మోడీ ప్రభంజనంతో దిక్కుతోచని కాంగ్రెస్ పార్టీ

  బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ సుడిగాలిలా దేశాన్నిచుట్టేస్తూ మోడీ చేస్తున్న ప్రసంగాలతో దేశప్రజలు, ముఖ్యంగా యువత చాలా ప్రభావితులవుతున్నారు. ఒకప్పుడు మాజీ ప్రధాని వాజపేయికి ఎంత ఆదరణ ఉండేదో, నేడు మళ్ళీ బీజేపీలో మోడీకి అంత ఆదరణ కనబడుతుండటంతో 2014ఎన్నికల తరువాత మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ఆ పార్టీ అగ్ర నేతలలో కూడా ఇప్పుడు నమ్మకం ఏర్పడుతోంది. అందువలన ఇంతవరకు పార్టీలో ఆయనపట్ల ఉన్న వ్యతిరేఖ భావనలు కూడా క్రమంగా సమసిపోతున్నాయి.    భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఉద్దేశ్యించి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అవమానకర వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ స్పందించకపోయినా, మోడీ “మా దేశ ప్రధానిని ఏమయినా అంటే కబడ్దార్” అంటూ వెంటనే తీవ్రంగా హెచ్చరించడంతో మోడీపట్ల ప్రజలలో మరింత అభిమానం పెరిగింది. తమ పార్టీకి చెందిన ప్రధానిని మోడీ వెనకేసుకు వస్తూనే, మరోపక్క అయన అసమర్దుడని విమర్శిస్తుంటే, కాంగ్రెస్ మోడీని ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక తికమక పడుతోంది. పైగా మోడీ వాక్చాతుర్యం, ఆయన మాటలలో ప్రజ్వలించే దేశభక్తి కాంగ్రెస్ నేతలెవరిలో లేకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి దిగులు పుట్టిస్తోంది.   అయితే ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే కాక, తను నిర్దేశించుకొన్న సమున్నత లక్ష్యాల గురించి కూడా వివరిస్తూ, అందులో తాము కూడా భాగస్వాములమేననే భావన ప్రజలలో కలిగిస్తూ అన్ని వర్గాల ప్రజలను మమేకం చేసుకుపోతున్నారు. మానవ వనరులకు కొదవలేని మన దేశంలో దానిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవచ్చునో ఆయన చెపుతుంటే యువత ఆయనకి జేజేలు పలుకుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆయన విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ, ప్రజలు ఎంత మాత్రం నమ్మని ఆహార భద్రత, భూసేకరణ చట్టం, నగదు బదిలీ పధకం వంటివి వల్లెవేస్తూ ఉన్న నమ్మకం కూడా పోగొట్టుకొంటోంది. ఇటువంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నకాంగ్రెస్ పార్టీ ఆయనను గుజరాత్ అల్లర్లతో, నఖిలీ ఎన్కౌంటర్ కేసులతో గట్టిగా ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.   దానిపై కూడా మోడీ తనదయిన శైలిలో స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తన చేతిలో ఉన్న సీబీఐ, రా, ఈడీ, ఆధాయశాఖ మరి దేనిని తనమీద ప్రయోగించినా తానూ బయపడేది లేదు, లొంగేదీ లేదని చెప్పడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం కాళ్ళకి ముందే బంధం వేసారు. ఇప్పుడు ఆయనపై కాంగ్రెస్ వీటిలో ఏ ఒక్క శాఖను ఉసిగొల్పినా, ప్రజలకు అయన కాంగ్రెస్-సీబీఐ బంధం గురించి చెప్పినవన్నీ నిజమని మరింత నమ్మకం కలుగుతుంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం కలిగి ప్రమాదం ఉంది.   బహుశః ఈ సారికి కాంగ్రెస్ పార్టీ కూడా ‘నమో నమో’ అనుకొంటూ పక్కకు తొలగి ఆయనకు దారీయక తప్పదేమో?

మోడితో భేటి అవ్వనున్న బాబు

  రాష్ట్రంతో పాటు, కేంద్రంలోనూ ఎన్నికల వేడి మొదలవుతుండటంతో చంద్రబాబు కేంద్ర రాజకీయలమీద దృష్టి పెడుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి పలువరు జాతీయ నాయకులతో చర్చించిన చంద్రబాబు బుధవారం మరోసారి ఢిల్లీ వెళ్లారు. అయితే వచ్చే ఎన్నికల్లో బిజెపికే విజయావకాశాలు ఎక్కవేని అన్ని సర్వేలు చెపుతుండటంతో బాబు కూడా బిజెపితో పొత్తు దిశగా పావులు కదుపుతున్నారు. అందులో బాగంగానే బుధవారం డిల్లీకి వెళుతున్న ఆయన బిజెపి ప్రదాని అభ్యర్థి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడితో సమావేశం అవుతారన్న వార్త బలంగా వినిపిస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపధ్యంలో రాష్ట్ర పరిస్థితులు తెలంగాణ ఏర్పాటు వంటి అంశాలను ఆయనతో చర్చించనున్నారు. అయితే గతంలో కాంగ్రెస్‌, బిజెపియేతర పార్టీలతో మూడో ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా బలంగా ప్రయత్నించిన బాబు, ఆ ప్రయత్నాలు ఫలించకపోవటంతో ఇప్పుడు బిజెపితో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారు.

తెలంగాణ ఏర్పాటుకు అత్యధిక ప్రాదాన్యత

  రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా కేంద్ర మాత్రం విభజన దిశగానే అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ప్రదాని మన్మోహన్‌ సింగ్‌ మరోసారి రాష్ట్రవిభజన తమ తొలి ఎజెండా అని వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరిన ప్రధాని మన్మోహన్ ప్రత్యేక విమానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ వెళ్లగానే హోం మంత్రి సుశీల్‌కుమార్‌ తో సమావేశమై, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకుంటానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మనసులో తెలంగాణ ఏర్పాటు అత్యదిక ప్రదాన్యత కలిగిన అంశం అని ఆయన పిటిఐ తో తెలిపారు. దీనితో పాటు దోషులుగా రుజువన వారు చట్టసభల్లో ప్రవేశించవచ్చు అంటూ కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ విషయంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాహుల్‌ ఏ పరిస్ధితుల్లో ఆ వ్యాఖ్యలు చేశారో అడిగి తెలుసుకుంటామన్నారు. రాజీనామా చేసే ప్రసక్తి లేదన్న ప్రధాని, రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఎదుర్కోనేందుకు అన్ని లౌకిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

లాలూ తరువాత జగన్

      ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు పట్టిన గతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి పడుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. లాలూ మాదిరిగా జగన్ దోషిగా రుజువు కావడం తథ్యమని అన్నారు. రూ.950 కోట్ల దాణ కుంభకోణం కేసులో లాలూ దోషిగా తేలినట్టే లక్ష కోట్ల రూపాయల కుంభకోణంలో జగన్ కూడా దోషిగా తేలుతాడని తెలిపారు. తాను పదహారు నెలలు జైళ్లో ఉన్నానని ప్రచారం చేసుకుంటూ జగన్ ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని యనమల విమర్శించారు. రాష్ట్ర విభజనకు అనుకూలమని, సహకరిస్తానని జగన్ సోనియాకు మాట ఇచ్చి అసెంబ్లీ ఏర్పాటు ద్వారా అందుకు సహకరించాలని చూస్తున్నారని యనమల ఆరోపించారు. జగన్ నీతి వ్యాఖ్యలు వల్లించడం సెక్యులరీజం గురించి జగన్ మాట్లాడ్డాం విడ్డూరంగా ఉందని, సైతాన్ బైబిల్ చదివినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఒక కుంభకోణం కేసులో నిందితునికి గవర్నర్ ఎలా అపాయింట్‌మెంట్ ఇస్తారని యనమల ప్రశ్నించారు.

విజయమ్మ చిలుకపలుకులు

      పరకాల ఉప ఎన్నికల సమయంలో విజయలక్ష్మి చిలుకపలుకులు పలికారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ పై మాట మార్చినవారాని ద్రోహులుగానే పరిగణిస్తామని అన్నారు. ఓయూ విద్యార్థులను తాలిబన్లతో పోల్చినప్పుడు అది మీకు సంస్కారమనిపించిందా అని అడిగారు. సీమాంధ్ర నేతలు రాక్షసులని అనలేదని, తానేమీ మాట్లాడినా తప్పు అనడం దత్తాత్రేయ, నారాయణకు అలవాటైపోయిందని మండిపడ్డారు.     తెలంగాణ రాష్ట్రం కోసం రెండు నెలలుగా సహనంతో ఉన్నామని, తమ సహనాన్ని అలుసుగా భావించవద్దని హెచ్చరించారు. అశోక్‌బాబు కోట్లాటకు రమ్మని ఉసుగొల్పడం సంస్కారమా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను పాకిస్థాన్‌తో పోల్చిన వైకాపా ఇక్కడ సభ ఎందుకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ పెడితే ఏం జరుగుతుందో అదే జరుగుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర నాయకులు అవాకులు చవాకులు మానుకోవాలని, సంస్కారవంతంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

పాకిస్తాన్ లో జగన్ సభ ఎలా పెడతారు?

        వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల హైదరాబాద్ ను పాకిస్తాన్ అంటే, ఆయన ఇక్కడ సభ పెడతానంటారా అని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. రాష్ట్ర విభజన గురించి తన వద్దకు వచ్చిన జగన్ కు గవర్నర్ ఎలా కలిసేందుకు అనుమతి ఇస్తాడు ? అక్రమంగా ప్రజల సొమ్ము దోచుకుని జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన జగన్ ను కలవడం ఎలాంటి సంకేతాలు సమాజానికి ఇస్తుంది ? రేపు హత్య చేసిన వాడు కూడా వస్తే గవర్నర్ ఆహ్వానిస్తాడా ? అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఇంకా జగన్ మీద కేసులు విచారణలోనే ఉన్నాయని, ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించిందని అలాంటి వ్యక్తి బెయిలు మీద బయటకు వస్తే ఆరుగంటల పాటు ఊరేగింపుగా ఇంటికి వెళ్తే పోలీసులు రక్షణ ఎలా కల్పిస్తారని వీహెచ్ ప్రశ్నించారు. రేపు హత్య చేసిన వాడు ఊరేగింపు చేస్తే ఇలాగే భద్రత ఇస్తారా ? అని ప్రశ్నించారు. జగన్ హైదరాబాద్ సభకు ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వొద్దని, అనుమతి ఇస్తే తెలంగాణ వాదులు ఊరుకోరని హెచ్చరించారు.

హైదరాబాదుపై క్యాబినెట్ చర్చ, నిర్ణయం?

మొన్న హైదరాబాదులో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ తనతో కాంగ్రెస్ అధిష్టానం పూర్తి ‘టచ్చు’లోనే ఉందని అక్టోబరు ఆరులోగా అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్లగ్గు పీకేయబోతున్నదని ప్రకటించారు. ప్లగ్గు పీకడం సంగతి ఎలా ఉన్నపటికీ కాంగ్రెస్ అధిష్టానం, కేసీఆర్ తో బాటు బీజేపీ అధిష్టానంతో కూడా పూర్తి టచ్చులోనే ఉన్నట్లు సమాచారం.   రాష్ట్ర విభజన సజావుగా జరగాలంటే హైదరాబాదుపై కొంత పట్టువిడుపులు తప్పవని కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్ మరియు టీ-కాంగ్రెస్ నేతలకి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా విభజనకు అంగీకరిస్తేనే హైదరాబాదుపై సీమాంద్రా నేతల డిమాండ్లను కొన్నిటినయినా నేరవేర్చగలమని వారికి నచ్చచెపుతున్నట్లు తెలుస్తోంది.   ఈ విషయంలో బీజేపీ అధిష్టానాన్నికూడా సంప్రదిస్తూ దానిపై వారి సలహా, సూచనలు తీసుకొంటునట్లు తెలుస్తోంది. తద్వారా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ ఆలోచన. కొద్ది రోజుల క్రితం వరకు ‘సమన్యాయం’ అని మాట్లాడిన బీజేపీ అందుకే తన వైఖరి మార్చుకొని ఉంటుంది. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మెహబూబ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తమ పార్టీ పార్లమెంటులో తెలంగాణా బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తుందని ప్రకటించడమే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చును.   రేపు జరుగబోయే క్యాబినెట్ సమావేశంలో హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే ప్రవేశపెట్టబోయే టీ-బిల్లులో ఈ ప్రతిపాదనలు ఉండవచ్చునని తాజా సమాచారం. 1. గ్రేటర్ హైదరాబాదు మొత్తం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది.   2. విద్య, వైద్యం, ఉద్యోగాలు, లా అండ్ ఆర్డర్, భూశిస్తు, మరియు ఇతర ఆదాయ వనరులన్నీ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి.   3. ప్రస్తుతం హైదరాబద్, సైబరాబాద్ రెండు పోలీస్ కమీషనరేట్లను గ్రేటర్ హైదరాబాదు పరిధిలోకి తీసుకు వస్తారు.   4. ముందు ప్రకటించినట్లుగానే హైదరాబాద్ తెలంగాణా లో అంతర్భాగంగా, తెలంగాణా రాజధానిగా ఉంటుంది. అదే సమయంలో మరో పది సంవత్సరాల వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.   ఈ ప్రతిపాదనలకు సీమాంధ్ర, టీ-నేతలు అంగీకరించినట్లయితే వెంటనే విభజన ప్రక్రియ మొదలవుతుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజదానిని ఎక్కడ నిర్మించాలనే విషయంపై సీమంద్రా నేతలతో సంప్రదింపులు మొదలవుతాయి.

కాంగ్రెస్ పార్టీకి కేవలం సీబీఐపై మాత్రమే అదుపుంది: మోడీ

  కాంగ్రెస్ పార్టీ తన పెంపుడు చిలుకలయిన సీబీఐ, ఈడీ, ఆదాయ శాఖలను ప్రయోగించి తన రాజకీయ ప్రత్యర్ధులను భయపెట్టి, బెదిరించి లొంగదీసుకొంటుందని కేవలం బీజేపీయే కాక యూపీయే ప్రభుత్వానికి బయటనుండి మద్దతు ఇస్తున్నమాయావతి, ములాయం సింగ్ తదితరులు కూడా ఆరోపిస్తుంటారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగిన నరేంద్ర మోడీ ఇంటిపై కూడా గత ఏడాది కాలంగా సీబీఐ చిలుకలు వాలి చాల హడావుడి చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే తనను సీబీఐ, ఈడీ, లేదా మరే పెంపుడు చిలుకలు భయపెట్టి లొంగదీసుకోలేవని మోడీ అన్నారు.   నిన్న ఒక కార్యక్రమంలో పాల్గొనాదానికి ముంబై వచ్చిన మోడీ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ “యూపీఏ ప్రభుత్వం నానాటికి పతనమవుతున్న రూపాయి విలువ పడిపోకుండా చర్యలు తీసుకొంటానని చెపుతుంది, కానీ రూపాయి పతనం ఆగలేదు. కారణం దానికి దేశంలో ఏ సంస్థపైన పట్టు అదుపు లేదు. కానీ సీబీఐ, ఈడీ, ఆదాయ శాఖల వంటి వాటిపై మీద మాత్రం పూర్తి పట్టు ఉంది. నాతో ఎవరెవరు ఫోటోలు దిగుతున్నారు, ఎవెరవరు కలుస్తున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరు దండలు వేస్తున్నారు వంటి వివరాలన్నీ ఉన్నవీడియోలను తెప్పించుకొని చూస్తూ వారిపైకి సీబీఐ, ఆదాయశాఖలను ఉసిగొల్పుతుంది. అయితే నేను ఇటువంటి వాటికి ఎంత మాత్రం భయపడను. నాపైకి సీబీఐని ఉసిగొల్పి నన్ను భయపెట్టి లొంగ దీసుకోవాలని ప్రయత్నించినా నేను భయపడను, లొంగను,” అని మోడీ అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్ననరేంద్ర మోడీకే ఈ బాధలు తప్పకపోతే, ఇక మిగిలిన వారి సంగతేమిటి?

ఆయనకు మూడు కళ్ళట

  చంద్రబాబు తనకి ఆంద్రా,తెలంగాణా ప్రాంతాలు రెండు కళ్ళవంటివని చెపితే, ఆయనకంటే తనకి మరో కన్నుఎక్కువుందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు తనకు మూడు కళ్ళవంటివని అన్నారు. అయితే ప్రస్తుతం ఆయన పార్టీ ముందు సీమంద్రాలో తన రెండు కళ్ళను కాపాడుకొనే ప్రయత్నంలో ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ప్రయత్నంలోనే ఆయన తన మూడో కన్నుతెరిచి హైదరాబాదులో సమైక్య శంఖారవం పూరించబోతున్నారు. తెలంగాణ ఏర్పాటయితే కుప్పం నుండి శ్రీకాకుళం వరకు నీటి సమస్యలు వస్తాయని చెపుతూనే, తనకు పట్టం కడితే తెలంగాణా ప్రజల కోసం ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులను పూర్తిచేస్తానని వాగ్ధానం చేసారు. తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకిస్తూ హైదరాబాదులో సభ పెట్టబోతూ, అక్కడి ప్రజలు తనకు ఓటేసి గెలిపిస్తే వారందరినీ అభివృద్ధి పథం వైపు నడిపిస్తానని వాగ్దానం చేసారు. మరి తెలంగాణా ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

క్యాబినెట్ సమావేశంతో కాంగ్రెస్ హడావుడి

  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అంశం భుజాలకెత్తుకొన్నపటి నుండి నేటి వరకు దానిని సమర్ధంగా పరిష్కరించలేక ఎప్పటికప్పుడు కోర్ కమిటీలు, అంటోనీ కమిటీలు, టీ-నోట్, కేంద్ర మంత్రుల, నేతల వ్యాఖ్యలతో రోజులు నెట్టుకు వస్తోంది. రాష్ట్రంలో ఏదయినా హడావుడి కనబడగానే అది డిల్లీలో కూడా ప్రతిఫలిస్తుంటుంది. అంత మాత్రాన్నఅక్కడేదో కీలక నిర్ణయాలు జరిగిపోతాయని కాదు. కేవలం ప్రజలని, పార్టీలని, చివరికి తన స్వంత పార్టీ నేతలని భ్రమింపజేయడానికి మాత్రమే ఆ డ్రామా అంతా.   గత వారంలో కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ తిరుగుబాటు జండా ఎగురవేయడం, కేసీఆర్ ‘కాంగ్రెస్ కాకుంటే బీజేపీ ఉండనే ఉందని’ ప్రకటించడం, జగన్ కూడా మోడీని పొగిడి, ఆయన బీజేపీని సెక్యులర్ దారికి తీసుకువస్తే మద్దతు ఇవ్వచ్చుననట్లు మాట్లాడటం, తెదేపా బీజేపీల మధ్య వికసిస్తున్న స్నేహబంధం, ఏపీయన్జీవోలు మరో 15రోజుల సమ్మెకు సిద్దపడటం వంటి అనేక పరిణామాలతో మేల్కొన్నకాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ రేపు క్యాబినెట్ సమావేశంతో హడావుడి చేయనుంది.   ప్రస్తుత పరిస్థితుల్లో టీ-నోట్ రాష్ట్ర శాసనసభకు పంపడం వలన భంగపాటు ఎలాగు తప్పదు. అంతే గాక స్వయంగా రాష్ట్ర ప్రభుత్వాన్నికూల్చుకోవలసిన పరిస్థితి దాపురిస్తుంది. అయినప్పటికీ సమస్యలేవీ పరిష్కారం కాకపోగా మరింత చిక్కుముడులు పడవచ్చును. అందువలన టీ-నోట్ పై క్యాబినెట్ సమావేశంలో మళ్ళీ మరో మారు చాలా లోతుగా అధ్యయనం చేసేసిన తరువాత ఏవో కొన్ని సూచనలతో హోంశాఖకు దానిని త్రిప్పిపంపి చేతులు దులుపుకోవచ్చును. తద్వారా టీ-నోట్ ను క్యాబినెట్ లో చర్చించినందుకు అటు టీ-నేతలను, దానిని ముందుకు కదపకుండా అక్కడే ఉంచుతూ ఇటు-సీమాంధ్ర నేతలను చల్లబరిచే ప్రయత్నం చేయవచ్చును.   ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫలానా జిల్లాలను రాజధానిగా చేయడానికి పరిశీలిస్తున్నామని ప్రకటించడం ద్వారా సీమాంధ్రలో ఉద్యమాలను, ఉద్యోగుల సమ్మెలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయవచ్చును. రాజధానికోసం వారందరూ కత్తులు దూసుకొంటుంటే కాంగ్రెస్ అధిష్టానానికి మరికొంత సమయం చిక్కుతుంది. ఒకవేళ ఇదే కారణంగా ఉద్యమాలు సమ్మెలు నిలిచిపోతే అప్పుడు ఇక తనను ప్రశ్నించేవరెవరూ ఉండరు గనుక తాపీగా రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుపెట్టవచ్చును.

ఇడుకులపాయకు ఓకే, గుంటూరుకు నో

  అక్రమాస్తుల కేసులో 16 నెలల రిమాండ్‌ తరువాత వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ లభించింది. దీంతో హైదరాబాద్‌ విడిచి ఎటూ వెళ్లడానికి అవకాశం లేని జగన్‌ తనను ఇడుకులపాయతో పాటు గుంటూరుకు వెళ్లటానికి అవకాశం కల్పించాలని కోర్టును కోరారు. అయితే తన తండ్రి సమాధిని చూడటానాకి ఇడుకులపాయకు వెళ్తానన్న జగన్‌ అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించిన కోర్టు, పార్టీ కార్యక్రమంగా గుంటూరులో చేస్తున్న రైతు గర్జనకు వెళ్లటానికి జగన్‌కు అనుమతి నిరాకరించింది. దీంతో 1,2 తారీఖుల్లో జగన్‌ ఇడుకులపాయ వెళ్లనున్నారు. అయితే మరి గుంటూరు వెళ్లే విషయమై జగన్‌ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

వైసిపిలోకి కొనసాగుతున్న వలసలు

  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌పై విడుదల అయిన దగ్గర నుంచి రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు అధికార ప్రతిపక్ష పార్టీలతో పొసగక అసమ్మతి వర్గంగా ముద్రపడిన నాయకులు వైసిపి తీర్ధం పుచ్చకోవటానికి రెడీ అవుతున్నారు. ప్రస్థుత రాజకీయాల్లో విజయావకాశాలతో పాటు బలమైన నేతగా పేరున్న జగన్‌ పార్టీలో చేరడానికి ఎక్కువ మంది నాయకులు సుముఖంగా ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా మంది నాయకులు జగన్‌ పార్టీలో చేరగా తాజా కాంగ్రెస్‌ పార్టీ ఎంపి ఎస్‌పివై రెడ్డి జగన్‌ పంచన చేరారు. వీరితో పాటు సిబిఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ధర్మాన కూడా జగన్‌ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే కేసులులో చాలా రోజులుగా జైళ్లో ఉండి ఇటీవలే బయటికి వచ్చిన మోపిదేవి వెంకటరమణ కూడా వైసిపిలో చేరడానికి పావులు కదుపుతున్నారు. ఇక ఇటీవల రాజీనామ చేసిన మంత్రి విశ్వరూప్‌తో పాటు, రాజీనామలకు సిద్దమయిన ఎంపిలు సాయిప్రతాప్‌, అనంత వెంకటరామిరెడ్డిలు కూడా జగన్‌తో జతకట్టాలనుకుంటున్నారు. ప్రస్థుతం ఉన్న పరిస్థిత్తుల్లో సమైక్యాంద్ర కోసం బలంగా పోరాడుతున్న పార్టీ వైసిపి క్రెడిట్‌ సాధించటంతో పాటు అర్ధబలంగా కూడా బాగా ఉన్న జగన్‌ పంచన ఉంటే రాబోయే ఎలక్షన్స్‌లో ఈజీగా గట్టెక్కేయోచ్చని భావిస్తున్నారు చాలా మంది నేతలు. ఇది ఇలాగే కొనసాగితే మరింద మంది నాయకులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

టిడిపికి కాపుల అండ

  కేంద్రం తెలంగాణ ప్రకటించిన తరువాత అన్ని పార్టీల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు అధికార పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని భావించిన నేతలు కేంద్ర ఏమాత్రం వెనక్కి తగ్గకపోవటంతో ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా కాపు సామాజికి వర్గానికి చెందిన చాలా మంది నేతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే పలువురు నేతలు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి సంకేతాలు పంపగా, మరి కొంత మంది అదే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన కాపులు, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటంతో డైలామాలో పడ్డారు. అయితే ఇప్పుడు సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న నేపధ్యంలో కొందరు నేతలు తమ భవిష్యత్ ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా కోస్తా, రాయల సీమలలో స్థానిక రాజకీయాల్లో బలంగా ఉన్న కాపులు తెలుగుదేశంలో చేరే అవకాశా లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా చిరంజీవికి ప్రధాన అనుచరులలో ఒకరైన మంత్రి గంటా శ్రీనివాసరావు తన మాతృ సంస్థ అయిన తెలుగుదేశం పార్టీలో చేరుతారని కొంతకాలంగా బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరనున్నరన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

విశ్వసనీయత జాగాలో వచ్చి చేరిన కొత్త పదం నిజాయితీ

  ఇంతకు ముందు వైకాపా ‘విశ్వసనీయత’కు పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడేది. కానీ తెలంగాణాలో జండా పీకేసినప్పటి నుండి దైర్యంగా ఆ పదం పలకలేకపోతోంది. దానికి బదులు ఇప్పుడు కొత్తగా ‘నిజాయితీ’ అనే పదం అందుకొంది. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలని చెపుతున్నజగన్, కేంద్రం రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తరువాత ఆయన పార్టీ అన్ని రంగులు ఎందుకు మార్చిందో, ఆ క్రమంలో తెలంగాణా ప్రజలను, కొండా సురేఖ వంటి తన పార్టీ నేతలను నిర్దాక్షిణ్యంగా ఎందుకు వదిలించుకొందో మరిచిపోయినట్లున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్నప్పుడు ఆయన పార్టీ అంత హటాత్తుగా తెలంగాణాను ఎందుకు వదిలిపెట్టవలసి వచ్చిందో చెప్పాల్సి ఉంది.   అదే విధంగా, ఇంతవరకు ఆయనకు, ఆయన పార్టీకి అండగా నిలిచిన కాంగ్రెస్ యంపీ సబ్బం హరిని, కనీసం పిలిచి సంజాయిషీ అయినా కోరకుండా, మీడియా ద్వారానే ‘అతనికి మాకు సంభందం లేదని’ చెప్పి వదిలించుకోవడం ఎటువంటి నిజాయితీ? పైగా అంత నమ్మకస్తుడిగా పనిచేసిన సబ్బం హరికి వైకాపా చివరిగా ఇచ్చిన బహుమానం ఏమిటంటే ‘కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగస్తుడనే ముద్ర.’ దీనిని ఎటువంటి రాజకీయం అనాలి?   జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా సమైక్యాంధ్ర గురించి పోరాడితే ఎవరు తప్పపట్టారు. ఇతర పార్టీలతో ప్రమేయం లేకుండా తన పోరాటమేదో తను చేసుకొంటే నచ్చిన వారు వచ్చి కలుస్తారు. నచ్చని వారు దూరంగా ఉంటారు. కానీ ఆ పేరుతో సీమాంద్రాలో పార్టీని బలపరచుకోవడం, ఆ మిషతో తన ప్రత్యర్ధులను రాజకీయంగా దెబ్బతీయాలనుకోవడం గర్హనీయం.   ఒకవేళ ఆయనకున్నంత ‘నిజాయితీ’ ఈ రాష్ట్రంలో మరెవరికీ లేదని ప్రజలు భావిస్తే, వారే ఇతర పార్టీలకు, నేతలకు తగిన గుణపాఠం చెపుతారు. ఆ శ్రమ ఆయనెందుకు తీసుకోవడం? ముందు తన నిజాయితీ ఏమిటో నిరూపించుకొంటే చాలు కదా?

హైదరాబాదులో వైకాపా సమైక్యశంఖారవం సభ త్వరలో

  ఈ రోజు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన శాసనసభ్యులతో కలిసి గవర్నర్ నరసింహన్ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు గాను శాసనసభను సమావేశపరచమని ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ “కాంగ్రెస్ అధిష్టానం విభజనకు అంతా సిద్దం చేసి, టీ-నోట్ ను శాసనసభ అమోదానికి పంపినప్పుడు, శాసనసభ దానిని వ్యతిరేఖించినా దానివల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. అదే ఇప్పుడే శాసనసభను సమావేశపరచి రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి కేంద్రానికి ముందే ఆ తీర్మానాన్ని పంపినట్లయితే అప్పుడు కేంద్రం కూడా పునరాలోచించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వైకాపా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని లేఖ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా తెదేపా, కాంగ్రెస్ పార్టీలు కూడా లేఖలు ఇచ్చినట్లయితే తప్పకుండా రాష్ట్ర విభజన నిలిచిపోతుంది. మా పార్టీ వచ్చేఅక్టోబర్ 15-20 తేదీల మధ్య హైదరాబాదులో సమైక్యశంఖారవం పేరిట ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టిగా డిమాండ్ చేస్తుంది,” అన్నారు.  

లాలూకి మరిక గడ్డి మేసే అవకాశం దక్కదా

  కాంగ్రెస్ నేతృత్వంలో సాగుతున్న యూపీఏ ప్రభుత్వం క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులను వెనకేసుకు వస్తూ చేసిన చట్ట సవరణను తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శలు చేసిన రెండు మూడు రోజులలోపునే, పశువుల దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ని దోషిగా నిర్దారిస్తూ సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.   బీహార్ ముఖ్యమంత్రి పుణ్యమాని రాష్ట్రంలో అధికారానికి దూరంగా బ్రతకవలసివస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ కి ఇప్పుడు రాహుల్ గాంధీ విమర్శల కారణంగా యుపీఏ ప్రభుత్వం తను చేసిన చట్ట సవరణను రద్దు చేసినట్లయితే, 2014 ఎన్నికలలోకూడా పోటీ చేసే అవకాశం ఉండదు. ఆలూ (బంగాళా దుంపలు) ఉన్నంత కాలం లాలూయే బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడని స్వయంగా శలవిచ్చిన లాలూ ఇప్పుడు కటకటాలు పాలవడమే గాక, రాహుల్ పుణ్యమాని ఇక ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కోల్పోతే, మరి ఎన్నటికీ గడ్డిమేసే అవకాశం కూడా ఉండదేమో.   బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ మరియు జగన్నాథ్ మిశ్రాలను కోర్టు దోషులుగా నిర్దారించడంతో ఇరువురిని పోలీసులు అరెస్ట్ చేసి రాంచీలోని  జైలుకి తరలించారు. అక్టోబర్ 3న వారికి కోర్టు శిక్షలు ఖరారు చేస్తుంది.

జగన్ పార్టీలోకి ఆదినారాయణ రెడ్డి

      కడప జిల్లా జమ్మలమడుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సోమవారం ఆదినారాయణరెడ్డి జగన్‌ను కలిశారు. భేటీ ముగిశాక మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేసి జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు చెప్పారు. ఆదినారాయణ రెడ్డి జగన్ కు మొదటి నుంచి జగన్ కు మద్దతుగానే ఉన్నారు. ఐతే జగన్ జైలుకెళ్లిన కార్యక్రమంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ కు దూరంగా ఉన్నారు. జగన్ బయటికి రావడంతో మళ్లీ ఆయన చెంతకు చేరారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణం రాజు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.