ఇది కాంగ్రెస్ మార్క్ రాష్ట్ర విభజన

  రాష్ట్ర విభజనపై అసలు కాంగ్రెస్ అధిష్టానం అయోమయంలో ఉందా? లేక ఆవిధంగా ప్రవర్తిస్తూ ప్రజలనే అయోమయంలో ఉంచుతూ తన పని కానిచ్చేయాలని ప్రయత్నిస్తోందా? అనే అనుమానం ప్రజలలో నెలకొంది.   ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ లో మొదట తెలంగాణా, సమైక్యాంద్ర వాదులే ఉండేవారు. ఆ తరువాత సమైక్యవాదులలో అధిష్టానానికి అనుకూల వర్గం, వ్యతిరేఖ వర్గాలు పుట్టుకొచ్చాయి. మళ్ళీ ఈ అనుకూల వర్గంలో ఉత్తుత్తి రాజీనామాలు చేసిన వారు, అసలు చేయని వారు ఉన్నారు. విభజనను వ్యతిరిఖించే వర్గంలో మళ్ళీ ముఖ్యమంత్రి వర్గం, అతనిని వ్యతిరేఖించే వర్గం ఏర్పడ్డాయి. ఇక వీటికి అదనంగా కాంగ్రెస్ పార్టీలో చాలా ముటాలు, గ్రూపులు ఉండనే ఉన్నాయి.   ఈ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమలో తాము కొట్లాడుకొంటూనే మరో వైపు టీ-కాంగ్రెస్ నేతలతో కూడా కత్తులు దూస్తూ ఈ వ్యవహారంలో వీలయినంత గందరగోళం సృష్టిస్తున్నారు. ఒకే కాంగ్రెస్ పార్టీ ఇన్నివిధాలుగా విడిపోయి తలొక వాదన చేస్తుంటే, సహజంగానే ప్రజలలో కొంత గందరగోళం, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంది. ఈ కాంగ్రెస్ గ్రూపుల వాద ప్రతివాదనలే నేడు రాజకీయాలుగా చలామణి అవుతుండటం దురదృష్టకరం.   రాష్ట్ర కాంగ్రెస్ నేతల శైలికి ఏ మాత్రం తీసిపోకుండా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన వ్యవహారంపై రోజుకొక మాట మాట్లాడుతూ, మీడియాకి లీకులు ఇస్తూ కధ నడిపిస్తోంది. ఒక రోజు హైదరబాద్ పై ఫలాన ఆప్షన్స్ పరిశీలిస్తున్నామని చెపితే, మరోసారి భద్రాచలం గురించి, ఇంకోసారి ఆర్టికల్ 371 ఉంచాలా, సవరించాలా లేక తొలగించాలా?అని ఇంకోసారి రాష్ట్ర శాసనసభకి పంపవలసింది బిల్లా లేక డ్రాఫ్టా? అయితే ఎప్పుడు పంపాలి? ముఖ్యమంత్రి అడ్డుకొంటే ఏమి చేయాలి? ఇలా ఒకటేమిటి ప్రతీ అంశంపైనా లీకులు, అనుమానాలు, చర్చలు, సమావేశాలే. అయినా దానికి అంతు తెలియదు.   శాసనసభ ప్రోరోగ్ అంశం ఇంకా సర్దుమణుగక ముందే ఇప్పుడు మరో పాత అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. త్వరలో పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దం అవుతున్నఈ తరుణంలో హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతం చేయమని కొందరు సీమాంధ్ర కేంద్రమంత్రులు పట్టుబడుతుంటే, వీలేదని టీ-కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.   ఇంత కాలం రాష్ట్ర విభజనపై అధిష్టాన నిర్ణయమే తమకు శిరోధార్యమని చెపుతూ వచ్చిన కావూరి, జేడీ శీలం వంటి వారు ఈ డిమాండ్స్ చేస్తున్నట్లు మీడియాకి లీకులు ఈయడం వెనుక అర్ధం, ఉద్దేశ్యం ఏమిటి? వారు సీమాంధ్ర ప్రజల కోసం కడదాకా పోరాడుతున్నామని బిల్డప్ ఇచ్చేందుకే ఈవిధంగా చేస్తున్నారా? లేక ఈ వంకతో కాంగ్రెస్ లో కలిసేందుకు నిరాకరిస్తున్న తెరాసను లొంగదీయడానికే కాంగ్రెస్ అధిష్టానం ఈ కుటిలయత్నాలు చేస్తోందా? అసలు రాష్ట్ర విభజన ఏవిధంగా చేయాలో తెలియకనే తికమకపడుతోందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.   దేశంలో అన్ని వ్యవస్థలను తన చెప్పుచేతల్లో ఉంచుకొన్న కాంగ్రెస్ అధిష్టానం ఈవిషయంలో ఇంత అయోమయంలో ఉందంటే నమ్మశక్యం కాదు. తనకి కావలసిన ఏ అంశంపైనైనా తగిన సలహాలు ఇచ్చే మేధావులు, నిపుణులు దాని చేతిలో ఉన్నారు. అందువలన కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ అయోమయం కేవలం అతితెలివి ప్రదర్శించడమే. తద్వారా ప్రజలను, తన ప్రత్యర్ధ రాజకీయ పార్టీలను అయోమయంలో ఉంచే ప్రయత్నం చేస్తోంది. లేకుంటే కావూరి, జేడీ శీలం, పురందేశ్వరి వంటి వీర విధేయులు తనని బెదిరిస్తున్నారని నమ్మశక్యం కాని మీడియా లీకులు ఇచ్చేదే కాదు.

డీఎస్ ఉబలాటం..!

      తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కంటున్న చాలామందిలో డి.శ్రీనివాస్‌కి ఒకరు. వారానికోసారి వార్తల్లో కనిపించి తెలంగాణకి అనుకూలంగా ఏదో ఒకటి మాట్లాడకపోతే ఆయనకి నిద్రపట్టేలా లేదు. తాజాగా ఆయన మాట్లాడిన పాయింట్లను గమనిస్తే, తాను మిగతా కాంగ్రెస్ నాయకులకంటే చాలా ఫార్వర్డ్ అయిపోయినట్టు, అధిష్ఠానానికి చాలా దగ్గరగా వున్నట్టు బిల్డప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆయన మాట్లాడిన పాయింట్లేంటంటే, 10 జిల్లాలతో, హైదరాబాద్‌తో కూడిన హైదరాబాద్ వచ్చేస్తోందట.   సీమాంధ్రులు ఆశ్చర్యపోయి ఆనందంతో గంతులు వేసే స్థాయిలో ప్యాకేజ్ రాబోతోందట! అంచేత సీమాంధ్రులు సమైక్యం అంటూ హడావిడి చేయకుండా వచ్చే అద్భుతమైన ప్యాకేజీ తీసుకుని పండగ చేసుకోవాలట. బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో గప్‌చుప్‌గా బిల్లుకు ఆమోదం తెలిపి పంపేయాలట. అలా కాకుండా బిల్లును అడ్డుకోవడానికి ఏం చేసినా అది అసెంబ్లీ గౌరవాన్ని అప్రతిష్టపాలు చేసినట్టేనట! ఉమ్మడి రాజధానిగా హెచ్ఎండీఎ పరిధి ఉంటుందని తాను అనుకోవట్లేదట. ఒకవేళ హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా వున్నా సీమాంధ్రులు హైదరాబాద్‌లో ఎక్కువకాలం ఉంటలేరట.. ఎందుకంటే తమ ప్రాంతం కంటే హైదరాబాద్ దూరంగా వుంది కాబట్టి ఇంతదూరం రాలేక అక్కడే రాజధాని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతారట. అలాగే రాయల తెలంగాణ డిమాండ్ చేసినవాళ్ళు  రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్టేనట.. ఇవీ డీఎస్ గారు చెప్పిన విషయాలు!

కిషన్‌రెడ్డి ఏమంటున్నారు?

      బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇస్తున్న స్టేట్‌మెంట్లు సామాన్యులకు పిచ్చి పట్టిస్తున్నాయి. కిషన్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలన్నీ విన్న తర్వాత ఆయన తెలంగాణకు అనుకూలంగా వున్నారా.. వ్యతిరేకంగా వున్నారా అనే విషయం ప్రజలకు అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. బీజేపీ సీమాంధ్ర నాయకులెవరైనా ‘సమైక్యం’ అనే మాట మాట్లాడితే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని కిషన్‌రెడ్డి సారు తాజాగా ప్రకటించారు. ఇది ఇంకా ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు.     తెలంగాణ కోసం వందలాదిమంది యువకులు ఆత్మహత్య చేసుకున్నా స్పందించని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ ‌గాంధీ కోసం తెలంగాణ విభజనను చేపట్టిందని చెప్పారు. అంటే, రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తుందని తెలిసీ బీజేపీ అందుకు మద్దతు ఇస్తోందని అర్థమా? కిషన్‌రెడ్డి మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారు. బీజేపీ మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును ఆమోదించలేదని అన్నారు.

గుళ్ళు గోపురాలు వద్దంటున్నబీజేపీ

  కాంగ్రెస్ పార్టీ నుండి దాని భజన సంస్కృతిని వేరు చేసి చూడటం అసాధ్యం గనుక టీ-కాంగ్రెస్ నేతలు సోనియమ్మ భజన చేసినా, గుడి కడతామన్నా, తెలంగాణా రాష్ట్రానికి ఆమె పేరు పెట్టాలని డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు. కానీ అలా చేయనివారినే అనుమానించవలసి ఉంటుంది.   మాజీ మంత్రి శంకరన్నఇంకా సోనియమ్మ గుడికి, నిత్యధూప నైవేద్య హారతులకి మొత్తం ఎన్నిఎకరాలు కావాలో లెక్కలు వేసుకొంటూ ప్రభుత్వ స్థలాల కోసం తిరుగుతుంటే, అతని కంటే వీరభక్తులు కొందరు కరీంనగర్ జిల్లా కేంద్రంలో అప్పుడే అమ్మకి గుడి కట్టేసి నిత్యపూజలు కూడా మొదలెట్టేసారుట!   దేశంలో ఏ గుడి మీద ఈగ వాలినా ఊరుకోని బీజేపీ నేతలు, ఈ సోనియమ్మ గుడిని మాత్రం ఎందుకో హర్షించలేకపొతున్నారు. ఈవిషయం స్వయంగా ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డే చెప్పారు. “టీ-కాంగ్రెస్ నేతలకు ఆమె దేవత అయితే కావచ్చుగాక! కానీ, తెలంగాణా ప్రజలకు కాదు. నిజానికి ఆమె వెయ్యి మందికి పైగా అమాయకుల ప్రాణాలు బలిగొన్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి గుడికట్టి పూజలు చేయడానికి మీకు సిగ్గు లేదూ?” అంటూ వీరంగం వేసేసారు.   కిషన్ రెడ్డి మాటలను నిజమేనని ఒప్పుకోవడానికి కాంగ్రెస్ నేతలకి తప్ప మరెవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చును. కాంగ్రెస్ పార్టీతో ఒకవైపు ఎన్నికలలో కత్తులు దూస్తూనే, పార్లమెంటులో దాని కుంభకోణాలను ఎండగడుతూనే, ఇలా సిగ్గు లేదని తిడుతూనే మళ్ళీ అదే పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే తెలంగాణా బిల్లుకి మద్దతు ఇస్తామని చాటింపు వేసుకోవడం ఎందుకు? వేసుకొన్నాక ఇస్తామని ఖచ్చితంగా మాట మీద ఎందుకు నిలబడలేకపోతునట్లు? తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయడం వలన తనకి ఏ మాత్రం రాజకీయ ప్రయోజనం చేకూరదని గ్రహించిన బీజేపీ, ఇప్పడు వెనకడుగువేస్తే తానే స్వయంగా తెలంగాణా అడ్డుకొన్నట్లు కాదా? అప్పుడు తెలంగాణా యువకుల ఆత్మహత్యల పాపంలో బీజేపీ కూడా భాగం పుచ్చుకొంటుందా?   ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా తామే పరిశుద్దులమన్నట్లు, తామే ప్రజల ఆకాంక్షల కోసం కృషిచేస్తున్నట్లు ఎంత స్వంత డప్పు కొట్టుకొంటున్నపటికీ, అన్ని పార్టీల లక్ష్యం రానున్న ఎన్నికలలో గెలవడమేనని ప్రజలకి బాగా తెలుసు. బీజేపీ దానికి అతీతం కాదు.

టీఆర్ఎస్‌లో 11 ప్రశ్నలు!

      రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేయాలో చెప్పండంటూ మంత్రుల బృందం పదకొండు పనికిమాలిన ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. ఆ పదకొండు ప్రశ్నలకు ఏ పార్టీ సమాధానాలు ఇవ్వనప్పటికీ 11 ప్రశ్నలనే కాన్సెప్ట్ మాత్రం పాపులర్ అయింది. సరే, జీవోఎం తాలూకు పదకొండు ప్రశ్నల సంగతి పక్కన పెడితే, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల మనసులో వున్న 11 ప్రశ్నలను ఒకసారి పరిశీలిద్దాం. 1. కేంద్రం తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించడమయితే ప్రకటించింది. ఇంతకీ తెలంగాణ వస్తుందా? రాదా? 2. ఒకవేళ తెలంగాణ నిజంగా వచ్చేస్తుంటే రాకుండా ఎలా అడ్డుకోవాలి? 3. సీమాంధ్రులని సరికొత్తగా ఎలా తిట్టాలి? ఎలా బెదిరించాలి? 4. ప్రాంతీయ విద్వేషాలని ఇంకా రెచ్చగొట్టడం ఎలా? 5. రాబోయే ఎన్నికలలో ఎన్ని సీట్లు వస్తాయో ఏంటో? 6. తెలంగాణ వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేట్టుంది. ఇప్పుడెలా? 7. ఒకవేళ టీఆర్ఎస్‌ని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే ఆ తర్వాత మా పరిస్థితి ఎలా వుంటుంది? మా ఆదాయాలకేం ఢోకా వుండదు కదా? 8. ఇతర పార్టీలలో వున్న నాయకులకి ఎలా గాలం వేయాలి? 9. మేం ఎంత ట్రై చేసినా తెలుగుదేశం పార్టీ నాయకులెవరూ మా పార్టీ ముఖం కూడా చూడటం లేదెందుకో! 10. అనవసరంగా తెలంగాణ ఉద్యమం చేశారంటూ భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు మమ్మల్ని తిట్టిపోస్తారా? 11. ఫామ్‌హౌస్‌లో ఈసారి ఏయే పంటలు వేయాలి?

వాళ్లు ప్రజాకంఠకులే

  విభజన విషయంలో గత కొంతకాలంగా మౌనంగా ఉన్న మాజీ రాజ్యసభ సభ్యులు హరికృష్ణ మౌనం వీడారు. శుక్రవారం ఆయన తెలుగు ప్రజలకు ఓ బహిరంగ లేఖరు రాశారు. ఈ లేఖను తెలుగు జాతి మనో వేదన పేరుతో ఆయన విడుదల చేశారు. తెలుగు ప్రజలు కేవలం సమైఖ్యరాష్ట్రన్ని మాత్రమే కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. లక్షకోట్ల ప్యాకేజీలు, రాజధాని, సమన్యాయం ఇవేవి తమకు అవసరం లేదని కేవలం సమైఖ్యరాష్ట్రమే తమకు కావాలని ఆయన పునరుద్ఘాటించారు. మూడు పేజీల లేఖను విడుదల చేసిన హరికృష్ణ, ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజన చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టారని వమర్శించారు. విభజనకు సహకరించే ప్రతి వ్యక్తి ప్రజాకంఠకుడే అన్నారు.

విభజనతో భద్రతకు ముప్పు

  రాష్ట్ర విభజనతో భద్రతాపరమైన సమస్యలతో పాటు నక్సలిజం, టెర్రరిజం పెరిగిపోతాయన్న సియం వాదనకు మరింత బలం చేకూరింది. ఈ మేరకు ఇంటలిజన్స్‌ బ్యూరో జీవోయంకు ఓ నివేదికను అందించింది. విభజన ప్రధానంగా భద్రత పరమైన అంశాలపై తీరని ప్రభావాన్ని చూపే అవకాశ ముందనే అభిప్రాయా లు వ్యక్తమవుతు న్నాయి. టెర్రరిజాన్ని పెంచిపోషించినట్లవుతుందనే ఆందోళనను కేంద్ర నిఘా విభాగం వ్యక్తం చేస్తోంది. ఆంద్రప్రదదేశ్‌ రాష్ట్ర విభజనతో  హైదరాబాద్‌తో పాటు పలు రాష్ట్రాలపై భద్రతకు ముప్పువాటిల్లే అవకాశముందనే విషయాన్ని కేంద్ర ఇంటలిజెన్స్‌ బ్యూరో అధిపతి ఇబ్రహీం తన నివేదికలో వివరించారు. ఇప్పటికే జీవోయంకు ఈ నివేదిక అందిచామని ఈ విషయంపై కూడా ఆలొచించి నిర్ణయం తీసుకోవాలని కోరినట్టుగా సమాచారం.

తెహెల్కా ఎడిటర్‌పై లైగింక వేదింపుల ఆరోపణ

  ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజంతో ఇంటర్‌నేషనల్‌ లెవల్‌లో సంచనాలు సృష్టించిన తెహెల్కా మేగజైన్‌ వ్యవస్థాపక ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ చిక్కుల్లో పడ్డారు. ఎంతోమంది బడా బడా నేతల బండారాలు బయట పెట్టిన తేజ్‌పాల్‌ ఇప్పుడు లైగింక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్‌లో పది రోజుల కిందట తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సంస్థలోని ఓ మహిళా జర్నలిస్టు ఆయనపై ఆరోపణలు చేసింది. అయితే ఈ విషయంపై వెంటనే స్పందించిన తేజ్‌పాల్‌ తెహెల్కా ఎడిటర్‌ పదవికి ఆరునెలలపాటు దూరంగా ఉంటున్నట్టుగా ప్రకటించారు. తన చర్యల పట్ట తేజ్‌పాల్‌ సదరు ఉద్యోగినికి క్షమాపణ చెప్పినట్టు కంపెనీ పేర్కొంది అయితే ఈ విషయం పై ప్రజాసంఘాలు మాత్రం గుర్రుగా ఉన్నాయి. ఇటీవల ప్రసార భారతి బోర్డు సభ్యుడిగా తేజ్‌పాల్‌ను ఎంపిక చేసిన కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది.

మళ్లీ జగన్‌ యాత్ర

  సమైక్యరాష్ట్రన్ని కోరుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి యాత్ర చేపట్టనున్నారు. సమైఖ్య శంఖారావం పేరుతో తలపెట్టిన ఈ యాత్రను ఈ నెల 28 నుంచి మొదలు పెట్టనున్నారు. యాత్రను చిత్తూరుజిల్లా కుప్పం నియోజక వర్గంనుంచి మొదలు పెట్టి, రాయలసీమ, తెలంగాణల మీదుగా శ్రీకాకులంలో పూర్తిచేయనున్నారు. సమైక్య యాత్రతో పాటు ఓదార్పుయాత్రను కూడా జరపనున్నారు జగన్‌. ఇంకా యాత్రకు సంబందించిన షెడ్యూల్‌ ఖరారు చేయలేదని, గతంలో ఇదే అంశంపై జగన్‌ సొదరి షర్మిల కూడా యాత్ర చేశారని ఇప్పుడు జగన్‌ చేపట్టబోయే యాత్రకు భారీ స్థాయిలో జనసమీకరణ జరపాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.  

గవర్నర్ నోట ఆరడుగుల బులెట్

  హైదరాబాద్ లో మొన్న జరిగిన 18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ ముగింపు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సభకు హాజరయిన గవర్నర్ నరసింహన్ పవన్ కళ్యాణ్ న్ని ఉద్దేశ్యించి మంచి ఆసక్తికరమయిన సలహా ఇచ్చారు. ఆయన పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘అత్తారింటికి దారేది’ సినిమాలో బాగా పాపులర్ అయిన పాటలో ‘ఆరడగుల బులెట్...దైర్యం విసిరిన రాకెట్’ అని పవన్ కళ్యాణ్ న్ని సంబోధిస్తూ పలికినప్పుడు సభలో హర్షద్వానాలు మిన్నంటాయి. చివరికి పవన్ కళ్యాణ్ కూడా ఆయన మాటలకు నవ్వాపుకోలేకపోయాడు.   గవర్నర్ పవన్ కల్యాణ్ న్ని ఉద్దేశించి “మీరు ‘అత్తారింటికి దారేది’ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా నటించారు. గానీ ఇంటికి తిరిగిన వెళ్ళిన తరువాత కూడా అంతే పవర్ చూపించకండి. రియల్ లైఫ్ లో పవర్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం” అని అన్నారు.   బహుశః గవర్నర్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అయినందున అతని సినిమాలను, అతని రాజకీయ ప్రవేశంపై వస్తున్న మీడియాలో వస్తున్న కధనాలను గమనించిన తరువాతనే రాజకీయాలోకి రావడం అంత మంచిది కాదని ఈవిధంగా సున్నితంగా సూచించి ఉంటారు.   పవన్ కళ్యాణ్ కి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నందునే తన మెగా అన్నగారి ప్రజారాజ్యం కోసం అంత కష్టపడ్డారు. కానీ, ఆ తరువాత ఆయన తాము ఏ పార్టీకి వ్యతిరేఖంగా పోరాటం చేసారో మళ్ళీ అదే పార్టీలో తన పార్టీని కలిపేసి కేంద్రమంత్రి పదవి పుచ్చుకోవడంతో సహజంగానే అది పవన్ కళ్యాణ్ కి కోపం కలిగించి ఉండవచ్చును. అయితే కుటుంబ విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే అతను ఎన్నడూ కూడా అన్నగారిని విమర్శించలేదు. కానీ తన సినిమాల ద్వారా ఆయనకి అప్పుడప్పుడు చురకలు వేస్తుంటారు.   ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వస్తే బాగుంటుందనే ఆలోచనతో కొందరు చేసిన ప్రయత్నాలను నాగబాబు ఖండించారు. ప్రస్తుతం సినిమాలతో తీరిక లేకుండా ఉన్నతమకు రాజకీయాలలో రావడానికి కానీ, ఏ పార్టీలో చేరే ఆలోచనలు గానీ తమకు లేవని నాగబాబు స్పష్టం చేసారు.   రాజకీయలలో నైతిక విలువలు అదః పాతాళానికి పడిపోయిన ఈ తరుణంలో ప్రజలు అమితంగా అభిమానించే పవన్ కళ్యాణ్ వంటి నిజాయితీపరుడు చొరవ తీసుకొని రాష్ట్రాన్ని కడిగేయాలని ప్రజలు ఆశపడటం సహజమే. కానీ, అది టాగూర్ వంటి సినిమాలలోనే సాధ్యం అవుతుంది తప్ప నిజ జీవితంలో సాధ్యం కాదని స్వయంగా మెగా బ్రదరే రుజువు చేస్తున్నపుడు మచ్చలేని పవన్ కళ్యాణ్ కి కూడా మళ్ళీ ఈ రొంపిలోకి లాగడమెందుకనే ఉద్దేశ్యంతోనే గవర్నర్ ఆవిధంగా సలహా ఇచ్చి ఉంటారనుకోవాలి.   ఇంతకీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో రావాలా వద్దా? మీరే డిసైడ్ చేయండి మరి.

విభజనుల గొంతులో వెలక్కాయ!

      జాగో, భాగో నినాదాలతో, హైదరాబాద్, భద్రాచలం మాదేననే డిమాండ్లతో హోరెత్తిస్తున్న విభజనుల గొంతులో ఇప్పుడు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూపంలో పచ్చి వెలక్కాయ పడింది. శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం కర్నూలు జిల్లా భూముల్లో వున్నదని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు గుంటూరు జిల్లా భూముల్లో వున్నదన్న వార్తలు రావడం, ఆ వార్తలకు తగిన ఆధారాలు కూడా వుండటంతో విభజనవాదులు అవాక్కయ్యారు. అయితే కాసేపట్లోనే తేరుకున్న విభజనవాదులు తమ సహజమైన తెలివితేటల్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు. తమ గొంతులో వున్న వెలక్కాయ మింగుడు పడటం కోసం, ఈ వార్తలు మమ్మల్నేమీ భయపెట్టవని క్రియేట్ చేయడం కోసం స్టేట్‌మెంట్లు రువ్వడం ప్రారంభించారు. ‘ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా సీమాంధ్రులు కుట్రలు చేశారు’ అనే ఒక స్టాక్ డైలాగ్‌ని తక్షణం విడుదల చేశారు. ఆ తర్వాత ‘ప్రాజెక్టులు సీమాంధ్ర భూముల్లో వున్నా మాకేం పర్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సరిహద్దులు నిర్ణయించి తెలంగాణకి హక్కులు ఇస్తుంది’ అంటూ మరో స్టేట్‌మెంట్ తెలంగాణ అమాయక ప్రజలకు కానుకగా ఇచ్చారు. తద్వారా తెలంగాణ ప్రజల్ని మరింత మోసం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే పదవుల కోసం విభజనవాదాన్ని పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకుల తీరు పట్ల చిరాకుగా వున్న తెలంగాణ ప్రజలు ఇప్పుడు రెండు ప్రాజెక్టుల విషయంలో వస్తున్న వార్తలను చూసి భయపడిపోతున్నారు. విభజనుల ప్రయత్నాలు ఫలించి రాష్ట్రం విడిపోతే, రెండు ప్రాజెక్టులూ తమకు అందుబాటులో లేకపోతే పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకుని హడలిపోతున్నారు. అయితే విభజనవాదులు మాత్రం హైదరాబాద్, భద్రాచలంతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ మావేనంటూ ప్రచారం చేసుకుంటూ ఆత్మతృప్తి పడుతూ ఆత్మవంచన బాటలో పయనిస్తున్నారు.

విభజనకు ఎందుకు ఒప్పుకొన్నామంటే

  మెగాస్టార్ చిరంజీవి కేంద్రమంత్రిగా మారిన తరువాత కెమెరాల ముందు సరిగ్గా నటించలేక చాలా తడబడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు రాజీనామా చేసిన తరువాత మీడియా కెమెరాలను ఎదుర్కోవడానికి సైతం పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆయాన సహవాసం వల్లనో మరేమో కానీ మిగిలిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు మాత్రం చాలా నిర్భయంగా, అద్భుతంగా కెమెరాల ముందు నటించేస్తున్నారు. దానితో పదవులలో కొనసాగుతున్న వారెవరో, రాజీనామాలు ఇచ్చిన వారెవరో, రాజీనామా లేఖలను రాంగ్ అడ్రస్ కి పంపినవారెవరో ప్రజలకు తెలియనీయకుండా అందరూ చాలా చక్కగా మేనేజ్ చేసేస్తున్నారు.   రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు గ్లూకోసు డబ్బాలు, బూస్టు సీసాలు చాలా ఖాళీ చేసేసి మరీ పోరాడుతున్న కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలంలు , రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే పాయె, కనీసం హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతంగానయినా చేయకపోతే రాజీనామా చేస్తామని బెదిరించినట్లు తాజా సమాచారం. కానీ అటు కేంద్ర మంత్రుల బృందం గానీ, ఇటు ప్రజలు గానీ ఆ తాటాకు చప్పుళ్ళను వినేందుకు ఇష్టపడటం లేదు.   అయితే ఈ సందర్భంగా అప్రయత్నంగా వారి నోట ఒక గొప్ప రహస్యం ప్రజలకు తెలుసుకొనే భాగ్యం కలిగింది. హైదరాబాద్‌ను యూటీ చేస్తారనే నమ్మకంతోనే రాష్ట్ర విభజనకు తాము ఒప్పుకున్నామని వారు వాపోతునప్పుడు ప్రజలు ఔరా! తెర వెనుక ఇటువంటి ఇంకెన్ని ఒప్పందాలు జరిగాయో’ అంటూ ముక్కున వేలేసుకోక తప్పలేదు.

ఐబీ ఆందోళనపై ఆగ్రహం!

      తెలంగాణ వచ్చేస్తే తమ జీవితాలలో ఏదో మార్పు వచ్చేస్తుందని తెలంగాణ ప్రజలు అనుకోవడం లేదు. రాష్ట్ర విభజన వల్ల తమకు నష్టం వాటిల్లే ప్రమాదం వుందనే భయపడుతున్నారు. అయితే ఈ భయం మాత్రం తెలంగాణ రాష్ట్రం వచ్చేయాలని తెగ ఉబలాటపడిపోతున్న విభజనవాదుల్లో మాత్రం కనిపించడం లేదు. ఎప్పుడు తెలంగాణ వస్తుందా ఎప్పుడు పదవులు పంచుకుందామా.. ఎప్పుడు సీమాంధ్రులను హింసిద్దామా అనే ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం హర్షించదగ్గ పరిణామం కాదని దేశవ్యాప్తంగా మేధావులు అంటున్నారు.   తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎన్నో ఇతర సమస్యలకు కారణం అయ్యే ప్రమాదం వుందని ఆందోళన పడుతున్నారు. అటు తెలంగాణతో గానీ, ఇటు సీమాంధ్రతో గానీ సంబంధంలేని వ్యక్తులు, ఆలోచనపరులు, కీలక బాధ్యతల్లో వున్నవారు కూడా ఈ మాటే చెబుతున్నారు. ఇప్పడీ విషయాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఇబ్రహీం కూడా చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడితే వచ్చే సమస్యలు అందరికంటే క్షుణ్ణంగా తెలుసుకోగలిగింది ఇంటెలిజెన్స్ బ్యూరో మాత్రమే. అలాంటి అధికారిక సంస్థ చీఫ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆందోళనకర పరిణామాలు ఏర్పడతాయని అంటున్నారు. దేశ భద్రత అనే అంశం మీద ఇంటెలిజెన్స్ బ్యూరో న్యూఢిల్లీలో ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో డీజీపీ, ఐజీపీ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐబీ చీఫ్ ఇబ్రహీం మాట్లాడుతూ, ‘తెలంగాణ ఏర్పాటు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కదానికే సంబంధించిన అంశం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలకు కొత్త సవాళ్ళు ఎదురయ్యే అవకాశం వుంది’ అన్నారు.  దేశ ఇంటెలిజన్స్ వ్యవస్థకు అధిపతిగా వున్న అధికారి నోటి నుంచి వెలువడిన ఈ మాటలను అంత ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదు. అయితే  ఐబీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలను చేయడాన్ని తెలంగాణ వాదులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇబ్రహీం చేసిన వ్యాఖ్యలను కూడా సీమాంధ్రుల కుట్రలో భాగంగా అభివర్ణించే ప్రయత్నాలు ప్రారంభించేశారు. ఇబ్రహీం తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చేయాలన్న ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం మీద తెస్తున్నారు. వీళ్ళ ప్రయత్నాలు ఫలిస్తే ఐబీ చీఫ్ ‘నా ఉద్దేశం అది కాదు.. మీడియా వక్రీకరించింది’ లాంటి స్టేట్‌మెంట్‌తో మీడియా ముందుకు వచ్చే అవకాశం వుంది.

కాబోయె సీఎం కన్నా అంటూ ఫ్లెక్సీలు

      రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కాబోయె ముఖ్యమంత్రి అంటూ ప్లేక్సిలు వెలిశాయి. గుంటూరులో జరిగిన రచ్చబండలో కాబోయే ముఖ్యమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అంటూ కటౌట్లు, ఫ్లెక్సీలు పెట్టేశారు. దీంతో ఇది చర్చానీయాంశం అయింది. అదే సమయంలో కన్నా పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో భేటీ అవడం కూడా గమనించదగ్గ అంశంగా ఉంది. కొన్ని రోజుల క్రితం సోనియాగాంధీని ఆయన కలిసి రాగానే ఆయన సీమాంధ్ర ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని ప్రచారం మొదలయింది. ఆయన పదవికి ఆశపడి అధిష్టానం ఆదేశాల మేరకు విభజనకు మొగ్గు చూపుతున్నాడని ఆరోపణలు మొదలయ్యాయి. అయితే అలాంటిది ఏమీ లేదని, తాను ముఖ్యమంత్రి రేసులో లేనని కన్నా తేల్చిచెప్పారు. ఆయన అభిమానులు త్వరలో కాబోయే ముఖ్యమంత్రి అని బోర్డులు పెట్టడం విశేషం.

ప్రిద్వీ షా భారత్ క్రికెట్ కి మరో సచిన్ అవుతాడా

  ‘ప్రిద్వీషా(14) బహుశః ఈ పేరు ఇంతవరకు ఎవరూ విని ఉండకపోవచ్చును. ముంబైలోని రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ అనే పాటశాలలో చదువుతున్నఈ బుడతడు మొన్నమంగళ బుధవారాలలోజరిగిన ఇంటర్ స్కూల్ క్రికెట్ పోటీలలో ప్రత్యర్ధి జట్టు సెయింట్ ఫ్రాన్సిస్ డీ’ అస్సిసీ స్కూలు జట్టుపై ఏకంగా 546 పరుగులు సాధించి దేశంలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.   తన స్కూల్ టీంకి కెప్టెన్ కూడా అయిన ప్రిద్వీ షా మొదటి రోజు ఆటలో 166 బాల్స్ కి 257 పరుగులు తీయగా మరునాడు జరిగిన మ్యాచులో ఏకంగా 289 పరుగులు తీసి ఒక సరికొత్త రికార్డ్ సృష్టించి ప్రతిష్టాత్మకమయిన హరీస్ షీల్డ్ తన టీముకి సాధించిపెట్టాడు. రెండు రోజుల మ్యాచులో ప్రిద్వీషా 85 బౌండరీలు, ఐదు సిక్సర్లు తీసి తన సత్తా చాటుకొన్నాడు.   ఇదివరకు అంటే 1933-34లో ముంబైలో సి.ఐ.రైల్వే మరియు సెయింట్ జేవియర్ కాలేజి మధ్య జరిగిన మ్యాచులో దాదాబాయి హవేవాల చేసిన 515 పరుగులు అత్యధిక స్కోరుగా రికార్డు నెలకొని ఉంది. దానిని సచిన్ టెండూల్కర్ ఇదే హారిస్ షీల్డ్ కోసం జరిగిన పోటీలలో వినోద్ కాంబ్లీ తో కలిసి 664 పరుగులు తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ తరువాత నుండే అతను జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.   మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత సచిన్ టెండూల్కర్ కి సరిసమానమయిన రికార్డుని ప్రిద్వీ షా చేయడం చూస్తే భారత్ క్రికెట్ కు మరో సచిన్ దొరికాడనే నమ్మకం కలుగుతోంది. వీలయినన్ని ఎక్కువ పరుగులు తీయడమే నా ఏకైక లక్ష్యంగా బ్యాటింగ్ చేసి మా టీమ్ ని గెలిపించుకొన్నదుకు నాకు చాలా సంతోషంగా ఉందని ప్రిద్వీ షా మీడియాతో చెప్పాడు.

కిరణ్ టార్గెట్ స్పీకరా లేక టీ-బిల్లు అడ్డుకోవటమా

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్ కి వ్రాసినట్లు చెప్పబడుతున్న లేఖ గురించి వారిరువురూ ఇంతవరకు స్వయంగా స్పందించకపోయినా దానిపై పెద్ద రాజకీయ దుమారమే చెలరేగుతోంది. ముఖ్యమంత్రి తనను తాను గొప్ప సమైక్యవాదిగా నిరూపించుకొనే ఏ అవకాశం వదలకపోవడం మెచ్చుకోదగ్గదే కావచ్చు. కానీ అందుకు ఇతరులను బలిచేయాలనుకోవడమే చాలా తప్పు అని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.    నిజానికి ప్రభుత్వం జూన్ నెలలో శాసనసభ సమావేశాలు ముగిసిన వారంలోగా సభను ప్రోరోగ్ చేయమని అభ్యర్దిస్తూ స్పీకర్ కి లేఖవ్రాయవలసి ఉంటుంది. కానీ అలా చేయకుండా, ఇప్పుడు స్పీకర్ సంప్రదాయం ప్రకారం సభను వచ్చేనెలలో సమావేశపరిచేందుకు సిద్దపడుతున్నఈ తరుణంలో ముఖ్యమంత్రి సభను ప్రోరోగ్ (నిరవధిక వాయిదా) వేయమని కోరుతూ లేఖ వ్రాయడం తెలంగాణా బిల్లుపై చర్చను జాప్యం చేసేందుకే అయినప్పటికీ, అందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను బలిపశువుని చేయడంపై కాంగ్రెస్ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   స్పీకర్ ముఖ్యమంత్రి మాటను మన్నిస్తూ సభను వాయిదా వేయకపోయినట్లయితే ఆయన కూడా తెలంగాణా బిల్లుపై చర్చకు సహకరిస్తున్నారనే తప్పుడు సంకేతాలు ప్రజలలోకి వెళ్తాయని వారు అంటున్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రి, స్పీకర్ల మధ్య సభ నిర్వహణ తేదీల విషయంలో, కమిటీల విషయంలో విభేదాలు తలెత్తాయి. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి సమావేశాలను వాయిదా వేయమని అసందర్భ కోరిక కోరడం స్పీకర్ ని అప్రదిష్టపాలు జేయడానికేనని కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన కుర్చీపై కన్ను వేసిన బొత్సను, కన్నాలక్ష్మినారాయణను కూడా ముఖ్యమంత్రి వర్గం ఇదే విధంగా అభాసుపాలు చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.   అయితే ఈ వ్యవహారంలో స్పీకర్ కి మద్దతుగా మాట్లాడితే తమకీ కొత్త ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచనతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా స్పందిస్తున్నపటికీ, టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస శాసనసభ్యులు ఆయనకి అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి దీనిని నుండి ఆశించినది ఒకటయితే ఫలితాలు మరొకలా వస్తున్నాయి.

ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టు భిన్నాభిప్రాయాలు

  జస్టిస్ కళ్యాణ్ సేన్ గుప్త మరియు కె.సి.భానులతో కూడిన హైకోర్టు ధర్మాసనం, ఏపీఎన్జీవోల సమ్మె చట్ట విరుద్దం అంటూ దాఖలయిన ప్రజహిత వాజ్యాలపై రెండు విభిన్నమయిన తీర్పులు నిన్న వెలువరించింది.   జస్టిస్ గుప్త పిటిషనుదారుల వాదనలతో ఏకీభవిస్తూ ఏపీఎన్జీవోల సమ్మె చట్ట విరుద్దమేనని ప్రకటించడమే గాకుండా, సమ్మె వలన ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని ఉద్యోగుల వద్ద నుండి వసూలుచేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు.   అయితే జస్టిస్ భాను మాత్రం దీనితో విభేదించారు. ప్రజాహితం కోసం అంటూ వేసిన పిటిషను కేవలం రాజకీయ ప్రేరేపితమయినది గనుక అటువంటి పిటిషను ఆధారంగా సమ్మె చట్టబద్దమా కాదా? అనే సంగతి తేల్చడం కోర్టు పరిధిలోకి రాదని ప్రకటించారు. పిటిషనుదారులలో ఒకరు గతంలో ఇదేవిధంగా తెలంగాణా కోసం జరిగిన సకల జనులసమ్మెలో పాల్గొన్న విషయాన్ని జస్టిస్ భాను ఈ సందర్భంగా గుర్తుచేసారు.   ఒకే ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు ఒక వాజ్యంపై ఈవిధంగా రెండు విబిన్నమైన తీర్పులు ఇచ్చినందున, దీనిపై మూడవ న్యాయ మూర్తి అభిప్రాయం/తీర్పు తీసుకోవాలని ధర్మాసనం నిర్ణయించింది. అందువల్ల మొదటి న్యాయమూర్తి గుప్త ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలు మళ్ళీ మూడవ న్యాయమూర్తి తీర్పు వెలువరించేవరకు అమలులోకి రావని ధర్మాసనం ప్రకటించింది.

ఎవరి భజన వారిదే

  తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం టీ-కాంగ్రెస్ నేతలు కూడా ఉడతా భక్తిగా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితంగా ముఖ్యమంత్రి పదవి కావాలనుకోవడం ఏమీ తప్పు కాదు. కొందరు సామాజిక న్యాయం ద్వారా అవుదామని ఆశిస్తుంటే, మరి కొందరు ఆత్మాభిమానంతో, వాళ్ళలో బాగా తెలివయిన వాళ్ళు అమ్మ దయతో అవుదామనుకొంటున్నారు. అయితే ఏ న్యాయనికయినా అమ్మ దయ తప్పనిసరిగా అవసరం గనుక అమ్మని ప్రసన్నం చేసుకొనేందుకు అమ్మకు జై! అంటూ అందరూ కలిసి యాత్రలు మొదలుపెట్టేసారు.   కానీ, కేసీఆర్ బూచిని చూపి అధిష్టానం పంపిన జైపాల్ రెడ్డి వారందరికంటే చాలా గట్టిగా తెలంగాణా గురించి మాట్లాడుతుంటే పాపం! ముఖ్యమంత్రి అయితే వేసుకోవచ్చునని ఎప్పుడో సూటు కూడా కుట్టించేసుకొన్న జానారెడ్డి, ముఖ్యమంత్రి అయితే తప్ప గడ్డం గీయనని అమ్మకి మొక్కుకొన్న దామోదరుడు, గీతక్కాయ్ వంటివారు బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉండిపోక తప్పడం లేదు.   ఇక్కడ వారందరితో కలిసి అమ్మ భజనలో పాల్గొంటున్నపటికీ, ప్రత్యేకం దర్శనం టికెట్స్ పట్టుకొని డిల్లీలో చక్కర్లు కొడుతున్న సర్వే సత్యనారాయణ ‘నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవలసిందే! అని అమ్మ ఆజ్ఞాపిస్తే కాదనే దైర్యం నాకెక్కడిది?” అని మీడియా ముందు బిక్క మొహం వేసుకొని తన మనసులో మాట చెప్పేసాడు.   అయితే, ఇంతమంది భక్తులలో అందరికీ ముఖ్యమంత్రి పదవులు ఈయలంటే తెలంగాణాని మరో పది రాష్ట్రాలుగా విడదీసినా సరిపోదు గనుక, ప్రస్తుతానికి జైపాల్ రెడ్డికే ఆ వరమేదో ఇచ్చేయవచ్చని సమాచారం. కానీ అప్పుడు ఈ సామాజిక న్యాయవాదులు, అత్మాభిమానులు ఏవిధంగా న్యాయం కోరుతారో చూడాలి.

జగమంత కుటుంబంలో షర్మిలమ్మకు చోటే లేదా?

  జగనన్న వదిలేసిన బాణం మరి ఎక్కడ పడిపోయిందో గానీ ఈ మధ్యన ఎవరికీ కనబడలేదు. అతను వదిలిన ఆ బాణం లాంగ్ రేంజి మిసైల్లాగా ఏకంగా 3000కిమీ దూరం పయనించి, మరే లక్ష్యం చేదించిందో తెలియదు కానీ, గత కొన్ని రోజులుగా ఎవరికీ కనబడలేదు. హైదరాబాదులో జబర్దస్త్ గా నిర్వహించిన సమైక్య సభలోనయినా తన బాణం గొప్పదనం గురించి నలుగురికి చెపుతాడని జనాలందరూ భావించినప్పటికీ, ఓట్లు, సీట్ల బాధలో పడి పాపం! ఆ బాణం సంగతి మరిచిపోయాడు జగనన్న.   అయితే పెరటి మొక్క లాంటి షర్మిలమ్మను పట్టించుకోకపోయినా మమతలు కురిపించే దీదీ (అక్క) మమతా బెనర్జీని కలిసేందుకు కోర్టు అనుమతి తీసుకొని కోల్ కత వెళ్లి మరీ వెళ్లి కలిసారు.  ఆమెకు కూడా పక్కలో బల్లెంలా గోర్ఖాలాండ్ విభజన వాదులున్నందున, విభజన కష్టం అంటే ఏమిటో తెలుసు గనుక బ్రదర్ జగన్ పై మమతానురాగాలు కురిపిస్తూ “తమ పార్టీ కూడా రాష్ట్రాల విభజనకు వ్యతిరేఖమని” ప్రకటించారు.   ఇంతవరకు షర్మిలమ్మే లోకంగా బ్రతుకుతున్న జగనన్నయకి ఇప్పుడు కొత్తగా దొరికిన మమతక్కాయ్ ఊహించని విధంగా కురిపించిన మమతానురాగాలకి పొంగిపోతూ లక్నోలో ఉన్న అఖిలేష్ యాదవన్నయ్యనో, తమ్ముడ్నో వెతుకొంటూ బయలుదేరుతున్నాడు. ఆ సోదరుడు కూడా పక్కా సమైక్యవాదే కాకుండా తనలాగే సీబీఐతో నానా బాధలు పడుతున్నాడు గనుక బహుశః ఒకరి కష్టం మరొకరు బాగానే అర్ధం చేసుకోవచ్చును.   ఆ తరువాత చెన్నై వెళ్లి జయక్కాయ్ ని, ఓడిశాలో నవీన్ అన్నయని కూడా కలవాలని ఈ అపూర్వ సోదరుడు భావిస్తున్నారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిపోయిన జగమంత కుటుంబంలో చెల్లెమ్మ ఎక్కడా కనబడకపోయినా, నదులు, రాష్ట్రాలు దాటి మరీ కొత్త సోదర సోదరీ మణులను వెతుకొంటూ బ్రదర్ జగన్ పయనమవుతున్నారు.   ఈనాటి ఈ అనుబంధాలే రానున్న ఎన్నికల తరువాత పండంటి ఉమ్మడి కుటుంబం (తర్డ్ ఫ్రంట్)గా పెరిగితే చూడాలని జగనన్న తాపత్రయం. కానీ సీబీఐ కోర్టు మాత్రం అతని బాధను అర్ధం చేసుకోలేక అడిగినప్పుడల్లా అనుమతులు మంజూరు చేయడం కుదరదంటూ ఒకటే విసిగిస్తోంది.