అవును అందుకే ఢిల్లీకి వెళ్ళేది

  జగన్మోహన్ రెడ్డికి బెయిలు రాకుండా అడ్డుకోనేందుకే చంద్రబాబు డిల్లీ యాత్రకు బయలుదేరుతున్నారని ఇంతవరకు వైకాపా ఆరోపించడం, దానిని తెదేపా నేతలు ఖండించడం రోజువారి వార్తలుగా మారిపోయాయి. కానీ, ఇప్పుడు చంద్రబాబు తన పార్టీ యంపీలను, సభ్యులను వెంటబెట్టుకొని సీబీఐ, ఈడీ తదితరులందరినీ కలిసి జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో పిర్యాదులు చేయబోతున్నట్లు వస్తున్నవార్తలు, ఇక ఈ ముసుగులో గుద్దులాటలు అవసరం లేకుండా చేసాయి. చంద్రబాబు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి సమాజంపై ఆర్ధిక అత్యాచారం చేసిన నేరగాడని, అతని కేసు కూడా నిర్భయ అత్యాచార కేసు వంటిదేనని, అందువల్ల అతనికి ఉరి శిక్షవేసినా తక్కువేనని ఆయన అన్నారు. ఈ నేపద్యంలో చంద్రబాబు డిల్లీ వెళ్లి సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులను ఎందుకు కలవాలనుకొంటున్నారో ప్రత్యేకంగా వివరించనవసరం లేదు.   అయితే, తెదేపా మాత్రం తాము ప్రధానిని, రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించిన నాటి నుండి రాష్ట్రంలో ప్రజలు ఏవిధంగా ఇబ్బందులు పడుతున్నారో, సమైక్యాంధ్ర ఉద్యమాలు, హైదరాబాద్ వంటి పలు అంశాల గురించి వారికి వివరించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించామని కోరేందుకే డిల్లీ వెళుతున్నామని చెపుతున్నారు.

మోపిదేవికి బెయిలు మంజూరు

  మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు వచ్చేనెల 31వరకు వైద్యం కోసం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. కేవలం వైద్యం కోసమే బెయిలు మంజూరు చేస్తున్నందున ఈ సమయంలో బయట వ్యక్తులను ఎవరినీ కలువరాదని, అదేవిధంగా సాక్షులను ప్రభావితం చేయరాదని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు సూచించింది. ఈ షరతులలో దేనిని ఉల్లంఘించినా బెయిలు రద్దు చేస్తామని హెచ్చరించింది. మోపిదేవిని మళ్ళీ నవంబర్ 1న పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది.   ఇక జగన్మోహన్ రెడ్డి తనకు ఇంటి నుండి భోజనం తెప్పించుకొనేందుకు అనుమతించాలని కోర్టుకు పెట్టుకొన్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషను బుధవారంనాడు విచారణకు వస్తుంది. ఆ రోజే సీబీఐ కౌంటర్ దాఖలు చేయడంతో బాటు, అక్రమాస్తుల కేసులో ఆఖరి రెండు చార్జ్ షీట్లు దాఖలు చేయనుంది.

తెదేపా నేతలకి షర్మిల సూటి ప్రశ్న

  తెదేపా, వైకాపా నేతలలో ఎప్పుడు ఎవరు డిల్లీ బయలుదేరుతున్నారెండో పార్టీ నేతలు దానిపై వివాదం రేకెత్తించడం రివాజుగా మారిపోయింది. అయితే ఆ రెండు పార్టీ నేతలు కూడా ‘కాంగ్రెస్ పార్టీతో మీరు కుమ్మక్కయ్యారంటే మీరే’ అని వాదులాడుకొంటూ ప్రజలకి మంచి కాలక్షేపంతో బాటు కొత్త అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నారు. కానీ, ఇందులో మూడో పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ఈవాదప్రతివాదనలు, ఆరోపణలపై ఎన్నడూ స్పందించకపోవడం విశేషం.   ఇక తల్లి, పిల్ల కాంగ్రెస్ కలయిక అనివార్యమని బల్ల గుద్ది చెపుతున్నతెదేపా నేతలకు వైకాపా నేత షర్మిల ఒక సూటి ప్రశ్న అడిగారు. తెదేపా చెపుతున్నట్లు తాము కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యి ఉండి ఉంటే, తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి 16నెలల్లుగా జైల్లో మ్రగ్గేవాడా? కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఉంటే ఏనాడో కేంద్ర మంత్రి అయ్యి ఉండేవారు కాదా? అని ఆమె ప్రశ్నించారు. ఇప్పడు కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి బెయిలు రాకుండా అడ్డుపడేందుకే పనిగట్టుకొని డిల్లీ బయలుదేరుతున్నారని ఆమె ఆరోపించారు. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీతో ఎవరు చేతులు కలుపుతున్నారో అందరికీ అర్ధం అవుతోందని ఆమె అన్నారు.   అయితే, వైకాపా, కాంగ్రెస్ పార్టీతో ఎన్నడూ చేతులు కలపదని, కాంగ్రెస్ లో విలీనం కాదని షర్మిల హామీ ఇవ్వగలరా? అని తెదేపా నేతలు ఎదురు ప్రశ్నించారు.

అద్వానికి ఆఫ‌ర్ ఇచ్చిన బిజెపి..?

  మోడిని ప్రదాని అభ్యర్ధిగా ప్రక‌టించ‌టంతో అలిగి పార్టీ కార్యక్రమాల‌కు దూరంగా ఉన్న ఎల్‌కె అద్వాని ఒక్కసారిగా యు ట‌ర్న్ తీసుకున్నారు. మోడి అభివృద్దికి కెరాఫ్ అడ్రస్ అంటూ పొగ‌డ్తల‌తో ముంచెత్తారు. అయితే నిన్నటి వ‌ర‌కు బెట్టు చేసిన ఈ రాజ‌కీయ కురువృద్దుడు ఇలా ఒక్కసారిగా మారిపోవ‌టం వెనుక పెద్ద కార‌ణమే ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో మోడి సార‌ధ్యంలోని బిజెపి పార్టీ విజ‌యం సాదించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని భావిస్తున్న పార్టీ వ‌ర్గాలు. మోడి ప్రదాని అయితే అద్వానికి కూడా ఓ అత్యున్నత ప‌ద‌వి అందించే ఆలోచ‌న ఉన్నాయి బిజెపి వ‌ర్గాలు. అయితే ప్రదాని ప‌ద‌వికి మించిన ఆ స్థానం ఏంటా అన్నదే ఇప్పుడు అస‌లు చ‌ర్చ. గ‌తంలో ఇలాగే ప్రదాని పీఠం మీద ఆశ‌ప‌డి అది అంద‌క భంగ ప‌డిన రాజ‌కీయ కురువృద్దుడు ప్రణ‌బ్ ముఖ‌ర్జీ. అయితే ప్రదాని కూర్చిలో కూర్చోక పోయిన త‌న అనుభ‌వంతో రాష్ట్రప‌తిగా అత్యున్నత స్థానంలో ఉన్నారు ప్రణ‌బ్‌. ప్రస్థుత ప‌రిణామాలు చూస్తుంటే అద్వాని ముందున్న ఆఫ‌ర్ కూడా అదేనేమో అంటున్నారు రాజకీయ విశ్లేష‌కులు. అందుకే ఒక్కసారిగా అద్వానీ యుట‌ర్న్ తీసుకున్నారంటున్నారు.

బెయిల్ కోసం ఆశారాం అడ్డగోలు వాద‌న‌

  16ఏళ్ల అమ్మాయిపై లైంగిక వేదింపులకు పాల్పడి, ప్రస్తుతం జైళు ఊచ‌లు లెక్కపెడుతున్న ఆద్యాత్మిక గురువు ఆశారాం బాపు, బైలు కోసం రక‌ర‌కాల పాట్లు పడుతున్నాడు. ఆశారాం త‌రుపున ఈ కేసు వాదిస్తున్న 90 ఏళ్ల సీనియ‌ర్ లాయ‌ర్ రాంజెఠ్మాల‌ని వింత వాద‌న‌ల‌ను తెర మీద‌కు తీసుకువ‌స్తున్నాడు. ఆశారాం పై ఆరోప‌ణ‌లు చేసిన అమ్మాయి మాన‌సిక ప‌రిస్థితి స‌రిగా లేద‌న్న జెఠ్మాలాని ఆ కార‌ణంగానే ఆ అమ్మాయి ఆశారాంపై లైంగిక దాడి ఆరోప‌ణ‌లు చేసింద‌న్నారు, త‌న క్లైంట్‌కు ఎలాంటి పాపం తెలియ‌నందున ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని వాదించారుర. అయితే ఈ కేసులో బాధితురాలి త‌రుపున వాధిస్తున్న లాయ‌ర్ త‌న క్లైంట్‌కు ఆశారాం త‌రుపునుంచి బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయ‌న్నారు అందుకు ఆదారంగా కాల్ రికార్డింగ్స్‌ను కూడా కోర్టుకు స‌మ‌ర్పించారు. వారి వాద‌న‌తో ఏకీభ‌వించిన కోర్టు ఆశారాం బెయిల్ పిటీష‌న్‌ను తిర‌స్కరించింది. దాంతో పాటు ఆయ‌న రిమాండ్ గ‌డువును ఈ నెల 30 వ‌ర‌కు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అలక వీడిన ఎల్‌కె.అద్వానీ

      భారతీయ జనతాపార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ ఎట్టకేలకు అలక వీడారు. బీజేపీ ఎన్నికల ప్రచారసారథి, ప్రధాని అభ్యర్థి అయిన నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. చత్తీస్‌గడ్, కోర్బా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అద్వానీ మాట్లాడుతూ మోడీ హయాంలో గుజరాత్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. గ్రామీణ విద్యుత్‌ను ఆధునీకరించారని, పల్లెల్లో విద్యుత్ కాంతులు నింపిన ఘనత ఆయనదేనని అద్వానీ పొగడ్తలతో ముంచెత్తారు. గ్రామీణాభివృద్ధికి నరేంద్ర మోడీ చేసిన కృషి అభినందనీయమని అద్వానీ పేర్కొర్నారు. రాజస్థాన్‌లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పంచాయితీల ఆదాయం కోసం ప్రభుత్వ సంస్థల మధ్య పంచాయితీ

  సీమాంధ్ర నేతలు చెపుతున్నట్లు రాష్ట్ర విభజన జరిగితే ఆదాయ పంపకాలు, నీటియుద్దాలు వగైరాలనీ ఒట్టి అపోహలేనని తెలంగాణా వాదులందరూ చాలా గట్టిగానే వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్.యం.డీ.ఎ.) మరియు గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ (జీ.హెచ్.యం.సీ.) సంస్థల మధ్య 36 పంచాయితీల ఆదాయం కోసం జరుగుతున్నయుద్ధం గమనిస్తే సీమాంధ్ర నేతల వాదనలు నిజమేనని నమ్మక తప్పదు.   2007లో గ్రేటర్ హైదరాబాదు పరిధిని శివార్లలో ఉన్న36 పంచాయితీలకు విస్తరిస్తూ నిర్ణయం తీసుకొన్నపటి నుండి ఈ యుద్ధం మొదలయింది. ఈ 36 పంచాయితీల నుండి దాదాపు రూ. 200కోట్లు వివిధ పన్నుల రూపంలో సాలీనా ఆదాయం లభిస్తుంది. ఇంత కాలంగా తమ అధీనంలో ఉన్నఆ 36 పంచాయితీల పరిధిలో గల 10 మునిసిపాలిటీల నుండి గత ఆరు సంలుగా జీ.హెచ్.యం.సీ. వసూలు చేసిన రూ.1200 కోట్ల డెవెలప్మెంట్ చార్జీలను కక్కమని హెచ్.యం.డీ.ఎ. అధికారులు ఒక లేఖ వ్రాసారు. ఒకవేళ అందుకు అంగీకరించని పక్షంలో ఇక ముందు తమకు సదరు పంచాయితీ పరిధిలో డెవెలప్మెంట్ చార్జీలను వసూలు చేసుకొనే హక్కు ఇప్పించాలని ప్రభుత్వానికి కూడా ఒక లేఖ వ్రాసారు.   హెచ్.యం.డీ.ఎ. కమీషనర్ నీరభ్ కుమార్ “2007లో ప్రభుత్వం ఈ10 మునిసిపాలిటీలను జీ.హెచ్.యం.సీ.లో విలీనం చేస్తూ జారీచేసిన జీఓలో జీ.హెచ్.యం.సీ.కి ఆయా ప్రాంతాలలో డెవెలప్మెంట్ చార్జీలను వసూలు చేసుకొనే అధికారం ఇచ్చినప్పటికీ, ఆ మొత్తాన్ని హెచ్.యం.డీ.ఎ. ఖాతాలో జమా చేయాలని స్పష్టంగా పేర్కొందని” అన్నారు.   కానీ, జీ.హెచ్.యం.సీ. పంచాయతీల విలీనం పట్ల చూపిన ఆసక్తి అ తరువాత వసూలయిన మొత్తాన్ని హెచ్.యం.డీ.ఎ. ఖాతాలో జమా చేయడంలో మాత్రం చూపలేదని ఆయన ఆరోపించారు. డెవలప్మెంట్ చార్జీల పేరిట వసూలయిన మొత్తం అంతా జీ.హెచ్.యం.సీ. వాడుకొంటోందని, న్యాయంగా తమకు రావలసిన మొత్తం తమ ఖాతాలో జమ చేసినట్లయితే కేవలం హెచ్.యం.డీ.ఎ. పరిధిలోనే గాకుండా జీ.హెచ్.యం.సీ. పరిధిలో ఉండే ప్రాంతాలలో కూడా అవసరమయిన మౌలిక వసతులు కల్పించడానికి వీలవుతుందని ఆయన అన్నారు.   అయితే, జీ.హెచ్.యం.సీ. చీఫ్ సిటీ ప్లానర్ జీ.వీ. రఘు మాత్రం ఆయన వాదనలతో ఏకీభవించట్లేదు. 10 మునిసిపాలిటీలలో తమ సంస్థ వసూలు చేస్తున్నడెవెలప్మెంట్ చార్జీలతో ఇంతవరకు హెచ్.యం.డీ.ఎ. చేస్తున్నపనినే ఇప్పుడు జీ.హెచ్.యం.సీ. చేస్తోందని, అందువల్ల తాము ఎవరికీ డబ్బు వాపసు చేయవలసిన అవసరం లేదని అన్నారు.

చంద్రబాబు ఆస్తుల విలువ 42 లక్షలు

      తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులు ఆస్తుల వివరాలను తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. చంద్రబాబు ఆస్తుల విలువ రూ. 42.06 లక్షలు, తన భార్య భువనేశ్వరి ఆస్తుల విలువ ముప్పై మూడు కోట్లు అని ఆయన చెప్పారు. తన కుమారుడు లోకేష్ ఆస్తుల విలువ నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు, తన కోడలు బ్రాహ్మణి ఆస్తుల విలువ మూడు కోట్ల ముప్పైలక్షల రూపాయలని చంద్రబాబు పేర్కొన్నారు. హెరిటేజ్ కంపెనీ ఈ ఏడాది 30 శాతం డివిడెండ్ చెల్లించినట్లు ఆయన తెలిపారు. తాను ప్రకటించినవి కాకుండా ఇంకా ఎలాంటి ఇతర ఆస్తులు ఉన్నట్లు ఎవరైనా నిరూపిస్తే అందులో వారికి ఆస్తుల్లో పెర్సంటేజ్ ఇస్తానని చంద్రబాబు సవాల్ చేశారు.

జగన్ పై సిబిఐ ఫైనల్ ఛార్జీషీట్

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన సిబిఐ నేడు ఆఖరి ఛార్జీషీటు దాఖలు చేసే అవకాశం వుంది. దీనిలో లేపాక్షి నాలెడ్జ్ హబ్, కోల్‌కతా బేస్డ్ సూటుకేసు కంపెనీలు, సండూరు పవర్ వంటి అంశాలు ఉండనన్నాయని తెలుస్తోంది. ఇప్పటికె ఈ కేసులో సిబిఐ ఎనిమిది ఛార్జీషీట్స్ దాఖలు చేసింది.   చివరి ఛార్జీషీటులో మంత్రి గీతా రెడ్డి భవిష్యత్ కూడా తేలే అవకాశాలున్నాయంటున్నారు. సండూర్ పవర్, లేపాక్షి గీతా రెడ్డిని సాక్షిగా సిబిఐ ప్రస్తావించే అవకాశాలున్నాయంటున్నారు. ఇటీవల దాఖలు సిమెంట్స్ అంశంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను సిబిఐ సాక్షిగా ప్రస్తావించింది. తుది ఛార్జీషీటులో గీతా రెడ్డిని కూడా సాక్షిగానే పేర్కొనే అవకాశాలున్నాయని అంటున్నారు. వారు ఈ ఛార్జీషీటును ఇవాళ రేపట్లో దాఖలు చేసే అవకాశాలున్నాయి.  

'మిస్ అమెరికా' పోటీల్లో విజేత తెలుగమ్మాయి

  'మిస్ అమెరికా' కిరీటాన్ని మిస్ న్యూయార్క్ నీనా దావులూరి (24) కైవసం చేసుకున్నారు. 15మంది సెమీ ఫైనలిస్ట్ లనూ అధిగమించి అందాల కీరిటాన్ని అందుకున్నారు. 'మిస్ అమెరికా' కిరీటాన్ని సొంతం చేసుకున్న తొలి ప్రవాస భారతీయురాలు దావూలూరి నీనా.ప్లాస్టిక్ సర్జరీపై జడ్జిలు అడిగిన ప్రశ్నకు నీనా బదులిస్తూ... తాను పూర్తిగా సర్జరీకి వ్యతిరేకమని, ఒకసారి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే నచ్చిన నచ్చకున్నా దానితోనే ఉండాలని కానీ కృత్రిమపరంగా పుట్టుకతో వచ్చే శారీరక అందంతోపాటు ఏ సర్జరీకి తలవంచని మానసిక అందమే గొప్పదని ఆమె చెప్పిన సమాధానం ఆకట్టుకుంది. ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చునని ఆమె చెప్పారు. కాగా, మిస్ అమెరికా రేసులో నిన్నటి వరకు ఇద్దరు ప్రవాసాంధ్ర అందగత్తెలు పోటీ పడ్డారు. హైదరాబాదుకు చెందిన పామర్తి బిందు(23), నీనా దావులూరిలు ఉన్నారు.నీనాకు అమెరికా తరపున 50వేల డాలర్లు ఉపకర వేతనం రూపంలో అందనున్నాయి.

రాష్ట్ర విభజనపై బీజేపీలో అంతర్మధనం

  మొదటి నుండి చిన్న రాష్ట్రాలకు మొగ్గుచూపుతున్న బీజేపీ ఆంధ్ర రాష్ట్ర విభజనకు కూడా పూర్తి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెడితే, తమ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తామని కూడా ప్రకటించింది. అదేవిధంగా ఇటీవల హైదరాబాదు పర్యటనలో నరేంద్ర మోడీ కూడా రాష్ట్ర విభజనకే మొగ్గు చూపారు. అయితే, ఇటీవల ఏపీఎన్జీవో నేతలు సమైక్యాంధ్రకు మద్దతు కోరుతూ డిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసిన తరువాతనే వారి ఆలోచనల్లో మార్పు మొదలయింది.   బీజేపీ సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఏర్పరిచి ఆ ప్రాంతంలో మరింత బలపడుతుంటే, అందుకు సహకరించిన తాము అక్కడ ఎటువంటి రాజకీయ ప్రయోజనమూ పొందకపోగా, సీమాంధ్రలో చేజేతులా పార్టీని నాశనం చేసుకోవడం ఎందుకనే ఆలోచన బీజేపీలో మొదలయింది. తమ వైఖరి వలన తమ కంటే కాంగ్రెస్ పార్టీయే ఇందులో ఎక్కువ లాభపడుతుందని గ్రహించిన వెంటనే బీజేపీలో రాష్ట్ర విభజనపై మాట మర్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాలకు ‘సమన్యాయం’ చేయలేకపోతే, పార్లమెంటులో తెలంగాణా బిల్లుకు తాము మద్దతు ఇవ్వబోమని బీజేపీ ప్రకటించింది. ఇక, ప్రస్తుతం తాము తెలంగాణా రాష్ట్రం ఏర్పరిచే పరిస్థితిలో లేనప్పుడు, పదేపదే తెలంగాణా గురించి మాట్లాడటం వలన నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదని ఆ పార్టీకి జ్ఞానోదయం అవడంతో, ఇప్పుడు ఇరు ప్రాంతాలలో తమ పార్టీని ఎలా కాపాడుకోవాలనే కొత్త ఆలోచన కూడా మొదలయింది.   అందుకే బీజేపీకి చోదకశక్తి (డ్రైవింగ్ ఫోర్స్)గా పనిచేస్తున్న ఆర్.యస్.యస్. ఈ నెల 17న బీజేపీ టీ-నేతలతో హైదరాబాదులో, ఆ మరునాడే బీజేపీ-సీమాంధ్ర నేతలో విజయవాడలో సమావేశమయ్యి, రెండు ప్రాంతాలలో పార్టీని కాపాడుకొనేందుకు ఎటువంటి వైఖరి అవలంభించాలనే అంశంపై చర్చించబోతున్నారు. ఒకవేళ బీజేపీ కూడా రెండు ప్రాంతాలకు అనువయిన వైఖరి తీసుకోదలిస్తే, బహుశః అది కూడా ప్రస్తుతం తెదేపా అనుసరిస్తున్నవైఖరినే అవలంభించవచ్చును. తద్వారా ఇంతవరకు సమైక్యాంధ్ర ఉద్యమాలకు దూరంగా ఉంటూ అక్కడ ప్రజల నుండి వ్యతిరేఖత మూటగట్టుకొన్న బీజేపీ కూడా ఇక నుండి జోరుగా ఉద్యమాలలో పాల్గొనడం ద్వారా పార్టీని మళ్ళీ ప్రజలకు దగ్గరచేయవచ్చునని బీజేపీ-సీమాంధ్ర నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   ఇక దీనివలన మరో ప్రయోజనం ఏమిటంటే, రానున్నఎన్నికల కోసం తెదేపాతో దోస్తీ చేయాలని తహతహలాడుతున్నబీజేపీ, ఈ విధంగా తేదేపాకు దగ్గరయ్యే అవకాశం కూడా ఉంది.

టిడిపి బషీరుద్దీన్‌ బాబుఖాన్‌ మృతి

తెలుగుదేశం పార్టీ మరో సీనియర్‌ నాయకున్ని కొల్సోయింది, గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి బషీరుద్దీన్‌ బాబుఖాన్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. తెలుగుదేశ్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న బషీరుద్దీన్‌ ఎన్టీఆర్‌, చంద్రబాబు ప్రభుత్వాలలో వివిధ మంత్రిశాఖలు నిర్వహించారు. ఎన్టీఆర్‌, చంద్రబాబులకు అత్యంత సన్నిహితుడిగా కూడా బషీరుద్దీన్‌ బాబుఖాన్‌కు పూరుంది. కాని 1998లో ఆయన టిడిపి పార్టీకి రాజీనామా చేసి క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన మృతికి తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. బాబుఖాన్‌ మృతితో మైనారిటీలతో పాటు బడుగు బలహీన వర్గాలకు ఓ అండపోయినట్టయిందని, వారికి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.

జెపికి రాజ‌మౌళి మ‌ద్దతు

  ఈ జ‌న‌రేష‌న్ సినీ ప్రముఖులు సినిమాల‌తో పాటు ఇత‌ర విష‌యాల మీద కూడ త‌మ అభిప్రాయ‌ల‌ను పంచుకుంటున్నారు. అలా స‌మాజంలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌పై స్పందించే అలవాటు ఉన్న టాలీవుడ్ ద‌ర్శక ధీరుడు రాజ‌మౌళి.. ఇటీవ‌ల జేపి చేప‌ట్టిన తెలుగుతేజం యాత్ర ఆగిపోవ‌టం పై ఈ క్రియేట‌ర్ స్పందిచారు. గ‌తంలో కూడా పలు సంద‌ర్భాల్లో జెపికి మ‌ద్దతు తెలిపిన రాజ‌మౌళి ఆయ‌న యాత్ర ఆగిపోవ‌టంపై ఆవేద‌న వ్యక్తం చేశారు. సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ ద్వారా స్పందించిన ఆయ‌న ప్రస్థుత పరిస్థితుల్లో జెపి ప్రజ‌ల‌కు మ‌ద్దతుగానే యాత్ర చేప‌ట్టార‌న్న రాజ‌మౌళి ఆయ‌న‌పై దాడులు చేయ‌టం త‌గ‌ద‌న్నారు. గ‌తంలో తెలంగాణ ఉద్యయం జ‌రుగుతున్నపుడు జెపి ఇలాగే ప‌ర్యటించార‌ని, ఇప్పుడు కూడా ఆయ‌న ప్రజ‌ల త‌రుపునే ఉద్యమం చేస్తున్నార‌న్నారు. రాష్ట్రం క‌లిసున్నా విడిపోయినా ప్రజ‌లు మాత్రం క‌లిసే ఉండాలన్నారు రాజ‌మౌళి.

చంద్రబాబు అంటే వణుకే

      చంద్రబాబు నాయుడు కాలు కదిపితే వైసీపీ, టిఆర్ఎస్ పార్టీలకు వణుకు వస్తోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. 'చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాలనుకొంటున్నానని అనగానే ఈ పార్టీలు గడగడలాడుతున్నాయి. ఆ యాత్రకు రకరకాల కారణాలు ఆపాదిస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాయి. ఆయన ఢిల్లీ వెళ్తే తమ ముసుగులు ఊడిపోతాయని, తమ నిజ స్వరూపం బయట పడుతుందని వాటి భయం. రాష్ట్రంలో రగులుతున్న మంటలను ఆర్పి అందరికీ న్యాయం చేయమని చంద్రబాబు కోరుతున్నారు. దానికి వీరికేమిటి బాధ? ఇరు పక్కలా ప్రజలను రెచ్చగొట్టి ఒకరిపైకి మరొకరిని ఉసిగొల్పి పబ్బం గడుపుకోవాలని ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. సమస్యలు పరిష్కారమైతే తమ పబ్బం గడవదని వీటి భయం. అందుకే బాబును తిటి ్ట పోస్తున్నాయి' అని ఆయన విమర్శించారు.

ఒడిసాలో భారీ ఎన్‌కౌంట‌ర్‌

  ఒడిసాలో మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఒడిసాతో పాటు చ‌త్తీస్‌గ‌డ్‌ల‌తో వ‌రుస దాడుల‌తో రెచ్చిపోతున్న మావోయిస్టుల‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. శ‌నివారం ఆంద్రా ఒడిసా స‌రిహాద్దులో జ‌రిగిన భారీ ఎన్‌కౌంట‌ర్లో 13 మంది మావోలు మ‌ర‌ణించారు. మ‌రో మావోయిస్టు పోలీసుల‌కు దొరికాడు. ఒడిసాలోని మల్కన్‌గిరి జిల్లా  సిలాకోట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్‌సింగ్ ఎస్‌వోజీ, డీవీఎఫ్ బలగాల‌తో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో పోలీసుల మావోయిస్ట్‌ల మ‌ధ్య ఎదురు కాల్పుల జరిగాయి. ఈ ఎన్‌కౌంట‌ర్లో 13 మంది న‌క్సల్స్ చ‌నిపోగా 12 తుపాకులు, ఒక పిస్టల్, ఒక ఏకే-47, రెండు రాకెట్ లాంచర్లు, కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే చనిపోయిన మావోలు  బస్తర్ జిల్లాలో కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ర‌ణించిన మావోల‌లో మ‌న రాష్ట్రానికి చెందిన ప్రమీలా అలియాస్ జిలానీ బేగం కూడా ఉన్నట్టు స‌మాచారం.

ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌కు నేత‌ల ప‌రామ‌ర్శలు

  గ‌త ప‌ది రోజులుగా అల్లర్లతో అట్టుడికిన ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో ఇప్పుడిప్పుడే కాస్త సాదార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. దీంతో ఆదివారం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాద‌వ్ ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో ప‌ర్యటించ‌నున్నారు. ఈ అల్లర్లలో గాయ‌పడి వివిధ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వేలాది మంది క్షత‌గాత్రుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్షించ‌నున్నారు. త‌రువాత అక్కడి జిల్లా యంత్రాంగంతో పాటు శాంతి భ‌ద్రత‌లపై పోలీసు ఉన్నతాధికారుల‌తో చర్చించ‌నున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని ప్రాంతాల్లో అల్లర్లు అదుపు రావ‌డంతో చెదురు మ‌దురు సంఘ‌ట‌న‌లు కూడా జ‌ర‌గ‌కుండా చూసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ‌ను ఆదేశించారు. అలాగే ముజఫర్నగర్లో సోమవారం ప్రదాని మన్మోహన్ సింగ్, యుపిఎ అధ్యక్షురాలు సోనియా గాంధి పర్యటించనున్నారు. హిందుతుల్లోని జాట్ తెగ‌కు ముస్లిం నాయ‌కుల‌కు జ‌రిగిన చిన్న గొడ‌వ ముదిరి 48 మంది ప్రాణాలు కోల్పోయే అంత పెద్ద గొడ‌వ‌గా మారింది. దీంతొ భవిష్యత్తులో ఇలాంటి ఘ‌ర్షణ‌లు చోటు చేసుకోకుండా క‌ట్టుదిట్ట మైన చ‌ర్యల తీసుకోవ‌డానికి రెడీ అవుతుంది అఖిలేష్ ప్రభుత్వం.

అగ్ని వి ప్రయోగం విజ‌య‌వంతం

  భార‌త అమ్ముల పొదిలో మ‌రో అస్త్రంలో స‌గ‌ర్వంగా చేరింది. పూర్తిస్వదేశి ప‌రిజ్ఞానంతో త‌యారు చేసిన అగ్నివి క్షిప‌ణిని రెండోసారి కూడా విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది డిఆర్‌డిఓ. ఒడిశా కోస్తా తీరంలోని వీల‌ర్ ద్వీపంలోని లాంయ్‌ప్యాడ్ 4 నుంచి డిఫెన్స్ రీస‌ర్చ్ అండ్ డెవ‌లెప్‌మెంట్ ఆర్గనైజేష‌న్ దీన్ని విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఆదివారం ఉద‌యం ఎనిమిది గంట‌ల యాబై నిమిషాల‌కు అగ్ని వి ను ప్రయోగించారు. దాదాపు 5000 కిలోమీట‌ర్లకు పైగా దూరంలో ఉన్న ల‌క్షాల్యను కూడా అగ్ని వి గురిత‌ప్పకుండా చేదించ‌గ‌ల‌దు. దాదాపు 50 ట‌న్నుల బ‌రువు, 17 మీట‌ర్ల పొడ‌వు ఉన్న అగ్ని వి ఒక ట‌న్ను బ‌రువైన అణ్వస్త్రాల‌ను ల‌క్ష్యం వైపు మోసుకుపోగ‌ల‌దు. గ‌త ఏడాది ఏప్రిల్ 2న కూడా అగ్ని వి క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు. ఈ ప్రయోగంతో ఖండాత‌ర క్షిప‌ణి ర‌క్షణ వ్యవ‌స్థ ఉన్న అతి కొద్ది దేశాల స‌ర‌స‌న భార‌త్ చేరింది. భార‌త ర‌క్షణ వ్యవ‌స్థలో అగ్ని ఓ కీల‌క ఆయుదంగా మార‌నుంది.

ఒకే వేదిక‌పైకి అద్వాని, మోడి

  ప్రదాని అభ్యర్ధిగా మోడి ప్రక‌ట‌న‌ల‌తో కినుక వ‌హించిన అద్వాని శాంతిస్తున్నట్టుగా స‌మాచారం.ఇప్పటి వ‌ర‌కు అద్వాని ప్రత్యక్షంగా మీడియా ముందుకు రాకున్నా ఆయ‌న అల‌క తీర్చడానికి బిజేపి అగ్రనేత‌లు చేస్తున్న ప్రయ‌త్రాలు ఫ‌లిస్తున్నట్టుగా క‌నిపిస్తున్నాయి. బిజెపి పార్టీ ఎప్పుడు అద్వాని సార‌ధ్యంలోనే న‌డుస్తుంద‌ని రాజ్‌నాధ్ వ్యాఖ్యనించ‌గా, అద్వానికి ఎలాంటి అసంతృప్తి లేద‌న్నారు సుష్మా. మోడి ప్రక‌ట‌న‌తో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారాయి. అదే స‌మ‌యంలో అద్వాని రాజ్‌నాధ్‌కు లేఖ రాయ‌డంలో అద్వాని మ‌రోమారు అస్త్రస‌న్యాసానికి దిగుతున్నట్టుగా కూడా వార్తలు వ‌చ్చాయి.  అయితే అలాంటి వాద‌న‌ల‌కు ఫుల్ స్టాప్ పెడుతూ బిజెపి పెద్దలు అద్వానిని బుజ్జగించే ప్రయ‌త్నం చేశారు. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, అద్వానీని శాంతపర్చేందుకు అన్నిర‌కాలుగా ప్రయ‌త్నించారు. అద్వాని ఎప్పటికి బిజెపి అగ్రనేతే అన్న రాజ్‌నాధ్ ఆయ‌న‌కు మమ్మల్ని తిట్టే హ‌క్కు కూడా ఉంటుంద‌ని చెప్పారు. భ‌విష్యత్తులో కూడా ఆయ‌నే మ‌మ్మల్ని ముందుడి న‌డిపిస్తార‌ని, భోపాల్‌లో జ‌ర‌గ‌బోయే స‌భ‌లో అద్వాని మోడిలు ఒకే వేదిక పంచుకోనున్నార‌ని ప్రక‌టించారు.