మోహన్ బాబు కేసు: పద్మశ్రీ తొలగించాలని కోర్టు ఆదేశం

      సినీ నటులు మోహన్ బాబు, బ్రహ్మానందం ‘పద్మశ్రీ' అవార్డును దుర్వినియోగం చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా సినిమా టైటిళ్లలో వారి పేర్ల ముందు ‘పద్మశ్రీ' వేసుకున్నారన్న వివాదానికి సంబంధించి, హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. తాజా విచారణ అనంతరం, ‘దేనికైనారెడీ’ సినిమా టైటిల్స్‌ నుంచి మోహన్‌బాబు, బ్రహ్మానందం పేర్ల ముందున్న పద్మశ్రీని తొలగించాలని ఆదేశించింది. టైటిల్స్‌లోని ‘పద్మశ్రీ’ పేరు వాడకంపై అఫిడవిట్‌ సమర్పించాలంటూ బ్రహ్మానందంకు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. సినిమా టైటిల్స్‌ నుంచి పద్మశ్రీ తొలగించి, ఆ విషయాన్ని పత్రికల్లో ప్రకటన వచ్చేలా చేయాలనీ చిత్ర నిర్మాతలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

కావూరిని కౌగలించుకుందెవరు: రేవంత్‌

      తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసుకుంటూ వెళ్తోందని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు కల సాకారమైతే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారని, టీఆర్ఎస్‌ను విలీనం చేయాలని కాంగ్రెస్ నేతలే కోరుతున్నారని ఆయన తెలిపారు. సమైక్యవాది కావూరిని సిరిసిల్లలో కేటీఆర్ కౌగిలించుకున్న మాట వాస్తవం కాదా? ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కిరణ్, జగన్ కలిసి చంద్రబాబుపై కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. తెలుగు ప్రజలను ఆదుకునే పార్టీ టీడీపీ అని ఆయన చెప్పారు. తెలంగాణకు టీడీపీ అనుకూలమంటే సీమాంధ్రకు అన్యాయం చేయడం కాదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

కేజ్రీవాల్ కు అస్వస్థత

      ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన కేజ్రీవాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం కార్యాలయానికి హాజరుకాలేకపోయారు, ఆయన జ్వరంతో భాదపడుతున్నారు. ప్రతి ఇంటికి 700 లీటర్లు నీరు ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఢిల్లీ జల బోర్డు అధికారులతో ఆయన సమావేశమై ఈరోజు చర్చలు జరపాల్సివుంది. కేజ్రీవాల్ నివాసం నుంచే కొన్ని ముఖ్యమైన వాటిపై చర్చలు జరిపారు. ఆదివారం నుంచి తనకు 102 జ్వరం ఉందని ఆయన ఈరోజు ఉదయం ట్విటర్‌లో తెలిపారు. సోమవారం ఆఫీస్‌కు హాజరవడం చాలా ముఖ్యమని, నీటీ విషయంలో ప్రకటన చేయాలన్న ఆలోచనలో ఉన్నామని, దేవుడు నన్ను ఇదే సమయంలో అనారోగ్యవంతుణ్ణి చేశాడని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. డాక్టర్స్ తనకు రక్తపరీక్షలు నిర్వహించి, విశ్రాంతి అవసరమని సూచించారని ఆయన తెలిపారు.

సోనియాకు 'అపరిచితుడి' శిక్షలు

      విచిత్ర వేషధారణలతో 'సమైక్య' వాణి వినిపిస్తున్న తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్.. ఆదివారం జరిగిన ప్రజా గర్జన సభలో'అపరిచితుడి' వేషం కట్టి అలరించారు. సంప్రదాయాలు తప్పి విభజన ప్రక్రియను నడిపిస్తున్నారంటూ సోనియాగాంధీకి శిక్షలు ప్రకటించాడు. ఏఐసీసీ అధ్యక్షురాలికి 'కుంభీపాకం' తప్పదని హెచ్చరించాడు. అంతేకాదు... 'భలే మంచి చిచ్చు పెడితివే... ఓ సోనియమ్మ! అన్నదమ్ముల వంటి తెలుగు ప్రజలమధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తుంటివే! సీమాంధ్ర ప్రజలపై శఠగోపం పెట్టి చోద్యం చూస్తుంటివే! రెండుసార్లు గెలిపించిన రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని యోచిస్తివే!' అంటూ పాట కూడా అందుకున్నారు.

దేవదేవుని సన్నిధిలో 'బాబు గర్జన'

      దేవదేవుని సన్నిధిలో ప్రజా గర్జన ప్రారంభమైందని, తెలుగుదేశం ఈ మహయజ్ఞాన్ని ప్రారంభించిందని, అందరూ భాగస్వాములు కావాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఆదివారం జరిగిన ప్రజా గర్జన సభలో పిలుపునిచ్చారు. సుదీర్ఘ సమయం ప్రసంగించిన చంద్రబాబు ఆద్యంతం పూర్తి ఉద్రేకంగా మాట్లాడారు. బాబు ప్రసంగం ఇప్పటిదాకా ఆయన చేసిన వాటికి భిన్నంగా సాగింది. జనాన్ని తరచూ ప్రశ్నలు వేస్తూ వారి నుంచి సమాధానాలు రాబడుతూ నేరుగా వారితోనే మాట్లాడిన అనుభూతిని కల్పించారు. ఆయన ఉపన్యాస ధోరణి గతానికి పూర్తి భిన్నంగా ఉండి జనాన్ని బాగా ఆకట్టుకుంది.   మరోవైపు వేదికపైకి వచ్చినప్పటి నుంచీ బాబు ఆద్యంతం ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించారు. తరచూ చిరునవ్వులు చిందిస్తూ జనానికి విజయసంకేతం చూపిస్తూ అభివాదం చేశారు. ఆయన పలకరింపులకు ప్రతిగా జనం రెచ్చిపోయి కేరింతలు కొట్టారు. టీడీపీ విజన్ 2020 తయారు చేస్తే కాంగ్రెస్ దొంగలు విజన్ 420 తయారు చేశారంటూ 2004 నుంచి కాంగ్రెస్ పాలనను, ప్రత్యేకించి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను దృష్టిలో ఉంచుకుని విమర్శన్ద్మాలు సంధించారు. సోనియా గాంధీకి ప్రజలు దయతో ఓటు వేస్తే అనకొండ పాము కంటే భయంకరంగా దేశమంతా వేలాది అనకొండలను తయారు చేసిందని, వాటిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకటైతే సోనియా అల్లుడు రాబర్ట్ వాధ్రా ఇంకొకటని దెప్పి పొడిచారు. పిల్ల అనకొండ జగన్ అంటూ వర్ణించారు. ఈ అనకొండలు దేశాన్ని మింగేస్తున్నాయని, జగన్ వందలాది కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఒకవైపు కాంగ్రెస్, వైకాపాపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తూనే ఇంకోవైపు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేయదలచారో వాగ్దానాలు, హామీల రూపంలో చెప్పారు. తమను గద్దెనెక్కిస్తే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామంటూ సామాన్యులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీ చేస్తామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తామని, ఉచితంగా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీల వర్షం కురిపించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే బాధ్యత తనదే అని, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. బీసీ డిక్లరేషన్ తమ పార్టీయే ఇచ్చిందని, పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన లక్షహ్యొం అని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో అంటీముట్టనట్టుగా మాట్లాడే చంద్రబాబు తిరుపతి సభలో విభజన సమస్యల గురించి చాలాసేపే మాట్లాడారు. రాష్ట్రం విడిపోవాలంటే సీమాంధ్రకు న్యాయం జరగాలని, సమైక్యంగా ఉండాలంటే తెలంగాణకు న్యాయం చేయాలని, వీటిలో ఏది జరగాలన్నా రెండు ప్రాంతాల వారినీ ఒక చోటికి చేర్చి ఒప్పించాలని అనడం జనానికి నిజమే కదా అనిపించేలా చేసింది. చివరన చంద్రబాబు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామంటూ ప్రతిజ్ఞ చేయించినపుడు కూడా జనం ఉత్సాహంగా లేచి నిలుచుని ప్రతిజ్ఞ చేశారు.

అన్నాహజారే మనసు కరుగుతోందా

  ఒకప్పుడు అన్నాహజారేతో కలిసి జనలోక్ పాల్ బిల్లుకోసం ఉద్యమించిన అరవింద్ కేజ్రీవాల్, ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలను పనిచేయించలేమని గ్రహించి, మార్పు తేవాలంటే స్వయంగా రాజకీయాలలో ప్రవేశింఛి అందుకు కృషి చేయడమే మార్గమని భావించడంతో, నాటి నుండి వారిరువురి దారులు వేరయిపోయాయి. ఆ తరువాత గత ఏడాది కాలంగా డిల్లీ ప్రజల సమస్యలపై అరవింద్ కేజ్రీవాల్ అనేక పోరాటాలు చేసారు కూడా. కానీ అవన్నీదున్నపోతు మీద వానలాగే డిల్లీ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి. ఆ తరువాత ఆయన ఆమాద్మీ పార్టీని స్థాపించడం, దానితో డిల్లీ ప్రజలందరూ మమేకం కావడం, ఆయన డిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నీచకచకా జరిగిపోయాయి.   ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టిననాటి నుండి ఆయన అయన అనుచరుల నిజాయితీతో కూడిన మాటలు, చేపడుతున్న చర్యలు చూసిన తరువాత బహుశః అన్నాహజారే మనసు క్రమంగా కరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఇటీవల ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “వ్యక్తులు రాజకీయాలలోకి చేరడం నేరమని నేను భావించడం లేదు. కానీ వాటిలో చేరిన తరువాత వారి ప్రమేయం లేకుండానే అవినీతి, లంచగొండితనమూ,అధికార లాలసలో మునిగిపోతారనే ఉద్దేశ్యంతోనే నేను రాజకీయాలలో చేరడాన్ని వ్యతిరేఖిస్తున్నాను. అయితే అరవింద్ కేజ్రీవాల్ ని నేను చాలా కాలంగా చూస్తున్నాను. ఆయన చాలా నీతి, నిజాయితీ గల వ్యక్తి. ఇప్పుడు కూడా ఆయన అదేవిధంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వంలో అవినీతిని పారద్రోలి మిగిలిన రాజకీయ నేతలకు పార్టీలకు ఆదర్శంగా నిలవాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు.   అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్స్వానికి కూడా హాజరవడానికి ఇష్టపడని అన్నాహజారే ఇప్పుడు ఈవిధంగా మాట్లాడటం చూస్తే కొంచెం మెత్తబడుతున్నట్లు అర్ధం అవుతోంది. బహుశః అరవింద్ కేజ్రీవాల్ మాటలలో నిజాయితీని అన్నాహజారే గుర్తించినందునే ఆయనలో ఈ మార్పు వచ్చినట్లు కనబడుతోంది. ప్రభుత్వం మరియు ఇతర వ్యవస్థల నుండి అవినీతిని పారద్రోలడం తన ఒక్కడివల్లే కాదని, అందుకు అందరూ కలిసి కృషి చేద్దామని అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపుకు, అన్నాహజారే కూడా సానుకూలంగా స్పందించినట్లు భావించవచ్చును.   ఇద్దరి గమ్యం ఒకటే గనుక, ఆయన కూడా ఆమాద్మీ ప్రభుత్వం వెనుక నిలబడితే ఇక ప్రక్షాళణా కార్యక్రమం వేగవంతమవుతుంది. అదేసమయంలోల్ అమాద్మీ ప్రభుత్వం గాడి తప్పితే హెచ్చరిస్తూ ఉండవచ్చును. అంతేగాక అన్నాహజారే వచ్చిఆమాద్మీ పక్కన నిలబడితే, ఇక కాంగ్రెస్, బీజేపీలు ఎటువంటి దుస్సాహసానికి పూనుకొనే ధైర్యం చేయలేవు కూడా. అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఒక మంచి ప్రయోగానికి అన్నాహజారే వంటివారు కూడా ముందుకు వచ్చి తమ సహకారం అందిస్తే, తప్పకుండా అది విజయవంతమవదమే కాక అది క్రమంగా దేశమంతటా వ్యాపించే అవకాశం ఉంటుంది.

హరికృష్ణను దూరంగా పెడుతున్నారా..!!

      తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీ నేత నందమూరి హరికృష్ణ మరోసారి అసంతృప్తిని వ్యక్తపరిచారు. తనకు ప్రజాగర్జనలో పాల్గొనేందుకు ఆహ్వానం పంపలేదంటూ ఆవేదన వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది. సమైక్యాంధ్ర అన్నందుకే పార్టీ కార్యక్రమాలకు తనను దూరం పెట్టారన్న అనుమానం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజను వ్యతిరేకిస్తూ హరికృష్ణ రాజ్యసభ సభ్వత్వానికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి సమైక్యవాదాన్ని హరికృష్ణ బలంగా విన్పిస్తున్నారు.   మరోవైపు ప్రజాగర్జన కోసం తాము ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానం పంపలేదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. కేవలం జిల్లా నేతలకు మాత్రమే ఆహ్వానాలు పంపించామన్నారు. మిగతా నాయకులు ఎవరైనా స్వచ్చంధంగా పాల్గొనవచ్చునని చెప్పారు.

చావుతో చెట్టా ‘పట్టాల్‌’...

      అనంతపురంలో మరో ఘోరప్రమాదం. రైలు పట్టాలపై మ్రత్యుఘోష. తెల్లవారుజాము సమయంలోనే 26 జీవితాలు తెల్లవారిపోయాయి. ఆ తర్వాత ఏమి జరిగింది? ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి దాకా అందరూ సంతాపం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి కాస్త తీరిక చేసుకుని వచ్చి పోయినోళ్లను ఎలానూ తేలేం కాబట్టి తలా రూ.5లక్షల నష్టపరిహారం, ప్రమాదంపై కమిటీ వేస్తానని ప్రకటించేసి వెళ్లిపోయారు. రోజంతా బుగ్గయిన బోగీ చుట్టూ కెమెరా తిప్పి తిప్పి, వాయిస్‌ ఓవర్‌లు చెప్పిచెప్పి అలసిపోయిన మీడియా ఫ్రెండ్స్‌ కూడా శాంతించారు. పొద్దున్నే ఇంటికి వస్తారని చూస్తున్న తమవారు రారని, ఇక వచ్చే అవకాశమే లేదనే విషయం ఇక ఇప్పుడు సంపూర్ణంగా అర్థం అవుతున్న దశలో... చనిపోయిన వారి కుటుంబాలలో ఎన్ని కళ్లు కన్నీళ్ల సముద్రాలు కడతాయో... ఎన్ని ఇళ్లు అతలాకుతలం అవుతాయో... ఎన్ని జీవితాలు చిందరవందరగా మారతాయో... రైలెక్కడం అనేది ఇంత పెద్ద నేరమా? అని ఎంతమంది భయపడిపోతారో... గత కొన్నేళ్ళుగా వరుస ప్రమాదాలు జరుగుతున్నా రైల్వేశాఖగాని, కేంద్రప్రభుత్వం గాని తమకు చీమ కుట్టినట్టయినా లేదని తరచు నిరూపించుకుంటూనే ఉంది. ప్రత్యక్షంగా జరిగే నష్టాన్ని మాత్రమే చూస్తున్న ‘పై’ వారికి పరిహారం ఇస్తే సరిపోతుందనిపిస్తుందేమో... కాని ఈ తరహా ప్రమాదాల కారణంగా తలెత్తే అనుబంధ కష్టాలు ప్రభుత్వాలకు అర్థమైతే... ఈపాటికే రైల్వేశాఖ పటిష్టమైన చర్యలు ప్రకటించేంది. కాలయాపన కమిటీలు, పరిహారాలతో ప్రజల్లో పేరుకుపోతున్న అభధ్రతాభావాన్ని పెంచడం మానేసేది.     తెల్లవారుజామునే జరుగుతున్న ప్రమాదాలు కనురెప్పపాటులో మనిషిని ‘మసి’చేస్తున్న కారణాలను శరవేగంగా అన్వేషించే యత్నం ఇప్పటికీ జరగడం లేదు. గతంలో వేసిన కమిటీల సిఫార్సులు ఏమయ్యాయో తెలీదు. రైల్వేలో సుశిక్షుతులైన సిబ్బంది నియామాకం ఎందుకు చేయరో తెలియదు. అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితో నెట్టుకు రావడం వల్ల కలుగుతున్న నష్టాలపై విశ్లేషణ లేదు. రైళ్లు ఢీ కొనడం సంఘటనలు తగ్గి, అగ్నిప్రమాదాలు ఎందుకు పెరిగాయో అర్థం చేసుకునే ప్రయత్నం లేదు. అనిల్‌కకోడ్కర్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయరు గాని మరిన్ని కమిటీలు వేసి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తూ ఉంటారు. ప్రమాదాలు జరగనే కూడదని, జరగవని ఎవరం అనం... అయితే ఒక ప్రమాదం మరిన్ని ఘోరాలు జరగకుండా అరికట్టేందుకు దోహదపడాలిగా... అది కూడా జరగకపోవడమే రైలు పట్టాలతో చావును చెట్టాపట్టాలేయిస్తోంది. ఓల్వో బస్సుల నుంచి రైలు బోగీల దాకా బుగ్గిగా మారేందుకు కారణమవుతోంది.  

టేక్ డైవర్షన్ ప్లీజ్!

  మన రాజకీయ పార్టీలు ఎప్పుడయినా వివాదాలలో లేదా ఇబ్బందులలో చిక్కుకొన్నప్పుడు వెంటనే వేరే ఆసక్తికరమయిన అంశం ఏదో అందుకొని మాట్లాడుతూ ప్రజల, ప్రత్యర్ధుల మీడియా దృష్టిని మళ్ళిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ట్రిక్కుని అనేక ఏళ్లుగా చాలా విజయవంతంగా అమలుచేస్తూ అనేక సార్లు గండం గట్టెకింది. ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు, లోక్ పాల్ బిల్లుని, ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ అవినీతిపై పోరాటాన్నిదొరకపుచ్చుకొని సమస్యలనుండి బయటపడ్డారు. అయితే రాహుల్ గాంధీ పొరపాటున తమ కొంపముంచే ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణాన్ని కెలుక్కోవడంతో, ఇప్పుడు ఆ సమస్య నుండి బయటపడేందుకు అర్జెంటుగా మళ్ళీ మరో కొత్త అంశం కోసం కాంగ్రెస్ వెదుకులాడుతోంది.   ఇక, మొన్న శాసనసభ సమావేశాలు మొదలయ్యినప్పుడు తెదేపా నేతలు రెండుగా చీలిపోయి మీడియా ముందు, సభలో చాల జోరుగా వాదించేయడంతో తెరాసకు అడ్డుగా దొరికిపోయారు. అప్పుడు తెరాస నేతలు తమపై దాడి మొదలుపెట్టేసరికి తెదేపా నేతలు ఆత్మరక్షణలో పడ్డారు కానీ వెంటనే తేరుకొని వారు కూడా ఆ ‘ట్రిక్కు’ని మరోమారు విజయవంతంగా ప్రయోగించి బయటపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తెరాసను విలీనం చేయనందునే తెలంగాణా ఆలస్యమయిపోతోందని వారు లొల్లి చేయడంతో అందరి దృష్టీ తెదేపాపై నుండి తెరాసపైకి మళ్ళింది. ఇదేసమయంలో తెదేపా నేతలకు వీ.హనుమంత రావు వంటివారు కూడా కోరస్ పాడటం మొదలు పెట్టడంతో ఈసారి తెరాస ఆత్మరక్షణలో పడింది.   ఇటువంటి టీ కప్పులో తుఫానులను అనేకం చూసిన కేసీఆర్ వెంటనే రంగంలోకి దూకి, రాష్ట్ర విభజన బిల్లులో అత్యవసరంగా చేయవలసిన సవరణల గురించి చర్చ మొదలుపెట్టి, అవసరమయితే మళ్ళీ ఉద్యమానికయినా సిద్దమని ప్రకటించేయడంతో మ్యాటర్ ఆటోమేటిగ్గా దానికి డైవర్ట్ అయిపోయింది. ఆ తరువాత ఆయన టీ-కాంగ్రెస్ నేతలను, రాష్ట్రపతిని కలవడం వంటివి చేయడంతో ‘విలీనం’ పాయింటుని మరి వినపడకుండాపోయింది. ఒకవేళ మళ్ళీ వినబడినా దానికి కౌంటర్ గా టీ-బిల్లు- సవరణలు అనే టాపిక్ ఉంది గనుక పెద్దగా ఇబ్బంది ఉండదు.   ఇక అందరి గురించి చెప్పుకొని వైకాపాను వదిలేస్తే వాళ్ళు చాలా బాధపడతారు. గనుక వాళ్ళ గురించి కూడా ఓ నాలుగు ముక్కలు చెప్పుకోవలసిందే. దిగ్వజయ్ సింగ్ ‘జగన్ నా కొడుకువంటి వాడు’ అని కలవరించినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీతో తమకు ఎటువంటి అక్రమ సంబంధం లేదని రుజువు చేసేందుకు జగన్ సోనియాగాంధీని విమర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక సమైక్య ముసుగులో విభజనవాదం చేస్తున్నారని ఆరోపణలు వచ్చినప్పుడల్లా జగన్ అఫిడవిట్స్ గురించి మాట్లాడటం వీలయితే ఓసారి రాష్ట్రపతిని కలిసి రావడం కూడా ఆనవాయితీయే.   ఈ రాజకీయ గందరగోళం చూసి జనాలు వెంటనే ఏ సినిమా న్యూస్ కో షిఫ్ట్ అయిపోయి దాని గురించే ఆలోచించడం, మాట్లాడటం మొదలుపెడతారు.ఇలా డైవర్షన్ సాగుతూనే ఉంటుంది.

రావణుడెంత గొప్పవాడో తెలిసింది: నాగార్జున

      చిన్నప్పుడు రామాయణం, మహాభారతం చూసి ఆహా రాముడెంత మంచోడు, దుర్యోధనుడెంత చెడ్డోడు అనుకునేవాళ్లం కదా మనమంతా... టాలీవుడ్‌ స్టార్‌ నాగార్జున కూడా అంతేనట. అయితే మనలో చాలామందిమి ఇప్పటికీ అలాగే అనుకుంటాం కానీ... మన నాగ్‌కు మాత్రం అలా అనుకోవడం లేదట. హైదరాబాద్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ ఎవర్‌గ్రీన్‌ అందగాడు తన శ్రీమతి అమలతో సహా పాల్గొని బోలెడన్ని ముచ్చట్లు చెప్పాడు. శూర్పణఖ అనే ఒక మహిళ ముక్కు చెవులు కోసేసేంత క్రూరత్వం ఉన్న వారి దగ్గర కన్నా తన దగ్గరే సీత క్షేమంగా ఉంటుందనే భావనతోనే రావణుడు సీతను అపహరించాడనే కొత్త లాజిక్‌ను ‘అసుర’ పుస్తకరచయిత కన్విన్సింగ్‌గా చెప్పిన తీరు తనకు నచ్చిందన్నాడు నాగ్‌.   అంతేకాదు మరెన్నో లక్షణాలు తెలుసుకున్నాక రావణుడు, కర్ణుడు... వీరంతా ఎంత గొప్పవారో తెలిసొచ్చిందన్నాడు. చెట్ల చుట్టూ తిరుగుతూ చేసే డ్యాన్సులు, సినిమాలంటే బోర్‌ కొట్టేస్తుందన్న నాగార్జున ఇలాంటి పుస్తకాల ఆధారంగా ఎవరైనా సినిమాలు తీస్తే నటించాలని ఉందన్నాడు. 2013 అత్యంత దురద్రుష్టకరమైన సంవత్సరమని, రానున్న ఏడాది అందరికీ బాగుండాలని ఆశిస్తున్నానన్నారాయన. ఇంతకీ ఈ మాటలంటున్నపుడు ఆయన పక్కనే ఉన్న అమలకు...  ఏకపత్నీవ్రతుడైన రాముడంటే భారతీయ మహిళలకు ఎంత ఇష్టమో, రావణుడంటే ఎంత ద్వేషమో తెలుసో లేదో...

పొట్లూరి వరప్రసాద్ కి వైకాపా టికెట్ ఖరారు..!!

  ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత మరియు పీవీపీ వెంచర్స్ అధినేత పొట్లూరి వరప్రసాద్ జనవరి26న వైకాపా తీర్ధం పుచ్చుకోనేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు విజయవాడ లోక్ సభ టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.   ఆ నియోజక వర్గం క్రింద ఉన్న తిరువూరు, నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, విజయవాడ సెంట్రల్ మరియు తూర్పుప్రాంతాలు ఉన్నాయి. వీటిలో తిరువూరు, నందిగామ ప్రాంతాలు తప్ప మిగిలిన నాలుగు ప్రాంతాలలో కమ్మ కులస్థులదే పూర్తి ఆదిక్యత. అందువల్ల కాంగ్రెస్, తెదేపా, వైకాపా మూడు పార్టీలు కూడా అదే కులానికి చెందిన వ్యక్తులను తమ అభ్యర్ధులుగా నిలబెడుతున్నాయి.   ఇప్పటికే తెదేపా అభ్యర్ధిగా కేశినేని శ్రీనివాస్ (నాని) రంగంలో ఉండగా, ఇప్పుడు వైకాపా పొట్లూరి వరప్రసాద్ ను తన అభ్యర్ధిగా ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి ఇంత వరకు లగడపాటి రాజగోపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఆయన అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నందున మళ్ళీ ఆయనకి టికెట్ దొరకక పోవచ్చును. కానీ ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే ఆయన ఆ పార్టీ టికెట్ పై పోటీచేయవచ్చును. లేదా స్వతంత్ర అభ్యర్దిగానయినా అక్కడి నుండే పోటీ చేయవచ్చును.   ఏవిధంగా చూసినా ఒకే కులానికి చెందిన ఈ ముగ్గురు బలమయిన అభ్యర్ధుల మధ్య చాలా తీవ్రమయిన పోటీ ఉండబోతోందని స్పష్టమవుతోంది. అయితే, షెడ్యుల్డ్ కులాల వారి ఆధిక్యత ఉన్న తిరువూరు, నందిగామలు ఎటువైపు మొగ్గితే వారికే విజయం దక్కుతుంది. గనుక అన్ని పార్టీలు ఆ రెండు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నాయి. ఈ రెండు ప్రాంతాల ప్రజలపై ప్రస్తుతం జగన్ ప్రభావం అధికంగా ఉన్నందున పొట్లూరి వరప్రసాద్ విజయం ఖాయమనే ధీమాతో వైకాపా ఉంది.   మచిలీపట్నం నుండి లోక్ సభకు కుక్కల నాగేశ్వరరావుని తన అభ్యర్ధిగా నిలబెట్టాలనుకొన్న వైకాపాకి ఆయన హటాన్మరణంతో మళ్ళీ అంత బలమయిన అభ్యర్ధి కోసం గాలించవలసివస్తోంది. ఆయన కుమారుడు కుక్కల వెంకట విద్యాసాగర్ లేదా పేర్నివెంకట రామయ్య(నాని)ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.   మచిలీపట్నం లోక్ సభ నియోజక వర్గం క్రింద ఉండే పెనమలూరు, గన్నవరం, పెడన, గుడివాడ, మచిలీ పట్నం,అవనిగడ్డ, పామర్రు మరియు మచిలీ పట్నం టవున్ ప్రాంతాలలో కాపు మరియు యాదవ కులస్తులు అధికంగా ఉన్నారు. అందువల్ల కాపు కులస్తుడయిన పేర్నివెంకట రామయ్యను లేదా యాదవ కులానికి చెందిన విద్యాసాగర్ లలో ఎవరికో ఒకరికి టికెట్ ఖాయం చేయాలని వైకాపా భావిస్తోంది. విద్యాసాగర్ కు సానుభూతి ఓటు కూడా అదనంగా ఉంటుంది గనుక ఆయనకు టికెట్ ఖరారు చేయవచ్చునేమో.   రాజకీయ పార్టీలన్నీఎన్నిసిద్దాంతాలు, ఆదర్శాలు వల్లెవేసినప్పటికీ స్థానిక కులసమీకరణాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికలలో అడుగు ముందుకు వేయలేవని స్పష్టమవుతోంది.

లగడపాటి చేతిలో చంద్రాస్త్రం..!!

      రాష్ట్రవిభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తమ అభిప్రాయాలు పట్టించుకోకుండా ముందుకు వెళితే బ్రహ్మస్త్రం ప్రయోగిస్తాం అంటూ ప్రకటిస్తూ వచ్చిన లగడపాటి రాజగోపాల్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పార్టీకి పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటూ వస్తున్న రాజగోపాల్‌.. అధిష్టానం పై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన తిరిగి పార్టీలో కొనసాగే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో ఇప్పుడు లగడపాటి పార్టీ మారుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అది కూడా కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీలోకి అన్న వార్త రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ దిశగా లగడపాటి వర్గం అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం.. త్వరలోనే వందలాది కార్యకర్తలతో ఆయన తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోనున్నారట. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటున్నట్టుగా సమాచారం. అయితే ఈ సారి లగడపాటి విజయవాడ నుంచి కాకుండా ఏలూరు నియోజక వర్గం నుంచి పోటి చేయాలని భావిస్తున్నాడట. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి కూడా హామీ లభించినట్టుగా చెపుతున్నారు. ఇదే నిజమయితే ఇన్నాళ్లు కరుడు గట్టిన కాంగ్రెస్‌ వాదిగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎలా మనగలుగుతారో.. ఆయనకు ఆ పార్టీ ఎలాంటి స్థానం కల్పిస్తుందో చూడాలి.

ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం

      ఢిల్లీలో చీపురు కట్టతో చరిత్ర సృష్టించిన ఆమ్ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అరవింద్ కేజ్రీవాల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. సమాచార హక్కు కార్యకర్త మనీష్ సిసోదియా, మిగిలిన ఐదుగురు మంత్రులతో కూడా నజీబ్ జంగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. రాంలీలా మైదాన్ ప్రజలు, అభిమానులతో కిక్కిరిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల మద్దతుతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పడడం విశేషం.

రైలు ప్రమాదం: 26కు చేరిన మృతుల సంఖ్య

      శనివారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బెంగుళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ థర్డ్ ఏసీ బీ-1 బోగీలో మంటలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈఘటనలో 26 మంది సజీవదహనం కాగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. బోగీలో ఏవైనా పేలుడు పదార్థాలు ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈఘటన జరిగిన వెంటనే ధర్మవరం,కొత్తచెరువు, పుట్టపర్తి ఆస్పత్రుల సిబ్బందిని రైల్వే అధికారులు అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం బెంగుళూరు, గుంతకల్లు నుంచి ప్రత్యేక రైల్లో రెండు వైద్య బృందాలను అధికారులు తరలిస్తున్నారు.   బాధితుల వివరాలు తెలుసుకునేందుకు అధికారులు టోల్‌ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్ : 080 22354108, 22156554 ఫోన్ నెంబర్ : 080 22354108, 9731666863 ఫోన్ నెంబర్ : 080 22259271, 9731666863 దక్షిణ మధ్య రైల్వేశాఖ పలు జిల్లాలో హెల్ప్‌లైన్ల నెంబర్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ : 040 27700868, 9701371060 వికారాబాద్ : 08416 252215, 9701371081 తాండూరు : 08411 272010 ధర్మవరం : 08559 224422 సేదం : 08441 276066, 7760998338 బీదర్ : 08482 226404, 7760998400 గుంతకల్లు : 0855 2220305, 09701374965 అనంతపురం : 09491221390 బెంగుళూరు సిటి : 080 22235408, 080 22156553 ప్రశాంతి నిలయం : 080 555280125

రైలు ప్రమాదం: మృతుల కుటుంబాలకు 5లక్షల పరిహారం

      అనంతపురం జిల్లా పుట్టపర్తి వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష, గాయపడిన వారికీ యాభై వేలు చొప్పున పరిహారం అందజేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.   అనంతపురం జిల్లా పుట్టపర్తి వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ థర్ట్ ఏసీ బీ-1 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ధర్మవరం అసుపత్రికి తరలిస్తున్నారు. సహయ చర్యల కోసం ధర్మవరం నుండి ప్రత్యేక రైలు రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ప్రయాణ సమయంలో బోగీలో మొత్త 73 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

యుపిఎకు ఓంప్రకాష్‌ గుడ్‌బై

  యుపిఏ కు మరో ఎదురు దెబ్బ తగిలింది ఇప్పటికే తెలంగాణ అంశంతో రాష్ట్రంలో పట్టుకోల్పోతున్న కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో మరో ఎంపి దూరమయ్యాడు. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తూ వస్తున్న స్వతంత్ర అభ్యర్ధి ఎంపి ఓం ప్రకాష్‌ యాదవ్‌ ఆ పార్టీకి తన మద్దతు ఉపసంహరించుకున్నారు. ధర పెరుగుదల, అవినీతి, రాజకీయ ప్రత్యర్థుల పై కాంగ్రెస్‌ అవలంభిస్తున్న ప్రతీకార చర్యలు లాంటి అంశల నేపధ్యంలో ఆ పార్టీకి ఆయన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి మద్దతు ఉపసంహరణ లేఖ అందించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఓం ప్రకాష్‌ గతంలో పలు సందర్బాల్లో దేశానికి దమ్మున నాయకుడు కావాలంటూ స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు. పలు సందర్బాల్లో నరేంద్ర మోడిని బహిరంగంగానే పొగిడారు. ఈ నేపధ్యంలో ఆయన బిజిపిలో చేరే అవకాశం ఉందన్న వర్తాలు వినిపిస్తున్నాయి.

అనంతపురంలో ఘోర రైలు ప్రమాదం:23 మంది మృతి

  ఈ ఉదయం అనంతపురం జిల్లాలొ ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది సజీవదహనం అయ్యారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి దగ్గరలొ నాంధేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసి బొగి ప్రమాద వశాత్తు పూర్తిగా కాలిపోయింది. థర్డ్‌ ఏసి బి1 భోగిలో మంటలు చెలరేగడంతో ప్రమాదం  సంభవించింది. ఈ ప్రమాదంలొ 23 మంది అక్కడి కక్కడే మరణించగా మరి కొంత మంది గాయపడ్డారు, క్షతగాత్రలను సమీపంలొని థర్మవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం  జరిగిన సమయంలో భోగి మొత్తం 73 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

రాయలసీమ రగులుతోంది... కోస్తాంథ్ర గుండెకు గాయమైంది... జెపి

      వినడానికి సినిమా డైలాగుల్లా ఉన్నాయనుకుంటున్నారా? అన్నది ఎవరో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఆయన ఎవరో కాదు... లోక్‌సత్తా నేత జయప్రకాష్‌ నారాయణ. సబ్జెక్ట్‌లో ‘సత్తా’ ఉన్న నేత కూడా ఇలాగైతే లాభం లేదనుకున్నారో ఏమో... సెంటిమెంట్‌ డైలాగులు విసరడం ప్రారంభించారు. విభజన అంశంపై ఆయన శుక్రవారం వైజాగ్‌లో మాట్లాడుతూ రాజకీయలబ్థి కోసమే కాంగ్రెస్‌ రాష్ట్ర విభజనకు పాల్పడుతోందన్నారు. రెండు ప్రాంతాల్లో సీట్లు దక్కించుకోవడం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టిందన్నారు. ఈ నిర్ణయం కారణంగా రాయలసీమ రగులుతోందని, కోస్తాంథ్ర మనసు గాయపడిరదని అన్నారాయన. అన్ని ప్రాంతాల వారినీ పిలిచి మాట్లాడి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని కాంగ్రెస్‌ పార్టీ ఆలోచించడం లేదని విమర్శించారు.

జగన్‌... నోరు పారేసుకోకు...

      స్పీకర్‌ను ఉద్ధేశ్యించి జగన్‌ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి బాలరాజు తీవ్రంగా ఖండిరచారు. రాజ్యాంగ వ్యవస్థనే కించపరిచే విధంగా జగన్‌ మాట్లాడారనీ, జగన్‌ అధికారం కోసమే ఇదంతా చేస్తున్నారని అందరికీ తెలుసనీ ఆయన ఎద్దేవా చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక కూడా ఇదే పంథా అనుసరిస్తారా? అనేది జగన్‌ తేల్చిచెప్పాలన్నారు. మాట్లాడే హక్కుందని అన్‌పార్లమెంటరీ భాష మాట్లాడడం ప్రజాస్వామ్యవ్యవస్థల మీద గౌరవం ఉన్నవారు చేయరని ఆయన స్పష్టం చేశారు. దీనిపై జగన్‌ను అసెంబ్లీకి పిలిపించి వివరణ అడగాలన్నారు. మరోవైపు తెలంగాణనేతలు సైతం జగన్‌పై తీవ్రస్తాయిలో మండిపడ్డారు. జగన్‌ ఓ మూర్ఖుడని ఎం.పి గుత్తా సుఖేందర్‌రెడ్డి తిట్టిపోశారు. స్పీకర్‌పై వ్యాఖ్యలు జగన్‌ ఫ్యూడల్‌ మనస్తత్వానికి నిదర్శమన్నారు. స్పీకర్‌పై జగన్‌ చేసిన విమర్శల్ని ఖండిరచిన ప్రభుత్వ ఛీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి... అసెంబ్లీ సమావేశాల్లో ప్రివిలేజ్‌ మోషన్‌ ఇస్తామన్నారు.