అక్కినేనికి రాజకీయ ప్రముఖుల సంతాపం

      అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు, దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరావుకు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్, చంద్రబాబు, డిప్యూటీ సీఎం దామోదర, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, చిరంజీవి, హరికృష్ణ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, డీఎస్, స్పీకర్ నాదెండ్ల , నన్నపనేని రాజకుమారి, రామానాయుడు, ఎస్పీబాలు, వైఎస్ విజయలక్ష్మి తదితరులు నివాళులర్పించారు.   ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు సంతాపం ప్రకటించారు.అక్కినేని అత్యంత ప్రతిభావంతుడని కొనియాడారు. అక్కినేని మరణం సినీ పరిశ్రమతో పాటు సమాజానికి తీరని లోటన్నారు.అక్కినేని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అక్కినేని నాగేశ్వరరావు పార్థివదేహానికి లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కినేని గొప్ప కళాకారుడే కాదు మానవత్వం మూర్తీభవించిన మహామనిషి అని కొనియాడారు. తెలుగు చలన చిత్ర వినీలాకాశంలో ఒక ధృవతార రాలిపోయిందని జేపీ అన్నారు. అక్కినేని సుదీర్ఘ నటనా ప్రస్థానం...ఆయన మరణంతో ఒక శకం ముగిసిందని తమిళనాడు గవర్నర్ రోశయ్య అన్నారు. అక్కనేని పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రపతికి కిరణ్ మరో లేఖ

      తెలంగాణ బిల్లుపై సమగ్రాభిప్రాయం తెలుసుకునేందుకు 4 వారాలపాటు గడువును తప్పనిసరిగా పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మరో లేఖ రాశారు. తాను మొదట రాసిన లేఖలో 5000 పైచిలుకు సవరణలు ప్రతిపాదించినట్లు గుర్తించామని, ముసాయిదా బిల్లుపై మొత్తం 9000 పైచిలుకు సవరణలను క్లాజుల వారీగా సభ్యులు ప్రతిపాదించారని రాష్ట్రపతికి రాసిన రెండో లేఖలో కిరణ్ వివరించారు. వీటన్నింటిపైనా సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించడంతోపాటు ఓటింగ్ నిర్వహించేందుకు వీలుగా నాలుగు వారాల గడువు అవసరమని మరోసారి విజ్ఞప్తి చేశారు.

అక్కినేని మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు: బాబు

      అక్కినేని మృతి సినీ పరిశ్రమకు, తెలుగు ప్రజలకు తీరని లోటు అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న అక్కినేని పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అక్కినేని కళారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అక్కినేని మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ శోకసంద్రలోకి వెళ్లిందని చంద్రబాబు అన్నారు. అత్యంత ఉన్నత విలువలు ఉన్న వ్యక్తి అక్కినేని అని కొనియాడారు. అక్కినేనికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అక్కినేని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాని చంద్రబాబు అన్నారు.

అక్కినేని నాగేశ్వర రావు ఆకస్మిక మృతి

  ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డా.అక్కినేని నాగేశ్వర రావు నిన్న రాత్రి నిద్రలోనే చనిపోయారు. రెండు నెలల క్రితం ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి తనకు క్యాన్సర్ వ్యాధి సోకిందని, కానీ అందుకు తాను ఎంత మాత్రం బయపడటం లేదని, పైగా ఈ వయసులో మరో పరీక్షలో నెగ్గేందుకు భగవంతుడు తనకొక మరొక గొప్ప అవకాశం ఇచ్చాడని తనదయిన శైలిలో వివరించారు. జీవితంలో అనేక పరీక్షలు దైర్యంగా ఎదుర్కొని గెలిచిన తాను, భగవంతుని, అభిమానుల ఆశీర్వాదంతో ఈ పరీక్షలో కూడా నెగ్గి నిండు నూరేళ్ళు బ్రతుకుతానని పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఆయన ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదంటే ఈ విషయం తెలిసిన తరువాత కూడా తన కొడుకు నాగార్జున, మనవడు నాగచైతన్యలతో కలిసి ‘మనం’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.   నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, నిన్న సాయంత్రం ఆయన మా అందరితో కులాసాగా కబుర్లు చెప్పారు. రాత్రి నిద్రలోనే ఆయన ప్రశాంతంగా పోయారు. ఆయన అభిమానుల సందర్శనార్ధం ఆయన దేహాన్నిఈరోజు అన్నపూర్ణా స్టూడియోలో ఉంచుతాము,” అని తెలిపారు.  

కొత్త పార్టీ దేనికో బొత్సకి తెలియదా

  గత కొద్ది రోజులుగా సమైక్యాంధ్ర పేరుతో సాగుతున్నప్రచారం గురించి పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ తనదయిన శైలిలో బాష్యం చెప్పారు. సమైక్యాంధ్ర అంటూ సీమాంధ్ర అంతటా జరుగుతున్నప్రచారం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకొనే కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రచారం మాత్రమేనని అబిప్రాయపడ్డారు. ఒకవేళ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నంలో ఎవరయినా కొత్త పార్టీ స్థాపించితే పరవాలేదు కానీ, సమైక్యం పేరుతో ఎన్నికలలో ప్రజల ఓట్లు దండుకోవడం కోసమే స్థాపిస్తే మాత్రం ప్రజల చేతిలో భంగపాటు తప్పదని అన్నారు. తమ కాంగ్రెస్ పార్టీయే స్వయంగా రాష్ట్ర విభజన చేస్తున్నపుడు దానిని అడ్డుకోనేందుకే ఎవరయినా కొత్తపార్టీ స్థాపిస్తే పరవాలేదని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మళ్ళీ అదేనోటితో సమైక్య ముసుగులో పార్టీ స్థాపిస్తే మాత్రం భంగపాటు తప్పదని హెచ్చరించడం మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది.   నిత్యం కిరణ్ కుమార్ రెడ్డితో భుజాలు రాసుకు తిరిగే బొత్ససత్యనారాయణ, ఆయన ఎవరి ప్రోద్బలంతో, దేనికోసం కొత్త పార్టీ స్థాపించబోతున్నారో తెలుసుకోలేనంత రాజకీయ అజ్ఞాని కాదు. అందువల్ల ఆయన ఈ సమైక్య కాంగ్రెస్ డ్రామాలో రెండవ అంకం మొదలుపెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లున్నారు. కానీ, నేడో రేపో వేరు కుంపటి పెట్టుకొని బయటకి పోయే కిరణ్ కుమార్ రెడ్డిని వెంటబెట్టుకొని, రాజ్యసభ అభ్యర్ధులను ఖరారు చేసేందుకు రేపు డిల్లీ వెళ్తామని బొత్స చెప్పడం కొస మెరుపు. కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎంత విధేయుడో మొన్న శాసనసభ సాక్షిగా నిరూపించుకొన్నారు. అందువల్ల బహుశః వారిరువురూ కొత్త పార్టీ గురించి చర్చించడానికే డిల్లీ వెళుతున్నారేమో ఎవరికి తెలుసు?

క్షమాభిక్ష పిటిషన్ పై సుప్రీం కీలకతీర్పు

      క్షమాభిక్ష పిటిషన్ పైన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. క్షమాభిక్ష పిటిషన్‌పైన నిర్ణయంలో జాప్యం జరిగితే మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చేందుకు ప్రతిపాదన ఉన్నట్లేనని పేర్కొంది. ఏకాంత శిక్ష అనుభవిస్తున్న వారికి మానసిక అస్వస్థత ఉంటే మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చవచ్చునని సుప్రీం వెల్లడించింది. దీంతో నలుగురు వీరప్పన్ అనుచరులు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో నిందితులు సహా మొత్తం పదిహేను మందికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైతే ఖైదీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

అవి మట్టి బొమ్మలు మాత్రమే: కేటీఆర్

  ఈరోజు శాసనసభ సమావేశంలో ట్యాంక్ బండ్ పై విగ్రహాల కూల్చివేతపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. తెరాస నేత కె.తారక రామారావు సభలో ప్రసంగిస్తూ, వేయి మంది విద్యార్ధులు చనిపోతే కనీసం పరామార్శించని సీమాంధ్ర నేతలు మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బ్యాండ్ పై నాలుగు మట్టి బొమ్మలు పగిలితే ఏదో అపచారం జరిగిపోయినట్లు గగ్గోలు పెడుతున్నారని అనడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.   కాంగ్రెస్, తెదేపా నేతలతో బాటు గండ్ర వెంకటరమణ వంటి కొందరు టీ-కాంగ్రెస్ నేతలు సైతం కేటీఆర్ మాటలు అహంకారపూరితంగా ఉన్నాయని,వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా బలవంతంగా, కుట్రపూరితంగా కలపబడిందన్న కేటీఆర్ వ్యాక్యలను డొక్కా మాణిక్యవర ప్రసాద్ వంటి సీమాంధ్ర నేతలు తీవ్రంగా ఖండించారు. కానీ, కేటీఆర్ మాత్రం తను మాట్లాడిన మాటలలో ఎటువంటి తప్పులేదని, నూటికి నూరు శాతం అది నిజమని, దానికే తను కట్టుబడి ఉంటానని వాదించడంతో సభలో మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో సభ కొంతసేపు వాయిదాపడింది.   మళ్ళీ సమావేశమయినప్పుడు ఈసారి తెరాస నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, సీమాంధ్ర నేతలు చివరికి ట్యాంక్ బండ్ పై ఒక్క తెలంగాణా నేత విగ్రహం కూడా పెట్టకపోవడం గమనిస్తే తెలంగాణా ఎంత వివక్షకు గురవుతోందో అర్ధమవుతుందని అన్నారు. తెదేపా నేత నరేంద్ర ఆయన మాటలకు జవాబు చెపుతూ, ట్యాంక్ బండ్ పై ఉన్న రాణీ రుద్రమదేవి, భక్త రామదాసు, మక్దూం మోయుద్దీన్ తదితరులు తెలంగాణా ప్రాంతానికి చెందివారు కాదా? అని ప్రశ్నించారు. ప్రముఖ కవి మరియు అచ్చమయిన తెలంగాణా వ్యక్తి సినారె విగ్రహాల స్థాపన కమిటికీ అధ్యక్షుడని, ఆ కమిటీలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఒక సభ్యుడని గుర్తుచేసి, మరి ఆయన ఏనాడు కూడా తెలంగాణా ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. మహనీయుల విగ్రహాలను మట్టి బొమ్మలనే తెరాస నేతలు ముందుగా సంస్కారం నేర్చుకోవాలని తెదేపా, కాంగ్రెస్ నేతలు హితవు పలికారు.   మంచి మాటకారి అయిన కేటీఆర్, నేర్పుగా చర్చను పక్కదారి పట్టిస్తూ, బ్రతికి ఉన్న మనుషులకు సమాధులు కట్టే కాంగ్రెస్ వారి నుండి, స్వర్గీయ యన్టీఆర్ పై చెప్పులు విసిరించిన తెదేపా నేతల నుండి తాము సంస్కారం నేర్చుకోవలసిన అవసరం లేదని, ముందుగా వారే నేర్చుకొని సభకు క్షమాపణ చెపితే బాగుంటుందని జవాబీయడంతో, కాంగ్రెస్, సీమాంధ్ర సభ్యులు కేటీఆర్, తెరాసకు వ్యతిరేఖంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అయితే కేటీఆర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. మంద బలమతో తమ గొంతు నోక్కేయలేరని అనడంతో సభలో గందరగోళం మొదలయింది.

ముఖ్యమంత్రిని కలవనున్న వల్లభనేని వంశీ

  తెదేపా నేత వల్లభనేని వంశీ ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి ఐజీ సీతారామాంజనేయులపై పిర్యాదు చేయబోతున్నారు. గతంలో కమీషనర్ ఆఫ్ పోలీసుగా చేసి పదోన్నతి పొంది ఐజీగా ఉన్న సీతారామాంజనేయులుతో వంశీకి చాలా కాలంగా విభేదాలున్నాయి. ఇప్పుడు తాజాగా అవి మరో మారు బయటపడ్డాయి. సీతారామాంజనేయులు తనను మాజీ నక్సల్స్ తో హత్య చేయించాలని చూస్తున్నారని, అందువల్ల తనకు ఐజీ సీతారామాంజనేయుల నుండి ప్రాణహాని ఉన్నందున తగిన భద్రత కల్పించాలని కోరుతూ వంశీ డీజీపీకి లికితపూర్వకంగా నిన్న పిర్యాదు చేసారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిసి వినతి పత్రం ఈయనున్నారు.

పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేకపోతే..

  డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆమాద్మీ పార్టీ నేతలు, నలుగురు పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయమని కోరుతూ మొదలుపెట్టిన పదిరోజుల దీక్ష మొదలుపెట్టారు. ఇంతకాలం డిల్లీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ చేతిలోనే ఉంది గనుక, పోలీసు వ్యవస్థ డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోఉన్నపటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడలేదు. కానీ, కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన ఆమాద్మీప్రభుత్వం కాంగ్రెస్ పార్టీనే డ్డీకొనడంతో సమస్య మొదలయింది.   ఈ ఘర్షణ వెనుక ఆమాద్మీ పార్టీ ఉద్దేశ్యాలు ఏవయినప్పటికీ, పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో లేకపోయినట్లయితే ఏమవుతుందో కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లులో పదేళ్ళపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండబోయే హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలపై సర్వాధికారాలు గవర్నర్ చేతిలోనే ఉంటాయని కేంద్రం చేసిన ప్రతిపాదన వల్ల కూడా మున్ముందు ఇటువంటి సమస్యలే తలెత్తవచ్చును. కాంగ్రెస్ వచ్చేఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాననే నమ్మకం లేకపోవడం వలననో లేక ఎన్నికలలోగా బిల్లుని ఆమోదింపజేసుకోవాలనే హడావుడి వలననో బిల్లులో ఇటువంటి అసంబద్దమయిన అనేక ప్రతిపాదనలు చేసి చేతులు దులుపుకొంది. వాటిపై తెలంగాణా నేతలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఇంతవరకు వివిధ పార్టీలకు చెందిన శాసనసభ్యులందరూ బిల్లుపై దాదాపు 5000 సవరణలను ప్రతిపాదించారంటే బిల్లు ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్ధం అవుతోంది. ఇప్పుడు డిల్లీలో ఆమాద్మీ పార్టీ చేస్తున్న ధర్నాతో ఒక సమస్య బయటపడింది.

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

      రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 7న పోలింగ్ జరుగనుంది. నేటి నుంచి ఈనెల 28 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మన రాష్ట్రంలో మొత్తం6 స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. శాసనసభ బలాబలాలను చూస్తే.. రాష్ట్రంలో ఉన్న ఆరు ఖాళీలకు మూడు కాంగ్రెస్‌కు, రెండు టిడిపికి దక్కడం ఖాయం. మిగిలిన ఒక స్థానం కోసం వైకాపా, టీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడి అభ్యర్ధిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. దీనిపై రెండు పార్టీల మధ్య రహస్య మంతనాలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

4 వారాల గడువొద్దు: హోంశాఖ

    తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చకు మరో నాలుగువారాలు గడువు కావాలని రాష్ట్రప్రభుత్వం రాష్ట్రపతిని కోరింది. దీనిపై రాష్ట్రపతి హోంశాఖ అభిప్రాయం కోరగా...రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు రాష్ట్రపతి నాలుగు వారాల గడువిస్తే మాత్రం పార్లమెంట్ సమావేశాలు వచ్చే 21తో ముగుస్తున్నందున తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ఆస్కారం ఉండదని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నాలుగు వారాల అదనపు గడువిస్తే ఆ తర్వాత ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి పార్లమెంట్ సమావేశాలు ముగిసే అవకాశముంది. సాధారణంగా ఓటాన్ అకౌంట్ సమావేశాలే చివరివి. ఈ ప్రభుత్వ హాయంలో మరోసారి పార్లమెంట్ సమావేశాలకు అవకాశం లేనందున ఇప్పుడే బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. అయితే గడువు పెంచరాదని, తెలంగాణ నేతలు పార్టీలకు అతీతంగా కోరుతున్నారు. కాంగ్రెస్ నేతలు, టిడిపి ఎమ్మెల్యేలు దీనిపై లేఖలు రాశారు.

బాబుకు మద్దుతుగా యువచైతన్య సదస్సు

  కాంగ్రెస్ అవినీతి పాలనతో రావణకాష్టంలా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబును మళ్ళీ అధికారంలోకి రావాలని యువత కోరుకుంటుంది. ఆయనకు మద్దుతుగా ఐటీ మరియు ఇతరరంగాలకు చెందిన యువకుల కలిసి ఈనెల 25న కూకట్ పల్లిలో హౌసింగ్ బోర్డు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యువచైతన్య సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సు కు ముఖ్య వాలంటీరుగా నారా లోకేష్ ను ఆహ్వానించనున్నారు.  ఇందుకోసం  www.bringbabuback.org ఒక వెబ్ సైట్ ను కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా ''బాబును మళ్ళీ తెచ్చుకుందాం...రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుందాం'' అన్న నినాదంతో యువతను ముందుకు రావాలని కోరుతున్నారు. దీనికి కూడా మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎనిమిది వేలమంది వెబ్ సైట్ ద్వారా ముందుకు వచ్చారు.                                           

మజ్లిస్ పార్టీకి ఊపిరిపోసిన సల్మాన్ ఖాన్

  కొద్ది రోజుల క్రితం బాలివుడ్ హీరో సల్మాన్ ఖాన్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కలిసి అహ్మదాబాద్ లో నిర్వహించిన పతంగుల పండుగలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోడీ మంచి సమర్దుడయిన పరిపాలకుడని, ఆయన ప్రధానమంత్రి అయినట్లయితే దేశం అన్ని రంగాలలో అభివృద్ధిపధంలో దూసుకుపోతుందని మోడీని తెగ పొగిడేశారు. ముస్లిం మతస్తుడయిన సల్మాన్ ఖాన్ వంటి ఒక ప్రసిద్ద నటుడు నరేంద్ర మోడీకి ఆవిధంగా మద్దతు ప్రకటించడం చాలా మంది జీర్ణించుకోలేకపోయినప్పటికీ, సల్మాన్ ఖాన్ వ్యక్తిగత అభిప్రాయాన్ని ఖండించడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, సల్మాన్ ఖాన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ “నరేంద్ర మోడీకి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది గనుక 2002లో జరిగిన అల్లర్లకు బాధ్యత వహిస్తూ ఆయన గుజరాత్ ప్రజలకు క్షమాపణ చెప్పనవసరం లేదు,” అన్నట్లు వచ్చిన వార్తలు మోడీ ప్రత్యర్ధులకు ఒక ఆయుధం అందించింది.   మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, తమ పార్టీని రాష్ట్రమంతటా విస్తరించి, వచ్చే ఎన్నికలలో ముస్లిం ప్రజల ఓట్లను పొంది, రాష్ట్ర, జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఆశపడ్డారు. మర్రి నీడవంటి కాంగ్రెస్ క్రింద ఎంతకాలం ఉన్నా తమ పరిస్థితిలో మార్పు ఉండదని భావించిన ఓవైసీ సోదరులు కిరణ్ కుమార్ రెడ్డితో గిల్లికజ్జాలు పెట్టుకొని కాంగ్రెస్ నుండి బయటపడ్డారు, కానీ ఊహించనివిధంగా అనేక చిక్కులో పడ్డారు. నాటి నుండి నేటివరకు తగిన అవకాశం కొరకు వారు చాలా ఓపికగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మోడీని వెనకేసుకురావడంతో దొరికిన అవకాశాన్ని అందుకొని, అసదుద్దీన్ ఓవైసీ వారిరువురిపై నిప్పులు చెరిగారు. “ఈ సినిమా హీరోలు తామే అసలయిన హీరోలని భావిస్తుంటారు. కానీ ముస్లిం ప్రజలకు అల్లా ఒక్కడే నిజమయిన హీరో. ఇటువంటి నీచులు వేలాది ముస్లిం ప్రజల మరణానికి కారకుడయిన మోడీ వెనుక, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం తోక ఊపుకొంటూ తిరుగుతారు. కానీ, దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం ప్రజలు ఎవరూ కూడా వారి వెనుక వెళ్లరు. నరేంద్ర మోడీకి కోర్టులు క్లీన్ చిట్ ఇవ్వొచ్చుగాక, సల్మాన్ ఖాన్ వంటి ముస్లిం వ్యక్తులతో క్లీన్ చిట్ ఇప్పించుకోవచ్చుగాక. కానీ జరిగిన దారుణాన్ని ముస్లిం ప్రజలెన్నడూ మరిచిపోలేరు. మోడీని క్షమించలేరు,” అని అన్నారు.   నరేంద్ర మోడీని, బీజేపీని తీవ్రంగా ద్వేషించే అసదుద్దీన్ ఓవైసీ ఈవిధంగా విరుచుకుపడటం సహజమే కావచ్చు. కానీ, బీజేపీ ప్రధాని అభ్యర్ధి అయిన నరేంద్ర మోడీపై ఆయన ఈవిధంగా తీవ్ర విమర్శలు గుప్పించడం ద్వారా మోడీపై తన ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాటు, పనిలోపనిగా యావత్ ముస్లిం ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాను, తన పార్టీయే ముస్లిం ప్రజలకు అసలు సిసలయిన ప్రతినిధులమని, తాము మాత్రమే వారి కోసం ఎంతటి వారినయినా దైర్యంగా డ్డీకొని పోరాటం చేయగలమని ముస్లిం ప్రజలకు నమ్మకం కలిగించేందుకే అసదుద్దీన్ సల్మాన్ ఖాన్, మోడీలపై అంత తీవ్రంగా విరుచుకుపడ్డారని చెప్పవచ్చును.   సల్మాన్ ఖాన్ నరేంద్ర మోడీని వెనకేసుకు రావడం వలన మోడీకి, బీజేపీకి మేలు కలుగుతుందో లేదో, ముస్లిం ఓట్లు పడతాయో లేదో ఇప్పుడే చెప్పలేకపోయినా, ఆయన చేసిన వ్యాక్యల వల్ల మజ్లిస్ పార్టీకి మళ్ళీ ఊపిరి అందించినట్లయిందని ఖచ్చితంగా చెప్పవచ్చును.

బిజెపిలో ఎంతకాలం.. జీవితా రాజశేఖర్..‌!

      సినీ దంపతులు జీవిత, రాజశేఖర్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే వీరి చేరికపై రాజకీయ, సినీ వర్గాలలో బిన్నవాదనలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వీరు..టిడిపిలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. కాని అవి ఫలించకపోవడంతో..ఈరోజు బిజెపిలో అధికారకంగా చేరినట్లు తెలుస్తోంది. మోదీ మేనియాతో చాలా మంది ప్రముఖులు బిజెపి పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి..వైఎస్ జగన్ వెంటనడిచారు. కాని వారికి జగన్ ప్రాధాన్యత ఇవ్వపోవడంతో ఆయనకి కూడా దూరమయ్యారు. ఎట్టకేలకు ఈ రోజు బిజెపిలో చేరారు. కాకపోతె ఈ పార్టీలో ఎంతకాలం వుంటారో అన్న చర్చలు  మొదలయ్యాయి..! 

సోనియాను వెనుకేసుకొచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి

  నేడో రేపో వేరు కుంపటి పెట్టుకొని కాంగ్రెస్ నుండి బయటపడబోతున్నట్లు చెప్పబడుతున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఈరోజు శాసనసభలో తెదేపా నేత పయ్యావుల కేశవ్ సోనియా గాంధీ విదేశీ పౌరసత్వం గురించి విమర్శిస్తున్నపుడు, ఆమె భజనలో తరిస్తున్న టీ-కాంగ్రెస్ నేతల కంటే ముందుగా లేచి ఆమెకు మద్దతుగా మాట్లాడటం విశేషం. ఆమెకు భారతీయ పౌరసత్వం ఉందని సుప్రీం కోర్టే ద్రువీకరించిందని, అందువల్లే ఆమె యంపీగా, పార్టీ అధ్యక్షురాలిగా, యూపీయే చెయిర్ పర్సన్ గా కొనసాగుతున్నారని అన్నారు. ఆమె తనకు ప్రధానమంత్రి పదవి చెప్పట్టే అవకాశం ఉన్నపటికీ, ఆమె వద్దనుకొనడం వలననే పీవీ నరసింహరావు ప్రధాని కాగలిగారని అన్నారు.   రాష్ట్ర విభజన అంశంపై మొదటి నుండి ఆమెతో విభేదిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డి, ఎన్నడూ కూడా నేరుగా ఆమె పేరు ఎత్తకుండానే అధిష్టానం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నఈ సమయంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఆమెపై అచంచల విశ్వాసం చూపడం విశేషమే. బహుశః అందుకే కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి అత్యంత విదేయుడయిన, క్రమశిక్షణ గల నేత అని దిగ్విజయ్ సింగ్ సర్టిఫికేట్ కూడా జారీ చేసారు. అదే నిజమయితే, త్వరలో కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోతున్న కొత్త రాజకీయ పార్టీ కూడా కాంగ్రెస్ కోసమే పుట్టబోతునట్లు అర్ధమవుతుంది.

జగన్ కు సబ్బం హరి వార్నింగ్

  కాంగ్రెస్ యంపీ సబ్బం హరి నిన్నమొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తూ, వచ్చే ఎన్నికలలో వైకాపా టికెట్ మీదనే పోటీ చేస్తానని చెపుతూ ఉండేవారు. కానీ, వైకాపా ఆయన మొహం మీదనే తలుపులు వేసేసిన తరువాత నుండి క్రమంగా ఆయన జగన్మోహన్ రెడ్డిపై కత్తులు దూస్తున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని, వైకాపాను పొగిడిన నోటితోనే, ఇప్పుడు జగన్ ఆర్ధిక నేరగాడని, అందుకే తాను తొందరపడి రాజీనామా చేయలేదని అన్నారు. అంతే గాక జగన్ చేతిలో పత్రిక ఉంది కదాని తనపై లేనిపోని రాతలు వ్రాస్తే జగన్ బండారం బయటపెడతానని వార్నింగ్ కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో రహస్య అవగాహన ఉందనే సంగతిని కూడా ఆయన దృవీకరించారు. కానీ, దానిని జగన్ సమర్ధంగా దాచిపుచ్చలేకపోవడం వలననే ఆయనకు జనాదరణ తగ్గిపోయిందని అన్నారు. ఏమయినప్పటికీ రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నపుడల్లా, సదరు పార్టీల గురించి, వాటి నేతల గురించీ సామాన్య ప్రజలకు తెలియని అనేక బ్రహ్మరహస్యాలు బయటపెడుతూ, వారి అసలు రంగు తెలుసుకొనే అవకాశం కల్పిస్తుంటారు. ఒకవేళ వైకాపా సబ్బం హరి మొహం మీద తలుపులు వేసి ఉండకపోయుంటే, ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ ఆయన ప్రత్యర్ధులను తిడుతూ ఉండేవారేమో! ప్రస్తుతం సబ్బం హరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, సమైక్యాంధ్ర కోసం ఆయన చేస్తున్న కృషిని పొగుడుతున్నారు. గనుక, ఆయన కిరణ్ పెట్టబోయే కొత్తపార్టీలో చేరబోతున్నారనుకోవాల్సి ఉంటుంది.

విభజనతో నిజాంకేం సంబంధం: ఓవైసీ

      అసెంబ్లీ లో తెలంగాణ బిల్లుపై చర్చ సంధర్బంగా కొంతమంది నేతలు నిజాం పేరును ప్రస్తావించడంపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు కారణమైన వారిని వదిలేసి నిజాం పేరును ప్రస్తావించడం ఎందుకు అని ప్రశ్నించారు. ప్రస్తుత రాష్ట్ర విభజనకు నిజాంకు సంబంధం లేదని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. చైనాతో పోరాడేందుకు 120 కేజీల బంగారాన్ని నిజాం ఇచ్చారని, మానినగాయాలు మళ్లీ గుర్తు చేయవద్దని అక్బరుద్దీన్ అన్నారు. హైదరాబాదును జవహర్ లాల్ నెహ్రూ మినీ ఇండియా అన్నారని గుర్తు చేశారు. నిజాం గుడ్ లీడర్, గుడ్ రూలర్ అన్నారు.   తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా దీనిపై స్పందించారు. వరంగల్ లో బతుకమ్మ ఆడుతున్న తెలంగాణ పడుచులను బట్టలిప్పించి బతుకమ్మ ఆడించి నిజాంను పొగడటం అంటే తెలంగాణ ప్రజలను మోసగించడం, అవమానించడమే అన్నారు. నిజాం అనే వాడు కట్టిన విద్యుత్ ప్లాంటు ఆయన ప్యాలెస్ వెలుగుల కోసం, ఆయన కట్టిన నీటి ప్రాజెక్టు ఆయనకు నచ్చిన వ్యవసాయ క్షేత్రాల కోసం, ఆయన కట్టిన ఆర్ట్స్ కాలేజీ తెలంగాణలో ఉన్న భూస్వాముల కోసం, తనకు నచ్చిన వారికోసమని అన్నారు.

ఎర్రబెల్లి అంతర్యం ఏమిటి?

  ఈ రోజు తెదేపా నేత పయ్యావుల శాసనసభలో చేసిన ప్రసంగంలో తెరాసను తీవ్రంగా పట్టుబట్టారు గనుక తెరాస నేతలు ఆయనను వ్యతిరేఖించడం సహజమే. కానీ, తేదేపాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పయ్యావుల ప్రసంగాన్నితీవ్రంగా వ్యతిరేఖిస్తూ మాట్లాడటం విశేషం. తెదేపా నేతలు ప్రాంతాల వారిగా చీలిపోయినా, నేటికీ ఒకే పార్టీ గొడుగు క్రింద అందరూ కొనసాగుతున్నారు. అటువంటప్పుడు ఎర్రబెల్లి మీ సీమాంధ్ర పెత్తనం మాకవసరం లేదని నిర్ద్వందంగా చెప్పడమే కాకుండా ఏ కర్నూలుకో వెళ్ళి రాజధాని ఏర్పాటు చేసుకోమని పయ్యవులకు ఒక ఉచిత సలహా కూడా ఇవ్వడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన పయ్యావులని ఉద్దేశ్యించి అన్నపటికీ, తెలంగాణాలో కూడా తెదేపాను నిలబెట్టుకొందామని ఆరాటపడుతున్నచంద్రబాబుకి కూడా ఆయన అదే మాట చెప్పదలచుకొన్నారా? అనే ప్రశ్నతలెత్తుతుంది. ఎర్రబెల్లి ఉద్దేశ్యం అదే అయినట్లయితే మరటువంటప్పుడు ఆయన ఇంకా తెదేపాలో కొనసాగడంలో ఔచిత్యమేమిటి? తెలంగాణపై సీమాంధ్రుల పెత్తనాన్ని ఖండిస్తున్నఎర్రబెల్లి మరి ఇంకా చంద్రబాబు క్రింద ఎందుకు పనిచేస్తున్నట్లు? అని ప్రశ్నిస్తే వేరే గత్యంతరం లేకనే అని అనుకోవలసి వస్తుంది.   నాగం జనార్ధన్ రెడ్డి, దేవేందర్ గౌడ్ తదితరులు పార్టీని వీడి బయటకి వెళ్లి ఏవిధంగా అపసోపాలు పడ్డారో చూశారు. గతేడాది తెదేపాను వీడి తెరాసలో చేరిన కడియం శ్రీహరి పరిస్థితి ఏమిటో కూడా స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఇవన్నీ చూసిన తరువాత ఎర్రబెల్లి అంత సాహసం చేయలేకపోతున్నారు. అందువల్ల వేరే పార్టీలోకి వెళ్లేందుకు లేదా స్వయంగా పార్టీని స్థాపించేందుకో సాహసం చేయలేని ఎర్రబెల్లి సీమాంధ్ర పెత్తనాన్నిసహించబోమని చెపుతున్నపటికీ, తెదేపా అండదండలు లేకపోతే తన రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుందనే సంగతి గ్రహించినందునే ఆయన ఇంకా తెదేపాను అంటిపెట్టుకొన్నారని భావించవచ్చును. అంతే గాక, ఒకవేళ రాష్ట్రం విడిపోయి తెలంగాణా ఏర్పడితే అక్కడ తెదేపాకు తానే నేతృత్వం వహించాలనే ఆశ కూడా ఉండి ఉండవచ్చును. కానీ ఒక అచ్చమయిన తెలంగాణావాదిగా అప్పుడప్పుడు ఈవిధంగా తన అక్కసు వ్రేళ్లగ్రక్కుతుంటారు.

శాసనసభలో పయ్యావుల ప్రసంగం

  ఈ రోజు శాసనసభలో రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ తెదేపా సభ్యుడు పయ్యావుల కేశవ్ అనర్గళంగా ప్రసంగించారు. తెలంగాణా సాయుధ పోరాటం మొదలుకొని సమైక్యాంధ్ర కోసం జరిగిన పెద్దమనుషుల ఒప్పందం, సాగునీరు, ప్రాజెక్టులు, అభివృద్ధి తదితర అనేక అంశాల గురించి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండటం వలన ఏవిధంగా తెలంగాణా అభివృద్ధి జరిగిందో వివరించారు. అలనాడు పటేల్ పట్వారీ పెత్తందారులకు, దొరలకు వ్యతిరేఖంగా ప్రజలు పోరాటం చేసారని, ఆ తరువాత స్వర్గీయ యన్టీఆర్ హయాంలో ఆ వ్యవస్థలను రద్దు చేసారని, కానీ మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ వంటి దొరలు పుట్టుకొచ్చారని ఆయన తెరాస నేతలకు చురకలు వేసారు. వారు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం చరిత్రను వక్రీకరించి, ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించి ఉద్యమాలు నడిపి, మళ్ళీ పెత్తందారీ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు తహతహలాడుతున్నారని పయ్యావుల ఆరోపించారు. సోనియాగాంధీ కొడుకు కోసమో, విజయమ్మ కొడుకు కోసమో లేకపోతే కేసీఆర్ కొడుకు కోసమో రాష్ట్ర విభజన చేయడం సరికాదని ఆయన వాదించారు. చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టుకి వ్యతిరేఖంగా పోరాటం చేసి జైలుకి కూడా వెళితే, కేసీఆర్ తెలంగాణా ప్రజల కోసం ఏమి చేసారో చెప్పాలని పయ్యావుల నిలదీశారు.   స్వర్గీయ యన్టీఆర్, చంద్రబాబు ఇద్దరూ కూడా తెలంగాణాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి చిత్తశుద్ధితో కృషి చేసినందునే నేడు ఇంత అభివృద్ధి జరిగిందని ఆయన గుర్తు చేసి, మరి అటువంటప్పుడు సీమాంధ్ర నేతలు, ప్రజలు తెలంగాణాను దోచుకుతింటున్నారని తెరాస నేతలు ఏవిధంగా ఆరోపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.