సోనియా, రాహుల్ తల్లీకొడుకులు కాదా?

      కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తల్లీకొడుకులు కాదా? ఈ సందేహాన్ని వ్యక్తం చేస్తోంది ఎవరో కాదు.. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు! కొడుకును ప్రధానమంత్రి చేయడానికి రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కూడా సిద్ధమైన సోనియాగాంధీ రాహుల్ గాంధీకి తల్లి అవునా కాదా అనే సందేహం ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే కొంత డెప్త్ లోకి వెళ్ళాల్సిన అవసరం వుంది.   సోమవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని 111 స్థానాలకు అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితా చూసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలామంది  షాకైపోయారు. ఎందుకంటే, లిస్టులో వాళ్ళ పేర్లయితే వున్నాయిగానీ, వివిధ స్థానాల నుంచి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్న వాళ్ళ పుత్రరత్నాలకు మాత్రం టిక్కెట్లు దక్కలేదు. ఇక టిక్కెట్లు వచ్చేస్తాయ్.. పోటీ చేసి గెలిచేద్దాం అని ఎదురుచూసిన సీనియర్ నాయకులు, పుత్రరత్నాలు జాయింట్‌గా బిత్తరపోయారు. ఎందుకిలా? అని అధిష్ఠానాన్ని అడిగితే ‘ఇంటికి ఒక్కటే టిక్కెట్’ అని బ్లంట్‌గా చెప్పేసింది. దాంతో వాళ్ళకి భోరున ఏడవటం ఒక్కటే తక్కువైంది. మా పుత్రరత్నాలకు టిక్కట్లు ఇవ్వలేదు. వారసులకు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వమని చెబుతున్నారు. మరి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తల్లీ కొడుకులే కదా.. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో వుండే ఒకే కుటుంబానికి చెందినవాళ్ళే కదా.. మరి వాళ్ళిద్దరికీ పార్టీ టిక్కెట్లు ఎందుకు ఇచ్చిందో అని అమాయకంగా అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు తల్లీకొడుకులు కాదేమోనని ఆగ్రహంగా అంటున్నారు. వాళ్ళకి వర్తించని రూల్స్ మాకెందుకు వర్తించాయో అనుకుంటున్నారు!

అన్ని పార్టీలలో ఎన్నికళలు!

  రాష్ట్రంలో ఈనేలో 30న జరిగే మొదటిదశ ఎన్నికలకి నామినేషన్లు వేయడానికి ఈరోజే ఆఖరి రోజు. అన్ని ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్ధులను దాదాపుగా ప్రకటించినప్పటికీ, ముఖ్యమయిన కొన్ని స్థానాలపై ఇంకా పట్లుపడుతూనే ఉన్నాయి. అన్ని పార్టీలలో కూడా టికెట్ దొరకని నేతలు, వారి అనుచరులు వీరంగం వేస్తున్నారు. కొందరు చురుకయిన నేతలు చకచకా కండువాలు, టోపీలు, పార్టీలు మార్చేసి టికెట్స్ దక్కించుకొంటే, మరి కొందరు స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారు. అయితే ‘నామినేషన్ల ఉపసంహరణ’ అనే వెసులుబాటు అటువంటివారిని బుజ్జగించి బరిలోనుండి తప్పించేందుకే ఉంది కనుక అప్పటికి అన్ని పార్టీలలో చెలరేగిన అశాంతి కొంతవరకు సర్దుమణగవచ్చును. కానీ పొత్తుల్లో భాగంగా టికెట్ దొరకని తమ పార్టీ నేతలని సదరు పార్టీలే స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలోకి దిగేందుకు పరోక్షంగా ప్రోత్సహించి, వారిపై బహిష్కరణ వేటు కూడా వేసి, ఎన్నికలలో గెలిచిన తరువాత ఆ బహిష్కరణ ఎత్తివేసి తిరిగి పార్టీలోకి రప్పించుకోవడం గతంలోనే చాలాసార్లు జరిగింది. గనుక రాజకీయ పార్టీలు, వాటిని వదిలి వెళ్ళిన లేదా పార్టీల గోడలు దూకి టికెట్ సాధించుకొన్న అభ్యర్ధులు అందరూ ఒక తానులో ముక్కలేనని స్పష్టమవుతోంది. అన్ని పార్టీల, నేతల ఏకైక లక్ష్యం ఎన్నికలలో గెలిచి అధికారం దక్కించుకోవడమే తప్ప వేరేమి కాదని వారి ఈ చేష్టలే నిరూపిస్తున్నాయి. ఇంతకాలం ప్రజలను చైతన్యపరిచేందుకు యాత్రలు చేసిన సదరు నేతల ఆలోచనలు, పద్దతులలో ఎన్నడూ మార్పు రాబోదని, ప్రజలు అటువంటివి ఆశించడం అత్యాశే అవుతుందని నిరూపిస్తున్నారు. అందువల్ల ప్రజలు కూడా ఇవ్వన్నీ ప్రతీ ఎన్నికల ముందు కనబడే సర్వ సాదారణ దృశ్యాలే అని సరిబెట్టుకొని వారిలోనే ఎవరికో ఒకరికి ఓటేసి వస్తుంటారు.

రెండు చోట్ల కేసీఆర్ పోటీ : అపనమ్మక ప్రభావం!

  తెలంగాణలో తెరాస అధికారంలోకి రాగలిగినంత మెజారిటీ సాధించే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు ఎప్పుడూ చెబుతూనే వున్నారు. ఆ విషయం కేసీఆర్‌కి కూడా తెలుసు. ఉత్తర తెలంగాణలో తప్ప దక్షిణ తెలంగాణలో పట్టులేని తెరాస తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది కలలో మాట. ఈ విషయం కేసీఆర్‌కి కూడా తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత తన పార్టీకి మెజారిటీ రావడం సంగతి దేవుడెరుగు, అసలు ఎన్నిసీట్లు గెలుస్తామో కూడా ఊహించలేని పరిస్థికి కేసీఆర్ చేరుకున్నారు. ఇంతకాలం తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మీద కేసీఆర్ పెంచుకున్న ఆశల మంచు చాలా వేగంగా కరిగిపోయింది. ఇప్పుడు కేసీఆర్ కళ్ళ ముందు వాస్తవ పరిస్థితి కనిపిస్తోంది. తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదన్న వాస్తవ అపనమ్మకి కేసీఆర్‌లో నిండిపోయింది. అందుకే అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేయాలన్న ఆలోచనకి కార్యరూపం తీసుకొచ్చారు. గజ్వేల్ అసెంబ్లీకి, మెదక్ పార్లమెంట్‌కి పోటీ చేస్తున్నారు. పొరపాటున, ఊహించని విధంగా, అనుకోకుండా తెరాసకి మెజారిటీ వస్తే అసెంబ్లీ సీటు ఆధారంగా ముఖ్యమంత్రి అయిపోవచ్చు. మెజారిటీ రాకపోతే ఢిల్లీలో హడావిడి చేయడానికి ఎంపీ సీటు ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

సరికొత్త రోగం : కేజ్రీవాల్ ఫోబియా

  ప్రపంచ వైద్య చరిత్రలో ఒక సరికొత్త రోగం తెరమీదకి వచ్చింది. ఆ రోగం పేరు ‘కేజ్రీవాల్ ఫోబియా’. ఇది ఒక మానసిక రోగం. మానడానికి ఎంతమాత్రం అవకాశం లేని రోగం. జనం నమ్మకాన్ని వమ్ము చేసిన రాజకీయ నాయకులకు మాత్రమే ఈ రోగం వచ్చే అవకాశం వుంది. ఈ రోగ లక్షణాలు ఎలా వుంటాయంటే, తాను జనం మధ్యలో వుండగా ఎవరో ఒక సామాన్యుడు తన ముందుకు వచ్చి చెంప చెళ్ళుమనిపిస్తాడని సదరు రాజకీయ నాయకుడు ఎప్పుడూ భయపడుతూ వుంటాడు. పైకి మాత్రం ‘నేను ప్రజాసేవకుడిని, సమస్యల పరిష్కరామే నాకు ముఖ్యం. నన్ను ఎవరు, ఎక్కడకి రమ్మన్నా వస్తా. ఇష్టం వచ్చినట్టు కొట్టుకోండి’ అని కేజ్రీవాల్ తరహాలో స్టేట్‌మెంట్లు ఇస్తూ వుంటారు. ఈ రోగం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి మొట్టమొదటిసారి వచ్చంది కాబట్టి దీనికి ‘కేజ్రీవాల్ ఫోబియా’ అని పేరు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఈ రోగం సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులకు వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే ఈ మూడు పార్టీల నాయకులు సీమాంధ్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు. రాష్ట్రం అన్యాయంగా ముక్కలయ్యేందుకు సహకరించారు. ప్రజల మనసులను గాయపరిచారు. ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో అర్థంకాకుండా వున్నారు. నమ్మకద్రోహం చేసిన తమకు ప్రజల నుంచి ‘చెంపదెబ్బ’ లాంటి సత్కారాలు జరుగుతాయేమోనని భయపడుతూ వున్నారు. ఇలా భయపడీ భయపడీ వీళ్ళకు ‘కేజ్రీవాల్ ఫోబియా’ వచ్చే అవకాశం వుంది.

కేసీఆర్‌కి కోదండరామ్ పెంపుడుకుక్కా?

      పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ మొదటి నుంచీ టీఆర్ఎస్‌కి, కేసీఆర్‌కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలో వాస్తవాలు అందరికీ తెలుసు. దీనిమీద తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతూనే వుంది. కోదండరామ్ కేవలం టీఆర్ఎస్‌కి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వుంటారని, టీఆర్ఎస్ ఆదేశాలను పాటిస్తూ వుంటారని, తెలంగాణ కోసం కృషి చేస్తున్న మిగతా పార్టీలను ఎంతమాత్రం పట్టించుకోరని అంటూ వుంటారు. ఇవన్నీ ఇలా వుంటే, కోదండరామ్ గురించి తెలుగుదేశం శాసనసభ్యుడు, అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాపలా కుక్కలా వుంటానని చెప్పుకునే కోదండరామ్ కేసీఆర్ పెంపుడుకుక్కలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కోదండరామ్ ఒక ప్రొఫెసర్‌లా కాకుండా పోరంబోకు లాగా మాట్లాడుతూ వుంటారని నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. కోదండరామ్ వ్యవహారశైలి టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నట్టు వుంటుందే తప్ప, పొలిటికల్ జేఏసీ ఛైర్మన్‌ స్థాయిలో వుండదని నర్సిరెడ్డి దుయ్యబట్టారు. తమకు నచ్చని పార్టీలు తెలంగాణలో వుండకూడదనే ప్రజాస్వామ్య విరుద్ధమైన ధోరణి కేసీఆర్‌లో, కోదండరామ్‌లో కనిపిస్తున్నాయని నర్సిరెడ్డి విమర్శించారు.

కేసీఆర్ నిర్వేదం!

      మీడియాతో ఎప్పుడు మాట్లాడినా బోలెడంత పౌరుషంగా మాట్లాడే కేసీఆర్ సడెన్‌గా నిర్వేదంగా, నిరాసక్తంగా, నీర్సంగా, నిస్తేజంగా మాట్లాడారు. ఆయన గొంతులో ‘ఏంటో పాడు పాలిటిక్స్’ అనే ధోరణి వినిపించింది. ఎన్ని తంటాలు పడినా, ఎంత ప్రాంతీయ విద్వేషాలు రగిల్చినా చివరికి ఎన్నికల్లో అవమానం తప్పదన్న బాధ ఆయన గొంతులో వినిపించింది.   సోమవారం ఆయన మాట్లాడుతూ, నా పని నేను చేస్తున్నాను ఇక ఫలితం ఇచ్చేది ఆ పైవాడే అన్నట్టుగా మాట్లాడారు. తెలంగాణ తెచ్చానన్న ఖ్యాతి నాకు మిగిలింది అది నాకు చాలు అనే మాట ఆయన నోట్లోంచి వచ్చినప్పుడు ఆ మాట విన్నవాళ్ళ మనసులో ఎన్నో ఆలోచనలు కలిగాయి. తెలంగాణ తెచ్చానన్న ఖ్యాతి తప్ప తనకేమీ మిగలదని కేసీఆర్ చెప్పకనే చెబుతున్నారా అనే సందేహాలు కలిగాయి. ఈ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి ‘వస్తే’ అభివృద్ధి జరుగుతుందని కూడా ఆయన అన్నారు. నిన్నటి వరకూ తెరాస అధికారంలోకి వస్తుంది, ముఖ్యమంత్రి అయిపోతానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ‘వస్తే’ అనడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే కేసీఆర్ టీఆర్ఎస్ అధికారంలోకి రాదన్న విషయాన్ని ఒప్పుకుంటున్నట్టే వుందని అందరూ అనుకుంటున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కార్యకర్తలు వద్దంటున్నా టీడీపీ, బీజేపీ ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నాయని అని బిక్కముఖం వేసుకుని చెప్పారు. అప్పటిగ్గానీ అసలు విషయం క్లియర్‌గా అర్థం కాలేదు. అసలే ఇప్పటికే విజయావకాశాలు అంతంతమాత్రంగానే వున్న టీఆర్ఎస్‌కి టీడీపీ, బీజేపీ కలయిక దారుణమైన నష్టం తెచ్చే అవకాశం వుంది. అందుకే కేసీఆర్ గొంతులో నిరాశ, నిర్వేదం ధ్వనించాయి.

కాంగ్రెస్ కి నిజంగానే టైమ్ దగ్గరపడిందా

  ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులు నామినేషన్లు వేయడానికి ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలుంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధుల పేర్లను ప్రకటించలేని దుస్థితిలో ఉంది. తెలంగాణాలో పార్టీకి విజయావకాశాలు కొంచెం మెరుగుగా ఉన్నందున టీ-కాంగ్రెస్ నేతలందరూ తమ బంధు మిత్ర పరివారాలకు టికెట్స్ ఇప్పించుకొనే ప్రయత్నంలో అధిష్టానంపై తెస్తున్న తీవ్ర ఒత్తిళ్ళ కారణంగా ఇప్పటికి ఇప్పటికి రెండు సార్లు అభ్యర్ధుల పేర్లను ప్రకటించబోయి ఆగిపోయింది.     ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న ఈ తరుణంలో ప్రత్యర్ధ పార్టీలు అభ్యర్ధుల జాబితాలను విడుదల చేసిన తరువాతనే తాము విడుదల చేస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. సరిగ్గా ఎన్నికల దగ్గరపడుతున్నతరుణంలో టికెట్స్ ఎరగా చూపించి ప్రత్యర్ధ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించి, ప్రత్యర్ధ పార్టీలను బలహీనపరిచేందుకే ఈ ఎత్తుగడ వేసి ఉండవచ్చును. ఇప్పటికే, తెదేపా, తెరాస, వైకాపా, బీజేపీలలో టికెట్స్ దొరకక అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి దూకేస్తున్నారు. ఇంకా చాల మంది దూకవచ్చు కూడా.   కాంగ్రెస్ పార్టీకి ఎన్నిసార్లు ఎదురుదెబ్బలు తగిలినా, మొట్టికాయలు పడినా తన ఆలోచనా ధోరణిని, పద్దతులను ఎన్నడూ మార్చుకోబోదని చెప్పడానికి ఇదే ఒక మంచి ఉదాహరణ. అందువల్ల ఈసారి కూడా ప్రతీసారిలాగే ప్రత్యర్ధుల కోసం త్రవ్వుతున్న గోతిలో మళ్ళీ తానే పడేందుకు రంగం సిద్దం చేసుకొంటోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సీమాంద్రాలో అభ్యర్ధులను వెతుకోవలసిన అవసరం ఉందేమో గానీ తెలంగాణాలో లేదు. అక్కడ అవసరమయిన వారికంటే చాలా ఎక్కువ మందే ఉన్నారు. పైగా టీ-కాంగ్రెస్ నేతలు స్వయంగా తమ పిల్లజెల్లాకి కూడా టికెట్స్ ఇమ్మని కోరుతున్నారు. అటువంటప్పుడు ఉన్నవారికే టికెట్స్ ఇవ్వలేనప్పుడు కొత్తగా వచ్చిన వారికి ఏవిధంగా టికెట్స్ కేటాయించగలదు?అని ప్రశ్నిస్తే దానికి సమాధానం దొరకదు. ఇతర పార్టీలలో నుండి టికెట్స్ దొరకనందునే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నవారు, ఒకవేళ అక్కడ కూడా టికెట్ దొరకని పరిస్థితి ఏర్పడితే అప్పుడు వారు కాంగ్రెస్ లో కొనసాగరు కదా! ఒకవేళ కొనసాగినా అసంతృప్తితో ఉన్న వారివల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం ఏమిటి? అని ఆలోచిస్తే వారు ప్రత్యర్ధ పార్టీకి మద్దతు ఇవ్వకుండా అడ్డుకోనేందుకేనని భావించవలసి ఉంటుంది.   ఉదాహరణకి తెదేపా-బీజేపీ పొత్తుల కారణంగా మల్కాజ్ గిరీ టికెట్ పోగొట్టుకొన్నమెదక్ యం.యల్యే. మైనంపల్లి హన్మంత రావు తెదేపాకు గుడ్ బై చెప్పేసి ఈరోజే కాంగ్రెస్ లో చేరారు. ఆయనకి మల్కాజ్ గిరీ టికెట్ ఇచ్చేందుకు దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారు. బాగానే ఉంది. కానీ ఇటీవల కాంగ్రెస్ నుండి తెరాసకు వెళ్లి మళ్ళీవెనక్కి వచ్చిన ఆకుల రాజేందర్ కి కూడా మల్కాజ్ గిరి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏవిధంగా నిలబెట్టుకోగలదు? అంటే లేదనే అర్ధమవుతుంది.   అప్పుడు మళ్ళీ వారిరువురితో కలిసి పార్టీలో అక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న మిగిలిన అభ్యర్ధుల మధ్య యుద్దం మొదలయితే అంతిమంగా నష్టబోయేది కాంగ్రెస్ పార్టీయే. ఎదుటవాడివి రెండు కళ్ళు పోగొట్టాలని కాంగ్రెస్ పార్టీ, ఉన్న తన ఒక (తెలంగాణా) కన్ను పోగొట్టుకోవడానికి ప్రయత్నించడం చాలా నవ్వు తెప్పిస్తుంది. వినాశకాలే విపరీత బుద్ధి అంటే బహుశః ఇదేనేమో!

నేరుగా లోక్ సభ బరిలోకే దిగుతున్న దినేష్

  మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ఈరోజు వైకాపాలో చేరబోతున్నారు. ఆయనకు మల్కాజ్ గిరీ నుండి లోక్ సభకు టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించినట్లు తాజా సమాచారం. ఇంతకాలం పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసిన ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం వింతేమీకాకపోయినా, కోట్లు రూపాయలు పార్టీకి ఫండు, మరికొన్ని కోట్ల రూపాయలు ఎన్నికల ప్రచారం ‘ఇత్యాదులకు’ మంచి నీళ్ళలా ఖర్చు చేయాల్సిన లోక్ సభ సీటుకే పోటీ చేయాలనుకోవడం చూస్తే ఆయన ఆదాయానికి మించి ఆస్తులు పోగేసుకొన్నారని ఇంతకాలంగా మాజీ మంత్రి శంకర్ రావు చేస్తున్నఆరోపణలలో ఎంతో కొంత నిజముందని అనుమానించవలసి వస్తోందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయ పడుతున్నారు. ఒక పోలీసు ఉన్నతాధికారిగా ఆయన ఎంతకాలం పనిచేసినా, ఆయన మిగిల్చుకొన్న డబ్బు లోక్ సభ సీటుకి పోటీ చేసేందుకు ఏమాత్రం సరిపోదని ఎవరికయినా తెలుసు. అయితే గతంలో శంకర్ రావు తనపై ఆరోపణలు చేస్తున్నపుడు ఆయన తనకు ఉద్యోగంలో చేరక ముందు నుండే చాలా ఆస్తులున్నాయని సంజాయిషీ చెప్పుకొన్నారు. అయితే తన ఆస్తుల వివరాలను మాత్రం ఎన్నడూ బయటపెట్టే ఆలోచన చేయలేదు. కానీ ఆయన ఇప్పుడు వైకాపా లోక్ సభ అభ్యర్ధిగా నామినేషన్ వేయదలిస్తే, తప్పనిసరిగా ఆ వివరాలను అందులో పేర్కొనవలసి ఉంటుంది. మరి ఒక పోలీసు అధికారిగా చేసి పదవీ విరమణ చేసిన ఆయన ఇంత భారీ మొత్తాలను వెచ్చించే శక్తి కలిగి ఉన్నారంటే ఆయన చాలా సౌండ్ పార్టీ అయినా అయ్యి ఉండాలి లేకుంటే శంకర్ రావు చెపుతున్నట్లుగా ఆయనకు జీతం కంటే గీతం ఎక్కువయినా అయ్యి ఉండాలని ప్రజలు గుసగుసలాడుకొంటున్నారు. ఏమయినప్పటికీ (సోనియాగాంధీకి గుడి కట్టినా కూడా టికెట్ దొరకని) ఆయన ‘ప్రియ శత్రువు’ శంకర్ రావుకే ఆయన గురించి నాలుగు ముక్కలు మాట్లాడే నైతిక హక్కు ఉందని అందరూ అభిప్రాయపడుతున్నారు.

తెదేపా-బీజేపీ పొత్తులతో ప్రత్యర్ధ పార్టీలకు భయమేలనో?

  తెదేపా-బీజేపీ ఎన్నికల పొత్తులు బెడిసికోడితే బీజేపీతో తామే పొత్తులు పెట్టుకోవచ్చని ఇంతకాలం ఆశగా ఎదురుచూసిన తెరాస, వైకాపాలు వారి పొత్తులను అనైతిక పొత్తులని ఒక్క ముక్కలో తేల్చేసాయి. తెదేపాకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, దైర్యం లేనందునే బీజేపీతో పొత్తులకి తహతహలాడిందని, కాంగ్రెస్, వైకాంగ్రెస్ పార్టీలు విమర్శించాయి. కానీ, తెదేపా కూడా తమలాగే ఒక రాజకీయ పార్టీ గనుక దానికి ఏ ఇతర పార్టీతోనయినా పొత్తులు పెట్టుకొనే అధికారం హక్కు ఉంటుందని ఏ ఒక్క పార్టీ భావించలేదు, అనలేదు. తమ పొత్తులు చారిత్రిక అవసరం అని చెప్పే పార్టీలు, తెదేపా-బీజేపీల పొత్తులను చూసి ఎందుకు అంత తీవ్రంగా దాడి చేస్తున్నాయి? అంటే, ఆ పొత్తుల వలన రెండు రాష్ట్రాలలో మారే బలాబలాలతో అవి తమపై చేయి సాధిస్తాయనే అభద్రతా భావంతోనే.   కేసీఆర్ దురాశకు పోకుండా కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఉండి ఉంటే, వారి కూటమి తెదేపా-బీజేపీ కూటమి కంటే చాలా బలంగా ఉండేది. కానీ కేసీఆర్ పదవీ కాంక్షతో కాంగ్రెస్ పార్టీని కాలదన్నుకొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా కేసీఆర్ ని నమ్ముకొని తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకి సిద్దపడింది తప్ప తన స్వంత పార్టీ నేతలకి ఎన్నడూ ప్రాధాన్యం ఈయలేదు. ఇచ్చి ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ తెరాసను పొత్తుల కోసం ఇంతగా దేబిరించవలసిన అవసరం ఉండేదే కాదు. ఏ పొత్తులు లేకుండానే తెరాస, తెదేపా-బీజేపీ లకు గట్టి పోటీ ఇవ్వగలిగేది.   సీమాంద్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే తప్పు చేసింది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని స్వంత పార్టీలో హేమాహేమీలయిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరి రాజకీయ భవిష్యత్తుతో చెలగాటమాడుకొని వారినందరినీ దూరం చేసుకొని, ఈరోజు పార్టీలో నాయకుల కోసం వెతుకోవలసిన దుస్థితిలో ఉంది. వారే గనుక ఈరోజు పార్టీకి అండగా నిలబడి ఉండి ఉంటే, తెదేపా-బీజేపీ పొత్తులను చూసి ఇంతగా బెదిరిపోనవసరం ఉండేదే కాదు.   ఇక జగన్మోహన్ రెడ్డి నేటికీ కూడా తండ్రి (సానుభూతి, సంక్షేమ పధకాలు) పేరు చెప్పుకొని ఓట్లు కోరాల్సిన దుస్థితిలో ఉన్నారు. ఆయన తన సమయాన్ని ప్రజలలో సానుభూతిని నిలుపుకొనేందుకు వెచ్చించే బదులుగా పార్టీ నిర్మాణం కోసం వినియోగించి ఉండిఉంటే పార్టీయే ఆయనకు కొండంత బలంగా నిలిచేది. జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో కావలసినంత సానుభూతి ఉంది. పార్టీలో చాలా బలమయిన నేతలు కూడా ఉన్నారు. కానీ ఆయన ఎవరినీ లెక్కచేయకుండా తన దుందుడుకు నిర్ణయాలతో పార్టీకి శల్యసారధ్యం చేస్తున్నందునే పార్టీ ఆశించినంత బలం పుంజుకోలేకపోయింది. అందుకే అతను కూడా వారి పొత్తులు చూసి భయపడవలసి వస్తోంది.   రాష్ట్రంలో ఈ మూడు ప్రధాన రాజకీయ పార్టీలు స్వీయ తప్పిదాల వలననే ఈరోజు తెదేపా-బీజేపీల పొత్తులు పెట్టుకోవడం చూసిభయపడవలసి వస్తోంది, లేకుంటే దాని గురించి ఆలోచించే అవసరమే ఉండేదే కాదు.

సారీ.. శ్రీకాంతాచారీ!

      తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతచారికి ఇప్పుడు తమ మనసులలో సారీ చెబుతున్నారు. అమరవీరుడిగా నిలిచిన శ్రీకాంతాచారి కుటుంబానికి టీఆర్ఎస్ చేస్తున్న అవమానాన్ని అడ్డుకోలని తమ అశక్తతను తామే నిందించుకుంటున్నారు. అమరవీరుల కుటుంబాలకు టిక్కెట్లు ఇస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ ఎన్నికలు వచ్చినవేళ ఆ ప్రస్తావనే తేలేదు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టీఆర్ఎస్ అధినేత దగ్గరకి వెళ్ళి టిక్కెట్ అడిగితే టిక్కెట్ ఇవ్వనని ముఖంమీదే చెప్పేశాడు.   టీఆర్ఎస్ నేత అసలు స్వరూపం తెలుసుకుని బాధపడిన శంకరమ్మ నాకు టిక్కెట్ ఇవ్వకపోతే నా కొడుకులాగా నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తేగానీ టిఆర్ఎస్ టిక్కెట్ ఇస్తానని ప్రకటించలేదు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ టిక్కెట్‌ని శంకరమ్మకి ఇస్తున్నారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ ఎంతమాత్రం గెలిచే అవకాశం లేదు. ఈ సీట్ తనకు వద్దని శంకరమ్మ మొత్తుకున్నా వినకుండా తొలి జాబితాలో ఆమె పేరుని ఆ స్థానానికే ప్రకటించారు. అదేంటని శంకరమ్మ ప్రశ్నిస్తే పోటీ చేస్తే చెయ్ లేకపోతే లేదని నిర్దాక్షిణ్యంగా చెబుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న తెలంగాణ ప్రజలు, అమరవీరుల కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అమరవీరుల కుటుంబాల విషయంలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరి దారుణంగా వుందని అంటున్నారు. శ్రీకాంతాచారి చేసిన త్యాగానికి, బలిదానానికి టీఆర్ఎస్ ఇస్తున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.  

కాంగ్రెస్‌లో ‘1’ నేనొక్కడినే!

      దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయమని ఇప్పటి వరకూ జరిగిన అన్ని సర్వేలూ చెప్పాయి. లేటెస్ట్ గా ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో కూడా కాంగ్రెస్ అడ్రస్ గల్లంతేనని సదరు సర్వే చెప్పింది. దేశం సంగతి అలా వుంచితే, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఖతమ్ అయిపోవడం ఖాయమని, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ స్థానం మాత్రమే దక్కే అవకాశం వుందని సర్వే తేల్చి చెప్పింది.   ఇదిలా వుంటే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో  పదకొండు లోక్‌సభ అభ్యర్థుల పేర్లతో  తొలి జాబితాని ప్రకటించింది. వీళ్ళలో శ్రీకాకుళం- కిల్లి కృపారాణి, విజయనగరం- బొత్స ఝాన్సీ, కర్నూలు- కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, అరకు- కిషోర్ చంద్రదేవ్, కాకినాడ- పళ్ళం రాజు, అనకాపల్లి- తోట విజయలక్ష్మి, నరసాపురం- కనుమూరి బాపిరాజు, నెల్లూరు- వాకాటి నారాయణరెడ్డి, విజయవాడ- దేవినేని అవినాష్, బాపట్ల- పనబాక లక్ష్మి, తిరుపతి- చింతా మోహన్ వున్నారు. ఎన్డీటీవీ సీమాంధ్రలో కాంగ్రెస్ ఒక్క సీటే గెలుస్తుందని ఎన్డీటీవీ చెప్పింది కాబట్టి.. ఆ గెలిచే ఒక్కడు నేనొక్కడినే అని ఈ పదకొండు మంది అభ్యర్థులు అనుకుంటూ వుండొచ్చు. మిగతా 14 మంది పేర్లను ప్రకటిస్తే వాళ్ళు కూడా గెలిచేది నేనొక్కడినే అనుకుంటారేమో! సీమాంధ్ర ప్రజలు మాత్రం ఈసారి సీమాంధ్రలో ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా గెలిచే ఛాన్సే లేదని అంటున్నారు.

రాష్ట్ర విభజన లోకజ్ఞానం!

      ‘‘గురువర్యా’’ ‘‘ఏంటి శిష్యా?’’ ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం చివరికి ఏమి కాబోతోంది? ఏం జరగబోతోందా అన్న టెన్షన్‌తో నేను అల్లాడిపోతున్నా. మీ దివ్యదృష్ణితో చూసి భవిష్యత్తులో జరిగేదోంటో కాలజ్ఞానం చెప్పి నన్ను ధన్యుణ్ణి చేయండి’’ ‘‘ఈ విషయం చెప్పడానికి కాలజ్ఞానం ఎందుకు శిష్యా? లోకజ్ఞానం చాలు’’ ‘‘అయితే ఆ లోకజ్ఞానం ఏంటో చెప్పేయండి గురువర్యా’’ ‘‘చెప్తా విను శిష్యా.. తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగేవరకూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకే తాను అనుకూలంగా వున్నట్టు కలరింగ్ ఇస్తుంది. తెలంగాణలో పోలింగ్ పూర్తయిన తర్వాతే అసలు ట్విస్టు వుంటుంది’’ ‘‘ఏంటా ట్విస్టు గురూజీ?’’ ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ధంగా జరగలేదని కోర్టు చెబుతుంది. దాంతోపాటు అనేక న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అంశాలు బయటకి వస్తాయి. అప్పుడు విభజన ప్రక్రియ సరిగా జరగలేదు కాబట్టి మళ్ళీ తెలంగాణ బిల్లును రూపొందించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, పార్లమెంట్‌లో చర్చించాలని డెసిషన్ వస్తుంది’’ ‘‘నిజంగా ఇలా జరుగుతుందంటారా గురూజీ?’’ ‘‘వేచి చూడు నాయనా’’....!  

కిషన్‌రెడ్డి అలకపాన్పు!

      రాష్ట్ర బీజేపీకి కిషన్ రెడ్డి పెద్ద గుదిబండలా తయారయ్యారు. ప్రతి సందర్భంలోనూ లేనిపోని ఇష్యూలు క్రియేట్ చేసి తలనొప్పులు సృష్టిస్తున్నారు. తెలంగాణ ఇష్యూని సాధ్యమైనంత ఎక్కువగా రాజేసీ, సుష్మా స్వరాజ్ తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చేలా చేయడంలో కిషన్‌రెడ్డి పాత్ర ఎంతో వుంది. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తుల ఇష్యూ జీడిపాకంలా సాగడానికి కూడా కిషన్ రెడ్డే కారణమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పొత్తు కుదిరేదాకా వచ్చిన ప్రతిసారీ కిషన్ రెడ్డి దాన్ని చెడగొట్టడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు.   ఇదిలా వుంటే ఇప్పుడు ఆయన తాజాగా అలక సీన్ సృష్టించారు. తాను ఈసారి ఎన్నికలలో పోటీ చేయడం లేదని బాంబు పేల్చారు. అలా ఎందుకని అడిగితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ అంతటా పర్యటించాల్సి వుంటుంది కాబట్టి తాను పోటీ చేయదలచుకోవడం లేదని చెప్పారు. అయితే దీనికి వెనుక అసలు కారణం మరోటి వుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందరి చూపూ మల్కాజిగిరి లోక్‌సభ స్థానం మీదే వుంది. చాలామంది అక్కడి నుంచి పోటీ చేసి గెలవాలని తహతహలాడుతున్నారు. ఆతహతహ కిషన్‌రెడ్డికి కూడా మొదలైంది. మొన్నటి వరకూ సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ నుంచి పోటీ చేసి దత్తాత్రేయకి జెల్ల కొట్టాలని కిషన్‌రెడ్డి  ప్రయత్నించారు. అయితే కిషన్‌రెడ్డిని అంబర్ పేట నుంచే పోటీ చేయించాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు కిషన్ రెడ్డికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకి హర్టయిన కిషన్ రెడ్డి అస్సలు పోటీయే చేయనని అలిగి కూర్చున్నారు. అలిగిన తనను బీజేపీ అగ్ర నాయకత్వం బుజ్జగించి పార్లమెంట్‌కి పోటీ చేయిస్తుందని కిషన్‌రెడ్డి ఆశిస్తున్నారని సమాచారం.  

యువరాజా వారికి అక్కయ్య బ్యాక్ సపోర్ట్

  రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి చూసుకోవాలని సోనియాగాంధీ తల్లి మనసు కొట్టుకొంటుంటే, ఆ తల్లి ముచ్చట తీర్చేందుకు ప్రియాంక వాధ్ర తమ్ముడి కోసం తెరవెనుక మంత్రాంగం నడిపిస్తూ చాలా కష్టపడుతున్నారని ఈమధ్య తరచూ వార్తలలో చూస్తున్నాము.   తల్లి కొడుకులిద్దరూ ఊరూరు తిరుగుతూ తమని గెలిపించమని ప్రచారం చేసుకొంటుంటే, ప్రియంక తమ్ముడి ఇంట్లో కూర్చొని అతను ఎక్కడ, ఏ విషయాలపై, ఏవిధంగా ప్రసంగించాలి? ఏ సభలో ఎటువంటి బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించాలి? ఏ సభకు ఎప్పుడు వెళ్ళాలి? అక్కడ ఏ కులస్తులు లేదా మతస్తులు అధికంగా ఉన్నారు? వారు విద్యావంతులా లేక నిరక్షరాస్యులా? అక్కడ స్థానిక సమస్యలేమిటి? వాటికి రాహుల్ సూచించవలసిన పరిష్కారాలేవిధంగా ఉండాలి?వంటి అన్ని వివరాలను క్రోడీకరించి అతని ప్రసంగాలకు తుదిమెరుగులు దిద్దుతూ, తమ్ముడి సభకు అవసరమయిన ఏర్పాట్లను ఇంటి నుండే పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా చూసి రాహుల్ గాంధీ కంటే అతని విజయం కోసం తెరవెనుక శ్రమిస్తున్న ఆ అక్కయ్యని చూసి ఎవరయినా మెచ్చుకోవడం సహజమే.   అయితే, భారతదేశం వంటి ఒక సువిశాలమయిన దేశాన్ని ప్రధాని కుర్చీలో కూర్చొని పరిపాలించాలనుకొంటున్న యువరాజవారిని నేటికీ ఎవరో ఒకరు వేలు పట్టుకొని నడిపిస్తే తప్ప తనంతట తానుగా నడవలేరని దీనితో స్పష్టం అవుతోంది. సోనియాగాంధీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ని రిమోట్ కంట్రోల్ తో నడిపిస్తూ దేశాన్ని పాలిస్తున్నట్లుగానే, ఒకవేళ రేపు ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి రాహుల్ ప్రధాని కుర్చీలో కూర్చొంటే, అప్పుడు  ఆయనను కూడా ఎవరో ఒకరు రిమోట్ ఆపరేషన్ చేయవలసి వస్తుందేమో!   నరేంద్ర మోడీ తొలుత దేశవ్యాప్తంగా ప్రజలందరి నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొన్నారు. ఆ తరువాత ప్రధాని అభ్యర్ధిగా ప్రకటింపబడిన తరువాత పార్టీలో చాలా మంది సీనియర్ల నుండి కూడా తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొన్నారు. నేటికీ దేశంలో సగం మంది ఆయనను వ్యతిరేఖిస్తునే ఉన్నారు. కానీ ఆయన చాలా నేర్పుతో పట్టుదలగా ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ ఇప్పుడు దేశ ప్రజలందరి చేత, చివరికి తనను వ్యతిరేఖించిన తన పార్టీ నేతల చేత కూడా ‘నమో నమో’ అనిపించుకొంటూ అప్రతీహతంగా ముందుకు సాగిపోతున్నారు.   ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఆయన ముందు కాంగ్రెస్ పార్టీలో ప్రతీ ఒక్కరు సాగిలపడి దాసోహమని ఆయనను భుజానెత్తుకొని భజన చేస్తుంటే, సాక్షాత్ ప్రధానమంత్రి డా.మన్మోహన్ సింగ్ ఆయన కోసం కుర్చీలో నుండి దిగిపోయేందుకు సిద్దమని పదేపదే చెప్పడమే కాక చివరికి మొన్న “ఎన్నికల తరువాత మరిక ప్రధాని కుర్చీలో కూర్చోబోను” అని ప్రకటించేసి యువరాజవారికి దారి నుండి అడ్డు తప్పుకొన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కురువృద్దుడనిపించుకొన్న డా.మన్మోహన్, తను రాహుల్ గాంధీ క్రింద పనిచేయడానికి కూడా వెనుకాడనని నిసిగ్గుగా చెప్పుకొన్నారు.   ఇంతటి సానుకూల వాతావరణం ఉన్నపటికీ యువరాజవారు నెగ్గుకు రాలేకపోవడంతో ఎవరో ఒకరు ఆయన వేలు పట్టుకొని నడిపించక తప్పడం లేదు. పైగా ప్రియంకా గాంధీ ఆవిధంగా తమ్ముడికి సహాయపడటం ఏదో చాలా గొప్ప విషయమన్నట్లు దేశంలో మీడియా అంతా కోడై కూస్తోంది. మోడీ రాజకీయానుభవం, కార్యదక్షత, పరిపాలనానుభావం, తెలివి తేటలు తదితర అంశాలతో రాహుల్ గాంధీని ఎలాగూ పోల్చి చూడటానికి లేదు. కనీసం తనంతట తానుగా మాట్లాడగల తెలివి తేటలు, తన సభలను, కార్యక్రమాలను తానే చక్కబెట్టుకోగల నేర్పు, అందుకు అనుసరించవలసిన వేష బాషలు వంటి చిన్న చిన్నవిషయాలకు సైతం ఎవరో ఒకరి సలహాలు, సహకారం అవసరం పడటం చూస్తుంటే రేపు ఈయన ఇంత పెద్ద దేశాన్ని ఏవిధంగా ఏలుతారు? అనే ధర్మ సందేహం ఎవరికయినా కలగడం సహజమే. అటువంటప్పుడు ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా అన్నీ చక్కబెడుతున్న ప్రియాంక గాంధీయే (యువరాజవారి కంటే) ప్రధాని పదవికి బాగా సరిపోతారేమో సోనియమ్మ ఆలోచించితే మేలేమో.

మధు యాస్కి బొచ్చెలో బిజెపి రాయి!

      మధు యాస్కి అమెరికా వెళ్ళి హోటళ్ళ వ్యాపారం చేయొచ్చుగానీ, సీమాంధ్రులు హైదరాబాద్‌లో ఉండకూడదు. ఈతరహా ఆలోచనా విధానం వున్న మధు యాస్కి నిజామాబాద్ ఎంపీ అయినప్పటి నుంచి తెలంగాణ వాదాన్ని భుజాన వేసుకుని తిరగడమే తప్ప నియోజకవర్గానికి ఒరగబెట్టింది సున్నా. ఎంపీగా ఫెయిలైన మధు యాస్కి ఈసారి గెలవటం డౌటేనన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.   ఓడిపోతానని తెలిసినా మధు యాస్కి మళ్ళీ నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తాను ప్రజలకు చేసిన సేవ ఏమీ లేకపోయినా తనకరుగట్టిన తెలంగాణ వాదాన్ని అడ్డంగా పెట్టుకుని ఓట్లు అడగాలని ఆయన అనుకుంటున్నారు. అయితే మధు యాస్కికి అనుకోని అవాంతరం వచ్చిపడింది. ఇప్పటి వరకూ నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ నాయకుడు యెండల లక్ష్మీ నారాయణ ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నారు.  ఆల్రెడీ నామినేషన్ కూడా దాఖలు చేశారు. ప్రజల్లో మంచి పేరు, సేవకుడిగా మంచి గుర్తింపు వున్న లక్షీనారాయణను ఎదుర్కోవడం మధు యాస్కి వల్ల కాదని, అందువల్ల మధు యాస్కి ఈసారి ఓడిపోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సీమాంధ్రులను అన్యాయంగా తిట్టిపోసిన పాపం మధు యాస్కిని ఊరకే వదులుతుందా?

9 నెలల పిల్లోడు హత్య చేయబోయాడట!

      పాకిస్తాన్ పోలీసులకు మైండ్ మోకాలిలో వుంటుందన్న అభిప్రాయానికి బలం చేకూర్చే సంఘటన లాహోర్‌లో జరిగింది. లాహోర్‌లోని ఒక ఏరియా పోలీసులు తొమ్మది నెలల వయసున్న మూసా అనే బాలుడి మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆ పిల్లగాడు హత్యాయత్నం చేసింది ఎవరిమీదో కాదు.. సాక్షాత్తూ పోలీసుల మీదేనంట. ఈ మేరకు ఆ పసికందు, అతని తండ్రితోపాటు పాతిక మంది మీద పోలీసులు హత్యాయత్నం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.   వీళ్ళందరినీ కోర్టుకు హాజరుపరచడంతో జడ్జి బెయిల్ మంజూరు చేసి, తొమ్మిది నెలల బాలుడు పోలీసుల మీద హత్యాయత్నం ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆ బాలుడినే కనుక్కుని స్టేట్‌మెంట్ రికార్డు చేయండని ఆదేశాలు జారీ చేశారు. తొమ్మది నెలల బాలుడి మీద  హత్యాయత్నం కేసయితే పెట్టాం గానీ, మాటలే రాని అతని స్టేట్‌మెంట్ ఎలా  రికార్డు చేయాలో అర్థంకాక పోలీసులు జుట్టు పీక్కున్నారు. ఈలోగా పోలీసు ఉన్నతాధికారులకు ఈ కేసు విషయం తెలిసి, పసికందు మీద కేసు పెట్టిన పోలీస్ స్టేషన్ ఎస్ఐని సస్పెండ్ చేసేశారు. మూసా మీద కేసు ఎత్తేశారు.  ఇంతకీ జరిగింది ఏంటంటే, లాహోర్‌లోని ఓ మాస్ లొకాలిటీలో జనం కరంట్ సరిగా వుండటం లేదని ఆందోళన చేశారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు వస్తే వాళ్ళమీద ఓ పాతికమంది దాడి చేశారు.  దాడి చేసిన వాళ్ళలో మూసా తండ్రి ఇర్ఫాన్ తరార్ కూడా వున్నాడు. దాడి చేసిన సమయంలో ఇర్ఫాన్ తరార్ చంకలో తొమ్మిది నెలల కొడుకు మూసా కూడా వున్నాడు. దాంతో పోలీసులు తమమీద దాడిచేసిన గ్రూప్‌లో మూసా కూడా వున్నాడు కాబట్టి మూసా మీద కూడా హత్యాయత్నం కేసు పెట్టి కోర్టుకు లాగారు. అదీ విషయం.

శంకరమ్మకి ఓడిపోయే చోట సీటు!

      కేసీఆర్ శుక్రవారం ప్రకటించిన తొలి జాబితాలో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి నల్గొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌ టిక్కెట్‌ని కేటాయించారు. నిజానికి ఈ స్థానంలో శంకరమ్మ కాదు కదా, సాక్షాత్తూ కేసీఆర్ పోటీ చేసినా టీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదట. అలాంటి ఓడిపోయే సీటును శంకరమ్మకి కేటాయించడం దారుణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు కేసీఆర్‌కి శంకరమ్మకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం ఎంతమాత్రం ఇష్టం లేదు. అయితే శంకరమ్మ తనకు సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, ఉద్యమకారుల కుటుంబాలకు టిక్కెట్లు ఇవ్వలేదన్న ఆరోపణలు తప్పించుకోవాలన్న ఆలోచన రావడంతో కేసీఆర్ శంకరమ్మకి హుజూర్ నగర్ టిక్కెట్ కేటాయించారు. దీనికి టీ టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు దుయ్యబడుతున్నారు. గెలవని సీటుని శంకరమ్మకి ఇచ్చి, గెలిచే సీట్లను మాత్రం తన కుటుంబ సభ్యులకు ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్‌కి ఉద్యమకారుల కుటుంబాల మీద గౌరవం వుంటే సిద్దిపేట టిక్కెట్ శంకరమ్మకి ఇచ్చి, హుజూర్ నగర్ టిక్కెట్ హరీష్ రావుకి ఇవ్వాలని సవాల్ విసిరారు.

సైకిల్-కమలం హవా!

    రాష్ట్రంలో సైకిల్ హవా నడుస్తోంది. ఏ సంస్థ సర్వే చేసినా అటు సీమాంధ్రలోను, ఇటు తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న ఫలితాలు వస్తున్నాయి. తాజాగా ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో కూడా రాష్ట్రంలో సైకిల్ హవా నడుస్తోందని తేలింది. సీమాంధ్రలో తెలుగుదేశం కూటమి 46 శాతం ఓట్లు, 14 లోక్‌సభ స్థానాలను పొందుతుందని సర్వే చెప్పింది. అలాగే తెలంగాణలో కూడా రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. మొత్తమ్మీద రెండు ప్రాంతాలతో కలిపి తెలుగుదేశం కూటమికి 16 ఎంపీ స్థానాలు దక్కనున్నాయి. వైకాపాకి 10 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్‌కి ఒక్క స్థానం దక్కే అవకాశం వుందని సర్వే చెప్పింది. తెలంగాణలో దుమ్ము దులిపేస్తామని బిల్డప్పులు ఇచ్చుకుంటున్న టీఆర్ఎస్‌కి దక్కేది ఏడు పార్లమెంట్ స్థానాలే. తెలంగాణ ఇచ్చామని డప్పాలు కొట్టుకుంటున్న కాంగ్రెస్‌కి కూడా ఏడు స్థానాలే దక్కనున్నాయి. ఇదిలా వుంటే, తమిళనాడులోని 39 పార్లమెంటు స్థానాల్లో అధికార అన్నా డీఎంకే 25 స్థానాల్లో విజయం సాధించబోతోందట. డీఎంకే కూటమి 11, బీజేపీ కూటమి 3 సీట్లు సొంతం చేసుకోనున్నాయి. కర్నాటకలోని 28 స్థానాల్లో 14 స్థానాలు భారతీయ జనతాపార్టీ అకౌంట్లో పడనున్నాయి.  కాంగ్రెస్ 10, జేడీఎస్ 2 స్థానాల్లో గెలిచే అవకాశం వుందట. జార్ఖండ్‌లోని 14 స్థానాల్లో బీజేపీ 10, కాంగ్రెస్‌కి 4 సీట్లు దక్కనున్నాయి. బీహార్‌లోని 40 స్థానాల్లో బీజేపీ 21, ఆర్జేడీ 11, జేడీయూ 6 స్థానాల్లో గెలిచే అవకాశం వుంది. మహారాష్ట్రలోని 48 స్థానాలో బీజేపీ 36, కాంగ్రెస్ 10, ఎంఎన్ఎన్ 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో గెలుస్తారట. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో బీజేపీ 4, ఆమ్ ఆద్మీ పార్టీ 2, కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించే అవకాశం వుందని ఎన్డీటీవీ సర్వే తేల్చిచెప్పింది.  

తెరాసలో అసంతృప్తి జ్వాలలు!

      తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ 69 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితా చూసి ఇతర పార్టీలు ఆనందంతో పండగ చేసుకుంటున్నాయి. ఈ లిస్టులో గెలిచేవారు చాలా తక్కువగా వున్నారని అంటున్నాయి. ఉద్యమంలో పాల్గొన్నారనో, పాటలు పాడారనో, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ తాలూకనో, ఆర్థికంగా బలంగా వున్నారనో కొత్తవారికి టిక్కెట్లు ఇవ్వడం వల్ల అది విజయావకాశాలపై దెబ్బతీసే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ స్థానాలలో ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల కంటే బలమైన అభ్యర్థులను ప్రకటించడానికి మిగతా పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇదిలా వుంటే, తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ సేవలో ఎప్పటి నుంచో తరిస్తున్న వారిని కాదని నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికి, రాజకీయ అనుభవం లేనివారికి టిక్కెట్లు ఇచ్చారన్న విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. పార్టీకి సేవ చేసిన అనేకమంది ఈ లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇలా అసంతృప్తితో వున్న బలమైన అభ్యర్థులకు గాలం వేసే ప్రయత్నాలు మిగతా పార్టీలు ఇప్పటికే ప్రారంభించాయి.