రాజీనామాలు వెనక్కి తీసుకొండి ; అశోక్‌బాబు

  ఇన్నాళ్లు ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలని పట్టుపట్టిన అశోక్‌బాబు ఇప్పుడు మాట మార్చారు. ఎమ్మెల్యేలు రాజీనామలు చేయాల్సిన అవసరం లేదన్న ఆయన ఇప్పటికే రాజీనామ చేసిన వారిని కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరారు. అంతేకాదు ఈ విషయంపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు లేఖ రాయనున్నట్టుగా ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదన్న అశోక్‌ బాబు ఎంపిలను మాత్రం రాజీనామ చేయమంటున్నారు. అసెంబ్లీలో రాష్ట్రవిభజన తీర్మానాన్ని వ్యతిరేకించటానికి ఇక్కడ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండలాని, అలాగే కేంద్రంలో బిల్లు వీగిపోవాలంటే అక్క బలం ఉండకూడదని అందుకే రాష్ట్ర నాయకులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అశోక్‌బాబు వివరించారు. ఇప్పటికే దాదాపు 60 రోజులుగా ఉద్యమం ఉదృతంగా జరగుతున్న కేంద్రంలో చలనం లేదని కాబట్టి నాయకులు పార్టీల మీద వత్తిడి తీసుకొచ్చి సమైక్యా రాష్ట్రం కోనసాగేలా నాయకులు కృషి చేయాలని కోరారు.

డిజిపిగా కొన‌సాగ‌నివ్వండి ప్లీజ్‌

  ఈ నెల 30తో డిజిపి దినేష్ రెడ్డి ప‌ద‌వి కాలం ముగుస్తుండ‌టంతో, త‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగించాలంటూ డీజిపి క్యాట్‌ను ఆశ్రయించారు. అయితే దీనిపై గురువారం విచారించిన క్యాట్ డీజిపి అభ్యర్ధన‌ను తిర‌స్కరించింది. దినేష్ రెడ్డిని ఇక కొన‌సాగించ‌బోమ‌ని ప్రభుత్వం క్యాట్‌కు నివేదిక ఇవ్వటంతో క్యాట్ డిజిపి కొన‌సాగింపును తొసి పుచ్చింది. త‌న రిటైర్‌మెంట్ వ‌య‌సు కాకుండా బాధ్యత‌లు స్వీక‌రించిన ద‌గ్గర నుంచి 2 సంవ‌త్సరాల పాటు త‌న‌ను ప‌దవిలో కొన‌సాగ‌నివ్వాల‌ని డిజిపి క్యాట్‌కు తెలిపారు. సుప్రీం తీర్పు ఆధారంగానే తన నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.  కాగా దినేష్ రెడ్డి పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది.

30న గవర్నర్ తో జగన్ భేటి

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత మొదటిసారిగా గవర్నర్ నరసింహన్ కలవబోతున్నారు. సమైక్యాంధ్ర తీర్మానం అసేంబ్లీలో చేయాలని, తెలంగాణ తీర్మానాన్ని ఓడించాలని కోరుతూ గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. గవర్నర్ సెప్టెంబర్ 30 తేదిన సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్ మెంట్ కేటాయించారు.   ప్రత్యేకంగా అసేంబ్లీని సమావేశ పరిచి సమైక్య తీర్మానం చేయాలని జగన్ కోరనున్నారని పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలిపారు. అసేంబ్లీ తీర్మానం తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను ఆమోదించుకోనున్నారు.    ఇక వచ్చే నెల 1,2 తేదీలలో కడప జిల్లాలోని ఇడుపుల పాయకు వెళ్లేందుకు, నాలుగో తేదీన గుంటూరుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో ఈ రోజు పిటీషన్ దాఖలు చేశారు.    

జగన్ వైపు విశ్వరూప్..!

      రాష్ట్ర మంత్రి విశ్వరూప్ రాజీనామాతో కాంగ్రెస్‌లో కలకలం చెలరేగింది. గత కొంత కాలంగా విశ్వరూప్  వైఎస్ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారు.  ఈ రోజు గవర్నర్ నరసింహన్‌కు తన రాజీనామా లేఖను సమర్పించిన విశ్వరూప్ త్వరలో వైకాపాలో చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రేపో, ఎల్లుండో జగన్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.     గవర్నర్ నరసింహన్‌కు రాజీనామా లేఖ సమర్పించిన తరువాత మీడియా తో మాట్లాడుతూ...ఏపీ ఎన్జీవోల సమ్మెకు మద్దతుగా తాను రాజీనామా చేశానని అన్నారు. ఇంతవరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగమని చెప్పినందువల్లే రాజీనామా చేయకుండా ఆగానని చెప్పారు. 60 రోజులుగా సీమాంధ్ర ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. తన రాజీనామా గవర్నర్ ఆమోదించారనే భావిస్తున్నట్లు చెప్పారు.  

కాంగ్రెస్ రాష్ట్ర విభజన సమస్యను కొత్త ప్రభుత్వం పైకి నెట్టేస్తుందా

  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసి ఇప్పటికి దాదాపు రెండు నెలలు పూర్తి కావస్తున్నా, సమైక్యాంధ్ర ఉద్యమాలు, సీమాంధ్ర నేతల ఒత్తిళ్ళ కారణంగా ఇంతవరకు విభజన ప్రక్రియను మొదలుపెట్టలేకపోతోంది. కానీ, తన నిర్ణయంపై ఎట్టి పరిస్థితుల్లో వెనకడువేసే ప్రసక్తే లేదని మాత్రం చాలా గట్టిగా పదేపదే చెపుతోంది. అంటే జాప్యం చేస్తూ సీమాంద్రులని, విభజన ఆపేది లేదని తెలంగాణా ప్రజలని ఇరువురినీ మభ్యపెడుతూ రోజులు నెట్టుకొస్తోందన్నమాట. ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేస్తానని చెపుతున్నపటికీ అది చేసే వరకు ఎవరికీ నమ్మకం లేదు.   నరేంద్ర మోడీ ప్రధాని పదవి చెప్పట్టేందుకు ఉన్నఅన్నిఅడ్డంకులను ఒకటొకటిగా తొలగించుకొని వస్తూ ఎలాగయినా ఈ సారి పార్టీని ఎన్నికలలో గెలిపించుకొని ప్రధాని పదవి చెప్పట్టాలని ఉత్సాహం చూపిస్తుంటే, ప్రధాని పదవి చెప్పటేందుకు యావత్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఎర్రతివాచీ పరిచి మరీ స్వాగతం చెపుతున్నా ఆయన ఆ పదవి చెప్పట్టేందుకు ఆసక్తి చూపక పోగా “ప్రజల కలలను నెరవేర్చేందుకు తన కలలను చంపుకొంటానని” పలికి కాంగ్రెస్ పార్టీని తీవ్ర నిరాశపరిచారు.   ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక అత్యంత సాహసోపేత నిర్ణయం-‘తెలంగాణా ఏర్పాటు’ ప్రకటన చేసింది. కానీ తీరా చేసి దానిని ఇప్పుడు అమలు చేయడానికి మీన మేషాలు లెక్కపెడుతోంది. ఒకవేళ ఏర్పాటు చేసినా వచ్చే సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండు రాష్ట్రాలలో, కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం కూడా లేదు. గనుక, ఈ సమస్యను వీలయినంత వరకు సాగదీసే అవకాశాలే ఎక్కువున్నాయి.   ఒకవేళ రానున్న ఎన్నికలలో గెలిస్తే ఈ సమస్యను పరిష్కరించడం, ఓడిపోయే సూచనలు కనిపిస్తే ఈ సమస్య మరింత ముదిరి పాకాన పడే విధంగా ఆఖరి నిమిషంలో మరికొన్నివివాదస్పదమయిన నిర్ణయాలు ప్రకటించవచ్చును. తద్వారా రాబోయే ప్రభుత్వానికి కూడా రాష్ట్ర విభజన సమస్య ఒక గుదిబండలా తయారు చేసి చేతులు దులుపుకొని బయటపడవచ్చును. అప్పుడు కొత్త ప్రభుత్వం ఈ సమస్యతో కుస్తీలు పడుతుంటే కాంగ్రెస్ పార్టీ వినోదిస్తూ, కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని ఉంటే ఈ సమస్యను అవలీలగా తెల్చిపారేసేవారమని ఉత్తర కుమార ప్రగల్భాలు పలకవచ్చును.

సమైక్యాంధ్రపై తీర్మానం పెట్టాలి: శోభా నాగిరెడ్డి

      అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం నెగ్గేందుకే వైఎస్సార్ సీపీ రాజీనామాల ఆమోదం కోసం పట్టుబడుతోందన్న విమర్శలు తీవ్రమవడంతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశం నిర్వహించి రాజీనామాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మూడు డిమాండ్లు చేశారు. విభజన నిర్ణయం నేపథ్యంలో అసెంబ్లీని వెంటనే సమావేశ పర్చాలి, సమైక్యాంధ్రపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి, పాస్ చేయించిన తీర్మానాన్ని ఢిల్లీకి పంపించి ఆ తర్వాత రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేశారు. తాము దీనిపై గురువారం సాయంత్రం స్పీకర్‌ను కలుస్తామని, అపాయింట్మెంట్ దొరికితే గవర్నర్‌ను కూడా కలుస్తామని చెప్పారు. సమైక్యాంధ్ర పైన తమ పార్టీని ప్రశ్నించే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదని శోభా నాగి రెడ్డి అన్నారు. సమైక్యాంధ్ర కోసం తాము అందరికంటే ముందుగానే రాజీనామాలు చేశామని, అలాంటప్పుడు తమను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదన్నారు.

ధర్మ విజేత అంటే ....... ?

        ....సాయి  లక్ష్మీ మద్దాల     అక్రమ ఆస్తుల కేసు విషయమై ఎట్టకేలకు 16 నెలల అనంతరం సి.బి.ఐ కోర్ట్ మంజూరు చేసిన షరతులతో కూడిన బెయిల్ పై జగన్ జైలునుండి బయటకు వచ్చాడు. ప్రస్తుత చట్టాల ఆధారంగా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. సాక్ష్యాలను విచారించి జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిర్దోషా కాదా అనేది న్యాయస్థానం నిర్ణయించ వలసి ఉంది. కేవలం బెయిల్ లభించి నంత మాత్రాన ఈ పరిస్థితులలో జగన్ ధర్మవిజేత అనటం ఎంతవరకు సమంజసం? ఇక జగన్ బయటకు వస్తే రాజకీయాలలో చాలా మార్పులు వస్తాయి అనటం కూడా సరికాదు. ఒకసారి పార్లమెంట్ లో సమైఖ్యాంద్ర ప్లకార్డు పట్టుకొని,మరొకసారి అఖిలపక్ష సమావేశంలో విభజనకు అనుకూలంగా లెటర్ ఇచ్చి,మళ్ళి ఇప్పుడు సమైఖ్యాంద్ర కోసం సీమాన్ద్రలో ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్న నేపధ్యంలో మళ్ళి సమ న్యాయం అంటూ పరిపరి విధాలుగా తమ నిర్ణయాన్ని మార్చుకుంటూ తమకంటూ ఒక నిర్ణీత అభిప్రాయం లేని,వై. ఎస్.ఆర్. సి.పి ని ఏరకంగా సమైఖ్యాంద్ర కోసం చిత్తశుద్దితో ప్రయత్నిస్తుందని నమ్మాలి?నేటి ఆంధ్రప్రదేశ్ అనిశ్చిత స్థితికి కారణం జగన్ రాజకీయ పార్టీనే అని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. కేవలం జగన్ను ఎదుర్కోవటానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ విభజన అంశాన్ని2009 లో  తీసుకువచ్చింది అనే అభిప్రాయం చాలామంది ప్రజల మదిలో ఉంది. ఇక రాజకీయ స్వార్ధం కోసం రాజశేఖరరెడ్డి టి.డి.పి హయాం లో 41 మంది శాసనసభ్యుల సంతకాలతో విభజన అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం ముందుకు పంపారు అనే అభిప్రాయాన్ని వై.ఎస్.ఆర్.సి.పి నే ఖండించలేని పరిస్థితి ఉంది. ఇక రాజకీయ నాయకులను ప్రజలు నమ్మని ఈ పరిస్థితులలో సమైఖ్యాంద్రను తాను సాధించ గలనని జగన్ ప్రజలను ఎలా నమ్మించ గలడు?                   ఇక జగన్ సోదరి షర్మిల విభజన జరిగితే సమైఖ్యాంద్ర కు కట్టుబడి ఉన్నందున సీమాన్ద్రలో వై.ఎస్.ఆర్.సి.పి నే ప్రజలు గెలిపిస్తారని,తెలంగాణలో తమ తండ్రి రాజశేఖర రెడ్డి ఏవిధంగా అభివృద్ధి నిమిత్తం ఎక్కువనిధులు సీమాంద్ర ప్రాంతం కంటే వెచ్చించారో తమ వద్ద గల ఆధారాలను చూపించి తెలంగాణలో కూడా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్ప్తోంది. ఈరోజున ప్రజలకు కావల్సింది విభజన అంశం ఏరకంగా వై.ఎస్.ఆర్.సి.పి  కి ఉపయోగపడుతుంది అని కాదు, విభజన జరిగితే 2014 ఎన్నికల తరువాత కేంద్రంలో వై.ఎస్.ఆర్.సి.పి  తన వైఖరి ఎటు అని. ఈ విషయంలో జగన్ తన  వైఖరి చెప్పని పక్షంలో విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తో కుమ్మక్కు ఐన కారణంగానే జగన్ కు బెయిల్ దొరికి,జైలు నుండి బయటకు వచ్చాడని ప్రజలు భావించే ప్రమాదముంది.                    2014 ఎన్నికల తరువాత కేంద్రంలో యు.పి.ఎ  ని బలపరిచే అవకాశం ఉందని  స్వయంగా వై.ఎస్.ఆర్.సి.పి  వారే  అంగీకరిస్తున్నారు. విభజన విషయం లో సీమాంద్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని భావిస్తున్నారు. వారి ఆగ్రహావేశాలను వై.ఎస్.ఆర్.సి.పి  సమైఖ్యాంద్ర నినాదంతో ఓట్లు కింద మార్చుకుని 2014 లో యు.పి.ఎ  ని బలపరిస్తే అంతకు మించిన ప్రజాద్రోహం మరొకటి ఉండదు.  

వైకాపా రాజీనామాలు..జగన్ కుట్ర

      ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పట్టుబడుతుండటంలో కుట్ర దాగి ఉందని మంత్రి శైలజానాథ్ అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ తీర్మానం శాసనసభలో ఆమోదం పొందేందుకే ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శాసనసభ్యులు రాజీనామాలు చేయాలనే వాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రాజీనామాలు చేసి, వాటిని ఆమోదింపజేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజీనామాలు చేయవద్దని ఆయన సీమాంధ్ర శాసనసభ్యులకు విజ్జప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటే రాజీనామాలు చేయకుండా తెలంగాణ తీర్మానం శాసనసభకు వచ్చినప్పుడు మాట్లాడాలని, తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెసు అధిష్టానం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు నిజం కాకూడదని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

విభజనకు 'జగన్' సపోర్ట్ !

        తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు వీలయినంత ఎక్కువగా సహకరిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో జరిగిన ఒప్పందంలో భాగంగా బెయిలు మీద బయటకు వచ్చాడని జగన్ మీద విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రకటనకు ముందే సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్ తన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాడు. ఇప్పుడు తాజాగా వాటిని ఆమోదించుకునేందుకు మొగ్గు చూపుతున్నాడు.     కాంగ్రెస్ సూచనల మేరకే జగన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే జగన్ పార్టీలో చేరి అనర్హత వేటుపడిన సీమాంధ్ర శాసనసభ్యులు 15 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు జగన్ పార్టీ టికెట్ మీద గెలిచిన 17 మంది కూడా రాజీనామాలు చేస్తున్నారు. అంటే మొత్తం 32 మంది.  దీంతో సీమాంధ్ర ఎమ్మెల్యేల సంఖ్య  175 నుండి 143కు చేరుతుంది. అంటే తెలంగాణ (117)ఎమ్మెల్యేల కంటే సీమాంధ్ర ఎమ్మెల్యేలు కేవలం 26 మంది మాత్రమే ఎక్కువ అవుతారు.  అందులో కొందరు వివిధ కారణాలతో గైర్హాజరయితే తెలంగాణ తీర్మానం సులభంగా నెగ్గుతుంది. సమైక్యవాదానికి కట్టుబడ్డందుకు జగన్ కు సీమాంధ్రలో ఆదరణ ఎలాగు ఉంటుంది. ఇటు తెలంగాణ ఏర్పాటు జరిగిపోతుంది.

మ్యాచ్ ఎప్పుడో అయిపోయింది: శ్రీధర్ బాబు

  ఆఖరి బంతి పడేవరకు మ్యాచ్ పూర్తవదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ “తెలంగాణా మ్యాచ్ ఎప్పుడో పూర్తయిపోయింది. మ్యాచ్ పూర్తయిపోయిన తరువాత ఇక ఆఖరి బంతి పడదు. కాంగ్రెస్ నేతలందరూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి తప్పని సరిగా కట్టుబడి ఉండాలని” ఆయన అన్నారు.   ఇప్పటికే చాలా మంది తెలంగాణా కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పదవిలోంచి తప్పించి, రాష్ట్రపతి పాలన విధించయినా రాష్ట్ర విభజన ప్రక్రియను వీలయినంత వేగంగా పూర్తి చేయాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరున్న మంత్రి శ్రీధర్ బాబు ఇంతవరకు ఆయనకు వ్యతిరేఖంగా ఎన్నడూ వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన కూడా ముఖ్యమంత్రికి దూరం జరిగినట్లు ఈ వ్యాఖ్యలతో అర్ధం అవుతోంది.   సీమాంధ్ర శాసన సభ్యులు, మంత్రులు సమైక్య హడావుడిలో తిరుగుతుంటే, మరో పక్క టీ-కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రికి దూరంగా మసులుతున్నారు. అదేవిధంగా లక్షలాది ఉద్యోగులు కూడా సమ్మె బాట పట్టి రెండు నెలలు కావస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పరిపాలన కొనసాగడం అసాధ్యమని స్పష్టమవుతోంది. అయినప్పటికీ, కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రంలో పరిస్థితులు భేషుగ్గా ఉన్నాయని శలవిస్తూ ప్రజలకి మరింత ఆగ్రహం కలిగిస్తున్నారు.

ఆఖరి బంతి వరకు ఆడుతా: స్టార్ బ్యాట్స్ మ్యాన్

  సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ‘స్టార్ బ్యాట్ మ్యాన్’ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్నమరో సిక్సర్ కొట్టారు. ఆఖరి బంతి పడేవరకు ఏ మ్యాచు ముగియదని ఆయన వ్యాఖ్యానించారు. అంటే రాష్ట్ర విభజన అంశంపై తుది వరకు పోరాటం కొనసాగిస్తానని చెప్పినట్లే అనుకోవచ్చును. సరిగ్గా అంతకు ముందు రోజే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ “ఆయన రాష్ట్రమంతటికీ ముఖ్యమంత్రి గనుక అందరినీ కలుపుకుపోవలసిన అవసరం ఉందని” హెచ్చరికలు జారీ చేసారు. అయినప్పటికీ, కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ సమైక్యవాదం వినిపించడం చూస్తే, ఇక అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలని సిద్దం అయినట్లే ఉన్నారు.   “రాజకీయ సమీకరణాలు, పార్టీల అభిప్రాయాల కంటే ప్రజాభిప్రయమే ముఖ్యమని, పార్టీలు కూడా తదనుగుణంగానే నడుచుకోవాలని ఆయన అన్నారు. “దాదాపు ఆరున్నర లక్షల మంది ఉద్యోగులు, మూడున్నర లక్షల మంది ప్రజలు గత రెండు నెలలుగా రోడ్ల మీద ఉండి చేస్తున్న ఉద్యమాలను, వారి ఆందోళనను పట్టించుకోకుండా ముందుకు సాగితే పార్టీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమని ఆయన స్పష్టం చేసారు.   హైదరాబాద్, విద్యుత్, ఉద్యోగాలు, నదీ జలాల పంపకాలలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపకుండా రాష్ట్ర విభజన చేయడం వలన సమస్యలు మరింత పెరుగుతాయే తప్ప తరగవని ఆయన మరో మారు స్పష్టం చేసారు. ఇంతవరకు నదీ జలాల పంపకాలపై వేసిన ఏ ట్రిబ్యునల్స్ కూడా సమస్యలను ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించలేకపోయిన సంగతిని కేంద్రం గుర్తుంచుకోవలసిన అవసరం ఉందని అన్నారు. ఒక రాష్ట్రంలో ఏర్పరిచిన ప్రాజెక్టులను రెండు రాష్ట్రాలకి సమానంగా విడదీసి ఈయడం ఏవిధంగా సాధ్యమో కేంద్రమే ఆలోచించుకోవాలని” అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి పట్ల తన అసంతృప్తిని బహిరంగంగానే వెలిబుచ్చినప్పటికీ ఆయన మరో మారు తన వైఖరిని ఈవిధంగా స్పష్టం చేయడంతో, ఇప్పుడుకాంగ్రెస్ అధిష్టానం ఆయనతో ఏవిధంగా వ్యవహరించాలనే సంగతి నిర్ణయించుకోవలసి ఉంటుంది.   ఇంతవరకు ఆయన సీమాంద్రా నేతలందరినీ రాజీనామాలు చేయకుండా పట్టి ఉంచారు. ఒకవేళ అధిష్టానం ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకొన్నా, లేదా విభజనపై ముందుకు వెళ్ళినా, ఆయనతో సహా అందరూ కూడా హెచ్చరిస్తున్నట్లుగానే తమ పదవుల నుండి తప్పుకోవచ్చును. అయినా కాంగ్రెస్ అధిష్టానం మొండిగా ముందుకు సాగితే వారందరూ పార్టీ నుండి తప్పుకొని మరో కొత్త పార్టీ పెట్టినా ఆశ్చర్యం లేదు. మరి కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితిని అంతవరకు రానిస్తుందా లేక వేరే ఏమయినా ఉపాయం ఆలోచిస్తుందా? అనేది చూడాలి.

తెలంగాణ నుంచి రాహుల్‌ పోటి

  వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ అధిష్టానం అందుకు తగ్గట్టుగానే ప్రణాళిక రూపొందిస్తుంది. ముఖ్యంగా రాహుల్‌ ప్రదానిని చేసే దిశగా ఈ ప్రణాళికా రచన సాగుతుంది. అందుతో భాగంగానే రాహుల్‌ను తెలంగాణ ప్రాంతం నుంచి పోటికి దించాలని భావిస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగంగా పూర్తి చేసే ఆలోచనలో ఉంది కాంగ్రెస్‌. అందుకోసం ఈసారి రాహుల్‌ మహుబూబ్‌ నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటి చేసేందుకు రాహుల్‌గాంధిని ఒప్పించాలంటే డీసిపి బృందం రాహుల్‌ సన్నిహితులను కొరారు.ప్రస్తుతం కేంద్రం తెలంగాణకు అనుకూలంగా పావులు కదుపుతున్న నేపధ్యంలో రాహుల్ తెలంగాణ నుంచి పోటి చేస్తే అది పార్టీకి రాష్ట్రంలో కేంద్రలో ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారు. దీని వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రాభవాన్ని పెంచుకోవటంతో పాటు టిఆర్‌ ఎస్‌ బలాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారట కాంగ్రెస్‌ నాయకులు.

అప్పుడు తెలంగాణా, ఇప్పుడు సీమాంధ్ర నేతలతో

  ఇంత కాలంగా టీ-కాంగ్రెస్ నేతల రాజకీయ జీవితాలతో చెలగాటమాడి రాక్షాసానంధం అనుభవించిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల రాజకీయ జీవితాలతో ఆట మొదలు పెట్టింది. ఒకప్పుడు తెరాస, టీ-జేఏసీ, టీ-విద్యార్ధుల ఆగ్రహానికి గురయిన టీ-కాంగ్రెస్ నేతలు అధిష్టానంతో తమ పరిస్థితి గురించి ఎంత మోర పెట్టుకొన్నపటికీ పట్టించుకోకపోవడం వలన, పార్టీలో అత్యంత సీనియర్ నేతలు కే.కేశవ్ రావు, మందా జగన్నాథం, వివేక్ వంటివారనేకమంది చిన్నాపెద్దా నేతలు పార్టీని వీడి ఇతరపార్టీలలో చేరవలసి వచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం చలించలేదు. మళ్ళీ ఇప్పుడు సీమాంద్రాలో కూడా అదే పరిస్థితి తలెత్తినా కాంగ్రెస్ అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. పైగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ సీమాంద్రా యంపీలు రాజీనామాలు చేసుకోవచ్చునని వారికెవరూ అడ్డు చెప్పబోరని పలికి పుండుమీద కారం జల్లినట్లు మాట్లాడారు.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా పార్టీలో అనేకమంది నేతలు అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుతో తమ ప్రాంతంలో పార్టీ కనబడకుండా పోవడం తధ్యమని హెచ్చరిస్తున్నాఅది చెవిటివాడి ముందు శంఖమే అయ్యింది.   దీనర్ధం రాష్ట్ర విభజనను నిలిపివేయమనో, కొనసాగించామనో కాదు. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని చెప్పడమే. గత రెండు నెలలుగా13జిల్లాలలో ప్రజాజీవనం పూర్తిగా స్తంభించిపోయినా కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమాత్రం చొరవ చూపకపోవడం క్షమార్హం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజల పట్ల చూపిస్తున్నఈ ఉదాసీనతకి,నిర్లక్ష్యానికి, వైఫల్యానికి రానున్న ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ప్రజలు చెపుతున్నమాటే కాదు, స్వయంగా కాంగ్రెస్ నేతలే చెపుతున్నారు. ఇప్పటికయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని సమస్య పరిష్కారానికి ప్రయత్నించకపోతే తాము కూర్చొన్న కొమ్మను తామే నరుకొంటున్నట్లుగా భావించవలసి ఉంటుంది.

రాజీనామాలు చేసుకో(వచ్చు)వద్దు: దిగ్విజయ్ సింగ్

  “తెలంగాణా అంశంపై వెనకడువేసే ప్రసక్తే లేదు. కానీ, అంటోనీ కమిటీ తన నివేదికను సమర్పించిన తరువాతనే టీ-నోట్ ను క్యాబినెట్ సమావేశంలో ప్రవేశపెడతాము. రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నసీమాంధ్ర యంపీలు రాజీనామాలు చేసుకోదలిస్తే వారిని మేము ఆపబోము,” అని మూడు రోజుల క్రితమే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర యంపీలతో అన్నారు. కానీ అదే దిగ్విజయ్ సింగ్ ఈరోజు “త్వరలో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే టీ-నోట్ సిద్దం చేసి క్యాబినెట్ ముందు పెడతారని అన్నారు. ఇక సీమాంధ్ర యంపీలు రాజీనామాలు చేసుకోవచ్చని నిర్భయంగా చెప్పిన ఆయన, ఈ రోజు వారిని రాజీనామాలు చేయవద్దని కోరారు. ఇక ఒకవైపు టీ-నోట్ ప్రస్తావన తెస్తూనే దానిని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న ఏపీయన్జీవోలను తమ నిరవధిక సమ్మెవెంటనే విరమించమని ఆయన కోరారు. ఉద్యోగుల సమ్మె వలన రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని, అదేవిధంగా సీమాంధ్రలో ప్రజలు చాలా ఇబ్బంబులు పడుతున్నారని, అందువలన వెంటనే ఉద్యోగులు సమ్మె విరమించాలని ఆయన కోరారు. కేవలం దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు మాత్రమే ఒక అంశంపై ఈ విధంగా రెండు రకాలుగా మాట్లాడగలరేమో.

బెయిల్ కోసం విజయసాయి రెడ్డి పిటీషన్

      జగన్ అక్రమాస్తుల కేసులో ఏ1 ముద్దాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిలు మీద విడుదల కావడంతో ఇక ఇవే కేసులలో ఉన్న ఇతర నిందితులు మెల్లమెల్లగా బెయిలు పిటీషన్లు దాఖలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిలు పిటీషన్ వేశారు. ఇప్పుడు జగన్ సంస్థల అడిటర్ విజయసాయి రెడ్డి, జగన్ సన్నిహితుడు సునీల్ రెడ్డిలు బెయిలు పిటీషన్లు దాఖలు చేశారు.     సునీల్ రెడ్డికి వాస్తవంగా ఎప్పుడో బెయిలు వచ్చేది. కానీ ఆయన ఇంతవరకు బెయిలు కొరకు ధరఖాస్తు చేసుకోలేదు. జైల్లో అతను జగన్ కు సహాయకుడిగా, పీఏ గా వ్యవహరించేవాడని, జగన్ ములాఖత్ ల పేరుతో ఎక్కువ మంది కలిసేందుకు వీలుగా ఇతను బెయిలు తీసుకోకుండా ఉన్నాడని ఆరోపణ ఉంది. జగన్ కు బెయిలు మంజూరయ్యే రోజు కూడా జగన్ కుటుంబ సభ్యులతో పాటు ఇతర రాజకీయ నాయకులు జగన్ ను కలిశారు. పరిమితికి మించి లోపలికి వెళ్లి జగన్ ను కలిశారు. అయితే ములాఖత్ ల రికార్డులలో మాత్రం ఇతరుల పేరు మీద ఉండడం విశేషం.

నాలుకలు కోసినా, కాళ్లు విరగకొట్టినా...

      తమ నాలుకలు కోసినా, కాళ్లు విరగకొట్టినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తమ పోరాటం ఆగదని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. హిందూపురంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అశోక్‌బాబు తెలిపారు. కావాలంటే తన ప్రసంగం సీడీలను టీఆర్ఎస్ నేతలకు ఇస్తామని తెలిపారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు దానిని వ్యతిరేకించాలని అన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం జరుగుతుందని, 29న కర్నూలులో ఏపీ ఎన్జీవోల సభ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 30న భవిష్యత్ కార్యాచరణ ప్రకటన చేస్తామని అశోక్‌బాబు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని వేరుగా చూడాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రజలపై మేము ఎలాంటి విమర్శలు చేయలేదని అశోక్‌బాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలనే తమ ఉద్దేశమని, తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.

బిజెపి పార్టీ బుర్కాల ప్లాన్!

      భారతీయ జనతా పార్టీ వెంట ముస్లిం మైనారిటీలు కూడా ఉన్నారని చాటుకునేందుకు ఆ పార్టీ ఓ పది వేల బుర్కాలను తయారు చేయిస్తోందని, ఆ బుర్కాలను తమ పార్టీ కార్యకర్తలకు వేయించి మైనారిటీలు బీజేపీతో ఉన్నారన్న భ్రమలు కల్పించే ప్రయత్నాలలో ఆ పార్టీ ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సభలో ఈ ప్రయోగం చేయనున్నారని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించి బీజేపీ బుర్కాలకు ఆర్ఢర్ ఇచ్చిందని ఓ బిల్లును దిగ్విజయ్ మీడియాకు చూపారు. అయితే గుజరాత్ లో 33 శాతం ముస్లింలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారని ఇటీవల ఎన్నికల్లో తేలింది. ఇక ముస్లింలు మాత్రమే గెలుపు ఓటములు నిర్ణయించగల ఎనిమిది స్థానాలలో ఆరు స్థానాలు బీజేపీకి దక్కాయి. 2002 గుజరాత్ అల్లర్లను బూచిగా చూపడమే తప్ప నరేంద్ర మోడిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ కు ఎలాంటి కారణమూ దొరకడం లేదు.