చంద్రబాబు జగన్ తో కుమ్మక్కు: హనుమంతరావు ఉవాచ

  సీనియర్ కాంగ్రెస్ నేత వీ.హనుమంత రావు మాటలు విన్నవారికి ఉద్యోగులకే కాదు రాజకీయ నాయకులకి సైతం పదవీ విరమణ వయసు పెట్టడం అవసరమనిపిస్తుంది.   ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్డి అక్రమంగా వేలకోట్ల ఆస్తులు కూడ బెట్టుకొన్నాడు. ఆయన తండ్రి తెలంగాణా ఏర్పాటు చేయాలని కోరితే అతను మాత్రం సమైక్యవాదం పేరిట దేశాటన చేస్తూ ప్రతిపక్ష నేతలందరినీ కలుస్తున్నాడు. ఈ మిషతో అందరినీ కలుస్తూ పరిచయాలు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. అతని అసలు ఉద్దేశ్యం వేరే ఉంది. పార్టీలనన్నిటినీ పోగేసి కేంద్రంలో ఏదో చక్రం తిప్పేయాలని కలగంటున్నాడు. అయితే అది నెరవేరదని అతనికీ తెలుసు. అతను హైదరాబాదు బయట కాలుపెడితే సాక్షులను ప్రభావితం చేస్తాడని వాదించిన సీబీఐ ఇప్పుడు అతనిని దేశమంతా తిరగడానికి, ఎవరిని పడితే వారిని కలవడానికి ఎందుకు అనుమతి ఇస్తోందో అర్ధం కావడం లేదు. ఇప్పటికయినా సీబీఐ కోర్టులు అతనికి కళ్ళెం వేయాలి,” అని అన్నారు.   ఆయన ఇంతటితో ఆగితే పరువలేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులు అనుమతులు మంజూరు చేయకుండా చంద్రబాబు అడ్డుకోవాలని ఒక విచిత్రమయిన కోరిక కోరారు. ఇంతవరకు ఆ రెండు పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యాయని ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకొంటుంటే, ఇప్పుడు హనుమంత రావు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్యాడని, అందుకే అతనిని అడ్డుకోవడం లేదని విచిత్రమయిన ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయి తమను అన్యాయం చేస్తోందని లగడపాటి వంటి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వాపోతుంటే ఈయన ఈవిధంగా మాట్లాడటం చూస్తే ఇక రాజకీయాల నుండి రిటైర్మెంటు తీసుకోవచ్చునని అర్ధం అవుతోంది.

టీఆర్‌ఎస్ కంచుకోటకు బీటలు..!

      టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా పిలువబడే సిద్ధిపేటకు బీటలు మొదలయ్యాయి. ఈ నియోజక వర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి వలసలు జోరందుకోవడంతో ఆ పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. మండల కేంద్రమైన చిన్నకోడూరుకు చెందిన గ్రామపంచాయతీ ఉప సర్పంచు మంగా ప్రసాద్, మరో ఆరుగురు వార్డు సభ్యులు, కార్యకర్తలు సిద్ధిపేట ఆత్మ కమిటీ ఛైర్మన్ కాముని శ్రీనివాస్ పార్టీని వీడి ఎంపీ విజయశాంతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.   మరోవైపు సిద్ధిపేట నియోజ కవర్గంలోని చిన్నకోడూరు, నంగునూరు, సిద్ధిపేట మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్ సర్పంచులు, గ్రామ, మండల శాఖ నాయకులు పెద్ద యెత్తున కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎవరికి వారుగా తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన సిద్ధిపేట నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడల్లా అండగా నిలిచారు. అయితే, ఇప్పుడిప్పుడే సిద్ధిపేట నియోజకవర్గంలోని ప్రజల్లో మార్పు కొ్టచ్చినట్లు అగుపిస్తున్నది. స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వం వల్ల అటు ప్రజలు, ఇటు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు కొంత అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం.

కోస్తాంధ్రలో 'హెలెన్' బీభత్సం

        'హెలెన్' తుఫాన్ దెబ్బకు పచ్చని కోనసీమ మరోసారి కకావికలమైంది! వందల సంఖ్యలో కొబ్బరి చెట్లు నేలరాలాయి! మిగిలిన చెట్లు తుఫానుకు ఎదురు నిలిచినా.. వాటిపై ఒక్క కాయ కూడా లేదు. కోనసీమ కొబ్బరి రైతు మరో పదేళ్లదాకా కోలుకోలేని రీతిలో తుఫాను దెబ్బతీసింది. లక్షల హెక్టార్లలో పంటలు మునిగాయి.   అరటి, చెరకు, తమలపాకు, పసుపు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విద్యుత్తు వ్యవస్థ చిన్నాభిన్నమైంది! వేల సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి! వందలాది గ్రామాల్లో అంధకారం నెలకొంది! ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 1055 విద్యుత్తు స్తంభాలు కుప్పకూలాయి. 88 కిలోమీటర్ల విద్యుత్తు లైన్లు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సహా తీర ప్రాంత మండలాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 23 సబ్ స్టేషన్ల పరిధిలోని వంద గ్రామాల్లో అంధకారం నెలకొంది. 800కుపైగా కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. కోనసీమ సహా వివిధ ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణకు మూడు రోజుల సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తుఫాను బీభత్సానికి కోస్తా జిల్లాల్లో 13 మంది మరణించారు. వీరిలో చెట్లు మీద పడి ఐదుగురు, విద్యుత్తు స్తంభాలు కూలి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.   video coutesy:tv9

యంగ్ టైగర్ జీవితంతో సీతయ్య ఆడుకొంటున్నాడా

  నందమూరి వంశస్థుడయిన తనకు తెలుగుదేశం పార్టీలో తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని చీటికి మాటికి అలుగుతూ ఎప్పుడో ఓసారి పార్టీ కార్యక్రమాలకి వచ్చి అప్పుడు కూడా తనదయిన శైలిలో వ్యవహరించే హరికృష్ణ, పార్టీతో సంప్రదించకుండా సమైక్యాంధ్ర వేడిలో తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన తరువాత ఆయన పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడిన రేవడిగా తయారయింది.   ఆ మధ్య వైకాపా జూనియర్, సీనియర్ యన్టీఆర్ ల ఫోటోలను తన పార్టీ బ్యానర్లలో వేసుకొని తెదేపాతో మైండ్ గేమ్స్ మొదలుపెట్టినప్పుడు, అతని సోదరుడు గట్టిగా ఖండించినప్పటికీ హరికృష్ణ మాత్రం అందులో తప్పేమిటి? అన్నట్లుగా మాట్లాడటంతో కేవలం ఆయనపైనే కాకుండా ఆ ప్రభావం అయన కుమారుడు జూ.యన్టీఆర్ సినిమాలపై కూడా నేటికీ తీవ్ర ప్రభావం చూపుతోంది. పార్టీకి, తమకి మధ్య ఏర్పడిన ఆ దూరాన్ని తగ్గించుకోవాలని ఇరువైపులా వారు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంతో వారి మధ్య ఆదూరం అలాగే ఉండిపోయింది.   రాష్ట్ర విభజన వ్యవహారంతో పార్టీ తీవ్రంగా సతమవుతున్నతరుణంలో హరికృష్ణ తన యంపీ పదవికి రాజీనామా చేయడం ఆ దూరాన్ని మరింత పెంచింది. ఆయన తనకు ఏ కారణంగా పార్టీలో ప్రత్యేక హోదా, గౌరవం కలిగి ఉండాలని ఆశిస్తున్నారో, ఇప్పుడు అదే నందమూరి వంశం అర్హత కారణంగానే ఆయన రాజీనామా పార్టీని ఇబ్బందులలో పడేసింది.   చంద్రబాబు పార్టీని కాపాడుకోవడానికి తలపెట్టిన ఆత్మగౌరవ యాత్రకు సమాంతరంగా ఆయన కూడా సమైక్యాంధ్ర కోసం ‘చైతన్యయాత్ర’ మొదలుపెడతానని ప్రకటించినా, బహుశః పార్టీ ఒత్తిడి వలననే ఆ ప్రయత్నం విరమించుకొన్నట్లు భావించవలసి ఉంటుంది. కానీ మళ్ళీ ఈ మధ్య ఆయన ‘తెలుగుజాతి మనోవేదన’ అంటూ ప్రజలకు మూడు పేజీల బహిరంగ లేఖ ఒకటి పత్రికలకి విడుదల చేసారు.   అందులో రాష్ట్ర విభజన చేస్తున్నకాంగ్రెస్ అధిష్టానాన్ని, దాని ఉద్దేశ్యాలని వివరించి, అధిష్టానానికి తలొగ్గి ప్యాకేజీలు కోరుతున్న కాంగ్రెస్ యంపీలను, కేంద్రమంత్రులను, వారి అధిష్టానాన్నికూడా దుమ్మెత్తి పోశారు. కానీ ఆయన అంతటితో ఆగకుండా 'సమన్యాయం' అంటూ మాట్లాడటం కూడా తెలుగుజాతిని ద్రోహం చేయడమేనంటూ పరోక్షంగా మళ్ళీ స్వంతపార్టీకి కూడా చురకలు వేసారు.   ఇంకా రాజకీయాలలోనే కొనసాగాలనుకొంటున్న హరికృష్ణ ఈ బహిరంగలేఖతో ఏమి సాధించదలచుకోన్నారో తెలియదు. కానీ తనసమైక్యవాదంతో అటు వైయస్సార్ కాంగ్రెస్ తోనూ కలవలేక, ఇటు స్వంత పార్టీతోను కలవలేక తన రాజకీయ జీవితాన్నే కాకుండా తన కుమారుడు ఎంతో కష్టపడి నిర్మించుకొన్న సినిమా జీవితాన్నికూడా నాశనం చేస్తున్నారు.   ఆయన చేస్తున్న సమైక్యవాదం వల్ల రాష్ట్ర విభజన ఆగిపోదు. వైకాపా అతనికి బాజా బజంత్రీలతో ఎదురేగి పార్టీలోకి స్వాగతం పలకదు. రెండు రాష్ట్రాలకి సమన్యాయం కోరుతున్న తెదేపా ఆయనని దరిచేరనీయదు. పైగా ఈ ప్రభావం ఆయన కుమారుడి సినీజీవితాన్ని కూడా దెబ్బ తీస్తోంది. ఆయన చేస్తున్నసమైక్యవాదం వలన తెలంగాణాలో యన్టీఆర్ సినిమాలకు ఆటంకాలు ఎదురవుతుంటే, ఆ తండ్రీ కొడుకులు వైకాపాకు దగ్గరవుతున్నారనే అనుమానంతో ఆంధ్రాలో అభిమానులు దూరం అవుతున్నారు.   హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. కనీసం పార్టీ సభ్యుడిగా క్రియాశీలకంగా పార్టీ వ్యవహారాలలో పాల్గొన్నదీ లేదు. అటువంటప్పుడు పార్టీ నుండి కానీ ప్రజల నుండి గానీ ఆయన ఏదో ఆశించడం అవివేకం. కనీసం రాజకీయ సన్యాసం స్వీకరిస్తే కనీసం ఆయన తన కుమారుడు యన్టీఆర్ కయినా మేలు చేసినవారవుతారేమో ఆలోచిస్తే బాగుంటుంది.

జగన్‌ దేశ పర్యటన

  సమైక్య రాష్ట్రం కోసం గట్టిగా కృషి చేస్తున్నానన్న క్రెడిట్‌ కోసం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నివిదాల ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా  విభజిస్తుందంటూ ఆరోపిస్ దేశ నాయకులను కలుస్తున్నారు జగన్‌. అందులో భాగంగానే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మరోసారి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం.. అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ విభజన ముసాయిదా బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని చెప్తున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రపతిని కలిసి విభజన ప్రక్రియలో జోక్యం చేసుకుని అడ్డుకోవాలని కోరనున్నారు.   జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలో రాష్ట్రపతిని కలవనున్నారు. ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు జనతాదళ్ అధినేత శరద్‌యాదవ్‌ను కలిసి సమైక్యాంద్ర ప్రదేశ్‌కు మద్దతు కోరనున్నారు.ఆదివారం ఉదయం 11 గంటలకు బిజూ జనతాదళ్‌ అథినేత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కలసి రాష్ట్ర పరిస్థితులను వివరించనున్నారు.

యూటికి మేం వ్యతిరేకం

  రాష్ట్రవిభజన నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దిన్‌ ఒవైసి, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధిని కలిశారు. శుక్రవారం మద్యాహ్నం సోనియాను కలిసిన ఆయన 45 నిమిషాల పాటు చర్చించారు.కేంద్ర మంత్రుల బృందానికి ఇచ్చిన నివేదికనే తిరిగి సోనియాగాంధీకి కూడా వినిపించానని అసదుద్దీన్ చెప్పారు. హైదరాబాద్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రపాలిత ప్రాంతం చేయొద్దని ఆయన సోనియాను కోరారు. హైదరాబాద్‌ను ఇరు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధాని చేయాలన్న సీడబ్ల్యుసీ ప్రతిపాదనకు కూడా తాము వ్యతిరేకమని, దేశంలో ఏ రాష్ట్ర రాజధానీ మరొక రాష్ట్రంలో లేదని గుర్తు చేశానన్నారు. ఒకవేళ తప్పదని భావిస్తే కనుక కేవలం ఖైరతాబాద్ మండల పరిధికే ఉమ్మడి రాజధానిని పరిమితం చేయాలని సోనియాను కోరానని అసదుద్దీన్ తెలిపారు.

విభజన వాదులను జైళ్లో పెడతా

  రాష్ట్ర విభజన నేపధ్యంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన నేత టిజి వెంకటేష్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను ముఖ్యమంత్రినై తే... రాష్ట్ర విభజనవాదులను జైల్లో పెడతా అంటూ మంత్రి టీజీ వెంకటేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రం కోసం తీవ్రంగా పోరాడుతున్నామన్న ఆయన త్వరలో విభజనను అడ్డుకోవటానికి లక్షమందితో ఢిల్లీ వెల్లనున్నట్టు చెప్పారు. అయితే లక్షమందితో ఢిల్లీ దిగ్బందం కార్యక్రమం ఏపిఎన్జీవో అద్యక్షడు అశోక్‌బాబు నేతృత్వంలోనే జరుగుతుందన్నారు.ఢిల్లీ ముట్టడికి తన వంతుగా 15 వేల మందిని తీసుకెళతానని వెల్లడించారు. సీయం విభజనను ఆపాటానికి అన్నివిదాలుగా కృషిచేస్తున్నారన్న టిజి అసెంబ్లీ రద్దు చేయాల్సిందిగా సియంను కోరుతా నన్నారు.

నిమ్మకూరులో జగన్‌కు చేదు అనుభవం

  కృష్ణాజిల్లా పర్యటనలో ఉన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు సొంతఊరు నిమ్మకూరులో పర్యటిస్తున్న జగన్‌, అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేయాలనుకున్నారు అయితే ఎన్టీఆర్‌ అభిమానులు ఆయన్ను అడ్డుకున్నారు. జగన్‌ పూల మాల వేస్తే ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పాలతో శుద్ది చేస్తామని అభిమానులు హెచ్చరించారు. దీంతో జగన్‌ పూలమాల వేయకుండానే వెనుదిరిగారు. తరువాత ఎన్టీఆర్‌ బంధువు పెద వెంకటేశ్వరరావు ఇంటికి జగన్‌ వెళ్లారు.

ఏటిఎం ఆగంతకుడి అరెస్ట్‌.?

  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏటీఎం వ్యవహారంలోని నిందితున్ని బెంగుళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్ట పగలు బెంగళూరులోని ఏటీఎం సెంటర్‌లో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన ఆగంతకుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తుముకూరు జిల్లా, టిపటూరులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి పేరు సతీష్ అని తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఇంకా పోలీసులు ధృవీకరించలేదు.  బెంగళూరులోని ఏటీఎంలో జ్యోతి ఉదయ్‌పై 19వ తేదీ ఉదయం దాడి జరిగింది. దాడిలో తీవ్ర గాయాల పాలయిన ఉదయ్‌ ప్రస్తుతం ఆమె బీజీఎస్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రేణుకాచౌదరికి అధిష్టానం షాక్‌

  ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ఫైర్‌బ్రాండ్‌ రేణుకాచౌదరికి కాంగ్రెస్‌ అధిష్టానం షాక్‌ ఇచ్చింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి నుంచి శుక్రవారం రేణుకాచౌదరిను తొలగించింది. అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం పై రేణుకచౌదరితో పాటు జిల్లా నాయకులు కూడా షాక్‌ గురయ్యారు. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిథిగా రేణుకచౌదరి నియమితులయ్యారు. అయితే పార్టీ కార్యక్రమాలను భావాలను అనుకున్న స్థాయిలొ రేణుక ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారని అధిష్టానం అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమెను అధికార ప్రతినిధి పదవినుంచి తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.

విశ్వవిజేత ఓడిపోయాడు

  13 సంవత్సరాలుగా తన కిరీటాన్ని కాపాడుకుంటూ వస్తున్న చెస్‌ చాంపియన్‌ విశ్వనాధన్‌ ఆనంద్‌ చివరకు తలవంచాడు. 5 సార్లుగా వరుసగా టైటిల్స్‌ సాదిస్తున్న వచ్చిన ఆనంద్‌ ఈ సారి మాత్రం తన కిరీటాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. నార్వే దేశానికి చెందిన మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ చెస్ చాంపియన్షిప్ను గెలుచుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్షిప్ పోటీలలో భారత యోధుడు విశ్వనాథన్ ఆనంద్ను 6.5-3.5 పాయింట్ల తేడాతో ఓడించి ఈ నార్వే యువకుడు కిరీటాన్ని దక్కించుకున్నాడు. ఏకంగా 13 సంవత్సరాల పాటు ఆ టైటిల్ మరెవ్వరికీ దక్కకుండా నిలబెట్టుకున్నాడు. అయితే, తాజా పోటీలలో భాగంగా పదో గేమ్ డ్రా కావడంతోనే ఈ కిరీటం ఆనంద్ చేజారింది. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ విశ్వవిజేతగా నిలిచాడు. 22 ఏళ్ల అతి పిన్న వయసులోనే ఈ ఘనతను సాధించి రికార్డు సృష్టించాడు.

తెలంగాణ ఆశలు గోవిందా?

      కేంద్రం తెలంగాణ ఇచ్చే కార్యక్రమాన్ని ఏదో ఆషామాషీగా చేసిపారేద్దాం.. ఆంధ్రప్రదేశ్‌ని ఈజీగా రెండు ముక్కలు చేసిపారేద్దాం అనుకుని విభజన నిర్ణయాన్ని ప్రకటించింది. నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాతగానీ తాను తేనెతుట్టె మీద రాయితో కొట్టానని అర్థం అర్థంకాలేదు. ఇప్పుడు రాష్ట్రాన్ని కేక్ కోసినట్టు కోయడానికి కత్తి పట్టుకుని రెడీ అయిన మంత్రుల బృందానికి రాష్ట్రాన్ని ఎలా కోయాలో తెలియక ఆ కత్తితోనే బుర్రలు గోక్కుంటున్నారు.     రాష్ట్ర విభజన విషయంలో ఏ పాయింట్ గురించి ఆలోచించినా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థంకాక టెన్షన్ పడిపోతున్నారు. నెలలు, సంవత్సరాలు ఆలోచించి, ఎంతో కృషి చేస్తే తప్ప సాధ్యం కాని రాష్ట్ర విభజన ప్రక్రియని కట్టె కొట్టె తెచ్చె అన్నట్టు సింపుల్‌గా పూర్తి చేయడం ఎలాగో తెలియక గందరగోళపడిపోతున్నారు. అందుకే మంత్రుల బృందంలోని సభ్యులు ఈ విభజన గోల తమ నెత్తిన అనవసరంగా పడ్డ బరువుగానే భావిస్తున్నారు. బాధ్యత మొత్తం షిండే, జైరామ్ రమేష్ భుజాల మీద పడేసి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్టు అందరూ తప్పించుకు తిరుగుతున్నారు. మంత్రుల బృందం సమావేశానికి డుమ్మా కొట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మంత్రుల బృందం ఎప్పుడు సమావేశమైనా కొన్ని సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. దోశ పెనం మీద వుందన్నంత ఈజీగా బిల్లు రెడీ అవుతోందని మంత్రుల బృందం సభ్యులు గంభీరంగా చెబుతున్నప్పటికీ, నిజానికి అంత సీను లేదని తెలుస్తోంది. తమకు వీలుకాకుండా పోయిన ఈ తద్దినాన్ని ఎలా పెట్టాలో అర్థంకాక  మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలా వుంటే, తెలంగాణ బిల్లు ఎందాకా వచ్చింది సార్ అని బృందంలో కీలక సభ్యుడు జైరామ్ రమేష్‌ని విలేకరులు అడిగితే, ఆయన ‘గోవిందా.. గోవింద’ అనేసి వెళ్ళపోయారట. పాపం లోపల ఎంత మథనపడి వుండకపోతే ఆయన నోట్లోంచి ఆ మాట బయటపడుతుంది? జైరామ్ రమేష్ చేసిన కామెంట్ చూస్తుంటే తెలంగాణ బిల్లు శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశాలు లేవన్నట్టే అనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు పార్లమెంటు ముందుకు రాకపోతే ఇక తెలంగాణ పరిస్థితి జైరామ్ రమేష్ చెప్పినట్టు ‘గోవిందా’ అనుకోవడమే అని భావిస్తున్నారు.

తీరాన్ని దాటిన హెలెన్ తుఫాన్

      రాష్ట్రంలో తీవ్ర ఉగ్రరూపం దాల్చిన హెలెన్ తుపాను మచిలీపట్నం వద్ద ఈ రోజు మధ్యాహ్నం తీరం దాటినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో ఆరు గంటల్లో ఇది క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారుతుంది. ఈ వాయుగుండం ప్రభావం వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. హెలెన్ తుపాను ప్రభావానికి రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో కోనసీమ ప్రాంతంలో విపరీతంగా నష్టంవాటిల్లినట్లు తెలుస్తోంది. మరోవైపు తీర ప్రాంత ప్రజలను అధికారులు పునరావాసకేంద్రాలకు తరలించిడంతో ప్రాణ నష్టం తప్పింది.   video courtesy;ETV 2

ఇది కాంగ్రెస్ మార్క్ రాష్ట్ర విభజన

  రాష్ట్ర విభజనపై అసలు కాంగ్రెస్ అధిష్టానం అయోమయంలో ఉందా? లేక ఆవిధంగా ప్రవర్తిస్తూ ప్రజలనే అయోమయంలో ఉంచుతూ తన పని కానిచ్చేయాలని ప్రయత్నిస్తోందా? అనే అనుమానం ప్రజలలో నెలకొంది.   ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ లో మొదట తెలంగాణా, సమైక్యాంద్ర వాదులే ఉండేవారు. ఆ తరువాత సమైక్యవాదులలో అధిష్టానానికి అనుకూల వర్గం, వ్యతిరేఖ వర్గాలు పుట్టుకొచ్చాయి. మళ్ళీ ఈ అనుకూల వర్గంలో ఉత్తుత్తి రాజీనామాలు చేసిన వారు, అసలు చేయని వారు ఉన్నారు. విభజనను వ్యతిరిఖించే వర్గంలో మళ్ళీ ముఖ్యమంత్రి వర్గం, అతనిని వ్యతిరేఖించే వర్గం ఏర్పడ్డాయి. ఇక వీటికి అదనంగా కాంగ్రెస్ పార్టీలో చాలా ముటాలు, గ్రూపులు ఉండనే ఉన్నాయి.   ఈ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమలో తాము కొట్లాడుకొంటూనే మరో వైపు టీ-కాంగ్రెస్ నేతలతో కూడా కత్తులు దూస్తూ ఈ వ్యవహారంలో వీలయినంత గందరగోళం సృష్టిస్తున్నారు. ఒకే కాంగ్రెస్ పార్టీ ఇన్నివిధాలుగా విడిపోయి తలొక వాదన చేస్తుంటే, సహజంగానే ప్రజలలో కొంత గందరగోళం, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంది. ఈ కాంగ్రెస్ గ్రూపుల వాద ప్రతివాదనలే నేడు రాజకీయాలుగా చలామణి అవుతుండటం దురదృష్టకరం.   రాష్ట్ర కాంగ్రెస్ నేతల శైలికి ఏ మాత్రం తీసిపోకుండా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన వ్యవహారంపై రోజుకొక మాట మాట్లాడుతూ, మీడియాకి లీకులు ఇస్తూ కధ నడిపిస్తోంది. ఒక రోజు హైదరబాద్ పై ఫలాన ఆప్షన్స్ పరిశీలిస్తున్నామని చెపితే, మరోసారి భద్రాచలం గురించి, ఇంకోసారి ఆర్టికల్ 371 ఉంచాలా, సవరించాలా లేక తొలగించాలా?అని ఇంకోసారి రాష్ట్ర శాసనసభకి పంపవలసింది బిల్లా లేక డ్రాఫ్టా? అయితే ఎప్పుడు పంపాలి? ముఖ్యమంత్రి అడ్డుకొంటే ఏమి చేయాలి? ఇలా ఒకటేమిటి ప్రతీ అంశంపైనా లీకులు, అనుమానాలు, చర్చలు, సమావేశాలే. అయినా దానికి అంతు తెలియదు.   శాసనసభ ప్రోరోగ్ అంశం ఇంకా సర్దుమణుగక ముందే ఇప్పుడు మరో పాత అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. త్వరలో పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దం అవుతున్నఈ తరుణంలో హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతం చేయమని కొందరు సీమాంధ్ర కేంద్రమంత్రులు పట్టుబడుతుంటే, వీలేదని టీ-కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.   ఇంత కాలం రాష్ట్ర విభజనపై అధిష్టాన నిర్ణయమే తమకు శిరోధార్యమని చెపుతూ వచ్చిన కావూరి, జేడీ శీలం వంటి వారు ఈ డిమాండ్స్ చేస్తున్నట్లు మీడియాకి లీకులు ఈయడం వెనుక అర్ధం, ఉద్దేశ్యం ఏమిటి? వారు సీమాంధ్ర ప్రజల కోసం కడదాకా పోరాడుతున్నామని బిల్డప్ ఇచ్చేందుకే ఈవిధంగా చేస్తున్నారా? లేక ఈ వంకతో కాంగ్రెస్ లో కలిసేందుకు నిరాకరిస్తున్న తెరాసను లొంగదీయడానికే కాంగ్రెస్ అధిష్టానం ఈ కుటిలయత్నాలు చేస్తోందా? అసలు రాష్ట్ర విభజన ఏవిధంగా చేయాలో తెలియకనే తికమకపడుతోందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.   దేశంలో అన్ని వ్యవస్థలను తన చెప్పుచేతల్లో ఉంచుకొన్న కాంగ్రెస్ అధిష్టానం ఈవిషయంలో ఇంత అయోమయంలో ఉందంటే నమ్మశక్యం కాదు. తనకి కావలసిన ఏ అంశంపైనైనా తగిన సలహాలు ఇచ్చే మేధావులు, నిపుణులు దాని చేతిలో ఉన్నారు. అందువలన కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ అయోమయం కేవలం అతితెలివి ప్రదర్శించడమే. తద్వారా ప్రజలను, తన ప్రత్యర్ధ రాజకీయ పార్టీలను అయోమయంలో ఉంచే ప్రయత్నం చేస్తోంది. లేకుంటే కావూరి, జేడీ శీలం, పురందేశ్వరి వంటి వీర విధేయులు తనని బెదిరిస్తున్నారని నమ్మశక్యం కాని మీడియా లీకులు ఇచ్చేదే కాదు.

డీఎస్ ఉబలాటం..!

      తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కంటున్న చాలామందిలో డి.శ్రీనివాస్‌కి ఒకరు. వారానికోసారి వార్తల్లో కనిపించి తెలంగాణకి అనుకూలంగా ఏదో ఒకటి మాట్లాడకపోతే ఆయనకి నిద్రపట్టేలా లేదు. తాజాగా ఆయన మాట్లాడిన పాయింట్లను గమనిస్తే, తాను మిగతా కాంగ్రెస్ నాయకులకంటే చాలా ఫార్వర్డ్ అయిపోయినట్టు, అధిష్ఠానానికి చాలా దగ్గరగా వున్నట్టు బిల్డప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆయన మాట్లాడిన పాయింట్లేంటంటే, 10 జిల్లాలతో, హైదరాబాద్‌తో కూడిన హైదరాబాద్ వచ్చేస్తోందట.   సీమాంధ్రులు ఆశ్చర్యపోయి ఆనందంతో గంతులు వేసే స్థాయిలో ప్యాకేజ్ రాబోతోందట! అంచేత సీమాంధ్రులు సమైక్యం అంటూ హడావిడి చేయకుండా వచ్చే అద్భుతమైన ప్యాకేజీ తీసుకుని పండగ చేసుకోవాలట. బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో గప్‌చుప్‌గా బిల్లుకు ఆమోదం తెలిపి పంపేయాలట. అలా కాకుండా బిల్లును అడ్డుకోవడానికి ఏం చేసినా అది అసెంబ్లీ గౌరవాన్ని అప్రతిష్టపాలు చేసినట్టేనట! ఉమ్మడి రాజధానిగా హెచ్ఎండీఎ పరిధి ఉంటుందని తాను అనుకోవట్లేదట. ఒకవేళ హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా వున్నా సీమాంధ్రులు హైదరాబాద్‌లో ఎక్కువకాలం ఉంటలేరట.. ఎందుకంటే తమ ప్రాంతం కంటే హైదరాబాద్ దూరంగా వుంది కాబట్టి ఇంతదూరం రాలేక అక్కడే రాజధాని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతారట. అలాగే రాయల తెలంగాణ డిమాండ్ చేసినవాళ్ళు  రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్టేనట.. ఇవీ డీఎస్ గారు చెప్పిన విషయాలు!

కిషన్‌రెడ్డి ఏమంటున్నారు?

      బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇస్తున్న స్టేట్‌మెంట్లు సామాన్యులకు పిచ్చి పట్టిస్తున్నాయి. కిషన్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలన్నీ విన్న తర్వాత ఆయన తెలంగాణకు అనుకూలంగా వున్నారా.. వ్యతిరేకంగా వున్నారా అనే విషయం ప్రజలకు అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. బీజేపీ సీమాంధ్ర నాయకులెవరైనా ‘సమైక్యం’ అనే మాట మాట్లాడితే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని కిషన్‌రెడ్డి సారు తాజాగా ప్రకటించారు. ఇది ఇంకా ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు.     తెలంగాణ కోసం వందలాదిమంది యువకులు ఆత్మహత్య చేసుకున్నా స్పందించని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ ‌గాంధీ కోసం తెలంగాణ విభజనను చేపట్టిందని చెప్పారు. అంటే, రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తుందని తెలిసీ బీజేపీ అందుకు మద్దతు ఇస్తోందని అర్థమా? కిషన్‌రెడ్డి మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారు. బీజేపీ మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును ఆమోదించలేదని అన్నారు.

గుళ్ళు గోపురాలు వద్దంటున్నబీజేపీ

  కాంగ్రెస్ పార్టీ నుండి దాని భజన సంస్కృతిని వేరు చేసి చూడటం అసాధ్యం గనుక టీ-కాంగ్రెస్ నేతలు సోనియమ్మ భజన చేసినా, గుడి కడతామన్నా, తెలంగాణా రాష్ట్రానికి ఆమె పేరు పెట్టాలని డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు. కానీ అలా చేయనివారినే అనుమానించవలసి ఉంటుంది.   మాజీ మంత్రి శంకరన్నఇంకా సోనియమ్మ గుడికి, నిత్యధూప నైవేద్య హారతులకి మొత్తం ఎన్నిఎకరాలు కావాలో లెక్కలు వేసుకొంటూ ప్రభుత్వ స్థలాల కోసం తిరుగుతుంటే, అతని కంటే వీరభక్తులు కొందరు కరీంనగర్ జిల్లా కేంద్రంలో అప్పుడే అమ్మకి గుడి కట్టేసి నిత్యపూజలు కూడా మొదలెట్టేసారుట!   దేశంలో ఏ గుడి మీద ఈగ వాలినా ఊరుకోని బీజేపీ నేతలు, ఈ సోనియమ్మ గుడిని మాత్రం ఎందుకో హర్షించలేకపొతున్నారు. ఈవిషయం స్వయంగా ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డే చెప్పారు. “టీ-కాంగ్రెస్ నేతలకు ఆమె దేవత అయితే కావచ్చుగాక! కానీ, తెలంగాణా ప్రజలకు కాదు. నిజానికి ఆమె వెయ్యి మందికి పైగా అమాయకుల ప్రాణాలు బలిగొన్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి గుడికట్టి పూజలు చేయడానికి మీకు సిగ్గు లేదూ?” అంటూ వీరంగం వేసేసారు.   కిషన్ రెడ్డి మాటలను నిజమేనని ఒప్పుకోవడానికి కాంగ్రెస్ నేతలకి తప్ప మరెవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చును. కాంగ్రెస్ పార్టీతో ఒకవైపు ఎన్నికలలో కత్తులు దూస్తూనే, పార్లమెంటులో దాని కుంభకోణాలను ఎండగడుతూనే, ఇలా సిగ్గు లేదని తిడుతూనే మళ్ళీ అదే పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే తెలంగాణా బిల్లుకి మద్దతు ఇస్తామని చాటింపు వేసుకోవడం ఎందుకు? వేసుకొన్నాక ఇస్తామని ఖచ్చితంగా మాట మీద ఎందుకు నిలబడలేకపోతునట్లు? తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయడం వలన తనకి ఏ మాత్రం రాజకీయ ప్రయోజనం చేకూరదని గ్రహించిన బీజేపీ, ఇప్పడు వెనకడుగువేస్తే తానే స్వయంగా తెలంగాణా అడ్డుకొన్నట్లు కాదా? అప్పుడు తెలంగాణా యువకుల ఆత్మహత్యల పాపంలో బీజేపీ కూడా భాగం పుచ్చుకొంటుందా?   ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా తామే పరిశుద్దులమన్నట్లు, తామే ప్రజల ఆకాంక్షల కోసం కృషిచేస్తున్నట్లు ఎంత స్వంత డప్పు కొట్టుకొంటున్నపటికీ, అన్ని పార్టీల లక్ష్యం రానున్న ఎన్నికలలో గెలవడమేనని ప్రజలకి బాగా తెలుసు. బీజేపీ దానికి అతీతం కాదు.

టీఆర్ఎస్‌లో 11 ప్రశ్నలు!

      రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేయాలో చెప్పండంటూ మంత్రుల బృందం పదకొండు పనికిమాలిన ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. ఆ పదకొండు ప్రశ్నలకు ఏ పార్టీ సమాధానాలు ఇవ్వనప్పటికీ 11 ప్రశ్నలనే కాన్సెప్ట్ మాత్రం పాపులర్ అయింది. సరే, జీవోఎం తాలూకు పదకొండు ప్రశ్నల సంగతి పక్కన పెడితే, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల మనసులో వున్న 11 ప్రశ్నలను ఒకసారి పరిశీలిద్దాం. 1. కేంద్రం తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించడమయితే ప్రకటించింది. ఇంతకీ తెలంగాణ వస్తుందా? రాదా? 2. ఒకవేళ తెలంగాణ నిజంగా వచ్చేస్తుంటే రాకుండా ఎలా అడ్డుకోవాలి? 3. సీమాంధ్రులని సరికొత్తగా ఎలా తిట్టాలి? ఎలా బెదిరించాలి? 4. ప్రాంతీయ విద్వేషాలని ఇంకా రెచ్చగొట్టడం ఎలా? 5. రాబోయే ఎన్నికలలో ఎన్ని సీట్లు వస్తాయో ఏంటో? 6. తెలంగాణ వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేట్టుంది. ఇప్పుడెలా? 7. ఒకవేళ టీఆర్ఎస్‌ని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే ఆ తర్వాత మా పరిస్థితి ఎలా వుంటుంది? మా ఆదాయాలకేం ఢోకా వుండదు కదా? 8. ఇతర పార్టీలలో వున్న నాయకులకి ఎలా గాలం వేయాలి? 9. మేం ఎంత ట్రై చేసినా తెలుగుదేశం పార్టీ నాయకులెవరూ మా పార్టీ ముఖం కూడా చూడటం లేదెందుకో! 10. అనవసరంగా తెలంగాణ ఉద్యమం చేశారంటూ భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు మమ్మల్ని తిట్టిపోస్తారా? 11. ఫామ్‌హౌస్‌లో ఈసారి ఏయే పంటలు వేయాలి?

వాళ్లు ప్రజాకంఠకులే

  విభజన విషయంలో గత కొంతకాలంగా మౌనంగా ఉన్న మాజీ రాజ్యసభ సభ్యులు హరికృష్ణ మౌనం వీడారు. శుక్రవారం ఆయన తెలుగు ప్రజలకు ఓ బహిరంగ లేఖరు రాశారు. ఈ లేఖను తెలుగు జాతి మనో వేదన పేరుతో ఆయన విడుదల చేశారు. తెలుగు ప్రజలు కేవలం సమైఖ్యరాష్ట్రన్ని మాత్రమే కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. లక్షకోట్ల ప్యాకేజీలు, రాజధాని, సమన్యాయం ఇవేవి తమకు అవసరం లేదని కేవలం సమైఖ్యరాష్ట్రమే తమకు కావాలని ఆయన పునరుద్ఘాటించారు. మూడు పేజీల లేఖను విడుదల చేసిన హరికృష్ణ, ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజన చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టారని వమర్శించారు. విభజనకు సహకరించే ప్రతి వ్యక్తి ప్రజాకంఠకుడే అన్నారు.