యువతిని వేధిస్తున్న ఉడత అరెస్ట్

  సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిలు వేధిస్తున్నారంటూ కంప్లైంటు ఇస్తుంటారు. కానీ ఇక్కడ ఓ యువతిఓ ఉడత తనను వేధిస్తుందంటూ కంప్లెంట్ ఇచ్చింది. ఈ విచిత్రమైన ఘటన జర్మనీలో జరిగింది. వివరాల ప్రకారం జర్మనీలోని ఓయువతి ఓ ఉడుత తనను వెంబడిస్తోందని, ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేస్తోందని ఆ యువతి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అయితే మొదట పోలీసులు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే ఆ యివతి మళ్లీ ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగి ఉడతను పట్టుకొన్నారట. అయితే తనను బంధించడంతో ఇప్పుడు ఆ ఉడత ఆహారం తీసుకోవడం మానేసిందట. దీంతో బాగా చిక్కిపోవడంతో ఆ ఉడుత కోసం ప్రత్యేకంగా ఓ పోలీసును ఏర్పాటు చేసి పోలీసులు ఆహారం అందిస్తున్నారట.

కే సీఆర్‌ నియంతృత్వ ధోరణి విడనాడాలి

  తమ వేతనాలు పెంచాలని గతవారం రోజులకు పైగా మున్సిపల్ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం వాళ్లు చేస్తున్న సమ్మెను చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే మున్సిపల్ శాఖ ఉన్నా సమస్య పరిష్కారం కాకపోవడం ఆశ్చర్యం. అయితే కార్మిక సంఘాల పై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వైఖరిపట్ల పలు పార్టీలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వామపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి. మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కే సీఆర్‌ నియంతృత్వ ధోరణి విడనాడాలని వామపక్షాల కార్యకర్తలు ధర్నా చేపట్టి.. ఆర్టీసీ బస్సులను అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు వచ్చి వామపక్షాల కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. అంతేకాక రాష్ట్రంలోని పలు చోట్ల కార్మిక సంఘాల కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కాగా వామపక్షాలు చేస్తున్న బంద్ కు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలు మద్దతు పలికాయి.

ఏపీకి విపత్తు పునరుద్ధరణ..

  విపత్తు పునరుద్దరణ పనులకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు రూ 1500 కోట్లకు పైగా రుణంగా ఇవ్వనుంది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వానికి, ప్రపంచ బ్యాంకుకు మద్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. గురువారం కేంద్ర కేంద్రం తరపున ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌ సెల్వకుమార్‌, ప్రపంచ బ్యాంకు తరఫున భారతదేశ డైరెక్టర్‌, ఏపీ తరపున భూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్‌ చందర్‌ శర్మ సమావేశమయిన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ప్రపంచ బ్యాంకు తరఫున భారతదేశ డైరెక్టర్‌, ఎస్‌ సెల్వకుమార్, జగదీశ్‌ చందర్‌ ఈ ఒప్పందం పై సంతకాలు కూడా చేశారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చే ఈ రుణంతో ఏపీలో ఏర్పడే విపత్తుల్ని తట్టుకునే శక్తి సామర్థ్యాల పెంపు, ఆయా ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందిచనున్నారు. రానున్న ఐదేళ్లలో ఏపీ ప్రభుత్వం ఈ నిధుల్ని వినియోగించి విద్యుత్తు సరఫరా వ్యవస్థను బలోపేతం చేయటం, రహదారుల పునరుద్ధరణ, మొదలైన కార్యక్రమాలను అమలు చేయనుంది. అంతేకాక తుఫాను ప్రమాద ఉపశమన పథకం ఏపి, ఒడిశా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మొదటి దశగా రూ. 1491.71 కోట్లుగా అంచనా వేసింది. అయితే ఇప్పుడు మొదటి దశ అంచనాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. రూ 835 కోట్లు మేర పెంచుతూ... మొత్తాన్ని రూ 2331.71 కి పెంచింది.

పదవి పోయిన వెంటనే పార్టీ మారడం ఖాయం.. జేసీ

  అనంతపురం జిల్లా తాడిపత్రి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో దురదృష్టమశాత్తు జరిగిన ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నారని అన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పార్టీ అధ్యక్ష పదవి ఉన్నంతకాలమే రఘువీరా రెడ్డి పార్టీలో ఉంటారని.. ఆ పదవి పోయిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారడం ఖాయమని ఎద్దేవ చేశారు. రాష్ట్ర విభజన వల్లనే కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని.. కాంగ్రెస్ పార్టీ వల్ల తాము చాలా లాభపడ్డామని అన్నారు. అంతేకాక హైదరాబాద్ గురించి మాట్లాడుతూ హైదరాబాద్ కు వెళ్లినప్పుడల్లా బాధ కలుగుతుందని.. హైదరాబాద్ లాంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు వస్తుందో తెలియదని, అటువంటి రాజధాని వస్తుందనే నమ్మకం లేదని ఆయన అన్నారు. తన నియోజక వర్గం అభివృద్ధికి అవసరమైతే దౌర్జన్యానికైనా దిగుతానని వ్యాఖ్యానించారు.

జానాకు రాహుల్ సూటి ప్రశ్న

  ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది నేతలు వేరే పార్టీల్లోకి చేరిన సంగతి తెలిసిందే. ఇంకా చాలా మంది నేతలు ఇతర పార్టీలలోకి దూకడానికి ప్రయత్నాలు కూడా జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న డీఎస్ కూడా టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత అయిన జానారెడ్డి కూడా వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారు అన్నారు కానీ ఆతరువాత జానారెడ్డి ఎక్కడికి ఏపార్టీల్లోకి వెళ్లడం లేదని కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశంలో తెలిపారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తం కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాహుల్ జానారెడ్డికి నేరుగా ఒక ప్రశ్న వేశారంట. మీరు పార్టీలో ఉంటారా? వెళ్లిపోతారా? మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అంటూ ఆయన్ని నేరుగా అడిగారంట. అయితే ఈ వార్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతుంది. అయితే రాహుల్ వేసిన ప్రశ్నకు జానారెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని.. బయట వచ్చే వార్తలను నమ్మొద్దని సమాధానం చెప్పారంట. అయితే దీనికి రాహుల్ డి.ఎస్ వంటి విశ్వాసపాత్రమైన సీనియర్ నేతలే వెళ్లిపోతుంటే, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మరాదో తెలియడం లేదని రాహుల్ వాపోయారట. చూద్దాం జానారెడ్డి మాట మీద నిలబడతారో లేదో.

పుష్కరఘాట్ లో మొసలి!!!

  కరీంనగర్ జిల్లాలో ఇబ్రహీం మండలం వేములకుర్తి వద్ద బాలమ్మ పుష్కర ఘాట్ లో స్నానాలు చేస్తున్న భక్తులకి నీళ్ళలో మొసలి కనిపించడంతో తుళ్ళిపడి భయంతో ఒడ్డుకి పరుగులు తీసారు. ఈ విషయం తెలుసుకొన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మొసలిని పట్టుకొన్నారు. ఒడ్డుకి వచ్చిన మొసలి చాలా చిన్నది కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మళ్ళీ కాసేపు విరామం తరువాత భక్తులు యధావిధిగా నదిలోకి దిగి స్నానాలు చేయడం మొదలుపెట్టారు. నదిలో ఒక మొసలి కనబడిందంటే లోన ఇంకా మొసళ్ళు ఉండే అవకాశం ఉంది. ఈరోజు భక్తుల అదృష్టం కొద్దీ సకాలంలో మొసలిని చూసి ప్రాణాలు రక్షించుకోగలిగారు. కానీ మళ్ళీ మరొక మొసలి రాదని నమ్మకం ఏమిటి? కనుక ప్రభుత్వం అక్కడ పుష్కర స్నానాలు నిషేధించి ఉంటే బాగుండేది. ప్రమాదం జరిగిన తరువాత బాధపడటం కంటే జరగకుండా ముందే జాగ్రత్త పడితే మంచిది కదా?

రాజమండ్రి ఘటన దురదృష్టకరం... చంద్రబాబు

  మూడోరోజు కూడా గోదావరి మహాపుష్కర స్నానాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కొవ్వూరు లోని గోష్పాదక్షేత్రాన్ని పరిశీలించారు. పుష్కర ఏర్పాట్లపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి రోజే రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్త చేశారు. రాష్ట్రంలో పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయని.. భక్తులను అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని... భక్తులు సైతం క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ మహా పుష్కరాలకు ఒక్క మన రాష్ట్ర నుండే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారని తెలిపారు.

చర్చ పై రచ్చ

  పాలమూరు ప్రాజెక్టుపై టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి.. టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావుల మధ్య మాటాల తూటాలు పేలుతూనే ఉన్నాయి. మొదట ప్రాజెక్టు పై చర్చించేందుకు జూపల్లి ఎన్టీఆర్ భవన్ కు వస్తానని సవాల్ విసిరారు. అయితే తాను చర్చకు వెళ్లలేదు.. ఆతరువాత దానిపై రావుల స్పందించి జూపల్లి ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. జూపల్లి కోసం మూడు గంటలు ఎన్టీఆర్ భవన్ లో వేచి ఉన్నానని.. అయినా జూపల్లి రాలేదని.. సవాల్ విసిరి మొహం చాటేసారని ఎద్దేవ చేశారు. అయితే రావుల చేసిన వ్యాఖ్యలకు జూపల్లి స్పందించి చర్చకు నేను సిద్ధంగానే ఉన్నాను.. టైం మీరు ఫిక్స్ చేసినా పర్వాలేదు అని డైలాగులు విసిరారు.. అక్కడితో ఆగకుండా మళ్లీ టీడీపీ నేతలు తోక ముడిచారు.. చర్చకు రాలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రావుల జూపల్లి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చర్చకు తామేప్పుడూ సిద్దమేనని.. కానీ చర్చ ఎప్పుడు, ఎక్కడ అనేది జూపల్లి ఏకపక్షంగా నిర్ణయిస్తే కుదరదని అన్నారు. ఆయన దారి తప్పిన, గతి తప్పిన విధంగా మాట్లాడుతున్నారని, ఇంతకు మించి తాను స్పందిస్తే తనకు సభ్యత అడ్డు వస్తుందన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని.. ఈ పథకం పూర్తి కావాలని తామూ కొరుకుంటున్నామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం వద్దని చంద్రబాబు లేఖ రాయలేదని, వైసీపీ అధినేత జగన్‌ రాశారని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున జూపల్లి ముందుగా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని, ఆ తర్వాత ఎన్ని రోజులైన చర్చ పెట్టుకోవచ్చన్నారు.

5వేల కోట్లివ్వండి...అప్పులు తీర్చుకుంటాం..

  రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్ధికంగా చాలా నష్టం చాలా నష్టం జరిగిందన్నది తెలిసిందే. ఉన్నకష్టాల్లోనే ఎలాగొలా అప్పులుతెచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఆర్జీ పెట్టుకుంది. రాష్ట్ర విభజన వల్ల ఏపీ అప్పులపాలైపోయింది.. అప్పులు తీరాలంటే ఇప్పటికి ఇప్పుడు 5 వేల కోట్లు అవసరం.. తక్షణమే ఆ మొత్తాన్ని విడుదల చేసి ఆదుకోండి అంటూ కేంద్రానికి ఆర్జీ పెట్టింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తాం.. స్పెషల్ ప్యాకేజీలు ఇస్తాం.. రాష్ట అభివృద్ధికి చేయూతనిస్తాం అని తెలిపిన కేంద్ర ప్రభత్వం ఇప్పుడు చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. ఏపీకీ ఉన్న ఆర్ధిక లోటు గురించి ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఏపీ ప్రభుత్వం గతేడాదే రెవెన్యూ లోటు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రత్యేక ప్యాకేజీ, సీఎస్టీ బకాయిలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 24,500 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరింది కానీ కేంద్రం మాత్రం .. కేవలం రూ.350 కోట్లు మాత్రమే ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకొంది. అప్పటి నుండి 350 కోట్లు మినహా ఒక్క పైసా కూడా కేంద్రం ఇవ్వలేదు. మరోవైపు కాగ్ నివేదిక వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ కు ఉన్న రెవెన్యూలోటు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్పింది. అయితే ఏపీకి ఉన్న ఆర్ధికలోటు 17 వేల కోట్లు అని కాగ్ రెండు నెలలు క్రితమే నివేదికను ఇచ్చింది. కానీ కేంద్రం మాత్రం ఆవిషయంపై నోరు విప్పడంలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం ఎలాగోలా అప్పులు తెచ్చి నెట్టుకొస్తుంది. అలా తెచ్చిన అప్పులే ఇప్పటికి 5వేల కోట్లు అయిపోయింది. దీంతో ఏపీ సర్కారు కేంద్రానికి రెవెన్యూ లోటు కింద 5 వేల కోట్లు ఇవ్వాలని.. అప్పులు తీర్చుకుంటామని కోరింది. కనీసం కేంద్రం కనుకు 5వేల కోట్లు మంజూరు చేసినట్టయితే కనీసం అప్పులు తీర్చి కాస్తంత ఒడ్డున పడొచ్చు అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మాకూ సగం ఇవ్వండి.. టీ సర్కార్

  తెలంగాణ ప్రభుత్వానికి.. ఏపీ ప్రభుత్వానికి ఏదో విషయంలో పేచీలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే అనేక వివాదాలతో రెండు ప్రభుత్వాలు ఎప్పుడూ గొడవపడుతూనే ఉన్నాయి. ఒక పక్క ఆంధ్రా, తెలంగాణ విద్యుత్ శాఖల్లో ఉద్యోగుల కేటాయింపుల్లో కొంచెం వివాదస్పద సమస్యలు ఉన్న నేపథ్యంలో ఈ విషయంపై ఇప్పటికే ఇరు రాష్టాల ఉద్యోగులు ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఏపీకిచ్చిన బొగ్గు గనుల్లో మాకూ సగం ఇవ్వండంటూ తెలంగాణ ఇంధన శాఖ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. తెలంగాణ ప్రభుత్వం నల్గొండ జిల్లాలో నిర్మించే 6,000 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టుకు బొగ్గు అవసరముందంటూ... ఒడిసా లోని సర్పాల్‌-నౌపార్‌ గనుల్లోని బొగ్గును సగం తమకు కేటాయించాలని తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి అరవింద కుమార్‌ కేంద్రానికి లేఖ రాశారు. అయితే గతంలో రాష్ట్ర విభజన ముందు ఒడిసాలోని సర్పాల్‌-నౌపార్‌ గనుల ను ఏపీకి కేటాయిస్తూ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 25ను జారీ చేసింది. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత సర్పాల్‌-నౌపార్‌ బొగ్గు గనులను ఆంధ్రప్రదేశ్ జెన్‌కోకు కేటాయిస్తూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ రెండు నెలల క్రితమే ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపింది. అయితే ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం విభజన ముందు బొగ్గు గనులను ఏపీకీ కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది... ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి అవే గనుల్లో మాకూ 50 శాతం కేటాయించాలని పట్టుబడుతోంది. మరి దీనికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంటుందో లేదో.. ఒకవేళ ఒప్పుకోకపోతే మళ్లీ దీనిపై వివాదం మొదలవుతుంది.

గాయకుడు రామకృష్ణ కన్నుమూత

  ప్రముఖ గాయకుడు విస్సంరాజు రామకృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. జూబిలీ హిల్స్ వెంకటగిరిలోని తన నివాసంలో రామకృష్ణ తుదిశ్వాస విడిచారు. రామకృష్ణ 1947, ఆగస్టు 20వ తేదీన విజయనగరంలో జన్మించారు. ప్రముఖ గాయని పి.సుశీల రామకృష్ణకు పిన్ని. రామకృష్ణ నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణంరాజు నటించిన అనేక చిత్రాలకు ఆయన పాటలు పాడారు. భక్తి గీతాలను పాడటంలో రామకృష్ణది ప్రత్యేక శైలి. మహాకవి క్షేత్రయ్య, దాన వీర శూర కర్ణ, అమరదీపం, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం, బలిపీఠం, గుణవంతుడు, అందాల రాముడు, తాత-మనవడు, భక్త తుకారాం, శారద, భక్త కన్నప్ప, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, కరుణామయుడు వంటి అనేక చిత్రాల్లో ఆయన పాడిన పాటలు చిరస్థాయిగా నిలిచాయి. దాదాపు 200 చిత్రాలలో ఐదు వేలకు పైగా పాటలు పాడారు. ఎన్నో భక్తి గీతాల ఆల్బమ్స్‌లో కూడా ఆయన పాటలు పాడారు. ప్రముఖ నటుడు సాయికిరణ్ రామకృష్ణ తనయుడు. రామకృష్ణ కన్నుమూత పట్ల సినిమా రంగానికి చెందిన పలువురు దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఏసీబీ కార్యలయం వద్ద తెరాస ఎమ్మేల్యే.. సర్వత్రా ఆసక్తి

    నోటుకు ఓటు కేసులో తెరాస ఎమ్మెల్యేకు కూడా తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేయనున్నదని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా సంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డి ఈ రోజు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయాలనుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభాకర్ రెడ్డి మాత్రం వ్యక్తిగత పనుల నిమిత్తమే తాను ఏసీబీ కార్యాలయానికి వచ్చానని అన్నారు. కాగా మీడియా ప్రతినిధులు మరిన్ని ప్రశ్నలు అడుగుతుండగా జవాబు చెప్పేందుకు నిరాకరించారు. అయితే ఈ కేసు వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేయగా తాజాగా తెదేపా నేత వేం నరేందర్ రెడ్డి కొడుకు కృష్ణ కీర్తన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీనిలో భాగంగా కృష్ణ కీర్తన్ ఈ రోజు ఏసీబీ కోర్టు ముందు హాజరయ్యారు.

వాళ్లేమి టెర్రరిస్టులు కాదు అణచివేయడానికి.. రాఘవులు

  మున్సిపల్ కార్మికులు వారం రోజుల నుండి సమ్మె చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. ఒక పక్క కార్మికుల సమ్మెతో రోడ్లు మొత్తం చెత్తతో నిండిపోయిన ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తుంది. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పారిశుధ్య కార్మికులు సమ్మె ప్రభుత్వం వారిని పట్టించుకోకపోగా వారి సమ్మెను పోలీసుల సాయంతో భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయంపై సీపీఎం నేత బివి రాఘవులు స్పందించి కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏం బాలేదని.. వాళ్లేమి టెర్రరిస్టులు కాదు పోలీలుసు, సైన్యాన్ని దించి అణచివేయడానికి అని అన్నారు. మున్సిపల్ శాఖ కేసీఆర్ హయాంలో ఉన్నా కాని సమస్య పరిష్కారం కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. అన్ని శాఖలకు వేతనం పెంచిన కేసీఆర్ మున్సిపల్ కార్మికులు అడిగిన వేతనం ఇవ్వడానికి ఏమైందని.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే వాళ్లు వేతనం డిమాండ్ చేస్తే తప్పా అని ప్రశ్నించారు. కార్మికుల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి క‌మ్యూ‌నిస్టు పార్టీ‌ల నాయ‌కులు సిధ్దంగా ఉంటార‌ని తెలిపారు.

నీతి ఆయోగ్ సమావేశం.. సీఎంలు డుమ్మా

  భూసేకరణ బిల్లు నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఈ సమావేశం ఏర్పాటైంది. అయితే గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉన్న భూసేకరణ బిల్లుకు అధికార ఎన్డీఏ ప్రభుత్వం పలు మార్పులు చేర్పులు చేసింది. ఈ నేపథ్యంలో రాష్టాల ఆమోదం కోసం ఎన్టీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ ఈ విషయంలో మాత్రం కొంత మంది నేతలు మాత్రం సముఖత చూపనట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలు ఈ బిల్లులోని మార్పులను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో ఈ బిల్లుపై రాహుల్ గాంధీ పెద్ద హంగామా కూడా చేశారు. అయితే ఈ సమావేశానికి దేశంలోని కొంతమంది ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు హాజరవ్వగా.. కొంత మంది సీఎంలు హాజరుకాలేదు. ముందుగా ఖరారైన కార్యక్రమాల వల్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంతరి అఖిలేష్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్నందున ఈ సమావేశానికి హాజరు కావటం లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గోదావరి మహాపుష్కరాలు సందర్భంగా సమావేశానికి హాజరవలేదు.

నదుల అనుసంధానంతో ఉపయోగం.. చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో నీటిప్రాముఖ్యత-నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నూతన ప్రాజెక్టులకు నాంది పలికిన కేఎల్‌ రావు రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఒక స్ఫూర్తి ప్రధాత కావాలని సీఎం ఆకాంక్షించారు. నదుల అనుసంధానంతో ఆర్ధికంగా ఎంతో ఉపయోగం ఉంటుందని.. నదులు అనుసంధానం చేసి ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చన్నారు. సముద్రంలో వృధాగా పోయే వెయ్యి టీఎంసీల గోదావరి నీటిని ఉపయోగించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్‌ను కరువు నుంచి బయటపడేయ వచ్చని అన్నారు. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తామని అన్నారు.

అది మన రాజకీయ నాయకులకే చెల్లు

గోదావరి మహాపుష్కరాల సందర్భంగా మొదటి రోజు అంటే నిన్న రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఒక పక్క ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలవాల్సిన రాజకీయ నేతలు అది చేయకుండా దీని అంతటికి కారణం సీఎం చంద్రబాబే అంటూ విమర్శించడం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తూ జరిగిన ఘటనకు దొరికిందే ఛాన్స్ అనుకొని  ప్రతిపక్షనేతలు తొక్కిసలాటకు కారణం ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఏ సాకు దొరుకుతుందా అని చూసే జగన్ అయితే ఏకంగా రెచ్చిపోయి బాబు స్థానంలో ఎవరైనా ఉంటే జైలుకు పంపించేవారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అయినా ప్రజల గురించి అంత పట్టించుకునే నాయకులైతే పుష్కర ఘాట్ ల దగ్గరకు వచ్చి ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చూసేవాళ్లు.. అది చేయడం చేతకాదు.. ఎవర్నైనా విమర్శించమంటే మాత్రం ముందుంటారు. అంత జాలే ఉన్నట్టయితే బాధితుల కుటుంబాలను పరామర్శించి సహాయం చేసేవాళ్లే. కనీసం అక్కడి పరిస్థితి ఎలా ఉందో కూడా వెళ్లి చూడని నాయకులు కూడా విమర్శించడం ఆశ్చర్యకరంగా ఉంది. శవాలతో కూడా రాజకీయాలు చేయవచ్చని మన రాజకీయ నేతలను చూసి నేర్చుకోవచ్చనిపిస్తుంది... అది మన రాజకీయ నేతలకే చెల్లు. అయితే ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కూడా ఘాటుగానే సమాధాన మిచ్చారు. ఈ విషయం పై టీడీపీ నేత గాలిముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ నిన్న రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటకు కారణం చంద్రబాబే అంటూ దుష్ప్రచారం చేయడంసరికాదని మండిపడ్డారు. ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ జరిగిన ఘటనను ఆధారంగా చేసుకొని ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం సరికాదన్నారు. చిరంజీవి, రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి నేతలు కూడా శవరాజకీయాలు చేస్తున్నారని, చంద్రబాబు ప్రణాళికాబద్ధంగానే ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజమండ్రి పుష్కర ఘాట్ తొక్కిసలాటపై ప్రతిపక్షాలది అనసవర రాద్దాంతమని ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మాని.. భక్తులకు బాసటగా నిలవాలని అన్నారు. ఈ విషయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సరైన రీతిలో స్పందించారని.. భక్తులకు సహాయ చర్యలు అందించాలని తన అభిమానులకు పిలుపునివ్వడం అభినందనీయమని సోమిరెడ్డి అన్నారు. జూపుడి ప్రభాకర్ రావు కూడా చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ప్రతిపక్షాలపై ఘాటుగానే మండిపడ్డారు. ప్రమాదం జరిగి ఓవైపు ప్రాణాలు కోల్పోయి ఉంటే బాధితులను ఓదార్చాల్సింది పోయి దాని కారణం సీఎం అంటు.. టీడీపీ అంటూ విమర్సలు చేయడం విడ్డూరమన్నారు. అంతేకాక మేం కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని.. పార్టీ తరుపున ఎవరినైనా వాలెంటీర్లను పంపించారా అని ప్రశ్నించారు. శవాల పైన రాజకీయం చేసే బ్యాచ్ అని ధ్వజమెత్తారు.

ఏసీబీ ఎదుట వేం నరేందర్ తనయుడు

  ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు ఎవరో ఒకరికి నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ లకు తరువాత ఈ కేసులో నిందితులుగా భావించి తెదేపా నేతలైన వేం నరేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలకు నోటీసులు జారీ చేసి వారిని విచారించింది. ఇప్పుడు ఈ కేసులో వేం నరేందర్ రెడ్డి తనయుడు కృష్ణ కీర్తన్ రెడ్డి కు కూడా సెక్షన్ 160 కింద ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కృష్ణ కీర్తన్ రెడ్డి ఈరోజు ఏసీబీ ఎదుటు హాజరయ్యారు. కాగా వేం నరేందర్ కొడుకు కృష్ణ కీర్తన్ రెడ్డి బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అయితే అతను రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహాలతో మాట్లాడినట్టు ఏసీబీ గుర్తించడంతో అతనికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

అర్ధరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో రెండో రోజు కూడా గోదావరి మహాపుష్కర స్నానాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండు రోజు కూడా భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఏపీలోని రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపురం, తెలంగాణలోని భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం ఘాట్లలో భక్తులు కిటకిటలాడుతున్నారు. కాగా నిన్న రాజమండ్రిలోని పుష్కర ఘాట్‌ తొక్కిసలాట నేపథ్యంలో జరిగిన ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోగా అక్కడ ఏపీ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు కూడా మంగళవారం అర్ధరాత్రి వరకు పుష్కర ఘాట్‌ల వద్ద కలియతిరిగి అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరాల సమాచారం కోసం 8333000020 టోల్‌ఫ్రీ ఫోన్‌లో సంప్రదించాలని అధికారులు కోరారు.