మళ్లీ తెరపైకి రాహుల్ గాంధీ పౌరసత్వం.. వివరణ ఇవ్వాలని నోటీసులు

కాంగ్రెస్ పార్టీ  ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఎప్పటినుండో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తన పౌరసత్వంపై రాహుల్ కు ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. తాజాగా మళ్లీ రాహుల్ కు పౌరసత్వంపై చిక్కులు వచ్చి పడ్డాయి. అసలు సంగతేంటంటే.. రాహుల్ భారతీయుడు కాదని.. తనకి బ్రిటన్ పౌరసత్వం ఉందని ఆరోపణలు వచ్చాయి. రాహుల్ కు బ్రిటన్లో ఓ కంపెనీ ఉందని.. దానికి సంబంధించిన పత్రాలలో రాహుల్ తాను బ్రిటన్ వారసత్వానికి చెందిన వాడినని చెప్పినట్టు..  భాజపా నేత సుబ్రమణ్యస్వామి ఎప్పటినుండో ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయంటూ చెప్పారు. అయితే ఇప్పుడు దీనిపై కేంద్రమంత్రి మహేశ్‌ గిరి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు  ఫిర్యాదు చేయడంతో.. స్పీకర్ ఈ ఫిర్యాదును పార్లమెంటరీ ఎథిక్స్‌ కమిటీకి పంపించారు. దీనిపై విచారణ జరిపిన పార్లమెంటరీ ఎథిక్స్‌ కమిటీ రాహుల్ తన పౌరసత్వంపై వెంటనే విచారణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.   ఇదిలా ఉండగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ  ఈవ్యవహారంపై మండిపడుతోంది. స్పీకర్ ఫిర్యాదు చేసేముందు రాహుల్ గాంధీని సంప్రదించాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మొత్తానికి రాహుల్ కు ఈ వారసత్వం గురించిన తలనొప్పులు ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడంలేదు.

బీ ప్రౌడ్ టు బీ హైదరాబాదీ అంటున్న కెసీఆర్

అసెంబ్లీలో తమపై ప్రతిపక్షం చేసిన ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు సిఎం కేసీఆర్. మిషన్ భగీరథను అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, అది పూర్తయితే తమకు ఓట్లు రావని కాంగ్రెస్ భయపడుతోందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీకి ఇప్పటికే 700 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, త్వరలోనే పూర్తి స్థాయి లాభాల బాట పట్టిస్తామని ఆయన తెలిపారు. గవర్నర్ ప్రసంగం, అధికార పార్టీ ఇచ్చిన వాటితోనే సాగుతుందని, అది టిఆర్ఎస్ మానిఫెస్టోనే అంటూ ఆయన తెలిపారు. డిసెంబర్ కల్లా, 6182 గ్రామాలకు మంచినీరు అందిస్తామని, ఆయన స్పష్టం చేశారు.   సమైక్య రాష్ట్రంలో లాండ్ అసైన్ మెంట్ ను కూడా సరిగ్గా చేయలేదని, ఆ అసైన్ మెంట్స్ అన్నింటినీ సరి చేస్తామన్నారాయన. త్వరలోనే తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తండాలన్నింటినీ పంచాయితీలుగా మారుస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామాలన్నింటికీ సింగిల్ ఫేజ్ విద్యుత్ ను నిరంతరంగా అందిస్తామని, ప్రతీ ఊళ్లోని దళితులకు 3 ఎకరాలు భూమిని కేటాయిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. బడ్జెట్లో ఆరోగ్యానికి పెద్దపీట వేయబోతున్నామని, హాస్పటళ్లను అద్భుతంగా, ఆరోగ్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఈ ఏడాది ముప్ఫై నాలుగు వేల ఉద్యోగాలను కల్పిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష ఉద్యోగాలను ఇస్తామన్న దానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.  బీ ప్రౌడ్ టు బీ ఏ హైదరాబాదీ అంటూ మాట్లాడటం విశేషం.

నా భర్త వేధిస్తున్నాడు : సింగర్ మథుప్రియ

  గత అక్టోబర్లో పెద్దల్ని ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకుంది సింగర్ మధుప్రియ. శ్రీకాంత్ అనే షార్ట్ ఫిల్మ్ మేకర్ తో ప్రేమలో పడి, ఆ తర్వాత పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్లను ఎదిరించి, మథుప్రియ తన సన్నిహితుల సమక్షంలో పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హుమయూన్ నగర్ పి ఎస్ లో తన భర్త వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది మథుప్రియ. వరకట్నం కోసం వేధించడమే కాక, అనుమానిస్తున్నాడని, ఫోన్ కూడా తీసేసుకుని ఎవరితోనూ మాట్లాడనివ్వట్లేదని ఫిర్యాదులో పేర్కొంది. కట్నం తీసుకురావాలని అత్తమామలు వేధిస్తున్నారని, పెళ్లైన నాలుగు నెలల్లో తనకు నరకం చూపించాడని, అతని నుంచి తనకు రక్షణ కల్పించాలని కంప్లైంట్ లో పేర్కొంది. భర్త వేధింపులను తట్టుకోలేక మధుప్రియ ఏడుస్తూ పుట్టింటికి చేరుకుందని సమాచారం. తాజాగా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హుమయూన్ నగర్ పి ఎస్ లో ఫిర్యాదును నమోదు చేసింది. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి విచారిస్తున్నారు

లండన్ పర్యటనలో బిజీ బిజీగా చంద్రబాబు.. ఎక్స్ క్ల్యూజివ్ ఫొటోస్

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడి టాప్ 20 కంపెనీ ప్రతినిధులతో భేటీ అయినట్టు తెలస్తోంది. ఈ సమావేశంలో భాగంగా చంద్రబాబు ఏపీ రాష్ట్ర పరిస్థితులు.. నూతన రాజధాని అయిన అమరావతి గురించి చర్చిస్తున్నట్టు సమాచారం. స్మార్ట్‌సిటీ నిర్మాణంపై అక్కడ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇంకా నిర్మాణాలు, సౌకర్యాలు గురించి అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు అమరావతికి నిధుల సమీకరణలో సాయం అందించేందుకు లండన్ స్టాక్‌ఎక్సేంజ్ అంగీకరించింది. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. దీంతో మొత్తానికి  వరుస భేటీలతో చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు.     ఇదిలా ఉండగా థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఆకర్షణీయ పర్యాటక సంస్థ లండన్ ఐని చంద్రబాబు బృందం సందర్శించింది. థేమ్స్ నది అందానికి ముగ్దులైన చంద్రబాబు నవ్వుతూ అక్కడ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. థేమ్స్ నదిలో బోటు షికారు చేశారు.  

విజయ్ మాల్యాపై వర్మ కామెంట్లు.. క్యాలెండర్‌ గర్ల్స్‌ను ఇస్తే సరిపోతుంది..

రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాస్పద వ్యాఖ్యలు.. వివాదాస్పద వ్యాఖ్యలు అంటేనే రాంగోపాల్ వర్మ.. టాపిక్ ఏదైనా కానీ.. వ్యక్తి ఎవరైనా కానీ ఏదో ఒకటి అననది రాంగోపాల్ వర్మకి నిద్రపట్టదు. తాజాగా ఆయన దేశం మొత్తం సంచలనం సృష్టిస్తున్న విజయ్ మాల్యాపై కూడా నాలుగు కామెంట్లు విసిరారు. బ్యాంకర్లు ఆయనకు ఇచ్చిన వేల కోట్ల అప్పులు కట్టే బదులు మాల్యా దగ్గర ఉన్న క్యాలెండర్‌ గర్ల్స్‌ని ఒక్కొక్కరినీ ఒక్కొక్క బ్యాంకుకు ఇవ్వాలని, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదని అన్నాడు. అక్కడితో ఆగాడా.మాల్యా చేసిన అప్పులతో క్యాలెండర్‌ గర్ల్స్‌ ఆస్తులు ఏమైనా పెరిగి ఉంటే మరి వారు రుణం తీర్చాలి కదా.. అని మాల్యా ఈ ఆఫరిస్తే బ్యాంకులు అంగీకరించకపోవచ్చు.. కాని బ్యాంకర్లు అంగీకరిస్తారు.. అంటూ చురకలేశారు.

నారాయణ సంచలన వ్యాఖ్యలు.. విజయ్ మాల్యాను చంపబోయి మాగంటిని చంపారు

సిపిఐ నాయకుడు నారాయణ అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేయడం పరిపాటే. ఇప్పుడు తాజాగా విజయ్ మాల్యా వ్యవహారంలో కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌మాల్యాకు, మాగంటి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని.. నక్సలైట్లు విజయ్ మాల్యాను చంపాలని ప్రయత్నించి వీలుకాక మాగంటి సుబ్బిరామిరెడ్డిని చంపారని అన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ పైన విమర్శల బాణాలు సంధించారు. బ్యాంకర్లకు, విజయ్‌మాల్యాకు మధ్య గతంలో కాంగ్రెస్ మధ్యవర్తిత్వం నడిపిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో మాగుంట సుబ్బరామిరెడ్డిని నక్సలైట్లు కాల్చి చంపారని ఆరోపించారు. 

ఐశ్వర్యరాయ్ ది గుంటూరు జిల్లానా..!

ప్రభుత్వ అధికారులు అప్పుడప్పుడు తప్పిదాలు చేస్తుంటారు అది సహజం.. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకంది. హెల్త్ కార్డు ఒక ఫ్యామిలీ ఫొటోకు బదులు బాలీవుడ్ నటి అందాల తార ఐశ్వర్యరాయ్ ది వచ్చి చేరింది. వివరాల ప్రకారం.. ఆంధ్ర ప్రభుత్వం పేదలకు ఎన్టీఆర్ వైద్య సేవల హెల్త్ కార్డు ఇస్తుంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా గొల్లపల్లి మండలం గంగుపల్లి తాండాకు చెందిన బాణావత్ బాద్యుకు కూడా హెల్త్ కార్డు మంజూరైంది. కాకపోతే తమ ఫ్యామిలీ ఫొటోకి బదులు ఐశ్వర్యరాయ్ ఫొటో రావడం చూసి ఖంగుతిన్నారు. దీంతో ఆ కుటుంబసభ్యులు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఇదే నిదర్శనమని అంటున్నారు.

కొరియాను కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య యుద్ధ వాతావరణం చిక్కబడుతోంది. ఈ ఏడాది మొదట్లో ఉత్తర కొరియా అణ్వాస్త్రాన్ని పరీక్షించడంతో మొదలైన ఈ ఉద్రక్తత ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. ఉత్తర కొరియా దూకుడుని తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి పలు ఆంక్షలను విధించినప్పటికీ, వాటిని లెక్కచేయకుండా ఆ దేశ నియంత కిమ్‌ జోంగ్‌ మరిన్ని సవాళ్లకు సిద్ధపడుతున్నారు. తరచూ పలు క్షిపణులను పరీక్షించడమే కాకుండా, ఆ క్షిపణులకి అణ్వాస్త్రాలను మోసుకుపోయే శక్తి కూడా ఉందంటూ కవ్విస్తున్నారు. దాంతో దక్షిణ కొరియాకు మిత్రరాజ్యమైన అమెరికా రంగంలోకి దిగింది. తన యుద్ధ విమానాలు కొన్నింటిని ఇప్పటికే దక్షిణ కొరియాకు పంపింది అమెరికా. ఆ ప్రాంతంలో ఇరు దేశాల బలాన్ని చాటేందుకు ఇప్పడు దక్షిణ కొరియా తీరంలో తన నౌకలను కూడా మోహరించింది. ఈ నౌకలు మరో రెండు నెలల పాటు దక్షిణ కొరియా తీరంలో కవాతుని నిర్వహించనున్నట్లు సమాచారం. మరోవైపు ఉత్తరకొరియా కూడా తాను యుద్ధానికి సదా సిద్ధం అంటోంది. తమ నేత కిమ్ జోంగ్‌ ఆదేశాలివ్వడమే ఆలస్యం, ప్రత్యర్థుల మీద విరుచుకుపడిపోతామని ఆ దేశ సైన్యాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తమ అణ్వాయుధాలన్నీ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయనీ, ఏ క్షణంలోనైనా వాటిని ఉపయోగిస్తామని అంటున్నారు.

భర్త చేసినా అత్యాచారమే.. వారిని శిక్షించాలి..

రేప్ ఎవరు చేసినా అది రేప్ అవుతుంది.. అది భర్త అయినా ఇంకెవరయినా కానీ.. అలాంటి వారికి శిక్ష వేయాల్సిందే అంటున్నారు జాతీయ మహిళా సంఘం (ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలు రేఖా శర్మ. భారతీయుల విషయంలో భార్యాభర్తల సంబంధాలను అత్యాచారంగా పరిగణించడం సరికాదని.. భార్యాభర్తల మధ్య అత్యాచార ఘటనగా పరిగణించలేమని రాజ్యసభలో కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంపై ఆమె స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. కనీసం జంతువుల సంరక్షణకు కూడా చట్టాలు ఉన్నాయి.. అలాంటిది ఆడవాళ్లకు రక్షణ వద్దా.. వివాహాం అనే ముసుగులో భార్యను భర్త చిత్ర హింసలు పెట్టడం అమానుషం.. ఎవరు అత్యాచారం చేసినా అత్యాచారమే. భర్త అయినా మరొకరయినా ఒకే శిక్ష వేయాలి' అని రేఖా శర్మ ట్వీట్ చేశారు.

యువతిని వేధిస్తున్న కేసులో జనసేన పార్టీ సభ్యుడి అరెస్ట్..

ఓ యువతిని వేధిస్తున్నాడు అంటూ జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేసిన వైనం విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్టణానికి చెందిన చంద్రశేఖర్ సాకేటి సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి ఫేస్ బుక్ లో  హైదరాబాదు నగరానికి చెందిన ఒక యువతితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో హైదరబాద్ వచ్చినప్పుడల్లా చంద్రశేఖర్ ఆమెను కలిసేవాడు. అయితే ఆ అమ్మాయి చనువును అవకాశంగా తీసుకున్న అతను మొదట ప్రేమ, ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో చంద్రశేఖర్ వారిద్దరూ కలిసినప్పుడు తీసుకున్న ఫొటోలు, అసభ్యకరమైన మెసేజ్ లు.. కామెంట్లు పోస్ట్ చేస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతన్ని పట్టుకున్నారు.

బ్యాంకులకు కాస్త రిలీఫ్.. ఇంకా రూ.5,500 కోట్ల ఆస్తులు

విజయ్ మాల్యాకు అప్పులిచ్చి ఇరకాటంలో పడ్డ్ బ్యాంకులకు కాస్త ఊరట లభించే విషయం ఒకటి బయట పడినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ తన ఆస్తలు గ్యారంటీగా పెట్టి అప్పులు తీసుకున్న విజయ్ మాల్యాకు ఇంకా రూ.5,500 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయన్న విషయం తాజాగా వెలుగు చూసింది. దీంతో బ్యాంకులు కొంచం రిలీఫ్ అయ్యాయి. ఇప్పటికే మాల్యా తమకు గ్యారెంటీగా పెట్టిన ఆస్తులను విక్రయించిన బ్యాంకులు రూ. 1,200 కోట్లను రాబట్టుకున్నాయి. ఇప్పుడు ఈ ఆస్తులను కూడా బ్యాంకులు అటాచ్ చేసి కొంత మేర రుణాలను రాబట్టుకునే ప్రయత్నాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాకట్టు పెట్టని ఆస్తులను స్వాదీనం చేసుకునే హక్కు లేకపోయినా కోర్టును ఆశ్రయించి తద్వారా సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.   ఇక మాల్యా కూడా ఎలాగూ దేశం విడిచిపోయినట్టు తెలుస్తోంది కాబట్టి కోర్టు ఆ ఆస్తులను జప్తులను చేసి..వేలం వేసి వచ్చిన సొమ్ముతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను బకాయిలతో పాటు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, పీఎఫ్ బకాయిలు తీర్చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

చనిపోయిన భార్య- టీవీలో కనిపించింది

మొరాకో దేశంలో నివసించే అబ్రగ్‌ మొహమ్మద్‌ భార్య రెండేళ్ల క్రితం ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రిలో చేర్చిన అబ్రగ్, వైద్యానికి అయ్యే ఖర్చులను పోగేసుకుని ఆసుపత్రికి చేరుకునేసరికి, భార్య చనిపోయిందని చెప్పారు వైద్యులు. చెప్పడమే కాదు, అతని భార్యదేనంటూ ఓ శవపేటికను కూడా అందించారు. అబ్రక్‌ దానిని తన సొంత ఊరికి తీసుకువెళ్లి సమాధి చేసేశాడు కూడా! కానీ ఈమధ్య ఓ టీవీ కార్యక్రమంలో తన భార్య కనిపించడంతో అబ్రగ్‌కి మతిపోయింది. తప్పిపోయినవారిని తిరిగి తమ బంధువుల దగ్గరకు చేర్చే ఆ కార్యక్రమంలో, తాను రెండేళ్ల క్రితం తన భర్త నుంచి దూరమయ్యానంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి భార్యాభర్తలు ఇద్దరూ ఓ చోటకి చేరినప్పటికీ... రెండేళ్ల క్రితం ఏం జరిగి ఉంటుందన్నది మాత్రం ఓ మిస్టరీగా మిగిలిపోయింది. అన్నింటికీ మించి అబ్రగ్‌ పాతిపెట్టిన శవం ఎవరిదంటూ ఇప్పుడు పరిశోధన మొదలైంది.

టీఆర్ఎస్ పై మండిపడ్డ రేవంత్ రెడ్డి..

టీడీఎల్పీనేత రేవంత్ రెడ్డి అదికార పార్టీ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. గతంలో ఎప్పుడూ ముందు వరుసలో కూర్చునే రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నాలుగో వరసలో కూర్చోవాల్సి వచ్చింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ..  సభలో విపక్ష నేతగా తనకు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉన్నా, అందుకు విరుద్ధంగా నాలుగో వరుసలో కేటాయించారని మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే తనపై కక్ష్య సాధిస్తుందని.. మాకూ మంచి రోజులు వస్తాయి అని వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ టీడీపీ నుండి మొత్తం 15 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటి వరకూ 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఇంక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.

చంద్రబాబుపై అప్పుడే ఎర్రబెల్లి సంచలన కామెంట్లు..

ఎర్రబెల్లి దయాకర్ టీఆర్ఎస్ పార్టీలోకి చేరి ఆపార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. స్పీకర్ కూడా వారిని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించారు. అయితే ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత.. సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చేసింది పార్టీ ఫిరాయింపు కాదని.. పార్టీ శాసనసభాపక్షాన్నే టీఆర్ఎస్ లో విలీనం చేశామని తెలిపారు. అయినా గతంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావును గద్దె దించి చంద్రబాబు సీఎం అయిన తీరుతో పోలిస్తే... మేం చేసింది ఎంత? అని ఆయన మీడియాకే ఎదురు ప్రశ్నలు సంధించారు. టీఆర్ఎస్ లోకి వస్తానంటూ తాను ఏ ఒక్క నేతకు కూడా ఫోన్ చేయలేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు.