిమానులతో చర్చించి భవిష్యత్ కార్యాచారణపై నిర్ణయం తీసుకుంటామని విజయశాంతి స్పష్టం చేశారు.

జగన్ కి జలగం జలక్

      ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అనుచరులు మూసివేశారు. ఇటీవలి కాలంలో జలగం వెంకట్రావ్‌కు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు జలగం కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం పెద్దగా కనిపించలేదు. దీంతో జలగం అనుచరులు పార్టీతో తెగదెంపులు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపటంతో వెంకట్రావ్ కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జోరందుకొంది. దీంతో జలగం వర్గం కార్యకర్తలు పార్టీ కార్యాలయాన్ని మూసివేశారని అంటన్నారు. పార్టీ కార్యాలయం ముందున్న ఫ్లెక్సీలను తొలగించారు.

పొలిటికల్ జోక్ by Mallik

      ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది...వందలాది కార్లు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాయ్. అందులో వినయ్ కారు ఒకటి. వాచ్ వంక విసుగ్గా చూసుకుంటున్న వినయ్ కారు విండో అద్దం మీద ఒక వ్యక్తి కంగారుగా దబదబా బాదుతున్నాడు. వినయ్ విండో డోర్ కిందకి దించాడు. '' ఏంటి? అడిగాడు వినయ్. ''సార్..టెర్రరిస్టులు ఇప్పుడే సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, దిగ్విజయ్ సింగ్, చిదంబరం, షిండే, సుష్మాస్వరాజ్....వీళ్ళ౦దర్ని కిడ్నాప్ చేశారు సార్... వాళ్ళందర్ని విడిచిపెట్టడానికి వాళ్ళు 1000 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు అడిగిన మొత్తం ఇవ్వకపోతే అందరి మీద పెట్రోల్ పోసి తగల బెడ్తామని అంటున్నారు సార్..అందుకే మేము ఇక్కడున్న అందర్ని విరాళాలు ఇవ్వమని అడుగుతున్నాం...'' అన్నాడు ఆ వ్యక్తి. '' అంటే మేము ఇప్పుడు ఎంతెంత విరాళం ఇవ్వాలని నీ ఉద్దేశం? " అడిగాడు వినయ్. ''ఎంతో కాదు సార్..మీరంతా చెరో లీటర్  పెట్రోలు ఇస్తే చాలు'' 

రాష్ట్ర విభజన ఒక్క రోజు నిర్ణయం కాదు

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం ఒక్క రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదు. మూడేళ్లుగా జరిగిన సంప్రదింపులు, చర్చల అనంతరం ఈ సాహసోపేతమయిన నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం తీసుకుందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ గుర్తించిందని రాష్ట్ర మంత్రి జానారెడ్డి అన్నారు. గత 60 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం అనేక రకాలుగా జరుగుతూ వస్తుందని, ఎందరో అమరులు బలిదానాలు చేశారని, 1969లో తుపాకి కాల్పుల్లో చనిపోతే, మలిదశ ఉద్యమంలో తమను తాము కాల్చుకున్నారని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలు, నేతలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆవేశాలతో నిర్ణయాలు తీసుకుంటే, ఆవేశాలతో విధ్వంసం కొనసాగితే తీర్చలేని సమస్యలెదురవుతాయని ఆయన హెచ్చరించారు. సీమాంధ్రులు ఆందోళనలు విరమించి తమ సమస్యలను కేంద్రానికి నివేదించాలని ఆయన కోరారు. సంయమనం పాటించి రెండు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో తీసుకుపోదామని పిలుపునిచ్చారు. భారతదేశం గర్వపడేలా ప్రగతి సాదిద్దామని కోరారు. తెలుగుజాతి ఐక్యతను దెబ్బతీయవద్దని, అన్నదమ్ముల్లా విడిపోయి కలిసి బతుకుదామని అన్నారు.

రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పొరపాటు: దేవినేని నెహ్రూ

      రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పొరపాటు ఉందని ఒప్పుకుంటామని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ అన్నారు. అయితే ప్రాంతీయవాదం ఎగిసినప్పుడు కొందరు నేతలు పాదయాత్రలకు వెళ్లి ఒక్కో రకంగా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వంటి నేతలు రాజకీయం కోసం తెలంగాణను ఎత్తుకున్నారన్నారు. 2009 డిసెంబరు తొమ్మిదిన తెలంగాణ ప్రకటన వస్తే కాంగ్రెస్ ఎమ్.పిలు,ఎమ్మెల్యేలు అంతా ఆందోళన చేస్తే కేంద్రం దిగివచ్చి నిర్ణయం మార్చుకుందని ఆయన చెప్పారు. ఐదు లక్షల కో్ట్లు ఇచ్చి రాష్ట్రాన్ని ముక్కలు చేయండని ఒక నాయకుడు చెబుతున్నారని, మరో నాయకుడు విజయవాడ రాజధాని కావాలలని అంటారని, ఇప్పటికైనా టిడిపి వైఖరి ఏమిటో చెప్పండని ఆయన ప్రశ్నించారు. ప్రజల మనోభావాలను రాజకీయ పార్టీలు గౌరవించాలని మాజీ మంత్రి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. గతంలో ఏం చెప్పినా ఇప్పుడు పార్టీలు సమైక్యాంధ్రకు మద్దతుగా ఆలోచన మార్చుకోవాలన్నారు. విభజన నిర్ణయంతో ప్రతి తెలుగువాడి గుండె అగ్నిగుండంలా మారిందన్నారు. రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

సమైక్య సెంటిమెంట్ కోసం నేతల పోటా పోటీలు

  ఒకప్పుడు తెలంగాణా రాష్ట్ర సాధనలో తామే ముందుండాలని రాజకీయనేతలందరూ పోటీలు పడేవారు. అయితే, కాంగ్రెస్ తెలంగాణా ప్రకటన చేసేయడంతో వారందరూ రాజకీయ నిరుద్యోగులుగా మారిపోగా, ఇప్పుడు ఆ అవకాశం సీమంధ్ర నేతలకి, జేఏసీలకి దక్కింది.   ఇక సమైక్యాంధ్ర సెంటిమెంటును అందిపుచ్చుకొనేందుకు మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన త్యాగాలకు మారుపేరయిన వైకాపా అందరి కంటే ముందుగా త్యాగాలు చేసేసి రోడ్డేక్కగానే, ఆ త్యాగాల రేసులో తామెక్కడ వెనుకబడిపోతామోననే భయంతో కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున ఎందుకు మేస్తుందన్నట్లు, తల్లి పిల్లా కాంగ్రెస్ లను చూసి తెదేపా నేతలు కూడా చేలోకి దిగిపోయారు.   వారందరూ ఒకరిని చూసి మరొకరు భయపడుతూ, ‘సమైక్యాంధ్ర మహా రక్షక’ బిరుదు కోసం ఒకరితో మరొకరు పోటీలు పడుతుంటే, వారికి దీటుగా ఉద్యమాలు చేస్తున్న ప్రజలు మాత్రం వారెవరినీ నమ్మకపోవడం విచిత్రం. కానీ రాజకీయ నేతలు మాత్రం తాము ప్రజాభీష్టం మేరకే రాజీనామాలు చేసి ఉద్యమంలో దిగామని చెపుకోవడం విశేషం. ఈ కారణంగానే వారు కూడా పార్టీల వారిగా జనాలని పోగేసుకొని ఎదుట పార్టీనే లక్ష్యంగా చేసుకొని ఉద్యమాలు చేస్తున్నారు.   ప్రజల అద్వర్యంలో నడుస్తున్న ఉద్యమాలు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తుంటే, సదరు పార్టీల నేతృత్వంలో సాగుతున్న ఉద్యమాలు మాత్రం ఎదుట పార్టీ వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని, ఎదుట పార్టీలో వారు ఎప్పుడెప్పుడు ఏవిధంగా రాష్ట్ర విభజనకోసం ప్రయత్నాలు చేసింది వివరిస్తూ, వారు ఆంధ్ర ద్రోహులని కేవలం తాము మాత్రమే ‘మహా సమైక్య రక్షక’ బిరుదుకు అన్ని విధాల అర్హులమని నిరూపించుకొనే పనిలో పడ్డారు.   అయితే, వారిలో ఏ ఒక్కరూ కూడా తెలంగాణా ఏర్పాటుని దైర్యంగా వ్యతిరేఖించకుండా, అవ్వ కాదు బామ్మ అన్నట్లు తెలంగాణా పేరెత్తకుండా జాగ్రత్త పడుతూనే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ చేసిన ప్రకటనను వ్యతిరేఖిస్తున్నారు.   ఇప్పుడు వారు లేవనెత్తుతున్న అనుమానాలను, భయాలను, సమస్యలను ఆనాడు అఖిలపక్ష సమావేశంలో కూడా అడిగి ఉండవచ్చును. ఒకవేళ అందుకు అనుమతి లేదనుకొంటే అప్పుడు హోంమంత్రికి ఇచ్చిన లేఖలో లికిత పూర్వకంగా తమ అభ్యంతరాలను తెలియజేసి వాటిని నివృత్తి చేసిన తరువాతనే తాము రాష్ట్ర విభజనపై తమ అభిప్రాయం చెపుతామనో లేక అంగీకరిస్తామనో చెప్పి ఉండవచ్చును.   కానీ, అప్పుడు అందరూ ముందుగా తమ నిర్ణయం చెప్పేస్తే రాజకీయంగా తామెక్కడ నష్ట పోతామనో, లేక ఎదుట పార్టీ తమపై రాజకీయంగా ఎక్కడ పైచేయి సాధిస్తుందనో భయంతో ఆ బాధ్యతను కాంగ్రెస్ పైకి నెట్టి చేతులు దులుపుకొని చక్కావచ్చారు. తీరా చేసి ఇప్పుడు కాంగ్రెస్ తన నిర్ణయం ప్రకటించిన తరువాత గత 5 దశాబ్దాలలో జరిగిన సంఘటనలను, నివేదికలను, లేఖలను ప్రస్తావిస్తూ వితండ వాదనలు చేస్తూ ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.   దీనిని ప్రజలు గమనించలేరనే భ్రమలో నేతలు రాజకీయ చదరంగం ఆడుతున్నారు. అయితే, ప్రతీ ఐదేళ్ళకోసారి జరిగే పరీక్షలలో ప్రజలు ఎప్పుడు నెగ్గుతూనే ఉండగా రాజకీయ పార్టీలే ఓడిపోతున్న సంగతిని గుర్తుంచుకొంటే, వారు ఈవిధంగా ప్రజలని మభ్య పెట్టే ప్రయత్నాలు చేయరేమో.

పార్లమెంట్ ను తాకిన సమైఖ్య సెగ, సభలువాయిదా

      లోక్‌సభలో విభజన మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం లోక్‌సభ ప్రారంభంకాగానే సీమాంధ్ర టీడీపీ ఎంపీలు విభజనపై వాయిదా తీర్మానం ఇచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ఎంపీలు నినాదాలు చేశారు. తమ ప్రాంత ప్రయోజనాలు పరిరక్షించాలని టీడీపీ ఎంపీలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. టీడీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఎంపీలకు పోటీగా తెలంగాణ ఎంపీలు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ సభను వాయిదా వేశారు.   రాజ్యసభ సోమవారం ప్రారంభమైన వెంటనే విభజన నినాదాలతో మధ్యాహ్నానికి వాయిదా పడింది. రాజ్యసభలో విభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదులు నినాదాలు చేశారు. దీంతో సభలో గందగోళం నెలకొనడంతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.