రాజీనామాలను ఆమోదిస్తారని భావిస్తున్నా౦: ఉండవల్లి

        లోక్‌సభ స్పీకర్‌మీరాకుమార్‌తో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు శనివారం ఉదయం సమావేశమయ్యారు. ఎంపీలు లగడపాటి, సాయిప్రతాప్, అనంత, ఉండవల్లి, ఎస్పీవైరెడ్డి స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఎంపీల అభిప్రాయాలను స్పీకర్ తెలుసుకున్నారు. మనస్పూర్తిగా రాజీనామా చేస్తున్నారా అని స్పీకర్ అడిగినట్లు తెలుస్తోంది. తమపై ఎవరి ఒత్తిడి లేదని స్పీకర్‌కు దీనిపై సీమాంధ్ర ఎంపీలు తెలిపినట్లు సమాచారం. రాజీనామాలు చేసిన ఎంపీలకు హర్షకుమార్, సబ్బంహరి మద్దతు తెలిపారు.   లోక్‌సభ స్పీకర్‌మీరాకుమార్‌తో సమావేశం అనతరం ఉండవల్లి అరుణకుమార్ మీడియా తో మాట్లాడారు.ఏ రకమైన ఒత్తిడికి గురై ఇచ్చిన రాజీనామా లేఖ కాదని, కావాలని, పూర్తి మనఃపూర్వకంగా ఇచ్చిన రాజీనామా అని స్పష్టంగా చెప్పామని ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. తమ రాజీనామాలను ఆమోదిస్తారని భావిస్తున్నామని అన్నారు. ఇంకేదైనా సందేహం ఉంటే స్పీకర్ ను అడగండని అన్నారు. 

బొత్స రాజీనామా..!!

      పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. బొత్స సత్యనారాయణతో మరో నలుగురు మంత్రులు పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నోట్ వచ్చే లోగా తాను రాజీనామా చేయడం బెటర్ అని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొదట ప్రత్యేకవాదిగా ముద్ర వేసుకున్న బొత్స సమైక్య వినతిపత్రంపై సంతకం చేశారు. తాను రాజీనామా చేయబోతున్న విషయాన్ని బొత్స గవర్నర్‌కు చెప్పినట్లు సమాచారం. బొత్స శుక్రవారం గవర్నర్‌ను కలవడంతో మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి.

కాంగ్రెస్ మార్క్ పాలన...కాంగ్రెస్ మార్క్ కష్టాలు

  కాంగ్రెస్ మార్క్ పాలనలో కేవలం ప్రజలే కాక స్వయంగా ఆ పార్టీకి కూడా చాలా కష్టాలు, కన్నీళ్లు తప్పడంలేదు. రాష్ట్రవిభజనతో కొత్త సమస్యను సృష్టించుకొని అందులోంచి బయటపడలేక తిప్పలు పడుతున్నకాంగ్రెస్ అధిష్టానానికి, నిన్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విసిరిన సవాలుతో ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకొంది.   ఆయన ఇంత బహిరంగంగా అధిష్టానానికి సవాలు విసురుతున్నపటికీ, వెంటనే ఆయనని పదవిలోంచి తొలగించలేని దుస్థితి కాంగ్రెస్ పార్టీది. ఒకవేళ తొలగిస్తే అది ప్రజలలో ఆయన ఇమాజ్ మరింత పెంచుతుంది. తెలుగు ప్రజలను రెండుగా చీల్చి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఇప్పటికే చాలా ఆగ్రహంతో ఉన్నసీమాంధ్ర ప్రజలను అది మరింత రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. అలాగని ఉపేక్షిస్తే ప్రజలలో అధిష్టానం చులకన అవుతుంది. బహుశః జగన్మోహన్ రెడ్డి ద్వారా కిరణ్ ప్రభుత్వాన్నికూలద్రోయించి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించి ఈ గండం గట్టెక్కే ప్రయత్నం చేయవచ్చును.   ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉండగా, అక్కడ డిల్లీలో నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వంత పార్టీపై, ప్రభుత్వంపై చేసిన తీవ్ర విమర్శలతో కాంగ్రెస్ అధిష్టానం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకొంది.   నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులను రక్షించేందుకు తమ పార్టీ, ప్రభుత్వం కలిసి బిల్లు తీసుకురావడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా ఆక్షేపిస్తూ “ఆ బిల్లును చింపి చెత్త కుప్పమీద పడేయాలి. బీహార్ రాష్ట్రంలో మా పార్టీ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకే ఇటువంటి బిల్లుకి మా పార్టీ ఆమోదం తెలిపిందని భావిస్తున్నాను. ఈవిధంగా ప్రతీ విషయంలో రాజీపడుతూ పోతే, ఇక ఎప్పటికీ దేశం నుండి అవినీతిని పారద్రోలలేమనే సంగతిని మా పార్టీతో సహా అన్నిరాజకీయ పార్టీలు గమనించాలి,”అని అన్నారు.   ఆయన రాక మునుపు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నపార్టీ కార్యదర్శి అజయ్ మాకన్, కాంగ్రెస్ పార్టీ నేతలతో సహా ప్రతిపక్షాలు ఈ బిల్లుపై చేస్తున్నఆరోపణలను, విమర్శలను ఆయన తీవ్రంగా ఖండిస్తూ, “వారిది అవగాహనా రాహిత్యమని బిల్లును సమర్దించుకొని వస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ కూడా బిల్లుకు వ్యతిరేఖంగా మాట్లాడేసరికి, అజయ్ మాకన్ నోట మాట రాలేదు కాసేపు. చివరికి మా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పినదే మా పార్టీ సిద్ధాంతం,’ అని ప్రకటించి బయటపడ్డారు. రాహుల్ గాంధీ విమర్శలతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడగా, బిల్లును వ్యతిరేకిస్తున్నబీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీలన్నీకాంగ్రెస్ పార్టీని ఇదే అదునుగా దుయ్యపట్టసాగాయి.   ఇక నిన్నముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోకి చొరబడి ఒక ఆర్మీ కల్నల్ తో సహా 12మందిని చంపినప్పటికీ, ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఈ రోజు సమావేశం అవుతానని ప్రకటించడంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.   ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని విమర్శిస్తుంటే, అక్కడ డిల్లీలో స్వయంగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడే తమ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడం విశేషం. ఇద్దరూ పార్టీలో, ప్రభుత్వంలో కూడా చాలా కీలకమయిన వ్యక్తులే కావడంతో వారి విమర్శలకు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకొన్న ప్రతీసారి ప్రజల, మీడియా దృష్టిని మళ్ళించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక ఉపాయం పన్నుతుంటుంది. బహుశః ఈసారి చేతిలో సిద్ధంగా ఉన్న తెలంగాణా సమస్యను హైలైట్ చేస్తూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదిస్తుందేమో.

నేడు పాలమూరు ప్రజాగర్జన

  పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతు బిజెపి తలపెట్టిన ప్రజాగర్జనకు ఏర్పాటు పూర్తయ్యాయి. పాలమూరులో శనివారం జరుగుతున్న సభకు ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ హాజరు కానున్నారు. ఇటీవల బిజెపి ఎల్‌బి స్టేడియంలో చేసిన మోడి నవభారత యువభేరి సభ సక్సెస్‌ కావడంతో ఇప్పుడు ప్రజాగర్ఝనను కూడా అదే స్థాయిలో సక్సెస్‌ చేయాలనుకుంటున్నారు రాష్ట్ర నాయకులు. తెలంగాణ ఎంపి సీట్ల మీద గట్టి ఆశలు పెట్టుకున్న బిజెపి ఈ సభను ఎలాగైన సక్సెస్‌ చేయాలని భావిస్తుంది. ఈ సమావేశానికి తెలంగాణకు మద్దతు తెలపుతున్న పలు సంఘాలతో పాటు టిజెఏసి నేత కొదండరామ్‌ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రజాగర్ఝనకు ముందు సుష్మా స్వరాజ్‌ పలువురు తెలంగాణ నేతలతో సమావేశమవుతారు.

స్పీకర్‌ను కలవనున్న సీమాంద్ర ఎంపిలు

  చాల రోజులుగా రాజీనామాలు చేస్తామంటూ చెపుతున్న సీమాంద్ర ఎంపిలు నేడు స్పీకర్‌ కలవనున్నారు. 60 రోజులుగా సీమాంద్రలో ఉద్యమాలు జరుగుతున్నా కేంద్ర ఏ మాత్రం స్పందిచకపోవటంతొ ఎంపిలు రాజీనామలు చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో బాగంగానే స్పీకర్‌ను కలిసి తమ రాజీనామలు ఆమోదించాల్సిందిగా కోరనున్నారు. స్పీకర్‌ను కలవనున్న వారిలో లగడపాటి రాజగోపాల్‌, అనంత వెంకట్రామిరెడ్డి, సాయి ప్రతాప్‌, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, హర్షకుమార్‌, ఎస్‌పివై రెడ్డి ఉన్నారు. వీరంతా ఆగస్టు 2న ఇచ్చిన తమ రాజీనామలను ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను కోరనున్నారు. మూడు రోజుల కిందటే స్పీకర్‌ ను కలవాల్సి ఉండగా, ఆమె బిజీ ఉండటంతో అపాయింట్‌మెంట్‌ను మూడు రోజులు పోస్ట్‌పోన్‌ చేశారు.

సోనియా అబద్దం చెపుతుంది

  రాష్ట్రవిభజన నేపధ్యంలో ఎంపి సాయిప్రతాప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం, సోనియా అందరికి చెప్పి నిర్ణయం తీసుకున్నమనటం అబద్దం అన్నారు సాయిప్రతాప్‌. నవ్వుతూనే మాట్లాడి మమ్మల్ని అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్‌ చేసే దుస్థితి వస్తుందని ఎన్నడూ అనుకోలేదని అన్నారు. విభజన పై నిర్ణయం తీసుకుంటున్నామని అసలెవరికి చెప్పారో కూడా తెలియదన్నారు. తనతో పాటు సీమాంద్ర ఎంపిలు మంత్రులు అందరు చివరి వరకూ సమైక్యాంధ్ర డిమాండ్‌నే వినిపించామని చెప్పారు. తాను భగవద్గీతపై ప్రమాణం చేసి మరీ చెబుతానని.. తమకు పదవులు ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర తెలంగాణ విషయంలో ఎంత ముందుకు వెళ్లాలని ప్రయత్నించిన అది జరగదని చెప్పారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదన్నారు. శిక్షపడ్డ ప్రజాప్రతినిధులను కాపాడేందుకు కేబినెట్ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను చించి పారేయాలని రాహుల్ గాంధీ చెప్పినప్పుడు.. ఎనిమిది కోట్ల మంది ఐక్యతను కాపాడేందుకు తెలంగాణ పై కేబినెట్ నోట్‌ను ఎందుకు చించే యకూడదని సాయిప్రతాప్ ప్రశ్నించారు. కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాన్ని రాహుల్‌ వ్యతిరేఖించినప్పుడు తాము వ్యతిరేకించటంలో తప్పేముందని ప్రశ్నించారు.

అధిష్టానంపై సియం తిరుగుబాటు

  తొలి నుంచి తనని తాను సమైక్యవాదిగా చెప్పుకుంటున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి మరోసారి అధిష్టానం మీద తిరుగుబాటు చేశారు. కిరణ్‌ వైఖరి గురించి దిగ్విజయ్‌సింగ్‌ వ్యతిరేఖ వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో ప్రెస్‌ మీట్‌ పెట్టి మరి తాను సమైక్యవాదినే అని చెప్పారు. రాష్ట్ర విభజన అంత సులువు కాదని మరోసారి తెలిపిన సియం, రాష్ట్రం విడిపోతే వచ్చే సమస్యలు ఎవరు పరిష్కరించలేరన్నారు. రాష్ట్రం విడిపోతే జలయుద్దాలు తప్పవని, మ్యాప్‌ చూపించి మరీ వివరించారు. సమ్మె విరమించమని ఉద్యోగులను కోరడానికి ప్రెస్‌మీట్‌ పెట్టిన సియం తన ప్రసంగం అంతా అథిష్టానం తప్పులను ఎత్తి చూపించడానికి ప్రయత్నించారు. తనకు ప్రదవి కన్నా ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని అవసరమైతే ముఖ్యమంత్రి పదవిని కూడా వదులుకోవడానికి సద్దమన్నారు. దిగ్విజయ్‌సింగ్‌ తనను సమైక్యాంద్ర ముఖ్యమంత్రి అని అన్నప్పుడల్లా తనకు పట్టుదల ఇంకా పేరుగుతుందన్నసియం, ప్రజలా పార్టీనా అన్న ప్రశ్న తలెత్తితే ప్రజలవైపే ఉంటామన్న సంకేతాలు ఇచ్చారు. నెహ్రూ, ఇందిర తీసుకున్న నిర్ణయాల కన్నా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం గొప్పదా అని సోనియా నాయకత్వాన్ని పరోక్షంగా ప్రశ్నించారు. పార్టీ నిర్ణయానికీ, ప్రభుత్వ నిర్ణయానికీ చాలా తేడా ఉంది. విభజనపై ఇప్పుడు కాంగ్రెస్‌ రాజకీయ నిర్ణయం తీసుకుంది. దానివల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించి కేంద్రం ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజల్లో ఉన్న ఆందోళనలు నివృత్తి చేయకుండా మేం అన్నీ చూసుకుంటాం అంటే అది రాజకీయ ప్రకటనే అవుతుంది. పరిష్కారాలపై కేంద్రం లిఖితపూర్వకంగా భరోసా ఇవ్వాలి. సమస్యలకు పరిష్కారం చూపిన తర్వాతే ప్రకటన చేయాల్సింది.

అద్దెకు వచ్చి ఇళ్ళు నాదంటే ఎట్లా?

      ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు, ఎంపి లగడపాటి రాజగోపాల్‌లది ఒకే స్కూలులా ఉందని, ఇల్లు అద్దె కోసం వచ్చి ఇల్లు నాదే అన్న చందంగా అశోక్ బాబు మాట్లాడుతున్నాడని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఎద్దేవా చేశారు. కేంద్రం రోడ్ మ్యాప్ అడిగినప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమైక్యాంధ్ర ఆలోచన పక్కన పెట్టి సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఎలా బతికించుకోవాలో ఆలోచించుకోవాలని సూచించారు. తెలంగాణ డిమాండ్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విత్తనం వేస్తే, చంద్రబాబు నాయుడు దానికి నీళ్లు పోశారని అన్నారు.ముఖ్యమంత్రిని చూసిన చంద్రబాబు నాయుడు తెలంగాణ విషయంలో రివర్స్ అయ్యారు.  బెయిలు మీద జెయిలు నుండి వచ్చిన జగన్ కు అట్టహాసంగా స్వాగతం పలకడం సిగ్గు చేటు అని వి.హనుమంతరావు విమర్శించారు.

లగడపాటి అన్న చీకటి ఒప్పందాలు ఏమిటి?

      విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ తమ రాజీనామాలను ఆమోదింప చేసుకున్న తర్వాత కొన్ని చీకటి ఒప్పందాలను బయటపెడతానంటున్నారు. రాజీనామా ఆమోదించుకునేందుకు ఈ నెల 24న స్పీకర్ వద్ద అపాయింట్ మెంట్ తీసుకుంటే స్పీకర్ అందుబాటులోకి రాలేదు. వచ్చే నెల 2న కలవాలని చెప్పారు. దీంతో రాజీనామాల ఆమోదం కోసం చూస్తున్నారు.   జగన్ తో కాంగ్రెస్ కుమ్మక్కు అయిందా ? అని లగడపాటిని అడిగితే ఏమో చాలా మంది చాలా మాటలు అంటున్నారు. కానీ నా రాజీనామా ఆమోదం పొందితే నాకు తెలిసిన విషయాలు బయటపెడతా అని అంటున్నారు. అంటే సోనియాగాంధీ, దిగ్విజయ్ సింగ్ లపైనే ఈయన ఆరోపణ చేస్తారా? లేక ఇంకేమైనా కొత్త విషయం చెబుతారా?అన్నది చూడాలి.

కేంద్ర ఆర్డినెన్స్ చించిపారేయాలి: రాహుల్ సంచలన వ్యాఖ్య

      కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేర చరితులను రక్షించడానికి కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినేన్స్‌పై ఆయన మండిపడ్డారు. ఆర్డినెన్స్‌ను చింపి పారవేయాలని రాహుల్ పేర్కొన్నారు. ఇటీవల నేర చరితులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని సుప్రీంకోర్టు పేర్కొంటూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై 24న కేబినెట్‌లో చర్చ జరిపి ఆమోదించిన అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్‌కు పంపారు. ఈ బిల్లు ఇంకా అక్కడే ఉంది.   బీహర్ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ పశువుల దాణ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ జరుగుతున్న విషయం తెలిసందే. నేరం రుజువు అయితే లాలూ ఎన్నికలలో పాల్గొనే అర్హత కోల్పోతారు. అందుకేసమే కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిందని పలువురు రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సమంజసమేనని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు.

దినేష్ రెడ్డికి క్యాట్ లో మళ్ళీ ఎదురుదెబ్బ

  డీజేపీ దినేష్ రెడ్డికి ఈ నెల 30వ తేదీతో పదవీకాలం ముగుస్తుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆయన ఒకేసారి అనేక వివాదాలలో చిక్కుకొన్నారు. పైగా అతని ఆస్తులపై సీబీఐ విచారణ కూడా మొదలయింది. అందువల్ల ప్రభుత్వం అతని పదవీ కాలం పొడిగించేందుకు నిరాకరించడంతో ఆయన కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా ఆయనకు చుక్కెదురయింది. ట్రిబ్యునల్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్నే సమర్ధించడంతో ఆయన మళ్ళీ మరో ప్రత్యేక పిటిషను వేసారు. కానీ ట్రిబ్యునల్ ఆయన రెండో పిటిషన్నుకూడా ఈ రోజు తిరస్కరించింది.   ప్రభుత్వం ఆయన సమర్ధతను గుర్తించి, తనంతట తానుగా ఆయన పదవీ కాలం పొడిగించి ఉంటే అది ఆయనకు ఎంతో గౌరవ ప్రదంగా ఉండేది. కానీ సమస్యలు చుట్టుముట్టిన ఈ తరుణంలో తను అధికారంలో ఉండటం చాలా అవసరమని ఆయన భావిస్తున్నందునే ఆయన తన పదవిని కాపాడుకోవడానికి ఇంత పోరాటం చేస్తున్నారనిపిస్తుంది. ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే పదవీ కాలం మిగిలిన ఈ తరుణంలో ఆయన హుందాగా వ్యవహరించి తప్పుకొంటే బాగుంటుందేమో.

కిరణ్ సర్కార్ కి కౌంట్ డౌన్

  అంటోనీ కమిటీ తో సంబంధం లేకుండా అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ నోట్ ని కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ప్రవేశపెడతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ నిన్న ముహూర్తం ఖరారు చేసారు. ఇక అక్టోబర్ 3లోగా విభజన ప్రక్రియ మొదలుపెట్టకపోతే మళ్ళీ సకలజనుల సమ్మెకు దిగుతామని టీ-ఉద్యోగులు తాజాగా హెచ్చరికలు జారీ చేసారు. అదేవిధంగా టీ-నోట్ ను ముందుకు కదిపితే హైదరాబాదులో మిలియన్ మార్చ్ చేపడతామని ఏపీఎన్జీవోల నేత అశోక్ బాబు గతంలోనే హెచ్చరించారు. ఒకవేళ టీ-నోట్ పై ఏ మాత్రం అడుగు ముందుకు వేసినా వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేస్తామని కొందరు సీమాంధ్ర యంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఒకే అంశంపై ఇన్నిప్రతిస్పందనలు వస్తున్నఈ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇక దైర్యంగా ముందుకు సాగాలంటే బహుశః రాష్ట్రపతి పాలన ఒక్కటే శరణ్యం. తెలంగాణా నేతలు కూడా రాష్ట్రపతి పాలన విధించి విభజన ప్రక్రియను పూర్తి చేయమని గట్టిగా కోరుతున్నారు.   ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం టీ-నోట్ తయారు చేసి శాసనసభ ముందుకు పంపినా అది ఆమోదం పొందే అవకాశం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర నేతలందరూ కేవలం తెలంగాణా బిల్లును శాసనసభలో ఓడించేందుకే ఇంకా పదవులలో కొనసాగుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం టీ-నోట్ ను ముందుకు పంపి భంగపడే కంటే తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించుకొని దానిని నేరుగా పార్లమెంటులోనే ప్రవేశ పెట్టవచ్చును.   ఇక తన చేతికి మట్టి అంటకుండా జగన్మోహన్ రెడ్డి ద్వారా కిరణ్ కుమార్ రెడ్డిని, అతని ప్రభుత్వాన్నివదిలించుకొని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికే మొగ్గు చూపవచ్చును. ఈ లోగా అతని ద్వారానే ఏపీఎన్జీవోల సమ్మెను పక్కదారి పట్టించి దానిలో చీలికలు తీసుకువచ్చినిలిచిపోయెలా చేయవచ్చును. ఇప్పటికే జగన్ ఆ రెండు పనులలో కొంత ముందడుగు వేసారు. త్వరలోనే అతను మిగిలిన పని కూడా పూర్తి చేయగానే, రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్ర విభజన ప్రక్రియను మొదలుపెట్టవచ్చును.అంటే దిగ్విజయ్ ప్రకటించిన అక్టోబర్ మొదటి వారమే కిరణ్ సర్కారుకి ఆఖరి వారం అయ్యే అవకాశున్నాయి.

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

  ఇటీవల సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ప్రచ్చన్నయుద్ధం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కొద్ది వారాల క్రితం సుప్రీంకోర్టు “నేరాభియోగాలు ఎదుర్కొంటూ జైలుపాలయిన ప్రజాప్రతినిధులు ఎన్నికలలో పోటీకి అనర్హులని” తీర్పు ప్రకటించగానే, ప్రభుత్వం హుటాహుటిగా కోర్టు ఆదేశాలను కొట్టి వేస్తూ ఒక చట్ట సవరణ చేసింది. ఆ తరువాత గ్యాస్ వినియోగదారులకు ఆధార్ కార్డుతో అనుసంధానం తప్పని సరిచేస్తూ ప్రభుత్వం ప్రకటించగానే, ఒక్క గ్యాస్ మాత్రమే కాక, దేనికి కూడా ఆధార్ తో అనుసంధానం చేయవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పింది.   ఇక లోక్ పాల్ బిల్లు కోసం, ప్రస్తుత ఎన్నికల విధానంలో సవరణల కోసం పోరాడిన అన్నాహజారే, ప్రభుత్వ వైఖరిని ఇక మార్చలేమని తన పోరాటం విరమించుకొన్న తరువాత, ఆయన ప్రధాన డిమాండ్లలో ఒకటయిన ‘ఓటర్లకు అభ్యర్థులను తిరస్కరించే హక్కును’ కల్పిస్తూ సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఓటర్లకు పోటీ చేస్తున్నఅభ్యర్ధులలో ఎవరూ నచ్చకపోతే అటువంటి వారిని తిరస్కరించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలోతప్పనిసరిగా ‘రిజక్ట్’ బటన్ కూడా ఏర్పాటు చేయవలసిందేనని కోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల రాజకీయ పార్టీలు సరయిన అభ్యర్ధులను మాత్రమే పోటీలో నిలబెట్టగలవని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది.     మరో రెండు నెలలలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న ఈ తరుణంలో సుప్రీంకోర్టు ఇటువంటి ఆదేశాలు జారీ చేయడం అన్ని రాజకీయ పార్టీలకు కూడా జీర్ణించుకోవడం కష్టమే. గనుక మళ్ళీ అన్ని రాజకీయపార్టీలు చేతులు కలిపి కోర్టు తీర్పుని రద్దు చేస్తూ త్వరలోనే మరో మారు చట్ట సవరణ చేస్తారేమో!

రాజీనామాలు వెనక్కి తీసుకొండి ; అశోక్‌బాబు

  ఇన్నాళ్లు ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలని పట్టుపట్టిన అశోక్‌బాబు ఇప్పుడు మాట మార్చారు. ఎమ్మెల్యేలు రాజీనామలు చేయాల్సిన అవసరం లేదన్న ఆయన ఇప్పటికే రాజీనామ చేసిన వారిని కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరారు. అంతేకాదు ఈ విషయంపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు లేఖ రాయనున్నట్టుగా ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదన్న అశోక్‌ బాబు ఎంపిలను మాత్రం రాజీనామ చేయమంటున్నారు. అసెంబ్లీలో రాష్ట్రవిభజన తీర్మానాన్ని వ్యతిరేకించటానికి ఇక్కడ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండలాని, అలాగే కేంద్రంలో బిల్లు వీగిపోవాలంటే అక్క బలం ఉండకూడదని అందుకే రాష్ట్ర నాయకులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అశోక్‌బాబు వివరించారు. ఇప్పటికే దాదాపు 60 రోజులుగా ఉద్యమం ఉదృతంగా జరగుతున్న కేంద్రంలో చలనం లేదని కాబట్టి నాయకులు పార్టీల మీద వత్తిడి తీసుకొచ్చి సమైక్యా రాష్ట్రం కోనసాగేలా నాయకులు కృషి చేయాలని కోరారు.

డిజిపిగా కొన‌సాగ‌నివ్వండి ప్లీజ్‌

  ఈ నెల 30తో డిజిపి దినేష్ రెడ్డి ప‌ద‌వి కాలం ముగుస్తుండ‌టంతో, త‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగించాలంటూ డీజిపి క్యాట్‌ను ఆశ్రయించారు. అయితే దీనిపై గురువారం విచారించిన క్యాట్ డీజిపి అభ్యర్ధన‌ను తిర‌స్కరించింది. దినేష్ రెడ్డిని ఇక కొన‌సాగించ‌బోమ‌ని ప్రభుత్వం క్యాట్‌కు నివేదిక ఇవ్వటంతో క్యాట్ డిజిపి కొన‌సాగింపును తొసి పుచ్చింది. త‌న రిటైర్‌మెంట్ వ‌య‌సు కాకుండా బాధ్యత‌లు స్వీక‌రించిన ద‌గ్గర నుంచి 2 సంవ‌త్సరాల పాటు త‌న‌ను ప‌దవిలో కొన‌సాగ‌నివ్వాల‌ని డిజిపి క్యాట్‌కు తెలిపారు. సుప్రీం తీర్పు ఆధారంగానే తన నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.  కాగా దినేష్ రెడ్డి పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది.

30న గవర్నర్ తో జగన్ భేటి

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత మొదటిసారిగా గవర్నర్ నరసింహన్ కలవబోతున్నారు. సమైక్యాంధ్ర తీర్మానం అసేంబ్లీలో చేయాలని, తెలంగాణ తీర్మానాన్ని ఓడించాలని కోరుతూ గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. గవర్నర్ సెప్టెంబర్ 30 తేదిన సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్ మెంట్ కేటాయించారు.   ప్రత్యేకంగా అసేంబ్లీని సమావేశ పరిచి సమైక్య తీర్మానం చేయాలని జగన్ కోరనున్నారని పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలిపారు. అసేంబ్లీ తీర్మానం తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను ఆమోదించుకోనున్నారు.    ఇక వచ్చే నెల 1,2 తేదీలలో కడప జిల్లాలోని ఇడుపుల పాయకు వెళ్లేందుకు, నాలుగో తేదీన గుంటూరుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో ఈ రోజు పిటీషన్ దాఖలు చేశారు.    

జగన్ వైపు విశ్వరూప్..!

      రాష్ట్ర మంత్రి విశ్వరూప్ రాజీనామాతో కాంగ్రెస్‌లో కలకలం చెలరేగింది. గత కొంత కాలంగా విశ్వరూప్  వైఎస్ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారు.  ఈ రోజు గవర్నర్ నరసింహన్‌కు తన రాజీనామా లేఖను సమర్పించిన విశ్వరూప్ త్వరలో వైకాపాలో చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రేపో, ఎల్లుండో జగన్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.     గవర్నర్ నరసింహన్‌కు రాజీనామా లేఖ సమర్పించిన తరువాత మీడియా తో మాట్లాడుతూ...ఏపీ ఎన్జీవోల సమ్మెకు మద్దతుగా తాను రాజీనామా చేశానని అన్నారు. ఇంతవరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగమని చెప్పినందువల్లే రాజీనామా చేయకుండా ఆగానని చెప్పారు. 60 రోజులుగా సీమాంధ్ర ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. తన రాజీనామా గవర్నర్ ఆమోదించారనే భావిస్తున్నట్లు చెప్పారు.  

కాంగ్రెస్ రాష్ట్ర విభజన సమస్యను కొత్త ప్రభుత్వం పైకి నెట్టేస్తుందా

  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసి ఇప్పటికి దాదాపు రెండు నెలలు పూర్తి కావస్తున్నా, సమైక్యాంధ్ర ఉద్యమాలు, సీమాంధ్ర నేతల ఒత్తిళ్ళ కారణంగా ఇంతవరకు విభజన ప్రక్రియను మొదలుపెట్టలేకపోతోంది. కానీ, తన నిర్ణయంపై ఎట్టి పరిస్థితుల్లో వెనకడువేసే ప్రసక్తే లేదని మాత్రం చాలా గట్టిగా పదేపదే చెపుతోంది. అంటే జాప్యం చేస్తూ సీమాంద్రులని, విభజన ఆపేది లేదని తెలంగాణా ప్రజలని ఇరువురినీ మభ్యపెడుతూ రోజులు నెట్టుకొస్తోందన్నమాట. ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేస్తానని చెపుతున్నపటికీ అది చేసే వరకు ఎవరికీ నమ్మకం లేదు.   నరేంద్ర మోడీ ప్రధాని పదవి చెప్పట్టేందుకు ఉన్నఅన్నిఅడ్డంకులను ఒకటొకటిగా తొలగించుకొని వస్తూ ఎలాగయినా ఈ సారి పార్టీని ఎన్నికలలో గెలిపించుకొని ప్రధాని పదవి చెప్పట్టాలని ఉత్సాహం చూపిస్తుంటే, ప్రధాని పదవి చెప్పటేందుకు యావత్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఎర్రతివాచీ పరిచి మరీ స్వాగతం చెపుతున్నా ఆయన ఆ పదవి చెప్పట్టేందుకు ఆసక్తి చూపక పోగా “ప్రజల కలలను నెరవేర్చేందుకు తన కలలను చంపుకొంటానని” పలికి కాంగ్రెస్ పార్టీని తీవ్ర నిరాశపరిచారు.   ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక అత్యంత సాహసోపేత నిర్ణయం-‘తెలంగాణా ఏర్పాటు’ ప్రకటన చేసింది. కానీ తీరా చేసి దానిని ఇప్పుడు అమలు చేయడానికి మీన మేషాలు లెక్కపెడుతోంది. ఒకవేళ ఏర్పాటు చేసినా వచ్చే సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండు రాష్ట్రాలలో, కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం కూడా లేదు. గనుక, ఈ సమస్యను వీలయినంత వరకు సాగదీసే అవకాశాలే ఎక్కువున్నాయి.   ఒకవేళ రానున్న ఎన్నికలలో గెలిస్తే ఈ సమస్యను పరిష్కరించడం, ఓడిపోయే సూచనలు కనిపిస్తే ఈ సమస్య మరింత ముదిరి పాకాన పడే విధంగా ఆఖరి నిమిషంలో మరికొన్నివివాదస్పదమయిన నిర్ణయాలు ప్రకటించవచ్చును. తద్వారా రాబోయే ప్రభుత్వానికి కూడా రాష్ట్ర విభజన సమస్య ఒక గుదిబండలా తయారు చేసి చేతులు దులుపుకొని బయటపడవచ్చును. అప్పుడు కొత్త ప్రభుత్వం ఈ సమస్యతో కుస్తీలు పడుతుంటే కాంగ్రెస్ పార్టీ వినోదిస్తూ, కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని ఉంటే ఈ సమస్యను అవలీలగా తెల్చిపారేసేవారమని ఉత్తర కుమార ప్రగల్భాలు పలకవచ్చును.