24 గంటల డెడ్ లైన్: చంద్రబాబు

      తెలంగాణ నోట్ కు కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. రెండు ప్రాంతాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టె రీతిలో లెక్కలేనితనంతో వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు. ''24 గంటల సమయం ఇస్తున్నాం. చర్చల ప్రక్రియ మొదలు పెట్టకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. మా పార్టీపరంగా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాం'' అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 'ఎక్కడ నుంచి మీకింత ధైర్యం వచ్చింది? అటూ ఇటూ చెరొకరు ఉన్నారనే కదా? మీకు ఓట్లు వేయకపోయినా వాళ్ళకు వేస్తారనే కదా? జగన్ సోనియాను ఒక్క మాట అనడు. రెండు ప్రాంతాల వారిని పిలిచి మాట్లాడాలని చెప్పిన నన్ను తిడతాడు. ఈ వ్యవహారంలో నెంబర్ వన్ క్రిమినల్ అయిన సోనియా పేరే ఎత్తకుండా నా గురించి మాట్లాడటానికి సిగ్గుందా? జగన్‌తో ఒప్పందం కుదరగానే విభజనపై కాంగ్రెస్ ముందడుగు వేసింది. జగన్‌పై వేసిన కేసులకు ఆధారాలు లేవని ఢిల్లీలో మెమో తయారు చేసి విమానంలో హైదరాబాద్ పంపి కోర్టులో దాఖలు చేయించారు. అందుకే సోనియా గురించి మాట్లాడకుండా జగన్ మమ్మల్ని తిడుతున్నారు' అని చంద్రబాబు విమర్శించారు.

ప్రజలే పావులుగా రాజకీయ రాక్షస క్రీడ !

     .....సాయి లక్ష్మీ మద్దాల     ఆంధ్ర -తెలంగాణా రాష్ట్ర విభజన అంశం గత కొద్ది రోజులుగా యావత్భారతవనిని సందిగ్ధ స్థితిలోకి నెట్టింది. జూలై 30 న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసింది మొదలు సీమాంధ్ర ప్రాంతంలో రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలంటూ ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. 60రోజులుగా పిల్ల,పెద్ద అనే వయో భేదం లేకుండా యావత్ సీమాంధ్ర ప్రజానీకం రోడ్ల మీదే ఉంటూ ఉద్యమం చేస్తున్నారు. 2నెలలుగా ఉద్యోగస్తులకు జీతాలు లేవు. బడుగు,బలహీన ప్రజలకు తిండి,తిప్పలు లేవు. ఈ విధంగా ఇంత కఠిన తరంగా అక్కడి ప్రజలు తమ పిల్లల చదువుల కోసం,ఉద్యోగాల కోసం,అక్కడి ప్రజల భవిష్యత్తుకోసం తమ జీవితాలను ఫణంగా పెట్టి ఉద్యమం చేపడితే,ఆ ఉద్యమం తీవ్రతను ఇసుమంతైనా గమనించకుండా,గుర్తించ కుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అత్యంత రాక్షసంగా తెలంగాణపై ఏక పక్ష నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా సీమాంధ్ర ప్రాతం ఎంత నష్ట పోతుందో,ఆ నష్టాన్ని ఎలా నివారించ గలరో ఏవిధమైన భరోసాను,వివరణను ఇవ్వలేదు. మరి సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆందోళనలకు విలువ లేనట్లేనా?ప్రజల ఆందోళనలకు విలువ లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్ధం ఏముంది?ఒక 15 ఎంపి సీట్లకోసం ఇంతగా దిగజారిపోయిన ఈ కాంగ్రెస్ పార్టీనా ఆంధ్రరాష్ట్రం రెండుసార్లు వరుసగా గెలిపించింది అని ప్రతి తెలుగువాడు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. అక్టోబర్ 3 2013 న ఆంధ్ర రాష్ట్ర విభజన నిమిత్తమై దొంగచాటుగా విభజన నోట్ పెట్టి కేంద్ర ప్రభుత్వంచే సోనియా గాంధి ఆమోదింప చేసుకుంది.కాని ఇప్పటివరకు జరిగిన మూడురాష్ట్రాల విభజనల ప్రక్రియను పరిశీలిస్తే కేంద్ర కాబినెట్ లో ఆమోదం పొందిన నోట్ శాసనసభకు తీర్మానం నిమిత్తం వెళ్ళి,అక్కడ శాసనసభ ఆమోదం కూడా పొందినతరువాత కేంద్ర మంత్రుల బృందం ఇ దే నోట్ మీద బిల్లును తాయారు చేసి రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆ బిల్లును తిరిగి మరల శాసనసభకు పంపించటం జరుగుతుంది. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి పార్లమెంట్ కు ఆమోదం నిమిత్తం ఆ బిల్లును పంపిస్తారు. పార్లమెంట్లో ఒకసారి ఆమోదం పొందిన వెనువెంటనే దానిని రాష్ట్రపతి ఆమోదిస్తారు. ఇది ఇప్పటివరకు ఏర్పాటైన కొత్త రాష్ట్రాల విషయంలో జరిగిన రాజ్యాంగ ప్రక్రియ. కాని నేడు ఆంధ్రరాష్ట్ర విభజన విషయంలో మాత్రం దీనికి విరుద్ధంగా నోటు ను శాసనసభలో ప్రవేశపెట్ట కుండ నేరుగా బిల్లును తయారు చేస్తున్నారు. ఇది సమైఖ్య రాష్ట్ర స్ఫూర్తి కి విరుద్ధం.                            నోట్ ను బిల్లుగా తయారు చేయవలసిన మంత్రుల బృందానికి నిర్ణీత గడువు హొమ్ మంత్రిత్వ శాఖ షెడ్యుల్ లో 90 రోజులు అని ఉంది. కాని ప్రస్తుతం ఈ గడువును ఆరువారాలు అనగా సగానికి కుదించారు. నవంబర్ లో రానున్నపార్లమెంట్  శీతాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకోవటానికి ఇంత హడావుడి ప్రక్రియ చేపట్టారు. వై.ఎస్.ఆర్.సి.పి  వారి రాజీనామాలతో శాసనసభలో నోట్ ను నేగ్గించుకోవాలని చూశారు. అది విఫలం కావటంతో నోట్ పై శాసనసభ ఆమోదం లేకుండానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ కుటిల రాజకీయాలను తిప్పి కొట్టటానికి రాష్ట్రపతి మరియు న్యాయ వ్యవస్థలు తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించాల్సి ఉంది.                        భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ చాలా రాష్ట్రాలు ఉద్యమం చేస్తున్నాయి. గూర్ఖాలాండ్ 1907 నుండి ఉద్యమం చేస్తోంది. విదర్భ,ఉత్తర ప్రదేశ్ లు అసెంబ్లీ తీర్మానం కూడా పొందాయి. మరి కుప్పలుతెప్పలుగా ఉన్న మిగతా రాష్ట్రాల విభజన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇంత హడావుడిగా ఒక్క ఆంద్ర రాష్ట్రాన్ని అందున ఒకే జాతిని రెండుగా చీల్చే పాపానికి కాంగ్రెస్ అధిష్టానం ఒడిగట్టింది. కేవలం ఓట్లు సీట్లతో రాహుల్ ను ప్రధానిని చేయటమే లక్ష్యంగా సోనియా గాంధి, ఆమెకు తొత్తులుగా మారిన బొత్స సత్యనారాయణ లాంటి కొంత మంది సీమాంద్ర ద్రోహులు కలిసి ఆడుతున్న వికృత క్రీడ. ఏ విధమైన భరోసా లేకుండా పూర్తి అన్యాయ భరితంగా చేపట్టిన ఈ ప్రక్రియ మీద సీమాంధ్ర నేతలు ఇప్పటికైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తగు రీతిలో ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడాలి. అన్నిటికి మించి రాష్ట్రపతి చేతులలో అవకాశం ఇంకా మిగిలే ఉంది. నేరచరితులైన నేతల కోసం చేసిన ఆర్డినెన్సు ను ఎలా చెత్త బుట్ట దాఖలు తానుగా చేయ గలిగారో,చాలా అన్యాయంగా ఏక పక్షంగా కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా తన అధికారంతో వెనక్కు తిప్పి పంపించాల్సి ఉంది. లేని పక్షంలో 1907 నుండి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న గూర్ఖాలాండ్ ను కూడా పశ్చిమ బెంగాల్ నుండి ,పశ్చిమబెంగాల్ పౌరుడైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విడగొట్టాలి. అలా చేయలేకపోతే ప్రాంతీయ వ్యత్యాసాలు చూపిస్తున్న కారణంగా ప్రధమ పౌరిడిగా ఆ పదవిలో కొనసాగే అర్హత నైతికంగా ఆయనకు లేనట్లే.                         రాజకీయ స్వార్దాలకోసం తీసుకునే నిర్ణయాలు పార్టీలకు లాభం చేకూరుస్తాయేమో గాని జాతికి మాత్రం నష్టం తెస్తాయి. కొన్ని సందర్భాలలో ఆశించిన రాజకీయ ప్రయోజనం లభించకపోగా పూర్తి వ్యతిరేక ఫలితం కూడా అనుభవంలోకి రావచ్చు. ఇప్పటికైనా ఈ నేతలందరూ తమ పార్టీల జెండాలను,అజెండాలను పక్కనపెట్టి ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడితే కొంత వరకైనా న్యాయం జరగవచ్చు.

మంత్రులు, యంపీలు రాజీనామా డ్రామాలు

  రాష్ట్ర విభజన జరుగుతోందని చాలా ముందుగానే తెలిసినప్పటికీ తెలియనట్లు నటిస్తూ ఇంతకాలం పదవులలో కొనసాగిన మంత్రులు,యంపీలు ఇప్పుడు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ రాజీనామాలు చేయడం కూడా మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడానికే. బహుశః ఇది కూడా అధిష్టానం కనుసన్నలలోనే జరిగి ఉండవచ్చును.   కేంద్రమంత్రి పదవి ఈయలేదని అలిగిన ఏలూరు యంపీ కావూరి సాంబశివరావుని కేంద్రమంత్రి కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా తీసుకొన్నారు. అయితే రాష్ట్రవిభజన అనివార్యమని అప్పటికే స్పష్టం అయినందున వర్కింగ్ కమిటీలోఉంటే ఆ నిర్ణయానికి తను కూడా అమోదముద్ర వేయవలసి ఉంటుంది గ్రహించిన కావూరి, దానివల్ల తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ముందు చూపుతోనే కేంద్ర మంత్రి పదవిని అట్టేబెట్టుకొని వర్కింగ్ కమిటీ సభ్యత్వం వదులుకొన్నారు. ఆ వెంటనే ఆయన “కేంద్రమంత్రిగా తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని” ప్రకటించడం గమనిస్తే ఆయనకి అప్పటికే రాష్ట్రవిభజన నిర్ణయం అయిపోయినట్లు తెలుసన్నసంగతి అర్ధం అవుతోంది. మరి ఆయనకి తెలిసిన ఈ విషయం మిగిలిన యంపీలకి, కేంద్రమంత్రులకి తెలియదని భావించలేము.   ఇప్పుడు కొందరు నేతలు పార్టీలు మారడానికి దీనినొక సదవకాశంగా భావించి రాజీనామాలు చేస్తే, ఇంకొందరు అధిష్టానం అనుమతి తీసుకొని, మరికొంతమంది ప్రజల పోరు భరించలేక రాజినామాలు చేస్తున్నారు తప్ప వారి రాజినామాలలో నిజాయితీ లేదు. అటువంటి నేతలు, రాజకీయ నాయకులూ ఇంకా రాష్ట్ర విభజనను అడ్డుకొంటామని పలుకుతున్న ఉత్తరకుమార ప్రగల్భాలు కూడా సీమంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికే.   ఇక ఇప్పటి నుండి ఈ సదరు నేతలు విభజన ప్రక్రియలో ప్రతీ అంచెలో తాము అడ్డుకొంటునట్లు నటించడం మొదలుపెట్టబోతున్నారు. తద్వారా ప్రజలను ప్రసన్నం చేసుకొని తమ రాజకీయ జీవితం దెబ్బతినకుండా చూసుకొందామనే తాపత్రయమే తప్ప నిజంగా అడ్డుకోవాలనే ఆలోచనతో మాత్రం కాదని ప్రజలు గ్రహించాలి. ఈ లోగా వివిద అంశాలను పరిష్కరించేందుకు ఏర్పాటయ్యే క్యాబినెట్ మంత్రి మండలితో సీమంధ్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు యుద్ధం చేస్తున్నట్లు కూడా నటించవచ్చును. వారు ఈ డ్రామాలు రెండు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో ఏర్పడేవరకూ కూడా కొనసాగిస్తూనే ఉంటారు.   అయితే రాష్ట్ర విభజన అనివార్యమనే సంగతిని సీమంధ్ర ప్రజలు, ఉద్యోగులు కూడా ఎంత త్వరగా జీర్ణించుకోగలిగితే అంత మచిది. ఇంతవరకు వచ్చిన తరువాత ఏ ప్రభుత్వము, పార్టీ కూడా తన నిర్ణయాన్నిఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకొనే అవకాశం లేదనే సంగతి వారు గ్రహించాలి. అందువల్ల రాష్ట్ర విభజనను ఆపే ప్రయత్నాలకు బదులు, సీమంధ్ర ప్రాంతం, ప్రజలు నష్టపోకుండా ఏమిచేయాలని ఆలోచనలు చేయడమే తక్షణ కర్తవ్యం.

సీమాంధ్ర మంత్రుల రాజీనామా

  తెలంగాణ నోట్‌కు కేంద్రం ఆమోదం తెలపటంతో కాంగ్రెస్‌ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి.. మొదటి నొంచి తెలంగాణ నోట్‌కు మోదం నపడితే రాజీనామ చేస్తామంటూ వస్తున్న మన రాష్ట్రనికి సంభందించిన జాతీయ నాయకులు  ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.   తమ సమక్షంలోనే తెలంగాణ నోట్‌కు ఆమోదం పడటంతో సమావేశంనుంచి మధ్యలోనే బయటికి వచ్చిన పళ్లంరాజు, కావూరి సాంబశివరావులు రాజీనామ చేసే లోచనలో ఉన్నారు. వీరితో పాటు మరో కేంద్ర మంత్రి చిరంజీవి కూడా రాజీనామకు అనుకూలంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.     వీరితో పాటు ఎంపిలు అనంతవెంటకట్రామి రెడ్డి, సబ్బం హరిలు, తమ ఎంపి పదవులతో పాటు కాంగ్రెస్‌ పార్టికి కూడా రాజీనామ చేస్తున్నారు. ఉండవల్లి, హర్షకుమార్‌, కెవిపి, పురందరేశ్వరి లాంటి మరింత మంది నేతలు ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  

48 గంటల సీమాంద్ర బంద్‌

    తెలంగాణ నోట్‌కు సంభందించి కేభినెట్ ఆమోదం లభించటంతో సీమాంద్ర భగ్గుమంది.. సమైక్యాంద్ర పరిరక్షణ సమితి తరుపున ఏపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌ బాబు రేపు దయం 6 గంటల నుంచి 48 గంటల పాటు బంద్‌కు పిలుపు నిచ్చారు.   ఎపిఎన్జీవో భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన 48 గంటల పాటు కేంద్ర కార్యాలయాలతో పాటు రహాదారులు, అన్ని ఆఫీస్‌లు, బ్యాంక్‌లు బంద్‌ చేయాలని నిర్ణయించారు. బంద్‌లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాయకులను కోరారు.   ఇప్పటికైనా కేంద్ర మంత్రులు ఎంపిలు రాజీనామాలు చేసి ప్రజా ఉధ్యమంలోకి రావాలని కోరారు.. ఇప్పటికీ ఉద్యమంలోకి రాకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.  

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

      తెలంగాణ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర హోంమంత్రి షిండే తెలిపారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. ఆంద్రప్రదేశ్ నుంచి కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని ఆయన తెలిపారు. విభజన సమస్యల పరిష్కారం కనుగొనేందుకు మంత్రుల బృందం ఏర్పాటు అవుతుందని చెప్పారు. నీటి సమస్య, ఆదాయాలు,అప్పులు, ఇతర సమస్యలపై మంత్రుల కమీటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని షిండే తెలిపారు. క్యాబినెట్ ఆమోదం పొందిన ఈ నోట్ ఇప్పుడు రాష్ట్రపతి ముందుకు వెళుతుంది. ఆయన దానిని శాసనసభ ఆమోదానికి పంపిస్తారు. కాని ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి పంపించే ఆదేశాలలో కేవలం అసెంబ్లీ అభిప్రాయాన్ని మాత్రమే తెలుసుకుంటారు గాని అసెంబ్లీ ఆమోదానికి ఎదురుచూడరని తెలుస్తున్నది.

కేబినెట్ ముందు తెలంగాణ నోట్

        తెలంగాణ నోట్ను కేంద్ర కేబినెట్ ముందు ఉంచారు. కేంద్ర కేబినెట్ భేటీ గురువారం సాయంత్రం 5-30 గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి 14 మంది మంత్రులు, 37 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు మంత్రులు హాజరయ్యారు. తెలంగాణకు చెందిన జైపాల్‌రెడ్డి, సీమాంధ్రకు చెందిన కావూరి సాంబశివరావు, పల్లం రాజులు హాజరయ్యారు. మరో మంత్రి కిశోర్ చంద్రదేవ్ మాతృ వియోగంతో సమావేశానికి గైర్హాజరయ్యారు.     అయితే కేబినెట్‌లో నోట్‌ను వ్యతిరేకిస్తామని కావూరి సాంబశివరావు తెలిపారు. మిగిలిన మంత్రుల అభిప్రాయాలు వింటామని అన్నారు.  ఈ నెల 9న ప్రధాని విదేశీ పర్యటను వెళ్లనున్నారు. ఈ లోపలే తెంగాణ అంశంపై మంత్రి మండలి ఆమోదం పొందే ప్రయత్నాలలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ నోట్ పై షిండే సంతకం పెట్టారు

      తెలంగాణ నోట్ మధ్యాహ్నం కొంత గందరగోళంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి షిండే సాయంత్రానికి నోట్ పై సంతకం చేశారు. హోంశాఖ నోట్ కు సోనియాగాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కేబినెట్ నోట్ మీద సంతకం చేశారు. అనంతరం తెలంగాణ నోట్ లను కేంద్రమంత్రులకు పంపించారని తెలుస్తోంది. దీంతో ఉదయం నుండి తెలంగాణ నోట్ మీద నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయినట్లే. కాగా సీమాంద్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పల్లంరాజులు క్యాబినెట్ నోట్ పై ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా ఉంది. మరో మంత్రి కిశోర్ చంద్రదేవ్ తన తల్లి మరణం కారణంగా ఆయన డిల్లీలో లేరు. ఈ ఇద్దరు మంత్రులు వ్యతిరేకమైనా, పెద్ద ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఈ నెల ఇరవై లోపు శాసనసభకు ఈ తీర్మానం రావచ్చని అంటున్నారు.

దాణా స్కాం కేసులో లాలూకు ఐదేళ్ల జైలుశిక్ష

      దాణా కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడి) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐదేళ్ళు శిక్షపడింది. ఆయనకు పాతిక లక్షల జరిమానా కూడా విదించింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు శిక్షను ఖరారు చేసింది. దాణా కుంభకోణం కేసులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఒకరు కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా. రెండో వారు లాలూ ప్రసాద్ యాదవ్. మొత్తం రూ.950 కోట్ల కుంభకోణంలో లాలూ సిఎంగా ఉన్న సమయంలో ఇతను రూ.35 కోట్లకు పైగా కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి.

తెలంగాణ నోట్ క్యాబినెట్ ముందుకు: దిగ్విజయ్

      తెలంగాణ నోట్ క్యాబినెట్ ముందుకు వెలుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గే అవకాశమే లేదని...తెలంగాణకు కట్టుబడి వున్నామని చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వుంటామని తెలంగాణ,సీమాంధ్ర నేతలు హామీ ఇచ్చారని, అందరిని సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నామన్నారు. కేబినెట్ నోట్ కు, ఆంటోనీ కమిటీకి సంబంధం లేదన్నారు. ఈ కమిటీ నివేదిక వచ్చే వరకు కేబినెట్ నోట్ ఆగుతుందని తాము చెప్పలేదన్నారు. విభజన అనంతరం సీమాంద్రలో తలెత్తే సమస్యల్ని పరిష్కరించడానికే ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కాబట్టి కమిటీ రాష్ట్రానికి వచ్చే వరకు వేచిచూడాలన్నారు.

తెలంగాణ నోట్ లోని విశేషాల స్పెషల్..!

      తెలంగాణకు సంబంధించి ఇప్పుడే రాదని అనకున్న తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకు తెలంగాణపై కేబినెట్ నోట్ ను సిద్ధం చేశారు. సోనియా గాంధీ సూచనల్ని అనుసరించి హోంమంత్రిత్వ శాఖ 22 పేజీల నోట్ ను తయారు చేసింది. నోట్ లో కొన్ని ముఖ్యమైన అంశాల్ని ప్రస్తావించారు. ఆర్టికల్-3 ప్రకారం విభజన జరుగుతుంది. అసెంబ్లీ తీర్మానం లేకుండానే విభజన ప్రక్రియ పూర్తవుతుంది.   తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. తెలంగాణ ఎమ్మెల్యేలు 119 మంది ఉంటారు. అందులో ఎస్సీలు 19, ఎస్టీలు 12. లోక్ సభ స్థానాలు 17 ఉంటాయి. అందులో 3 ఎస్సీలకు, 2 ఎస్టీలకు కేటాయించాలి. రాజ్యసభ సభ్యులు 8 మంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో (సీమాంధ్ర) 175 ఎమ్మెల్యే స్థానాలుంటాయి. అందులో ఎస్సీలు 29, ఎస్టీలు 7. 25 లోక్ సభ స్థానాల్లో నాలుగు ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు కేటాయించాలి. రాజ్యసభ సభ్యలు 10 మంది ఉంటారు. నదీజలాలు, ఇతర సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలి. సీమాంధ్రలో రాజధాని ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి.

బాబు, మోడీల అంతర్గత చర్చలు

      గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ తెలుగుదేశం అధినేత చంద్రబాబుల మధ్య అనుబంధం పూర్తిగా బలపడినట్లు కనిపిస్తోంది. బుధవారం సదస్సులో వీరిద్దరూ వేదికపైకి కలసికట్టుగా వచ్చి కరచాలనం చేసుకున్నారు. చంద్రబాబు ప్రారంభోపన్యాసంలో అభివృద్ధి గురించి, కాంగ్రెస్ పార్టీ దోపిడీ గురించి తన అభిప్రాయాలు చెబుతున్నప్పుడు మోడీ ఆసక్తిగా విన్నారు. అంతేకాదు.. వీరిద్దరూ దాదాపు అరగంట సేపు ఏకాంత చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలూ దేశ రాజకీయ పరిస్థితిపై తమ అభిప్రాయాలను పంచుకోవడమే కాక, ఎన్నికల పొత్తులపై కూడా నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ను పూర్తిగా నిర్మూలించాలంటే భావసారూప్యం గల పార్టీలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. భేటీ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. కాగా ఉదయం సభాస్థలిలో ప్రవేశించినప్పటి నుంచీ ఇద్దరు నేతలూ దాదాపు కలిసే గడిపారు. విద్యార్థులతో మంతనాలు జరిపారు. ఇంచుమించు 8 గంటలపాటు ఇద్దరూ అలా కలిసే గడపడం, పక్కపక్కనే కూర్చోవడం, ఒకర్నొకరు ప్రశంసించుకోవడంతో వారిమధ్య స్నేహం బలోపేతమైందనడానికి నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు.

క్యాబినెట్ ముందుకు తెలంగాణ నోట్..!

      రాష్ట్ర విభజనపై కేంద్రం దూకుడు పెంచింది. కిరణ్ ధిక్కారణ ధోరణితో ప్రక్రియను త్వరగా పూర్తి చే యాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబందించి నోట్ ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ కే రాబోతోందని పెద్ద ఎత్తున కధనాలు వస్తున్నాయి. 22 పేజీల తెలంగాణ నోట్‌ను కేంద్ర తయారు చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు చేయగా, సీమాంధ్ర రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉమ్మడి రాజధానిపై మరో బిల్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నదీ జలాలు, ఇతర సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీని నియమించన్నుట్లు సమాచారం. సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి మొదలైనవాటిని కూడా కేంద్రం, కాంగ్రెస్ అధిష్ఠానం నిశితంగా పరిశీలిస్తున్నాయని జాతీయ వార్తా చానెళ్లలో కధనాలు వస్తున్నాయి.

కాంగ్రెస్, వైకాపాల వ్యూహం

  జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సమైక్యసభకి సిద్దం అవుతున్నారు. తద్వారా ఆయన ఉద్యోగులలో చీలికలు కూడా తేగలిగారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు సమ్మె విరమించుకోగానే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుపెట్టవచ్చును. అయితే జగన్మోహన్ రెడ్డి అప్పుడేమి చేస్తాడు? అని ఆలోచిస్తే కేసీఆర్ ని అతని కుటుంబ సభ్యులని, తెరాస పార్టీని ఈ సందర్భంగా ఒకసారి తలుచుకోక తప్పదు. తెలంగాణాలో కేసీఆర్ మరియు అతని కుటుంబ సభ్యులు తమ మాటలతో అగ్గి రాజేస్తూ ఇంతకాలంగా తెలంగాణా సెంటిమెంటు తగ్గిపోకుండా కాపాడుకొంటూ ఏ విధంగా రాజకీయ ప్రయోజనం పొందగలిగారో, అదేవిధంగా ఇక ముందు సీమంద్రాపై పూర్తి ఆధిపత్యం పొందేందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల వరకు సమైక్యాంధ్ర ఉద్యమాలు కొనసాగించవచ్చును.   ఒకసారి రాష్ట్ర విభజన జరుపుకోవడానికి మార్గం సుగమమం అయిపోయిన తరువాత, వైకాపా సమైక్య ఉద్యమాలు చేసుకోవడాన్నికాంగ్రెస్ కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. పైగా అతనిని పరోక్షంగా ప్రోత్సహించవచ్చును. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో సీమంద్రాలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఎలాగు వీలుకాదు కనుక అటువంటప్పుడు కేంద్రంలో తమకు మద్దతు ఇస్తామని చెపుతున్న వైకాపాను ప్రోత్సహిస్తే, తద్వారా తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చుకూడా.   ఈలోగా మరికొన్ని డమ్మీ సమైక్య పార్టీలను సృష్టించగలిగితే, వాటి ద్వారా ఓట్లు చీల్చి ఎన్నికల తరువాత ఆ డమ్మీపార్టీలు సాధించిన సీట్లను బట్టి వీలయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో, అక్కడ కేసీఆర్ తో అధికారం పంచుకోగలదు. బహుశః ఈ వ్యూహంతోనే ఆ రెండు పార్టీలు ముందుకు సాగుతున్నట్లున్నాయి.

సమైక్యం పేరిట విభజన

  జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో తలపెట్టిన సమైక్య శంఖారావం సభకి పోలీసుల అనుమతి దొరుకుతుందో లేదో, దొరికినా సభని తెలంగాణావాదులు జరుగనిస్తారో లేదో తెలియదు. కానీ, అతను పన్నిన ఈ వ్యూహంతో ఏపీఎన్జీవోల మధ్య ఊహించినట్లే చీలికలు సృష్టించగలిగాడు. ఇంతవరకు రాజకీయ పార్టీలను దూరంగా ఉంచుతూ ఎంతో ఐకమత్యంగా సమైక్యఉద్యమం చేస్తున్నఎన్జీవోలు, కొందరు అతని సభలో పాల్గోనాలని, మరి కొందరు దూరంగా ఉండాలని నిశ్చయించుకావడంతో చీలికలు మొదలయ్యాయి. హైదరాబాద్ సచివాలయ సీమంధ్ర ఉద్యోగులు, అదేవిధంగా సీమంధ్ర ప్రాంతం నుండి మరి కొంత మంది ఉద్యోగులు ఈ సభలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.   గత రెండు నెలలుగా కేవలం ఏపీయన్జీవోలు చేస్తున్న సమ్మె కారణంగానే రాష్ట్ర విభజనపై అడుగు ముందుకు వేయలేకపోతున్న కేంద్రం, ఇప్పుడు జగన్ వలన వారిలో చీలికలు ఏర్పడితే ఇక త్వరలో తన పని మొదలుపెడుతుంది. అక్టోబర్ మొదటి వారంలో టీ-బిల్లు క్యాబినెట్ ముందు ప్రవేశపెట్టి తీరుతామని బల్ల గుద్ది మరీ చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, ఏపీఎన్జీవోలు తమ సమ్మెను అక్టోబర్ 15వరకు పొడిగిస్తున్నామని ప్రకటించగానే, టీ-బిల్లుని కూడా సరిగ్గా రెండు వారాలకి వాయిదా వేసుకోవడం గమనిస్తే, కాంగ్రెస్ అధిష్టానం ఉద్యోగులు వెనక్కి తగ్గగానే రాష్ట్ర విభజన ప్రక్రియను మొదలుపెట్టాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు అర్ధం అవుతోంది.   జగన్ సమైక్యాంధ్ర సభ అంటూనే ముందుగాఉద్యోగుల సమైక్యఉద్యమాన్ని దెబ్బతీయడం గమనిస్తే, అతను రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ అధిష్టానానికి పరోక్షంగా సహకరిస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఈవిధంగా కాంగ్రెస్ అధిష్టానం ఉద్యోగుల సమ్మెను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తూనే, మరో వైపు వారికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు చెప్పబడుతున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించేందుకు, ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన బొత్స, ఆనం, చిరంజీవి వంటి కొందరు సీమంధ్ర కాంగ్రెస్ నేతలతో పావులు కదుపుతోంది.   అందుకే కుంటి సాకులు చెప్పి టీ-బిల్లుని రెండు వారాలకి వాయిదా వేసుకొంది. బహుశః ఈ రెండు పనులు రాగల 10-15రోజుల్లో పూర్తి చేసి రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుపెట్టవచ్చును. జగన్ హైదరాబాదులో తలపెట్టిన సమైక్య సభ తేదీ (అక్టోబర్ 19)యే ఇందుకు ముహూర్తమేమో?

బామ్మ వేషంలో టిడిపి ఎంపీ

      ఎంపీ శివప్రసాద్ కొత్త అవతారమెత్తాడు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన ముసలి వితంతువు వేషం వేశాడు. విలేకరుల ముందుకొచ్చి తనదైన శైలిలో సమైక్యాంధ్రకకు మద్దతుగా తన వాణి వినిపించాడు. తన భర్త చనిపోయాడని.. ఆయన ఉన్నపుడు రాష్ట్రం బాగుండేదని.. ఆయన పోయాక రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని విలపిస్తూ ఆ పాత్రను రక్తి కట్టించారు. గాంధీ తాత ఎక్కడ చూసినా కర్ర పట్టుకుని నిలుచుని ఉంటాడని.. ఐతే ఆయన ఆ కర్ర పట్టుకుని వచ్చి సోనియా గాంధీ నెత్తిన ఒక దెబ్బ.. కేసీఆర్ ముఖం మీద మూడు దెబ్బలు కొట్టాలని.. అప్పుడైనా వాళ్ల బుద్ధి మారుతుందని అన్నారు. డీకే అరుణ కూతురిని నెల్లూరు వాసికిచ్చి పెళ్లి చేసిందని, గీతా రెడ్డి భర్తది కర్నూలని, సబితా ఇంద్రారెడ్డి కోడల్ని తూర్పు గోదావరి నుంచి తెచ్చుకుందని, మల్లు రవి.. కోనేరు రంగారావు కూతుర్ని చేసుకున్నాడని.. కేసీఆర్ ది విజయనగరమని.. కేటీఆర్ భార్య కాకినాడ అమ్మాయి అని చెప్పారు. ఇప్పుడు వీళ్లంతా విడిపోతారా.. సీమాంధ్రతో సంబంధాలు తెంచుకుంటారా అని ప్రశ్నించారు.

కేవలం ఐదారుగురు మంత్రులే సమైక్యం కోరుకొంటున్నారు: డొక్కా

  మొన్నముఖ్యమంత్రికి వ్యతిరేఖంగా ముఠాకట్టిన తొమ్మిది మంది సీమంధ్ర మంత్రులలో ఒకరయిన మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, మీడియాతో మాట్లాడుతూ " సీమంధ్ర మంత్రులలో కేవలం కేవలం ఐదారుగురు మంత్రులు మాత్రమే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొంటున్నారని, మిగిలినవారు గందరగోళంలో ఉన్నారని" బాంబు పేల్చారు.   మొన్న మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై యుద్ద భేరి మ్రోగించగా నేడు మంత్రి డొక్కా ఆయనపై నేరుగా యుద్దమే మొదలుపెట్టేసారు. ముఖ్యమంత్రి అధిష్టానం తీసుకొన్న నిర్ణయాన్ని ఎదిరించడం, తప్పుబట్టడం చాలా తప్పని అన్నారు. ముఖ్యమంత్రి చుట్టూ కొంత మంది చెక్కభజన చేస్తున్నారని, వారి కారణంగానే ఆయన ఆవిధంగా మాట్లాడుతున్నారని డొక్కా ఆరోపించారు. ఆయన కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఖండించకపోవడంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు.   ముఖ్యమంత్రిగా ఉన్నకిరణ్ కుమార్ రెడ్డి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయకపోగా వారి మధ్య విద్వేషాలు మరింత రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తాము కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖించమని ఆయన స్పష్టం చేసారు. అయితే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని అధిష్టానాన్ని కోరుతామని ఆయన తెలిపారు.   ఇంత వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కేవలం తెలంగాణా మంత్రులు, ప్రతిపక్ష పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. కానీ బహుశః రేపటి నుండి మిగిలిన సీమంద్రా మంత్రులు కూడా ఆయనకు వ్యతిరేఖంగా తమ గొంతులు సవరించుకొని విమర్శలు గుప్పిస్తారేమో. దీనివలన ఇప్పటికే దెబ్బ తిన్న కాంగ్రెస్ ప్రతిష్ట మరింత దిగజారడం ఖాయం. అది సమైక్యవాదం చేస్తున్న వైకాపాకు లబ్ది చేకూర్చే అవకాశం ఉంది. అదే విధంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడం ద్వారా, రాష్ట్ర విభజనకు అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేసిన సదరు నేతలు సమైక్యవాదుల ఆగ్రహానికి గురి కాక తప్పదు.

రాహుల్ దెబ్బకి ఆర్డినెన్స్ వెనక్కి

  నేరచరితులయిన ప్రజాప్రతినిధులను వెనకేసుకు వస్తూ యూపీయే ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా ఆక్షేపించడంతో ఆ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించింది. ఇది పార్టీకి, ప్రభుత్వానికి చాలా అవమానకరమే అయినప్పటికీ, దానిని కొనసాగించడం వలన కూడా ప్రతిపక్షాల చేతిలో మరింత పరాభవం తప్పదనే సంగతి గ్రహించిన కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకొంది. ఈ రోజు సాయంత్రం ప్రధాని డా. మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ ఆర్డినెన్స్ రద్దుచేయవచ్చును.   అందువల్ల ఇక నుంచి సుప్రీంకోర్టు జూన్ 10న ఇచ్చిన తీర్పు అమలులో ఉంటుంది గనుక, రెండేళ్ళు జైలు శిక్షపడిన ప్రజాప్రతినిధులు ఇకపై ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. ఇప్పటికే మెడికల్ సీట్ల కుంభకోణంలో శిక్షపడిన కాంగ్రెస్ యంపీపై అనర్హత వేటుపడనుండగా, పశువుల దాణా కుంభకోణంలో దోషిగా నిర్దారింపబడిన బీహార్ మాజి ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కి రాంచీలో సీబీఐ కోర్టు రేపు జైలు శిక్ష ఖరారు చేస్తే అతను అనర్హత వేటు పడ్డ రెండవ వ్యక్తవుతారు.   రాష్ట్రంలో తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ ఇంతలు ఇదే అంశం ప్రస్తావిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి రేపు కోర్టు జైలు శిక్ష విదిస్తే అతనిపై కూడా అనర్హత వేటు పడక తప్పదని జోస్యం చెపుతున్నారు.