తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయ౦: కమల్‌నాథ్

      ఫిబ్రవరి 5 నుంచి మొదలుకానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు. అవసరమైతే పార్లమెంటు సమావేశాలు పొడిగించైనా తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చూస్తామని పేర్కొన్నారు. పార్లమెంటులో బిల్లును త్వరగా ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని' దృష్టిలో ఉంచుకుని గడువు వారం మాత్రమే పెంచుతున్నట్లు రాష్ట్రపతి తన ఆదేశాల్లోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కమల్‌నాథ్ చేసిన ప్రకటనతో వచ్చేనెలలో బిల్లు ప్రవేశపెట్టడం ఖాయమని తెలిసిపోతోంది. వచ్చేనెల 5 నుంచి 20వ తేదీ వరకు పార్లమెంటు సమావేశ పరచాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తోపాటు మరికొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అనూహ్య హత్య: షిండేని కలిసిన తండ్రి

      ముంబై నగర శివార్లలో కాలిన శవమై లభించిన మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య తండ్రి ప్రసాద్ శుక్రవారం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేని కలిసి తమకు న్యాయం చేయాలని, దోషులను త్వరగా పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన కూతురిని వెతుకుతూ తాను అనుభవించిన మనోవేదన ఏ తల్లిదండ్రులకు రాకూడదని ఆయన షిండేతో అన్నారు. అనంతరం ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ జరిగిన దుర్ఘటన గురించి షిండేకు తెలిమజేశామని అన్నారు. కేసు విషయంలో పోలీసులు కూడా తమకు సహాయపడడంలేదని, తమ కుమార్తె అదృశ్యమైనప్పటి నుంచి ఆచుకీ కోసం స్వయంగా తామే గాలించామని, చివరికి పదిరోజుల తరువాత తను మృతదేహం లభించింది. మాకు కలిగిన ఈ బాధ మరే తల్లిదండ్రులకి రాకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శాసనసభలో టీఆర్ఎస్ వర్సెస్ టిడిపి

      తెలంగాణ బిల్లుపై శాసనసభలో తీవ్ర గందరగోళం మధ్య చర్చ జరుగుతోంది. సభలు పలుమార్లు టీఆర్ఎస్, టిడిపి సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. విభజన బిల్లుపై టీఆర్ఎస్ నేత జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణకు ప్రధాన అడ్డంకి చంద్రబాబు నాయుడే అని, టీడీపీ వైఖరి వల్లే వేలాది మంది ఆత్మహత్య చేసుకున్నానరని జోగు రామన్న ఆరోపించారు. దీనిపై సభలో కొద్ది సేపు గందరగోళం నెలకొంది. జోగురామన్న వ్యాఖ్యలపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అవకాశవాదం వల్లే తెలంగాణలో వేలాది మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని మండిపడ్డారు. అమరవీరుల కుటుంబాలకు అడుగడునా ఆదుకున్నది టీడీపీనే అని తెలియజేశారు.

సల్మాన్ 'జయహో': అసద్ కు కౌంటర్

      బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ మీద ప్రశంసల జల్లు కురిపించి మద్దతు ప్రకటించడంపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ సినిమాలను బహిష్కరించాలని తన మద్దతుదారులకు పిలునిచ్చారు. తాజాగా దీనిపై సల్మాన్ ఖాన్ స్పందించారు. నరేంద్ర మోదీని కలవడాన్ని ఆయన సమర్ధించుకున్నారు.   జయహో చిత్రం ప్రోమోషన్ కోసం గుజరాత్ వెళ్లానని..పతంగులు ఎగురవేశానని చెప్పారు. తాను సగం హిందూ..సగం ముస్లీంనని అన్నారు. అలాగే తన తండ్రి ముస్లిం అని, తన తల్లి హిందువు అని చెప్పారు.గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం సోదరులు బాగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. ''జయహో'' మంచి మెసేజ్ వున్నా చిత్రమని అందరూ తప్పక చూడాలని అన్నారు.      

కాంగ్రెస్ లోకి అరవింద రెడ్డి!

      ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరవింద రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో తనకు సీటు ఇస్తామని హామీ ఇస్తే పార్టీలో చేరతానంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కలిసి చెప్పినట్లు సమాచారం. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అరవింద్ రెడ్డి చెప్పారు. ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలను కలిసిన మాట వాస్తవమేనని..తెలంగాణ ప్రజల పక్షానే ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అరవింద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌తో ఆయనకు సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయంటున్నాయి పార్టీ వర్గాలు.

విజయవాడ టికెట్ ఇస్తే పొట్లూరి తెదేపా గూటికి

  కొన్ని రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు సినీ నిర్మాత పొట్లూరు వర ప్రసాద్ త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, విజయవాడ నుండి పోటీ చేయబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, జగన్మోహన్ రెడ్డిని తట్టుకొని పార్టీలో ఎక్కువకాలం కొనసాగడం కష్టమని గ్రహించిన ఆయన వైకాపాలో చేరే ఆలోచనను విరమించుకొన్నారు. అయితే, ఇదంతా జగన్మోహన్ రెడ్డిని, వైకాపాని అప్రదిష్టపాలు చేసేందుకు చంద్రబాబు, ఆయనకి అనుకూలంగా ఉండే మీడియా చేసిన కుట్రే తప్ప తామేనాడు పొట్లూరిని పార్టీలోకి ఆహ్వానించలేదని, టికెట్ కూడా ఆఫర్ చేయలేదని వైకాపా వాదించింది.   తాజా సమాచారం ఏమిటంటే పొట్లూరి తెదేపాలో చేరే ప్రయత్నంలో కృష్ణా జిల్లాకు చెందిన ఒక ప్రముఖ తెదేపా నాయకుడుని వెంటబెట్టుకొని మొన్న చంద్రబాబుని కలిసి విజయవాడ లోక్ సభ టికెట్ కోసం అభ్యర్ధించినట్లు తెలుస్తోంది. కానీ, ఆ సీటు ఇప్పటికే కేశినేని నానికి కేటాయించినందున దానిని ఆయనకు ఇవ్వడం సాధ్యం కాదని, వేరెక్కడి నుండయినా పోటీ చేసేందుకు సిద్దపడితే ఆలోచిస్తామని చంద్రబాబు జవాబు చెప్పినట్లు తెలుస్తోంది. గతేడాది చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు విజయవాడ సీటుని ఆశిస్తున్న వల్లభనేని వంశీని తప్పించి, కేశినేని నానికి అప్పగించారు. దానితో వంశీ చాలా ఆగ్రహించినపుడు, ఆయనకు గన్నవరం శాసనసభ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని సమాచారం. అందువల్ల ఇప్పుడు పొట్లూరి విజయవాడ టికెట్ ఆశించినా ఇవ్వలేని పరిస్థితి.   పొట్లూరి కృష్ణాజిల్లాలో కొందరు తెదేపా శాసనసభ్యులను కలిసి వారి మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నం చేసారు. కానీ వారెవరూ కూడా పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేఖంగా వెళ్లేందుకు సిద్దపడకపోవడంతో పొట్లూరి చివరి ప్రయత్నంగా నేరుగా చంద్రబాబునే కలిసి మాట్లాడారు, కానీ ఫలితం లేకపోయింది. ఈసారి ఎన్నికలలో పోటీ చాలా తీవ్రంగా ఉండబోతునందున, చంద్రబాబు అభ్యర్దుల ఎంపికలో చాలా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. మరో పక్క నారా లోకేష్ కూడా వేరేగా ఎప్పటికప్పుడు నియోజక వర్గాల వారిగా సర్వేలు నిర్వహింపజేయిస్తూ గెలుపు గుర్రాల పేర్లను తండ్రికి సూచిస్తునట్లు సమాచారం.   ఒకవేళ పొట్లూరి విజయవాడ కోసం పట్టుబట్టకుండా వేరే చోట నుండి పోటీకి అంగీకరించినప్పటికీ, తెదేపా టికెట్స్ కోసం చాలా ఒత్తిడి ఉన్నకారణంగా ఆయనకు ఎక్కడి నుండి టికెట్ కేటాయించాలన్నాచాలా కష్టమే అవుతుంది. అయినప్పటికీ, ఒకవేళ పొట్లూరి అందుకు అంగీకరిస్తే చంద్రబాబు ఏదోవిధంగా సర్దుబాటు చేయవచ్చునేమో! ఒకవేళ పొట్లూరి విజయవాడ టిక్కెటే కావాలనుకొంటే, ఆయన తరువాత గమ్యం కాంగ్రెస్ పార్టీ కావచ్చును. ఎందుకంటే విజయవాడ కాంగ్రెస్ యంపీ లగడపాటి రాజగోపాల్ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేసి కిరణ్ కుమార్ రెడ్డి లేదా తనే స్వయంగా స్థాపించబోయే కొత్త పార్టీ టికెట్ మీద పోటీ చేయబోతున్నారు గనుక, పోట్లూరికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ దొరికే అవకాశం ఉంది. కానీ, సీమాంధ్రలో తీవ్ర ప్రతికూలత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయడమంటే అది మరొక వర్ణ చిత్రమే అవుతుంది ఆయనకు. గనుక తన కల నెరవేర్చుకోవడానికి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయవలసి ఉంటుంది. కానీ, అది కూడా చాలా భారీ ఖర్చు, రిస్కుతో కూడిన వ్యవహారమే గనుక, పొట్లూరి ఏమి చేయబోతున్నారో తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

రాజ్యసభ ఎన్నికలకు వైకాపా దూరం!

  వచ్చిన ఏ అవకాశాన్నివదులుకోవడానికి ఇష్టపడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తనకు సరిపోయినంత మంది శాసనసభ్యుల మద్దతు లేనందున ఫిబ్రవరి 7న జరిగే రాజ్యసభ ఎన్నికలలో తమ అభ్యర్ధిని పోటీకి నిలబెట్టడం లేదని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి ప్రకటించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇతర పార్టీల మద్దతు తీసుకొని పోటీకి నిలబెట్టడమంటే విభజన వాదులతో కుమ్మకు కావడమేనని, కాంగ్రెస్, తెరాస, తెదేపాలు విభజనవాదులే గనుక రాజ్యసభ ఎన్నికలలో ఒకరికొకరు సహకరించుకొంటూ పోటీ చేస్తున్నారని ఒక వింత సిద్ధాంతం కూడా కనిపెట్టారాయన.   సాధారణంగా ఇటువంటి అవకాశం దొరికితే తన రాజకీయ ప్రత్యర్ధులను ఇరుకునబెట్టి వికృతానందం అనుభవించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఈవిధంగా నీతులు వల్లిస్తూ మడికట్టుకొని కూర్చొంటానని చెప్పడం చాలా అనుమానం కలిగిస్తోంది. రాజ్యసభ ఎన్నికలకు సిద్దమయితే, బహుశః పార్టీలో లుకలుకలు మొదలవుతాయని భయపడిందో లేక మొన్న ఏపీయన్జీవో ఎన్నికలలో వేలు పెట్టి భంగ పడినందున, మళ్ళీ మరోసారి భంగపడకూదదని వెనక్కి తగ్గిందో లేకపోతే సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపాల నుండి వైకాపాలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నఅభ్యర్ధులకు మద్దతు ఇచ్చి వారిని పార్టీలోకి ఆకర్షించే ఆలోచనలో ఉందో తెలియాలంటే ఈ నెల 28న అభ్యర్ధులందరూ నామినేషన్లు దాఖలు చేసేవరకు వేచి చూడవలసి ఉంటుంది. బహుశః అప్పటికి వైకాపా ఆలోచనలేమిటో బయటపడవచ్చును.

సీఎం బెదిరింపులకు దడవను: హరీష్

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్తుంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కిరణ్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ..బెదిరింపులకు ఎవరూ లొంగరు. ఆయన భయపెడితే భయపడే వారు ఎవరూ ఇక్కడ లేరు. తెలంగాణ రైతులకు బోర్ల కొరకు 19 వేల కోట్ల రూపాయల ఉచిత విద్యుత్ ఇచ్చానని ముఖ్యమంత్రి అసేంబ్లీలో చెబుతున్నాడు. కానీ ఆ బోర్లు వేసేందుకు, వాటి మోటార్లకు తెలంగాణ రైతులు 40 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని టీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీష్ రావు సూచించారు. సీమాంధ్రకు నీరు కాలువల ద్వారా వెళ్తుంటే ..తెలంగాణ రైతులు స్వంత డబ్బుతో బోర్లు తవ్వుకుంటున్నారు. దానికి ఉచిత విద్యుత్ పేరుతో రాత్రివేళ ..ఇష్టం వచ్చినప్పుడు విద్యుత్ సరఫరా చేస్తుండడంతో తెలంగాణ రైతులు విద్యుత్ షాక్ లతో, పాము, తేలు కాట్లకు గురయి మరణిస్తున్నారు. సీమాంధ్రలో నీటి సరఫరా ఖర్చు ప్రభుత్వం భరిస్తే, తెలంగాణలో ఖర్చు రైతు భరిస్తున్నాడని హరీష్ రావు తెలిపారు.

అక్కినేని అంత్యక్రియలు పూర్తి

      నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో ముగిసాయి. అక్కినేని వారసులు వెంకట్, నాగార్జున, సుమంత్, నాగ చైతన్య, సుప్రియ, అఖిల్ తదితరులు ఈ అంత్యక్రియల క్యార్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కినేనికి గన్ సెల్యూట్ చేసారు. అంతకుముందు గురువారం ఉదయం నాగేశ్వరరావు భౌతికకాయాన్ని పలువురు సందర్శనార్థం ఫిల్మ్‌చాంబర్‌లో ఉంచారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఫిల్మ్‌చాంబర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకు అక్కినేని అంతిమయాత్ర జరిగింది. ఫిలింఛాంబర్‌లో అక్కినేని పార్థివదేహాన్ని సందర్శించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు.

రాజగోపాల్ బావమరిది తెదేపాలోకి జంప్?

  హిందూపురం కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ అంబిక లక్ష్మినారాయణ, తెలుగుదేశం పార్టీలోకి జంపైపోవాలని ఉబలాట పడుతున్నారు. అయితే ఆయన ఓబులాపురం అక్రమ గనుల తవ్వకాల కేసులో అరెస్టయ్యి జైలుకి వెళ్ళిన గనులశాఖ డైరెక్టర్ రాజగోపాల్ కి బావమరిది కావడంతో స్థానిక తెదేపా నేతలు, కార్యకర్తలు ఆయనని పార్టీలో చేర్చుకోవడానికి అభ్యంతరం చెపుతున్నారు. కానీ, లక్ష్మినారాయణ మాత్రం తెదేపాలోకి మారేందుకు గట్టిగానే కృషి చేస్తున్నట్లు సమాచారం. ఆయన గత ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ మీద హిందూపురం నుండి పోటీ చేసారు, కానీ తెదేపా అభ్యర్ధి అబ్దుల్ ఘనీ చేతిలో ఓడిపోయారు. ఈసారి సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఏమీ బాగుండకపోవడంతో ఏకంగా తెదేపాలోకే జంపైపోవడం సేఫ్ అనుకొన్నారేమో, తెదేపా టికెట్ కోసం కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డితో కలిసి చంచల్ గూడా జైలులో చాలాకాలం సహవాసం చేసిన రాజగోపాల్ సైతం వచ్చే ఎన్నికలలో ఉరవకొండ శాసనసభ నియోజక వర్గం నుండి పోటీ చేయాలని ఉబలాటపడుతున్నట్లు సమాచారం. కానీ, ఆయన మాత్రం వైకాపా టికెట్ పైనే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే బావ బావమరుదులిద్దరూ వచ్చే ఎన్నికలలో రాజకీయ ప్రత్యర్దులవుతారేమో!

ఎమ్మెల్యేల చెవిలో పువ్వులు...హరీష్ కు కిరణ్ వార్నింగ్

      తెలంగాణ ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా విభజనను నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రసంగంలో వెల్లడిస్తున్న అంశాల మీద తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు అడుగడుగునా అభ్యంతరాలు చెబుతున్నారు. సీమాంధ్ర ప్రజల చెవ్విలో ముఖ్యమంత్రి పువ్వులు పెడుతున్నారని, అబద్దాలు చెబుతూ తెలంగాణ మీద విషం కక్కుతున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలుపుతున్నారు. ఈ సంధర్భంగా చెవిలో పువ్వులు పెట్టుకున్న వారిని చూసి ముఖ్యమంత్రి చాలా అందంగా ఉన్నారని అన్నారు.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావును గురువారం శాసన సభలో హెచ్చరించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ సమయంలో తన ప్రసంగంపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేయగా కిరణ్ ఘాటుగా స్పందించారు. హరీష్ రావు నోటిని అదుపులో పెట్టుకోవాలని, కాస్త కంట్రోల్లో ఉండాలని హెచ్చరించారు. ఏది అంటే అది మాట్లాడవద్దని సూచించారు. మరో సమయంలో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పైన ఏ సీమాంధ్ర నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు.

బిజెపికి నో..కాంగ్రెస్ లోనే: పనబాక

      కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని..పార్టీని ఎప్పటికి వీడనని చెప్పారు. బాపట్ల నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తానని పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. తన నియోజకవర్గానికి ఎస్సీ,ఎస్టీ నిధులు మంజూరుకావడం లేదని, నిధులు కోరితే ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులపై పనబాక అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తనకు సహకరించడం లేదని, వారి సహకారం ఉంటే బాపట్ల నియోజవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదని పనబాక లక్ష్మి అన్నారు.

విభజన బిల్లుపై చర్చకు మరోవారం?

      విభజన బిల్లుపై అభిప్రాయాలు తెలపటానికి శాసనసభకు ఇచ్చిన గడువును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరోవారం రోజులు పొడగించవచ్సుననే వార్తలు రాజకీయవర్గాలలో వినిపిస్తున్నాయి. తెలంగాణ బిల్లుపై అభిప్రాయాలు తెలపటానికి అసెంబ్లీకి రాష్ట్రపతి ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. బిల్లుపై సమగ్రాభిప్రాయం తెలుసుకునేందుకు 4 వారాలపాటు గడువును తప్పనిసరిగా పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రపతికి లేఖలు రాశారు. దీంతో విభజన సందర్బాలలో అప్పటి రాష్ట్రపతులు పాటించిన సంప్రదాయాలను ప్రణబ్ మరోసారి పరీశీలిస్తున్నారు. చర్చకు మరింత సమయం ఇవ్వడంపై గురువారం రాష్ట్రపతి భవన్ అధికారిక వర్గాలు స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.   మరోవైపు గడువు పొడిగింపు అంశం అసెంబ్లీ లాబీల్లో హాట్ టాపిక్‌గా మారింది. పొడిగింపు వస్తుందా, రాదా, పొడిగించకపోతే ఎలా ఉంటుంది, పొడిగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అనేక రకాల కథనాలు, ప్రచారాలు జరిగాయి. రాష్ట్రాల విభజన సందర్భంగా ఆయా అసెంబ్లీలు చర్చకు గడువు పెంపు కోరినప్పుడు... రాష్ట్రపతి తిరస్కరించిన దాఖలాలు లేవని, ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ ఇదే జరుగుతుందని అనుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి కోరినట్లు నాలుగు వారాలు కాకుండా, కనీసం ఒక్కవారం పెంచే అవకాశాలున్నాయని తెలిపారు.

గిరిజనులకీ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి: బాలరాజు

  గిరిజన సంక్షేమ శాఖామంత్రి బాలరాజు నిన్న శాసనసభలో మాట్లాడుతూ, తాను రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకొన్న నిర్ణయాన్ని సమర్దిస్తున్నానని అన్నారు. తమ పార్టీ రాష్ట్రంలో అన్ని పార్టీలను సంప్రదించిన తరువాతనే విభజనకు పూనుకొందని, కానీ పార్టీలన్నీ మాట తప్పి కాంగ్రెస్ ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు.   వెనుకబాటుతనం, ఆత్మగౌరవం పేరిట మొదలయిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, ఇప్పుడు అధికారం కోసం ఆదిపత్య పోరులో మునిగి తేలుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా తన పాడేరు నియోజక వర్గంలో గిరిజనులు పడుతున్న అష్టకష్టాల గురించి వివరించి, రాష్ట్ర విభజన అనివార్యమయితే దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని గిరిజనుల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. బాలరాజు ఏ కారణంగా తెలంగాణా ఉద్యమాలు మొదలయ్యాయో చెప్పి, వాటిని విమర్శించడమే గాక మళ్ళీ ఆయన అవే కారణాలతో గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేయడం విచిత్రం.   గిరిజనుల కష్టాల గురించి, వారికి ఏర్పాటు చేయవలసిన సౌకర్యాల గురించి సభలో ధాటిగా ప్రసంగించిన బాలరాజు, గిరిజన సంక్షేమ శాఖామంత్రిగా వారికోసం ఏమి చేసారో తెలియదు కానీ, పాడేరు పాత ఐటిడిఎ కార్యాలయ స్థలాన్ని, చింతపల్లి ఎలక్ట్రిక్ బోర్డు స్థలాన్ని, గూడెంలోని కాఫీబోర్డు స్థలాన్నికబ్జా చేశారని, ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 300 ఎకరాల భూములపై కన్నువేశారనే ఆరోపణలున్నాయి. ఆయన భూకబ్జాలపై మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదులు పంపారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు గిరిజనుల సంక్షేమాన్ని విస్మరించి తన సంక్షేమాన్ని మాత్రమే చూసుకుంటున్నారని దేముడు విమర్శిస్తున్నారు.   మంత్రి బాలరాజు భూకబ్జాలకు పాల్పడటమే కాకుండా అనేక అనైతిక పనులు కూడా చేస్తున్నారని, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దేముడు తన ఆరోపణలో పేర్కొన్నారు. తన ఆటలు సాగవనే ఉద్దేశ్యంతో పాడేరు ఐటిడిఎ కార్యాలయానికి ఐఎఎస్ అధికారిని నియమించకుండా బాలరాజు అడ్డుకుంటున్నారని సబ్ కలెక్టర్ కార్తికేయ మిశ్రాను అడ్డుతొలగించి ఆయన స్థానంలో తనకు అనుకూలమైన ఆర్డీవో స్థాయి అధికారిని నియమించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని దేముడు ఆరోపించారు.   బాలరాజు మంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన కొద్ది నెలలకే ఆయనపై ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు, ఆయన ఇప్పుడు గిరిజన సంక్షేమం గురించి సభలో మాట్లాడటం విడ్డూరం. నిజానికి శాసనసభ్యులు, మంత్రులు, యంపీలు అందరూ తమ నియోజక వర్గాల అభివృద్ది పట్ల, తమ ప్రజల బాగోగుల పట్ల కనీసం 50 శాతం శ్రద్ధ చూపినా నేడు సభలో ఈ విభజన చర్చ జరిగే ఉండేదే కాదు. కానీ, ఎంతసేపు రాజకీయాలు, ఓట్లు, సీట్లు, అధికారం, పదవుల కోసమే తాపత్రయపడే నేతల వలననే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని చెప్పక తప్పదు.

కంగారూ కోర్టు శిక్ష: యువతిపై 12 మందితో రేప్

      పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో అత్యంత ఘోరమైన సంఘటన జరిగింది. పిటిఐ వార్తాకథనం ప్రకారం... పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలోని సుబాల్పూర్ గ్రామంలో గిరిజన యువతి మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడితో సంబంధం పెట్టుకుందని ఆరోపణతో..గ్రామ కంగారూ కోర్టు ఆమెకి రెండు వేల రూపాయల జరిమానా విధించింది. ఆ డబ్బు మొత్తం చెల్లించలేమని ఆమె కుటుంబం చెప్పడంతో... ఆ యువతిపై 12 మందితో సామూహిక అత్యాచారం జరిపించారు. ఈ సంఘటనపై గిరిజన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో...గ్రామానికి చెందిన 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

అన్నపూర్ణలోనే అక్కినేని అంత్యక్రియలు

      తెలుగుసినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలోనే జరపనున్నట్లు తెలుస్తోంది. మొదట ఎర్రగడ్డ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ...ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలోనే జరుపాలని నిర్ణయిచారు. గురువారం ఉదయం 11.30 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంచుతారు. 12 గంటలకు ఫిలిం చాంబర్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి అక్కినేని అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా తిరిగి అన్నపూర్ణ స్టూడియోకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు.

జనాలకి గ్యాస్ కొడితే ఓట్లు రాలుతాయా?

  రాహుల్ గాంధీ గత తొమ్మిదేళ్లుగా (కాంగ్రెస్ మార్క్) రాజకీయాలలో శిక్షణ పొందిన తరువాత ప్రధానమంత్రి పదవి చెప్పట్టేందుకు సిద్దపడ్డారు. కానీ ఆయన సమర్ధత గురించి ఆయన కంటే కాంగ్రెస్ కే బాగా తెలుసు గనుక, ఆయనను పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించకుండా, కేవలం ఎన్నికలలో పార్టీకి సారధ్యం వహిస్తారని ప్రకటించుకొంది. కానీ, ఆ బాధ్యతలు కూడా పూర్తిగా ఆయనకే అప్పగించే సాహసం చేయకపోవచ్చును. ఒకవేళ వచ్చే ఎన్నికలలో పార్టీ ఓడిపోతే ఆయనకు అప్రదిష్ట కలగకూడదనే ముందుచూపు కూడా ఉంది గనుక ఏదో ఒక కమిటీని ఆయనకు రక్షణ కవచంగా తొడిగి, వంది మాగధులను తోడిచ్చి ఎన్నికల యుద్ధానికి పంపవచ్చును.   అయితే, ఆయనకు దైర్యం కలగడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నిటానిక్కులు పట్టిస్తున్నా అవి అంతగా పనిచేయడం లేదనిపిస్తోంది. ఒంటిచేత్తో ఎన్నికల యుద్దంలో గెలిచేయడానికి తానేమి భీముడిని కానని ఆయన అన్నట్లు సమాచారం. ఆయన భీముడు కాకపోయినా, ప్రధాని పదవి చెప్పట్టేందుకు తాను అన్నివిధాల సమర్దుడనని నిరూపించుకొంటే సరిపోయేది. కానీ, ఆయన ఆ ప్రయత్నం చేయకుండా తను తొమ్మిదేళ్ళలో నేర్చుకొన్న కాంగ్రెస్ మార్క్ ఐడియాలనే జనాల మీద ప్రయోగిస్తున్నారు.   గుజరాత్ ఎన్నికలలో గెలిచేందుకు ఆరు సబ్సీడీ సిలెండర్లని తొమ్మిదికి పెంచినా ఫలం దక్కలేదు. అయినా ఏదో చిన్న ఆశతో ఆ తొమ్మిదిని వచ్చేఎన్నికల కోసం పన్నెండు చేయడానికి యువరాజావారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. సబ్సీడీ ఇచ్చుకొంటూ పోతే ఆయిలు కంపెనీలు మూసుకోవలసిందేనని గతంలో గట్టిగా వాదించిన ఆయిలు మంత్రి మొయిలీగారు ఇప్పుడు ఆ సంగతి మరిచిపోయి, యువరాజవారి ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని అప్పుడే ప్రకటించేసారు.   ఎన్నికలలో గెలిస్తే అప్పుడు ఎలాగూ మళ్ళీ కోతపెట్టే అవకాశం ఉంటుంది. ఓడిపోతే ఆ భారం బీజేపీ నెత్తిన పడుతుందని యువరాజవారు ఆలోచన అయిఉండవచ్చును. అయితే, పార్టీని, ప్రభుత్వాన్ని, దేశాన్ని సమూలంగా మార్చిపడేస్తానని చెపుతున్న యువరాజవారు ముందుగా ఇటువంటి ఆలోచనలను, అలవాట్లను, ట్రిక్కులను వదిలించుకొని తన మాటలకు, చేతలకు కొంతలో కొంతయినా సంబంధం ఉండేట్లు చూసుకొంటే ఆయన ఎన్నికలలో గెలవడం, ప్రధాని కావడం గురించి ఆలోచించవచ్చును. కేవలం గ్యాస్ కొట్టినంత మాత్రాన్నఓట్లు జలజల రాలిపోవని గుజరాత్ ఎన్నికలు నిరూపించాయి గనుక యువరాజవారు ఆ భ్రమలో నుండి బయటపడితే మంచిదేమో!

అక్కినేనికి శాసనసభ సంతాపం

      ప్రముఖ నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల శాసనసభ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ అక్కినేని మృతిపట్ల సంతాప తీర్మానం ప్రకటించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ విరాజిల్లడానికి అక్కినేని ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. చలనచిత్ర నటుడిగానే కాకుండా సంఘజీవిగా అక్కినేని పలు సేవలు అందించారని అన్నారు. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రాంతాలకు అతీతంగా ఇలాంటి మహనీయులను స్మరించుకోవాలని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అక్కినేని మరణం వల్ల దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని అన్నారు.