supreme court

సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు

  ప్రజాప్రయోజన వ్యాజ్యం క్రింద దాఖలు చేయబడిన ఒక ప్రైవేట్ పిటిషను విచారణకు చేపట్టిన సుప్రీం కోర్టు ఈ రోజు సంచలనాత్మకమయిన తీర్పు వెలువరించింది. ఇంతవరకు క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిర్దారించబడిన ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధ్య చట్టంలో సెక్షన్ 8(4) నిబందన క్రింద పై కోర్టులకి అప్పీలుకి వెళ్ళడం ద్వారా అనర్హత వేటు నుండి తప్పించుకొంటున్నారు. ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు వెలువరిస్తూ రాజ్యాంగంలో ఈ నిబంధన న్యాయ సమ్మతం కాదని తేల్చి చెప్పింది. నేరం జరిగిన సమయం నుండే ప్రజా ప్రతినిధులకు అనర్హత వర్తిస్తుందని పేర్కొంది. అంటే ఎవరయినా ఒక ప్రజాప్రతినిధి నేరం చేసినట్లు ప్రాధమికంగా రుజువయితే, కోర్టు కేసులతో సంబంధం లేకుండా అతను లేదా ఆమెపై అనర్హత వేటు వేయవచ్చునని విస్పష్టంగా చెప్పింది. న్యాయ మూర్తులు యస్.జే.ముఖోపాద్యాయ, ఏకే.పట్నాయక్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పు వెలువరించే నాటికి ఉన్నత న్యాయ స్థానాలను ఆశ్రయించిన ప్రజాప్రతినిదులకి ఈ తీర్పు వర్తించదని పేర్కొంది.

ap cm

త్యాగమూర్తులకే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి

  దేవుడి దగ్గరకు వెళ్ళినా కూడా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మాత్రమే కోరుకొనే త్యాగామూర్తులయిన నేతలు మనకున్నారు. రాష్ట్రం విడిపోకుండా ఉండాలని, ప్రజలందరూ కలిసి మెలిసి సుఖంగా ఉండాలని కోరుకొన్నట్లు మన బొత్స బాబు శలవిచ్చారు.   “కొందరికి పదవులు ఏర్పరిచేందుకే రాష్ట్రం విడగొట్టబడుతున్నట్లయితే, నేను నా మంత్రి పదవిని, పీసీసీ అధ్యక్ష పదవిని కూడా త్యాగం చేసిపడేస్తానని” ఒకే ఒక పంచ్ డైలాగుతో, సమైక్యంగా ముఖ్యమంత్రి పదవి రేసులో ముందుకు దూసుకుపోతున్న లగడపాటి, రాయపాటి, వెంకటేష్, శైలజానాథ్ వంటి వారి కంటే అన్నివిధాల తానే పెద్ద త్యాగ మూర్తినని, అందువల్ల కొత్తగా ఏర్పడబోయే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కుర్చీకి తనే బాగా సూటవుతానని బొత్స చెప్పకనే చెప్పారు.   “ఇక రాష్ట్రం విడిపోయిన తరువాత నాకీ రాజ్యసభ సీటేందుకు, విశాఖ లోక్ సభ సీటు మాత్రం ఎందుకు? దాని మీద ముచ్చటపడుతున్న పురందేశ్వరికే నా సీటు ఇచ్చేస్తాను. ముప్పై ఏళ్లుగా దేశానికి, రాష్ట్రానికి, విశాఖ నగరానికి ఎనలేని సేవలందిస్తున్న నేను, కొత్తగా ఏర్పడుతున్న ఆంద్ర రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి గా నావంతు సేవలు నన్ను చేసుకోనీయండి” అని సుబ్బిరామిరెడ్డి అంటే, “అసలు ఇంతపెద్ద సమైక్య రాష్ట్రాన్నిఒంటి చేత్తో ఏలుతున్న నా సంగతి మరిచిపోయి మీలో మీరే పోటీలుపడుతూ నా కుర్చీలో కర్చీఫ్ వేసేస్తానని ఈ ముసుగులో గుద్దులాటలేమిటి? అసలు నేనొకడిని ఉన్నానని మరిచిపోయారా?” అంటూ అప్పుడు ఒరిజినల్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ చిరాకు పడటం ఖాయం.   ఇక రాష్ట్రం విడిపోతే తెలంగాణా వారికి ఎవరు ముఖ్యమంత్రి కావాలనేదే ప్రశ్న. కానీ ఆంధ్ర రాష్ట్ర నేతలకి మాత్రం రాజధాని ఎక్కడ పెట్టుకొంటే తమ రియల్ వ్యాపారాలకు లాభసాటిగా ఉంటుందనే మరో పాయింటు కూడా ఉంది.   రాజధానిని విశాఖలో పెట్టుకొంటే ఉత్తర కోస్తా జిల్లాలలో తన వ్యాపార కార్యక్రమాలన్నీ మూడు పూలు ఆరు కాయలుగా చేసుకోవచ్చునని ఆ జిల్లాలకు చెందిన కొందరు నేతలు ఆలోచిస్తుంటే, “కొత్త రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న విజయవాడని, రాజమండ్రీని కాదని ఎక్కడో మారు మూల ప్రాంతంలో పెడితానంటే ఎలా?” అని అక్కడి రాజకీయ వ్యాపారవేత్తలు అభ్యంతరం చెప్పడం ఖాయం.   “అయినా అంగుళం భూమి కూడా ఖాళీ లేని ఆ ఊళ్లలో రాజధాని ఏర్పాటు చేయడం అసలు సాధ్యమేనా? మా ఒంగోలు నేతలు అమాయకులు, నిస్వార్ధపరులు గనుక ఇక్కడ ఇంకా ప్రభుత్వ భూములు కొన్ని మిగిలే ఉన్నాయి. గనుక ఇక్కడే బెస్ట్” అని అక్కడి నేతల వాదన. “ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మా కర్నూలుకి హ్యాండిచ్చి హైదరాబాదుకి రాజధాని పట్టుకొనిపోయారు. అప్పటి నుంచి వేసిన గొంగళి వేసిన చోటనే పడి ఉంది. గనుక కనీసం ఇప్పుడయినా మా రాజధాని మాకిచ్చేస్తే మా ప్రాంతం కొంచెం డెవెలప్ అవుతుందని” కర్నూల్ నేతల వాదన.   “తిరుపతిలో పెట్టుకొంటే మన రాష్ట్రానికి ఆ స్వామివారి కృప బాగా ఉంటుంది. గనుక కొత్త రాజధాని ఇక్కడే ఏర్పాటు చేయాలని” మరికొందరి వాదన.   అందుకే రోడ్డు మ్యాపు చేతిలో ఉండగానే అన్నీ చక్కబెట్టుకోవలన్నారు పెద్దలు.

 Kedarnath

మిస్‌ అయిన వారి లెక్కతేల్చండి

  కేధారనాధుడి సాక్షిగా ప్రకృతి సృష్టించిన విలయం ఇంకా కన్నీళ్లు కురిపిస్తూనే ఉంది. వేల మంది ప్రాణాలు విడిచిన ఈ మహావిపత్తులో ఇంకా ఎంతో మంది సర్వం కోల్పోయారు.. ప్రాణాలకు తెగించి సైన్యం అందించిన సహాయక చర్యల్లో లక్షమందికి పైగా సురక్షిత ప్రాంతాలకు చేరినా ఇంకా వేల మంది జాడ తెలియ రావటం లేదు. అయితే ఈ విషయంలోనే అధికారులు నాయకులు ఇస్తున్న స్టేట్‌మెంట్‌కు పొంతన లేకుండా ఉంది.. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 400 మంది మాత్రమే మిస్‌ అయ్యారని తెలుస్తుంది.. అయితే ఇందుకు భిన్నంగా నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ శశిదర్‌రెడ్డి మాత్రం 11,600 మంది వరకు మిస్‌ అయ్యారని ప్రకటించారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మాత్రం వివిధ రాష్ట్రాలనుంచి తమకు అందించిన సమాచారం ప్రకారం కోర్టుకు అందించిన ఎఫ్‌ ఐ ఆర్‌లో 4000 మంది మాత్రమే మిస్‌ అయ్యారని తేల్చింది.. కాని ఓ ప్రైవేట్‌ సంస్థ ద్వారా అందించిన సమాచారం ప్రకారం ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు. వీలైనంత త్వరగా ఆ లెక్కలను తేల్చి సాయం అందిచాల్సిందిగా కోరుతున్నారు బాధితులు..

Enforcement Directorate Target Factionists

ఫ్యాక్షనిస్ట్‌ల ఆస్తుల అటాచ్‌మెంట్‌

  దేశంలోనే మొట్టమొదటి సారిగా ఫ్యాక్షనిస్ట్‌ల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్దం అవుతుంది.. పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఈ సారి భారీగా నగదు చేతులు మారుతుందని భావించిన పోలీస్‌ యంత్రాంగం ఫ్యాక్షన్‌ ప్రబావిత ప్రాంతాలపై ప్రత్యేకం దృష్టి పెట్టింది. ముఖ్యంగా కర్నూల్‌ జిల్లా ఎస్పీ కె రఘురామిరెడ్డి అందుకు సంభందించిన ప్రణాలికను కూడా సిద్దం చేశారు.. అక్కడ జరగబోయే పంచాయతి ఎలక్షన్స్‌లో ఫ్యాక్షనిస్ట్‌ హావా తగ్గించి ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్‌ జరిపించటం కోసం వాళ్ల అక్రమాస్థులపై దృష్టి పెట్టారు.. అందుకోసం ఇప్పటికే సిబి సిఐడి నివేదిక పంపిన ఎస్‌పి మనీ లాండరింగ్‌ యాక్ఠ్‌ కింద ఆదాయానికి మించి ఆస్తులు వున్న వ్యక్తుల పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. మరి ఎస్‌పి రఘురామి రెడ్డి చేయాలనుకుంటున్న ఈ అటాచ్‌మెంట్‌లు ఎంత వరకు సజావుగా సాగుతాయో చూడాలి..

botsa satyanarayana

బొత్స నాలుకకు నరం ఉందా?

  మూడు నాలుగు రోజుల క్రితం రాష్ట్ర విభజన కొరకు రోడ్డు మ్యాప్ చేతిలో పట్టుకొని డిల్లీలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులందరినీ కలుస్తూ హడావుడిగా తిరిగిన పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ, నిన్నతిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రం విడిపోకుండా కలిసి ఉండాలని తానూ దేవుడ్ని ప్రార్దించినట్లు” తెలిపారు. “కేవలం కొంత మంది రాజకీయ నేతలకి మంత్రి పదవులు ఏర్పాటు చేసేందుకే రాష్ట్ర విభజన జరుగుతున్నట్లయితే, నేను నా మంత్రి పదవిని, పీసీసీ అధ్యక్ష పదవిని కూడా వదులుకోవడానికి సిద్దం. కుటుంబ పెద్ద తన కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండాలని కోరుకొంటున్నట్లే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నేను కోరుకొంటున్నాను. అయితే, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.” అని అన్నారు.   ఇంత కాలం “హిందీ వాళ్ళకు పది రాష్ట్రాలుండగా తప్పు లేనిదీ, తెలుగు వాళ్ళకు రెండు రాష్ట్రాలుంటే తప్పేమిటి?” అని వాదిస్తూ వచ్చిన బొత్స కధ క్లైమక్సుకు వచ్చిన తరువాత ఈవిధంగా రెండు నాలికలతో మాట్లాడటం అటు తెలంగాణా ప్రజలకు, ఇటు సీమంధ్ర ప్రజలకు కూడా ఆగ్రహం తెప్పిస్తోంది.   రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెపుతూనే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడం చూస్తే ఆయన ప్రస్తుతం సీమంద్రాలో క్రమంగా రగులుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని చేసినవిగానే భావించవచ్చును. తద్వారా తనకు రాష్ట్రం విడిపోవడం ఇష్టం లేదని చెపుతూ వారి మనసులు గెలుచుకోవాలని ప్రయత్నిస్తూనే, మరో వైపు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడం ద్వారా తెలంగాణా నేతలని కోపం రాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. అయితే, ఇటువంటి రెండు నాల్కల ధోరణి వల్ల ఆయన ఆశించిన విధంగా ఎవరూ మెచ్చుకోకపోగా ఆయన ధోరణిని ఖండిస్తున్నారు.

PCC

బలంగా వినిపిస్తున్న సమైక్యగాణం

  కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేక తెలంగాణ దిశగా అడుగులు వేస్తుండటంతో రాష్ట్రంలో సమైఖ్యగాన్ బలంగా వినిపిస్తుంది.. ఇన్నాళ్లు ఎలాంటి స్టేట్‌మెంట్‌లు ఇవ్వని నాయకులే కాదు.. తెలంగాణ ఇచ్చిన పర్లేదు అన్న బోత్సా లాంటి నాయకులు కూడా ఇప్పుడు యు టర్న్‌ తీసుకున్నారు. తెలంగాణ ఎర్పాటుకు రోడ్‌ మ్యాప్‌ సిద్దం చేయాలంటూ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ సియం,పిసిసీ చీఫ్‌లను కోనడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. చాలా రోజులు స్థబ్ధుగా ఉన్న సమైఖ్య వాదులు మళ్లీ గళం విప్పారు.. ఇప్పటికే రాయలసీమ వైఎస్‌ఆర్‌ సిపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా తాజాగా మరో ఎమ్మెల్సీ షేక్‌ హుస్సేన్‌ కూడా రాజీనామ చూశాడు.. రాష్ట్రం సమైఖ్యం ఉంచాలని కోరుతూ ప్రదర్శనలు చేపట్టిన విద్యార్థి జేఎసి, పురందరేశ్వరికి చీర సారే తో పాటు, సుబ్బిరామిరెడ్డికి కమండలం,రుద్రాక్షలు పంపి నిరసన తెలిపారు.. ఇదిలా ఉంటే టికాంగ్రెస్‌ నాయకులు తెలంగాణ ఏర్పాటుకు సర్వం సిద్దం అయిందంటుంటే.. సీమాంద్రనాయకులు మాత్రం రాష్ట్ర పరిస్థితుల్లోనూ విడిపోయే ప్రసక్తి లేదంటున్నారు.. ఈ నేపధ్యంలో సియం, పిసిసి చీఫ్‌లకు అధిష్టానం నుంచి పిలుపు రావడం ప్రదాన్యత సంతరించుకుంది.. ఈ నెల 12న జరగబోయే కోర్‌కమిటీ బేటిలో తెలంగాణ విషయాన్ని తేల్చేస్తాం అంటున్నా కాంగ్రెస్‌ ఎంత వరకు మాట నిలుపుకుంటుందో చూడాలి..

Solar Scam  Chandy

కేరళ సియం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

  కేరళ సీఎం ఊమెన్ చాందీని సోలార్ ప్యానెల్ స్కాం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం చాందీపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. చాందీ తక్షణమే సీఎం పదవి నుంచి తప్పుకోవాలంటూ ఎల్డీఎఫ్ సహా ప్రతిపక్షాలు అసెంబ్లీని స్తంబింపజేశాయి. ఊమెన్‌ చాందీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అటు అసెంబ్లీని సైతం ప్రతిపక్షాలు అట్టుడుకించాయి. స్కాంలో నిందితులుగా ఉన్న సరితా నాయర్‌, రాధాక్రిష్ణన్‌, శాలు మీనన్‌తో సీఎం చాందీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించాయి. ఎల్డీఎఫ్‌ కార్యకర్తలు అసెంబ్లీ ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం చాందీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జితో నిరసనకారులను చెదరగొట్టారు. అయితే పరిస్థితి చేయిదాటుతుందని గమనించిన చాందీ విచారణకు అంగీకరించారు.. దానితో పాటు తప్పని సరి అయితే రాజీనామకు కూడా వెనుకాడనని ప్రకటించారు. ఈ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన కొద్ది సేపటికే చాందీ మళ్లీ మాట మార్చారు.. ఆ కుంభకోణంతో తనకెలాంటి సంభందం లేదని ప్రస్థుతానిక రాజీనామా యోచన లేదని తేల్చేశారు దీంతో మరోసారి ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌ హైకమాండ్‌తో పాటు మిత్రపక్షమైన యుడీఎఫ్‌ కూడా మద్దతుగా నిలవటంతో చాందీ మాటర్చినట్టుగా భావిస్తున్నారు..అయితే ప్రస్థుతానికి గండం గట్టెక్కినా చాందీ చుట్టూ ఉచ్చు మరింత బలంగా బిగుసుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు..

Lord Puri Jagannath Rath Yatra

వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌ జగన్నాధ్ రథచక్రాల్‌

  వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌ జగన్నాధ్ రథచక్రాల్‌ అన్నాడు మహాకవి శ్రీశ్రీ.. నిజంగా పూరి వేదికగా జరిగే ఉత్సవాలలో ఈ రోజు నుంచి జగన్నాథ రథ చక్రాలు కథలనున్నాయి.. అందుకు సంభందించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తోంది. తొమ్మిదిరోజుల పాటు కన్నులపండువగా వేడుకలను నిర్వహించనుంది. అటు అహ్మదాబాద్‌ లోనూ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.   ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ యాత్రకు సర్వం సిద్ధం అయ్యింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 18 వరకు తొమ్మిది రోజుల పాటు ఈ రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించేదుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది.. ఆ వైభోగాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా పూరీ చేరుకుంటున్నారు. యాత్ర ప్రారంభమైన క్షణం నుంచి రథం గమ్యస్థానం చేరేవరకు ముందుకు సాగుతూనే ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆపరాదని ఆలయ నిబంధనలు చెబుతున్నాయి. జాతి, కుల, లింగ వివక్ష లేకుండా అందరూ రథోత్సవంలో పాల్గొంటారు. స్వయంగా భక్తులే రథాన్ని లాగే అవకాశం ఉండటంతో ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు పోటిపడతారు. జగన్నాథుని సేవలో పాల్గొని పునీతులౌతారు. ఏటా ఆషాడ శుద్ద విదియనాడు ప్రారంభమయ్యే రథయాత్ర ఏకాదశి వరకు నిరంతరంగా కొనసాగుతుంది. స్థానిక రాజ వంశస్థులైన గజపతుల ప్రథమ హారతితో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. బలభద్ర, జగన్నాథ, సుభద్ర వేర్వేరు రథాలపై భక్తులకు దర్శనమిస్తారు. ముగ్గురు దేవతలు జన్మించిన ప్రాంతంగా భావించే అడప మండపం వద్ద బస చేసి తొమ్మిదవ రోజున తిరుగు ప్రయాణం అవుతారు. ఇతర ఆలయాల్లో ఉత్సవ విగ్రహాలను ఆలయ వీధుల్లో ఊరేగిస్తే.. పూరీలో అందుకు విరుద్ధంగా మూల విగ్రహాలనే ఊరేగింపుగా భక్తుల వద్దకు తీసుకెళ్తారు. అటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోనూ ఈ రథయాత్రను కన్నుల పండువగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మోడీ సర్కారు భారీ భద్రతను ఏర్పాటు చేసింది. అలాగే హైదరాబాద్‌లోని పూరి జగన్నాధ్‌ స్వామి ఆళయంలో కూడా ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.. పూరిని తలపించేలా రథాలను ముస్తాబు చేసిన జగన్నాథ స్వామి ఊరేగింపుకు సిద్దం చూశారు..

chief ministers

తెలంగాణ మొదటి ముఖ్యమంత్రులము మేమే

  కాంగ్రెస్ తెలంగాణా ఇస్తుందో లేదో తెలీదు గానీ, అటు కొత్త రాష్ట్రం ఏర్పడితే ఎవరు ముఖ్యమంత్రి కావాలని టీ-కాంగ్రెస్ నేతలు ముసుగులో గుద్దులాట మొదలయిపోయింది.   ఖాళీగా పడున్న హోంమంత్రి మంత్రి సీటులో కూర్చొని ముచ్చట తీర్చుకోవాలనుకొంటే అడ్డుపడిన ఈ కిరణ్ కుమార్ కి బుద్ది చెప్పాలంటే, ఒక మంచి రోడ్డు మ్యాపు గీసుకొని ఏకంగా ముఖ్యమంత్రియి పోవడమే బెటరు అనుకొంటూ దామోదర చేతిలో ఉన్న రంగు పెన్సిళ్ళతో గడ్డం గోక్కొంటూ మ్యాపులు గీసుకొంటున్నాడు.   రేపు రాష్ట్రం ఏర్పడితే అప్పుడు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయమన్నపుడు టైము ఉంటుందోలేదోనని ముందుగానే సూటు కూడా కుట్టించుకొని వేసుకు తిరుగుతున్నాను.అసలు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణా ఉద్యమాన్నిబ్రేకులు వేస్తూ ముందుకు, వెనుకకి, పక్కకి అన్ని డైరెక్షన్లలో తీసుకువెళ్తున్న వాడిని నేనే. అయినా ఎవరికీ నేను కనబడటం లేదు. ఇక నా ప్రయత్నాలేవో నేను చేసుకోక తప్పేలా లేదనుకొంటూ జానారెడ్డి మీడియా వాళ్ళని పిలిచి “ముఖ్యమంత్రి పదవి కంటే తెలంగాణాయే నాకు ముఖ్యం’ అని ఒక స్టేట్మెంటు ఇచ్చేరు. అప్పుడు మీడియా వాళ్ళ ‘అయితే మీకు ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి లేదా?’ అని అడిగితే, ‘ముందు తెలంగాణా రానీయండి’ అని తన మనసులో మాట చెప్పేశారు.   ‘హోంమంత్రి పదవి ఇస్తారంటే ఆశపడి ఇన్ని రోజులు తెలంగాణా గురించి మాట్లాడకుండా ఆ ఆంధ్రా ముఖ్యమంత్రి నించోమంటే నించొన్నాము, కూర్చోమంటే కూర్చోన్నాము. కానీ మాయమాటలు చెపుతూ చివరికి అది కూడా తన దగ్గిరే అట్టేపెట్టేసుకొన్నాడు. మా రాష్ట్రం మాకొస్తే అప్పుడు నేను ముఖ్యమంత్రినయినప్పుడు గానీ అతనికి నా గొప్పదనం తెలిసిరాదు, అని బాబ్డ్ హెయిర్ సవరించుకొంటూ గీతా రెడ్డమ్మ చరచరా వెళ్లిపోతుంటే, ఆమెని చూసి మూతులు తిప్పుకొన్నారు మిగిలిన రెడ్డమ్మలు.   ముఖ్యమంత్రి పదవికి ప్రధాన అర్హతలయిన ‘దళిత కోటా’, ‘మహిళా కోటా’ ‘ఉద్యమ కోటా’ లేదా ఈ మూడింటి కాంబినేషనులో ‘దళిత మహిళా ఉద్యమ నేత’లుగా ఏవిధంగా చూసుకొన్నా కూడా అన్ని విధాల అర్హతలున్న తమకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే తామేమి (మట్టి) గాజులు తొడుకొని కూర్చోబోమని, (మొన్నబంగారం ధర తగ్గినప్పుడు కొనుకొన్న) కొత్త బంగారు గాజులను సవరించుకొంటూ రుసరుసలాడుతున్నారు మిగిలిన రెడ్డమ్మలు.   ఆంద్రోళ్ళ ఇస్టోరీ తరువాయి భాగంలో....  

Narendra Modi for PM post

ప్రధాని అభ్యర్ధి మోడినే

      మోడి పట్టాభిషేకానికి ఒక్కటొక్కటిగా అడ్డంకులు తొలగుతున్నాయి.. ఇటీవల ప్రచార సారధిగా బాధ్యతలు చేపట్టి మోడి పార్టీలో తన పట్టును మరింత పెంచుకోవటానికి పావులు కదుపుతున్నారు.. అందుకు తగ్గట్టుగానే పార్టీ పెద్దలు చాలా మంది మోడికి మద్దతుగా నిలుస్తున్నట్టు సమాచారం..   అయితే చాల రోజులుగా ఎన్డీఏ ప్రదాని అభ్యర్థి మోడినే అన్న వాదం బలంగా వినిపిస్తున్న ఇంత వరకు పార్టీ వర్గాలు మాత్రం ఆ విషయాన్ని ద్రువీకరించలేదు.. అయితే ఎన్నికల సమయం మరింత దగ్గరపడుతుండటంతో ఈ నెలాఖరు వరకు మోడినే ప్రదాని అభ్యర్థిగా ప్రకటిస్తారంటున్నాయి పార్టీ వర్గాలు..         అంతే కాదు వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోడి ఎంపిగా పోటి చేయనున్నారని కూడా అంటున్నారు. అందుకోసం ఇప్పటికే నియోజిక వర్గాన్ని కూడా ఎంచుకున్నారట.. బలమైన హిందూ వాదిగా పేరున్న మోడి ఏదైనా హిందూ దార్మిక స్థలం నుంచి పోటి చేయాలనుకుంటున్నాడట..         ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం వారణాసి నుంచి మోడి పోటి చేయాలని భావిస్తున్నాడట. బిజెపి కంచుకోటగా భావించే ఈ ప్రాంతం నుంచి ప్రస్థుతం మురళి మనోహర్‌ జోషి ప్రతినిధ్యం వహిస్తున్నారు..         ప్రస్థుతానికి ఇవన్నీ ఊహాగానాలుగా కొట్టిపారేసిన ఎన్డీఎ భవిష్యత్తు దృష్ట్యా త్వరలోనే మోడిని ప్రదాని అభ్యర్థిగా ప్రకటించటం మాత్రం కాయం అంటున్నాయి పార్టీ వర్గాలు..

Shankar Rao arrested

బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి శంకర్రావు

      కోడలి వేధింపుల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి శంకర్రావును సీసీఎస్ పోలీసులు ఈ ఉదయం ఉస్మానియా ఆసుపత్రి నుండి బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. నిన్న అరెస్టయిన ఆయన స్పృహతప్పి పడిపోవడంతో ఆయనను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఉదయం మరింత మెరుగయిన చికిత్స కోస్ కేర్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వైద్యుల సూచన మేరకు శంకర్రావును మారేడుపల్లి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు. శంకర్‌రావు కుమారుడు శశాంక్‌కు, వంశీప్రియకు 2005లో పెళ్లి జరిగింది. ఆ తరువాత శంకర్రావు కూతురు భర్తతో విడిపోయి ఇంట్లోనే ఉంటోంది. అప్పటి నుండి  ఆమె వంశీప్రియను వేధింపులకు గురిచేస్తోంది. దీంతో ఆమె భర్త నుండి విడిపోయింది. ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయంలో శంకర్రావు సాక్షులను బెదిరించారని ఆరోపణలున్నాయి. ఇదే కేసులో శంకర్రావు కూతురు సుస్మితను అరెస్టు చేసిన పోలీసులు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు.

panchayat elections

సం’గ్రామం’

      పంచాయితీ ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. జిల్లాల వారీగా కలెక్టర్లు ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్ జారీచేయనున్నారు. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మొత్తం మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికలు జరుగనున్నాయి.   అయితే ఇప్పటికే కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కాగా.. మిగతా చోట్ల ఎన్నికలకు రంగం సిద్దం అవుతుంది. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి మొదలుకానుంది. కలెక్టర్లు..  జిల్లాలవారీగా నోటిఫికేషన్లు జారీచేస్తారు. ఈ నెల 13 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 14న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 17 న ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. కాగా.. ఈ నెల  23, 27, 31న మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. నేటి నుంచి ఎన్నిక లకోడ్ అమలల్లో ఉండటంతో ఇక తెర వెనుక రాజకీయాలకు తెరలేవనుంది.. ఇప్పటికే చాలా చోట్ల బేరసారాలు మొదలవగా.. ఈ సారి రిజర్వేషన్ల ప్రక్రియ కూడా అస్థవ్యస్తంగా సాగింది.. చాలా చోట్ల రిజర్వేషన్‌ కేటాయించిన సామాజిక వర్గం నేతలు లేకపోవటం అభ్యుర్థల ఎంపిక కూడా కష్టమయింది.. కొన్ని చోట్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో అడుక్కునేవారిని కూడా అభ్యర్ధులుగా ప్రకటిస్తున్నారు.. ఏది ఏమైనా సాధారణ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎలక్షన్స్‌ను అన్నిపార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు..

Liu Zhijun death sentence

పాపం పండింది

      మనదేశంతో పోలిస్తే అవినీతి విషయంలో అన్ని దేశాలు కఠినంగానే వ్యవహరిస్తున్నాయి.. ముఖ్యంగా చైనా లాంటి దేశాలలో ఎంత వారకైనా తీవ్రమైన శిక్షలు విధిస్తున్నారు.. ఆఖరికి మంత్రి స్థాయి వారికి కూడా మరణ శిక్ష విదించి సంచలనం సృష్టించింది చైనా.25 ఏళ్ల రాజకీయ జీవితంలో 65 కోట్ల అవినీతి పాల్పడ్డ మాజీ మంత్రికి... అక్కడి కోర్టు ఏకంగా మరణశిక్ష విధించింది. అవినీతి సొమ్ముతో అతను సంపాందించిన సొత్తును స్వాదీనం చేసుకుంది..   లియు ఝిజున్‌. చైనా మాజీ రైల్వే మంత్రి. దేశంలోనే అత్యధికంగా 8 ఏళ్ల పాటు రైల్వే మినిస్టర్‌ గా పని చేసి రికార్డ్ సృష్టించిన వ్యక్తి. దాదాపు 25 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ఐతే దీపముండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా... మంత్రిగా ఉండగానే చేతివాటం చూపించాడు. దాదాపు 65 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు. కరెప్షన్ వ్యవహారంలో ఇదీ చైనా వైఖరి. దేశంలోనే ఓ సీనియర్‌ రాజకీయ నాయకుడు... 65 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడితినే సహించలేదు. చైనా రైల్వే రంగంలో ఎన్నో సంస్కరణలకు కారణమైన లియు ను పాపం పోనీ అనలేదు. దేశ సంపద దుర్వినియోగం చేస్తే ఎవరినీ క్షమించేదీ లేదని ఈ సంఘటన ద్వారా మిగతా నాయకులకు హెచ్చరికలు పంపింది. కాని మనదేశంలో మాత్రం ఇలాంటి సంఘటనలు మచ్చుకు కూడా కనిపించవు.. వేల కోట్ల అవినీతి ఆరోపణలతో కంపు కొట్టే మన రాజకీయపార్టీల నేతలకు అసలు అలాంటి భయమన్నదే లేదు.. మన చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకున్న నాయకులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. . మన దేశంలో కూడా చైనాలో జరిగిన లాంటి సంఘటన ఒక్కటి జరిగితే చాలు.. ఒక్క అవినీతి నాయకునికి శిక్ష పడినా దేశంలో కొంత మంది అయినా మారతారు.. మరీ అవినీతి కుంభకోణాలతో భ్రష్టు పట్టిన మన దేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వేల కోట్ల రూపాయల జాతి సంపద దోచుకున్న నాయకులు దర్జాగా చట్టసభల్లో దర్శనిమిస్తున్నారు. కామన్ వెల్త్ స్కాంలో 70 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినా... సురేష్ కల్మాడీ ఇంక ఎంపీగా కొనసాగుతున్నారు. పలు క్రీడాల సంఘాల్లో పోటీ చేసే అవకాశంతో పాటు పార్లమెంట్‌ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. 2జీ స్కాం లో నిందితురాలిగా ఉన్న కరుణానిధి కుమార్తె కనిమొళి మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక రైల్వే మినిస్టర్‌ గా బాధ్యతలు చేపట్టిన 6 నెలల్లోనే 10 కోట్ల రూపాయల లంచం తీసుకునేందుకు ప్రయత్నించిన పవన్ కుమార్ బన్సాల్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. సీబీఐ చార్ఝిషీట్ కనీసం ఈ మంత్రిగారీ పేరు లేదు. ఆదర్శ్ కుంభకోణంలో నిందితులకు ఇప్పటికీ శిక్షపడలేదు. బొగ్గు స్కాం లో వేల కోట్ల జాతి సంపదను మెక్కినా ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతోంది. వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన ఏ నాయకుడి ఆస్తులను ప్రభుత్వం ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదు. కనీసం ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించిన దాఖలాలు లేవు. వాయిస్ అవినీతి విషయంలో ఇంత కచ్చితంగా వ్యవహారిస్తున్నందునే చైనా సూపర్ పవర్‌ గా ఎదిగింది. ఇకనైనా భారత్ కరెప్షన్ విషయంలో ఉదాసీన వైఖరి మార్చుకోవాలని పలువురు మేధావులు సూచిస్తున్నారు. లేదంటే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడక తప్పదని హెచ్చరిస్తున్నారు.

telangana digvijay

దిగ్విజయ్: తెలంగాణ తేలికైన విషయం కాదు?

డా. ఎబికె. ప్రసాద్ (సీనియర్ సంపాదకులు)         "చల్లకోసం వచ్చి ముంత దాచటం" సాధ్యం కాదన్న సామెతకు చాలా అర్థం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎంత క్లిష్టమైనదో తెలిసి ఉండి కూడా, అందులోనూ ఏక భాషా సంస్కృతులు ఆధారంగా ఒక జాతిని రెండు రకాల పరాయి పాలకుల మధ్య (బ్రిటిష్, మొగలాయీ పాలకుల కింద), వాళ్ళ సామ్రాజ్య ప్రయోజనాల మధ్య పరాయి ప్రాంతాల్లో పుట్టకొకరు, చెట్టుకొకరుగా చెల్లా చెదరై ఉన్న తెలుగువారందరినీ భాషా ప్రయుక్త, రాష్ట్ర ప్రాతిపదికపైన ఒక్క గొడుగు కిందకు చేరుకోవటానికి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ అవతరణ మౌలిక లక్ష్యానికే చేటు తెచ్చే విభజన వాదన వల్ల మొత్తం తెలుగు జాతి ఉనికికే రాగల నష్టమెంతో తెలిసి ఉండి కూడా - కేవలం ఎన్నికల్లో ఓట్లు, సీట్ల కోసం జాతీయ కాంగ్రెస్ నాయకత్వం 'రెండు ఆవుల దూడలా', రెండు నాల్కలతో తప్పుడు రాజకీయాలకు తెరలేపి కూర్చుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానంలో ఒక ముఖ్యుడు, నిన్నమొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాలు చూస్తూ వచ్చిన కేంద్ర మంత్రి అజాద్ స్థానంలో, అంతకు ముందు కొన్నాళ్ళు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు చూసి చాలించుకున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దౌత్య సంప్రదింపుల్లో మంచి లౌకికం ప్రదర్శించగల నేర్పుగల దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారకర్తగా నియమితులయిన తరువాత రాష్ట్రానికి వచ్చి, "రాష్ట్ర విభజన సమస్యపై" స్థానిక ప్రజల అవకాశవాద నాయకుల అభిప్రాయాలు తెలుసుకుని తిరిగి డిల్లీ వెళ్లారు. కాని ఏ "సమస్య" పరిష్కారం పేరుతో కేంద్రం తరపున (యు.పి.ఎ) దిగ్విజయ్ వచ్చారో, ఏ రకమైన తాత్కాలిక "మాండేట్"తో వచ్చారో, ఆ మాండేట్ లక్ష్యమేమిటో చెప్పకుండానే మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టారు. అందరి మాటలూ వినడమైతే విన్నారు. విభజనకు అనుకూల ప్రతికూల వర్గాల కబుర్లు విన్నారు; ప్రాంతాల్లోని అవకాశవాదుల మాటలు విన్నారు; అధికారంలో ఉన్నా ఊడినా కూడా నిత్యం కొట్లాడుకునే ఏకైక జాతీయ రాజకీయ పక్షంగా కొన్ని దశాబ్దాలుగా మనుగడసాగించుకుంటున్న కాంగ్రేస్‌లోని రాష్ట్ర శాఖీయుల మధ్య కుమ్ములాటలూ చూశారు. కొందరి దృష్టిలో ‘సిద్దడు వేమారం వెళ్లనూ వెళ్లాడు, తిరిగి రానూ వచ్చాడ’న్న సామెత ప్రకారం దిగ్విజయ్‌ కనిపించవచ్చు! కాని, అసహజమైన రాష్ట్ర విభజన ప్రతిపాదనపైన ఈనాడు కాదు ముప్పయ్యేళ్లనాడే (1972లో) నాటి ప్రధానమంత్రి దివంగతురాలు కాకముందు ఇందిరాగాంధి భారత పార్లమెంటు నిండు పేరోలగంలో నిష్కర్షగా నీజాయితీతో చేసిన విస్పష్టమైన ప్రకటనకు విరుద్ధంగా వెళ్ళడం సాధ్యపడదన్న అవగాహన ఉన్న అగ్రనాయకుల్లో దిగ్విజయ్‌ ఒకరు. నేడు ఇందిరాగాంధీ సజీవురాలై ఉండి ఉంటే 1972 నాటి ప్రకటనకు విర్ధుంగా వెళ్ళదు. సోనియా మౌనం వీడితేగాని విషయాలు మరింత సుబోధికం కావు! ఆ మౌనాన్ని చేదించడానికే దిగ్విజయ్‌ యాత్ర. ఆ పూర్వా పరాలేగాదు, ఒక పెద్ద రాష్ట్ర (మధ్యప్రదేశ్‌) ముఖ్యమంత్రిగా విభజన వాదం వల్ల తన రాష్ట్రానికి కలిగిన కష్ట, నష్టాలన్నీ ఎలాంటివో కూడా ఆయనకు తెలుసు. అందుకనే తాజాగా మన రాష్ట్ర పర్యటన సందర్భంగా దిగ్విజయ్‌ అవకాశవాద రాజకీయాలకు పలు రకాల ప్రశ్నలను గుచ్చి గుచ్చి అడుగుతూ వచ్చారు. వాటిలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న, ఆదాయ వ్యయాలకు సంబంధించిన ప్రశ్న (వినతి పత్రాలను పక్కన పెట్టించి) ‘ప్రస్తుతం రాజధాని హైదరాబాద్‌ నగరం నుంచే ర్ఱాష్ట బొక్కసానికి అత్యధికంగా ఆదాయం వస్తోందని లెక్కలు సృష్టంగా నిరూపిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరం ఏ ఒక్కరిదో కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారూ, ఇతర రాష్ట్రాలకు చెందినవారూ, అనేక పరిశ్రమలు, కంపెనీలు ఇక్కడ స్థిరపడిపోయి ఉన్నందున అది అందరికీ చెందిన రాజధాని అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడం ఎలాగో ఎవరైన ఆలోచించారా’’ అని దిగ్విజయ్‌ ప్రశ్నించారని పత్రికా వార్తలు! ఈ ప్రశ్నకు పదవీకాంక్షలో ఉన్న రాజకీయ నిరుద్యోగులెవ్వరూ సరైన సమాధానంయివ్వలేకపోయారు. ఎందుకంటే ‘ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు ఒకవైపు నుంచి తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం కారణం కాగా మరొకవైపు నుంచి ఆంధ్ర, హైదరాబాద్‌ స్టేట్‌ శాసనసభలు మెజారిటీ సభ్యుల సంయుక్త తీర్మానాలు కారణమయ్యాయన్న సత్యాన్ని మరవరాదు. కనుకనే దిగ్విజయ్‌ కూడా రాష్ట్రంలోనూ, దేశంలోనూ నెలకొని ఉన్న పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మాత్రమే రాష్ట్ర విభజన సమస్యపైన కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అంతకు ముందు శ్రీకృష్ణ కమిటీ నివేదిక తన ప్రాధాన్యం సమైక్య రాష్ట్రమే ననీ, తెలుగు ప్రజల భావి భాగ్యోదయానికి అదే శ్రీరామరక్ష అని అభిప్రాయం ప్రకటిస్తూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ (కోస్తా, రాయలసీమ, తెలంగాణా) అన్నింటి కంటే ఎక్కువగా వెనుకబడి ఉన్నది ఒక్క రాయలసీమ ప్రాంతమేననీ, అభివృద్ధికి సంబంధించి ఏ అంశాన్ని తీసుకున్నా రాయలసీమ వెనుకబాటు తనానికి లెక్కలన్నీ దాఖలాలుగా నిలిచాయనీ సృష్టం చేసినప్పుడు ‘మాకు లెక్కలతో, వాదనలతో పనిలేదు. మా (తెలంగాణా) రాష్ట్రం మాకిచ్చేయండి’’ అని రాజకీయ నిరుద్యోగ నాయకులు ఎదురు వాదించడం జరిగింది!  కాని అప్పుడు ‘మాకు లెక్కలతో, వాదనలతో’ నిమిత్తం లేదన్నవీరు, ‘రేపు ఏర్పడే రెండు రాష్ట్రాల రాజధానుల్లో ప్రభుత్వాలకు ఆధాయ వనరులు ఒకే విధంగా ఉంటాయనీ, ఆధాయ పంపిణీ విషయంలో విభజన ఇబ్బందీలేమీ ఉండవనీ’ ఏభరోసాతో, ఏలెక్కమీద, ఏ గణాంకాల మీద ఆధారపడి చెబుతున్నారో కనీసం ‘కాకిలెక్కల్ని’ అయినా చూపి దిగ్విజయ్‌ ముందు నిరూపించలేకపోయారు! అదే సమయంలో వీరు, తోటి తెలుగువారిపై విద్వేష ప్రభావాన్ని (వాళ్ల ఆస్తులన్నీ మనం ఆక్రమించవచ్చు, వాళ్లను హైదరాబాద్‌ నుంచి, తెలంగాణా నుంచి తరిమివేస్తే, వాల్ల ఇళ్లూ, భుమూలూ సర్వస్వం ఆక్రమించుకోవచ్చు, ఫలితంగా ఉద్యోగాలన్నీ తెలంగాణా యువతకే దక్కుతాయ’న్న ప్రచారం) ముమ్మరం చేసి, ఒక భయ కంపిత వాతావరణాన్ని సృష్టించడం ద్వారా కల్పించిన ఆశలు నెరవేరకపోయేసరికి, తెలంగాణా బిడ్డల్ని ఆత్మహత్యలవైపునకు రాజకీయ నిరుద్యోగులైన నాయకులు బలవంతంగా నెట్టారు. ఈ తమ నేరస్త మనస్తత్వాన్ని తోటి తెలుగు ప్రజలపైకి నెడుతూ ఇప్పుడు ‘కేంద్రం నుంచి తెలంగాణా ఏర్పాటు నిర్ణయం రావడం ఆలస్యమవుతున్న కారణంగా ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయ’ని కేంద్రంపైకి నిందను నెట్టడానికి కూడా జంకలేదు!   అంతే కాదు, ‘‘2009 డిసెంర్‌ 9’’ ప్రకటన గురించి ప్రస్తావించినప్పుడు కూడా దిగ్విజయ్‌ సింగ్‌ సమాధానమిస్తూ ‘‘ఆ ప్రస్తావనలో చర్చ ప్రక్రియ ప్రారంభమైనదని చెప్పడంతో పాటు ఆ ప్రకటనలో సమస్యను రాష్ట్రా అసెంబ్లీ నివేదించి, అక్కడ తీర్మానం చేయాలని కూడా ఉందని’’ గుర్తుచేశారు! అంటే, ఇన్నాళ్లూ ఏర్పాటు వాదులయిన రాజకీయ నిరుద్యోగులు ‘అసెంబ్లీ తీర్మానం’ అవసరమని ‘‘2009 డిసెంబర్‌ 9’’ ప్రకటనలో ఉన్న షరతును కావాలనే మభ్యపెడుతూ వచ్చారని గమనించాల్సి ఉంది! అంతేగాదు, గతంలో బిజెపి వారి వేర్పాటు రాజకీయంతో ఎన్‌.డి.ఎ` బిజెపి సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రాలను చీల్చి ఏర్పాటు చేసిన ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తారాఖండ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలను సహితం అసెంబ్లీ తీర్మానాల ద్వారా ఏర్పాటయినవేనని దిగ్విజయ్‌ గుర్తు చేయాల్సి వచ్చింది. అలాగే తాను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌ను విచ్చిన్నంచేసి ఛత్తీస్‌ఖడ్‌ను ఏర్పరచడం వల్ల తామెన్ని కష్ట, నష్టాలకు, వేదనకు గురి అయ్యామో ఆయన మన రాష్ట్రంలోని మందమతులకు పదవీ కాంక్షపరులకూ గుర్తు చేయాల్సి వచ్చిందని మరచిపోరాదు, అందుకే ‘విభజన’ అనేది ‘అతిక్లిష్టం, బాధాకరం’ అని ఆయన పాఠం చెప్పాల్సి వచ్చింది! అందుకే దిగ్విజయ్‌ మరొక హెచ్చరిక కూడా ఈ పర్యటనలో చేయాల్సి వచ్చింది. కేంద్రం ఇంతకూ ‘ఏ నిర్ణయం’ తీసుకోబోతోందన్న విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఇలా హెచ్చరించారు.   ‘రాష్ట్ర విభజన సమస్యపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన వ్యక్తులతో (కోర్‌కమిటీ) కూడిన  సంఘం ప్రత్యేకంగా సమావేశమవుతుంది. అన్నీ ఆలోచించాకనే కమిటీ ఒక నిర్ణయానికి వస్తుంది. రాష్ట్రాన్ని విభజించినా, యధాతథంగా సమైక్యరాష్ట్రంగానే కొనసాగించినా అందుకు రాష్ట్ర నాయకులంతా కట్టుబడి ఉండాల్సిందే, ఆ తరువాత జరగబోయే పరిణామాలను ధైర్యంగా ముందుండి ఎదుర్కొవడానికి కూడా మీరంతా సిద్ధంగా ఉండాలని’’ ఆయన హెచ్చరించారు! ఎందుకంతగా దిగ్విజయ్‌ ముందస్తుగా హెచ్చరించాల్సి వచ్చింది? అందుకూ ఆయన స్వయానుభవంతో యిలా స్వష్టం చేయాల్సి వచ్చింది.   'రాష్ట్ర విభజన అనేది చాలా క్లిష్టమైనది, బాధాకరమైనదీ, ఆ బాధేమిటో నేను స్వయంగా అనుభవించాను. నేను మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్ర విభజన జరిగి ఛత్తీస్‌గఢ్‌ ఏర్పడిరది. అప్పట్లో చాలా ఇబ్బందులు కళ్ళారా చూశాను. అందువల్ల రాష్ట్రాన్ని విభజించడం ఆషామాషీ వ్యవహారం కాదు. బల్లలు, కుర్చీలు మొదలుకుని నీళ్లు, విద్యుచ్చక్తి, అప్పులు, ఆదాయాల దాకా ఎన్నెనో పంపిణీ చేయాల్సి ఉంటుంది. సమస్యలు కూడా చాలా ఉంటాయి. మధ్యప్రదేవ్‌ విభజన జరిగినప్పుడు విద్యుత్‌ ప్రాజెక్టులన్నీ ఛత్తీస్‌ఖడ్‌లో ఉంటే వాడకందార్లందరూ మధ్యప్రదేశ్‌లో ఉండి పోయారు. అలాగే పంజాబ్‌ను వీడగొట్టినప్పుడూ ఈ బాధలనే ప్రజలు చావి చూడాల్సి వచ్చింది!      ఇదే (పంజాచ్‌ విభజన) సమస్యను ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ పర్యటన సందర్భంగాను ప్రసిద్ధ పాత్రికేయులు, ఇంగ్లాండ్‌లో భారత మాజీ హైకమిషనర్‌ అయిన కులేదీప్‌నయ్యార్‌ కూడా పంజాబ్‌ విభజనవల్ల హర్యానా, పంజాబ్ పూచిరువురూ ఎలా దెబ్బతిన్నావో వివరించి, ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి పరిస్థితిని కోరికోరి కొని తెచ్చుకోవద్దని హెచ్చరించి పోయాడని మరవరాదు! ఇదే స్ఫూర్తితో బహుశా దిగ్విజయ్‌సింగ్‌ కూడా స్వీయానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్ర పర్యటనలో ప్రాంతీయ రాజకీయ నిరుద్యోగుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ‘సమస్యను పరిశీలించబోమని’ ప్రత్యక్షంగా అనకుండా పరోక్షంగా విభజనవల్ల రాబోయే పరిణామాల గురించి పరోక్షంగా చెప్పక చెప్పక చెప్పాడు.   ఇంతకూ విచారకరమైన అసలు విషయం ` విజయాన్ని గాకుండా విషాన్ని పంచే విభజన సూత్రానికి 1969`71మధ్య కాలంలో తెలంగాణాలో భుస్వామ్య, జాగిర్దారీ దాష్టికాలతో పేద, మధ్యతరగతి ప్రజాబాహుళ్యాన్ని దోచుకు తినడంలో నిజాం ప్రభువుల కనుసన్నల్లో కీలకమైన పాత్రవహించిన కె.వి.రంగారెడ్డి కుటుంబీకుడు తెలంగాణా కాంగ్రెస్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ చెన్నారెడ్డి కాగా ఈసారి ప్రాంతీయ రాజకీయ నిరుద్యోగులుగా కోస్తాంధ్ర నుంచి వలసవచ్చిన ‘బొబ్బిలి దొర’ కె.సి.ఆర్‌ కుటుంబం మచిలీపట్నం పూర్వ రంగంగా తెలంగాణాలో తిష్టవేసిన కె.కే. (కేశవరావ్‌) ఉద్యమ శల్య సారధులు కావటం!   ‘ఛత్తీస్‌గడ్‌, ఉదాహరణ ‘వేరట, తెలంగాణా ‘సమస్య’ వేరట! కెసిఆర్‌ స్థానిక పార్టీతో పడని ‘తెలంగాణా సంయుక్త కార్యాచరణ సంఘం’ (టి.జె.ఎ.సి)లో మళ్లీ లుకలుకలు, ఆ రెండిరటికీ పడకపోగా, పరస్పరం అలకలు, ఖండన మండనలతో కాలక్షేపం చేస్తూ ఉస్మానియా విశ్వవిధ్యాలయ ఆచార్య పదవికి సెలవుపెట్టి, ఇన్నాళ్లుగానూ నెలవారీ జీతం సజావుగానే పొందుతూ మాత్రం ఢోకా లేకుండా పొందుతూ ‘టి’ జాక్‌ ఉద్యమానికి మాత్రం నాయకత్వం వహిస్తున్న కోదండరామరెడ్డితో దళిత, బహుజన వర్గాల నాయకులకు పడకపోవడం మరో ‘ఫార్సు’, ‘సామాజిక తెలంగాణా’ వాదులలో పెక్కుమందికి కెసిఆర్‌, కోదండరామ్‌ విభాగాల పొడగిట్టదు. అందుకని రాజకీయ ‘దుకాణాలు’ మారిపోతున్నాయి! వందలకోట్ల రూపాయలను కెసిఆర్‌ ‘ఉద్యమం’ పేరిట వసూళ్లు చేసుకుని కుటుంబాన్ని మల్టీనేషనల్‌ కంపెనీగా మార్చాడని దళిత వర్గ నాయకురాలు గజ్జెల కాంతం దండోరా వేస్తుండగా, కె.సి.ఆర్‌ ‘సకల జనుల సమ్మె’ను రూ.50 కోట్లకు అమ్మేశాడని స్వయాన కె.సి.ఆర్‌. సోదరుడి కూతురు రమ్య చాటుతోంది!   ఇక కోదండరామ్‌ తరపున వెలువడుతున్న విచిత్ర ప్రకటనల్లో తాజా వార్త - వాళ్లూ వీళ్లూ కాదు సరాసరి సోనియాగాంధీ నుంచే కోదండరామ్‌కు పిలుపు రానున్నదన్న ప్రచారం. ఇది ప్రధానంగా స్థానిక బడా పెట్టుబడిదారుడైన రాజాం నేతృత్వంలో నడుస్తున్న పత్రికలో తప్ప ఇతర పత్రికల్లో రాలేదు. ‘తెలంగాణా రాష్ట్రం’ ఏర్పాటుకోసం ఉద్యమాన్నిమోపుచేసే పేరిట ప్రస్తుతం కోదండరామ్‌ ఢిల్లీలో విభజన ప్రేమికులయిన కొన్నిచిల్లర పార్టీల నాయకులతో ఓ రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిపారు. ఇది ఇలా ఉండగానే లోకసభ మాజీ స్వీకర్‌ సంగ్మా రెండవ ఎస్‌.ఆర్‌.సి. (రాష్ట్రాల పునర్విభజన పరిశీలనా సంఘం)ని ఏర్పాటు చేయడం ఉత్తమమని ప్రతిపాదించారు. అయితే చరిత్ర తెలియని కొందరు ప్రాంతీయ రాజకీయ నిరుద్యోగనాయకులు పూర్వపు తెలంగాణా రాష్ట్రమే తమకు అభిలషణీయమని దిగ్విజయ్‌కు ఒక నివేదిక అందజేశారు! చారిత్రక అజ్ఞానానికి హద్దులుండవు. ఎందుకంటే తెలంగాణా ఏనాడూ రాష్ట్రంగా లేదు. అది హైదరాబాద్‌ సంస్థానపు పరాయి పాలకుల (మోగలాయిల`బహమనీల`నిజాముల)పాలనలో నలిగిపోయిన ప్రాంతాలలో ఒక భాగం మాత్రమే! ఈ విషయం కోదండరామ్‌ ప్రభృతులకు తెలియక పోవచ్చునేమోగాని, తెలంగాణా సాయుధపోరాటానికి నాయకత్వం వహించిన అగ్రశ్రేణి తెలంగాణా నాయకులయిన దేవులపల్లి వెంకటేశ్వరరావు, రావి నారాయణరెడ్డి ఎట్టి అనుమానాలకు తావులేకుండా స్పష్టం చేశారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు ‘తెలంగాణా ఒక రాష్ట్రంగా ఏనాడూ లేదు. తెలంగాణా ఆంధ్రప్రదేశంలో ఒక భాగం. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడేదాకా తెలంగాణా జిల్లాలు హైదరాబాద్‌ సంస్థానంలో ఉన్నాయి. భారతదేశంలో బ్రిటీష్‌ పాలన ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ సంస్థానం ఎన్నడూ స్వతంత్ర రాజ్యంగా లేదనేది ఒక వాస్తవ విషయం. (అంతేగాదు) తెలంగాణా ప్రజలు ఆంధ్రజాతిలో ఒక భాగమే కాని, ప్రత్యేక జాతి కాదు. కనుక స్వయం నిర్ణయహక్కు ఉండేది ఆంధ్రజాతికే గాని, తెలంగాణా ప్రజలకు కాదు. పాలక వర్గాలలో తెలంగాణాకు చెందిన ఒక బలమైన భుస్వామ్య వర్గం, వర్తక వ్యాపారాలలో ఒక భాగం, ఉద్యోగస్తులు అంతా ఆంధ్రప్రజదేశ్‌ ఏర్పడడాన్ని వ్యతిరేకించారు. ప్రత్యేక తెలంగాణా కామ్‌, యిలాంటి చిన్న రాష్ట్రాల నిర్మాణానికేమీ నేటి పాలక వర్గాలు వ్యతిరేకమనే భావం తప్ప. తమ స్థానాన్ని బలపర్చుకోవటానికి ఒకే భాషా ప్రాంతాన్ని కూడా విడదీసి చిన్న రాష్ట్రాలు ఏర్పరచడానికి వారు ఎప్పుడూ వెనుకాడరు. ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక రాయలసీమ నినాదాలను కూడా మరికొన్ని పాలక వర్గ ముఠాలు లేవనెత్తుతున్నారనేది గమనించాలి. బడా బూర్జారా వర్గం, విదేశీ పెట్టుబడి, భుస్వామ్య వర్గాల పాలనే సమస్యలన్నింటికీ మూలకారణమనేది స్పష్టం. దేశ సమస్యల నుంచి ఆంధ్రప్రదేశ్‌ సమస్యలను విడదీసి చూడటం అవాస్తవికమవుతుంది. అశాంతి, అలజడులకు ప్రాంతీయ అసమానతలు, నిరుద్యోగం మూల కారణాలు. ఈ సమస్యలు అటు ప్రత్యేక రాష్ట్రంలోగాని, ఇటు సమైక్య రాష్ట్రంలో గానీ పరిష్కరింపబడజాలవు. (‘జాతీయ సమస్య’ డాక్యుమెంటు నుంచి)! ఈ వివరణలకు తాజాగా ఇటీవల కాలంలో గులామ్‌నబీ అజాద్‌ అధికార హూదాలో చేసిన ఒక ప్రకటనలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఓటములన్నవి ‘విభజన’పైన ఆధారపడి వుండబోవని గుర్తు చేస్తూ లడక్‌ ప్రాంత అనుభవాన్ని ఇలా పూసగుచ్చి చెప్పారు.‘లడఖ్‌ ప్రాంతాన్ని మూడు జిల్లాలుగా విభజించాలని నాలుగు దశాబ్ధాలుగా డిమాండ్‌ ఉండేది. కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని నేను ముఖ్యమంత్రిగా ఉండగా వాటిని ఏర్పాటు చేయించాను తీరా ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌కు ఒక్కటంటే ఒక్క సీటూ రాలేదు’’! అనుభవం అమృతం లాంటిదంటారు! అందుకేనేమో!

Secunderabad building collapsed

హలీం బట్టీల వల్లనే కూలీన సిటీలైట్ భవనం

      హలీం బట్టీలే సిటీలైట్ కుప్పకూలడానికి కారణమా! అవుననే అంటున్నారు ప్రభుత్వ అధికారులు. సికింద్రాబాద్ లోని సిటీలైట్ హోటల్ 'హలీం' కి చాలా ఫేమాస్. రంజాన్ నెల ప్రారంభం అయింది అంటే 'హలీం' రుచి చూడడానికి ఈ హోటల్‌కు ప్రతి రోజూ భారీగా కస్టమర్లు వస్తుంటారు. దీంతో ప్రతి సంవత్సరం లాగే ఈ సారి హలీం బట్టీల కోసం పెద్దఎత్తున ఇటుకలను, ఇసుకను, మట్టిని బిల్డింగ్ పైకి తరలించారు. ఒక్కొక్క బట్టీ తయారీకి సుమారు 800 కిలోల సరుకులు అవసరమని అంచనా. దీని ప్రకారం.. ఎనిమిది బట్టీల బరువు దాదాపు 6.4 టన్నుల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే తయారీ మొదలుపెట్టడంతో హలీం బట్టీలనుంచి వెలువడే తీవ్రమైన వేడికి పైకప్పు బలహీనపడింది. పురాతన భవనంపై ఇంత బరువు వేయడం.. బట్టీ నుంచి వెలువడిన వేడిమి కారణంగా భవనం కుప్పకూలి ఉంటుందని జీహెచ్ఎంసీ, పోలీసువర్గాలు చెబుతున్నాయి. భవనం పైభాగంలో బట్టీలను నిర్మించవద్దని వాటి నిర్మాణం సందర్భంగానే హోటల్లోని కొంతమంది సిబ్బంది యజమానిని వారించినట్లు చెబుతున్నారు. అయినా, పెడచెవిన పెట్టినట్లు సమాచారం. ఆదివారం రాత్రి నుంచే పెచ్చులు ఊడుతున్నా కూడా యాజమాన్యం గమనించలేదు. భవనానికి పిల్లర్లు కూడా లేకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. సిటీలైట్ హోటల్ కూలి 13 మంది మరణించిన విషయం తెలిసిందే.  

ఉగ్రవాదుల కంటే కరుడుగట్టిన రాజకీయ నేతలు

  నరేంద్ర మోడీనీ సాకుగా చూపి, బీజేపీ నేతృత్వం వహిస్తున్నఎన్డీయే కూటమి నుండి నితీష్ కుమార్ కి చెందిన జేడీ(యు) తప్పుకొన్న తరువాత, ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నానాటికి తీవ్రతరమవుతోంది. ఇక, జేడీ(యు)ని ఎలాగయినా తన కూటమిలోకి ఆకర్షించాలనే తాపత్రయంతో కాంగ్రెస్ పార్టీ, నితీష్ కుమార్ కి అండగా నిలబడుతూ తమ ఉమ్మడి శత్రువయిన బీజేపీపై విరుచుకు పడుతోంది.   మొన్న ఆదివారం నాడు బీహార్ రాష్ట్రం భోదగయ భౌద్ద క్షేత్రంలో జరిగిన ప్రేలుళ్ళను అవకాశంగా తీసుకొని బీజేపీ, జేడీ(యు)పై మాటలు రువ్వుతుంటే, అందులో కాంగ్రెస్ కూడా ప్రవేశించి బీజేపీపై ఎదురు దాడికి దిగింది. కాంగ్రెస్, జేడీ(యు)లు రెండు తీవ్రవాదుల దాడి గురించి ముందే సమాచారం ఉన్నపటికీ అలసత్వం చూపాయని బీజేపీ విమర్శిస్తే, బీజేపీ ఉగ్రవాదచర్యలను కూడా రాజకీయం చేస్తోందని నితీష్ కుమార్ విమర్శించారు. కొద్ది రోజుల క్రితం నరేంద్ర మోడీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి బుద్ధి చెప్పమని బీజేపీ కార్యకర్తలకు పిలుపునీయడం, ఆ తరువాత ఆయన అనుచరుడు అమిత్ షా కూడా నితీష్ కి వ్యతిరేఖంగా వ్యాఖ్యలు చేయడం, వెన్వెంటనే గయలో బాంబు ప్రేలుళ్ళు జరగడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, దిగ్విజయ్ సింగ్ ఇందులో బీజేపీ హస్తం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేసారు.   బౌద్ధ ఆలయంలో బాంబు ప్రేలుళ్ళు జరిగిన తరువాత ఏఉగ్రవాద సంస్థ దానికి తామే బాధ్యులమని ఇంతవరకు ప్రకటించలేదు. అదేవిధంగా దర్యాప్తు సంస్థలు కూడా అవి ఎవరి పనో ఇంతవరకు నిర్దారించలేదు. కానీ, దాడి జరిగిన వెంటనే హోం మంత్రిత్వ శాఖ ‘అది ఇండియన్ ముజాహుదీన్ పనే అయి ఉంటుందని’ క్షణంలో తేల్చిపడేసింది. ఇప్పుడు బాధ్యతగల పదవులను నిర్వహిస్తున్న దిగ్విజయ్ సింగ్ అది బీజేపీ పనేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అది ముస్లిం తీవ్ర వాదులచర్య అని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈవిధంగా దేశభద్రతకు సంబందించిన విషయాన్నీ కూడా అన్ని పార్టీలు రాజకీయం చేస్తూ ఉగ్రవాదులు నిశ్చింతగా మరిన్ని దాడులు చేసేందుకు అవకాశం ఇస్తున్నాయి.   దేశంలో ఇటువంటి బలహీనమయిన, ఐకమత్యంలేని రాజకీయ వ్యవస్థ ఉన్నపుడు, దేశ భద్రత విషయంలో కూడా అవి రాజకీయాలు చేస్తాయని తెలిసినప్పుడు, దర్యాప్తు సంస్థలపై అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉంటాయని తెలిసినప్పుడు, మన దేశం ఉగ్రవాదులకు లోకువగానే కనిపించడంలో ఆశ్చర్యం ఏమి లేదు. దేశ భద్రత, జాతీయ భావం కంటే తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించే రాజకీయ పార్టీలు, నేతల ధోరణి మారనంత కాలం ఉగ్రవాదులు ఈవిధంగా చెలరేగిపోతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉంటారు.

తెలంగాణా అమరవీరుల కుటుంబీకులకు ఉద్యోగాలు

  పంచాయితీ మరియు స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో నిన్న వరంగల్ జిల్లా ఖాజీపేటలో నిర్వహించిన సభలో, ముందుగా ఆయన వేదికపై అమర్చిన అమర వీరుల స్థూపం నమూనా వద్ద ఘన నివాళులు అర్పించారు. తరువాత ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికలలో తెదేపాను గెలిపిస్తే తెలంగాణా కోసం బలిదానాలు చేసిన అమరవీరుల కుటుంబీకులకు ప్రభుత్వోద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసారు. తమ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి, చేసిన ప్రతీ వాగ్దానాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తెదేపా హయంలో స్థానిక సంస్థలకు సకాలంలో నిధులు విదుదల చేస్తూ, ఎన్నికలు నిర్వహిస్తూ వాటిని బలోపేతం చేయగా, కాంగ్రెస్ అధికారం చెప్పటిన తరువాత వాటిని క్రమంగా బలహీనపరిచిందని ఆరోపించారు. తమ హయంలో సర్పంచులకు గౌరవ వేతనం కూడా ఏర్పాటు చేసిన విషయం ఆయన గుర్తు చేసారు. తెదేపా ప్రధానంగా కార్యకర్తల బలం మీదనే ఆధార పది ఉందని అందువల్ల రానున్న పంచాయితీ ఎన్నికలలో పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొన్నట్లు తెలంగాణా పేరు చెప్పుకొని తెరాస నేతలు కోట్లు పోగేసుకొన్నారని, అటువంటి పార్టీ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని ఆయన అన్నారు.

మోత్కుపల్లి హత్యకు రెక్కీ జరిగిందా

  తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ నేత మోత్కుపల్లి నరసింహులుని హత్య చేసేందుకు మావోయిస్టులు ఇటీవల రెక్కీ నిర్వహించారని అందువల్ల ఆయనకు అదనపు భద్రత కల్పించమంటూ ముఖ్యమంత్రికి లేఖ వ్రాయడంతో పార్టీలోమరియు తెలంగాణావాదులలో కలకలం రేగింది. తెదేపాలో ఉంటూ తెలంగాణా వాదం బలంగా వినిపిస్తూనే మరో వైపు పార్టీపై వస్తున్న విమర్శలను కూడా బలంగా తిప్పికొడుతూ పార్టీని ఒక కాపు కాస్తున్నఅతనికి రాజకీయ శత్రువులు ఉండటం సహజమే. ఆయన తెలంగాణా వాదం వల్ల, ఇటు సీమంధ్ర నేతలకు కూడా ఆయన శత్రువయి ఉండవచ్చును. అయితే అది ఆయనను హత్య చేసేంత తీవ్రమయిన శత్రుత్వం అవడానికి ఆస్కారం లేదు. మరి మోత్కుపల్లిని హత్యచేసేందుకు ఎవరు రెక్కి నిర్వహించారు? సీమంధ్ర నేతలా లేక తెలంగాణా నేతలా? లేక ఆయనకి ఇంకెవరయినా వేరే శత్రువులున్నారా? దళితుడనయిన తనను రాజకీయంగా ఎదుర్కొనలేకనే కేసీఆరే తనను హత్య చేయించేందుకు కుట్ర పన్ని ఉంటాడని మోత్కుపల్లి ఆరోపించడంతో దీనికి రాజకీయ రంగు కూడా పులుముకోనుంది. పంచాయితీ, స్థానిక ఎన్నికలలోగెలిచేందుకే తెదేపా తమ పై ఈవిధమయిన నిరాధారమయిన ఆఅరొపణలు చేస్తున్నారని  తెరాస నేతలు ప్రత్యారోపణలు మొదలు పెట్టవచ్చును. ఏమయినప్పటికీ, ఇది తీవ్రమయిన విషయమే. ప్రభుత్వానికి లేఖ వ్రాసి సరిపెట్టుకోకుండా ఆయన తనకు తానుగా లేదా పార్టీ తరపున భద్రత ఏర్పాటు చేసుకోవడం మంచిది.

ఎవరు డబుల్ గేమ్ ఆడుతున్నారు

  రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సగం మంది ప్రత్యేక తెలంగాణా కోసం, మరి కొంత మంది సమైక్యాంధ్ర అంటూ మాట్లాడుతుంటే, కేంద్ర మంత్రి పదవులు పుచ్చుకొన్న మరి కొంతమంది తాము అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నమంటూనే, రాష్ట్ర విభజన పట్ల తమ అభిప్రాయంలో ఎటువంటి మార్పు లేదని చెపుతున్నారు. వారు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెపుతుంటే, వారి అనుచరులు మాత్రం సమైక్యాంధ్ర అంటూ సభలు సమావేశాలు నిర్వహించడం కూడా బహిరంగ రహస్యమే. అంటే కాంగ్రెస్ పార్టీలోనే నాలుగు రకాల వాదనలు చేస్తున్నవారున్నారన్నమాట.   అయితే, నెల్లూరు కాంగ్రెస్ శాసన సభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ముఖ్యంగా వైకాపానేతలు ఈ విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. విజయమ్మ ఆదేశాల మేరకే ఆ పార్టీ శాసన సభ్యులు రాజీనామా డ్రామా ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.   ఒకవైపు ఆయన ప్రతిపక్షాలను నిందిస్తూనే, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగదని, తెలంగాణా మ్యాపులు వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదని ఆయన స్పష్టం చేసారు. అయితే, మరి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ రోడ్డు మ్యాపులు తయారు చేయమని ముఖ్యమంత్రిని, పీసీసీ అధ్యక్షున్ని, ఉప ముఖ్యమంత్రిని ఎందుకు కోరినట్లు? అది ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆనం వారి అభిప్రాయమా? అదే నిజమయితే మరి డబుల్ గేమ్ ఆడుతున్నధి కాంగ్రెస్ పార్టీనా లేక ప్రతిపక్షాలా? ఆయనే వివరిస్తే బాగుంటుంది కదా?