telangana

తెలంగాణాలో గెలిచి ఓడిన కాంగ్రెస్ పార్టీ

  కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ప్రకటనతో తెరాస, తెదేపాలపై పైచేయి సాధించినప్పటికీ, టీ-కాంగ్రెస్ నేతలు ఆ సదవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. తెలంగాణా ప్రకటన చేసి కేసీఆర్ ను, తెరాసను పూర్తిగా దెబ్బతీయలనుకొన్న కాంగ్రెస్ అధిష్టాన వ్యూహం కాస్తా టీ-కాంగ్రెస్ నేతల ఉదాసీనతతో బెడిసికొట్టింది. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రవిభజన ప్రకటన చేసిన తరువాత వారెవరూ ఆ ఖ్యాతిని దక్కించుకొనే ప్రయత్నాలేవీ చేయకపోగా, ఇంకా ఏర్పడని తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి పదవికోసం అంతర్యుద్దంలో మునిగిపోయారు. వారి నిర్లిప్తతకు తోడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమాంధ్ర ప్రాంతాన్ని దాదాపు స్తంభింపజేసారు.   అయినప్పటికీ, టీ-కాంగ్రెస్ నేతలలోఎటువంటి ప్రతిస్పందన కనబడకపోవడంతో, అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొంటూ కేసీఆర్ చకచకా పావులు కదుపుతూ తెలంగాణాలో తానే అసలయిన హీరోనని నిరూపించుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. కేసీఆర్ చురుకుగా కదిలి తెలంగాణా అంశాన్నిమళ్ళీ తన చేతిలోకి తెచ్చుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలలో నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితులను తనకనుకూలంగా మలచుకొని ముందుకు సాగుతున్నాడు.   రాజధాని హైదరాబాద్ ను పంచుకొనే విషయంలో, ఆంద్ర ఉద్యోగుల విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆతనిని తెలంగాణా ప్రజల హీరోగా నిలబెడితే, హైదరాబాదులో స్థిరపడిన ఉద్యోగుల భద్రతకు హామీ ఇస్తూ మాట్లాడిన టీ-కాంగ్రెస్ నేతలు తెలంగాణా విలన్లుగా మిగిలిపోయారు. నిజానికి టీ-కాంగ్రెస్ నేతలు ఈ వ్యవహారంలో సరిగ్గానే ప్రతిస్పందించినపటికీ, అది తెలంగాణావాదానికి వ్యతిరేఖంగా ఉండటంతో కేసీఆర్ దే పైచేయి అయ్యింది.   ఇంతకాలం తెలంగాణా ఈయకపోతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందని అధిష్టానాన్ని పదేపదే హెచ్చరించిన టీ-కాంగ్రెస్ నేతలు, తెలంగాణా ప్రకటన తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో పూర్తి ఆధిక్యత సాధించగలదని నిబ్బరంగా చెప్పలేకపోతున్నారు. అందుకు ప్రధాన కారణం వారిలో ఏ ఒక్కరికి తెలంగాణాలో పది జిల్లాలపై పూర్తి పట్టు లేకపోవడం, ఏ ఒక్కరికి అందరినీ కలుపుకుపోగల నాయకత్వ లక్షణాలు లేకపోవడమే. అయినప్పటికీ టీ-కాంగ్రెస్ నేతలందరూ ఎవరికివారు తామే ప్రధాన నేతగా భావించుకొంటూ, మిగిలినవారిని తమకు పోటీదారులుగా భావించడం విశేషం.   తాజా సర్వేల ప్రకారం ఈరోజు ఎన్నికలు జరిగినట్లయితే, కాంగ్రెస్ పార్టీ కంటే తెరాసకే ఆధిక్యత ఉంటుందని తేలింది. ఈ సర్వేలు అంచనాలు ఎలా ఉన్నపటికీ తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి మాత్రం అంత గొప్పగా లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఎంతో సాహసోపేతమయిన నిర్ణయం తీసుకొని తెలంగాణా ఏర్పాటు చేస్తున్నపటికీ అది ఆ పార్టీకి లాభం చేకూర్చకపోగా రెండు ప్రాంతాలలో కూడా నష్టం కలిగిస్తోంది. అందుకు ఆ పార్టీ నేతలనే నిందించక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మేల్కొనకపోతే తెరాసను విలీనం చేసుకోవడం సంగతి దేవుడెరుగు, ఆ పార్టీ రెండు ప్రాంతాలలో కనబడకుండా పోయే ప్రమాదం ఉంది.

 MP Harikrishna united andhra pradesh

హరికృష్ణ రాజీనామా ఆమోదం: ఎంపీలకు షాక్

      రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టిడిపి పార్టీ ఎంపీ హరికృష్ణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పిజే కురియన్ ఆమోదించారు. తన రాజీనామాను ఆమోదించినందుకు హరికృష్ణ డిప్యూటీ ఛైర్మన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసినందుకు గర్వపడుతున్నానని ఆయన అన్నారు. అన్నగారి ఆశయ సాధన కోసమే రాజీనామా చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ వల్లే తనకీ పదవి దక్కిందని ఆయన చెప్పారు. తనను రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు హరికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.   అయితే ఇది సమైక్య రాష్ట్రం కోసం చేసిన తొలి రాజీనామా అవుతుంది. దీంతో ఇప్పుడు మిగిలిన సీమాంద్ర ఎమ్.పిలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. రాజ్యసభలోను, లోక్ సభలోను ఆందోళన చేస్తున్న ఎమ్.పిలు రాజీనామా చేయాలని ఇప్పటికే ప్రజలలో డిమాండ్ ఉంది. ఎపి ఎన్.జి.ఓల సంఘం అయితే ఎమ్.పిలు రాజీనామా చేస్తే తమ ఆందోళన విరమించుకుంటామని ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఇది కొత్త టర్న్ తీసుకున్నట్లవుతుంది. మిగిలిన ఎమ్.పిలు కూడా రాజీనామా చేస్తారా? లేదా అన్నది చర్చనీయాంశం అవుతుంది.

junior ntr tdp

'బాద్ షా' పదవి పై జూనియర్ కసి

      గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ కి టిడిపి లో పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తరువాత తానే అధినేత అవుతానని భావిస్తున్న సమయంలో...నారా లోకేష్ సడన్ ఎంట్రీ తో జూనియర్ ఎన్టీఆర్ కి షాక్ తగిలింది.   నారా లోకేష్..టిడిపి అధ్యక్షుడి కుమారుడు, నందమూరి బాలకృష్ణ అల్లుడు కావడంతో పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. ఇది జూనియర్ ఎన్టీఆర్ ను మనోవేదనకు గురి చేసింది. ఇంకా బాలకృష్ణ కూతురు తేజస్విని వివాహానికి కూడా జూనియర్ ఆహ్వానం పై లోకేష్ అభ్య౦తరం వ్యక్తం చేయడంతో ఆహ్వానించ లేదు. దీంతో స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వం కోసం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య పోటీ ప్రజ్వరిల్లినట్లేనని కూడా ప్రచారం జరుగుతోంది.                కసితో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాత స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వం కోసం ఎన్ని కష్టనష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాని కోసం గత కాలంగా తండ్రి హరికృష్ణ కు కూడా దూరంగా ఉంటూ...ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే కేంద్రీకరించాడు. నందమూరి అభిమానుల్లో తన ఫాలోయింగ్ ఎక్కువగా పెంచుకోవడానికి కష్టపడుతున్నాడు. ఎలాగైనా వరుస సూపర్ హిట్లు కొట్టి ఎన్టీఆర్ వారసుడ్ని తానే అనిపించుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.   ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తన రాజకీయ వారసుడు నందమూరి బాలకృష్ణ అని ప్రకటించినా...తన సమర్ధతతో టిడిపి అధ్యక్ష పదవిని చేపట్టిన చంద్రబాబునే ఆదర్శంగా తీసుకొని... తాను తిరిగి ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తాననె కసితో జూనియర్ ఉన్నాడని సన్నిహిత వర్గాలు అనుకుంటున్నారు. 

Harikrishna new party

హరికృష్ణ కొత్త పార్టీ..!!

      టిడిపి పార్టీ ఎంపీ హరికృష్ణ, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి అందజేశారు. అయితే హరికృష్ణ రాజీనామా పైన వివిధ రకాల ప్రచారం జరుగుతోంది.  సిడబ్ల్యూసి విభజన నిర్ణయం వెలువడిన హరికృష్ణ మొదట రాజీనామా చేస్తూ... ప్రజల సెంటిమెంటుకు తలవంచి తాను విభజనను అంగీకరిస్తున్నానన అయితే, విభజన తీరు బాగాలేదని ఆయన ఆక్షేపించారు. ఈసారి సమైక్యాంద్రకు మద్దతుగా ఆయన రాజీనామా చేశారు.   హరికృష్ణ రాజీనామాలో మరో కోణాలు కూడా ఉండి ఉండవచ్చునని ప్రచారం సాగుతోంది. చంద్రబాబుపై నిత్యం అసంతృప్తి వ్యక్తం చేసే హరికృష్ణ...సీమాంధ్రలో కొత్త పార్టీ పెట్టే ఉద్దేశ్యంతో ఉన్నారని అందుకే, రాజీనామా చేశారని అంటున్నారు. ఇప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేసిన హరికృష్ణ ..త్వరలో కృష్ణా జిల్లా చైతన్య యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సమైఖ్య నినాదంతో యాత్ర చేయబోతున్న హరికృష్ణ తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.      అయితే జూనియర్ ఎన్టీఆర్ కారణంగా పార్టీ వైపు ఆలోచించే అవకాశాలు లేకపోలేదని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద ఆయన టిడిపి కి రాజీనామా చేసి..బస్సు యాత్ర మొదలు పెడితే అప్పుడు కాస్త క్లారిటీ రావొచ్చు.   

harikrishna

సీతయ్య ఎవరి మాట వినడు

  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు కట్టుబడి ఉన్నానని చెపుతుంటే ఆ పార్టీకి చెందిన సీమంధ్ర నేతలు మాత్రం సమైక్యాంధ్ర కోరుతూ పోటాపోటీగా నిరాహారదీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు హరికృష్ణ కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా చంద్రబాబుకి పోటీగా బస్సుయాత్ర కూడా చెప్పట్టబోతున్నారు. చంద్రబాబు పార్టీని రెండు ప్రాంతాలలో కాపాడుకోవాలనే ఆలోచనతో బస్సుయాత్ర చెప్పట్టబోతుంటే, హరికృష్ణ సమైక్యాంధ్ర కోసం చేయబోతున్న బస్సుయాత్రతో చంద్రబాబుకి, తెదేపాకి ఇబ్బందులు సృష్టించబోతున్నారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నపటికీ, నందమూరి కుటుంబానికి చెందిన హరికృష్ణ బస్సుయాత్ర చేపడితే అది తెలంగాణా ప్రజలకి, నేతలకి తప్పుడు సంకేతాలు పంపుతుంది. అదేవిధంగా కాంగ్రెస్, వైకాపా, తెరాసలకు ఒక తెదేపాపై దాడి చేసేందుకు ఒక చక్కటి ఆయుధం అందజేసినట్లవుతుంది. పార్టీ అధిష్టానాన్ని సంప్రదించకుండా ఆయన ఈ విధంగా బస్సు యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించడం పార్టీని డ్డీకొనడంగానే భావించవచ్చును.   కొద్ది నెలల క్రితం వైకాపా ఫ్లెక్సీ బ్యానర్లతో చిచ్చుపెట్టినప్పుడు, తన కుమారుడు జూ.యన్టీఆర్ తో చంద్రబాబు, బాలకృష్ణలు వ్యవహరించిన తీరుపట్ల చాలా ఆగ్రహంగా ఉన్నహరికృష్ణ, ఇప్పుడు సరయిన సమయం చూసి చంద్రబాబుపై పగ తీర్చుకొనేందుకే ఈ సమైక్యాంధ్ర బాట పట్టి ఉండవచ్చును. ఒకవేళ చంద్రబాబు ఆయన బస్సు యాత్రకి అడ్డుపడితే తెదేపా సమైక్యాంధ్రని వ్యతిరేఖిస్తున్నట్లవుతుంది. చూసీచూడనట్లు ఊరుకొంటే, తెలంగాణాను వ్యతిరేఖిస్తున్నట్లు ప్రచారం అవుతుంది. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నహరికృష్ణ హటాత్తుగా తన పదవికి రాజీనామాచేసి బస్సు యాత్రలు చేపట్టినంత మాత్రాన్న ప్రజలు ఆయన మాటలను నమ్మకపోవచ్చును, కానీ స్వయంగా నందమూరి కుటుంబ సభ్యుడే తెలంగాణాను వ్యతిరేఖిస్తున్నందున అది పార్టీ అభిప్రాయమేనని ప్రతిపక్షాలు ప్రచారం చేసుకొనే అవకాశాన్ని చేజేతులా అందజేసినట్లవుతుంది. మరి హరికృష్ణ వ్యవహార శైలితో మొదటినుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్న చంద్రబాబు, బాలకృష్ణలు మరిప్పుడు ఆయనని ఏవిధంగా నిలువరిస్తారో చూడాలి.

Sabita Indra Reddy

జగన్ కేసు: సబితాను ప్రశ్నించిన సిబిఐ

      పెన్నా సిమెంట్ కంపెనీకి గనుల కేటాయింపు వ్యవహారంలో హోం శాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. దిల్‌కుషాలో ధర్మానను ప్రశ్నించిన సమయంలోనే సబితా ఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. వైఎస్ హయాంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబిత.. పలు గనుల లీజులను పెన్నాకు కేటాయించారు. వైఎస్ కుటుంబానికి ఆత్మీయుడైన పెన్నా ప్రతాపరెడ్డి.. ఇందుకు ప్రతిఫలంగా జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టారని కోర్టుకు సీబీఐ తెలిపింది. జగన్ అక్రమాస్తుల కేసులో చార్జిషీటు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో సబితను ప్రశ్నించి.. సీబీఐ అధికారులు తమ అనుమానాలను నివృత్తి చేసుకొన్నారు.

tdp mp hari krishna redign

టిడిపి ఎంపి హ‌రికృష్ణ రాజీనామా

  స‌మైక్యాంద్రకు మ‌ద్దతుగా మ‌రో ఎంపి రాజీనామ‌కు సిద్దమ‌య్యారు. తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు ఎన్టీఆర్ త‌ర‌యుడు నందమూరి హరికృష్ణ గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. స్పీప‌ర్ ఫార్మాట్‌లోనే రాజీనామ చేయాల‌ని నిర్ణయించుకున్నారు. గురువారం ఉద‌యం త‌న రాజీనామ ప‌త్రాన్ని చైర్మన్ హమీద్ అన్సారీకి సమర్పించనున్నారు. గ‌త కొద్ది రోజులుగా హ‌రికృష్ణ స‌మైక్య వాదాన్ని బ‌లంగా వినిపిస్తున్నారు. ఇటీవ‌ల రాజ్యస‌భ‌లోనూ విభ‌జ‌న‌పై విరుచుప‌డ్డ హరికృష్ణ ఇప్పుడు రాజీనామ‌కు సిద్దం కావ‌టం చ‌ర్చనీయాంశం అయింది. అయితే హరికృష్ణ రాజీనామ‌తో మ‌రింత మంది నేత‌లు రాజీనామ బాట ప‌ట్టే అవకాశం ఉందంటున్నారు.

sexual asault asharam bapu

ఆశారామ్ బాపుపై లైంగిక దాడి కేసు

  ఇప్పటికే చాలా మంది ఆద్యాత్మిక గురువులు త‌మ శిష్యుల‌పై లైంగిక దాడికి పాల్పడుతున్నార‌న్న వివాదాలు ఉండ‌టంతో ఇప్పుడు మ‌రో బాబాపై కూడా అలాంటి ఆరోప‌ణ‌లే మొద‌ల‌య్యాయి. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూ  తనపై లైంగిక దాడిచేశారంటూ ఓ అమ్మాయి  ఢిల్లీలో కేసు పెట్టింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆశారామ్ ఈ దాడి చేశారంటూ ఆ 16 ఏళ్ల బాలిక ఆరోపించింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ఆ బాలిక వైద్య ప‌రీక్షలు చేయించి లైంగిక దాడి జ‌రిగిన‌ట్టుగా నిర్ధారించారు. ఆమె ఆరోపించిన విధంగా ఆశారామ్‌పై ప‌లు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఉదంతం రాజ‌స్ధాన్‌లో జ‌రిగినందున కేసును అక్కడి బ‌దిలీ చేయ‌నున్నారు. అయితే ఆశారామ్ బాపు శిష్యులు మాత్రం ఈ విష‌యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు, ఎవ‌రో కావాల‌నే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయిస్తున్నార‌ని ఆరోపించారు. ద‌ర్యాప్తు పూర్తి అయితే అన్ని నిజాలు తెలుస్తాయ‌న్నారు. ఆశారామ్ బాపూపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 2009లో ఆయనపై హత్యాయత్నం, భూకబ్జా కేసులు నమోదవగా మధ్యప్రదేశ్‌లోనూ భూకబ్జా కేసు నమోదైంది. వీటితో పాటు కొంత మంది భ‌క్తుల‌ను మీడియా ప్రతినిధుల‌ను అవ‌మానించిన కేసులు కూడా ఆయ‌న పై ఉన్నాయి. 2008లో ఆశారామ్ ఆశ్ర‌మ పాఠ‌శాల‌లో ఇద్దరు విద్యార్ధులు మ‌ర‌ణించ‌టం కూడ అప్పట్లో సంచ‌ల‌న‌మ‌య్యింది.

asadhuddin meeting with sonia

రాయ‌ల తెలంగాణ అయితే ఓకె

  తెలంగాణ అంశం తెర మీద‌కు వ‌చ్చిన ద‌గ్గర నుంచి స‌మైక్య గానం బ‌లంగా వినిపిస్తున్న ఎం ఐ ఎం పార్టీ నాయ‌కులు ఇప్పుడు కాస్త మెత్తబడ్డట్టుగా క‌నిపిస్తున్నారు. ఇన్నాళ్లు స‌మైక్యాంద్ర త‌ప్ప మ‌రో ఆఫ‌న్ష్ లేద‌న్న ఆ పార్టీ నాయ‌కులు ఇప్పుడు రాయ‌ల తెలంగాణకు కూడా మ‌ద్దతిస్తామంటున్నారు. విభ‌జ‌న ప్రక‌ట‌న‌, సీమాంద్రలో నిర‌స‌నల నేప‌ధ్యంలో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ బుధవారం సాయంత్రం భేటి అయ్యారు. విభ‌జ‌న అనివార్యం అయిన ప‌క్షంలో రాయ‌ల తెలంగాణ‌కు మ‌ద్దతిస్తామ‌న్నారు. ఇన్నాళ్లు స‌మైక్యం వైపు ఉన్న అస‌ద్ ఇప్పుడు రాయ‌ల తెలంగాణ అన‌టంతో ఢిల్లీలో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. చ‌ర్చ అంతా హైద‌రాబాద్ చుట్టూ న‌డుస్తుండ‌టంతో, హైద‌రాబాద్‌లో బ‌ల‌మైన‌ప‌ట్టు ఉన్న అస‌దుద్దీన్, సోనియాతో భేటి కావ‌టం ప్రాదాన్యం సంత‌రించుకుంది. ఈ భూటిలోనే అస‌ద్ త‌న అభిప్రాయాన్ని సోనియాకు చెప్పారు. అయితే తెలంగాణ ప్రాంతంలో పది జిల్లాలతో కూడిన రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తుండ‌టంతో రాయల తెలంగాణ అంశం మళ్లీ కొత్త వివాదాల‌ను తెర మీద‌కు తీసుకువ‌స్తుంది

 Dhulipalla Narendra deeksha

ధూళిపాళ్ళ దీక్ష భగ్నంలో విషాదం

      తెలుగు దేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ళ నరేంద్ర పొన్నూరులో నాలుగు రోజులుగా సమైక్యాంధ్రకు మద్దతుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేసారు. పార్టీనాయకులు, మద్దతుదారులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నంలో ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు పైచెయ్యయిన పోలీసులకు నరేంద్రను అక్కడి నుండి తరలించే అవకాశం దొరికింది.   నరేంద్రను తరలిస్తున్న సందర్భంలో పోలీసు వాహనం వెనకనే దాన్ని అనుసరిస్తున్న మద్దతుదారుల వాహనం కూడా ముందు వాహనంతో సమానంగా వేగంగా ముందుకు పోతుండగా ఒక లారీని ఢీకొంది.  దానితో అందులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.  ముగ్గురికి గాయాలవగా వారిని హాస్పిటల్ కి చేర్చారు.  ఈ సంఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం బ్రాహ్మణ కోడూరు సమీపంలో జరిగింది.  జరిగిన ప్రమాదాన్ని నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

konda surekha

వైఎస్ బెస్ట్..జగన్ వేస్ట్

      మాజీ మంత్రి కొండా సురేఖ జగన్ పై మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేసింది. రక్షాబంధన్ సంధర్బంగా ఆమె మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి విగ్రహానికి రాఖీ కట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి, జగన్ కి చాలా తేడా ఉందని అన్నారు. వైఎస్ ఉన్నప్పుడు తాము ఉన్నత స్థాయిలో ఉంటే, జగన్ కార్యకర్త స్థాయికి దిగజార్చారని ఆమె అనడం విశేషం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూలంగానే తెలంగాణ వచ్చిందని, ఆయన పేరిట స్మృతివనం నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు.   తెలంగాణ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేయడం మూలంగానే తాను ఆ పార్టీని వీడి బయటకు వచ్చానని, వైఎస్ ను దూషించిన వారు ఆ పార్టీలో చెలామణి అవుతున్నారని, ఆత్మగౌరవం చంపుకోలేక బయటకు వచ్చామని అన్నారు. అయితే వైఎస్ మూలంగా తెలంగాణ వచ్చిందని కొండా సురేఖ అనడం ఆశ్చర్యంగా చింతచచ్చినా పులుపు చావలేదంటే ఇదేనేమో.

 Dhramana Prasad Rao

ధర్మానను విచారిస్తున్న సిబిఐ

      మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు బుధవారం ఉదయం సిబిఐ ఎదుట హాజరయ్యారు. దిల్ కుశ అతిథి గృహంలో సిబిఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. జగన్ కంపెనీలలో పెట్టుబడుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ ధర్మానకు సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద సిబిఐ నిన్న ఆయనకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా ఇందూ కంపెనీకి సంబంధించి లేపాక్షి నాలెడ్జ్ ప్రాజెక్టుకు భూకేటాయింపుల వ్యవహారంలో ఆయనను సిబిఐ విచారిస్తోంది. కాగా, ఇప్పటికే ధర్మాన ప్రసాద రావు పైన సిబిఐ ఒక ఛార్జీషీటు దాఖలు చేసింది. ఆయన సిబిఐ ఎదుట హాజరు కావడం ఇది మూడోసారి.

బాలయ్య కుమార్తె వివాహానికి ఎన్టీఆర్ డుమ్మా!

      ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు. అయితే నందమూరి బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ లు హాజరుకాకపోవడం అక్కడ లోటుగా కనిపించింది.వారిద్దరినీ బాలకృష్ణ పిలవలేదని కొందరు అంటుంటే హరికృష్ణకు ఆహ్వానం అందిందని అయితే జూనియర్ ఎన్టీఆర్ ను పిలవనందున ఆయన రాలేదని, తన తరపున తన మరో కుమారుడు కళ్యాణ్ రామ్ పంపించాడని మరికొందరు అంటున్నారు. ఎన్టీఆర్ – నారా లోకేష్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని, ఇక కొన్నాళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకొన్పప్పుడు మొదలయిన వివాదం సమసిపోలేదని, బాబాయ్.. అబ్బాయ్ లకు అభిప్రాయ భేదాలు వచ్చాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమయినా నందమూరి కుటుంబంలో విభేదాలు అభిమానులను ఆవేదనకు గురిచేస్తున్నాయి.

కాంగ్రెస్ ఎత్తుకి తెదేపా, వైకాపాలు చిత్తు

  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైకాపా నేత షర్మిల ఇద్దరూ తమ పాదయాత్రలు కొనసాగిస్తు కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకొని అస్త్రాలు సంధిస్తున్నపుడు, కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. చంద్రబాబు పాదయాత్ర తరువాత తెదేపా మళ్ళీ రెండు ప్రాంతాలలో బాగా పుంజుకొంది కూడా. అయితే, కాంగ్రెస్ పార్టీ వేసిన ఒకే ఒక ఎత్తుతో రెండు పార్టీలు చిత్తయినట్లు కనిపిస్తున్నాయి.   కాంగ్రెస్ పార్టీ ‘రాష్ట్రవిభజన ప్రకటన చేయడంతో వారిద్దరూ ఎంతో శ్రమపడి చేసిన పాదయాత్రలు నిష్ప్రయోజనమయ్యాయి. వైకాపా సమైక్యాంధ్ర టర్న్ తీసుకోవడం వలన షర్మిల తెలంగాణాలో చేసిన పాదయాత్రలు, విజయమ్మ శ్రమ వృధా కాగా, చంద్రబాబు నాయుడు 63 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య పరిస్థితులను సైతం లెక్క చేయకుండా చేసిన పాదయాత్ర రాష్ట్ర విభజన ప్రకటనతో నిష్ప్రయోజనమయిపోయింది. కాంగ్రెస్ వేసిన ఎత్తుతో వైకాపా తెలంగాణాను వదులుకోవలసి వస్తే, తెదేపా రెండు ప్రాంతాలలో తన ఉనికిని నిలుపుకోవడానికి ప్రయాస పడవలసి వస్తోంది. ఇప్పుడు రెండు పార్టీలు కూడా సీమాంధ్ర ప్రాంతంపై పట్టుకోసం తీవ్రంగా శ్రమించడం గమనిస్తే వాటి పరిస్థితి అర్ధం అవుతుంది.

హరికృష్ణ చైతన్య యాత్ర

      రాష్ట్ర విభజనను నిరసిస్తూ తెలుగువారంతా ఒక్కటిగానే ఉండాలని, వారిని విడదీయొద్దని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ చైతన్యయాత్ర చేయనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ తెలుగువారి ఆత్మగౌరవ పతాకాన్ని తలకెత్తుకుని 1982లో ఎన్టీఆర్ చైతన్యయాత్ర చేశారు. కేవలం తొమ్మిదినెలలలో రాష్ట్రంలో పాతుకుపోయిన కాంగ్రెస్ పాలనను కూకటివేళ్లతో పెకలించారు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుందని లేఖలు రాసి నిరసన తెలుపుతున్న హరికృష్ణ తాజాగా చైతన్య యాత్ర చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన అనంతపురం జిల్లా హిందూపురం నుండి ఈ యాత్రను చేపట్టనున్నారని సమాచారం. ఇక ఆయన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా నుండి తెలుగు ఆత్మగౌరవ యాత్రకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ రెండు యాత్రలకు ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతారో వేచిచూడాలి.

వైభవంగా బాలయ్య కుమార్తె వివాహం

      ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని వివాహం ఈ రోజు హైటెక్స్ లో ఘనంగా జరిగింది. ఈ ఉదయం 8.52గంటలకు వరుడు శ్రీభరత్‌, వధువు తేజస్విని మెడలో మూడుముళ్లు వేసారు. ఈ వివాహం కార్యక్రమాన్ని టీవీలలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా పెళ్లిని నిర్వహించేందుకు బాలకృష్ణ కుటుంబం ఏర్పాట్లు చేసింది. బాలకృష్ణ స్వయంగా అతిధులందరినీ ఆహ్వానిస్తూ బిజీగా ఉన్నారు. ఈ పెళ్లికి ఆయన అల్లుడు, నందమూరి కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.   వదూవరునలు ఆశీర్వదించేందుకు... కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, ఎంపీ నామా నాగేశ్వరరావు, టి.సుబ్బరామిరెడ్డి, జయసుధ, మోహన్ బాబు, మంచు లక్ష్మీప్రసన్న, మోత్కుపల్లి నర్సింహులు, ఈనాడు అధినేత రామోజీరావు, కేంద్రమంత్రి చిరంజీవి లతో పాటు సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.