ఓటుకు నోటు.. ఏసీబీ వరుసబెట్టి నోటీసులు

  ఓటు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు వరుసపెట్టి అందరికీ నోటీసులు జారీ చేసే పనిలోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి నుండి మొదలు పెట్టి ఈ కేసులో సంబధం ఉందంటూ ఇప్పటివరకూ ఎంతో మందికి నోటీసులు జారీ చేశారు. మొదట టీడీపీ నేతలు సండ్ర వెంకట వీరయ్య.. వేం నాగేందర్ రెడ్డిక నోటీసులు జారీ చేశారు. తరువాత వేం నరేందర్ రెడ్డి కొడుకుకి.. ఆతరువాత కారు డ్రైవర్లకి కూడా నోటీసులు జారీ చేశారు. అంతేకాక రేవంత్‌ రెడ్డి అనుచరులు అల్లూరి నారాయణరాజు, సైదులికి విచారణకు హాజరుకావాలంటూ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యలయంలో వారు విచారణలో పాల్గొన్నారు. సుమారు ఏడు గంటలపాటు ఏసీబీ అధికారులు విచారించారు. అయితే ఇంకా కొంతమందికి ఏసీబీ నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో సంబంధం ఉన్నా లేకపోయిన అందరినీ వరుసపెట్టి విచారించే పనిలో పడింది.

అవును...ఏపీ ఫోన్లు ట్యాపింగ్ చేసాము

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సహా కొందరు మంత్రులు, ఉన్నతాధికారుల ఫోన్లను తెలంగాణా ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఆరోపణలు నిజమేనని తేలింది. ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు టెలిగ్రాఫిక్ చట్టంలో సెక్షన్: 5క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరి ఫోన్లను ట్యాపింగ్ చేయమని తెలంగాణా ప్రభుత్వ సంస్థలు తమను కోరాయని, దాని ఆదేశాలు పాటిస్తూ కొన్ని ఫోన్లను ట్యాపింగ్ చేసామని ఐడియా, ఎయిర్ టెల్ మరియు రిలయన్స్ సంస్థలు సుప్రీంకోర్టుకి తెలిపినట్లు సమాచారం. కానీ అవి అధికారిక రహస్యాలు కనుక వాటిని బయటపెట్టవద్దని, బయటపెడితే ప్రాసిక్యూట్ చేస్తామని తమను హెచ్చరించినట్లు వారు సుప్రీంకోర్టుకి తెలిపారు. కానీ ఆ వివరాలను విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు తమను కోరుతుండటంతో ఏమి చేయాలో పాలుపోకనే సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్లు వారు తెలిపారు.   వారి పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు ఆ వివరాలను సీల్డ్ కవర్లో పెట్టి వారం రోజుల్లోగా విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకి అందజేయవచ్చని, వారికి తమ అనుమతి ఉంది కనుక తెలంగాణా ప్రభుత్వం నుండి ఎటువంటి న్యాయపరమయిన సమస్యలు రావని హామీ ఇచ్చింది. కనుక మిగిలిన అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ చేసిన కాల్ డాటాని విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకి సమర్పిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తదుపరి చర్యలకు ఉపక్రమించవచ్చును.

సునీల్ జాక్ పాట్.. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా చెల్లి

  సునీల్ కమెడియన్ గా చిత్రపరిశ్రమకు పరిచయమయ్యి ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకులను నవ్వించాడు. తరువాత హీరోగా మారి ఎన్నో వైవిద్యమైన పాత్రల‌లో నటించాడు. ఆ తరువాత జక్కన్న రాజమౌళి డైరెక్షన్ లో నటించే ఛాన్స్ కొట్టేసి మర్యాద రామన్న చిత్రంలో నటించి హిట్ అందుకున్నాడు. అనంతరం పలు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే కొన్నిరోజులుగా గ్యాప్ తీసుకున్న సునీల్ ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సునీల్ క‌థానాయ‌కుడిగా, ర‌క్ష ఫేమ్ వంశి కృష్ణ ఆకేళ్ళ ద‌ర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లి మ‌న్నార్ చోప్రాతో జతకట్టే జాక్ పాట్ కొట్టేశాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

దశలవారీగా ఏపీ రాజధాని.. అయోమయస్థితిలో ఏపీ రైతులు

  ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం ఎలా ఇంకా ప్రారంభంకూడా కాలేదు. కానీ అమరావతిపై అంచనాలు మాత్రం చాలా పెరిగిపోయాయి. ఆంధ్ర ప్రభుత్వం ఏపీ సీడ్ క్యాపిటల్ పేరుతో ఫోటోలు విడుదల చేయడం.. అమరావతికి 100 శాతం వాస్తు కుదరడం.. అంతేకాక రాజధానిలో ఆహాశహర్మ్యాలు నిర్మించే దిశగా ప్రయత్నాలు జరగడం ఓరకంగా ఇవన్నీ అమరావతిపై భారీ అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి. అసలు అమరావతి నిర్మాణం పూర్తయ్యేసరికి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇవన్నీ చూస్తుంటే మాత్రం నిజంగానే అలా ఉంటుందేమో అని అనిపిస్తుంది.   అంతా బానే ఉంది కానీ సింగపూర్ ప్రభుత్వం ఏపీ రాజధాని ఇచ్చిన ప్లాన్ లో ఈ అమరావతి పనులు దశలవారీగా పూర్తవుతాయని పేర్కొంది. 2035 వరకు పూర్తవుతాయని.. 2018 నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని పేర్కొంది. అయితే సింగపూర్ ప్రభుత్వం చెప్పిన దానికి ఏపీ రైతులు అయోమయస్థితిలో పడిపోయారు. రాజధాని తొలిదశ పనులు 2018 నాటికి పూర్తవుతాయి అంటే ఏపీ సీడ్ క్యాపిటల్ అవ్వచ్చు.. మరి మిగిలిన భూముల సంగతి ఏంటి.. వాటిని ఎప్పుడు అభివృద్ధి చేస్తారు..తమకు ఇవ్వాల్సిన ప్లాట్లను ఎప్పుడు ఇస్తారు అని రాజధానికి భూమి కేటాయించిన రైతులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి భూసమీకరణ చేపట్టినప్పుడు ప్రతిపక్షాలు పలు రకాలుగా వాదనలు చేసిన రైతులు మాత్రం చంద్రబాబునాయుడిపై నమ్మకం ఉంచి.. ఆయన ఏపీ రాజదానిని ఓమహాద్భుతంగా నిర్మించగలరని విశ్వాసం ఉంచి తన భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. చంద్రబాబు కూడా రాజధాని నిర్మాణానికి ముందే ప్లాట్ల విభజన పూర్తవుతుందని, ఏ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు ఆ ప్రాంతంలోనే భూములు కేటాయిస్తామని చెప్పారు. అయితే దశలవారీగా నిర్మాణం అనేసరికే రైతులకు సందేహాలు ముసురుకుంటున్నాయి.

టీ సర్కార్ కు కేంద్రం ఝలక్.. ఏపీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి

  రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు అంశాలలో విభేధాలు తలెత్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ శాఖలకు సంబంధించి.. ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ శాఖల్లో ఉద్యోగుల రిలీవింగ్ గురించి గొడవలు పడుతూనే ఉన్నారు. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం ఏపీ విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగులను రిలీవ్ చేస్తానంటుంటే.. మరోపక్క ఏపీ ప్రభుత్వం దీనికి నిరాకరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఉద్యోగులు విభజన పై ఏర్పాటు చేసిన కమల్ నాథ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలని లేదా.. ఉమ్మడిగా ఇరు రాష్ట్ర ఇంధన సంస్థలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా ఈ ఏడాది మార్చి 20న కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సమక్షంలో ఇరు రాష్ర్టాల విద్యుత్ సంస్ధలు సమావేశమయ్యి ఒప్పందం చేసుకున్న మేరకు విభజన ప్రక్రియ జరగాల్సిఉంది. అంతేకాని తెలంగాణ ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండా తనకు ఇష్టమొచ్చినట్టు ఏకపక్షంగా వ్యవహరించడం సబబు కాదని తెలిపింది.   ఇప్పుడు ఐ.వై.ఆర్‌.కృష్ణారావు రాసిన లేఖకు కేంద్రం కూడా మద్ధతు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. తెలంగాణ విద్యుత్ సంస్ధల్లో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేస్తూ టీ సర్కార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం సరికాదని.. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉద్యోగుల సర్దుబాటుకు సముఖత చూపునినట్టు.. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్లో ఎంత మందిని తెలంగాణకు పంపిస్తే, అంతే సంఖ్యలో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వెనక్కు పంపిచే విధంగా సర్దుబాటు చేసుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని గతంలో అన్నా దానికి సంబంధించిన వార్తలు ఇప్పడు వినిపించడంలేదు. కాగా ఈ నెల 31న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి వద్ద ఉద్యోగుల విభజనకు సంబంధించి ఇరు రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇంధన శాఖ కార్యదర్శులు, ట్రాన్స్‌కో సీఎండీలు సమావేశం కావాల్సి ఉంది.

నేటితో గోదావరి మహాపుష్కరాలు సంపూర్ణం

  రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత వైభవంగా సాగిన గోదావరి మహా పుష్కరాలు ఈరోజుతో ముగుస్తాయి. కనుక చివరి రోజయిన ఈరోజు పుష్కర స్నానాలు చేసేందుకు సుదూర ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలివస్తుండటంతో రెండు రాష్ట్రాలలో పుష్కర ఘాట్లు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం రెండు రాష్ట్రాలలో అన్ని ఘాట్ల వద్ద గోదావరి నదికి హారతి కార్యక్రమం నిర్వహిస్తారు.   ఈ మహా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పుష్కర ముగింపు వేడుకలను కూడా అంతకంటే ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఈరోజు సాయంత్రం రాజమండ్రిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించబోతోంది. కన్నులకింపుగా నిర్వహిస్తున్న గోదావరి హారతితో బాటు సాయంత్రం లేజర్ లైట్ల ప్రదర్శన, రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో వెయ్యి మంది కూచిపూడి కళాకారుల నృత్య ప్రదర్శన, సుప్రసిద్ధ గాయకుడు మంగళంపల్లి బాలమురళి కృష్ణచే కర్నాటక గాత్ర సంగీత కచేరీ మొదలయిన అనేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

జగన్ అక్రమాస్తుల కేసు ఆగస్ట్ 21కి వాయిదా

  అక్రమాస్తుల కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఏ-2 ముద్దాయిగా ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఇంకా అనేక మందిపై సీబీఐ 11 చార్జ్ షీట్లు దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వాటన్నిటినీ వేర్వేరుగా కాకుండా అన్నిటినీ కలిపి ఒకేసారి విచారణ చేయాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి తదితరులు సీబీఐ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిని సీబీఐ కోర్టు నిన్న విచారణకు చేప్పట్టినప్పుడు సీబీఐ తరపున వాదించిన న్యాయవాదులు వారి వేసిన పిటిషన్ న్ని తిరస్కరించాలని కోర్టుని కోరారు. ఈ 11 కేసుల్లో ఒకే రకమయిన నేరం జరిగినప్పటికీ అందులో అనేక మంది నిందితులు వేర్వేరు లక్ష్యాలతో ఈ కుట్రలకు పాల్పడ్డారని కనుక అన్ని చార్జ్ షీట్లను కలిపి విచారించడం సబబు కాదని వాదించారు. కొందరు కొన్ని కేసులలో ముద్దాయిలుగా ఉండగా, జగన్, విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు కొందరు అన్ని కేసులలో ముద్దాయిలుగా ఉన్నారని, వారు వివిధ మార్గాలలో, వేర్వేరు ప్రయోజనాలని ఆశించి ఈ నేరాలకి పాల్పడ్డారు కనుక 11 చార్జ్ షీట్లను కూడా వేర్వేరుగానే విచారించాలని, కనుక జగన్మోహన్ రెడ్డి తదితరులు వేసిన పిటిషన్ న్ని కొట్టివేయాలని సీబీఐ న్యాయవాదులు వాదించారు. ఇరు పక్షాల వాదనలను విన్న తరువాత సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వెంకట రమణ ఈ కేసుని ఆగస్ట్ 21కి వాయిదా వేశారు.

ఆపన్నహస్తం అందించిన 'తెలుగువన్ ఫౌండేషన్'

  కుటుంబ బాధ్యత వహించాల్సిన కొడుకు రెండు చేతులు కాలిపోయి ఏం చేయలేని స్థితిలో ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవిస్తారో అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. అలాగే తన రెండు చేతుల్ని ఏమాత్రం కదపలేని స్థితిలో ఉండే వ్యక్తి జీవితం ఎంత దర్భరంగా ఉంటుందో వేరే చెప్పక్కరలేదు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది తెలుగువన్ ఫౌండేషన్. కన్నా రామంజనేయులు అనే కుర్రాడిది బసవవానిపాలెం.. కోడూరు మండలం. అతనికి 7 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు జరిగిన అగ్నిప్రమాదంలో అతని రెండు చేతులు పూర్తిగా కాలిపోయి శరీరానికి అంటుకుపోయాయి. కనీసం చేతులు రెండూ ఏమాత్రం కదపలేని పరిస్థితిలో 10 సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్నాడు. అతను తెలుగువన్ ఫౌండేషన్ అధినేత శ్రీ రవిశంకర్ కంఠమనేని ని కలిసి తన పరిస్థితిని వివరించినప్పుడు అతని స్థితికి చలించిపోయిన శ్రీ రవిశంకర్ గారు ముందుకొచ్చి అతని చేతులకు ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు తను తన ఒక చేతిని కదపగలుగుతున్నాడు.. మరో చేతి ఆపరేషన్ మరో ఆరు నెలల్లో చేయించనున్నారు.

50 ఏళ్లైనా కాంగ్రెస్ కు అధికారం దక్కదు.. అచ్చెన్నాయుడు

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురంలో రైతు భరోసా యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రైతు భరోసా యాత్రపై టీడీపీ నేత ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రాన్ని విడదీసి.. తెలుగు ప్రజల మధ్య విబేధాలు ఏర్పడేలా చేసి ఇప్పడు ఏ మొహం పెట్టుకొని రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చారని విమర్శించారు. రాష్ట్ర విభజన వల్ల తమ పార్టీకి ప్రయోజనం ఉంటుందని ఆశించి సోనియాగాంధీ అతి దారుణంగా రాష్ట్రాన్ని విడదీశారని.. కానీ తెలుగు ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పారని ఎద్దేవ చేశారు. ఇంకా 50 ఏళ్ల పాటు పోరాడినా కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కదని కూడా అచ్చెన్న జోస్యం చెప్పారు.

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

  ఏపీ సీఎం చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. గోదావరి మహాపుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్ల పర్యవేక్షణకు వెళ్లిన చంద్రబాబు లాంఛీకి ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం... శుక్రవారం చంద్రబాబు, మంత్రులు ఉన్నతాధికారు దాదాపు రెండు గంటల పాటు ప్రత్యేక బోటులో గోదావరి పర్యటించి పుష్కర ఘాట్లను పర్యవేక్షించడానికి వెళ్లగా.. వారితో పాటే ఇంకో బోట్ లో మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారు. అయితే టూరిజం బోటు ప్రాంతం నుంచి విఐపి ఘాట్, సరస్వతీ ఘాట్, గౌతమీ ఘాట్‌లను పరిశీలించి కొవ్వూరు వస్తుండగా అదే సమయంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న లాంచీని మీడియా లాంచ్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా అధికారులు ఉలిక్కిపడ్డారు. అయితే ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు కానీ మీడియా బోటు స్వల్పంగా దెబ్బతింది. కాగా కోటి లింగాల రేవు ఘాట్ వద్ద కూడా సీఎం లాంచి మట్టిలో చిక్కుకొని ఓవైపు ఒరిగిపోయింది.

మున్సిపల్ జీతాలు పెంచలేం.. చేతులెత్తేసిన టీ సర్కార్

  మున్సిపల్ కార్మికులు తమ వేతనాలు పెంచమని వారం రోజులకుపైగా సమ్మె చేసిన సంగతి తెలిసిందే. అయితే కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెను మొదట తెలంగాణ ప్రభుత్వం అంటీ అంటనట్టుగానే ఉంది. తరువాత వారి సమ్మెకు ప్రతిపక్షపార్టీలు మద్ధతు తెలిపి.. బంగారు తెలంగాణ చేస్తానని నగరాన్ని చెత్తగా మార్చారని.. మున్సిపల్ శాఖ కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నా కాని సమస్య పరిష్కారం కాకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ.. వెంటనే వాళ్ల సమస్యలు తీర్చాలంటూ పార్టీలు ధర్నా చేయడంతో దిగివచ్చిన తెలంగాణ ప్రభుత్వం వారి వేతనాలు పెంచేందుకు అంగీకరించింది. దాంతో కార్మిక సంఘాలు కూడా సమ్మెను విరమించాయి. ఇక్కడ వరకూ బానే ఉంది. కానీ ఇప్పుడు జీహెచ్‌ ఎంసీ మినహా ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలలో ఇప్పటికిప్పుడు వేతనాలను పెంచలేమని చేతులేత్తేసినట్టు తెలుస్తోంది.   అయితే మున్సిపాలిటీ కార్మికులు వేతనాలపై దృష్టిసారించిన తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను సంప్రదించింది. దీనికి సంబంధించి ఈ కమిటీ మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు చెందిన మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు, ఉద్యోగులతో చర్చలు జరిపి వేతనాలను పెంచాలని మునిసిపాలిటీల్లో పనిచేసే కార్మికులు కోరుతున్నారని తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వానికి ఓ నివేదికను పంపించింది. వాస్తవానికి మునిసిపాలిటీలే ఆ ఉద్యోగుల వేతనాలను చెల్లిస్తున్నాయి. కానీ ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితి వల్ల అది సాధ్య కాదని.. ‘‘ప్రస్తుతం ఉన్న ఆదాయం మునిసిపాలిటీలను నిర్వహించడానికే చాలడం లేదని తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్ ఇప్పుడు వేతనాల పెంపుపై ఏం చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలే తెలంగాణ ఖజానా కూడా ఖాళీ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రమంతటా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహించినప్పటికీ అది ఒక్క జీహెచ్ఎంసీ మాత్రమే పరిమితం చేసే యోచన చేసింది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు దానికి కూడా వేతనాల పెంపు కష్టమే. మరి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.

త్వరలో గవర్నర్ రాజీనామా చేయనున్నారా?

  ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం క్రమంగా చల్లబడుతున్న ఈ సమయంలో గవర్నర్ నరసింహన్ బాంబు లాంటి మాటొకటి పేల్చి కలకలం సృష్టించారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఇండో గ్లోబల్ ఫార్మా సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, “త్వరలోనే నేను కూడా సాధారణ పౌరుడుగా మారాతున్నాను,” అని అన్నారు. రెండు రాష్ట్రాలకి ప్రధమ పౌరుడుగా ఉన్న ఆయన సామాన్య పౌరుడు అవడం అంటే తన పదవి నుండి తప్పుకోవడమే.   కానీ ఇప్పుడు ఆయనని దిగిపొమ్మని కేంద్ర ప్రభుత్వం కానీ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కానీ పట్టుబట్టడం లేదు. మొదట తెదేపా మంత్రులు, నేతలు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించినా ఆ తరువాత అచ్చెం నాయుడు వంటి వారు ఆయన మనసు నొప్పించినందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ఆయనకీ ఇబ్బంది కలిగించే సెక్షన్: 8 గురించి కూడా ఇప్పుడు ఎవరూ గట్టిగా ఒత్తిడి చేయడం లేదు. క్రమంగా రెండు రాష్ట్రాల మధ్య పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొంటున్నాయి. ఇటువంటి సమయంలో ఆయన తన పదవి నుండి తప్పుకోవాలని ఎందుకు భావిస్తున్నారో తెలియదు. బహుశః ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలు, వివాదాలు పరిష్కరించడం సాధ్యం కాదనే అభిప్రాయంతోనే ఆయన గౌరవప్రదంగా తప్పుకోవాలనుకొంటున్నారేమో? కానీ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఇదే అంశం మీద నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఒక బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ని రాజీనామా చేయమని ఎటువంటి ఒత్తిడి చేయలేదని, అసలు తమ ప్రభుత్వానికి అటువంటి ఆలోచనే లేదని స్పష్టం చేసారు.

నేడు అనంతపురంలో రాహుల్ పాదయాత్ర

  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు అనంతపురం జిల్లాలో ఓబులదేవర చెరువు నుండి కొండకమర్ల గ్రామం వరకు సుమారు 10 కి.మీ పాదయాత్ర చేస్తారు. ఆయన ఉదయం డిల్లీ నుండి బెంగుళూరు విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుండి నేరుగా జిల్లాలో ఓబులదేవర చెరువు గ్రామంలో ఇందిరా గాంధీ వేదిక వద్దకి చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తన పాదయాత్రను ఆరంభిస్తారు. దారిలో మామిళకుంటుపల్లి, దేబురాపల్లి గ్రామాలలో ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలని, మహిళా స్వయం సహాయక సంఘాలను, చేనేత కార్మికులను, విద్యార్ధులను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకొంటారు. దారిలో కొండకమర్ల గ్రామం వద్ద బహిరంగ సభ నిర్వహించి తన పాదయాత్రను ముగించి మళ్ళీ సాయంత్రం బెంగళూరు నుండి డిల్లీకి విమానంలో వెళ్ళిపోతారు.   ఈసారి ఆయన పాదయాత్రకి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆయన ఓబులదేవర చెరువు గ్రామంలో అంబేద్కర్ విగ్రహంతో బాటు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి తన పాదయాత్ర ఆరంభిస్తారు. రాష్ట్ర విభజన వలన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనే కారణంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలకు రాష్ట్ర విభజన వలన రాష్ట్రానికి మంచే జరిగిందని ఆయన నచ్చజెప్పబోతున్నట్లు సమాచారం.   ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో బాటు సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఓడిపోయినా తరువాత నుండి ఇంతవరకు ప్రజలకు మొహాలు చూపించని ఆనం రామనారాయణ రెడ్డి, పళ్ళం రాజు, కిల్లి క్రుపారాణి, కెవిపి రామచంద్రరావు, తన 150వ సినిమా నిర్మాణంపైనే దృష్టిపెట్టిన చిరంజీవి, ఏఐ.సి.సి. ప్రధాన కార్యదర్శి కొప్పలరాజు తదితరులు కూడా పాల్గొంటారు.   ఇదివరకు రాహుల్ గాంధీ తెలంగాణాలో పాదయాత్ర చేసినప్పుడు కేవలం ఆ రాష్ట్ర నేతలే ఆయన వెంట వచ్చేరు. కానీ ఈసారి ఆయనతో బాటు అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల పీసీసీ కార్యవర్గ సభ్యులు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

పార్లమెంట్ లో కాంగ్రెస్ రచ్చ.. మాట్లాడలేకపోతున్నాం.. టీడీపీ ఎంపీలు

  పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీనేతల తీరును టీడీపీ ఎంపీలు తప్పుబట్టారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ను దద్దరిల్లేలా చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రుల ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అవకాశం రావట్లేదు. దీనితో కాంగ్రెస్ నేతల వైఖరిపై టీడీపీ ఎంపీలు మండిపడుతున్నారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ తీరుపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌ను స్తంభింపజేయడం వలన ఏపీ సమస్యలు ప్రస్తావించలేకపోతున్నామని.. సభలో కాంగ్రెస్‌ వైఖరితో ఏపీకి తీరని నష్టం కలుగుతోందని ఎంపీలు వ్యాఖ్యానించారు. సభ సజావుగా సాగితే, ఏపీకి ప్రత్యేక హోదా, నిధులపై చర్చించవచ్చని వారు అన్నారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్ లో వ్యవహరించాల్సిన తీరును ప్రతిపక్షాలు నేర్చుకోవాలన్నారు.

ప్రజలే బుద్ధి చెబుతారు.. పత్తిపాటి

  ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ పై విమర్శలు చేశారు. దొంగ యాత్రలతో ప్రజలను మోసం చేయాలనుకుంటే కుదరదని.. ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే సూచనలు ఇస్తే తాము స్వీకరిస్తామని, కానీ అభివృద్ధికి అడ్డుపడిడాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని ఆయన అన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక.. ఏం చేయాలో తెలీక ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారని.. తమ తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఒకటిగా ఉన్నరాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం ఎవరూ నమ్మె స్థితిలో లేరని ఎద్దేవ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుపై జగన్ అనవసరంగా రాద్దాంతం చేస్తుందని.. పట్టిసీమ ప్రాజెక్టు వస్తే తమకు పార్టీకి పుట్టగతులు ఉండవనే భయంతో దానిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

ప్రత్యేక హోదాపై సుజనా ట్విస్ట్.. పవన్ కళ్యాణ్ నోరు మూయించేందుకే

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదాపై చర్చలు జరుగుతున్నాయని.. ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాడతామని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సుజనా చౌదరి మరో ట్విస్ట్ ఇచ్చారు. లోకసభ జరిగితేనే కదా, మనం ప్రత్యేక హోదా, నిధుల గురించి కేంద్రాన్ని అడగడానికి వీలుంటుందని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ ప్రారంభమైన రోజునుండే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టడం మొదలుపెట్టారు. సభను సక్రమంగా జరగకుండా పదేపదే అడ్డుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఏపీ ప్రత్యేక హోదా గురించి చర్చించడం కష్టమైన పనే కాని కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదాకి నిధులు తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి ఏపీకి నష్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కూడా పార్లమెంట్లో తన వైఖరి వల్ల ఏపీకి నష్టం చేకూరుతుందని అన్నారు.   మరోవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని టిడిపి ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్ముడి విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు చేసే ధర్నాలన్నీ కంటితుడుపు చర్యలు అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ల నోర్లు మూయించేందుకే ప్రత్యేక హోదా కోసం ధర్నా అని వ్యాఖ్యానించారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయనుకోవడం లేదన్నారు. మొత్తానికి ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ మాటలు మన ఎంపీల మీద పనిచేసినట్టున్నాయ్.

గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలున్నాయి

  సెక్షన్ 8పై తెలంగాణ రాష్ట్రం.. ఆంధ్రరాష్ట్రం దెబ్బలాడుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి గాను గవర్నర్ ను ఇరు రాష్ట్రాల సీఎంల వల్ల ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లో పౌరుల భద్రతని దృష్టిలో ఉంచుకొని విభజన చట్టంలో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి కిరణ్‌ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో భద్రత వ్యవస్థకు సంబంధించిన ప్రత్యేక బాధ్యతలను గవర్నర్ కు అప్పగించామని తెలిపారు.

అంత సీన్ లేదు... కాల్ డేటా ఇవ్వాల్సిందే

  ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ ప్రభుత్వానికి.. ఆంధ్రాప్రభుత్వానికి మధ్య వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అటు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులకు, ఇటు సర్వీసు ప్రొవైడర్ల తరపు న్యాయవాదులకు మధ్య వాదనలు జరిగాయి. అయితే సర్వీసు ప్రొవైడర్లు మాత్రం తెలంగాణ ప్రభుత్వం కాల్ డేటా ఇవ్వద్దని చెప్పిందని.. ఇస్తే ప్రాసిక్యూషన్ చేస్తామని హెచ్చరించిందని తెలియజేశారు. అంతేకాదు కేంద్రం కూడా దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిన పని లేదని చెప్పిందని తెలిపారు. అయితే దీనికి కోర్టు అలాంటివి ఇక్కడ చెల్లవు.. పాలనా విధానం వేరు.. చట్టాలు వేరు.. కాల్ డేటా ఇవ్వాల్సిందే అని తేల్చిచెప్పింది. కానీ సర్వీసు ప్రొవైడర్లు అంతటితో ఆగారా అంటే లేదు.. కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పాపం అక్కడ కూడా వాళ్లకి మొట్టికాయ పడింది.   ఈరోజు సర్వీసు ప్రొవైడర్లు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏపీ సిట్ అధికారుల అడిగిన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కాల్‌డేటాను వారం రోజుల్లోగా ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. అయితే సర్వీసు ప్రొవైడర్లు తరపు న్యాయవాది మాట్లాడుతూ కాల్ డేటా ఇస్తే తెలంగాణ ప్రభుత్వ ప్రాసిక్యూషన్ చేస్తానని హెచ్చరించిందని చెప్పడంతో దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేస్తూ సుప్రీం జ్యుడిషియల్‌ ఆర్డర్‌ ఉన్నప్పుడు దాని ముందు ఏ ఆర్డ్‌ర్స్‌ పనిచేయవని.. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని సూచించింది. ఈ నేపథ్యంలో కాల్ డేటా ఇవ్వడానికి తమకు కొంత సమయం కావాలని సర్వీస్‌ప్రొవైడర్ల కోర్టును కోరడంతో వారం రోజుల పాటు గడువును ఇచ్చింది. దీనిలో భాగంగానే సుప్రీంకోర్టు విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు కొన్నిసూచనలు చేసింది. కాల్‌డేటా ఇచ్చాక సీల్డ్‌ కవర్‌ను మూడు వారాల వరకు తెరచి చూడకూడదని, కాల్‌డేటాను స్వీకరించిన అనంతరం విచారణను నెలరోజుల పాటు వాయిదా వేయాలని విజయవాడ కోర్టును ఆదేశించింది.

ఏపీ రాజధానిలో ట్విన్ టవర్స్

  ఏపీ నూతన రాజధానిపై ఇప్పుడు భారీ అంచనాలు మొదలయ్యాయి. ప్రపంచ దేశాలను తలదన్నే రీతిలో ఈ రాజధాని నిర్మాణం ఉంటుందని ఇప్పటికే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికి సంబధించి సింగపూర్ ప్రభుత్వం కూడా అదేవిధంగా ప్రణాళికను ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కృష్ణానది తీరాన ఆకాశహార్మ్యాలు నిర్మించనున్నారు. ఈ భవనాల నిర్మాణాన్ని చేపట్టే బాధ్యత కూడా సింగపూర్ డెవలపర్స్ తీసుకోవడానికి ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. కృష్ణానది తీరాన సుమారు 17 చదరపు కిలోమీటర్లు వరకు.. సుమారు 70-80 అంతస్థులు ఉండేలా ఈ బహుళ అంతస్థులను నిర్మించాలని అనుకుంటున్నారు. అంతేకాక కృష్ణానది తీరాన 125 అడుగులు ఉండే ద్యాన బుధ్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇంకా రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు అసెంబ్లీ, సచివాలయం, కోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు రాజధాని నడిబొడ్డున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2050 నాటికి అమరావతిలో కోటి మంది నివాసం ఉండే అవకాశం ఉందని.. దీనికి అనుగుణంగానే భవన నిర్మాణాలు జరపాలని ఏపీ సర్కార్‌ అంచనా వేస్తోంది.   మరో వైపు నూతన రాజధానికి పక్కా వాస్తు కుదిరిందని.. అన్ని నిర్మాణాలకు అనువైన స్థలంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్, సింగపూర్ దేశాలు కూడా ముందుకొస్తున్నాయి. ఇంకా ఈరాజధాని నిర్మాణానికి దసరా నాడు శంకుస్థాపన చేయాలని నిర్ణయించుకున్నట్టు ఏపీ ప్రభుత్వ స్పష్టం చేసింది. అది జరిగిన వెంటనే రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతాయని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.