జగన్ కు మమత బెనర్జీ హామి

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలన్నదే తన అభిలాష అని జగన్‌తో అన్నారు. జగన్ తనకు సోదరుడు లాంటివారని మమత పేర్కొన్నారు.   రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించే దిశగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉందని, అందువల్ల బెయిల్ షరతులు సడలించాలని జగన్ కోర్టును కోరారు. ఆ మేరకు ముందుగా కోల్కతా, లక్నో నగరాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ముందుగా ఆయన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అక్కడ కూడా గూర్ఖాలాండ్ ఉద్యమం జోరుగా ఉండటం, విభజన యోచనను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో.. ఆంద్ర ప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా కూడా ఆమె మద్దతు పొందేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.  

టిడిపి 'ప్రజాగర్జన' వాయిదా

      ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన బహిరంగ సభలు వాయిదా వేసినట్లు ఆ పార్టీ నేత కంభంపాటి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తుపాన్ వచ్చే అవకాశం ఉన్నందున్న ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి, ఆయన అనుమతితో ఈ మేరకు ప్రకటన చేస్తున్నట్లు కంభంపాటి వ్యాఖ్యానించారు. తిరిగి ఎప్పుడు ప్రారంభించేది త్వరలో తెలియజేస్తామని ఆయన అన్నారు. కాగా 2014 ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ రేపటి నుంచి ప్రజాగర్జన సభలను నిర్వహిస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

విభజనపై చివరి దాక అదే అయోమయం

  ఈరోజు కేంద్రమంత్రుల బృందం రాష్ట్ర విభజనపై తుది నివేదిక తయారుచేసేందుకు సమావేశమయ్యింది. రేపు మళ్ళీ మరో మారు సమావేశమయిన తరువాత తమ నివేదికకు తుది మెరుగులు దిద్ది, రేపే కేంద్రమంత్రి వర్గం చేతిలో పెట్టబోతున్నామని వారిలో ఒక సభ్యుడయిన జై రామ్ రమేష్ ప్రకటించారు. అయితే, మరి కొద్ది సేపటికే హోం మంత్రి షిండే మీడియా ముందుకు వచ్చి ఇటువంటి ముఖ్యమయిన అంశంపై ఇంత హడావుడిగా నివేదిక చుట్టబెట్టేసి, మంత్రి వర్గ సమావేశంలో ప్రవేశపెట్టడం మంచిది కాదని, అందువల్ల కనీసం మరో రెండు మూడు సార్లు సమావేశమయ్యి, అన్ని అంశాలపై మరింత లోతుగా చర్చించిన తరువాతనే మంత్రి వర్గ సమావేశంలో ప్రవేశపెడతామని ప్రకటించారు. రాష్ట్ర విభజనను పర్యవేక్షిస్తున్న ఒక మంత్రి 'రేపటితో సరి!' అంటుంటే మరొకరు 'లేదు! ఇంకా చర్చించవలసింది చాలా ఉందని చెప్పడం చూస్తే వారిలోనే ఈవిషయంపై సరయిన అవగాహన, ఏకాభిప్రాయం లేదని అర్ధం అవుతోంది. ఆర్ధిక శాఖ నుండి ఇంకా పూర్తి వివరాలు రాకపోవడం వలనే హోం మంత్రి షిండే మరి కొంత సమయం కొరుతునట్లు సమాచారం.   ఆవిధంగానయితే రాష్ట్ర విభజనపై నివేదిక మంత్రి వర్గం సమావేశంలో ఆమోదం పొంది రాష్ట్రపతి ద్వారా రాష్ట్ర శాసన సభకు చేరుకోవడానికి మరి కొంత ఆలస్యమవుతుందేమో? కానీ ఈ సారి పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టాలంటే ఈ ప్రక్రియలో ఎక్కడా ఆలస్యం జరుగకూడదు.   అక్కడ డిల్లీలో ఈ అయోమయం కొనసాగుతుంటే, ఇక్కడ రాష్ట్రంలో వచ్చే నెల నుండి మొదలు కావలసిన శాసనసభ సమావేశాలను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ని కోరినట్లు అందుకు ఆయన నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. శాసనసభ సమావేశాలను వాయిదా వేసినట్లయితే, తెలంగాణా బిల్లు సకాలంలో పార్లమెంటుకి చేర కుండా అడ్డుకోవచ్చునని, తద్వారా రాష్ట్ర విభజన జరుగకుండా ఆపవచ్చని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.   అయితే రాష్ట్ర విభజనకు రాష్ట్ర శాసనసభ ఆమోదం అవసరం లేదు గనుక, ఒకవేళ శాసనసభ సమావేశాలు జరుగకుండా వాయిదా వేసినట్లయితే, ఇక రాష్ట్ర విభజనపై సభలో చర్చించకుండానే నేరుగా పార్లమెంటుకి వెళ్ళిపోతుంది. గనుక రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాలు తప్పకుండా సకాలంలోనే జరుపవచ్చును.

రాష్ట్ర విభజన: సీఎం కిరణ్ ప్రోరోగ్ అస్త్రం..!

      రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. ప్రోరోగ్ ద్వారా అసెంబ్లీ భేటీకి అడ్డుకట్ట వేయడం ద్వారా విభజనను జాప్యం చేసే యోచనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో విభజన అంశం కొత్త మలుపు తిరిగెఅవకాశం కనిపిస్తోంది.   రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం తన తుది నివేదికను ఈనెల 21న కేంద్ర మంత్రి మండలికి సమర్పించనుంది. దానిలో అవసరమయితే మార్పులు చేర్పులు చేసి, ఈనెల 28లోగా రాష్ట్రపతికి పంపనున్నారు. ఆయన దానిని పరిశీలించిన తరువాత రాష్ట్ర శాసనసభ ఆమోదానికి పంపుతారు. ఈ లెక్క ప్రకారం చూస్తే తెలంగాణా బిల్లు ఈనెలాఖరుకి లేదా వచ్చే నెల మొదటి వారంలోగానీ రాష్ట్ర శాసనసభ ముందుకు రాబోతోందని అర్ధం అవుతోంది.     వచ్చేనెల 5న మొదలయ్యే శీతాకాల పార్లమెంటు సమావేశాలు, ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున కేవలం 20వరకే జరుగుతాయి. అందువల్ల రాష్ట్ర శాసనసభ సమావేశాలు వెంటనే జరుపకుండా పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు వాయిదా వేసినట్లయితే, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకోవచ్చునని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శాసనసభను ప్రోరోగ్ చేయాలని స్పీకర్ కు లేఖ రాసినా ఆయన జాప్యం చేశారంటూ కధనాలు వచ్చిన నేపధ్యంలో నాదెండ్ల మనోహర్ గవర్నర్ కు లేఖ రాస్తున్నారని సమాచారం. దీనివల్ల శాసనసభ ప్రోరోగ్ అవుతుంది. ప్రోరోగ్ కాకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు శాసనసభను పెట్టవచ్చు.   తెలంగాణా బిల్లుకి రాష్ట్ర శాసనసభ ఆమోదం అవసరం లేకపోయినా, రాజ్యాంగ పద్దతుల ప్రకారం సభలో కనీసం దానిపై చర్చజరగాలంటే సభ నిర్వహించి తీరాలి. కానీ ముఖ్యమంత్రి అభీష్టానికి విరుద్దంగా సభ నిర్వహించడం సాధ్యం కాకపోతే, తప్పని పరిస్థితుల్లో ఆయనను తొలగించి వేరొకరిని ఆ స్థానంలో నియమించయినా సరే ఈ ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది.

టిడిపి ‘ప్రజాగర్జన’

      రాష్ట్రంలో ఏప్రిల్ లో శాసనసభతో పాటు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను, కార్యకర్తలను సన్నద్దం చేస్తున్నారు. ఇక నుంచి ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. తిరుపతి నుంచి ఈ నెల 21న ప్రారంభించన్ను సభలకు ’ప్రజాగర్జన’ అని పేరు పెట్టారు.   చంద్రబాబు నాయుడు 'ప్రజాగర్జన' పేరుతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలలో బహిరంగసభలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్, జగన్ అవినీతి, కుట్రాలపై ఈ సభలలో నిప్పులు చేరగానున్నారు.  మరోవైపు కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ రెండో రోజు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.  కుప్పంలో జగన్మోహన్‌రెడ్డిని అడుగుపెట్టకుండా చూడాలని ప్రజలను కోరారు. కేసీఆర్, జగన్మోహన్‌రెడ్డితో కాంగ్రెస్‌కలిసి రాష్ట్రాన్ని భ్రస్టుపట్టించారని ఆరోపించారు. తమ రాజకీయ లబ్ధికోసం రాష్ర్ట ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాబు ధ్వజమెత్తారు.                

భద్రాచలమా...తెలంగాణా?

      భద్రాచలం కావాలో తెలంగాణ కావాలో తెలంగాణ ప్రాంత నాయకులు స్పష్టంగా తేల్చుకోవాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు వీర్రాజు అన్నారు. భద్రాచలాన్ని తెలంగాణాకు కేటాయిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ఆంధ్రులు రాజధానులను కోల్పోవడం వల్ల ప్రతిసారి నష్టపోతున్నారన్నారు. గుంటూరులో జరిగిన సీమాంధ్ర బీజేపీ నేతల సమావేశంలో 13 జిల్లాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనలో భద్రాచలం సీమాంధ్రకే చెందాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు.   ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యుడు హరిబాబు మాట్లాడుతూ భద్రాచలాన్ని తెలంగాణ ప్రాంతానికి కేటాయిస్తే రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఫలితంగా సీమాంధ్ర మొత్తం ఎడారిగా మారుతుందన్నారు. చారిత్రకంగా చూసినా 1820 నుంచి భద్రాచలం సీమాంధ్రలోనే ఉందన్నారు. అనేక రకాలుగా ఆంధ్రులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న తెలంగాణ ప్రాంత విభజన వాదులు పోలవరాన్ని అడ్డుకునే ప్రమాదం ఉందన్నారు.

శాసనసభ సమావేశాలపై రాద్ధాంతం

  రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం తన తుది నివేదికను ఈనెల 21న కేంద్ర మంత్రి మండలికి సమర్పించనుంది. దానిలో అవసరమయితే మార్పులు చేర్పులు చేసి, ఈనెల 28లోగా రాష్ట్రపతికి పంపనున్నారు. ఆయన దానిని పరిశీలించిన తరువాత రాష్ట్ర శాసనసభ ఆమోదానికి పంపుతారు. ఈ లెక్క ప్రకారం చూస్తే తెలంగాణా బిల్లు ఈనెలాఖరుకి లేదా వచ్చే నెల మొదటి వారంలోగానీ రాష్ట్ర శాసనసభ ముందుకు రాబోతోందని అర్ధం అవుతోంది.   అయితే శాసనసభ సమావేశాల తేదీలపై ముఖ్యమంత్రి, స్పీకర్ విభేదిస్తున్నట్లు అప్పుడే మీడియాలో కొన్నివార్తలు కూడా మొదలయ్యాయి. వచ్చేనెల 5న మొదలయ్యే శీతాకాల పార్లమెంటు సమావేశాలు, ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున కేవలం 20వరకే జరుగుతాయి.   అందువల్ల రాష్ట్ర శాసనసభ సమావేశాలు వెంటనే జరుపకుండా పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు వాయిదా వేసినట్లయితే, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకోవచ్చునని ముఖ్యమంత్రి భావిస్తున్నందున, శాసనసభ సభను ప్రోరోగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ వ్రాస్తే దానిపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.   అయితే ఈవిషయంలో ముఖ్యమంత్రి నిర్ణయమే అంతిమ నిర్ణయం గనుక దానిని స్పీకర్ శిరసావహించవలసి ఉంటుంది. తెలంగాణా బిల్లుకి రాష్ట్ర శాసనసభ ఆమోదం అవసరం లేకపోయినా, రాజ్యాంగ పద్దతుల ప్రకారం సభలో కనీసం దానిపై చర్చజరగాలంటే సభ నిర్వహించి తీరాలి. కానీ ముఖ్యమంత్రి అభీష్టానికి విరుద్దంగా సభ నిర్వహించడం సాధ్యం కాకపోతే, తప్పని పరిస్థితుల్లో ఆయనను తొలగించి వేరొకరిని ఆ స్థానంలో నియమించయినా సరే ఈ ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది.   కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ తుది చర్చలో తను కూడా పాల్గొన్న తరువాతనే రాజీనామా చేద్దామని భావిస్తున్నందున బహుశః ఆయన వెనక్కి తగ్గి శాసన సభ సమావేశాలకు అంగీకరించవచ్చును. లేకుంటే ఆయన ఇంతకాలంగా చేస్తున్న వాదనలకు అర్ధం ఉండదు.

బలపడుతున్న టీడీపీ, బీజేపీల స్నేహబంధం!

      రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి దుర్మార్గాలకు వ్యతిరేకంగా పుట్టి తెలుగు ప్రజలకోసం పోరాడుతున్న టిడిపి పార్టీ. నరేంద్రమోడీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభంజనం సృష్టిస్తున్న పార్టీ భారతీయ జనతాపార్టీ. ఈ పార్టీల స్నేహబంధం బలపడడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే త్వరలోనే టీడీపీ-బీజేపీ జట్టు కట్టడం ఖాయమనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పుడు నరేంద్రమోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తెరమీదకి వచ్చాక తెలంగాణ విషయంలో బీజేపీ స్వరం మెల్లమెల్లగా మారుతోంది. రాష్ట్రంలో ఇతర పార్టీలో ఇంతవరకూ అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో మొదటి అడుగే తెలుగుదేశం పార్టీతో స్నేహం పెంచుకోవడం. బీజేపీ-టీడీపీ దోస్తీని కిషన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. అయినా ఆయన మాట చెల్లకుండా పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కిషన్ రెడ్డి ఎంత వ్యతిరేకించినా బీజేపీ-టీడీపి బంధాన్ని బలపరచడానికి వెంకయ్యనాయుడు కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విషయంలో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిందిగా కేంద్ర నాయకత్వం నుంచి కిషన్ రెడ్డికి ఇప్పటికే ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే త్వరలో ఈ బంధం మరింత బలపడడం ఖాయం. 

అందరి బంధువయా.. భద్రాచల రామయ్యా!

      రాముడు: లక్షణా.. లక్ష్మణుడు: ఏంటన్నయ్యా? రాముడు: గోదావరి అవతల, గోదావరి ఇవతల ఏంటి హడావిడిగా వుంది? లక్ష్మణుడు:  రెండుపక్కల నుంచీ ‘భద్రాచలం మునగాల.. భద్రాచలం మునగాల’ అనే నినాదాలు వినిపిస్తున్నాయన్నయ్యా.. రాముడు: భద్రాచలం మునగాలా? ఇదెక్కడి కోరిక లక్ష్మణా.. ఇప్పటికే ప్రతి ఏడాదీ వరదలొచ్చినప్పడు భద్రాచలం ఎలాగూ మునిగిపోతోంది కదా.. మళ్ళీ ఇప్పడు ప్రత్యేకంగా భద్రాచలం మునగాలని కోరికెవరికి పుట్టింది? లక్ష్మణుడు: భద్రాచలం మునగాల అంటే అర్థం అది కాదన్నయ్యా.. భద్రాచలం అండ్ మునగాల అన్నమాట. రాముడు: ఓహో.. మనం ఉన్న భద్రాచలం, మన పక్కనే వున్న మునగాల గురించా.. లక్ష్మణుడు: అవునన్నయ్యా.. రాముడు: ఈ రెండు ఊళ్ళ పేర్ల గురించే ఎందుకలా నినాదాలు వినిపిన్నాయి? లక్ష్మణుడు: అదే అన్నయ్యా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని ఇటలీ సోనియాగాంధీ డిసైడ్ చేసింది కదా.. భద్రాచలం, మునగాల మాదంటే మాదంటూ తెలంగాణ, సీమాంధ్ర వాళ్ళు గొడవలు పడుతున్నారన్నమాట.. రాముడు: అదేంటి లక్ష్మణా.. మనిద్దరిలా అంటే రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్ముల్లా కలసిమెలసి వుండే వీళ్ళమధ్య విభేదాలు ఎందుకొచ్చాయో... లక్ష్మణుడు: విభజనవాదులని ఉన్నార్లే అన్నయ్యా.. వాళ్ళు కట్టుకున్న పుణ్యమిది. రాముడు: భద్రాచలం మునగాల.. భద్రాచలం మునగాల అంటూ చివరికి ఇద్దరూ మునిగిపోతారేమో! లక్ష్మణుడు: బాగాచెప్పావన్నయ్యా.. రాముడు: వీళ్ళు భలేవాళ్ళు లక్ష్మణా.. మనం కావాలని ఇద్దరూ కోరుకుంటున్నారుగానీ, మనలాగా కలసిమెలసి వుండాలని మాత్రం అనుకోవడం లేదు.. లక్ష్మణుడు: అవునన్నయ్యా.. అది సరేగానీ, నువ్వు వీళ్ళిద్దరిలో ఎవరివైపు వుండాలని అనుకుంటున్నావన్నయ్యా? రాముడు: నేను భద్రాచల రాముణ్ణి.. అందరి బంధువుని!

ఒక్క పిటిషను వేస్తే వంద పిటిషన్లు వేసినట్లే

  అదేదో సినిమాలో హీరో నేను ఒక్కమారు చెపితే వంద సార్లు చెప్పినట్లే అన్నట్లు, కోర్టు ఒక పిటిషను తిరస్కరిస్తే వంద పిటిషన్లు వేసయినా సరే ఒప్పించుకోగల పట్టువదలని విక్రమార్కుడు జగన్మోహన్ రెడ్డి. దేశమంతటా తిరిగేందుకు అనుమతి కోరుతూ అతను వేసిన పిటిషనును నిన్న సీబీఐ కోర్టు తిరస్కరించగానే, వెంటనే మరో పిటిషను వేసారు. నేరుగా ‘నేషనల్ పర్మిట్’ అడిగితే కోర్టు ఈయదని గ్రహించిన అతను, ఈసారి కోల్ కతా, లక్నో నగరాలు వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరుతూ మరో పిటిషను వేసారు. అతను ఊహించినట్లే ఆ రెండు నగరాలకి వెళ్లేందుకు సీబీఐ కోర్టు ఈరోజు అనుమతి మంజూరు చేసింది. బహుశః ఈ రెండు చుట్టబెట్టి వచ్చిన తరువాత ఒరిస్సా మరియు బీహార్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ మరో పిటిషను వేస్తారేమో!   దేశంలో వివిధ కాంగ్రెసేతర పార్టీ నేతలను కలిసి రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు మద్దతు కోరేందుకు ఈ యాత్రలని అతను పైకి చెపుతున్నపటికీ, ఈ సాకుతో దేశంలో అన్ని పార్టీల నేతలతో పరిచయాలు పెంచుకొని, అందరి దృష్టిని ఆకర్షించడమే అతని లక్ష్యమని చెప్పవచ్చును. ఒకప్పుడు స్వర్గీయ యన్టీఆర్, చంద్రబాబు కేంద్రంలో ఏవిధంగా చక్రం తిప్పేరో, తను కూడా ఆవిధంగానే తిప్పుదామని అతని ఉద్దేశ్యం కావచ్చును.   అంతే గాకుండా, ఈవిధంగా జాతీయ స్థాయి నాయకులతో రాసుకుపూసుకు తిరుగుతున్నట్లయితే, కాంగ్రెస్ మళ్ళీ తనపై సీబీఐని కానీ ఈడీని గానీ ప్రయోగించే దుస్సాహసం చేయదనే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చును.   కానీ ఈ ప్రయత్నంలో ఒకదానికి మరొకటి బద్దశతృవులయిన పార్టీలని జగన్ కలుస్తుండటం వలన, అతను వారి మద్దతు పొందడం సంగతి ఎలా ఉన్నపటికీ, ముందు అతనిపై అందరికీ అనుమానాలు రేకెత్తిస్తున్నారు. మొదట అతను లెఫ్ట్ పార్టీలని కలిసిన మరునాడే అవి తీవ్రంగా వ్యతిరేఖించే బీజేపీని కలిసి రహస్య మంతనాలు చేసి వచ్చారు. రేపు అతను లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేఖించే తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీని కలువబోతున్నారు. ఆ తరువాత బీజేపీకి బద్దశత్రువయిన సమాజ్ వాదీ పార్టీ నేతలని, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ని కలవబోతున్నారు. ఇక వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువులేనని వేరే చెప్పనవసరం లేదు.   జగన్ ఎటువంటి సిద్ధాంతాలు చూడకుండా ఈవిధంగా దేశంలో ఉన్న కాంగ్రెసేతర రాజకీయ పార్టీలను కలవడం ద్వారా తను కాంగ్రెస్ పార్టీకి బద్ద విరోధినని రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తుండవచ్చు గాక. ఈ యాత్రల వలన అతను ఆశిస్తున్న దొకటయితే, ఫలితాలు మాత్రం వేరేలా ఉండే అవకాశాలున్నాయి.   అతను ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సాహమే అతనికి పరాభవాలు మిగిల్చినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించినా ఆశ్చర్యం లేదు. అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ మళ్ళీ తనను జైలుకి పంపే సాహసం చేయలేదని అతని అబిప్రాయం కావచ్చును.

పార్టీలకి ఎన్నికల జ్వరం మొదలయింది

  ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం కొన్ని రోజులే అన్నట్లుగా గత రెండు మూడు నెలలుగా రాష్ట్ర విభజన వైరాగ్యంతో బాధపడుతున్న ప్రజలు, రాజకీయ పార్టీలు క్రమంగా దానిని నుండి బయటపడుతున్నారు. అయితే ఈ వైరాగ్యంలో ఇంకా శాసనసభ, పార్లమెంటులో బిల్లు ఆమోదమనే రెండు దశలు మిగిలి ఉన్నాయి. ఇంత బాధని దిగమింగిన తరువాత ఆ రెండు దశలు దాటడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చును.   అందుకే ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కూడా ఆ వైరాగ్యం నుండి బయటపడి మరో ఆరు నెలలో వచ్చే పెద్ద పండుగకి (ఎన్నికలు) సన్నాహాలు మొదలుపెట్టాయి. క్రిందటి వారం జరిగిన తెదేపా మేధోమధనం సమావేశాలలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ ఎన్నికల సన్నాహాలకు కేవలం 100 రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది గనుక పార్టీ శ్రేణులని ఎన్నికలకి సిద్దం కమ్మని కమ్మటి పిలుపునిచ్చారు. అంతేగాక నిన్న,ఈరోజు ఆయన తన కుప్పం నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. ఆ తరువాత క్లిష్టమయిన టికెట్స్ వ్యవహారం కూడా చెప్పట్టవలసి ఉంది. ఇప్పటికే ఆ విషయంలో పార్టీ చాలా కసరత్తు చేసి ఉన్నందున బహుశః వచ్చే నెలాఖరులోగా టికెట్స్ వ్యవహారం కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.   ఇక, మొన్నజరిగిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల గురించి చంద్రబాబు చెప్పినట్లే చెప్పారు. కానీ టికెట్స్ వ్యవహారంలో ఆ పార్టీకి కొన్నిఇబ్బందులున్నాయి. ఆ పార్టీ తెలంగాణా లో పోటీ చేయదలిస్తే అక్కడ ఎవరయినా ఆసక్తి చూపుతారా? అనే అనుమానం ఉంది. ఇక ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహించిన కారణంగా, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి, పార్టీలో మొదటి నుండి ఉన్నవారికీ టికెట్స్ కేటాయింపు వ్యవహారం తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అందువల్ల వైకాపా తన అభ్యర్దులను ఖరారు చేయడానికి మరో రెండు నెలలు పట్టవచ్చును.   రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితే చాలా అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం టీ-కాంగ్రెస్ నేతలు ఏవో జైత్రయాత్రలు, సోనియమ్మ భజన కార్యక్రమాలు నిర్వహించుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ వారి భవిష్యత్ మొత్తం తెరాస తీసుకొనే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు. ఒకవేళ తెరాస కాంగ్రెస్ తో ఎన్నికల పోత్తులకి అంగీకరిస్తే టీ-కాంగ్రెస్ ముసలి గుర్రాలు తమ టికెట్స్ పై ఆశలు వదులుకోవలసిందే. కానీ సీమాంధ్ర తో పోలిస్తే గుడ్డిలో మెల్ల అన్నట్లు తెలంగాణాలో పరిస్థితి కొంత బాగానే ఉందనుకోవచ్చును.   సీమాంధ్రలో నేతలు కాంగ్రెస్ పేరు చెప్పుకోవడానికి కూడా జంకుతున్నారు. కానీ ప్రజలకు ‘షార్ట్ మెమొరీ ప్రాబ్లెం’ ఎక్కువ ఉంది గనుక త్వరలోనే వారు ‘సమైక్యాంధ్ర’ వైరాగ్యం నుండి బయటపడి ‘కొత్త రాజధాని ఎక్కడ పెట్టాలి?’ అనే రసవత్తరమయిన చర్చలో పడిపోతే కాంగ్రెస్ పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

భలే మంచి ట్విస్ట్!

      కాంగ్రెస్ పార్టీ నిర్మాతగా, కేంద్ర ప్రభుత్వ దర్శకత్వంలో, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, ఏపీ కాంగ్రెస్ ముఖ్య పాత్రధారులుగా గత కొంతకాలంగా ఏకపక్షంగా నడుస్తున్న ‘రాష్ట్ర విభజన’ డ్రామాలో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నిజంగా రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ బొచ్చెలో రాయిపడటం ఖాయమని కొత్తగా బయటపడిన ఈ ట్విస్ట్ చెప్పకనే చెబుతోంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటంటే, శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమకు చెందిన భూమిలోనే ఉందట.. అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టు గుంటూరు జిల్లాకి చెందిన భూముల సర్వే నంబర్లలోనే ఉందట!   ఈ విషయాలను వెల్లడిస్తూ వచ్చిన వార్తల్లో పూర్తి వాస్తవాలు వుంటే మాత్రం  హైదరాబాద్ మాదే.. భద్రాచలం మాదే అని రెచ్చిపోతున్న విభజనవాదుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టే. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రను ఎడారి చేయాలన్న ఉద్దేశంలో ఉన్న విభజనవాదులు తాము తీసుకున్న గోతిలో తామే పడ్డట్టే! రెండు ప్రాజెక్టులూ సీమాంధ్ర భూముల్లోనే వుంటే ఇక తెలంగాణ  పరిస్థితి ఏమిటి? హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం కాబట్టి సర్వహక్కులూ మావేనని గొంతుచించుకుంటున్న విభజనవాదులు సీమాంధ్రలో అంతర్భాగంగా వున్న ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? మొత్తమ్మీద పరిస్థితులు చూస్తుంటే విభజనవాదుల నెత్తిన తెల్లగుడ్డపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ యూటీ దిశగా పయనిస్తోంది. హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు న్యాయమైన వాటా లభించే పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రాచలం నూటికి నూరుశాతం సీమాంధ్రకి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాముల అంశం తెరమీదకి వచ్చింది. ఇన్నాళ్ళూ అనాథలుగా అరణ్యరోదన చేసిన సీమాంధ్రులకు మంచి రోజులు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు విభజన డ్రామా రసకందాయంలో పడింది. ఇక ఈ డ్రామా దర్శక నిర్మాతలు, ప్రధాన పాత్రధారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

దివిసీమ ఉప్పెనకు 36 ఏళ్లు

      దివిసీమ ఉప్పెన.....ఈ పేరు వింటేనే కృష్ణాజిల్లాలోని దివిసీమ వాసులు ఉలిక్కిపడతారు. తీరప్రాంతాన్ని ఆనుకొని ఉండే దివిసీమ సముద్రుడి ఉగ్రరూపాన్ని చూసిన రోజు అది. దశాబ్ధాలు గడుస్తున్నా నవంబర్‌ 19 అంటేనే దీవిసీమ ప్రాంత వాసులు శ్రుతి పథంలో ఆనాటి జలప్రళయం సృష్టించిన విషాదం మెదులుతుంది. సంవత్సరాలు గడిచిన ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా తడారలేదు.   అప్పటి జలప్రళయంలో సొర్ల గొంది, దీన దయాళ పురం, దిండి, హంసల దీవి, నాళి..తదితర గ్రామాలలోని సుమారు పదివేల మందికి పైనే మృత్యువాత పడ్డారు. పంట నష్టం, పశు నష్టం, సంగతి చెప్పనక్కరలెదు. అంతెత్తున ఎగసిపడిన సముద్రపు అలలు సృష్టించిన అప్పటి ఆ భీభత్సాన్ని తలచుకుంటే దివిసీమ వాసులతో పాటు మనసున్న ప్రతి ఒక్కరి మనసు ఈనాటికి చెమర్చక మానదు.    

ఆ పుస్తకాల్లో ఏముందో?

      ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళి మంత్రుల బృందం ముందు ఎప్పటిలాగానే తన సమైక్య వాదనను వినిపించారు. ఢిల్లీ పెద్దలకు ఎప్పుడు చెప్పే మాటల్నే మళ్ళీ ఇంకోసారి చెప్పారు. అయితే ఈసారి ముఖ్యమంత్రి రెండు పుస్తకాలను ఢిల్లీకి తీసుకెళ్ళి జీఓఎం సభ్యులకు ఇచ్చారు. జీఓఎంతో సమావేశం ముగిసిన తర్వాత బయటకి వచ్చిన ముఖ్యమంత్రి తాను జీఓఎంతో ఏం చెప్పిందీ మరోసారి ఏకరువు పెట్టారు.   ముఖ్యమంత్రి చెప్పిన విషయాల్లో కొత్త సంగతులేవీ లేవు. అయితే ముఖ్యమంత్రి తాను సమర్పించిన రెండు పుస్తకాల గురించి గానీ, అందులో ఏముందన్న విషయం గానీ బహిర్గతం చేయలేదు. ఆ పుస్తకాల్లో ముఖ్యమంత్రి చెప్పిన మాటలే గణాంకాలతో సహా వున్నాయా, లేక మరేవైనా సీక్రెట్స్ దాగి వున్నాయా అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి ఏదో కీలక అంశాలే ఆ పుస్తకాల్లో ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పే అంశాలున్నాయా.. లేక చాలామంది అనుమానిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి అంతర్గతంగా విభజనకు మద్దతు పలుకుతూ సులభంగా విభజన జరగడానికి సహకరించే అంశాలను ఆ పుస్తకాల్లో పొందు పరిచారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి తాను మంత్రుల బృందం ముందు వుంచిన అన్ని విషయాలనూ బహిర్గతం చేయాల్సిన అవసరం వుంది. ఈ విషయాన్నే పలువురు రాజకీయ నాయకులు ప్రస్తావిస్తూ ఆ పుస్తకాల్లో ఏమున్నదీ ముఖ్యమంత్రి బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రం సమైక్యంగా వుండాలని నిజంగానే కోరుకుంటున్న పక్షంలో తాను సమర్పించిన పుస్తకాల్లో వున్న అంశాలను బహిర్గతం చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  

కేంద్రమంత్రుల బృందం వేస్తే అదో తుత్తి!

  రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయినప్పుడు కాంగ్రెస్ హడావుడిగా అంటోనీ కమిటీ వేసింది. దాని నిర్వాకం అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఏర్పాటు చేసిన కేంద్రమంత్రుల బృందం రాష్ట్రంతో కానీ, రాష్ట్ర ప్రజలతో గానీ ఎటువంటి సంబంధం లేకుండా డిల్లీలోనే కూర్చొని విభజన ప్రక్రియ చకచక చేసుకుపోతుంటే, సీమాంధ్ర రాజకీయ పార్టీలు మళ్ళీ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడంతో అఖిలపక్ష సమావేశం పెట్టింది. అయినప్పటికీ విభజన రాజ్యంగా ప్రకారం జరుగలేదంటూ సుప్రీంకోర్టులో కేసులు దాఖలవుతుండటంతో చివరిగా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రిని కూడా నిన్న పిలిచి వారి అభిప్రాయాలు తీసుకొని ‘మమ’ అనిపించేసింది.   రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకు విశ్వప్రయత్నాలు చేశామని, అందుకోసం తమ పదవులకు రాజీనామాలు కూడా చేసేసామని చెప్పుకొంటున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు, మళ్ళీ తమ కేంద్రమంత్రుల హోదాలోనే రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన కేంద్రమంత్రుల బృందానికి తగిన సూచనలు ఇచ్చివచ్చారు.   కానీ, ఇప్పుడు కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమనే చెప్పివచ్చామని మరో మారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసారు. బహుశః ఏపీఎన్జీజీవోల హెచ్చరికలు, ప్రజల ఆగ్రహానికి గురికాకూడదనే భయమే వారిని ఆవిధంగా పలికించి ఉంటుంది. లేకుంటే వారు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ఎక్కడ పెట్టాలనే విషయం గురించి ఈ సందర్భంగా మీడియా ముందు ప్రస్తావించేవారే కాదు. ఆ తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా గట్టిగా చాలా వాదించానని, తను కూడా అవసరమయితే వారిలాగే పదవీ త్యాగానికి సిద్దమని చెప్పి వచ్చారు.   కేంద్రమంత్రుల బృందం తన నివేదికను సిద్దం చేసి ఈ నెల 21న క్యాబినెట్ కి సమర్పించనుంది. కానీ, ఈ అభిప్రాయ సేకరణ తంతు పూర్తయిన కొద్ది గంటలలోనే రాష్ట్ర విభజనకి ప్రధాన కారకుడు-కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర విభజనను ముందే ఖరారు చేసేస్తూ తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు. దీనిని బట్టి ఈ కేంద్రమంత్రుల బృందం, అబిప్రాయాల సేకరణ తంతు మొత్తం కూడా సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టేందుకేనని అర్ధం అవుతోంది.   కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యదర్శులు శాఖల వారిగా తెరవెనుక ఈ విభజన ప్రక్రియ అంతా పూర్తి చేస్తుంటే, ప్రజల తుత్తి కోసమే కేంద్రమంత్రుల బృందం పాపం! చాలా శ్రమ తీసుకొంది. కానీ నేటికీ కొందరు విభజనను వ్యతిరేఖిస్తూ చెప్పివచ్చమని, మరి కొందరు అడ్డుకొంటామని చెప్పడం కూడా సీమాంధ్ర ప్రజల తుత్తి కోసమే!

ఛత్తీస్‌గఢ్ లో రెండో విడత పోలింగ్ ప్రారంభం

      ఛత్తీస్‌గఢ్ లో రెండో విడత పోలింగ్ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. 73 నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. 843 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.40 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 18 స్థానాలకు ఈ నెల 11న తొలిదశ ముగిసిన నేపథ్యంలో చివరివిడతకు లక్షమందికిపైగా భద్రత సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలవారు 72 మంది చొప్పున పోటీలో ఉండగా, మొత్తంమీద 75 మంది మహిళలు కూడా రంగంలో ఉన్నారు. తొలిదశలో కొన్ని నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా, తుది విడత 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు సాగుతుంది. ఇక రాజధాని రాయ్‌పూర్ (దక్షిణ) నియోజకవర్గంలో అత్యధికంగా 38 మంది, సరాయ్‌పలి స్థానంలో అతి తక్కువగా ఐదుగురు బరిలో ఉన్నారు.

సీఎం పదవి..బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

      "తొమ్మిదేళ్లు ఎవరికీ దక్కని గౌరవం, అవకాశం నాకు దక్కాయి. ముఖ్యమంత్రిగా ఇంతపెద్ద ఆంధ్రప్రదేశ్‌ను ఏకధాటిగా పాలించా. మళ్లీ అలాంటి రాష్ట్రానికి సీఎం కావాలని కోరుకుంటాను తప్పితే.. ఏ జైళ్లనుంచీ బెయిళ్లు.. ఏ కేసుల నుంచీ మాఫీలూ నాకు అవసరం లేదు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.   చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. రాష్ట్రంలో అప్రతిహతంగా సాగుతున్న టీడీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికే విభజన కుట్రను తెరమీదకు తీసుకొచ్చారని ఆయన ఆరోపించాడు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిన తర్వాతనే రాష్ట్ర విభజన గురించి ఆలోచించాలని, కాదని ఏకపక్షంగా ముందుకు పోతే టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదని హెచ్చరించారు. ఈనెల 21న తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని, అదే రోజు తిరుపతిలో జరిగే సభలో కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ కలిసి పన్నుతున్న కుతంత్రాలను బయటపెడతానని చంద్రబాబు అన్నాడు. వచ్చే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మ పోరాటం సాగిస్తున్న టీడీపీ ఘన విజయం సాధించి తీరుతుందని జోస్యం చెప్పాడు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యానాలు చేశాడు.

వైఎస్ షర్మిల కూడా పులుసులో కరివేపాకేనా?

  ఈరోజు హైదరాబాదులో జరిగిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీలో ముఖ్యలయిన నాయకులందరూ పాల్గొన్నప్పటికీ వైవీ సుబ్బారెడ్డి, షర్మిల ఇద్దరు కూడా హాజరుకాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు నుండి, షర్మిల కడప నుండి లోక్ సభ టికెట్స్ ఆశించి భంగపడినందునే ఈ సమావేశానికి గైర్హాజరయ్యారని సమాచారం. అయితే ఇందులో నిజానిజాలెలా ఉన్నపటికీ, జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలయిన నాటి నుండి షర్మిల పార్టీలోకి కానీ, ప్రజల మధ్యగానీ కనబడలేదనిధి వాస్తవం.   అతను జైల్లో ఉన్నపుడు పార్టీని నిలబెట్టడానికి షర్మిల ఏకంగా 3000 కిమీ. పాదయాత్ర చేయడమే కాక, స్వయంగా తన రాజకీయ భవిష్యత్ నిర్మించుకోగల ఆ సదవకాశాన్ని కూడా కాదనుకొని, తాను తన సోదరుడు జగన్ తరపునే ప్రజల వద్దకు వచ్చానని చెప్పిన వ్యక్తి ఆమె. ఒకవేళ షర్మిల కనుక ఆనాడు పూనుకొనకపోయి ఉంటే, ఈరోజు వైకాపా ఉనికి కూడా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదెంత మాత్రం.   ఒకవేళ జగన్ జైలు నుండి విడుదల కాకపోయినట్లయితే, రానున్నఎన్నికలలో పార్టీకి ఆమె సారధ్యం వహించవచ్చని, అందువల్ల పాదయాత్ర అనంతరం ఆమెకు పార్టీలో కీలకమయిన పదవి కట్టబెడతారని ప్రజలు కూడా భావించారు. కానీ పార్టీలో ఇప్పుడు ఆమె ఉనికే లేకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యం.   నిత్యం తన తండ్రి రాజశేకర్ రెడ్డి నామస్మరణ చేస్తూ, ప్రజలకు తన ఆ ‘ప్రత్యేక హోదా’ని గుర్తుచేసే జగన్మోహన్ రెడ్డి నోట పార్టీ కోసం, తన కోసం ఇంత కష్టపడిన తన సోదరి షర్మిల సేవలను ప్రశంసిస్తూ నేటివరకు ఒక్క ముక్క కూడా వినబడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత అంటూ నిత్యం సూక్తులు వల్లించే జగన్, తన సోదరికి కృతజ్ఞతలు తెల్పుకోవడం కాదు కదా, కనీసం ఆమె పేరు కూడా తలచుకోకపోవడం ఎటువంటి విలువలో అతనికే తెలియాలి. ఒకవేళ జగన్ తన స్వంత సోదరి షర్మిలనే పక్కనబెట్టగలిగినప్పుడు, మరిక ఇతరుల గురించి చెప్పేదేముంది? పార్టీ అవసరమయినప్పుడు మాత్రమే వాడుకొని తరువాత పక్కన బెట్టడం చూస్తే ఆమెను కూడా పులుసులో కరివేపాకు వలే ఉపయోగించుకొంటున్నట్లు అర్ధం అవుతోంది.