విజయ్ మాల్యాకి లుకౌట్ నోటీసు పొరపాటే.. తాపీగా సీబీఐ

  ఒకపక్క పార్లమెంట్లో విజయ్ మాల్యా వ్యవహారంపై అధికార.. విపక్ష నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. అంతేకాదు విజయ మాల్యా దేశం విడిచి పారిపోవడానికి కేంద్ర ప్రభుత్వమే సహరించిందని విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాల్యా దేశం విడిచిపోతుంటే సీబీఐ చోద్యం చూస్తుందా అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. అందరూ విమర్శలు చేస్తుంటే ఇప్పుడు తాపీగా సీబీఐ ఓ విషయం చెబుతుంది. అసలు విజయ్ మాల్యాకి లుకౌట్ నోటీసు జారీ చేయడమే తమ పొరపాటని..  కింది స్థాయి అధికారి వల్ల జరిగిన ఓ పొరపాటు కారణంగా విజయ్ మాల్యాకి లుకౌట్ నోటీసు జారీ చేయడం జరిగిందని.. డిసెంబర్ 9, 10వ తేదీలలో ఢిల్లీలో, డిసెంబర్ 12వ తేదీన ముంబైలో ప్రశ్నించినప్పుడు మాల్యా తమకి సహకరించాడని సీబీఐ పేర్కొంది. దీంతో సీబీఐ వ్యాఖ్యలతో ప్రతిపక్షాల మంటలపై ఇంకా ఆజ్యం పోసినట్టు అయింది. ఇప్పటికే సీబీఐ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే దీనికి తోడు ఆసమయంలో ఈవ్యాఖ్యలు చేసి మరింత దుమారానికి దారి తీశారు. మరి ప్రతిపక్షనేతలు ఈ వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో చూడాలి.

అధార్ చట్టబద్దత వల్ల ఉపయోగాలే.. బిల్లును పరిశీలనకు పంపాలి

ఆధార్ చట్టబద్దత కు లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ అధార్ చట్టబద్దత వల్ల ఉపయోగాలే కాని.. నష్టాలు లేవని చెబుతున్నారు. పౌరులకు ప్రభుత్వ సబ్సడీలు, ప్రయోజనాలు, సేవలు పారదర్శకంగా అందించేందుకు ఆధార్ కు చట్టబద్దత కల్పించేందుకు బిల్లును రూపొందించినట్టు అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం బిల్లును పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు. దానికి ప్రభుత్వం మాత్రం.. 2010లో యూపీఏ ప్రభుత్వం ఆధార్ బిల్లును ఆమోదించి సభలో ప్రవేశపెట్టిందని, అప్పుడు అధ్యయనం చేశారు.. కావున ఇప్పుడు మళ్లీ పంపించాల్సిన అవసరం లేదని.. యూపీఏ ప్రవేశపెట్టిన బిల్లులో లోపాలను సవరించి తాము కొత్తగా ఇప్పుడు మళ్లీ ప్రవేశపెట్టినట్టు తెలిపారు.

పారిపోయిన విజయ్ మాల్యా.. అల్లరి నరేశ్ కి చిక్కాడు..!

వేల కోట్లు రూపాయలు బ్యాంకులకు టోకరా వేసి.. పార్లమెంట్లో దుమారానికి కారణమైన విజయమాల్యా ప్రస్తుతం దేశం విడిచిపోయారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సినీ నటుడు అల్లరి నరేశ్ విజయ్ మాల్యాతో ఫొటో తీసుకొని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఎవ్వరికి చిక్కని విజయ్ మాల్యా నాకు చిక్కాడు అంటూ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాడు. అదేంటీ అల్లరి నరేశ్ కు విజయ్ మాల్యా ఎక్కడ చిక్కారనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. ఇటీవల మాల్యా విదేశాలకు వెళ్లే క్రమంలో అల్లరి నరేశ్ కు తారసపడగా అక్కడ నరేశ్ సెల్పీ తీసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ మాల్యా వ్యవహారం దేశం మొత్తం హాట్ టాపిక్ కాగా నరేశ్ ఇలా ఫొటో పోస్ట్ చేసి అందరికి షాకిచ్చి.. కామెడీ చేసేశాడు.

కన్నయ్యకు బెదిరింపుల పోస్టర్.. నేను కాలుస్తాను

  జెఎన్యూ విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ పై ఇప్పటికే దేశద్రోహి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు అతనికి చంపేస్తే రూ.11 లక్షలు ఇస్తామంటూ గతంలో పోస్టుర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి బెదిరింపులతో కూడిన పోస్టర్లు వస్తున్నాయి.  కన్నయ్యకుమార్‌, విద్యార్థులు ఉమర్‌ ఖలిద్‌, అనిర్బన్‌ భట్టాచార్యలు దేశ ద్రోహులు.. వారిని కాల్చి చంపడం జాతి ధర్మం.. దేశంలో ఉంటూ దేశానికి వెన్ను పోటు పొడిచేవారు.. ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులు వారిని నేను కాలుస్తాను అంటూ పోస్టర్ ఒకటి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కనిపించినట్టు చెబుతున్నారు. అంతేకాదు ఈ పోస్టర్ బల్బీర్‌ సింగ్‌ భారతీయ అనే పేరుతో ఉంది. పోస్టర్‌లో అతడి ఫోన్‌ నెంబరు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో కూడా ఉంది. పోలీసులు ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా..  ఫోన్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి తాను యమునా బజార్‌లో దుకాణం నిర్వహిస్తానని, నిన్న జంతర్‌మంతర్‌ వద్దకు వచ్చానని మాత్రమే చెప్పాడని పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ జరుపుతన్నామని తెలుపుతున్నారు.

ఇస్లాం మతంపై మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు.. అమెరికా అంటే గిట్టదు..

అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇస్లాం మతం.. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా మరోమారు నోరు జారారు. సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన.. ఇస్లాం మతానికి అమెరికా అంటే గిట్టదని నాకు అనిపిస్తోంది.. అమెరికన్లను వ్యతిరేకించే వారిని దేశంలోకి అనుమతించరాదని..  తీవ్రవాద భావజాలాన్ని నింపే ఇస్లాంపైనే అమెరికా యుద్ధం చేస్తోందని వ్యాఖ్యానించారు. అయితే ఏమనుకున్నాడో ఏమో.. రాడికల్ భావాలున్న ఇస్లాం గురించి తాను చెపుతున్నానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో తన వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న ట్రంప్.. ఇప్పుడు ఈవ్యాఖ్యలతో ఎలాంటి ఇబ్బందుల్లో పడతారో.

రోజాకు మళ్లీ చుక్కెదురు.. మేము విచారించలేము

వైసీపీ ఎమ్మెల్యే రోజా తన సస్పెన్షన్ పై సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ కూడా రోజాకు నిరాశే ఎదురైనట్టు తెలుస్తోంది. రోజా పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా.. రోజా తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వాదనలు ప్రారంభించడానికి నిలబడగానే... ‘‘ఈ కేసును మేము విచారించలేము.. సోమవారం వేరే బెంచ్‌ విచారిస్తుంది’’ అని న్యాయమూర్తి ఖెహర్‌ బదులిచ్చారు. దీనికి ఇందిరా మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితమే కేసు విచారణకు వస్తుందనుకున్నాము కానీ రాలేదని తెలిపారు. కాగా స్పీకర్ తనపై విధించిన సస్పెషన్ ను సవాల్ చేస్తూ రోజా హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆమెకు చుక్కెదురవడంతో సుప్రీం ను ఆశ్రయించిన సంగతి విదితమే. మొత్తానికి రోజాకు స్టే వచ్చేసరికి అసెంబ్లీ సమావేశాలు కూడా అయిపోతాయేమో..

ప్రారంభమయిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 2700 పోస్టులకు ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కరువు, రైతు సమస్యలపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయి.. ప్రభుత్వ స్కూళ్లలో వేలాది పోస్టులు ఖాళీలున్నాయి.. విద్యా ప్రమాణాలు పెంచాలంటే ఆ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.   దీనికి ఈటెల రాజేందర్ స్పందించి.. ఏడాది లోపు ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తాం.. 1.07 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. కార్పోరేషన్లలో పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తాం.. ఉద్యోగాల భర్తీని డబ్బుల కోణంలో ప్రభుత్వం చూడటం లేదు.. రెసిడెన్షియల్ స్కూళ్లలో 2700 పోస్టులకు ఆమోదం తెలిపాం అని అన్నారు.

రాజీవ్‌ను చంపడం తప్పే... ఎల్టీటీఈ నేత పశ్చాత్తాపం

‘భారత మాజీప్రధాని రాజీవ్‌గాంధీని పొట్టనపెట్టుకోవడం తాము చేసిన అతి పెద్ద తప్పు’ అని ఒకనాటి ఎల్టీటీఈ నేత బాలసింగం పేర్కొన్నారు. తను చనిపోయే ముందు ఈ విషయాన్ని నార్వే దౌత్యవేత్త ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. తాము రాజీవ్‌గాంధిని చంపిన విషయం ఎల్టీటీఈ నేత ప్రభాకరన్‌ తొలుత అంగీకరించలేదని, కానీ తరువాత వారు ఒప్పుకోక తప్పలేదని చెప్పుకొచ్చారు బాలసింగం. అసలు రాజీవ్‌ను చంపాలన్న నిర్ణయం ప్రభాకరన్ ఎందుకు తీసుకున్నారో కూడా బాలసింగం వెల్లడించారు. 1987-90ల మధ్య కాలంలో రాజీవ్‌గాంధి శ్రీలంకలో శాంతిని స్థాపించేందుకు కొంత సైన్యాన్ని పంపారు. ఆ సైన్యం చేతిలో చాలామంది ఎల్టీటీఈ తీవ్రవాదులు హతులైపోయారు. మళ్లీ రాజీవ్‌గాంధి కనుక ప్రధానమంత్రి పదవిని చేపడితే ఆనాటి సంఘటనలు పునరావృతం అవుతాయన్న భయంతో, ఆయనను పొట్టనపెట్టుకున్నామన్నది బాలసింగం మాట. ఈ విషయాలన్నీ కూడా మార్క్ సాల్టర్ అనే రచయిత తన ‘టు ఎండ్ ఏ సివిల్ వార్’ పుస్తకంలో పేర్కొన్నాడు. 549 పేజీల సుదీర్ఘమైన ఈ పుస్తకంలో శ్రీలంకలో మూడు దశాబ్దాలకు పైగా సాగిన తమిళ-సింహళీయుల మధ్య పోరాటాన్ని, దానికి ముగింపు పలికేందుకు నార్వే నేతృత్వంలో సాగిన శాంతి ప్రక్రియ వివరాలనీ పొందుపరిచారు. రాజీవ్‌ను చంపాలన్న ఆలోచన తప్పని, అప్పుడే ఎల్టీటీఈ నేతల మనసుకి తట్టి ఉంటే ఎంత బాగుండేదో!

5 కోట్లు జరిమానా కడతాం.. ఒకేసారి కట్టలేం.. రవిశంకర్..

జైలుకైనా వెళ్తాను కానీ.. జరిమానా చెల్లించేది లేదని చెప్పిన శ్రీ శ్రీ రవిశంకర్ ఎట్టకేలకు ఒక మెట్టు దిగినట్టు కనిపిస్తోంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ పేరుతో రవిశంకర్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల వల్ల పర్యావరణానికి హాని కలిస్తుందంటూ దీనికి 5 కోట్లు జరిమానా కట్టమంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన రవిశంకర్ జరిమానా అస్సలు కట్టనని చెప్పిన ఆయన నాలుగు వారాల్లోగా అయిదు కోట్ల జరిమానాను చెల్లిస్తామని గ్రీన్ ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది. కల్చర్ ఫెస్టివల్ ఆరంభం అయ్యేలోపు అంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేమని ఇవాళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ కోర్టుకు పేర్కొంది. తమది స్వచ్ఛంధ సంస్థ అని, ఇంత త్వరగా అంత మొత్తాన్ని సమీకరించలేమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

విజయ్ మాల్యా తీసుకెళ్లిన ఆ బ్యాగుల్లో ఏముందో..

  ప్రస్తుతం దేశం మొత్తం విజయ మాల్యా గురించిన వార్తలతోనే నిండిపోయింది. రుణాలు చెల్లించకుండా బ్యాంకులకు టొకరా వేసిన విజయ్ మాల్యా ప్రస్తుతం దేశం విడిచి పోయాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు స్పందిచిన మాల్యా మాత్రం తాను ఎక్కడికి పారిపోలేదని.. ఒక అంతర్జాతీయ వ్యాపారస్థుడిగా పలు దేశాలు తిరుగుతుంటానని.. న్యాయానికి కట్టుబడే ఉంటానని చెపుతూ పలు ట్వీట్లు ట్వీటారు. అయితే తాను ఎక్కడి నుండి ట్వీట్లు ట్వీటారా అని ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే మాల్యా ప్రస్తుతం..  లండన్లోని తన సొంత ఇంట్లోనే ఉన్నారని తెలుస్తోంది. అక్కడి నుండే తాను ఈ ట్వీట్లు చేశాడని వార్తలు వినిపిస్తున్నయి.   అయితే ఇక్కడ విజయ్ మాల్యా లండన్ వెళ్లిన పద్దతి చూస్తుంటే మాత్రం తాను నిజంగానే పారిపోయాడా అన్న సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే మాల్యా మార్చి 2 అర్థరాత్రి 1.30 ఢిల్లీ నుంచి లండన్ ఫ్లైట్ ఎక్కినట్టు ఓ ఉన్నత అధికారి తెలిపారు. అయితే ఎప్పుడూ చుట్టూ జనంతో ఉండే మాల్యా.. ఆరోజు ఒంటరిగా వచ్చినట్టు.. అయితే ఆయన పక్కన ఓ మహిళ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆరోజు మాల్యా తనలో పాటూ చాలా పెద్దవి..ఏడు లగేజీ బ్యాగ్‌లు తీసుకెళ్లారట. దీంతో ఇప్పుడు అందరి అనుమానాలు ఆ బ్యాగుల మీద పడ్డాయి. అంత పెద్ద బ్యాగుల్లో.. ఎప్పుడూ లేనిది ఇప్పుడే అంత లగేజ్ తీసుకెళ్లడానికి గల కారణాలు ఏంటి.. ఇంతకీ ఆ బ్యాగుల్లో ఏముంది అని పలువురు అనుకుంటున్నారు. మరి ఇంతకీ ఆ బ్యాగుల్లో ఏముందో..

రింగింగ్ బెల్స్ కు మరో షాక్.. యాడ్ కామ్ వార్నింగ్..

రింగింగ్ బెల్స్ సంస్థ.. ఈ సంస్థ పేరు ఇంతకు ముందు అందరికీ తెలుసు లేదో తెలియదు కానీ.. ఎప్పుడైతే రూ.251 రూపాయలకు స్మార్ట్ ఫోన్ అందిస్తామని చెప్పారో అప్పుడు..ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దాదాపు ఆరుకోట్ల దాకా బుకింగ్ లు వచ్చాయి..  జూన్ కల్లా హ్యాండ్ సెట్లు అందిస్తాము.. మొదటి విడతలో 25 లక్షల ఫోన్లు విడుదల చేస్తామని కూడా చెప్పారు. అయితే ఆ ఫోన్ అందిచడం సంగతేమో కానీ ఆ ప్రకటన తరువాత పాజిటివ్ టాక్ కంటే నెగిటివ్ టాకే ఎక్కువ సొంత చేసుకుంది. ఏదో ఒక విషయంలో రింగిగ్ బెల్స్ సంస్థకి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. ఇటీవలే అద్దె కూడా కట్టలేక సంస్థ మూసేశారు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు మరో విషయంలో ఈ సంస్థకు సమస్య ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. యాడ్ కామ్ అనే ఐటీ ఉత్పత్తుల సంస్థ తాము హ్యాండ్ సెట్ ను 3,600 రూపాయలకి రింగింగ్ బెల్స్ సంస్థకి అమ్మామని.. కానీ రింగింగ్ బెల్ మాత్రం ఒక్కో ఫోన్ కు రూ.1500మాత్రమే తమకు ఖర్చు అవుతుందని చెప్పింది. కానీ ఆ సంస్థ రూ.251 ఫోన్ ఇవ్వడంపై మా ప్రమేయం లేదు.. ఒకవేళ దానివల్ల మా బ్రాండ్ నేమ్ కి ఏదైనా చెడ్డ పేరు వస్తే మాత్రం చట్టపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించింది.

కశ్మీర్‌ వాసులకు సైన్యం హెచ్చరిక

  కశ్మీర్‌లో తరచూ పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదులు ఏదో ఒక విధ్వంసాన్ని సృష్టించేందుకు ప్రయత్నించడం, వారిని సైన్యం దీటుగా ఎదుర్కోవడం తరచూ వినే వార్తే! కానీ ఈ మధ్య కాలంలో తీవ్రవాదులను ఎదుర్కొనే సైన్యానికి ఓ కొత్త సమస్య మొదలైంది. స్థానికంగా ఉండే జనం ఈ గొడవను చూసేందుకు వందలకొద్దీ మూగడం మొదలుపెట్టారట. పనిలో పనిగా వీరిలో కొందరు అల్లరిమూకలు చేరి సైన్యం మీదకు రాళ్లు విసరడం, తీవ్రవాదులకు అనుకూలంగా నినాదాలు చేయడంతో.... పరిస్థితి సైన్యం చేయిదాటిపోసాగింది. మొన్నటికి మొన్న ‘ఆషిముకాం’ అనే ప్రాంతంలో జరిగిన ఇలాంటి ఘటనలో, వేయిమందికి పైగా జనం ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. వారిని వెనక్కి వెళ్లమంటూ సైన్యం ఎంతగా హెచ్చరించినా వినకపోగా, రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. దీంతో సైన్యం గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటన తరువాత అమాయకమైన పౌరుల మీద కాల్పులు జరుపుతున్నారంటూ, సైన్యం మీద ఆరోపణలు వచ్చాయి. అయితే ‘పరిస్థితి చేయిదాటిపోవడంతో తాము కాల్పులు జరపాల్సి వచ్చిందనీ, పౌరులు కనుక ఇలాగే శాంతికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే, తాము కూడా తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందనీ’ సైన్యం తరఫున ప్రతినిధి చెప్పుకొచ్చారు. అంటే మున్ముందు తాము అల్లరిమూకలతో మరింత కఠినంగా వ్యవహరిస్తామనేగా!

సరదాగా చంపేశా.... ఓ నిందితుడి వాంగ్మూలం

ఎలాంటి కవ్వింపు కానీ కలహం కానీ లేకుండా జరిగే హత్యలు పాశ్చాత్య దేశాలలోనే సాధ్యం అనుకోవద్దు. కలికాలంలో ఎక్కడైనా ఏదైనా సాధ్యమే అని నిరూపించేందుకు కావల్సినన్ని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దిల్లీకి దగ్గర్లోని గుర్‌గావ్‌లో సందీప్‌ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గుర్‌గావ్‌లో జరిగిని ఓ రెండు హత్యలకు సంబంధించిన కేసులో అనుమానితుడిగా సందీప్‌ను వారు అదుపులోకి తీసుకున్నారు. కానీ సందీప్‌ చెప్పిన విషయాలు విన్న పోలీసులకి మతిపోయింది. ‘ఆ రెండు హత్యలనీ తానే చేశాననీ, వారిని హత్య చేసేంత పెద్ద కారణమేమీ లేదు కానీ, అలా చేసేశాను అంతే!’ అంటూ సందీప్‌ నవ్వుతూ పోలీసులకి చెప్పాడట. మీడియా ముందు ప్రవేశపెట్టిన తరువాత కూడా సందీప్‌ అన్ని ఫోటోలకీ నవ్వుతూనే ఫోజులివ్వడం చూసి పోలీసులు బిత్తరపోయారు. సందీప్‌ నిజంగానే ఉత్త పనికిమాలినవాడనీ, నిరంతరం తాగుతూ ఎవరో ఒకరితో గొడవపెట్టుకుంటూ కాలం గడిపేస్తాడనీ స్థానికులు పేర్కొన్నారు. అందుకే అతణ్ని అంతా ‘టైంపాస్’ అని పిలుస్తారట. ఇప్పుడు అదే టైంపాస్‌ కోసం హత్యలు కూడా చేశానని చెప్పుకొచ్చాడు సందీప్‌!

స్థిరాస్తి బిల్లుకు ఆమోదముద్ర!

  సొంత ఇంటి కల ప్రతి మధ్యతరగతి వ్యక్తికీ ఉండేదే! కానీ ఆ కలను క్యాష్ చేసుకోవాలని చూసేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. రాజ్యసభ నిన్న ఆమోదించిన స్థిరాస్తి బిల్లుని కనుక స్పష్టంగా అమలుచేస్తే వినియోగదారుల ఇక్కట్లు చాలావరకూ తప్పే అవకాశం కనిపిస్తోంది. ఈ బిల్లు ప్రకారం ఇంటి కోసం వినియోగదారుడు అందించే నగదుని డెవలపర్ తన ఇష్టారాజ్యంగా వాడుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే 70 శాతం నగదుని డెవలపర్ బ్యాంకుల్లో ధరావతుగా ఉంచాల్సి ఉంటుంది. ఏ ఇంటి కోసమైతే ఈ సొమ్ముని డెవలపర్‌ తీసుకున్నాడో, ఆ ఇంటి కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఒకవేళ ఇంటినిర్మాణం ఆలస్యమైతే ఇకనుంచి డెవలపర్ కూడా వడ్డీని చెల్లించాల్సి ఉంటుందనీ, ఇంటి నిర్మాణంలో ఎలాంటి అవకతవకలూ జరిగినా అతను మూడేళ్ల వరకూ జైలుశిక్షను అనుభవించాల్సి వస్తుందనీ ఈ బిల్లు హెచ్చరిస్తోంది. నిర్మాణ రంగంలో ఓ క్రమపద్ధతిని తీసుకువచ్చేందుకు, వినియోగదారులకు తోడ్పడేందుకు ఇకమీదట ‘స్థిరాస్తి నియంత్రణా వ్యవస్థ’లను ప్రతి రాష్ట్రంలోనూ నెలకొల్పనున్నారు. మొత్తానికి, ఇప్పటివరకూ స్థిరాస్తి రంగంలో డెవలపర్లే రాజులుగా ఉన్నారనీ... ఇకనుంచీ వినియోగదారుడిదే పైచేయి అవనుందనీ స్పష్టం చేస్తోంది ఈ బిల్లు!

ఆడపిల్లతో దురుసుతనం... మరో వివాదంలో కన్నయా

  కన్నయాకుమార్‌ అంటే దేశంలో తెలియని వారుండకపోవచ్చు. జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద సమావేశానికి సంబంధించిన కేసులో ఉన్న కన్నయా, బెయిలు మీద బయటకు వచ్చి ఇస్తున్న ఉపన్యాసాలు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. కానీ అదే స్థాయిలో కన్నయా మీద రోజుకో వివాదం వెలుగుచూస్తోంది. తాజాగా జేఎన్‌యూకి చెందిన ఒక పూర్వ విద్యార్థినితో కన్నయా దురుసుగా ప్రవర్తించిన సంఘటన వార్తల్లో నిలిచింది. గత ఏడాది అక్టోబరులో కన్నయా బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నాడనీ, అదేమని మందలించబోయిన తన అంతు చూస్తానని బెదిరించాడనీ.... కమలేష్‌ నర్వానా అనే మహిళ ఆరోపించారు. ఈ విషయమై తాను అప్పట్లో విశ్వవిద్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారని కూడా ఆమె చెప్పారు. జేఎన్‌యూ అధికారులను సంప్రదించగా ఈ విషయం వాస్తవమేనని తేలింది. అప్పట్లో కన్నాయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతణ్ని మందలించి వదిలివేశామనీ, మూడు వేలు జరిమానా కూడా విధించామనీ అధికారులు పేర్కొన్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళల గురించి తెగ మాట్లాడిన కన్నయా అసలు రూపం ఇదేనని భాజపా అనుబంధ సంఘాలు విరుచుకుపడుతున్నాయి.