సమైక్య చాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్ లో గెలుపెవరిది

  ఒక సమైక్య కృషీవలుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తన ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్దమని ప్రకటిస్తుంటే, మరొకాయన ఉంగరం పడిపోయిన చోటనే వెతుకోవాలనట్లు డిల్లీలో వాలి కాంగ్రెసేతర పార్టీలను తనతో సమైక్యం కమ్మని కోరుతున్నాడు.   పదవులు త్యాగాలు చేసినంత మాత్రాన్నఫలితం ఉండదని అనుభవపూర్వకంగా చెపుతున్నకావూరి, చిరంజీవి, పల్లంరాజు, పురందేశ్వరి వంటి వారి మాటలను ఖాతరు చేయక 'త్యాగం.. త్యాగం' అంటూ చాంపియన్ నెంబర్:1 ఒకటే పలవరిస్తున్నపటికీ, మరో వైపు ‘ఆయన కాంగ్రెస్ అధిష్టానం గీసిన గీతను జవదాటే రకం’ కాదని డిల్లీ వాళ్ళే సర్టిఫై చేస్తున్ననేపద్యంలో ఆయన విశ్వసనీయతపై జనాలలో అనుమానాలు మొదలయ్యాయి.   ఇక ‘సమైక్యసెంటిమెంటుతో సీమాంధ్రలో మొత్తం యంపీ సీట్లు అన్నినొల్లెస్తా, రాష్ట్రంలోనే కాదు డిల్లీ లెవెల్లో కూడా గిరగిర చక్రం తిప్పేస్తా’ అంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన చాంపియన్ నెంబర్:2 జగన్ బాబు ఇప్పుడు ఆ పనిమీదనే నేడు డిల్లీలో వాలిపోయారు. అందువల్ల ఇంతకీ ఆయన చేస్తున్నది సమైక్యయాత్రనా లేక ఎన్నికల పొత్తుల యాత్రనా అనే అనుమానాలు జనాలకున్నాయి.   ఏమయినప్పటికీ ఈనెలాఖరులోగా ఫైనల్స్ జరుగబోతున్నాయని షిండే మహాశయులు డేట్ కూడా ప్రకటించేసారు గనుక, ఇప్పుడు జరుగుతున్నవి సమైక్య చాంపియన్ ట్రోఫీ కోసం జరుగుతున్న మ్యాచ్ లో సెమీ ఫైనల్స్ గా భావించవచ్చును. డిల్లీలో కూర్చొన్న థర్డ్ ఎంపైర్స్ ఇంతకీ ఈ మ్యాచ్ లో ఎవరిని చాంపియన్ గా ప్రకటిస్తారో తెలుసుకోవాలంటే మరి కొన్ని వారాలు వేచి చూడక తప్పదు.  

టీడీపీ నాయకులకు గాలం!

      రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన ఘనకార్యాన్ని విజయవంతంగా పూర్తిచేసిన టీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ పార్టీలు ఇప్పుడు తమ దృష్టిని తెలుగుదేశం పార్టీ మీద కేంద్రీకరించాయి. రాష్ట్ర విభజన విషయంలో అడ్డగోలు వాదనలకు పోకుండా ఒక స్పష్టమైన విధానంలో వున్న తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రాంతంలో పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నాలను మూడు పార్టీలూ ముమ్మరంగా చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అనుకూల పార్టీ కాదంటూ గోబెల్స్ ప్రచారం చేసే పని ఎప్పటినుంచో అమలులో వుంది.     ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోని తెలంగాణ నాయకులను తమ వైపు లాక్కునే ప్రాజెక్టును మూడు పార్టీలూ చేపట్టాయి. నోటి బలమే తప్ప ఓటుబలం లేని కడియం శ్రీహరి లాంటి నాయకులు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి దూరమై తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలు పోశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బలంగా వున్న తెలంగాణ ప్రాంత నాయకుల మీద మూడు పార్టీల దృష్టి పడింది. టీడీపీలో ఈమధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చ చేస్తున్న ఎర్రబెల్లి దయాకరరావును లాక్కోవాలని కాంగ్రెస్ పార్టీ  తీవ్రంగా ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. రాజకీయాలు మానేసి వ్యవసాయం చేసుకుంటానే తప్ప తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టేది లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఎర్రబెల్లి కోసం గాలం వేసే వుంచింది. ఇప్పుడు మూడు పార్టీలూ రేవంత్‌రెడ్డితోపాటు పలువురు సీనియర్ తెలంగాణ నాయకులను తమ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలోంచి మా పార్టీలోకి వస్తే మీకు ఉజ్వల భవిష్యత్తు వుంటుందంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అయినా వాళ్ళ పప్పులు ఉడకటం లేదు. హడావిడి చేసే కార్యకర్తలే తప్ప ఓట్లు పడే నాయకులు లేని టీఆర్ఎస్ పార్టీ.. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల మీద బోలెడంత ఆశలు పెట్టుకుంది. ఏ సీటు కావాలన్నా ఇస్తాం. ఏం కోరినా తీరుస్తాం అంటూ ఆఫర్లు ఇస్తోంది. ఇక తెలంగాణలో పూర్తిగా గల్లంతైపోయిన వైఎస్సార్సీపీ తన దింపుడుకళ్ళం ఆశలతో వుంది. తెలుగుదేశం పార్టీ నాయకులను తనవైపు లాక్కుని అయినా తెలంగాణలో ఉనికిని నిలుపుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మూడు పార్టీల ఆశలు ఆవిరవడం తప్ప ప్రయోజనం వుండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

రత్నప్రభ ఫైర్...జగన్ మైండ్ బ్లాంక్

      వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సీనియర్ ఐఏఎస్ అధికారిణి కత్తి రత్నప్రభ నిప్పులు చెరిగారు. సీబీఐ కోర్టు ప్రాంగణంలో తీవ్ర స్వరంతో ఆమె విరుచుకుపడటంతో జగన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రెండు రోజుల కిందట ఇందుటెక్ జోన్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరై వస్తున్న జగన్ కు ..అదే కేసులో నిందితురాలిగా ఉన్న రత్నప్రభ ఎదురుపడింది. అంతే.. జగన్‌ను చూడగానే ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. "వాట్ మిస్టర్ జగన్..? వాటీజ్ దిస్ నాన్సెన్స్..? మీరెవరో నాకు తెలియదు.. ఎప్పుడూ చూడనూ లేదు.. మీతో మాట్లాడిందీ లేదు. కానీ మీ వల్ల మేమందరం సమస్యల్లో పడిపోయాం.. ఈ గొడవలతో మాకేమీ సంబంధం లేదు.. మేం రూల్స్ ప్రకారమే నడుచుకున్నాం.మీ నాన్న ముఖ్యమంత్రిగా ఆదేశాలిస్తే.. వాటిని మేం పాటించాం. అయినా మాకెందుకీ సమస్యలు.. మీ కారణంగా మేమందరం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలా మేమెందుకు తిరగాలి. ఇంతకాలం నిజాయతీగా బతికి ఇప్పుడు మీ వల్ల మేమంతా అభాసుపాలయ్యాం.. '' అంటూ జగన్‌పై రత్నప్రభ నిప్పులు చెరిగారు. వాస్తవానికి రత్నప్రభ గురించి జగన్‌కు కూడా పెద్దగా తెలియదు. విచారణకు హాజరై తిరిగి వస్తున్నప్పుడు ఎదురుపడి దుమ్ము దులిపేయడంతో ఆయన కాసేపు నిశ్చేష్టుడయ్యాడు.  

వైకాపా కొత్త పాయింటు

  ‘కీప్ సమ్ చేంజ్’ అంటే దానికి అర్ధం జనాలు రకరకాలుగా చెప్పుకోవచ్చు గాక. వాటిలో ఒకటి నిరంతరం కొత్త ఆలోచనలకి ప్రయత్నించమనే సందేశం కూడా ఇమిడి ఉంది. దానిని ఎవరు పట్టించుకొన్నా, కోకపోయినా వైకాపా మాత్రం బాగా వంట పట్టించుకొంది. అందుకే ఎప్పటి కప్పుడు సరి కొత్త ట్విస్టులు, యూ టర్నులు, వ్యూహాలతో దూసుకుపోతూ ఉంటుంది. ఈవిషయంలో ఏ ఇతర పార్టీ కూడా దానికి సరిసాటి కాదని ఒప్పుకోక తప్పదు. ఇక లేటెస్ట్ గా ఆ పార్టీ కనుగొన్నకొత్త సిద్దాంతం ఏమిటంటే తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తోందని! ఈ సంగతి కనిపెట్టడానికి కొంచెం ఆలస్యమయినా చాలా చక్కటి పాయింటుతో వచ్చామని ఆ పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి భావించారు. కానీ, తెదేపా కూడా సరిగ్గా ఇలాగే భావించడం యాదృచ్చికమేమో? అయితే అంత మాత్రాన్న ఈ రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యే అవకాశమే లేదని గట్టిగా చెప్పవచ్చును.

సోనియా కడుపులో మంట!

      కడుపులో వున్న బాధ బాగా పెరిగిపోతే అది కడుపు మంటగా మారి బయటపడుతుంది. దానికి తాజా ఉదాహరణగా మనం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని తీసుకోవచ్చు. రాజకీయ ప్రసంగాలు చేయడంలో నరేంద్రమోడీకి, రాహుల్ గాంధీకి వున్న తేడాని దేశం మొత్తం గమనిస్తోంది. నరేంద్ర మోడీ ప్రసంగిస్తే జనం మంత్రముగ్ధుల్లా వింటున్నారు. అదే రాహుల్ గాంధీ నోరు విప్పితే జనం పెదవి విరుస్తున్నారు.   పసలేని, పనికిరాని ప్రసంగాలతో రాహుల్ గాంధీ అందరిచేతా అక్షింతలు వేయించుకుంటున్నాడు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ప్రసంగాల్లో మత ఘర్షణలు, ఇందిర, రాజీవ్ హత్యల్లాంటి విషయాలను ప్రస్తావించి అందరి చేతా తలంటి పోయించుకున్నాడు.  చివరకు ఎన్నికల కమిషన్ కూడా రాహుల్ గాంధీని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించింది. తన కడుపున పుట్టిన రాహుల్ గాంధీ సరైన రీతిలో ప్రసంగాలు చేయలేక భంగపడుతూ వుండటం చూసి ఆయనగారి మాతృమూర్తి సోనియాగాంధీ ఎంతో బాధపడుతోంది. అయినా సోనియాగాంధీకే సరిగా ప్రసంగాలు చేయడం రాదు.. మరి రాహుల్‌కి ఎలా వస్తుంది? అందుకే, తన కొడుకు ప్రసంగాలు బాగా చేయలేడుగానీ, దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళగడని ఆమె తల్లి హృదయం నమ్మేస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ కంటే నరేంద్రమోడీ బాగా ప్రసంగిస్తూ జనాన్ని ఆకట్టుకుంటూ వుండటం ఆమె కడుపులో బాధని కలిగిస్తోంది. ఆ బాధ కడుపు మంటగా మారి బయటపడింది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన సోనియాగాంధీ నరేంద్రమోడీ మీద విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘ప్రసంగాలతో దేశ సమస్యలను పరిష్కరించలేం.. అభివృద్ధి సాధించలేం’’ అని తన కడుపుమంటని బయటపెట్టుకున్నారు. రాహుల్ గాంధీ కంటే నరేంద్రమోడీ బాగా ప్రసంగిస్తున్నారన్న విషయాన్ని పరోక్షంగా ఒప్పుకున్నారు. నరేంద్రమోడీ కంటే రాహుల్ బాగా మాట్లాలేకపోతున్నాడని ఏడవటం కంటే, రాహుల్‌ని నరేంద్రమోడీ ప్రసంగాలు విని ఎలా మాట్లాడాలో నేర్చుకోమని చెప్పొచ్చు కదా సోనియా మేడమ్!  

టిడిపిలో ఎర్రబెల్లి వర్సెస్ సీఎం రమేష్

      తెలుగుదేశం పార్టీలో చిచ్చురేగుతున్నట్లుగా కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం పయ్యావుల కేశవ్ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు తాజా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తాము ఉండాలో లేదా రమేష్ ఉండాలో తేల్చుకుంటామని ఆయన అన్నారు.   సీఎం రమేష్ లాంటి దళారులు, వ్యాపార వేత్తల మూలంగానే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని, కనీసం వార్డు మెంబరుగా కూడా గెలవలేని రమేష్ ను పార్టీ ఎంపీగా పంపడం నష్టం చేస్తోందని ఎర్రబెల్లి అన్నారు. సీఎం రమేష్ ఓ బ్రోకర్, మోసగాడు అని, ఆయనను మీద వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. చంద్రబాబు విభజన లేఖకు కట్టుబడి ఉన్నారని అంటూనే దయాకరరావు ఈ డిమాండ్ చేయడం విశేషం.

సొంత పార్టీకి కిరణ్ ప్రచారం..!

    అందరూ ఊహించినట్టే రచ్చబండను తన ఇమేజ్ పెంచుకోవడానికి సీఎం ఉపయోగించుకోవడం ప్రారంభించేశారు. భవిష్యత్తులో తాను కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత పార్టీ పెడితే సీమాంధ్ర ప్రజలు తనకు పూర్తి మద్దతు ఇచ్చేలా ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.విశాఖ జిల్లా చోడవరంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో స్థానికుల సమస్యల పరిష్కారం కంటే సమైక్యాంధ్ర నినాదాన్నే ప్రధానంగా ముందుకు తీసుకొచ్చారు.   రాష్ట్రం విడిపోవడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని, చివరి వరకు రాష్ట్రం ముక్కలు కాకుండా కాపాడతానని ప్రసంగించారు. రాష్ట్రం విడిపోతే వచ్చే నష్టాలను ఏకరువు పెట్టారు. సీఎం ఇలా మాట్లాడుతూ వుంటే సీమాంధ్రుల మనసులు ఒకసారి కాకపోతే ఒకసారైనా కరగకుండా వుంటాయా అని ఆయన అనుకూల వర్గాలు ఆశాభావంతో వున్నాయి. రచ్చబండలో సమైక్య నినాదాన్ని చాటడంతోపాటు స్థానికులకు బోలెడన్ని వరాలు కూడా సీఎం ప్రకటించారు. వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వాగ్దానాలు చేశారు. ఈసారి రచ్చబండలో భాగంగా సీఎం కిరణ్ మొత్తం నాలుగు సీమాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఈ నాలుగు జిల్లాలనూ తన ‘గ్రిప్’లోకి తెచ్చుకోవాలని కిరణ్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.  

ధర్మ సందేహాలు ఎన్నో

  జగన్ బాధితులలో ధర్మాన ప్రసాదరావు కూడా ఒకరు. కానీ చావు తప్పి కన్నులొట్టపోయినట్లు ఇంకా జైలు గడప తొక్క కుండా ఎలాగో మేనేజ్ చేసుకొంటూ, ఆ జగన్ బాబుతోనే కలిసి రోజూ కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొంటున్నారు. ఆ క్రమంలో వారిద్దరూ ఒకరికొకరు ఎట్రాక్ట్ అవుతునట్లు సమాచారం. ఇంతవరకు కిరణ్ రెడ్డి ఎప్పటికయినా కొత్త పార్టీ పెట్టకపోతాడా అందులో తను చేరకపోతానా? అని త్రిశంకులో ఊగిసలాడుతున్న ధర్మాన, ఈ ఎట్రాక్షన్లో పడి, తనకీ పరిస్థితి కల్పించిన బాబు ఆ బాబేనన్న సంగతి కూడా మరిచిపోయి, ‘పోనీ వైకాపాకి కమిట్ అయిపోదామా?’ అని ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.   కానీ రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం పోలేదన్నట్లు, సీబీఐ ఇచ్చిన మెడల్స్ వల్ల తనకి టికెట్ రాని కాంగ్రెస్ నుండి, సీబీఐతో అనుబందం పెనవేసుకొన్న కాంగ్రెస్ లోకి జంప్ చేస్తే, రేపు కేసులు ఓ కొలిక్కి వస్తున్నపుడు మళ్ళీ అదే బాబుకి వ్యతిరేఖంగా మాట్లాడవలసి వస్తే? అనే ధర్మసందేహం కూడా ధర్మయ్యని పట్టి వెనక్కి లాగుతోంది.   అంతే గాక తనకంటే ముందే ఆ పార్టీలో సెటిల్ అయిపోయిన బ్రదర్ కృష్ణ దాసు తనకోసం తలుపులు తీసేందుకు బొత్తిగా ఒప్పుకోవడం లేదట. ఇదివరకు అతనిపై మరో బ్రదర్ రామదాసుని ఎన్నికలలో పోటీకి నిలబెట్టడమే అందుకు కారణమని సమాచారం. అయితే ఏ బ్రదర్ ఒప్పుకోకపోయినా బిగ్ బ్రదర్ ఒప్పుకొంటే అన్ని తలుపులు వాటంతటవే తెరుచుకొంటాయని జగమెరిగిన సత్యం.   అయితే కండువా ఏదయినప్పటికీ ఈసారి నేరుగా లోక్ సభకే వెళ్ళిపోవాలని ధర్మాన డిసైడ్ అయిపోయినట్లు సమాచారం. అలాగయితే, ఆ రేంజిలో జిల్లాలో పోటీపడవలసిన వారు ఇద్దరు ఉన్నారు. తండ్రి మరణంతో అతని స్థానంలోకి వచ్చిన ఎర్రం నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు. కాంగ్రెస్ డీ.యన్.యే. కలిగి ఉన్నకిల్లి రాణిగారు.   రామ్మోహన్ నాయుడు తన ముందు కాకి పిల్లే అనుకొన్నా, అతనికి సానుభూతి ఓటు, జిల్లాలో అతని తండ్రికి ఉన్నమంచి పేరు ప్లస్ పాయింట్స్. ఇక కిల్లి రాణీ గారి గురించి చెప్పేదేముంది? తన పట్టు చీర కొంగుతో రాష్ట్రాన్ని గట్టిగా ముడేసి కలిపి ఉంచుదామనుకొన్నపటికీ ఆ పాడు బీజేపీ, తెదేపాలు ‘యు టర్నులు’ తీసుకొంటున్నాయని ఆవేదన చెందని రోజు లేదు. ఇక ఎలాగు విడిపోయే రాష్ట్రం కోసం రాకరాక వచ్చిన తన కేంద్ర మంత్రి రాజీనామా చేసి ఉపయోగమేమిటని నిలదీస్తుంటారు కూడా. కానీ ఈసారి కూడా తనకే ఓటేసి గెలిపించేస్తే డిల్లీలో తనకున్న పలుకుబడినంతా ఉపయోగించేసి శ్రీకాకుళానికి ఒక మంచి ప్యాకేజి తెస్తానని హామీ ఇస్తున్నారు.   కానీ మళ్ళీ అంతలోనే ధర్మనకి మరో ధర్మసందేహం కలిగింది. అదే, ఏ కండువా కప్పుకొన్నపటికీ జనాలు గుర్తు పట్టకుండా ఉంటారా? అని. మరి ఈ పద్దులు, సందేహాలు అన్నీ సరి చూసుకొన్న తరువాతనే ఏ కండువా కప్పుకోవాలో, ఏ సీటులో కూర్చొంటే ఐదేళ్ళు కడుపులో చల్ల కదలకుండా హాయిగా కూర్చోవచ్చో ఫైనల్ చేసుకోవడం ధర్మానకి ధర్మంగా ఉంటుంది.

సోనియమ్మ వరమిచ్చినా ...సీబీఐ అడ్డుపడినట్లు

  ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారన్నట్లుగా, చంచల్ గూడా జైలులో జగన్ తో ఏకంగా పదహారు నెలలు సహవాసం చేయడంతో మోపిదేవి అ జగన్ పంచనే జేరుతున్నారు. ఇక జగన్ పుణ్యమా అని సీబీఐ చార్జ్ షీట్లో పేర్లు నమోదు చేయించుకొన్నపాపానికి పాపం! సబిత, ధర్మాన అన్యాయంగా తమ పదవులు ఊడగొట్టుకొని తమ పరిస్థితేమిటో తమకే తెలియక తలలు పట్టుకొని కూర్చొన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ నేతలకి కొంత ‘హ్యాండ్ సప్పోర్ట్’ బాగానే ఉన్నపటికీ, సీమాంధ్రలో అది బొత్తిగా కరువవడంతో పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు వెర్రి నాగాన్నలు.   అయితే ఈ సీబీఐ చార్జ్ షీట్లో ఎక్కిన పేర్లు సబితమ్మకి, ముఖ్యమంత్రి రేసులో ఉన్న గీతమ్మకి, ధర్మయ్యకి భుజకీర్తులు (మెడల్స్)లా తయారవడంతో ఇప్పుడు తమకి టికెట్స్ వస్తాయో రావో అని వారందరూ ఒకటే టెన్షన్ లో ఉన్నారు పాపం! మోపిదేవి దైర్యంగా వైకాపాలోకి దూకేసినా ఈ ముగ్గురి పరిస్థితి మాత్రం చాలా అయోమయంగా ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ నుండి వైకాపాలోకి దూకడమంటే గోతి లోంచి నూతిలోకి దూకినట్లే గనుక పాపం ఆ అమ్మలిద్దరూ వేరే ఆప్షన్స్ లేక కాంగ్రెస్ నే కరిచిపెట్టుకొని ఉన్నారు ఇంకా.   సోనియమ్మ వారికి టికెట్ ఇవ్వలనుకొన్నా సీబీఐ వారికి అడ్డుపడటం నిజంగా ఎంత దురదృష్టం?

సచిన్ ఎందుకు ఔటయ్యాడు?

      ముంబైలోని వాంఖేడే స్టేడియం. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత సచిన్ ఇక బ్యాట్ పట్టడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా తన కెరీర్‌కి గొప్ప ముగింపు ఇవ్వాలని ఆయన అభిమానులందరూ కోరుకుంటున్నారు. వాంఖేడే స్టేడియంలో బ్యాటింగ్ చేస్తున్న సచిన్ మీదే స్టేడియంలో వున్న, టీవీలో మ్యాచ్ చూస్తున్న అందరి చూపులూ కేంద్రీకృతమై వున్నాయి.   సచిన్ ఎంతో ఉత్సాహంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లు విసురుతున్న బంతుల్ని చాకచక్యంగా కొడుతున్నాడు. వేసిన ప్రతి బాల్ నుంచి పరుగులు పిండుకోవాలి.. తనను చూస్తున్న అభిమానులకు ఆనందం కలిగించాలి అనే తపన సచిన్ ముఖంలో కనిపిస్తోంది. ఈ చివరి టెస్ట్ మ్యాచ్‌లో తనకోసం కాకపోయినా తనను అభిమానించే దేశ ప్రజల కోసమైనా సెంచరీ చేయాలన్న  కృతనిశ్చయం ఆయన కళ్ళలో కనిపిస్తోంది. సచిన్ ముఖంలో, కళ్ళలో కనిపిస్తున్న భావాలను అర్థం చేసుకున్న అభిమానులు మరింత ఉత్సాహంగా మ్యాచ్‌ని గమనిస్తున్నారు. సచిన్ సెంచరీ చేసే క్షణం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రత్యర్థి బౌలర్ విసురుతున్న బంతుల్ని సచిన్ చాకచక్యంగా ఫోర్లు, సిక్సర్ల రూపంలో బౌండరీ అవతలకి తరలిస్తున్నాడు. సచిన్ అర్ధ శతకం పూర్తి చేశాడు. స్టేడియం మొత్తం కోలాహలంగా మారింది. చూస్తుండగానే సచిన్ అరవై పరుగులు పూర్తి చేశాడు. మరికొద్ది నిమిషాల్లో డెబ్భై పరుగులు పూర్తయ్యాయి. సచిన్ సెంచరీ చేయడం ఖాయమన్న నిర్ణయానికి స్టేడియంలో ఉన్నవారు, టీవీలు చూస్తున్నవారు వచ్చేశారు. అయితే సడెన్‌గా సచిన్ దూకుడులో మార్పు వచ్చింది. మనిషి స్లో అయిపోయాడు. బంతులు ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు. రెండుసార్లు ఔటవ్వబోయి తృటిలో తప్పించుకున్నాడు. మ్యాచ్ చూస్తున్నవారంతా ఇది చూసి ఆశ్చర్యపోయారు. సచిన్‌లో సడెన్‌గా ఈ మార్పు ఎందుకు వచ్చిందా అని ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్ళంతా అలా ఆలోచిస్తూ వుండగానే 74 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర సచిన్ ఔటయ్యాడు. సచిన్ సెంచరీ చేయాలన్న అభిమానుల ఆశలు నీరుగారిపోయాయి. సచిన్‌లో ఉన్నట్టుండి, సడెన్‌గా ఎందుకు మార్పు వచ్చిందా అన్న పరిశీలన అభిమానులలో మొదలైంది. అందరూ ఏదో అనుమానం వచ్చి స్టేడియం మొత్తం కలియజూశారు. అంతకుముందే స్టేడియంలోకి ఎంటరైన ఒక వ్యక్తిని చూడగానే అందరికీ సచిన్ ఎందుకు ఔటయ్యాడో అందరికీ అర్థమైపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు.. రాహుల్‌గాంధీ! లెగ్గుబాబూ.. లెగ్గు! అది మామూలు లెగ్గా! రాహుల్‌గాంధీ ఎంటరయ్యాక వంద సంవత్సరాలకు పైగా చరిత్ర వున్న కాంగ్రెస్ పార్టీనే ఔటయిపోయింది. పాపం సచిన్ ఒక లెక్కా? సరే జరిగిందేదో జరిగిపోయింది. కనీసం సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా సచిన్ ఆడేటప్పుడు రాహుల్‌గాంధీని స్టేడియం పరిసరాల్లోకి రాకుండా చూడు భగవంతుడా అని  సచిన్ అభిమానులందరూ దేవుడికి మొరపెట్టుకుంటున్నారు.

సోనియమ్మ గుడికి పూజారి ఎవరు?

  తన రాజకీయ ప్రస్థానంలో చివరి దశలో ఉన్న మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు, ఇంతవరకు తన సికిందరాబాద్ కంటోన్మెంటు నియోజక వర్గం ప్రజలకు ఒరగబెట్టినదేమీ లేకపోయినా, వచ్చే ఎన్నికలకు టికెట్ సంపాదించాలనే యావ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో హేమా హేమీలకే తమ పరిస్థితి ఏమిటో అర్ధం కాక తలలు పట్టుకొంటుంటే, శంకర్ రావు మాత్రం ‘అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే’ అనే పాలసీతో నిత్య సోనియా పారాయణం చేస్తూ ఆమె దృష్టిలో పడాలని తెగ తాపత్రయపడుతున్నాడు.   ఆ ప్రయత్నంలో భాగంగానే తెలంగాణా వరంగా ఇచ్చిన ఆ దేవతకు ఒక గుడి కట్టాలని కూడా సంకల్పం చెప్పుకొని ప్రయత్నాలు మొదలుపెట్టేసాడు. స్థలం గుర్తించడం, (బహుశః ప్రభుత్వభూమి అయినందున) రెవెన్యు అధికారులను సంప్రదించడం కూడా జరిగిందని, సోనియమ్మ పుట్టిన రోజు అంటే డిశంబర్ 9న సోనియాలయ శంఖు స్థాపన కూడా చేయాలని ఆయన కమిట్ అయిపోయినట్లు సమాచారం.   అయితే ఆయన గ్రహించని రెండు విషయాలు ఏమిటంటే, ఆయన ఇంకా రాజకీయాలలో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్నప్పటికీ, సోనియమ్మ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ బాబుని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి, తను రిటర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అటువంటప్పుడు శంకర్ రావు ఆమెకు గుడి కట్టించడం కంటే రాహుల్ బాబుకే కట్టించేస్తే బెటరేమో ఓ సారి ఆలోచించవలసి ఉంది. లేకుంటే రాజకీయాల నుండి రిటర్ అయిపోతున్న సోనియమ్మకు గుడి కట్టి అందులో భజన చేసుకోవాలంటే ఆమెతో బాటు శంకర్ రావు కూడా రిటర్మెంట్ తీసుకోక తప్పదు.   ఇక రెండో పాయింటు: రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికలలో తన వంటి యువతకి అంటే 40 నుండి 60 మధ్యలో ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తారని ఇప్పటికే చాలా స్పష్టమైయిన సంకేతాలు ఇస్తున్నారు. మరి తను ఆ ‘యువ రేంజ్’ లో ఉన్నాడో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని, వీలయితే మళ్ళీ ఓ సారి ఆరోగ్యపరీక్షలు చేయించుకొంటే మంచిది. ఎందుకంటే పోలీసులు విచారణకు పిలిచినప్పుడల్లా ఆయన ఆరోగ్యం పాడయిపోవడం, వెంటనే ఏ కార్పోరేట్ ఆసుపత్రిలో చేరిపోవడం చూసి ఆ సాకుతో రాహుల్ ఆయనకు టికెట్ నిరాకరించే ప్రమాదం ఉంది. అందువల్ల సోనియమ్మని ఎలాగో ప్రసన్నం చేసుకొని, యువ రేంజ్ లోకి దూరిపోయి టికెట్ సంపాదించుకొన్నా, తీరా చేసి మళ్ళీ ఆరోగ్యంపాడయిపోతే టికెట్ వృదా అయిపోతుంది గనుక ముందే ఓ సారి ఓల్ బాడీ చెకప్స్ కూడా చేయించుకొంటె మంచిదేమో అని అలోచించాలి. .   అందువల్ల సోనియమ్మకి గుడి కట్టే ముందు ఓసారి టికెట్ విషయం కూడా కన్ఫర్మ్ చేసుకొంటే మంచిదేమో. అప్పుడు గుడికి, తనకి కలిపి మొత్తం ఎంత ల్యాండ్ పుచ్చుకోవాలో, అసలు గుడి కట్టాలో వద్దో, కడితే ఎవరికి కట్టాలో, కడితే టికెట్ వస్తుందో రాదో, రాకపోతే దానిలో నిత్యపూజలు తనే స్వయంగా నిర్వహించాలో లేక వేరవరినా నిర్వహించాలో, వగైరా సమాచారం అంతా సేకరించవచ్చును.     ఏమయినప్పటికీ ఇటువంటి గొప్ప భక్తుడిని తమ ప్రతినిధిగా ఎన్నుకొన్న సికిందరాబాద్ కంటోన్మెంటు ఓటర్ల విజ్ఞతకు జోహార్లు చెప్పక తప్పదు. ఒకవేళ ఈ సారి అతనిపై అమ్మ దయ తప్పి, యువరాజు టికెట్ మంజూరు చేయకపోతే కనీసం సదరు నియోజక వర్గ ప్రజలయినా అతనిని స్వతంత్ర అభ్యర్ధిగా నిలబెట్టుకొని గెలిపించుకోవలసిన గురుతరమయిన బాధ్యత తమపైనే ఉందని గుర్తించాలి.లేకుంటే శంకరన్న అదే గుడిలో గంట కొట్టుకొంటూ కాలక్షేపం చేయక తప్పదు.

మోపిదేవి కాంగ్రెస్ కి రామ్ రామ్

  వాన్‌పిక్ కేసు నిందితుడిగా దాదాపు 16నెలలు జైలు జీవితం గడిపిన మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, తనకు కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా కూడా పట్టించుకోకుండా వదిలేసిందనే ఆగ్రహంతో, కాంగ్రెస్ ను వీడి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరబోతున్నారు. ఇప్పటికే ఆయన సోదరుడు, కుటుంబ సభ్యులు, అనుచరులు వైకాపాలో చేరి ఉన్నారు. ఇప్పుడు మోపిదేవి కూడా చేరుతున్నారు.   సాధారణ పరిస్థితుల్లో అయితే మోపిదేవి వంటి బలమయిన నాయకుడు పార్టీని వీడివెళ్లిపోతుంటే బుజ్జగింపుల ప్రక్రియ ఉండేది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రికే గ్యారంటీ లేనప్పుడు ఇంకా మోపిదేవిని మాత్రం ఎవరు పట్టించుకొంటారు? పైగా సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అందరూ ఎవరికి వారు తమ పరిస్థితి ఏమిటనే దిగులుతో ఏమి చేయాలో పాలుపోక, పరిస్థితులు ఎప్పటికయినా చక్కబడక పోతాయా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటువంటి సమయంలో మోపిదేవిని ఎవరూ పట్టించుకొంటారని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. అయితే రేపు జగన్ తన పార్టీని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తే భూమి గుండ్రంగా ఉన్నట్లు మోపిదేవి మళ్ళీ కాంగ్రెస్ గూటిలోనే వచ్చి పడవచ్చును.

పాల్వాయి శిశుపాలుడు ఎవరో?

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ణన్ రెడ్డి మండిపడుతున్నారు. శిశుపాలుడు వంద తప్పులు చేసిన తరువాత శిక్ష అనుభవించాడు. కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శిశుపాలునికంటే ఎక్కువ తప్పులే చేశారు. ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తే ఏంటి ? చేయకపోతే ఏంటి ? అధిష్టానం అనుకుంటే వెంటనే తప్పిస్తుంది. ఆయనను వెంటనే ముఖ్యమంత్రి పదవి నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించాలి. తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటూనే అన్యాయం చేస్తామంటే ఊరుకునేది లేదు అని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ణన్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ హై కమాండ్ కిరణ్ ను తీసే సాహసం చేయలేకపోతున్నదని పాల్వాయి 'కడుపు మంట'ని అంటున్నారు!

దేవుళ్ళకీ ప్రాంతీయ మసి!

    దేవుళ్ళకి కూడా ప్రాంతీయ మసిని పూయడానికి విభజనవాదులు ప్రయత్నిస్తున్నారు. విభజనవాదులకు హైదరాబాద్‌ని తేరగా ఇచ్చేయాలి.. గతంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఖమ్మం జిల్లాలో కలిపిన భద్రాచలాన్ని కూడా ఇచ్చేయాలి. ఇదెక్కడి న్యాయం? 1956‌కి ముందు తెలంగాణ ఎలా వుండేదో ఆ తెలంగాణ కావాలని అంటున్నారు కదా, మరి 1956లో భద్రాచలం సీమాంధ్రలోనే వుంది కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే విభజనవాదులు గయ్యిమని అంతెత్తున లేస్తున్నారు.   భద్రాచలంతో తెలంగాణ ప్రజలకు బోలెడంత అనుబంధం పెరిగిపోయిందట. అందుకే భద్రాచలం తెలంగాణలో వుండాలట. మరి సీమాంధ్రులకు కూడా హైదరాబాద్‌తో అనుబంధం పెరిగిపోయింది కాబట్టి హైదరాబాద్ మీద సీమాంధ్రులకు కూడా హక్కు కావాలంటే దానికిమాత్రం ఒప్పుకోం అంటున్నారు. అంటే ‘అనుబంధం’ అనే పదం మీద కేవలం తెలంగాణ వారికే కాపీరైట్ హక్కులున్నాయా? సీమాంధ్రులకు అనుబంధాలు వుండకూడదా? అసలు భద్రాచలం ఆలయాన్ని హైదరాబాద్ పాలకుల ఆదాయంతోనే కట్టించారు కాబట్టి భద్రాచలం మాదే అని విభజనవాదులు అంటున్నారు. అలాంటప్పుడు భద్రాచలం ఆలయం కట్టించిన సమయంలో సీమాంధ్ర ప్రాంతం కూడా హైదరాబాద్ నవాబుల పాలనలోనే వుండేది కదా.. మరి సీమాంధ్ర మీకు వద్దా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవాళ్ళెవరూ లేరు!  ఈమధ్య మరో కొత్త వాదన విభజన వాదుల నోళ్ళలోంచి ఊడిపడింది. సీమాంధ్ర ప్రాంతంలో అనేక ప్రధాన దేవాలయాలు వున్నాయి. మా తెలంగాణలో లేవు. అంచేత భద్రాచల రాముడినైనా మాకు వదిలిపెట్టండి అంటున్నారు. దేవుళ్ళు ఏ ప్రాంతంలో వున్నా అందరికీ దేవుళ్ళే. ఒకవేళ భద్రాచలం సీమాంధ్రకి వెళ్ళిపోతే తెలంగాణ వాళ్ళు రాముడిని చూడటానికి వెళ్ళరా? రాముడు అందరి వాడు..  ‘అందరి బంధువయా.. భద్రాచల రామయ్యా’  అని అందుకే అన్నారు. అందరి బంధువుని కొందరికే బంధువుని చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. అయినా తెలంగాణలో పెద్ద దేవాలయాలు లేవని అనడం చాలా తప్పు. చాలా గొప్పగొప్ప క్షేత్రాలు తెలంగాణ ప్రాంతంలో వున్నాయి. ప్రాంతీయ భేదం లేకుండా అందరూ వాటిని సందర్శిస్తూనే వున్నారు. విభజనవాదులు మాత్రం ప్రతి అంశాన్నీ విభజనకు ముడిపెడుతూ రాజకీయాలు చేస్తున్నారు. చివరికి దేవుళ్ళకి కూడా ప్రాంతీయ మసిని పూస్తున్నారు.

కన్నావారి సొల్లు కబుర్లు

  మంత్రి కన్నా లక్ష్మినారాయణ తన రచ్చబండ కార్యక్రమాన్ని సైతం రద్దు చేసుకొని రెక్కలు కట్టుకొని మరీ సోనియమ్మ ముందు వాలి రహస్య మంతనాలు చేసివచ్చిన తరువాత, కిరణ్ కుర్చీలో ఆయనే కూర్చోబోతున్నడనే వార్తలు రావడంతో, అటువంటి వార్తలు వింటూ మనసులో ఆనందం పొంగిపోరలుతున్నపటికీ, పైకి మాత్రం అసలు సిసలయిన రాజకీయనాయకుడిగా చిరంజీవి కంటే బాగా నటించక తప్పలేదు.   అసలు అధిష్టానం తనను రమ్మని పిలువలేదని కానీ తానే సమైక్యాంధ్ర కోసం వెళ్లి సోనియమ్మని కలిసొచ్చానని, కానీ గిట్టని వారు తనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ వచ్చిందని, అందుకు ప్రతిగా రాష్ట్ర విభజనకు సహకరించేందుకు అంగీకరించినట్లు ప్రచారం చేస్తున్నారని, కానీ తను అచ్చమయిన సమైక్యవాదినని, అచ్చు బొత్స సత్తి బాబు లాగానే ఆవేదన ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేసారు.   అయితే రాష్ట్ర విభజన ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తున్న ఈ తరుణంలో ఆయన రచ్చబండ మీద నుండి నేరుగా హనుమంతుడిలా డిల్లీకి లంగించి తల్లి సోనియా ముందు వాలి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరానని చెపుతున్నారు. అదే కొంచెం నమ్మ బుద్ది కావడం లేదు. అయితే ఆయన మిగిలిన వారిలా కాకుండా తాను ముఖ్యమంత్రి రేసులో లేనని చెప్పడం ద్వారా రేసులో తన ప్రాధమిక అర్హతను స్వయంగా నిర్దారించుకొనడంమెచ్చుకోవలసిందే.

కేంద్ర విన్నపాలు వినవలె ముఖ్యమంత్రిగారు

  రాష్ట్ర విభజనను పర్యవేక్షిస్తున్న కేంద్రమంత్రుల బృందం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఈ రోజు రాత్రి 8గంటలకు డిల్లీలో జరిగే సమావేశానికి రమ్మని పిలిచింది. కానీ రచ్చబండ కార్యక్రమం పెట్టుకొనందున డిల్లీ రాలేనని జవాబు చెప్పి తప్పించుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం కంగు తింది. ఇంతవరకు తన విభజన ఆలోచనని ధిక్కరిస్తున్నప్పటికీ, అది సజావుగా సాగేందుకు పరోక్షంగా సహకరిస్తున్నందున నేటికీ ఆయనను ‘గుడ్ బాయ్’ గానే పరిగణిస్తూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం, ఆయన ఇప్పుడు తన ఆజ్ఞను కూడా ధిక్కరించడంతో అవాక్కయింది.   అయితే ఊహించినట్లే కాంగ్రెస్ అధిష్టానం తన పరువు కాపాడుకొనే ప్రయత్నంలో, ఈనెల 18న సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులతో జీ.ఓ.యం. సమావేశమయిన తరువాతనే, ఆఖరిగా ముఖ్యమంత్రితో మాట్లాడాలని నిశ్చయించుకొన్నామని, అందుకే ఈరోజు ఆయనతో జరుగవలసిన సమావేశం వాయిదా వేశామని ప్రకటించింది. అందువల్ల మళ్ళీ ఈనెల 18న జరిగే సమావేశానికి ఆయనని డిల్లీ రమ్మని తాజాగా మరో ఆహ్వానం పంపింది. కనీసం ఆ విజ్ఞప్తినయినా ముఖ్యమంత్రి మన్నించి డిల్లీ వెళతారో లేక తేదీ ముందే తెలిసింది గనుక, ఆరోజు ఏ విశాఖ పర్యటనో పెట్టుకొని తప్పించుకొంటారో? చూడాలి.

‘ఇసి’గించొద్దు రాహుల్!

        మనిషికోమాట... గొడ్డుకోదెబ్బ అన్నారు. మరి రాహుల్ గాంధీ లాంటి రాజకీయ నాయకుడిని దారిలోకి తేవాలంటే ఏం చేయాలన్నది ఎవరైనా కొత్తగా కనిపెట్టాలి. చిన్నసార్ ఏ ముహూర్తంలో రాజకీయాల్లోకి ఎంటరయ్యాడోగానీ, సార్ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ మటాష్! తనమీద పడిన ఈ ముద్రని పోగొట్టుకోవాలని అనుకున్నాడో ఏంటోగానీ, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాహుల్ తెగ పర్యటించేస్తున్నాడు. ఓటర్లని బుట్టలో వేయడానికి నోటికొచ్చింది మాట్లాడేస్తున్నాడు.   ఆమధ్య ఓ మీటింగ్‌లో ముజఫర్‌నగర్‌లో జరిగిన గొడవలను ప్రస్తావించి, ఆ గొడవలకి కారణం బీజేపీయేనని కాషాయం కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ విషయం మీద బీజేపీ  భగ్గుమంది. రాహుల్ మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం రాహుల్‌ని వివరణ కోరితే, రాహుల్ తాను చాలా మంచి బాలుడినని, ఎన్నికల కమిషన్ నిబంధనలను ఎంతమాత్రం ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చాడు. అయితే రాహుల్ గాంధీ ఇచ్చిన వివరణ ఎన్నికల కమిషన్‌కి ఎంతమాత్రం నచ్చలేదు. రాహుల్ వివరణ మీద ఇ.సి. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. భవిష్యత్తులో బహిరంగసభల్లో మాట్లాడే సమయంలో నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికైనా రాహుల్ జనాన్ని తన మాటలతో ‘ఇసి’గించకుండా వుంటారని ఆశిద్దాం. ఇదిలావుంటే, రాహుల్ గాంధీ మీద బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాబట్టి, దానికి ప్రతీకారంగా కాంగ్రెస్ పార్టీ నరేంద్రమోడీ మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసింది. ఎన్నికల ప్రచార సభల్లో మోడీ కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన హస్తాన్ని ‘ఖూనీ పంజా’ అని విమర్శిస్తున్నారని, ఈ పాయింట్‌ని బేస్ చేసుకుని మోడీ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఎన్నికల సంఘం యథావిధిగా ఈ విషయంలో నరేంద్ర మోడీ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనికి నరేంద్రమోడీ వివరణ ఎలా వుంటుందో వేచి చూడాలి. కానీ ఒక్కటి మాత్రం సందేహం లేకుండా చెప్పొచ్చు. అదేంటంటే, మోడీ ఇచ్చే వివరణ రాహుల్ ఇచ్చిన వివరణలా ఇ.సి. చేత అక్షింతలు వేయించుకునేలా మాత్రం వుండదు.