త్యాగమూర్తి శ్రీధర బాబు మంత్రిపదవికి ససేమిరా

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ సమావేశాలు మొదలయ్యే ముందురోజు మంత్రి శ్రీధర్ బాబు నుండి శాసనసభా వ్యవహారాల శాఖను వెనక్కి తీసుకోవడంతో ఒక్కసారిగా ఆ ఇరువురూ కూడా వార్తలకెక్కారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరొందిన శ్రీధర్ బాబుకి తెలంగాణాలో తగిన ప్రచారం కల్పించేందుకే ఆయన ఆవిధంగా చేసారనే వార్తలను శ్రీధర్ బాబు గట్టిగా ఖండించారు. ఆయన తనపై వచ్చిన ‘కిరణ్ కుమార్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను’ గట్టిగా ఖండించినప్పటికీ, ఆయన మాటలు, కార్యక్రమాలు అన్నీకూడా ఆ ఆరోపణలను దృవీకరిస్తున్నట్లే ఉన్నాయి.   ముఖ్యమంత్రి రేసులో ఉన్న శ్రీధర్ బాబు, ఒక సీమాంధ్ర ముఖ్యమంత్రి చేతిలో తను ఏవిధంగా అన్యాయంగా బలయిపోయినది ప్రజలకి చెప్పుకొంటూ, తన రాజీనామా అంశాన్నిపదేపదే నొక్కి చెపుతూ తన నియోజక వర్గ ప్రజల సానుభూతిని, మెప్పు పొందే ప్రయత్నిస్తున్నారు. మొన్న ఆయన కరీంనగర్ వెళ్ళినప్పుడు, ఆయన అనుచరులు ఆయనకు చాలా భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఆ సందర్భంగా ఆయన అనుచరులు ఏర్పాటు చేసిన ఒక సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తానిక కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసే ప్రసక్తే లేదని, దమ్ముంటే తన రాజీనామాను ఆమోదించమని కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన సవాలు విసిరారు.   ఆయన తను మంత్రి పదవికి రాజీనామా చేయడమనేది తెలంగాణా కోసం చేసిన గొప్ప త్యాగంగా మాట్లాడటం కాంగ్రెస్ మార్క్ రాజకీయమే. అయితే ఇది ఆయనకు వచ్చే ఎన్నికలలో ఓట్లు రాల్చగలదేమో కానీ తెలంగాణాకు ముఖ్యమంత్రిని చేయలేదు. ఎందుకంటే టీ-కాంగ్రెస్ లో ఆయన కంటే చాలా మంది సీనియర్లు ఆ కుర్చీకోసం క్యూలో ఉన్నారు. అలాగని శ్రీధర్ బాబు తన ప్రయత్నాలు మానుకోనవసరం లేదు. ఎవరి ప్రయత్నాలు వారివి.   కాంగ్రెస్ యంపీలు, కేంద్రమంత్రులు రాజీనామాలు చేసి, సోనియాగాంధీని విమర్శిస్తూ ఏవిధంగా తమ పదవులలో కొనసాగుతున్నారో, శ్రీధర్ బాబు కూడా అదేవిధంగా ఎన్నికల వరకు కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ మంత్రిగా సకల రాజలాంచనాలు అనుభవిస్తూ ఈ మూడు నెలలూ లాగించేయవచ్చును.

ప్రయాణికులకు నరకం చూపిస్తున్నరవాణాశాఖ

  అమ్మ అన్నం పెట్టదు అడుక్కొని తిననివ్వదనట్లుంది మన ఆర్టీసీ, రవాణాశాఖవారి నిర్వాకం. పండుగ సందర్భంగా రద్దీ తట్టుకొనే శక్తి ఆర్టీసీకి లేదని తెలిసినప్పటికీ, రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ బస్సులను రోడ్ల మీద తిరగనీయకుండా అడ్డుపడుతూ పండుగకు స్వంత ఊర్లకు బయలుదేరుతున్నప్రజలకు నరకం చూపిస్తున్నారు. రెండు నెలల క్రితం పాలెం బస్సు దుర్ఘటన జరిగిన తరువాత నుండి రవాణాశాఖ వారు ప్రైవేట్ బస్సులపై కొరడా జుళిపిస్తున్నారు బాగానే ఉంది. కానీ, ఇంతవరకు అందుకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం చేయలేదు. ఉద్యమాల వలన తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన ఆర్టీసీ, ఇంత తక్కువ వ్యవధిలో అదనపు బస్సులను ఏర్పాటుచేసి ఈ లోటును భర్తీ చేయలేదని తెలిసికూడా రవాణాశాఖ ప్రైవేట్ బస్సులను రోడ్ల మీదకు రానీయకుండా కట్టడి చేస్తుండటంతో, దూరప్రాంతాల నుండి స్వంత ఊర్లకు బయలుదేరుతున్న ప్రజలు రైళ్ళు, బస్సులు లేక నానా కష్టాలు పడుతున్నారు.   కానీ ఇదేమీ పట్టనట్లు రవాణాశాఖ అధికారులు ఎక్కడికక్కడ ప్రైవేట్ బస్సులను పట్టుకొని నిలిపివేస్తూ గుడ్డెద్దు చేలో పడినట్లు వ్యవహరిస్తున్నారు. నిన్న ఒక్కరోజే విశాఖ, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 65 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణాశాఖ అధికారులు పట్టుకొని నిలిపివేసినట్లు సమాచారం.   పాలెం బస్సు ప్రమాదం జరగక ముందు అవే ప్రైవేట్ బస్సులు నిబందనలు పాటించకుండా తిరుగుతున్నపుడు మరి రవాణాశాఖ వాటిపై ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదో ప్రజలకు సంజాయిషీ ఈయవలసి ఉంది. ప్రతీ ఉల్లంఘనకీ ఎంతో కొంత జరిమానా వేసి ఖజానా నింపుకొంటూ, పనిలోపనిగా తమ జేబులు కూడా నింపుకొనేందుకు అలవాటు పడిన నేతలు, అధికారుల వలననే, ప్రైవేట్ బస్సు యాజమాన్యాలలో కూడా నిర్లక్ష్యం పెరిగి, ఇటువంటి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. అందువల్ల ఈ ప్రమాదాలకు కేవలం ప్రైవేట్ బస్సు యాజమాన్యాలే కాదు రవాణాశాఖ, ప్రభుత్వం కూడా సమాన బాధ్యత వహించవలసి ఉంటుంది.   ఇంతకాలం నిబంధనలు గుర్తుకు రాని రవాణాశాఖ అధికారులకు పాలెం బస్సుప్రమాదంలో 45మంది ప్రయాణికులు మరణించిన తరువాతయినా అవి గుర్తుకు రావడం, వెంటనే రోడ్డునపడి ఎక్కడికక్కడ ప్రైవేట్ బస్సులను పట్టుకొని కేసులు వ్రాసేసి నిలిపివేయడం ఎవరూ తప్పు పట్టలేరు. నిబంధనలు అతిక్రమిస్తే తప్పకుండా శిక్షించవలసిందే. కానీ, అవే నిబందనలు ఆర్టీసీకి కూడా వర్తింపజేస్తే, నేడు రాష్ట్రంలో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా తిరిగే అవకాశం ఉండదని వారికి తెలియదా? తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన ఆర్టీసీ కాలం చెల్లిన బస్సులను నడుపుతుంటే పట్టించుకోని రవాణాశాఖ అధికారులు, ప్రైవేట్ బస్సులను మాత్రం పట్టుకోవడం ఏమిటి? అంటే, ఆర్టీసీ బస్సులు అటువంటి ప్రమాదాలకు అతీతమయినవనా లేక ఆర్టీసీకి అటువంటి నిబందనలు వర్తించవని వారి అభిప్రాయమా?   ఏమయినప్పటికీ, సంక్రాంతి పండుగ సందర్భంగా ఎంత రద్దీ ఉంటుందో రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులకు తెలియకపోలేదు. అయినా ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రైవేట్ బస్సులను కూడా పట్టుకొని నిలిపివేస్తూ ప్రయాణికులకు పండుగ ముందు నరకం చూపిస్తున్నారు. తాము చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నామని వారు భావించవచ్చును. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఈవిధంగా చేయడం బాధ్యతారాహిత్యమే.

టీ-బిల్లుపై ఓటింగ్ ఉంటుందిట!

  రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ ఉండదని తెలంగాణావాదులు, ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో సహా సమైక్యవాదులు ఇంతకాలంగా వాదిస్తున్నారు. అయితే ప్రజలకు ఎవరి మాట నమ్మాలో తెలియని పరిస్థితి. ఈ సందిగ్ధాన్ని తొలగిస్తూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లుపై చర్చ పూర్తయిన తరువాత ఓటింగ్ ఉంటుందని మొన్నప్రకటించారు. కానీ, అసలు చర్చే జరగకుండా ఓటింగ్ కోసం వైకాపా పట్టుబట్టడం సరికాదని ఆయన అన్నారు. ఇంతకాలం షిండే, దిగ్విజయ్ సింగ్ తదితరులు బిల్లుపై శాసనసభ్యుల అభిప్రాయాలు సేకరించడానికే తప్ప వారు బిల్లుని ఆమోదించడానికో లేక తిరస్కరించడానికో శాసనసభకు పంపలేదని చెపుతూ వచ్చారు.   ఇప్పుడు స్పీకర్ బిల్లుపై ఓటింగ్ జరిపినట్లయితే, మెజార్టీ సభ్యులు సీమాంధ్ర ప్రాంతానికే చెందివారు ఉన్నందున శాసనసభలో బిల్లు తిరస్కరింపబడే అవకాశాలే ఎక్కువ. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించేందుకు మొగ్గు చూపే రాష్ట్రపతి శాసనసభ చేత తిరస్కరింపబడిన బిల్లుని తనవద్దే త్రొక్కిపెట్టి ఉంచదమో లేకపోతే కేంద్రాన్ని దానిపై సవరణలు, వివరణలు కోరడమో చేస్తే, బిల్లు బడ్జెట్ సమావేశాలలో కూడా ప్రవేశపెట్టడం అనుమానమే అవుతుంది. అందువల్ల ఒకవేళ స్పీకర్ బిల్లుపై ఓటింగ్ చెప్పట్టదలిస్తే, అది జరగకుండా తెలంగాణా సభ్యులు సభను స్తంభింపజేసి, జనవరి23న యధాతధంగా రాష్ట్రపతికి త్రిప్పి పంపే ప్రయత్నం చేయవచ్చును.   కాంగ్రెస్ పార్టీ, తెలంగాణా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కాక, ఎన్నికలలో తన రాజకీయ లబ్ది కోసమే రాష్ట్ర విభజనకు పూనుకొన్నందునే, అందరి ఆమోదంతో ఒక సామరస్య వాతావరణంలో శాస్త్రీయంగా జరుగవలసిన రాష్ట్ర విభజన ప్రక్రియ, ఈవిధంగా అడుగడుగునా ప్రశ్నార్ధకంగా సాగుతోంది. అయినప్పటికీ దీనివలన కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందగాలదా అంటే అనుమానమే.

జైపాల్ రెడ్డి ఆరాటం దేనికో?

  టీ-కాంగ్రెస్ నేతలందరూ ఏదో ఓ సమయంలో తెలంగాణా ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారే. కానీ, తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న సమయంలో కూడా తన పదవిని వదులుకోని జైపాల్ రెడ్డి, కనీసం ఏనాడు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు గురించి బహిరంగంగా మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. అటువంటి వ్యక్తి ఇప్పుడు హటాత్తుగా డిల్లీ నుండి హైదరాబాదులో వాలిపోయి తెలంగాణా సాధన తన గొప్పదనమేనని, తెలంగాణాకోసం తాను తెర వెనుక ఎంతగా కృషి చేసినదీ, రాష్ట్రం ఏర్పడిన తరువాత చెపుతానని శలవిస్తున్నారు. పనిలోపనిగా సీమాంధ్ర నేతలందరూ శుంటలని, ప్రజలు అమాయకులని ఆయన సర్టిఫికెట్స్ కూడా జారీ చేస్తున్నారు.   హైదరాబాదు అభివృద్ధి వెనుక రాష్ట్ర ప్రజలందరి సమిష్టి కృషి ఉందనే సంగతి అంగీకరించడానికి ఇష్టపడని జైపాల్ రెడ్డి, తను మెట్రో రైలు, సిటీ బస్సులను తెచ్చానని గొప్పలు చెప్పుకొంటున్నారు. నగరం అభివృద్దే జరగకపోయి ఉండి ఉంటే, మెట్రో రైలు, ఏసీ బస్సులు అవసరం ఉండేవికావనే సంగతి ఆయనకు తెలియదనుకోవాలా? హైటెక్ సిటీని నిర్మించి హైదరాబాదును దేశంలో ప్రధాన ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దిన చంద్రబాబు కూడా ఆయన నోటి ముందు బలాదూరే! జైపాల్ రెడ్డి ఇన్నేళ్ళు కేంద్రమంత్రిగా రాష్ట్రానికి, కనీసం తన తెలంగాణా ప్రాంతానికి చేసిందేమీ లేకపోయినా, తెలంగాణా ఏర్పాటవుతున్న సమయంలో నేడు అకస్మాత్తుగా ఊడిపడి, మిగిలిన టీ-కాంగ్రెస్ నేతలతో బాటు సీమాంధ్ర నేతలను దుమ్మెత్తి పోస్తూ ముఖ్యమంత్రి రేసులో అందరి కంటే ముందు నిలవాలని తహతహలాడుతున్నారు.   బహుశః వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని గ్రహించడం వలననే ఆయన అకస్మాత్తుగా తెలంగాణా వైపు దూసుకు వస్తున్నారేమో. అధికారంలోలేని కేంద్రాన్ని పట్టుకొని వ్రేలాడటం కంటే, తెలంగాణా రాష్ట్ర ఏర్పడి అక్కడ కాంగ్రెస్ పార్టీ, తెరాసతో కలిసి సంకీర్ణ ప్రభుత్వమయినా ఏర్పాటు చేయగలిగితే, దానికి తాను ముఖ్యమంత్రి కావచ్చునని ఆయన కలలు కంటున్నారేమో! అందుకే ఆయన సీమాంధ్ర నేతలను, ప్రజలను కించపరిచేలా మాట్లాడుతూ తనను తాను తెలంగాణా హీరోగా ప్రమోట్ చేసుకొనేందుకు చాలా శ్రమ తీసుకొంటునట్లున్నారు. కానీ, తెరాస కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులు లేదా విలీనం కానంత కాలం ఆయన ముఖ్యమంత్రి కావడం కలగానే మిగిలిపోవడం ఖాయం.

దావూద్ మా దేశంలో లేడు: పాకిస్తాన్‌

      మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని భారత హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది. దావూద్ ఇబ్రహీం తమదేశంలో లేడని గతంలోనే స్పష్టం చేశామని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల కార్యాలయం అధికార ప్రతినిధి తస్నీమ్ అస్లామ్ అన్నారు. ప్రస్తుతం కూడా దావూద్ తమ దేశంలో లేడని తస్నీమ్ అస్లామ్ పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. అయితే షిండే మాత్రం తమకున్న సమాచారం మేరకు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని తెలిసిందని... అమెరికాతో కలిసి సంయుక్త ప్రయత్నంతో దావూద్‌ను పట్టుకుంటామని ఆయన చెప్పారు.

వి.హెచ్ రాక్షసుడు..!

      కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుపై మంత్రి టీజీ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆనాటి హనుమంతుడు గొప్ప రామ భక్తుడైతే, ఈ నాటి కలియుగ హనుమంతుడు వీహెచ్ కుప్పిగంతులు వేస్తున్నారని” ఆ హనుమంతుడు దైవాంశసంభూతుడైతే, ఈ హనుమంతుడు రాక్షస జాతికి చెందిన వాడని” ఘాటుగా విమర్శించారు. నోటికొచ్చినట్టు మాట్లాడటం తప్పితే, ఆయన చేసేదేమీ లేదని విమర్శించారు. కిరణ్, చంద్రబాబు, జగన్ లు ఐక్యంగా పోరాడితే రాష్ట్రాన్ని ఎవరూ విడగొట్టలేరని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, అలాంటి ఆయన గురించి మాట్లాడే అర్హత కుప్పిగంతులు వేసే హన్మంతరావుకు లేదని, విభజన వల్ల రాయలసీమ, కోస్తా జిల్లాలకు అన్యాయం జరిగిందని, తమకు ఉరి శిక్ష వేసి శాసనసభలో చర్చ పెట్టమనడం, అందులో పాల్గొనమనడం అన్యాయమని టీజీ అభిప్రాయపడ్డారు.

బోగి మంటల్లో తెలంగాణ బిల్లు..!!

      సంక్రాంతి సంధర్బంగా నిర్వహించనున్న బోగి మంటల్లో విభజన బిల్లును దహనం చేయాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నిర్ణయించింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17, 18 తేదీల్లో 48 గంటలపాటు రాష్ట్ర బంద్ నిర్వహించాలని ఏపీఎన్జీవోల జేఏసీ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నిర్ణయించాయి. ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఈ నెల 20న శాసనసభను ముట్టడించాలని నిర్ణయించారు. విభజన బిల్లును శాసనసభలో ఓడిస్తేనె పార్లమెంటులో అడ్డుకోనెందుకు వీలుటు౦దని తెలిపారు. ఈ వివరాలను సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వెల్లడించారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డిపై శాసనసభలో జరిగిన దాడి ఘటనను ఆయన ఖండించారు.

నిమ్మకూరులో బాలకృష్ణ ప్రత్యేక పూజలు

      వైకుంఠ ఏకాదశి సందర్భంగా నందమూరి బాలకృష్ణ నిమ్మకూరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్నరాత్రి నిమ్మకూరుకు చేరుకున్న బాలయ్య బంధువుల ఇంట్లో బస చేశారు. ఈ రోజు ఉదయం కాలినడకనే గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత నిమ్మకూరులో ఉన్న ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిమ్మకూరులో ఏర్పాటు చేసి మంచినీటి ప్లాంట్‌ను బాలయ్య ప్రారంభించారు. తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో ముచ్చటించారు.చాలా రోజుల తర్వాత బాలకృష్ణ తన తండ్రి ఎన్టీరామారావు పుట్టిన నిమ్మకూరుకు చేరుకున్నారు. దీంతో ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు పరిసర ప్రాంతాల నుండి తరలి వచ్చారు. భవిష్యత్‌లో అభిమానుల ఆధ్వర్యంలో ఎన్‌బికె సేవా సంస్థను ప్రారంభించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. ఈ సంస్థకు చైర్మన్‌గా నేనే ఉంటానని చెప్పిన ఆయన....ఈ సంస్థ ద్వారా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.   

శాసనసభ 17వ తేదీకి వాయిదా

      శాసనసభ సమావేశాలు ఈనెల 17వ తేదీకి వాయిదా పడ్డాయి. విభజన బిల్లుపై సభలో సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ప్రసంగం అనంతరం స్పీకర్ నాదెండ్ల మనోహర్ శాసనసభను వాయిదా వేశారు.శుక్రవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సభలో జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్‌నాదెండ్ల మనోహర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.   వాయిదా అనంతరం తిరిగి ప్రారంభంకాగానే తెలంగాణ బిల్లుపై ఓటింగ్‌కు ప్రభుత్వం నుంచి ఎటువంటి హమీ రాలేదని నిరసిస్తూ సభ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. దీనిపై ఆ పార్టీ శాసనసభపక్ష నేత వైఎస్ విజయలక్ష్మి మాట్లాడుతూ మెజార్టీ సభ్యులు విభజనను వ్యతిరేకిస్తున్నారని, అన్ని క్లాజులను వ్యతిరేకిస్తూ సవరణలు పంపామన్నారు. ప్రధాన అంశాలపై బిల్లులో సమాచారం లేదని విజయమ్మ తెలిపారు. విజయమ్మ వ్యాఖ్యలపై స్పీకర్ మనోహర్ వివరణ ఇచ్చారు. టి.బిల్లుపై చర్చ తర్వాత ఓటింగ్ ఉంటుందన్నారు. చర్చ జరగకముందే ఓటింగ్ కోరడం సరికాదని తెలిపారు.

పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు..!

      తెలంగాణ బిల్లు రాష్ట్రపతి నుంచి రాగానే పార్లమెంట్ లో పెడతామని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే అన్నారు. ఈ నెల 23 వరకు శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లు చర్చకు రాష్ట్రపతి గడువు విధించారని, ఆ తరువాత అది రాష్ట్రపతికి రాగానే మాకు పంపితే వెంటనే పార్లమెంటులో పెడతామని ఆయన వెల్లడించారు. ఒకవేళ పదిహేను రోజులు ఆలస్యమైతే పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోతాయి. పిబ్రవరి ప్రథమార్థం నుంచి పదిహేను రోజులు పాటు పార్లమెంట్ సమావేశాలుంటాయని ఇప్పటికే కమలనాథ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.. తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని ..శాసనసభలో చర్చకు మరింత గడువు కోరాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దానికి రాష్ట్రపతి ఒప్పుకుంటారా ? లేదా ? అన్నది ఆయన మీదనే ఆధారపడి ఉంటుంది.

నరేంద్ర మోడీకే నా ఓటు: కిరణ్ బేడీ

      ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయన మాజీ మద్దతుదారు కిరణ్ బేడీ షాకిచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో సుస్థిర , సుపరిపాలన కావాలంటే మోడీకే తాను ఓటు వేస్తానని తేల్చిచెప్పారు. తనకు ప్రథమ ప్రాధాన్యం భారత్ అని, మంచి పాలన, మంచి యంత్రాంగం, నిజాయితీ, భాగస్వామ్య విధానం కారణంగా ఓ స్వతంత్ర ఓటరుగా తాను నరేంద్ర మోడీకి ఓటేస్తానని ఆమె ట్విట్టర్‌లో రాశారు. అన్నా శిష్యుడు అరవింద్ కేజ్రివాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో అన్నాకు సన్నిహితంగా ఆయనతో కలిసి ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న కిరణ్ బేడీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాల్లో విలువలను మార్చిందని, ఇది దేశానికంతటికీ మంచిదని కిరణ్ బేడీ అన్నారు.

కిరణ్ ఈటెల మధ్య వాగ్వివాదం..బాబు కౌంటర్

      తెలంగాణ బిల్లుపై చర్చ సంధర్బంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఈటెల రాజేందర్ మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. తెలంగాణ అడ్వకేట్ జనరల్ పదవి తెలంగాణకు చెందిన వ్యక్తికి ఇవ్వలేదని ఈటెల ఆరోపించారు. దీనిపై సీఎం కిరణ్ స్పందిస్తూ...తెలంగాణ నుంచి సీఎం పదివి పొందిన వారు అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పీవీ నరసింహారావును మీరు గెలిపిస్తారని నమ్మకం లేకనే మీము గెలిపించామని వ్యాఖ్యానించారు.   శాసనసభలో సీఎం కిరణ్ మాట్లాడుతూ పీవి ప్రస్తావన తేవడంతో... బాబు దానిపై స్పందించారు. పీవికి ఢిల్లీలో ఘాట్ ఎందుకు నిర్మించలేదని  ..కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. పీవి చనిపోతే కాంగ్రెస్ వాళ్ళు పార్టీ ఆఫీస్ కూడా తీసుకెళ్ళలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా పీవి అంత్యక్రియలు సక్రమంగా చేయలేదన్నారు.పీవీని కాంగ్రెస్ హైకమాండ్ అడుగడుగా అవమానించిందన్నారు. పీవీకి జరిగిన అన్యాయాన్ని ఎండగట్టింది టీడీపీనే అని చంద్రబాబు అన్నారు.  

పాలెం బస్సు ప్రమాద బాధితులకి న్యాయం జరిగేదెన్నడు

  పాలెం బస్సు దుర్ఘటనలో 45మంది నిండు ప్రాణాలు మంటలకు ఆహుతయిపోయాయి. ఆప్తులను, వారి అండను కూడా పోగొట్టుకొని తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నవారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడవలసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రమాదం జరిగి రెండు నెలలు గడుస్తున్నాఇంతవరకు వారికి ఎటువంటి సహాయం, న్యాయం చేయలేదు. కనీసం వారిపట్ల సానుభూతి కూడా చూపలేకపోయింది. ఇటువంటి ఘోర దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం, రాజకీయపార్టీలు వెంటనే ‘దిగ్బ్రాంతి ప్రకటనలు’ జారీ చేయడం తప్పితే, తదనంతరం వారి గోడు పట్టించుకోవని ఈ దుర్ఘటన మరోమారు రుజువు చేస్తోంది.   ఆత్మీయులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారు ఎటువంటి సానుభూతికి నోచుకోకపోగా, న్యాయం కోరుతూ రోడ్డున పడాల్సిరావడం ఇంకా బాధాకరం. చిన్నచిన్న నేరాలకు సైతం కేసులు పెట్టి దోషులను కోర్టుల చుట్టూ తిప్పే పోలీసులు, 45మంది కళ్ళెదుట కాలి బూడిదయిపోతే ఇంతవరకు ఎటువంటి చర్యలకు ఉపక్రమించక పోవడం చూస్తే ‘చట్టం దృష్టిలో కొందరు అధిక సమానులు’ గనుకనే భాధ్యులపై చర్యలకు వెనకాడుతున్నట్లు భావించవలసి ఉంటుంది. ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని కూడా వేలాది ప్రమాద కేసులలో ఒకటిగా పరిగణిస్తూ మాట్లాడుతోంది తప్ప,మానవీయ కోణంలో ఆలోచించేందుకు ఇష్టపడటం లేదు. బహుశః ఈ ప్రమాదాన్ని ప్రత్యేకంగా పరిగణించి భాదిత కుటుంబాలకు న్యాయం చేస్తే, ఎప్పుడయినా దురదృష్టవశాత్తు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు భాదితులు ప్రభుత్వాన్నిఈవిధంగానే డిమాండ్స్ చేస్తారనే ఆలోచనతో వెనుకంజ వేస్తూ ఉండవచ్చును. అటువంటప్పుడు బస్సులో ప్రయాణించే ప్రయాణికులకి తప్పనిసరిగా ఇన్స్యూరెన్స్ చేయించాలనే నిబంధన అమలు చేస్తే, బాధిత కుటుంబాలకు కొంత మేర ఊరట లబించే అవకాశం ఉంటుంది.   ఇంతకాలం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొన్న ప్రభుత్వం, ఇప్పుడు భాదిత కుటుంబాలకు క్రమంగా రాజకీయ పార్టీలు కూడా వచ్చిఅండగా నిలబడుతుండటంతో కొంత కదలిక వచ్చింది. నిన్న జబ్బార్ ట్రావెల్స్ భాగస్వాములను నలుగురిని సీఐడీ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేసారు. వారిని ఈరోజు మెహబూబ్ నగర్ కోర్టులో హాజరుపరిచి కేసుపై విచారణ మొదలుపెట్టబోతున్నారు. అయితే, రెండు రాష్ట్రాలలో రెండు బస్సు యాజమాన్యాల మధ్య జరిగిన ఒప్పందాల దృష్ట్యా ఈ కేసు ఇంత త్వరగా పరిష్కరింపబడే అవకాశం లేదు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేటప్పటికి ఎన్నినెలలు, సం.లు పడతాయో కోర్టులకే ఎరుక.

గాదెవెంకటరెడ్డి చొక్కా పట్టుకున్న ఎమ్మెల్యే ..!

      ఓ ఎమ్మెల్యే శాసనసభలో మరో ఎమ్మెల్యే చొక్కా పట్టుకోవడం సభలో కలకలం రేపుతోంది. ఈటెల రాజేందర్, ద్రోణంరాజు శ్రీనివాస్ ల మధ్య వాగ్వాదం జరుగుతున్నప్పుడు హఠాత్తుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు ద్రోణంరాజు వద్దకు దూసుకెళ్లారు. దీంతో గుంటూరు జిల్లా బాపట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఊహించని విధంగా విద్యాసాగర్ రావు… గాదె చొక్కా పట్టకున్నారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెరేగింది. సర్దిచెప్పడానికి వస్తే చొక్కా పట్టుకుంటారా? అని గాదె వెంకటరెడ్డి శాసనసభలో మండిపడ్డారు. సభ్యత, సంస్కారం లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు ప్రజాప్రతినిధులకు ఉండాల్సిన సభ్యత, సంస్కారం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ సభ్యుల దౌర్జన్యాలను అడ్డుకునే శక్తి సామర్థ్యాలు తమకున్నాయని గాదె అన్నారు. చొక్కా పట్టుకున్న వారితో వెంటనే క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ తమ సభ్యుల ప్రవర్తనకు చింతిస్తున్నామని క్షమాపణలు చెప్పారు.

బీజేపీ టీ-బిల్లుకి మద్దతు ఇస్తుందా?

  వచ్చే ఎన్నికల తరువాత రాజకీయాల నుండి తప్పుకోవాలని భావిస్తున్నసోనియాగాంధీ, ఎలాగయినా తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో పెట్టేందుకు అవసరమయిన యంపీల మద్దతు కూడ గట్టేందుకు, దేశంలో ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమయిన వ్యూహాలు రచించి, అమలుచేస్తున్నారు. మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు చూసుకొంటే, రాష్ట్ర విభజనకు పూనుకొని చాలా భారీ విద్వంసకర వ్యూహమే అమలు చేస్తున్నారు.   తెలంగాణా ప్రజల ఆకాంక్షలు మేరకే విభజన చేస్తున్నట్లు పైకి ప్రకటిస్తున్నపటికీ, ఇంత హడావుడిగా వచ్చే ఎన్నికలలోగా తన పధకాన్నిఅమలుచేయడానికి ప్రయత్నిస్తున్నతీరు గమనిస్తే ఇదంతా కేవలం తన రాజకీయ లబ్ధికోసమే చేస్తోందని స్పష్టమవుతోంది. నరేంద్ర మోడీ ఒకసారి ప్రధాని కుర్చీలో సెటిల్ అయిపోతే ఇక రాహుల్ గాంధీకి మళ్ళీ జీవితంలో ప్రధాని కుర్చీలో కూర్చొనే భాగ్యం దక్కకపోవచ్చనే ఆలోచనతోనే, అతని రాజకీయ భవిష్యత్తుని చక్కబెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ కోట్లాది రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోంటోoది. అయితే పైకి మాత్రం తానొక పవిత్రమయిన కార్యం కోసం తన పార్టీనే పణంగా పెడుతున్న త్యాగామూర్తిలా మాట్లాడుతోంది. తెలంగాణాలో టీ-కాంగ్రెస్, తెరాసల మద్దతుతో, సీమాంధ్రలో కాంగ్రెస్, కిరణ్ కాంగ్రెస్, వై.కాంగ్రెస్ పార్టీల మద్దతు పొందాలనేది కాంగ్రెస్ యోచన.   అయితే ఈ వ్యూహం అమలవ్వాలంటే ముందుగా రాష్ట్ర విభజన జరగాల్సి ఉంటుంది. అందుకు బీజేపీ మద్దతు తప్పనిసరి. బీజేపీ టీ-బిల్లుకి మద్దతు ఇస్తానని నేటికీ హామీ ఇస్తున్నపటికీ, దానితోబాటే సమన్యాయం పల్లవి కూడా ఆలపించడం మరిచిపోవడం లేదు. అందువల్ల బీజేపీని గుడ్డిగా నమ్మికాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళగలిగే పరిస్థితి లేదు. ఒకవేళ బీజేపీ ఆఖరి నిమిషంలో బిల్లుపై మాటమార్చితే కాంగ్రెస్ ఇరకాటంలో పడక తప్పదు. అటువంటి పరిస్థితే వస్తే, తను క్షేమంగా బయటపడే వ్యూహాలు కాంగ్రెస్ సిద్దంచేసుకొనే ఉంటుంది. బహుశః అందువలనే దిగ్విజయ్, షిండే, ఆజాద్, కమలనాథ్, మొయిలీ తదితర కాంగ్రెస్ పెద్దలు తెలంగాణా బిల్లు కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెడతామని ఒకరంటే, కాదు బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని మరొకరు చెపుతూ బిల్లుపై బీజేపీతో దాగుడుమూతలు ఆడుతున్నారు.   కానీ కాంగ్రెస్ దేశముదురయితే, బీజేపీ మహా ముదురు పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న తెలంగాణా బిల్లుకి మద్దతు ఇస్తే దానివల్ల కాంగ్రెస్ పార్టీకే పేరు, ప్రయోజనం కలుగుతాయి తప్పతనకు కలగవనే సంగతి కొంచెం ఆలస్యంగానయినా గ్రహించగలిగింది. తాను ఏ కాంగ్రెస్ పార్టీని వచ్చేఎన్నికలలో మట్టి కరిపించి కేంద్రంలో అధికారంలోకి రావాలని తపిస్తోందో, అదే పార్టీ ప్రవేశపెడుతున్నబిల్లుకి ఇప్పుడు మద్దతు ఇస్తే, చేజేతులా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, తన పార్టీని తనే దెబ్బ తీసుకొన్నట్లవుతుంది. కనుక, బీజేపీ తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయకపోవచ్చును.   కానీ, బిల్లుపై ‘యూ టర్న్’ తీసుకొంటే, తెలంగాణా ప్రజల ఆగ్రహానికి, తెరాస, టీ-కాంగ్రెస్ నేతల నోటికి బలయిపోవడం ఖాయం. కనుక తను ఇప్పుడు ఆలపిస్తున్న’సమన్యాయం’ పల్లవితో బాటు మరో కొత్త రాగమేదయినా ఆలపించవలసి ఉంటుంది. తెలంగాణా బిల్లుపై టీ-కాంగ్రెస్, తెరాస నేతలు ఇప్పటికే అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసారు. వాటిని పట్టుకొని తెలంగాణాకు చాలా అన్యాయం జరుగుతోందని వాదిస్తూ బీజేపీ ‘యూ టర్న్’ తీసుకోవచ్చును. తాము అధికారంలోకి రాగానే బిల్లులో లోపాలను సవరించి తెలంగాణా ప్రజలు, నేతలు కోరుతున్నట్లు ఎటువంటి షరతులేని సంపూర్ణ తెలంగాణా ఇస్తానని హామీ ఇస్తూ బీజేపీ ప్రజలవద్దకు వెళ్ళగలదు.   ఇక తను చాలా పట్టుదలగా, చిత్తశుద్దితో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుచేయబోతే, బీజేపీ దానికి మోకాలు అడ్డిందని, లేకుంటే ఈ ఎన్నికలు తెలంగాణాలోనే జరిగి ఉండేవని, అందువల్ల ప్రజలు మళ్ళీ తనకే ఓట్లేసి గెలిపించినట్లయితే అధికారం చెప్పట్టగానే వెంటనే తెలంగాణా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల వద్దకు వెళ్ళవచ్చును.   అందువల్ల పార్లమెంటులో బిల్లుకి మద్దతు అనేది కేవలం సాంకేతిక సమస్య మాత్రమే కాదు, రాజకీయ సమస్య కూడా అని దీని వల్ల అర్ధం అవుతోంది. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు బిల్లు గురించి ఎన్నిమాటలు చెపుతున్నపటికీ, బిల్లు పార్లమెంటులో ఓటింగ్ వచ్చేసమయానికి అందరూ మాట మార్చి వెనక్కి తగ్గడం ఖాయం. అందువల్ల వచ్చేఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చును.

కమలం చుట్టూ ఈగలు

    బీజేపీకి దక్షిణాదిన అధికారం కట్టబెట్టిన ఏకైక రాష్ట్రం కర్ణాటక. దాదాపు రెండు దశాబ్దాల పాటు బీజేపీ రాజ్యం ఏలిందక్కడ. కానీ మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప అవినీతి భాగోతాల పుణ్యామాని ఉన్నఆ ఒక్క రాష్ట్రాన్ని కూడా పోగొట్టుకొంది. వాపును చూసి బలుపని భ్రమసిన ఎడ్యూరప్ప కర్ణాటక జనపక్ష పార్టీ పెట్టి బీజేపీని రాష్ట్రంలో నుండి తరిమి కొడతానని ప్రతిజ్ఞ చేసారు. కానీ ఆయన పార్టీని ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆయన బీజేపీని రాష్ట్రం నుండి తరిమికొట్టలేకపోయినా ఎన్నికలలో గెలవకుండా సైంధవుడిలా అడ్డుపడి, అధికారాన్నికాంగ్రెస్ చేతికి అప్పగించగలిగారు. అందుకు బీజేపీ ఆగ్రహించకపోగా ఆయనను దూరం చేసుకొన్నందునే ఎన్నికలలో ఓడిపోయామని భావించడం ఆశ్చర్యం. అదేవిధంగా ఎడ్యూరప్ప కూడా బీజేపీని వదిలిపెట్టి బయటకి వచ్చినందునే ఓడిపోయానని పశ్చాతాపపడుతూ, మళ్ళీ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. అయితే ఇంతకాలం వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నందున, అవినీతికి మారుపేరయిన ఎడ్యూరప్పను పార్టీలో చేర్చుకొంటే ఆ ప్రభావం పార్టీపై పడుతుందని, అదీ గాక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అదొక ఆయుధంగా మారుతుందని భావించిన బీజేపీ, ఆయనను తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, ఇంతకాలం దూరంపెట్టింది. ఇప్పుడు ఎన్నికలు కూడా పూర్తయిపోయాయి గనుక, ఆయనకు ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికి తిరిగి పార్టీలో చేర్చుకొంది. ఈ రోజు ఎడ్యూరప్ప తన అనుచరులతో కలసి వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద జోషీ మరి కొందరు సీనియర్ నేతల సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన తన కర్ణాటక జనపక్ష పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. నేటి నుండి, బీజేపీ నేతలు కాంగ్రెస్ అవినీతిని ప్రశ్నించే ముందు వారు ఎడ్యూరప్పఅవినీతి భాగోతాల గురించి లేవనెత్తే ప్రశ్నలకు జవాబీయడానికి సిద్దంగా ఉండాల్సి ఉంటుంది.

శాసనసభలో టీ-బిల్లుపై చర్చ జరిగేనా

  తెలంగాణ బిల్లు రాష్ట్ర శాసనసభకు వచ్చిన నాటి నుండి నేటి వరకు వైకాపా ముందుగా సభలో సమైక్యాంధ్ర తీర్మానం చేసిన తరువాతనే చర్చ మొదలుపెట్టాలని వితండవాదం చేస్తూ, బిల్లుపై చర్చ మొదలవకుండా అడ్డుకొంటోంది. ఈరోజు ఉభయ సభలలో వైకాపా సభ్యులను సస్పెండ్ చేయడంతో బిల్లుపై చర్చ మొదలయింది. ఈ పని మొదటే చేసి ఉంటే విలువయిన సభా సమయం, ప్రజాధనం వృదా అయ్యేవి కావు.   ప్రస్తుతం సభలో చర్చ మొదలయినప్పటికీ, అది ఎంతకాలం సజావుగా సాగుతుందో చెప్పలేము. ఒకవేళ సజావుగా సాగినా, సభ్యుల ఊకదంపుడు ప్రసంగాలతో, చరిత్ర పాటాలతో పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుంది. ఈ నెల13 నుండి 16వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా శాసనసభ సమావేశాలు జరుగవు. అంటే బిల్లుపై అర్ధవంతమయిన చర్చ జరపడానికి ఇంకా కేవలం 10రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందన్నమాట. దాదాపు నెల రోజులపాటు సమయం వృధా చేసుకొని ఇప్పుడు ఈ మిగిలిన కొద్ది రోజులలో మన ప్రజాప్రతినిధులు బిల్లుపై లోతుగా చర్చించగలరని ఆశించలేము.   ఉభయ సభలలో బిల్లుపై లోతుగా చర్చ జరగవలసి ఉన్నపటికీ, తమతమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చే మన ప్రజాప్రతినిధులు, తమ పార్టీ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని భావిస్తే సభను ఏ నిమిషంలోనయినా స్తంభింపజేయవచ్చును. చర్చ యావత్తు రాష్ట్ర విభజనపైనే జరుగుతోంది గనుక సీమాంధ్ర శాసనసభ్యులు లేవనెత్తే అంశాలను తెలంగాణా సభ్యులు అడ్డుకోవడం తధ్యం. అదేవిధంగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు చేయడం, ఆ వెంటనే తెలంగాణా కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడికి దిగడంతో చర్చ పక్కదారి పట్టగానే సభలో మళ్ళీ వాయిదాల పర్వం మొదలవవచ్చును. ఈలోగా పుణ్యకాలం కూడా పూర్తయిపోతుంది.

జగన్ ఎమ్మెల్యేల సస్పెన్షన్..అరెస్ట్

      వైకాపా ఎమ్మెల్యేలు శాసన సభ నుంచి సస్పెండయ్యారు. ఐదు రోజులుగా అసెంబ్లీకి తీవ్ర ఆటంకం కలిగిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యేల్ని ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. శాసన సభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్ వీరి సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా స్పీకర్ ఆమోదం తెలిపి.. 15 మంది ఎమ్మెల్యేల్ని సభ నుంచి బయటికి వెళ్లాల్సిందిగా కోరారు. ఐతే ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ అక్కడే ఉండటంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటికి పంపారు. ఐతే సస్పెండ్ చేసిన సభ్యుల్లో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ లేదు. తమ సభ్యులందరినీ బయటికి పంపేయడంతో విజయమ్మ ఒంటరి అయిపోయారు. మంత్రి వట్టి వసంతకుమార్ మాట్లాడుతుండగా విజయమ్మ లేచి.. సమైక్య తీర్మానం చేయనందుకు నిరసనగా తాను వాకౌట్ చేస్తున్నట్లు చెప్పి.. బయటకు వెళ్లిపోయారు.   అనంతరం ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేట్ నెంబర్ 1 వద్ద ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, శాసన మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్సీలను కూడా సస్పెండ్ చేశారు.

తెలంగాణలో 'ప్రజాగర్జన'

      ఇటీవల తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టిన ప్రజాగర్జన సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చి విజయవంతం కావడంతో..ఈ సభలను తెలంగాణలోనూ నిర్వహించాలని టిడిపి నిర్ణయించింది. బుధవారం తెలంగాణ ప్రాంత నేతలతో సమావేశమైన చంద్రబాబు..పొత్తుల విషయం పక్కన పెట్టి ప్రతి నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేయాలని సూచించారు. తెలంగాణలో పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాజకీయ కార్యకలాపాల్లో వేగం పెంచాలని చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో ఈ నెలాఖరు లోపు విస్తృత సమావేశాలు నిర్వహించి, తర్వాత నియోజకవర్గాలవారీగా పార్టీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత తెలంగాణలో రెండుచోట్ల జోనల్ సభలు నిర్వహించాలనీ నిర్ణయం తీసుకొన్నారు.