chandrababu

తెలంగాణా కోసం చంద్రబాబు సరికొత్త వ్యూహం

  రాష్ట్ర విభజన దెబ్బకి తెలంగాణాలో డీలాపడిపోయిన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రయోగించిన బీసీ మంత్రంతో మళ్ళీ బలం పుంజుకొంది. ఇటీవల ఆయన వేసిన రెండు తెలంగాణా కమిటీలలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించడమే కాకుండా బీసీ వ్యక్తినే తెలంగాణా మొదటి ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన హామీతో ప్రధాన ప్రత్యర్దులయిన కాంగ్రెస్, తెరాసలు రెండూ చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు మరో సరికొత్త వ్యూహంతో పార్టీని మరింత బలోపేతం చేసి, అధికారం కైవసం చేసుకొనేందుకు సిద్దమవుతున్నారు.   తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణా పోరాటంలో తనకు అండగా నిలబడి పోరాడిన ఉద్యమకారులకు టికెట్స్ నిరాకరించడంతో వారు ఆయనపై ఆగ్రహంగా ఉన్న సంగతిని గమనించిన చంద్రబాబు, వారిలో యువకులు, ఉన్నత విద్యావంతులు, తెలంగాణా పునర్నిర్మాణం పట్ల నిబద్దత కలవారు ముఖ్యంగా బీసీ వ్యక్తులను గుర్తించి పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.   ఈ మధ్యనే హన్మకొండకు చెందిన తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) వర్కింగ్ కమిటీ చైర్మన్ చిల్లా రమేష్‌తో పాటు మరికొంత మంది చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉన్నత విద్యావంతుడు, ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న యువకుడు అయిన రమేష్ ముదిరాజ్ కులానికి చెందినవారు. ఆయనను బీసీలు అధికంగా ఉన్న వరంగల్ జిల్లా తూర్పు అసెంబ్లీ స్థానం నుండి పోటీలో నిలిపేందుకు చంద్రబాబు సంసిద్దంగా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా తెలంగాణా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న బీసీ కులాలకు చెందిన మరికొందరు యువకులతో చంద్రబాబు తన అనుచరుల ద్వారా సంప్రదిస్తున్నట్లు తాజా సమాచారం.   తెలంగాణా ప్రజలకు సుపరిచితులయిన ఉద్యమకారులనే పార్టీ టికెట్స్ కేటాయించి ఎన్నికల బరిలో దింపినట్లయితే, కాంగ్రెస్, తెరాసలకు చెక్ పెట్టడమే కాకుండా, ప్రజలకు తెదేపా పట్ల నమ్మకం కలిగించవచ్చును. చంద్రబాబు ప్రయత్నాలు ఫలించినట్లయితే, ఇంతవరకు తెలంగాణాలో తమకు తిరుగేలేదని భావిస్తున్న తెరాస, కాంగ్రెస్ పార్టీలు తెదేపా అభ్యర్ధులను ఓడించేందుకు చెమటోడ్చవలసి రావచ్చును. నిన్న మొన్న వరకు తమతో కలిసి పనిచేసిన తెలంగాణా ఉద్యమకారులకు వ్యతిరేఖంగా ఆ రెండు పార్టీలు మాట్లాడటం కూడా కష్టమే అవుతుంది. కానీ తప్పనిసరి పరిస్థితిలో వారిపై విమర్శలు గుప్పిస్తే అవి ప్రజలలో ఆ రెండు పార్టీల పట్ల వ్యతిరేఖతను పెంచే ప్రమాదం ఉంది. అందువల్ల చంద్రబాబు ప్రయోగిస్తున్న ఈ రెండో బ్రహ్మాస్త్రం మొదటి దానికంటే చాలా ప్రమాదకరమయినదని ఒప్పుకోక తప్పదు.

congress

టీఆర్ఎస్ తో పొత్తుకే కాంగ్రెస్ యోచన

  ‘జుట్టు పట్టుకుని బయటకీడ్చినా చూరు పట్టుకుని వేలాడి’ అన్నట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. పొత్తూలేదు గిత్తూ లేదని కుండ బద్దలుకొట్టిన కేసీఆర్ ను మళ్లీ దేహీ అనేలా కనిపిస్తోంది. అవసరమైతే నేరుగా సోనియా గాంధీయే కేసీఆర్ తో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పూర్తిగా దిగజారిపోయింది. దీంతో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణలో గరిష్టస్థాయిలో ప్రయోజనం పొందాలని ఆ పార్టీ ఆశిస్తోంది. ఇక్కడ పార్టీ పూర్తిగా ప్రయోజనం పొందాలంటే టీఆర్‌ఎస్ తో పొత్తు పెట్టుకోవడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనివల్ల ఓట్లలో చీలిక రాదని, పార్టీకి ఎదురే ఉండదని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో టీఆర్‌ఎస్ పొత్తుకోసం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   టీఆర్‌ఎస్ పొత్తుకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న సంకేతాలపై ఇరు పార్టీల్లోనూ మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పొత్తులో భాగంగా సీట్లు ద క్కించుకుంటామనే నమ్మకం ఉన్న నాయకులంతా తమ విజయానికి ఇక తిరుగుండదనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పొత్తు కారణంగా అవకాశాలు కోల్పోతామని భావిస్తున్న నాయకులు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని తాజా మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌తో పొత్తు ఖాయమైతే అధిష్టానం తమ నెత్తిన పాలుపోసినట్లే అవుతుందని సంతోషపడుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభావం అంతగా లేని దక్షిణ తెలంగాణలో మాత్రం పొత్తు వల్ల ఆ పార్టీకి సీట్లు కేటాయించక తప్పదని, ఇది తమకు తీవ్ర నష్టమని ఆందోళన చెందుతున్నారు.

trs survey reports

టీఆర్ఎస్ సర్వేల కామెడీ!

  టీఆర్ఎస్ చేస్తుస్తున్న సర్వేల వ్యవహారం సినిమా హీరోయిన్ల వయసు మాదిరిగా తయారైంది. హీరోయిన్లు అసలు వయసు ఎప్పుడూ బయటపెట్టరు. పదేళ్ళ ముందట ఎంత వయసు చెప్పారో పదేళ్ళ తర్వాత కూడా మాట తప్పకుండా అదే వయసు చెబుతారు. అదే విధంగా మాట తప్పడం అంటే ఏమిటో ఎంతమాత్రం తెలియని కేసీఆర్ కూడా ఇదే రూట్లో ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన తన వయసు చెప్పే విషయంలో ఎలాంటి కామెడీ చేయడం లేదుగానీ, టీఆర్ఎస్ పార్టీకే ఈ ఎన్నికలలో రాబోయే సీట్ల విషయంలో మాత్రం బోలెడంత కామెడీ క్రియేట్ చేస్తున్నాడు. హీరోయిన్ల మాదిరిగా ఎప్పుడు అడిగినా ఒకే అంకె చెబుతున్నారు. టీఆర్ఎస్‌కి ఈ ఎన్నికలలో 70 అసెంబ్లీ సీట్లు తప్పకుండా వస్తాయని కేసీఆర్ బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు. తమ పార్టీ చేసిన సర్వేల సర్వేల ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నానని ఆయన అంటున్నాడు. ఇది ఇప్పుడు కాదు. తెలంగాణ రాకముందు నుంచీ ఇదేమాట చెబుతున్నాడు. సార్ ఎప్పుడు సర్వే చేయించినా 70 సీట్లు వస్తాయని రిజల్టు వస్తోందంటే ఈ సర్వే రిపోర్టుని అనుమానించాల్సిందే. ఆ సర్వే చేసే సంస్థకి దండేసి దణ్ణం పెట్టాల్సిందే.   నిజానికి కేసీఆర్ సర్వేలు చేయించి 70 అంకె చెబుతున్నట్టుగా లేదని, నోటికొచ్చినట్టుగా ఎప్పటినుంచో ఒకే అంకెని పట్టుకుని వేలాడుతున్నట్టుగా వుందని రాజకీయ పరిశీకులు అనుమానంగా చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం ప్రజలు టీఆర్ఎస్‌ని లైట్‌గా తీసుకుంటున్నారని, ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ 35 నుంచి 40 సీట్లు మాత్రమే సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంకా మాట్లాడితే ఈ మాత్రం సీట్లు కూడా వస్తాయో లేదోనన్న సందేహాలు కూడా వున్నాయని చెబుతున్నారు. ఈ వాస్తవం తెలుసుకున్న కేసీఆర్ తనకు తాను ఉత్సాహాన్ని ఇవ్వడానికో, పార్టీ నాయకులు నిరాశలో కూరుకుపోకుండా వుండటానికో తాను చేయించానని చెప్పుకునే సర్వే గురించి, 70 అంకె గురించి గుర్తు చేస్తూ వుంటాడని అంటున్నారు.  

chiranjeevi

కర్ణుడి చావుకి వెయ్యి శాపాలు.. చిరంజీవి ప్రచారానికి..

    గత వారం రోజులుగా చిరంజీవి & ట్రూప్ వారు ప్రదర్శిస్తున్న మెగా కాంగ్రెస్ షో ప్రేక్షకులు లేక ఘోరంగా ఫ్లాప్ అయి అర్ధాంతరంగా ముగుస్తుండటంతో ఆయన్నే నమ్ముకొని గోదారి దాటేద్దామని ఆశపడిన కాంగ్రెస్ అధిష్టానం ఏమి చేయాలో తెలియక తలపట్టుకోంది. కాంగ్రెస్ పట్ల ప్రజలలో నెలకొన్న తీవ్ర వ్యతిరేఖతకి తోడు రాష్ట్ర విభజన వ్యవహారంలో, ఆయన మూటగట్టుకొన్నఅపఖ్యాతి కూడా ఆయన ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చును. అందుకే ఆయన ప్రచారానికి జనాలు మొహాలు చాటేశారు.అయినా రాష్ట్ర విభజనతోనే కాంగ్రెస్ పార్టీకి సీమాంద్రాలో ప్రజలు అకౌంటు క్లోజ్ చేసేసారని తెలిసినప్పటికీ అదేమీ తెలియనట్లు నటిస్తూ వారు వచ్చినంత మాత్రాన్న ప్రజలు తమ అభిప్రాయాలు మార్చేసుకొంటారని చిరంజీవి & ట్రూప్ అనేసుకోవడం అత్యాసే.   ఇక చిరంజీవి తన ప్రచారంలో చేస్తున్న అర్ధం లేని అసందర్భ ప్రసంగాలతో ఉన్న జనాలు కూడా పారిపోతున్నారు. ఇక కాంగ్రెస్ నేతలందరూ కట్టకట్టుకొని ఏసీ బస్సు వీసుకొని ప్రచారానికి బయలుదేరినా వారిలో ఒక్కరికీ కూడా ప్రజలలో మంచి పేరు కానీ, గుర్తింపు గానీ లేకపోవడం, గుర్తింపు ఉన్న చిరంజీవికి నోటి శుద్ధి లేకపోవడంతో జనాలు కరువయ్యారు.  ఒకప్పుడు లక్షలాది ప్రజలు రోడ్ల మీదకు రెండున్నర నెలల పాటు ఉద్యామాలు చేసినప్పుడు వారి అభిప్రాయాలకు పూచికపుల్లెత్తు విలువీయని కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు ప్రజలు బాజాభజంత్రీలతో ఘన స్వాగతం చెపుతారని అనుకోవడం కూడా అత్యాసే కదా! అయినా ప్రజలు ఇప్పటికీ తెదేపా, వైకాపా, కొత్తగా రంగంలోకి దిగుతున్న జనసేన పార్టీల మధ్యన ఎప్పుడో చీలిపోయారు. అందువలన ఇప్పుడు ఏ జీవి వచ్చినా కాంగ్రెస్ పార్టీని కాపాడటం అసాధ్యం అని అధిష్టానం గ్రహించగలిగితే, వేరే కొత్త ఆలోచన ఏదయినా చేసుకొనే వీలుతుంది.

pwan kalyan

పవన్ తెదేపా ఏజెంటా?

  పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తెలంగాణాలో కూడా పోటీ చేస్తుందనే సంకేతాలు ఈయకపోయి ఉంటే, బహుశః తెరాస నేతలు అసలు ఉపన్యాసం గురించి పట్టించుకొనేవారే కాదేమో. కానీ, ఆయన ఆంధ్ర తెలంగాణా రెండు ప్రాంతాలలో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు, తమ రాజకీయ ప్రత్యర్దులయిన తెదేపా, బీజేపీలతో పొత్తులు పెట్టుకొనే ఉద్దేశ్యం ఉన్నట్లు చూచాయగా చెప్పడంతో, తెరాస తప్పనిసరిగా స్పందించవలసి వచ్చింది. తాము భూస్థాపితం చేసేశామనుకొన్న తెలుగుదేశం పార్టీ ఇటీవల మెహబూబ్ నగర్ లో నిర్వహించిన ప్రజాగర్జన సభ విజయవంతం కావడం, దానికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చేందుకు సిద్దపడటం చూసిన తెరాస అప్రమత్తమయి వారిరువురినీ లక్ష్యంగా చేసుకొని ఎదురుదాడి ఆరంబించింది.   తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన తరువాత, తెరాస నేత హరీష్ రావు తెదేపా, జనసేనలపై తన అస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మేకప్ & ప్యాకప్ పార్టీ అని కవిత విమర్శిస్తే, హరీష్ రావు మాత్రం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఏజెంటుగా రాజకీయ రంగ ప్రవేశం చేసారని విమర్శిస్తూ, ఆ రెండు పార్టీలను ఒకే గాట కట్టి, ఆంద్ర పార్తీలనే ముద్ర వేసేందుకు ప్రయత్నించారు.   అయితే కేసీఆర్ తో సహా తెరాస నేతలందరూ కూడా తమ పార్టీకి ఎన్నికలలో ఎదురే ఉండదని, తమ పార్టీయే తెలంగాణాలో మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నపటికీ, కవిత, హరీష్ రావు తెదేపా, జనసేనలను ఇంత బలంగా ఎదుర్కోవడం చూస్తే, తెరాస తన ప్రత్యర్ధులను చూసి భయపడుతోందని అర్ధమవుతోంది.   అందుకు ప్రధాన కారణం నేటికీ తెరాసకు తెలంగాణాలో పది జిల్లాలపై పూర్తిపట్టు లేకపోవడం, నేటికీ పార్టీ గ్రామస్థాయి వరకు పార్టీ నిర్మాణం జరగక పోవడమే. నేటికీ తెరాస తెలంగాణా సెంటిమెంటు మీదే ప్రధానంగా ఆధారపడి ఎన్నికలకి వెళుతోంది తప్ప, పార్టీ క్యాడర్ మరియు తన నేతల బలం చూసుకొని మాత్రం కాదని నిర్ద్వందంగా చెప్పవచ్చును. అందుకే తన ప్రత్యర్ధులు ఏమాత్రం బలపడినట్లు కనబడినా వెంటనే వారిపై తెరాస నేతలు అందరూ కట్టకట్టుకొని విరుచుకు పడుతుంటారు. ఇప్పుడూ వారు అదే చేస్తున్నారు.

congress

వలసలతో పార్టీలు సలసల

  సాధారణ ఎన్నికలకు ముందొచ్చిన వలసలు పాలమూరులో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అధికారికంగా అభ్యర్థిత్వాలు ఖరారయ్యే వరకు ఈ కలకలం తప్పదని నేతలు ఆవేదన చెందుతున్నారు. పలు నియోజకవర్గాల్లోని కేడర్‌లో కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. వలసల కారణంగా కాంగ్రెస్ పార్టీలో మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఇబ్బందులు ఎదురవుతుండగా....తెలంగాణ రాష్ట్ర సమితికి నాలుగు స్థానాల్లో తల నొప్పులు తప్పని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీలోకి అలంపూర్ మాజీ ఎమ్మేల్యే చల్లా వెంకట్రాంరెడ్డి చేరటంతోనే కొల్లాపూర్, అలంపూర్ నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు తీవ్ర రూపం దాల్చాయి. ఏకంగా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం కాంగ్రెస్‌ను వదిలి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి ప్రధాన కారణం చల్లా సూచించిన వ్యక్తికే అలంపూర్ టికేట్ ఇస్తారని ప్రచారం కావటమేనని తెలుస్తుంది. మరో పక్క చల్లా వెంకట్రాం రెడ్డి కొల్లాపూర్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తుండటంతో...ఇక్కడి నుంచి బరిలో నిలవాలని ప్రయత్నిస్తున్న విష్ణువర్థన్‌రెడ్డి, మరికొందరు తీవ్ర అసంతృప్తితో తాడోపేడో తేల్చుకోడానికి సిద్దపడుతున్నారట.   మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డికి ఖరారు అవుతోందని ప్రచారం జరుగుతుండటంతో ఈ స్థానంపై కన్నేసిన మాజీ ఎంపి, కాంగ్రెస్ నేత విఠల్‌రావు కొడంగల్ అసెంబ్లీ సీటు కావాలంటున్నారు. దీంతో ఇక్కడినుంచి టికెట్‌ను ఆశిస్తున్న పలువురు నేతలు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అటో ఇటో అంటున్నారని సమాచారం. టీఆర్‌ఎస్ లో లొల్లి మరోలా ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు వై. ఎల్లారెడ్డి (నారాయణపేట), జైపాల్‌ యాదవ్ (కల్వకుర్తి) టీఆర్‌ఎస్‌ లో చేరగా, గద్వాలలో మాజీ మంత్రి అరుణ బంధువు కృష్ణమోహన్‌రెడ్డి కూడా కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.   టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ లో చేరారు. వీరందరికీ టికెట్లు ఇస్తామన్న కేసీఆర్, నియోజకవర్గాలు కూడా కేటాయించారు.ఎల్లారెడ్డికి మక్తల్, జైపాల్‌యాదవ్‌కు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కల్వకుర్తి, శ్రీనివాస్‌గౌడ్‌కు మహబూబ్‌నగర్, కృష్టమోహన్‌రెడ్డికి గద్వాల అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. దీంతో ఆ నాలుగు నియోజకవర్గాల్లో అసమ్మతి రాజుకుంది. పాలమూరు పార్టీ ఇన్‌చార్జి ఇబ్రహీం ఇక్కడ నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించటంతోపాటు ఇతరులతో టచ్‌లో ఉంటున్నట్టు ప్రచారం సాగుతోంది. అవకాశాన్ని బట్టి కాంగ్రెస్ లేదా ఎంఐఎం లో ఇబ్రహీం చేరవచ్చునన్న ప్రచారం జరుగుతోంది.   కల్వకుర్తిలో పార్టీ ఇన్‌చార్జి బాలాజీసింగ్, మక్తల్‌ లో ఆ పార్టీ నాయకుడు దేవర మల్లప్ప,గద్వాలలో పార్టీ ఇన్‌చార్జి గట్టు భీముడు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. కల్వకుర్తిలోబాలాజీసింగ్ అనుచరులు ఒకడగు ముందుకేసి అందోళనకు దిగారు. ఇలా రెండు పార్టీల్లోనూ వలసల సెగలు భగభగమంటూనే ఉన్నాయి.

tdp

కమలం - సైకిల్ పొత్తు పొడిచేనా?

  తెలుగుదేశం పార్టీ, బీజేపీల పొత్తు పరిస్థితి అయోమయంలో పడింది. సాక్షాత్తు బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ దూతగా వచ్చిన ప్రకాష్ జవదేకర్ కూడా ఇక్కడి పొత్తుల విషయాన్ని ఏమీ తేల్చలేక చేతులెత్తేసి హస్తిన వెళ్లిపోయారు. జైట్లీయే స్వయంగా రంగప్రవేశం చేస్తారని ప్రచారం జరిగినా ఆయన కూడా ఇంతవరకు రాలేదు. ‘చంద్రబాబు వల్లే అధికారం కోల్పోయాం. పొత్తు వ్యవహారం కుదరకపోతే అన్ని స్థానాలకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పొత్తుల కోసం మేమెవ్వరినీ బతిమాలడం లేదు’ అని బీజేపీ తెలంగాణా శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం చూస్తే, ఇక పొత్తు పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. రెండు ప్రాంతాల్లో కలిపి ఎనిమిది వరకూ ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ సరేనంటోంది. ఇందులో తెలంగాణాలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్‌ నగర్, మెదక్, సీమాంధ్రలో నరసాపురం, తిరుపతి ఉన్నట్లు సమాచారం. దీనిపై కమలనాథులు మండిపడుతున్నారు.   హైదరాబాద్ స్థానం మజ్లిస్ కంచుకోట. అలాగే మెదక్ నుంచి ఈసారి కేసీఆర్ పోటీ చేయచ్చు. ఇలా, కచ్చితంగా ఓడిపోతారనుకునే స్థానాలను తమకిచ్చి ‘గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం’ అన్నట్లుగా వ్యవహరిస్తే పొత్తులపై ముందుకు ఎలా వెళ్తామని అంటున్నారు. కానీ.. తాము తమ సీట్ల జాబితాను ఊరికే ఆషామాషీగా ఇవ్వలేదని, ఏ సీటును బీజేపీ తీసుకుంటే లాభం ఎలా ఉంటుంది? అక్కడ రాజకీయ సమీకరణాలు, స్థానిక బలాబలాలు వివరిస్తూ శాస్త్రీయంగా ఇచ్చామని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారట.   ఇదంతా చూసి.. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందన్న అంచనాతో బీజేపీలో చేరిన సీమాంధ్ర నేతల గుండెల్లో ఇప్పుడు రైళ్ళు పరిగెడుతున్నాయి. సీమాంధ్రలో బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. అక్కడ టీడీపీతో పొత్తు ఉంటేనే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే పరిస్థితి ఉంది. టీడీపీలో పోటీ అధికంగా ఉండటం వల్లో లేదా మరే ఇతర కారణాలతోనో వారు బీజేపీని ఎంచుకొన్నారు. ఆ పార్టీ కోటాలో సీటు సాధించగలిగితే ఖాయంగా గెలవవచ్చన్నది వారి అంచనా. కానీ పొత్తుల చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటం వారిలో ఆందోళన పెంచుతోంది.   ఇందులో వైసీపీని వదులుకొని వచ్చినవారు, కాంగ్రెస్‌లో పెద్ద స్థాయిలో ఉండి వచ్చినవారు, రిటైర్డ్ అధికారులు వంటి వారు ఉన్నారు. "సీమాంధ్రలో కేవలం బీజేపీ పేరుతో గెలిచే పరిస్థితి లేదు. అది అందరికీ తెలుసు. టీడీపీతో పొత్తు ఉంటుందనే మేం రంగంలోకి దిగాం. ఇప్పటికే కొంత ఖర్చు కూడా పెట్టాం. ఇప్పుడు తేడా వస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు'' అని వారు వాపోతున్నారు.

chandrababu

టీఆర్ఎస్ హార్ట్ లో స్టోన్!

  టీఆర్ఎస్ హార్ట్ లో స్టోన్ పడింది. ఆ స్టోన్ కూడా అంతా ఇంతా స్టోన్ కాదు.. చాలా భారీ స్టోన్. ఆ స్టోన్ పేరు ‘తెలుగుదేశం’. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ వుంటుందని భ్రమపడిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తమ భ్రమలు తొలగించుకుని వాస్తవాన్ని దర్శిస్తున్నారు. అటు సీమాంధ్రతోపాటు ఇటు తెలంగాణలో కూడా తెలుగుదేశం చాలా స్ట్రాంగ్‌గా వుందన్న సత్యాన్ని తెలుసుకుంటున్నారు.   రాష్ట్ర విభజన జరిగిపోయింది కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం ప్రభావం వుండదని టీఆర్ఎస్ నాయకులు శక్తివంచన లేకుండా ప్రచారం చేశారు. తెలంగాణలో బలంగా వున్న తెలుగుదేశం నాయకులందరికీ టీఆర్ఎస్‌లో చేరాలని ఆహ్వానాలు పంపారు. అయితే ఏదో కొద్దిమంది నాయకులు తప్ప ఎవరూ టీఆర్ఎస్ వైపు వెళ్ళలేదు. టీడీపీకి వున్న కార్యకర్తల కోటలో ఒక్క ఇటుకని కూడా టీఆర్ఎస్ కదల్చలేకపోయింది. దీనితోపాటు తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రిని చేస్తానని, తెలంగాణ బీసీలకు తెలుగుదేశం పార్టీని కానుకగా ఇస్తున్నానని చంద్రబాబు ప్రకటించడం, బీసీలను గౌరవించే విధంగా కార్యవర్గాన్ని ప్రకటించడం తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మీద వున్న గౌరవం పెరిగేలాచేసింది.   తెలంగాణ రాకముందు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడని ప్రకటించి, తీరా తెలంగాణ వచ్చాక దళితుల నెత్తిన చెయ్యి పెట్టిన కేసీఆర్ కంటే చంద్రబాబు నాయుడు ఎంతో ఉన్నతుడన్న అభిప్రాయం తెలంగాణ ప్రాంతంలో వ్యక్తమవుతోంది. మంగళవారం నాడు మహబూబ్‌నగర్‌లో చంద్రబాబు నిర్వహించిన పాలమూరు ప్రజా గర్జన కార్యక్రమాన్ని చూసి అటు టీఆర్ఎస్‌తోపాటు కాంగ్రెస్ నాయకుల గుండెల్లోకూడా రాళ్ళు పడ్డాయి.   చంద్రబాబు సభకు భారీ స్థాయిలో ప్రజలు హాజరు కావడం, చంద్రబాబు ప్రసంగానికి విశేష స్పందన లభించడం రెండు పార్టీల నాయకులకు కంటి నిండా నిద్ర లేకుండా చేశాయి. ప్రస్తుత ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు తెలుగుదేశం పార్టీలో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

telangana

టీ-ఉద్యోగుల గడుసుతనం

  తెలంగాణ ఉద్యోగులు మరీ గడుసుతనం ప్రదర్శిస్తున్నారు. అవ్వా కావాలి బువ్వా కావాలి అంటూ ప్రస్తుతం రాష్ట్రాన్ని చుట్టుముట్టిన విభజన సమస్యను మరింత జటిలం చేసి సమస్యను తెగేదాకా లాగాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి ఎలా వుందంటే, కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఆమోదించిన రాష్ట్ర విభజన బిల్లులో తమకు అనుకూలంగా వున్న విషయాలను మాత్రం సూపర్ అంటున్నారు. తమకు వ్యతిరేకంగా వున్న విషయాలను మాత్రం ఒప్పుకోమని అంటున్నారు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వ ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు ఎలా పంచాలన్న విషయం మీద బిల్లులో కొన్ని మార్గదర్శకాలను చేర్చారు.   కమలనాథన్ అధ్యక్షతన ఏర్పడిన విభజన కమిటీ బిల్లులో సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ఉద్యోగుల విభజన కార్యక్రమంలో ముమ్మరంగా పనిచేస్తోంది. అయితే ఇప్పుడు కొత్తగా టీ ఉద్యోగులు కొత్త రాగం ఆలపించడం ప్రారంభించారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వడానికి వీల్లేదని, దీనికి తాము ఎంతమాత్రం ఒప్పుకోమని గొంతు చించుకుని అరుస్తున్నారు. కేసీఆర్ ఏ మాట అంటే ఆ మాటను పట్టుకుని వేలాడుతూ తమకంటూ ప్రత్యేక వ్యక్తిత్వం లేనివాళ్ళుగా తెలంగాణ ఉద్యోగులు కనిపిస్తున్నారని సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. టీ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ ఉద్యమ నాయకుల దగ్గర శక్తి లేదు కాబట్టి ఊరుకున్నారుగానీ, వాళ్ళకే శక్తి వుంటే సీమాంధ్ర ఉద్యోగులు అందర్నీ తెలంగాణ ప్రాంతం నుంచి సీమాంధ్రకు తరిమేసేవారని వారు అంటున్నారు. అయితే తెలంగాణ ఉద్యోగులు, కరడుగట్టిన విభజనవాదులు చేస్తున్న కుట్రలు భగ్నం చేయడానికి తాము సిద్ధంగా వున్నామని చెబుతున్నారు.

kiran

కిరణ్ మార్కు కంగాళీ!

  రాష్ట్ర విభజన విషయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సృష్టించిన కంగాళీ సీమాంధ్రుల కొంప ముంచింది. ముఖ్యమంత్రి సీట్లో కూర్చని ‘రాష్ట్ర విభజన జరగదు.. జరగదు..జరగదు’ అంటూ జనాన్ని, తన స్వంత పార్టీ నేతలనీ కూడా హిప్నటైజ్ చేసేసి ఎలాగో రోజులు దొర్లించేసారు. పాపం.. సీమాంధ్రులు కూడా ముఖ్యమంత్రి చెబుతున్నాడు కదా అని నమ్మేశారు. ఫలితం.. పిడుగులాంటి రాష్ట్ర విభజనను భరించాల్సి వస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి అండ్ బ్యాచ్ తియ్యటి మాటలతో సీమాంధ్రులను మభ్యపెట్టి రాష్ట్ర విభజన సులువుగా జరిగిపోవడానికి సహకరించారన్న అభిప్రాయం సీమాంధ్రులలో బలంగా ఉంది. అయితే రాష్ట్ర విభజన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయించిన కిరణ్ బృందం ఇప్పటికీ రాష్ట్రం విడిపోదు అంటూ సీమాంధ్రులని మరింత అమాయకుల్ని చేసే ప్రయత్నం చేస్తోంది.   కానీ, ఇప్పుడు సీమాంధ్రుల ఉన్న పరిస్థితుల్లో సీమాంధ్రుల గొంతును ఢిల్లీలో వినిపించే సమర్థ నాయకత్వం కావాలి. కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కొనే నాయకత్వం కావాలి. అలాంటి నాయకత్వాన్ని సీమాంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీలో, చంద్రబాబు నాయుడిలో చూస్తున్నారు. ఒకపక్క తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే, మరోపక్క కిరణ్ కుమార్ రాష్ట్ర విభజన ఆగిపోయే అవకాశం వుందని సీమాంధ్రులను కన్ఫ్యూజ్ చేస్తూ, అంతా కంగాళీ చేస్తున్నారన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.   కిరణ్ కుమార్ సీమాంధ్ర ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కనడం మానుకుంటే మంచిదని అనుకుంటున్నారు. కిరణ్ కుమార్ అండ్ బృందానికి సీమాంధ్రుల మీద నిజంగా అభిమానం వుంటే, జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఎన్నికల్లోకి వెళ్ళి ఓట్లు చీల్చి లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం కంటే తమ పార్టీ ఎన్నికలలో గెలిస్తే రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తుందో చెప్పుకొంటే మేలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

Azharuddin faces opposition from Congress workers

అజ్జూభాయ్ తిక్క కుదిరింది!

      క్రికెటర్‌గా గ్రౌండ్‌లో సిక్సర్స్ కొట్టి, గ్రౌండ్ బయట మ్యాచ్ ఫిక్సర్‌గా నిలిచిన మహ్మద్ అజారుద్దీన్ ఆ తర్వాత రాజకీయ రంగానికి షిఫ్టయ్యాడు. కళంకితులకు సీట్లు ఇవ్వడంలో ముందుండే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్‌ని సాదరంగా ఆహ్వానించి యు.పి.లోని మురాదాబాద్ ఎంపీ సీటు ఇచ్చింది. టైం బాగుండి అజార్ అక్కడ గెలిచాడు.   ఎంపీగా అజారుద్దీన్ మురాదాబాద్ నియోజకవర్గాన్ని ఉద్ధరించిందేమీ లేదు. అజారుద్దీన్ పేరు చెబితేనే మురాదాబాద్ జనం ముఖాలు తిప్పుకుంటున్నారు. తన నియోజకవర్గానికి అజార్ చేసిన సేవ ఏమీ లేకపోయినా, సోనియమ్మ సేవలో మాత్రం తరించిపోయాడు. సోనియాగాంధీ ఆదేశాల మేరకు మొన్నామధ్య పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీలను చితకబాదే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశాడు. సొంత రాష్ట్రం ఎంపీలని కూడా చూడకుండా రౌడీయిజం ప్రదర్శించిన అజారుద్దీన్‌కి ఇప్పుడు తగిన శాస్తి జరిగింది. ఈసారి ఎన్నికలలో అజార్‌కి కాంగ్రెస్ అధిష్ఠానం టిక్కెట్ ఇవ్వకుండా మొండిచెయ్యి చూపడంతో బాగా ముదిరిపోయిన ఆయన తిక్క కుదిరింది. పార్టీ కోసం పార్లమెంట్‌లో రౌడీయిజం చేశాడన్న అభిమానం కూడా లేకుండా అజార్‌కి టిక్కెట్ ఇవ్వనంది. మురాదాబాద్ టిక్కెట్‌ని నూర్‌భాన్ అనే ముస్లిం మహిళకు కేటాయించింది. దాంతో లబోదిబోమన్న అజారుద్దీన్ కాంగ్రెస్ అధిష్ఠానం కాళ్ళావేళ్ళా పడ్డా ఉపయోగం లేకుండా పోయింది. భవిష్యత్తులో మరో నియోజకవర్గం నుంచి అయినా టిక్కెట్ ఇస్తారో లేదో అన్న గ్యారంటీ లేక అజారుద్దీన్ అయోమయ పరిస్థితిలో వున్నాడు. అజారుద్దీన్‌కి సీమాంధ్రుల శాపనార్థాలే తగిలి వుంటాయి.

mp vinod

కారు ప్రయాణం పడలేదా!!

  జి.వెంకటస్వామి తనయులుగా రాజకీయాల్లోకి ప్రవేశించి, సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న వి-బ్రదర్స్ వినోద్, వివేక్ మళ్లీ కారు దిగి, కాంగ్రెస్ గూటికి చేరాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తోందంటూ టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈ బ్రదర్స్.. ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. వాస్తవానికి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ పట్ల పెద్దగా వ్యతిరేకత లేకపోయినా, కిరణ్ కుమార్ రెడ్డితో పడకపోవడం వల్లే దూరమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజా పరిస్థితుల్లో టీఆర్ఎస్ అధినాయకత్వం ఎంపీ వివేక్‌కు సిటింగ్ స్థానమైన పెద్దపల్లిని కేటాయించటానికి సిద్ధమైంది. వినోద్‌కు ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి అసెంబ్లీ సీటు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. అయితే బెల్లంపల్లి సీటును కాకుండా, అదే జిల్లా చెన్నూరు అసెంబ్లీ సీటును వినోద్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అక్కడ టీఆర్ఎస్ నుంచి నల్లాల ఓదెలు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను కాదని చెన్నూరులో వినోద్‌కు టికెట్ ఇవ్వటం గులాబీ దళపతికి ఇష్టం లేనట్లు తెలుస్తోంది. బెల్లంపల్లిలో పోటీకి వినోద్ విముఖత చూపటానికి కారణం.. అక్కడ సీపీఐ సిటింగ్ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ తిరిగి పోటీ చేస్తుండటమేనని అంటున్నారు.   కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ పొత్తు ముగిసిన అధ్యాయమని కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతోపాటు కాంగ్రెస్, సీపీఐ జట్టు కట్టే సూచనలు కూడా బెల్లంపల్లి సీటును వినోద్ వద్దటానికి మరో కారణమని చెబుతున్నారు. బెల్లంపల్లి కాకపోతే కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ సీటును వినోద్‌కు కేటాయించటానికి టీఆర్ఎస్ నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా ఆయన చెన్నూరు కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇక, వివేక్ కూడా పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో తాను టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగితే.. మరో బలమైన అభ్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటే ఎలా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఆయన ఒక సర్వే చేయించుకోగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తే వచ్చే ఓట్ల కంటే, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎక్కువ ఓట్లు వస్తాయని తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌లో కొనసాగటంపై కాకా తనయులు పునరాలోచనలో పడ్డారు.

kiran kumar

కిరణ్ కు చివరకు మిగిలేది గోడ ముక్కేనా

  నల్లారి వారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతోంది. రాష్ట్ర విభజన ప్రక్రియ మొత్తం ముగిసేవరకు స్పందించకుండా ఊరుకుని, ఇంకా చివరి బంతి పడలేదు, ఆట ముగిసిపోలేదు అంటూ వ్యాఖ్యానించిన కిరణ్ కుమార్ రెడ్డి.. పార్లమెంటు ఉభయ సభలలోను రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టారు. ఆ సమయంలో ఆయన వెంట పట్టుమని పదిమంది నాయకులు కూడా ఉన్న పాపాన కనిపించలేదు. మళ్లీ రెండు రాష్ట్రాలను విలీనం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధిస్తానంటూ గొంతుచించుకుని మైకు పట్టుకుని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డి.. చివరకు తాను స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో తానొక్కరే మిగిలేలా ఉన్నారు. ఆయనతో పాటు పలు సందర్భాల్లో ఆయన చూపిస్తున్న బెర్లిన్ గోడ ముక్క కూడా ఉండేలా ఉందని పరిశీలకులు అంటున్నారు.   కిరణ్ కుమార్ రెడ్డి అనుంగు అనుచరులుగా భావిస్తున్నవాళ్లంతా ఒక్కొక్కరుగా ఆయన పెట్టిన పార్టీకి దూరం అయిపోతున్నారు. ఇంకా ఎన్నికల ప్రచారం ఊపందుకోక ముందే జేఎస్పీకి నాయకులు దండం పెట్టేస్తున్నారు. మీకు మీ పార్టీకి ఓ నమస్కారం అంటూ పక్కచూపులు చూస్తున్నారు. అందరికంటే ముందుగా మేల్కొన్న వ్యక్తి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్. టీడీపీలో చేరేందుకు ఆయన సిద్ధమైపోయినట్లు సమాచారం.   మరో సీనియర్ నేత సాయిప్రతాప్ కూడా కిరణ్ పార్టీలో ఉంటే పరువు దక్కదని డిసైడైపోయారట. అందరికంటే ముందు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వెంట కుడిభుజంగా నిలిచిన పశ్చిమగోదావరి జిల్లా నేత పితాని సత్యనారాయణ కూడా.. ఇప్పుడు జేఎస్పీలో ఉంటే కష్టమని నిర్ణయించుకుని టాటా చెప్పేద్దామనుకుంటున్నట్లు వినికిడి. ఇదంతా చూస్తుంటే చివరాఖరుకు పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరు, ఆయనతో పాటు ఆయన వెంట ఉన్న బెర్లిన్ గోడముక్క మాత్రమే మిగిలినా ఆశ్యర్యపోనవసరం లేదని జేఎస్సీ వర్గాలే గుసగుస లాడుతున్నాయట.

congress leaders

ఆ అడుగులన్నీ టీడీపీ వైపే

  కాంగ్రెస్ నేతల అడుగులన్నీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంవైపే పడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సాయి ప్రతాప్ టీడీపీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలతో వీరు ఇప్పటికే సంప్రదింపుల్లో ఉన్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో వీరిద్దరూ చంద్రబాబును కలిసి మాట్లాడనున్నారని చెబుతున్నారు. వీరిలో ఒంగోలు సిటింగ్ ఎంపీ మాగుంట ఈసారి నెల్లూరు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. కానీ, అది ఇప్పటికే వేరొకరికి ఖాయం అయింది. ఆయన పేరును ఒంగోలుకు పరిశీలించడానికి టీడీపీ సుముఖంగా ఉంది. సాయిప్రతాప్ ఈసారి కూడా సుదీర్ఘకాలంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేట ఎంపీ సీటును కోరుకొంటున్నారు. అక్కడ ఆయనకు కొంత పోటీ ఉన్నా టీడీపీ నాయకత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకొంటున్నారు. పార్టీలో చేరడానికి తనకు ఆసక్తి ఉందన్న సంకేతాలను ఆయన పంపిస్తున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఆయన చంద్రబాబును కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.   అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే మధుసూధన్ గుప్తా, కృష్ణా జిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసి మాట్లాడినట్లు సమాచారం. గుప్తా ఇప్పుడు కూడా గుంతకల్లు సీటును ఆశిస్తుండగా పద్మజ్యోతి ఎక్కడైనా ఎంపీ సీటును కోరుకొంటున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్న మహారాజుల కుటుంబానికి చెందిన సోదరులు నరేశ్, దినేశ్ మంగళవారం చంద్రబాబును కలిశారు. వీరిలో నరేశ్ మాజీ మంత్రి మాణిక్‌రావు కుమారుడు. ఆయనకు ఈసారి తాండూరు టికెట్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది.   హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ స్వప్నారెడ్డి కూడా మంగళవారం చంద్రబాబును కలిశారు. దివంగత టీడీపీ నేత ఎలిమినేటి మాధవరెడ్డి సోదరుని కుటుంబానికి చెందిన స్వప్నారెడ్డి.. ఈసారి నల్లగొండ జిల్లా భువనగిరి లేదా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

botsa

బొత్స కూడా కాంగ్రెస్ నుండి జంపైపోతున్నారా?

  రాష్ట్ర విభజనకు ముందో తర్వాతో ముఖ్యమంత్రి అయిపోదామని కలలుగన్న బొత్స సత్యనారాయణకి ఉన్న పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఊడిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి తప్పుకోవడంతో రవాణా శాఖ మంత్రి పదవి కూడా ఊడిపోయింది. ఇక రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆయన మూటగట్టుకొన్న అపకీర్తి మరేనేతకి దక్కలేదు. దానితో అటు స్వంత నియోజక వర్గంలో ప్రజల ఆదరణకి నోచుకోక, ఇటు పార్టీ ఆదరణకి నోచుకోక బొత్ససత్యనారాయణ చాలా దుర్భరమయిన పరిస్థితిలో ఉన్నారు. ఇది సరిపోదన్నట్లు ఇంతకాలం పీసీసీ అధ్యక్షుడిగా ఒక వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు చిరంజీవి, రఘువీరా రెడ్డి, పనబాక లక్ష్మి వారి క్రింద పనిచేయవలసి రావడం మరింత దుర్బరం. వారు తమ బస్సు యాత్రలో భాగంగా ఇటీవల విజయనగరం వచ్చినప్పుడు, బొత్స కూడా వారితో కలిసినప్పటికీ, జనాలు మొహం చాటేయడం చూస్తే బొత్స పరపతి ఎంతగా దిగజారిపోయిందో స్పష్టమవుతుంది.   అందుకే ఆయన పీసీసీ అధ్యక్ష పదవి ఊడిపోయినప్పటి నుండి ఉంగరం పోగొట్టుకొన్న చోటునే వెతుకోవాలన్నట్లు మళ్ళీ తన జిల్లా, తన చీపురుపల్లి నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించేదుకు గట్టిగా కృషి చేస్తున్నారు. అయితే మాజీ పీసీసీ అధ్యక్షుడయిన ఆయన, సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు బయలుదేరిన చిరంజీవి తదితరులతో కలవకుండా, తన నియోజక వర్గానికే పరిమితమవడం, పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో, ఆయన కూడా పార్టీ వీడేందుకు సిద్దం అవుతున్నారని ఒక ఆంగ్ల దిన పత్రికలో వార్త రావడంతో కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడ్డారు.   అందరి కంటే మొట్ట మొదటగా స్పందించిన శాసనమండలి సభ్యుడు రుద్రరాజు పద్మరాజు ఆ వార్తను ఖండిస్తూ బొత్స ఒక కరడు గట్టిన కాంగ్రెస్ వాది అని ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని వీడరని గట్టిగా సర్టిఫై చేసేసారు. అయితే, బొత్స కంటే కరడుగట్టిన కాంగ్రెస్ వాదులని పేరుబడ్డ లగడపాటి, ఉండవల్లి, కిరణ్ కుమార్ రెడ్డి, హర్ష కుమార్, రాయపాటి వంటివారు అనేకమంది పార్టీని వీడగా లేనిదీ బొత్స వీడితే ఆశ్చర్యం ఏముంటుంది? అని ఆలోచిస్తే అది సాధ్యమేనని అర్ధమవుతుంది.   ఆయన బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారనే వార్తలు వినవస్తున్నా, ఆయనను బీజేపీ అంగీకరించకపోవచ్చును. అందువలన ఆయన పార్టీని వీడాలంటే తనను భరించగలిగే పార్టీని కూడా చూసుకోవలసి ఉంటుంది. ఆయనకి తెదేపా, వైకాపాలలో వెళ్ళే అవకాశం లేదు కనుక ఇక మిగిలిన జై సమైక్యాంధ్ర పార్టీవైపే చూడక తప్పదు.   ఆయన ఆ జెండా పట్టుకొని బయలుదేరితే తీర్దానికి తీర్ధం ప్రసాదానికి ప్రసాదమన్నట్లు తనపై పడిన సమైక్యద్రోహి ముద్రను చేరిపేసుకోవచ్చును, మళ్ళీ దైర్యంగా ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడగవచ్చును. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అయితే స్థాపించారు గానీ బలమయిన నేతలు లేక ఉన్నవారిని నిలుపుకొనేందుకు చాలా ఆపసోపాలు పడుతున్నారు పాపం. అందువల్ల బొత్స వస్తానంటే నే వద్దంటానా...?అని ఆయనకు ఎర్ర తివాచీ పరిచి మరీ స్వాగతం పలుకవచ్చును. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎలాగు ఓడిపోయే అవకాశాలే ఎక్కువున్నాయి గనుక బొత్స కూడా దైర్యం చేసి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ కిరణ్ పార్టీలోకి లాంగ్ జంపైపోవడమే మేలేమో! ఆనక ఆ పార్టీ కూడా మళ్ళీ ఎలాగూ కాంగ్రెస్ పార్టీలోనే కలిసిపోతుంది గనుక పెద్దగా ఇబ్బందీ ఉండదు కూడా.   ఇక బొత్సకు పార్టీ మారే ఆలోచన కనుక లేకపోయినట్లయితే, ఆయన తనను పక్కనబెట్టిన కాంగ్రెస్ అధిష్టానానికి చిన్న జలక్ ఇచ్చేందుకే ఇటువంటి మీడియా లీక్ ఇచ్చేరేమోనని కూడా అనుమానించవలసి ఉంటుంది. ఈ వార్తపై బొత్స ఇంకా స్పందించకపోవడం చూస్తే నిప్పు లేనిదే పొగరాదని అనుకోవలసి ఉంటుంది.

ఈ గురుశిష్యుల గోలేంటో!

  జనాన్ని కన్ఫ్యూజ్ చేయడంలో గురువే పెద్ద మాస్టర్ అనుకుంటే, శిష్యుడు గురువుకంటే పెద్ద ముదురులా కనిపిస్తున్నారు. ఈ గురుశిష్యులిద్దరికీ ప్రస్తుతం ఒకరంటే ఒకరికి పడకపోయినప్పటికీ వెరైటీ స్టేట్‌మెంట్లు ఇవ్వడంలో మాత్రం ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. ఇంతకీ ఎవరా గురుశిష్యులనుకుంటున్నారా? ఇంకెవరూ ఘనతవహించిన అన్నా హజారే... అరవింద్ కేజ్రీవాల్. మొదట అన్నా హజారే విషయానికి వస్తే, కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అయినప్పుడు అన్నా హజారే కేజ్రీవాల్‌కి తన మద్దతు వుండదని ప్రకటించాడు. అన్నా మద్దతు లేకపోయినా కేజ్రీవాల్ ఢిల్లీ మీద ప్రభావం చూపించాడు. నలభై రోజులపాటు ముఖ్యమంత్రి గిరీ వెలగబెట్టాడు. కేజ్రీ ముఖ్యమంత్రి కాగానే అన్నా చాలా మురిసిపోతూ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడం తనకి సంతోషాన్ని కలిగిస్తోందని, తాను ఇది ముందే ఊహించానని చెప్పాడు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే అన్నా ప్రేమని కురిపిస్తున్నాడని అప్పుడు జనం అనుకున్నారు. అలాగే మొన్నీమధ్య మమతా బెనర్జీ అన్నాని కలిసి ఆయన కాళ్ళమీద పడిపోయింది. దాంతో మురిసిపోయిన అన్నా ఈ ఎన్నికలలో తన మద్దతు మమతా బెనర్జీకే వుంటుందని ప్రకటించాడు. వారం తిరిగిందో లేదో మమతా బెనర్జీకి తన మద్దతు లేదని మళ్ళీ ప్రకటించాడు. మనసెందుకు మార్చుకున్నావు పెద్దాయనా అంటే మమత నచ్చిందిగానీ, ఆమె చుట్టూ వున్నవాళ్ళు మాత్రం తనకి నచ్చలేదని, అందుకే మమతకి మద్దతు ఉపసంహరించానని సెలవిచ్చారు. అన్నా చేసే కంగాళీ ఇలా వుంటే, కేజ్రీవాల్ చేసే క్రేజీ పనులు మరోలా వున్నాయి. ముఖ్యమంత్రిగా నలభై రోజులు వెలగబెట్టి పరువు మొత్తం పోగొట్టుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు ఇస్తున్న స్టేట్‌మెంట్లు చాలా విచిత్రంగా వుంటున్నాయి. మీడియా బీజేపీకి అమ్ముడు పోయిందని, మీడియా ప్రతినిధులని జైల్లో పెట్టిస్తానని కేజ్రీవాల్ అన్న మాటలు పెద్ద దుమారాన్నే సృష్టించాయి. ఆ తర్వాత రాజకీయ నాయకులకు సహజమైన ‘నేనలా అనలేదు.. నా మాటల్ని వక్రీకరించారు’ అంటూ కేజ్రీవాల్ తప్పించుకున్నాడు. నిన్నగాక మొన్న వారణాసిలో నరేంద్రమోడీ మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి, ఆ తర్వాత తనకి అంత సీన్ లేదని అర్థం చేసుకున్నాడు. రెండు చోట్ల పోటీ చేయడం మా పార్టీ సిద్ధాంతానికి విరుద్ధమని ఆ తర్వాత ప్రకటించాడు. మొత్తమ్మీద జనాన్ని అయోమయానికి గురిచేయడంలో గురుశిష్యులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు.

కారులో ఉద్యమకారులకు చోటు లేదట

  తెలంగాణలో టీఆర్ఎస్ తరఫు నుంచి అరిచేవాళ్ళే తప్ప ఎన్నికలలో గెలిచేవాళ్ళు లేనట్టు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు వారు కూడా ఎన్నికలలో నిలబడటానికి పనికిరార న్నట్టుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఇంతకాలం ఉద్యమకారుల్ని, కవుల్ని, కళాకారుల్ని వాడుకున్న కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళని దూరంగా పెడుతున్నాడు. ప్రజల్లో మంచి గుర్తింపు వున్న వారు కూడా కేసీఆర్‌ని టిక్కెట్ కోసం అభ్యర్థిస్తుంటే వాళ్ళని పట్టించుకోవడం లేదు. డబ్బు పెట్టి గెలిచే సత్తా వున్నవారికే టిక్కెట్లన్నట్టుగా కేసీఆర్ వ్యవహార శైలి వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.   అమరవీరుల కుటుంబాలకు బోలెడన్ని టిక్కెట్లు పేలాలు పంచినట్టు పంచుతానని గతంలో ప్రకటించిన కేసీఆర్ తీరా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టిక్కెట్ అడిగితే కాదు పొమ్మన్నాడు. తీరా ఆమె తనకి టిక్కెట్ ఇవ్వకపోతే తన కొడుకులాగా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ మూడు రోజుల ‘డెడ్‌లైన్’ విధించేసింది. దాంతో దారికొచ్చిన కేసీఆర్ నల్లగొండ జిల్లాలోని ఓ అసెంబ్లీ టిక్కెట్‌ని ఆమెకి కేటాయించినట్టు హామీ ఇచ్చి బుజ్జగించాడు. కేసీఆర్ టిక్కెట్ ఇవ్వకపోతే శంకరమ్మకి తాము టిక్కెట్ ఇస్తామని అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం ప్రకటించడంతో కేసీఆర్‌కి ఇంతకంటే మరో దారి లేకపోయింది. అయితే శంకరమ్మ ఆవేశాన్ని చల్లార్చి, ప్రస్తుతానికి గండం నుంచి గట్టెక్కడానికే కేసీఆర్ ఆమెకి టిక్కెట్ ఇచ్చాడని తెలంగాణవాదులు భావిస్తున్నారు. కొంతకాలం తర్వాత శంకరమ్మకి ఏదో ఒక కాకమ్మ కథ చెప్పి ఆమెని మెల్లగా పోటీ నుంచి తప్పించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.   కేసీఆర్ దగ్గరకి టిక్కెట్ కావాలని ఎవరు వచ్చినా, వాళ్ళకి టిక్కెట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ‘ఫ్యూచర్లో నిన్ను ఎమ్మెల్సీ చేస్తా’ అంటూ హామీలు ఇచ్చి పంపించేస్తున్నాడు. టీఆర్ఎస్‌కి ఇప్పటికీ తెలంగాణలో సగానికి పైగా సీట్లలో గెలిచే అభ్యర్థులే లేరు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలలో వున్న గెలుపు గుర్రాలకు పగ్గాలు వేయడానికి ఒకవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు మా పార్టీలో గెలుపు గుర్రాలకు కొదువలేదని చెబుతున్న కేసీఆర్ చాణక్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.

జగన్ కు రాష్ట్రాన్ని పాలించే శక్తి లేదా?

  వైఎస్ జగన్ ను చిన్నతనం నుంచి చూసినవారిలో సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. అతనికి రాష్ట్రాన్ని పాలించే శక్తి లేదని జేసీ తేల్చిచెప్పేశారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, తాను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన పాలనను పొగిడానని గుర్తుచేశారు. అదీ చంద్రబాబుకు.. జగన్ కు ఉన్న తేడా. తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అపార అనుభం చంద్రబాబు సొంతం. రాష్ట్రంలో ఐటీ రంగానికి పునాదులు వేయడానికి ఫైళ్లు చేతపట్టుకుని ఎన్ని దేశాల్లో ఎన్ని కంపెనీల చుట్టూ తిరిగారో ఆయనకే తెలుసు. అందుకే కొత్త రాజధాని నిర్మాణం అంటే ఎలా చేయాలన్న విషయమై తన విజన్ ను ఆయన తన మేనిఫెస్టోలో చూపిస్తున్నారు. సీమాంధ్రను సింగపూర్ లా చేస్తానంటే.. అక్కడ వ్యవసాయం లేదని, అంటే సీమాంధ్ర మొత్తమ్మీద వ్యవసాయమే లేకుండా చేస్తారా అని జగన్ అండ్ కో విమర్శలు చేయడం మనకు తెలిసిందే. సీమాంధ్ర ప్రాంతంలో నానాటికీ వ్యతిరేకత తగ్గించుకుంటూ బలం పుంజుకుంటున్న తెలుగుదేశం పార్టీని చూసి భయాందోళనలతో ఇలాంటి విమర్శలు చేస్తున్నారే తప్ప చంద్రబాబు విజన్ వాళ్లకు తెలియక కాదన్నది టీడీపీ నాయకుల అభిప్రాయం.   క్రైసిస్ మేనేజ్ మెంట్ విషయంలో చంద్రబాబు చొరవను కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా కూడా శభాష్ అనకుండా ఉండలేని సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. కోనసీమ ప్రాంతంలో 1996 నవంబరులో పెను తుఫాను వచ్చినప్పుడు అధికార యంత్రాంగం మొత్తాన్ని అక్కడకు తరలించి, మినీ సెక్రటేరియట్ నే ఏర్పాటుచేసి అతి తక్కువ కాలంలో ఆ ప్రాంతం తుఫాను విలయం నుంచి కోలుకునేలా చేసింది చంద్రబాబేనని ఇప్పటికీ కోనసీమవాసులు చెప్పుకొంటారు. జీఎంసీ బాలయోగి లాంటి నాయకులు ఆ సమయంలో లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించి, ఈ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లు వేయించారని, దానివల్లే ఇప్పటికీ రవాణా సదుపాయాలు బాగున్నాయని, ఇదంతా చంద్రబాబు నాయకత్వ ప్రతిభేనని కోనసీమ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పటికీ అంటున్నారు.   తండ్రి మరణించిన కొద్ది రోజులకే అధికార పీఠాన్ని అందుకోడానికి హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప, కొత్త రాష్ట్ర పునర్నిర్మాణం గురించి నిర్మాణాత్మకంగా ఒక్క ముక్క కూడా చెప్పని జగన్, ఆయన చుట్టూ ఉన్న భజన బృందం సీమాంధ్రలో పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు సాగబోవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో చేరే సందర్భంలో జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నాలుగు దశాబ్దాల బంధం.. తెగిపోయింది

  ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని కష్టకాలంలో కూడా ఏనాడూ పార్టీ గీత దాటని జేసీ కుటుంబం ఎట్టకేలకు ఆ పార్టీని వీడింది. మాజీ మంత్రి, అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్ గా ఇన్నాళ్లు నిలిచిన జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీతో తన సుదీర్ఘబంధాన్ని తెంచుకున్నారు. ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన సమయంలోనూ కాంగ్రెస్‌లోనే కొనసాగిన జేసీ కుటుంబం ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పేసింది. జేసీ దివాకరరెడ్డి తండ్రి నాగిరెడ్డి ఆ పార్టీ తరఫున చాలా కాలం క్రితం రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన దివాకరరెడ్డి 1972లో మొదటిసారి సమితి అధ్యక్షునిగా గెలుపొందారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్టు రాకపోవడంతో తాడిపత్రి నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేశారు. ఆయనకు రెండో స్ధానం వచ్చి కాంగ్రెస్ అభ్యర్థికి మూడో స్ధానం వచ్చింది. టీడీపీ ఆ ఒక్కసారే అక్కడ గెలిచింది. 1985లో కాంగ్రెస్ టికెట్టు పొందిన జేసీ అప్పటి నుంచి 2009 దాకా ప్రతి ఎన్నికలో గెలుస్తూ వచ్చారు.   కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయాల్లో కొన్నిసార్లు అసంతృప్త నేతగా ఉన్నా దివాకరరెడ్డి గతంలో ఎప్పుడూ పార్టీని వీడే యోచన చేయలేదు. కోట్ల వర్గంలో ఉన్న ఆయన అప్పట్లో వైఎస్‌పై తీవ్ర స్ధాయిలో పోరాడారు.వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత రాజీపడ్డారు. కానీ వైఎస్ కుటుంబంతో దూరం కొనసాగుతూ వచ్చింది. ఆ కారణం వల్లే ఆయన వైసీపీ వైపు చూడకుండా కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌తో పూర్తిగా విభేదించి ఇప్పుడు బయటకు వచ్చేశారు.   జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ కాలం టీడీపీతో పోరాటం చేసిన ఆయన ఆ పార్టీలో చేరటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ప్రత్యేకించి టీడీపీలో కొందరు ఆయన రాకను వ్యతిరేకించారు. కానీ దివాకరరెడ్డి తన లౌక్యంతో వారిని సమాధానపర్చగలిగారు.'టీడీపీ నా వద్దకు రాలేదు. నేనే టీడీపీ వద్దకు వెళ్లాను' అని ఆయన చేసిన ప్రకటన జిల్లాలో టీడీపీ నాయకులను శాంతపర్చింది.