balakrishna TDP

నారావారిపల్లెలో బాలయ్య సందడి

        తెలుగు హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణల తన బావ నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లారు. ప్రస్తుతం బాలకృష్ణ తన సంక్రాంతి సంబరాలను వియ్యంకుడు ఇంట్లో జరుపుకుంటున్నారు. శనివారం రాత్రి నారావారిపల్లిలోని బావ చంద్రబాబు ఇంటికి చేరుకున్న బాలయ్య అభిమానులతో కరచాలనం, నమస్కారాలు చేస్తూ సందడిగా కనిపించారు. అభిమానులు, పల్లెప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబసభ్యులు సందడిచేశారు. వీరి రాకతో గ్రామంలో ఒకరోజు ముందుగానే సంక్రాంతి పండుగ వాతావరణం కనిపించింది. మరోవైపు చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉండటంతో ఆయన ఖమ్మం జిల్లాలోనే సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సెయింట్ జోసెఫ్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు పాఠశాల ఆవరణలో భోగిమంటలు, ముగ్గుల పోటీలు, పతంగుల ప్రదర్శన, గంగిరెద్దుల ఆటలు లాంటివి ఏర్పాటుచేసి సంక్రాంతి సందడి సృష్టించారు.

 Kakinada MLA resigns from Congress

కాంగ్రెస్‌కు ద్వారంపూడి రాజీనామా

          కాకినాడ అర్బన్ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఆదివారం కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశాడు. పార్టీకి రాజీనామా చేసిన అతను తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేయనని ప్రకటించారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఉద్దేశ్య పూర్వకంగా కాంగ్రెసు ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలను ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా సంక్షేమం కాంగ్రెసు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. తన రాజీనామా లేఖను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు పంపినట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కిరణ్ ప్రభుత్వాన్ని అవిశ్వాసం ద్వారా గద్దె దింపే ప్రయత్నాలు చేస్తానని వెల్లడించారు.

Seethamma Vakitlo Sirimalle Chettu

"సీతమ్మ వాకిట్లో..."ఈ ఆనందం ప్రత్యేకం..!

          "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" మొదటి ఆట పూర్తికాగానే మీడియా మిత్రులంతా అభినందిచడంతో నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయని దిల్ రాజు చెప్పారు. ఉదయం అలాగే చాలా మంది ఫోన్లు చేసి ఒక అద్భుతమైన, అందమైన తెలుగు సినిమా తీశారని ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. సినిమాను ఎలా ఆదరిస్తారోనని భయపడ్డాను. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు ఫోన్‌ చేసి మేమందరం మరిచిపోయిన లైన్‌ని నువ్వు సినిమాగా తీశావ్‌, దర్శకుడికి, నీకు హ్యాట్సాఫ్‌ అని చెప్పడం, మంత్రి శ్రీధర్‌బాబు ఫోన్‌ చేసి చాలా కాలం తరువాత ఓ మంచి సినిమా చూశాను, ఈ సినిమా డివిడి రాగానే నాకే ముందు పంపించు, ప్రతి రోజు చూడాల్సిన చిత్రమిదని అన్నారు. ఇద్దరి హీరోల అభిమానులు కూడా మాకు హీరోలు కనిపించలేదు, వాళ్ళ క్యారెక్టర్లు మాత్రమే కనిపించాయని చెప్పడం మరింత ఆనందాన్నిచ్చింది. మా బ్యానర్లో ఇన్ని సినిమాలు వచ్చినా ఈ సినిమాకు లభించిన ఆనందం ఇంతకు ముందు లభించలేదు” అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు.

congress party

తెలంగాణాపై కొనసాగుతున్న చర్చలు

    కేంద్రం విదించుకొన్న నెల రోజుల గడువు ముగియడానికి ఇంకా కేవలం 15 రోజుల మాత్రమే ఉంది. ఈ నెల 28వ తేదీతో ఆ గడువు ముగియగానే, కేంద్ర నిర్ణయంతో రాష్ట్ర పరిస్థితి ఏవిదంగా మార బోతుందనే ఆందోళన రాజకీయ వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ, మినీ కోర్ కమిటీ, వార్ రూమ్ మీటింగ్, మేధో మధనం అంటూ ఈ సమస్యను పరిష్కరించడానికి చాలా కష్టపడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈవిదంగా చేతులుకాలేక ఆకులు పట్టుకొనే పరిస్థితి తన చేజేతులా కొని తెచ్చుకోనదే అని చెప్పక తప్పదు. ఈ కష్టం ఏదో అదిముందే పడిఉంటే, రాష్ట్రంలో ఇంత అనిశ్చితి, ఇంత నష్టం ఉండేదికాదు. కాంగ్రెస్ కి ఈ జ్ఞానోదయం కలగడానికి రాష్ట్ర ప్రజలు చాల భారీ మూల్యమే చెల్లించేరు. ఏమయినప్పటికీ కాంగ్రెస్ ఇప్పటికయినా మేల్కొనడం సంతోషించవలసిన విషయమే.   తెరాస అధినేత కేసిర్ తో కాంగ్రెస్ అధిష్టానం తన దూతల ద్వారా చర్చిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరో వైపు, సీమంద్ర నాయకుల తాజా ప్రకటనలు చూస్తుంటే కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రం ఏర్పరచబోతోందని వారు నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గానీ, రాష్ట్ర విభజనకు పూనుకొంటే, మేము రాజీనామా చేస్తామని అప్పుడే కొందరు శాసన సభ్యులు ప్రకటనలు చేస్తుండటం గమనిస్తే, కాంగ్రెస్ ఏమి వారు చేయబోతోందో గ్రహించినట్లు తెలుస్తోంది.   కేంద్రం రాష్ట్ర విభజన విషయంలో ప్రస్తుతం పులి మీద సవారి చేస్తున్నట్లే భావించవచ్చును. అయితే, సమస్యని ఇప్పటికీ పరిష్కరించుకోలేకపోతే, అది మరింత అరాచకానికి దారి తీసి తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది. కష్టమయినా, నష్టమయినా రాజకీయ పార్టీలు పట్టువిడుపులు ప్రదర్శించి విజ్ఞత చూపినప్పుడే రాష్ట్రంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. స్వార్ద రాజకీయ ప్రయోజనాలకోసం పార్టీలు ఇంకా తెలంగాణా లేదా సమైక్యంద్ర అంటూ ఉద్యమాలు కొనసాగిస్తే రాష్ట్రం మరెన్నటికీ కోలుకోలేని దారుణ పరిస్థితులకి చేరుకొంటుంది. రాజకీయాలకు సమాంతరంగా రకరకాల వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాదించుకొంటున్న రాజకీయ నాయకులకి వీటి వల్ల ఏమీ తేడా లేకపోయినప్పటికీ, సామాన్య ప్రజలు మాత్రం వాటి దుష్పరినామాలని చిరకాలం ఎదుర్కోకతప్పదు.

Rowdy sheet opened on Paritala sriram

పరిటాల పై రౌడీషీట్

        అనంతపురం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే కామేపల్లి సుధాకర్ రెడ్డి హత్యకు కుట్రపన్నిన కేసులో పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఇప్పటికే పోలీసులకు దొరకకుండా ఈ కేసులో బెయిలు తెచ్చుకున్న శ్రీరామ్ మీద పోలీసులు రౌడీ షీట్ తెరిచేందుకు ప్రయత్నాలు చేయడం జిల్లాలో సంచలనం రేపుతోంది. కేవలం కక్ష్య సాధింపుతోనే ఈ రౌడీ షీట్ తెరుస్తున్నారని, శ్రీరామ్ ను అనవసరంగా ఈ ఉచ్చులోకి లాగుతున్నారని పరిటాల అభిమానులు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే కామేపల్లి సుధాకర్ రెడ్డి నాకు ఎలాంటి విభేదాలు పరిటాల కుటుంబంతో లేవని పలుమార్లు చెప్పారని, అయినా పోలీసులు ఇందులో చూయిస్తున్న అతృతను బట్టి రాజకీయ కోణంలోనే పోలీసుల చర్యలు ఉన్నాయని అంటున్నారు. యువకుడయిన శ్రీరామ్ భవిష్యత్ ను దెబ్బతీసేందుకు ఈ చర్యలు అని అంటున్నారు. మొత్తం ఈ కేసులో ఉన్న 11 మంది మీద రౌడీ షీట్ తెరుస్తున్నారు. మరో వైపు ఈ కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చారని, పరోక్షంగా సాయం చేశారని పరిటాల సునీత, మరో టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ నేత మీద కేసులు పెట్టనున్నట్లు తెలుస్తోంది.  

YS sharmila

షర్మిల పాదయాత్ర ఫిబ్రవరి నుంచి ప్రారంభం

        మోకాలి గాయంతో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను నిలిపేసిన జగన్ సోదరి వైఎస్ షర్మిల పిబ్రవరి లో పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తుందని సమాచారం. ఈ మేరకు ఆమెకు వైద్యం చేసిన వైద్యుడు శివభరత్ రెడ్డి ఈ విషయం వెల్లడించాడు. షర్మిల వేగంగా కోలుకుంటుందని, పిబ్రవరి మూడో వారంలో పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని అన్నారు. ఆరువారాల విశ్రాంతి పూర్తి కాగానే ఆమె మోకాలిని పరీక్షించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గాయం అయిన మొదటి రెండు రోజులు దాని తీవ్రతను గుర్తించలేకపోయామని, ఆ తరువాత గాయం తీవ్రత తెలిసి ఎమ్ ఆర్ ఐ స్కాన్ తీయడంతో గాయం తీవ్రత కనిపించిందని అన్నారు. అందుకే శస్త్రచికిత్స నిర్వహించామని, ప్రస్తుతం ఫిజియోథెరపీ నిపుణుల సాయంతో షర్మిల కోలుకుంటుందని అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు షర్మిల పాదయాత్ర మొదలవుతుందని, ఆ లోపు వైఎస్ జగన్ జైలు నుండి విడుదలయితే ఆయనే ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తారని అన్నారు.  

Akbaruddin Owaisi police custody

పోలీసుల కస్టడీలోకి అక్బరుద్దీన్, విచారణ

        వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్టైన అక్బరుద్దీన్ ఓవైసీకి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అదిలాబాద్ సబ్ జైలు నుంచి పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. ఈ విచారణ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది. కస్టడీలోకి తీసుకొనే ముందు జైలులో అక్బరుద్దీన్ కు రిమ్స్ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్బరుద్దీన్ ఓవైసీని  ఐదు రోజులపాటు పోలీస్ స్టడీ విధిస్తూ నిర్మల్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అక్బర్‌ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు పెట్టుకున్న పిటిషన్‌పై శుక్రవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు ముగిసిన అనంతరం తీర్పును మధ్యాహ్నానికి వాయిదా పడింది. భోజన విరామం అనంతరం న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

TDP MLAs arrested

టిడిపి ఎమ్మెల్యేలు అరెస్ట్...

      విద్యుత్ చార్జీలు తగ్గించాలని, నిరంతరం 7 గంటలు కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సచివాలయంలో ధర్నా చేపట్టారు. సీఎం కార్యాలయం సమతా బ్లాక్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి, ఎమ్మెల్యే క్వార్టర్స్‌వైపు తీసుకు వెళ్ళారు. మొదట విద్యుత్ సౌధ వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. అక్కడ భారీగా పోలీసులు మోహరించడంతో టీడీపీ వ్యూహం మార్చింది. సచివాలయంలో సీఎస్ మధ్యూస్‌కు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించి అక్కడకు వెళ్ళగా సీఎం, సీఎస్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉండడంతో కలవలేకపోయారు. అనంతరం అక్కడే ఆందోళనకు దిగారు.    

Paritala Sriram

అజ్ఞాతం వీడిన పరిటాల, పోలీసుల ఎదుట ప్రత్యక్షం

        అజ్ఞాతంలో ఉన్న పరిటాల శ్రీరామ్ గురువారం బయటికి వచ్చాడు. ధర్మవరం పోలీసుల ఎదుట హాజరై బెయిలు పత్రాలు అలాగే కోర్టు  రూ.25 వేల పూచికత్తును సమర్పించాడు. కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారన్న కేసులో పరిటాల శ్రీరామ్‌తో పాటు పదిహేను మందిపై ధర్మవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిటాల శ్రీరామ్ అరెస్టు తప్పదని భావించిన శ్రీరాం కోర్టులో ముందస్తు బెయిలు పిటీషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం బుధవారం శ్రీరాంకు ముందస్తు బెయిలు ఇచ్చింది. శ్రీరాంతో పాటు ఈ కేసులో ఉన్న రాఘవేంద్రకు ముందస్తు బెయిలు వచ్చింది. వడ్డె నాగరాజు, రామకృష్ణ, శ్రీనివాసులులకు రెగ్యులర్ బెయిలు లభించింది. శ్రీరామ్ పోలీసు స్టేషన్‌కు వచ్చిన సమయంలో భారీగా పరిటాల అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు.  

Hate speech row

అక్బరుద్దీన్‌ జైలు: ఓయూ పోలీస్ స్టేషన్‌ కు..?

          వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై ఓయూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. శుక్రవారం ఓయూ పోలీస్ స్టేషన్‌లో అక్బరుద్దీన్ హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఓయూ పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను పీటీ వారెంట్‌పై అక్బరుద్దీన్‌ను తీసుకొచ్చే అంశంపై న్యాయ నిపుణులతో ఓయూ పోలీసులు చర్చిస్తున్నారు. ప్రస్తుతం అక్బరుద్దీన్ ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్నాడు. అయితే అక్బరుద్దీన్ ను హైదరాబాద్ కు తీసుకురావడంతో పాటు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ప్రసంగాలను ప్రసారం చేసిన ఛానళ్లకు కూడా నోటీసులు ఇచ్చే అంశాన్ని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఆయా ఛానళ్లకు నోటీసులు జారీ చేసి ఆ ప్రసంగాలకు సంబంధించిన టేపులను అందించాల్సిందిగా కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే అక్బరుద్దీన్ ను హైదరాబాద్ తీసుకురావడం కంటే అక్కడే విచారిస్తే సరిపోతుందని, పోలీస్ స్టేషన్ లో హాజరుపరిచేందుకు ఇంతదూరం తీసుకురావడం ఉద్రిక్తతలకు దారితీస్తుందని భావిస్తున్నారు.

mysoora reddy

మజ్లిస్, తెరాస సేం సేం: మైసూర రెడ్డి

    యం.ఐ.యం. పార్టీ శాసన సభ్యుడు అక్బరుదీన్ ఓవైసీ చేసిన విద్వేష ప్రసంగంపై యావత్తు దేశమూ ముక్తకంఠంతో నిరసనలు తెలియజేస్తుండగా, అతని స్నేహహస్తం అందుకోవాలని తహతహ లాడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు అతని ఖడించక నోరు మెదపకుండా కాలక్షేపం చేస్తోంది. అయితే, తెరాస మరియు తెదేపాలు, ఆ పార్టీని దుయ్యబడుతూ ‘వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకూడా మతతత్వ పార్టీ గనుకనే అది మజ్లిస్ ని విమర్శించడానికి వెనుకాడుతోందని’ దాడి చేస్తుండటంతో, దానివల్ల తమ పార్టీకి మతతత్వ పార్టీ అనే ముద్రపడుతుందనే భయంతో ఈ రోజు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి మీడియా ముందుకువచ్చి మొట్ట మొదటిసారి అక్బరుదీన్ విషయంలో నోరువిప్పారు. అయితే, అతి జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడిన అయన కర్ర విరగకుండా, పాము చావకుండా, అన్న రీతిలో ఖండించేరు.  అయన మీడియాతో మాట్లాడుతూ “మా పార్టీ సెక్యులర్ పార్టీ. మతం పేరిట, ప్రాంతాల పేరిట ప్రజల మద్య విద్వేషాలు రెచ్చగోట్టడాన్ని మా పార్టీ ఎన్నటికీ సమర్దించదు. అతను అక్బరుద్దీన్ కావచ్చు, లేదా కేటీఆర్ లేదా చంద్రబాబు మరెవరయినా కావచ్చును, గానీ ఎవరూ కూడా మతం, ప్రాంతం పేరిట ఇతరులను దూషించడం, ప్రజల మద్య విద్వేషాలు రెచ్చగొట్టడం చాలా తప్పుగా మేము భావిస్తున్నాము. అటువంటి వారితో ఏవిదంగా వ్యహరించాలో మన చట్టాలకి, న్యాయస్థానాలకి  తెలుసు. ఇటువంటి సున్నితమయిన అంశాలను కూడా రాజకీయం చేసి మా పార్టీ పై బురద జల్లాలనుకోవడమే దురదృష్టకరం. మా పార్టీని మతతత్వ పార్టీ అని వేలెత్తి చూపుతున్న ఇదే చంద్రబాబు ఒకనాడు కేంద్రంలో చక్రం తిప్పేందుకు మతతత్వ పార్టీ అయిన బీజేపీ తో చేతులు కలిపిన సంగతి ఆయన మరిచిపోయినా ప్రజలు నేటికీ మరిచిపోలేదని ఆయన తెలుసుకోవాలి. రాజకీయ పార్టీలు ప్రజలను సన్మార్గంలో నడిపించాలి తప్ప ఇటువంటి విషయాలను అవకాశంగా తీసుకుని ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని తెలుసుకోవాలి.’’   మైసూర రెడ్డి తమ పార్టీని వెనకేసుకు వస్తూనే, తెరాస కూడా ప్రాంతీయ భావాలు రెచ్చగొడుతోందని ఆరోపించడం ద్వారా అది కూడా మజ్లిస్ పార్టీకి తక్కువేమికాదనే అభిప్రాయం వెలిబుచ్చేరు. అదే సమయంలో తెదేపా-భాజపాల మైత్రీ బందం మరో మారు చంద్రబాబుకు గుర్తుచేసి, ఆ పార్టీ అధికారం కోసం ఒక మతతత్వపార్టీతో చేతులు కలపడానికి వెనకాడలేదని చెపుతూనే, మరి అటువంటప్పుడు తాము మాత్రం మజ్లిస్ పార్టీతో కలిస్తే తప్పేమిటనట్లు ఉదేశ్యం వెలిబుచ్చేరు. కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తూ ‘దానికి మద్దతు ఇస్తే ఒకలాగా, మద్దతు ఇవ్వకపోతే మరోలాగా ఆ పార్టీ వ్యవహరిస్తోందని’ అన్నారు.   మొత్తం మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్ర విరగకుండా, పాము చావకుండా ఈ విదంగా మాట్లాడటం మెచ్చుకోవలసిందే.  శాస్త్రప్రకారం ‘మమ’ అనడం జరిగింది. తమ రహస్య స్నేహితుడిని నొప్పించకుండా మాట్లాడటం జరిగింది. పనిలోపనిగా తమపార్టీని ఎండగడుతున్న శత్రు పార్టీలకు చురకలు కూడా వేయడం అయిపొయింది. అందుకే రాజకీయ పార్టీలు మైసూరా వంటి సీనియర్ రాజకీయ నేతలను కోరుకుంటాయి.      

Andhra Pradesh government decides to ban gutkha

రాష్ట్రంలో గుట్కాలు నిషేధం

      రాష్ట్రంలో గుట్కాలు, పొగాకుతో కలిపిన అన్ని రకాల పాన్‌ మాసా లాలను నిషేధిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. ఆహార భద్రతాశాఖ కమిషనర్‌ ప్రజా రోగ్యం దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా గుట్కాలతోపాటు అన్ని రకాల పొగాకు పాన్‌ మాసాలాలను నిషేధిం చడానికి అనుమతి ఇవ్వాలని చేసిన అభ్యర్థనను ప్రభుత్వం అంగీకరించింది. వాటిని నిషేధిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్‌ 6 ను విడుదల చేసింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుంది. రాష్ట్రంలో పొగాకు కలిపివున్న గుట్కా, పాన్‌ మాసా లాల ఉత్పత్తి, నిల్వలు, అమ్మకాలు, రవాణా చేయ రాదని ప్రకటించింది. మార్కెట్‌లో వివిధ రకాల పేర్లతో గుట్కా, పాన్‌మాసాలాలు నిల్వ ఉంచడంపై పూర్తి నిషేధాన్ని విధించడమైంది. నిషేధిత పదార్ధాల రవాణాను అరికట్టడానికి రాష్ట్ర సరిహద్దు ల్లో చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి నిషేధం అమలుకు విస్తృత ప్రచారాన్ని కల్పిస్తూ అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలని జిఒలో ప్రభుత్వం సూచించింది.

paritala sriram bail

పరిటాల శ్రీరామ్ కు ముందస్తు బెయిల్

          పరిటాల శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. అనంతపురం జిల్లా కోర్ట్ అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పరిరిటాల శ్రీరామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై జిల్లా కోర్టులో మంగళవారం వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ రోజు తీర్పు చెప్పింది. ఆనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కాంగ్రెస్‌ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌ పై జరిగిన హత్యకుట్రలో పరిటాల రవి కుమారుడయిన పరిటాల శ్రీరాంపై పోలీసులు కేసు నమోదు చేయడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయేడు. అతను తన లాయర్ ద్వారా ఈ నెల 2వ తేదిన ఆనంతపురం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసాడు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు తన తీర్పును రేపటికి అనగా బుధవారానికి వాయిదా వేసింది. పరిటాల శ్రీరామ్ ఈ నెల 7వ తేదిన సింగపూర్ వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొన్న తరుణంలో పోలీసులు కేసు నమోదు చేయడం, అతను అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. అతని తల్లి పరిటాల సునీత,మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీయే తమను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్నినట్లు ఆరోపించారు.  

Akbaruddin Owaisi Arrested

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్ట్

        ఎట్టకేలకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రిలో జరిగిన వైద్యపరీక్షల అనంతరం అక్బరుద్దీన్ ఆరోగ్యం సాధారణంగానే ఉందని వైద్యుల బృందం తేల్చిచెప్పింది. నిర్మల్ కు వాహనంలో తీసుకెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని తేలడంతో అక్బరుద్దీన్ ను అరెస్టు చేసినట్లు వరంగల్ జిల్లా రేంజి డీఐజీ వెంకటేశ్వర్ రావు వెల్లడించారు. ఈ మేరకు అక్బరుద్దీన్ కి, ఆయన తరపు న్యాయవాదికి అరెస్టు విషయం వెల్లడించారు. అక్బరుద్దీన్ని అరెస్ట్ చేస్తున్నారని తెలియడంతో ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్న ఎంఐఎం కార్యకర్తలు చేరి,పోలీసులకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నారు. పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి చెదరగొడుతున్నారు. అక్బరుద్దీన్ ను తరలించేందుకు ఓ బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు, పది వాహనాల కాన్వాయ్ ని పోలీసులు సిద్దం చేశారు.  గాంధీ ఆసుపత్రి నుండి సికింద్రాబాద్, జూబ్లీ బస్ స్టాండ్, కామారెడ్డిల మీదుగా పోలీసులు ఆయనను నిర్మల్ తరలించనున్నారు.

అక్బరుద్దీన్ కి వైద్య పరీక్షలు పూర్తి... అరెస్టు చేస్తారా?

      ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో సుమారు మూడు గంటల పాటు ఐదుగురు వైద్యుల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించింది. అక్బరుద్దీన్ శరీరంలో బుల్లెట్ ఉన్నందున ఎంఆర్ఐ స్కానింగ్ చేయలేదు. పొత్తికడుపులో నొప్పిగా ఉందని అక్బరుద్దీన్ వైద్యులకు తెలపడంతో… పొత్తికడుపు స్కానింగ్ పూర్తయిన తర్వాతనే వైద్య పరీక్షల నివేదికను వైద్యులు పోలీసులకు అందజేయనున్నారు. ప్రస్తుతం వైద్యుల నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఆయనను అరెస్టు చేయాలా ? వద్దా ? అన్న నిర్ణయం దాని మీదనే ఆధారపడి ఉంది.

జగన్ విడుదల కాంగ్రేసుకి మరణ శాసనం కానున్నదా?

  ఒక సమున్నత స్థాయిలోఉన్న తనను జైలుకీడ్చి తన జీవితంతో చెలగాటమాడుకొంటున్న కాంగ్రెస్ పార్టీపై పగతీర్చుకొనేందుకు జగన్మోహన్ రెడ్డి సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. సిబిఐ మరియు కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా ఎంత ప్రయత్నించినా తనను మరో రెండు నెలలకు మించి జైల్లో ఉంచడం అసంభవం అని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనని అరెస్ట్ చేయకముందు కాంగ్రెస్ పార్టీపట్ల కొంతయినా సానుకూలధోరణి కలిగిఉన్నఅతను, ఇప్పుడు జైలు నుంచి విడుదల అయిన తరువాత ఇక ఆపార్టీని వదిలిపెట్టేదిలేదని తనను కలవవచ్చిన పార్టీ నేతలలో చెపుతున్నట్లు తెలిసింది. తన విడుదల తేదీనే కాంగ్రెస్ పతనానికి ముహూర్తంగా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.   ఇంత కష్టం భరిస్తున్నతనని కాంగ్రెస్ పార్టీ ఇంకా కొత్తగా పెట్టే ఇబ్బంది ఏముంటుంది? అనే ఒక రకమయిన తెగింపువచ్చిన జగన్ మోహన్ రెడ్డి, తనకు ఈ దుస్థితి కల్పించిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేయాలని భావిస్తునట్లు తెలుస్తోంది. జైలు నుంచి బయటకి రాగానే తన మొట్ట మొదటి కార్యక్రమం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడమేనని తన నేతలతో చెప్పడమే గాక, అందుకు తగిన పధక రచన కూడా సిద్దంచేసినట్లు సమాచారం. ముందుగా, కిరణ్ కుమార్ ప్రభుత్వంలోంచి తమ పార్టీవైపు వచ్చే వారి పేర్లను సేకరించే భాద్యతను పార్టీలోని కొందరు ముఖ్యనేతలకు, తన సాక్షి మీడియాలో పనిచేస్తున్న ఒక ముఖ్యవ్యక్తికీ అప్పజేప్పినట్లు తెలుస్తోంది.   ప్రస్తుతం తెదేపా, తెరాసలు రెండు పార్టీలు తమ పార్టీ ఏదో ఒకరోజున కాంగ్రేసులో కలుస్తుందనే ప్రచారం ఉదృతంగా చేస్తున్న కారణంగా, ఇతర పార్టీ నేతలు తమ పార్టీలో జేరెందుకు ఆసక్తి చూపుతున్నపటికీ, ఈ కారణంగానే చేరేందుకు బయపడుతున్న విషయం చర్చకు రావడంతో, అటువంటి నేతలకి, కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు ఇక ముందు కాంగ్రెస్ పార్టీతో పూర్తీ స్థాయి యుద్దమే తప్ప పొత్తులు,కలయికలు ఉండబోవని స్పష్టంగా తెలియజేయాలని జగన్ తన నేతలకి చెప్పినట్లు తెలిసింది. తద్వారా, తమపై జరుగుతున్నా దుష్ప్రచారాన్ని అడ్డుకోవడమే గాకుండా, పార్టీలోకి వచ్చేఆలోచన ఉన్న ఇతర పార్టీ నేతలకి, కార్యకర్తలకీ కూడా భరోసా కలిపించినట్లు ఉంటుందని జగన్ భావిస్తున్నారు.   అదే విదంగా, షర్మిల తన పాదయాత్రను మద్యలో ఆపేయడం, దానిపై తమ శత్రుపక్షాలు మరియు మీడియాలో కొన్ని వర్గాలు చేస్తున్న విష ప్రచారం అడ్డుకొనేందుకు షర్మిల చేత మళ్ళీ త్వరలో పాద యాత్ర మొదలు పెట్టించాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్నీపార్టీ కార్యకర్తలకి మెసేజ్ లు ద్వారా తెలియజేసి ఆమెకు వారి పూర్తి సహకారం అందజీయాలని జగన్ మాటగా కోరనున్నట్లు తెలుస్తోంది. ఆమెకి సుదీర్గ పాదయాత్రలు చేసే శక్తి లేనప్పటికీ, కొద్ది రోజుల విరమాలతో నయినా, తప్పనిసరిగా మళ్ళీ ఆమె చేత పాదయాత్రలు మొదలుపెట్టించాలని, ఒకవేళ తానూ గానీ ఈ మద్యలో విడుదలయినట్లయితే, అక్కడి నుండి తానే స్వయంగా పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో వీలయినంత ఎక్కువ మంది కాంగ్రేసు నేతలను, కార్యకర్తలను తన పార్టీ వైపు తిప్పుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలనీ నిర్నయించుకోన్నట్లు తెలుస్తోంది.   షర్మిల చేత పాదయాత్ర మళ్ళీ మొదలు పెట్టించడం ద్వారా పార్టీ శ్రేణులకు ఉత్సాహం కలిగించడమే కాకుండా, తమ కుటుంబములో పార్టీ నాయకత్వపదవికోసం అంతర్గత కలహాలు జరుగుతున్నట్లు మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకట్ట వేయవచ్చునని భావిస్తునట్లు తెలుస్తోంది. ఏది   ఏమయినపటికీ, షర్మిల గనుక త్వరలో మళ్ళీ పద యాత్ర మొదలు పెట్టినట్లయితే, జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు అమలు మొదలయినట్లు భావించవచ్చును.

పరిటాల వారసుడు ఎక్కడ..?

    పరిటాల శ్రీరామ్ ఇంకా పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పరిటాల శ్రీరామ్ కోసం వెతుకుతున్న పోలీసులు అతని ఆచూకిని ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. పరిటాల తనయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై మంగళవారం అనతపురం కోర్ట్ లో వాదనలు ముగిశాయి. తీర్పును బుధవారానికి వాయిదా వేశారు. కాంగ్రెసు నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారన్న కేసులో పరిటాల శ్రీరామ్‌తో పాటు పదిహేను మందిపై ధర్మవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. దీనిపై పరిటాల శ్రీరామ్ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో పరిటాల శ్రీరామ్ అజ్ఞాత ప్రదేశానికి వెళ్లినట్టు చెబుతున్నారు. పరిటాల శ్రీరామ్ అజ్ఞాతవాసం ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు.

గాంధీ ఆసుపత్రిలో అక్బరుద్దీన్

      ఎట్టకేలకు ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి వచ్చారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి రావాలని ఈ ఉదయం పోలీసులు అక్బరుద్దీన్ నివాసం వద్ద నోటీసులు జారీ చేశారు. తనకు అనారోగ్యంగా ఉన్నందున పోలీసుల ముందు హాజరయ్యేందుకు నాలుగు రోజుల గడువు ఇవ్వాలని అక్బరుద్దీన్ కోర్టు పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఓ సారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలోని అత్యవసర చికిత్సల విభాగంలో అక్బరుద్దీన్ కు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల వివరాలు ఈ మధ్యాహ్నం బయటకు వస్తాయి. ఆ తరువాత అరెస్టు మీద నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరో వైపు అక్బరుద్దీన్ ఇంటి నుండి గాంధీ అసుపత్రి వరకు భారీగా పోలీసులను మోహరించారు. ఎంఐఎం పార్టీ కార్యకర్తలు, నేతలు భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.